రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, సెప్టెంబర్ 2019, సోమవారం

868 : 'పాలపిట్ట' ఆర్టికల్


          విగా, రచయితగా, అనువాదకునిగా, సినీ విశ్లేషకునిగా బహుముఖ ప్రజ్ఞని ప్రదర్శించే అరుదైన సృజనశీలి మామిడి హరికృష్ణ. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా ఆయన నిర్వహిస్తున్న పాత్ర విలక్షణమైనది. విభిన్న రంగాలలో తనదైన ముద్ర వేసిన హరికృష్ణ సృజనశీలత్వాన్ని, విశిష్టతని ప్రతిఫలించే స్పెషల్ ఇష్యూ ఇది. మామిడి హరికృష్ణ తో ప్రముఖ రచయిత కస్తూరి మురళి కృష్ణ చేసిన ఇంటర్వ్యూ తో పాటు హరికృష్ణ మూర్తిమత్వాన్ని వ్యక్తం చేసే వ్యాసాల, అభిప్రాయాల సమాహారం ఈ ‘పాలపిట్ట’ సంచిక. డజన్ కు పైగా వ్యాసాలు, కవితలు హరికృష్ణ క్రియేటివ్ నేచర్ ని తెలియజేస్తాయి. హరికృష్ణ ప్రయాణం లోని అనేక కోణాలు ఈ సంచిక లో చూడవచ్చు. కవిగా హరికృష్ణ ప్రత్యేకత లను సిద్ధార్థ, ఎం.నారాయణ శర్మ చెప్పారు. సినిమాలపై హరికృష్ణ కు ఉన్న సాధికారిక పట్టును సికిందర్ చెప్పిన తీరు ఆకర్షణీయం. అందరికి తెలిసినట్టే కనిపించే హరికృష్ణ లోని తెలియని ఆర్ద్రమైన కోణాలు ఎన్నో ఈ ‘పాలపిట్ట’ సంచిక పాఠకుల ముందుకు తెచ్చింది. ఇందుకు సహకరించిన రచయతలకు, ముఖ్యంగా అక్షర కుమార్ కు, ఇతర మిత్రులకు ధన్యవాదాలుఅభినందనలు.
కె.పి. అశోక్ కుమార్
వర్కింగ్ ఎడిటర్, ‘పాలపిట్ట’ మాసపత్రిక
 
          తెలుగు సినిమా విమర్శకుడు, చరిత్ర కారుడు మామిడి హరికృష్ణ పేరు తెలియని వారు వుండరు. వివిధ పత్రికల్లో విరివిగా ఆయన సినిమా వ్యాసాలు రాసి పేరు గడించారు. సినిమా విమర్శకుడుగా రెండు సార్లు నంది అవార్డులు పొందారు.  హాలీవుడ్ నుంచీ బాలీవుడ్, టాలీవుడ్, ప్రాంతీయ సినిమాల దాకా గొప్ప జ్ఞానసంపద వున్న వ్యాసకర్తగా ఖ్యాతి సంపాదించారు. ఈ నాల్గు సినీరంగాలపై ఆయన రాసిన వ్యాసాలు తగినంత సమాచారాన్ని అందిస్తాయి. ఆయన స్పృశించని అంశమంటూ లేదు. సినిమా  పుట్టిందగ్గర్నుంచి,  ఏ స్థాయికి చేరిందనేవరకూ ఒక నిఘంటువులా వ్యాసపరంపర సాగించారు. ఈ వ్యాస సంపదని సినిమా కళ శాస్త్ర సాంకేతిక విషయ అధ్యయన దృష్టితో కాకుండా, విస్తృత ఉపరితల సమాచారాన్నందించే డేటా బ్యాంకుగా అందుబాటులో వుంచారు. సగటు సినిమా పాఠకుల్ని అలరించే విశేషాలు  ఆయన విషయ సేకరణకి ప్రధానంగా వున్నాయి.

          2013 వరకూ విరివిగా సినిమా వ్యాసాలు రాస్తూ పోయారు. ఆ తర్వాత సినిమా వ్యాసాలు గానీ, తెలుగు సినిమా సమీక్షలు గానీ రాసినట్టు లేదు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకుడుగా తీరిక లేని బాధ్యతల వల్ల ఇది కుదరక పోవచ్చు. అయితే రవీంద్ర భారతి కేంద్రంగా ఆయన భావి సినిమా కళాకారుల్ని తీర్చిదిద్దే వివిధ కార్యక్రమాలు నిర్విహిస్తూ బిజీగానే వుంటున్నారు.

