రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, నవంబర్ 2018, ఆదివారం

703 :‘పాలపిట్ట’ ఆర్టికల్, విస్మృత సినిమాలు -1


      కొన్ని మంచి సినిమాలు ప్రేక్షకుల దృష్టిలో పడక కనుమరుగైపోతాయి. కారణాలనేకం వుంటాయి. మంచి సినిమాలకి ప్రేక్షకాదరణ లేకపోవడమనే సమస్య ఏ కాలంలోనైనా వుంటూనే వుంది. మంచి సినిమా అంటే కమర్షియల్ విలువలకి దూరంగా ఉండేదని ఒక  నిర్వచనమైతే వుంది గానీ, మంచి సినిమా ప్రమాణాలేమిటో ఎవరికీ తెలీదు. తెలిసినా ఉపయోగం లేదు. ఎందుకంటే వాటికి ప్రేక్షకులు తక్కువ. ఆ తక్కువ మంది ప్రేక్షకులే అభిరుచిగల ప్రేక్షకులు. కొన్నిసార్లు వీరి దృష్టిలో కూడా పడకుండా అదృశ్యమై పోతూంటాయి మంచి సినిమాలు. అలాటి ఒక తాజా మంచి సినిమా గురించి చెప్పుకోవాలంటే ‘మన ఊరి రామాయణం’ ని గుర్తు చేసుకోవాలి.

          ‘మన ఊరి రామాయణం’ ది విచిత్ర పరిస్థితి. పాత తరహా టైటిల్ చూసి ఇది మన సినిమా అనుకుని పెద్ద వాళ్ళు వెళ్లారు. తీరా చూస్తే అది కుర్రకారు సినిమా. టైటిల్ ని చూసి కుర్రకారు ఇది మనది కాదులే అనుకుని దూరంగా వుండిపోయారు. ఇలా ఒక మంచి సినిమా రెంటికీ చెడ్డ రేవడి అయింది. 

         
ధోని, ఉలవచారు బిర్యానీ  వంటి సమాంతర సినిమాలకు దర్శకత్వం వహించి తన అభిరుచి యేమిటో చాటుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మరోసారి తన దర్శకత్వ ప్రతిభని చాటుతూ 2016 లో మన ఊరి రామాయణంతీశారు. ఇది కూడా రీమేకే. ఇతర భాషల్లో తనకి  నచ్చిన ఉత్తమ సినిమాల్ని రీమేక్ చేస్తూ వస్తున్న ప్రకాష్ రాజ్, ఈసారి  కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచులకి సవాలు విసురుతూ కమర్షియలేతర సినిమా తీశారు. ఒక సినిమాని పాటలు, ప్రేమలు, డాన్సులు, ఫైట్లు, కామెడీలూ లేకుండా చూడలేనంత మొద్దుబారిపోయి వున్నామా మనం నిజంగా - లేకపోతే పలాయనవాదంతో అలా నటిస్తున్నామా? నిజంగా ఇవేవీ లేని ఒక బలమైన కమర్షియలేతర సినిమాని చూడలేమా తెలుగులో? సినిమా అక్షరాస్యతా రేఖకి  అంత దిగువకి జారిపోయి క్షణికానందం కోసం ఉత్త కాలక్షేప సినిమాలు చూస్తూ జీవితాలు చాలించుకోవడమేనా? చూసే సినిమాలు అధమంగా వుండాలనుకున్నప్పుడు, కొనే సెల్ ఫోన్లు కూడా అధమంగానే  వుండాలిగా? అనవసరంగా ఈ హిపోక్రసీ  ‘మన ఊరి రామాయణంలాంటి సినిమాల్ని చంపేస్తోంది. కానీ ఈ సినిమా ముందు కమర్షియల్ సినిమాలు కూడా బలాదూర్  అనేందుకు ఇందులో ప్రేక్షకుల్ని కదలకుండా కూర్చో బెట్టే  అంశాలు ఎలా వుండాలో అలా కుదిరి, ఇది కదా సినిమా అంటే అన్న ఒక కొత్త ఎరుకతో సంతృప్తి చెందుతాం.

