రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, జులై 2020, శుక్రవారం

963 : రివ్యూ!


దర్శకత్వం వెంకటేష్ మహా
తారాగణం: సత్యదేవ్, నరేష్, సుహాస్, హరి చందన, రూప తది తరులు
సంగీతం: బిజిబల్, ఛాయాగ్రహణం: అప్పు ప్రభాకర్
బ్యానర్: ఆర్కా మీడియా
నిర్మాతలు: విజయ ప్రవీణ పరుచూరి, శోభు యార్ల గడ్డ, ప్రదాస్ దేవినేని
విడుదల: నెట్ ఫ్లిక్స్

***
        త్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు మలయాళ రీమేక్ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యింది. ప్రముఖ సంస్థ ఆర్కే మీడియా నిర్మించింది. ఇటీవలే సత్య దేవ్ నటించిన థ్రిల్లర్ ‘47 డేస్’ విడుదలైన విషయం తెలిసిందే. సత్యదేవ్ వెరైటీ పాత్రల్ని ఎంచుకుని తనకి సూటయ్యే జానర్ రియలిస్టిక్ సినిమాలు నటిస్తూ పోతున్నాడు. ‘మనవూరి రామాయణం’ లో ఆటో డ్రైవర్ పాత్రతో, ‘ఘాజీ’ లో మెరైనర్ పాత్రతో మంచి గుర్తింపు పొందాడు. ఇప్పుడు మలయాళ రీమేక్ తో సాధారణ విలేజి ఫోటోగ్రాఫర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ పాత్ర తనకి ప్లస్ అయిందా, ఏ మేరకు అయింది - అలాగే కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా ఈసారి రీమేక్ తో ఏ మేరకు మెప్పించాడు ఓసారి చూద్దాం...

కథ
      మహేష్ (సత్యదేవ్) అరకులో చిన్నపాటి స్టూడియో నడుపుకునే ఫోటోగ్రాఫర్. వృద్ధుడైన తండ్రి మనోహర్ రావు (రాఘవన్) వుంటాడు. తండ్రి నుంచే ఫోటోగ్రఫీ నేర్చుకుని ఈ వృత్తిలోకి వచ్చాడు. వీళ్ళకి సన్నిహితుడైన ఎముకల నాటు వైద్యుడు బాబ్జీ (నరేష్) వుంటాడు. హైస్కూలు అప్పట్నించీ మహేష్ ప్రేమిస్తున్న స్వాతి (హరిచందన) వుంటుంది. వూళ్ళో ఏ సమస్యలు లేకుండా హాయిగా గడిచిపోతున్న మహేష్ జీవితంలో వూహించని సంఘటన జరుగుతుంది. రోడ్డు మీద ఎవరో కొట్టుకుంటూంటే మహేష్ అడ్డుకోబోతాడు. అడ్డొచ్చిన మహేష్ ని జోగినాథ్ అనే పక్క వూరి వెల్డర్ విపరీతంగా కొడతాడు. అతడి బలం ముందు మహేష్ బలం ఏమాత్రం చాలదు. అందరి ముందూ దెబ్బలు తిన్నందుకు అవమానం ఫీలవుతాడు. ఎలాగైనా ఇక జోగినాథ్ ని కొట్టి పగదీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు. అంతవరకూ కాళ్ళకి చెప్పులు వేసుకోనని పంతం బూనుతాడు. 

        మరి మహేష్ పగ తీరిందా? అంత బలం ఎలా వచ్చింది? జోగినాథ్ దొరికాడా? ఈలోగా స్వాతి ఏమైంది? జ్యోతి (రూప) తో మహేష్ ప్రేమ ఎలా మొదలయ్యింది? ఇవన్నీ తెలియాలంటే మిగతా సినిమా చూడాలి. 

నటనలు- సాంకేతికాలు
      సత్యదేవ్ పాత్ర యాంగ్రీ యంగ్ మాన్ రెగ్యులర్ కమర్షియల్ పాత్ర కాదు. నిజ జీవితంలో కనిపించే సహజ పాత్ర. కాబట్టి ఆ బాపతు హీరోయిజాలూ, రివెంజి డైలాగులూ, యాక్షన్ సీన్లూ లేకుండా తాజాగా కన్పిస్తుంది. అవమానం పొందే ముందు నల్గురితో అతడి సాధారణ జీవిత దృశ్యాలు, అవమానం పొందాక పగదీర్చుకునే లోపు ఎదురయ్యే అసలు జీవిత దృశ్యాలూ  పాత్రని అర్ధంజేసుకుని శాంతంగా, ప్రభావశీలంగా నటించాడు. అరకు నేటివిటీలో కలిసిపోతూ రాణించాడు. కాకపోతే మలయాళ ఒరిజినల్ ప్రకారం పాత్ర కిచ్చిన ముగింపుతో విషయ రాహిత్యంగా కన్పిస్తాడు. తన పాత్రని, నటనని, గోల్ నీ ఫాలో అవుతున్న ప్రేక్షకులు తప్పకుండా విలన్ని కొట్టి పైచేయి సాధిస్తాడనే అనుకుంటారు. ముగింపు తెలిసిపోతూనే వుంటుంది. కమర్షియల్ సినిమా ముగింపు. కానీ తనది కమర్షియల్ పాత్ర కాదు. అలాటి నటన కూడా లేదు. కానప్పుడు ప్రేక్షకులు వూహించని రియలిస్టిక్ ముగింపే నివ్వాలి. తనని కొట్టిన వాణ్ని బలం పెంచుకుని కొట్టడం తెలుస్తున్న, పేలవమైన కమర్షియల్ ముగింపు. దీన్ని రివర్స్ చేసి తను మెచ్యూర్ అయిన పాత్రగా ఎదిగినట్టు చూపలేక పోయాడు. మెచ్యూరిటీ పరంగా ఎక్కడున్న వాడు అక్కడే వుండి పోతూ, ఇవ్వాల్సిన పాజిటివ్ మెసేజ్ ఇవ్వలేక  పోయాడు. 


        ఇతర పాత్రల్లో నరేష్ సహా అందరూ (చాలా మంది కొత్త వాళ్ళు) అరకు మనుషుల్లాగే కన్పిస్తారు. హీరోయిన్లు హరి చందన, రూప సినిమాకి రూరల్ రోమాంటిక్ విలువని చేకూరుస్తారు. బ్యాడ్ క్యారక్టర్ జోగినాథ్ గా నటించిన రవీంద్ర విజయ్, హీరో తండ్రి పాత్రలో రాఘవన్ పర నటులైనా నేటివిటీలో కలిసిపోయారు. 

        బిజిబల్ సంగీతంలో రెండు పాటలు మాంటేజీల్లో వస్తాయి. అప్పు ప్రభాకర్ కెమెరా వర్క్, రవితేజ ఎడిటింగ్ చెప్పుకోదగ్గవి. 

కథాకథనాలు
  2016 లో విడుదలైన మలయాళ ‘మహేషింటే ప్రతీగారం’ రీమేక్ కథ ఇది. దీనికి కంచరపాలెం తీసిన దర్శకుడు వెంకటషే నేటివ్ ఫీల్ కి సరైన న్యాయం చేయగలడు. మలయాళ వాసన లేకుండా అచ్చమైన తెలుగు కథలా తీశాడు. కథనంలో గానీ, దృశ్యాల చిత్రీకరణలో గానీ రెగ్యులర్ తెలుగు సినిమాలకి అలవాటు పడిన- దర్శకుడి అహం బయటపడే - ఎలాటి కమర్షియల్, టెక్నికల్ కాలుష్యాలు జొరబడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇలాటి సినిమాకి అగ్రనిర్మాతలు చేయూత నివ్వడం ఒకెత్తు. వాస్తవిక దృక్పథం పెల్లుబికే  కథలతో బ్రతికే ఆరోగ్యకరమైన ఇలాటి చిన్న సినిమాలకి అగ్రనిర్మాతల వల్లే బలం లభిస్తుంది. 


        మలయాళ సినిమాలంటే తేలికపాటి సంఘర్షణలతో కూడిన లైటర్ వీన్ సినిమాలు. తెలుగు ప్రేక్షకులు ఏళ్లకేళ్ళు పిచ్చి పిచ్చి లైటర్ వీన్ ప్రేమ సినిమాలకి అలవాటు పడ్డారుగానీ, ఇలాటి తేలికపాటి కాన్ఫ్లిక్ట్ వుండే మలయాళ మార్కు మంత్రాలకి కాదు. కాన్ ఫ్లిక్ట్ వుంటుంది, కానీ ఆ కాన్ఫ్లిక్ట్ తోనే కథ వుండదు. కథ పాత్రకి చెందిన ఇతర జీవిత కోణాల్ని సృశిస్తూ పోతూ, చిట్ట చివరికి ఎదుటి పాత్రతో అమీ తుమీకి దిగి కాన్ఫ్లిక్ట్ తేల్చు కుంటుంది. ప్రస్తుత కథ కూడా ఇదే బాపతు. 

        తనని కొట్టిన వాణ్ని కొట్టాలి సత్య దేవ్. ఇంత చిన్న కాన్ఫ్లిక్ట్. ఈ చిన్న కాన్ఫ్లిక్ట్ ని పట్టుకుని కథ నడిపితే సిల్లీగా వుంటుంది. అందుకని కొట్టిన వాడు దుబాయ్ వెళ్లి పోతాడు. చేసేది లేక వాడు  వచ్చాకే కొడదామని ఇతర వ్యాపకాల్లో పడిపోతాడు సత్యదేవ్. ఆ ఇతర వ్యాపకాలు ఇద్దరు భామలతో ప్రేమలు, వాటి అతీగతీ, ఫోటోగ్రఫీలో తండ్రి నుంచి ఇంకాస్త జ్ఞానం, కుంగ్ ఫూ నేర్చుకోవడం, ఇతర కార్యక్రమాలు వగైరా వగైరా. ఇక కొట్టిన వాడు దుబాయి నుంచి రాగానే వాణ్ని కుంగ్ ఫూతో పబ్లిగ్గా కొట్టి పడేసి, పోయిన పరువు రాబట్టుకుంటాడు. 

