రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, ఫిబ్రవరి 2015, శనివారం

శివ

కిటికీ లోంచి కొత్త సృష్టి!
శివ’ ఆధారంగా  తెలుగు సినిమా  స్క్రీన్ ప్లే  స్ట్రక్చర్  వ్యాసాల పరంపరలో  భాగంగా  ‘శివ’ గురించి ఈ సింహావలోకనం... 

రిత్రని మార్చేస్తూ మార్గదర్శకంగా నిలవాలంటే ఏం చేయాలి?

     పాతలో నెగెటివ్స్ ని చూసి, కొత్తని పాజిటివ్ గా ఆలోచించాలి. అలనాటి హాలీవుడ్ ఫన్నీ డైరెక్టర్ బిల్లీ వైల్డర్ సీను ఎలా వుంటే ఇంటరెస్టింగ్ గా మారుతుందో ఇలా చమత్కరిస్తాడు- ‘మామూలుగా పాత్ర తలుపు తీసుకుని లోపలికి  వచ్చిందనుకోండి, అది చప్పగా వుంటుంది ప్రేక్షకులకి. అదే ధబీల్మని కిటికీ దూకేసి వచ్చిందనుకోండి- చప్పున లేచి చూస్తారు ప్రేక్షకులు!’

      సింపుల్ గా ఎంత తేడా తలుపుకీ కిటికీకీ ప్రేక్షకుల రెస్పాన్సు లో!

      సరీగ్గా 1989 కి పూర్వం ఇలాగే ఉండేవి తెలుగు సినిమాలు. బద్ధకంగా తలుపు తీసుకుని వచ్చి అలసటగా కూర్చునేవి. ఈ రొటీన్ ఫార్ములా చూసి చూసి ఇదే కాబోలు సినిమా అంటే అనుకుని అలవాటు పడిపోయారు ప్రేక్షకులు. అప్పుడు 1989 లో అనుకోకుండా జరిగిందొక సంఘటన. అతను అక్కినేని నాగార్జున, ఇంకో అతను రామ్ గోపాల్ వర్మ. ఇద్దరూ కలిసి అదును చూసుకుని ‘శివ’ అనే సినిమాని దభీమని కిటికీ దూకించారు. అంతే, ఉలిక్కి పడి చూసిన ప్రేక్షకులు థ్రిల్లయి పోయారు. తెలుగు సినిమాలు ఎప్పుడైనా తలుపు తీయడమూ, లోపలికొచ్చి ఎక్కడ ప్రేక్షకులు పారిపోతారో నని గట్టిగా గడియ పెట్టేసుకోవడమే తప్ప, ఇలా డిఫరెంట్ గా డైనమిక్ గా  కిటికీ దూకేసి రావడమేమిటి? ఇంటా వంటా ఇలాంటిది లేదే - అనుకుంటూనే సీట్లకి అతుక్కుపోయి శివాలెత్తి పోయారు. ఇంతకాలమూ అమాయాకంగా తాము చూస్తూ ఉండిపోయిన సినిమాల్ని తల్చుకుని శివ శివా అనుకున్నారు. రాత్రికి రాత్రే నాగార్జునకి టాప్ హీరోగా పట్టం గట్టేశారు, రామ్ గోపాల్ వర్మ ని హాట్ దర్శకుణ్ణి చేసేశారు.