కథలోకి వెళ్దాం 
       దుబాయ్ లో బాగా డబ్బు సంపాదించుకుని సొంతూరు వస్తాడు భుజంగయ్య (ప్రకాష్ రాజ్). ఊళ్ళో భార్య, అత్తా, ఇద్దరు కూతుళ్ళూ వుంటారు. బయట డబ్బు మదంతో, ఇంట్లో అడ్డమైన పెత్తనంతో ఎవర్నీ నోరెత్త నివ్వకుండా ఇష్టారాజ్యంగా బతికేస్తూంటాడు. చేసే పనేం లేదు. సాయంత్రం కాగానే తన ఇగోని సంతృప్తి పర్చుకుంటూ నేస్తాలకి మందు పోసి పొగడ్తలు విని తరించడమే. ఇంటి కాంపౌండు నానుకుని రోడ్డు మీదికి ఓ షాపు తన సొంతానిది. దాన్ని అద్దెకివ్వకుండా సాయంకాలాలు పానశాలగా మార్చడమే. దుబాయ్ కి వెళ్ళక ముందు ప్రతీ శ్రీరామ నవమికీ రావణుడి వేషం వేసేవాడట. ఇప్పుడు నవమి వచ్చింది. ఆ ఉత్సవాలు డబ్బు ఖర్చుపెట్టి భారీగా నిర్వహిస్తూంటాడు. ఆ ఉత్సవాల్లో భాగంగా తను  రావణాసురుడి వేషం వెయ్య బోతున్నాడు.  ఆ రాక్షసత్వం ఇప్పుడు ఇంట్లో కూడా ప్రదర్శిస్తూ పెద్ద కూతుర్ని డిగ్రీ చదువుకో నివ్వడు. ఎందుకంటే కాలేజీ పేరుతో  ఆమె బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతోందని అనుమానం, కాబట్టి కాలేజీ మాన్పించేసి పెళ్లి చేసేస్తానంటాడు. ఒక రోజు ఇంట్లో మాటామాటా పెరిగి ఉక్రోషంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. వూళ్ళో తనకి నమ్మిన బంటు శివ (సత్యదేవ్) అనే ఆటో డ్రైవర్ ఉంటాడు. వీడికి దుబాయ్ వెళ్లేందుకు వీసా ఇప్పిస్తానని వెంట తిప్పుకుంటూంటాడు. ఆ రాత్రి షాపులో మందు భాయీలతో మందేసుకుని శివ ఆటో ఎక్కి ఎక్కడికో బయల్దేరతాడు భుజంగయ్య. బయల్దేరుతోంటే రోడ్డుపక్క అమ్మాయి కన్పిస్తుంది. ఆమెని పొందాలన్పిస్తుంది. శివని  పంపిస్తాడు. సుశీల (ప్రియమణి) అనే ఆ వేశ్యని మాట్లాడి శివ పట్టుకొస్తాడు. వాళ్ళు కులకడానికి షాపులోకి తోసి తాళం వేసుకుని, భోజనం తీసుకుని గంటలో వస్తానని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన వాడు ఇక రాడు.  

          ఈ రాకపోవడమే భుజంగయ్య కొంపలు ముంచుతుంది. రాత్రంతా వేశ్యతో షాపులో ఇరుక్కుని, ఏ సమయంలో ఏం జరుగుతుందో, తెల్లారితే ఇదెక్కడ బయటపడి ఇంటా బయటా పరువుపోతుందో, తానేమై పోతాడో - అని క్షణం క్షణం ప్రాణాలరజేతిలో బెట్టుకుని నానా చావూ చస్తాడు. 

         
భుజంగయ్య ఈ రొంపి లోంచి ఎలా బయట పడ్డాడు, చిట్ట చివరికి తాళం ఎవరు తీశారు, అప్పుడు ఎవరికి తను దొరికిపోయాడు, దొరికిపోతే ఏం జరిగిందనేది అడుగడుగునా సస్పెన్స్ తో కట్టి పడేసే కథే.

