రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, ఆగస్టు 2014, సోమవారం


సాంకేతికం
ఆనాటి ఇంటర్వ్యూ..
డీటీఎస్ కి పూర్వం మేమెవరో తెలీదు!
ఇ.రాధాకృష్ణ, సౌండ్ ఇంజనీర్

   బ్దం 360 డిగ్రీల అనుభవం. దాన్నో పెట్టెలో బందీ చేసి ప్రేక్షకులకి/శ్రోతలకి అభిముఖంగా పెట్టి విన్పించడమంత అన్యాయం లేదు. ఈ అన్యాయాన్ని అరికట్టేందుకే కాబోలు, అపూర్వంగా డిటిఎస్ అనే ఆడియో వైభవాన్ని కనిపెట్టి, శబ్దానికి నివాళిగా అర్పించాడు సైంటిస్టు టెర్రీబెర్డ్.

     ప్పుడు డిటిఎస్ (డిజిటల్ థియేటర్ సిస్టమ్స్) అంటే తెలీని సగటు ప్రేక్షకుల్లేరు. కాని "డిటిఎస్‌కి పూర్వం సౌండ్ ఇంజనీర్లు ఉండేవారని జన సామాన్యానికి తెలీదు. పాటలూ, నేపథ్య సంగీతం సహా సినిమాల్లో విన్పించే అన్నిరకాల శబ్దాల సృష్టికర్త, సమ్మేళనకర్తా సంగీత దర్శకుడనే నమ్మేవారు'' అంటారు ఇ. రాధాకృష్ణ. గత 19 ఏళ్ళుగా ప్రసాద్ ల్యాబ్స్ లో సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఈయనకి డిటిఎస్‌తో పదేళ్ల అనుభవముంది. థియేటర్లలో శబ్ద ఫలితాలు ఎలా విన్పించాలన్నది ఆయన చేతుల్లోనే ఉంది. అదే సమయంలో వాళ్లు పడ్డ కష్టమంతా సంపూర్ణంగా ప్రేక్షకులకి బదలాయింపు జరగాలంటే థియేటర్లలో సౌండ్ స్థితిగతులు బాగుండాలి. "డిటిఎస్ అనేది 5.1 ఛానెల్ వ్యవస్థ. ఇందులో వెండితెర వెనుక కుడి, ఎడమ, మధ్యన మూడు, హాలులో కుడివైపు, ఎడమవైపు చెరొక ఛానెల్‌తో మొత్తం ఐదు స్పీకర్లుంటాయి. మిగిలిన (.1) ఛానెల్‌తో ఆరవ స్పీకర్ వెండితెర వెనుకే కింది భాగంలో ఉంటుంది. దీన్ని సబ్ వూఫర్ అంటారు. ఇందులో ముష్టిఘాతాలు, తుపాకీ, బాంబు పేలుళ్ళు లాంటి లో ఫ్రీక్వెన్సీ శబ్దాలు వెలువడతాయి. మిగతా ఐదు స్పీకర్లలోంచి సంభాషణలు, నేపథ్య సంగీతం, స్పెషల్ ఎఫెక్ట్స్ తాలూకు శబ్దాలు, పాటల్లో వాద్య పరికరాలూ వగైరా విభజన జరిగి వీనుల విందు చేస్తాయి'' అని వివరించారు రాధాకృష్ణ. 

     హాల్లో కుడి ఎడమవైపుల్లో అదనంగా ఎన్నైనా స్పీకర్లు అమర్చుకోవచ్చు. ఈ రెండు వరసలూ ప్రేక్షకుల సీటింగ్ వెనుకవైపు వరకూ కొనసాగుతాయి. మొట్టమొదట సౌండ్ నెగెటివ్‌తో కలిపి పిక్చర్ నెగెటివ్ వేశాక, ఆ సౌండ్ నెగెటివ్ (మోనో ఆడియో ఫార్మాట్)ని అలాగే ఉంచుతారు. ఎందుకంటే పల్లెటూరి థియేటర్లలో డిటిఎస్ సౌకర్యం ఉండదు గనుక. ఇక డబ్బింగ్, రీరికార్డింగ్స్, ఎఫెక్ట్స్, సాంగ్స్ మొదలైన వాటిని ముందేసుకుని మార్కెట్‌లో తిరుగులేని బ్రాండ్‌గా ఉన్న ‘ప్రోటూల్స్ డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్’ మీద డిటిఎస్ మిక్సింగ్‌కి పూనుకుంటారు. ఈ మిక్సింగ్‌ని డిటిఎస్ కంపెనీ తీసుకుని సీడీ రామ్స్ లో ముద్రించి ఇస్తుంది. దీనికి 75 వేలు రాయల్టీ రుసుముతో బాటు, ఒక్కో డిస్కుకి మరికొంత వసూలు చేస్తుంది. దీనివల్ల డిస్కులు తారుమారు కాకుండా ఉంటాయి. అప్పుడు థియేటర్లలో ప్రొజెక్టర్లోంచి సినిమా, సీడీ ప్లేయర్లోంచి డిస్కూ విడివిడిగా రన్ చేస్తే రెండు కలిసి హాల్లో ప్రేక్షకుల్ని అలరింపచేస్తాయన్న మాట!