          ఆంధ్రభూమి సినిమా పేజీ వెన్నెలలో హరికృష్ణ రాయడం ప్రారంభించి ఇతర పత్రికలకి విస్తరించారు. దేశంలో సినిమా ఆవిర్భావానికి అద్యులైన దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య నాయుడు, జెసీ డేనియల్ నాడార్ ల గురించి ఇంకా  జీవిత చరిత్రలు  రాయడం, పరిచయం చేయడం అవసరం లేదు. ఈ ముగ్గురిపై వివిధ భాషల్లో కొన్నేళ్లుగా అనేక కథనాలు వచ్చేశాయి. సినిమా చరిత్రకారుడిగా హరికృష్ణ తనూ రాసి కొత్తగా తెలిపేదేమీ వుండదు. అందుకని ఈ ముగ్గురి జీవితాలాధారంగా నిర్మించిన మూడు బయోపిక్స్ ని పాఠకుల ముందుంచారు. ఇంతకాలం వివిధ వ్యాసాలతో ఈ ముగ్గురు సినీ పితామహుల్ని స్మరించుకుంటూనే వున్నాం. బయోపిక్స్ తో స్మరించుకోవడం ఒకెత్తు. దాదా ఫాల్కే హరిశ్చంద్రాచీ ఫ్యాక్టరీ’ (మరాఠీ), ‘రఘుపతి వెంకయ్య’ (తెలుగు), ‘సెల్యూలాయిడ్’ (మలయాళం) అనే మూడు బయోపిక్స్ విశేషాలు తెలియజేశారు. అయితే దక్షిణ దేశంలో తొలి సినిమా నిర్మించింది రంగస్వామి నటరాజ మొదలియార్. ఈయన 1918 లోనే తమిళంలో కీచక వధమ్నిర్మించాడు. ఈయన బయోపిక్ లేకపోయినా ఈయన గురించి ప్రస్తావించి ఉండాల్సింది. దక్షిణాది చిత్రంఅనే వేరే వ్యాసంలో మొదలియార్ గురించి రాశారు.  ఇక రఘుపతి వెంకయ్య అనకుండా, రఘుపతి వెంకయ్య నాయుడు అని పూర్తి పేరు రాయాల్సింది. 

        పునర్జన్మల మీద వచ్చిన సినిమాలు, జేమ్స్ బాండ్ సినిమాలు, కాపీ సంస్కృతి, సినిమా నిర్మాణంలో సాధకబాధకాలు, వివిధ అవార్డులు, చలన చిత్రోత్సవాలు, ఆస్కార్ అవార్డుల చరిత్ర, ఆస్కార్ అవార్డులు సాధించిన సినిమాల జాబితా, ఆస్కార్ అవార్డులకి పోటీ పడ్డ భారతీయ సినిమాలు, దేవానంద్ నట జీవితం, తెలుగు సినిమా టైటిల్స్, తెలుగు సినిమాల్లో ఊతపదాలు, రామాయణం మీద తీసిన సినిమాలు, తెలంగాణా సినిమాలు, ప్రపంచంలో తొలి బయోపిక్, హిందీ సినిమాల్లో మాండలికం, యశ్  చోప్రా నిర్మించిన చిత్రాలు, బాలల చిత్రాలు, చిత్రోత్సవాలు, బాలీవుడ్ కథా వస్తువులు, మాస్ సినిమా లక్షణాలు, సినిమాలపై సామాజిక ఉద్రిక్తల ప్రభావం, ప్రాంతీయ సినిమాలు ...ఇలా ఒకటనేమిటి, వీలైనన్నిఅంశాలపై విస్తృతంగా, విపులంగా రాశారు. 

          రిఫరెన్స్ కోసం ఆయన వ్యాసాలు చక్కగా ఉపయోగపడతాయి. ఈ వ్యాసాల్లో ఆయనలోని విమర్శకుడు కన్నా చరిత్రకారుడే కన్పిస్తాడు. విషయాన్ని పరిచయం చేయడం వరకే ఈ వ్యాసాల ఉద్దేశంగా కనబడుతుంది. విమర్శనాత్మక దృష్టితో వాటి లోతైన విశ్లేషణ కన్నా, తులనాత్మక విశ్లేషణ కొంత కన్పిస్తుంది. రెండు మూడు భాషల్లో వచ్చిన పునర్జన్మల సినిమాలని పోల్చడం, జేమ్స్ బాండ్  సినిమాలని పోల్చడం వగైరా. 