కథ వెనుక కథ 
       2012 లో జాయ్ మాథ్యూస్ అనే కొత్త దర్శకుడు తీసిన షటర్’  అనే మలయాళ  సినిమాకి రీమేక్ ఇది. మలయాళ ఒరిజినల్ కేవలం సస్పెన్స్ థ్రిల్లరే అయితే, తెలుగులో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అనే బంగారు పళ్ళేనికి  మరింత గాత్వాన్ని కల్పిస్తూ,  రామాయణంతో పౌరాణిక గోడ చేర్పు ఇచ్చారు. బాపూ రమణలు ఆ పైన వుంటే అక్కడ్నించీ  ప్రకాష్ రాజ్ కి అభినందన సందేశం పంపుతారు - రామాయణాన్ని ఇలా కూడా తీస్తావటయ్యా భలేవాడివి- అని. 1979 లో దాసరి నారాయణ రావు అక్కినేని నాగేశ్వర రావుతో రాముడే రావణుడైతేతీశారు. కానీ రావణుడే రాముడైతే? ఇదే ఈ కథ. రావణుడు రాముడిగా మారే కథ. ఒక నోరు తిరగని పేరుతో పోలెండ్ దర్శకుడొకాయన వున్నాడు-  స్ట్రిస్టాఫ్ కీష్ లాస్కీ అని. ఇంగ్లీషులో స్పెల్లింగ్ ఇలా వుంటుంది- Krzysztof Kieslowski  అని. ఈయన 1989లో టెన్ కమాండ్ మెంట్స్ని ఆధారంగా తీసుకుని డెకలాగ్అనే పది నీతికథల టెలిఫిలిమ్స్ తీశాడు. అవన్నీ ఒకే అపార్ట్ మెంట్ లో జరుగుతాయి. అలా వేశ్యతో ఒక షాపులో ఇరుక్కున్న  రావణుడి నీతి కథే ఇది. మనిషిలో రాముడు రావణుడు ఇద్దరూ వుంటారు. ఇంకో తన బలమెంతో తెలియని హనుమంతుడూ వుంటాడు. అలాగే సీతలా  కన్పించే అమ్మాయి సీత కాకపోవచ్చు- శూర్పణక అయివుండవచ్చు. ఇవన్నీ కలిపి ఒక సస్పెన్స్ రామాయణం ఈ కథ. మలయాళ ఒరిజినల్ దర్శకుడు తన కథని పొయెటికల్ వయొలెన్స్ ఆన్ సెల్యూలాయిడ్అన్నాడు. ఇది తెలుగు కూడా వర్తిస్తుంది.

నటనల సంగతి
       ప్రకాష్ రాజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎంత రావణుడైనా వాడు కుక్కిన పేనయ్యే రోజొకటి వస్తుంది. వేశ్యతో ఇరుక్కున్న ఈ పరిస్థితిని అద్వితీయంగా పోషించాడు. చాలా క్లిష్ట పాత్ర ఇది. పాత్రలోకి మనల్ని లీనం చేసి వదలకుండా తనతో తీసుకుపోతాడు. క్షణం క్షణం మారిపోయే పరిస్థితులకి అంతకంతకూ పెరిగిపోయే భావోద్వేగాల తీవ్రతని కంటిన్యుటీ చెడకుండా పకడ్బందీగా నటించాడు. షాపు వెనకాలే ఇంట్లో భార్యా పిల్లలున్నారు, షాపులో వేశ్యతో తను వున్నాడు. తాగిన మత్తులో వేశ్యని కోరుకున్నాడు, తీరా ఆమెకి దగ్గర కాలేకపోతున్నాడు. అలాటి తత్త్వం కాదు తనది. ఇంట్లోభార్యని నోరెత్తకుండా చేసే తను ఇప్పుడు వేశ్య ఏరా పోరా అంటున్నా కూడా కిక్కురుమనలేక పోతున్నాడు. తాళం వేసుకుపోయిన శివ ఎంతకీ రాకపోయేసరికి భయం- పరువు ప్రతిష్టలగురించి భయం పట్టుకుంది. పైగా పక్క షాపు వాడికి తన షాపు అద్దె కివ్వననేసరికి వాడు కోపం పెంచుకున్నాడు. ఇప్పుడు షాపులో ఏ మాత్రం అలికిడి అయినా వాడొచ్చే  ప్రమాదముంది. కానీ ఈ దిక్కుమాలిన వేశ్య సెల్ ఫోన్ కి మాటిమాటికీ కస్టమర్స్ నుంచి కాల్స్ రావడం, ఆమె పెంకెగా అరిచి మాట్లాడడం ప్రాణాల్ని తోడేస్తోంది...ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రావణుడి క్షోభ అంతా ఇంతా కాదు. ఇదంతా ప్రకాష్ రాజ్ నటనతో అడుగడుగునా ఊపిరి బిగబట్టి చూడాల్సిన ఉత్కంఠని రేపుతాయి. అంత తేలిగ్గా మర్చిపోలేం ఈ పాత్రలోప్రకాష్ రాజ్ ని.

