రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, ఫిబ్రవరి 2019, సోమవారం

793 : రివ్యూ



రచన - దర్శకత్వం : ఆదిత్యా ధార్
తారాగణం
: విక్కీ కౌశల్, యామీ గౌతం, మోహిత్ రైనా, పరేష్ రావల్ తదితరులు
సంగీతం : శాశ్వత్ సచ్ దేవ్, ఛాయాగ్రహణం : మితేష్ మీర్చందానీ
కూర్పు : శివకుమార్, పణిక్కర్, కళ : నీనద్ జెరో, యాక్షన్ : స్టీఫాన్ రిచర్
బ్యానర్ :  ఆర్ ఎస్ విపి మూవీస్
నిర్మాత :  రోనీ స్క్రూ వాలా
***
          ర్జికల్ స్ట్రయిక్ మీద తొలి సినిమా ‘యూరీ - ది సర్జికల్ స్ట్రయిక్’ కి మైలేజీ పెరిగింది. పుల్వామా దాడితో తిరిగి వసూళ్లు పుంజుకుని హౌస్ ఫూల్స్ తో నడుస్తోంది. తెలుగు డబ్బింగ్ కూడా చేసి వుంటే ఇంకా బావుండేది. అయితే ఈ మూవీ జరిగింది జరిగినట్టు చూపించడం వరకే చేసిందా, సర్జికల్ స్ట్రయిక్ జరిపినప్పటికీ మార్పు లేని పరిస్థితిని ఎత్తి చూపిందా, పరిస్థితిలో మార్పు లేకపోతే  ఇంకేం చేయాలో సూచించిందా అన్న ప్రశ్నలు పక్కన బెట్టి – ఒక సినిమాగా ఇది ఎంతవరకూ కాన్సెప్ట్ కి న్యాయం చేయగల్గిందో చూద్దాం. చెప్పినంత జోష్ నిజంగా వుందా, లేక హోష్ లేని జోష్ తో మైమరిపించారా ఒకసారి పరిశీలిద్దాం...

కథ 
     మణిపూర్ లో నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ - కె (ఎన్ ఎస్ సి ఎన్ - కె) తీవ్రవాదులు భారత సైన్యం కాన్వాయ్ మీద దాడి జరిపి సైనికుల్ని చంపేస్తారు. దీంతో పారా ఎస్ ఎఫ్ మేజర్ విహాన్ (విక్కీ కౌశల్) తన దళంతో పక్క దేశం మయన్మార్ లోకి జొరబడి, ఎన్ ఎస్ సి ఎన్ - కె తీవ్రవాదుల్ని నాయకుడితో సహా చంపేసి వస్తాడు. ఇక రిటైర్మెంటు తీసుకుని ఢిల్లీలో అల్జైమర్స్ తో బాధపడుతున్న తల్లి (స్వరూప్ సంపత్) దగ్గర వుండాలని కోరుకుంటాడు. ప్రధాని (రజిత్ కపూర్) ఇలా కాదని, దేశానికి నీ సేవలు అవసరమని, ఢిల్లీలోనే రక్షణ శాఖ ప్రధాన కార్యాలయానికి ట్రాన్స్ ఫర్ చేయిస్తాడు. ఆక్కడ ఆఫీసు పని చూసుకుంటూ తల్లితో వుంటాడు. నర్సుగా జాస్మిన్ అల్మీడా (యామీ గౌతమ్) వస్తుంది. విహాన్ కి  సోదరి, మేనకోడలు, సైన్యంలోనే వున్న బావ వుంటారు. 

