రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, జూన్ 2017, శనివారం

డార్క్ మూవీస్ ఎలిమెంట్స్ - మరికొన్ని ఎగ్జాంపుల్స్ : 


*********************************************************************************************

రివ్యూ!

దర్శకత్వం: .ఆర్‌.కె.శరవణన్
తారాగణం: ఆది పినిశెట్టి, నిక్కీ గర్లాని, ఆనంద్ రాజ్, రాం దాస్, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం తదితరులు
సంగీతం: దిబు నినన్థామస్ఛాయాగ్రహణం: పివి శంకర్
బ్యానర్స్ : రిషి మీడియా, శ్రీచక్ర ఇన్నోవేషన్స్
విడుదల : జూన్ 16, 2017
***
          ‘మలుపు’, ‘సరైనోడు’ లతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకున్న తెలుగు వాడైన తమిళ హీరో  ఆది పినిశెట్టి మరోసారి  ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తన సీరియస్ సినిమాలకి భిన్నంగా తమిళ ‘మరగద నాణయం’ డబ్బింగ్  ‘మరకతమణి’ తో ఈసారి ఎంటర్ టైన్ చేయడానికి వచ్చాడు. కొత్త దర్శకుడు ఏ ఆర్ కె  శరవణన్ కి అవకాశమిచ్చి  ఇద్దరి భవిష్యత్తూ తేల్చుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఎంటర్ టైన్ చేయడానికి  అది పినిశెట్టికి నిజంగా అంత టాలెంట్ వుందా? కొత్తదనం కోసం ప్రయత్నించిన శరవణన్ కి నిజంగా అంత సమర్ధత వుందా? ఈ రెండిటిని బట్టే ఈ మూవీ ప్రేక్షకులని అలరించడం వుంటుంది. ఇదెంతవరకూ సాధ్యమైందో చూద్దాం...

కథ
   అనంత పురం నుంచి హైదరాబాద్ వస్తాడు రఘు నందన్ ( అది పిని శెట్టి). వూళ్ళో చేసిన అప్పులు తీర్చడానికి హైదరాబాద్ లో మిత్రుడు బుచ్చి పనిచేస్తున్న  స్మగ్లింగ్ గ్యాంగ్ లో చేరతాడు. ఈ గ్యాంగ్ బాస్ (రాందాస్) చిన్న చిన్న పనులే చేయిస్తూంటాడు. ఇలా అయితే అప్పులు తీరవని పెద్ద పనే  చేయాలనీ రఘునందన్ ఒప్పిస్తాడు. చైనా నుంచి వచ్చిన ఒకడు మరకతమణి కోసం జాన్ అనే వాణ్ణి ఆశ్రయిస్తాడు. ఆ మణి  జోలికిపోతే ప్రాణాలు పోతాయని వారిస్తాడు జాన్. విక్రమాదిత్య కాలానికి చెందిన ఆ మణి కోసం ప్రయత్నించిన 132 మంది ఇంతవరకూ చనిపోయారని అంటాడు. రఘునందన్ వచ్చి ఈ పని చేసి పెడతానంటాడు. అతడి ధైర్యానికి  పది కోట్లు ఆఫర్ చేస్తాడు చైనీయుడు.

          రఘునందన్ అలేఖ్య (నిక్కీ గల్రానీ) ని మూగగా ప్రేమిస్తూంటాడు. ఆమెకి ఎంగేజ్ మెంట్ అయిపోతుంది.  ఈ బాధలో వుండగా, రాందాస్ చనిపోతాడు. అతణ్ణి పూడ్చిపెట్టి ఒక స్వామీజీ (కోటశ్రీనివాస రావు)దగ్గరికి పోతారు రఘునందన్, బుచ్చిలు. ఆ స్వామీజీ చావకుండా మణిని దక్కించుకునే మార్గం చెప్తాడు. ఆ ట్రిక్కు ప్రయోగిస్తే మణి కోసం ప్రయత్నించి చనిపోయిన 132  మంది ఆత్మలూ వచ్చేస్తాయి. వాళ్ళల్లో బుచ్చిగాడి  మావయ్య ఆత్మ  వచ్చేసి రాందాస్ శవంలో దూరుతుంది. రాందాస్ లేచివచ్చి వీళ్ళతో రఘునందన్, బుచ్చిలతో కలుస్తాడు.  ఇంకో మూడు శవాల్లో ఆత్మల్ని ప్రవేశపెడితే అవికూడా మణిని కనిపెట్టడానికి తోడ్పడతాయని  రాందాస్ అనేసరికి, ఆ మూడు శవాల కోసం వెళ్తారు. మూడో శవంగా  వురేసుకుని వుంటుంది అలేఖ్య. 