        ఈ కథ పాయింటు 2001 లో వచ్చిన హాలీవుడ్ హిట్, టిమ్ అలెన్ నటించిన ‘జో సమ్ బడీ’ లో కూడా వుంది. టిమ్ ని కూతురు ముందు ఒక బలవంతుడు అన్యాయంగా కొడతాడు. టిమ్ కి గొప్ప అవమాన మైపోతుంది. అదే కూతురి ముందు వాణ్ని కొట్టి ప్రూవ్ చేసుకోవాలని సిద్ధమై పోతాడు. ఇందుకు కరాటే, కుంగ్ ఫూ వంటి వన్నీ నేర్చుకుంటాడు. వీడేంట్రా అని నవ్వుతున్నా పట్టించుకోడు. చివరికి పుష్టిగా, బలంగా తయారై కూతురి స్కూలు ముందు ఈవెంట్ పెట్టి వాణ్ని రమ్మంటాడు. కానీ వాడికంటే బలవంతుడుగా మారిన తను కొట్టడు. కొట్టి పైచేయి సాధిస్తే అది కథ ఎందుకవుతుంది? ఇది స్పోర్ట్స్ కథ కాదు కదా? అందుకని కొట్టడానికంటే మించిన మెసేజ్ ఒకటుంది. ఆ మెసేజి వల్ల తను మెచ్యూర్డ్ వ్యక్తిగా ఎదగగల అవకాశం....ఇగోని  మెచ్యూర్డ్ ఇగో మార్చే ముగింపే కదా మంచి కథా లక్షణం. మలయాళంలో, తెలుగు రీమేక్ లో ప్లాట్ క్లయిమాక్స్ ని ప్లాట్ క్లయిమాక్స్ గానే ముగించారు. ‘జో సమ్ బడీ’ లో ప్లాట్ క్లయిమాక్స్ గాకుండా, చక్కటి స్టోరీ క్లయిమాక్స్ చేశారు...

-సికిందర్


29, జులై 2020, బుధవారం

962 : రివ్యూ!


దర్శకత్వం: పన్నాగాభరణ
తారాగణం: డానిష్ సేట్, సాల్ యూసుఫ్, దిశా మదన్, సింధూ శ్రీనివాస మూర్తి, మైకేల్ మధు, మహంతేష్, రంగాయణ రఘు తదితరులు
రచన: పన్నాగాభరణ, అవినాష్ బలెక్కల, సంగీతం: వాసుకీ వైభవ్, ఛాయాగ్రహణం: కార్తీక్ పళని
బ్యానర్: పిఆర్ కె ప్రొడక్షన్స్, నిర్మాత: అశ్వనీ పునీత్ రాజ్ కుమార్, గురుదత్ తల్వార్
విడుదల: అమెజాన్ ప్రైమ్

***
       
రో కన్నడ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కన్నడలో తొలి రెండు ఓటీటీ విడుదలలు చేసిన  నిర్మాణ సంస్థగా పిఆర్ కె ప్రొడక్షన్స్ నిలిచింది. ఈ నెలలోనే ‘లా’ తర్వాత ఇప్పుడు ‘ఫ్రెంచ్ బిర్యానీ’ అందించింది. ప్రముఖ కన్నడ దర్శకుడు టిఎస్ నాగాభరణ కుమారుడు పన్నాగభరణ ‘ఫ్రెంచ్ బిర్యానీ’ దర్శకుడు. ప్రముఖ బెంగళూరు స్టాండప్ కమెడియన్లు డానిష్ సేట్, సాల్ యూసుఫ్ లు టైటిల్ పాత్రలు. టిక్ టాక్ స్టార్ దిశా మదన్ హీరోయిన్. రొటీన్ టెంప్లెట్ కథనే నేపథ్య ప్రాధాన్యంతో సరికొత్త స్టయిలిష్ కామిక్ థ్రిల్లర్ గా ఎలా మార్చారో చూద్దాం...

కథ
     బెంగళూరులో సి - కంపెనీ ముసలి డాన్ ఛార్లెస్ అలియాస్ పౌడర్ ఛార్లెస్ (మైకేల్ మధు) కొడుక్కి ఓ మాట చెప్పి చచ్చిపోతాడు. సైమన్ అనేవాడు వచ్చి సులేమాన్ కి సరుకు అందిస్తాడని. కొత్త డాన్ గా బాధ్యతలు తీసుకున్న కొడుకు మసల్ మణి (మహంతేష్) కన్ఫ్యూజ్ అయిపోతాడు. సైమన్ అనే వాడు వచ్చి సులేమాన్ కి సరుకు అందిస్తాడా, లేక సులేమాన్ అనేవాడు వచ్చి సైమన్ కి సరుకు అందిస్తాడా తికమక పడి  డ్రైవర్ సులేమాన్ ని ఏర్ పోర్టుకి పంపిస్తాడు. అక్కడ సైమన్ ని సామాన్ గా పలుకుతూ ఫ్లయిట్ దిగిన వాళ్ళని అడుక్కుంటూ వుంటాడు సులేమాన్. చివరికి ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఫ్రెంచి సైమన్ (సాల్ యూసుఫ్) ని చూసి ఇతనే అనుకుని క్యాబ్ ఎక్కించుకుని తీసికెళ్ళి పోతాడు. 

         దారిలో ఒక సంఘటన జరిగి అస్ఘర్ అలీ (డానిష్ సేట్) ఆటో ఎక్కేస్తాడు సైమన్. ఆటో యాక్సిడెంట్ అవుతుంది. బ్యాగు దొంగ కొట్టేస్తాడు. సెల్ ఫోన్ ఆవు మింగేస్తుంది. మెడికల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళలేక, హోటల్ కీ వెళ్ళలేక, ఫ్రెంచి ఎంబసీ వాళ్ళూ రానియ్యక, రోడ్డున పడితే, సరుకుతో వున్న బ్యాగు కోసం మసల్ మణి గ్యాంగ్ ఒక వైపు, ఇన్స్ పెక్టర్ మహదేవ్ (రంగాయణ రఘు) ఇంకోవైపు వెంటాడుతూంటే, దేశం కాని దేశంలో కంగారెత్తి  పోతాడు సైమన్. నానా పాట్లు పడి అతణ్ణి కాపాడుతున్న అస్ఘర్ కి ఇంటి దగ్గర సమస్యలుంటాయి. ఇక వీళ్ళిద్దరి సమస్యలు ఎలా తీరాయన్నది మిగతా కథ. 

నటనలు – సాంకేతికాలు
    కర్ణాటక మాజీ మంత్రి అజీజ్ సేట్ మనవడు డానిష్ సేట్ తో బాటు, సాల్ యూసుఫ్ బెంగుళూరు స్టాండప్ కమెడియన్లుగా కలిసి వెండి తెర మీద కన్పించడం అభిమానులకి పండగే అయింది. ఈ కామిక్ థ్రిల్లర్ ని తమ తమ పర్ఫెక్ట్ కామిక్ సెన్స్ తో నిలబెట్టారు. వెకిలి కామెడీ బారిన పడకుండా ఈ స్టయిలిష్ మల్టీ కల్చరల్, కాస్మోపాలిటన్ కామెడీని కాపాడారు. కాకపోతే ఆటో డ్రైవర్ గా సేట్ పలికే ఉర్దూ డైలాగులు అనేక చోట్ల బూతులు దొర్లుతాయి. ఫ్రెంచి దేశస్థుడుగా యూసుఫ్ కామెడీ పాత్ర కాకపోయినా అతడి కష్టాలు కామెడీగా వుంటాయి. ఇద్దరూ కలిసి ఈ బెంగళూరు కామెడీకి ఒక స్టార్ ఎట్రాక్షన్ ని  తీసుకొచ్చారు. 

        ఆటో డ్రైవర్ అస్ఘర్ చెల్లెలు రహీలా గా సుధా శ్రీనివాస మూర్తి నటించింది. ఈమెకిది తొలి అవకాశం. ఈమె భర్త పురుషోత్తంగా నాగభూషణ నటించాడు. ఇతడి ‘పంపులో నీళ్ళు లేక’ పిల్లలు పుట్టక పోతే భార్యకే విడాకులిస్తానని గొడవ పెట్టుకునే పాత్ర. ‘పంపులో నీళ్ళు లేకపోయినా’ ఆడవాళ్ళకి పిల్లలు పుట్టాలంటాడు. పిల్లల్ని పుట్టిస్తున్న వాళ్ళని చూస్తే అసూయ. పిల్లల్ని పుట్టిస్తున్న వాళ్ళని దేశం నుంచి వెళ్ళ గొట్టాలంటాడు. ఇదంతా సబ్ ప్లాట్ కథ
, పాత్ర.  

      ఇంకో ప్రముఖ పాత్ర మసల్ మణి తమిళ డాన్ పాత్ర. ఈ పాత్రలో మహంతేష్ కామిక్ విలనీతో  బాగా ఎంటర్ టైన్ చేస్తాడు. తను కొలంబియా డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్ లా ఫీలై పోతూంటాడు. పాబ్లో లాగానే పోలీస్ ఫైరింగ్ లో చస్తాడు. ఇలా అని బ్రేకింగ్ న్యూస్ ఇస్తాడు ఇన్స్ పెక్టర్ మహదేవ్. నిజానికి గ్యాంగ్ వార్ లో చచ్చిపోతే తను చంపినట్టు న్యూస్ ఇచ్చుకుంటాడు. ఇన్స్ పెక్టర్ మహదేవ్ గా రంగాయణ రఘు ది హిలేరియస్ నటన. తను బ్లాక్స్ ని పట్టుకుని ఎడాపెడా కొడతానన్నప్పుడు, సైమన్ పాత్రలో సాల్ యూసుఫ్, నువ్వు రేసిస్ట్ కామెంట్స్ చేస్తున్నావంటాడు. దీంతో రేసిస్టు అంటే రేసింగ్ అనుకుని, తను ఎన్నెన్ని రేసులు గెలిచాడో చెప్పుకుపోతూ ఫూలిష్ సీను క్రియేట్ చేస్తాడు రంగాయణ.  

