రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, జనవరి 2014, ఆదివారం

బాక్సాఫీసు వాస్తవాలు వేరు!


రివ్యూ
1 – నేనొక్కడినే !







తారాగణం : మహేష్ బాబు, కృతీ సానన్, గౌతమ్, పోసాని కృష్ణ మురళి, సాయాజీ షిండే, శ్రీనివాసరెడ్డి, సూర్య, నాసర్, ప్రదీప్ రావత్, , కెల్లీ దోర్జీ తదితరులు
కథ : చక్కా హరిప్రసాద్, స్క్రీన్ ప్లే : అర్జున్ వై కే, తోట శ్రీను
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, గీతాలు : చంద్ర బోస్
ఛాయాగ్రహణం : ఆర్ రత్నవేలు, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ : రాజీవన్, నృత్యాలు : ప్రేమ్ రక్షిత్ , యాక్షన్ : పీటర్ హెయిన్స్
బ్యానర్ : 14  రీల్స్ ఎంటర్ టైన్మెంట్ – ఇరోస్ ఇంటర్నేషనల్
నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర
సెన్సార్ : u/a
విడుదల : జనవరి 10, 2014

సంక్రాంతి సినిమాలంటే ప్రేక్షకులకి పండగ ఆనందాన్ని మించిన ఆనందం. పండగపూట కడుపునిండా వినోదాన్ని ఆరగించాలని ఉవ్వీళ్ళూరుతారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తారు. ఎదురుచూసిన అభిమాన స్టార్ సినిమా అట్టహాసంగా విడుదలవగానే థియేటర్ల కి పరుగులు పెడతారు. అంతవరకే వాళ్ళ చేతుల్లో వుండేది. ఆతర్వాత
నొసట రాత అంతా ఆ సినిమా దర్శకుడు, స్టార్ లతో బాటూ నిర్మాతల చేతుల్లో వుంటుంది. వాళ్ళు ప్రాప్తకాలజ్ఞు లయ్యరా, ప్రేక్షకులు చిరుదరహాసాలతో బయటపడతారు, వాళ్ళు ప్రేక్షకాభిరుచులమీద ప్రయోగాలు చేశారా- పండగ మూడ్ చెడగొట్టుకుని చెల్లాచెదురై పో తారు. ప్రిన్స్ మహేష్ బాబు 1- నేనొక్కడినేతో ఈ రెండోదే జరుగుతుందని  సాక్షాత్తూ ఆయన ఫ్యాన్స్ కూడా ఊహించివుండరు. సరిగ్గా 2011 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  కూడా ఇలాటి ఆందోళనకర పరిస్థితుల్నే సృష్టించాడు. కాకపోతే ఆ సినిమా పంజాసంక్రాంతికి ఓ నెల ముందే  విడుదలై ప్రేక్షకుల్ని రక్షించింది!

 ‘పంజాలాంటి అపజయాన్ని చూసికూడా ఆ దారిలోనే  నేనొక్కడినేఅనే మరో డార్క్ మూవీ తీయడం సాహసమే. అదీ దూకుడులాంటి పూర్తి వినోదాద్మక సూపర్ హిట్ తీసిన నిర్మాతలు- అలాంటి వినోదానికి దూరంగా సీరియస్ సినిమాతో ముందుకురావడం మింగుడు పడని వ్యవహారమే. వరస హిట్ల మీదున్న మహేష్ బాబు ఇలా తెలుగు సినిమాతో, తెలుగు సినిమా పాత్రతో ప్రయోగం చేయాలనుకోవడం, అందుకు దర్శకుడు సుకుమార్ ని ప్రోత్సహించడం అలావుంచితే, స్టార్ సినిమాకి సకుటుంబ సమేత ప్రేక్షక సమూహాలుంటాయి- అలాంటిది ఇన్నాళ్ళూ పక్కా ప్రేమసినిమాలుతో కుటుంబ ప్రేక్షకుల్ని కూడా అలరిస్తూ వచ్చిన సుకుమార్, ఆ  కుటుంబ ప్రేక్షకులే ఎలా చూస్తారనుకుని  ఏకంగా బిగ్ స్టార్ మహేష్ తో యాక్షన్ జెనర్ లో ఈ ప్రయోగం చేశాడన్నది పెద్ద క్వశ్చన్ మార్కే! ...పోతే ఈ డెబ్బై కోట్ల మెగా బడ్జెట్ మూవీలో అసలేముందో ఇప్పుడు చూద్దాం...