          పునర్జన్మల సినిమాలకి సంబంధించి ఇవెందుకు హిట్ ఫార్ములా అయ్యాయో మనోవిశ్లేషణ చేశారు. పునర్జన్మలు ఒక నమ్మకం కాదనీ వాటిని శాస్త్రీయంగా నిరూపించేందుకు పారాసైకాలజీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ తదితర రంగాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయనీ వివరించారు. ఇవే కాక పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే టెక్నిక్ తో ఇప్పటికిప్పుడు మనిషిని గత జన్మలోకి తీసికెళ్ళే నిపుణుడుగా డాక్టర్ బ్రియాన్ వీస్ వున్న విషయం మనకి తెలిసిందే. అయితే కొన్ని నమ్మకాలకి ప్రేక్షకులకి నిరూపణలతో నిమిత్తముండదేమో. దేవుళ్ళతో భక్తి సినిమాలు, దెయ్యాలతో హార్రర్ సినిమాలూ ఎలా చూస్తారో పునర్జన్మ సినిమాలూ అంతే. వీటి నాటకీయ విలువలే, పలాయన వాద చిత్రణలే ప్రేక్షకులకి సత్కాలక్షేప వినోద సాధనాలవుతున్నాయేమో ఆలోచించాలి.

 
          ఇక్కడ వ్యాసకర్త ఇచ్చిన శాస్త్రీయ సమాచారం విలువైనదే. అయితే పాఠకులు క్షమిస్తే, కొంత బేసిక్ సినిమా శాస్త్రాన్ని ఇక్కడ జోడించడం అవశ్యం కావచ్చు. క్లుప్తంగా చెప్పుకుంటే, వెండితెర మీద సినిమా ప్రదర్శనంటే ఏమిటి? ప్రేక్షకుల మానసిక లోకాన్ని ఆవిష్కరించడమే. ప్రేక్షకుల కాన్షస్ మైండ్ తో వాళ్ళ సబ్ కాన్షస్ మైండ్ కి లడాయి పెట్టడమే. దీన్నే కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లే అన్నారు. చిన్మయానంద స్వామి ప్రకారం కురుక్షేత్రం ఎక్కడో జరగలేదు. మనిషి మస్తిష్కంలోనే నూరు మంది కౌరవులనే నెగెటివ్ భావాలతో, ఐదు మంది పాండవులనే పాజిటివ్ ఫీలింగ్స్ జరిపే నిత్య సంఘర్షణే మనిషి మానసిక లోకంలో జరిగే కురుక్షేత్రం. పురాణాలన్నీ సైకో ఎనాలిసిస్ లే. మనసు గురించి చెప్పేవే. ఈ విశ్వమే దేవుడి మనసు. మనస్సు తప్ప ఇంకేమీ లేదు ఎక్కడా. దురదృష్టవశాత్తూ మనసే మనిషికి శత్రువైంది. ఈ మనస్సుని మధించడమే వెండితెర మీద సినిమా చేసే పని.


          పైన చెప్పుకున్న లడాయికి  ప్రేక్షకుల ఇగో కథానాయకుడుగా వుంటుంది. ఇతర పాత్రలు ప్రేక్షకుల వివిధ భావోద్వేగాలకి ప్రతిరూపాలుగా వుంటాయి. సినిమా కథంటే ఏమిటి? అన్న ప్రశ్న వేసుకుని,  ఇరవై ఏళ్ళూ అజ్ఞాతంలో కెళ్ళిపోయి పరిశోధన చేసిన స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ కనుగొన్న వాస్తవాలివి. ఇలా గొప్ప సినిమాలు కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లేగానే ఉంటున్నాయని తేల్చాడు. లేనివి మామూలు సినిమాలుగా మిగిలిపోతున్నాయన్నాడు. అంతరాత్మ (సబ్ కాన్షస్ మైండ్) తో కాన్షస్ ఇగో  జరిపే పోరాటమే సినిమా కథ అన్నాడు. ఈ పోరాటంలో జీవిత సత్యాలు తెలుసుకున్న ఇగో, చివరాఖరికి  మెచ్యూర్డ్ ఇగోగా ఉన్నతిని పొందుతుందన్నాడు. ఇగోని ఏం చేసీ చంపడం సాధ్యం కాదు గనుక, దాన్ని మెచ్యూర్డ్ ఇగోగా మార్చుకుని బాగుపడ్డమే చేయగల్గింది. దీన్నే గొప్ప సినిమాలు చిత్రిస్తాయన్నాడు. ఈ బేసిక్ సినిమా సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు, ప్రేక్షకుల అన్ని నమ్మకాలూ, మూఢనమ్మకాలూ వగైరా మనోఫలకాలన్నీ  వెండి తెరమీద ఈ చట్రంలోకే వచ్చేసి నర్తిస్తాయి. జేమ్స్ బానెట్ ప్రసిద్ధ గ్రంధం ‘Stealing Fire from the Gods’ సారాంశమిది.



