రచన- దర్శకత్వం : చందూ మొండేటి
తారాగణం : నాగచైతన్య, సాయి పల్లవి, ప్రకాష్ బెలవాడి, కరుణాకరన్,
మహేష్ అచంట
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : షామ్ దత్
సయీనుద్దీన్
బ్యానర్ : గీతా
ఆర్ట్స్
నిర్మాత : బన్నీ వాసు
విడుదల : ఫిబ్రవరి 7, 2025
***
ఫిబ్రవరి 7 శుక్రవారం విడుదలైన ‘తండేల్’ తొలిరోజు
వరల్డ్ వైడ్ గ్రాస్ 20.5 కోట్లు రాబట్టి
హిట్ టాక్ తెచ్చుకుంది. రెండో రోజు శనివారం 16 కోట్లు, మూడో రోజు ఆదివారం 14 కోట్లుగా డ్రాప్ అవుతూ వచ్చి,
సోమవారం నుంచి వసూళ్ళ పతనం పెరుగుతూ
పోయింది. సోమవారం (నాల్గవ రోజు) 6.15 కోట్లు,
మంగళవారం (ఐదవ రోజు) 5.5 కోట్లు, బుధవారం (ఆరవ రోజు) 3.6 కోట్లు, నిన్న గురువారం (ఏడవ రోజు) 3 కోట్లకి పడిపోయి ప్రశ్నార్ధకంగా నిల్చింది. హిందీ
రాష్ట్రాల్లో కేవలం 40 లక్షలు వసూలు చేసింది. ఈ ఏడు రోజుల్లో (అంటే తొలి వారం) మొత్తం
వరల్డ్ వైడ్ గ్రాస్ 65.65 కోట్లు. బడ్జెట్ 75 కోట్లు. 100 కోట్ల టార్గెట్ రీచ్
అవుతుందని ఆశిస్తున్నారు. కాకపోయినా నష్టం లేదు, ఓటీటీ
హక్కులు 45 కోట్లు రానే వస్తాయి. ఇలా ఓటీటీ సపోర్టుతో లాభాల్లో పడితే సేఫ్
ప్రాజెక్టు అన్నట్టేనా? వుందిగా ఓటీటీ అని క్వాలిటీ మీద
దృష్టి పెట్టకుండా సినిమాలు తీసేసి హిట్ అని చెప్పుకోవచ్చా?
అయితే ప్రతీరోజూ కలెక్షన్లు డ్రాప్ అవడానికి కారణాలు కొన్ని చెప్తున్నారు.
మొదటి రోజే పైరసీ కాపీ వచ్చేసిందని ఒక
కారణం. అన్ని సినిమాలూ మొదటి రోజే పైరసీలు
వచ్చేస్తాయి. వాటి లింకులు మర్నాడు పెడతారు. అసలు పైరసీతో సంబంధం లేకుండా పెద్ద
సినిమాలు హిట్టవుతూనే వున్నాయి. సంక్రాంతికి బాలకృష్ణ ‘డాకూ మహరాజ్’, వెంకటేష్ ‘సంక్రాంతికి
వస్తున్నాం’ పైరసీలు వచ్చేసినా హిట్టయ్యాయి. కానీ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాపయ్యింది. ఎందుకు ఫ్లాపయ్యింది-
కంటెంట్ ప్రాబ్లం. ఇక ‘తండేల్’
డ్రాపవుతూ వుండడానికి మార్చి ఫస్ట్ నుంచి పరీక్షల సీజన్ అనీ,
మరొకటనీ ఇతర కారణాలు చెప్తున్నారు. కానీ కంటెంట్ తో వున్న పెద్ద బ్లాక్
హోల్ గురించి మాట్లాడ్డం లేదు. ఏమిటా బ్లాక్ హోల్? కమర్షియల్ సినిమాలకి కాస్త కథలు చూసుకుని తీయాలనీ, గాథలు తీసి గల్లంతు అవకూడదనీ గత కొన్నేళ్ళుగా బ్లాగులో హెచ్చరించుకుంటూనే
వున్నాం. అయినా ‘తండేల్’ ని గాథగా చేసి
తీయనే తీశారు! ఫలితమే పైన కనిపిస్తున్న అంకెలు!
తెలుగు సినిమాలకి పాసివ్
పాత్రలు, ఎండ్ సస్పెన్స్ కథనాలే శాపాలనుకుంటే, కథలు గాక గాథలు చూపిస్తూ ఇంకో శాపం కూడా తెచ్చి పెట్టుకుంటున్నారు. గాథ అంటే ఏమిటో మరోసారి గుర్తు చేసుకుందామా?
‘గాథ’ అనేది కథ కిందికి రాదు. కథకీ గాథకీ తేడా వుంది. గాథ లో వుండే కంటెంట్ ఒక సాదా స్టేట్ మెంట్ మాత్రంగానే వుంటుంది. అంటే పాత్ర- నేనిలా అనుకుంటే నాకిలా జరిగి ఇలా ముగిసిందీ బాబో- అంటూ విధికి తలవంచిన
పరాజిత లక్షణాలతో వాపోతుంది. విధి అంటే ఏమిటి? తన ప్రారబ్ద కర్మే!
