రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, నవంబర్ 2019, గురువారం

893 : స్క్రీన్ ప్లే సంగతులు - 3



     ఇంటర్వెల్ సీన్లో  కూడా ప్లాట్ పాయింట్ వన్ రాలేదు. అంటే కథ ప్రారంభించడం కోసం సమస్య ఏర్పాటు కాలేదు. అంటే జార్జి రెడ్డి గోల్ ప్రారంభం కాలేదు. ఇంటర్వెల్ ప్రసంగంలో విద్యార్ధులు అన్యాయాలపై తిరగబడాలని మాత్రమే ప్రసంగించి వూరుకున్నాడు. ఒక సమస్యంటూ ఏర్పడితే దానిమీద తిరగబడ్డం కథవుతుంది. ‘సైరా’ లో బ్రిటిషర్ల బలవంతపు పన్ను వసూలు సమస్య వచ్చింది కాబట్టి దాని మీద తిరగబడి పోరాటం ప్రారంభించాడు సైరా. కథా ప్రారంభానికి అది మూలం. ‘అల్లూరి సీతా రామ రాజు’ లో మన్యంలో బ్రిటిషర్లు ప్రకృతి వనరులు దోచుకుంటున్నారు కాబట్టి దాని మీద తిరగబడ్డాడు అల్లూరి సీతా రామరాజు. కథా ప్రారంభానికి, ఆ మాట కొస్తే చరిత్ర ప్రారంభం కావడానికి ఇది మూలం. ‘జార్జి రెడ్డి’ లో  ఇలాటి ఒక ప్రధాన సమస్యంటూ రైట్ వింగ్ తో  ఏర్పడకపోతే కథెక్కడిది, చరిత్రెక్కడిది?

          ఇంటర్వెల్లో కూడా కథ ప్రారంభం కాని తెలుగు సినిమాలెన్నోఇప్పటికీ చూస్తూంటాం. ఇవి ఇంటర్వెల్ తర్వాత కథలేక సెకండాఫ్ సిండ్రోంలో పడ్డమో, ఇంకేదో కథ అతికించుకుని స్క్రీన్ ప్లే మధ్యకి ఫ్రాక్చరవడమో, లేదా సినిమా చివర్లో ఎక్కడో పిసరంత కథ ప్రారంభమై మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవడమో అయి, అట్టర్ ఫ్లాపవడం చూస్తూంటాం. జార్జిరెడ్డి లో కథా ప్రారంభానికి సెకండాఫ్ లో పెట్టుకున్న సమస్య ఏమిటంటే ఎన్నికలు! ఇది ప్లాట్ పాయింట్ వన్ అయ్యే అవకాశం లేదు. అంటే ఎన్నికలతో కూడా కథ ప్రారంభం కానట్టే. అంటే ఇంకా బిగినింగ్ విభాగం ముగియనట్టే. అంటే ప్రారంభం కాని కథకి ఇంకా ఉపోద్ఘాతమే!

          అతడి భావజాలాన్ని ఎస్టాబ్లిష్ చేయకుండానే ఎన్నికలు పెట్టేశారు. రైట్ వింగ్ తో భావజాలాల సంఘర్షణ చూపకుండానే, సమస్య ఏర్పాటు చేయకుండానే ఎన్నికలు. ఎన్నికలనేవి పాత్రకి ఏర్పాటైన సమస్యని తేల్చుకునే యాక్షన్ తో కూడిన ఒక అవకాశమే అవుతాయి తప్ప, వాటికవి కథకి సాధించాల్సిన సమస్య కాలేవు.1977 లో జనతా పార్టీ గాలిలో పుట్టుకొచ్చి ఎన్నికల్లో ఇందిరాగాంధీని ఓడించలేదు.1975 లో ఆమె విధించిన  ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ పార్టీ పెట్టి ఎన్నికలు గెలిచారు. ఇలాగే కథా క్రమంలో కూడా ఎదుర్కొంటున్న ఒక సమస్యని పరిష్కరించుకునే సాధనంగా ఎన్నికలనే ఎలిమెంట్ ఎంటరవుతుంది తప్ప ఎన్నికలే సమస్యగా (ప్లాట్ పాయింట్ వన్ గా) ఏర్పాటు కావు.

          రెండోది, ఇంటర్వెల్ ప్రసంగానికి జార్జి రెడ్డి విద్యార్ధుల్ని సమీకరించి మీటింగ్ పెట్టడానికి తగిన కారణమేమీ కన్పించదు. ఢిల్లీ జే ఎన్ యూ లో ఫీజుల పెంపుకి వ్యతిరేకంగా విద్యార్ధులు రోడ్ల  మీది కొచ్చినట్టు - అలాటి వొక బలమైన కారణం గానీ సమస్య గానీ లేదు. ఇంకా జార్జి రెడ్డి జీవితంలో ఒక కీలక చారిత్రక ఉద్యమాన్ని ఈ సినిమాలో పక్కన పెట్టారు.1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమం. అప్పుడు ఓయూ లోనే వున్నాడు. ఆ ఉద్యమం పట్ల ఆసక్తి లేదు. కానీ ఆ ఉద్యమంలో కదిలిన విద్యార్ధి లోకాన్ని చూసి, తన ఎజెండాకి కూడా విద్యార్ధుల్ని కదిలించ వచ్చని గుర్తించాడు. తెలంగాణా ఉద్యమం తర్వాత మూడేళ్ళే జీవించాడు. ఈ మూడేళ్ళ కాలంలో లెఫ్ట్ భావజాలంతో ‘పిడియూ’ స్థాపించి, చేగువేరా మోటార్ సైకిల్ డైరీస్ స్టయిల్లో సైకిల్ యాత్ర చేశాడు వరంగల్ కి. అక్కడ కాకతీయ మెడికల్ కాలేజీలో, కాకతీయ యూనివర్సిటీలో ప్రచారం చేశాడు. అతడి జెండా గుర్తు రక్తపు పిడికిలి ముద్ర. నినాదం  ‘జీనా హైతో మర్నా సీఖో, కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో’. 1972 లో ఓయూ ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘర్షణలో హత్యకి గురయ్యాడు.


        సినిమాలో తారుమారు చేశారు. ఎన్నికల ప్రకటన తర్వాతే  పైన చెప్పుకున్న నినాదం, జెండా చూపించారు. దీంతో ఎన్నికలు వచ్చే వరకూ జార్జి రెడ్డికి కథకి ఏర్పడాల్సిన గోల్ లేనట్టే  తేలింది. సెకండాఫ్ లో ఎన్నికలు ప్రకటించింతర్వాత అతను హడావిడిగా జెండా తయారు చేయడం చూస్తే, అతను పాసివ్ క్యారక్టర్. ఎన్నికల్లేక పోతే జెండా, ఎజెండా, నినాదం ఏమీ వుండేవి కావా? వూరికే కాలక్షేపం చేస్తూ పాసివ్ గా వుండే వాడా?
              ఇంటర్వెల్ కి ముందు కూడా ఒక సీను జార్జిరెడ్డిని పాసివ్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ముంబాయి నుంచి మంచి ఆఫర్ వస్తే, ఆ ఎగ్జిక్యూటివ్ కి ఏమీ సమాధానం చెప్పకుండా వచ్చేస్తాడు. ఆ ఆఫర్ స్వీకరించవద్దని, ఇక్కడే విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలనీ ఫ్రెండ్ అంటే ఏమీ అనకుండా కారు దిగిపోతాడు (జార్జి రెడ్డి కార్లు ఎక్కేవాడు కాదు, రబ్బర్ చెప్పులేసుకుని స్పీడుగా నడిచేవాడు). ఏమిటీ క్యారక్టర్ మనసులో ఏముందో చెప్పకుండా టూమచ్ ఇంటర్నల్ గా వుంటోంది? ఇలాగైతే ఆడియెన్స్ కి క్యారెక్టరెలా అర్ధమవుతుంది? ఆ తర్వాత విద్యార్ధులతో ఇంటర్వెల్ మీటింగ్. అంటే ఫ్రెండ్ చెప్పడం వల్ల - నిజమే తను విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇక్కడే వుండి కృషి చేయాలనీ అనుకుని ఈ మీటింగ్ పెట్టాడా? ఇది పాసివ్ క్యారక్టర్ లక్షణమే. యాక్టివ్ క్యారక్టరే  అయితే, ఆ ఎగ్జిక్యూటివ్ కి తనే స్పష్టం చేసేయాలి - తన అవసరం ఇక్కడ స్టూడెంట్స్ కి చాలా వుందని. యాక్టివ్ క్యారెక్టర్ ఇలా ఎసర్టివ్ గా వుంటుంది. అప్పుడా తర్వాత ఫ్రెండ్ తో చెప్పించుకున్న ఫలితంగా ఇలా మీటింగ్ పెట్టుకున్నాడని చులకనయ్యే అవకాశమే వుండదు. ఫ్రెండ్ తో తీసిన ఆ సీనూ లేక, ఆ సీను తీయడానికైన డబ్బులూ మిగులుతాయి. యాక్టివ్ క్యారెక్టర్ చెప్పించుకోడు, తనుగా ఆలోచించి చేస్తాడు, జరిపిస్తాడు. ఎందుకంటే అతను కథా నాయకుడు. కథ తను నడుపుతాడు, ఎవరో చెప్పినట్టు నడపడు. యాక్టివ్ క్యారక్టరైజేషన్లు ఎవరో స్క్రీన్ ప్లే పండితుల స్వకపోల కల్పితాలు కావు తిరస్కరించడానికి. నిజజీవితంలో వ్యక్తిత్వ వికాసం. యాక్టివ్ క్యారక్టరైజేషన్ అనేది వ్యక్తిత్వ వికాసపు  అభివ్యక్తి. పాసివ్ క్యారక్టరైజేషన్ వ్యక్తిత్వ వికాసం లేని అల్పత్వం.

ఒకే  ఒక్క సీక్వెన్స్
            సెకండాఫ్ అంతా ఒకే  సీక్వెన్స్ తో వుంటుంది. మొదట రిసెర్చర్ ముస్కాన్ తో ఒక ప్రెజంట్ టైం సీను. తర్వాత జార్జిరెడ్డి పెట్టిన ఇంటర్వెల్ మీటింగ్ కి ఎబిసిడి వాళ్ళ వ్యతిరేక మీటింగ్. కౌషిక్ ఎమ్మెల్యే సలహా అడిగితే సానుభూతి ప్లే చేసి జార్జి రెడ్డిని కొట్టాలని ఎమ్మెల్యే సలహా ఇవ్వడం. ఎన్నికలు ప్రకటించడంతో, ఒక జెండా అవసరమని జార్జి రెడ్డి జెండా తయారీ, పిడియూ పార్టీ ఏర్పాటు. ఎన్నికల ప్రచారం. మూడు పక్షాల హోరా హోరీ ప్రచారం. కొట్లాట, విజయంతో పాట. ఒక బస్తీలో ఎవరో దౌర్జన్యం చేస్తున్నారని జార్జి రెడ్డికి ఫిర్యాదు. జార్జిరెడ్డి వెళ్లి అడ్డుకోవడం. మాయ ప్రేమ ప్రకటన. జార్జి రెడ్డి ఏదీ తేల్చి చెప్పకపోవడం. జార్జి రెడ్డి మీద గ్యాంగ్ ఎటాక్. బ్లేడ్ ఫైటింగ్. గాయపడిన జార్జిరెడ్డి కోలుకునే ప్రయత్నం. మదర్ సెంటి మెంట్. చిన్నప్పటి దృశ్యాలతో పాట. కోలుకున్న జార్జిరెడ్డి క్యాంపస్ కి రావడం. ఇంకో కొట్లాట. గొడవలు. ఊరేగింపులు. పోలీస్ లాఠీ ఛార్జి. దేశమంతటా సంచలనం. జార్జిరెడ్డి ఉపన్యాసం. 144 సెక్షన్ విధింపు. రాళ్ల దాడులు. లాఠీ ఛార్జి. ఉద్యమాన్ని ఉధృతం చేయాలనీ పిలుపు. పోలీస్ పికెట్... దీని తర్వాత జార్జి రెడ్డి హత్య, కుటుంబ విషాదం, ముస్కాన్ గన్ ని హుస్సేన్ సాగర్ లో విసిరేయడం.

