రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, నవంబర్ 2022, బుధవారం

1246 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం :  మేర్లపాక గాంధీ
తారాగణం : సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మాజీ, సప్తగిరి, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్, బెనర్జీ, రఘుబాబు తదితరులు
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిర్యాల; ఛాయాహగ్రహణం : వసంత్ ఏ
బ్యానర్స్ : నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్, అముక్తా క్రియేషన్స్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
విడుదల : నవంబర్ 4, 2022
***

      ముందుగా రివ్యూ హెడ్డింగ్ గురించి ఒక మాట : జోకులకి ప్రసిద్ధి అయిన ఒక సీనియర్ దర్శకుడు ఈ సినిమా గురించి ఫోన్లో మాట్లాడుతూ, లైకే చేయనప్పుడు మిగతా రెండూ ఎలా చేస్తారని నవ్వించారు. ఆయన జోకే రివ్యూ హెడ్డింగుగా కుదిరింది. 2011 నుంచి సక్సెస్ కోసం అలుపెరుగని ప్రయాణం చేస్తున్న హీరో సంతోష్ శోభన్, మధ్యలో ఏక్ మినీ కథ అనే ఓటీటీ లో విడుదలైన మూవీతో మాత్రం ఫర్వాలేదన్పించుకున్నాడు. ఇది మినహాయిస్తే, అయిదు థియేటర్ సినిమాలతో సక్సెస్ ని అందుకోలేక తిరిగి ఇంకో ప్రయత్నం చేస్తూ, తనలాగే ఫ్లాప్స్ తో వున్న దర్శకుడితో ఈవారం బాక్సాఫీసు ముందుకొచ్చాడు.

        2013 లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే హిట్ తో ప్రారంభమయిన మేర్లపాక గాంధీ, తర్వాత తీసిన ఎక్స్ ప్రెస్ రాజా’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘మాస్ట్రో లతో పట్టుకోల్పోయి, ‘ఏక్ మినీ కథ తో పైకొచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి లైక్, షేర్ & సబ్ స్క్రైబ్ తీర్పు కోసం ప్రేక్షకుల ముందుంది. వీళ్ళిద్దరూ గ్లామర్ పోషణకోసం జాతిరత్నాలుఫరియా అబ్దుల్లాని హీరోయిన్ గా కూడా తీసుకున్నారు. మరి ఇప్పుడైనా విజయఢంకా మోగించారా? ఢంకా కూడా మోగనని మొరాయించిందా? అరకు వెళ్ళి సినిమా తీసినా అరణ్య రోదనే అయిందా? మధ్యలో చూపించిన రివ్యూ రైటర్ పాత్ర చేత ఈ సినిమాకి రేటింగ్ వేయించుకున్నారా? ఈ అత్యవసర విషయాలు తెలుసుకుందాం...  

కథ

హైదరాబాద్ లో విప్లవ్ (సంతోష్ శోభన్) యూట్యూబ్ లో ట్రావెల్ వ్లాగర్. వివిధ ప్రదేశాల ట్రావెల్ వీడియోలు తీసి యూట్యూబ్ లో బాగా డబ్బు సంపాదించాలనుకుంటాడు. ఈసారి అరకు అందాలు చూపించాలని ప్లాన్ చేసి, తండ్రి (బెనర్జీ) దగ్గర బలవంతంగా లక్ష రూపాయలు ఇప్పించుకుని, మధ్యలో తగిలిన కెమెరామాన్ జాక్ డానియేల్స్ (ప్రవీణ్) ని తీసుకుని బయల్దేరతాడు. అరకులో 30 ఏళ్ళుగా పీపీఎఫ్ (పీపుల్స్ ప్రొటెక్షన్ ఫోర్స్) తీవ్రవాద దళంతో పోలీసులకి పోరు జరుగుతూ వుంటుంది. సీఎం (శుభలేఖ సుధాకర్) తో శాంతి చర్చలకని పిలిచి తమ దళ సభ్యులు ముగ్గుర్నీ  చంపారని పోలీసుల మీద పగబట్టి వున్న పీపీఎఫ్, ఇప్పుడు డీజీపీని టార్గెట్ చేసి వుంటారు.