        టీవీ రిపోర్టర్ మాలినిగా దిశా మదన్ నాల్గయిదు సీన్లలో కన్పించే హీరోయిన్. చివర్లో ఆటోడ్రైవర్ అస్ఘర్ తో లవ్ ఓకే అయిపోయే ఫక్తు పాత ఫార్ములా పాత్ర. టిక్ టాక్ స్టార్ గా పాపులర్ అయిన తను సినిమా హీరోయిన్ గా కొనసాగే మెటీరియల్ అంతా వుంది. 

        సాంకేతిక విలువలు బావున్నాయి. కెమెరా వర్క్, కలర్స్, లైటింగ్ లతో కూడిన విజువల్స్, బెంగళూరు లొకేషన్స్, ట్రెండీ కాస్ట్యూమ్స్, యాక్షన్, ఛేజ్ సీన్లు పకడ్బందీగా వున్నాయి. వాసుకీ వైభవ్ సంగీతం గత ‘లా’ లోలాగా కాకుండా మాంచి పెప్ తో వుంది. ‘అతిధి దేవోభవ’ ర్యాప్ సాంగ్, దాని చిత్రీకరణ హైలైట్. 

కథాకథనాలు
      పాత రొటీన్ టెంప్లెట్ కథే. ఒకరనుకుని ఇంకొకర్ని టార్గెట్ చేసే మిస్టేకెన్ ఐడెంటిటీ బాపతు కథ. ఒక బ్యాగు కోసం కొన్ని గ్రూపులు ప్రయత్నించే అరిగి పోయిన కథ. ఈ కథకి స్క్రీన్ ప్లే లేదు. అంటే హీరో పాత్ర అస్ఘర్ అనుకుంటే అతడికి గోల్ లేదు, కథ అతడి మీద వుండదు, అతను ముగించడు. క్లయిమాక్స్ లో అతను వుండడు. మరి కథ ఎవరి మీద వుంటుందంటే, ఎవరి మీదా వుండదు. అందరూ తోచిన విధంగా కథ నడుపుతూంటారు. కనుక హీరోలేని అర్ధంపర్ధం లేని క్లయిమాక్స్ తయారయ్యింది. ఫన్నీ క్యారక్టర్స్ తో ఫన్నీ సీన్స్ నడపడమే దర్శకుడు కథ అనుకున్న కథ. 

        దీన్ని బెంగళూరు బ్యాక్ డ్రాప్ లో నడపడమే, అదీ బెంగళూరు జనజీవితాన్ని రియలిస్టిక్ గా భాగం చేయడమే, ఈ మైండ్ లెస్ మూవీ వీక్షణాసక్తి పెరిగేలా చేసింది. వివిధ పాత్రలు నగరంలోంచి వూడి పడ్డట్టు వుంటాయి. అవి వాటి వాటి భాష, యాస మాట్లాడే స్తాయి. ఆటో డ్రైవర్ ‘హీరో’ చాలా వరకూ కన్నడ యాసలో ఉర్దూయే మాట్లాడతాడు. అతడింట్లో సీన్లు ఉర్దూలోనే వుంటాయి. ఫ్రెంచి సైమన్ బ్రోకెన్ ఇంగ్లీషులో, ఫ్రెంచిలో మాట్లాడతాడు. యంగ్ డాన్ కన్నడింగ్లీషు మాట్లాడతాడు. కన్నడ మాట్లాడే పాత్రలు కన్నడ మాట్లాడతాయి. ఇలా కన్నడ, ఉర్దూ, ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలతో బెంగళూరు భిన్న సంస్కృతుల కాస్మోపాలిటన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. భాషలు ప్రేక్షకు లెవరికో అర్ధం కావేమో ననే సంశయాలు పెట్టుకోలేదు. ఫ్రీ స్టయిల్ రైటింగ్, మేకింగ్ చేశారు. కాలం లో ఎక్కడో ఇరుక్కున్న సినిమా సంకెళ్ళని తెంచి పారేశారు. ఇప్పుడు కావాల్సిన న్యూ ఏజ్ సినిమాగా ఎస్టాబ్లిష్ చేశారు. 

        భిన్న సంస్కృతుల్ని ప్రదర్శించే ‘అతిధి దేవోభవ’ ర్యాప్ సాంగ్ తో బెంగళూరు నగర జీవితమంతా నగరవాసులు ఐడెంటిఫై చేసుకునేలా కళ్ళ ముందుంచారు. దృశ్యపరమైన అసభ్యత లేకపోయినా, డైలాగుల్లో ధారాళంగా బూతులు ప్రవహిస్తాయి. ఒక పాటే fuck-ruddin అనే పల్లవితో వుంది. ఇక సెల్ ఫోన్ మింగేసిన ఆవుతో గోమాత సీను, ఆవు కడుపులోంచి సెల్ ఫోన్ తీస్తానని ఎదురుగా మటన్ షాపు వాడు ఆఫరివ్వడం, చచ్చిన ముసలి డాన్ శవయాత్రలో శవాన్ని మోటార్ సైకిల్ ఎక్కించి తిప్పడం, ఆ పాడె మోస్తున్న అస్ఘర్ పాడె వదిలేస్తే మోటార్ సైకిల్ సహా శవం కింద పడడం... జనాభా సమస్యపై జోకులు, రేసిస్టు కామెంట్లతో కామెడీ... ఇలా చుట్టూ వున్న ప్రపంచంలో ఏం జరుగుతోందో వాటినీ వాడేశారు.

        రచన, దర్శకత్వం అన్నవి కొత్త పుంతలు తొక్కాయి. ఈ రెండూ కాలాన్ని దాటి వుండక పోతే ఈ పాత రొటీన్ కామిక్  థ్రిల్లర్ వృధా అయ్యేది.  

-సికిందర్


27, జులై 2020, సోమవారం

961 : రివ్యూ!



దర్శకత్వం: ముఖేష్ ఛబ్రా
తారాగణం: సుశాంత్ సింగ్ రాజ్పుత్, సంజనా సంఘీ, సాహిల్ వేద, శాశ్వతా ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ తదితరులు

రచన: శశాంక్ ఖైతాన్, సుప్రోతిం సేన్ గుప్తా
సంగీతం: ఏఆర్ రెహ్మాన్, ఛాయాగ్రహణం: సత్యజిత్ పాండే
బ్యానర్: ఫాక్స్ స్టార్ స్టూడియోస్
విడుదల: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

***
       
త్మహత్య చేసుకుని సంచలనం సృష్టించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి విడుదల ‘దిల్ బేచారా’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సందడి చేస్తోంది. ఇది కూడా అతడి మరణాన్ని చూపించేదే. అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదలై వుంటే దాని ప్రభావంతో మనసు మార్చుకుని ఇవ్వాళ అందరి మధ్య సజీవంగా వుండే వాడేమో. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కొత్త దర్శకుడు ‘మీటూ’ వివాదంలో ఇరుక్కోవడంతో నిర్మాణం ఆలస్యమై అనుకున్న నవంబర్ 2019 కల్లా విడుదల కాకపోవడం ఒక బ్యాడ్ లక్. 

       
అంతరిక్షం సుశాంత్ అభిమాన సబ్జెక్టు. నలభై లక్షలు పెట్టి కొన్న టెలిస్కోప్ తో నక్షత్ర లోకాలని వీక్షిస్తూ వుండేవాడు. 2016 లో ఆత్మ హత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ వేముల కూడా అంతరిక్ష అభిమానియే. ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ లాగా సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు రాయాలనుకున్నట్టు సూసైడ్ నోట్ లో రాసుకున్నాడు. నక్షత్ర లోకాలకి పయనించాలని వుందని కూడా రాసుకున్నాడు. సుశాంత్ నీ, రోహిత్ నీ నక్షత్ర లోకాలే సూదంటు రాయిలా ఆకర్షించి తీసికెళ్ళి పోయాయేమో. ఇక ‘దిల్ బేచారా’ కి ఆధారమైన పాపులర్ నవల పేరులో కూడా ‘స్టార్స్’ వుండడం (‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’) ఇంకో ఐరనీ.

        ‘దిల్ బేచారా’ లో అంతరిక్షం గురించిన ప్రస్తావన కూడా వుంది. ఆత్మహత్యకి వ్యతిరేకంగా సంభాషణ కూడా వుంది. మరణాన్ని అదుపు చేసే మంత్రం కూడా వుంది. అతడికి సరదాగా సిగరెట్ నోట్లో పెట్టుకునే అలవాటు వుంటుంది. దాన్ని ముట్టించి స్మోక్ చెయ్యడు. సిగరెట్ అంటే క్యాన్సర్. క్యాన్సర్ అంటే మరణం. ‘మారణాయుధాన్ని మన పెదాల మధ్య వుంచుకున్నా, మనల్ని చంపే శక్తిని మాత్రం దానికివ్వకూడదు’ అంటాడు. ‘జననం ఎప్పుడు, మరణం ఎప్పుడు మనం నిర్ణయించలేం, ఎలా జీవించాలో నిర్ణయించుకో గలం’, ‘మరణించాక దాంతో బాటే జీవించాలన్న ఆశ కూడా చచ్చిపోతుంది’, ‘పాట పూర్తిగా ఎందుకు లేదు? ఎందుకంటే జీవితమే పూర్తిగా వుండదు కాబట్టి’, ‘కాలుతున్న సిగరెట్ లో చంపే శక్తి వుంటుంది, దాన్నుంచి నేనా శక్తిని లాక్కున్నా’, ‘నా అంతిమ సంస్కారాల్లో నేనూ పాల్గొనాలనుకుంటున్నా’, ‘నేను గొప్ప గొప్ప కలలు గంటాను, వాటిని తీర్చుకోవాలన్న కోరిక మాత్రం కలగదు’, ‘స్ట్రాంగ్ గా వుండాలని నేననుకోవడంలేదు, నార్మల్ గా వుండాలనుకుంటున్నా’, ‘సూసైడ్ ఇల్లీగల్, కనుక బతకాలి తప్పదు’... ఇలా జీవితం గురించి ఇన్ని సత్యాలు తెలుసుకున్న సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. 