          ఇలా వుండగా, కాశ్మీర్లోని యూరీ లో, బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ మీద టెర్రరిస్టులు దాడి జరిపి నిద్రలో వున్న19 మంది సైనికుల్ని చంపేస్తారు. ఈ దాడిలో విహాన్ బావ కూడా చనిపోతాడు. దీంతో పాక్ కి బుద్ధిచెప్పాలని రక్షణ శాఖ నిర్ణయించుకుంటుంది. ప్రధాని (రజిత్ కపూర్),  హోంమంత్రి (నవతేజ్
హుండాల్), రక్షణ మంత్రి  రవీంద్ర అగ్నిహోత్రి (యోగేష్ సోమన్),, ఆర్మీ చీఫ్ జనరల్ అర్జున్ సింగ్ రజావత్ (శిశిర్ శర్మ), జాతీయ భద్రతా సలహాదారు గోవింద్ భరద్వాజ్ (పరేష్ రావల్) లు సమావేశమై పాక్ మీద సర్జిల్ స్ట్రయిక్ జరపాలని నిర్ణయం తీసుకుంటారు. దీని బాధ్యత మేజర్ విహాన్ కి అప్పగిస్తారు. టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన సైనికులు ఎక్కువ మంది బీహార్, డోగ్రా రెజిమెంట్లకి చెందిన వారు. ఈ రెజిమెంట్ల నుంచే దళాన్ని ఎంపిక చేసుకున్న మేజర్ విహాన్, సరిహద్దుదాటి పాక్ టెర్రరిస్టుల స్థావరాలని ఎలా తుదముట్టించి వచ్చాడన్నది  మిగతా కథ.

ఎలా వుంది కథ
     సెప్టెంబర్ 29, 2016 న భారత ప్రభుత్వం యూరీకి ప్రతీకారంగా పాక్ మీద చర్య తీసుకునే వరకూ, సర్జికల్  స్ట్రయిక్ అన్న పదం ఎవరికీ తెలీదు. అలాటివి జరుగుతాయని కూడా తెలీదు. 2008 -11 మధ్య మూడు సార్లు సర్జికల్ స్ట్రయిక్స్ జరిగినప్పుడు ఆర్మీ కోరికమీద అప్పటి ప్రభుత్వం బయట పెట్టలేదు. ఈ       సారి ప్రభుత్వం బయట పెట్టి ప్రచారం చేసుకోవడంతో, సర్జికల్ స్ట్రయిక్ అనే ఆర్మీ వ్యూహ మొకటుందని అందరికీ తెలిసిపోయింది. దీంతో ఈ సినిమా తీయడానికి అవకాశమేర్పడింది. ఇంతవరకూ బాలీవుడ్ కూడా వూహించి వుండదు, యుద్ధ కథల్లో ఇలాటి కథ కూడా ఒకటుంటుందని. 

          దీన్ని ఫార్ములాకి దూరంగా రియలిస్టిక్ గా తీశారు. అయితే వాస్తవంగా జరిగిందానికి కల్పనని జోడించారు. సినిమాటిక్ గా ఈ కల్పనని జోడిస్తున్నప్పుడు అసంపూర్ణ కథనం చేశారు. దీంతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యాక, “how’s the josh?” అని మేజర్ అడిగినప్పుడు “high sir!” అని దళం బదులిస్తే, మనకి అంత జోష్ ఏమీ అన్పించదు. జోష్ నిచ్చే  ముఖ్యమైన పాత్ర ఒకటి మిస్ కావడం వల్ల. ఐతే ఈ కథలో జోష్ ని నింపడానికి దేశభక్తి నినాదాల జోలికి పోలేదు.

ఎవరెలా చేశారు 
      ‘మన్మర్జియా’ క్రేజీ బాయ్ ఫ్రెండ్ విక్కీ కౌశల్ మేజర్ విహాన్ పాత్రలో పకడ్బందీగా నటించాడు. కుటుంబ జీవితం, వృత్తి జీవితం - ఈ రెండు పార్శ్వాలకి భావస్పోరక నటనలతో వేరియేషన్స్ చూపాడు. పూర్తి కాన్ఫిడెన్స్ తో కొత్త దర్శకుడు దృశ్యాల్ని చిత్రీకరించే తీరు, వాటికి తోడ్పడ్డ విజువల్, సౌండ్, యాక్షన్  ఎఫెక్ట్స్, మేకప్, కాస్ట్యూమ్స్, కళా దర్శకత్వం  వగైరా హంగులన్నీ విక్కీ కౌశల్ పాత్ర ప్రెజెంటేషన్ని ఉన్నతంగా చేశాయి. పాత్ర ప్రెజెంటేషన్ ప్రేక్షకుల్ని ఆలోచనాత్మక మూడ్ లోకి నెట్టేసిందంటే ఆ పాత్రచిత్రణ విజయం సాధించినట్టే. కాకపోతే ఈ పాత్రకి ప్రతినాయక పాత్ర లేదు, సినిమాటిక్ గా ఇదే పెద్ద లోపం.        