అదే అరకు ప్రాంతానికి ట్రావెల్ వ్లాగర్ గా బాగా సంపాదిస్తున్న డిజిపి వర్మ (ఆడుకాలం నరేన్) కూతురు వసుధ (ఫరియా అబ్దుల్లా) వచ్చి విప్లవ్ కి తగుల్తుంది. విప్లవ్ ఆమె ప్రేమ కోసం వెంటపడతాడు. పీపీఎఫ్ దళంలో దద్దమ్మలన్పించుకున్న బ్రహ్మన్న(బ్రహ్మాజీ) తోబాటు ఇంకో అయిదుగురు డిస్మిస్ అయి తిరుగుతూంటారు. ఏదైనా ఘనకార్యం చేసి దళంలో స్థానం సంపాదించుకోవాలనుకుంటారు. వీళ్ళతో రెండు సార్లు గొడవపడ్డ విప్లవ్, వసుధ, డానియేల్స్ లని  అడవిలో కిడ్నాప్ చేస్తారు. ఇలా ప్రమాదంలో చిక్కుకున్న డిజిపి కూతురు వసుధతో ఇక ఏం జరిగిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ
చెప్పుకోవడానికి బావుంటుంది. చూస్తే మాత్రం భరించలేకుండా వుంటుంది. మాస్ ప్రేక్షకులు కూడా బయటికి వచ్చి బాగాలేదు వెళ్ళి పొమ్మంటారు. రేటింగ్స్ కూడా 1.2, 1.25, 1.5 అంటూ ట్రోలింగ్ అవుతున్నాయి.  సినిమాలో రేటింగ్స్ ఇచ్చే రివ్యూ రైటర్ పాత్ర చేత ఎవరో ఈ సినిమాకి 1.22 రేటింగ్ ఇప్పించి సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఇంత పరిహాసానికి గురైన సినిమా ఇంతకి ముందు చూసి వుండం. అరకు ఆకుల్లో  మేర్లపాక వారు వడ్డించిన భయానక  పాకం ఇది.  

టైటిల్ కీ కథకీ ఏ సంబంధం లేదు. హీరో హీరోయిన్లు ట్రావెల్ వ్లాగర్సే గానీ దీంతో కథ వుండదు. ట్రావెల్ వ్లాగర్స్ అనుకోకుండా తీవ్రవాద దళం వీడియోలు తీసి అప్ లోడ్ చేసి
, డిజిపి హత్యని నివారిస్తూ దళంతో ప్రమాదంలో పడి వుంటే ట్రావెల్ వ్లాగర్స్ థ్రిల్లర్ లాగైనా వుండేది. ఆ వీడియో టైటిల్ కి న్యాయం చేస్తూ, విపరీతంగా లైక్, షేర్ & సబ్ స్క్రైబ్ అయి విప్లవ్ ఆశించిన డబ్బులు వచ్చుండేవి. పాపులర్ వ్లాగర్ వసుధకి ఆల్రెడీ 3 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు వున్నారు. ఇదంతా వదిలేసి ఇంటర్వెల్ వరకూ అడవిలో తిరుగుతూ అర్ధం లేని కామెడీలతో వృధా చేశారు. ఇంకోటేమిటంటే బ్రహ్మన్న దళాన్ని జోకర్లుగా చూపించి కామెడీలు చేసే ప్రయత్నం కూడా ఘోరంగా విఫలమైంది. ఇంటర్వెల్లో వసుధని కిడ్నాప్ చేసే వరకూ కథే వుండదు- ఇంటర్వెల్ వరకూ తీసిన సగం సినిమా బడ్జెట్ వృధా. ఏ సీనుకీ పది రూపాయల విలువ లేదు.