          ఈ నడిచే శవాలతో రఘునందన్ మణి ని ఎలా కనిపెట్టాడన్నది మిగతా కథ. ఇందులో ట్వింకిల్ రామనాథం ( ఆనంద్ రాజ్) అనే ఇంకో గ్యాంగ్ బాస్ పాత్రేమిటన్నది కూడా ఈ మిగతా కథలోనే చూడాలి. 

ఎలావుంది కథ 
      రకరకాల జానర్స్ ని కలిపేసి అల్లేశారు. యాక్షన్ తప్ప క్రైం, హార్రర్, ఫాంటసీ, డార్క్ కామెడీ మొదలైన వాటితో  ఈ కథ నడిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టు వుండదు, ఎలా తోస్తే అలా గట్ ఫీలింగ్ మీద ఆధారపడి కథ అల్లుకు పోయినట్టు అన్పిస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఈ జానర్ల కలబోతకి పాల్పడి వుంటే అది వేరేగా వుండేది. ఈ జానర్స్ అన్నిటినీ  చలనంలోకి తేవడానికి అవసరమైన యాక్షన్ అనే జారుడుబల్ల పైకి చేర్చే ప్రయత్నం జరిగేది. ఇలా జరక్కపోవడంతో ఎక్కడేసిన గొంగళిలా వుండే ఉత్త  డైలాగ్ కామెడీ గా మారింది. 

          నడిచే శవాల్ని చూపించడం కొత్తదే. హాలీవుడ్ లో చాలా పూర్వం నుంచీ ‘జాంబీ’ సినిమాలున్నాయి. గత సంవత్సరమే పదికి పైగా వచ్చాయి. తెలుగులో వీటి  మీద ఎవరి దృష్టీ పడలేదు. తెలుగులో రొటీన్ హార్రర్ కామెడీకి  బదులుగా  ఈ అయిడియా ఉపయోగించుకోమని చెప్తే భయపడ్డాడొక దర్శకుడు. ‘మరకతమణి’ ఈ అయిడియాని తెలిసో తెలీకో ఉపయోగించుకుంది. పక్కోడు ముందుకు పోతోంటే తెలుగు దర్శకులు బల్లగుద్ది కుంభనిద్రకే పెద్ద పీట వేస్తారు. ఆ పీట మీద గుర్రు పెట్టి కుంభ నిద్రోతూ ఇంకా ఇంకా అవే హార్రర్, రోమాన్సుల  అట్టర్ ఫ్లాపు కలలు కమ్మగా, ఇష్టంగా కంటూ వుంటారు.

          జాంబీ ( zombie) దక్షిణాఫ్రికా తెగల వూడూ మంత్రకళ. పూడ్చిన శవాల్ని వూడూ మంత్రంతో లేపి బానిసలుగా పనులు చేయించుకుంటారు. ఈ నడిచే శవాలు మాటాడవు, మరమనుషుల్లా వుంటాయి. వీటికి మాటలు జోడించి ఫాంటసీలు సృష్టించి సొమ్ములు చేసుకుంటోంది హాలీవుడ్. ‘మరకతమణి’ ఈ అయిడియా హాలీవుడ్ ని చూసి ఉపయోగించుకున్నట్టు కూడా అన్పించదు. ఏదో అల్లుకు పోతూంటే తగిలినట్టు అన్పిస్తుంది. లేకపోతే  ఈ కథ జాంబీ యాక్షన్ గా కొత్త పుంతలు తొక్కి రికార్డుల కేక్కేది. 

