రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, మార్చి 2015, మంగళవారం

ఆనాటి సినిమా!

హాస్యభూషణం హాజర్ హై!!

విలన్ :  హీరోని ఏడ్పించేవాడు
కామిక్ విలన్ : ప్రేక్షకుల్ని నవ్వించేవాడు
హీరోయిక్ విలన్ : సాంతం పబ్లిక్ ని ప్రేమించేవాడు
ఒకసారి పబ్లిక్ తో ప్రేమలో పడ్డాక, ఇక వాంటెడ్ డెడ్ ఆర్ ఆలైవ్ పోస్టర్ని పరపరా చింపేసుకుని, పబ్లిక్ కి సరెండరై పోయినట్టే విలన్ అనేవాడు!!


    త్రికా రచనకి నిజాలు ముఖ్యం. సినిమాకి నిజాలుగా భ్రమింపజేయడం అతి ముఖ్యం. భ్రమింపజేయడమే నటుల మెయిన్ బిజినెస్. భ్రమా బేరం లేక భుక్తి లేదు.
కడారు నాగభూషణం (1921 – 1995) అనే  భ్రమల బేహారి వాస్తవికతని రక్తికట్టించే విలనిజం నుంచీ సహజ కథానాయకుడిగా కూడా సమాజానికి దొరికిపోయేముందు, నాటక సమాజానికి గొప్ప సెటైరిస్టుగా, అధిక్షేపణ  లాక్షిణికుడుగా చిక్కాడు. చిక్కాక సినిమా నిర్మాతలకి చిక్కడు-దొరకడు  అయిపోయాడు – ‘నెలలో మొదటి వారం నో షూటింగ్స్ ప్లీజ్...నేనెక్కడికో వెళ్ళిపోయి నా ‘రక్తకన్నీరు’ నాటకం వేసుకుంటా...పది లక్షలి సిస్తామన్నా కెమెరా ముందుకు రానంటే రానంతే, దట్సాల్!’ 



               న్నెన్ని ‘రక్త కన్నీళ్లు’ అని! ఆలిండియా లెవెల్లో అక్షరాలా ఐదు వేల నాలుగు వందల ముప్ఫై రెండు ప్రదర్శనలు! మన హైదరాబాదీ ‘అద్రక్ కె పంజే’ ( అల్లం కొమ్ములు) ఫేమ్ బాబ్బన్ ఖాన్ పదివేల ప్రదర్శనలతో గిన్నీస్ బుక్ రికార్డు కెక్కిన తర్వాత, తనే ఆ స్థాయిలో కాకపోయినా తెలుగులో ప్రదర్శనల రికార్డు నెలకొల్పిన రంగ స్థల కళాకారుడు. పాతికేళ్ళ పాటూ వందలాది రంగస్థల కళాకారులకి ఉపాధీ, రెండు దశాబ్దాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్య మండలి అధ్యక్ష బాధ్యతలూ, ఇంకా ఇండియన్ పీపుల్స్ థియేటర్ ఉపాధ్యక్ష పదవిలో కొన్నాళ్ళూ, రాష్ట్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడెమీ సలహాదారుగా సేవలూ, వామపక్ష భావజాలం కారణంగా ఎప్పటికప్పుడు మారిపోతున్న రాజకీయాలపై,  సామాజిక పరిణామాలపై, కొత్త కొత్తగా వ్యంగ్య బాణాల సంధింపూలూ! అసలు  ‘రక్తకన్నీరు’ నాటకమేంటో  మనం నిక్కర్లేసుకున్న ఆ రోజుల్లో బుద్ధికి పట్టు బడలేదు గానీ, ఓ సన్నివేశం జన్మకి గుర్తుండి పోతుంది- కుష్టు రోగంతో బాధపడుతున్న ప్రధాన పాత్రధారి నాగభూషణం చుట్టూ ముసిరే ఈగల ‘స్పెషల్ ఎఫెక్ట్స్’ మాయాజం అప్పుడే ఎంత థ్రిల్!

    ‘నాటకాల రాయుడు’ విషయాని కొస్తే,  ఐది నాగభూషణం కామెడీతనానికి పరాకాష్ఠ! రవి ఆర్ట్ థియేటర్స్ అని సినిమా నిర్మాణ సంస్థ స్థాపించి ‘ఒకే కుటుంబం’, ‘ప్రజానాయకుడు’ అనే రెండు సినిమాల్ని నిర్మించినా, దిడ్డి శ్రీనివాసరావు అనే మరో నిర్మాతకి చెందిన హరిహరా ఫిలిమ్స్ బ్యానర్లో ‘నాటకాల రాయుడు’తో సోలో హీరోగా వచ్చాడు. ఏ. సంజీవి దీని దర్శకుడు. నాటకాల మీద చచ్చే మోజు పెంచుకుని ఇంట్లోంచి ఉడాయించే ఓ ఔత్సాహిక నటోత్తముడి అనుభవాలే ఈ సినిమా ఇతివృత్తం.

  ‘నాటకాల రాయుడు’ విషయాని కొస్తే,  ఐది నాగభూషణం కామెడీతనానికి పరాకాష్ఠ! రవి ఆర్ట్ థియేటర్స్ అని సినిమా నిర్మాణ సంస్థ స్థాపించి ‘ఒకే కుటుంబం’, ‘ప్రజానాయకుడు’ అనే రెండు సినిమాల్ని నిర్మించినా, దిడ్డి శ్రీనివాసరావు అనే మరో నిర్మాతకి చెందిన హరిహరా ఫిలిమ్స్ బ్యానర్లో ‘నాటకాల రాయుడు’తో సోలో హీరోగా వచ్చాడు. ఏ. సంజీవి దీని దర్శకుడు. నాటకాల మీద చచ్చే మోజు పెంచుకుని ఇంట్లోంచి ఉడాయించే ఓ ఔత్సాహిక నటోత్తముడి అనుభవాలే ఈ సినిమా ఇతివృత్తం.



          బుచ్చి బాబు ( నాగభూషణం) కి నాగయ్య- హేమలత లాంటి తల్లి దండ్రులు, అనిత లాంటి చెల్లెలు, సత్యనారాయణ, సీత లాంటి అన్న వదినెలతో అన్యోన్య కుటుంబం. ఎక్కడో చిన్నపాటి గుమాస్తా ఉద్యోగం చేస్తాడు కానీ నాటకాలే ఊపిరి. మహానటుడు అయిపోవాలన్నదే ఏకైక లక్ష్యం. దీంతో తండ్రితో  చివాట్లు. నాటకాలంటూ ఎక్కడెక్కడో తిరిగి అర్ధరాత్రిళ్లు గోడ దూకి వచ్చి, చెల్లెలు అన్నం పెడితే తినేసి, ఆమె పాడితే హాయిగా కళ్ళు మూసుకుని గుర్రు పెట్టడం హాబీ. 

        చెల్లెలి పెళ్ళికి కట్నం తెస్తానంటాడు పెద్ద హీరోలా. తీరా ఆఫీసులో తన నాటకాల దురద ఆపుకోలేక, ‘మయసభ’ సీను విరగదీసి నటించి పారేసి, ఆ న్యూసెన్సు కి ఉన్న ఆ పాటి ఉద్యోగమూ ఊడబీకించుకుని -ఉత్త చేతుల్తో జీరోలా ఇంటికి రావడం! 

          తండ్రితో వాగ్యుద్ధం జరిగి, నాటకాలే తనకు నాగరికమని నగరం బాట పట్టేస్తాడు. అక్కడ ఓ నాటకాల కంపెనీ పద్మనాభం సైధవుడిలా అడ్డు తగిలేసరికీ, అసలిక్కడ ఎంట్రీ సంపాదించాలంటే ఇంకెక్కడో ప్రముఖ రంగస్థల నటీమణి గీతాదేవి ( కాంచన) ని మచ్చిక చేసుకోవాలని, వెళ్ళేసి ఆమె ఇంట్లో పని వాడుగా చేరిపోతాడు. తనని బాగా ఎంటర్ టెయిన్ చేస్తున్న ఈ గమ్మత్తయిన శాల్తీలో  ఏకంగా ఆమె ఒక అజ్ఞాత కళాకారుణ్ణే చూసి, బాగా ఎంకరేజి చేస్తుంది. అయితే అప్పటికే ఆ కంపెనీలో పాపులర్ స్టేజి నటుడు ప్రేమ్ కుమార్ ( ప్రభాకర రెడ్డి) అనే అతను హీరోగా  ప్రొసీడ్ అవుతున్నాడు. గీతాదేవికి లైనేస్తూ కూడా ప్రోసీడవుతున్నాడు. ఇప్పుడు వీడెవడో బుచ్చి బాబు గాడు తనకి పొటెన్షియల్ డేంజర్ గా అన్పించేసరికి ఏకడం మొదలెడతాడు.