          ఇతర పాత్రల్లో యామీ గౌతమ్, పరేష్ రావల్ ల పాత్రలకి ఎక్కువ ఫుటేజీ ఇచ్చారు. యామీ గౌతమ్ నర్సు రూపంలో వున్న ఇంటలిజెన్స్ ఏజెంట్ పల్లవీ శర్మగా, ఆ తర్వాత సర్జికల్ ఆపరేషన్ కో ఆర్డినేటర్ గా కన్పిస్తుంది.  జాతీయ భద్రాతా సలహాదారు గోవింద్ భరద్వాజ్ గా పరేష్ రావల్, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కి నమూనా పాత్ర. సెల్ ఫోన్లు విరగ్గొట్టే తిక్క వుంటుంది. 

          ప్రధాని మోడీ గెటప్ లో,
హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ గెటప్ లో, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పరికర్ గెటప్ లో నటులు ఫర్వాలేదు గానీ, అటు వైపు పాక్ యంత్రాంగాన్ని కామెడీగా చూపించారు. ఐఎస్సై చీఫ్ నైతే మరీ జోకర్ లా చూపించారు. విలన్స్ ని తక్కువ చేసి చూపిస్తే సినిమాలో హీరోయిజానికి జోష్ ఏముంటుంది. వాళ్ళెంత కర్కశులో చూపిస్తేనే ప్రేక్షకులకైనా కచ్చి రేగుతుంది. సోషల్ మీడియాలో వాళ్ళని ఎంతైనా ఆడుకుని తృప్తి పడొచ్చు, సినిమాలో పచ్చిగా చూపించకపోతే కచ్చి లేదు. 

          45 కోట్ల బడ్జెట్ కి మేకింగ్ పరంగా అద్భుతమనే చెప్పొచ్చు. కెమెరా వర్క్, యాక్షన్ సీన్స్, ఎడిటింగ్, డైలాగ్ ఎడిటింగ్ వగైరా సాంకేతికాలు ఉన్నతస్థాయిలో వున్నాయి. లొకేషన్స్, భవనాలు, వాహనాలు, ఆయుధాలు కథకి తగ్గ సహజత్వంతో వున్నాయి. యాక్షన్ సీన్స్ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతంగా వున్నాయి. లొకేషన్స్ ని సెర్బియాలో చీట్ చేశారు. టెక్నికల్ గా వండర్ గా వున్న ఈ వార్ మూవీ, కళా పరంగా అంత బలంగా లేదు.  

చివరికేమిటి 
     ఫస్టాఫ్ ఎన్ ఎస్ సి ఎన్ - కె తీవ్రవాదుల దాడి, మయన్మార్ లో మేజర్ విహాన్ ప్రతి దాడులతో ప్రారంభమవుతుంది. ఇది 2015 లో జరిగిన నిజ సంఘటనే. సర్జికల్ స్ట్రయికే. కానీ అప్పట్లో దీన్ని వెలుగులోకి తేలేదు ప్రభుత్వం. అయితే  2016 లో పాక్ మీద సర్జికల్ దాడికి ప్రభుత్వానికి ఇదే స్ఫూర్తి నిచ్చింది వాస్తవానికి. కానీ సినిమాలో ఇంకేవేవో ఆప్షన్స్ మాట్లాడుకుంటారు ప్రభుత్వ పెద్దలు. చివరికి సర్జికల్ దాడినే నిర్ణయిస్తారు. అనవసర డ్రామా. ఈ నిర్ణయించినప్పుడు, పాక్ కి తెలియకుండా రహస్యంగా జరపాలనుకుంటారు. దాడి తర్వాత పాక్ కూడా చెప్పుకోలేని పరిస్థితి వుంటుందనీ, చెప్పుకుంటే తాము టెర్రరిస్టుల్ని పోషిస్తున్నట్టు చెప్పుకోవడమే అవుతుందనీ సంతృప్తి పడతారు. కానీ అటు పాక్ లో క్షేత్ర స్థాయి పరిస్థితిని గమనంలోకి తీసుకోవాలనుకోరు. 

