రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, మే 2024, శుక్రవారం

1428 : రివ్యూ

రచన-దర్శకత్వం: హరి
తారాగణం : విశాల్, ప్రియా భవానీ శంకర్, తులసి, సముద్రకని, మురళీ శర్మ, యోగి బాబు, విజయ్ కుమార్, జయప్రకాష్ తదితరులు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : సుకుమారన్
నిర్మాత : కార్తికేయన్ సంతానం, అలంకార్ పాండియన్  
విడుదల :ఏప్రిల్ 26, 2024
***
        పురచ్చి దళపతి (విప్లవ దళపతి) విశాల్ 2017 లో ‘తుప్పరివాలన్’ (తెలుగులో ‘డిటెక్టివ్’) 
హిట్టయిన తర్వాతవరుసగా 9 ఫ్లాపులిచ్చి, చిట్టచివరికి 2023 లో మార్క్ ఆంథోనీ తో ఏకంగా రూ. 100 కోట్ల బ్లాక్ బస్టర్ ఇచ్చేసి సర్ప్రైజ్ చేశాడు. ఈ మాస్ యాక్షన్ మూవీకి సైన్స్ ఫిక్షన్ జోడించి విప్లవాత్మకంగా ఒక కొత్త వెరైటీని సృష్టించాడు. ఇకపైన విశాల్ ఇలాగే అప్డేట్ అవుతూ బ్లాక్ బస్టర్స్ ఇస్తాడనుకునేలా నమ్మకం కల్గించాడు. తమిళంలో సూర్యతో సింగం సిరీస్ పోలీస్ సినిమాలతో రికార్డులు బ్రేక్ చేసిన దర్శకుడు హరి కూడా తన ఒకే రకమైన పాత మూస మాస్ సినిమాలనుంచి అప్డేట్ అయినట్టూ కనిపించాడు.  కానీ మళ్ళీ అదే పాత మూస బాట పట్టి మరో మూడు అట్టర్ ఫ్లాపులిచ్చాడు. ఇలా  అప్డేట్ అయిన విశాల్, అప్డేట్ అయీ పాత వాసనలు వెదజల్లడానికే సిద్ధపడిన హరి తో చేతులు కలిపితే ఏం జరిగింది? చేతులు కాలాయా, కరతాళ ధ్వనులు అందుకున్నాయా? ఏం జరిగిందో తెలుసుకుందాం...

కథ
చిత్తూరులో పళని స్వామి (సముద్రకని) అనే ఎమ్మెల్యేకి రత్నం (విశాల్) నమ్మిన బంటుగా వుంటూ పనులు చక్కబెడుతూంటాడు. పోలీసులు చేసే సగం పనులు తనే చేసి శాంతి భద్రతలకి గ్యారంటీగా వుంటాడు. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన బాధ వెంటాడుతూంటుంది. ఇలా వుండగా, ఓ రోజు మల్లిక (ప్రియా భవానీ శంకర్) నీట్ పరీక్ష రాయడానికి చిత్తూరు వస్తే ఆమెని చంపడానికి ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. రత్నం ఆ దాడిని తిప్పికొట్టి ఆమెని కాపాడతాడు. ఆమెని ప్రేమిస్తాడు. అయితే ఆమె తన తల్లి పోలికలతో వుండడంతో క్షోభ అనుభవిస్తాడు. ఆమెని చంపడానికి గ్యాంగ్ చేసే ప్రయత్నాలు ఆగవు.
       
మల్లిక కుటుంబానికి కొంత స్థలముంది. ఆ స్థలం తమిళనాడు నుంచి తిరుపతి విడిపోయినప్పుడు తమిళనాడులోకి వెళ్ళిపోయింది. ఆ స్థలంలో పూర్వీకుల సమాధులున్నాయి. సంవత్సరానికోసారి వెళ్ళి పూజలు చేసి వస్తూంటారు. ఈ సంవత్సరం వెళ్ళినప్పుడు చూస్తే
, ఆ స్థలంలో ఓ మెడికల్ కాలేజీ కట్టేస్తున్నారు. దీంతో మల్లిక తండ్రి (జయప్రకాష్)  ల్యాండ్ మాఫియా లింగం (మురళీ శర్మ) మీద పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాడు. పోలీసులు తండ్రి సంతకంతో వున్న అగ్రిమెంట్ చూపించి దబాయించారు.
       
దీనికి ముందు మల్లిక చదువుకోసం ఆమె తండ్రి వేరే చోట కొంత అప్పుతీసుకుని
, ఖాళీ కాగితం మీద సంతకం పెట్టి ఇచ్చాడు. ఆ కాగితాన్ని సొంతం చేసుకున్న లింగం, దాని మీద స్థలం అమ్మకం తాలూకు అగ్రిమెంట్  రాసుకుని వెళ్ళగొట్టాడు. అయితే అగ్రిమెంట్ మీద తన సంతకం చెల్లదని తండ్రి అసలు విషయం బైట పెట్టాడు. ఆ స్థలాన్ని ఆరవ తరానికి చెందిన మొదటి వారసులే అమ్మగలరనీ, ఆ ప్రకారం ఆరవ తరం మొదటి వారసురాలిగా తన కూతురు మల్లికకి మాత్రమే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టే అధికారముందనీ స్పష్టం చేసేశాడు.
       