ఏది నిజం? ఏది అబద్ధం ?
పరిస్థితుల ప్రభావంతో మార్పు చెందేది ఎప్పుడూ అసలైన సత్యం కాదని వేదాల్లో చెబుతారు. గౌతమ్ (మహేష్ బాబు) అనే రాక్ స్టార్ తన గురించిన సత్యం తెలుసుకోవడానికి గతంలోకి ప్రయాణిస్తాడు. అప్పటికే ఆ గతంతో సంబంధమున్న ఇద్దర్ని విదేశాల్లో చంపేశాడు. హైదరాబాద్ లో ఓ  రాక్  షో ఇస్తున్నప్పుడు మూడో వాడు తనని చంపడానికి వస్తే  వాణ్ని చంపేసి అరెస్టవుతాడు. ఆ హత్యా దృశ్యాల్ని సమీరా (కృతీ సానన్) అనే టీవీ జర్నలిస్టు చిత్రీకరిస్తుంది. తీరా  ఆ వీడియోలో చూస్తే, అక్కడ లేని  శత్రువుని ఊహించుకుంటూ గాలిలో  విన్యాసాలు చేశాడు తప్పితే చంపలేదని తెలుస్తుంది. సైకియాట్రిస్టు (సూర్య)కి చూపిస్తారు. ఆ సైకియాట్రిస్టు ఇతను  చిత్తభ్రాంతులకి లోనయ్యే మనోవ్యాధితో బాధపడుతున్నాడని తేలుస్తాడు. గౌతమ్ తను చూసిందీ చంపిందీ అబద్ధం కాదనీ, అది పూర్తిగా నిజమనీ వాదిస్తాడు. చిన్నప్పుడు తన తల్లిదండ్రుల్ని హతమార్చిన వాళ్ళే తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారని అంటాడు. కానీ నిజానికి  తను విదేశాల్లో కూడా ఎవర్నీ చంపలేదన్న విషయం అతడికి తెలీదు.

ఇలా వుండగా అతడి మీద మళ్ళీ హత్యా ప్రయత్నాలు జరుగుతూంటాయి. పోలీసు అధికారి (సాయాజీ షిండే) వచ్చి చూస్తే, ఘటనా స్థలం అలావుండదు. అంతా గౌతమ్ స్వైరకల్పనలేనని హేళన చేస్తాడు. దీంతో గౌతమ్ అసలు తానెవరో తెలుసుకోవాలన్న పట్టుదలతో గోవా వెళ్తాడు. సమీరా అనుసరించి వస్తుంది. అక్కడామెకి అతడిమీద ప్రేమలాంటిది పుడుతుంది. అతడి మానసిక స్థితితో ఆ ప్రేమకి సరిపడదు. ఇక్కడా అవే చిత్తభ్రాంతులు. ఇక్కడ కూడా దాడులు జరుగుతాయి. ఈ దాడులు సమీర మీదే జరుగుతున్నాయని పసిగడతాడు. అది నిజమే అయినా తనమీద ఎందుకు దాడులు జరుగుతున్నాయో ఆమె దాస్తుంది. 