          దీంతో చాలా తిప్ప లొచ్చేస్తాయి బుచ్చిబాబుకి. ప్రేమ్ కుమార్ చేతిలో సఫా అయ్యే దుస్థితి కూడా దాపురిస్తుంది. ఇంకో వైపు గీతాదేవి తనకి క్లోజ్ గా మూవ్ అవడమేమిటో , ఆ కవ్వింపు లేమిటో ఎటూ అర్ధం కాని స్థితి. ఒకమ్మాయి వుందంటే, ఆమెతో ప్రేమ కలాపాలకి ట్రయల్ వేసుకోవచ్చని కూడా తెలీని అమాయక ప్రాణి అతను. ఇలా ఈ ప్రమాద ప్రమోదాల సయ్యాటలో చిక్కుకుని గిలగిల్లాడు తూంటాడు. పెట్టుకున్నలక్ష్యం కాస్తా గల్లంతై పోతుంది.

                   ఆద్యంతం నాగభూషణం చాలా యాక్టివ్ గా, చలాకీగా రక్తి కట్టించే ఈ నవ్వుల ప్రపంచంలో తీరని విషాదం కూడా వుంది. నాగభూషణం – అతడి కుటుంబపు పరిస్థితుల అనులోమ- విలోమ సంబంధం, రేఖా గణితం ఈ సినిమా కథా కథనాలకి బలమైన వెన్నెముక గా నిలుస్తాయి. ఎలాగంటే అతనెక్కడో మహా నగరంలో పైపైకి ఎదుగుతూ వుంటే, అటు వూళ్ళో కుటుంబం నానాటికీ దిగజారి పోతూ వుంటుంది. తను చాలా చాలా గొప్ప వాడైపోయేసరికి, ఆ కుటుంబంలో ఓ మరణం సంభవించి, ఇంకో జననం తో ముక్కలై, భిక్షాటన చేసే దౌర్భాగ్యం. ఇప్పటి సినిమాల్లో కొరవడిన కరకు వాస్తవ జీవిత మంతా ఇందులో జడలు విప్పుకుంటుంది...

      తల్లి ఆశీర్వాద బలంతోనే  తానిలా గొప్ప వాణ్ణయి పోయాననుకుని మురిసిపోతాడు. ఆ తల్లి ఎప్పుడో గతించిన విషయం కూడా తెలీదు! ఆ కుటుంబంలో పెళ్ళి శుభకార్యానికి  డబ్బెప్పుడూ నిలవదు. మొదటిసారి డబ్బు దొంగల పాలవగానే, అంతవరకూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చిన ఆ కుటుంబం ఒక్కసారి భగ్గుమనేస్తుంది. కలలో కూడా ఊహించని కటువైన మాటలు పేలతాయి వాళ్ళ మధ్య. ఆ పరస్పర దూషణలు, దెప్పి పొడుపులు తనకి కూడా తగిలి కుమిలికుమిలి పోతుందా పెళ్లి కున్నఅమ్మాయి. దర్శకుడు సంజీవి ఈ దృశ్యాన్ని నాగయ్య, హేమలత, సత్యనారాయణ, అనిత లతో అత్యంత బలంగా సృష్టించాడు. సినిమాకి ఇదే హైలైట్.

          ఈ సినిమాలో వినోద విషాద ఘట్టాలన్నిటిలో గొల్లపూడి మారుతీ రావు కలం బలం కట్టి పడేస్తుంది మరి నోరెత్త నీయకుండా.  నాటకాల అనుభవముంటే ఆ సినిమా రచనే వేరు. ఇక సినిమా ప్రారంభమే ప్రభాకర రెడ్డి, కాంచనల మీద అతి సుదీర్ఘంగా  ఐదు నిమిషాలా నలభై సెకన్ల పాటూ సాగే పద్య గానముంటుంది. పద్యాలు వడ్డాది రాస్తే, పాటలు ఆత్రేయ రాశారు. జికే వెంకటేష్ సంగీతంలో ‘నీలాల కన్నుల్లో మెల్ల మెల్లగా’ అనే సిస్టర్ సాంగ్, ‘వేళ చూడ వెన్నెలాయె’ అనే కాంచన మీద సూపర్ హిట్ బ్యూటీఫుల్ సాంగ్ రెండూ అలరిస్తాయి. కమల్ ఘోష్ తెలుపు- నలుపు కెమెరా పనితనం ఈ సినిమాలో ఓ కవితా గానమే.

        నాటక దృశ్యాల్లో నాటకం చూసే ప్రేక్షకులు ఊహించలేని లొకేషన్ మార్పులు, సీక్వెన్సులూ పంటి కింద రాళ్ళలా తగుల్తాయి. స్టేజి  మీద నాటక ప్రదర్శనలో ఇవి అసాధ్యం. సినిమాయే  కదా- దీనికి వుండే సినిమాటిక్ లిబర్టీ అనే లైసెన్సుతో నాటక కళదుంప తెంచి నట్టుంది. నాటక రంగ నిపుణుడైన నాగభూషణం వీటిని అనుమతించడం ఆశ్చర్యమే. ఏమైనా భావి తరాలకి నాగభూషణం అందించిన ఓ మంచి వినోద కాలక్షేప మనొచ్చు ఈ సినిమాని!


***

డైలాగ్ డిష్ 

నాగభూషణం
*  దేశంలో పూలన్నీ మహా నాయకులకూ మహా నటులకూ దండల కిందే  సరిపోతున్నాయి, ఇక ముత్తయిదువులకెందుకుంటాయ్.
*  ఒరే కంచుకీ, పరమ దుర్మార్గుడును , సకల ఉద్యోగి దండునకు శత్రువూ అయిన ఆ మేనేజారథముడెక్కడ?
*  ఈ రోజుల్లో నటీమణుల రికమెండేషను లేకపోతే నాటక కంపెనీల్లో మేనేజర్లు వేషాలివ్వరు, అందుకని అంతఃపురం లోంచి నరుక్కు పోదామని ఇటోచ్చా.
*  మహా నటుడు అంతః పురంలో ఉండగలడు, అవసరమైతే అంట్లూ తోమగలడు.
*  మీ అమ్మగారి తద్దినమంటే నటించా సార్, లేకపోతే నటించే వాణ్ణి కాను సార్!
కాంచన
*  జీవితంలో తిండీ నిద్రా తప్ప ఇంకేమీ లేవా బుచ్చిబాబూ!
*  నాటకంలో ప్రేమని నటించే ఆడది కూడా ప్రేమని మనసులో పవిత్రంగా దాచుకుంటుంది.
*  ఇవ్వాళ్ళ కార్లలో తిరిగే చాలా మంది నటుల్ని చాలా మంది ఈర్ష్యగా చూస్తారు గానీ, అప్పటివాళ్ళ దీక్షా తపస్సుల వెనుక ఎన్ని బాధ లున్నాయో, ఎన్ని గాథలున్నాయో అర్ధం చేసుకుంటే ఆ చూపుని వాళ్ళు మళ్ళించు కుంటారు.

