రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, నవంబర్ 2016, శుక్రవారం

రివ్యూ!









రచన-దర్శకత్వం: శివ రాజ్ కనుమూరి

తారాగణం: శ్రీనివాసరెడ్డి, పూర్ణ, శ్రీవిష్ణు, కృష్ణుడు, రవివర్మ, కృష్ణ భగవాన్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, జీవా, జోగినాయుడు తదితరులు 
సంగీతం: రవిచంద్ర,  ఛాయాగ్రహణం : నాగేష్ బన్నెల్
బ్యానర్: శివరాజ్‌ ఫిలిమ్స్‌ 
నిర్మాతలు: శివరాజ్ కనుమూరి-సతీష్ కనుమూరి,
విడుదల: 25 నవంబర్, 2016
***
        కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా గతంలోనే ‘గీతాంజలి’ అనే హార్రర్ కామెడీలో నటించాడు. తిరిగి ఇప్పుడు ఓ ప్రేమకథలో నటిస్తూ ప్రేక్షకుల ముందు కొచ్చాడు. కొత్త దర్శకుడు శివరాజ్ కనుమూరి కమెడియన్ అయిన శ్రీనివాస రెడ్డికి కామెడీ పాత్రకాక సీరియస్ పాత్రలో చూపించదల్చుకున్నారు. ఒక ఆత్మవిశ్వాసం లేని వాణ్ణి నిండు ఆత్మవిశ్వాసం గల వాడిగా తయారుచేసే బాధ్యత మీదేసుకుని, ప్రేమకథ ద్వారా దీన్ని చూపించ దల్చుకున్నారు. పాత రోజుల్లో రాజబాబు లాంటి కమెడియన్లు సీరియస్ పాత్రలేసిన రోజులున్నాయి. ఇప్పుడు శ్రీనివాస రెడ్డి వేసిన సీరియస్ పాత్ర ఎలావుందో చూద్దాం.


కథ 
         ఓ రాత్రిపూట సముద్రపుటొడ్డున ఎమోషనల్ గా చూస్తూ నిలబడి వుంటాడు సర్వమంగళం అలియాస్ సర్వం (శ్రీనివాస రెడ్డి). మెళ్ళో వున్న తాయత్తు  తెంపి సముద్రంలోకి కసికొద్దీ విసిరేస్తాడు. ఎందుకలా విసిరేశాడు, ఆ తాయత్తుతో అతడికున్న సంబంధమేమిటి, చెప్పడానికి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది... 

          2013 లో ఆంధ్రప్రదేశ్ ఇంకా విడిపోలేదు. కరీంనగర్ లో సర్వం కి వయస్సు ముప్పై దాటినా ఉద్యోగం రావడం లేదు. అతను ఆత్మవిశ్వాసం లేనివాడు. మూఢ విశ్వాసాలు పెంచుకుని ప్రతీదానికీ బాబా (జీవా) చెప్పే జ్యోతిష్యాల మీద ఆధారపడతాడు. పరీక్ష రాయాలన్నా బాబా చెప్పే ముహూర్తానికే వెళ్లి రాస్తాడు. ఒకరోజు బాబా, ఓ రాత్రి స్మశానంలో నిద్రపోతే ఉద్యోగం వస్తుందంటే అలగేపడుకుని ఉద్యోగం తెచ్చుకుంటాడు సర్వం. కాకినాడ మునిసిపాలిటీలో పోస్టింగ్ వస్తుంది. చీరలు నేసి కుటుంబాన్ని గడుపుకోస్తున్న తల్లితో ఇక్కడే ట్రాన్స్ ఫర్ చేయించుకుని వస్తానని కాకినాడ వెళ్తాడు.