ఇక ఇక్కడ దాడులు చేస్తున్న శత్రువు (కెల్లీ దోర్జీ) ని చంపేసి లండన్ బయల్దేరతాడు గౌతమ్...లండన్ లో అతను తెలుసుకున్న రహస్యాలేమిటి, అక్కడింకా ఎవరు శత్రువులున్నారు, అసలు తన తల్లిదండ్రుల్ని ఎందుకు చంపారు, ఆ గుట్టు ఏమిటి, తన తల్లి దండ్రులు అసలెలా వుంటారు- అదెలా తెలుస్తుంది- వగైరా ప్రశ్నల పరంపరకి  ఈ ద్వితీయార్ధంలో సమాధానాలు దొరుకుతాయి.  

ప్యాకేజీ- పాత్రలూ పరిమితం 
చాలాతక్కువ పాత్రలతో, అతితక్కువ వినోదాత్మక విలువలతో రొటీన్ కి భిన్నమైన కథా కథనాలతో చేసిన ఈ ప్రయోగంలో నటనవరకూ మహేష్ బాబు ఓకే, కానీ నటనే సినిమాని నిలబెట్టదు. కాసేపైనా తననుంచి ప్రేక్షకులాశించే అల్లరిచేయకుండా, నవ్వించకుండా , ఆద్యంతం సీరియస్ గా కన్పిస్తూ, హీరోయిన్ తో ప్రేమ సన్నివేశాల్లో సైతం రొమాంటిక్ మూడ్ ని ప్రదర్శించక- తన జీవితం, తన సమస్యే తప్ప ప్రేక్షకులు పట్టని  ఆత్మాశ్రయ ధోరణిలో సాగే ఈ  పాత్ర ఆశించిన ఫలితాల్నిచ్చిందా అంటే అదేమీ లేదు- అలాంటప్పుడు ఈ ప్రయోగం విఫలమైనట్టే.

మానసిక సమస్యని పక్కన బెడితే, పాత్రకి చిన్నపుడు జరిగిన అన్యాయానికి సంబంధించి సానుభూతిని పొందడానికి తగిన నేపధ్యం కూడా లేకపోవడం పాత్ర బాగా బోరు కొట్టడానికీ, సహన పరీక్ష పెట్టడానికీ కారణం. దీనికి మరమ్మత్తు చేయాలంటే, 'ధూమ్ -3 ' లో అమీర్ ఖాన్ పాత్రచిత్రణ చూడాలి. ఇది తర్వాత చూద్దాం. సీరియస్ నటన తర్వాత, మహేష్ బాబు మూడు పాటలకి డాన్సులేశాడు. అవేమీ ధియేటర్లో కేరింతలు పెట్టించలేదు. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఎందుకనో పేలవంగా వుంది. ఐటెం సాంగ్ తప్పనిసరిగా పెట్టుకునే అలవాటున్న సుకుమార్,   ఈసారి ఐటెం సాంగ్ ని కూడా నీరుగార్చేశాడు. నేపధ్య సంగీతం కూడా శోక రసంతో థీమ్  ట్రాకుగా రిపీటవడం  సినిమా నడకని పెను భారం గా మార్చేసింది. పాటల తర్వాత యాక్షన్ దృశ్యాల్లో మహేష్  ని వంక పెట్టడా నికేం లేదు. యాక్షన్ దర్శకుడు పీటర్ హెయిన్స్ సముద్రం మీదా, లండన్ లోనూ కంపోజ్ చేసిన పోరాట దృశ్యాలు హైలైట్. అలాగే 'రోబో' ఫేమ్ ఛాయాగ్రాహకుడు ఆర్ రత్నవేలు ఎంచుకున్న లైటింగ్ స్కీమ్ చివరంటా డార్క్ మూడ్ నే క్రియేట్ చేయడానికి  పనికొచ్చింది తప్ప,  ప్రేక్షకులకి మానసికంగా కాస్తైనా పంచరంగులతో  అలరించలేకపోయింది. ఈ తరహా చిత్రాకరణ చిన్నాచితకా నటులతో తీసే సైకలాజికల్ థ్రిల్లర్స్ కి నప్పుతుంది- బిగ్ స్టార్స్ కి కన్నులపండువగా వుండాలి- అవుట్ డోర్ లోకేషన్స్ ప్రకాశాన్ని కూడా డీ ఐ తో డీలా పడేట్టు చేశారు. 

