రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, జులై 2017, బుధవారం

487- నాటి సినిమా!





       పాత్రికేయుడు థామస్ ఫ్రీడ్మన్ తరచూ ఓ మాట అంటూంటాడు - ప్రపంచంలో ఉగ్రవాద సమస్య తీరడానికి, ఆ వైపు ఆకర్షితులవుతున్న వాళ్ళతో మత పెద్దలు కూర్చుని రచ్చబండ  సమావేశాలు జరుపుకోవాలని. కులపంచాయితీలకి, కట్టుబాట్లకు, సెంటిమెంట్లకి ప్రబల గుర్తుగా వుండే విలేజి రచ్చబండ  తీర్మానాలు, అంత బలమైన ప్రభావం చూపగలవని ఆయన నమ్మకం. కానీ దురదృష్ట వశాత్తూ ఇలాటి సమావేశాలు ఉగ్రవాద తండాల్లోనే  జరుగుతూ, అసంఖ్యాక లేతపిండాలు కరుడుగట్టిన  టెర్రరిస్టులుగా తయారై లోకం మీద పడడాన్ని చూస్తున్నాం. 

          ప్రజాపాలనేది పాజిటివ్ అర్ధంలోకంటే, నెగెటివ్ కోణంలోనే సమాంతర వ్యవస్థ రూపంలో సూపర్ హిట్టవుతుందేమో! ఉగ్ర తండాల్లో తాలిబన్లు, గ్రామాల్లో భూస్వాములు, నగరాల్లో మాఫియాలు... సినిమాల్లో బొబ్బిలిబ్రహ్మన్న! 


             ఔను వాళ్ళిద్దరూ మెలికపడ్డారు...ఫిలిం ఈజ్ బిహేవియర్ అన్నట్టే, స్టార్ ఈజ్ ఆర్గ్యుమెంట్ అని కూడా అన్నారు పెద్దవాళ్ళు. బ్రహ్మన్న ఈ రెంటినీ మెలేసి, ధర్మపీఠం  స్థాపించి కూర్చున్నాడు! ఫ్రీడ్మన్ మార్కు విలేజి రచ్చబండ స్థానే, ధిక్కార ధోరణితో సమాంతర  వ్యవస్థనే స్థాపించాడు. నేరం జరిగిందా, ఇక పోలీసులకి నో ఎంట్రీ. విచారణ తనదే, తీర్పు కూడా తనదే. తీర్పుని శిరసావహించకపోతే  గ్రామబహిష్కారం లేదా అక్కడున్న కత్తితో చటుక్కున శిరవిచ్ఛేదం!  ఎంత తీవ్రవాదం...టోటల్లీ అబ్నార్మల్ క్యారక్టర్!

          ఒక సహజవిరుద్ధమైన పాత్రతో రచయిత / దర్శకుడు ప్రేక్షకుల మనస్సుల్లోకి ప్రవేశపెట్టాలనుకునే వాదం ఒప్పించేదిగా వున్నప్పుడే అది విజయవంతమవుతుంది. సినిమా ఆసాంతం కథనం పేరుతో  చేసేదే వాదం అయినప్పుడు, దానికో నాదం వుంటుంది.వాదాన్ని నాదంలా వినిపించడంలో విఫలమైతే  అభాసవుతుంది. బ్రహ్మన్న తన బిహేవియర్ ని, ఆర్గ్యుమెంట్ నీ అంతబాగా వొంటబట్టించుకున్నాడు కాబట్టే, పాత్ర ప్రయాణాన్ని నల్లేరు మీద నడకలా మార్చుకోగలిగాడు. దీన్నే ‘ధర్మాధికారి’ గా హిందీలో దిలీప్ కుమార్ తో కృష్ణంరాజే రీమేక్ చేస్తే, కోలుకోలేని నష్టాలే తేలాయి.  కారణం? దిలీప్ మెత్తటి నటుడు. కృష్ణం రాజులా కళ్ళెర్ర జేసి పౌరుషాగ్నిని రగిలించడం కష్టం. కృష్ణంరాజుకి కళ్ళే నటనకి తరగని ఆస్తి. సంచలన క్యారక్టర్ వుంటే చాలదు, దానికి తగ్గ ఆర్టిస్టు బలం తోడవాలని దిలీప్ కుమార్ తో తేలింది. బిహేవియర్, ఆర్గ్యుమెంట్, ఆర్టిస్టు బలం - ఈ మూడూ ఇనుమడింప జేసే టాలెంట్ కృష్ణం రాజుది. గోపీ కృష్ణా మూవీస్ సంస్థ స్థాపించి, నిర్మించిన ‘కృష్ణవేణి’ (1974) లో వాణిశ్రీ పోషించిన మతిస్థిమితం కోల్పోయిన సహజ విరుద్ధపాత్ర ఆమె టాలెంట్ తో ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే! 