          అక్కడ ఆఫీసులో ఆంధ్రా వాళ్ళ మధ్య తెలంగాణా యాస మాట్లాడుతూ అమాయకంగా, బుద్ధిమంతుడిలా ఉంటాడు. పక్కనే మీ సేవా కేంద్రంలో పనిచేసే రాణి (పూర్ణ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ చెప్పే ధైర్యం చాలదు. ఆమెకోసం మరో ఇద్దరు ప్రయత్నిస్తూంటారు. వాళ్ళని ఎదిరించలేక, ఆమెతో వాళ్ళ చేష్టల్ని నిస్సహాయంగా చూస్తూంటాడు. వాళ్ళలో ఒకడు జేసీ (రవివర్మ) అనే పై అధికారే. ఇతను అమ్మాయిలకి వలేసి రాత్రిపూట సర్వం గదికి తెచ్చుకుంటూంటాడు. సర్వం బయట గడుపుతూంటాడు. అలా ఓరాత్రి ఆ జేసీ ప్రేమని నమ్మి, అది సర్వం  గది అని తెలీక జేసీతో వస్తుంది రాణి. షాక్ తిన్న సర్వం ఈమెనెలా కాపాడాలా అని కంగారు పడిపోతాడు. బాబా సలహా కోసం ఫోన్ చేస్తాడు....ఇదీ విషయం. 

        ఆత్మవిశ్వాసంలేని మూఢవిశ్వాసాల పిరికి సర్వం ఎలా ధైర్యవంతుడై, తను ప్రేమిస్తున్న రాణిని కాపాడుకుని-  తన ప్రేమని ఎలా తెలియజేశాడూ  అన్నది మిగతా కథ

ఎలావుంది కథ

      రోమాంటిక్ డ్రామా... పాత స్టయిల్లో వుంది. ఇందులో కథతో సంబంధం లేని అనేక పాత్రలతో కామెడీ ట్రాకులున్నాయి. కొత్తదనం కోసం ప్రయత్నిచకుండా, ప్రూవైన పాత ఫార్ములానే నమ్ముకుని సేఫ్ జర్నీ చేద్దామనుకున్నట్టుంది  దర్శకుడి ఆలోచన.  అంధవిశ్వాసాలు మాని ఆత్మవిశ్వాసం పెంచుకోండి- అని చెప్పడం దర్శకుడి ఉద్దేశం. ఈ ఉద్దేశం ఉన్న చివరి  అరగంటలోనైనా, ఆచరణలో కామెడీ ట్రాకుల అడ్డంకి వల్ల సూటిగా ప్రేక్షకుల హృదయాల్లోకి దిగేలా చెప్పలేక పోయాడు. ‘కోయీ మిల్ గయా’ లో హృతిక్ రోషన్ తో ఇదే ఉద్దేశాన్ని సూటిగా బలంగా చెప్పడం వుంటుంది. ఒక హాలీవుడ్ మూవీలో పిరికి వాడైన తండ్రి, తన కూతురి ముందు ఒక బలవంతుడు  తనని చెంప దెబ్బ కొట్టాడని, ఆ కూతురిముందే కొట్టి పరువు నిలుపుకోవాలన్న లక్ష్యంతో సాగే కథనం బిగి సడలకుండా,  కదిలించేలా వుంటుంది.

ఎవరెలా చేశారు
       సెకండాఫ్ లో ఇంకో ఇరవై  నిమిషాలూ గడిచేదాకా అణిగిమణిగి అమాయకంగానే – పాసివ్ గా వుండే శ్రీనివాస రెడ్డికి - మెళ్ళో తాయత్తు తెంపి పారేసి ధైర్యవంతుడయ్యాక హుషారోస్తుంది. తిరిగి తన ట్రేడ్ మార్క్ కామెడీతో  నవ్వించడం మొదలుపెడతాడు- తనని ఏడ్పించిన వాళ్ళని ఏడ్పిస్తూ. అయితే ఇది కాస్సేపే- ఓ రెండుమూడు సీన్లు. ఆ తర్వాత మళ్ళీ షరామామూలే.  తన గోల్ కోసం నవ్వించడం మానేసి సీరియస్ గా మారిపోతాడు. హీరోయిన్ తో నైనా ఎంటర్ టైన్ చేసే ఆలోచన వుండదు. ఆ ప్రేమ ఏదో అమర ప్రేమలాగా- ‘మేఘసందేశం’లో ఏఎన్నార్ ప్రేమలాగా గంభీరంగా వుంటుంది. కానీ ఈ సినిమా రో మాంటిక్ కామెడీ కాకుండా, రోమాంటిక్ డ్రామా అయినప్పుడు ఇది కరెక్టే. ఇలాగే చూడాలి ప్రేక్షకులు. ఇక క్లయిమాక్స్ ని కమెడియన్లకి అప్పజెప్పేసి చివర్లో వస్తాడు. 