కొన్ని ఫన్నీ సీన్స్

          * నాగభూషణం ఆఫీసు మేనేజరిచ్చిన పెద్ద కవరు పోస్ట్ చేయడాని కెళ్తే అది పోస్ట్ బాక్సులో పట్టదు. దాంతో ఆ కవర్ని రెండు ముక్కలు చేసి, పోస్ట్ బాక్సులో కుక్కుతాడు- మొదటి భాగం, రెండో భాగం అంటూ!
          *నాగభూషణం టాలెంట్ కి టెస్టు పెడుతుంది నాటక కంపెనీ. నాగభూషణం రాకెన్ రోల్ డాన్స్ తో విరగ్గొట్టేస్తాడు. తోటి కళాకారులతన్ని బంతాట ఆడేసుకుంటారు. కింద పడిపోతాడు నాగభూషణం. ప్రభాకర రెడ్డి, పద్మనాభం ఇద్దరూ సంతోషిస్తారు, కాంచన చిన్న బుచ్చుకుంటుంది.
          * నాగభూషణం అలా నడుచుకుంటూ వస్తూంటే, ఓ వ్యక్తి ఎదురవుతాడు. నాగభూషణం ఆగిపోయి ‘ఆఁ-!’  అంటాడు. ఆ వ్యక్తి కూడా నోరు తెర్చు కుని ఆఁ-!’ అంటాడు. వెంటనే నాగభూషణం అతడి నాలుక మీద పోస్టల్ స్టాంపు పెట్టి తీస్తాడు. ఆ తడితో కవరు మీద అతికించుకుని వెళ్ళిపోతాడు.  
          * టైటిల్స్ లో కర్రసాము, కత్తి యుద్ధాలు ‘రాఘవులు అండ్ పార్టీ’ అని వేయడం నవ్వు తెప్పిస్తుంది!



—సికిందర్ 

(జనవరి 2010 –‘సాక్షి’) 




9, మార్చి 2015, సోమవారం

సాంకేతికం ...



మాన్యువల్  ఎఫెక్ట్స్ ఉండవా?
సాదిరెడ్డి రామారావు - యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ 

జీవా నటించిన సూపర్ హిట్ ‘రంగం’ సినిమా క్లైమాక్స్ లో గన్ ఫైర్ దృశ్యాలు ఎంత బీభత్స భయానంగా వున్నాయో తెలిసిందే. రెప్పపాటు కాలంలో కొన్ని వందల బుల్లెట్స్ గోడల్లోకి చొచ్చుకు పోతూంటాయి. క్రిమినల్స్ గల్లంతై పోతారు. ఇదంతా యాక్షన్ కొరియోగ్రాఫర్ సుప్రసిద్ధ పీటర్ హెయిన్స్ ప్రతిభాపాటవంగా నమోదవుతుంది బ్రహ్మాండంగా. ఇక్కడే వుంది తిరకాసు. ఈ సీను జాగ్రత్తగా చూస్తే, ఆ బుల్లెట్ రంధ్రాల్లోంచి సహజంగా రావాల్సిన పొగ రావడం కన్పించదు.  నిప్పులేనిదే పొగ ఎలా వస్తుంది? ఈ పొగ వెలువడి సీను సహజంగా కన్పించడం కోసం యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆపరేటర్ క్రాకర్స్ (మేకుల్లాంటి టపాసులు) ఆ రంధ్రాల్లో అమర్చి పేల్చాలి నిజానికి. కానీ దీనికి బదులు కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ (సిజిఐ) లో ఈ సీను సృష్టించడం వల్ల ఈ అసహజత్వం వచ్చేసింది...మాన్యువల్ ఎఫెక్ట్స్ ని కాదని సిజిఐ కి పాల్పడ్డం తో ఈ కృత్రిమత్వమంతా అన్నమాట!

     ఇది ప్రేక్షకులు పసిగట్టేస్తున్నారని అంటున్నారు సాదిరెడ్డి రామారావు అలియాస్ రాము. గ్రాఫిక్స్ చేశార్రోయ్ అని అరిచేస్తున్నారు ప్రేక్షక షెర్లాక్ హోములు! రాము వంటి సీనియర్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆపరేటర్లకి సైతం ఈ సిజిఐ మాయ వచ్చేసి పని తగ్గించేస్తోంది. ఓ జీపుని నిజంగా పేల్చేయడానికి ఇరవై లీటర్ల పెట్రోలు అవసరమైతే, అర లీటరుతో కొద్దిగా పెల్చేద్దురూ,  మిగతాది గ్రాఫిక్స్ లో చూసుకుంటామని అనేస్తున్నారు నిర్మాతలు సైతం. నిజానికి మాన్యువల్ ఖర్చు కంటే గ్రాఫిక్ కయ్యే ఖర్చే ఎక్కువని రాము స్పష్తం చేస్తున్నారు.

     మూడు దశాబ్దాల సుదీర్ఘానుభావంతో రాము గన్ ఫైరింగ్, బాంబ్  బ్లాస్టింగ్, క్యానన్ బ్లాస్టింగ్, కౌంటర్ బ్లాస్టింగ్, మినియేచర్ బ్లాస్టింగ్, వాటర్ బ్లాస్టింగ్, పేపర్ బ్లాస్టింగ్, గ్లాస్ బ్రేకింగ్, కత్తి పోరాటాల్లో మెరుపులు, గదలు కొట్టుకున్నప్పుడు రవ్వలు వంటి అనేక ధ్వంస రచనల్లో ఆరితేరారు. వీటి ఆపరేటింగ్ లో చాలా ఏకాగ్రత అవసరం. టైమింగ్ తప్పితే ప్రమాదాలే జరిగిపోవచ్చు. అయితే ఇంతవరకూ ఏ చిన్న ప్రమాదమూ జరగనివ్వని క్లీన్ చిట్ తో, మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీ కాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లే కాకుండా, ఇంకా వందలాది నటులు రాము చేతుల్లో సురక్షితంగా వున్నారు.

    ‘సినిమాటెక్’ శీర్షికకు ఈ ఇంటర్వ్యూల కోసం ఈ యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాన్ని వెపన్స్, బ్లాస్టింగ్స్, క్యానన్ బ్లాస్టింగ్ అని మూడు తరగతులుగా విభజించుకుని, మొదటగా వెపన్స్ గురించి రాముని కలుసుకుంటే, ఆయన సొంత నివాస భవనంలోని ‘ఆయుధాగారం’ చూపించారు. అక్కడ డబుల్ బ్యారెల్, ట్రిపుల్ బ్యారెల్, 302 రైఫిల్స్, ఎస్ ఎల్ ఆర్, ఏకే- 47, ఎం.పి- 5, పంప్ యాక్షన్ హెవీ గన్స్  మొదలైనవి అనేకం వున్నాయి. మరి రివాల్వర్స్, పిస్టల్స్, 9 ఎం.ఎం. గన్స్ సంగతి? వాటిని ఓల్డ్ సిటీ నుంచి మహ్మద్ మారూఫ్ అనే అతను సరఫరా చేస్తాడన్నారు. గత పాతికేళ్ళుగా ఈయనే వాటికి అధీకృత సప్లయర్.

     ఇక్కడున్న ఆయుధాలు మాత్రం స్వయంగా రాము తయారు చేసుకున్నవే. వీటిలో రెండు రకాలు : పేల్చకుండా పట్టుకు తిరిగేవి, పేల్చేవి. పేల్చడానికి ఉపయోగించే వాటిలో లోపలి ఎలక్ట్రిక్ సర్క్యూట్ రూపకల్పన కూడా  ఈయనదే. గన్ బట్ కుండే స్లయిడ్ ని పక్కకు జరిపితే, లోపల సర్క్యూట్, దానికి అనుసంధానించిన పది పెన్ టార్చి బ్యాటరీలు, 10 ఫ్యూజులూ కన్పిస్తాయి. ఈ ఫ్యూజులకే  క్రాకర్స్ ని అమరుస్తారు. దాంతో ట్రిగర్ లాగగానే పెద్ద చప్పుడుతో క్రాకర్స్ పేలి, బ్యారెల్లోంచి నిప్పు రవ్వలు చిమ్ముతాయి. నిజ తుపాకుల్లోంచి వెలువడే తూటా ఎలాగూ దాని పలాయన వేగంతో కంటికి కనపడదు కాబట్టి, ఈ తుపాకుల్లో బుల్లెట్స్ ని లోడ్ చేసే అవసరం రాదు.