బాండ్ డిటెక్టివ్?
          జేమ్స్ బాండ్ సినిమాల గురించి ఎక్కువ సమాచారమిచ్చారు. జేమ్స్ బాండ్ ని సృష్టించిన రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ గురించి రాశారు. జేమ్స్ బాండ్ పాత్ర ఎలా పుట్టిందీ రాశారు. అయితే ఇది డిటెక్టివ్ జానర్  అన్నట్టుగా రాశారు. జేమ్స్ బాండ్  డిటెక్టివ్ నవలా సాహిత్యంలో ఎంత సంచలనం సృష్టించాడో, స్పై  థ్రిల్లర్ సినిమాలతో కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేశాడుఅనడం సరి కాదేమో. జేమ్స్ బాండ్ ది డిటెక్టివ్ నవలా సాహిత్యంకాక,  స్పై గూఢచార సాహిత్యమే. డిటెక్టివ్ పాత్ర  స్థానికంగా నేర పరిశోధన చేస్తే, స్పై లేదా గూఢచారి పాత్ర విదేశాల్లో రహస్య కార్యకలాపాలు సాగిస్తాడనేది జగమెరిగిన సత్యం. వృత్తుల్లో ఈ తేడా వుంది. జేమ్స్ బాండ్ ఈ రెండో కోవకి చెందిన వాడు. సత్యజిత్ రే సృష్టించిన ఫెలూదా పాత్ర జేమ్స్ బాండ్ పాత్ర అనడం కూడా సరికాదేమో. అది పక్కా డిటెక్టివ్ పాత్రే. అలాగే జంధ్యాల తీసిన చంటబ్బాయ్లో చిరంజీవి ప్రైవేట్ డిటెక్టివే తప్ప, జేమ్స్ బాండ్ పాత్ర కాదు. హాస్యం కోసం, ప్రేక్షకులకి అర్ధం అవడం కోసం ఆ పాత్ర జేమ్స్ పాండ్అని పలుకుతుంది. పాత్రపేరు పాండు రంగా రావు అయినందుకు. ఇక రాజ్ కపూర్ నటించిన జాసూస్’, ‘దో జాసూస్లు కూడా బాండ్ సినిమాలు / పాత్రలు కావు, అవి డిటెక్టివ్ సినిమాలే, డిటెక్టివ్ పాత్రలే. జాసూస్ అంటేనే పత్తేదారు లేదా డిటెక్టివ్ అని అర్ధం. జేమ్స్ బాండ్ స్పై జానర్ గురించిన వ్యాసంలో, డిటెక్టివ్ జానర్ సినిమాలని స్పై జానర్ కింద పేర్కొంటూ కలిపి రాసేశారు.  తెలుగులో డిటెక్టివ్ యుగంధర్ సృష్టికర్త కొమ్మూరి సాంబశివరావు, షాడో సృష్టికర్త మధుబాబు, జేమ్స్ బాండ్ స్ఫూర్తితో రాయడం మొదలెట్టినట్టు తెలియజేశారు. కానీ జేమ్స్ బాండ్ పుట్టక ముందే యుగంధర్ పాత్రని సృష్టించి నవలలు రాయడం మొదలెట్టారు కొమ్మూరి. మధు బాబు షాడో పాత్ర మార్షల్ ఆర్ట్స్ ని పరిచయం చేస్తూ, తెలుగు డిటెక్టివ్ సాహిత్యాన్ని అటకెక్కిస్తూ, ఆధునికంగా పుట్టిన స్పై పాత్ర. దీనికి జేమ్స్ బాండ్ స్ఫూర్తి కాదు. కొమ్మూరి సాంబశివరావు పేరుని సాంబశివరావు అనకుండా, కొమ్మూరి సాంబశివరావు అని పూర్తి  పేరు రాసివుంటే గౌరవంగా వుండేది.


          ఇక తెలుగులో మొదటి జేమ్స్ బాండ్ సినిమా హీరో కృష్ణ నటించిన గూఢచారి 116’  అన్నారు కానీ దర్శకుడు కెఎస్ఆర్ దాస్ కాదు, ఎం మల్లిఖార్జునరావు. ఆ తర్వాత హీరో కృష్ణ 1978 లో జేమ్స్ బాండ్ గా ఏజెంట్ గోపీలో నటించారన్నారు. కానీ గూఢచారి 116తర్వాత జేమ్స్ బాండ్ 777లో, ‘ఏజెంట్ గోపీతర్వాత మరో రెండు బాండ్ సినిమాలు రహస్య గూఢచారి’, ‘గూఢ చారి 117లలో నటించారు హీరో కృష్ణ. ఇన్ని బాండ్ సినిమాల్లో నటించినందుకే ఆయన ఆంధ్రా జేమ్స్ బాండ్ అయ్యారు. చిరంజీవి నటించిన బాండ్ సినిమాల్ని పేర్కొనడం బావుంది గానీ, కృష్ణం రాజు నటించిన అందడు ఆగడుకూడా పేర్కొని వుండాల్సింది.