       అలా తెలుగు సినిమా రూపు రేఖల్ని పునర్నిర్వచించింది ‘శివ’. అప్పటికి రెండు స్వర్ణ యుగాలే (1931లో ‘భక్త ప్రహ్లాద’ నుంచీ 1950 లో ‘స్వప్న సుందరి’ వరకూ మొదటి స్వర్ణ యుగం;  1951 లో ‘మల్లీశ్వరి’ నుంచీ 1965 లో  ‘సుమంగళి’  వరకూ రెండో స్వర్ణ యుగం) తెలిసిన తెలుగు సినిమాకి, 1965 తర్వాత నుంచీ ఫక్తు వ్యాపార విలువల్ని జోడించుకుని కళని రెండో తరగతి పౌరురాలిగా మార్చేసుకున్న తెలుగు సినిమాకి- తను ఎటు ప్రయాణిస్తోందో దిశా దిక్కూ లేకుండా ఉన్న తెలుగు సినిమాకి- అప్పుడు 1989 లో గ్లాసుడు చల్లని నీళ్ళతో సేదదీర్చి, అక్కడో గీత గీసి ‘ఇదిగో నేనూ ‘శివ’ ని. ఇక్కడ్నుంచీ  తెలుగు సినిమాలు గీత కటు ‘శివ’ కి ముందు, గీత కిటు ‘శివ’ కి తర్వాతగా వుంటాయి. గీత కటే  నువ్వుండి  పోయి కాలగర్భంలో కలిసిపోతావో, దాటుకుని ఇటొచ్చి కాలంతో పాటూ ముందుకు సాగుతావో ఇక నీ ఇష్టం. వచ్చావా నాతో, గీత దాటించేస్తా. భయపడొద్దు, మాస్ ప్రేక్షకుల మెప్పు కూడా పొంది వచ్చాన్నేను. నాకు పనికొచ్చిన సరంజామా అంతా నీకే ఇచ్చేస్తా. బిల్డప్పులు, బ్యాంగులు, మాస్ డైలాగులు, ఓవరాక్షన్ లు, కామెడీ ట్రాకులూ ఉండక పోవచ్చు నా  సరంజమాలో. నేలకి దిగి వచ్చి నిజవితంతో కరచాలనం చేశా మరి. రా నాతో  చేయి కలిపి, నా విజయ రహస్యమూ జ్ఞానమూ నువ్వూ పంచుకుని తెలుగు సినిమాని కొత్త తావులకి తీసి కెళ్ళడంలో నువ్వూ భాగస్వామివి కా, కమాన్!’ అనేసి వెన్ను తట్టి ప్రోత్సహించింది.

     శివ’ కి ముందు ‘శంకరాభరణం’ వంటి ఆణి ముత్యాలున్నాయి, కాదనలేం. అవి ప్రతిష్టని నిలబెట్టాయి. ‘శివ’ చరిత్ర ని మార్చింది. కొత్తగా వచ్చే దర్శకుల్లో ఆవేశాన్ని రగిల్చింది. రిఫరెన్స్ పాయింట్ గా నిల్చింది. అభినయాలతో, కథా కథనాలతో కొత్త పుంతలు తొక్కుతూ, టెక్నికల్ విలువలకీ ఓ గైడ్ అయింది.   

   టెక్నాలజీ! మనిషి అంతరంగం ఎక్కడో ఊర్ధ్వలోకాల్ని తాకాలని ఉబలాట పడుతూంటుంది. ఈ ఉబాలాటాన్ని తీర్చేది టెక్నాలజీయే. సుదూరంగా వుండే వాటిని పసిగట్టే మానసిక శక్తులు ఆ రోజుల్లో ఋషుల కుండేవి. ఈ రోజుల్లో ఆ మానసిక శక్తుల పాత్ర టెక్నాలజీ వహిస్తూ ఉపగ్రహాల ద్వారా దూరతీరాల సమాచరం మనకందిస్తోంది. స్పిరిచ్యువాలిటీకి అచ్చమైన నకలు టెక్నాలజీ. ఈ టెక్నాలజీ సినిమాలో కలగలిసిపోయినప్పుడు ప్రేక్షకుడెంతో సేద తీర్తాడు. ఆ టెక్నాలజీ తానుంటున్న ప్రదేశపు మట్టి వాసనలతో మిళితమైనప్పుడు ఇంకింత రిలాక్సవుతాడు. అదే పాత  పద్దతుల్లో అదే మూస ఫార్ములా కథకి టెక్నాలజీ హంగులు సమకూర్చుకుని వచ్చి వుంటే  ‘శివ’ కింత సమ్మోహక శక్తి లభించేది కాదేమో. ‘శివ’ అనే యాక్షన్ సినిమా మొదటి సారిగా రియల్ లైఫ్ క్యారక్టర్ లతో, మన ప్రాంతంలో మన ముందే జరుగుతున్నట్టుండే వాస్తవిక సంఘటనలతో, అందునా ఎక్కువ మంది ఫీలయ్యే స్థానిక సమస్య కథాంశంగా వచ్చి ఉండడం వల్లే,  దీని టెక్నాలజీ హంగులైన శబ్ద, ఛాయాగ్రాహక ఫలితాల్ని అంతలా మైమరచి ఆస్వాదించ గల్గారు సగటు ప్రేక్షకులు సైతం.