          సెకండాఫ్ గంటంపావంతా ఒకే సీక్వెన్స్ అనేది చాలా విచిత్రమైన కథనం. ఇదే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లో కూడా చూస్తాం. ఇందులోనైతే ఇంకా ఫస్టాఫ్ కూడా ఒకే సీక్వెన్స్ వుంటుంది. ఏ సినిమా అయినా ఎనిమిది సీక్వెన్సుల మీద నిలబడుతుంది : ఫస్టాఫ్ లోనాల్గు, సెకండాఫ్ లో నాల్గు. అప్పుడే ఓ సినిమా చూస్తున్నట్టు వుంటుంది.
ఏ సినిమా కథకైనా- అదెంత సిగ్రేడ్ సినిమా అయినా సరే, దాని బిగినింగ్- మిడిల్- ఎండ్ లనే విభాగాల రచన ఎలా వున్నాకూడా - స్క్రీన్ ప్లేలో అప్రయత్నంగా ఎనిమిది సీక్వెన్సు లూ వచ్చి పడిపోతాయి!

       
ఈ ఎనిమిది సీక్వెన్సులు  బిగినింగ్ లో రెండుమిడిల్ లో నాల్గుఎండ్ లో రెండు వుంటాయి. ఈ సీక్వెన్సుల్ని విశ్లేషించి చూస్తే, ఒక్కో సీక్వెన్సు ఒక్కో మినీ మూవీ లా వుంటుంది. అంటే ప్రతీ సీక్వెన్సులోనూ మళ్ళీ బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాలు తప్పని సరిగా వుంటాయి, అది సరయిన స్క్రీన్ ప్లే అయితే. ఒక్కో సీక్వెన్సు ఒక్కో పాయింటుతో రన్ అవుతుంది. అలా ఒక సినిమా కథలోని ఎనిమిది పాయింట్ల మీద రన్ అవుతుంది. ఒక పాయింటు ముగింపు ఇంకో పాయింటు ప్రారంభంగా వుంటుంది. అంటే ప్రతీ సీక్వెన్స్ ముగింపూ తర్వాతి సీక్వెన్స్ ప్రారంభంగా వుంటుంది.
           పైన చెప్పుకున్న కథనం చూస్తే, సెకండాఫ్ లో ప్రారంభమైన కథనం కూడా ఓ కథ కాక పోగా, ఒకే ఎన్నికలనే పాయింటుతో ఒకే సీక్వెన్సుగా  నడిపి ముగించేశారు. దీంతో సెకండాఫ్ ఏం చూశామంటే ఒకే టైం స్పాన్ లో అదే ఎన్నికల ప్రచారాలూ కొట్లాటలూ పోలీసుల చర్యలూ చూశాం. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినట్టు చిత్రణ. కానీ జార్జి రెడ్డి దేశవ్యాప్తంగా తెలిసింది ఇంతకి చాలా పూర్వం భావజాల ప్రచారం చేస్తున్నప్పుడే. ఈ సెకండాఫ్ లో కూడా కథలేక ఏం చూశామంటే ఏమో అన్నట్టుగా తయారయ్యింది. కథే లేని సినిమా అయింది. పైన చెప్పుకున్నట్టు- సెకండాఫ్ సిండ్రోం, ఫ్రాక్చర్డ్ స్క్రీన్ ప్లే, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే ఇవే చూస్తూ వచ్చాం ఇంతకాలం. ఇప్పుడు కొత్తగా అసలు కథేలేని ‘స్క్రీన్ ప్లే’ చూస్తున్నాం. దీనికి కొత్తగా ఏం పేరు పెట్టాలి?         

        రైట్ వింగ్ విరోధంతో ప్రారంభమైన అతడి పోరాటంలోంచి గోల్ - క్యాంపస్ రాజకీయాల కావల నక్సల్ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాలన్న ఆశయంగా పెరిగింది. సైకిల్ యాత్ర వరంగల్ వెళ్ళినప్పుడు, అక్కడ అజ్ఞాతంలో వున్న నక్సల్స్ ని కలుసుకున్నది ఇందుకే. ఇదేమీ చూపించలేదు ‘బయోపిక్’ లో. ఇంకోటేమిటంటే అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఖాయంగా ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి. ఇది కూడా చూపించలేదు. ఈ కోరికలు తీరకుండానే అతడి మరణం సంభవించింది. ముగింపులో ఈ ఆశయాల ఊసెక్కడా లేకపోతే అదెలాటి ‘బయోపిక్’?  బయోపిక్ పాత్ర ఏవో కాలేజీల దొమ్మీల ఫలితంగా చనిపోయాడని చూపిస్తే అది మామూలు రౌడీ పాత్ర. ఓ ఫార్ములా కథ. జార్జి రెడ్డి అనే ఓ భిన్నమైన పర్సనాలిటీ ఆశయాలు తీరకుండానే అర్ధాంతరంగా చనిపోవడం బాధాకర ముగింపు. అది  ఆలోచింప జేస్తుంది.  ఈ ముగింపుని కొనసాగిస్తే, అతడి ఆశయాలకి ప్రతిరూపంగా, అతన్నుంచి స్ఫూర్తిగా  ఎందరెందరు ప్రముఖ నక్సల్ నాయకులు ఉద్భవించారో తెలుస్తుంది. అది సమగ్ర ముగింపు అవుతుంది. 


            
           ఎన్నికల ప్రచారం ఉద్రిక్తల మధ్య పోలీస్ పికెట్ ఏర్పడ్డ తర్వాత అకస్మాత్తుగా ఈ సీను వస్తుంది - రాత్రి పూట జార్జి రెడ్డి ఇంట్లోంచి గన్ తీసుకుని వెళ్తూంటాడు. భోంచేసి వెళ్ళమని తల్లి అంటుంది. మెస్ లో చేస్తానని వెళ్ళిపోతాడు. హాస్టల్లోకి వెళ్తూంటే ఆ చీకట్లో ఎటాక్ చేస్తారు. అతను చేతులతో, బ్లేడుతో ఎదుర్కొంటాడు. గన్ మాత్రం తియ్యడు. అలాగే వాళ్ళ చేతిలో గాయపడి చచ్చిపోతాడు. గన్ తీసుకుని బయల్దేరిందే ఆత్మరక్షణ కోసం అయినప్పుడు దాన్ని తీసి కాల్చి పడెయ్యక పోవడమేమిటి?


          ఈ గన్ ఏదో పోయెటిక్ ముగింపు కోసం అనుకుని ఇలా చేసినట్టున్నారు. ఆ గన్  ముగింపులో ముస్కాన్ హుస్సేన్ సాగర్ లో ఏదో సందేశంతో విసిరేయాలి కాబట్టి దాన్నిలా ‘ఎస్టాబ్లిష్’ చేయడం కోసం జార్జిరెడ్డి కిచ్చి పంపినట్టుంది. ఇది సిల్లీగా వుంది. జార్జి రెడ్డి కిచ్చి పంపిస్తే జార్జి రెడ్డి దర్శకుడు చెప్పినట్టు చేస్తాడా? వాళ్ళందర్నీ కాల్చి పడేసి ముగింపు మార్చేస్తాడు. ముస్కాన్ లేదు, గిస్కాన్ లేదు.


          అసలు జార్జి రెడ్డి దగ్గర ఎప్పుడూ గన్ లేదు. అయినా అతణ్ణి చంపాలంటే చాలా కష్టం. అతను జిమ్ లో వ్యాయామం చేసి బలిష్టంగా వుండేవాడు. సినిమాలో చూపించినట్టు కర్రసాము, కత్తి సాము లేవు. బాక్సింగ్ ఒకటే ఇంటరెస్టు. ఇంకా సినిమాలంటే ఇంటరెస్టు. పోయెట్రీ రాసేవాడు. మద్యం, సిగరెట్లు ముట్టుకునే వాడు కాదు. విద్యార్ధులకి కూడా వీటికి దూరంగా వుండాలని చెప్పేవాడు. 
ఒకసారి అతడి మీద హత్యా ప్రయత్నం చేసిన తర్వాత ఇంకోసారి ఎటాక్ చేయడం అంత సులువనుకోలేదు. అయితే అతను తానుగా వెళ్లి ట్రాప్ లో పడ్డాడు. ఎన్నికలప్పుడు ఆ సాయంకాలం ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ కి వొంటరిగా వెళ్ళి, పోటీ చేస్తున్న అభ్యర్ది మీద ఎటాక్ చేశాడు. దీంతో మూకుమ్మడిగా ఎటాక్ చేసి అతణ్ణి చంపడం సులువైపోయింది...
సికిందర్

26, నవంబర్ 2019, మంగళవారం

892 : స్క్రీన్ ప్లే సంగతులు -2


   మరోసారి కథ : ముస్కాన్ అనే రిసెర్చర్ అమెరికా నుంచి వచ్చి, జార్జి రెడ్డి మీద తీయాలనుకుంటున్న డాక్యుమెంటరీ గురించి అతడి జీవితాన్ని శోధించడం మొదలెడుతుంది. ఇందులో భాగంగా మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులుగా జార్జిరెడ్డి కథ వస్తూంటుంది. అతను కేరళలో జన్మించాడు. తల్లి వుంటుంది. చిన్నపుడే కర్రసాము, కత్తి సాము నేర్చుకున్నాడు. బ్లేడుతో గాయపర్చడం నేర్చుకున్నాడు. చదువులో ముందుంటాడు. ఇలా పెద్దవాడై, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చేరతాడు.  అప్పటికే యూనివర్సిటీలో రెండు విద్యార్ధి సంఘాలుంటాయి. వాటిలో ఒకటి ఎబిసిడి (ఎబివిపి పేరు మార్చారు. అప్పట్లో ఎబివిపి లేదు, ఆరెస్సెస్ అనుబంధ సంస్థ వుండేది). ఈ రెండు సంఘాలూ కొట్టుకోవడమే పని. హాస్టల్లో భోజనాల దగ్గర్నుంచీ ప్రతీదానికీ కొట్లాటలే. ర్యాగింగ్, ఈవ్ టీజింగులు, కుల వివక్ష, ఆర్ధిక అసమానతల అశాంతీ, ఇవన్నీ చూసి తిరగబడతాడు జార్జిరెడ్డి. విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. ఇంకో పక్క ఇతనంటే ప్రేమ పెంచుకున్న మాయా అనే నార్త్ అమ్మాయి వుంటుంది. ప్రత్యర్ధుల హింసకి హింసే సమాధానంగా చేసుకున్న జార్జి రెడ్డి పీడీఎస్ (అతడి మరణానంతరం పీడీఎస్ యూ - ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా వెలిసి, జాతీయంగా విస్తరించి ఇప్పుడూ క్రియాశీలంగా వుంది) అనే విద్యార్ధి సంఘాన్ని స్థాపించి, ఎన్నికల్లో గెలుస్తాడు. దీంతో సదరు రెండు సంఘాలు కక్ష గడతాయి. అతణ్ణి చంపేందుకు ఒకసారి విఫలయత్నం చేసి, రెండో సారి చంపేస్తారు. ఇదీ కథ. 
          కేరళలో జార్జి రెడ్డి చిన్నప్పట్నుంచీ కథెత్తుకున్నారు. తల్లి, తను మాత్రం వుంటారు. చదువులో ముందుంటాడు. కర్రసాము, కత్తి సాము నేర్చుకుంటాడు. బ్లేడుతో ఒకడి మీద దాడి చేస్తాడు. పెద్దయ్యాక హైదరాబాద్ వచ్చినట్టు సిటీ బస్సులో చూపిస్తారు. బస్సులో ఆకతాయిలు హీరోయిన్ మాయని అల్లరి పెడుతూంటే అడ్డుకుని హీరోయిజాన్ని ప్రదర్శిస్తాడు. ఆ నైట్ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో చేరతాడు. రూమ్మేట్స్ పరిచయమవుతారు. మెస్ లో రెండు గ్రూపులు కొట్టుకుంటాయి. జార్జి రెడ్డి మీద తప్పుడు కంప్లెయింట్ ఇస్తారు. ఆ రాత్రి పోలీస్ స్టేషన్లో వుంటాడు. కంప్లెయింట్ ఇచ్చింది రైట్ వింగ్ ఎబిసిడి గ్రూపు. ఈ రైట్ వింగ్ గ్రూపు లీడర్ సత్య. ఇంకో గ్రూపు లీడర్ కౌషిక్. ఇతడికి అధికార పార్టీ ఎమ్మెల్యే అండ వుంటుంది.
          క్యాంపస్ లో మాయ జార్జి రెడ్డి ని చూసి అభిమానిస్తుంది. బస్సులో తనని కాపాడినందుకు ఈ అభిమానం. మళ్ళీ రెండు గ్రూపులు కొట్టుకుంటాయి. సీనియర్లు జూనియర్స్ ని ర్యాగింగ్ చేస్తారు. జార్జి రెడ్డిని కూడా ఏదో అంటే కొడతాడు. కౌషిక్ పోలీస్ కంప్లెయింట్ ఇస్తాడు. యూనివర్సిటీ డీన్ జార్జి రెడ్డిని సంవత్సరం పాటు బహిష్కరిస్తాడు. జార్జి రెడ్డి చదువు మీద శ్రద్ధ పెడతాడు. మళ్ళీ రెండు గ్రూపులు స్కాలర్ షిప్పుల గురించి కొట్టుకుంటాయి. మాయ జార్జి రెడ్డితో మాట కలుపుతుంది. క్లాస్ రూమ్ లోకి ఓ గ్రూపు జొరబడి వచ్చి స్టూడెంట్స్ ని కొడతారు. వాళ్ళు ఔట్ సైడర్స్ అని తెలుసుకుని జార్జి రెడ్డి వాళ్ళని కొట్టి తరుముతాడు. ఇంతలో ఒక స్టూడెంట్ ర్యాగింగ్ చేస్తున్నారని జార్జి రెడ్డికి కంప్లెయింట్ చేస్తే వెళ్లి కొడతాడు. జార్జి రెడ్డి ఇప్పుడు నోట్లో బ్లేడు వుంచుకుని తిప్పుతూంటాడు. 
         మళ్ళీ గ్రూపులు కొట్టుకుంటాయి. ఎగ్జామ్స్ లో చీటింగ్ చేసి దొరికిపోయిన స్టూడెంట్ గ్రూపుతో ఇన్విజిలేటర్ ని కొట్టిస్తాడు. రిజల్ట్స్ వస్తాయి. జార్జిరెడ్డి పాసవుతాడు. రిజల్ట్స్ దగ్గర మళ్ళీ రెండు గ్రూపులు కొట్టుకుంటాయి. ఇన్విజిలేటర్ ని కొట్టినందుకు జార్జి రెడ్డి ఫైర్ బాల్ ఫైట్ చేసి గ్రూపుని కొడతాడు. జార్జి రెడ్డి విద్యార్హతల్ని గుర్తించి బాంబే (ముంబాయి) నుంచి ఒక పెద్ద ఆఫర్ వస్తుంది. నువ్విక్కడే వుండి  స్టూడెంట్స్ ఉజ్వల భవిష్యత్తు కోసం పోరాడాలని ఫ్రెండ్ అంటే వుండి పోతాడు. స్టూడెంట్స్ ని ఉద్దేశించి ప్రసంగించడానికి జార్జి రెడ్డి మీటింగ్ పెడుతోంటే 50 మంది కూడా రారు. మీటింగ్ ని అడ్డుకోవడానికి ఎబిసిడి గ్రూపు వాళ్ళు ప్రయత్నిస్తారు. మీటింగ్ పెడితే ఐదువేల మంది వస్తారు. అన్యాయాల్ని ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రసంగిస్తాడు జార్జి రెడ్డి. దీంతో ఇంటర్వెల్ పడుతుంది.
ఉపోద్ఘాత విఘాతం
         ఇదీ ఫస్టాఫ్ కథ. ఈ ఫస్టాఫ్ అంతా  కథలో బిగినింగ్ విభాగమే అనుకున్నాకూడా ఇంటర్వెల్లో జార్జి రెడ్డి చేసిన ప్రసంగం సీను ప్లాట్ పాయింట్ వన్ సీను కాలేదు, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటూ కాలేదు. జార్జి రెడ్డికి ప్రత్యర్ధులతో ఒక ప్రధాన సమస్య గురించి సంఘర్షణ కూడా ఫస్టాఫ్ లో ఎక్కడా ప్రారంభం కాలేదు. అన్నీ చిల్లర దొమ్మీలే. ఇక సమస్యే ఏర్పాటు కానప్పుడు దాన్ని సాధించాలన్న గోల్ కూడా జార్జి రెడ్డి కేర్పడలేదు. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా, ఇంటర్వెల్లో కూడా ఈ ‘బయోపిక్’ కథే ప్రారంభం కాలేదు. 