          ఇక రామాయణ సినిమాల విషయానికొస్తే ఇవి ఎన్ని రకాలుగా వచ్చాయో వర్గాలుగా విభజించి చక్కగా పేర్కొన్నారు. ఇంకా ఈ జాబితాలో  ఇంద్రజిత్, పాదుకా పట్టాభిషేకంతో బాటు బాపు దర్శకత్వంలో సీతాకళ్యాణంకూడా చేర్చాలి. 1972 లో బాపు దర్శకత్వంలో శోభన్ బాబు, చంద్రకళ జంటగా ఓ సినిమా వచ్చిందన్నారు. అ సినిమా పేరు సంపూర్ణ రామాయణంఅని రాయాల్సింది.

మాండలికం ముచ్చట్లు
          హిందీలో ఎన్ని మాండలికాలున్నాయో (12) వాటి గురించి వివరంగా సేకరించి తెలియజేశారు. ఈ మాండలికాలు ప్రధాన స్రవంతి హిందీ సినిమాల్లోకి ఎలా ప్రవేశించాయో విపులంగా రాశారు. ఈ మాండలిక వాడకం1961 లో  గంగా జమునతో ప్రారంభమై,  ఆ తర్వాత 1970 లలో రివెంజి సినిమాల వెల్లువలో కొట్టుకు పోయి2000 లలో ప్రకాష్ ఝా, విశాల్ భరద్వాజ్ తదితర దర్శకులతో తిరిగి మాండలిక ప్రయోగాలు  జరుగుతున్నట్టు చెప్పుకొచ్చారు.  కానీ 1970 లలో హిందీ బందిపోటు సినిమాల వెల్లువలో మాండలికం బాగానే వెల్లివిరిసింది. ఇక 1975 లో షోలేలో గబ్బర్ సింగ్ మాట్లాడిన ఖరీబోలీ యాస గురించి చెప్పాల్సిన పనిలేదు.

          తెలుగు సినిమా టైటిల్స్ పరిణామ క్రమం గురించి, తెలుగు సినిమాల్లో సంభాషణల చమత్కారం గురించీ, ఊత పదాల గురించీ పాతాళ భైరవిదగ్గర్నుంచీ కొన్ని  సినిమాలని సరదాగా ఉదహరించారు. ముత్యాల ముగ్గులో రావుగోపాల రావు పొడవైన డైలాగుల గురించి రాశారు గానీ, ‘అలోవలోవలోఅనే ఊతపదం, ‘యాభైలో సగం పన్నెండున్నరఅనే బాగా పేలిన డైలాగు కూడా వున్నాయి.

          సినిమా కథలు ఎన్ని రకలుగా కాపీ చేస్తారో ఒక జనరల్ వ్యాసం రాశారు. ఇది రాసే నాటికే బాలీవుడ్ లో  హాలీవుడ్ కంపెనీలు శాఖలు ఏర్పాటు చేసుకుని, హాలీవుడ్ నుంచి కాపీ కొడుతున్న నిర్మాతలకి నోటీసులు పంపడం ప్రారంభించడంతో అప్రమత్తమై, బాలీవుడ్ లో కాపీలు  కొట్టడం మానేశారు. ఈ కొసమెరుపు రాసి ఉండాల్సింది. ఇక స్వామీ రారాఅనే మొదటి సినిమా తీసిన దర్శకుడు సుధీర్ వర్మ,  ‘నాకు నచ్చిన సినిమాలన్నిటినీ కాపీ కొడతానుఅని టైటిల్స్ కి ముందు వేశారని పేర్కొన్నారు. నిజానికి ఈ లైను కూడా దర్శకుడు కాపీ కొట్టిందే. స్వామీరారాని హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరాంటినో తీసిన కల్ట్ ఫిలిం పల్ప్ ఫిక్షన్కి ప్రభావితుడై తీశాడు. క్వెంటిన్ టరాంటినో  ప్రసిద్ధ కొటేషన్ ఒకటుంది - 
“I steal from every single movie ever made. అని. దీన్ని కాపీ కొట్టి తెలుగులో తన కొటేషనుగా వేసుకున్నాడు దర్శకుడు. ఆ తర్వాత ఈ దర్శకుడు కనిపించడం మానేశాడు. టరాంటినోలా కాపీ కొడతానని గొప్పగా చెప్పుకోవాలంటే తనూ టరాంటినో స్థాయికి ఎదిగితేనే కదా - ఫర్వా లేదనుకుని ధైర్యం చేసి నిర్మాతలు సినిమాలిస్తారు. ఓవరాక్షన్ చేస్తే ఇలాగే వుంటుంది.