         
 ప్రియమణి కూడా వేశ్య చేష్టల్ని చాలా నేర్పుగా నటించింది. ఎంత సేపూ తన గొడవే గానీ అవతలి వాడి ఏడ్పు ఏమాత్రం పట్టని పాత్ర చిత్రణతో తను సృష్టించే సమస్యలు ఇన్నీ అన్నీ కావు- పరువు గురించి వీడికి భయముంటే తనకేంటన్నవేశ్యల కుండే సహజ నిర్లక్ష్యంతో హడలెత్తించేస్తుంది. దాదాపు ముప్పావు కథ ఈ జగమొండి తనంతోనే సాగేక, అప్పుడు తెల్లారి వెంటిలేటర్ లోంచి అవతల ఇంట్లో అతడి భార్యా పిల్లల్ని చూసినప్పుడు, మెత్తబడి మొట్టి కాయలేయడం మొదలెడుతుంది అతడి పాడు బుద్ధికి. తను కూడా మానవత్వం నేర్చుకుని హూందాతనం ప్రదర్శిస్తుంది. ప్రియమణి కూడా గుర్తుండిపోతుంది ఈ పాత్రతో.

         
ఇక సత్యదేవ్ గురించి. తెలుగు వాడైన ఇతను పూరీ జగన్నాథ్ తీసిన జ్యోతిలక్ష్మితో పరిచయమయ్యాడు. ఆ సినిమాలో వేశ్యతోనే, ఈ సినిమాలోనూ వేశ్యతోనే. భుజంగయ్య తనకి రాముడు లాంటి వాడు. తను హనుమంతుడు. కానీ వాళ్ళిద్దర్నీ  షాపులోకి తోసి తాళం వేసుకుని భోజనం కోసంవెళ్ళిన వాడు ఎక్కడెక్కడో ఇరుక్కుంటాడు - ఏమేమో చేస్తాడు - ఎక్కడెక్కడో తిరుగుతాడు. తెల్లారిపోయాక నడిబజార్లో తాళం తీసే అవకాశం లేక, లోపలున్న గురువు గారి పరిస్థితికి తల్లడిల్లిపోతాడు- ఈ ఆటో డ్రైవర్ పాత్రలో  సత్యదేవ్ కూడా అత్యంత సహజంగా నటించాడు.  

         
ఇక పృథ్వీ ది చాలా విభిన్న పాత్ర, నటనా. బాగా రొటీనై పోయిన తన ఓవరాక్షన్ పేరడీల, డైలాగుల జడివానలోంచి ఓ తొలకరితో కొత్తదనానికి నాట్లు వేశాడు. ఒక స్ట్రగుల్ చేసే సినిమా దర్శకుడిగా మామూలు చొక్కా ప్యాంటు వేసుకుని,  సామాన్యుడిలా ఆటోల్లో తిరుగుతూ, తగ్గి మాట్లాడుతూ, పోగొట్టుకున్న స్క్రిప్టు వెతుక్కునే పాత్రలో పృథ్వీ జస్ట్ ది బెస్ట్. 

         
ఇక ఇలాటి కథ వున్న సినిమాతో ఇళయరాజా గురించి చెప్పేదేముంది- ఆయనకి మరో మౌనరాగమో మరోటో దొరికినట్టే. తన సంగీత సారమంతా కథలోకి దింపేశారు. అలాగే కెమెరా మాన్ ముఖేష్ ఒక ఆర్ట్ వర్క్ లా చిత్రీకరణ చేశాడు. అంత ప్రధాన పాత్రలో నటిస్తూ కూడా ప్రకాష్ రాజ్ కనబర్చిన దర్శకత్వపు మెళకువలు- షాట్స్ తీయడంలో నేర్పు విజువల్ మీడియా మీద తనకున్న పట్టు ఏమిటో తెలియజేస్తాయి. ఏ నటీనటులూ కూడా ఆయన దర్శకత్వంలో అసహజంగా కన్పించరు. 

