రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, ఫిబ్రవరి 2017, ఆదివారం

క్యారక్టర్ తో కాసేపు!


        కసారి దివంగత సినిమా రచయిత త్రిపురనేని మహారథి ఈ వ్యాసకర్తతో చెప్పారు- ‘సినిమా నిర్మాణంలో ఇదిలా తీస్తేనే విజయవంతమవుతుందని కొన్ని సెంటిమెంట్లు వుంటాయి. కానీ ఇవి ఆయా కాలాల్ని బట్టి మారుతూంటాయి. మారనిదల్లా పాత్రలకుండే సెంటిమెంట్లు’ అనేసి.  ఒక్క ముక్కలో సక్సెస్ మంత్రం మొత్తం చెప్పేశారు. ఇది ఆయన కాలంలో అందరూ పాటించేవారు. చరిత్రలోకి చూస్తే ఇది అర్ధమవుతుంది. క్రిందటి శతాబ్దంలో ప్రతీ రెండు దశాబ్దాల కోసారి సినిమాలు పాము కుబుసం విడిచేసినట్టు పాత  హంగులు వదిలేసి కొత్తవి ధరించుకు పోసాగాయి. తెలుగు సినిమాల తొలి స్వర్ణయుగమైన 1931-51 ల మధ్య  ( ‘భక్తప్రహ్లాద’ నుంచీ పాతాళ భైరవి’ దాకా) వచ్చిన లాంటి సినిమాలు మలిస్వర్ణ యుగంలో లేవు. మలిస్వర్ణ యుగం 1951 -71 ల మధ్య (‘మల్లీశ్వరి’ నుంచీ ‘చెల్లెలి కాపురం’ వరకూ)  సాగింది. ఈ మలిస్వర్ణయుగంలో వచ్చిన లాంటి సినిమాలు తర్వాత వ్యాపారయుగంలో లేవు. వ్యాపారయుగం 1971- 91 ల మధ్య (‘దసరాబుల్లోడు’ నుంచీ ‘గ్యాంగ్ లీడర్’ వరకూ) కొనసాగింది. ఇంతే, ఈ మూడు యుగాల్లో దాదాపు తరానికోమారు  సినిమాల తీరుతెన్నులు మారుతూ వచ్చాయి. రెండు దశాబ్దాలకోసారి కొత్త  తరం నిర్మాతలూ దర్శకులూ వచ్చేస్తూ సినిమాల్ని కొత్తబాట పట్టించసాగారన్నమాట!

         
1991 తర్వాత 2000ల వరకూ గ్లోబల్ యుగం ప్రారంభమైనా, వ్యాపార యుగాన్నే పట్టుకుని వుండిపోయారు.  2000 నుంచీ ప్రారంభమైన నెట్ యుగంలో యూత్ సినిమాలతో పెనుమార్పులొచ్చాయి. కొత్త కొత్త నిర్మాతలతో, దర్శకులతో మరోసారి తరం మారింది.  2000 ల నుంచీ ఇది నెట్ యుగం. ఈ నెట్ యుగం ఇప్పటికి దశాబ్దంన్నర పైగా కొనసాగుతూ వస్తోంది ఈ కొత్తతరం వాళ్ళతో. అయితే సినిమా లేమైనా ముందు కెళ్లాయా అంటే ఏమీ వెళ్ళలేదు. నిర్మాణంలో సెంటిమెంట్ల పరంగా వెనకటి తరాల్ని ఆశ్రయించి,  అప్పటి మలిస్వర్ణయుగపు, వ్యాపార యుగపు సెంటిమెంట్లనే  పట్టుక్కూర్చున్నాయి. నెట్ యుగంలో కూడా సినిమా నిర్మాణపు సెంటిమెంట్లు కాలానుగుణంగా మార్చుకోవడానికి ఇష్ట పడ్డం లేదు  ఈ నాల్గో తరం 4- జి  మేకర్లు. ఇందుకే ఇంకా రెండో తరం, మూడోతరం కాలాలకి చెందిన 2 – జి, 3 – జి బాపతు  ‘విన్నర్’ లాంటివి కానికాలంలో వచ్చి చతికిల బడుతున్నాయి. నెట్ యుగమంతా దారీతెన్నూ తెలీని అస్తవ్యస్త యుగమే. కారణం, రధసారధులు పుట్టకపోవడం.  క్రిందటి  మూడు యుగాల్లో యుగానికో తరం మారుతూ  పాతని వదిలించుకున్నట్టు ఇప్పుడు వదిలించుకునే ధైర్యం నాల్గో తరానికి వుండడం  లేదు.

          సృజనాత్మకతకి ప్రాప్తి స్థానాలు మారనంతవరకూ ఇంతే. గతయుగాల్లో ప్రాప్తి స్థానాలు సామాజిక పరిణామాలు, స్వయంకృషి. ఇప్పుడు డివిడిలు మాత్రమే. స్వయంకృషి, సొంత సృజనాత్మక లేని వాళ్ళే ఒకడుగు ముందు కెయ్యడానికి భయపడతారు. సినిమాలంటే తొలిస్వర్ణ యుగంలో వచ్చిన సినిమాలేనని సెంటి మెంట్లు పట్టుకుని కూర్చుని వుంటే మలిస్వర్ణ యుగం ప్రారంభమయ్యేదే కాదు. సినిమాలంటే మలిస్వర్ణయుగపు సినిమాలేనని సెంటిమెంట్లు పెట్టుక్కూర్చుంటే వ్యాపార యుగం ప్రారంభమయ్యేదే కాదు. సినిమాలంటే టోటల్ డబుల్ ధమాకాగా చేతికి తేరగా దొరికిన మలిస్వర్ణ యుగపు, వ్యాపార యుగపు  సినిమాలేనని  ఇంకా కాలంతీరిన అవే సెంటిమెంట్లతో, మంకుపట్టుపట్టి బోరవిరుచుకు తిరగడం వల్లే నెట్ యుగం ప్రారంభమవ్వాల్సిన తేదీకి ప్రారంభమై  చావడంలేదు! ఇంకా స్టార్టింగ్ ట్రబుల్ తోనే తైతక్క లాడుతోంది. పాత్ర నెట్ యుగంలో వుంటే, పాత్ర సృష్టికర్తేమో  పాతయుగాల్లో పాత సారా
పట్టిస్తూంటాడు. అరే  బాబూ, ఆ సారా మేం తాగాం, నువ్వు కాస్త  పబ్ కి పోయి బ్లాక్ డాగ్ కొట్టరా నాయనా - అని అక్కడి మార్గదర్శకులు మెడబట్టి ముందుకు తోసినా,  పాత సారాయే అమృత ధార అని అక్కడే అమరుడైపోతున్నాడు ది గ్రేట్ తెలివిలేని  టెల్గూ మూవీ మేకర్ నేడు!
                                         ***
      సోది ఆపి సంగతి చూద్దాం : నిజానికి టెంప్లెట్ స్క్రీన్ ప్లేల  గురించి మళ్ళీమళ్ళీ రాయడానికేమీ వుండదు, కొత్తగా తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన  స్క్రిప్టింగ్ విశేషాలూ వుండవు. బిగ్ బడ్జెట్ సినిమాల నుంచి భావితరాలు నేర్చుకోవడాని కేమీ వుండకపోవడం చాలా శోచనీయం. ఒక స్మాల్ బడ్జెట్  ‘ఘాజీ’ లోంచి నేర్చుకోవచ్చు, ఇంకో స్మాల్ బడ్జెట్ ‘అప్పట్లో ఒకడుండే వాడు’ లోంచీ నేర్చుకోవచ్చు. కానీ బిగ్ బడ్జెట్స్ నేర్పే పాఠాలేమీ వుండవు, అవి గుణపాఠాలు నేర్చుకోవడంతోనే సరిపోతోంది. అదే స్టార్ ఎంట్రీ, బిల్డప్ డైలాగులు, ఫైట్, గ్రూప్ సాంగ్, లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్, రెండు డ్యూయెట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, స్టోరీ, రెండు డ్యూయెట్స్, క్లయిమాక్స్ లీడ్, ఫోక్ సాంగ్, క్లయిమాక్స్, ఫైట్... ఈ వరస పెట్టుకుని రాసేస్తే అదే స్క్రీన్ ప్లే అయిపోతుంది. నిజానికి కథాబలంతో చిన్న చిన్న సినిమాల స్క్రీన్ ప్లేలు  రాయడానికే చాలా కష్టపడాలి గానీ, స్టార్ సినిమాలకి  అదే టెంప్లెట్ ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. అందులోకి పైన చెప్పుకున్న ఏ స్లాట్ లో ఆ ఆణిముత్యం   పడేస్తూ  పోతేసరి. మొత్తం 14 ఆణిముత్యాలు వుంటాయని గుర్తుపెట్టుకుని, అవి ఎక్కడెక్కడ పడెయ్యాలో  కొలతలతో సహా  బట్టీ పడితే  చాలు, అదే స్క్రీన్ ప్లే.  

          విన్నర్ ఈ ఆణిముత్యాలతో ఈ టెంప్లెట్ లోనే సెటిలయ్యాడు (స్టార్ ఎప్పుడూ కెరీర్ లో సెటిల్ కాడు- కారణం, టెంప్లెట్ లో సెటిల్ అవడం. టెంప్లెట్ ...టెంప్లెట్ ...టెల్గూ స్టార్...హౌ ఐ వండర్ వాట్ యూఆర్!). విన్నర్ కో తాత, తండ్రీ వుంటారు. వాళ్లకి హార్స్ రేసింగ్ కంపెనీ వుంటుంది. తండ్రి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. తాత అతణ్ణి బహిష్కరిస్తాడు. తండ్రిని బహిష్కరించాక  కంపెనీ నష్టాల పాలవుతుంది. కొడుకుని తెచ్చుకుంటేనే కంపెనీ బాగుపడుతుందని తాత కుడిభుజం సలహా ఇస్తాడు. అప్పటికి కోడలు చనిపోతుంది. దీంతో కొడుకునీ మనవణ్ణీ  తెచ్చుకుంటాడు తాత. కొడుకు రావడంతో రేసుల్లో గుర్రాలు గెలుస్తూ కంపెనీ బాగుపడుతుంది. కానీ తను కులం కాని కోడల్ని ఇష్టపడలేదు కనుక,  ఆమెకి పుట్టిన మనవడంటే అసహ్యం. వాణ్ణి  వెళ్ళ గొట్టేందుకు తండ్రి  మీద ద్వేషం పెరిగేలా చేస్తాడు. తాత కుట్రలు తెలియని మనవడు తండ్రితో బాటు రేసుల మీదా విపరీత ద్వేషంతో ఇల్లువిడిచి పారిపోతాడు ఐదేళ్ళప్పుడు.

          ఇప్పుడు పాతికేళ్ళ వయసులో విన్నర్ ఒక న్యూస్ పేపర్ కి క్రియేటివ్ హెడ్ గా వుంటాడు. ఒక గ్యాంగ్ పొలాల్ని పాడు చేస్తూ రేసులు పెడుతూంటే వెళ్లి ఫైట్ చేసి ఆ రైతుని కాపాడతాడు. అక్కడే దొరికిన హాట్ గర్ల్ తో పబ్ కెళ్ళి  సాంగ్ పాడతాడు. ఇక మనం లవ్ లో పడాలని అసిస్టెంట్ ని తొందరపెట్టి, పబ్ కెళ్ళి అమ్మాయిల్ని చూస్తాడు. హీరోయిన్ నచ్చుతుంది. ఆమె ఫోటో తీసి పేపర్లో వేస్తాడు. ఆమె వచ్చి గొడవ పెట్టుకుంటుంది. లవ్ ట్రాక్ మొదలెడతాడు. ఆమెకి లవ్ కంటే కూడా అథ్లెట్ గా మారథాన్ గెలవడం మీదే దృష్టి వుంటుంది. విన్నర్ ని దూరం పెడుతుంది. ఆమె దగ్గరవ్వాలంటే ఇంకా వరస్ట్ ఫెలో ని ఆమెకి ఎటాచ్ చేయాలనీ,  ఒక ఎస్సైని తగిలిస్తాడు. ఈ ఎస్సై లవ్ అంటూ  ఆమె వెంట పడుతూ కామెడీ ట్రాక్ మొదలెడతాడు.

          కొడుకు దూరమైన  తండ్రి, ఆ కొడుకు తిరిగి రావాలని యాగాలూ దానధర్మాలూ చేస్తూంటాడు.  ఈ వృధా ఆపాలని తాత  ఇంకో కుట్ర చేసి, విలన్ ని తెచ్చి వీడే నీ కొడుకు అంటాడు. తండ్రి నమ్మేసి విలన్ ని కొడుకులా చూసుకుంటాడు.

