రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, డిసెంబర్ 2014, శుక్రవారం

ఎడిటింగ్

 కన్నూ చెవీ సంబంధం కాలరాస్తే ఎలా?
 క సందేహం : ఫిలిం ఎడిటింగ్ లో ఫిజికల్ కంటిన్యూటీ ఎడిటర్ కి చాలా ముఖ్యం. షాట్స్ ని సీక్వెన్సులుగా, సీక్వెన్సుల్ని మొత్తం సినిమాగా ఏర్చి కూర్చే ప్రయత్నంలో ఎక్కడో ఒక షాటేదో మిస్సయిందన్పించ వచ్చు . హీరో పలికిన ఒక డైలాగుకి విలన్ రియాక్షన్ పడలేదన్పించ వచ్చు. ఆ  రియాక్షన్ షాట్ కోసం దర్శకుడ్ని సంప్రదిస్తాడు ఎడిటర్. ఇలా కంటిన్యూటీ షాట్స్ ని తర్వాత తీయడాన్నే ప్యాచ్ వర్క్ అంటారు. ఆ వొక్క షాట్ తీయడానికి పది  వేలు ఖర్చయినా, దానివల్ల పది లక్షల కలెక్షన్ పెరగ వచ్చు. బాగానే వుంది,  మరి 35 కోట్లు ఖర్చుపెట్టి ‘ఆరెంజ్’ తీసినప్పుడు, అందులో చివర్లో హీరో రాం చరణ్, హీరోయిన్ జెనీలియాని కలుసుకోబోతూండ గానే, హఠాత్తుగా శుభం పడి, రీలేదో  మిస్సయినట్టు థియేటర్లో  గందరగోళం ఏర్పడింది. అలాంటప్పుడు అది కలెక్షన్లని దెబ్బతీసే కంటిన్యూటీ సమస్యలా తోచి, వెంటనే ప్యాచ్ వర్క్ కి ఆదేశించాలన్పించ లేదా సుప్రసిద్ధ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ కి? ఆ అర్ధాంతరపు ముగింపునలా ఉపేక్షించి , సినిమాకి జరగబోయే భారీ నష్టాన్ని చూస్తూ కూడా ఎందుకు వదిలేసినట్టు?

          దీనికాయన ఇచ్చిన జవాబు : దర్శకుడి లాజిక్ ననుసరించే ముగింపుని అనుమతించామని! రొటీన్ గా ముగించకుండా కాస్త సాంప్రదాయేతరంగా  ఉండాలన్న దర్శకుడి ఆలోచన మేరకే అది జరిగిందని వివరించారు.

          దర్శకుడి విజ్ఞతే శిరోధార్యమైనప్పుడు ఎడిటర్ చేసేదేమీ వుండదు. అయితే ఎడిటింగ్ లో తను ప్రేక్షకుల్లో ఒకడిగా ఫీలయ్యి నిస్సంకోచంగా దర్శకులకి తన అభిప్రాయం వ్యక్తం చేస్తానన్నారు వెంకటేష్. నిజానికి ఈ విమర్శనా  దృష్టే తనని ఎడిటర్ గా చేసిందన్నారు. ‘కూలీ నెం-1’ తీసిన కె. రాఘవేంద్ర రావు దానిమీద తన విశ్లేషణ కోరినప్పుడు, నిర్మొహమాటంగా చెప్పడమే ఆయనకి  నచ్చి ఆ తర్వాత ‘అల్లరి ప్రేమికుడు’ కి ఎడిటింగ్ బాధ్యతల్ని అప్పజెప్పారన్నారు. 1995 లో అలా ఎడిటింగ్ పగ్గాలందుకున్న వెంకటేష్, అంతవరకూ సుప్రసిద్ధుడైన తన తండ్రి ఎడిటర్ మార్తాండ్ దగ్గర సహాయకుడుగా వున్నారు. ఇప్పటికి ఈ పదిహేనేళ్ళ ప్రస్థానంలో 250 తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలకు ఎడిటర్ గా అగ్రస్థానంలో వుంటున్నారు. 
    మాన్యువల్ ఎడిటింగ్ కాలానికి చెందిన ఈయన మొదట రాఘవేంద్రరావు తిట్టి కొట్టి చెప్పిన పాఠాలెన్నో నేర్చుకున్నారు. తర్వాత రామానాయుడు స్టూడియోలో ఎవిడ్ వ్యవస్థ నెలకొల్పినప్పుడు, నిర్మాత డి. సురేష్ కోప్పడుతూంటే, మాన్యువల్ ని వదిలి వెళ్లి ఎవిడ్ ఎడిటింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు సరికొత్త వెర్షన్ ఎవిడ్ -5 మీద పనిచేస్తున్నారు.

           అయితే చాలా మంది దర్శకులు ఎడిటింగ్ లో వస్తున్న కొత్త టెక్నాలజీని దుర్వినియోగ పరుస్తున్నారని బాధ పడ్డారు వెంకటేష్. ఫ్లాష్ లు, డిజాల్వ్ లు, వైప్ లు, స్ప్లిట్ ఫ్రేములు, ఇష్టారాజ్యంగా వేయిస్తున్నారన్నారు. ఫారిన్ లో షూటింగ్ ఎందుకు చేస్తారు? అక్కడి సుందర దృశ్యాలతో కనువిందు చేయాలనేగా? మరి ఆ వివిధ లోకేషన్స్ లో తీసిన సుందర దృశ్యాల్ని నాలుగేసి బొమ్మలుగా విభజించి, ఒకేసారి తెరమీద స్ప్లిట్ స్క్రీన్ లో వేస్తే  ప్రేక్షకులు వాటినెలా ఆస్వాదిస్తారని ప్రశ్నించారు.