ఇలాకాక ‘కథ’ అనేది ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తుంది. అంటే పాత్ర- నేననుకున్న లక్ష్యాన్ని ఫలానా ఈఈ
శక్తులతో ఈ విధంగా సంఘర్షించి సాధించుకున్నానూ- అని విజేత అయి ప్రకటిస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్య పాత్రగానీ, సాయి పల్లవి పాత్రగానీ
మొదటి సిద్ధాంతానికే న్యాయం చేయడానికి కృషి చేశాయి. అంటే గాథని సృష్టించడానికి జత కట్టాయి. ఇది వివరంగా తెలుసుకోవడానికి స్క్రీన్
ప్లే సంగతుల్లోకి వెళ్ళాలి. ముందుగా కంటెంట్ ఏమిటో చూద్దాం...
శ్రీకాకుళం తీరంలో మత్స్యకారుల్లో ఒకడైన రాజు (నాగ
చైతన్య) చేపల వేటకి వెళ్తూంటాడు. తన బృందం తో కలిసి ప్రతి సంవత్సరం గుజరాత్ దాకా సముద్రంలో ప్రయాణించి అక్కడ ఒక
కాంట్రాక్టర్ కి తాము పట్టిన చేపలు అమ్మి వస్తూంటాడు. ఇంటి దగ్గర వాళ్ళ భార్యలు, తల్లులు, ఇతర బంధువులు వీళ్ళు తిరిగి వచ్చేదాకా
ఎదురు చూపులతో గడుపుతూంటారు. రాజు కూడా తాను ప్రేమిస్తున్న సత్య (సాయి పల్లవి)
ని వదిలి వెళ్తూంటాడు. తొమ్మిది నెలలు సముద్రం
మీద, 3 నెలలు ఇంటి దగ్గర వుండే రాజు ఈ సమయంలోనే సత్యతో
ప్రత్యక్ష ప్రేమలో వుంటాడు. మిగిలిన కాలం
ఫోన్ల మీద మాట్లాడుకోవడమే. అందుకని సత్యకి అతను చేస్తున్న ఈ వృత్తి నచ్చదు. ఈ నేపథ్యంలో
ఒక రౌడీ ముఠాని ఎదుర్కొన్న రాజుని తమ తండేల్ (నాయకుడు) గా ఎన్నుకుంటారు
మత్స్యకారులు. ఇక తండేల్ గా రాజు తిరిగి గుజరాత్ కి ప్రయాణం కట్టడంతో తీవ్రంగా
వ్యతిరేకిస్తుంది సత్య. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బృందంతో వెళ్ళిపోయిన అతను- తుఫాను
చెలరేగడంతో సముద్రంలో ఒక పాకిస్తానీని కాపాడుతూ పాక్ సముద్రజలాల్లోకి ప్రవేశిస్తాడు. దీంతో బోటులో వున్న 21 మంది బృందం సహా పాక్ దళాలకి పట్టుబడతాడు. జైల్లో బందీ అయి
పోతాడు.
ఈ వార్త సత్యకీ, మిగతా అందరికీ షాకులా తగులుతుంది. ఇప్పుడు పాక్ జైల్లో బృందంతో ఖైదు అయిన రాజు ఎదుర్కొన్న అనుభవాలేమిటి? అతను బృందంతో అక్కడ్నుంచి ఎలా బయటపడ్డాడు? రాజు మీద కోపంతో వున్న సత్య ఏం చేసింది? వీళ్ళిద్దరి ప్రేమ ఏ తీరానికి చేరింది చివరికి? ఇదీ మిగతా కంటెంట్. కంటెంట్ అనడమెందుకంటే, ఇది కథో గాథో తేలేదాకా కంటెంట్ అనే అనుకుందాం.
శ్రీకాకుళంలో జరిగిన సంఘటనని ఆధారంగా
తీసుకుని ఈ కంటెంట్ ని రూపొందించారు. ఆ నిజ సంఘటన పాక్ జైల్లో బందీలైన శ్రీకాకుళం
మత్స్యకారుల గురించే. మిగతా ప్రేమకి సంబంధించిన కంటెంట్ ని కల్పన చేసి జోడించారు. 2018
లో కరాచీ జైల్లో ఏడాదికి పైగా నిర్బంధంలో గడిపిన తర్వాత, పాకిస్తాన్ విదేశాంగ
శాఖ వీళ్ళని తిరిగి భారత్ కి పంపేసింది. ఐతే జైల్లో పెట్టిన హింస, తిండికి మాడ్చిన తీరు మాత్రం హేయమైనవి. శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఈ జాలర్లని
పాకిస్తాన్ మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీ నవంబర్ 2018 లో గుజరాత్ తీరంలో అదుపులోకి తీసుకుంది. అరేబియా సముద్రంలో
పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారన్న ఆరోపణపై అదుపులోకి తీసుకున్నారు. కోస్తాంద్ర
నుంచి మత్స్యకారులు అంత దూరం గుజరాత్ వెళ్ళడానికి కారణం అక్కడ జెల్లీ ఫిష్ అనే చేపలు భారీగా పడతాయి. వాటిని అక్కడే కాంట్రాక్టర్లకి అమ్మి తిరిగి వస్తారు.
అయితే ఈ జాలర్ల నిజ జీవితపు
అనుభవానికి ఓ జంటతో కలిపి కల్పిత ప్రేమని జోడించినప్పుడు, ఈ మొత్తం కంటెంట్ అసలు కథే అవుతోందా లేక గాథ అవుతోందా చూసుకోలేదు.