          విన్నర్ ఎస్సై తో వేసిన ప్లాన్ హీరోయిన్ కి అర్ధమై తిప్పి కొడుతుంది. తండ్రి బలవంతంగా చేస్తే  వేరే పెళ్ళికి సిద్ధమవుతుంది. ఆ పెళ్ళికొడుకు విలనే. విన్నర్ ఈ పెళ్లి చెడగొట్టాలని వెళ్లి,  పెళ్లి కూతురు నవ్వడం లేదనీ, ఫోటోలకి నవ్వాలనీ అంటే,  అతణ్ణి గుర్తుపట్టి ఆమె ఒక ప్లానుతో నవ్వుతుంది. పెళ్ళికి ఎదురు తిరుగుతుంది. విన్నర్ నే చేసుకుంటాననీ, అయితే విలన్ తో విన్నర్ రేసు గెలవాలనీ షరతు పెడుతుంది.

          అంతలో తండ్రి అక్కడికి రావడంతో విన్నర్ గుర్తుపట్టి తగ్గుతాడు. ఆ విలన్ కొడుకుగా  నటిస్తూ తన తండ్రి దగ్గర తిష్ట వేశాడని గ్రహిస్తాడు విన్నర్. ఈ పెళ్లి జరుగి తీరుతుందనీ, తన కొడుకే గెలుస్తాడనీ, విన్నర్ ఓడిపోతాడనీ తండ్రి  తీర్మానించడంతో విన్నర్ ఇరుకునపడి ఇంటర్వెల్.

          స్టోరీ స్టార్ అయి, తాత ఇంట్లో పనివాణ్ణి విన్నర్ కిడ్నాప్ చేసి వాడి ద్వారా అన్నీ తెలుసుకుంటాడు. చిన్నప్పుడు తాత తనతో చేసిన కుట్ర కూడా తెలిసిపోయి తండ్రి మీద ద్వేషం బదులు ప్రేమ పుట్టుకొస్తుంది. కొడుకు అని తెలీకుండా తండ్రి దగ్గరికెళ్ళి చిన్నప్పుడు తండ్రితో చేసిన సరదాలు డిటో తీర్చుకుంటాడు. ఇక మన బేబీని చూసుకుందామని హీరోయిన్ దగ్గరికెళ్ళి ఆమెని కిడ్నాప్ చేస్తాడు. ఆమె తిట్టేసరికి తీసికెళ్ళి  స్టేడియంలో పడేస్తాడు. స్టేడియంలో ట్రాక్ లోకి ఆమె దూకేసి మారథాన్ గెలిచేసి గోల్డ్ మెడల్ తో వచ్చేస్తుంది. తనకోసం విన్నర్ ఇంత చేసినందుకు మురిసిపోయి  లవ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇప్పుడొక డ్యూయెట్ తర్వాత కాస్త స్టోరీ, ఇంకో డ్యూయెట్టూ అయ్యాక, ఇంటర్వెల్ లో చేసిన ఛాలెంజి ప్రకారం విన్నర్ రేసు గుర్రం ట్రైనింగ్. 

          విన్నర్ మీద తాత, విలన్ ల ఎటాక్స్. ట్రైనింగ్ కి తండ్రి సహకారం. ఇక ఫోక్ సాంగ్. ఫోక్ సాంగ్  తర్వాత క్లయిమాక్స్ మొదలు. రేస్ కోర్సులో విలన్ తో విన్నర్ హార్స్ రేస్. యాక్షన్. విన్నర్ గెలుపు. విన్నరే నా కొడుకని నాకు ముందే  తెలుసనీ తండ్రి బ్యాంగ్. నకిలీ కొడుకు తో తాత ఆటలు కట్. తాతని క్షమించి కలుపుకుందామని విన్నర్ రిక్వెస్ట్, హీరోయిన్ తో పెళ్లికి ఫర్మాయిష్.  ది ఎండ్.
  
       ***
      పై సినాప్సిస్ లో కథావస్తువుతో అభ్యంతరం వుండనవసరం లేదు. కథలతో బాటు  పాత్రలూ ఎప్పుడూ అవే వుండవచ్చు క్రియేటివ్ క్షామం కొద్దీ.  పాత్రల సెంటి మెంట్లూ మారకుండా వుండవచ్చు. త్రిపురనేని మహారధి అన్నట్టు, పాత్రల సెంటిమెంట్లు మారేవి కావు. ప్రపంచంలో ఎక్కడైనా ఈ సెంటి మెంట్లతో కూడిన భావోద్వేగాలు ఒకటే, అవి మారవు. కాకపోతే ఈ సెంటి మెంట్లతో, ఎమోషన్స్ తో పాత్రలు తీసుకునే  చర్యలే  కాలంతో పాటు మారిపోతాయి. ఇది  గుర్తు పెట్టుకోవాలి - సెంటి మెంట్లతో, ఎమోషన్స్ తో పాత్రలు తీసుకునే చర్యలే  కాలంతో పాటు  మారిపోతాయి! -  ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి  దురదృష్ట వశాత్తూ ‘విన్నర్’ తోపాటు ఇంకా ఇలాటి మూస సినిమాలన్నిటి విషయంలో ఇదే  గుర్తించడం  లేదు. ఇందుకే ఇన్ని ఆశాభంగాలు. 


          ‘విన్నర్’ కథా వస్తువు  1978 లో  యశ్ చోప్రా దర్శకత్వం వహించిన సలీం –జావేద్ రచన ‘త్రిశూల్’ ని గుర్తుకు తెస్తుంది. ఇది కూడా కుటుంబపరంగా అన్యాయమైపోయిన హీరో కథే. తను పుట్టక ముందే తల్లిని మోసం చేసిన తండ్రి మీద పగబడతాడు అమితాబ్ బచ్చన్ విజయ్ పాత్రలో. అతడి వ్యాపారాల్ని, కుటుంబ సంబంధాల్నీ కూల్చెయ్యడం మొదలె డతాడు... దట్స్ కాల్డ్  సెన్సిబుల్ క్యారక్టరైజేషన్. విజయ్  పొందిన అవమానాలతో, బతికిన అనాధ జీవితంతో - స్క్రీన్ ప్లే పరిభాషలో చెప్పాలంటే సర్కిల్ ఆఫ్ బీయింగ్ తో -  ఇంతకంటే మార్గాంతరం లేదతడికి- డిమాలిషన్, కూల్చెయ్యడం, అంతే. తల్లిని మోసం చేసి, డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న తండ్రి ఆ విలాసాలు అనుభవించ కూడదు!  పోటీ బిజినెస్సే పెట్టి ముప్పుతిప్పలు పెడతాడు, నేలకు దించుతాడు.

          సుమారు ఈ  సర్కిల్ ఆఫ్ బీయింగే వుంది  విన్నర్ కి కూడా. సర్కిల్ ఆఫ్ బీయింగ్ ని పాత్ర బ్యాక్ డ్రాప్ అనుకుందాం. చిన్నప్పుడు తల్లిని కోల్పోయి, తాత చేసిన కుట్రకి బలై, తండ్రి మీదా వాళ్ళ రేసుల వ్యాపారం మీదా  ద్వేషం పెంచుకుని  వీధిన పడ్డాడు ఐదేళ్ళప్పుడు విన్నర్. ఇది పాత్ర బ్యాక్ డ్రాప్. 

          పై సినాప్సిస్ ఆధారంగా విన్నర్ స్క్రీన్ ప్లే విశ్లేషణ జోలికి పోవడం లేదు, విశ్లేషణలకి టెంప్లెట్స్  అర్హమైనవి అనుకోలేం.  కేవలం విన్నర్ పాత్ర చిత్రణే  చెప్పుకుంటున్నాం. ఎందుకంటే  వర్తమాన  కాలంలో పురాతన కాలపు కథ వచ్చి పడినా, అందులోని పాత్ర వర్తమాన కాలాన్ని రిఫరెన్సు గా పెట్టుకుని ప్రవర్తిస్తుందే తప్ప, ప్రవర్తించి తీరాలి తప్ప, ఇంకా పురాతన కాలపు ప్రవర్తనల్నీ, చర్యల్నీ రిఫరెన్సు గా పెట్టుకుని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తే అభాసు అవుతుంది. విన్నర్ దీనికెంత వరకు న్యాయం చేశాడో చూస్తే,  టెంప్లెట్ మూవీ అయినప్పటికీ దీని బలహీనత అంతా ఎక్కడుందో తెలిసిపోతుంది. ఈ టెంప్లెట్స్ నే పెట్టుకుని  సినిమాలు ఇంకా తీసుకోవచ్చు, ఎవరికీ అభ్యంతరం లేదు. కాకపోతే కాస్త పాత్రనైనా నెట్ యుగంలో పెట్టి చూపిస్తే పాపాలన్నీ పోతాయేమో తెలుసుకోవడానికే ఈ పాత్రోచితాను- చితుల- చిటపట మంటల  సంగతి!
***

       సర్కిల్ ఆఫ్ బీయింగ్ లోంచీ నేరుగా విన్నర్ చితి మీదికి చేరిపోయాడు. పాపం తాత పార్నూకితే కథకుడు పట్టుకుని చితి మీదికి చేర్నూకాడు. నిజానికి విన్నర్ తాను వచ్చిన  బ్యాక్ డ్రాప్ లోంచి - ఎవరికి  తెలుసు చితికిన మనసు చితిలా రగులుననీ... అని పాడుకోవాల్సిన వాడు, కానీ హైఫై గా న్యూస్ పేపర్లో క్రియేటివ్ హెడ్ అయిపోయాడు. అవచ్చు, కానీ దీనికీ కథకీ సంబంధముందా? హీరోయిన్ని చూడగానే ఈ వృత్తితో అవసరం తీరిపోతుంది.  టెంప్లెట్ పాత్రలకి ఇవి టెంప్లెట్ వృత్తులు. టెంప్లెట్ హీరోయిన్ కూడా జర్నలిస్టు గానో, ఫ్యాషన్ డిజైనర్ గానో పరిచయమై, టెంప్లెట్ లవ్ లోపడగానే వృత్తీ గృత్తీ జాంతానై అని జంప్ అవుతుంది. 


          సరే, ఒక క్రియేటివ్ హెడ్ కి  న్యూస్ పేపర్ కంటెంట్ తో, ఎడిటింగ్ తో సంబంధం వుండదు. అతడిదంతా డిజైనింగ్ చూసుకునే పని. కనీసం ఏడు  సంవత్సరాలు అనుభవం వుంటే గానీ హెడ్ కాలేరు. ఇరవై ఐదుసంవత్సరాలకే విన్నర్ గారు హెడ్ అయిపోయారు. అయిపోయి, ఎవరో పొలాల్లో రేసులు పెడుతూంటే అ సంగతి రిపోర్టర్లు చూసుకోకుండా తను వెళ్లి ఫైట్ చేశాడు. హీరో జర్నలిస్టు అయితే సినిమా జర్నలిస్టు అలాగే ఫైట్లు చేస్తాడని మినహాయింపు ఇవ్వొచ్చు. క్రియేటివ్ హెడ్ కేం పని?

          విన్నర్ కి తండ్రితో బాటు, రేసుల మీదా చిన్నప్పటి ద్వేషం అలాగే వుంటుంది. అంటే అతను కాన్సెప్ట్ తో కూడా పూర్తిగా కటాఫ్ అయిపోయాడన్న మాట. రేసుల్ని ద్వేషించేవాడు ఆ రేసులోనే పాల్గొనాల్సి వచ్చే  క్యారక్టర్ టర్నింగ్ బావుంటుందని  కథకుడు అనుకున్నట్టుంది. అందుకే రేసుల మీద కూడా ద్వేషం సృష్టించాడు. ఈ క్యారక్టర్ ట్విస్టు ని  సెకండాఫ్ లో ఓ డైలాగు ద్వారా పలికించాడు కూడా. ఇది నిజంగా క్యారక్టర్ ట్విస్టేనా? దీంతో క్యారక్టర్ ఆర్క్ పెరిగి గ్రాండ్ గా కన్పించాడా? పెరగడం కాదు సరికదా, తరిగి మరింత పాసివ్ అయిపోలేదా?  ఆ ట్విస్ట్ ఎలా వచ్చింది? తను ఇచ్చిన ట్విస్టా అది? ఇంటర్వెల్లో మొదట హీరోయిన్, తర్వాత విన్నర్ ఫాదర్ – రేసులో పాల్గొని గెలవాలని వాళ్ళు విసిరిన సవాలు కాదా?  అప్పుడు ఖర్మరా అనుకుంటూ ఎలాగో గుర్రపు స్వారీ నేర్చుకుని రేసులో పాల్గొనడం హీరోయిజం అవుతుందా, పాసివిజం అవుతుందా? విన్నర్ అనే వాడు తన క్రియేటివిటీ తో తను ఆట నిర్ణయిస్తాడా, లేక ఎవరో నిర్ణయించిన ఆటలో కించపడి పాల్గొంటాడా?  అసలు యాక్టివ్ క్యారక్టర్ అంటే ఏమిటి? పాసివ్ క్యారక్టర్ అంటే ఏమిటి? విన్నర్ ఏ క్యారక్టర్?