          హీరోయిన్ పూర్ణ ది కూడా గంభీరమైన పాత్ర. ఒక్కసారి కూడా అల్లరిగా నవ్వుతూ కన్పించదు. చిన్న స్మైలిచ్చి వూరుకుంటుంది- తన పాత్రకి హుషారే వుండదు. ముగ్గురి మధ్య ఎవర్ని నిర్ణయించుకోవాలో తెలీని అయోమయమాన్ని మాత్రం బాగా ప్రదర్శించింది.

          ఇక సినిమా నిండా చాలా మంది కమెడియన్లున్నారు. వీళ్ళు  కథతో సంబంధం లేకుండా వాళ్ళ కామెడీ వాళ్ళు చేసుకుంటూంటారు. కృష్ణభగవాన్ ‘మంగళవారం’ కామెడీకి  ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వుంది. మున్సిపాలిటీలో తన పనిజరగని పోసాని కామెడీ కూడా. 

          పాట ఒక్కటే బావుంది. నేపధ్యసంగ్గేతంలో క్వాలిటీ లేదు. కెమెరా వర్క్ కూడా అంతంత మాత్రంగానే వుంది పాట సినిమా చూస్తున్నట్టు.
చివరికేమిటి 

  కొత్తదర్శకుడు పాతనే నమ్ముకున్నాడు. పాతని కూడా సరీగ్గా చెప్పలేకపోయాడు. ఇంటర్వల్ పడినా హీరో హీరోయిన్ల మధ్య ఏమీ ఎస్టాబ్లిష్ కాక, కథ మొదలవక నిస్తేజంగా వుంటుంది. దీనిక్కారణం ఫస్టాఫ్ మొదలుకుని, సెకండాఫ్ ఇంకో పావుగంట దాకా ఫ్లాష్ బ్యాక్ గా సాగడమే. ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోతేగానీ కథ మొదలవదన్న మాట. స్ట్రక్చర్ లేకపోవడం ఒకటీ, సీన్లు సాగదీయడం ఒకటీ, ముగించాల్సిన చోట కథ ముగించకుండా సాగదీయడం ఒకటీ దర్శకత్వాన్ని బలహీనపర్చాయి. చాలాచాలా చెప్పేయ్యాలన్న ఆత్రుత కూడా దర్శకుడికి ఎక్కువున్నట్టుంది. దీంతో నిడివి కూడా చాంతాడులా సాగిపోయింది. ఒక అశక్తుడి ఈ రోమాంటిక్ డ్రామాని బాగా ట్రిమ్ చేసి క్రిస్ప్ గా బలంగా- చెప్పే అవకాశం వుందిగానీ, అభత్రతా కారణాలవల్ల పాతనే బాగా నమ్ముకోవడంవల్ల- సహజంగానే ప్రధాన కథలో కొరవడిన వినోదాన్ని కమెడియన్లతో ఒక వేరే ప్యాకేజిగా ఇవ్వాలన్న ఆలోచనతో, ఈ సినిమాలో ఏవేవో విషయాలు చేరిపోయాయి. మొత్తానికి శ్రీనివాసరెడ్డి కామెడీ చేయకున్నా, యాక్షన్ సీన్స్ పెట్టుకోకపోయినా,  పోస్టర్ల మీద వేసినట్టు దీన్ని  ‘దేశవాళీ వినోదం’ (?) గా సరిపెట్టుకోమన్నాడు.

-సికిందర్
http://www.cinemabazaar.in