          హిందీ సినిమాలు ఎలా మార్పు చెందుతూ వచ్చాయో పేర్కొన్న వ్యాసంలో, అమితాబ్ బచ్చన్ కెరీర్ గ్రాఫ్ తలకిందులుగా వుంది.  “ ‘షోలే’ (1975) తో మొదలైన అమితాబ్ జైత్ర యాత్ర,  ‘జంజీర్’, ‘దీవార్లతో దూసు కెళ్ళి... అంటూ రాసు కొచ్చారు. నిజానికి జంజీర్’ (1973) తో మొదలైన అమితాబ్ జైత్ర యాత్ర, ‘మజ్బూర్’ (1974), ‘దీవార్’ (1975), షోలే (1975) లతో దూసుకెళ్లింది...అని వుండాలి.


సాంఘిక సంక్షోభాల్లో విజయాలు 

          సమాజం సంక్షుభితంగా వున్నప్పుడు సినిమాలు విజయాలు సాధిస్తాయని సూత్రీకరణ చేశారు. దూకుడుసినిమా ఘనవిజయం సాధించడానికి ఆ సమయంలో తెలంగాణా ఉద్యమంతో సంక్షుభిత వాతావరణం  ఏర్పడడం కారణమే తప్ప మరొకటి కాదన్నారు. అలాటి  సంక్షోభ సమయాల్లో మనిషి ఎలాటి  మానసిక స్థితికి లోనవుతాడో మానసిక శాస్త్ర ఆధారాలు చూపారు. ఉద్యమాలు భావోద్వేగాలతో వుంటాయి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుతో కూడిన భావోద్వేగాల తెలంగాణా ఉద్యమ సమయంలో, ఆంధ్రా సినిమాకి తెలంగాణాలో కూడా ఘనవిజయం లభించిందంటే, తెలంగాణా భావోద్వేగాలు పనిచేయకుండా వుండాలి. వ్యాసకర్త వివరించిన వ్యక్తిగత భావోద్రేకాలు తోడ్పడి వుండాలి. అంటే తెలంగాణా ప్రేక్షకులు తెలంగాణా ఉద్యమంతో విసిగి వేసారి వుండాలి. ఈ విసుగుతో సినిమాని విజయవంతం చేసి ఉపశమనం పొంది వుండాలి.

          ఇదే ఉద్యమం తీవ్రంగా వున్న  సమయంలో నితిన్ నటించిన సీతా రాముల కళ్యాణం- లంకలో’  విడుదలైప్పుడు, ఆంధ్రా ప్రాంత విద్యార్థులు తెలంగాణా సోదరుడి సినిమాని ఆహ్వానిద్దాంఅని థియేటర్ల దగ్గర ప్రేక్షకులకి గులాబీలు పంచారు. అయినా ఆ సినిమా ఆడలేదు. 1969 తెలంగాణా ఉద్యమ కాలంలో,  కృష్ణ - విజయనిర్మల నటంచిన లవ్ ఇన్ ఆంధ్రవిడుదలైతే ఆంధ్రాలోనే అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ దృష్టాంతాల రీత్యా వ్యాసకర్త సూత్రీకరణ సంతృప్తికరంగా అన్పించడం లేదు.

          ఇకపోతే తెలంగాణా సినిమాలు ఎన్నిరకాలుగా వున్నాయో వర్గీకరణ చేసి, ఆ ఎనిమిది రకాల సినిమాల్ని పేర్కొన్నారు. అ యితే ఓ రెండు సినిమాలకి తప్ప,  మిగతా  వాటిలో కూడా నటీనటులెవరో పేర్కొనలేదు. పేర్కొని వుంటే సమాచారం సమగ్రంగా వుండేది.