      తూటా వెళ్లి ఓ వ్యక్తికి తాకడాన్ని ఇలా వివరించారు రాము : ఆ దేహ భాగానికి ప్యాడింగ్ చేసి, ఓ కండోమ్ లో రక్తం ( అంటే గ్లిజరిన్ + రంగు) నింపి, క్రాకర్స్ తో ఒక సర్క్యూట్ ని ఏర్పాటు చేస్తారు. ఆ తీగెల్ని దూరంగా స్విచ్ బోర్డుకి బిగించుకుని ఆపరేటర్ కూర్చుంటాడు. షాట్ తీసేటప్పుడు  టైమింగ్ తో ఈ స్విచ్ ని నొక్కితే, క్రాకర్స్ పేలి, కాలిన బట్టల్లోంచి పోగరావడం, అదే క్షణంలో కండోమ్ కూడా పగిలి,  బ్లడ్ ని  విరజిమ్మడమూ జరిగిపోతాయి. వెండి తెర మీద ఈ ప్రక్రియ సహజత్వానికి అత్యంత దగ్గరగా వుంటుందన్నారు రాము.

పాత రోజుల్లో తుపాకీ పేలిన సౌండ్ ఎఫెక్ట్  మీద, క్షతగాత్రుడు గుండె పట్టుకుని అక్కడున్న రక్తపు తిత్తిని నొక్కుకుంటే, బొటబొటా రక్తం కారేది కానీ, గాయం కన్పించేది కాదన్నారు రాము.

     1982 లో చిరంజీవి నటించిన ‘ఖైదీ’ సినిమాకి ఏకనాథ్ దగ్గర అసిస్టెంట్ గా చేరిన రాము, 1987 లో కమల్ హాసన్ ‘విక్రమ్’ కి ఆపరేటర్ అయ్యారు. నాటి నుంచీ నేటి వరకూ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలు కలిపి వందలాది చేశారు. జేపీ దత్తా  తీసిన మెగా హిట్ ‘ బోర్డర్’ అనే యుద్ధ చిత్రానికి బికనీర్ వెళ్లి 40 రోజులు పని చేసి వచ్చారు. బాలకృష్ణ నటించిన బంపర్ హిట్ ‘సమరసింహా రెడ్డి’  లో మొట్ట మొదటిసారిగా తెలుగు సినిమా కంటూ టాటా సుమోల్ని పేల్చేసి గాల్లోకి ఎగేరేసిన క్యానన్ బ్లాస్టర్స్  మోహన్- కృష్ణ లకి  పెట్రో బ్లాస్టింగ్ లో సహకరించారు రాము. ఈయన స్వస్థలం కాకినాడ.


    రజనీ కాంత్ జంబోజెట్  ‘రోబో’ కోసం రాము అత్యంత  కష్టపడి ఒక భారీ యాక్షన్ సెట్ నే సిద్ధం చేశారు. గన్ షాట్స్ తో క్షణాల్లో గోడ జల్లెడయ్యే సీన్ అది. 60 మంది టీం తో 20 రోజులూ  శ్రమించి,  గోడలో 10 వేల రంధ్రాలతో క్రాకర్స్ ని ఫిక్స్ చేసి, సర్క్యూట్ ని కంప్లీట్ చేశారు. టెస్ట్ షూట్ చేసి కూడా చూపించారు. అప్పుడా రంధ్రాల్లోంచి పొగ చిమ్మడం కూడా చూశాడు ఆ సినిమా యాక్షన్ డైరెక్టర్. ఐనా ఇలా పొగ వచ్చే బుల్లెట్ రంధ్రాలు తనకవసరం లేదని, వెళ్ళిపోయి గ్రాఫిక్స్ చేయించుకున్నాడు. రాము పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది.

    ‘రంగం’ అయినా , ‘రోబో’ అయినా ఇస్తున్న సంకేతం ఒకటే...ప్రపంచీకరణ వల్ల కుల వృత్తులు / చేతివృత్తులు  మటు మాయమై పోతున్నాయంటూ ‘కుబుసం’ లో శ్రీహరి పాడే పాట ఒకటి వుంది... ‘పల్లె కన్నీరు పెడుతుందో తెలియని కుట్రల’ అని గోరటి వెంకన్న రాసిన పాట. యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ అనే చేతి వృత్తి గతి కూడా ఇంతే నేమోనని ఆ సంకేతం! 


సికిందర్
( మే 2011, ‘ఆంధ్రజ్యోతి’ కోసం)

7, మార్చి 2015, శనివారం

సూర్యుడి సంగతులు..

 ఐడియా!..ప్లేటు ఫిరాయిస్తే??


  రచన – దర్శకత్వం – ఛాయాగ్రహణం : కార్తీక్ ఘట్టమనేని
తారాగణం : నిఖిల్, త్రిధా చౌదరీ, మధుబాల, తనికెళ్ళ భరణి, సత్య, వైవా హర్ష, తాగుబోతు రమేష్, మస్త్ అలీ, సాయాజీ షిండే, రావు రమేష్  తదితరులు.
మాటలు : చందూ మొండేటి, సంగీతం : సత్య మహావీర్, గీతాలు : రామజోగయ్య శాస్త్రి, శ్రీ మణి, కృష్ణ మాదినేని, కూర్పు : గౌతం ఎన్, కళ : టి. ఎన్. ప్రసాద్, నృత్యాలు : విజయ్, యాక్షన్ : వెంకట్
బ్యానర్ : సురక్ష్ ఎంటర్ టైన్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాత : మల్కపురం శివకుమార్
 విడుదల : 5 మార్చి, 2015       సెన్సార్ : U
***

    రుసగా ఒకే స్కూలుకి చెందిన ముగ్గురు కొత్త దర్శకులతో మూడు కొత్త తరహా సినిమాలు  (స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య) చేసుకొచ్చిన నిఖిల్  నిజానికి మూస సినిమాలకి దూరం జరుగుతున్నాడు. ఇది మెచ్చదగ్గ విషయమే. తనకంటూ ఒక ప్రత్యేక స్లాట్ ని సృష్టించుకోవడం మంచి ఎత్తుగడే. అలాగని ఆ  ప్రయత్నంలో ఆర్ధిక ప్రయోజనాలే దెబ్బ తింటున్నప్పుడు ఆ ఎత్తుగడకి అర్ధం వుండదమో. మొదటి సినిమా తప్ప మిగిలిన రెండూ ఈ విషయాన్నే  చాటుతున్నాయి. ‘కార్తికేయ’ కి మంచి రెస్పాన్సే వస్తే ఎందుకు నష్టాలతో ముగిసిందో ఆలోచించుకోవాల్సి వుంది. ఇప్పుడు ‘సూర్య వర్సెస్ సూర్య’ అనే మరింత  కొత్త ప్రయోగం చాలా రిస్కులో ఎందుకు పడుతోందో కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి వుంది. గత ఏడాది ప్రారంభంలో మహేష్ బాబు అంతటి బిగ్ స్టార్ కే ‘నేనొక్కడినే’ అనే సైకలాజికల్ ప్రయోగం పట్టుబడలేదు. నిఖిల్ ఇప్పుడు నావెల్టీ పేరుతో  ఇంకో శారీరక రుగ్మతని బాక్సాఫీసు ఫ్రెండ్లీగా మార్చాలంటే ఇంకా చాలా చాలా హోం వర్క్ చేయాల్సి వుంటుంది. మరోవైపు 2011 లో ‘బద్రీనాథ్’ పరాజయ కారణాలు కూడా ఇంకా కళ్ళ ముందుండగానే, ఏరి కోరి మళ్ళీ అలాటి పొరపాటే  చేయరెవరూ. చేస్తున్నారంటే సినిమాల్ని పైపైన చూసేసి వూరుకుంటున్నట్టే- ఏ సినిమా ఎందుకు ఆడింది, ఎందుకు పోయిందనే డేటా బ్యాంకు సృష్టించుకోకుండా.

