రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, అక్టోబర్ 2015, మంగళవారం





రచన -దర్శకత్వం- నిర్మాణం :  గుణశేఖర్ 

తారాగణం : అనూష్కా, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, సుమన్, ఆదిత్యా మీనన్, విక్రం జిత్ విర్క్, కేథరిన్ ట్రెసా తదితరులు
సంగీతం : ఇళయరాజా
,  ఛాయాగ్రహణం : అజయ్ విన్సెంట్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
బ్యానర్ : గుణా టీం వర్క్స్
విడుదల : అక్టోబర్ 9
, 2015

***

             పెద్ద బడ్జెట్  సినిమా వసూళ్లు సాధించుకోవడానికి కనీసం ఓ రెండు వారాలు కూడా గ్యాప్ లేకపోతే రిస్కే. ‘రుద్రమదేవి’ బాలారిష్టాల్ని దాటించి ఎట్టకేలకు ఎందరో మోసి విడుదలకి నోచుకునేలా చేసినా, పోటీ సినిమాల విడుదల వెన్నంటే వుండడాన్నినివారించలేక  పోయారు.మరుసటి వారమే  రామ్ చరణ్- శ్రీను వైట్లల ‘బ్రూస్ లీ’,  మళ్ళీ ఆ పైవారమే  అఖిల్- వి.వి. వినాయక్ ల ‘అఖిల్’  అనే మరో రెండు భారీ కమర్షియల్సూ వచ్చి పడుతూండడంతో  ‘రుద్రమదేవి’ బ్రీతింగ్ స్పేస్ అనేది లేకుండా పోయింది. పెట్టిన పెట్టుబడి ఎనభై కోట్లని చెప్పుకుంటున్నా, 50 కి మించి ఆవదని నిపుణులు అంటున్నారు. సీజీ క్వాలిటీని చూస్తే   తెలిసిపోతోంది. ఈ యాభై కూడా ఒక్కవారంలో వెనక్కి రావడమెలా అన్నది ఇప్పుడు ప్రశ్న. క్యూకట్టి వున్న పై  రెండు పెద్ద కమర్షియల్స్ తో పోటీని తట్టుకో గల్గితే  ఫర్వాలేదు-  ఐతే అలా తట్టుకునే శక్తి వుందా దీనికి? 

             ప్రేక్షకులు భలే  ఎమోషనల్ జీవులు. ఒక్కోసారి సినిమా బాగోగులతో సంబంధం లేకుండా భారీ సినిమాలకి ఓపెనింగ్స్ ని భారీగానే ముట్టజెప్పేస్తారు.  స్టార్ బ్యాగేజితో అట్టహాసంగా తమ ముందు కొచ్చేసిన ‘రుద్రమదేవి’ కి తొలి మూడు రోజుల్లో  26.10 కోట్ల గ్రాస్ ని అందించేశారంటే, వాళ్ళ భావోద్వేగాలు ఏ స్థాయిలో వున్నాయో ఊహించుకోవచ్చు. కాబట్టి భారీ సినిమాలు నిర్మించడానికి పెద్దగా తెలివితేటలు అవసరం లేదనుకోవచ్చు. విషయపరంగానూ తీవ్రంగా కష్ట పడిపోనక్కర లేదని కూడా  అనుకోవచ్చు. బుద్ధిజీవుల కోసం భారీ కమర్షియల్స్ ని తీయరు. అయితే ఒకజాతి గర్వించదగ్గ చరిత్రతో కూడిన సినిమాని కూడా మైండ్ ని అప్లయ్ చేయకుండా, మసాలా సినిమాలా తీసెయ్యొచ్చా అన్నది ఆ దర్శకుడే  వేసుకోవాల్సిన ప్రశ్న. 

          నిజానికి దర్శకుడు గుణశేఖర్ కి చరిత్ర అవకాశామివ్వలేదు గానీ, మామూలు కమర్షియల్స్ తో వరస ఫ్లాపులు చవిచూసి విసిగిపోయి, ఆపద్ధర్మంగా తనే ఓ చారిత్రిక అవకాశాన్ని సృష్టించుకుని, ‘రుద్రమదేవి’ అనే మహాయజ్ఞానికి సమకట్టారు. దీనికి బాక్సాఫీసు క్షమించినంతగా చరిత్ర కూడా క్షమిస్తుందా, లేకపోతే ఇది ఇలావచ్చి అలా జనం మర్చిపోయే చెత్తబుట్ట దాఖలు బాపతు మరో విఫల యత్నమేనా ,  ఓ సారి ఈ కింద చూసుకుంటూ వెళ్దాం..