   ‘బొబ్బిలిబ్రహ్మన్న’ రచయితల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ రాసిన సిద్ధాంత గ్రంథం – ‘తెలుగు సినిమా సాహిత్యం- కథ, కథనం, శిల్పం’ - లో ఓ చోట ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని వివరిస్తూ, తెలియని అద్భుత శక్తేదో ఆ కష్టమైన సన్నివేశాన్ని రాయించిందంటారు.  మనం చెప్పుకోవాలంటే, ఆ సన్నివేశాన్నలా వుంచి, అసలు బ్రహ్మన్న అనే అసాధారణ పాత్రనే ఆ అద్భుత శక్తేదో సృష్టించిందనాలి.

      ఈ బ్రహ్మన్న బొబ్బిలి బ్రహ్మన్నల వంశంలో నాల్గవతరం మనిషి. 1857 సిపాయీల తిరుగు బాటప్పుడు, బ్రిటిష్ సైనికులు కోటిపల్లి గ్రామంలో అరాచకాలు చేస్తారు. దీని మీద తిరగబడ్డ మొదటి తరం బ్రహ్మన్న కత్తిపట్టి అరాచక మూకల్ని తెగ నరుకుతాడు. అప్పుడు తెల్లదొర బ్రహ్మన్నని మాయోపాయంతో పట్టుకుని చెట్టుకి ఉరి తీయిస్తాడు. అలా వీరస్వర్గం పొందిన ఆ మొదటి  బ్రహ్మన్న వేలాడిన చెట్టునే నరికి, దాని మొదల్లో అతడి కత్తినే అధికారానికి గుర్తుగా నాటుతారు గ్రామస్థులు. అప్పట్నించీ బ్రహ్మన్న వంశస్థులు గ్రామం లోకి పాలకుల ప్రవేశాన్ని నిషేధించి, ధర్మాన్ని తామే కాపాడుకుంటూ వున్నారు. ఇదంతా ప్రారంభ దృశ్యాల్లో జయసుధ బుర్రకథగా  చెప్పుకొచ్చే ఫ్లాష్ బ్యాక్.  

          ఈ నేపధ్యంలో ఇప్పటి బ్రహ్మన్న పాత్రచిత్రణలో ఓ సమస్య లేకపోలేదు. ఓ సన్నివేశంలో నిందితుడి కోసం గ్రామాని కొచ్చే పోలీసు అధికారిని బ్రహ్మన్న ఆపేస్తూ, అధికారుల వెలికి  తన కారణాలు చెప్తాడు – ‘ఆ నాడు తెల్లవాడు తన సైనికుల చేతిలో పరిపాలన పెడితే, మగవాడి ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. మలినాడు నిజాం నవాబు ఖాసీం రజ్వీ చేతిలో అధికారం ఉంచితే, ఆడవాళ్ళ శీలానికి భద్రత లేకుండా పోయింది, ఈ  నాడు ప్రజాప్రభుత్వాలు మీ పోలీసుల చేతుల్లో ప్రజల బతుకులు పెడితే...’ అంటూ పోలీసుల ఘోరాలు వార్తా పత్రికల్లో చూపిస్తానంటాడు. 