హీరోయిన్ కృతీ సానన్ వృత్తి గతంగా మోడలూ కథక్ కళాకారిణీ అయినా,  వెండితెరమీద ఈ సినిమాతో అరంగేట్రం చేసి నటనలోనూ ది బెస్ట్ అన్పించుకుంది. పోసానీ కామెడీ పాత్ర చిన్నదే, విలన్లు నాసర్, ప్రదీప్ రావత్, కెల్లీ దోర్జీలవి అంత శక్తిమంతమైన విలన్ పాత్రలు మాత్రం  కావు. మహేష్ తనయుడు గౌతమ్ నటన ఎలాంటి బెరుకు లేకుండా మంచి ఈజ్ తో వుండడం విశేషం.

స్క్రీన్ ప్లే  సంగతులు 
ఈ సినిమాకి హరిప్రసాద్ కథ నందిస్తే, అర్జున్, తోట శ్రీనులు స్క్రీన్ ప్లే రాసినట్టు టైటిల్స్ లో వేశారు. సరిగ్గా ఇలాటిదే కథ -మానసిక సమస్యలేకుండా, తననెవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారన్న పీడకలలతో- ఒక అసోసియేట్ దర్శకుడు రాసుకుని ఈ సమీక్షకుణ్ణి కలిశాడు. దాన్ని సరిదిద్ది స్క్రీన్ ప్లే రాశాక, ఒక ప్రముఖ హీరోకి విన్పించాడు. ఆ ప్రముఖ హీరో ఇలాటి కథ తమిళంలో అయితే తీస్తారేమోగానీ, తెలుగులో వర్కౌట్ కాదని తేల్చేశారు. 2005  నాటి సంగతి ఇది. ఆ తర్వాత ఆ అసోసియేట్ ఓ తమిళ హీరోకి విన్పించాలని విఫలయత్నం చేశాడు. కొన్నేళ్ళ తర్వాత అందులో పీడకలల యాంగిల్ కూడా తీసేసి పూర్తి స్థాయి కమర్షియల్ యాక్షన్ గా మార్చేశాం. దాంతో మరో అగ్రనటుడి కటాక్షం కోసం ప్రయత్నిస్తున్నాడు ప్రస్తుతం ఆ అసోసియేట్.

ఇప్పుడు 'నేనొక్కడినే' కథేమిటో చూశాక  పైన పేర్కొన్న  ఆ ప్రముఖ నటుడు- ఇలాటి కథ తెలుగులో  వర్కౌట్ కాదని చెప్పడం ఎంత కరెక్టో అర్ధమౌతోంది ! ఆయనకి  ఇలాటి సైకలాజికల్ కథలతో   ఎలాటి 'చిత్తభ్రాంతులూ'  'అనుమానాలూ' లేవేమో-  

కొత్తదనం పేరుతో  ఇలా  బాక్సాఫీసు వ్యతిరేక సినిమాలు తీస్తూ పోతే, అసలే భారీ ఫ్లాపులు మూట గట్టుకుంటున్నఫీల్డు ఇంకా లోతుగా ఊబిలో కూరుకు పోకతప్పదు . కొత్తదనం పేరుతో  జరిగేదేమంటే, నేటివిటీ లేని క్రియేటివిటీని అంట గట్టడమే. స్టయిలిష్ నెస్ పేరుచెప్పుకుని హాలీవుడ్ కథా కథనాలతో తీస్తూపోతే, ప్రేక్షకులు హాలీవుడ్ సినిమాలనే చూడొచ్చు - తెలుగులో వాటి అనుకణలతో పనేముంది!