          ఇలా ఈ ఫస్టాఫ్ బిగినింగ్ విభాగంలో చూపించిన సీన్లన్నీ ప్రారంభమవాల్సిన కథకి  ఉపోద్ఘాతమే. ఈ ఉపోద్ఘాతానికి ఉపోద్ఘాత లక్షణాలు కన్పించవు. ఒక దిశా గమ్యం లేకుండా ఏవో సీన్లు ఎందుకో పేర్చుకుంటూ పోయారు. ఈ కాన్సెప్ట్ కి సంబంధంలేని బోలెడు అనవసర సీన్ల మీద బడ్జెట్ దండగైంది. బిగినింగ్ విభాగంలో  ఉపోద్ఘాతపు లక్షణాలేమిటి? 1. కథా నేపథ్యపు ఏర్పాటు, 2. పాత్రల పరిచయాలు, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా, 4. దీంతో సమస్య ఏర్పాటూ (ప్లాట్ పాయింట్ వన్), 5. తద్వారా హీరో పాత్రకి  గోల్ - ఇంతేగా? 

          ఈ కనీసావసరా లేవీ ఫస్టాఫ్ లో లేవు. అంటే స్క్రీన్ ప్లేనే లేదన్న మాట. మరేముంది? చైల్డ్ ప్లే వుంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చిన్న పిల్లల స్థాయికి దిగజారి చిల్లర పంచాయిలతో తూతూ  - మై మై అని కొట్టుకోవడమే వుంది. ఈ ఫస్టాఫ్ 70 నిమిషాల్లో ఇలా ఒకటీ రెండూ కాదు, ఏకంగా పన్నెండు సార్లు తొండి పంచాయితీలతో ఒకటే తన్నుకుంటారు! అంటే సగటున 6 నిమిషాలకో కొట్లాట! ఇది ఒక పద్ధతైన సినిమా కథ చెప్పడంలా వుండదు. పక్కా యాక్షన్ సినిమా కూడా ఇన్ని ఫైట్లతో వుండదు. 

         తెలంగాణాలో ఆ రోజుల్లో వుండిన బకాల్వాడీ బడుల్లో పిల్ల కాయలు పలక కోసం, బలపం పెట్టుకునే తొండి తగాదాలూ, చిల్లర కొట్లాటల్లా వుంది యూనివర్సిటీ స్థాయి స్టూడెంట్స్ తో చిత్రీకరణ. కోట శ్రీనివాసరావు స్టయిల్లో - శవ్వ! శవ్వ! - అని ఉస్మానియా పరువంతా పోయింది. ఒక కాలంలో - ఒక వీసీ జమానాలో - ఉస్మానియా డిగ్రీలంటే విశ్వసనీయత కోల్పోయి నవ్వులాటగా మారిందిగానీ, ఉస్మానియా స్టూడెంట్లంటే చిల్లర వ్యవహారమని ఎప్పుడూ పేరుబడ లేదు. సినిమాలో చూపించిన విధానం ఇలాగే  వుంది. 

         చెబుతున్న కథ జార్జి రెడ్డి లెఫ్ట్ ఓరియెంటేషన్ గురించై నప్పుడు, సరీగ్గా ఆ కాలంలో శ్రీకాకుళం నుంచి నక్సల్బరీ ఉద్యమ ప్రభావం ఉస్మానియా మీద పొడసూపుతున్నప్పుడు, ఆ సంబంధిత వాతావరణం ప్రతిఫలించే ఉస్మానియా బ్యాక్ డ్రాప్ లో కథా నేపథ్యం ఏర్పాటు చేయాల్సింది పోయి, బకాల్వాడీ బడి సిగపట్ల లపాకీ వ్యవహారం చేశారు.  
పాత్ర చిత్రణ వైఫల్యం
        జార్జి రెడ్డి జార్జి రెడ్డిగా తయారయ్యింది ఉస్మానియాలో అడుగు పెట్టాకనే. అంతకి ముందు అతడికే భావజాలమూ లేదు. ఒక బ్రిలియెంట్ సైన్స్ స్టూడెంట్ మాత్రమే. సినిమాలో చిన్నప్పుడే భావజాల బీజం పడినట్టు అదేదో అనాలోచిత కల్పన చేశారు. చిన్నప్పుడు తల్లి పనిగట్టుకుని భగత్ సింగ్ పుస్తకం చూపించి చెబుతుంది. అది అప్పుడే అతడి లెఫ్ట్ భావజాలానికి బీజం కాదు. ఆ తల్లికి అతనొక్కడే సంతానం కాదు. ఇంకా నల్గురున్నారు. తల్లి కేరళకి చెందిన క్రిస్టియన్ లీలా వర్ఘీస్. ఆమె తల్లి ప్రధానోపాధ్యాయురాలు, తండ్రి న్యాయమూర్తి. జార్జి రెడ్డి తండ్రి చిత్తూరుకి చెందిన రఘునాథ రెడ్డి. వాళ్ళ మతాంతర వివాహం చాలా కష్టాలు తెచ్చి పెట్టింది వెలివేత సహా. జార్జి రెడ్డి ఎనిమిదేళ్ళప్పుడు తండ్రి విడిపోవడంతో, పిల్లల్నితీసుకుని తల్లి ఊరూరా తిరిగేది ఉదర పోషణకు. అప్పుడు సమాజం నుంచి చాలా కుల వివక్షా, అవమానాలూ చవి చూశాడు. అదే అతడిలో బీజాన్ని నాటింది.  ధిక్కార స్వభావాన్ని పెంచింది. అలాటి దుర్భర పరిస్థితుల్లోనూ చదువులో ముందున్నాడు.  
         
          అప్పుడు పడ్డ ఈ  బీజం ఉస్మానియాలో ఎంటరయ్యాక, నక్సల్బరీ ఉద్యమ ప్రభావంతో మెల్లగా మొలకెత్తడం ప్రారంభించింది. భగత్ సింగ్, చేగు వేరాలు అప్పుడే తెలిశారు, చిన్నప్పుడు కాదు. కానీ అతడి స్ఫూర్తికి ఈ సుదూర విప్లవకారులు కాక, సమీప శ్రీకాకుళం నక్సల్బరీ ఉద్యమం కారణమైంది.  
          సినిమాలో చిన్నప్పుడు కర్రసాము, కత్తి సాము, బ్లేడుతో దాడులు నేర్చుకున్నట్టు చూపించారు. కారణం లేకుండా చూపించారు. దీంతో క్యారక్టర్ నెగెటివ్ గా ఎస్టాబ్లిష్ అయింది. ఈ చర్యల వెనుక మానసిక కారణాలు చూపించి వుంటే నెగెటివిటీకి ప్రేక్షకుల నుంచి ఎమోషనల్ సపోర్టు లభించేది. వివక్షతో, వెలివేతతో గడిచిన అతడి దుర్భర బాల్యం చూపించకుండా - అందమైన కేరళ ప్రకృతి దృశ్యాల మధ్య పోయెటిక్ గా, హాయిగా గడిచినట్టు అతడి బాల్యాన్ని తప్పుగా చూపించారు. అతడి బాల్యం పోయెటిక్ గా, హాయిగా ఏమీ గడవలేదు. అదే అతను పెద్దవాడయ్యాకా వెంటాడింది. అతను దుర్భర బాల్యంతో రాజీ పడలేదు, దాన్ని మర్చి పోలేదు. అతడ్ని చిన్నప్పటి ఈ కసి పుట్టిన జార్జి రెడ్డియే పెద్ద వాడయ్యాకా డ్రైవ్ చేశాడు. అందుకే ఆవేశం తప్ప ఆలోచన లేకుండా ప్రవర్తించాడు. యూనివర్సిటీలో ప్రతీ ఒక్కడ్నీ తన్నడం చేశాడు. తన బాల్యానికి న్యాయం చేసుకోవాలన్న బేసిక్ ఇన్ స్టింక్ట్ తో వుండిపోయాడు. లెఫ్ట్ భావజాలాన్ని ఒంట బట్టించుకున్నా, బాల్యాన్ని మర్చిపోలేక పోయాడు. బాల్యాన్ని క్షమించుకుని వుంటే, విద్యార్ధి నాయకుడుగా మెచ్యూరిటీతో ప్రవర్తించే వాడు. ఆలోచనలేని - అర్ధంలేని ఆవేశమే ఆయుధంగా తన చావు తనే తెచ్చుకునే వాడు కాదు. జార్జి రెడ్డి గురించి ఎక్కడెక్కడి సమాచారం కూడేసి చదివితే, అతడి గురించి చాలా పూర్వం క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించిన సినిమా మిత్రుడ్నీ సంప్రదిస్తే, జార్జి రెడ్డి క్యారక్టర్ గురించి మనకందే అంచనా ఇది. 
           ఈ సర్కిల్ ఆఫ్ బీయింగ్ జార్జి రెడ్డి ది. అతడి పాత్ర ఈ మానసిక, భౌతిక నేపథ్యాల సర్కిల్ ఆఫ్ బీయింగ్ లోంచి ప్రారంభమయింది చిన్నప్పుడు. ఈ బాల్యాన్ని ఎప్పుడు చూపించాలి? బయోపిక్ అంటే బాల్యం నుంచీ కథ ఎత్తుకోవడం కాదు. కానీ ఈ సినిమాలో బాల్యం నుంచే రొటీన్ టెంప్లెట్ ఫార్ములాగా చూపించారు. దీనివల్ల బయోపిక్ జానర్ మర్యాద తప్పడమే గాక, సినిమా నిడివి పెరిగిపోయింది. సినిమాల నిడివి రెండున్నర గంటలు దేనికి? ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ శరవేగంగా తగ్గిపోతున్నప్పుడు సినిమా నిడివి రెండు గంటల పది నిమిషాలు చాలు. కానీ ఈ మధ్య లపాకీ సినిమాలు కూడా రెండున్నర గంటలు పైబడి వుంటున్నాయి. వాటిలో ఏదో అమృత రసమున్నట్టూ, ప్రేక్షకులు బాగా జుర్రుకుని అమరత్వం సాధించాలన్నట్టూ, కిలోమీటర్ల పొడవుతో  చీకుడు సినిమాలు తీసి పడేస్తున్నారు. తీసెదే అట్టర్ ఫ్లాప్స్, అందులో బడ్జెట్ దుబారా!
         బయోపిక్ అంటే ఆ వ్యక్తి దేని గురించి చరిత్రలో నిలిచాడో ఆ అంశం సమీప, సంబంధిత సంఘటనలతో కథ నెత్తుకోవడం. సంఘటనల్ని చకచకా ఆ అంశం దగ్గరికి చేరేసి, సమస్యా - గోల్ - సంఘర్షణా చూపించెయ్యడం. ఇంత సింపుల్. ఆ అంశంతో బాల్యానికి సంబంధముంటే, మధ్యలో ఎక్కడైనా మాంటేజ్ వేసి కనెక్ట్ చేసి చేతులు దులుపుకోవడం, అంతే. లాలి పాటతో ఉయ్యాల్లో బయోపిక్ నెత్తుకుని స్పూన్ ఫీడింగ్ చేస్తున్నారంటే అది అచ్చ అమూల్ బేబీ సినిమా. 
బ్యాక్ డ్రాప్ ట్రబుల్
          ఒక కార్య క్షేత్రంలోకి పాత్ర ఎంటరవుతోంటే సీను రక్తి కట్టాలంటే, విజువల్ గా వుండాలంటే, ముందా కార్య క్షేత్రాన్ని కాంట్రాస్ట్ గా లేదా యాంటీగా ఎస్టాబ్లిష్  చేస్తారు. దీన్నే సిడ్ ఫీల్డ్ against the grain అన్నాడు. ‘శివ’ లో శివగా నాగార్జున కాలేజీలో  ఎంటరయ్యే ముందే కాలేజీ మీద మాఫియా భవానీ ప్రాబల్యాన్ని చూపిస్తారు. విద్యాలయం విద్య కోసం వుంటుంది, మాఫియాల కోసం కాదు. ఈ కాంట్రాస్ట్ అన్నమాట. మాఫియాల అడ్డా అయిన కాలేజీలోకి తెలియక చదువుకోవడానికి శివ ఎంటరవడం. దీనికిదే ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుందీ సీను.