          ఇప్పటి బ్రహ్మన్న కార్యాచరణకి ఈ కారణాలు చాలవనిపిస్తాయి. ఎప్పుడో శతాబ్దాల క్రితం 1857 లో గ్రామంలో జరిగిన సంఘటనలు,  ముత్తాత బలిదానమూ వగైరా ఇప్పటి తన ప్రవర్తనకి ఇంకా చోదక శక్తులుగా వుంటాయా? పాతికేళ్ళ క్రితం తన తల్లి దండ్రుల్ని చంపిన విలన్ ని కళ్ళారా చూసిన హీరో, ఎప్పుడో పెద్దయ్యాక పగతీర్చుకోవడమే ఒక అసహజ చిత్రణ.  అలాటిది 152 ఏళ్ల తర్వాత ఇంకా పాలనా వ్యవస్థ మీద బ్రహ్మన్న పగబట్టి కూర్చోవడం అతి అన్పిస్తుంది. ఆ చెప్పే కారణాలకి కూడా పొంతన కన్పించదు. బ్రిటీష్ పాలనలో అరాచకాలు  సరే, మధ్యలో ఖాసీం రజ్వీ అరాచకాలు  కోస్తాలో ఎక్కడ జరిగాయి.  తెలంగాణాలో జరిగిందాన్ని కోస్తా కెలా అన్వయిస్తాడు. తన ప్రాంతం  గురించే  మాట్లాడాలి. నిజాం కూడా పాలనని రజ్వీ చేతిలో పెట్టలేదు. ఏ నిజాంల  కాలంలో కూడా మతకలహాలు  జరగలేదు. ఇక రాజ్యం పోతుందన్న దుగ్ధకొద్దీ ఖాసీం రజ్వీ దాన్ని ఎదుర్కోవడానికి నిజాంని కాదని రజాకార్లని సృష్టించి ఎగదోశాడు. ఇక బ్రహ్మన్న పాత్ర వున్న కోస్తాలో బ్రిటిష్ పాలనపోయి భారత పాలన మాత్రమే వచ్చింది. 


     బ్రహ్మన్న ఇప్పుడు చర్యకి పూనుకోవాలంటే ప్రత్యక్ష అనుభవాలతో కూడిన ఫ్లాష్ బ్యాక్ పడాలేమో? పాతికేళ్ళ తర్వాత విలన్ మీద పగదీర్చుకునే హీరోకైనా చిన్నప్పుడు  ఏం జరిగిందో అతడితోబాటు అది చూసిన ప్రేక్షకులకి, అతడి పగతో కనెక్ట్ అయ్యే ఎమోషన్ పుట్టుకొస్తుంది. కానీ బ్రహ్మన్న కీ సర్కిల్ ఆఫ్ బీయింగ్ లేదు. అతను బ్రిటిష్ కాలంనాటి సంఘటనలు చూడలేదు, ప్రేక్షకులు చూశారు. బ్రహ్మన్నతో ప్రేక్షకులకి ఈ ఎడం వుంది. అల్లూరి సీతారామరాజు కూడా మన్యం ప్రజల బాధలు కళ్ళారా చూసి, చలించిన ఫలితంగానే చర్యకి పూనుకున్నాడు. ఇప్పటి బ్రహ్మన్నకి విన్న విషయాలే తప్ప, కన్న విషయాలూ  బాధాకర అనుభవాలూ లేవు. అతను సుఖంగా కాలం గడుపుతున్నాడు. ప్రేక్షకులకి కళ్ళారా చూపించిన పూర్వకాలపు దృశ్యాలు, బ్రహ్మన్నకి అనుభవం కావాలంటే, కనీసం అతడి తండ్రి చనిపోతూ చెప్పాలి, చెప్పి వంశానుగతంగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించాలని మాట తీసుకోవాలి- అప్పుడే ప్రేక్షకులతో ఎడం తీరే అవకాశం వుంటుంది. 