          ఇలా విభిన్న అంశాలపై తన సునిశిత దృష్టిని సారించారు వ్యాసకర్త. ఈ వ్యాసాలు చదివితే సినిమా జర్నలిస్టుగా ఆయన పరిపూర్ణంగా అర్ధమవుతారు. అయితే అవసరమైన చోటల్లా సంబంధిత సినిమా నిపుణుల్ని సంప్రదించి, వారి అభిప్రాయాలని కూడ జతపర్చి వుంటే ఆయన  జర్నలిజం మరింత ప్రకాశించేది. ఈ వ్యాసాలు 2013 వరకూ రాసినవి. ఇన్నేళ్ళ విరామం తర్వాత వీటిని పుస్తకంగా వేయాలంటే, కొత్త సమాచారంతో  అప్డేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా  వుంది.

సికిందర్
(‘పాలపిట్ట’, మే 2019 సంచిక) 


867 : స్క్రీన్ ప్లే సంగతులు -1


  (‘సాహో’ లైన్ ‘లార్గో వించ్’ నుంచి కాపీ అని వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కొందరు టాలీవుడ్ మిత్రులు ‘సాహో’ లో ఎండ్ సస్పెన్ తో మిడిల్ మటాష్  స్క్రీన్ ప్లే చేశారని ఫోన్లు చేసి చెప్పేస్తున్నారు. తాజాగా సిఎస్ అనే ఇంకో మిత్రుడు, ఇంకో అడుగు ముందుకేస్తూ రీసెర్చి చేసి, అసలు ‘సాహో’ స్క్రీన్ ప్లే, కథనం ఇదే దర్శకుడు తీసిన తొలి మూవీ, ‘రన్ రాజా రన్’ నుంచే దించేశాడని విశ్లేషణ రాసి పంపారు. ‘రన్ రాజా రన్’ లోని రోమాన్సు, ‘సాహో’లో యాక్షన్ గా ఎలా మారిందో వివరించారు. ఇంకా ‘రన్ రాజా రన్’ లోని పాత్రలే, వాటితో వున్న కథనాలే  ‘సాహో’ లో ఎలా మార్చి తీశాడో చెప్పారు. ఈ విశ్లేషణ చదవండి. చివర ‘రన్ రాజా  రన్’ కి అప్పట్లో పోస్టు చేసిన బ్లాగు రివ్యూ లింక్ ఇచ్చాం, అది కూడా చదవండి)

         న్ రాజా రన్సినిమానే మళ్ళీ  ‘సాహో’ గా తీసిన సుజీత్. అదేంటి? ‘లార్గో వించ్’ నుండి ‘సాహో’ కు లైన్ తీసుకున్నారని అంటున్నారే?  మరి 'రన్ రాజా రన్' కు పోలిక ఏమిటి? ఎందుకో చూద్దాం...

          న్ రాజా రన్' సినిమాలో  కథ ఏమిటో, అసలేం జరుగుతుందో చివరి ఇరవై నిమిషాల వరకూ తెలీదు.  మరి అంత వరకూ జరిగింది ఏమిటి?  ఒక పక్క, శర్వానంద్ కూరగాయల షాపు నడుపుకుంటూ డిజైనర్ డ్రెస్సులు వేసుకుని తెలుగు సినిమా హీరోలా ఏ పనీ పాట లేకుండా హీరోయిన్ తో అచ్చిక బుచ్చికలు, ఇంకో పక్క నగరంలో జరుగుతున్న కిడ్నాపులు, కిడ్నాపర్ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్న కమీషనర్ సంపత్ రాజ్, అతను వేసే చెత్త పథకాలు. సినిమా మొదలైన గంటా యాభై నిముషాలు వరకూ జరిగింది ఇంతే.  

          హీరో సమస్య ఏమిటి
, అతని గోల్ ఏమిటి, విలన్ ఎవరు, వాడి గోల్ ఏమిటి? ఇలా ఏమీ తెలీకుండా గూగుల్ లో వెతికితే  వచ్చే జోకులతో టైమ్ పాస్ తప్ప, దాదాపు ఒక గంటా యాభై నిముషాల సినిమాలో కథ ప్రసక్తే లేదు. ఇంటర్వల్లో హీరో హీరోయిన్ ను కిడ్నాప్ చేయడం ట్విస్ట్ అట! నాకు బోర్ కొట్టి ఇక వెళ్ళి పోదాము అనుకున్న టైమ్ లో, చివరి ఇరవై నిమిషాలూ ట్విస్టుమీద ట్విస్టులు.  