భుజంగయ్య పాత్ర
       వూళ్ళో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ వాతావరణమంతా మనకి తెలుస్తూ వుంటుంది. ఈ ఉత్సవాలకి  ఉదారంగా విరాళాలిస్తున్న భుజంగయ్య దుబాయ్ లో భారీగా సంపాదించుకు వచ్చాడని మాటల్లో మనకి తెలుస్తుంది. దీనికి తగ్గట్టు  వొంటి మీద బంగారు గొలుసులు, వేళ్ళకి ఉంగరాలు, చేతులకి కంకణాలు, జేబులో పాకెట్ లో ఫుల్లుగా నోట్లతో,  బ్రహ్మాండమైన సిల్కు దుస్తుల్లో  కళకళ లాడుతూ వుంటాడు. ఇంతేకాదు, ఈ సందర్భంగా భుజంగయ్యకి కళాపోషణ కూడా వుందని మనకి అర్ధమవుతుంది. ఉత్సవాల్లో రావణ పాత్ర పోషించాలన్న అతడి అభిలాష వల్ల. ఈ అభిలాష ఇంట్లో అతడిలోని రావణుణ్ణి మేల్కొల్పి నరకం చూపిస్తుంది. భుజంగయ్య ఇంట్లో మర్యాదలేని రాక్షసుడుయితే, బయట ఏంతో గౌరవనీయుడైన రావణుడు గారు. ఇంట్లో భార్య, అత్తా, పెద్ద కూతురు, చిన్న కూతురూ వున్నా, వీళ్ళని రాచి రంపాన పెడుతూంటాడు ఆడవాళ్ళన్న దయా, వీళ్ళే తనకి దిక్కూ మొక్కూ అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా.   

          ఇలా కూతురి ప్రేమ వ్యవహారం గురించి తెలిసి ఇంకోసారి నానా రభస చేసి, వొళ్ళు మండి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు భుజంగయ్య. ఈ వెళ్ళడం సింబాలిక్ గా రాముడు అరణ్య వాసానికి వెళ్ళినట్టే వుంటుంది.  ఇక రామాయణం ప్రారంభమైనట్టే. కాకపోతే ఇక్కడ రావణుడే  అరణ్యానికి వెళ్తున్నాడు. అలా వెళ్లిపోయి షాపులో నేస్తాలతో మందు కొట్టి, అర్ధరాత్రి బయటి కొచ్చి, శివ ఆటో ఎక్కుతాడు. ఈ ఆటోలో పోతున్నప్పుడే ఖర్మ కాలి రోడ్డు పక్క నిలబడి కన్పిస్తుంది రూపవతి సుశీల.

          ఈ సుశీల అనే వేశ్య గాలానికి చిక్కి,  తన షాపులోనే తను ఇరుక్కుంటాడు. ఇక్కడ పరిస్థితులు బాగా విషమిస్తోంటే, ఇక విధిలేక అన్నట్టు అస్తిత్వ  పోరాటం మొదలెడతాడు. తనకి గొప్ప పరువు ప్రతిష్ట లున్నాయని విర్రవీగి ప్రవర్తిస్తే, ఆ పరువు ప్రతిష్టలు కాస్తా ఇప్పుడు ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. ఇక లెంపలేసుకుని తన ప్రవర్తన మార్చుకోవాలే తప్ప, ప్రాణాల కంటే మిన్న అయిన పరువూ ప్రతిష్టల్ని పోగొట్టుకోలేడు. కాబట్టి ఇక మనసు చీకటి కోణాల్లో మేట వేసిన భయాలనే నెగెటివ్ శక్తులతో పోరాటం మొదలెడతాడు. ఆ షాపు గదిలో ఒక్కో సంఘటన అతడిలోని ఒక్కో రావణ గర్వాన్ని పటాపంచలు చేస్తూపోతుంది. మనిషి ఏదైనా కోల్పోతాడు గానీ పరువు ప్రతిష్టలు  కోల్పోవడానికి సిద్ధ పడడు కదా? 

          భుజంగయ్య ఈ సంఘర్షణలో తనలో అజ్ఞానమనే అడ్డుగోడల్ని కూల్చేసుకుంటాడు. జీవితపు నగ్నసత్యాల్ని తెలుసుకుంటాడు. పరమ సత్య మేమిటో గ్రహిస్తాడు. జీవితంగురించి
, కుటుంబ విలువల గురించి, మనిషి విలువ గురించీ చక్కగా నేర్చుకుని  తనలోని రావణుణ్ణి భూస్థాపితం చేసి, రాముడిలా ఇంటికి తిరిగి వస్తాడు. అతడి వనవాసం మనస్ఫూర్తిగా పూర్తయ్యింది. 

ఇదొక సైకో థెరఫీ 

       కరీనా కపూర్- రాహుల్ బోస్ లతో 2003 లో సుధీర్ మిశ్రా తీసిన చమేలీలో కూడా ఒక వర్షపు రాత్రంతా బస్టాపులో వేశ్యతో చిక్కుబడిపోయిన హీరో తెల్లారే సరికి మారిన మనిషిగా ఇంటికి తిరిగొస్తాడు. ఇంతే, గొప్ప కథలు సైకో థెరఫీలే చేస్తాయి. పాత్రల ఇగోల్ని మెచ్యూర్డ్ ఇగోగా మార్చి మోక్షం కల్గిస్తాయి. 