హాలీవుడ్ దర్శకుడు డాన్ లివింగ్ స్టన్ తన పుస్తకంలో ఒక చోట పేర్కొన్నట్టు- - As the camera rolls and the director watches the scene unfold, the director’s taste must serve as the representative of all the audiences who will ever  see the film – అనేది అదేదో మేధావితనం గా అన్పించుకోవడం కోసం కాదు- సింపుల్ గా సింపుల్ కామర్సే అది- అంతే! బాక్సాఫీసు కాసుల ఘోష...కమర్షియల్ సినిమాకి బాక్సాఫీసే లక్ష్యం కావాలి తప్ప- మేధావులుగా పేరు తెచ్చుకునే ఎలాటి యావా  కాదు. పై దర్శకుడే మరోచోట అన్నట్టు- ‘భావోద్వేగాల్ని ప్రభావితంజేసే  సృజనాత్మక ప్రక్రియే ఆర్టు...ఆ సృజనాత్మక ప్రక్రియకి ప్రేక్షకులు ఉద్వేగభరితులవు తారు, నవ్వుతారు, కన్నీళ్లు పెట్టుకుంటారు, బాగా ఎక్సైటై పోతారు..దర్శకుడనేవాడు తన అభిరుచుల్ని ప్రేక్షకులమీద రుద్దకుండా, ప్రేక్షకులకుండే  సవాలక్ష కోరికలకి తను ప్రతినిధిగా వున్నప్పుడు  చాలావరకూ విజయం సాధిస్తాడు....’

మన స్టైలిష్ మూవీ మేకింగ్ లో ఏం జరుగుతోందంటే, అలాటి ప్రాతినిధ్యమే మాయమై, పై కొటేషన్ లోని ...as the director watches the scene unfold..పదాలు గల్లంతయిపోయి-seen unfold –అవడాన్ని పట్టించుకోడు. దృష్టంతా ఆ scene చుట్టూ భౌతికపరమైన కెమెరా, లైటింగ్, ఆర్ట్  డైరెక్షన్ హంగుల పైనే వుంటుంది. ఇలా తీసి స్టైలిష్ గా తీశామని చెప్పుకుంటారు.

నేనొక్కడినే’ స్క్రీన్ ప్లే చెప్పుకోవడానికైతే సార్వజనీన మూడంకాల (3-act) స్క్రీన్ ప్లే నే అయినా, నిర్వహణ లో బాగా దెబ్బతింది. ప్రారంభించడమే ప్రధాన కథలో కెళ్ళి పోయి పాయింట్ ఎస్టాబ్లిష్ చేసేవరకూ సాగే మొదటి అంకం ముప్ఫై నిమిషాలే తీసుకోవడం అభినందించదగ్గదే. ఈ క్రింది పటం చూడండి-



act -1, act-2, act-3 అనే మూడంకాల స్క్రీన్ ప్లే నిర్మాణంలో కథేమిటో తెలియజేసే act-1 లోని సెటప్ ప్రకారం గౌతమ్ ఎవరు, అతడి సమస్యేమిటి, అతనేం చేయబోతున్నాడనేది చెప్పుకొచ్చారు. హాయిగా అరగంటలో ముగించేసిన ఈ ప్లాట్ పాయింట్ -1 దగ్గర కథ  మలుపు తిరిగి act-2లోకి ప్రవేశించాలి. ఆ మలుపు ఏమిటంటే, మూడోసారి కూడా గౌతమ్ జరగని దాడిని ఊహించుకున్న సందర్భంలో,  పోలీసుల హేళనకి గురై అసలు తానెవరో తెలుసుకోవడానికి గోవా ప్రయాణం కట్టడం.

ఇక్కడ్నించీ act-2 లోకి ప్రవేశించిన  కథా లోకంలో జరిగే బిజినెస్ ఏమిటంటే, పాత్ర తన సమస్య తో లేదా ప్రత్యర్ధితో సంఘర్షించడం- దీన్నే confrontation అంటారు. ఈ సంఘర్షణలో ఎదురు దెబ్బ లుంటాయి-ఎదురుదాడి చేయడం వుంటుంది. ఇంటర్వెల్ దగ్గర కొచ్చేసరికి, సమస్య తీవ్రత పెరిగి మరింత ఇరకాటంలో పెడడమో, లేదా తిరుగులేని సవాలు విసరడమో జరుగుతుంది. ఈ ప్రకారం గౌతమ్ తనని పీడిస్తున్న సమస్యకి కారకుడైన ఒక విలన్ని ఇంటర్వెల్ దగ్గర కాల్చి చంపడం కూడా ఓకే.