           వాస్తవంలోనైతే  ప్రభుత్వం ఈ దాడికి అనుమతించే ముందు యూరీ ఘటన నేపధ్యంలో సరిహద్దులో పాక్ ఎంత అప్రమత్తంగా వుంటుంది, టెర్రరిస్టు క్యాంపులు లేకుండా ఎంత జాగ్రత్తపడుతుందీ వగైరా అంశాల్ని పరిగణనలోకి తీసుకుంది. అప్పుడే జాగ్రత్తగా ప్లాను చేసి మెరుపు దాడి జరిపింది. సినిమాలో ఆషామాషీగా వుంది. శాటిలైట్ ఛాయాచిత్రాలతో లాంచింగ్ ప్యాడ్స్ (టెర్రరిస్టుల క్యాంపులు) ఉనికినీ, నాల్గు డ్రోన్స్ తో అక్కడి దృశ్యాలనీ సేకరించి ప్లానింగ్ చేసేస్తారు. బలాబలాల సమీకరణ లేదు. అవతలి బలమెంతో ప్రేక్షకులకి చూపించాలనుకోరు. ఏకపక్ష ఆపరేషన్ తో ఏం మజా వస్తుంది. 

          అవతలి పక్షం ఒక సీను చూపిస్తారు  - ఐఎస్సై, మిలిటరీ,  ప్రధాని - ఇండియాని తేలికగా తీసుకుంటారు. వాళ్ళేం చేస్తారు, నాల్రోజులు క్రికెట్ ని, ఫిలిం స్టార్స్ ని బ్యాన్ చేసి ఆ తర్వాత మర్చిపోతారని నవ్వుకుంటారు. నిజమా? అవతల మైండ్ సెట్స్ ఏమిటో రీసెర్చి చేశారా? లేక ఇలా మన మైండ్ సెట్ ని బయట పెట్టుకున్నారా? సెన్సార్ లో వుండాల్సిన సీను కాదిది. చాలా యుద్ధ, టెర్రర్ సినిమాల్లో ఇదే పరిస్థితి - సొంత బలహీనతలనే బయటపెట్టుకోవడం. 

          సర్జికల్ దాడి గురించి వార్తల్లో వచ్చింది వచ్చినట్టు చూపిస్తే సినిమా ఎలా అవుతుంది. అవతలి పక్షాన్ని కామెడీ చేసి ఏకపక్ష - వన్ వే కథనం చేస్తే డాక్యుమెంటరీయే అవుతుంది. యూరీ ఘటనకి తన మీద సర్జికల్ దాడి జరిపించుకున్న పాక్ నిజంగా ఏమీ చేస్తూ కూర్చోలేదా? అవతల వాళ్ళేం చేస్తూ కూడా విఫలమయ్యారో రీసెర్చి చేసి వుంటే, ఈ కథ ఓ కథగా బలాన్ని సంతరించుకునేది. 

          బిన్ లాడెన్ ని చంపిన కథతో తీసిన ‘జీరో డార్క్ థర్టీ’ - మీడియా కూడా చేయని రీసెర్చి చేసి ఆ రాత్రి బిన్ లాడెన్ వైపు కూడా ఏం జరుగుతోందో చూపించారు. పైగా మీడియాకి  తెలీని సీఐఎ గూఢచారిణి కూడా కీలక పాత్ర పోషించిందని రీసెర్చి లో తెలుసుకుని, ఆ పాత్రని కూడా  సృష్టించారు. కథగా రక్తి కట్టించడానికి ఏం తగ్గిందో తెల్సుకుని దాన్ని పొందు పర్చాల్సిందే. ఈ సినిమాలో అవతలి పక్షపు ఈ విలనీయే  మొత్తం తగ్గిపోయింది.