కమర్షియల్ సినిమాతో కథకీ, గాథకీ తేడా తెలియకపోతే ప్రమాదకర
జోన్లోకి అడుగుపెడుతున్నట్టే. కమర్షియల్ సినిమాకి కథే కావాలి. ఆర్ట్ సినిమాకి గాథ
చెప్పుకోవచ్చు. కథ అన్నప్పుడు అందులో యాక్టివ్ క్యారక్టర్లుంటే, గాథలో పాసివ్ క్యారక్టర్లుంటాయి. కథకి కాన్ఫ్లిక్ట్ వుంటే, గాథకి
కాన్ఫ్లిక్ట్ వుండదు. కథలో పాత్రకి గోల్ వుంటే, గాథలో
పాత్రకి గోల్ వుండదు. కథని పాత్ర నడిపిస్తే, గాథలో గాథ
పాత్రని నడిపిస్తుంది. కథలో పరిష్కారాన్ని పాత్ర సాధిస్తే,
గాథలో పాత్ర కోసం పరిష్కారాన్ని ఇతర పాత్రలు సాధించి పెట్టి ఒడ్డున పడేస్తాయి. ఇలా
కథలో పక్కా యాక్టివ్ పాత్ర వుంటే, గాథలో పూర్తి పాసివ్ పాత్ర
వుంటుంది. ఇలాటి గాథల ద్వారా కమర్షియల్ సినిమాతో ఏం చెప్పాలనుకుంటున్నట్టు? మీకు సమస్యలొస్తే కుమిలిపోతూ పాసివ్ గా కూర్చోండి,
ఎవరో ఒకరు దేవుడులా వచ్చి ఆదుకుంటారనేనా? చేతకాని పాసివ్
క్యారక్టర్ తో చాలా బ్యాడ్ మెసేజి ఇది.
పాక్ లో చూపించిన మత్స్యకారుల
అనుభవాల్ని డాక్యుమెంటరీలా తీశారు. దీంతో ఫీలింగ్ లేకుండా పోయింది. డాక్యుమెంటరీ
అన్నాక చూపించడాని కేముంటుంది సమాచారం తప్ప. కంటెంట్ డాక్యుమెంటరీలా వున్న విషయం
నాగచైతన్య కనిపెట్టి, సరి చేసుకుంటే నటిస్తానని చెప్పేశాడు. ఏం
సరిచేశారో తెలీదుగానీ ఒకటి కాదు రెండు గాథలు తీసినట్టు తయారైంది మొత్తం కంటెంట్.
స్ట్రక్చర్ స్కూలుని అవతల పడేసి క్రియేటివ్ స్కూలునే అనుసరిస్తే ఇంతే జరుగుతుంది. క్రియేటివ్
స్కూల్లో స్ట్రక్చర్ తో పని వుండదు, స్ట్రక్చర్ స్కూల్లో
క్రియేటివిటీతో కూడా పని వుంటుంది.
ఈ కంటెంట్ లో క్రియేటివ్ స్కూలుతో
జరిగిందేమిటంటే, ఫస్టాఫ్ లో కాన్ఫ్లిక్ట్ అంటూ లేని ప్రేమతో
కూడిన గాథ నుంచి సెకండాఫ్ తెగిపోయి, పాక్ లో జాలర్ల స్ట్రగుల్
తో కూడిన గాథకింద పడి నలిగిపోయింది. ఇలా మొత్తం కలిపి చూస్తే సినిమాలో వున్నది గాథే అయినా, అదీ ఒక
పాయింటుతో గాక, ఫస్టాఫ్ ప్రేమ పాయింటు,
సెకండాఫ్ జాలర్ల స్ట్రగుల్ అనే పాయింటు అంటూ రెండు ముక్కలుగా తెగిపోయి- సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండంలో పడిందన్న మాట!
కథ అనుకుని తయారు చేసిన ఈ కంటెంట్
లో, ప్రేమలో కాన్ఫ్లిక్ట్ పూర్తిగా లేదని కాదు, కాన్ఫ్లిక్ట్ సరీగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. అందుకని కాన్ఫ్లిక్ట్
వున్నా లేనట్టే వుంది. స్క్రీన్ ప్లేలో కాన్ఫ్లిక్ట్ (సంఘర్షణ) ప్రాముఖ్యమేమిటంటే, అది కథనానికి డ్రైవింగ్ ఫోర్స్ గా పనిచేస్తుంది.
టెన్షన్ ని సృష్టిస్తుంది. కాన్సెప్ట్ ని ముందుకి నడిపిస్తుంది. పాత్రల్ని డెవలప్
చేస్తుంది. పాత్రలు అధిగమించాల్సిన సవాళ్ళని ఎత్తి చూపుతూ ప్రేక్షకుల్ని ఎంగేజ్
చేస్తుంది. కాన్ఫ్లిక్ట్ లేని కంటెంట్ లో డైనమిజం (చైతన్యం) కూడా వుండదు, స్తబ్దుగా వుండిపోతుంది.
ఇవన్నీ ఈ స్క్రీన్ ప్లేలో కొట్టొచ్చినట్టుండే లోపాలు.