విశ్రాంతి తర్వాత act- 2 సెకండ్ పార్ట్ కొచ్చేసరికి కొత్తసమాచారంతో లండన్ వెళ్ళడం, తండ్రి లాకర్ తెరచి ఒక ఫార్ములా స్వాధీనం చేసుకోవడం, ఆ ఫార్ములాకోసం మిగిలిన ప్రత్యర్ధులు వెంటపడ్డంతో ప్రారంభమై ప్రధాన విలన్ (నాసర్)ని కనుగొనడంతో act-2 ముగుస్తుంది. ఇక act -3 లో క్లైమాక్స్ ప్రారంభమౌతుంది...ఇక్కడ ప్రధాన విలన్ తో తన తల్లి దండ్రుల గురించిన సమాచారంకోసం బేరసారాలు కుదరక అతన్ని చంపేయడంతో ముగుస్తుంది. ఇక తల్లిదండ్రులు ఎవరనే అన్వేషణతో కొనసాగి శుభం కార్డు పడే వరకూ సుదీర్ఘంగా జరిగేదంతా  ఉపసంహారమే!

అదే అంకం అదే బిజినెస్సూ!
సమస్య ఎక్కడొచ్చిం దంటే, మొదటి అంకంలో గౌతమ్ మానసిక సమస్య చెప్పేసి  పరిష్కారానికి గోవా దారి పట్టించాక,  రెండో అంకంలో పదేపదే ఆ సమస్యనే ( చిత్తభ్రాంతులు - hallucination) రిపీట్ చేసి, ఏ సంఘటన నిజమో ఏ సంఘటన అబద్ధమో తెలీని కన్ప్యూజన్లో ఆడియెన్స్ ని పడేస్తూ- గౌతమ్ క్యారక్టర్ ని అపహాస్యం పాల్జేశారు. రెండో అంకంలో జరగాల్సిన బిజినెస్ అది కాదు. ఇక్కడ జరగాల్సిన బిజినెస్ సమస్యతో పోరాటం- రెండో అంకంలో గౌతమ్ గోల్ మొదటి అంకం ముగింపులో ఎష్టాబ్లిష్ చేసినట్టు- తానెవరో, తన గతం ఏమిటో తెలుసుకునేందుకు జరపబోయే అన్వేషణ ! రెండో అంకంలో తను సంఘర్షిస్తే ఈ గోల్ కోసం సంఘర్షించాలే తప్ప, ఇంకా తన మొదటి అంకంలో చెప్పేసిన తన మానసికసమస్యతో కాదు. ఈ విధంగా కథ మీద ఫోకస్ కోల్పోయి, మొదటి అంకం బిజినెస్ ని రెండో అంకంలో కూడా చొరబెట్టి దాన్నే  క్లైమాక్స్ వరకూ లాగుతూ పోవడం వల్ల, సువిశాలమైన రెండో అంకం ఏరియా అంతా  కథన భంగం కలిగి గందరగోళం ఏర్పడింది. కథ బుర్ర కెక్కడం కష్టసాధ్య మైపోయింది.