    పాకిస్తాన్ వాళ్ళేదో కనుక్కుని అడ్డుకున్నట్టు ఒక సీను చూపిస్తారు. నిజానికి ఇటు వైపు ఇండియన్ దళం హెలికాప్టర్స్ లో వెళ్లి దాడి చేయడానికి సిద్ధమవుతూ వుంటారు. దాని కనుగుణంగా హెలీకాప్టర్స్ కి పాక్ రంగులు వేసేస్తారు. ఈ ఛాయా చిత్రాలు పాక్ మిలిటరీకి అంది అప్రమత్తమై పోతారు. దీంతో ఇండియన్ ప్లాను కుప్పకూల్తుంది. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే లో ప్లాట్ పాయింట్ టూ కి ఒక విషమ ఘట్టం అవసరమే. కానీ ఇది కాన్సెప్ట్ నే దెబ్బతీసింది. 

          వాస్తవంలో ఇండియా కాప్టర్ స్ట్రయిక్ ని ప్లాన్ చేయలేదు. వాస్తవాధీన రేఖ దగ్గర దళాల్ని ఏర్ డ్రాప్ చేసి  కాలి నడకన పంపించడాన్నే ప్లాన్ చేసి, తుచ తప్పకుండా అమలు చేశారు. హెలీకాప్టర్స్ తో క్రాస్ చేస్తే దొరికిపోయి యుద్ధానికే దారి తీస్తుంది. గుట్టు రట్టు కానివ్వలేదు. కాలినడకన జొరబడి నైట్ విజన్ రెయిడ్ నే ప్లాన్ చేసి షాకిచ్చారు. వాళ్లకి తెలిసేలోగా చంపి వచ్చేశారు. వాళ్ళు తెల్లారి తెలుసుకుని లబోదిబో మన్నారు. సర్జికల్ స్ట్రయిక్ అంటే, దొడ్డి దారిన ఇంట్లోకి వెళ్లి, నిద్రపోతున్న వాణ్ని లేపి, లెంపకాయ కొట్టి పారిపోయి రావడమే. ఇంట్లో వున్న వాడికి ఎవరు కొట్టారో, ఎందుకు కొట్టారో అర్ధంగాక పోవడమే. 

          సినిమాలో అల్లరి చేసుకుంటూ వెళ్తారు. టెర్రరిస్టుల క్యాంపుల్లోకి వెళ్తున్నప్పుడు కూడా గట్టిగా బూట్ల చప్పుడుతో పరిగెడుతూ, చప్పుడయ్యేలా గేట్లూ తలుపులూ తీసుకుంటూ, సామాన్లు పడేసుకుంటూ వెళ్తారు.  టెర్రరిస్టులు నిద్ర లేవరా? ఈ కాన్సెప్ట్ ఉద్దేశమే సైలెంట్ ఆపరేషన్ కదా? బయల్దేరుతున్నప్పుడు మేజర్ విహానే అంటాడు -  మనం stealthy గా (దొంగ చాటుగా) silent గా వెళ్ళాలని. ఇది ముందుగా  కాప్టర్ దాడి ప్లాన్ చేసినప్పుడు అంటాడు. కాప్టర్ తో stealthy గా, silent గా ఎలా వెళ్తారు. ఆ ప్లాన్ ఫెయిలయ్యింది. ఇప్పుడైనా కాలి నడకన అలా వెళ్ళాలిగా?

          చాలా పాత జేమ్స్ కోబర్న్ నటించిన ‘స్కై రైడర్స్’  (1976) వుంది. ఏథెన్స్ లో ఒక టెర్రర్ గ్రూపు కొండ మీద గృహంలో బందీలుగా పట్టుకున్న ఒకావిణ్ణి, ఆవిడ పిల్లల్నీ విడిపించడానికి జేమ్స్ కోబర్న్ తన దళంతో చేసే సైలెంట్ ఆపరేషన్ ఇది. ఆ గృహంలోకి వెళ్లేందుకు ఆలోచిస్తున్నప్పుడు, ఆకాశంలో ఎగురుతున్న డేగల్ని చూసి ఐడియా వస్తుంది. ఇక అలా డేగల్లా ఎగిరే హేంగ్ గ్లయిడర్స్  తయారు చేసుకుని, సైలెంట్ గా ఎగురుతూ వెళ్లి ఆ కొండ మీద గృహం మీద వాలతారు. అక్కడ్నించీ ఏమాత్రం చడీ చప్పుడు చెయ్యని అత్యంత సునిశిత సైలెంట్ ఆపరేషనే. ఎక్కడ ఏ శబ్దమవుతుందోనని గుండెలుగ్గ బట్టుకుని చూడాల్సిన ఆందోళనకర డ్రామా...