అందుకని ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎలా వుందో చూద్దాం. సినిమా ప్లాట్ పాయింట్ 1 దగ్గర ఓ కాన్ఫ్లిక్ట్ సృష్టించిన ఘట్టంతోనే ప్రారంభమవుతుంది. అంటే రవిబాబు తీసిన ‘అదుగో’ లోలాగా, లేదా టీనేజి నోయర్ ‘బ్రిక్’ లోలాగా అన్నమాట. ఇలా ప్లాట్ పాయింట్ 1 ఘట్టంతో రైల్వే స్టేషన్లో ప్రారంభమవుతుంది సినిమా. ఓపెనింగ్ షాట్ లో రైలు వెళ్ళిపోయాక చూస్తే అక్కడ బెంచీ మీద కూర్చుని తీవ్రంగా దుఖిస్తున్న సత్య కనిపిస్తుంది (ఈ ఓపెనింగ్ షాట్ గా వేసిన దృశ్యంలో రైలు లెఫ్ట్ కి వెళ్ళిపోతుంది- కానీ ఈ ప్లాట్ పాయింట్ 1 ఘట్టం ఫ్లాష్ బ్యాక్ ముగించుకుని తిరిగి ఇదే స్పాట్ కొచ్చినపుడు- రైలు రైట్ కి వెళ్తూ కనిపిస్తుంది!).
ఈ ఘట్టం ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగంగా ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. రాజు, సత్య ఇతర పాత్రల పరిచయమూ, రాజూ సత్యల ప్రేమాయణమూ మొదలైన బిగినింగ్ బిజినెస్ మొదటి రెండు టూల్స్
తో నేపథ్యం ఏర్పాటవుతుంది. ప్రేమించుకుంటున్నారు, కానీ రాజు
వేటకి సముద్రం మీదికెళ్ళి నెలలకి నెలలు కనపడకుండా పోతూంటే సత్యకి తీవ్ర అసంతృప్తి.
ఒక రోజు వేటకెళ్ళిన జాలరి ఒకతను శవమై తిరిగి రావడంతో సత్యకి భయం పట్టుకుంటుంది-
రాజుకి కూడా ఇలా జరిగితే? (బిగినింగ్ బిజినెస్ లో మూడవ టూల్-
సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన అన్నమాట).
తర్వాత తండ్రిని అడుగుతుంది- నువ్వెందుకు వేట కెళ్ళవని. ఒకసారి అతను కొన్ని నెలలు వేట కెళ్ళి వచ్చేసరికి భార్య గుండెపోటుతో చనిపోయిందని తెలుస్తుంది. దీంతో చివరి చూపులు కూడా దక్కని భార్య సమాధి దగ్గరకెళ్ళి ఏడ్చాడు. కూతుర్నీ ఇలాగే దూరం చేసుకోకూడదని ఆమెని చూసుకునేందుకు వేట మానేశాడు. మరి ఈ పని మానెయ్యమని రాజుకి ఎందుకు చెప్పలేదని అడిగితే, రాజు విషయం నీకే వదిలేస్తున్నానని అంటాడు.
సత్య ఇప్పుడు వేట మానెయ్యమని రాజుకి చెప్పేస్తుంది. జాలరి మరణం ఆమెని భయపెడ్తోంది. రాజు కొట్టి పారేస్తాడు. చావొచ్చేదుంటే ఎక్కడున్నావస్తుందంటాడు. పైగా తాను నేల మీద కన్నా సముద్రం మీద స్ట్రాంగ్ అంటాడు. ఆమె అస్సలు వినిపించుకోదు. ఒట్టేయించుకుంటుంది. ఇంతలో ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుంది- రేపుదయం స్టేషన్ కొచ్చేయమని.
ఉదయం చూస్తే రాజు వుండకపోయేసరికి స్టేషన్ కి పరిగెడుతుంది. రైలు వచ్చి వుంటుంది. రాజు సహా బృందం ప్లాట్ ఫామ్ మీద వుంటారు. రాజుని పట్టుకుని నిలదీస్తుంది. ఆమె భయపడుతున్నట్టు జరగదని అదే సమాధానం చెప్తాడు. ఈసారి రాగానే పెళ్ళి చేసేసుకుందామంటాడు. ఇంకేదో అంటాడు. ఏదీ విన్పించుకోదు. తండేల్ గా ఇప్పుడు తన మీద వాళ్ళందరి కుటుంబాల బాధ్యత వుందంటాడు. నేనా- తండేలా చెప్పమంటుంది. చెప్పలేక పోతాడు. రైలు బయల్దేరుతూంటే ఏడ్వ వద్దని, నవ్వమనీ బ్రతిలాడుకుని రైలెక్కేస్తాడు. ఆమె ఏడుస్తూనే వుంటుంది. రైలు వెళ్ళిపోతుంది. ఇదీ బిగినింగ్ బిజినెస్ నాల్గవ టూల్ గా సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్) సృష్టించిన ప్లాట్ పాయింట్ 1 ఘట్టం.
చూస్తే క్యారక్టర్ పరంగా రాజు బాధ్యతల నుంచి పలాయనం చిత్తగించే పాసివ్ క్యారక్టర్ లా వున్నాడు. నమ్మదగ్గ ప్రేమికుడిలా లేడు. ఎక్కడా అతను ఆమె పక్షాన నిలబడ్డం లేదు. ఆమె కంటే వేట, వేటగాళ్ళ బృందమే ముఖ్యమనే మైండ్ సెట్ తో వున్నాడు. ఆమె ముందే ఫ్రెండ్ నుంచి స్టేషన్ కి రమ్మని కాల్ వస్తే, రానని చెప్పలేదు. అప్పటికి వెళ్ళనని ఒట్టేశాడు. అయినా రానని చెప్పకుండా, ఆమెకి తెలియకుండా జంపయ్యాడు. దొంగబుద్ధితో ఇతనేం ప్రేమికుడన్నది ప్రశ్న!