సెకండాఫ్ మరీ వృధా. ముగ్గుర్నీ బందీలుగా పట్టుకున్న బ్రహ్మన్న దళంతో మళ్ళీ అర్ధం లేని కామెడీలు మొదలు. బ్రహ్మన్న 5 లక్షలు డిమాండ్ చేస్తే వసుధ ఏటీఎం నుంచి డ్రా చేసి ఇచ్చేయడానికి సిద్ధపడడం. అంత డబ్బు ఏటీఎం నుంచి ఎలా డ్రా చేస్తుందో. ముగ్గురూ తప్పించుకునే ప్రయత్నం చేసి దొరికిపోవడం. హీరో విప్లవ్ క్యారక్టర్ డీజీపీకున్న ప్రమాదంతో అసలు సమస్య గుర్తించకుండా పాసివ్ క్యారక్టర్ గా వుండిపోవడం, కామెడీలు చేయడం. సహనాన్ని పరీక్షించే ఈ సెకండాఫ్ లో బ్రహ్మన్న ఫ్రెండ్ గా సినిమా రివ్యూ రైటర్ సప్తగిరి వచ్చేసి వేరే కామెడీలు చేయడం.

సినిమా అవకాశాలు దొరక్క రివ్యూ రైటర్లుగా మారి సినిమాల మీద కసి తీర్చుకుంటున్నారనే అజ్ఞానపు కామెంట్లు చేయడం. మరి తన కొస్తున్న అవకాశాలతో మేర్లపాక ఏం సాధిస్తున్నట్టో. ఒక సినిమా ఏదీ లేని శూన్యమని, దానికి 0.25 రేటింగ్, అదికూడా తిన్న పాప్ కార్న్ కిచ్చాననీ సప్తగిరి చెప్తాడు. మేర్లపాక సినిమా కూడా శూన్యమే, దీనికీ 0.00 రేటింగ్ ఇప్పించుకోవాలిగా? రివ్యూ రైటర్ల మీద వ్యంగ్యాలు మాని సినిమా సరిగా తీసుకోవాలి.

నటనలు- సాంకేతికాలు

2015లో తను- నేనుఅనే రెండో సినిమాతో సంతోష్ శోభన్ ఎంత ఈజ్ గల కెమెరా ఫ్రెండ్లీ హీరోనో చూశాం. కానీ తన టాలెంట్ కి తగ్గ సినిమాలు చేయలేక పోతున్నాడు. ఈ సినిమాలో చేయాల్సిందంతా చేశాడు- కామిక్ టైమింగ్, ఫైటింగ్ స్కిల్స్, అవసరమైనప్పుడు ఎమోషన్లు పలికించడం, సాంగ్స్ కి డాన్సులేయడం...కానీ ఒక శూన్యం లాంటి  సినిమాలో ఇవన్నీ చేస్తే మిగిలేదీ శూన్యమే. దారితప్పి ఈ సినిమాలోకి వచ్చినట్టున్నాడు.

జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఫస్టాఫ్ లో బరువు పెరిగి, సెకండాఫ్ లో బరువు తగ్గి, స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్పుకుని ఎలాగెలాగో వుంది. జాతిరత్నాలు తో వచ్చిన క్రేజ్ అంతా పోయింది. నటించిన పాత్రకూడా సిల్లీగా వుంది. పాపులర్ ట్రావెల్ వ్లాగర్ గా ప్రొఫెషనల్ గా ఎంటరై, తర్వాత ఆ సంగతే మర్చిపోయి సిల్లీగా తిరుగుతుంది.

దళ సభ్యుడిగా బ్రహ్మాజీ జోకర్ పాత్ర భరించలేకుండా వున్నా- ఆయన కామెడీ స్కిల్స్ ని మెచ్చుకోవాల్సిందే. కాకపోతే ఇలాటి సినిమాలో నటించకూడదు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవడానికేం లేదు.

మేకింగ్ క్వాలిటీ మీద కూడా శ్రద్ధ పెట్టలేదు. బి గ్రేడ్ సినిమా చూస్తున్నట్టు వుంది పాటలు సహా. సినిమాలో కథ మీద సరైన దృష్టి పెట్టకుండా ప్రిన్స్ లోలాగా కేవలం కామెడీ బిట్లు చేస్తే నిలబడదని మరోసారి ప్రూవ్ అయింది. కామెడీ బిట్లు చూడడానికి టీవీ వుంది, యూట్యూబ్ వుంది- ప్రత్యేకంగా సినిమా ఎందుకు? అక్కడక్కడా కొన్ని డైలాగులు మాత్రం నవ్విస్తాయి తప్ప చెప్పుకోవడానికేం లేదు.


—సికిందర్