సగం పాడిన పాట
     జీవన్మరణాలు, సంఘర్షణ, అస్తిత్వ సంక్షోభం వంటి అంశాలని తాకుతుంది ‘దిల్ బేచారా’. ప్రాణాంతక వ్యాధితో యువజంట, వాళ్ళ యంగ్ రోమాన్స్, ఎడబాటు ఈ కథ. జంషెడ్ పూర్ నేపధ్యంలో వుంటుంది. అక్కడ కిజీ బసు (సంజనా సంఘీ) థైరాయిడ్ క్యాన్సర్ బాధితురాలు. భుజాన ఆక్సిజన్ సిలండర్ తో వుంటుంది. తల్లిదండ్రులు (శాశ్వతా ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ) అండగా వుంటారు. మరణం కోసం ఎదురు చూస్తూ గడపడం తప్ప రోజంతా చేసే పనుండదు. అయితే బాధని మరిపించుకోవడానికి ఎక్కువ బయట తిరుగుతూ వుంటుంది. ఒక సింగర్ ని అభిమానిస్తూ వుంటుంది. అతను పాడిన పాట సగమే వుండడం ఆమెకి సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూంటుంది. ఆ పాట అతను పూర్తిగా ఎందుకు పాడలేదు? ఆపేసిన దగ్గర్నుంచి పాట ఎలా వుంటుంది? అతనేమయ్యాడు? ఇవి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ వుంటుంది. 

        ఊళ్లోనే ఒక షార్ట్ మూవీస్ మేకర్, ఇమ్మాన్యుయేల్ రాజ్ కుమార్ జూనియర్ అలియాస్ మానీ (సుశాంత్) వుంటాడు. ఇతను రజనీకాంత్ అభిమాని. రజనీకాంత్ ని అనుకరిస్తూ షార్ట్ మూవీ తీస్తూంటాడు. ఇంకో క్యాన్సర్ బాదితుడైన మిత్రుడు జేపీ (సాహిల్ వేద్) సహకరిస్తూ వుంటాడు. ఒక రోజు కిజీని చూసి ప్రేమలో పడిపోతాడు మానీ. వెంటపడుతున్న అతణ్ణి కిజీ వారిస్తూంటుంది. కానీ క్రమంగా తనూ ప్రేమలో పడిపోతుంది. అతను బోన్ క్యాన్సర్ బాధితుడు. 

        ఇద్దరూ పరస్పరం అర్ధం జేసుకుని ప్రేమని కొనసాగిస్తూంటారు. ఆమె తల్లిదండ్రుల ఆమోదం కూడా పొందుతారు. ఆమె అసంపూర్ణంగా వున్న పాట గురించే కాదు, ఆ సింగర్ ని కూడా కలుసుకోవా లనుకుంటోందని కూడా తెలుసుకుని, ఆమె కోరిక తీర్చడానికి పూనుకుంటాడు మానీ. ఆ సింగర్ అభిమన్యు వీర్ (సైఫలీ ఖాన్). అతను పారిస్ లో వున్నట్టు తెలుస్తుంది. అతడ్ని కలుసుకోవడానికి పారిస్ చేరుకుంటారు కిజీ, ఆమె తల్లి, మానీ. 

        అక్కడేం జరిగింది? ఆ తర్వాత ఇద్దరి ప్రేమా ఏమైంది? ఇద్దరి వ్యాధులు ఏమయ్యాయి? మరణాన్ని ఆహ్వానించారా? అతను షార్ట్ మూవీ పూర్తి చేయగలిగాడా? ఆమెకి పాట పూర్తిగా తెలిసిందా? ఆ పాటని ఎవరు పూర్తి చేశారు?...ఇదీ మిగతా కథ. 

ఎలా వుంది కథ
     ముందుగా చెప్పుకున్నట్టు ఇది బెస్ట్ సెల్లర్ ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ నవలాధారం. ఇదే టైటిల్ తో హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. హాలీవుడ్ సినిమా పూర్తిగా నవలని అనుసరించి వుంది. ‘దిల్ బేచారా’ లో మార్పులు చేశారు. ముఖ్యంగా హీరోయిన్ గోల్ విషయంలో చేసిన మార్పు కనెక్ట్ కాలేదు. ఆమె సగం పాట గురించి సింగర్ ని కలుసుకోవాలన్న గోల్ తో వుంటుంది. ఇదేమీ ఆమె జీవితంలాంటి పాట కాదు కనెక్ట్ కావడానికి. నవల్లో కథ ప్రకారం అందులోని హీరోయిన్ ఒక నవల చదువుతుంది. అది తన లాంటి క్యాన్సర్ తో వున్న హీరోయిన్ కథే. ఆ నవల చివరి వాక్యాలు సగమే వుండి ముగింపు తెలియదు. దీంతో ముగింపు తెలుసుకోవడానికి అజ్ఞాతంలో వున్న రచయిత అన్వేషణలో వుంటుంది. ఇలా మరణం ముంగిట వున్న హీరోయిన్ జీవితానికి కనెక్ట్ అయ్యే పాయింటుగా ఇది వుంటుంది.


        ‘దిల్ బేచారా’ డైలాగులు కాన్సెప్టుకి తగ్గట్టుగా బాగానే వున్నాయి. కానీ కథా కథనాలు కాన్సెప్ట్ కి తగ్గ ఫీల్ ని కల్గించవు. ఫీల్ కల్గించేది చనిపోయిన వ్యక్తిగా సుశాంతే గానీ పాత్ర  కాదు. పాత్ర కంటే, సూసైడ్ చేసుకున్న సుశాంతే కన్పిస్తూంటే, బోలెడు సానుభూతీ కన్నీళ్ళతో ప్రతిస్పందించి సినిమా బావుందంటున్నారు ప్రేక్షకులు. సుశాంత్ కి వీడ్కోలు చెబుతున్న సినిమాగా ఇంతకంటే కథని విశ్లేషించడం భావ్యం కాదు. 

ఇద్దరూ ఇద్దరే
    నటుడుగా ఇంత టాలెంట్ వున్న సుశాంత్, జీవించడంలో ఆ టాలెంట్ చూపక పోవడం అతి పెద్ద విషాదం. టాలెంట్ ని ఓడించగల శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదని తెలుసుకోలేక పోయాడు. స్మైల్ అతడి చిరకాల ఎస్సెట్. ఆ స్మైల్ కే సీన్లు షైన్ అవుతాయి. డైలాగ్ డెలివరీ అసామాన్యం. మరణాన్ని తేలికగా తీసుకునే పాత్రగా కొన్ని ఫన్నీ సీన్స్ క్రియేట్ చేశాడు. సైలెంట్ హ్యూమర్ ఇంకో ప్లస్. ఇన్ని పాజిటివ్స్ వున్న తను నెగెటివ్ నిర్ణయం తీసుకోవడమే పాజిటీవిటీకి గొడ్డలి పెట్టు. అతడి నిష్క్రమణ పాజిటీవిటీకే పెద్ద లోటు. 

        హీరోయిన్ సంజనా క్యాన్సర్ పాత్రకి సరీగ్గా సూటయ్యింది. ఆధునిక క్యాన్సర్ పాత్ర. కొద్ది కొద్ది మాటలు, వడివడి నడక, గెటప్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ సైకలాజికల్ గా అలౌకిక భావతరంగాల్ని తట్టిలేపుతాయి. బెస్ట్ నటి. సాంకేతికాలు థీమ్ ని ప్రదర్శిస్తాయి. కొన్ని చోట్ల వెలసిన జీవితాల్లాగే వెలసిన రంగులుంటాయి. తొమ్మిది వుండీ లేనట్టుండే పాటలతో రెహ్మాన్ సంగీతం ఒక స్మూత్ ట్రావెల్. 

        క్యాస్టింగ్ డైరెక్టర్ నుంచి సినిమా దర్శకుడుగా మారిన ముఖేష్ ఛబ్రా హాలీవుడ్ ఒరిజినల్ జానర్ ని కూడా మార్చి తీశాడు. నవల గానీ, హాలీవుడ్ సినిమా గానీ కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ కి చెందినవి. పదహారేళ్ళ హీరోయిన్, పదిహేడేళ్ళ హీరో ఇద్దరి క్యాన్సర్ కథ. వినూత్నంగా ఇంత లేత టీనేజీ హీరోహీరోయిన్ పాత్రలతో క్యాన్సర్ కథ కాబట్టే మార్కెట్ యాస్పెక్ట్ తో నవల, సినిమా అంత పాపులర్ అయ్యాయి.

సికిందర్







!

25, జులై 2020, శనివారం

960 : రివ్యూ!



దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
సంగీతం : డీఎస్ఆర్, ఛాయాగ్రహణం: జోషి
బ్యానర్: ఆర్జీవీ
వరల్డ్ థియేటర్
విడుదల: జులై 25, 2020

***
        వివాదాలతో, దాడులతో, ట్రైలర్ లీకులతో హైప్ సృష్టించిన ఆర్జీవీ ‘పవర్ స్టార్’ శనివారం ఆర్జీవీ వరల్డ్ థియేటర్ సైట్ లో విడుదలయ్యింది. టికెట్టు ధర 150 రూపాయలు. నిడివి 37 నిమిషాలు. నటీనటులు కొందరు నిజ వ్యక్తుల్ని పోలిన నటులు. వాళ్ళ పేర్లు స్పెల్లింగులు మార్చారు. టైటిల్ పాత్ర పవన్ కళ్యాణ్ ప్రవన్ కళ్యాణ్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ పోలికలతో వున్న ఇతను పవన్ బాడీ లాంగ్వేజీని బాగానే అనుకరించాడు. ఇతను తప్ప ఈ వెబ్ మూవీలో ఆసక్తి కల్గించేదేమీ లేదు. 

       చెప్పుకోవడానికి ఇది పేరడీ కాదు, డాక్యూడ్రామా కాదు, అసలు సినిమా కూడా కాదు. ఓ ఆరేడు ఒకదాని కొకటి సంబంధం లేని సీన్లు జోడించి ముగించారు. ఈ ఒక్కో సీన్లో ఒకొక్క ప్రవన్ కళ్యాణ్ సన్నిహితుడు వచ్చి ఓదార్చి వెళ్ళడం వుంటుంది. ఓదార్చి తిట్లు తిని వెళ్ళడం కూడా వుంటుంది. 

        ప్రవన్ కళ్యాణ్ ఎన్నికలు ఓడిపోయిన రాత్రి మొదలవుతుంది ఈ వెబ్ మూవీ. ప్రవన్ కళ్యాణ్ మన సేన పార్టీ ఒకటే స్థానం గెలుస్తుంది. తను పోటీ చేసిన రెండు స్థానాలూ ఓడిపోతాడు. ఈ పరాభవంతో వున్న అతడి దగ్గరికి పెద్దన్న మెగాస్టార్ వచ్చి మందలిస్తాడు. డైరెక్టర్ త్రివిక్రమ్ వచ్చి సంజాయిషీ ఇచ్చుకుంటాడు. నిర్మాత బండ్ల గణేష్ వచ్చి కొత్త సినిమా ఆఫర్ ఇస్తాడు. జర్నలిస్టు కత్తి మహేష్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాడు. రష్యన్ భార్య వస్తుంది. చివరికి చిన్నన్న నాగబాబు పోన్లో పలకరిస్తాడు. చివరి సీను మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో వుంటుంది. ఆఖరికి ఆర్జీవి వచ్చి హితోపదేశం చేయడం వుంటుంది.

        ప్రవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత అమాయకుడో, అతడి చుట్టూ చేరి కొందరు ఎలా దెబ్బతీశారో అన్నదే చెప్పాలనుకున్నాడు ఆర్జీవి. ఇంతకి మించి పవన్ ని అవమానించడం ఎక్కడా చేయలేదు. సానుభూతి చూపించడం మాత్రమే చేశాడు. ఈ సానుభూతికి పరాకాష్ట చివర్లో ఆర్జీవి హితబోధ.

        ‘గడ్డి తింటావా’ అన్న పాటలో వున్న సెటైర్ మిగతా మూవీలో లేదు. డైలాగుల్లో పంచ్ తప్ప సెటైర్ లేదు. కెమెరాతో గిమ్మిక్కులు చేయకుండా స్టడీ షాట్లు తీశారు. ఒక ఫాం హౌస్ లో వారం రోజుల్లో షూటింగ్ ముగించారు. అతి లో బడ్జెట్ లో తీసిన ఈ వెబ్ మూవీ క్వాలిటీ గురించి చెప్పుకోవాల్సింది లేదు. విషయం గురించి అసలే లేదు. ప్రవన్ కళ్యాణ్ మీద సానుభూతి ఏమో గానీ, వర్మ మీద జాలిపడేలా వుంది. 

-సికిందర్

21, జులై 2020, మంగళవారం

959 : రివ్యూ



రచన, దర్శకత్వం : అన్వితా దత్తా
తారాగణం: తృప్తీ దిమ్రీ, అవినాష్ తివారీ, పావలీ దామ్, రాహుల్ బోస్, పరమబ్రత ఛటర్జీ
సంగీతం: అమిత్ త్రివేదీ, ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ దివాన్
బ్యానర్: క్లీన్ స్లేట్ ఫిలిమ్స్
నిర్మాతలు: అనూష్కా శర్మ, కర్ణేష్ శర్మ
విడుదల: నెట్ ఫ్లిక్స్


      ‘ఎన్ హెచ్ -10’, ‘పరీ’ వంటి సినిమాలు, ‘పాతాళ్ లోక్’ వంటి వెబ్ సిరీస్ నిర్మించిన బాలీవుడ్ స్టార్ అనూష్కా శర్మ, తాజాగా ‘బుల్బుల్’ అనే సూపర్ నేచురల్ హార్రర్ తో ఓటీటీ ప్రవేశం చేసింది. నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. రచయిత్రి అన్వితా దత్ దర్శకురాలిగా పరిచయమైంది. 19 వ శతాబ్దపు నేపథ్యంతో ‘డ్రాక్యులా’ ని తలపించే ఫీల్ తో, సంజయ్ లీలా భన్సాలీ లాంటి దృశ్య వైభవంతో, పిశాచ కథని కవితాత్మకంగా తెరకెక్కించింది. ‘పోస్టర్ బాయ్స్’, ‘లైలా మజ్నూ’ అనే రెండు సినిమాల హీరోయిన్ తృప్తీ ధిమ్రీ టైటిల్ పాత్ర నటించింది. రాహుల్ బోస్ ద్విపాత్రాభినయం చేశాడు. అమిత్ త్రివేదీ సంగీతం చేశాడు. ఇలా ఓ జమీందారీ కుటుంబంలో అంతఃపురపు కుట్రల్ని వెల్లడించే ఈ కథేమిటో ఒకసారి చూద్దాం... 

కథ
     1880 లో బెంగాల్లో ఐదేళ్ళ బుల్బుల్  కి పెళ్ళవుతుంది. తన తోటి బాలుడు సత్యతో పెళ్లి చేస్తున్నారని అనుకుంటే, సత్య అన్న ఇంద్రనీల్ (రాహుల్ బోస్) తో పెళ్లయి పోతుంది. ఐదేళ్ళ బుల్బుల్ ని పెళ్ళిచేసుకున్న పెద్ద జమీందారు ఠాకూర్ ఇంద్రనీల్ కి తనలాగే వున్న కవల సోదరుడు మహేంద్ర (రాహుల్ బోస్) వుంటాడు. ఇతడికి మతిస్థిమితం వుండదు. ఇంకో ఏడేళ్ళ తమ్ముడు, బుల్బుల్ తో కలిసి ఆడుకున్న సత్య వుంటాడు. ఇరవై ఏళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు లండన్లో చదువు పూర్తి చేసుకున్న సత్య (అవినాష్ తివారీ) తిరిగొస్తాడు. వచ్చేసరికి చాలా మార్పులు జరిగివుంటాయి. పెద్దన్న ఇంద్రనీల్ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు, చిన్నన్న చనిపోయాడు. చిన్న వదిన బినోదిని (పావలీ దామ్) వితంతువుగా శిరోముండనం చేయించుకుని తెల్ల చీరలో వుంది. పెద్దన్న భార్య బుల్బుల్ (తృప్తీ ధిమ్రీ) దొరసానిలా జమీందారీ బాధ్యతలు చేపట్టింది.  

        బుల్బుల్ కి చిన్నప్పుడు సత్యతో పెళ్లి కాలేదన్న బాధ వుంటుంది. సత్య ఆమెని వదినలాగే చూస్తూంటాడు. అయితే చుట్టు పక్కల ఒక పిశాచి సంచరిస్తోందనీ, అది మనుషుల్ని చంపేస్తోందనీ అందరూ అంటూంటే వింటాడు. చిన్నన్న మహేంద్రని కూడా పిశాచి చంపేసిందని అంటారు. ఇలా వుండగా ఇప్పుడు అడవిలో వేట కెళ్తే తన కళ్ళ ముందే పోలీసు కొత్వాల్ శవవుతాడు. దీంతో ఈ చావుల రహస్యం తెలుసుకోవాలని నిశ్చయించుకుంటాడు సత్య.

        ఈ చావులు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగా పిశాచి చంపుతోందా? ఎందుకు చంపుతోంది? చిన్నన్నని పిశాచియే చంపిందా? పెద్దన్న ఎక్కడికెళ్ళి పోయాడు? ఈ మొత్తం పరిణామాల్లో డాక్టర్ సుదీప్ (పరమబ్రత ఛటర్జీ) పాత్రేమిటి? ఇదీ మిగతా కథ.

నటనలు- సాంకేతికాలు
     నటిగా తృప్తీ ధిమ్రీ హైలైట్ అయిన సినిమా ఇది. తియ్యగా నవ్వుతూ, ఇంకా తియ్య తియ్యగా మాట్లాడుతూ, స్నేహభావంతో మెలగుతూ, హవేలీ బాధ్యతలు చూసుకునే యువ జమీందారిణీగా ఒక చెరగని ముద్ర వేస్తుంది. అంతఃపుర రహస్యాలుంటాయి. అవి బాధైనా, మరోటైనా భరించే జమీందారిణీ హూందాతనంతో వుండే పాత్రగా అర్ధంజేసుకుని ఒదిగిపోయింది. చిన్న వయసులో (26 ఏళ్ళు), రెండు సినిమాల అనుభవంతో, ఈ బరువైన క్లిష్ట పాత్ర పోషించే అవకాశం రావడం ఆమెకి గొప్ప.  