          అసలు రేసుల్లో పాల్గొనడానికి విన్నర్ కున్న అర్హతలేమిటి? ట్రైనర్ గా ఒక కమెడియన్ తో కామెడీలు చేస్తూ నేర్చుకునేదా రేసింగ్? పోనీ ‘దంగల్’ టైపులో తండ్రి నేర్పితే ఉన్నట్టుండి జాకీ అయిపోగలడా? ఇంటెనకాల సొంతంగా  గుర్రప్పందాలు పెట్టుకుంటే ఎవడికి వాడే జాకీ.  రేస్ కోర్సులో జాకీ అవ్వాలంటే కొన్నేళ్ళూ ఆ రంగంలో నలగాలి. ఎన్నో అనుబంధ జాబ్స్ చేయాలి. ట్రైనర్ తో ఎటాచ్ అయివుండి, ఎంతో ట్రైనింగ్ పొందాలి, ఎన్నో లైసెన్సులు పొందాలి. సాటి జాకీల సైకాలజీలతో బాటు,  రకరకాల గుర్రాల జాతుల గురించీ, వాటి లక్షణాల గురించీ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. విపరీతంగా రేసులు చూడాలి. ఇంకా చాలా వుంటాయి.

          కమెడియన్ ట్రైనర్ నాల్గు గుర్రాల్ని చూపించి ఏ గుర్రం కావాలని అడిగితే, ఓ  గుర్రాన్ని చూపిస్తూ అది కావాలంటాడు విన్నర్. మనకి నవ్వొస్తుంది. ఆ గుర్రం ఏమిటో, దాని బయోడేటా ఏమిటో తెలుసా విన్నర్ కి? చిన్నపిల్లాడు ఆ బొచ్చు కుక్క కావాలీ   అన్నట్టుంది.

          ఇక ఫైనల్ గా రేస్ గురించీ, దాని చిత్రీకరణ గురించీ,  విలన్ తో విన్నర్ హోరాహోరీ గురించీ చూస్తే, ఇవీ చప్పగా తేలిపోయాయి.

          ఇక పాతికేళ్ళూ తండ్రికి దూరమై, తీరా అది తాత కుట్ర అని తెలిశాక- వెంటనే తండ్రి దగ్గరికెళ్ళి పోయి,  తను ఘోరంగా అపార్ధం జేసుకున్నందుకు కాళ్ళ మీద పడ్డానికి ఏం అడ్డొచ్చింది?  ఇంకా ఎందుకు తన స్థానంలో నకిలీ కొడుకుని కొనసాగిస్తాడు? ఈ విషయం  తండ్రికి చెప్పకుండా ఇలాకూడా ఎందుకు అన్యాయం చేస్తున్నాడు?  తను కొడుకని తెలిస్తే తండ్రి తట్టుకోలేడంటాడు, ఎందుకో? ఆ తర్వాత తాతకి బుద్ధి చెప్తానంటాడు. ఈ విషయమే మర్చిపోతాడు. చిట్టచివర్లో తాతని క్షమించి కలుపుకుందామంటాడు. తాత భలే లక్కీ, తన్నులు తినకుండా కలిసిపోయాడు మనవడితో. ఇలా వుండాలి కాబట్టి అన్నట్టు అక్కడక్కడా వచ్చిపోయే సోసో అనుబంధాల, పైపై ఎమోషన్ల సంగతులు ఇవీ...  ఐదేళ్ళ వయసులో తండ్రిని ద్వేషించడాన్ని అర్ధం జేసుకోవగలం గానీ; రేసుల గురించీ, ఇంట్లో పెద్దవాళ్ళు చేసే వ్యాపారాల గురించీ  అప్పుడే  ఏం తెలుస్తుంది పసివాడికి ద్వేషించడానికి- ఈ ద్వేషం క్యారక్ట ర్ టర్నింగ్ కి పనికొస్తుందని పెట్టుకున్నాడు కథకుడు. కానీ క్యారక్టర్ ఏం ఫీలవుతోందో  తెలుసుకున్నాడా? కథకుడు తన ఇష్టాలతో నడిపిస్తే పాసివ్ క్యారక్టర్, క్యారక్టర్ తన ఇష్టంతో నడుచుకుంటే యాక్టివ్ క్యారక్టర్. పాసివ్  క్యారక్టర్స్ కథకుడు ఆర్ట్ సినిమాలకే పనికొస్తాడు.
          క్యారక్టర్ బ్యాక్ డ్రాప్ కీ,  చేపట్టిన క్రియేటివ్ హెడ్ వృత్తికీ సంబంధం లేదు.  రేసులమీద ద్వేషంతో కాన్సెప్ట్ తోనూ కటాఫ్ అయిపోయాడు. బ్యాక్ డ్రాప్ లో ఎవరితో అన్యాయానికి గురయ్యాడో, మళ్ళీ వాళ్ళ షరతులకే లోబడి బానిసలా రేసుల కెళ్ళాడు. అతను ఆజన్మ బాధితుడు, తనజీవితం తన చేతిలో లేని వాడు, తిరుగుబాటు చేయడం తెలీని వాడు. బ్యాక్ డ్రాప్ నుంచీ, బ్యాక్ డ్రాప్ లో వున్న సమస్య నుంచీ - నేను ద్వేషిస్తున్నాను- అనేసి  వంకపెట్టుకుని  పలాయనం చిత్తగిస్తున్న లూజర్.

          హీరోయిన్ కూడా కటాఫ్ క్యారక్టర్. కథతో సంబంధం లేని హీర
వృత్తిలాగే, తనకీ  అథ్లెట్ గా వేరే గోల్. గుర్రప్పందాల కథ వుండగా,  మళ్ళీ వేరేగా ఈమెకి పరుగుపందేల గోల్ ఏమిటో? గోల్డ్ మెడల్ ఏమిటో?

          ఇక చివర్లో తండ్రి-  వీడు నా కొడుకని ముందే తెలుసనీ అనడం గురించి. ఎలా తెల్సు? అతడి కూతురికి (మళ్ళీ పెళ్లి సంతానం) విన్నర్ ఒక లాకెట్ ఇచ్చాడు. ఆ లాకెట్ ని బట్టి విన్నర్ తన కొడుకేనని తెలుసుకున్నానంటాడు. విన్నర్ అలా లాకెట్ ఎందుకిచ్చాడు- అది తండ్రి గుర్తు పడతాడని తెలీదా? తండ్రి కి తను తెలియకూడదని కదా అనుకుంటున్నాడు? కథని సులువు చేసుకోవడానికి కథకుడు ఇలా పాత్రని డిక్టేట్ చేస్తూ సొంత అభిప్రాయాలు రుద్దుతున్నాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ లో నారా రోహిత్ చెల్లెలు శ్రీవిష్ణు కి తన గొలుసు ఇచ్చినప్పుడు అతనెవరో ఏమిటో ఆమెకి తెలీదు, ఆమె ఎవరో ఏమిటో అతడికీ తెలియుడు. తీరా రోహిత్ విష్ణుని ఎన్ కౌంటర్ చేయాలనుకున్నప్పుడు,  విష్ణు దగ్గర ఆ గొలుసు బయటపడి- ఆ ఘట్టం ఇద్దరి జీవితాలనీ మార్చేస్తుంది!  ఇదీ  ప్లాట్ డివైస్ ని బలంగా ఉపయోగించే పధ్ధతి కథలో. 

          కనీసం క్యారక్టర్స్ కి  టెంప్లెట్స్ బారి నుంచి నుంచి విముక్తి కల్గించినా,  బిగ్ బడ్జెట్లకి  చెప్పుకోదగ్గ బయోడేటా వుంటుందేమో.
***
      విన్నర్ ని ఇటుతిప్పి కాన్సెప్ట్  వైపు నడిపిస్తే? అప్పుడు అతను సబ్ కాన్షస్ ని ఢీకొంటాడు. అంతరంగంలో ఆడియెన్స్ కోరుకునేదిదే. ఐదేళ్ళ వయస్సులో గుర్రాల్ని కడుగుతూంటాడు విన్నర్. నాల్గేళ్ళ వయసున్న యజమాని కూతురు అతణ్ణి చిన్న బుచ్చుతూ బండ చాకిరీ చేయిస్తూంటుంది. నువ్వేమవుతావ్? – అని అడిగితే, జాకీ నవుతానని అంటాడు. జాకీ  నేనవుతా, నువ్వు బుకీ కూడా  కాలేవు - అంటుంది. అవుతా, హైదరాబాద్ రేస్ కోర్స్ చైర్మన్ సురేందర్ రెడ్డిలా ఫేమస్ జాకీ నవుతా – అంటాడు విన్నర్ రెడ్డి. నువ్వు చదువుకోవడం లేదంటుంది. ఇంటర్నేషనల్ స్టార్ జాకీ రాబీ కింగ్ కూడా  చదువుకో లేదంటాడు  (జాకీ అవడానికి చదువుండనవసరం లేదు). ఇలా వాదోప వాదాలు జరుగుతూంటాయి. విన్నర్ తనకి పోటీగా జాకీ అవుతాననడం ఆమె సహించలేక పోతుంది.  అతడికి హద్దులు పెడుతూంటుంది. 

          ఇలాగే గుర్రాల మధ్య పెరిగి పెద్ద వాడవుతాడు విన్నర్. యజమానికి అతడంటే ఎంతో ఇష్టం. అతడి యాంబిషన్ ని గుర్తించి స్టెప్ బై స్టెప్ జాకీ అవడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తూంటాడు. ఎదిగిన కూతురు కూడా జాకీ అవుతానంటే,  మగబుద్ధి కొద్దీ వివక్షతో వద్దంటాడు. అమ్మాయిలు జాకీలు కాలేరంటాడు ప్రపంచంలో చాలా మందే  వున్నా. ఆమెకి వొళ్ళు మండి హయ్యర్ స్టడీస్ కి ఐదేళ్ళు యూఎస్ వెళ్తున్నా ననేసి వెళ్ళిపోతుంది. వెళ్లి సిటీలోనే  రైవల్ కంపెనీలో చేరిపోతుంది.  అక్కడ ఇద్దరు పెద్ద మనుషులు వుంటారు. తమ రైవల్ గాడి కూతురే తమ దగ్గరకి రావడం చూసి సంతోషించి ట్రైనింగ్ ఇప్పిస్తారు.

          విన్నర్, యజమాని కూతురూ రేసుల్లో తలపడతారు. ఆమె హెడ్ గేర్ తో కవర్ చేసుకోవడంతో మొహం కన్పించదు. ఆమె యజమాని కూతురనుకోడు విన్నర్. వాచ్ చేస్తున్న యజమాని కూడా ఆమెని గుర్తు పట్టడు. విన్నర్  ఇంకా తనలాంటి న్యూ ఎంట్రీయే కాబట్టి, చిన్నప్పటి కసితో  ఓడించేస్తూంటుంది యజమాని కూతురు. ఆమె బాసులైన పెద్ద మనుషులిద్దరూ సంతోషిస్తూంటారు తమ రైవల్ గాణ్ణి ఫినిష్ చేసే సూపర్ జాకీ దొరికిందని.

          ఆమె హార్స్ పేరు డాన్సింగ్ క్వీన్, విన్నర్ తను పెంచి పోషించి హార్స్ పేరు డ్రీమీ డియర్.  ఈ రెండు హార్స్ లూ  వార్తల కెక్కుతాయి. ఓ రేసులో యజమాని కూతురు కింద పడిపోవడంతో హెడ్ గేర్ తీయాల్సివచ్చి విన్నర్ కి ఎక్స్ పోజ్ అయిపోతుంది. విన్నర్ షాక్ అవుతాడు, యూఎస్ కెళ్ళిన కూతురు రైవల్ గాళ్ళ జాకీగా ఝలక్ ఇవ్వడంతో విన్నర్ యజమానికి కూడా దిమ్మదిరుగుతుంది.

          దాన్ని చిత్తు చిత్తుగా ఓడించేయ్, ఆ రైవల్ గాళ్ళు రెడ్లు, నువ్వూ రెడ్డీ. నో క్యాస్ట్ ఫీలింగ్, వాళ్ళని  ఫినిష్ చెయ్ - అని ఆర్డర్స్ పాస్ చేస్తాడు యజమాని.  వాళ్ళెందుకు రెడ్లు అయ్యారో తెల్సా మీకు? ఆ చిన్నోడు నా అయ్య, ఆ ముసలోడు నా తాతయ్య- నో క్యాస్ట్ ఫీలింగ్, నో ఫ్యామిలీ ఫీలింగ్స్, ఓన్లీ  గంజి తాగించే రివెంజి  - అని విన్నర్ ఓపెన్యయ్యే సరికి, యజమానికి బుర్ర తిరిగిపోతుంది. 

          కులం కాని అమ్మకి పుట్టినందుకు వాళ్ళెలా నా ఐదేళ్ళప్పుడు అమ్మలేని నన్ను ఇంట్లోంచి వెళ్ళ గొట్టారో,  అలా వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం లోంచి వాళ్ళనీ  దిక్కు లేని వాళ్ళుగా వెళ్ళ గొట్టాలనే ఆ నాడు మీ దగ్గర వచ్చి చేరా- అని విన్నర్ చెప్పేసరికి,  యజమాని భుజం తట్టి-  ప్రొసీడ్ అంటాడు.