ఎవరెలా చేశారు 
     ఆది పినిశెట్టి కామెడీ చేస్తే ఎలా వుంటుందో తెలీదు. ఆ అవకాశం అతడికి లేకుండా పక్క పాత్రలన్నీ చేసేశాయి. కాబట్టి  ఈ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ ఏదైనా వుంటే అది మిగతా అన్ని పాత్రల పుణ్యమే. రాందాస్, ఆనంద్ రాజ్, అతడి ఆసిస్టెంట్స్, రెండు నడిచే శవాల నటులు, ఇంకా హీరోయిన్ నిక్కీ గిల్రానీ వీళ్ళే ఈ కథ ముందుకు నడవని కామెడీ డైలాగులతో నవ్వించే ప్రయత్నం చేస్తారు. ‘అది మేడిన్ చైనా- అప్పుడప్పుడు పేల్తుంది. ఇది మేడిన్  ఇండియా-  ఎప్పుడు పడితే అప్పుడు  పేల్తుంది’ అని ఆనంద్ రాజ్ నవ్వించే  లాంటి ఇన్స్ పైరింగ్ డైలాగులు కూడా అది పినిశెట్టి కి లేకపోవడం విచారకరం. అతడివి పరిమితమైన ఎక్స్ ప్రెషన్స్. కామెడీ కష్టం. కామెడీ చేయకా, యాక్షన్ కీ దిగక- కథని కూడా నడిపించక పాసివ్ గ వుండిపోయే పాత్ర పోషించాడు.

          చనిపోయిన హీరోయిన్ లో మగ ఆత్మ దూరడంతో ఆమె మగ గొంతుతో మాట్లాడడం మొదట ఎబ్బెట్టుగా అన్పించినా,  తర్వాత్తర్వాత అలవాటై పోతారు ప్రేక్షకులు. మగ గొంతుతో రఫ్ గా వుండే హీరోయిన్ కి మగ గొంతు  బదులు,  ఆ రఫ్ నెస్ కోసం ఏ తెలంగాణా శకుంతల గొంతు పెట్టినా బావుండేది. మగ గొంతుతో అదీ తెలంగాణా యాస హీరోయిన్ మాట్లాడడం మాత్రం క్రియేటివిటీ కాదు, ఫన్ క్రియేట్ చెయ్యదు.

          స్వామీజీగా కోట శ్రీనివాసరావులో మునపటి చైతన్యం లేదు. ఆయన మీద సీను ప్రారంభమే నీరసంగా వుంటుంది. చివర్లో వచ్చే బ్రహ్మనందం కూడా నవ్వించే బదులు అపార సానుభూతి పొందుతారు. తెలుగు డబ్బింగ్ లో రెండు తెలుగు ముఖాలైనా వుండాలని పట్టుబట్టి వీళ్ళని పెట్టినట్టుంది. దర్శకుడి టేస్టు నిరుపమానం. 

          కెమెరా వర్క్ బావుంది. కానీ ఆడియోలో వున్న ఐదు పాటలు లేవు. రెండే వున్నాయి. ఆడియోలో వున్న యుగళగీతాలు హీరోహీరోయిన్ల మీద లేకుండా విగత గీతాలై పోయాయి.  

          హార్రర్ దృశ్యాల గ్రాఫిక్స్ ఫరవాలేదు. ఆత్మలన్నీ వచ్చి చుట్టూ నిలబడే గ్రాఫిక్స్ తో కూడిన రెండు సీన్లు బావున్నాయి. అలాగే హత్యలు చేసే కిల్లర్ లారీకి ఇచ్చిన హార్రర్ లుక్ బావుంది. విక్రమాదిత్య సమాధిలో విక్రమాదిత్య ఆస్థిపంజరాన్ని చూపించకుండా వుండాల్సింది. ఎముకల గూడు చూపించడంతో మిస్టీరియస్ ఫీలింగ్ ని, రాజుపట్ల భయభక్తుల్ని దెబ్బ తీసి నట్టయింది.

చివరికేమిటి 
     ప్రమాదకరమైన మరకతమణి కోసం వేట అనేది యాక్షన్ థ్రిల్లర్ లా వుండాల్సింది. అంటే అద్భుత రసం ప్రధాన రసం అవ్వాల్సింది. దీంట్లోకి ఇమిడి  మిగతా హాస్య, బీభత్స రసాలు సాగాల్సింది. కానీ సినిమాని ఉత్తేజితం  చేసే ప్రధాన రసాన్నే మర్చిపోయి, ఇతర ఉప రసాలు పిండుకుంటూ కూర్చోవడంతో నిస్సారమైపోయింది.  ప్రధాన రసమైన యాక్షన్ థ్రిల్లర్ త్రాటి పైకి కథని తెస్తే హీరో కూడా యాక్టివ్ అయి గోల్ వైపుగా దూసుకు పోయేందుకు అవకాశ ముండేది. 