        రాహుల్ బోస్ అన్నదమ్ముల ద్విపాత్రాభినయం చేశాడు. గృహ హింస వెలగబెట్టే మగ రాయుళ్ళ పాత్రలు. ఒకటి మతి చెడిన తమ్ముడి పాత్ర. చాలా శాంతంగా, తక్కువ  మాట్లాడే పాత్రలు. చేపట్టేవి క్రూరమైన చర్యలు. అనుభవించేది దారుణమైన శిక్షలు. ఈ డార్క్ షేడ్ పాత్రల్లో రాహుల్ బోస్ ఒకలాటి మత్తైన వాతావరాణాన్ని క్రియేట్ చేస్తాడు నటనతో.  

        వితంతువు బినోదినిగా పావలీ దామ్, ఆ నాటి వితంతువుల జీవితాలకి అద్దం పడుతుంది. డాక్టర్ సుదీప్ గా పరమబ్రత ఛటర్జీ ఇంకో ఫర్వాలేదనిపించే నటన. ఇక హీరోగా అవినాష్ త్రివేదీ లోకల్ షెర్లాక్ హోమ్స్ గా ఆసక్తి కల్గిస్తాడు. ఇంగ్లీషు ప్రభావంతో అతడి లుక్స్, మాటలు ప్రత్యేకంగా వుంటాయి. 

        నటీనటులందరూ 1880 -1900 నాటి మనుషుల పోకడలతో, ముఖ్యంగా నాటి బెంగాలీ నేటివిటీతో, భాషతో, దృశ్యపరమైన సౌందర్యాన్నిపరిపుష్టం చేశారు. హవేలీ వైభవం, వర్ణ చిత్రాలు, పట్టు పరదాలు, వస్త్రా లంకరణ, వస్తు సామగ్రి, గుడ్డి నూనె దీపాల నుంచీ కాలక్రమంలో విద్యుత్ దీపాల కాంతులూ, గుర్రబ్బగ్గీలూ, ఇవన్నీ క్లాసిక్ వాతావరణాన్ని సృష్టిస్తూ ఆ కాలం లోకి లాక్కెళతాయి. 

        రిచ్ కలర్స్, లైటింగ్ స్కీమ్, పిశాచి దాడి చేసేప్పుడు దృశ్యాలకి వాడిన కాషాయ కలర్స్ హార్రర్ ని కూడా ఒక దృశ్య కావ్యంలా మారుస్తాయి. కాషాయం ఎందుకంటే పిశాచి కాళికా దేవీ అని నమ్ముతారు అక్కడి ప్రజలు. పిశాచి వయొలెంట్ జస్టిస్ కి పాల్పడుతోంది. మేల్ వయొలెన్స్ కి వయొలెంట్ జస్టిస్సే సమాధానం అన్నట్టు వుంటుంది. 

        లైటింగ్ ఎఫెక్ట్స్ గురించి కూడా చెప్పుకోవాలి. సత్యజిత్ రే తీసిన ‘దేవి’ పోస్టర్ కి ప్రభావితుడై ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ సృష్టించానన్నాడు కెమెరా మాన్ సిద్ధార్థ్ దివాన్. అమిత్ త్రివేదీ సంగీతం స్వరాలు సుతిమెత్తగా పలుకుతాయి. ఎడిటింగ్ కొంతవరకు కథకి ఉత్తేజం తీసుకొచ్చేలా వుంది. ఎడిటింగ్ కి కథ తోడ్పడకపోతే ఎడిటింగ్ కూడా బోరే కొడుతుంది. కొన్ని చోట్ల ఎడిటర్ రామేశ్వర్ భగత్, ఏ షాట్ ముందు వేసి ఏ షాట్ వెనుక వేస్తే కిక్ వుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. 

        దర్శకురాలిగా తొలి ప్రయత్నంతో ఇంత విజువల్ అద్భుతాన్ని సృష్టించింది అన్వితా దత్తా. ఇంత దర్శకత్వం ఏ దర్శకులూ చేయరు బహుశా. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలకి బీభత్స సూపర్ నేచురల్ వెర్షన్ ని సృష్టించి పెట్టినట్టుంది తను. 

కథాకథనాలు
    19 వ శతాబ్దం, ఇంకా ఆ పూర్వపు కాలాల హార్రర్ కథల్ని గోథిక్ హార్రర్ జానర్ అంటారు. ‘ఫ్రాంకెస్టీన్’, ‘డ్రాక్యులా’ వంటి ప్రసిద్ధ నవలలు వచ్చాయి. ఇవొక ఫాంటసికల్ వాతవరణ నేపథ్యంతో వుంటాయి. ‘బుల్బుల్’ కథ ఈ కోవకే చెందింది. ఈ కథ రబీంద్ర నాథ్ టాగూర్ నవలిక ప్రభావంతో రాశానంది దర్శకురాలు. 1901 లో టాగూర్ రాసిన ‘నష్టనిర్’ (చెదిరిన గూడు) నవలిక లోని పాత్రల్ని హార్రర్ లోకి మార్చి తీశానంది. గృహ హింస ఆనాడు ఎంతుందో ఈనాడూ అంతే వుందంది. నవలికలో వున్న పాత్రలు టాగూర్ నిజ జీవితంలో అన్న దమ్ముల పాత్రలే. బినోదిని పేరుతో పాత్రకూడా నవలికలో వుంది. ఈ నవలిక ఆధారంగా సత్యజిత్ రే ‘చారులత’ తీశారు. 


        దర్శకురాలు అన్విత గీత రచయిత్రిగా బాలీవుడ్ పాటలు రాసింది. మాటల రచయిత్రిగా దోస్తానా, కంబఖ్త్ ఇష్క్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, క్వీన్ వంటి 27 సినిమాలకి రాసింది. ఈ రెండు వృత్తులూ ఓకే. కథా రచయిత్రిగా వచ్చేసరికి విఫలమైంది. దర్శకురాలిగా ఎంతో అద్భుతం చేసింది. లేని కథని అద్భుతంగా తీసినంత మాత్రాన ఫలితాలు అద్భుతంగా వుండవు. అద్భుతమైన పాత్రల్ని తీర్చిదిద్దింది. వాటికి కథే లేదు. ఐతే తనేం కథ చేస్తోందో అది మాత్రం తెలుసని చెప్పింది. రెగ్యులర్ గా తీసే ఎవరు చేశారు? -  అనే మర్డర్ ఇన్వెస్టిగేషన్ గాక, ఎలా చేశారు?- అన్న యాక్షన్ కే పరిమితం చేసినట్టు చెప్పింది. ఇదెంతో రిలీఫ్ నిచ్చే మాట. మర్డర్ ఇన్వెస్టిగేషన్, హంతకుణ్ణి పట్టుకోవడాలు వగైరా ఇంకా ఎవరిక్కావాలి? హంతకుడు ఎలా హత్య చేశాడు, ఎందుకు చేశాడనే ఆసక్తి చుట్టూ కథ వుంటే చాలు. పట్టుకుంటే ఎంత, పట్టుకోకపోతే ఎంత - నేటి శిక్షలు పడే ప్రహసనాలూ కాలయాపనలూ చూస్తున్నాక.

        అయితే తను తెలుసుకోని దేమిటంటే, సినిమాని అడ్డంగా కుప్ప కూల్చే ఎండ్ సస్పెన్స్ అనే మాయదారి జాతికి చెందిన కథ ఇదని. దీంతో ఈ గంటన్నర సినిమా కూడా వృధా అయిపోయింది. గంటన్నరలో గంటా 10 నిమిషాల వరకూ కథ అంతుబట్టక, అసలు కథే అర్ధం గాక, పట్టపగలు కూడా నిద్ర ముంచుకొచ్చే పరిస్థితి. ఆ తర్వాతి ఇరవై నిమిషాల్లోనే ఫ్లాష్ బ్యాకుల వల్ల కథ తెలిసి ముగింపు కొస్తుంది. బుల్బుల్ కి అసలేం జరిగిందో ఈ ఇరవై నిమిషాల్లోనే తెలిసి -తెలిశాక ఇంకేం జరుగుతుందో తెలిసిపోయి- చప్పగా ముగుస్తుంది. 

        మరి ఫస్టాఫ్ అంతా ఏముంది? బుల్బుల్ చిన్నతనంలో పెళ్లి, తర్వాత ఇరవై ఏళ్ళు టైం లాప్స్ తో సత్య ఇంటికి రావడం, అన్నలేమయ్యారో ఆ ఫ్లాష్ బ్యాకులు అసంపూర్ణంగా తెలుసుకోవడం, చావుల దర్యాప్తు చేయడం, ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రధాన పాత్ర బుల్బుల్ జమీందారిణీగా ఏమీ చెయ్యకుండా నవ్వులు చిందిస్తూ వుండడం, ఎంతకీ కథనం ముందుకు కదలక పోవడం, విషయం తెలియక పోవడం, ఇంతే. మూసి పెట్టిన విషయం తో ఎండ్ సస్పెన్స్ పెట్టే సహన పరీక్ష ఇలా వుంటుందని ఈ సినిమాతో వెయ్యో సారి రుజువైంది. 

        అనుమానిత పాత్ర లేకపోవడం ఈ ఎండ్ సస్పెన్స్ లో కూడా ఒక లోపం. బుల్బుల్ ని అనుమానిత పాత్రగా ఎస్టాబ్లిష్ చేసివుంటే కథలో చాలా సమస్యలు తీరేవి. మాటలు కవితాత్మకంగా రాసినట్టు, కథకూడా కవిత రాసినట్టు రాయడం వల్ల వచ్చిన సమస్య ఇది. గృహ హింస తాలూకు రెండు దృశ్యాలు వయొలెంట్ గా వుంటే సరిపోలేదు. ఆ గాభరా, సస్పెన్స్ మిగతా కథలో కూడా వుండాలి. కథేమిటో ఓపెనై పాత్ర సమస్యేమిటో తెలియాలి. సమస్యేమిటంటే- అటు బుల్బుల్, ఇటు సత్య ఏదీ ప్రధాన పాత్ర కాకుండా పోయాయి. టాగూర్ నవలిక, దాంతో సత్యజిత్ సినిమా సామాజికాలు కాబట్టి సరిపోయాయి. వాటిని హార్రర్ గా మార్చాలంటే అసలు  స్క్రీన్ ప్లే అనేది స్ట్రక్చర్ లో వుండడం అవసరం.  