          ఇది ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. ఇక్కడ ఇంతవరకూ పైకి కన్పించని ఎండ్ సస్పెన్స్ అంతా అనూహ్యంగా  రివీల్ అయ్యింది. ఇక్కడ కథ పుట్టింది. ఇక విన్నర్ తండ్రీ తాతల అంతు ఎలా చూస్తాడనే సీన్- టు- సీన్ సస్పన్స్ ని క్రియేట్ చేస్తూ ముందుకు పోతుంది కథ. అంటే మిడిల్ లోకి ప్రవేశిస్తుంది మొదట. మిడిల్ అంటే సబ్ కాన్షస్ వరల్డ్ అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం.  స్క్రీన్ ప్లే అంటే కాన్షస్ – సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే అని మరెన్నో సార్లు చెప్పుకున్నాం.  అప్పుడు కాన్షస్ మైండ్ కి ప్రతినిధి అయిన ‘ఇగో’ గా విన్నర్ తండ్రీ తాతలనే సబ్ కాన్షస్ వరల్డ్ తో తలపడతాడన్న మాట, మధిస్తాడన్న మాట. ఎక్కడెక్కడ ఏ మాధ్యమాల్లో ఎలాటి కథైనా చేసేది ఇదే - మన అంతరంగ (సబ్ కాన్షస్) ప్రపంచాన్ని మధించడం. మన అంతరంగ ప్రపంచాన్ని  మధించని కథ కథ అవదు.

          ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం లో విన్నర్ గోల్ రివీల్ అయ్యింది. ఈ గోల్ పకడ్బం దీగా వుండి, విన్నర్ పాసివ్ అయిపోకుండా యాక్టివ్ క్యారక్టర్ గా కొనసాగేందుకు పట్టు పగ్గాలుగా వుండాల్సిన  నాల్గు గోల్ ఎలిమెంట్స్  – 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4, ఎమోషన్ పూర్తిగా  సమకూరాయి. 


          కోరిక- తాతా తండ్రుల గుర్రాల సామ్రాజ్యాన్ని కూల్చడం. పణం- ఈ కోరికతో గుర్రాల్ని గుర్రం తోనే కొట్టాలని, చదువు సంధ్యల్ని వదిలేసి భవిష్యత్తునే పణంగా పెట్టాడు. పరిణామాల హెచ్చరిక- ఈ పోరాటంలో ఓడిపోతే నీచంగా ఆ తండ్రీ తాతల కాళ్ళ మీదే పడే పరిస్థితి, లేదా ఆత్మాభిమానంతో ఆత్మహత్య చేసుకునే దుస్థితే రావొచ్చు. ఎమోషన్- ఇరవై ఏళ్లుగా  నిద్రపోనివ్వని ఈ సమస్య. ఇప్పుడు ఈ ఎమోషన్ రిలీజ్ అయ్యేందుకు పరిస్థితులన్నీ పక్వాని కొచ్చాయి- ఇక డివిడెండ్లు పొందడమే తరువాయి. వీటన్నిటితో సర్కిల్ ఆఫ్ బీయింగ్, గోల్ రెండూ స్ట్రాంగ్.
                                    ***
         హిందీలో ‘త్రిశూల్’, దానికంటే ముందూ తర్వాతా వచ్చిన యాంగ్రీ యంగ్ మాన్ పాత్ర లు నాటి సామాజిక పరిణామాల్లోంచి వచ్చినవే.  పేద- ధనిక అంతరాల్లోంచి వచ్చినవే. అప్పటి ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నవాడు లేని వాణ్ణి పీడించే వాడు, పీక్కుతినే వాడు. ఈ పీడితుల కథల్ని  ఏడ్పుల కథలుగా చేసుకుని ఆర్ట్ సినిమాలు వచ్చేవి. కానీ సలీం -జావేద్ సినిమాలు దీన్ని రివర్స్ చేసి చూపించసాగాయి కమర్షియాలిటీ కోసం. లేనోడే  ఉన్నోణ్ణి గిల్లితూంటే, గిచ్చుతూంటే, ఏడ్పిస్తూంటే, పొడుస్తూంటే ఎలా వుంటుంది? అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్ మాన్ పనులివే, పాటలుకూడా వేసుకుని. అప్పుడెలా వుంటుంది? సినిమా అనే మాస్ మీడియాకి మహారాజ పోషకులైన సామాన్య జనానికి మజాగా వుంటుంది. జీవితాల్లో తాము చూడలేనిది చూపిస్తూంటే, జీవితాల్లో తాము చేయలేనిది చేయిస్తూంటే పిచ్చ పిచ్చగా కచ్చి తీరిపోతుంది!  ఆడియెన్స్ ఏ సామాజిక పరిణామాల నేపధ్యంలో ఏ మానసిక స్థితిలో వున్నారో, అలా ఎంత కాలం వుంటారో తెలిసిన వాడే నిజమైన కమర్షియల్ కథకుడు.

          తర్వాత ఆ ఫ్యూడలిజమూ నక్సలిజమూ పోయి, యాంగ్రీ యంగ్ మాన్ కూడా వెళ్ళిపోయాడు- ఈ  యాంగ్రీ యంగ్ మాన్ హిందీలోంచి అన్ని భాషల కమర్షియల్  సినిమాల్లోకీ దిగుమతి అయ్యాడు. 

          ఇక ప్రపంచీకరణ నేపధ్యంలో పీడకులూ పీడితులూ లేకుండా పోయారు. ఒకప్పటి పీడుతులు సాయంత్రమయ్యేసరికి క్వార్టర్ బాటిల్ లేపేసే  లెవెల్ కి చేరారు. వందరూపాయలు పారేసి  మల్టీ ప్లెక్సు లో సినిమాలు చూసే స్టేటస్ సంపాదించుకున్నారు. వాళ్ళ ఎదిగివచ్చిన పిల్లలకి పాత చరిత్రలు తెలీవు. నడుస్తున్న చరిత్రలో వాళ్ళూ పుష్కలంగా డబ్బులు చేతిలో ఆడుతూ ఇంకెంతో ఎంజాయ్ చేస్తున్నారు. అయినా అంతరం ఏర్పడింది. అయితే ఇప్పుడు డెవలప్ అయిన ఒకప్పటి పీడితులు ఈ అంతరంతో పెద్దగా ఇబ్బంది పడ్డం లేదు.  వస్తున్న వేల రూపాయల ఆదాయంతో అన్ని అవసరాలూ తీరుతూ  సుఖంగానే వుంటున్నారు. కాబటి ఎప్పుడూ వినని,  చూడని,  ఫిగర్స్ తో– వాడు వందల కోట్లు సంపాదించాడు, వీడు వేలకోట్లు వెనకేసుకున్నాడు అనే హెడ్ లైన్స్ కి పెద్దగా రెస్పాండ్ అవడం లేదు. అయితే ఈ వందల, వేల కోట్ల నయా ఆసాములు  ఎలా జీవిస్తూంటార్రా బాబూ -  అనే క్యూరియాసిటీ మాత్రం పెరిగింది. ఈ క్యూరియాసిటీ ని క్యాష్ చేసుకున్నవే  ఇటీవలి ‘పింక్’, కహానీ -2’ లు, ఇంకా ముందు ‘షైతాన్’ లాంటి సినిమాలు!

          సంపన్న వర్గాల్లో కొందరు నైట్ లైఫ్ అనే కల్చర్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నైట్ లైఫ్ లో వాళ్ళ విశృంఖలత్వం, దాంతో కొని తెచ్చుకునే కొత్త కష్టాలూ, ఇరుక్కునే కేసులూ, వాటిలోంచి బయటపడేందుకు పడే పాట్లూ, పొందే అవమానాలూ...అన్నీ పోగొట్టుకుని వీధిన పడే బ్రతుకులూ ఇవీ చిత్రిస్తూ సొమ్ము చేసుకున్నాయి పై సినిమాలు. అంటే ఇప్పుడు అంతరాల కథలు చెప్పాలంటే ఈసురోమంటూ మధ్య తరగతి బాధలో, కింది తరగతుల కష్టాలో చూపడం కాదు. వాళ్ళు హేపీగా వున్నారు. వాళ్లకి చూపించాల్సింది గ్లామరస్ గా, అల్ట్రా రిచ్ గా, హైఫై  క్యారక్టర్లని  వాళ్ళ జీవనశైలులతో ఉల్ఫా గాళ్ళని చేస్తూ ఆనందపర్చడ మన్నమాట!

          ఈ కథల్లో యాంగ్రీ యంగ్ మాన్ కి చోటు లేదు. అతడి సోషల్ బ్యాక్ డ్రాప్ ముగిసిపోయింది. కానీ ఎప్పుడో ఇరవై ఏళ్ల  క్రితం అప్పటి సోషల్ బ్యాక్ డ్రాప్ లోని ‘యాంగ్రీ యంగ్ బాయ్’ కథని ఇప్పుడు ఈ వర్తమాన కాలంలో పూర్తి  చేయవచ్చు. విన్నర్ ‘యాంగ్రీ యంగ్ బాయ్’ గానే ఇరవై ఏళ్ళక్రితం బయల్దేరాడు. 

          ఇప్పుడు నైట్ లైఫ్ కల్చర్ తో సహా మారిపోయిన సంపన్నుల జీవనశైలుల్లో వుంటారు తాతా తండ్రీ. వీళ్ళని గిచ్చాలి, గిల్లాలి, గిలిగింతలూ కితకితలూ పెట్టాలి, నవ్వించాలి, ఏడ్పించాలి- తీసికెళ్ళి వీధిలో పడెయ్యాలి. విన్నర్ యజమాని హఠాన్మరణంతో విన్నర్ చేతికి కంపెనీ వస్తుంది. అతడి ఎదుగుదల, రైవల్స్ తగ్గుదల.  

          ఎవరీ జాకీ అని వాళ్ళు తెలుసుకుంటే, అప్పుడు సినిమాలోచూపించిన చిన్నప్పుడు విన్నర్ కి అన్యాయం జరిగిన దృశ్యాలన్నీ చూపించవచ్చు. ఆ దృశ్యాల్లో తండ్రి అమాయకుడు. తాత విలన్. 

          ప్రెజెంట్ కొచ్చి, తండ్రి అమాయకత్వం రుజువయ్యాకే ముగింపు- ఈ ముగింపులో తాత  వుండకపోవచ్చు. ‘త్రిశూల్’  లో తండ్రి మరణిస్తాడు. అప్పుడు తల్లి పక్కన తండ్రి పేరు కలిపి కంపెనీ ప్రారంభిస్తాడు విజయ్. 

          తండ్రి అంటే ద్వేషం, రేసులంటే ద్వేషం అని మూలన కూర్చునే పాత్ర 30 లక్షల ఆర్ట్ సినిమాలకి పనికొచ్చే పాసివ్  పాత్ర. అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం తిరగబడేదే యాక్టివ్ పాత్ర.  కమర్షియల్ సినిమాలకి ఇలాటి విజేతల కథలు కావాలి గానీ, విన్నర్ అని పేరు పెట్టుకుని అన్యాయం చేసిన వాళ్ళ షరతుల ప్రకారమే  నడుచుకునే పరాజితుల పాసివ్ కథలు  కాదు.

-సికిందర్ 
http://www.cinemabazaar.in


24, ఫిబ్రవరి 2017, శుక్రవారం

రివ్యూ!




స్క్రీన్ ప్లే –దర్శకత్వం : గోపీచంద్ మలినేని

తారాగణం : సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కల్యాణి, జతిబాబు, అనూప్ సింగ్, ముఖేష్ రుషి, రఘుబాబు, ఆలీ, వెన్నెలకిశోర్ దితరులు

కథ :  శ్రీనివాస్ వెలిగొండ, మాటలు : రవి అబ్బూరి, సంగీతం : థమన్ ఎస్. ఎస్, ఛాయాగ్రహణం : నాయుడు ఛోటా కె 

బ్యానర్ :  క్ష్మీ సింహా ప్రొడక్షన్స్
నిర్మాతలుః  బుజ్జి ల్లలుపు,  ధు ఠాగూర్
విడుదల : ఫిబ్రవరి 24, 2017
***

       అనుబంధాల కథలతో సినిమాలు తీయడం పక్కన పెట్టి, దశాబ్దంన్నర కాలంగా కొత్త ట్రెండ్ లో యాక్షన్ సినిమాలు, యాక్షన్ కామెడీలూ తీస్తూ వుండిపోయిన టాలీవుడ్-  తీరా అనుబంధాల కథలో, లేదా ఫ్యామిలీ కథలో తీయాల్సి వచ్చేటప్పటికి - వాటిని  అదే పాత ఫార్ములాగా రొటీన్ యాక్షన్ సినిమాలకి కృత్రిమ భావోద్వేగాలతో నింపేసి  వదిలేస్తున్నారు. తాజాగా ‘విన్నర్’ కూడా ఇదే చట్రంలో ఇరుక్కుని ఈ కాలానికి తగ్గ అనుబంధాల పునర్నిర్వచనం రాసే అవకాశాన్ని పోగొట్టుకుంది. చూపించదల్చుకున్న  గుర్రప్పందాల నేపధ్యం ఆధునికమైనప్పుడు, అనుబంధాల కథ కూడా అంతే ఆధునికమై ఎందుకుండ కూడదన్న ప్రశ్న లేవనెత్తుతోంది ఈ మలినేని గోపీచంద్ తాజా ఆఫర్. 