     ఈ సినిమాతో దర్శకుడుగా (దర్శకుడంటే ఈ రోజుల్లో రచయిత కూడా కాబట్టి రచయిత గానూ) మారిన ఛాయాగ్రాహకుడు కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం లో తనదైన మార్క్ ని సృష్టించుకున్నాడు. నిజానికి ముడి ఫిలిం పోయి డిజిటల్లో చిత్రీకరణ లొచ్చాక ఛాయాగ్రహణమనే కళ అందరి చేతుల్లో చిల్లరై పోయి విలువ కోల్పోయిందని ఫీల్డులోనే  అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కిందటి తరం ప్రసిద్ధ ఛాయాగ్రాహకుల్లాగా  నేనున్నానూ అంటూ ఫ్రేము ఫ్రేమునా తన మార్కు వేస్తూ ఉనికిని చాటుకున్నాడు ఘట్టమనేని. ఇది చాలా  మైలేజీ నిచ్చే మార్కే. ఐతే దర్శకుడుగానూ మారినందువల్ల చాలామంది తనలాంటి వాళ్లకి కలిసిరాని ఈ రెండు పడవల మీద ప్రయాణం లాగే,   బిగ్ స్టార్స్ సినిమాలకి ప్రమోటయితే సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుత సినిమాకి దర్శకుడుగా, ఛాయాగ్రాహకుడుగా అతను  విఫలమవలేదు- కేవలం రచయితగానే రాణించలేకపోయాడు. ఫలితంగా సినిమా పునాదిలోనే కాన్సె ప్చ్యువల్  బ్లండర్ బారిన పడింది.

      ‘సూర్య వర్సెస్ సూర్య’ లాంటి ఐడియా నిజానికి మరిన్ని ఇలాటి సినిమాలకి ట్రెండ్ సెట్టర్ అవ్వాల్సిన ఐడియా!

అర్ధరాత్రి సూరీడు
     చిన్నప్పుడే అతడి వ్యాధి బయటపడింది. పొర్ఫీరియా / జిరోడెర్మా  పెగ్మెంటోసమ్ అనే ఈ అనువంశిక రుగ్మత ప్రకారం అతను పగటిపూట ఎండలో తిరిగితే పావుగంటలో చచ్చిపోతాడు. ప్రబంధాల్లో అసూర్యంపస్య అనే ప్రయోగం వుంటుంది. అంటే అందగత్తెల్ని ఉద్దేశించి ఎండ కన్నెరగనిది అనడం. ఎండ తగిలితే కమిలిపోయేంత సుకుమారి అన్నమాట. ఇది ఎండ తగిలితే చచ్చిపోయే వ్యాధి అయి కూర్చుందిప్పుడు. అందుకని సూర్య ( నిఖిల్) పగలంతా నిద్రపోయి, రాత్రి పూట కాలేజీకి వెళ్తాడు. పగలు వర్షం పడితేనే బయటికి వెళ్ళ నిస్తుంది వాళ్ళమ్మ (మధుబాల). ఆ నైట్ కాలేజీలో అన్ని వర్గాల, అన్ని వయసుల వాళ్ళూ చదువుకుంటూ వుంటారు. వాళ్ళల్లో కిరాణా షాపు ఎర్రిస్వామి అలియాస్ ఎర్ సామ్ (తనికెళ్ళ భరణి), ఆటో నడుపుకునే అరుణ్ సాయి ( సత్య), సూర్యకి ఫ్రెండ్స్ అవుతారు. హైదరాబాద్ లో పోలీస్ ఆంక్షలే లేనట్టు నైటంతా రోడ్లమీద, హోటళ్ళ దగ్గరా ఎంజాయ్ చేస్తారు. మందు కొడతారు. తల్లికూడా ఇంట్లో వీళ్ళ మందు పార్టీల్ని అనుమతిస్తూంటుంది. వీళ్ళది ఉన్నత కుటుంబం. సూర్య చదువుకుని సంపాదించాల్సిన అవసరం లేదు.

       ఇలావుండగా ఒక టీవీ యాంకర్ సంజనా (త్రిధా చౌదరి) ని వర్చువల్ గా ప్రేమిస్తూంటాడు సూర్య. రాత్రి పూట యాంకరింగ్ చేసే ఆమె ప్రోగ్రాం కి ఫోన్లు చేస్తూంటాడు. ఇది తెలుసుకున్న ఫ్రెండ్స్ ఇద్దరూ సూర్యని ఆమెతో కలుపుతారు. వీళ్ళతో నైట్ షికార్లలో ఆమె కూడా పాల్గొంటూ సూర్యతో ప్రేమలో పడుతుంది. ఒకానొక రోజు పట్టపగలు ఆమె నెవరో టీజ్ చేస్తూంటే సూర్యకి కాల్ చేసి వచ్చి కాపాడ మంటుంది. తన వ్యాధి సంగతి ఆమెకి చెప్పని సూర్య ఇరకాటంలో పడతాడు. ఇప్పుడు వెళ్తే ఎండలో చచ్చిపోతాడు. వెళ్ళకపోతే అసహ్యించుకుంటుంది..అంతలో ఒక అద్భుతమేదో జరిగి సూర్య వెళ్లి ఆమెని కాపాడేస్తాడు. ఆ తర్వాత గిల్టీగా  ఫీలై , ఫ్రెండ్స్ ని పంపిస్తాడు నిజం చెప్పేయమని. నిజం తెలుసుకున్న సంజన, రోగిష్టి సూర్య ప్రేమని వదులుకుంటుంది. ఇదీ సమస్య. తిరిగి ఈమె ప్రేమని సూర్య ఎలా గెలుచుకున్నాడనేది మిగతా కథ.

ఎవరెలా చేశారు
      నిఖిల్ కొత్త కొత్త పాత్రల్లో కన్పిస్తున్నాడు బాగానేవుంది. ఆ పాత్రల లోతు పాతుల్లోకి కూడా వెళ్ళ గలిగితే పాత్రలు నిలబడతాయి, తనూ నిలదొక్కుకుంటాడు. ప్రస్తుత పాత్రకి సంబంధించి ఒక ప్రేమికుడిగా ఎలా మానసిక సంఘర్షణకి లోనయ్యాడన్నది మాత్రమే కాదు పాయింటు, ఒక ఎండ పొడ గిట్టని బాధితుడిగానూ ఎలా స్ట్రగుల్ చేశాడన్నది కూడా ప్రశ్న. దీని ఛాయలే  పాత్రలో కన్పించనప్పుడు గుర్తుండిపోయే పాత్ర అవజాలదు. కేవలం నైట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న లవర్ బాయ్ గా మాత్రమే మిగిలిపోతాడు. ఇలా రొటీన్ గా మిగిలిపోయిన నిఖిల్ నటనలో కొత్తదన మేముంటుంది - ఇమేజీ మేకోవర్ తప్ప.

        హీరోయిన్ త్రిధా చౌదరికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో భావాలు పలికించే సామర్ధ్యం వుంది. అయితే సెకండాఫ్ లో మరీ ఆమె పాత్ర విషాదం లోకి జారుకోకపోయి వుంటే బావుండేది. ఈ సినిమాలో ఆద్యంతం కామిక్ రిలీఫ్ తనికెళ్ళ భరణియే. కుర్ర వేషాలతో ఆయన అలరించాడు. సత్య, హర్షాల కామెడీ కూడా కొత్త తరహా సీన్లతో హుషారెక్కించింది. ఇక మరో ఆటో డ్రైవర్ పాత్రలో ‘హైదరాబాద్ నవాబ్స్’ ఫేమ్ మస్త్ అలీ తెలుగుర్దూ శ్లాంగ్ కామెడీతో ఫ్రెష్ నెస్ తీసుకొచ్చాడు.

       పైన చెప్పుకున్నట్టు దర్శకుడి ఛాయాగ్రహణంతో బాటు, సత్య మహావీర్ సంగీతం ఒక హైలైట్ గా నిల్చింది. అన్ని పాటలూ క్యాచీగా వున్నాయి. చాలా కాలం తర్వాత మంచి సాహిత్యంతో, నృత్యాలతో, చిత్రీకరణలతో పాటలు కథని ఎలివేట్ చేసేంత బలంగా వున్నాయి. అయితే కథే ఈ బలానికి సరితూగలేదు.