        ఈ కథలో మోస్ట్ టెర్రిఫిక్ డైలాగు, బుల్బుల్ తో బినోదిని ‘చుప్ రహెనా’ (సైలెంట్ గా  వుండిపో) అనడం. అలాగని కథ కూడా సైలెంట్ గా వుండిపోతే ఎలా?  

సికిందర్


17, జులై 2020, శుక్రవారం

958 : రివ్యూ



‘లా’ (కన్నడ)
రచన, దర్శకత్వం: రఘు సమర్థ్
తారాగణం: రాగిణీ ప్రజ్వల్, హేబ్బాలే కృష్ణ, రాజేష్ నటరంగ, అచ్యుత్ కుమార్, ముఖ్యమంత్రి చంద్రు, లిఖిత్ కుర్బా, ఇమ్రాన్ పాషా, మధు హెగ్డే తదితరులు
సంగీతం: వైభవ్ వాసుకి, ఛాయాగ్రహణం: సుగ్నన
నిర్మాతలు: అశ్వనీ పునీత్, రాజ్ కుమార్
విడుదల: అమెజాన్


        తొలి కన్నడ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ‘లా’ ఈ రోజు అమెజాన్ లో విడుదలయ్యింది. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ బ్యానర్ రూపొందించడంతో దీనికి మంచి హైప్ వచ్చింది. దర్శకుడు రఘు సమర్థ్ కి రెండో సినిమా. హీరోయిన్ రాగిణీ ప్రజ్వల్ కి తొలి సినిమా. తొలి సినిమా రెగ్యులర్ ప్రేమ సినిమాగా వుండకూడదని టాలెంట్ ని పరీక్షించే ఈ పాత్ర  ఒప్పుకున్నట్టు చెప్పుకుంది. ఈ సినిమా రెగ్యులర్ లీగల్ డ్రామాగా తీయలేదని దర్శకుడు కూడా చెప్పుకున్నాడు. అయితే ఇటీవల తమిళంలో ఓటీటీలో విడుదలైన జ్యోతిక నటించిన ‘పొన్మంగళ్ వందాళ్’ కూడా ఇలాటి లీగల్  డ్రామానే. ఇలాటి హీరోయిన్ పాత్రే. రేప్ బాధితురాలు తన కేసుని తను వాదించుకునే లాయర్ పాత్ర. ఈ కన్నడ క్రియేటివిటీ ఫ్లాపయిన జ్యోతిక క్రియేటివికి ఎంత భిన్నంగా వుంది? ఇది క్రియేటివిటీయేనా, లేక క్రిమి కీటకమా ఓసారి చూద్దాం...

కథ
    నందిని (రాగిణీ ప్రజ్వల్) లా గ్రాడ్యుయేట్. ఓ రాత్రి గ్యాంగ్ రేప్ కి గురవుతుంది. పోలీస్ స్టేషన్ కెళ్తే హేళన చేస్తారు. మూడు నెలలు గడిచిపోతాయి. ఆమె తనకి జరిగింది సోషల్ మీడియలో వైరల్ చేసేసరికి ఆందోళనలు చెలరేగుతాయి. దీంతో పోలీస్ కమీషనర్ కేసుని సీఐడీ ఇన్స్ పెక్టర్ పార్థ సారథి బ్రహ్మ (హేబ్బాలే కృష్ణ) కి అప్పగిస్తాడు. పార్థ సారథి బ్రహ్మ ఇన్వెస్టిగేట్ చేసి ముగ్గుర్ని (లిఖిత్ కుర్బా, ఇమ్రాన్ పాషా, మధు హెగ్డే) అరెస్ట్ చేసి కేసు పెడతాడు. నందిని ఈ కేసుని తను వాదిస్తానంటుంది. నిందితుల డిఫెన్స్ న్యాయవాదిగా శ్యాం ప్రసాద్ (రాజేష్ నటరంగ) వస్తాడు. న్యాయం కోసం అతడితో తలపడుతుంది నందిని. ఇందులో విజయం సాధించిందా? ఆమె విజయాన్ని ఇన్స్ పెక్టర్ బ్రహ్మ ఎందుకు అడ్డుకోబోయాడు? ఆమె దాచిన అసలు నిజం ఏమిటి? ఈ నిజం బయట పడితే ఏం చేసింది? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి. 

నటనలు-సాంకేతికాలు
    కొత్త హీరోయిన్ రాగిణీ ప్రజ్వల్ తొలి సినిమాకి ఎంపిక చేసుకున్న పాత్ర మంచిదే. కానీ తనకి నటించడం రాక, దర్శకుడికి సినిమా తీయడం రాక చేసిన ప్రయత్నం విఫలమైంది. ప్రారంభం నుంచీ ఎక్కడా రేప్ బాధితురాలిగా కన్పించదు. పోగొట్టుకుంది పర్సు అయినట్టు, పోతే పోయిందన్నట్టు మేకప్ చెదరకుండా తిరుగుతూంటుంది. బీఆర్ చోప్రా తీసిన ‘ఇన్సాఫ్ కా తరాజూ’ (1980) లో జీనత్ అమన్ ని చూస్తే రేప్ బాధితురాలంటే ఏమిటో తెలిసేది రాగిణికి. ఇక లాయర్ గా కూడా నవ్వొచ్చే విధంగా వుంది. చివర్లో అసలు నిజంతో క్లయిమాక్స్ లో నటన జలపాతం దగ్గర అరణ్య రోదనగానే మిగిలింది. ఎంత అరిచి ఏడుద్దామన్నా ఎమోషనే రావడం లేదు. ఎందుకైనా మంచిదని దర్శకుడు లాంగ్ షాట్ వేశాడు. సంగీత దర్శకుడు పీలగా విన్పించిన సంగీతం నుంచి మాత్రం మనకి రక్షణ లేదు. హీరోయిన్ని ఆచి తూచి ఎంపిక చేసుకున్నానని దర్శకుడనడమంటే ఇదేనేమో. ఇందులో ఏం ఆచి వుందో, ఏం తూచి వుందో అర్ధంగాదు. 


        హీరోయిన్ తండ్రి పాత్రలో అవినాష్, ఇన్స్ పెక్టర్ పాత్రలో హేబ్బాలే కృష్ణ, డిఫెన్స్ లాయర్ పాత్రలో రాజేష్ నటరంగ సమర్ధులైన సీనియర్ నటులు. కానీ కథ, సన్నివేశాలు తోడ్పడలేదు. అవినాష్ పోలీస్ స్టేషన్ లో రేప్ బాధితురాలైన కూతురి దగ్గరి కొచ్చి, ‘చట్టం తో ఏమీ తేలదమ్మా, జరిగింది మర్చి పో’ అనేసి లైట్ తీసుకుని కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయే పాత్ర. ఎక్కడా అతను జరిగిందానికి ఏ మాత్రం ఫీలవడు ఎవర్ గ్రీన్ గ్లామర్ గర్ల్ కూతురిలాగే. వీళ్ళని చూస్తే రేప్ మీదే మనకి జాలి పుడుతుంది. 

        ఇక జడ్జి సిద్ధ లింగయ్య పాత్ర వున్నాడు ముఖ్యమంత్రి చంద్రు అనే నటుడు. ఇతను కామెడీ జడ్జి. దర్శకుడికి కథలో ఎంటర్ టైన్మెంట్ తగ్గిందన్న బాధతో సీరియస్ కేసు వాదనల్లో జడ్జి కామెడీలు చూపించాడు. జడ్జికి తోడు బంట్రోతు. మధ్యలో జడ్జి గయ్యాళి పెళ్ళాం నుంచి ఫోను రావడం. బెంబేలెత్తి పోయి జడ్జి హనుమాన్ చాలీసా వేసుకోవడం. ఏం సినిమా తీసి అమెజాన్ కిచ్చాడో దర్శకుడికే తెలియాలి. 

         ‘పొన్మంగళ్ వందాళ్’ లో గోవింద్ వసంత అనే సంగీత దర్శకుడి లాగే ఇక్కడ కూడా వైభవ్ వాసుకి అనే సంగీత దర్శకుడు, పరికరాలే లేనట్టు వీలయినంత పేలవంగా సంగీత సృష్టి గావించాడు. కెమెరా మాన్ సుగ్నన అనే ఒకతను మాత్రమే అప్పగించిన బాధ్యతకి కాస్త న్యాయం చేసినట్టు కనబడతాడు. సినిమా నిడివి రెండు గంటలే అయినా రెండు యుగాల్లా వుంటుంది. 

కథా కథనాలు
    కథకి అయిడియా మంచిదే. ఆచరణలో చెదిరి పోయింది. ముగింపులో హీరోయిన్ మోటివేషన్ కి ఇచ్చిన కారణంతో దీన్నొక బలమైన ఎమోషనల్ లీగల్ యాక్షన్ డ్రామా చేయొచ్చు. తన అయిడియాలో వున్న బలం, లోతు పాతులు తనకే తెలియక పోతే ఎలా? ఈ అయిడియాలో హీరోయిన్ తన శీలంతో తనే ప్రయోగం చేయడమనే రాడికల్ తెగింపు వుంది. ఈ పాయింటుని  హైలైట్ చేసి మార్కెట్ యాస్పెక్ట్ ని పట్టుకోవాలనుకోలేదు దర్శకుడు. మొద్దుబారి
పోయిన వ్యవస్థని లేపడానికి శీలాలతో ఇలాటి ప్రయోగాలు  తప్పవా అన్న సామాజిక ప్రశ్న ఈ కథలో వుంటే, ఏవో కామెడీలు చేస్తూ వుండిపోయాడు దర్శకుడు. చట్టంతో మగాడు ఈజీగా ఆడుకోగలడు. ఆడది ఆడుకోవాలంటే ఇక శీలాల్ని పణంగా పెట్టాలేమో. 