దీంతో లింగం
, ఈ కూతురు మల్లికని గనుక లేపేస్తే అయిదవ తరం వారసుడు తండ్రి చేసిన సంతకంతో అగ్రిమెంట్ చెల్లుతుందని మల్లికని లేపేసే కార్యక్రమానికి తెర లేపాడు.
       
ఇప్పుడేం జరిగింది
? రత్నం మల్లికని కాపాడి స్థలం ఆమె కుటుంబానికి దక్కేలా లింగం అంతు చూశాడా? తల్లి పోలికలతో వున్న మల్లికని ప్రేమించలేని క్షోభ నుంచి ఎలా బయట
పడ్డాడు? తల్లి మరణంతో లింగం కున్న సంబంధం తెలుసుకుని ఏం చేశాడు? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ.

ఎలావుంది కథ 

హరి చేతిలో హరీమన్న పాత రొడ్డ కొట్టుడు కథ. హరితో చేతులు కలిపి విశాల్ తిరిగి 'మార్క్ ఆంథోనీ పూర్వపు ఫ్లాప్ మసాలా కాలాని కెళ్ళిపోయిన కథ. ప్రమాదంలో హీరోయిన్, ఆ హీరోయిన్ ని కాపాడే హీరోల సినిమాలు తెలుగులో, తమిళంలో వచ్చీ వచ్చీ చచ్చిపోయాయి. దీన్ని బతికించడానికి ఇప్పుడు నానా పాట్లు పడ్డారు. స్థూలంగా ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కథని సాగదీసి సాగదీసి, చెప్పడానికి కథ లేదన్నట్టు అడుగడుగునా ఫైట్లతో నింపేశారు.

తమిళనాడు నుంచి తిరుపతి విడిపోయినప్పుడు తమిళనాడులోకి స్థలం వెళ్ళిపోవడమనే అంశం, 2017 లో విద్యాబాలన్ నటించిన బేగం జాన్ ని గుర్తు చేస్తుంది. ఇందులో 1947 లో దేశ విభజనప్పుడు అటు బెంగాల్లో, ఇటు పంజాబ్ లో రెండు గీతలు గీసేసి దేశాన్ని విభజించేస్తాడు రాడ్ క్లిఫ్. అటు తూర్పు పాకిస్తాన్, ఇటు పశ్చిమ పాకిస్తాన్, మధ్యలో ఇండియా పొమ్మంటాడు. దీని ప్రకారం కంచె వేసుకుంటూ వస్తూంటే, సరీగ్గా రాడ్ క్లిఫ్ రేఖ మీద బేగం జాన్ వేశ్యా గృహం తగుల్తుంది. ఖాళీ చేయాల్సిందిగా ఆమెకి నోటీసులిస్తే చించి పారేస్తుంది- మీరు సాని కొంప అంటున్న ఈ ఇల్లు నా ఇల్లు, నా దేశం. మమ్మల్ని ఇక్కడ్నించి కదిలించాలని చూశారో, మీ కాళ్ళూ చేతులూ తీసేసి దేహ విభజనచేస్తాంఅని వార్నింగ్ ఇస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ ఎమోషనల్  స్టోరీ.

        
ఇదొకటైతే, రత్నం లో హీరో తల్లికి వేశ్యాగృహంలో మగ్గే కథ ఫ్లాష్ బ్యాకుగా వేశారు. ఇలా ప్రాంత విభజనతో స్థలం స్థానభ్రంశం చెందడం, వేశ్యాగృహమూ అనే ఈ రెండు అంశాలూ బేగం జాన్ నుంచి ఎత్తేస్తే వచ్చిన ఫలితమే, రత్నం అనే రొడ్డ కొట్టుడు అని అనుమానించాల్సిన పరిస్థితి.
       
ఫస్టాఫ్ న్యాయం పేరుతో హత్యలుచేసే హీరో
, ప్రమాదంలో హీరోయిన్, ఆమెతో ప్రేమ, తర్వాత ఆమె అసలు కథ అనే టెంప్లెట్ లో సాగినా, అగ్రిమెంట్ కాగితమనే వివాదం దగ్గర కొత్త మలుపు తీసుకున్నా, సెకండాఫ్ కొచ్చేసరికి గుంటూరు కారం లో తాత గారి అగ్రిమెంట్ పై మహెష్ బాబు సంతకం పెట్టాల్సిన తరహాలో అర్ధంపర్ధం లేని కథలా మారిపోయింది. పైగా ఈ కథ వదిలేసి హీరో తల్లి చావుకి కారకుడయ్యాడని అదే విలన్ మీద పగదీర్చుకునే హీరో రివెంజీ స్టోరీగా మారిపోయింది! అట్టర్ ఫ్లాపులతో అన్నేళ్ళ అనుభవంతో విశాల్ కథల్ని ఎలా జడ్జి చేస్తాడో అర్ధంగాని పదార్ధంగా మారిపోయింది...