          వజ్రాల కథలన్నీ వేటే కదా? వేట లేకుండా కథ మేట వేసుకు కూర్చుంటే ప్రేక్షకులు కూర్చోగలరా?  కథా  ప్రారంభంలో మరకతమణి చరిత్ర చెప్పడం, దాంతో ప్రమాదం వివరించడం గంభీరంగా సస్పెన్స్ ని సృష్టిస్తుంది. ఆ తర్వాత  హీరో స్మగ్లింగ్ చేస్తూ ఎంటరవుతాడు. పాటతో కలిపి ఈ దృశ్యాలు పాత ఫార్ములా దృశ్యాలే. హీరోయిన్ ని ఓ రెండు సార్లు మూగగా ప్రేమిస్తున్నట్టు చూడడం, ఆమెకి ఎంగేజ్ మెంట్ అయిపోయాక ఫీల్ అవడం, ఆ తర్వాత అప్పు తీర్చడానికి పెద్ద ప్లానుకోసం ప్రయత్నించడం, మరకతమణి ఆఫర్ రావడం వరకూ వచ్చి,  మొదటి మలుపు తీసుకునే స్క్రీన్ ప్లే ఆతర్వాత నుంచీ చప్పబడి పోతుంది. మొదటి మలుపులో వేట నిర్ధారణ అయ్యింది. కానీ ఈ వేట ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకునే తతంగమే సుదీర్ఘంగా సాగుతూ  పక్కదారి పడుతుంది. ఒక్కో శవాన్నే లేపుతూ వచ్చే కామెడీ మీదికిపోయి, వేట అనే ‘సెటప్’ - ఆ వేట తో వచ్చే పదికోట్లూ అనే ‘ పే ఆఫ్’ టూల్స్  గల్లంతై పోయాయి.  కామెడీ శవాల్ని లేపడం గురించి వుండాలా, లేక కట్ షాట్స్ తో టకటకా శవాల్ని లేపేసి వాటితో కలిసి మరకతమణి వేట కొనసాగించడంలో వుండాలా?         

          శవాలతో కలిసి వేట సాగించడంలోనే కామెడీ వుండాలి. కామెడీ ఏ సెగ్మెంట్ లో వుండాలో తెలుసుకోక, ఆ వేట సంగతే వదిలేసి, కూర్చుని మాట్లాడుకుంటూ కామెడీలు చేసుకోవడంతో- ఫస్టాఫ్ నీరసంగా,  కదలని మొద్దులా తయారైంది. కథ వేటలోకే అంటే,  యాక్షన్ లోకే దిగదు కాబట్టి,  ఇంటర్వెల్ కూడా సిల్లీయే! 

          సెకండాఫ్ లో మళ్ళీ శవాలు చేసే వెర్బల్ – ఇండోర్ కామెడీ. వాటి క్యారక్టరైజేషన్స్. ఒక డ్రామా చూస్తున్నట్టే వుంటుంది.  సినిమా చూస్తున్నట్టు ఎప్పుడు ఫీలవుతామంటే, ఈ యాక్షన్ లేని- యాక్షన్ కామెడీ లేని ఇండోర్ దృశ్యాల నుంచి-  క్లయిమాక్స్ లో అవుట్ డోర్స్ లో పడ్డాకే.

          ప్రమాదాలు, ప్రాణాపాయాలు ఇక్కడే మొదలవుతాయి కాసేపు, అంతే. ఇప్పుడు కథ కథ  కొస్తుంది. కానీ ఈ క్లయిమాక్స్ కూడా బలహీనమే. అయినా ఫర్వాలేదనుకుంటాం, కథ కథ కొచ్చిందన్న వూరటతో. 

          ఏం చేసి వుండాల్సింది? తను లేపిన శవాలు జాంబీలని దర్శకుడు గ్రహించి, జాంబీ సినిమాలు హాలీవుడ్ లో వున్నాయని తెలుసుకుని, ఆ మేరకు జాంబీ లతో హిలేరియస్ యాక్షన్ కామెడీ చేసి వుంటే,   ఇంత అర్ధంపర్ధం లేకుండా వుండేది కాదు.

-సికిందర్
http://www.cinemabazaar.in