          ఇదే విషయం రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు ముందు పెడితే, ఫ్లాష్ బ్యాకులు ఎక్కువై పోతాయన్నారు. జయసుధ బుర్ర కథతో చెప్పిన ఫ్లాష్ బ్యాక్ సరిపోతుందన్నారు. అది ప్రేక్షకులకి చెప్పారు, బ్రహ్మన్నకి చెప్పినట్టు చూపించలేదు కదా అంటే, దానికేదో చెప్పారు. మరి సెకండాఫ్ లో అన్నపూర్ణతో కృష్ణంరాజు ఫ్లాష్ బ్యాక్ గురించి అడిగినప్పుడు, దానికి టకటకా చెప్పేసి కన్విన్స్ చేశారుగానీ; అంతటి బ్రహ్మన్న, తన మీద వచ్చిన ఆరోపణలకి ఆ ఫ్లాష్ బ్యాకే చెప్పి, ప్రత్యర్ధి నోర్మూయించలేకపోతే, మళ్ళీ తన కొడుకే వచ్చి కాపాడాల్సి వస్తే, అది కూడా చాలక అన్నపూర్ణ కూడా వచ్చి బలపరచాల్సి వస్తే, బ్రహ్మన్న పాత్ర దయనీయ స్థితిలో పడిపోలేదా అన్న ప్రశ్నకూడా మనకి ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రశ్నలకి వివరణల  సంగతెలా వున్నా, ఎప్పుడో 1984 లో రాసిన స్క్రిప్టు సంగతులు ఇంకా గుర్తుండడం చూస్తే ఆయన జ్ఞాపక శక్తి అమోఘమన్పిస్తుంది. 

          ఇలా పైవిధంగా సహజ విరుద్ధ సినిమాటిక్ పాత్ర బ్రహ్మన్న కి కాస్త అతి కూడా జత కలిసింది. చర్యకీ కారణానికీ ఎడం వుంటే అతిగానే వుంటాయి పాత్రలు. తాలిబనిజంతో కూడిన నెగెటివిజం,  యాంటీ హీరోయిజములే  బ్రహ్మన్న విలక్షణ వ్యక్తిత్వం. ప్రేక్షకులు నిజ జీవితంలో ఏసు క్రీస్తు, మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ ల వంటి అహింసా  మూర్తుల్ని హీరోలుగా పరిగణినిస్తారనీ, అదే సినిమాల్లో కొచ్చే టప్పటికి, హీరో వయోలెంట్ గా వుంటేనే అభిమానిస్తారనీ, ఓ హాలీవుడ్ రచయిత సెలవిచ్చాడు. ఇలాంటి వయోలెంట్ బ్రహ్మన్న తాపత్రయమంతా కూడా ధర్మం కోసమే. 

          ఈ ధర్మపీఠం మీద ఆధిపత్యం కోసం పెద వెంకటరాయుడుగా రావుగోపాలరావు  కుతంత్రాలు. ఈయనది  కామిక్ విలనీ. బృహన్నల లాంటి కొడుకుగా  సత్యనారాయణనీ, చాణక్య చిట్కాలు చెప్పే గుడిపూజారి గా నూతన్ ప్రసాద్ నీ, ఇంకా అటలు పట్టించి  పరువు తీసే బార్బర్ గా  అల్లురామలింగయ్యనీ వెంటేసుకుని ఏం తీర్పులు  చెప్తాడో దేవుడెరుగు- ఎలాగైనా ధర్మ పీఠం తనకి కావాలంటే కావాలంతే! దీనికోసం బ్రహ్మన్నని ఇరుకున బెడుతూ  ఏదో వొక సమస్య  తెచ్చి పెడుతూంటాడు. ఓసారి ఖర్మకాలి  సత్యనారాయణ తన మగటిమిని నిర్ధారించుకునే ప్రయోగం చేసి, జయసుధ అక్క పాత్రతో నీచానికి పాల్పడతాడు. దీనికి బ్రహ్మన్న ఒకటే తీర్పు చెప్తాడు – అదే అమ్మాయితో పెళ్లి, లేదా రావుగోపాలరావ్ అండ్ కంపెనీ గ్రామం నుంచి వెలి! 