నటనలు- సాంకేతికాలు
వీటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కళ తప్పిన మొహంతో హీరోయిన్, కండలు తిరిగిన శరీరంతో విశాల్, దట్టంగా పౌడరు పూసుకునే పిచ్చితో విలన్-అంతా ఆటవికంగా వుంటుంది. దర్శకుడు హరి రిటైర్ అవడానికిక పరాకాష్ట. అవసరం లేకపోయినా ఫైట్లు. అవీ సాగదీసిన ఫైట్లు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమైతే చెప్పక్కర్లేదు- శరీరం కుంచించుకుపోయే స్వరాలు. బ్యాక్ గ్రౌండ్ విషాద గీతం, దాని సాహిత్యం అద్భుతం. విశాల్ తెలుగు డబ్బింగ్ అయితే ఎవరో జూనియర్ ఆర్టిస్టుకి చెప్పినట్టుంది. డబ్బింగ్ ఆర్టిస్టు విశాల్ ని జ్యూనియర్ ఆర్టిస్టు అనుకున్నాడేమో తెలీదు.
       
ఇంకో ముఖ్య విషయమేమిటంటే-
బేగం జాన్ లో వేశ్యా గృహాన్ని తొలగింఛడానికి దాన్నే కేంద్రంగా జేసుకుని ఎన్నిసార్లు పోలీసు దాడులు జరుగుతాయో- అదే తరహాలో- సెకండాఫ్ లో హీరోయిన్ ని చంపడానికి హీరోయిన్ కుటుంబం వున్న ఇంటి మీదే విలన్ రకరకాలుగా దాడులు చేస్తూంటాడు. ఈ రకంగా రత్నం బేగం జాన్ విసిరేయగా దొరికిన కొన్ని కథా సౌందర్యపు రత్నాల్ని ఏరి తెచ్చుకుని, రత్న కిరీటం తయారు చేసుకుందన్న మాట!

—సికిందర్ 

8, మే 2024, బుధవారం

1427 : రివ్యూ!

దర్శకత్వం : డేవిడ్ అయర్       
తారాగణం : జేసన్ స్టాథమ్, ఎమ్మీ రావర్-లాంప్‌మాన్, ఫిలిసియా రషద్, జోష్ హచర్సన్, డేవిడ్ విట్స్, బాబీ నాడేరీ, జెరెమీ ఐరన్స్
సంగీతం : డేవిడ్ సర్డీ, ఛాయాగ్రహణం : గాబ్రియేల్ బెరిస్టైన్
బ్యానర్స్ : మెట్రో గోల్డ్విన్ మేయర్, మీరామాక్స్
నిర్మాతలు : బిల్ బ్లాక్, జేసన్ స్టాథమ్, డేవిడ్ అయర్, క్రిస్ లాంగ్, కర్ట్ విమ్మర్
విడుదల ; ఏప్రిల్ 26, 2024 ( లయన్స్ గేట్ ప్లే ఓటీటీ)
***
            హాలీవుడ్ యాక్షన్ సీనియర్ హీరో జేసన్ స్టాథమ్ గత సంవత్సరం నాలుగు సినిమాలు నటించి మరో యాక్షన్ తో వచ్చాడు. 1998 నుంచీ ఫ్యాన్స్ ని పోగొట్టుకోకుండా ట్రాన్స్ పోర్టర్’, మెకానిక్’, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మొదలైన 30కి పైగా హెవీ మాస్ యాక్షన్ సినిమాలతో కొనసాగుతున్న స్టాథమ్, వరుస యాక్షన్ సినిమాల దర్శకుడు డేవిడ్ అయర్ తో కలిసి ది బీకీపర్ అనే మరో భారీ యాక్షన్ కి తెరతీశాడు. జనవరిలో థియేట్రికల్ గా విడుదలై విజయం సాధించి గతవారం నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ  కథాకమామిషేమిటో చూద్దాం...

కథ
రిటైర్డ్ స్కూల్ టీచర్ ఎలోయిస్ పార్కర్ (ఫిలిసియా రషద్) ఒంటరిగా నివసిస్తూంటుంది. ఆమె ఎస్టేట్ లో ఆడమ్ క్లే (జెసన్ స్టాథమ్) తేనెటీగల పెంపకం దారుగా జీవిస్తూంటాడు. ఒక రోజు ఎలోయిస్ ఫిషింగ్ స్కామ్ లో ఇరుక్కుంటుంది. తను నిర్వహిస్తున్న బాలల ఛారిటీ ఫండ్ తాలూకు బ్యాంకు ఖాతా నుంచి 2 మిలియన్ డాలర్లని ఒక్క క్లిక్ తో పోగొట్టుకుంటుంది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె కుమార్తె ఎఫ్బీఐ అధికారిణి వెరోనా పార్కర్‌ (ఎమ్మీ రావర్-లాంప్‌మాన్) వెంటనే ఆడమ్ ని అరెస్టు చేస్తుంది. తర్వాత అనుమాన నివృత్తి చేసుకుని వదిలేస్తుంది. అయితే తన తల్లిని దోచుకున్న ఆన్ లైన్ స్కామ్ ముఠాని ట్రాక్ చేసి  పట్టుకోలేకపోతున్నామని, ఈ విషయంలో సాయం చేయమనీ ఆడమ్ ని కోరుతుంది.
        