        ఇలాటి కథలో కూడా దర్శకుడికి ఎంటర్ టైన్మెంట్ తగ్గుతోందన్న వర్రీ తీవ్రంగా వున్నట్టుంది. రేప్ బాధితురాలైన హీరోయిన్ కి కామెడీ ఫ్లాష్ బ్యాకులు. అల్లరి చేష్టలు. కథలో జరిగిన విషయానికీ ఈ ఫ్లాష్ బ్యాకులకీ సంబంధమేమిటో, వీటినెలా ఎంజాయ్ చేయాలో అర్ధంగాదు. ఫస్టాఫ్ లో నాల్గు సార్లు ఈ కామెడీ ఫ్లాష్ బ్యాకులేస్తాడు. ప్రతీ రాత్రీ తనకి జరిగిందే గుర్తుకొస్తూ నిద్రపట్టడం లేదని హీరోయిన్ డైలాగు. ఎప్పుడు గుర్తొచ్చింది, ఎప్పుడు నిద్ర పట్టలేదు సీన్లే చూపించలేదు. పోయింది పర్సే కదా అన్నట్టు జాలీగా తిరుగుతూంటే. 

        ‘పొన్మంగళ్ వందాళ్’, ‘లా’ రెండూ దాదాపు కథ లొకటే. తీసి ఫ్లాప్ చేసుకున్న విధం ఒకటే. క్రియేటివిటీకి రెండు తరాలు వెనకున్నాయీ సినిమాలు. కథ పక్కనబెట్టి, కనీసం ఇప్పుడు సినిమా ఇలా తీయరన్న ఆలోచన కూడా లేకపోతే ఎలా?

సికిందర్  


15, జులై 2020, బుధవారం

957 : రివ్యూ



‘కాక్ టైల్’ (తమిళం)
రచన, దర్శకత్వం: ఆర్ ఏ విజయ మురుగన్
తారాగణం: యోగిబాబు, రేష్మీ గోపీనాథ్, మిథున్ మహేశ్వరన్, బాలా, కవిన్, సాయాజీ షిండే తదితరులు
సంగీతం: సాయి భాస్కర్, ఛాయాగ్రహణం: ఆర్ జే రవీన్
నిర్మాత: పిజి ముత్తయ్య, ఎం. దీపా
విడుదల: జీ5

***
        మిళంలో పొన్మంగళ్ వందాళ్, పెంగ్విన్ అనే రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ డైరెక్ట్ ఓటీటీ విడుదలల తర్వాత, కమెడియన్ యోగిబాబుతో  ‘కాక్ టైల్’ విడుదలైంది. ఇది కూడా మొదటి రెండిటిలాగే కొత్త దర్శకుల సినిమాల జాబితాలో ఓటీటీ కొచ్చి ఔటై పోయింది. కొత్త దర్శకుడు విజయ మురుగన్ అట్టర్ ఫ్లాప్ చేయడంలో కొత్త పుంతలు తొక్కాడు. కొత్త దర్శకుడికి ఇంత పాత కాలపు చీకేసిన సినిమా తీయాలన్న బ్రహ్మాండమైన అయిడియా ఎలా వచ్చిందో తెలీదు. కమెడియన్ గా తమిళంలో ఇప్పుడు డిమాండ్ లో వున్న యోగిబాబుని బలవంతంగా వాడుకుని, బలవంతంగా నవ్వించాలని విశ్వప్రయత్నం చేశాడు. యోగిబాబు షూటింగులో డైలాగులు చెప్పలేదనీ, డబ్బింగులోనే చెప్పాడనీ తెర వెనుక సంగతులు. ఇందుకేనేమో ఫేసు ఒకలాగా, డైలాగులు ఇంకోలాగా పలికాయి. మనవి ఫూల్స్ అయిన ఫేసులయ్యాయి. ఈ ఫూలిష్ కథేమిటో చూద్దాం...
కథ
      450 ఏళ్ల చోళుల కాలం నాటి పురాతన మురుగన్ దైవ విగ్రహం మ్యూజియం నుంచి చోరీ అవుతుంది. ఇన్స్ పెక్టర్ రాజమాణిక్యం (సాయాజీ షిండే) కేసు టేకప్ చేస్తాడు. అలాటి నకిలీ విగ్రహం మీడియాకి చూపించి, విగ్రహాన్నిసాధించామని మీడియాకి చెప్తాడు. దీని వల్ల అసలు విగ్రహాన్ని చోరీ చేసిన దొంగలు తమ దగ్గరున్నది నకిలీ విగ్రహమనుకుని అమ్మేయడానికి ప్రయత్నిస్తారనీ, అప్పుడు పట్టుకోవచ్చనీ ప్లాను. 

     యోగిబాబు జంతువుల సెలూన్ నడుపుతూంటాడు. అతడికి మిథున్ మహేశ్వరన్, బాలా, కవిన్ ఫ్రెండ్స్ గా వుంటారు. మిథున్ మహేశ్వరన్ ఇన్స్ పెక్టర్ రాజమాణిక్యం కూతురు రేష్మీ గోపీనాథ్ ని ప్రేమిస్తూంటాడు. ఒక రోజు నల్గురూ తాగి పార్టీ చేసుకుని పడుకుంటే తెల్లారి అమ్మాయి శవం వుంటుంది. ఈ శవం ఎలా వచ్చిందో, ఈ అమ్మాయి ఎవరో తెలీక భయపడతారు.

        ఒకవైపు విగ్రహాన్ని అమ్మేద్దామని ప్రయత్నిస్తూ దొంగలు, ఇంకోవైపు శవాన్ని వదిలించు కోవాలని ఈ నల్గురూ. ఈ రెండు గ్రూపులు ఎక్కడ ఎదురెదురయ్యాయి? ఎదురైతే ఏం జరిగింది? ఇన్స్ పెక్టర్ రాజమాణిక్యం ప్లాను పారిందా? విగ్రహం దొరికిందా? శవం కేసులోంచి నల్గురూ ఎలా బయట పడ్డారు? ఇదీ మిగతా కథ. 

నటనలు - సాంకేతికాలు
      ముందుగానే చెప్పుకున్నట్టు యోగిబాబు ఫేసొకటి డైలాగొకటిగా నటించిన ఫూలిష్ పాత్ర. కలవని ఫేసూ డైలాగులతో బ్యాడ్ కాక్ టైల్. రజనీకాంత్ ‘దర్బార్’ లో తను చాలా నయం. ఇప్పుడు ఈ సినిమాతో హీరోగా శ్రద్ధగానీ ఆసక్తిగానీ లేనట్టు  నటించాడు మాస్ కూడా చూడలేని నటన. ఒక్క డైలాగూ నవ్వు పుట్టించదు. పైగా అర్ధం పర్ధం లేని మైండ్ లెస్ కామెడీ సీన్లు కావడంతో అట్టర్ ఫ్లాపయ్యాడు. 

     బక్కగా వుండే టీవీ కమెడియన్ బాలాది భరించలేని చీప్ కామెడీ. ఓవరాక్షన్ కూడా. మిథున్ మహేశ్వరన్ కి కామెడీ రాదు, సాయాజీ షిండేకి ఈ సినిమా ఎలా పోయినా పట్టింపు లేదు. హీరోయిన్ రేష్మీ గోపీనాథ్ ఎప్పుడు కనిపిస్తుందో తెలీదు. కన్పించినప్పుడు ఎందుకీ రోమాంటిక్ సీన్లు అన్నట్టు ఆమెకే చీదర. పోతే ఇంకో స్టార్ కూడా వుంది. టైటిల్ కోసం పట్టుకొచ్చిన పక్షి. కాక్ టైల్ అనే ఆస్ట్రేలియా పక్షి. ఇది పైన కూర్చుని యోగిబాబుని చూస్తూ వుంటుంది తప్ప వీళ్ళ సంగతేమిటో చూద్దామనుకోదు. కాక్ టైల్స్ చిలకల్లా మాట్లాడతాయి. అలా కూడా మాట్లాడించాలనుకోడు దర్శకుడు. ఈ ఆస్ట్రేలియన్ పక్షిని cockatiel అంటారు.  

        వీలయినంత పాత కాలపు దర్శకత్వం చేశాడు కొత్త దర్శకుడు. సాంకేతిక  విలువలకి విలువలేదు. రైటింగ్ లో గానీ, టేకింగ్ లో గానీ కొత్తదనం లేదు. ఉన్న రెండు పాటలు నీరసం. 

కథా కథనాలు
      పాత కాలపు అరిగిపోయిన కామెడీ కథ. విగ్రహం దొంగలు -శవంతో ఫ్రెండ్స్  అన్న డై నమిక్స్ వున్న కథని అర్ధంపర్ధం లేని కామెడీలతో చుట్టేశాడు. విగ్రహం కథ మళ్ళీ క్లయిమాక్స్ లో తప్ప గుర్తుకు రాదు. శవంతో కథతో సస్పెన్స్, థ్రిల్స్ వుండవు. గతంలో మైండ్ లెస్ కామెడీలు చాలా వచ్చాయి. రోహిత్ శెట్టి తీసిన ‘గోల్ మాల్’ సిరీస్ సహా. అవి లాజిక్ ని వదిలేసి నవ్వించడంలో సక్సెస్ అయ్యాయి. ‘కాక్ టైల్’ లో లాజిక్ లేదు, నవ్వులేదు.

-సికిందర్ 
Rv at telugurajyam.com