          ఇందులో హీరో సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’ గా ఆట తను నిర్ణయించాల్సింది పోయి,  ప్రత్యర్ధి చేతిలో పెడితే అది విన్నర్ లక్షణం ఎలా అవుతుందని ముందే ప్రశ్నించు కోవాల్సింది. ఆ రూల్స్ తాను  నిర్ణయించి వుంటే,  ఈ ‘విన్నర్’ అనుబంధాల కథలకి కొత్త రూట్ మ్యాప్ అయ్యేది.
          
         హంగూ ఆర్భాటాలతో అట్టహాసమైన దృశ్యాలు,  భారీ తారాగణం - ఇవుంటే చాలు   అదొక కుటుంబ అనుబంధాల కమర్షియల్ అయిపోతుందనుకుంటే, బాక్సాఫిసు వేరే  గళంలో దాని బాణీ అది విన్పిస్తుంది...

కథ
          సిద్ధార్థ్ రెడ్డి (సాయి ధరమ్ తేజ్) చిన్నప్పుడు తాత (ముఖేష్ రిషి) చేసిన కుట్ర కార ణంగా తండ్రి మహేంద్ర రెడ్డి (జగపతి బాబు) కి దూరమవుతాడు. తండ్రి అన్నా, తండ్రి చేసే గుర్రప్పందాల వ్యాపారమన్నా ద్వేషం పెంచుకుంటాడు. పెద్దవాడై ఒక పత్రికకి ఎడిటర్- కమ్ - ఓనర్ అవుతాడు. సితార (రకుల్ ప్రీత్ సింగ్) అనే ఒక అథ్లెట్ ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె అతణ్ణి తిరస్కరించి తండ్రి చూసిన వేరే సంబంధం చేసుకుంటూంటుంది. ఈ పెళ్లిని ఆ పాలని సిద్ధార్థ్ వెళ్తాడు. అతణ్ణి చూసి ఆమె తండ్రికి ఎదురు తిరుగుతుంది- సిద్ధార్థ్ నే చేసుకుంటానంటుంది. ఈ  పెళ్లి కొడుకు ఆది (అనూప్ సింగ్)  కంటే సిద్ధార్థ్ గొప్ప జాకీ అని చెప్పేస్తుంది. అక్కడికే వచ్చిన తండ్రి మహేంద్ర రెడ్డిని ఇరవై ఏళ్ల తర్వాత చూసి సిద్ధార్థ్ కలవరపడతాడు. ఆ తండ్రి మహేంద్ర రెడ్డి తన కొడుకు ఆదితోనే ఈ పెళ్లి జరుగుతుందనీ, రేసులో ఆది సిద్ధార్థ్ ని ఓడిస్తాడని ఛాలెంజి విసురుతాడు.

          ఇప్పుడు సిద్ధార్థ్ ఏం చేస్తాడు? జాకీగా మారి ఆదిని ఓడించి సితారని చేపడతాడా?
చిన్నప్పుడు దూరమైన సిద్ధార్థ్ తానేనని తాతా తండ్రీ తెలుసుకునేలా చేస్తాడా? ...ఇవి తెలుసుకోవాలంటే మిగతా ఆట చూడాల్సిందే.

ఎలావుంది కథ
          తెగిపోయిన అనుబంధాలని అతికించే మరో పాత కథ ఇది. అనుబంధాలు తెగిపోవచ్చు- కానీ అతికించే విధానంలో ఎక్కడో బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఆగిపోయిన మరో కథ ఇది. కథకుడు వెలిగొండ శ్రీనివాస్ పాత కథలవైపే చూసి వాటిలోంచి ఈజీగా పది కథలు కన్పించే  కథ అల్లేస్తాడు. కాకపోతే ఈసారి గుర్రప్పందాలతో  హడావిడి చేశాడు. అనుబంధాల కంటే డబ్బే ప్రధానమైన ఈ కాలంలో కేవలం నాల్గు డైలాగులతో, రెండు కన్నీటి బొట్లతో, లేదా ఏదో ఓ ఛాలెంజితో  తిరిగి మనుషుల్ని కలిపేయడం ఇలాటి కథలు రాసేసినంత సులభమా? విడిపోవడానికి ఏది కారణమవుతుందో కలపడానికీ  అదే కారణమవుతుందనేది సింపుల్ లాజిక్, ట్రూత్. ఈ కోవలో ఆ లోచించి వుంటే గుర్రాలు కూడా ఒక పాత్ర వహించి ఈ కథ ఎక్కడికో వెళ్ళిపోయేది...

ఎవరెలా చేశారు
          సాయిధరమ్ తేజ్ నిజాయితీగా నటించాడు. గత సినిమాల్లోని ఓవరాక్షన్, మాస్ కోసం వూర యాక్షన్ ఈసారి చేయకుండా రక్షించాడు. కానీ  ఈ అనుబంధాల కథలో వున్న సీన్లలో కూడా తన బాధతో ఒక్క చోటా  ఏడ్పించలేక పోయాడు. రోమాంటిక్ సీన్లు, యాక్షన్ సీన్లూ జస్ట్ వినోదం కోసమే వుండొచ్చు- బరువైన సీన్లు నటుడన్పించుకునేందుకు వుంటాయి.అలాటివి కొన్ని పెట్టించుకుని వుండాల్సింది- కనీసం ఎక్కడా కళ్ళల్లో నీళ్ళు కూడా తిరగనప్పుడు అనుబంధాల ప్రాకులాట ఎందుకు. కేవలం జాకీగా అందర్నీ జాయింటుగా కలిపేయ వచ్చనుకున్నాడా? వాళ్ళేమైనా చిన్నపిల్లలా గుర్రపు స్వారీ చూసి గంతులేసి చంకనెక్కడానికి? పైగా వాళ్ళు చెప్తేనే  కదా తను క్లయిమాక్స్ లో జాకీ అవాల్సి వచ్చింది. ఇతరులు చెప్పకుండా ఏది ఎలా సాధించాలో తన ఎడిటర్ –కమ్- ఓనర్ బుర్రకి తెలియాలి కదా? ఎడిటర్ అనేవాడు ఇతరులకంటే పైస్థాయిలో ఆలోచిస్తాడు కదా? లేకపోతే పేపర్ని ఎవ్వరూ కొనరు కదా?  ఇలా పాత్ర పాసివ్ కాకుండా చూసుకోవడమే గాక, పాత్ర చిత్రణ కూడా సరి చూసుకున్నాకే  సినిమాలు ఒప్పుకుంటే బావుంటుంది. ఎందుకంటే, ఇంకో రెండు దశాబ్దాలు గడిచినా కథలు చెప్పే వాళ్లకి యాక్టివ్ – పాసివ్ తేడాలు తెలీవు. కేవలం స్టార్ తమని ఒడ్డున పడేస్తాడని ఏదో ఒకటి విన్పించేస్తారు.

          రకుల్ ప్రీత్ సింగ్ ది అయోమయం పాత్ర. తన కేం కావాలో, అదెలా కావాలో తనకేం తెలీదు. అథ్లెట్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాలనుకునే తను, ఇందుకోసం హీరో ప్రేమనే ఛీకొట్టే తను- తీరా ఆ హీరోయే తీసికెళ్ళి స్టేడియంలో పడేస్తే గానీ పోటీలున్నాయని తెలియని తను, ఆ పోటీ గెలిచి గోల్డ్ మెడల్ అందుకుని- ఇపుడు మనమెలా లవ్ చేసుకుందాం? – అంటుంది సిగ్గుఎగ్గు లేకుండా.

          జగపతిబాబు పాత్రకి కొంత సస్పెన్స్, డెప్త్ వున్నాయి- వీటితో నటనకి- చివర్లో ఎమోట్ అవడానికీ అర్ధంపర్ధం వచ్చాయి. విలన్ తాతగా ముఖేష్ రుషి, విలన్ గా అనూప్ సింగ్ లది రొటీన్ విలనీ. వెన్నెల కిషోర్ కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది ప్రేక్షకులకి. ట్రైనర్ గా అలీ కథలో సరీగ్గా ఇమడని కామెడీ. ఇలా అన్నీ ఇమడనివే వున్నాయి- అతుకులేస్తే కథ అతకదు, అల్లితే కథ అల్లుకుంటుంది. 

          థమన్ సంగీతం లో ‘సితారా...’ అనే సాంగ్ ఓకే. ఫాదర్ సెంటి మెంట్ మీద సాంగ్ కి సన్నివేశ బలం లేదు. ఛోటా కె నాయుడు కెమెరా వర్క్ ఎప్పటిలాగే నీట్. ప్రొడక్షన్ విలువలు ఆర్భాటంగా వున్నాయి. అబ్బూరిరవి మాటలు మసాలా మాటలే. 

          దర్శకుడు మలినేని గోపీచంద్ ఈ కథని ఎప్పుడూ వుండే తెలుగు సినిమా పాత మూస ఫార్ములా టెంప్లెట్ లో పెట్టేసి సరిపెట్టేశారు. చూసిందే చూపించే ఈ వరసకన్నా ఇంకో విధానమే లేదా? అన్నికథలకీ ఒకే  సింగిల్ విండోనా? దీన్ని మార్చుకుంటే, అసలే కొత్త  కథలు చెయ్యలేని తమలాంటి వారికి  ఆ పాతవాటినే కాస్తయినా కొత్త  విధానంలో చెప్పే అవకాశం రాదా? ఇలా హీరో మాస్ డైలాగులతో ఎంట్రీ, ఓ ఫైట్, ఓ సాంగ్, ఆ వెంటనే హీరోయిన్ ని పడేసే ఓ లవ్ ట్రాక్, ఇదే  ఇంటర్వెల్ దాకా సాగిసాగి అప్పుడు- ఈ లవ్ తో సంబంధంలేని వేరే కథ- సెకండాఫ్ లో ఈ వేరే కథని కూడా పైకెత్త లేక నాన్చి నాన్చి అదే రొటీన్ ముగింపూ- ఇదే కొనసాగాలా? 

          ‘విన్నర్’ తీసిన కథనే తిరగేసి చెప్తే ఎలా విన్ అయ్యేదో రేపు ‘స్క్రీన్ ప్లే సంగతులు’ లో చూద్దాం.

- సికిందర్
http://www.cinemabazaar.in

21, ఫిబ్రవరి 2017, మంగళవారం

రివ్యూ!

రచన- దర్శకత్వం : సుభాష్ కపూర్

తారాగణం : అక్షయ్ కుమార్, హుమా ఖురేషీ, సయానీ గుప్తా, సౌరభ్ శుక్లా, అన్నూ కపూర్, మానవ్ కౌల్, ఇనాముల్ హక్, కుముద్ మిశ్రా, వినోద్ నాగ్  పాల్ తదితరులు సంగీతం: మంజ్ ముసిక్, మీత్ బ్రదర్స్, చిరంతన్ భట్, ఛాయాగ్రహణం : కమల్జిత్ నేగీ

బ్యానర్ : ఫాక్స్ స్టార్ స్టూడియోస్ 
విడుదల : ఫిబ్రవరి 10, 2017
***

       
కోర్టు రూమ్ డ్రామాలు హిందీలో పెరుగుతున్నాయి. ఇటీవలే ‘రుస్తుమ్’ తర్వాత ‘పింక్’, దీని తర్వాత ఇప్పుడు ‘జాలీ, ఎల్ ఎల్  బి- 2’ వచ్చాయి. వీటికి జస్ట్ ముందు ‘జాలీ- ఎల్ ఎల్ బి’, ‘ఓ మై గాడ్’ వచ్చాయి. చాలా కాలంగా ఖాళీగా వున్న  ఈ జానర్ స్లాట్ ని భర్తీ చేస్తున్నాయి. ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే, ఇవి టాప్ స్టార్స్ తో వచ్చి ఆకర్షిస్తున్నాయి. మరుగున పడ్డ ఒక జానర్ ని తిరిగి కొత్త తరంలో పాపులర్ చేయాలంటే స్టార్స్ ని ఆశ్రయించక తప్పడంలేదు. ఒక తరగతి ప్రేక్షకులకోసం బి గ్రేడ్ సినిమలుగా వుండి పోయిన హారర్ జానర్ ని మహేష్ భట్  అప్పట్లో స్టార్స్ తో ‘రాజ్’ (రహస్యం) గా  2002 లో తీసి, హార్రర్ ని కుటుంబ ప్రేక్షకుల్లోకి  తీసికెళ్తూ, ఇక హారర్స్ లో స్టార్స్ నటించే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు- కోర్టు రూమ్ డ్రామాలకీ  స్టార్స్ తోనే  కలెక్షన్స్ వచ్చేట్టున్నాయి. 