           సరే, ఇప్పుడు పెరిగిపోయిన జీవన వేగం కారణంగా ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ (ఒక దృశ్యం పై ధ్యాస నిలిపే కాలం) కొన్ని సెకన్లకి పడిపోయిందని హాలీవుడ్ సినిమాల్లో కూడా ఎంటీవీ తరహా మైక్రో షాట్స్ తో సినిమాలు తీస్తున్నారు, ఇది సబబేనా అంటే- అది కంటికీ చెవికీ మధ్యన వుండే  4 ఫ్రేముల తేడా థియరీని కాలరాసి, డబ్బులిచ్చుకుని సినిమా కొచ్చిన ప్రేక్షకులకి తలనొప్పి తెప్పించడమేనని ఆయన దుయ్యబట్టారు! ఈ జాడ్యం తెలుగు సినిమాల్లోనూ ప్రబలిందన్నారు. షాట్స్ ని గజిబిజిగా వేయాలని నేటి దర్శకులు కోరుతున్నారన్నారు.


          తన వరకూ సంప్రదాయ స్కూల్ నే అనుసరిస్తున్నానని అన్నారు వెంకటేష్. డాక్టర్ డి. రామానాయుడు తన ప్రతీ సినిమానీ ప్రేక్షకుల మధ్య కూర్చుని- మొదటి రోజు, మూడో రోజు, రెండు వారల తర్వాతా..ఇలా మూడేసి సార్లు చూసి, ఎక్కడ ప్రేక్షకులు ఏడుస్తున్నారు, ఎక్కడ నవ్వుతున్నారు, ఎక్కడ చప్పట్లు కొడుతున్నారూ స్టడీ చేసి రమ్మనేవారు వెంకటేష్ ని. ఈ అనుభవం బగా తోడ్పడింది. అలాగే తన తండ్రి మార్తాండ్ కూడా ఒక విషాద సన్నివేశంలో కళ్ళు చెమర్చేలా  చేయని ఎడిటర్ మంచి ఎడిటరే  కాదని చెప్పేవారన్నారు వెంకటేష్. తను ఏ సినిమా కథ విననీ, తను ఫీలుయిన పద్ధతిలో కథని షాట్స్ గా కూర్చి, దర్శకుడికి చూపించి, అప్పుడు మాత్రమే  మార్పు చేర్పులుంటే చేస్తానని తన పని విధానాన్ని వివరించుకొచ్చారు.


       మరి తన ఎడిటింగ్ వెనకాల ఇంత వృత్తితత్త్వం ఉంటున్నప్పుడు, థియేటర్లలో ప్రొజెక్షన్ బాయ్స్ వాళ్ళ సొంత ఎడిటింగులూ అవీ చేసుకుని, బోరుకోడుతున్న సినిమాల నిడివినీ, కొన్ని భరించలేని పాటల్నీ వాళ్ళే ఎందుకు తీసిపారేస్తున్నట్టు? ఈ ప్రశ్నేఅడిగితే, అక్కడ ఎడిటర్ విఫలమైనట్టేనని ఒప్పుకున్నారు వెంకటేష్. 

       ఫిలిం ఎడిటింగ్ లో ఎమోషనల్ కంటిన్యూటీ చూసుకోవడం కూడా వుంటుంది. దర్శకుడు ఏ ఉద్దేశంతో దృశ్యాన్ని ప్రతిపాదిస్తున్నాడో గ్రహిస్తే, ఆ ప్రకారం షాట్స్ ని ఎంపిక చేసుకుని, ఆ వరసలో  పేర్చుకుంటూ పోయి దృశ్యానికి న్యాయం చేయవచ్చు. శేఖర్ కమ్ముల తీసిన ‘ఆనంద్’ లో కమలినీ ముఖర్జీ భోగి మంటలో ఫోటోలు వేసేస్తూ వుంటుంది. దీన్ని వెంకటేష్ ఎడిట్ చేశాక, దర్శకుడు శేఖర్ కమ్ముల చూసి, ఆమె తన మనసులోంచి చెత్తని తీసి మంటలో పారేస్తున్న అర్ధంలో ఆ దృశ్యం తీశానని వివరించారు. అప్పుడు వెంటనే వెంకటేష్ మరోసారి చూసుకుంటే, ఆమె గుండెల దగ్గర ఫోటోలు పట్టుకుని మంటలో వేస్తున్న షాట్ ఉండనే వుంది! ఇంకాలోచించ కుండా ఆ షాట్ ని కేంద్రబిందువుగా చేసుకుని, మొత్తం దృశ్యాన్ని రీ- ఎడిట్ చేస్తే, ఎమోషనల్ కంటిన్యూటీ అప్పుడు బాగా వచ్చింది!


        ఇప్పుడు ‘నాగవల్లి’, ‘రగడ’, ‘శక్తి’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘మనసారా’ మొదలైన సినిమాల ఎడిటింగ్ పనులతో బిజీగా వున్నారు మార్తాండ్ వెంకటేష్.

సికిందర్
(2010 డిసెంబర్ ‘ఆంధ్రజ్యోతి’ కోసం)