           జార్జి రెడ్డి ఇలా ఎంటరవడు. రాత్రిపూట నడుచుకుంటూ వచ్చి హాస్టల్లోకి మామూలుగా వెళ్ళిపోతాడు. చాలా బలహీన దృశ్యం. బలహీనంగా హాస్టల్ కాదు ఇక్కడ చూపించాల్సింది - బలంగా ఉస్మానియా యూనివర్సిటీ వాతావరణాన్నిఎస్టాబ్లిష్ చేయాలి. జార్జి రెడ్డి రాకముందే ఉస్మానియాలో మతవాద రైట్ వింగ్ సంఘం ప్రాబల్యముంది. ఎన్నికల్లో వాళ్ళే గెలుస్తున్నారు, వాళ్ళదే హవా. అలాటి కార్యక్షేత్రంలోకి జార్జి రెడ్డి ఎంటరవుతున్నాడు. ఏ సర్కిల్ ఆఫ్ బీయింగ్ లోంచి వచ్చి ఎంటరవుతున్నాడు? కుల వివక్ష నెదుర్కొన్న బాల్యపు దురనుభవాల్లోంచి ఒక మెరిట్ విద్యార్థిగా ఎంటరవుతున్నాడు. కాంట్రాస్ట్ కుదిరిందా? కథా నేపథ్యం ఏర్పాటైపోయిందా? కథా ప్రాంగణం - కథా రంగం అర్ధమైపోయిందా? అందులోకి జార్జి రెడ్డి పాత్ర ప్రవేశించిందా? ఈ పాత్ర కథా నాయకత్వానికి సవాలు ఎదురైందా? 
          అంటే ఎబిసిడి గ్రూపు లీడర్ ని, రెండో గ్రూపు లీడర్ నీ ఓ సీనుతో  మొదట ప్రముఖంగా ఎస్టాబ్లిష్ చేసేసి, వాళ్ళ మధ్యకి జార్జి రెడ్డిని ప్రవేశ పెట్టినప్పుడు - వాళ్ళ దృష్టి అతడిమీదే వుంటుంది. అతన్నే వాచ్ చేస్తూంటారు. ఇది ఆటోమేటిగ్గా వచ్చేసే కథనం. ఈ మూడు కీలక పాత్రల మీదా, కథ మీదా ఫోకస్ వచ్చేస్తూ. బలాబలాల సమీకరణ స్పష్టంగా తెలుస్తూ. కథ అర్ధమవుతూ. కానీ జరిగిందేమిటంటే, జార్జి రెడ్డి హాస్టల్లో నైట్ చేరింది లగాయత్తూ  మొదలైపోతాయి భోజనాల దగ్గర్నుంచీ చిల్లర కొట్లాటలు. ఆరు నిమిషాలకో కొట్లాట. ఎవరే గ్రూపో, ఎవరెందుకు కొట్టుకుంటున్నారో అస్సలు దృష్టి కందని కొట్లాటలు. హీరో సహా ఏ పాత్రా ఎస్టాబ్లిష్ కాకుండా. కథేమిటో అంతుబట్టకుండా. కథా నాయకత్వం గల్లంతై పోయి. అసలు కథానాయకుడు చాలా సీన్లలో కనపడడు. అతనున్నాడని మర్చిపోయే పరిస్థితి! ఈ ‘బయోపిక్’ చిల్లర విద్యార్ధులదా, జార్జి రెడ్డిదా?
           జార్జి రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ప్రకారం అతడి పాత్ర పరిచయ క్రమంలో ఏముండాలి? మొదట అతడి విద్యా ప్రావీణ్యం మీద ఫోకస్ చేస్తూ సీన్లు రావాలి. అతడిది అసాధారణ ఇంటలిజెన్స్. అతను వేసే ప్రశ్నలకి ప్రొఫెసర్లే సమాధానం చెప్పలేక పోయే వాళ్ళు. విద్యార్థులు  అతడ్ని చాలా రెస్పెక్ట్ తో చూసేవాళ్ళు. అతను ఉస్మానియాలో పీ హెచ్ డీ చేస్తూనే, బయట కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్ గా పని చేసే వాడు. ఇప్పుడు చూడండి - ఢిల్లీ జే ఎన్ యూలో పది రూపాయల ఫీజు 300 కి పెంచారని గతకొన్ని రోజులుగా విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. నిరుపేదలైన తమ తల్లిదండ్రులు కాయకష్టం చేసి తమని చదివిస్తున్నారని వాపోతున్నారు. కానీ ఒక్కరూ కూడా జార్జి రెడ్డి లాగా  పార్ట్ టైం జాబులేవో  చూసుకుని ప్రభుత్వానికీ, తల్లి దండ్రులకీ భారం తగ్గించాలని ఆలోచించడం లేదు. ఈ సమయంలో ఈ సినిమాలో జార్జి రెడ్డి పార్ట్ టైం జాబ్ చిత్రణ గనుక చేసి వుంటే ఎలా వుండేది? కాలం లోంచి ఒక వ్యక్తిని తీసి చూపిస్తున్నప్పుడు రెలవెన్స్ వుండాలిగా? జార్జి రెడ్డిని పక్కన పెట్టేసి చిల్లర పాత్రల దొమ్మీలు చూపిస్తే బయోపిక్ అయిపోతుందా?  
          ఆ తర్వాత ఏం చూపిస్తూ సీన్లేయాలి? జార్జిరెడ్డి విద్వత్తుని యూనివర్సిటీ పట్టించుకుంది. విద్యకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు అతణ్ణి సంప్రదించే తీసుకునే వాళ్ళు. ఇక్కడే రైట్ వింగ్ తో  ఘర్షణ మొదలైంది. అంటే మొదట స్టడీస్ లో అతడి టాలెంట్ ని, విద్యార్ధుల్లో, ప్రొఫెసర్స్ లో  రెస్పెక్ట్ నీ, యూనివర్సిటీ యంత్రాంగంలో మన్నననీ చూపాక పాత్రేమిటో స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అమ్మాయిల మీద అతడికి దృష్టి వుండేది కాదు. హీరోయిన్ ని కల్పన చేసి ఏక పక్ష ప్రేమగా చూపించారు, ఇది ఓకే యూత్ అప్పీల్ కోసం. 
          ఇలా పాత్ర పరిచయమయ్యాక, ఇప్పుడు సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన వస్తుంది. ఇందులో భాగంగా యూనివర్సిటీ యంత్రాంగంలో మన్నన పెరగడం మొదటి పరిణామం, రైట్ వింగ్ లో ఈర్ష్యాసూయలు రగలడం రెండో పరిణామం...తర్వాత యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలు చూసి చలించడం, అదే సమయంలో నక్సల్బరీ పట్ల ఆసక్తి పెంచుకోవడం, చేగువేరాని చదవడం...ఇలా ఇలా అతనొక రెబెల్ గా మారి అన్యాయాలకి వ్యతిరేకంగా మొదటి ఎటాక్ జరపడం. వీలయితే ఈ ఎటాక్ కి మౌలిక మోటివేషన్ గా బాల్యపు సంఘటనలతో ఒక మాంటేజ్ మధ్యలో వేయవచ్చు. ఇక్కడ మాత్రమే రివీలవుతుంది బాల్యంలో పడ్డ అసలు బీజం. ఇది పాత్రపట్ల ఒక సానుభూతిని, ఎమోషన్ నీ సృష్టిస్తుంది. పాత్ర డెప్త్ పెరుగుతుంది. 
వాదాల వివాదం
         ప్రత్యర్ధి పాత్రల విషయాని కొస్తే, ఎబిసిడి సత్య, ఇంకో సంఘం కౌషిక్ వున్నారు (ఈ రెండో సంఘం నిజానికి కాంగ్రెస్ అనుబంధ విద్యార్ధి సంస్థ – ‘ఎన్ ఎస్ యూఐ’). సత్య రైట్ వింగ్ లీడర్, కౌషిక్ అధికార పార్టీ ఎమ్మెల్యే అండగల నాయకుడు. అధికార పక్షం, ప్రతిపక్షంగా వీళ్ళిద్దరూ వుంటే, మధ్యలో థర్డ్ ఫ్రంట్ గా జార్జి రెడ్డి దూరాడు. సినిమా కోసం ఆ నాటి యూనివర్సిటీలోని వివాదాస్పద విద్యార్థి రాజకీయాలతో జాగ్రత్త వహించి, పైపైన తడిమి వదిలేశామని చెప్పుకున్నారు గానీ, అది బయోపిక్ కి, ఈ తరానికి జార్జి రెడ్డి అర్ధమవడానికీ ఎంత నష్టం చేసిందో గమనించినట్టు లేదు. బహుశా ఇందుకే కాబోలు భావజాలాల ‘వివాదాస్పద విద్యార్ధి రాజకీయాల’ జోలికి పోకుండా - చిల్లర మల్లర  కొట్లాటలతో సరిపెట్టారు. 
         వివాదాస్పదం ఎలా అవుతుంది?  అభిప్రాయాలేర్పర్చు కుంటేనే వివాదాస్పద మవుతుంది. ఈ పక్షం వాదం ఇది, ఆ పక్షం వాదం ఇదీ అని రిపోర్టింగ్ చేస్తున్న చందాన చిత్రిస్తే వివాదమేమీ వుండదు. అభిప్రాయం ఏర్పర్చుకుని ఒక పక్షం కొమ్ముకాస్తేనే సమస్య వస్తుంది. పైపైన తడిమి వదిలేయడం ఎక్కడ జరిగింది? రైట్ వింగ్ సత్యని విలన్ గానే చూపించారు. దీంతో లెఫ్ట్ వింగ్ జార్జి రెడ్డి కొమ్ము కాసినట్టయింది. సత్య చేసే మంచిని కూడా చూపించాలి. ప్రేక్షకుల్ని ఒక పక్షానే తోసేయకూడదు. జడ్జిమెంటల్ ధోరణి పని చెయ్యదు. సినిమా అనే మాధ్యమం పక్షపాతంతో వుండదు. ఈ బయోపిక్ లో పాత్రల్ని సినిమా కాబట్టి రొటీన్  హీరో- విలన్ అన్న దృష్టికోణంలో విభజించి ఎలా చూస్తారు? ఎవరి వాదంతో వాళ్ళు కరెక్ట్ అన్నప్పుడు సమస్య వుండదు. సత్య హిందూ వాది కావచ్చు, జార్జి రెడ్డి కమ్యూనిస్టు వాది కావచ్చు. ఇది ఖుల్లాగా చెప్తే అపాయ మేముంది- వాస్తవం ఇదే అయినప్పుడు? 
           సత్యది సాంస్కృతిక చైతన్యం, జార్జి రెడ్డిది సామాజిక చైతన్యం. ఇద్దరూ కరెక్టే. కానీ ఇద్దరి మధ్య మొదలైన ఘర్షణలు ఆధిపత్యం కోసమే. ఎక్కడైనా నాయకుల భావజాలాల కోసం కాక రాజ్యాధికారం కోసం ఘర్షణలు జరుగుతాయి. భావ జాలాలని మనమనుకుంటాం. మన కులం గెలిచిందని, మన మతం గెలిచిందని జబ్బలు చరచుకుంటాం. నాయకులు కుల మతాలకి చేసే మేలేమీ వుండదు. కుల మతాలు ఒకరి మీద ఆధారపడి వర్ధిల్లవు. అవి స్వతంత్రంగా వాటికవి వర్ధిల్లుతూనే వుంటాయి ఎవరున్నా లేకపోయినా. ఏం ప్రమాదం లేదు, నాయకులకి కత్తీ డాలు అప్పగించడానికి. సామాజిక భక్తి లేకుండా దేశభక్తి లేదని జార్జి రెడ్డి వాదించ వచ్చు. దేశాన్ని రక్షించకపోతే సమాజమే వుండదని సత్య ప్రతి వాదం చెయ్యొచ్చు. ఒకళ్లది సూక్ష్మ దృష్టి, మరొకళ్ళది స్థూల దృష్టి. ఏం ఫర్వాలేదు, సబ్ చల్తాహై. ఇంతమాత్రాన సత్య, జార్జి రెడ్డిలవి  భావజాలాల కోసం పోరాటమవుతుందా? యూనివర్సిటీలో ఆధిపత్యం కోసమే పోరాటం. భావజాలాలు అధికార కేంద్రానికి సోపానాలు మాత్రమే. ఇద్దరూ ఎన్నికల్లో గెలవడం కోసమే ఘర్షించుకున్నారు, ఇంతకి మించి ఏ గొప్పా దీనికాపాదించ నవసరం లేదు, సన్నివేశాల్లో ఈ అర్ధాన్ని సేఫ్ గా క్యారీ చేస్తే. 
           వివాదం ఎక్కడొస్తుందంటే జార్జి రెడ్డిని రైట్ వింగే చంపినట్టు చూపిస్తే. అలా చూపించలేదు కూడా. కోర్టు కేసు కొట్టేసినప్పుడు చూపించలేరు కూడా. మరొకటేమిటంటే జార్జి రెడ్డికి కాంగ్రెస్ విద్యార్ధి సంఘం ఎన్ ఎస్ యూఐ సపోర్టు వుండేది. దీంతో రైట్ వింగ్ కంటే అతనే ఎక్కువ దాడులకి పాల్పడేవాడు. చాలా క్రూరంగానూ. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ క్యారెక్టర్ గా. ఇలా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చేసుకోవచ్చు. సమస్య ఎక్కడొస్తుందంటే, సెంట్రల్ పాయింటు లేదా కీలక సమస్య గుర్తించడం దగ్గరే. జార్జి రెడ్డి దేని గురించి చరిత్రలో నిలిచాడో ఆ అంశం గుర్తించడం దగ్గర. ఎందుకంటే స్క్రీన్ ప్లే పరంగా ఇది లేకపోతే సినిమా కష్టం.
ఎర్ర జండా ఎజెండా 
        ఈ సినిమా విడుదల రోజు ఒక దర్శకుడు అన్నారు, “ ఆఁ... ఏముంటుంది ఈ సినిమా చూడ్డానికి. ఎర్రజెండా సినిమానే కదా. టి కృష్ణ  టైపులో వుంటుంది” అని. కానీ సినిమాలో ఎర్ర జండానే లేదు. కానీ సినిమా ఎర్ర జండా గురించే. ఇది చూపించడానికి మొహమాట పడ్డారు. దీంతో ఏమిటోగా తయారయ్యింది సినిమా. 8 కోట్ల బడ్జెట్ కి కంటెంట్ కి ఎక్కడికక్కడ నిషేధం విధించుంటూ పోయారు. కథని సెంట్రల్ పాయింటు కిందికి తేవడానికి ఏ పాయింటుని ఎత్తుకుంటారు? జార్జి రెడ్డి ఎన్నిటికో వ్యతిరేకంగా వున్నాడు : కుల వివక్ష, మత వివక్ష, భూస్వామం, సామ్రాజ్య వాదం, వ్యాపారీ కరణ, ప్రైవేటీ కరణ, స్త్రీల అణిచివేత, విద్యా రంగంలో మత ప్రమేయం...ఇలా చాలా వున్నాయి. సినిమాకి ఒక్కటి కావాలి. ఆ ఒక్కటి దేన్నీ తీసుకుంటారు? ఈ వ్యతిరేకతలన్నీ ఏ మూలంలోంచి వున్నాయో దాన్ని గుర్తిస్తే పాయింటు వస్తుంది. ఆ మూలం కమ్యూనిజం. కాబట్టి అతను యూనివర్సిటీలో ఎర్ర జెండా ఎగరేయడానికి కంకణం కట్టుకున్నాడు. అందుకని సెంట్రల్ పాయింటు ఎర్ర జెండా ఎగరేయడమే. దాన్ని గెలిపించడమే. ఇక మొదలైంది జెండాల పతంగుల ఆట. దారానికి ఎవరెక్కువ మాంజా పూస్తే వాళ్ళ చేతిలో కటింగ్ పవర్. అవతలి పతంగి పుటుక్కు. ఇక కత్తుల ఖణ ఖణలు, కటార్ల ఫటఫటలు. ఇంతకంటే ఏమీ లేదు. గోల్ ఏర్పాటైంది. ప్లాట్ పాయింట్ వన్ వచ్చేసింది. 