      ఒకప్పుడు కిడ్నాపులు (డబ్బు కోసం) చేసింది ఇప్పటి కమీషనరు సంపత్ రాజ్ అనీ, అప్పటి ఆ కిడ్నాపు నేరాన్ని మన హీరో నాన్న మీద వేసి జైలుకు పంపాడనీఇప్పటి కిడ్నాపులు చేసేది మన హీరో అనీఇది సంపత్ రాజ్ ను జైలుకు పంపడాని కి మన హీరో వేసిన అతి తెలివైన (!) పథకం అనీ. ఇవి కాకహీరోయిన్ హీరో ను ప్రేమించలేదనీ, జస్ట్ బక్రా గా సెలెక్ట్ చేసుకుందనీ, అయితే అంత కంటే ముదురైన మన హీరో ఆమెను బక్రాను చేయడానికే తాను బక్రాగా నటించాననీ, ఇలా వంశీ తీసిన  ‘అన్వేషణ’ సినిమా చివరలో రాళ్ళ పల్లి అన్ని రహస్యాలు  ఒక్క సారి గా గుక్క తిప్పుకోకుండా చెప్పినట్టు, డైరెక్టర్ మనకు చెప్తాడు- చూసారా నా స్క్రీన్ ప్లే అన్నట్టు. 

          చివరలో సస్పెన్స్ విప్పడానికి ఇదేమీ ‘అన్వేషణ’ లా సస్పెన్స్ థ్రిల్లర్ కాదు. ‘అన్వేషణ’ లో ఆ సస్పెన్స్ మొదటినుండీ బిల్డ్అప్ అవుతుంది
.

           
చివరి నిమిషం వరకూ ఏదో సోది చెబుతూ, చివరలో వాటికి కారణాలు చెబుతూ, ఇదీ అసలు కథ అని అప్పుడు రివీల్ చేయడం ఒక రకమైన మోసమే. డైరెక్టర్ ఉద్దేశం  ప్రకారం ఇది నాన్న కోసం కొడుకు రివెంజ్ తీర్చుకునే కథ. అయితే ఇది స్ట్రక్చర్ లో లేని సినిమా. అయినా కూడా ‘రన్ రాజా రన్’ సక్సెస్ అయిందంటే దానికి వేరే కారణాలు ఉండొచ్చు. కొంత మంది యువతకు నచ్చే హీరో హీరోయిన్ మధ్య వచ్చే పిచ్చి కామెడీ సీన్లు కావచ్చు , ఇంకొంత మందికి నచ్చే పాచి పోయిన 'మామను తిప్పలు పెట్టే అల్లుడు' కామెడీ సీన్లు కావచ్చు, లేదా శర్వానంద్ తన కుబుసాన్ని విడిచి రవితేజ మాస్కును తొడుక్కుని వేసే వెకిలి వేషాల సీన్లు కావచ్చు, రిలీజ్ అయిన టైమ్ కావచ్చు. ఇంకా అనేకం కావచ్చు. Sujeeth just got away.

       ‘రన్ రాజా రన్’ సినిమా సక్సెస్ అయినందుకు సుజీత్ కు ఆ ఫార్మాట్ పై నమ్మకం పెరిగింది. అందుకే సరిగ్గా అదే ఫార్మాట్ లో ‘సాహో’ రాశాడు. ‘సాహో’ లో కూడా చివరి ఇరవై నిమిషాల వరకూ ఏం జరుగుతుందో తెలీదు. ఇక్కడ స్టార్ హీరో కాబట్టి గూగుల్ జోక్స్ తో వర్క్ అవదు కాబట్టి, యాక్షన్ సీన్స్ తో టైమ్ పాస్ చేశాడు.
        

             ఇంటర్వల్లో హీరోనే దొంగ అని ఒక ట్విస్ట్ (‘రన్ రాజా రన్’ లో హీరో హీరోయిన్ ను కిడ్నాప్ చేసినట్టు). ఇక చివరి ఇరవై నిమిషాల్లో...ఇది నాన్న కోసం కొడుకు రివెంజ్ తీర్చుకునే కథ (రన్ రాజా రన్ లాగా). హీరో చేసే ప్రతీ పని వెనుక పెద్ద ప్లాన్ ఉంది (రన్ రాజా రన్ లాగా). హీరోయిన్ హీరో ను ప్రేమించినట్టు నటించింది బట్ చివరికి ప్రేమలో పడింది (రన్ రాజా రన్ లాగా).  ఇకపోతే  పోలీసే ఒక క్రిమినల్ (రన్ రాజా రన్ లో సంపత్ రాజ్ లాగా). ఇలా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చివరి నిమిషాల్లో రివీల్ అయ్యే ట్విస్టులు. ‘లార్గో వించ్’ లైన్ తీసుకుని, ‘రన్ రాజా రన్’ స్క్రిప్ట్ ను మళ్ళీ రాస్తే అయింది ‘సాహో’. Sujeeth got away for the first time but luck won't favour every time.

సి.ఎస్, టాలీవుడ్