     అయితే ఒక సినిమాకి 300 ప్రింట్లు వేసి 500 థియేటర్లలో ప్రదర్శించాలంటే, అదనంగా 200 డిస్కుల ఖర్చు పెరుగుతుందని, అదే ప్రింట్ల మీద ముద్రితమయ్యే డోల్బీ డిజిటల్ సిస్టమ్‌తో ఈ అదనపు భారం పడదనీ అన్నారు రాధాకృష్ణ. కానీ డోల్బీకి హిందీ సినిమాలకే తప్ప, దక్షిణాదిలో ఆదరణ లేదన్నారు.


   రాధాకృష్ణ మొదట డోల్బీకేపనిచేశారు. ఆ సినిమా 1998లో విడుదలైన 'ఆవిడా మా ఆవిడే'. చెన్నైలో పుట్టి పెరిగిన రాధాకృష్ణ, అడయార్ ఫిలింఇన్‌స్టిట్యూట్‌లో సౌండ్ ఇంజనీరింగ్ చదివి, 1991లో మీడియా ఆర్టిస్ట్ అనే సంస్థలో పనిచేశారు. అదే సంవత్సరం ప్రసాద్ ల్యాబ్స్ లో డబ్బింగ్ శాఖలో చేరి, అంచెలంచెలుగా రీరికార్డింగ్, మోనో మిక్సింగ్, ఆ తర్వాత డోల్బీకి, డీటీఎస్‌కీ ఎదిగారు. 

     సరే, అయితే డిటిఎస్‌తో అంతా నల్లేరు మీద నడకేనా, బాగా కష్టపెట్టిన సీన్లు లేవా అంటే, ఇష్టపడి చేసిన సీన్లే ఉన్నాయన్నారు. 'మగధీర'లో సామూహిక వధ సీనులో రామచరణ్ గుండెల్లో బాణం గుచ్చుకున్నప్పుడు, సౌండ్స్ అన్నిటినీ మైనస్ చేసి, నెమ్మది నెమ్మదిగా రీరికార్డింగ్ ఇస్తూ, ఫిమేల్ వాయిస్‌తో కాయిర్ వేస్తూంటే ఆ సీను ఉద్విగ్నతే వేరన్నారు. అలాగే 'సింహా' ఫ్లాష్ బ్యాక్‌లో బాలకృష్ణ హతమయ్యే సీన్లో భార్య కష్టం, పిల్లాడి ఏడ్పుకిచ్చిన శబ్ద ఫలితాలు మంచి తృప్తినిచ్చాయన్నారు. మిక్సింగ్ పరంగా ఈ రెండూ ఎంత సంకీర్ణ సన్నివేశాలో మనకు తెలిసిందే. 

     ఇప్పటివరకు 250 సినిమాలకి డిటిఎస్ మిక్సింగ్ చేశారు రాధాకృష్ణ. పూర్వం మోనో మిక్సింగ్‌తో కలుపుకుంటే ఈ సంఖ్య 800 వరకూ ఉంటుంది. వరుసగా మూడుసార్లు పోకిరి, మంత్ర, అరుంధతి సినిమాలకి నంది అవార్డులందుకున్నారు. ప్రస్తుతం బృందావనం, భైరవ, మరో కళ్యాణ్‌రామ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈయన తాజా సినిమా 'సరదాగా కాసేపు' ఈనెల 17న విడుదల అయింది.


   మరి తనకెవరు స్ఫూర్తి? - అనడిగితే, ఏడెనిమిది సార్లు ఆస్కార్అవార్డులందుకున్నఆడియో బ్రహ్మ గేరీ రెడ్‌స్టార్మ్ (జురాసిక్ పార్క్, టర్మినేటర్, టైటానిక్ ఫేమ్) తనకు ఎంతో స్ఫూర్తినిస్తున్నారని అన్నారు. ఈ రంగంలో తను ఎంత అనుభవం గడించినా నిత్య అధ్యయనం, పరిశీలన తప్పవన్నారు. హైదరాబాద్‌కి మారినప్పటి నుంచి సంగీత దర్శకుడు కోటితో తనకున్న అనుబంధం గురించి చెప్పారు. అలాగే కీరవాణితో 50 సినిమాలు చేయడం గర్వకారణంగా ఉందన్నారు. పోతే, మొదట్నుంచీ  నుంచి తన వెన్నుతట్టి ఎంతో ప్రోత్సహిస్తున్న ప్రసాద్ ల్యాబ్స్ ఎండీ రమేష్ ప్రసాద్‌కి ఆజన్మాంతం రుణపడి ఉంటానన్నారు రాధాకృష్ణ. 
 
- సికిందర్

(ఏప్రెల్ 2011 ‘ఆంధ్రజ్యోతి’ సినిమా టెక్ )