స్క్రీన్ ప్లే సంగతులు
    “నీకోసం, నీకోసం భగ భగ సూర్యుడు మాయమైపోడా...నీకే నువ్వు కవచానివై కదలాలంటా కదనానికే ..ఎదురడుగేసి సుడిగాలివై తెంచెయ్యాలి సంకెళ్ళనే.. గ్రహణమై గ్రహణమై కాంతికి ముసురు వెయ్యరా.. రాహువై  రాహువై  రగిలే సూర్యుడు శక్తి  లాగెయ్యరా..నీలో విశ్వాసం వుంటే నీదే ఈ విశ్వం..” (శ్రీమణి / కార్తీక్)
      ఇలా సాగే పాటకి కథ అందించిన బలమేమీ లేదు. ఊరికే పాట రెచ్చిపోతూ హీరోని ఆకాశాని కెత్తేస్తోంది. కీలకమైన ఇంటర్వెల్ యాక్షన్ సీన్లో ఈ బ్యాక్ గ్రౌండ్ పాట ఏదో హీరోని ఆదుకుంటూ ప్రకృతి కరుణించి వర్షం కురిపిస్తే, ఆ గొప్పంతా హీరోకి ఆపాదిస్తూ ప్రకృతి మీద కవితా పంక్తులు పేల్చడం అర్ధరహితంగా వుంది. అసలే కథాపరంగా ఇంటర్వెల్ సీన్ తేలిపోయిందనుకుంటే, బిల్డప్ తో ఈ పాటొకటి!

       ఈ కీలక సన్నివేశంలో తనని కాపాడమని హీరోయిన్ అడుగుతోంది. వెళ్తే ఎండలో చనిపోతాడు. ‘వెళ్ళూ..నువ్విపుడు ఇలాగే వెళ్ళాలి..నీ ప్రేమకోసం నువ్వేమైనా అయిపోవాలి.. వెళ్ళూ.. ఇప్పుడైనా ఆ సూర్యుణ్ణి ఎదిరించి వెళ్ళు...అప్పుడే ఈ కథని ఎక్కడికో తీసికెళ్ళి పోతావ్ –నువ్వు హీరోవి, ఇలాటి సాహసమే చెయ్యాలి!  What is character but determination of incident? And what is incident but the illumination of character? ( Henry Williams) అని మనకి ఆవేశం రగిలిపోతూంటే, ఇంకా తటపటాయిస్తూనే వుంటాడు. ఇక్కడే పాత్ర ఫెయిలయ్యిందనుకుంటే, ఇతన్ని అప్పనంగా కాపాడేస్తూ దర్శకుడు జొరబడి జోరుగా వర్షం కురిపించేస్తాడు- ఓహ్ గాడ్! – సీను మాంచి కాక మీదుంటే, ఆ సీను మీదా  హీరోయిజం మీదా ఉన్నట్టుండి నీళ్ళు గుమ్మరించేశాడు దర్శకుడు! ఇంకేముంది- సూర్యుడే  లేని ఆ కురిపించుకున్న వర్షంలో, వీరాధి వీరుడిలా మనవాడు పోరాటానికి వెళ్తోంటే,  ప్రకృతిని ‘ఇరగదీస్తూ’ పై పాట! ఎంత మిస్ మేనేజ్ మెంట్!

      కథ సాంతమూ ఇలాటి కన్ఫ్యూజనే వుంది.

      ఈ తరహా జెనెటిక్ వ్యాధితో  అమెరికాలోనూ, యూరప్ లోనూ అనేక టీవీ సిరిస్ లు, షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ లు, బాలల సినిమాలు, నవలలూ  వచ్చాయి- ఇంకా వస్తూనే వున్నాయి. డీన్ కూంజ్ ఇలాటి వ్యాధితో ఒక పాత్రని సృష్టించి మూడు థ్రిల్లర్ నవలలు రాశాడు.
2013 లో వచ్చిన ‘డూమ్ అండ్ గ్లూమ్’ అనే నవల్లో ఈ  వ్యాధి బారిన పడ్డ పన్నెండేళ్ళ కుర్రాడు కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోడు. సహజంగా ఆ వయసుకి వుండే తెగువ కొద్దీ తయారు చేసుకున్న సోలార్ సూటు తొడుక్కుని, పట్టపగలు ఎండలో సూపర్ హీరోలా సాహసకృత్యాలు చేస్తూంటాడు, రిస్కులో పడుతూంటాడు. ఈ పాత్ర చిత్రణతో సూర్య పాత్రని పోల్చగలమా?

         ఐడియా ఒకటయితే కథనం మరొకటి కావడం ఈ స్క్రీన్ ప్లే ప్రధాన లోపం. ఎత్తుకున్న ఐడియాకి ( పాయింటుకి) కట్టుబడి ఉండని ఒక్క తెలుగు సినిమాల్లోనే కన్పించే జాడ్యం మరోసారి ఇక్కడ జడలు విప్పుకుంది. గతంలో ‘బద్రీనాథ్’ అనే భారీ చలనచిత్రం ఈ కారణంగానే పరాజయం పాలయ్యింది. దీనిదీ ‘సూర్య వర్సెస్ సూర్య’ లాగే అసామాన్య కాన్సెప్ట్. రెండూ భారతీయ వెండితెర మీద ఇంతవరకూ రాని కాన్సెప్ట్సే.  ‘బద్రీనాథ్’ ఎత్తుగడలో పూర్వం విదేశీ దురాక్రమణ దార్లు దేశంలో దేవాలయాల్ని కొల్లగోడితే, ఇప్పుడు టెర్రరిస్టులు ఆ పని చేస్తున్నారంటూ అక్షరధాం ఉదంతాన్ని ఎత్తిచూపుతూ, ఈ పుణ్య క్షేత్రాల సంరక్షణకి హీరోని నియమిస్తూ కథ ప్రారంభిస్తారు. అంటే అపూర్వంగా ఇండియన్ టెంపుల్స్ వర్సెస్ టెర్రరిజం కథని చూపబోతున్నారని ఉత్సుకతని పెంచేశారు! తీరా చూస్తే, ఇదంతా పక్కకు తోసేసి, హీరోయిన్ ని ఎంటర్ చేయగానే ప్రేమ కోసం హీరో ఆమె వెంట పడే, వీళ్ళని ఫ్యాక్షనిస్టులు అడ్డుకునే పాత మూస ఫార్ములాలోకి ప్లేటు ఫిరాయించేసి, సూపర్ సోనిక్ స్పీడుతో అట్టర్ ఫ్లాపు దిశగా దూసుకుపోయారు!

         ఇంకో విచిత్రమేమిటంటే, విదేశీ దురాక్రమణ దార్ల మీదా, టెర్రరిస్టుల మీదా అంత ధ్వజమెత్తుతూ ప్రారంభమైన కథ చివరి కొచ్చి- స్వమతస్థులే దేవాలయం మీద తెగబడి మారణహోమం సృష్టించే దృశ్యాలతో ఠారెస్తుంది. ఇలా స్వమతస్థులే గుళ్ళ మీద పడి తెగ నరుకుతున్నట్టు చూపిస్తున్నప్పుడు, అన్యమతస్థుస్తల మీద ఆరోపణ లేమిటో అర్ధంకాని గందరగోళం సృష్టించింది అంత భారీ సినిమా కథ కూడా!

         ప్రస్తుత సినిమా కూడా ఇంతే. జీవితాంతం నిశాచరుడిగానే ఉండిపోవాల్సిన హీరోని ప్రేమించిన హీరోయిన్ కి ఆ విషయం తెలిస్తే ఏమౌతుందన్న పాయింటు కాస్తా పక్కకెళ్ళిపోయి, సవాలక్ష ప్రేమ సినిమాల్లో చూసేసిన రొటీన్ కమ్యూనికేషన్ ప్రాబ్లం కథగా మారిపాయింది. ఇది కూడా బలంగా చూపాలని లేకుండా, ఇంకా సినిమా కథల్ని ఇలా పైపైన చెప్పేస్తే సరిపోతుందన్న మైండ్ సెట్ తోనే కొత్త దర్శకుడు కూడా వుండడం విచారకరం.