పోనీ ప్రధాన విలన్ తో క్లైమాక్స్ అయినా ఎందుకు బలంగా లేదంటే -  కారణం, మొదటి అంకం ముగింపులో గౌతమ్ సమస్యని బలంగా ఎస్టా బ్లిష్  చేయకపోవడం వల్లే! ఎప్పుడైతే మొదటి అంకం ముగింపులో సమస్యని (పాయింటుని) దృశ్య రూపంలో ప్రభావవంతంగా ఎష్టాబ్లిష్ చేయ్యమో, అప్పుడు క్లైమాక్స్ కూడా బలహీనంగా, పేలవంగా  వస్తుంది. మొదటి అంకం ముగింపులో గోవా ప్రయాణం కట్టడానికి చిత్తభ్రాంతుల కారణమే చెప్పినా, అప్పుడు జరిగిన సంఘటన అంతకు మునుపు జరిగిన వాటికి భిన్నంగా ఏమీ లేదు. మార్పేమీ లేదు. ఇంకేదో అఘాయిత్యం లాంటి బలమైన సంఘటన జరిగి- చట్టానికి దొరక్కుండా పారిపోయే పరిస్థితి లాంటిది ఏర్పడితేనే బలమైన మలుపు అన్పించు కుంటుంది. ఏ స్క్రీన్ ప్లే కైనా ప్లాట్ పాయింట్-1, ఇంటర్వెల్, ప్లాట్ పాయింట్-2 లు మూలస్తంభాల్లాంటివి. వీటిని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటే తప్ప కథకి న్యాయం జరగదు.

ఈ లోపాలన్నీ టైం అండ్ టెన్షన్ థియరీని కూడా నాశనం చేశాయి. ఈ క్రింది పటం కూడా చూడండి...

 సినిమారీలు తిరిగే టైము గడుస్తున్న కొద్దీ కథలో టెన్షన్ పెంచుకుంటూ పోవాలి. అప్పుడే ప్రేక్షకులు సీట్లకి అతుక్కుపోతారు. ఆద్యంతం అన్ని అంకాల్లో అదే మొదటి అంకం బిజినెస్సే  నడుస్తూ కథనం మన్నుతిన్న పాములా పడుంటే  ఇంకా టెన్షన్ అనే మాట ఎక్కడ్నుంచి వస్తుంది?

పైగా ఎడాపెడా మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులతో, చిన్ననాటి మాంటేజెస్ తో, జరుగుతున్న కథ ఫలానా ఈ ఈ  విధంగా జరిగిందంటూ ఎక్స్ పొజిషన్ లతో- వర్తమాన కథకి టెన్షన్ అనే కాన్సెప్ట్ లేకుండా చేశారు. కథకుడికి కథమీద స్పష్టత లేనప్పుడే మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులకి పాల్పడతారని స్క్రీన్ ప్లే పండితుల నిర్ధారణ. మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులవల్ల చెప్పాలనుకుంటున్న అసలుకథ ఎక్కడేసిన గొంగళిలా పడుంటుంది.

పాత్ర చిత్రణ వైచిత్రి
మహేష్ బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన గౌతమ్ పాత్ర వాస్తవానికి చేష్టలుడిగిన ప్యాసివ్ పాత్ర. అది గొప్ప హీరోయిజం తో కూడిన యాక్టివ్ పాత్ర కావాలంటే, ఆ మూడంకాల్లో ఏ అంకం బిజినెస్ ఆ అంకంలో స్పష్టంగా జరగాలి. అప్పుడు మానసిక సమస్య అనే మొదటి అంకపు అంతర్గత ఎమోషనల్ స్ట్రగుల్ పదేపదే కథకి అడ్డు పడకుండా (పాత్ర ప్యాసివ్ గా అపహాస్యం గాకుండా) అసలు గోల్ కోసం పోరాడాల్సిన బహిర్గత ఫిజికల్ స్ట్రగుల్ తో యాక్షన్ లో కొచ్చి, పరిస్థితిని తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ జైత్రయాత్ర కొనసాగించే వీలుంటుంది. హీరోయిజం ఉట్టిపడుతుంది. ఎంతసేపూ ఊహాలోకంలో తనమీద దాడుల్ని పదేపదే తిప్పికొట్టడం హీరోయిజం అన్పించుకోదు. అది యాక్టివ్ గా వుండడం కాదు, రియాక్టివ్ గా నిస్సహాయంగా ఉండిపోవడం. జ్యూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ లో ఇలాగే ఆ పాత్ర విలన్ జరిపే దాడుల్ని తిప్పి కొట్టడమే ( రియాక్టివ్ గా) నిగా పెట్టుకుంటుంది తప్ప, ఆ విలన్ ని ట్రాప్ చేసి తనే దాడులు ప్రారంభించే  ప్రారంభించే యాక్టివ్ పాత్రగా ఎప్పటికీ మారదు!
మహేష్ బాబు పాత్ర తన తల్లి దండ్రులు హత్యకి గురయారన్న బాధతో చివరంటా ఎంతో ఎమోషన్ పండించాడని అనుకోవడం కూడా భావ్యం కాదు. అసలా తల్లిదండ్రులు ఎలా, ఎందుకు చనిపోయారో ముందే చెప్పేసి వుంటే పాత్ర మీద నిజమైన సానుభూతి ఏర్పడే అవకాశం వుండేది. ఆ తల్లి దండ్రులకీ, మహేష్ బాబు పాత్రకీ జరిగిన అన్యాయమేంటో మనకు తెలియకపోతే ఎలా మనసులోతుల్లోంచి సానుభూతి ఫీలవుతాం?