      ప్రకాష్ రాజ్ కథంతా, పరివర్తనంతా  ఏడ్పులతో, డైలాగులతో చెప్పలేదు. ఒక్క నీతి వాక్యం మౌఖికంగా చెప్పలేదు. ఏ వాయిసోవర్ తోనూ ముగింపు మెసేజి లివ్వలేదు. ఇదే క్వాలిటీ గల సినిమా అంటే. ఇవన్నీసంఘటనల ద్వారానే, ఆ సంఘటనలకి పాత్రల ప్రతిస్పందనల ద్వారానే  తెలియజేస్తూ పోయారు. ఈ కథ చెప్పడానికి వాడిన ప్రధాన రసం ఏ చింతపండు పులుసో కాదు. సస్పెన్స్ థ్రిల్లర్ కుండే  అద్భుత రసం. ఒక సంఘటనకి మించి ఇంకో సంఘటనగా టెన్షన్ పెంచుతూ టైం  అండ్ టెన్షన్ గ్రాఫ్ మీద కూడా దృష్టి పెట్టారు. ఆ ప్రకారం క్యారెక్టర్ ఆర్క్ కూడా పడుతూ లేస్తూ ప్రయాణిస్తూంటుంది. ఆ మధ్య డోంట్ బ్రీత్అనే హార్రర్ సస్పెన్స్ వచ్చింది. దానికంటే ఓ పదిశాతం తక్కువ సస్పెన్స్ -టెన్షన్ థ్రిల్ ఎలిమెంట్స్ తో ఇది వుండొచ్చు. షాపు బయటి పాత్రలతో ఒకరకమైన సస్పెన్స్, లోపలి పాత్రలతో ఇంకో సస్పెన్స్ తో- రెండంచుల కత్తిలా కథ. 

          ఇంటర్వెల్ మలుపుని  కూడా నరాలు బిగబట్టుకుని చూడాల్సి వస్తుంది. మన దగ్గర ఎలా ఉంటుందంటే - ప్రేమ కథల్లో, కుటుంబ కథల్లో  సస్పన్స్ అంటే అది యాక్షన్ సినిమాల వ్యవహారమనీ,  మనం పెడితే దెబ్బతింటామనుకునీ, అవే నిస్తేజ ఫార్ములా డ్రామాలు తీస్తూ పోతారు. ప్రసుత రామాయణంలో ఎవరూ హత్య చేయలేదు, ఇంకే నేరమూ చేయలేదు. అచ్చమైన  కుటుంబ కథే ఇది. కుటుంబ కథలో తటస్థించిన ఒకానొక దురదృష్టకర ఘట్టం. దీన్నిలా  సస్పెన్స్ థ్రిల్లర్ గా చెప్తే ఏం కొంపలు మునిగాయని?  మన ఊరి రామాయణం - మనలోని రామాయణంఅంటూ పాట ద్వారా వెల్లడయ్యే మానసిక లోకపు కల్లోలం. దీనికి పరిష్కారంతో సైకో థెరఫీ. ఇంతకంటే ఉత్తమ కథా రచన ఏముంటుంది?

          ఇందులో సినిమా దర్శకుడి పాత్ర పృథ్వీ  పోగొట్టుకునే స్క్రిప్టు కూడా ఒక ప్లాట్ డివైస్ గా కథ నడుపుతుంది. చివరి దృశ్యంలో నటులు పృథ్వీ- ప్రియమణిలతో ఈ స్క్రిప్టు ఒక అందమైన ముగింపు నిస్తుంది. హార్రర్ కామెడీలూ, ఇంకేవో యాక్షన్ సినిమాలూ పక్కన పెడదాం కాస్సేపు - నిత్య జీవితంలో మన కెదురయ్యే ఘట్టాలు మన చేతల వల్ల  ఎంత సస్పెన్స్ లో పడి ప్రాణాలు తోడేస్తాయో - కల్తీలేని ఈ అచ్చ కుటుంబ కథలో చూసేసి జీవిత కాలమంతా  నెమరేసుకోవచ్చు. షరతు ఏమిటంటే, ఈ సినిమా చూస్తేపాప్ కార్న్ కాకుండా స్వీట్ కార్న్ తినాలి.


సికిందర్
(‘పాలపిట్ట’ సాహిత్య మాసపత్రిక, అక్టోబర్ -2018 సంచిక)