          రాజశేఖర్ మలయాళ రీమేక్ ‘మగాడు’ (1990) లో కిడ్నాప్ డ్రామా కూడా ఇలాంటిదే. నీటుగా సాగే టెక్నికల్ ఆపరేషన్. సూపర్ హిట్టయింది. 

          ‘యూరీ’ లో నీ ఇంట్లో జొరబడి నిన్ను చంపి వస్తామంటూ అల్లరి చేసుకుంటూ వెళ్తే ఎలా. పైగా చంపాకా, అప్పుడు అక్కడి సీసీ కెమెరాల్ని బ్లాస్ట్ చేస్తారు. దానివల్ల ఏం లాభం. అప్పటికే తమ ముఖాలు రికార్డయి పోయి వుంటాయిగా. అది సాక్ష్య మిచ్చేసినట్టేగా. ఆ వీడియోలు పట్టుకుని పాక్ నానా గొడవ చేస్తే? సర్జికల్ ఆపరేషన్ కాన్సెప్ట్ కీ, చూపిస్తున్నదానికీ పొంతనే  లేదు. 

          హెలికాప్టర్స్ కి రంగులేసి వెళ్ళాలనుకునే ప్లానే తప్పయితే, పాక్ కి తెలిసిపోయినట్టు ప్లాట్ పాయింట్ టూ ట్విస్ట్ ఇవ్వడం ఇంకా తప్పు. పాక్ కి తెలిసిపోయాక ఇంకా సర్జికల్ స్ట్రయిక్ ఏమిటి. అలాగే ముందుకెళ్తే ఇక ఎస్కలేషనే. యుద్ధమే. కానీ అలాగే వెళ్తారు. ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ ఆపెయ్యమంటే, మేజర్ విహాన్ కాలినడకనే సరిహద్దు దాటి పూర్తి చేసి వస్తామంటాడు. ఇలా హీరోయిజాన్ని పెంచామనుకున్నారు. వాస్తవంలో కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ చేసింది కాలినడకన రహస్యంగా దాటాలనే. ప్రభుత్వం ఎప్పుడూ కరెక్టే. సినిమాలే ఇలా వుంటున్నాయి. ముక్కు ఎక్కడుందంటే చుట్టూ తిప్పి చూపించినట్టు మళ్ళీ అక్కడికే వచ్చింది కథ. అయితే ఇప్పుడు పాక్ కి తెలిసిపోయిన నేపధ్యంలో తెగించి కాలి నడకన వెళ్తున్నారు. పాక్ అప్రమత్తమైనట్టు చూపించి ఎలా వెళ్తారు. రంగులేసిన హెలీకాప్టర్స్ ఫోటోలు చూసి పాకీయులు అప్రమత్తమైన ఆ ఒక్క సీను చూపించి  వదిలేశారు. తర్వాత వాళ్ళు ఎక్కడికి పోయారో ఏమో, ఇటు కాలినడకన దూరిపోయారు! 

      మూడు స్థావరాల మీద ఏక పక్ష యాక్షన్ తో పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తారు. చివరికి దొరుకుతాడు యూరీ దాడిని ప్లాన్ చేసిన ఇద్రిస్ ఖాన్ ( అబ్రార్ జహూర్). ఇతన్నీ చంపి కక్ష తీర్చుకుంటాడు. ఇక్కడే అసలు పాయింటు వుంది. ఈ పాయింటు ఇంత సేపూ మరుగున పడి కథలో జోష్ ని చంపేసింది. యూరీ దాడికి టెర్రరిస్టు నాయకుండు ఇద్రిస్ ఖాన్ కారకుడైనప్పుడు,  యూరీ దాడికి ముందే అతణ్ణి విలన్ గా ఎస్టాబ్లిష్ చేసి ప్రేక్షకులకి కచ్చి పుట్టించాలి. ఇరవై మంది సైనికుల్ని చంపిన వాణ్ని అప్పుడే చూపించి ప్రేక్షకులతో హాహాకారాలు రేపకుండా, దాచివుంచి, ఎండ్ సస్పెన్స్ కథనం చేసి, చివరికి పట్టుకుని వీడే ఇద్రిస్ అంటే, అప్పటికి భావావేశాలేముంటాయి ప్రేక్షకులకి. 