            ఫస్టాఫ్ అంతా విషయం చెప్పకుండా కొట్లాటలతో గడిపేశారు. ఇంటర్వెల్లో మీటింగ్ హడావిడీ, అన్యాయాలపై ప్రసంగం. ఇది కాదు టర్నింగ్ పాయింట్. కార్యాచరణ చెప్పి ఓ జెండా పాతేస్తే టర్నింగ్ పాయింట్. రణభేరి. పాత్ర ఆశయం, గోల్. ఇవేవీ తేల్చకుండా ప్రసంగంతో ఇంటర్వెల్ వల్ల వచ్చిన లాభమేమిటి?
(రేపు సెకండాఫ్ సంగతులు) 
సికిందర్

24, నవంబర్ 2019, ఆదివారం

891 : స్క్రీన్ ప్లే సంగతులు


      తెలుగులో ఇంకో ‘బయోపిక్’ ఈసారి జార్జి రెడ్డి జీవితంతో వచ్చింది. 1966 - 72  మధ్యకాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫిజిక్స్ రీసెర్చి స్టూడెంట్ గా జార్జిరెడ్డి క్యాంపస్ రాజకీయాలు ఆధారంగా ఇప్పుడు ‘జార్జి రెడ్డి’ అనే ‘బయోపిక్’ నిర్మించారు. నిర్మించినప్పుడు చాలా ఆషామాషీగా నిర్మించారు కనీస సినిమా లక్షణాలని పక్కన పెట్టేసి.  జార్జిరెడ్డి జీవిత సమాచారాన్ని కూడా ఇష్టానుసారమిస్తూ బయోపిక్ కి అర్ధం లేకుండా చేశారు. ఇలా చేయాలనుకున్నప్పుడు ‘జార్జిరెడ్డి’ అనే టైటిల్ పెట్టకుండా, జార్జిరెడ్డి స్ఫూర్తితో అని ఏదో ఫిక్షన్ తీసేస్తే సరిపోయేది. ఒక నిజజీవిత వ్యక్తి గురించి తప్పుడు, అసమగ్ర  సమాచారమిస్తూ, జార్జిరెడ్డి పేరుని క్యాష్ చేసుకావాలన్న ధోరణిలో బయోపిక్ తీసే అధికారం దర్శకుడికి వుండదు. అది ఆ నిజ జీవిత వ్యక్తికి అన్యాయమే అవుతుంది. ఇలా బయోపిక్ జానర్ మర్యాదనే తీసి అవతలపెట్టి, తమ చేతికి చిక్కిన ఒక అరుదైన మంచి అవకాశాన్నే జారవిడుచుకున్నారు. ఆ నాటి క్యాంపస్ రాజకీయాలే నేడు కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రతిబింబిస్తున్న వైనాన్ని నేటి తరానికి ఎత్తి చూపగలిగే అరుదైన అవకాశమిది. దర్శకుడి బాధ్యత కూడా. తులనాత్మకంగా ఈ తరం ప్రేక్షకులకి జార్జి రెడ్డిని బాగా కనెక్ట్ చేయగలిగే సువర్ణావకాశం. దీన్ని నేలపాలు చేసుకున్నారు. అసలీ బయోపిక్ కాని బయోపిక్ ని తలపెట్టినప్పుడు  ఓ మార్కెట్ యాస్పెక్ట్ ని గానీ, క్రియేటివ్ యాస్పెక్ట్ ని  గానీ నిర్ణయించుకోలేదు. భారీగా ఎనిమిది కోట్లు ధారబోసి తక్షణం ఫ్లాపయ్యే ‘బయోపిక్’ ని ఇంకా ఈ సమాచార విప్లవ కాలంలో కూడా ఎలా తీస్తారో అర్ధంగాని విషయం. క్రియేటివ్ యాస్పెక్ట్ అలా వుంచి, అసలు మార్కెట్ యాస్పెక్ట్  ఏ ఒక్క సీనులో కూడా కన్పించదు ఈ ‘బయోపిక్’ లో. అంత ఔట్ డేటెడ్ గా వుంది.

         
మొట్ట మొదట ఈ స్క్రీన్ ప్లేకి కాన్సెప్ట్ ని నిర్ధారించేటప్పుడు నాడూ నేడూ కామన్ గా వుంటున్న లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ క్యాంపస్ రాజకీయాల్ని హైలైట్ చేస్తూ నేపథ్యం ఏర్పాటు చేసుకోలేదు. చేసి వుంటే ఆ నేపథ్యంలో నేపథ్యం తాలూకు క్యారక్టరైజేషన్ తో, లక్ష్యంతో, జార్జి రెడ్డి పాత్ర ఐడెంటిఫై అయ్యేది. బయోపిక్ పాత్రకి ఐడెంటిటీ అంటూ లేకపోతే బయోపిక్ కి అర్ధమే లేదు. ఐడెంటిటీ లేని పాత్రని ప్రేక్షకులు ఓన్ చేసుకోలేరు, ఫీలవలేరు. ఈ రెండూ జరక్కపోతే  సిడ్ ఫీల్డ్ మాటల్లో ఆ పాత్ర – “ too internal, too reactive, seems to disappear off the page” అవుతుంది. “ disappear off the page” అంటే స్క్రీన్ ప్లే పేజీల్లోంచి ఆ పాత్ర అదృశ్యమై పోవడమన్న మాట. నిజమే, రెండున్నర గంటల ఈ ‘బయోపిక్’ లో జార్జి రెడ్డి ఎక్కడున్నాడా అని పదేపదే వెతుక్కోవాల్సి రావడం ఇందుకే. ఇది చాలా విషాదం!