ఆడమ్ ఒకప్పుడు బీకీపర్స్ అనే సీక్రేట్ గ్రూపులో పనిచేసిన వాడే. ఈ గ్రూపు ఆన్ లైన్ స్కామర్స్ ని పట్టుకునే గోల్ తో పనిచేస్తూంటుంది. ఆడమ్ ఈ గ్రూపుని సంప్రదించి మిక్కీ గార్నెట్ (డేవిడ్ విట్స్) అనే యువ టెక్కీ నడుపుతున్న ఒక కాల్ సెంటర్ అడ్రసు తెలుసుకుని, అక్కడికెళ్ళి అందర్నీ చిత్తుగా తన్ని, కాల్ సెంటర్ ని పేల్చేస్తాడు. దీన్ని మిక్కీ తన బాస్ డెరెక్ (జోష్ హచర్సన్) కి రిపోర్టు చేసి, ఆడమ్ బీకీపర్స్ మాజీ మెంబరని చెప్తాడు.
        
డెరెక్ మాజీ సీఐఏ డైరెక్టర్ వాలెస్ వెస్ట్ విల్డ్ (జెరెమీ ఐరన్స్) కి ఆడమ్ గురించి చెప్తాడు. డెరెక్ నడుపుతున్న గ్లోబల్ కాల్ సెంటర్స్ కి సెక్యూరిటీ చూస్తూంటాడు వాలెస్. ఇతను ప్రస్తుత సీఐఏ డైరెక్టర్ హార్వర్డ్ కి కాల్ చేసి ఆడమ్ ని ఆపాల్సిందిగా కోరతాడు. ఇంతలో ఆడమ్ బోస్టన్ లో డెరెక్ కి చెందిన కాల్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ ని పేల్చేయబోతున్నాడని వేరొనాకి సమాచారమందుతుంది.
       
ఆడమ్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శత్రువుల్ని నాశనం చేయాలని ప్ర్రయత్నిస్తూంటే
, వెరోనా చట్టప్రకారం సక్రమ మార్గంలో నేరస్థుల్ని పట్టుకోవాలని పరుగులు దీస్తూంటుంది. ఈ క్రమంలో ఈ స్కామ్ తో అమెరికా అధ్యక్షురాలు జెస్సికాకి సంబంధం వుందని తెలుసుకున్న ఆడమ్ ఆమెని చంపడానికి సాగిపోతాడు. ఇప్పుడేం జరిగింది? అధ్యక్ష్యురాలిని చంపకుండా వెరోనా ఆడమ్ ని ఆపగల్గిందా?
రిటైర్డ్ స్కూల్ టీచర్ ఎలోయిస్ మృతికి కారకులైన శత్రుశ్రేణిని చంపడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్న ఆడమ్,  ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ సమీపంలోకి చేరుకోగల్గిన క్షణాన ఏం జరిగింది? ఇదీ మిగతా కథ.

నాన్ స్టాప్ బాదుడు
సినిమా సాంతం ఎవర్నో ఒకర్ని బాదుతూనే వుంటాడు జేసన్ స్టాథమ్. వృద్ధుల నుంచి లాక్కోవడం పిల్లల నుంచి దొంగిలించినంత చెడ్డది. పోగొట్టుకుంది పిల్లవాడైతే వాడికి తల్లిదండ్రులు వుంటారు. వృద్ధులకి ఎవరుంటారు చెప్పుకోవడానికి? కొన్నిసార్లు ఒంటరిగా పోరాడతారు, కొన్నిసార్లు పోరాడలేరు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళే వుండరు అన్న డైలాగుతో ఈ కథకి ఎమోషనల్ గ్రిప్ ఇస్తాడు.
        
ఈ సెంటిమెంటల్ అప్రోజ్ తో ఒక్కొక్కడ్నీ బాదిన ప్రతీసారీ ప్రేక్షకుల కచ్చి తీరుతూంటుంది. ఈ డ్రమెటిక్ పాయింటు పట్టుకుని ఈ యాక్షన్ మూవీని బలంగా నడిపిస్తూంటాడు. ఒంటరిగా ఒంటిచేత్తో ఎలా అంత మందిని చంపుతాడు, ఎలా ఎప్పుడు పడితే అప్పుడు పేల్చేస్తాడూ అన్న లాజిక్ కి ఇక్కడ స్థానం లేదు. ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలికి న్యాయం చేస్తున్నాడా, మన కచ్చి తీరిందా అన్నదే ముఖ్యం. ఏయ్, నా మాటల్ని రిపీట్ చేయండి...మేము బలహీనుల నుంచి దొంగిలించే పని మళ్ళీ చెయ్యం అని చెప్పించుకుని మరీ చంపుతూంటాడు.
        