          రెండోది యూరీ దాడిలో విహాన్ బావ కూడా చనిపోతాడు. దీంతోనే విహాన్ ఈ ఆపరేషన్ చేపట్టాడన్న అర్ధంలో చూపించారు. బావ చనిపోకపోతే చేపట్టే వాడు కాదా? వ్యక్తిగత నష్టం జరిగితేనే సైనికుడు దేశం కోసం పోరాడతాడా? మాఫియా కథలూ సైన్యం కథలూ ఒకటేనా? ఇంతకీ ఇద్రిస్ ని చంపింది  బావ చావుకి ప్రతీకారంగానా,  అమరులైన తోటి సైనికుల ఆత్మ శాంతికా? వ్యక్తిగతమా, దేశ హితమా?

          ఇలా తనకు తానే చిక్కుముళ్ళేసుకున్నాడు దర్శకుడు. ఇక క్లయిమాక్స్ లో పాక్ పోలీసులకి తెలిసిపోయి వెంటపడతారు. పాక్ సైన్యం కూడా హెలీకాప్టర్ తో ఛేజ్. దీన్ని అడ్డుకోవడానికి నియంత్రణ రేఖ దాటి వచ్చేసి ఫైరింగ్ జరుపుతుంది ఇండియన్ కాప్టర్! అంతా గందరగోళపు గజిబిజి కథనం. మరి ఇండియన్ కాప్టర్ పాక్ కాప్టర్ ని కూల్చెయ్యను కూడా కూల్చెయ్యదు. వెనక్కి వచ్చేస్తుంది. అంత ఫైరింగ్ లోనూ చిన్న దెబ్బ తగలకుండా వచ్చేస్తారు విహాన్ దళం. ఇంత రచ్చ అయినా కిమ్మనకుండా వుంటుంది పాక్. సర్జికల్ స్ట్రయిక్ అంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ తో మెరుపు దాడి చేసి రావడమా, రచ్చ చేసుకోవడమా? యుద్ధ వ్యూహనికే వ్యతిరేకమైన యాక్షన్ సీన్లతో నమ్మిస్తే సరిపోతుందా? మూడొందల కోట్లు వసూలు చేసిందంటే, సైన్యం గురించి ఏం చూపించి వసూలు చేశారో తెలుసుకోవడానికే ఈ రివ్యూ. 

          బిన్ లాడెన్ ని చంపుతున్నప్పుడు, కమాండో రాబర్ట్ ఓ నీల్ హెల్మెట్ కెమెరా ద్వారా ప్రసారమవుతున్న విజువల్స్ ని, వైట్ హౌస్ సిట్యుయేషన్ రూంలో కూర్చుని, ప్రెసిడెంట్ ఒబామా ప్రభృతులు ప్రత్యక్షంగా చూశారు. సర్జికల్ ఆపరేషన్ ని కూడా కమాండోల హెల్మెట్ కెమెరాల ద్వారా, డ్రోన్ ద్వారా, అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పరికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ లు ప్రత్యక్షంగా చూశారు. 

          సినిమాలో హోం మంత్రి, రక్షణ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారూ ఎవరింట్లో వాళ్ళు కూర్చుని, ఉద్రిక్తంగా చేతులు నలుపుకుంటూ గడుపుతూంటారు. 

          ఇలా 
హోష్ లేని జోష్ సోషల్ మీడియా జనరేషన్ కి జబర్దస్త్  జోషేమో !!

సికిందర్
Watched at PVR, Errum manzil
6.30 pm, Feb 24, 2019
  telugurajyam.com