         వ్యాధి తాలూకు కథాకమామిషూ తో ప్రేక్షకులకి కొత్త లోకాల్ని పరిచయం చేసే బంగారు అవకాశాన్ని వదులుకున్నారు. ఒక్కసారైనా హీరో ఎండలోకి వెళ్తే ఏమౌతుందో చూపించలేదు. అసూర్యంపస్య అయిన ప్రబంధ నాయికలా వుంచేశారు. ఎండలోకి వెళ్ళాలంటే హీరోకి ఎంత భయమో, కథలోకి వెళ్ళాలంటే దర్శకుడికి అంత భయంలా వుంది.

          ఈ కథది స్ట్రక్చర్ కోల్పోయిన మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే. అంటే కథకి వెన్నెముక లాంటి మిడిల్ విభాగం నామ మాత్రమన్నమాట. ప్రేమలో హీరో హీరోయిన్లు విడిపోయే ప్రధాన మలుపు వచ్చేసరికే సెకండాఫ్ లో పడింది కథ. అంటే బిగినింగ్ విభాగం మిడిల్ విభాగపు అసలు ఆటస్థలాన్ని దురాక్రమిస్తూ పట్టు కోల్పోయి, ఇంటర్వెల్ కూడా దాటిపోయిందన్న మాట- ఇలా స్ట్రక్చర్ లేని కథ ఎంత విసిగిస్తుందో ఈ సినిమా సెకండాఫ్ నుంచీ చూసి తెలుసుకోవచ్చు.

           విడిపోయిన కారణంలో కూడా స్పష్టత, బలం లేకపోవడం వల్ల ముగింపు అలా అభాసయ్యింది. ( బలహీన సమస్య ఏర్పాటు = బలహీన ముగింపు). ఇక లాభం లేదని హీరో ఆమెకి తన వ్యాధి గురించి చెప్పేయాలనుకున్నాడు. అలా తనే చెప్పకుండా ప్రబంధ నాయికలా ఫ్రెండ్స్ చేత చెప్పించాడు. అప్పుడామె విడిపోయింది. ఎందుకు విడిపోయింది? వ్యాధి గురించా? ముందే చెప్పనందుకా? ఏదైనా తనని ఆ దేవుడు కురిపించిన వర్షంలో వచ్చి కాపాడాడుగా? వర్షం కురవకపోతే వచ్చేవాడా అని డౌటా? అది ఊహాజనిత డౌటు. అయినా ఇదంతా ఎందుకు,  తను సగటు అమ్మాయి కాదు.  మనుషుల పట్ల, సమాజం పట్లా అవగాహన వుండే మీడియా వృత్తిలో వుంది. అలాటి తను ఎవరో పోకిరీలు తన యాంకరింగ్ ని ఆటలు పట్టించారని హుందాతనం కోల్పోయి, సంకుచితంగా హీరోని పిలిపించి కొట్టించడం లోనే అర్ధంలేదు. అలాగే హీరో వ్యాధిని దాచాడనీ, లేదా వ్యాధి ఉన్నందున పనికి రాడనీ భావించడం లోనూ పాత్రౌచిత్యం దెబ్బతినిపోయింది. ఇక విడిపోవడం అర్ధమే లేనిది!  

           హీరో కూడా వర్షం కురవకపోతే ఏం చేసేవాడు? ఆమె ప్రమాదంలో ఉన్నానూ రమ్మంటూంటే సందిగ్థంలో పడ్డాడు. కొన్ని క్షణాల తర్వాత భారీ వర్షం ప్రారంభమైంది. ఒక్కసారి అంత భారీ వర్షం మొదలైందంటే అంతకి ముందు ఆకాశం మేఘావృతమై ఉన్నట్టే. వర్షం పడితేనే వెళ్ళాలా? మబ్బులు కమ్మితే వెళ్ళ కూడదా? పోనీ, ఈ లాజిక్ కూడా తీసేసి సీన్ ని ఖూనీ చేస్తూ మూస ఫార్ములా ప్రకారమే ఇంకోలా చూద్దాం- హీరో అనేవాడు ఏం చేస్తాడు? అది ప్రేమిస్తున్న అమ్మాయే కానక్కర్లేదు, ఓ ఆడపిల్ల అపాయంలో వున్నానని ఫోన్ చేస్తే చాలు, ముందూ వెనుకా చూడకుండా కాపాడేస్తాడు. లేకపోతే వాడి జీవితానికి అర్ధమే లేదు. ఇదే మనం ఆశించి ఈ సీన్లో అంత ఆవేశ పడిపోయాం- వెళ్ళరా బాబూ అని!

          ఇలాటి అవకతవక పాత్ర చిత్రణల నేపధ్యంలో లవ్ లో బ్రేకప్ చూపిస్తే ఏమవుతుందో అదే జరిగింది ఈ సినిమాలో.  ఇలా ఏ సూత్రాల ఆధారంగా ఈ ఇన్నోవేటివ్ ఐడియాని కథగా విస్తరించారో, ఆ కథకి కథనం చేశారో, పాత్రల్ని నడిపించారో, ఒడ్డుకి చేర్చారో అదైనా పరిశీ లించుకుంటే మున్ముందు పనికొస్తుంది.

           సెకండాఫ్ లో మస్త్ అలీ చేత ఎలాగో మొహం పెట్టించి ఒక డైలాగు చెప్పించారు – ఫస్టాఫ్ స్వీట్ పాన్ లా వుంది, సెకండాఫ్ ప్చ్ సాదాగా వుందని! అంటే ఇది తెలిసే సినిమా తీశారన్న మాట!!

సికిందర్

అనుబంధంగా ‘బర్ఫీ’ ఎలా తీశారో ఈ కింద చూద్దాం...

విషాదం కాదు, వినోదమే!

      విషాదాన్నీ, శోకాన్నీ, సానుభూతినీ చూపించి సోమ్ముచేసుకునే కాలం తీరిపోయిందిప్పుడు. సినిమా అనే పాపులర్ దృశ్య మాధ్యమానికి అర్ధం ఎంటర్ టైన్మెంట్- ఎంటర్ టైన్మెంట్- ప్యూర్ ఎంటర్ టైన్మెంట్ మాత్రంగానే స్థిరపడిపోయిందిప్పుడు. ‘డర్టీ పిక్చర్’ లో  విద్యాబాలన్ పాత్ర అన్నట్టుగా, ఎంటర్ టైన్మెంట్ తప్పించి ఏ గాంభీర్య ప్రదర్శనా అనవసర ప్రేలాపనే!

      నిజానికి గతంలోకి చూస్తే, విషాదాన్ని లైట్ తీసుకోవడం ఏనాడో తన మాస్టర్ పీస్ ‘ప్యాసా’ తోనే  చేసేశాడు గురుదత్ దిగ్విజయంగా. ప్రతి అలాటి ఘట్టాన్నీ కేవలం ఒక టీవీ జర్నలిస్టు చేసే రిపోర్టింగ్ చందంగా మాత్రమే చూపించి కట్ చేసేస్తాడు. ఇంకే ఏడ్పులూ మెలోడ్రామాలూ నహీ చల్తా. దీన్నే మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ కథనమన్నారు పండితులు. మతులు పోగొట్టే తరహా కథనమిది. ఇంతకాలం దీన్ని మరే దర్శకుడూ  ప్రయత్నించకపోవడం విషాదమే.

      ఇప్పుడు దీన్ని అనురాగ్ బసు సాధించాడు. ‘మర్డర్’, ‘గ్యాంగ్ స్టర్’, ‘ఏ లైఫ్ ఇన్ మెట్రో’ లాంటి హిట్స్ తో కథా కథనాల మీద, మనస్తత్వాలూ భావోద్వేగాల  పైనా మంచి పట్టున్న దర్శకుడుగా రుజువు చేసుకున్నాక, ఇప్పుడు తాజాగా అనితర సాధ్య ప్రయోగమొకటి చేసి చూపించాడు – మొదలంటా విషాదం మెడలు వంచచేసి పూర్తి వినోదంగా మార్చేశాడు!