          జార్జి రెడ్డి లెఫ్ట్ వింగ్ ప్రతినిధి. అతను రైట్ వింగ్ తో సంఘర్షించాడు. లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ సంఘర్షణలు నేడూ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చూస్తున్నవే. ఈ నేపథ్యంలో జార్జి రెడ్డి ఆనాడు ఎలా సంఘర్షించాడు, ఏం తప్పులు చేశాడు, అతన్నుంచి ఈ తరం ఏం నేర్చుకోవచ్చన్నవి సహజాతి సహజంగా ఈ ‘బయోపిక్’ కి దానికదే కాన్సెప్ట్ అయిపోతుంది. ప్రాథమికంగా సినిమాకి కావాల్సిన కాన్సెప్ట్ ఏమిటో తెలియకపోతే  సినిమా ఎలా తీస్తారెవరైనా.

          మరికొన్ని స్క్రీన్ ప్లే ఓనమాలు కూడా తెలిసినట్టు లేదు : పాత్రకి ఒక గోల్, కాన్ఫ్లిక్ట్ లతో కూడిన స్ట్రక్చర్, సస్పెన్స్, థ్రిల్ అనే ఎలిమెంట్స్, యాక్టివ్ పాత్ర! ...హీన పక్షం యాక్టివ్ పాత్రతో కథ రాసుకోవాలని కూడా అనుకో లేదు. పనిలేని పాసివ్ పాత్ర రాసుకున్నారు. గత రెండు దశాబ్దాలుగా వందల సినిమాలు పాసివ్ పాత్రలతో అట్టర్ ఫ్లాపవుతూ వస్తున్నాయని ఇంకా తెలుసుకోక పోతే ఎలా? ఇదంతా చూస్తే దర్శకుడు ఆర్ట్ సినిమాల ధోరణితో వున్నట్టు అన్పిస్తుంది.
     

  
ఒకసారి క్లుప్తంగా కథ చూద్దాం :
         ముస్కాన్ అనే రిసెర్చర్ అమెరికా నుంచి వచ్చి, జార్జి రెడ్డి మీద తీయాలనుకుంటున్న డాక్యుమెంటరీ గురించి అతడి జీవితాన్ని శోధించడం మొదలెడుతుంది. ఇందులో భాగంగా మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులుగా జార్జిరెడ్డి కథ వస్తూంటుంది. అతను కేరళలో జన్మించాడు. తల్లి వుంటుంది. చిన్నపుడే కర్రసాము, కత్తి సాము నేర్చుకున్నాడు. బ్లేడుతో గాయపర్చడం నేర్చుకున్నాడు. చదువులో ముందుంటాడు. ఇలా పెద్దవాడై, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చేరతాడు.

        అప్పటికే యూనివర్సిటీలో రెండు విద్యార్ధి సంఘాలుంటాయి. వాటిలో ఒకటి ఎబిసిడి (ఎబివిపి పేరు మార్చారు. అప్పట్లో ఎబివిపి లేదు, ఆరెస్సెస్ అనుబంధ సంస్థ వుండేది). ఈ రెండు సంఘాలూ కొట్టుకోవడమే పని. హాస్టల్లో భోజనాల దగ్గర్నుంచీ ప్రతీదానికీ కొట్లాటలే. ర్యాగింగ్, ఈవ్ టీజింగులు, కుల వివక్ష, ఆర్ధిక అసమానతల అశాంతీ, ఇవన్నీ చూసి తిరగబడతాడు జార్జిరెడ్డి. విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. ఇంకో పక్క ఇతనంటే ప్రేమ పెంచుకున్న మాయా అనే నార్త్ అమ్మాయి వుంటుంది. ప్రత్యర్ధుల హింసకి హింసే సమాధానంగా చేసుకున్న జార్జి రెడ్డి పీడీఎస్ (అతడి మరణానంతరం పీడీఎస్ యూ - ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా వెలిసి, జాతీయంగా విస్తరించి ఇప్పుడూ క్రియాశీలంగా వుంది) అనే విద్యార్ధి సంఘాన్ని స్థాపించి, ఎన్నికల్లో గెలుస్తాడు. దీంతో సదరు రెండు సంఘాలు కక్ష గడతాయి. అతణ్ణి చంపేందుకు ఒకసారి విఫలయత్నం చేసి, రెండో సారి చంపేస్తారు. ఇదీ కథ.

కథ - గాథల కన్ఫ్యూజన్ 
        ఇలా ఈ పై కథ తలపెట్టిన బయోపిక్ కి  కథలా లేదు, గాథలా వుంది. ఈ విశ్లేషణ వచ్చే వ్యాసంలో చేద్దాం. ఐతే వాస్తవంగా జార్జిరెడ్డి జీవితం సినిమాగా గాథ అయ్యే అవకాశం లేదు. చివరికి చనిపోయి ట్రాజడీ అయినా నిజజీవితంలో ఒరిజినల్ గా అతడి కున్న లక్ష్యంతో, దాన్ని సాధించలేకపోయిన పోరాటంతో అది కథే అవుతుంది నిజానికి. లక్ష్యం లేకుండా ఏదో బలహీన పోరాటంగా  చూపిస్తే గాథ అయిపోతుంది. ఇదే జరిగింది. ఇది కమర్షియల్ సినిమాకి వ్యతిరేకం. ఈ స్క్రిప్టు రాయడానికి ఇది ముందు గుర్తించుకోవాల్సిన విషయం. ఒక ఐడియా అనుకున్నాక ఆ ఐడియాలో కథే వుందా లేక గాథ  ఏమైనా వుందా ముందు పరిశీలించుకుంటారు. ఇది కామన్ సెన్సు. గాథ గనుక వుంటే అది కమర్షియల్ సినిమాకి వ్యతిరేకం గనుక పక్కన పెట్టేస్తారు అమీబాలు కాని బుద్ధి జీవులు. అమీబాలు రాసుకున్న కథలన్నీ కథలే అనుకుని తమ అమీబియాసిస్ ని గాథలుగా కథంతా ప్రాకిస్తారు. సమ్మగా ఫ్లాపుని అనుభవిస్తారు. అదో తృప్తి. కథంటే ఏమిటి, గాథంటే ఏమిటి ఈ బ్లాగులోనే అనేక సార్లు చెప్పుకున్నాం గనుక మళ్ళీ అవసరం లేదు.

          జార్జి రెడ్డి జీవితమనేది కథా లక్షణాలతో కమర్షియల్ సినిమా తీయడానికి రెడీమేడ్ గా వున్నదే. ఇంకా దీన్ని టైలరింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కథకి ‘మహానటి’ ఫేం తాపడం చేశారు రిసెర్చర్ ముస్కాన్ పాత్రతో, జార్జిరెడ్డి జీవితాన్ని ఆమె తెలుసుకుంటున్న కథనంతో.  ‘మహానటి’ లో సావిత్రి గారి జీవితం గాథ. గాథని కమర్షియల్ గా నిలబెట్టి సక్సెస్ చేయాలంటే జర్నలిస్టు పాత్రలతో వాళ్ళ ‘కథ’ తో  ఆ గాథకి తాపడం చేయాలి. అదే చేశారు. ఆ జర్నలిస్టులు సావిత్రి గారి జీవితంలో ‘శంకరయ్య ఎవరు?’ అన్న డ్రమెటిక్ క్వశ్చన్ తో - అన్వేషణతో కొనసాగుతారు. వాళ్ళది కథ కాబట్టి వాళ్ళకి శంకరయ్య ఎవరో తెలుసుకునే గోల్, ఆ గోల్ కోసం సంఘర్షణా వగైరా కథా లక్షణాలు సమకూరాయి. ఈ కథ లోపల ప్యాక్ అయివున్న సావిత్రి గారి గాథకి సంఘర్షణ వుంటుంది గానీ లక్ష్యం లేదు. అందుకని గాథ అయింది. ఇలా స్క్రిప్టు రాయడానికి బయోపిక్ గాథగా దొరికినప్పుడు, ఆ గాథని ఇంకో కథ ఆధారంగా  చెప్పి నిలబెట్టడం అమల్లో వున్న విధానం.

          ఇలాకాక బయోపిక్కే కథగా లభించినప్పుడు ఆ కథ చెప్పడానికి ఆధారంగా ఇంకో కథ అవసరం లేదు. కథగా లభించిన  బయోపిక్ లోనే లక్ష్యమూ సంఘర్షణా ఇమిడి వుంటాయి గనుక అది దానికదే ఓ సినిమా ఐపోతుంది, ఇంకా వేరే సినిమా చూపించి కన్ఫ్యూజ్ చేయనవసరం లేదు. కథగా వున్న బయోపిక్ తో వచ్చిన ఏ సినిమా అయినా ఈ సూత్రంతోనే వుంది. ఎందుకని?

          ఎందుకంటే, బయోపిక్ లో వున్న కథని ఇంకో కథ ఆధారంగా చెప్తే రెండు కథలు దాడి చేస్తాయి. ఒక సినిమాలో ఒకే కథని రిసీవ్ చేసుకుంటుంది మైండ్. మళ్ళీ రెండో కథలో వుండే ఇంకో లక్ష్యమూ దాని తాలూకు సంఘర్షణా భరించలేదు. అది డిస్టర్బెన్స్ కూడా ఫోకస్ చెదర గొడుతూ. ఇందుకే రెండు మూడు కథలు, నాల్గైదు కథలుగా కథా సంపుటాలుగా వుండే సినిమాలు ఫ్లాపవుతాయి. మనం ఇడ్లీ అడిగితే  హోటలతను ఇడ్లీకి జతచేసి చక్కగా చట్నీ పెడతాడు. ఇడ్లీకి ఇంకో ఇడ్లీయే చట్నీగా మన మొహాన పడెయ్యడు. పడేస్తే అవేపెట్టి అతడి మొహాన ఫటీమని కొట్టి వచ్చేస్తాం. హోటల్ అట్టర్ ఫ్లాప్. కథ అనే ఇడ్లీకి ఇంకో ఇడ్లీయే చట్నీగా పెట్టినా ఇంతే. ఇవి క్రియేటివ్ యాస్పెక్ట్ ముచ్చట్లు. హోటలతనికి ఈ క్రియేటివ్ యాస్పెక్ట్ బాగా తెలుసు. అందుకని కలెక్షన్స్ బాగా వుంటాయి.


ప్లాట్ డివైస్ గా గన్ 
        అందుకని జార్జిరెడ్డి జీవితమే లక్ష్యంతో కూడిన కథగా స్క్రిప్టు రాసుకోవడానికి దొరికి నప్పుడు- ఈ కథ చెప్పడానికి ఆధారంగా మళ్ళీ ముస్కాన్ అనే రిసెర్చర్ తో ఇంకో కథ అల్లనవసరం లేదు. అల్లితే అది కథగా అల్లుకోదు. కలుపుగా పంట చెడగొడుతుంది. అందుకనే జార్జిరెడ్డి జీవితం తెలుసుకుంటున్న ముస్కాన్ కి ఏ లక్ష్యమూ సంఘర్షణా లేక, ఏవో హడావిడి దృశ్యాలు వచ్చి పోవడాన్ని చూస్తాం. అంటే జార్జిరెడ్డి కథ అనే బయోపిక్ కి ఈ తాపడం గాథలా తయారయ్యింది. కథ చెప్పడానికి ఆధారంగా గాథ అనేది తాపడంగా ఎలా వుంటుంది? ఒక కథ చెప్పడానికి ఆధారంగా ఇంకో కథగానీ, గాథ గానీ అవసరమే లేదు. కథ అంటేనే వొక స్వయంప్రతిపత్తి గల కళా రూపం. ఆ కథగా వున్న కథని ఫ్లాష్ బ్యాక్ గా మార్చి (స్వయంప్రతిపత్తిని తీసేసి) గాథ ఆధారంగా చెప్పలేరు.

          ఇప్పుడిక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమిటంటే, ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ కథ కాదు, ప్రెజెంట్ టైంలో చెప్తున్న విషయమే కథవుతుంది. ఈ కథ చెప్పడానికి కావాల్సిన సమాచారాన్ని ఫ్లాష్ బ్యాక్స్ లోంచి తీసుకుంటూంటుంది కథ. అందుకని ఫ్లాష్ బ్యాక్స్ ఎప్పుడూ సమాచార వనరుగానో, గాథలుగానో వుంటాయి. కథలుగా వుండవు. కథ అనేది ప్రెజెంట్ టైంలోనే నడవాలి. అందుకని  ‘మహానటి’ లో జర్నలిస్టుల ప్రెజెంట్ టైం కథకి, ఫ్లాష్ బ్యాక్స్ లో సావిత్రి గారి గాథ సమాచార వనరుగా తోడ్పడింది. జార్జి రెడ్డి బయోపిక్ లో ప్రెజెంట్ టైంలో రిసెర్చర్ జర్నీ చూపిస్తూ,  ఫ్లాష్ బ్యాక్స్ లో జార్జిరెడ్డి ‘కథ’ చెప్పారు. ఇది టోటల్ రాంగ్ అయింది టెక్నిక్ పరంగా, థియరీ పరంగానూ.