జీవితాంతం కష్టపడి పనిచేయడం తప్ప మరేమీ చేయని వ్యక్తుల నుంచి మీరు వందల మిలియన్లు దొంగిలించారు. ఆమె విద్యావేత్త. ఒక అమ్మ. తన జీవితమంతా ప్రజలకి  సహాయం చేయడానికి అంకితం చేసింది.  ఆమె నడుపుతున్న ఛారిటీ నుంచి  మీరు రెండు మిలియన్లు కాజేస్తే కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎప్పుడూ నన్ను జాగ్రత్తగా చూసుకున్న ఏకైక వ్యక్తి ఆమె అని జేసన్ స్టాథమ్ విసిరే డైలాగులకి జవాబులుండవు దుష్టుల దగ్గర.
       
అసలు స్కామ్ కూడా అంత ఈజీగా ఎలా జరుగుతుందని వివరించే జోలికి కూడా పోలేదు దర్శకుడు డేవిడ్ అయర్.
యువ టెక్కీల గ్రూపు ఒక భారీ హై-టెక్ సెంటర్ నడుపుతూ,  ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి  ప్రతి రోజూ మిలియన్ల డాలర్లని ఎలా తుడిచి పెట్టేస్తారు, అది ప్రభుత్వ దృష్టికి పోకుండా ఎలా వుంటుందీ అనే చిక్కుల్ని వివరించడానికి ఎలాటి ప్రయత్నం చేయలేదు.
        
ఆన్ లైన్లో దోపిడీ జరుగుతోందనేది ఆందోళనకర వాస్తవం. ఎలా జరుగుతోందనేది తెలిసిందే. కాబట్టి ఆ ప్రక్రియ జోలికి పోకుండా, ఒక వృద్ధురాలు భారీ మొత్తంలో పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంది, ఆమెకి న్యాయం జరగాలి- అని సూటిగా సగటు ప్రేక్షకుల స్థాయికి దించి చెబితే కమర్షియల్ గా హిట్టే. 40 కోట్ల డాలర్ల  బడ్జెట్ కి 152 కోట్ల డాలర్ల బాక్సాఫీసు వచ్చిందంటే కథతో ఈ ఫార్ములా కరెక్టే అనుకోవాలి.

కిక్‌లు- పంచ్‌లు- పేల్చివేతలు
మార్షల్ ఆర్టిస్టు జేసన్ స్టాథమ్ ఇచ్చే కిక్‌లు, పంచ్‌లు, ఢామ్మని చేసే బ్లాస్టింగులూ - ఆ యాక్షన్ కొరియోగ్రఫీ (గాబ్రియేల్ బెరిస్టైన్) ప్రారంభం నుంచీ ముగింపు దాకా అదరగొడతాయి. ఇతరుల కష్టార్జిత డబ్బు పట్ల ఏమాత్రం మానవత్వం చూపని వారిపై రివెంజ్ ఈ యాక్షన్ కి భావోద్వేగాల్ని సృష్టిస్తూ వుంటుంది. చాలా పాత్రలు మూస పాత్రలే. ప్రజల డబ్బు దోచుకుని సూపర్ రిచ్ గా మారిన ఘరానా వ్యక్తులు. వీళ్ళతో ఏళ్ళకి ఏళ్ళు పట్టే చట్టాలూ న్యాయప్రక్రియా వర్కౌట్ కావు. వ్యవస్థకి పై స్థాయిలో వ్యవహరించే ది బీకీపర్స్ చేసే తక్షణ న్యాయం జరగాలి. ఇది యూనివర్సల్ సమస్య. ఎవరో నైజీరియా విద్రోహక శక్తులకే పరిమితమై లేదిప్పుడు. ఎంత హైటెక్ గా ఈ ఫ్రాడ్స్ జరుగుతూంటే అంత నాటుగా శిక్షలు పడాల్సిందే. ఆ రుచే వేరు. ఈక్వలైజర్ సిరీస్ సినిమాలతో ఇలాటి నాటు శిక్షలే వేస్తాడు డెంజిల్ వాషింగ్టన్. ఇప్పుడు జేసన్ స్టాథమ్. అయితే ఇంగ్లీషులో తప్ప మరో భాషలో స్ట్రీమింగ్ అవట్లేదు ఈ మూవీ!

—సికిందర్ 

7, మే 2024, మంగళవారం

1426 : రివ్యూ

 

రచన -దర్శకత్వం : అర్జున్ వైకే
తారాగణం : సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్, నితిన్ ప్రసన్న, హర్ష వర్ధన్, వైవా హర్ష తదితరులు
సంగీతం : విజయ్ బుల్గానిన్, : ఛాయాగ్రహణం : ఎస్.చంద్రశేఖరన్
నిర్మాతలు : నిర్మాత: మణికంఠ, ప్రసాద రెడ్డి
విడుదల : మే 3, 2024
***
        టీవల అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ తర్వాత సుహాస్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ప్రసన్న వదనం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ప్రపంచ సినిమాల్లోనే అరుదైన కథా వస్తువుతో కొత్త దర్శకుడు అర్జున్ వైకే సుహాస్ ని ఒప్పించుకుని సినిమా తీసి ప్రేక్షకుల తీర్పు కోసం ముందుంచాడు. తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్ అంటేనే భయపడే రోజులు నడుస్తున్నాయి. వచ్చింది వచ్చినట్టు ఎటో వెళ్ళిపోతోంది. అయినా దీని క్రాఫ్ట్ ని నేర్చుకునే మాటే లేదు. ఒకొక్కరూ ఒక్కో హిచ్ కాక్ లా ఫీలై పోవడమే. హిచ్ కాకులు కాకుల్లా వచ్చి వాలుతోంటే ప్రేక్షకులు ఎడం చేత్తో దూరంగా తోలేస్తున్నారు. ఎన్నని తోలుతారు? ఇక కాకులు అగాల్సిన సమయం వచ్చిందేమో. ఈ పరిస్థితుల్లో  ప్రసన్న వదనం అలా ఆగాల్సిన సస్పెన్స్ థ్రిల్లరేనా కాదా తెలుసుకుందాం...