       సినిమాల్లో ద్వంద్వాల పోషణ హస్యపాత్రల చిత్రణకి తప్పనిసరి తద్దినమయ్యాక, నేపధ్యంలో విషాదం తాండవించడం మొదలయ్యింది. అలా అయితేనే హాస్యం రాణిస్తుందనుకునే వాళ్ళు. పాత్ర దాని అంతరంగంలో గూడు కట్టుకున్న విషాదాన్ని అనుభవిస్తూనే, ఆ విషాదాన్ని అధిగమించడానికి రకరకాల హాస్య ప్రహసనాలకి తెరతీసే ప్రక్రియ ఇలా పారంపర్యంగా వస్తూ వుండిన నేపధ్యంలో,  చందన్ మిత్రా వచ్చేసి ‘మై మేరీ పత్నీ ఔర్ వో ’ తీశాడు. పొట్టి వాడైన  అర్భక  భర్తకి తన పొడగరి అయిన భార్య అంటే చచ్చేంత ఆత్మనూన్యతా భావం. దీన్ని కవర్ చేసుకునేందుకు వెర్రిమొర్రి చేష్టలూ, చివరికి తన ఈ హిపోక్రసీ అంతా తనే భరించలేక భోరు మనెయ్యడం. ఇలాటి కామెడీలు చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడు విషాదం లోంచి హాస్యం పుడుతుందనే పూర్వ నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ –ఎలాటి ఈ ద్వంద్వాల ప్రదర్శనా లేని ఏకోన్ముఖ ఏక్  నిరంజన్ పాత్రతో, నసలేని పసగల ఆరోగ్యకర కామెడీ సృష్టించాడు అనురాగ్ బసు!

    ఈ బర్ఫీ ( రణబీర్ కపూర్) అనేవాడు పుడుతూనే అమ్మని హరీ మన్పించాడు. 1970 లకి పూర్వమెప్పుడో ఆ అమ్మకి ఒకటే కోరిక వుండేది. తను కంటే మర్ఫీ రేడియో లోగోలో వుండే బుడతడు లాంటి వాణ్ణే కనేసి, పేరు కూడా మర్ఫీ అనే పెట్టుకుని ముద్దు చేయాలని. అయితే వాణ్ణి కంటూనే బాల్చీ తన్నేసింది ( రేడియో ఆన్ అయింది, మమ్మీ ఆఫ్ అయిందనే పాట!). ఐతే ఈ పుట్టిన మర్ఫీ గాడికి మాటలే రావు. చెవులు కూడా విన్పించి చావవు. పుట్టు మూగా – చెవిటి  అయినా, తన మనసు భాష అర్ధంజేసుకు చావాల్సిన ఖర్మ ఈ లోకానికే పట్టిందన్నట్టు కేర్ లెస్ గా తిరుగుతూంటాడు.



       అదే డార్జిలింగ్ పట్టణంలో ( ఈ కథాకాలం 1970-76 మధ్య ) శృతి ( ఇలియానా) అనే అమ్మాయి దిగుతుంది. కలకత్తాలో ఈమెకి  క్లాస్ మేట్ తో పెళ్లి నిశ్చయమై వుంది. కానీ ఇక్కడ బర్ఫీని చూసి ప్రేమలో పడకుండా ఉండలేక పోతుంది. ఈ ప్రేమతో తల్లికి దొరికిపోతుంది. గతంలో తల్లిది కూడా ఈ కూతురి లాంటి దొంగ ప్రేమే. దాంతో అనుభవించింది కూడా. కనుక కూతుర్ని వారిస్తుంది. ఈ పరిస్థితుల్లో బర్ఫీ స్టయిలుగా  వచ్చేసి, పెళ్లి విజ్ఞాపన పత్రం చదివి విన్పించేసి తిట్లుతిని, తనదైన శైలిలో మనసు ( సైకిలు ని కూడా) విరిచేసుకుని అవతలపడేసి వెళ్ళిపోతాడు. అతడికి ఒకవైపు చిన్ననాటి స్నేహితురాలైన  మానసిక వికలాంగురాలు ఝిల్ మిల్ ( ప్రియాంకా చోప్రా) ఉండనే వుంది. కానీ ఈమెని కలుసుకోవడం ఇప్పుడు కుదరడం లేదు. తాతగారి హవేలీ లో ఎటూ వెళ్ళలేని ఒంటరి ఆమె. పైగా ఈ ఆస్తంతా తాత తనకే  రాసిచ్చినందుకు తండ్రి ( ఆశీష్ విద్యార్థి ) కి తనమీద చెప్పలేని కసి.  ఈ నేపధ్యంలో ఒకనాడు బర్ఫీ తండ్రికి అర్జెంటుగా చేయాల్సిన ఆపరేషన్ కి డబ్బు ఎక్కడా పుట్టక, తిక్కరేగి ఝిల్ మిల్ ని కిడ్నాప్ చేసి పడేస్తాడు. దీంతో అందరి కథలూ అడ్డం తిరిగిపోతాయి!

        ఓ అర్ధవంతమైన హాస్యానికి కేరాఫ్ అడ్రసుగా మారిన ఈ సినిమా ఫ్లాష్ బ్యాకుల సమాహారంగా వుంటుంది. సినిమాకి ఇదే పెద్ద బలం. ఇలియానా దృష్టి కోణంలో ప్రేమ కథగా ఒక ఫ్లాష్ బ్యాక్, రణబీర్ పాయింటాఫ్ వ్యూలో కిడ్నాప్ కథగా ఇంకో ఫ్లాష్ బ్యాక్, సౌరభ్ శుక్లా (ఇన్స్ పెక్టర్ పాత్ర)  స్వగతంలో కిడ్నాప్ మిస్టరీ విప్పే కథగా మరింకో ఫ్లాష్ బ్యాక్ వుంటాయి. అయితే ఈ చివరి ఫ్లాష్ బ్యాక్ లో కిడ్నాప్ మిస్టరీ, దీని విశ్లేషణా మరీ ఎక్కువై పోయి ఫోకస్ ని దెబ్బ తీస్తాయి. కథకి ఈ మిస్టరీ  అంతగా అవసరం లేదు. దీని వల్ల  ప్రధాన పాత్రలు మూడింటి మధ్య ప్రేమకథ బ్రేకులు పడుతున్నట్టయ్యింది.సత్యజిత్ రే అప్పూ ట్రయాలజీ డిటెక్టివ్ కథనాల పట్ల ఆకర్షితుడై దర్శకుడు దీనికి పాల్పడ్డాడేమో అన్పించేట్టు వుంది. ఆ పరిసరాల వాతావరణ సృష్టి కూడా అలాగే వుంటుంది. దీని వల్ల సినిమా ఆరంభ మధ్యమాల కంటే కూడా ముగింపు ఉన్నత స్థాయి కళాప్రదర్శన చేయాలన్న సూత్రీకరణ గాల్లో కలిసిపోయింది.

     అయితే ఏ ఫ్లాష్ బ్యాక్ లోనైనా కామెడీ కే పెద్ద పీట వేశాడు దర్శకుడు. నటనాపరంగా రణబీర్ లో చాప్లిన్ నే చూస్తున్నామా, మిస్టర్ బీన్ నే చూస్తున్నామా అన్నంత ప్రతిభావంతంగా పోషించాడు మూగ –చెవీటి పాత్రని. తను ఏ స్థాయి నటుడో గత ‘ రాక్ స్టార్ ‘ లోనే నిరూపించాడు. ప్రియాంకా చోప్రా అయితే తానొక స్టార్ అన్న సంగతే గుర్తు రానంత సీరియస్ గా ఈ డీ- గ్లామరైజ్డ్ పాత్రలో పరకాయప్రవేశం చేసింది. ఇలియానాని బహుశా  తొలిసారి చీరా, కట్టూబొట్లతో సామాన్య యువతిగా చూస్తాం. చాలా చాలా కాలం తర్వాత బాలీవుడ్ నుంచి ఒక క్వాలిటీ సినిమా ఈ ‘బర్ఫీ’ ఏడేళ్ళ క్రితం నిజజీవితంలో క్యాన్సర్ బారిన పడ్డ అనురాగ్ బసు, ఇండియన్ సినిమా మూస ఫార్ములా ముడతల్ని వదిలించి యూత్ నెస్ ని పులమడానికే ఆ క్యాన్సర్ ని జయించి పునర్జన్మెత్తాడేమో!

సికిందర్
(సెప్టెంబర్ 2012, ‘ఆంధ్రభూమి వెన్నెల’)