          అంటే ఫ్లాష్ బ్యాకులుగా చెప్పిన జార్జిరెడ్డి ‘కథ’ ని ప్రెజెంట్ టైంలో స్వయంప్రతిపత్తి గల కథ కిందికి తెచ్చి, ప్రెజెంట్ టైంలో అక్రమంగా తిష్ట వేసిన, గాథ మాత్రంగా అనాలోచిత కల్పనగా వున్న, ముస్కాన్ రిసెర్చి జర్నీని ఎత్తివేయాలి. ఆమె చేసిందేమీ లేదుగానీ చివర్లో జార్జిరెడ్డి గన్ ని హుస్సేన్ సాగర్ లో విసిరేసి ముగిస్తుంది. 47 ఏళ్ల తర్వాత ఆ గన్ ఆమె కెక్కడిది? ఈ సినిమాలోనే చూపించినట్టు, జార్జిరెడ్డి హత్య జరిగినప్పుడు అతడి దగ్గరే వుంది. అది పోలీసులకి దొరికి కోర్టు ప్రాపర్టీగా వుండి పోవాలి. అక్కడితో దాని కథ సమాప్తం కావాలి. కథే బ్యాలెన్సుగా లేనప్పుడు ఆమె ఎక్కడో గన్ ని దొరికించుకుని (కోర్టు భోషాణంలోంచి అపహరించిందా?) ముగించడానికి ఇంకా కథెక్కడుంది? హత్య కేసులో సాక్ష్యాధారాన్ని ఆమె ఎలా ఎత్తుకొచ్చి మాయం చేస్తుంది?

          ఈ ముగింపుకి దర్శకుడు చెప్పిన భావం, ఆ గన్ ని హుస్సేన్ సాగర్ లో వేయించడం డైరెక్టర్స్ టచ్. జార్జిరెడ్డి  పోరాటం తర్వాత వచ్చేది నిశ్శబ్దమే...గన్ బుద్ధుడి దగ్గరికి వెళ్లి ఆగుతుంది. ప్రశాంతత, హింస రెండూ ఆయన దగ్గరే వుంటాయి. ఏది ఫైనల్ అనేది మీరు నిర్ణయించుకోండి ... అంటూ ఇంటర్వ్యూలో ఏదో కవితాత్మక ధోరణి. ఇక్కడ గన్ ఉనికిని ప్లాట్ డివైస్ గా గుర్తించి కాన్సెప్ట్ కి కనెక్ట్ చేయడంలో విఫలమయ్యారు.

          అసలు తనని చంపుతున్నప్పటికీ జార్జిరెడ్డి గన్ తీయలేదంటే అక్కడే మేసేజి ఇచ్చేసినట్టు. అసలు కథలో కల్పించిన ఈ గన్ పాత్ర లాజిక్ గురించి వచ్చే వ్యాసంలో చూద్దాం.

          చెప్పేదేమిటంటే, కమల్ హాసన్ నటించిన ‘హే రామ్’ లో మహాత్మా గాంధీ రియల్ హత్యోదంతాన్ని, కమల్ పాత్రతో గాంధీని చంపాలన్న సమాంతర ఫిక్షన్ కథతో ముగింపు నిచ్చినట్టు - ముస్కాన్ తో కూడా గన్ కోసం అలాటి  ట్రావెల్ ని చేయించి వుండాల్సింది. కమల్ పాత్ర గాంధీ ని చంపడం కోసం, స్పెషల్ గన్ తయారీతో  సమాంతర ఫిక్షన్ గా వుంటుంది. అప్పుడు ముస్కాన్ ట్రావెల్ కూడా, తన హత్యా సమయంలో గన్ వాడని జార్జిరెడ్డి గన్ కోసం అన్వేషణగా కొనసాగితే ఒక లాజికల్ ఎండ్ కి దారితీస్తుంది. ‘జార్జిరెడ్డి గన్ ఎందుకు వాడలేదు?’ – అనేది డ్రమెటిక్ క్వశ్చన్ గా వుంటుంది. ‘శంకరయ్య ఎవరు?’ అన్న ‘మహానటి’ లో డ్రమెటిక్ క్వశ్చన్ లాగా. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ - అని ‘బాహుబలి’ డ్రమెటిక్ క్వశ్చన్ లాగా.

          అప్పుడు ముస్కాన్  ఫారిన్ డాక్యుమెంటరీ మేకర్ కాకుండా, నేటివిటీతో హక్కుల కార్యకర్తగా వచ్చి వుండొచ్చు. చరిత్ర దృష్టికి రాని డ్రమెటిక్ క్వశ్చన్ కి, జార్జి రెడ్డి బయోపిక్ ఆధారంగా సమాధానాన్ని అన్వేషించి – గన్ వాడని జార్జిరెడ్డి అప్రకటిత మెసేజ్ ని ప్రపంచానికి చాటవచ్చు. అప్పుడది ముస్కాన్ ట్రావెల్ కథవుతుంది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్స్ తో జార్జిరెడ్డి కథని గాథగా మార్చాలి - డిటో ‘మహానటి’. అయితే ఇప్పుడు తీసిన బయోపిక్ లో జార్జిరెడ్డిది పాసివ్ పాత్రతో గాథగానే వుంది. ఈ గాథ కూడా సరిగ్గా లేదనేది వచ్చే వ్యాసంలో చూద్దాం. ఇలా జార్జి రెడ్డిది ఏదో గాథ అయి, ముస్కాన్ ది కూడా లక్ష్యం లేకుండా ఇంకేదో గాథలా అయి -  రెండూ గాథలైపోయి బాక్సాఫీసుని ఇబ్బందిలో పడేశాయి. 


(రేపు ‘జార్జి రెడ్డి జీవిత కథ సంగతులు’) 

సికిందర్

21, నవంబర్ 2019, గురువారం

891 : సందేహాలు - సమాధానాలు

Q :   మీతో నాకు పరిచయం లేదు. అయితే స్టోరీ సినాప్సిస్ నేరేషన్ గురించి మీరు రాసిన ఆర్టికల్ ఫాలో అయి కథ చెప్పాను. వెంటనే ఓకే చేశారు. తర్వాత ఆ కథని ట్రీట్ మెంట్ రాసుకుని రెండు గంటలు మొత్తం అన్ని సీన్లు విన్పిస్తే, నచ్చలేదని రిజెక్ట్ చేశారు. ట్రీట్ మెంట్ నచ్చక పోతే మొదట నచ్చిన కథ రిజెక్ట్ అవుతుందా? 
కొత్త దర్శకుడు

A :   రిజెక్ట్ అవదు. మీరు సినాప్సిస్  చెప్పి ఓకే చేయించుకోవడానికీ, ట్రీట్ మెంట్ విన్పించడానికీ మధ్య గ్యాప్ లో ఇంకో కథ నచ్చి వుంటే తప్ప!  అందుకని  ట్రీట్ మెంట్ సిద్ధం చేసుకున్న తర్వాతే లైన్లయినా, సినాప్సిస్ లైనా చెప్పుకుంటే బావుంటుంది. ముందు లైను నచ్చాకనో, సినాప్సిస్  నచ్చాకనో తర్వాత తీరిగ్గా ట్రీట్ మెంట్ చేసుకోవచ్చులే నన్న అలసత్వం మంచిది కాదు. పూర్తి స్థాయి ట్రీట్ మెంట్ తోనే (బౌండెడ్ స్క్రిప్టు) వెళ్లి సినాప్సిస్ విన్పించాలి. అది ఓకే అయితే, రెడీగా వున్న ట్రీట్ మెంట్ ఆ వెంటనే చూపించేస్తే, అక్కడితో మ్యాటర్ క్లోజ్ అవుతుంది. ఇలా కాక సినాప్సిస్ ఒకసారి, ట్రీట్ మెంట్ ఇంకోసారి విడివిడిగా విన్పిస్తే ఆ గ్యాపులో ఏమైనా జరగొచ్చు. మళ్ళీ- ఈసారి మరీ పెను భారంగా రెండు గంటలు  ట్రీట్ మెంట్ వింటూ కూర్చునే ఓపిక లేకపోవచ్చు. ఉన్నా సెకండ్ థాట్స్ రావచ్చు. అప్పుడు నచ్చిన కథ ఇప్పుడెందుకో నచ్చకపోవచ్చు. కనుక సినాప్సిస్ శ్రవణం, ట్రీట్ మెంట్ సమర్పణ ఏకకాలంలో జరిగిపోతే ఇంకే దారుణమైన ఘడియలు రావు.

          ఇప్పుడెలాగూ మీ దగ్గర బౌండెడ్ స్క్రిప్టు వుంది కాబట్టి, ఒకసారి సినాప్సిస్, మళ్ళింకో సారి ట్రీట్ మెంట్ విన్పించాల్సిన టెన్షన్ వుండదు. ఓ అరగంట సినాప్సిస్ నేరేషన్ విన్పించాక ఓకే అయితే, రెడీగా వున్న ట్రీట్ మెంట్ తో ముందుకెళ్ళి పోవచ్చు. అంటే వివరంగా సీన్లు వినరని కాదు, వింటారు. ముందు మీకు ఆఫీసు కేటాయించి తర్వాత అన్నీ వింటారు. మార్పు చేర్పులు అవసరమన్పిస్తే చేయమంటారు. షార్ట్ కట్స్ తో పనిజరగదు. షార్ట్ కట్స్ కి లోతుపాతులు వుండవు. లోతుపాతుల్లేకుండా రాత్రికి రాత్రి పని జరగదు. చేతిలో బౌండెడ్ స్క్రిప్టు వుంటే చాలా లోతు పాతులున్నట్టు.

           కేవలం సినాప్సిస్ వరకూ రాసుకుని విన్పించి ఓకే చేయించుకున్నాక, ట్రీట్ మెంట్ రాస్తున్నప్పుడు తేడాలు రావచ్చు. తప్పకుండా వస్తాయి. విన్పించిన సినాప్సిస్ లాగే ట్రీట్ మెంట్ వుండాలని లేదు. అది సినాప్సిస్ కంటే బెటర్ గానో, వరస్ట్ గానో డెవలప్ అవచ్చు. అప్పుడా ట్రీట్ మెంట్ విన్పిస్తే, మొదట విన్పించిన సినాప్సిస్ తో  విభేదించి రిజెక్షన్ కి గురవచ్చు. సినాప్సిస్ దానికదే ఫైనల్ రూపం కాదు. రాసుకున్న సినాప్సిస్ కి చేసుకున్న ట్రీట్ మెంట్ తర్వాత తేలిన కథే ఫైనల్ కథ. ఈ ట్రీట్ మెంట్  ప్రకారం తిరగ రాసుకున్న సినాప్సిస్సే ఫైనల్. ఇదే విన్పించాలి.

          షార్ట్ కట్స్ కష్టాలకి ఉదాహరణలు... ఒకతను ఏం చేసి నిర్మాతని పట్టాడో పట్టేశాడు. ఆఫీసు ఓపెన్ చేయించి కూర్చుని ఏం కథ చేయాలా అని నెలల తరబడి ఆలోచిస్తున్నాడు. ఆఫీసు రేపోమాపో అన్నట్టుంది. ఇంకో అతను ఏదో కథ తీస్తూ పోతే తొంభై నిమిషాలే వచ్చింది. అది వదిలేసి పారిపోయాడు. షార్ట్ కట్స్ తో కామెడీ లుంటాయి.

Q :   దయచేసి "పారసైట్ " అనే సౌత్ కొరియన్ మూవీ యొక్క స్క్రీన్ ప్లే సంగతులు రాయండి.
రాజు AD

 
A :  పారసైట్’ (2019) అద్భుతమైన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ అంతర్జాతీయ ప్రశంసలతో. ఈ అద్భుతం కేవలం స్క్రీన్ ప్లే సంగతులతో తెలియదు. కేవలం స్క్రీన్ ప్లే సంగతులతో ఉపయోగం కూడా లేదు. దీని జానర్ క్రాఫ్ట్ ని కలిపి అర్ధం జేసుకోగలిగితేనే ఉపయోగం. కానీ వివిధ క్రాప్టులు ఇప్పుడొస్తున్న మేకర్లకి అర్ధం గావడం లేదు, ఏంచేస్తాం. వాళ్ళు రాసుకున్న కథల్లోనే ఒక సీను కేదైనా క్రాఫ్ట్ చెప్తే అర్ధం జేసుకోలేకపోతున్నప్పుడు, వేరే సినిమాల్లో క్రాఫ్టులు తెలుసుకోవా లనుకోవడ మెందుకు? అవసరం లేదు. ఇప్పటికే సత్యజిత్ రే ‘నాయక్’ గురించి పదేపదే ప్రస్తావించడం అతిగా వుంది. ఇంకోసారి చెప్పుకుంటే, అందులో సౌండ్ తో ఆయన క్రాఫ్ట్ ఎన్ని సంగతులతో ముడిపడి ఎలాటి కథ అదికూడా చెప్పిందో అర్ధంజేసుకోలేకపోతే, ఫీలై ఇన్స్ పైర్ అవకపోతే, ఏ సినిమా సైన్స్ తెలుసుకుని ఏం లాభం. ‘ఖైదీ’ క్రాఫ్ట్ ఎందరికి అర్ధమైంది? అందుకని ‘పారసైట్’ లాంటి మూవీ స్క్రీన్ ప్లే సంగతులు క్రాఫ్టు విహితంగా రాయడం బావుండక మానుకున్నాం.