కథ
సూర్య ( సుహాస్ ) రేడియో జాకీ (ఆర్జే) గా పని చేస్తూంటాడు. గతంలో ఒక ప్రమాదంలో మనుషుల్ని గుర్తు పట్టే శక్తిని కోల్పోతాడు. అరుదైన ఫేస్ బ్లయిండ్ నెస్ అనే రుగ్మతకి లోనవుతాడు. మనుషుల ముఖాల్ని గుర్తు పట్టలేడు. గొంతులు కూడా గుర్తించ లేడు. అతడికో మిత్రుడు (వైవా హర్ష) వుంటాడు. అతడికి మాత్రమే ఈ విషయం చెప్తాడు. ఇలాటి ఇతడికి రెండు మూడు చోట్ల ఆద్య (పాయల్ రాధాకృష్ణ) తగిలి ఆమె మీద ప్రేమ పెంచుకుంటాడు. ఇలావుండగా, ఒకరోజు నడి రోడ్డు మీద యాక్సిడెంట్ ని చూస్తాడు. యాక్సిడెంట్ లా అన్పించే ఆ సంఘటనలో ఒకడు ఒకమ్మాయిని లారీ కింద తోసేయడాన్ని చూస్తాడు. దీన్ని పోలీసులకి చెప్తాడు.
       
ఎస్సై (నితిన్ ప్రసన్న)
, ఏసీపీ వైదేహీ (రాశీ సింగ్) ఫేస్ బ్లయిండ్ నెస్ తో వున్న సూర్య చెప్పే వివరాలతో అప్రమత్తమవుతారు. చనిపోయిన అమ్మాయి ఎవరు? ఆమెని ఎవరు, ఎందుకు చంపారు? పోను పోనూ ఈ కేసులో సూర్య ఎలా ఇరుక్కుని పోలీసుల నుంచి పారిపోవడం మొదలెట్టాడు? తన రుగ్మతతో హంతకుల్ని ఎలా పట్టుకోగల్గి నిర్దోషిగా బయటపడ్డాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
ప్రోసోప్రగ్నోషా (Prosopagnosia) లేదా ఫేస్ బ్లయిండ్ నెస్ అనేది మెదడు ప్రక్రియకి సంబంధించిన రుగ్మత. దీని వల్ల సొంత ముఖంతో బాటు ఇతరుల ముఖాలు కూడా గుర్తు పట్టలేరు. గొంతులు కూడా గుర్తించలేరు. ఏవైనా కారణాల వల్ల మెదడు దెబ్బతినడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడతాయి.  దీనికి చికిత్స లేదు. దీని మీద హాలీవుడ్ నుంచి ఫేసెస్ ఇన్ ది క్రౌడ్ (2011) అనే సస్పెన్స్ థ్రిల్లర్, ఇన్ వివిడ్ డిటైల్ (2007) అనే లవ్ స్టోరీ వచ్చాయి. ఈ రెండు సినిమాలూ ప్రస్తుత ప్రసన్నవదనం లో వున్న సస్పెన్స్ థ్రిల్లర్ కథని, ప్రేమ కథనీ ఎలా ఎంత చక్కగా, ఉత్కంఠ భరితంగా మల్చవచ్చో  తెలియ జేస్తాయి. కొత్త యువ  దర్శకుడు ఈ పరిశీలన లేకుండా పాత మూస విధానంలో సినిమా తీసేశాడు.
       
పేరుకే ఫేస్ బ్లయిండ్ నెస్ తో కథ. దీన్ని హీరో పాత్రకి ఆపాదించకుండా
, కథకీ ఆపాదించకుండా పైపైన నడిపేశాడు. ఒక కొత్త కాన్సెప్ట్ ని వృధా చేశాడు. ఈ కథలో వున్న అతిపెద్ద లోపమేమిటంటే, హత్య చేస్తూండగా చూసిన ఫేస్ బ్లయిండ్ నెస్ హీరోని హంతకుడు చంపాలని వెంటపడడం. సెకండాఫ్ పూర్తిగా ఇదే కథ. ఫేస్ బ్లయిండ్ నెస్ తో వున్న వ్యక్తి సాక్ష్యాన్ని ఏ కోర్టూ తీసుకోదు. అలాంటప్పుడు వాడ్ని చంపాలనుకోవడ మెందుకు? ఎంచక్కా వాడితోనే దోస్తీ చేస్తూ తిరగొచ్చు కదా?ఈ ప్రశ్న వేసుకుంటే సెకండాఫ్ సినిమాయే లేదు.
       