          అయితే ఇప్పుడు అక్షయ్ కుమార్ నటించిన ఈ కోర్టు  రూమ్ డ్రామా పూర్తిగా భిన్నం. ఇది చాలా డేరింగ్ గా న్యాయవ్యవస్థని వ్యంగ్యం చేస్తుంది. ఎలా చూపించడానికి ఇతరులు వెనుకాడతారో అలా చూపించేస్తుంది. ఈ సినిమా విడుదలైన వారంతర్వాత తమిళనాడు అసెంబ్లీ బలపరీక్ష రచ్చరచ్చ అయి వుండొచ్చు గానీ, ఆ రచ్చ దృశ్యాలే కొన్ని ఈ కోర్టు రూమ్ కిష్కింధకాండలో ప్రత్యక్షమవడం నిజంగా విచిత్రం!  న్యాయ స్థానాల్లో,  చట్టసభల్లో రేపేం జరగవచ్చో ఈ కోర్టు రూమ్ డ్రామా ముందే చెప్పేసిందన్న మాట! ఇదంతా ఏమిటో వివరంగా చూద్దాం...
కథ 
       అతను జగదీశ్వర్ మిశ్రా అలియాస్ జాలీ (అక్షయ్ కుమార్). లక్నో సెషన్స్ కోర్టులో లాయర్ గా ప్రాక్టీసు చేయాలని తహతహలాడుతూంటాడు. అతడి తండ్రి ముప్ఫై ఏళ్ళు సీనియర్ లాయర్ రిజ్వీ సాబ్ (రాం గోపాల్ బజాజ్) దగ్గర టైపిస్టుగా చేశాడు. జాలీ కూడా అక్కడ గులాంగిరీ చేస్తూనే పెరిగాడు, రిజ్వీ సాబ్ ఇంటి పనులు  కూడా చేస్తూ. అందుకని ఏదో  ఎల్ఎల్ బీ చదివేసి రిజ్వీ సాబ్ దగ్గర జ్యూనియర్ గా కుదరాలన్న ఆటలు సాగడం లేదు. పైగా తను టక్కరి. మందిని ముంచడమే తెల్సు. లాయర్ వృత్తికే మచ్చ. ఇంటిదగ్గర తను వండి పెడితే తిని, తాగి తిరిగే  భార్య పుష్పా (హుమా ఖురేషీ), ఓ కొడుకూ వుంటారు. 

          ఇక రిజ్వీ సాబ్ తనని జ్యూనియర్ గా తీసుకునే పరిస్థితి లేక, తనే ఆఫీసు తెరచుకుని ప్రాక్టీసు పెట్టాలని ప్లానేస్తాడు జాలీ. ఇందుకు రెండు లక్షలు కావాలి. ఒక హీనా సిద్దీఖ్ (సయానీ గుప్తా) అనే ఆమె రిజ్వీ సాబ్ అపాయింట్ మెంట్ కోసం తిరుగుతూంటుంది. కడుపుతో వున్న ఆమె తన భర్త ఇక్బాల్ ఖాసిం (మానవ్ కౌల్) ఎన్ కౌంటర్ కేసు ఆయనకి  అప్పజెప్పాలని ప్రయత్నిస్తూంటుంది. పెళ్ళయిన మర్నాడే అతను ఎన్ కౌంటర్ అయ్యాడు. జాలీ ఆమెని నమ్మిస్తాడు. ముందు  కేసు తీసుకోవాలంటే రిజ్వీ సాబ్ కి రెండు లక్షలు ఫీజు ఇవ్వాలని తీసుకుని ఆ డబ్బుతో ఆఫీసు పెట్టేస్తాడు. ఆమె మోసపోయానని తెలుసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది.  
 
          లోకం చేత ఛీఛీ అన్పించుకుని జాలీ బుద్ధి తెచ్చుకుంటాడు. ఇక ఆమె భర్త ఎన్  కౌంటర్  కేసుని తనే వాదించి న్యాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ దరిమిలా ప్రమోద్ మాథుర్ (అన్నూ కపూర్) అనే పెద్ద లాయర్నీ, సూర్యవీర్ సింగ్ (ప్రమోద్ మిశ్రా) అనే ఎన్ కౌంటర్ ల పోలీసు అధికారినీ, సెషన్స్ జడ్జి సుందర్లాల్ త్రిపాఠి (సౌరభ్ శుక్లా) నీ ఎదుర్కొంటాడు. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ చూస్తే, అవినీతితో నిండి వుంటాయి. తలపండిన పెద్ద తలకాయలు ఆజమాయిషీ చేస్తూంటాయి. తను చూస్తే  ఛోటామోటా లాయర్. తన మీద తుపాకీ గుళ్ళు పేలుతాయి,  కాశ్మీర్ పోలీసులూ  వెంటపడతారు...

          అసలీ ఎన్ కౌంటర్  వెనుక జరిగిన కుట్రేమిటి? ఇందులో ఎవరెవరున్నారు? హీనా భర్త ఇక్బాల్ ఖాసింని ఎందుకు ఎన్ కౌంటర్ చేశారు? ఇక్బాల్ ఖాసిం టెర్రరిస్టు అయితే, ఇక్బాల్ ఖాద్రీ (ఇనాముల్ హక్) ఎవరు? ఇతనెక్కడున్నాడు? అవినీతి వ్యవస్థ ఇతన్నెందుకు కాపాడుతోంది? ఇవన్నీ జాలీ ఎదుర్కొనే చిక్కు ప్రశ్నలే. ఈ చిక్కు ముళ్ళు విప్పి సమాధానాలు కనుక్కోవడమే మిగతా కథ. 
ఎలావుంది కథ 
      ప్రేమలో యుద్ధంలో ఏం జరిగినా రైటే అని ఎవరో ఎప్పుడో ఎందుకో చెప్పిన మాట పట్టుకుని సరిహద్దులో సైనికుల గొంతులు శత్రువులు కోయడం లాంటివి, దేశంలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోవడం లాంటివీ  జరుగుతున్నాయనీ- ఘాటు వ్యాఖ్య  చేస్తుందీ కథ. ప్రధానంగా దిగజారుతున్న న్యాయ వ్యవస్థ ప్రతిష్టని ప్రశ్నిస్తూ, న్యాయవ్యవస్థ- పోలీసు వ్యవస్థ- నేరవ్యవస్థ ఈ మూడిటి చెట్టపట్టాలు సామాన్యులకి ఏ పరిస్థితుల్ని తెచ్చి పెడుతున్నాయో కొత్త కోణంలో కళ్ళకి కడుతుంది. 

          వచ్చిన మూస కథలనే దృష్టిలో పెట్టుకుని కొత్త కథలు సృష్టించడం వేరు. వాటిలో సమాజం కన్పించదు, కాలానికి దూరంగా పాత సినిమానే కన్పిస్తుంది. మూస కథల్లాగా సమాజం శిలాసదృశం కాదు, అదెప్పుడూ కొత్త కల్లోలాలు పుట్టిస్తూంటుంది. ఎప్పటికప్పుడు ఆ కల్లోల్లాలోకి కళ్ళు పెట్టి చూసినప్పుడు సినిమాలో అప్పటి వర్తమాన సమాజం కన్పిస్తుంది. వర్తమాన సమాజ చిత్రణే  ప్రేక్షకులతో కనెక్ట్ అవుతుంది. ఇవాళ్టి సినిమాల షెల్ఫ్ లైఫ్ కొద్ది రోజులే. సమకాలీన సామాజిక కథతో ఎంత బలంగా తీసిన ‘పింక్’ లాంటిదైనా ఆర్నెల్ల తర్వాత ఎవరూ చూడలేరు. అప్పటికి కొత్త  కల్లోలమేదో పుట్టివుంటుంది, దాన్ని పట్టుకోవాలి. ఇవాళ్టి సినిమాకి సామాజిక కథ అనేది తెల్లారితే చదవలేని న్యూస్ పేపర్ లాంటిది, గంట తర్వాత చూడలేని బ్రేకింగ్ న్యూస్ లాంటిది. ఇవాళ్టి సామాజిక కథ పరుగులు పెట్టిస్తూ వుంటుంది, అవినీతి మీద ఇంకా అక్కడే కూర్చుని అవే మూస కథలు తీస్తామంటే కుదరదు. 

          వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందనుకోవడం ఒక థాట్ మాత్రమే. అది కళ్ళకి కన్పించేది కాదు, మనసుకి అన్పించేది. కార్యాలయాలు మామూలుగానే పనిచేస్తూంటాయి, శాఖలు అట్టహాసంగానే వుంటాయి. భ్రష్టత్వం అక్కడ పనిచేసే వాళ్ళ మెదళ్ళల్లో వుంటుంది. వాళ్ళు చేసి పెట్టే పనుల్లో బయటపడుతుంది. మహా అయితే వ్యవస్థ భ్రష్టు పట్టి పోవడాన్ని సింబాలిక్ గా ఒక షాట్ లో చూపించడం ఆనవాయితీ. పాక్షికంగా రూపం ఇవ్వడం మాత్రమే. కానీ వ్యవస్థ భ్రష్టుపట్టి పోవడమనే థాట్ కి  అక్షరాలా పూర్తి రూపమిస్తూ డ్రమటైజ్  చేస్తే? భ్రష్టు పట్టిన మెదళ్లలో వాళ్ళ ఆలోచనలెలా వుంటాయో వాటికి భౌతిక రూపమివ్వడమే.  
          అప్పుడు వ్యవస్థ అంటే ఏ పట్టింపూ వుండని జడ్జి డాన్సు చేస్తూ కోర్టు కొస్తాడు. సీటులో కూర్చుని ఏం చదువుతున్నాడో కళ్ళకి కన్పించక లైటుని కిందకీ పైకీ  లాగుతూ దొర్లి కిందపడిపోతాడు. సొరుగులో దేవులాడి దేవులాడి ఐదు సుత్తులు తీసి బల్ల మీద పెట్టుకుంటాడు. నిమిషానికో మారు మొక్కకి నీళ్ళు పోస్తూంటాడు. వాదోపవాదాలు పట్టించుకోకుండా, తన కూతురి పెళ్ళికి ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా చేత  డ్రెస్సు కుట్టిస్తే ఎంతవుతుందని లాయర్ని అడుగుతాడు.  కూతురి పెళ్లి కార్డు మీద బూతుల్ని (అచ్చు తప్పుల్ని) దిద్దుకుంటూ కూర్చుంటాడు. సెల్ ఫోన్లో పెళ్లి ఏర్పాట్లు మాటాడుతూంటాడు. అక్కడే  కూర్చుని టిఫిన్  తింటాడు. ఈ క్షణంలో వాడు నిర్దోషి వదిలెయ్యమని చెప్పి, మరుక్షణం లాక్కొచ్చి బోనెక్కించమంటాడు. నువ్వేం పీకుతావని లాయర్ అంటే,  నువ్వేం పీకుతావని ఎదురుతిరుగుతాడు. తన మీద బూటు విసిరితే, కోర్టులో బూట్లని – మొత్తం పాదరక్షల్నీ నిషేధిస్తాడు. ఆలియా భట్ తన ఫ్యాన్ అంటాడు. ఆమె నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది  ఇయర్’ సినిమా  11 సార్లు చూశానంటాడు. తన ఛాంబర్లో అలియాభట్  పోస్టర్ పెట్టుకుంటాడు....ఇలా ఎన్నో. 