స్టేషన్ లో -ఈసారి రాగానే పెళ్ళి చేసుకుందామని అంటాడు. ఏదో తప్పించుకోవడానికి అన్నట్టు అనేస్తాడు. ఇక్కడా ఆమెకి నమ్మకం కల్గించడు. ఏడుస్తున్న ఆమెని నవ్వమని బ్రతిలాడుకుంటాడు. తను ఏం ప్రూవ్ చేసుకున్నాడని ఆమె నవ్వుతుంది. తండేల్ గా సొంత మనిషితో పెద్ద మనిషి తరహా కనిపించదు. అందుకని ఏడుస్తున్న ఆమెని అలాగే వదిలేసి రైలెక్కేసి వెళ్ళి పోయాడు!
సినిమా కథకి లాజిక్ అవసరం
లేదేమో, కానీ క్యారక్టరైజేషన్ కి లాజిక్కే కావాలి. ఎందుకంటే
నిత్యజీవితంలో మనందరికీ మానవ సంబంధాలు అనుభవమవుతాయి- దాంతో మనుషుల తత్వాలు
తెలిసిపోతాయి. సినిమా పాత్రల మధ్య దీన్నే చదువుతారు ప్రేక్షకులు. ఏ పాత్ర అసహజమో, ఏ పాత్ర సహజమో తెలిసిపోతుంది. అసహజ పాత్రని వాళ్ళ అంతరంగం అంగీకరించదు.
నాగచైతన్య రాజు పాత్ర అసహజమని ఇట్టే తెలుసుకున్నాక ఫాలో అవడానికి ఇబ్బంది పడతారు.
ముందు పాత్ర హిట్టవ్వాలి. అప్పుడు సినిమా దానికదే హిట్టవుతుంది.
ప్లాట్ పాయింట్ వన్ ఘట్టమంటే బిగినింగ్ (ఫస్ట్ యాక్ట్) ముగిసి, మిడిల్ (సెకండ్ యాక్ట్) ప్రారంభమయ్యే మలుపు. అంటే పాత్రకి ఆ కాన్ఫ్లిక్ట్ లొంచీ గోల్ ని సృష్టించే టర్నింగ్ పాయింటు. అంటే కథా ప్రారంభం. ఇంతదాకా బిగినింగ్ లో చూపించిందంతా కథ కాదు. మిడిల్లో ప్రారంభమయ్యే కథకి ఉపోద్ఘాతం మాత్రమే. మరి మిడిల్లో కథ ప్రారంభవమవడానికి ఇక్కడ రాజుకి గోల్ ఏది? సత్యతో తలెత్తిన కాన్ఫ్లిక్ట్ కి తనదంటూ గోల్ ఏర్పాటు చేసుకోకుండా జంపయ్యాడు. మరి సెకండాఫ్ మిడిల్ ఎలా నడవాలి కథ. కాబట్టి ఈ కంటెంట్ కథ కాదు. పాసివ్ పాత్రల గోల్ లేని గాథ అని ప్రూవ్ అవుతోంది!
4. సత్య సంగతీ డిటో
ఇక సత్య కూడా రాజు కేం తీసిపోలేదు. రాజు ఏడాదిలో 9 నెలలు వేట కెళ్ళి తనకి దూరంగా వున్నా ఆమెకి
అభ్యంతరం లేదు. వేట కెళ్ళిన ఒక జాలరి చనిపోతే మాత్రం ఆమెకి భయం పట్టుంకుంది రాజు గురించి.
ఇదిలా వుంటే, వేట కెందుకు వెళ్ళడం లేదని తండ్రిని అడిగినప్పుడు, అతను
నెలల తరబడి వేట కెళ్తే ఇంటిదగ్గర భార్య చనిపోయిన విషయం కూడా తెలియలేదనీ, అందుకని సత్యని కూడా దూరం చేసుకోకూడదని వేట మానేసినట్టు చెప్పాడు. మరి
రాజు చేత వేట ఎందుకు మాన్పించలేదంటే, రాజు విషయంలో నువ్వే
నిర్ణయం తీసుకోవాలని చెప్పేశాడు.
ఇతడి వాదం కూడా విచిత్రంగా వుంది. కూతురికోసం
తను వేట మానేసినప్పుడు, అదే కూతుర్ని వేటకెళ్ళే రాజుకెలా
కట్టబెడతాడు? నీ నిర్ణయమని ఎలా అంటాడు?
సత్య కి ఏ పరిస్థితుల్లో తన తల్లి చనిపోయిందో దాని గురించి బాధ భయం లేవు. ఇదే
పరిస్థితి రేపు రాజుతో తనకూ ఎదురవ్వచ్చన్న స్పృహ కూడా లేదు. తల్లి మరణం, తన కోసం తండ్రి చేసిన త్యాగం ఇవేవీ ఆమెని రాజుని ప్రేమించడానికి అడ్డుకాలేదు-
ఒక జాలరి చనిపోతే మాత్రం భయం పట్టుకుంది!