  భలే ఇరకాటంలో పడతాడు రావుగోపాలరావు. పైగా కొడుకు పాల్పడ్డ నీచానికి ఆ అమ్మాయి మాట కూడా పడిపోయింది. కొడుకు ఇలా మూగదాన్ని చేసుకోవాల్సి వస్తే, బ్రహ్మన్న కూతురు కూడా కళ్ళు లేని దాన్ని చేసుకునేట్టుగా పథకమేస్తాడు. 

    బ్రహ్మన్న కూతురుగా ముచ్చెర్ల అరుణ, భార్యగా శారద వుంటారు. తమ్ముడిగా కృష్ణంరాజు (ద్విపాత్రాభినయం) వుంటాడు. ఈ తమ్ముడి ప్రేమికురాలు జయసుధ. రాజేష్ ని అరుణ రహస్యంగా ప్రేమిస్తూంటుంది. వీళ్ళిద్దర్నీ లేచిపోయేలా చేస్తే బ్రహ్మన్న పదవీ భ్రష్టు డవుతాడని చిట్కా చెప్తాడు నూతన్ ప్రసాద్. దీన్ని కృష్ణంరాజు,  జయసుధలు విఫలం చేస్తారు. రావుగోపాలరావు ఇక సొంత చిట్కా ప్రయోగిస్తాడు. దీంతో అరుణ వల్ల  ఒకడు కళ్ళు పోగొట్టుకుంటాడు. ఈ పంచాయితీ ధర్మపీఠం ముందుకొస్తుంది. తన కూతురు ఈ గుడ్డి వాణ్ణే చేసుకోవాలని తీర్పు చెప్పేస్తాడు బ్రహ్మన్న. కృష్ణం రాజు అడ్డుపడి ఆమె ప్రేమిస్తున్న రాజేష్ తోనే  పెళ్లి జరిపించేస్తాడు. దీంతో వీళ్ళందర్నీ గ్రామబహిష్కారం చేస్తాడు బ్రహ్మన్న. ఇది తట్టుకోలేక  శారద వెళ్లి వాళ్ళని చూసొస్తానంటే, ఆమెనీ బహిష్కరించి ఏకాకి అయిపోతాడు  బ్రహ్మన్న

          ఇదంతా చూసి ఆనందిస్తూంటాడు రావుగోపాలరావు. అప్పుడు  ఒకటొకటే నిజాలు బయట పడుతూంటాయి. అడ్డంగా బ్రహ్మన్నకి దొరికిపోతాడు. తరిమి తరిమి మరీ వధిస్తాడు బ్రహ్మన్న. ఇక ధర్మ పీఠాన్ని తమ్ముడికి అప్పజెప్పేసి జైలు కెళ్ళిపోతాడు.

          దీనికి కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన మార్కు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ వుంటాయి. చక్రవర్తి సంగీతం. ఇప్పుడా పాటలూ నృత్యాలూ బలహీనంగా అన్పిస్తాయి. సలీం నృత్య దర్శకుడు. కొన్ని చోట్ల కృతకంగా వుంటుంది కథనం.

       1984 లో ఇది విడుదలయింది. అప్పటికింకా కాస్త మిగిలిన జమీందారీ వ్యవస్థనీ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థనీ ప్రతిబింబిస్తుంది. మధ్య తరగతి ఉమ్మడి కుటుంబాలు పూర్తిగా  వేరు. అవి ఫ్రీగా మసలుకుంటాయి. జమీందారీ ఉమ్మడి కుటుంబాల్లో కుటుంబ పెద్దని చూసి జడుసుకు చస్తుంటారు కుటుంబ సభ్యులు. చివరాఖరికి ఆ కుటుంబ పెద్ద బుద్ధి తెచ్చుకోవడమే పని. ఇది  సినిమాలకి అలవాటయిన ఫార్ములా. ఇంకో పదేళ్ళ తర్వాత ఇలాటి జమీందారీ కథతోనే మోహన్ బాబు ‘పెద రాయుడు’ తీశారు

           
-సికిందర్
(సెప్టెంబర్ 13, 2009 – ‘సాక్షి’)
http://www.cinemabazaar.in