ఇలా సిల్లీ కథ చేసేసి సుహాస్ మీద వేస్తే చెల్లుతుందా
? అందుకే కలెక్షన్స్ రిస్కులో పడ్డాయి. అసలు సస్పెన్స్ థిల్లర్స్ కి కొన్ని జానర్ మర్యాదలుంటాయి. తీసుకున్న పాయింటుకి యాక్షన్ రియాక్షన్లతో కూడిన సస్పెన్స్, థ్రిల్స్, ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్, యాక్షన్, డైలమా, టెంపో, ట్రెండీ టేకింగ్, స్పీడు వగైరా. ఇవేవీ లేకుండా నీరసంగా, నత్త నడకన, మధ్య మధ్యలో జానర్ మర్యాద తప్పి లవ్ ట్రాక్, సాంగ్స్, పెళ్ళి చూపులు, ఇంకో బోరు కొట్టే సబ్ ప్లాట్ ...ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ అనే ప్రక్రియలో ఇమడని ఎన్నో పాత మూస సీన్లు ఇరికించేశారు.
        
ఫస్టాఫ్ హీరోయిన్ తో ట్రాక్ నడుపుతూ మధ్యలో హత్య చూపించారు. ఆ తర్వాత హీరో దాన్ని మర్చిపోయినట్టు మళ్ళీ హీరోయిన్ తో ట్రాకు నడిపారు. ఇంటర్వెల్లో మాత్రం కిల్లర్ ఎవరో హీరోకి తెలియకుండా ప్రేక్షకులకి ఓపెన్ చేసేశారు. ఈ కథతో చేసిన మంచి పని ఇదొక్కటే. లేకపోతే అలవాటుగా చివరి వరకూ కిల్లర్ ని సీక్రేట్ గా వుంచి ఎండ్ సస్పెన్స్ కథలతో తీసి సినిమాల్ని ఫ్లాఫ్ చేస్తున్నారు.
        
ఇలా మధ్యలో కిల్లర్ ని ఓపెన్ చేయడం వల్ల ఎండ్ సస్పెన్స్ ప్రమాదం తప్పి- ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు చేస్తున్నట్టుగా -మధ్యలో కిల్లర్ ని ప్రేక్షకులకి రివీల్ చేసేసి- సినిమా నిలబడేందుకు ఉపయోగపడే సీన్ టు సీన్ సస్పెన్స్ కథనానికి బాగానే పూనుకున్నారు. అంటే ఇక నుంచీ సెకండాఫ్ లో కిల్లర్ తో హీరోకి ఎలుకా పిల్లీ చెలగాటం యాక్షన్ స్టోరీ అన్నమాట!
       
కానీ మళ్ళీ సెకండాఫ్ లో ఫస్టాఫ్ లాగే ఈ అసలు కథ వదిలేసి హీరోయిన్ తో ట్రాకు
, ఇంకో కుటుంబపు గొడవలు, ఇంకేవో కథలు, అప్పుడప్పుడు మాత్రం హీరోని చంపడానికి ప్రయత్నించే సీన్లూ.... చివరికి ఒక ట్విస్టుతో  హీరో కిల్లర్ ని చంపే ముగింపూ  ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు.
       
ఇందులో ఎక్కడా ఫేస్ బ్లయిండ్ నెస్ పాయింటు ప్లే అవదు. ఇది లేకుండా కూడా ఈ కథ చేయ వచ్చు. అసలు ఈ పాయింటు- అంటే ముఖాల్ని  గుర్తుపట్టలేని వాడి సాక్ష్యం పనికి రానప్పుడు
, వాడు అంధుడితో సమానమైనప్పుడు, వెంటపడి  వాడ్ని చంపాలని ప్రయత్నించే కథే అర్ధం లేనిది.
       
ఇక ఫ్లాష్ బ్యాక్ లో అసలు కిల్లర్ ఎందుకా అమ్మాయిని చంపాల్సి వచ్చిందో చూపించారు. ఆమె గర్భవతి. అయితే పోస్ట్ మార్టంలో ఈ విషయం బయటపడదా
?  బయటపడితే ఏసీపీ ఎలా మేనేజ్ చేస్తుంది? అది తన మెడకే చుట్టుకోదా? ఏమిటో ఈ గందరగోళం, గజిబిజి!  

నటనలు- సాంకేతికాలు
ఈ సినిమా ప్రధాన సమస్య ఏమిటంటే హీరో సుహాస్ పాత్రచిత్రణ అర్ధం పర్ధం లేకుండా వుండడం. అతను రేడియో మిర్చీ ఎఫ్ఎంలో పనిచేసే ఆర్జే అయినప్పుడు ఆర్జే లక్షణాలు ఒక్కటీ వుండవు. సగటు నిరుద్యోగి ప్రవర్తనతో భయపడుతూ భయపడుతూ, పిరికి పిరికిగా వుంటాడు. ఆర్జేలు మాటల ప్రవాహంతో రేడియో శ్రోతల్లో ఉత్సాహం నింపుతూ, తమపట్ల క్రేజ్ పెంచుకుని పాపులర్ వ్యక్తులై వుంటారు. కానీ సుహాస్ దీనికి భిన్నంగా పోలీసులు కొడితే గానీ ఐడీ చూపించుకుని తను ఆర్జే అని చెప్పుకోడు!