 దేవియే దేవుడుగా! 
         కాకతీయ సామ్రాజ్య చరిత్రలో  రాణీ రుద్రమ దేవి  (పాలనా కాలం 1261–1289)  పోషించిన పాత్ర తాలూకు చిత్రణ ఇది.  రుద్రమదేవిగా అనుష్కా ఇందులో కన్పిస్తుంది. రుద్రమ దేవి పుట్టే టప్పటికే రాజ్యానికి చాలా ప్రమాదాలు పొంచి వుంటాయి. శత్రు రాజులు, దాయాదులూ రాజ్యాన్ని కబళించాలని చూస్తూంటారు. అప్పటికే ఒక కూతురున్న రాజు గణపతి దేవుడు (కృష్ణం రాజు) తన వారసత్వాన్ని కొనసాగించే  మగ సంతానం లేకపోవడంతో శత్రువుల దృష్టిలో బలహీనపడతాడు. అలాంటప్పుడు మగసంతానం కోసం ఎదురు చూస్తూంటే ఆడపిల్ల రుద్రమ దేవి పుడుతుంది. ఈ విషయం పొక్కిందంటే, శత్రువులు విజృంభిస్తారు. దీనికో ఉపాయం చెప్తాడు మంత్రి శివ దేవయ్య (ప్రకాష్ రాజ్ ). పుట్టింది మగ సంతానమని ప్రకటించమంటాడు. పుట్టిన పిల్లని రుద్రమ దేవుడిగా పెంచుదామంటాడు. కోటలోనే పాగావేసి కుయుక్తులు పన్నుతున్న దాయాదులు హరిహర దేవుడు ( సుమన్), మురారీ దేవుడు ( ఆదిత్యా మీనన్) లకి  సైతం ఈ విషయం  తెలియకుండా దాచాలంటాడు. అలాగే ప్రకటన చేస్తాడు గణపతి దేవుడు. 

               ఇది తెలుసుకుని శత్రు దేశపు రాజు మహాదేవ నాయకుడు ( విక్రం జిత్ విర్క్) పిచ్చెక్కిపోతాడు. ఇటు మగపిల్లాడిలా పెరుగుతున్న రుద్రమదేవికి నిడదవోలు సామంతరాజు చాళుక్య వీరభద్ర ( దగ్గుబాటి రానా),   మరో దివంగత సామంత రాజు గోన బుద్ధా రెడ్డి కొడుకు గన్నారెడ్డి (అల్లు అర్జున్) లు స్నేహితులుగా ఏర్పడతారు. గన్నారెడ్డి పెద్దయ్యాక బందిపోటుగా మారి  ప్రజల్ని దోచుకుంటున్నాడని ప్రచారం జరుగుతూంటుంది. తన తండ్రిని చంపి గణపతి దేవుడి  పంచన చేరిన అన్నల మీద కక్షతో ఉంటాడు గన్నారెడ్డి. ఇటు ‘యువరాజు’ గా ఎదిగి తండ్రితో కలిసి పరిపాలిస్తూ చెరువులు తవ్వించీ, పన్నులు మాఫీ చేయించీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూంటుంది రుద్రమ దేవి. కక్షతో ఈమె పాలనకి ఆటంకాలు సృష్టిస్తూంటాడు మహాదేవ నాయకుడు. 

            ఈ నేపధ్యంలో రుద్రమదేవి ఆడపిల్లన్న సంగతి ఎలా ఎప్పుడు బయటపడింది, అప్పుడు ఎలాటి విషమ పరిస్థితులు ఏర్పడ్డాయి, వాటినామె ఎలా ఎదుర్కొంది; వీరభద్రుడు, గన్నారెడ్డి లు ఆమెకెలా తోడ్పడ్డారు మొదలయిన అంశాలతో మిగతా కథ సాగుతుంది.