          ఇదన్న మాట భ్రష్టత్వాన్ని కళ్ళకి కట్టడం. లీగల్ వ్యవస్థని ధైర్యంగా డార్క్ కామెడీ చేయడం, సెటైర్ చేయడం, డార్క్ జోకులతో కుళ్ళ బొడవడం. ఈ సినిమామీద కేసులు పడ్డాయి. జడ్జిని చూపించిన తీరు మీద కాదు, లాయర్ల అవినీతిని  చూపించినందుకు. లాయర్ తప్పుడు సాక్ష్యాధారాలు  ప్రవేశ పెట్టినట్టు చూపించి లాయర్ల పరువు తీసినందుకు. టైటిల్ లోంచి ‘ఎల్ఎల్ బి’ తీసేయాలని ఇంకో కేసు... బూట్ల మీద బాటా కంపెనీ కూడా కోర్టు కెక్కింది. ఆ కేసుని కొట్టేస్తింది కోర్టు. గతంలో  ‘జాలీ ఎల్ ఎల్ బి’ మీద కూడా కేసులు పెట్టారు. ‘జాలీ ఎల్ ఎల్ బి’ కి సీక్వెల్ అయిన ఈ కథ  కేసుల గురించి పెద్దగా పట్టించుకోకుండా చెప్పాల్సింది చెప్పేసింది. ఈ సెమీ రియలిస్టిక్ కథని ‘నేరము శిక్ష’ ఫార్ములా సెటప్ లో పెట్టి చెప్పారు. అంటే తన వల్ల ఓ కుటుంబానికి జరిగిన నష్టాన్ని అవమానాలు భరించి సరిదిద్దే హీరో కథన్నమాట.
ఎవరెలా చేశారు
       'జాలీ ఎల్ ఎల్ బి' (2013) లో హీరో పాత్ర అర్షద్ వార్సీ పోషించాడు. ఈ సీక్వెల్ లో అక్షయ్ కుమార్ పాత్రకి విశాల ప్రాతిపదిక వుంది. మొత్తం న్యాయ- పోలీసు- నేర వ్యవస్థలతో తలపడ్డం వుంది. అయితే ప్రారంభ దృశ్యాల్లో కన్నింగ్ లాయర్ గా అక్షయ్ లో ఇదివరకున్న స్పార్క్ ఇప్పుడు కన్పించదు. కేవలం డైలాగులే పలుకుతాయి, మైండ్ చలించదు. ‘హేరా ఫేరీ’, ఆ తర్వాత వచ్చిన అలాటి కొన్ని సినిమాల్లోని మైండూ డైలాగులూ ఒకటైన ఫన్నీ యాక్షన్ టక్కరి తనం ఇప్పుడు కనపడదు.
          తర్వాత కేసు టేకప్ చేశాక, పాత్రకి వున్న ప్రత్యేకత ఏమిటో గుర్తించక పాత్రకి మించిన ప్రతిభతో నటించుకుపోతాడు. ఈ  కారణంగా కథలో డార్క్ హ్యూమర్ డ్రామా సృష్టికర్త తను కాకుండా పోయాడు. ముందు తానేమీ కొమ్ములు తిరిగిన లాయర్ కాదు, పైగా మాయమాటలతో మందిని ముంచే రకం. అలాంటి వాడు తన వల్ల ఒక వ్యక్తి  మరణించిందని ఆమె కేసు టేకప్ చేసినప్పడు, ఉన్నట్టుండి  గొప్ప లాయర్ అయిపోలేడు. ముందు నుంచే గొప్ప లాయర్ అయి వుండీ అవినీతి చేస్తూంటే  ఆ అవినీతి మానుకుని గొప్ప లాయర్ గానే  పనిచేస్తున్నాడంటే అర్ధముంటుంది. కానీ  ‘లా’ విషయంలో తను అసమర్ధుడు. తన పాత్రకి అసమర్ధ లాయర్ గా, మందినిముంచే కిలాడీగా  రెండు షేడ్స్ వున్నాయి. ఈ రెండు షేడ్స్ లో రెండవది ఆ వ్యక్తి  మృతితో మాసిపోవచ్చు. కేసు విచారణకి సంబంధించి వారణాసి వెళ్ళినప్పుడు పాపాల్ని కడిగేసుకుంటున్నట్టు గంగా నదిలో దూకుతాడు. కానీ అదే సమయంలో వృత్తి విషయంలో స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి అసమర్ధ లాయర్ అనే రెండో షెడ్ అలాగే వుండి పోతుంది. అలా వుంటేనే పాత్ర అర్ధవంతంగా వుంటుంది. ఆ అసమర్ధతే పాత్రకి ఒక ప్రత్యేకతగా ప్రకాశిస్తుంది. పాత్రకి ఈ ప్రత్యేకతని గుర్తించకుండా ప్రతిభావంతుడైన లాయరన్న కోణంలో చిత్రణ చేస్తే ఎలా?

           అందుకే, కళ్ళముందు న్యాయప్రక్రియ రసాభాస అవుతూంటే బిత్తర చూపులు చూస్తూంటాడు. అదే అసమర్ధ లాయర్ గా వుంటే వచ్చీ రాని  పనితనంతో అసలే భ్రష్టు పట్టిన  వ్యవస్థల్నిఇంకింత నాశనం చేస్తూ అసలు వ్యవస్థలే లేకుండాపోయే, ఎవరికీ కొలువులే లేకుండా పోయే పరిస్థితి తెచ్చి వాళ్ళచేత కాళ్ళు పట్టించుకునే వాడు... ఇదీ కాన్సెప్ట్. 

          పాత్రకున్న షేడ్స్ విషయంలాగే, కథకీ రెండు షేడ్స్ వున్నాయి. ఇక్కడా  ఏ షేడ్ కాన్సెప్టో  గుర్తించినట్టు కనపడదు. కథకి వున్న ఆ  రెండు షేడ్స్ : ఒకటి, ఎన్ కౌంటర్ కేసు; రెండు, వ్యవస్థల భ్రష్టత్వం. ఈ రెండిట్లో ఏది కాన్సెప్ట్? రెండోదే. దీన్నే ప్రధానం చేయాలి, దీంతోనే తలపడాలి, ఎం కౌంటర్ కేసుని అందుకు సాధనంగా మాత్రమే వాడుకోవాలి. 

         కానీ ఎన్ కౌంటర్ కేసుని కూడా ప్రధానం చేయడంవల్ల సమస్య వచ్చింది. ఈ ప్రధానం చేయడంలో కూడా ఎన్నో లోసుగులూ బలహీనతలూ వున్నాయి- ఎందుకంటే ఒక వొరలో రెండు ఎలిమెంట్స్ ఇమడవు, ఒకటి బలి అవాల్సిందే. ఇక్కడ ఎన్  కౌంటర్ కేసు కథనం అందుకే  సంతృప్తికరంగా వుండదు. ఈ కథలో వ్యంగ్యం వ్యవస్థలతోనే వుంది గానీ కేసుతో లేదు, అలాంటప్పుడు కథకి ప్రధాన రసమైన ‘వ్యంగం’ అనే ఎలిమెంట్ కి విఘాతం కలక్కుండా చూసుకోవాలి.

          ఈ దర్శకుడే 2010 లో తీసిన ‘ఫస్ గయారే ఒబామా’  (తెలుగులో ‘శంకరాభరణం’ ) లో కూడా ఒక బ్యాక్ డ్రాప్ వుంటుంది : అమెరికాలో ఏర్పడిన ఆర్ధిక మాంద్యం బాధితుడిగా ప్రధానపాత్ర ఇండియాకి రావడం.  కానీ ఈ బ్యాక్ డ్రాప్ కాన్సెప్ట్ కాదు, అందుకని దాన్నే కథగా చేయలేదు. అలాటి వాడు ఇండియాకి వచ్చి ఎదుర్కొన్న అనుభవాలే ప్రధాన కథ. ఈ అనుభవాలతోనే పాత్రని నడిపించుకుపోయారే తప్ప, బ్యాక్ డ్రాప్ లో వున్న ఆర్ధిక మాంద్యం  జోలికి పోలేదు. అంటే ఇక్కడ ప్రధాన పాత్ర  అమెరికాలో ఆర్ధిక మాంద్యం అనే బ్యాక్ డ్రాప్ లోంచి వచ్చింది. అందుకని తదనంతర  అనుభవాలే కథయ్యింది. 

      అదే ప్రస్తుత కథలో అక్షయ్ కుమార్ పాత్ర వ్యవస్థల భ్రష్టత్వం అనే బ్యాక్ డ్రాప్ లోకి వెళ్ళాలి. ‘ఫస్ గయారే ఒబామా’ లో హీరో పాత్ర బ్యాక్ డ్రాప్ లోంచి వస్తే, ‘జాలీ ఎల్ ఎల్ బి -2’ లో హీరో పాత్ర బ్యాక్ డ్రాప్ లోకి వెళ్ళాలి. ఇదీ సంగతి. ‘ఫస్ గయారే ఒబామా’ లో హీరో పాత్ర బ్యాక్ డ్రాప్ లోంచి వచ్చి జీవితాన్ని మధించడమే కథగా పెట్టుకుంటే, ‘జాలీ ఎల్ ఎల్ బి -2’ లో హీరో పాత్ర  ఎన్ కౌంటర్ కేసు అనే తన ముందున్న అనుభవం లోంచి బ్యాక్ డ్రాప్ లో కెళ్ళి వ్యవస్థల్ని మధించాలి.

          ఈ  స్పష్టత కొరవడ్డంతో హీరో యమ సీరియస్ గా, గొప్ప లాయర్ గా, ఎన్ కౌంటర్ కేసుని పట్టుకుని, వ్యవస్థల భాగోతాన్ని కళ్ళప్పగించి చూడాల్సి వచ్చింది.

          పాత్రని సరీగ్గా నిర్వచించుకోక పోతే అది అన్నిటినీ చెడగొట్టే అవకాశముంది- కాన్సెప్ట్ నీ, కథనీ, కథనాన్నీసమస్తాన్నీ. పాత్రని అసమర్ధ లాయర్ గానే నిర్వచించుకుని వుంటే ఇవన్నీ దార్లో పడేవి.

          నిజానికైతే  పాత్ర కేసుని టేకప్ చేసే అవకాశం కూడా లేదు. కేసు కోసం తనని ఆశ్రయించిన ఆమెనే మోసం చేసి, ఆమె మృతికి కారకుడైన వాడిమీద చట్టం చర్య  తీసుకోదా?  బార్ అసోసియేషన్ వూరుకుంటుందా? కానీ  బార్ అసోషియేషన్ ఇప్పుడు వూరుకుని,  కేసు నడుస్తున్నప్పుడు అతనేదో అక్రమానికి పాల్పడ్డాడని బహిష్కరిస్తుంది. వెంటనే నిజాయితీని నిరూపించుకోమని నాల్గు రోజులు గడువిస్తుంది. ఇదంతా ఫాల్స్ డ్రామాగా తేలిపోయింది.

          హీరో ఈ కేసుని టేకప్ చేయడానికి క్లయంట్ లేదు. ఆమె తండ్రి వున్నాడు. కానీ ఆయనకి ముఖం చూపించలేడు. అందుకని పిల్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) వేస్తాడు. ఇదెలా సాధ్యం? ఒక వ్యక్తి  కేసుని పిల్ గా కోర్టెలా స్వీకరిస్తుంది? ప్రజలందరికీ ఎఫెక్ట్ అయ్యే సమస్యలకే  పిల్ వర్తిస్తుంది. మృతురాలి భర్త ఎన్ కౌంటర్ ప్రజలందరికీ ఎఫెక్ట్ అయ్యే సమస్య కాదుగా? ఆ ఎన్  కౌంటర్ల అధికారి ఎన్నో ఎన్ కౌంటర్లు చేశాడు. అలాంటప్పుడు అది ప్రజాసమస్య కావొచ్చు. అప్పుడు ఈ కేసు సహా, గతంలో ఎన్ కౌంటర్ల కేసులన్నీ కలిపి అతడి మీద కేసు వేస్తే అది ప్రజాప్రయోజన వ్యాజ్యం అవుతుంది గానీ,  ఒకే  కేసు పట్టుకుని పిల్ ఎలా వేస్తాడు, కోర్టెలా విచారణకి తీసుకుంటుంది?

          వ్యవస్థల్ని చెండాడే ముందు కథకుడు తన కథతో కరెక్టుగా వుండాలి. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఎలావుంటుందో, అడ్డగోలు కథతో నీతులు చెప్పినా  అలాగే వుంటుంది. 

          పాత్ర వ్యక్తిగత గోల్ తోనే బయల్దేరింది. కానీ తర్వాత అది వ్యవస్థాగత గోల్ గా ఎదగాల్సింది ఎదగలేదు, ప్రేక్షక పాత్రకే పరిమిత మయ్యింది. తన వల్ల చనిపోయినామె  కేసు పోరాడి ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న వ్యక్తిగత  గోల్ తో బయల్దేరినప్పుడు, అదైనా సరీగ్గా కుదిరిందా?  దాంతో ఏర్పడాల్సిన ఎమోషన్ పాత్రకి ఏర్పాటయ్యిందా? 

          ఆమె మృతితో నైతికంగా తను పూర్తిగా మారివుంటే, మారాలనుకుంటే, వెంటనే వెళ్లి ఆమె తండ్రి కాళ్ళు పట్టుకోవాల్సింది. అది చెయ్యక గంగా నదిలో మునకేసి ఏం లాభం? ఆ తండ్రి  ఎన్ కౌంటర్ లో అల్లుణ్ణి, హీరో మోసం వల్ల కూతుర్ని, కూతురి కడుపులో వున్న మనవరాల్నో మనవడ్నో  – ఇంతమందిని కోల్పోయి ముసలితనంలో ఒంటరిగా మిగిలాడు. అతడి దగ్గరికి హీరో వెళ్ళక పోతే అతనెలా బలమైన పాత్రవుతాడు?  వెళ్లి వుంటే అక్కడే బలమైన డ్రామా, పాత్రకి ఇంధనం లాంటి నిఖార్సైన  ఎమోషనూ  ఏర్పడి పాత్ర పునీతమయ్యేది.

         వ్యవస్థ  బాధితుల్ని కలుపుకోకుండా వ్యవస్థమీద పోరాడే హీరో, సరైన ఎమోషనల్ కనెక్ట్ లేక తేలిపోతాడని మొన్నే ‘సింగం -3’ రివ్యూలో గుర్తు చేసుకున్నాం. సెకండాఫ్ లో ఎప్పుడో హీరో ఒక అడ్రసు కోసం ఆ తండ్రి దగ్గరి కెళ్ళడాన్ని చూపించి ఆ లోటు తీర్చా మనుకున్నట్టుంది  దర్శకుడు- కానీ హీరో వెళ్ళాల్సింది అడ్రసు కోసం  ఇక వెళ్ళక తప్పదన్నట్టు ఎప్పుడో వెళ్ళడం కాదు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే, తను మారాలనుకున్నప్పుడే,  ఆ తండ్రి దగ్గరికి ప్రాయశ్చిత్తం కోసం వెళ్ళాలి- మారాలన్న ఆలోచన పెట్టుకుని తనతో తానే నిజాయితీగా లేకపోతే  ఎలా?