ఇలా పరస్పర విరుద్ధ పాయింట్లు సత్య
పాత్రకి కల్పించడంతో పాత్ర కన్ఫ్యూజన్ లో
పడి, ఆ రకంగా పాత్ర చిత్రణని కథకుడి నుంచి
అంగీకరించింది...ఈ మరణాలు, త్యాగాలూ లేకుండా సింపుల్ గా
ప్రేమలో సమస్యలు తెచ్చి పెట్టే పాయింటు ఒకటి అంత స్పష్టంగా వుండగా, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేసుకున్నట్టు కథకుడు?
వేట కెళ్ళి తొమ్మిది నెలలు కనిపించకుండా పోయే రిలవెంట్ సమస్యకన్నా
వేరే కారణం ఏం కావాలి సత్యకి గొడవ పడడానికి? తొమ్మిది నెలలు
దూరంగా వుండే ప్రేమ నాకొద్దు - అంటే ఎవరైనా ఆమె పక్షానే సమర్ధించడాని కొస్తారు.
సింపుల్. దీని గురించి అనవసరంగా తండ్రి ఫ్లాష్ బ్యాక్ సీన్లు, జాలరి
మరణం సీన్లు వేసి కథని గజిబిజి చేసి, బోలెడు బడ్జెట్ ని వృధా చేసినట్టే కదా?
ఇక రాజు వెళ్ళిపోయాక సత్యని తండ్రి స్టేషన్
నుంచి ఇంటికి తీసికెళ్తాడు. వెంటనే తనకి పెళ్ళి సంబంధం చూడమని అనేస్తుంది. రాజు మీద
కోపంతో ఈ మాటనేస్తుంది. చంద్ర (కరుణాకరన్)
అనే అతను పెళ్ళి చూపుల కొస్తాడు. సినిమా చివరి దాకా ఇతను సస్పెన్స్ లోనే వుంటాడు పెళ్ళి
చేసుకుంటుందా లేదాని. అంటే దాదాపు రెండేళ్ళ కథాకాలం! సత్యకే స్పష్లత లేదు ఏం చేయాలో.
తండేల్ గా ఎదిగిన రాజుపట్ల గౌరవాభిమానాలు లేకపోవడమే గాక, అలాటి
తండేల్ గా హోదా పెరిగిన రాజుకి కాబోయే జీవిత భాగస్వామినిగా తాను హూందాగా ప్రవర్తించాలన్న ఆలోచనే కూడా
లేదు!
కాన్ఫ్లిక్ట్ లోంచి రాజుకి గోల్
పుట్టాలంటే 4 గోల్ ఎలిమెంట్లు కావాలి. కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్. కాన్ఫ్లిక్ట్
పుట్టాలంటే సత్యతో భేదాభిప్రాయం రావాలి. ఆమె 9 నెలలు కనిపించకుండా పోయే ప్రేమా పెళ్ళీ
నాకొద్దంటుందనుకుందాం. అప్పుడు తప్పదంటాడు. సరే, నీది చిన్నప్పట్నుంచీ వేట కెళ్తున్న అలవాటు కదా, ఎకాఎకీన మానుకోమని నేనూ
అనను- ఇదిగో ఇది కడుతున్నాను, టైమ్ తీసుకుని ఆలోచించుకో, అప్పుడు కూడా వేటే ముఖ్యమనిపిస్తే దీన్ని తెంచి సముద్రంలో పారేయ్- అని
అతడి చేతికి దారం కట్టిందనుకుందాం...
ఇరుక్కుపోతాడు. ఆడది గుర్తుగా ఏదైనా ఇచ్చిందంటే ఇక పీక్కోలేడు మగాడు. రాజు మాటలు త్రుంచి
వేయవచ్చు-ఆమె కట్టిన దారం మాత్రం తెంచి పారెయ్యలేడు. సెంటిమెంటు. సక్సెస్ ఫుల్
బాక్సాఫీసు ఫార్ములా కూడా. మొత్తం ఈ దారం అనే ప్లాట్ డివైస్ మీదే ఆధారపడి ఇక ప్రేమ
కథ!
కాన్ఫ్లిక్ట్ లో కథ ఓ నిర్ణీత పాయింటుకొచ్చి దాన్ని హైలైట్ చేస్తూ పాత్రలకి ఛాలెంజీ విసరకపోతే అది ఆర్గ్యుమెంట్ తో కూడిన కథగా మారదు. ఇదేలాస్ట్ వేట, మళ్ళీ వెళ్ళను-నిన్ను పెళ్ళి చేసుకుని వేరే పని చేసుకుంటానని అతను కన్విన్సింగ్ గా ప్రామీజ్ చేయడమో, లేదా అతను వేటే ముఖ్యమనుకుంటే ఆమె దారం కట్టో, ఇంకేదో పెట్టో చాలెంజీ విసరడం చేయకుండా- రైల్వే స్టేషన్ సీన్లో రాజూ సత్యలు అసలు పాయింటుకి రాకుండా ఎంత గొడవపడి విడిపోయినా - అది గాథకి పనికొచ్చే నస అనిపిస్తుందే తప్ప- కథని పుట్టించి ముందుకి నడిపించే యాక్షనబుల్ కాన్ఫ్లిక్ట్ అవదు.