ఎవరెలా చేశారు 
        ఇప్పుడున్న తారల్లో రుద్రమదేవి పాత్రలో అనూష్కా ని తప్ప మరొకర్ని ఊహించలేమన్నది నిజమే. రుద్రమ దేవుడుగా పురుష పాత్రలో, రుద్రమదేవిగా స్త్రీ పాత్రలో రెండింటిలోనూ కన్పిస్తుంది అనూష్కా. రాజరికపు వీరత్వంతో కాఠిన్యంతోనూ, ప్రేమలో పడిన కుమారిగా సౌకుమార్యంతోనూ కన్పిస్తుంది. రుద్రమదేవి నిజజీవితంలోనే కొంతకాలం పురుషుడి వేషంలో వున్న స్త్రీగా జీవించిందన్న స్పష్టత వుంది కాబట్టి  ఇంతవరకూ మాత్రం ఏ కన్ఫ్యూజనూ లేదు అనూష్కాకి. 

          ఫస్టాఫ్ గడిచి సెకండాఫ్ లో తను స్త్రీ అన్న విషయం ప్రపంచానికి తెలిసిపోయాకే, ఫైనల్ గా ఆ కీలకమైన స్త్రీ పాత్రతో ఉండాల్సిన అసలు నటనంతా నీరుగారిపోయింది. ఇక్కడ్నించీ కథ ఇతర పాత్రల చేతుల్లోకి వెళ్లిపోవడంతో, ఇంకా క్లయిమాక్స్ లో కొచ్చేసరికి  పూర్తిగా కథ అల్లు అర్జున్ నటించిన గోన గన్నారెడ్డి పాత్ర వశమైపోవడంతో,  చేష్టలుడిగినట్టు కన్పిస్తుంది అనూష్కా. ఎంతగానంటే, ఈ కథకి తాను ముఖ్య పాత్ర కానంతగా. ఆయా సీన్లలో తనెందుకుందో అర్ధంగానంత తికమకగా. 

          దీనికి తోడూ అప్పీరియన్స్ కి కంటిన్యూటీ సమస్య కూడా ఎదురయ్యింది. ఎప్పుడో 2013 లో ఈ సినిమాని ప్రారంభించిన నాటి నాజూకుదనంతో సినిమా సాంతం కన్పించదు. సెకండాఫ్ గడుస్తున్న కొద్దీ బరువెక్కిపోతూ  కన్పిస్తుంది. 2013 నాటి అనూష్కా -2015 నాటికి ఎలావుందో ఫిజికల్ ఫీచర్స్ పరిణామక్రమాన్ని రికార్డు చేస్తుంది ఈ సినిమా. ఈ కథ అనూష్కా పాత్రని  కేంద్రంగా చేసుకుని  నడవక పోవడంతో ఓవరాల్ గా చూస్తే తను చేసిందేమిటో అంతగా గుర్తుకు రాదు. అంటే నటిగా తను విఫలమైనట్టు కాదు. పాత్ర చిత్రణలో దర్శకుడు చేసిన పొరపాట్ల ఫలితం. ఒక ‘ప్రతిఘటన’ లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా తీసుకున్నా, అందులో పవర్ఫుల్ గా నటించిన విజయశాంతి ఇప్పటికీ గుర్తుంటుంది. కానీ ఇక్కడ ఇంత భారీ చారిత్రాత్మకంలోనూ వీరవనిత రుద్రమదేవిగా అనూష్కా గుర్తుండదు, అల్లు అర్జునే గుర్తుంటాడు. 

         అనూష్కా కంటే గోన గన్నారెడ్డి పాత్రలో అల్లుఅర్జున్ ఎక్కువ హల్చల్ చేయడంతో ఈ సినిమాకి ‘గోన గన్నారెడ్డి’ అని టైటిల్ పెట్టినా నష్టం లేదు,  పైగా ‘బ్రూస్ లీ’  లకీ, ‘అఖిల్’ లకీ బస్తీమే సవాలుగా వుంటుంది తొడగొట్టి సినిమా. తెలంగాణా యాసలో అర్జున్ డైలాగులకే ఎక్కువ హుషారు ప్రేక్షకులకి. పోషించింది అతిధి పాత్రయినా గంగి గోవు పాలు గరిటెడైనా చాలన్నట్టు, ఈ సినిమా చూస్తూంటే వచ్చే నీరసాన్నంతా హుష్ కాకీ చేసేస్తాడు ఎమోషనల్ డ్రైవ్ జాస్తిగా వున్న తెలుగుజాతి ప్రేక్షకులకి అర్జున్. 