          ఇన్ని లొసుగులున్న పాత్రలో ఒక  స్టార్ ని ఎవరైనా ఎలా చూసి ఎంజాయ్ చేస్తారు? మనకైతే తెలీదు.

          ఇక సినిమాల్లో విలన్ బొట్టు పెట్టుకుంటే మరింత కఠినంగా కన్పిస్తాడు. అదే హీరో బొట్టు పెట్టుకుని  తిరిగితే పప్పుసుద్దలా కన్పిస్తాడు. సినిమాల్లో హీరో పూజలు చేస్తూ కన్పించడు. విలన్ పూజ చేస్తే వచ్చి నరుకుతాడు. విలన్ ద్వంద్వ నీతికి ఈ పూజలూ బొట్లూ అద్దం పడతాయి. అయితే సినిమా సాంతం ఒక హీరోగా అక్షయ్ కుమార్ బొట్టుతోనే వుండడం పాత్రౌచిత్యాన్ని దెబ్బతీసింది.  

          ప్రారంభంలో బొట్టుతోనే చాలా మందిని ముంచానని, ఒకామె చావుకీ కారకుణ్ణి అయ్యాననీ  తెలుసుకుంటే,  బొట్టు తీసేసి దాని పవిత్రతని కాపాడేవాడు. ఈ పరివర్తనతో  ప్రేక్షకులకి దగ్గరయ్యే వాడు. కేసు పోరాడుతున్నపుడు బొట్టు అవసరమే లేదు. జంధ్యం తీసి చూపించాడు, చాలు. ఇప్పుడు బొట్టు తీసేస్తేనే పవర్ఫుల్ గా వుంటాడు- శపథం చేసినట్టు. కథ మొత్తం అయ్యాక తిరిగి బొట్టు పెట్టుకుంటే అది సింబాలిక్ గా వుంటుంది తన విజయానికి.

          ఈ కథలో బొట్టు అనేది ప్లాట్ డివైస్. ప్లాట్ డివైస్ స్తబ్దుగా వుండిపోదు. ప్లాట్ డివైస్ ని కథానుగుణం గా ప్లే చేయకపోతే కథతో పాటు పాత్రకూడా నిస్తేజంగా వుంటాయి. 
                                    ***
      ప్రత్యర్ది లాయర్ పాత్ర బ్రహ్మాండంగా వుంది. కొన్ని కథల్లో కాని పనులు చేసే  ప్రత్యర్ధియే బ్రహ్మండంగానే వుంటాడు. తను చేయాల్సిన వెధవపనులన్నీ అత్యంత నిజాయితీతో చేసుకుపోతాడు. మంచి పనులు చేసే హీరోకే వాటి పట్ల నిజాయితీ నిబద్ధతలనేవి కన్పించవు. అతడికి కామెడీలూ హీరోయిన్లతో సరసాలూ కావాలి. 
          ప్రత్యర్ధి లాయర్ పాత్రలో అన్నూకపూర్ హీరోకంటే హైలైట్. వ్యవస్థల్ని పాడు చేసి బాముకునే బడా లాయర్ గా ప్లే చేయాల్సిన ట్రిక్కులన్నీ ప్లే చేస్తాడు. అలాగే జడ్జి పాత్రలో సౌరభ్ శుక్లా లేకపోతే  ఈ సినిమా లేదు. భారతీయ చలనచిత్ర  చరిత్రలో అతడిది  ఇంతవరకూ రాని  వినూత్న పాత్ర. అడ్డగోలు జడ్జిగా చాలా క్రియేటివ్ పాత్ర. ఈ విషయంలో దర్శకుణ్ణి అభినందించక తప్పదు. ఇక మిగతా అన్ని పాత్రలూ రియలిస్టిక్ గా కన్పించేవే. కానీ హీరోయిన్ హుమా ఖురేషీ కి ఏఎ సినిమాలో అంతగా పనిలేదు, వూరికే వుండే పాత్ర. హీనా సిద్దీఖ్ పాత్రలో సయానీ గుప్తా మాత్రం అక్షయ్ కుమార్ ని నిలదీసే సన్నివేశంలో పూర్తిగా డామినేట్ చేసి ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. 

          పాటలకి పెద్దగా ప్రాముఖ్యం లేదు, అవి ఆకట్టుకునేది కూడా లేదు. సహజత్వానికి దగ్గరగా కళా దర్శకత్వం, ఛాయాగ్రహణం బావున్నాయి. 

చివరికేమిటి 
     వ్యవస్థల అవినీతిని చెప్పే  కాన్సెప్ట్ బలమైనదే అయినా, కాన్సెప్ట్ కి సాధనమైన ఎన్ కౌంటర్ కథకీ ప్రాధాన్య మివ్వడంతో  స్క్రీన్ ప్లే ఒడిదుడుకుల పాలై కన్పిస్తుంది. అయితే ఒక సాధారణంగా కన్పించే ఎన్ కౌంటర్ కథ క్రమక్రమంగా చిక్క బడుతూ, విశాలమవుతూ- కొత్త రహస్యాల్ని వెల్లడిస్తూ, పతాక స్థాయికి వెళ్లి అసలు గుట్టు రట్టు చేయడమనే సస్పెన్స్ తో వున్నప్పటికీ,  ఇదంతా చూపించుకు రావడం వల్ల అసలు కాన్సెప్ట్ మీద ఫోకస్ చెదిరిపోయి కన్పిస్తుంది. పైగా ఈ కేసు కథలో లాజికల్ గా ఎన్నో లోపాలు. అలాగే సంఘటనల కూర్పు కూడా అతుకులేసినట్టు వుంటుంది. షాకింగ్ దృశ్యాల కల్పనలో షాక్ వుండదు. వున్నట్టుండి హీనా పాత్ర ఆత్మ హత్య చేసుకోవడంలో అది ప్రేరేపించాల్సిన అయ్యోపాపమనే భావం ప్రేరేపించదు. 

          అలాగే ఇంటర్వెల్ దృశ్యంలో హీరో మీద దుండగులు కాల్పులు జరిపే సంఘటన కూడా... అకస్మాత్తుగా జరిగే సంఘటన అకస్మాత్తుగా ముగిసిపోవాలనే నియమం ఇక్కడ కన్పించదు. హీరో తన ఫ్యామిలీతో మార్కెట్ లో వున్నప్పుడు సడెన్ గా దుండగులు వచ్చి హీరో మీద కాల్పులు జరుపుతారు. కానీ  దాడి జరిపినంత మెరుపు వేగంతో మాయమైపోరు. డిలే చేస్తారు. దీంతో షాక్ వేల్యూ నీరుగారిపోయింది. 

          ఎలా సడెన్ గా వచ్చి ఎటాక్ చేశారో, అంత  సడెన్ గానూ  మాయమైపోతే అందులో షాక్ వేల్యూ  వుంటుంది ఆడియెన్స్ కి కూడా. ఇంటర్వెల్ సీనుకి ఈ షాక్ వేల్యూ  చాలా అవసరం. ఇదొక వెర్షన్.

          ఇంకో వెర్షన్ లో-  సంఘటన సడెన్ గా జరగడం గాక, అది జరగబోతున్నట్టు సీన్ ఓపెన్ చేసి, ఒక వైపు దుండగుల్ని  చూపిస్తూ, మరో వైపు హీరోని చూపిస్తూంటే, అది సస్పెన్స్ ని  క్రియేట్ చేస్తుంది. అప్పుడు వచ్చి దాడి చేసి తక్షణం పారిపోకపోయినా  ఫర్వాలేదు- సస్పన్స్ ని ముగించారు కాబట్టి ఈ సీన్లో  ఎమోషన్ తీరిపోతుంది. 

          ఈ రెండూ కాక, దుండగులు సడెన్ గా వచ్చి హీరో మీద కాల్పులు జరిపి, తమని పట్టుకోవాలని పెనుగులాడుతున్న భార్యని విడిపించుకునే ప్రయత్నాలు చేస్తూ, పారిపోవడం డిలే చేస్తే  సస్పెన్సు, ఎమోషన్,  షాక్ వేల్యూ ఏవీ వుండవు. ఇలాగే  చూపించారు ఇంటర్వెల్ సీనులో.  
          అంటే పైన చెప్పుకున్న మొదటి వెర్షన్ ప్రారంభాన్ని,  రెండో వెర్షన్ ముగింపుతో  కలిపి కిచిడీ చేశారన్న మాట. దీంతో ఇంటర్వెల్ ఇవ్వాల్సిన ఎఫెక్ట్ ఇవ్వకుండా ఏదో  ముచ్చట్లాడు కుంటున్నట్టుగా వుండిపోయింది.

          ఇలా కాన్సెప్ట్- దాని సాధనం, పాత్ర - దాని తర్వాతి క్రమం, సంఘటన ప్రారంభం - దాని ముగింపు...ఇలా ఏ క్రియేటివ్ యాస్పెక్ట్ లోనూ  దర్శకుడు క్షీరనీర న్యాయం చేయలేకపోతున్నాడు. చేసి వీటి లోంచి  కేవలం పనికొచ్చే పాలనే తీసుకోవాలని గుర్తించ లేకపోతున్నాడు.
                                                ***
      కోర్టు సీన్ల సెటైర్లు, డార్క్ కామెడీ మాత్రం ధైర్యంగా అపూర్వంగా ప్రదర్శించిన క్రియేటివిటీ. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ దృశ్యాలు కొన్ని ఇక్కడ లైవ్ గా కన్పిస్తాయి. కోర్టులో ప్రత్యర్ది లాయర్  వర్గం సృష్టించే బీభత్సం, కొట్లాట, తన్నులాట, ఫైళ్ళ ఎగరవేత, బల్లలూ కుర్చీల విసిరివేత, జడ్జి బల్ల కింద దూరివేత (అంతకి ముందు  జడ్జి ‘నా కుర్చీలో కూర్చో రా!’  అని ఆరుస్తాడు- ఇది కూడా చేసి వుంటే తమిళ నాడు అసెంబ్లీ ఎపిసోడ్ కి పూర్తి న్యాయం జరిగేది), అన్నాడీఎంకే సభ్యుల్లా హీరో మౌనం గా చూస్తూ వుండడం,  చివరికి స్టాలిన్ లా ప్రత్యర్ధి లాయర్ అక్కడే ధర్నా కూర్చోవడం! (చూస్తే  స్టాలిన్, ఈ సినిమా చూసే ఆ యాక్షన్ డ్రామా అంతా  సృష్టించాడేమో అన్పిస్తుంది- సినిమాలో పూర్తి  చెయ్యని జడ్జి కుర్చీలో కూర్చునే ఘట్టాన్ని, అసెంబ్లీ లో స్పీకర్ సీటుతో చేసి చూపించాడేమో).
          ఇక అసెంబ్లీకి ఆ రోజు కె. కరుణానిధి రాలేదేమో గానీ, ఇక్కడ కోర్టులో కరుణానిధి లాంటి ఆరోగ్యపరిస్థితుల్లోనే ఒక బాగా వృద్ధుడు వీల్ చైర్ లో వచ్చి ప్రొసీడింగ్స్ గమనిస్తాడు (పై ఫోటో చూడండి).

          సినిమాలో జడ్జి కూడా, ధర్నా కూర్చున్న ప్రత్యర్ది లాయర్ ముందు కింద కూర్చోవడం ఇంకో స్పెషాలిటీ. అలా కోర్టు నిండా జనం చూస్తూనే వుంటారు. అర్ధరాత్రి గడిచిపోతుంది. తమిళనాడు అసెంబ్లీ  స్పీకర్ విశ్వాస పరీక్ష మధ్యలో జరిగిన రభసకి, సభ వాయిదా వేసి మళ్ళీ తర్వాత  విశ్వాస పరీక్ష జరపడం రూల్సు కి విరుద్ధమని అంటున్నారు.
ఇక్కడ జడ్జి అలా కేసు వాయిదా వేయడు. అర్ధరాత్రి దాకా ధర్నా జరగనిచ్చి, కేసు వాయిదా వేయకుండా కంటిన్యూ చేస్తాడు. ఇదన్యాయం, చట్ట విరుద్దమంటే- ఇప్పుడెలాగూ బయటికెళ్తే రిక్షాలుండవు, బస్సు లుండవు- ఎందుకొచ్చిన గొడవ - ఇక్కడే కూర్చుని పని ముగిద్దామని రసాభాసగా విచారణ కొనసాగించి, తెల్లారేసరికల్లా తీర్పు చెప్పేసి వెళ్ళిపోతాడు కూతురి పెళ్ళి పనులకి.

          మొత్తానికి రెండు వేర్వేరు జానర్స్  - సెటైర్, సీరియస్ యాక్షన్ డ్రామా- లని కలిపి ఒక ప్రయోగం చేశాడు దర్శకుడు. క్రియేటివిటీకి కొలమానాల్లేవన్నట్టు ఏదైనా చేసెయ్య వచ్చేమో!

-సికిందర్ 
http://www.cinemabazaar.in