ఇప్పుడు సత్య కట్టిన దారాన్నే తీసుకుని రాజు గురించి ఆలోచిద్దాం. ఇప్పుడేం చేస్తాడు- అన్న హుక్ తో, సస్పెన్స్ తో సెకెండ్ యాక్ట్ లో కథ ఆసక్తికరంగా ప్రారంభమవుతోంది. ఇప్పుడు సత్యతో ఇలా పుట్టిన కాన్ఫ్లిక్ట్ ని ఎలా పరిష్కరించాలన్నదే అతడి గోల్. ఈ గోల్ ఎలిమెంట్స్ లో పరిష్కారం అతడి ‘కోరిక’, దీనికి తండేల్ గా (నాయకుడిగా) తన పదవీ పరువూ ‘పణం’ గా పెడుతున్నాడు (వేట కెళ్ళక పోతే నీ పదవీ పరువూ పోతాయా అని సత్యే అన్నది). పరిణామాల హెచ్చరిక కోసం బిగినింగ్ లో రాజు తల్లితోనో, మరొక బంధువుతోనో లీడ్ ని క్రియేట్ చేయాలి- ‘శివ’ లో నాగార్జున అన్న కూతురిలాగా. ఇక ఈ మూడు టూల్స్ ని డ్రైవ్ చేస్తూ వాటిలోంచి ఎమోషన్స్ ని క్రియేట్ చేస్తే గోల్ – దాంతో కథా కథనాలూ బలంగా వస్తాయి. కథలో భావోద్వేగాలనేవి గోల్ వున్న కాన్ఫ్లిక్ట్ లొంచే పుట్టాలి తప్ప- గోల్ వున్న కాన్ఫ్లిక్ట్ ని వదిలేసి వేరే సన్నివేశాలతో క్రియేట్ చేస్తే అవి కథకి సంబంధించిన భావోద్వేగాలనిపించుకోవు. తండేల్ గా రాజు తోటి జాలర్లకి నాయకుడే గానీ, కాన్ఫ్లిక్ట్ లో నాయకుడుగా అతడికే గోలూ లేదు! ఇదీ మౌలిక సమస్య.
పైన చెప్పిన కాన్ఫ్లిక్ట్ తర్వాత, ఇంటర్వెల్లో రాజు బృందం సహా సముద్రంలో పాక్ దళాలకి చిక్కుతాడు. ఇంటర్వెల్
సీను కాబట్టి కథకి ఇదే కాన్ఫ్లిక్ట్ అవుతుందా? కాదు, ఈ కాన్సెప్ట్ రాజూ సత్యల ప్రేమ గురించే తప్ప పాక్ లో బందీలైన జాలర్ల
గురించి కాదు. కాబట్టి ఈ ఇంటర్వెల్ సీను దీనికి ముందు చూపించిన రాజూ సత్యల మధ్య ప్రేమలో పుట్టిన కాన్ఫ్లిక్ట్
దుష్పరిణామమే అవుతుంది తప్ప కాన్ఫ్లిక్ట్ కాదు! ఇది తెలుసుకోకపోవడం వల్ల ఇదే
కాన్ఫ్లిక్ట్ అనుకుని సెకండాఫ్ నడపడంతో- ప్రేమ కథ చెదిరిపోయి- పాక్ జైలునుంచి
బయటపడేందుకు జాలర్లు చేసే స్ట్రగుల్ గా మారిపోయింది సెకెండాఫ్.
సెకండాఫ్ పూర్తిగా పాకిస్తాన్ జైల్లో జాలర్ల గాథ. ఇక రొటీన్
గా పాక్ ఖైదీలతో పోరాటాలు, దేశభక్తి ప్రదర్శనలు వగైరా.
అసలు రాజు సముద్రంలో ఒక పాకిస్తానీని కాపాడే ప్రయత్నంలో సరిహద్దుని దాటడం వల్ల పట్టుబడ్డాడు.
ఈ విషయం ఎక్కడా చర్చకి రాదు. రాజు దీన్ని రుజువు చేసుకుంటే కేసే లేదు. కానీ కేసు గురించి ఏ ప్రయత్నాలు చేయకుండా, బృందంతో కష్టాలు అనుభవిస్తూ వుండి పోతాడు. సత్యని ఆ
పరిస్థితుల్లో వదిలేసి వచ్చిన తనకి ఆమె గురించి ఆలోచనే వుండదు. ఆమె అందమైన ఉత్తరాలు
రాస్తుంది. రాజు వద్దనుకుని చంద్రని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న తను ఇంకా రాజుకి ఉత్తరాలు
రాయడమేమిటో. సెకండాఫ్ లో ఇంటిదగ్గర ఒక సీన్లో అంటుంది- వాడి మీద ప్రేమ చచ్చిపోయింది, నామాట ఆ వినకుండా వెళ్ళి పోయాడని. ప్రేమ చచ్చిపోయాక ఇంకేం ప్రేమ గాథ.. ఈ క్యారక్టర్లేమిటో
అస్సలర్ధం గావు!
అయినా రాజునీ అతడి బృందాన్నీ విడిపించేందుకు అరకొర ప్రయత్నాలు చేస్తుంది. అవేమీ ఫలించవు. ఇంతలో పాక్ ప్రభుత్వం జాలర్లని ఆగస్టు 15న విడుదల చేయాలని నిర్ణయిస్తుంది. ఆగస్టు 15 న భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు అదేదో గిఫ్టు గా అన్నట్టు విడుదల చేయడమేమిటి- గర్వంగా వాళ్ళ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 14 న విడుదల చేయకుండా?