ఒక హత్య వంటి సంఘటన చూసిన ఆర్జే కార్య నిర్వహణ ఎలా వుంటుంది? వెంటనే ఎఫ్ఎంనే అస్త్రంగా చేసుకుని ప్రజలకి సమాచారాన్ని చేరవేసి పోలీసుల్ని పరుగులు పెట్టిస్తాడు. మీడియా వ్యక్తిగా పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుని డ్రైవ్ చేస్తాడు. కానీ సుహాస్ మాత్రం తనని చూసి ప్రేక్షకులు అయ్యోపాపమని సానుభూతి చెందాలన్నట్టు ప్రవర్తిస్తాడు. ఇంకోసారి పోలీస్ స్టేషన్ కెళ్ళి చేతులు కట్టుకుని నిలడితే ఏసీపీ చూసి, ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి?”అంటుంది. ఎంత అవమానం! ఎవరితను?’ అని కాస్టేబుల్ ని అడుగుతుంది. ఎంత షేమ్ ఆర్జే హీరో క్యారక్టర్ కి!

ఒక సీన్లో టెన్షన్ వచ్చి అక్కడ్నుంచి పారిపోయాను. నేనింటికి వెళ్ళాలంటే నా మీద ఎటాక్ చేస్తారని భయంగా వుంది అని ఫ్రెండ్ కి చెప్పుకుంటాడు! ఇతనేం హీరో? హాస్పిటల్ సీన్లో ఆగంతకులు వచ్చి చంపాలని ప్రయత్నిస్తే సుహాస్ ని పోలీసు వచ్చి కాపాడాల్సి వస్తుంది! ఇదేం హీరోయిజం?

సమస్య దర్శకుడితో వుంది. యాక్టివ్ క్యారక్టర్
, పాసివ్ క్యారక్టర్ తేడాలు తెలీక డైరెక్టర్లు అయిపోతున్నారు. కథానాయకుడన్నాక కథని నడిపే యాక్టివ్ పాత్ర కాకుండా, కథని నడపలేని పాసివ్ క్యారక్టర్ గా దద్దమ్మని చేసి సినిమాని నాశనం చేశాడు. ఈ క్యారక్టర్ కి గొప్పగా
ప్రోసోప్రగ్నోషా అని ఒక బిల్డప్ ఒకటి!

హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ ఫార్ములా పాత్ర. తను ఎవరో ఏం చేస్తూంటుందో తెలీదు. తన ముఖం గుర్తు పట్టని హీరోని ప్రేమిస్తూ వుంటుంది. దీనికి పరిష్కారం చూపించాలని కూడా ప్రయత్నించకుండా సుఖాంతం చేశాడు. ఫేస్ బ్లయిండ్ నెస్ తో క్రైమ్ కథ సరిగా లేదు, ప్రేమ కథా సరిగా లేదు.

ఎస్సై పాత్రలో నితిన్ ప్రసన్న
, ఏసీపీ పాత్రలో రాశీ సింగ్ మూస పోలీసు పాత్రలు, నటనలు. హీరో ఫ్రెండ్ గా వైవా హర్ష ఫస్టాఫ్ లో మధ్యలో అదృశ్యమై సెకండాఫ్ మధ్యలో వస్తాడు. డేట్లు కుదరలేదేమో.

ఇక సంగీతం గానీ
, ఛాయాగ్రహణం వంటి సాంకేతికాలు గానీ థ్రిల్లర్ చూస్తున్నట్టు లేవు. హీరోకున్న ఫేస్ బ్లయిండ్ నెస్ ని టెక్నికల్ గా చూపించే ప్రయత్నం కూడా చేయలేదు. అతడి కంటికి మనుషుల రూపాలు ఎలా కనిపిస్తాయీ విజువల్స్ వేసి ప్రేక్షకుల అనుభవంలోకి తెచ్చే ప్రయత్నం చేయలేదు. ఫేస్ బ్లయిండ్ నెస్ బాధితుడికి మనుషుల ముఖాలెలా కనపడతాయో ప్రేక్షకులకి చూపించకపోతే అతడితో ఎలా కనెక్ట్ అవుతారు.

1990 లో గీతాకృష్ణ తీసిన కోకిల లో హీరో నరేష్ కి నేత్ర మార్పిడి చికిత్స తర్వాత అతడికి కన్పించే దృశ్యాలెలా వుంటాయి? చనిపోయిన వ్యక్తి కళ్ళు అమర్చిన తర్వాత అతడ్ని చంపిన హంతకుడు నరేష్ కెలా కన్పిస్తూంటాడు? ఇలా మానసిక లోకాన్ని ఆవిష్కరించాలని లేకపోతే ఎందుకు ఇలాటి సినిమా తీసినట్టు?
—సికిందర్