 
Q :  ఫలానా సినిమా స్క్రీన్ ప్లే సంగతులు రాయమని మిమ్మల్ని ఇంకా అడుగుతున్నారంటే అది మీకు హేపీగా వుందా, బాధగా వుందా?
పేరు రాయలేదు

A :   పాయింటు హేపీయా, బాధనా అని కాదు, అవసరమా అని. ఇప్పటి అవసరమేమిటంటే, ఇంతకాలం పొందిన జ్ఞానంతో మీరే స్క్రీన్ ప్లే సంగతులు రాసి మీలో కథకుడో, దర్శకుడో ఎన్ని అంగుళాలు వున్నాడో తేల్చుకోవడం. అసలు స్క్రీన్ ప్లే సంగతులు ఏమర్ధమయ్యాయో కూడా తేల్చుకోవడం. తెలుగు సినిమాలన్నీ ఒకేలా వుంటున్నప్పడు స్క్రీన్ ప్లే సంగతులు ఒకేలా ఎంతకాలం చదివి బోరు కొట్టించుకుంటారు? ఆ మాటకొస్తే ఇప్పుడు తెలుగు సినిమాలకి రివ్యూలు కూడా అవసరం లేదు. అయినా మనమున్నామని తెలిపేందుకు అప్పుడొకటీ అప్పుడొకటీ రాద్దాం. 

Q :   ‘ఖైదీ’ స్క్రీన్ ప్లే సంగతులులో అది కమర్షియల్ స్ట్రక్చర్ తో వున్న ఆర్ట్ సినిమా కథ అన్నారు. అందుకని నూతనత్వం వచ్చిందన్నారు. ఐతే అది తమిళంలో తీశారు. అలాటిది తెలుగులో తీస్తే వర్కౌట్ అవుతుందా?
అనంత్, ASSO

A :   పైనే చెప్పుకున్నట్టు క్రాఫ్టే పాయింటు. క్రాఫ్ట్ ని అర్ధం జేసుకోనంతవరకూ ఏ ప్రయోగాలూ సాధ్యం కావు. అసలు మామూలు కమర్షియల్ సినిమాల్లోనే కొన్ని క్రాఫ్ట్స్ వుంటాయి. ఎన్టీఆర్ ‘బొబ్బిలి పులి’ క్రాఫ్ట్ ఏమిటి? సీనుకి ఒక్క డైలాగు మాత్రమే వుండడం. ఇది గమనించారా? గమనించకపోతే ఎందుకు సినిమా వాళ్ళు సినిమాలు చూస్తున్నట్టు? ఏ ఉద్దేశంతో ఈ క్రాఫ్ట్ వుంది? చివర కోర్టు సన్నివేశాల్లో హెవీగా ఎన్టీఆర్ డైలాగులు వుండడంతో. ఇంత హెవీ డైలాగులు చాలా సేపు ఆడియెన్స్ తట్టుకోవాలంటే మిగతా సినిమాలో ఎక్కువ డైలాగుల భారం వేయకూడదు.ఇలా చేస్తే ఇక్కడ రిలీఫ్ గా సీన్లు చూసిన ప్రేక్షకులు, అక్కడ హేవీ డైలాగుల్నిభారంగా ఫీల్ కారు అందుకని క్లయిమాక్స్ సన్నివేశాల వరకూ సీనుకొక్క డైలాగు మాత్రమే వ్యూహాత్మకంగా వాడారు దాసరి నారాయణ రావు.  సీనుకొక్క డైలాగు మాత్రమే ఎలా సాధ్యమైంది? సన్నివేశ సారాంశం తెలిస్తే అర్ధమవుతుంది. జస్ట్ యాడ్ ఏజెన్సీ లో కాపీ రైటర్ వుంటాడు. అతను ఒక్క లైనులో అమ్మకపు వస్తువు గురించి మ్యాటర్ క్రియేట్ చేస్తాడు. క్రాఫ్ట్ అంటే ఏమిటో, దాని అవసరమేమిటో జ్ఞాన సముర్పార్జన లేకుండా ‘ఖైదీ’ లా తెలుగులో కమర్షియలార్ట్ తీయడం కష్టం. కమర్షియల్ సినిమాలతో చేయి తిప్పుకోకుండా కళాత్మక సినిమాల జోలికి పోవద్దంటాడు రాబర్ట్ మెక్ కీ. తెలుగులో ఇప్పుడెన్ని కమర్షియల్ మసాలాలు తీసి అనుభవం గడించినా కమర్షియలార్ట్ పట్టుబడే అవకాశం కనిపించడం లేదు.

సికిందర్


18, నవంబర్ 2019, సోమవారం

889 : మూవీ నోట్స్


(ఆదివారం వెలువడాల్సిన  “మూవీ నోట్స్”  మన పనికి మాలిన కొన్ని ఎంజాయ్ మెంటు కార్యక్రమాల వలన సోమవారం)
          ర్ధిక మాంద్యం ప్రభావంతో ఇతర రంగాలు ఛిన్నా భిన్న మవుతున్నా, సినిమా రంగం ఫుల్ జోష్ తో ముందుకు సాగడం ఒక ప్రత్యేకత. మూడు సినిమాలు మొదటి రోజు 120 కోట్లు వసూళ్లు రాబట్టాయంటే, ఆర్ధిక మాంద్యం ఇంకెక్కడుందని ఆ మధ్య కేంద్ర మంత్రి రవి శంకర ప్రసాద్ వ్రాక్రుచ్చి వెనక్కి తగ్గితే, పివిఆర్ గ్రూప్ మల్టీ ప్లెక్సుల సీఈఓ కమల్ జ్ఞాన్ చందానీ  ఆర్ధిక మాంద్యం వుంది కాబట్టే సినిమాలు జోరుగా ఆడుతున్నాయని అభిభాషణ చేశారు. ఆర్ధిక మాంద్యం విసురుతున్న సవాళ్ళ నుంచి తప్పించుకోవడానికే ప్రజలు సినిమా లెక్కువగా చూసేస్తున్నారని అంకెలు చూపించారు. ఈయనే కాదు, సినీ పొలీస్ గ్రూప్ మల్టీ ప్లెక్సుల డిప్యూటీ సీఈవో దేవంగ్ సంపత్ కూడా ఇదే వివరణ ఇచ్చారు. పెద్ద స్టార్ల సినిమాలే కాదు, చిన్న చిన్న సినిమాలు అవెలా వున్నా కూడా ఇప్పుడు బాగా ఆడుతున్నాయన్నారు. బిస్కెట్ల నుంచీ కార్ల పరిశ్రమల వరకూ వివిధ రంగాల్ని మాంద్యం తినేస్తూంటే, దీన్నుంచి తప్పించుకోవడానికి ప్రేక్షకులు పాప్ కార్న్ తినేస్తూ సినిమాలు చూసేస్తున్నారన్న మాట. ఆర్ధిక మాంద్యం = మనో మాంద్యం. ఆర్ధిక మాంద్యం + మనో మాంద్యం = సినీ వినోదం అన్నమాట. గతంలోనూ ఆర్ధిక మాంద్యం పంజా విసిరినప్పుడు అది సినిమా రంగాన్ని తాకకుండా చూసుకున్నారు ప్రేక్షకులు. కానీ 2008 నాటి ఆర్ధిక మాంద్యం దెబ్బకి హాలీవుడ్ విలవిల్లాడింది. నెట్ ఫ్లిక్స్ కూడా కుదేలయింది. 

         
ర్ధిక మాంద్యం మాటేమో గానీ తెలుగులో చిన్న సినిమాల పట్ల నిర్మాతల్ల ఆసక్తి క్షీణిస్తోందా? కోటిన్నర రెండు కోట్లు పెట్టి తీస్తే రిటర్న్స్ వచ్చే నమ్మకమలా వుంచి, అసలు విడుదలవుతాయో లేదో కూడా తెలీనప్పుడు, వెబ్ సీరీస్ వైపు వెళ్తే మంచిదేమో నని ఆలోచనలు చేస్తున్నట్టు, వెబ్ సిరీస్ ప్రయత్నాల్లో వున్న ఒక దర్శకుడి వివరణ. 40, 50 లక్షల్లో వెబ్ సిరీస్ లాభసాటి వ్యాపారం. ఇదే జరిగితే చిన్న సినిమాలకి చెడు రోజులే. చిన్ననిర్మాతలు విజయవంతమైన ప్రత్యామ్నాయంగా డిజిటల్ ప్లాట్ ఫాం వెతుక్కుంటే దెబ్బ పడేది థియేటర్ల ఫీడింగ్ కే. ఇక విడుదలయ్యే ఒకటీ అరా పెద్ద సినిమాలు తప్ప ప్రదర్శించుకోవడానికి థియేటర్లకి సినిమాల కొరత ఏర్పడవచ్చు. చివరికి ఈ పరిస్థితి తెచ్చి పెట్టారు అర్ధం పర్ధం లేని లపాకీ సినిమాలు తీసే, వ్యాపార దృక్పథం లేని నయా మేకర్లు.

           
క ట్రీట్మెంట్ నేరేషన్ తో సమస్య! పది నిముషాలు, అరగంట, గంట కథ ఎలా చెప్పాలో ఆ మధ్య ఒక వ్యాసం రాస్తే చాలా మందికి ఉపయోగపడింది. బాగానే వుందనుకున్నాం. ఉన్నట్టుండి బాంబు పేలింది. శాస్త్రీయంగా రాసుకున్న సినాప్సిస్ తో పది నిమిషాలు, అరగంట, గంట ఏదైతే అది -  కథ ఎలా చెప్పాలో ప్రాక్టీసు చేసి కథ చెప్పేసి ఓకే చేయించుకున్నాక – నెక్స్ట్ ఏంటి? ఆ సినాప్సిస్ ని విస్తరించి, సీన్ల వారీగా ట్రీట్ మెంట్ రాసుకుని (దీన్నే గొప్పగా స్క్రీన్ ప్లే అంటారు) ఓ రెండు గంటలు మళ్ళీ విన్పించడమే. ఇప్పుడొచ్చింది సమస్య. ఈ సమస్య వస్తుందని వూహించలేదు. వూహించి వుంటే  రాసిన సినాప్సిస్ నేరేషన్ వ్యాసాన్నేఇంకా పొడిగించి, ట్రీట్మెంట్ నేరేషన్ ఏలా అని కూడా రాసేసి బ్లాగుకి అంకితమిచ్చేవాళ్ళం. సమస్య ఎలా వచ్చిందంటే, సినాప్సిస్ ని ఎలా విన్పిస్తారో ట్రీట్మెంట్ నీ అలాగే విన్పించడంతో. సినాప్సిస్ సంక్షిప్త కథ. అందులో కీలకమైనవి తప్ప అన్ని సీన్లూ వుండవు, సీన్ల వారీగా చెప్పడం వుండదు. ట్రీట్మెంట్ ని సీన్ల వారీగా చెప్పాలి. చెప్పినప్పుడు ఏ సీను ఏ ఉద్దేశంతో వుందో, దాని పాత్రానుగత, లేదా కథానుగత ప్రాముఖ్యమేమిటో, ఏ ఫీల్ తో ఎందుకుందో తెలుసుకోకుండా, అలా చెప్పకుండా, ఫ్లాట్ గా చెప్పేస్తే ఎలా?  వినేవాళ్ళకి సీన్ల విలువ తెలిసే అవకాశం లేక, కత్తిరింపుకి గురైతే ఏమిటి పరిస్థితి? కనుక ఇక ట్రీట్మెంట్ నేరేషన్ గురించి కూడా రాయాల్సి వచ్చేట్టుంది. హాలీవుడ్ లో చాలా హాయైన పరిస్థితి. అక్కడ స్క్రిప్టు బట్టీ పట్టి విన్పించే బాధ వుండదు. స్క్రిప్టు పంపిస్తే చదువుకుంటారు. వినడం కంటే చదివినప్పుడే మంచి చెడ్డలు బాగా తెలుస్తాయి. 

సికిందర్