 అమీర్ ఖాన్ నటించిన ‘ధూమ్-3’ లో, మొదటి పది నిమిషాల్లో అతడి చిన్నప్పుడు బ్యాంకు వాళ్ళ దురుసుతనం వల్ల  సర్కస్ కంపెనీ మూతపడే పరిస్థితేర్పడి, తండ్రి ఆత్మహత్య చేసుకోవడం కళ్ళారాచూసిన తను, ఆ బ్యాంకు మీద పగ దీర్చుకోవాలన్న దయనీయ బ్యాక్ డ్రాప్ ఏర్పడి,  ఆసాంతం ఎనలేని సానుభూతి పొందుతూ వుంటాడు.

మహేష్ బాబు పాత్ర పేరెంట్స్ ఎందుకు హత్యకి గురయ్యారో క్లైమాక్స్ వరకూ దాచిపెట్టడంవల్ల పాత్ర పడుతున్న బాధలకి  అర్ధం లేకుండా పోయింది.

ఇంకా లాజిక్కొస్తే, తన పేరెంట్స్ ఐడెంటిటీ కోసం గోల్ తప్ప,  దాని దారీ తెన్నూ తెలీని ఈ అడ్డగోలు ప్రయాణమంతా ఎందుకు? ఒక పేరుపొందిన రాక్  సింగర్ గా తను ఆనాటి పోలీస్ రికార్డులన్నీ పరిశీలించడానికి అవకాశం ఎప్పుడూ వుంటుంది. ఆ ఫైళ్ళతో తల్లి దండ్రులెలా ఉంటారన్న జిజ్ఞాసతో బాటు, కేసు వివరాలన్నీ తెలిసిపోతాయి కదా? ఇంత  సింపుల్ గా తేలిపోయే కథకి ఈ కన్ఫూజనంతా ఎందుకు?

ముగింపు- ఉపసంహారం విషయానికొస్తే- గతించిన తల్లిదండ్రుల ఉనికిని కనుగొనడం, ఆ ఫోటోలు చూసుకుని దుఖించడం వంటి సుదీర్ఘ సన్నివేశాలన్నీ ముగింపులో వచ్చి వుండకూడదు. విలన్ని చంపే ముందే వచ్చి వుంటే సింపతీ కోషేంట్ బాగా వర్కౌటయ్యేది. ఈ ఎపిసోడ్లు తారుమారు చేయడంవల్ల కథ ముగిశాక కూడా ఈ బోరేమిటనే ఫీలింగ్ ఏర్పడేది కాదు.

చివరగా- నిడివి ఇరవై నిమిషాలు కత్తిరించారని తాజా వార్త. ఇది టాక్ వెళ్ళిపోయాక విజయావకాశాల్ని పెంచుతుందా? ఏమో!

-సికిందర్