ఇంతలో ఆగస్టు 5 న కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు కావడంతో ఈ విడుదల ఆగిపోతుంది. ఫర్వాలేదు, కానీ ఆర్టికల్ 370 రద్దయితే పాక్ ప్రజలు భారీ యెత్తున హింసకి పాల్పడమేమిటి? ఇలాటి చాలా అవాస్తవిక చిత్రణలతో అనుకున్న దేశభక్తి ఫార్ములాతో బాక్సాఫీసుని జయించాలన్న ప్రయత్నం ఫలించలేదు. దర్శకుడు చందూ మొండేటి ‘కార్తికేయ 2’ లో మతభక్తితో నార్త్ ప్రేక్షకుల్ని విజయవంతంగా ఆకట్టుకున్నట్టు -ఈ సారి దేశభక్తితో ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నం లాభించ లేదనడానికి ఏడు రోజుల నార్త్ కలెక్షన్స్ 40 లక్షలే సాక్ష్యం.
'తండేల్’ లాంటి సీమాతర కాన్సెప్ట్ ని దేని
మీద ఫోకస్ చేయాలో తెలిపే పాకిస్థానీ మూవీ ఒకటి వుంది. 2008లో బాధిత హిందువు
గురించి ఒక పాకిస్థానీ మూవీ తీశారు. మెహరీన్ జబ్బార్ దర్శకురాలు. పేరు ‘రామ్ చంద్ పాకిస్థానీ’. అనుకోకుండా భారత భూభాగంలోకి
ప్రవేశించిన బాలుడి నిజ కథే ఇది. ఏడేళ్ళ రామ్ చంద్ సరిహద్దులో ఒక పాక్ గ్రామంలో
నివసించే దళిత హిందూ కుటుంబానికి చెందిన వాడు. ఒకరోజు తండ్రితో కలిసి అనుకోకుండా
సరిహద్దు దాటి భారత్ వైపు వచ్చేస్తాడు. వీళ్ళు గూఢచర్యం ఛేస్తున్నారని భద్రతా
దళాలు పట్టుకుని గుజరాత్ జైల్లో వేస్తారు.
ఇప్పుడు ఈ కాన్సెప్ట్ దేని గురించి వుండాలి? అంతర్జాతీయ సంబంధాల కోవకి చెందే ఈ కాన్సెప్ట్ రాజకీయంగా సరైన వైఖరితో, లౌకిక దృక్పథంతో –చొరబాట్లకి సంబంధించిన చట్టాలతో న్యాయ ప్రక్రియ/పోరాటం గురించే వుండాలి. ఇలాగే వుంది. వేరే ఏ దేశభక్తి, కులం, కులంలో అంటరానితనం, మతం, ప్రాంతం మొదలైన భావోద్వేగాల, మనోభావాల జోలికి పోకుండా, న్యాయ ప్రక్రియ/ పోరాటం మీదే ఫోకస్ చేసి వుంది.
అయితే ఈ పాక్ దళిత తండ్రీ కొడుకుల మీద ఇండియన్ పోలీసుల దౌర్జన్యం కూడా వుంది. ఇలా చూపిస్తే ముందు నీ దేశంలో దళితుల పరిస్థితి తెలుసుకో అంటారేమోనన్నట్టు, ముందే ఇలా కౌంటర్ ఇచ్చేసినట్టుంది. 9 అంతర్జాతీయ అవార్డులు పొందిన ఈ మూవీ ‘తండేల్’ ని పూర్తిగా దాని సీమాంతర ప్రేమ ‘కథ’ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేసి తీసి వుంటే - బాక్సాఫీసు ఫలితాలు ఇంకింత బలీయంగా వుండేవని తెలియజేస్తోంది.
సెకండాఫ్ లో జైల్లో వేస్తున్నప్పుడు
సోదా చేసి సెల్ ఫోన్లు సహా అన్ని వస్తువులూ తీసేసుకుంటారు. ఈ సెల్ ఫోన్ల దగ్గర -ప్రేమ
కథ తెగిపోయిన ఈ గాథని పూర్తి స్థాయి ప్రేమ కథగా మార్చే లవ్ ట్రయాంగిల్ ఎలిమెంట్ వుంది.
అదేమిటంటే- జైలు అధికారులు సెల్ ఫోన్లు చెక్ చేయకుండా వుండరు. అప్పుడా రాజు సెల్ లో
సత్యతో ఫోటోలు, వీడియోలు చూస్తే? ఇదొక్కటి
చాలు జైలు అధికారి ప్రేమ కథలో దుష్టపన్నాగం పన్నడానికి. ఇంతేకాదు, రాజు చేతికి సత్య దారం కట్టి వుంటే అది కూడా తీసేయమంటారు జైలు అధికారులు.
రాజుకి సత్యతో రియల్ టెస్టు ఇక్కడే. అతను దారం తీయడు, జైలు నిబంధనల ప్రకారం దారం తీయకపోతే వాళ్ళూ ఊరుకోరు. ఈ దారం కథే ప్రేమ కథని
లా క్కెళ్తుంది. ఇలాకాదనీ జైలు అధికారి సత్యనే మాయోపాయంతో వాఘా బోర్డర్ కి రప్పిస్తే...??
జస్ట్ ఇదొక పిచ్చి వూహ.
టేకిటీజీ, ఆల్ ది బెస్ట్.
—సికిందర్