          రానా దగ్గుబాటి కాల్పనిక చరిత్ర ‘బాహుబలి’ లోలాంటి పాత్రతోనే, ఆహార్యంతోనే, డిజైనర్ చరిత్ర ‘రుద్రమదేవి’ లోనూ నటించాడు. కానీ ఈ పాత్రకూడా ఆటలో అరటి పండు అయిపోవడంతో తన గురించి చెప్పుకోవడాని కేమీ లేదు. ఇతర పాత్రల్లో కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, నిత్యామీనన్ సుమన్, ఆదిత్యా మీనన్ తదితర భారీ తారాగణమంతా కలిసి, భారీ డైలాగులతో, ప్రధానపాత్ర రుద్రమ దేవి ఉనికిని ప్రశ్నార్ధకం చేశారు. ఇక మహాదేవ నాయకుడుగా నటించిన ముప్ఫయ్యేళ్ళ కుర్రాడు విక్రంజిత్ విర్క్ అయితే,  ఇంత భారీ చారిత్రాత్మకానికి కురచ విలన్ అయిపోయాడు.

          ఇళయరాజా సంగీతం హిట్టేమీ కాదు. పాటలూ - నేపధ్య సంగీతమూ అంతంత మాత్రంగానే వున్నాయి. నేపధ్య సంగీతమైతే మరీ వెనకబడిపోయింది. అజయ్ విన్సెంట్ ఛాయాగ్రహణానికి లైటింగ్ లో, కలర్ స్కీం లో ఏకత్వం కన్పించదు. కొన్ని ఔర్ డోర్ దృశ్యాలు మాత్రం బావున్నాయి. సాంకేతికంగా ఈ సినిమా అంత ఉన్నతంగా ఏమీ లేదు.  గ్రాఫిక్స్ మరీ చవకబారుగా వున్నాయి.  సెకనుకి ఇరవై వేలు వెచ్చిస్తే వచ్చే క్వాలిటీ నాలుగైదు వేలు పెడితే ఏమొస్తుంది. అలాగే యాక్షన్ సీన్సు సైతం బలహీనంగా వున్నాయి. కత్తి పోరాటాలు ఈ కాలపు సినిమానే  చూస్తున్నామా అన్నట్టున్నాయి- పాత జానపద సినిమాల్ని జ్ఞప్తికి తెస్తూ. 

          పరుచూరి బ్రదర్స్ రాసిన సంభాషణలు ఫస్టాఫ్ వరకూ మంచి ఫీల్ నిస్తాయి. సెకండాఫ్ లోనే మరీ  భారమన్పిస్తాయి. కారణం,  కథని యాక్షన్ తో కాకుండా, ఎంతసేపూ వ్యూహ ప్రతివ్యూహాలు, కుట్రలూ కుతంత్రాలూ మాటాడుకోవడాలతో, ఊహాగానాలతో నిండి పోవడమే - ఆ నాడు కృష్ణ దర్శకత్వం వహించిన డైలాగుల మోత  ‘సింహాసనం’ ని గుర్తుకు తెస్తూ.  ఒక్క అల్లు అర్జున్ కి రాసిన డైలాగులు మాత్రమే క్రియేటివిటీతో శక్తిమంతంగా వున్నాయి. ఇలాటి పవర్ఫుల్ డైలాగులు  అసలుండాల్సిన  రుద్రమదేవి పాత్రకే మృగ్యమైపోయాయి.

          పాత్రల పంపకం, డైలాగుల పంపకం, సాంకేతిక హంగుల పంపకం.. ఇలా వేటిలోనూ బ్యాలెన్సింగ్ యాక్ట్ పాటించని అగ్ర దర్శకుడు గుణశేఖర్ మేకింగ్ పనితనం మొత్తంగా ఎలా వుందో ఈ కింద  ‘స్క్రీన్ ప్లే సంగతులు’ తర్వాత చెప్పుకుందాం..

స్క్రీన్ ప్లే సంగతులు