      స్టడీ కామ్ ఈ విజువల్ ఫలితాల్ని సాధించింది. ప్రేక్షకుల ఇన్వాల్వ్ మెంట్ ని పెంచే ఈ కెమెరాతో గ్యాంగ్ ని తప్పించు కుంటూ పిల్ల నెత్తుకుని నాగార్జున సందు గొందుల్లో పరుగెత్తే దృశ్యాలెంత థ్రిల్లింగ్ గా అన్పించాయో తెలిసిందే. నాల్గేళ్ళుగా  చెన్నైలో వృధాగా పడి ఉంటున్న ఈ  స్టడీ కామ్ ని పట్టుకొచ్చి, దేశంలో మొట్ట మొదటి సారిగా ‘శివ’ కి ఉపయోగించారు. ‘శివ’ విడుదలై ఏడాది తిరిగేసరికల్లా, అర్జెంటుగా ఇలాటి ముప్పయ్యారు కెమెరాలు దేశంలోకి దిగుమతి అయిపోయాయంటే పూర్వరంగంలో  ‘శివ’ సాధించిన గొప్పతనమేమిటో తెలుస్తోంది. 1976 లో గారెట్ బ్రౌన్ అనే నిపుణుడు కనిపెట్టిన ఈ కెమెరా  మోత బరువుంటుంది. ఈ బరువంతా ఆపరేటర్ తన నడుం  మీద మోయాల్సిందే. ఈ క్రమంలో షూట్ చేస్తూ కదుల్తూన్నా, పరిగెడుతూన్నా ఆ కుదుపు లన్నిటినీ  కౌంటర్ బ్యాలెన్స్ చేసుకుని స్టడీగా వుంటుందీ కెమెరా. ‘శివ’ కి దీని బరువు బాధ్యతల్ని ప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాల రెడ్డి దగ్గర ఆపరేటివ్ కెమరా మాన్ గా పనిచేస్తున్న రసూల్ ఎల్లోర్ ఎత్తుకున్నాడు.

        ఇలాటి గోపాలరెడ్డి విజువల్ విన్యాసాలతో దీపెన్ ఛటర్జీ శబ్ద గ్రాహక ప్రతిభ పోటీ పడింది. ఈ ఆడియో ఎఫెక్టు తెలుగు సినిమాల్లో మొట్ట మొదటి సారిగా  కృత్రిమ శబ్దం ‘డిష్యూం డిష్యూం’ ని పచ్చడి పచ్చడి చేసింది. ముష్టి ఘాతం తొలిసారిగా సహజ శబ్దంతో రక్తపోటు పెంచేసింది. బార్ సీన్ లో బ్రిజ్ గోపాల్ ని హీరో నాగార్జున కొడుతున్నప్పుడు పుట్టే ఆ శబ్ద ప్రకంపనలు ప్రేక్షకుల గుండెల్లో అలజడి రేపాయి. నేపధ్యంలో ఇంకే శబ్దాలు, అరుపులు, మూల్గులు, రీ- రికార్డింగూ విన్పించవు. ఇది శబ్దం లో నిశ్శబ్దం. శబ్దపు పొరల్ని విప్పుకుంటూ పోతూంటే  పోతూంటే భయంకర నిశ్శబ్దమే తేలుతుంది. అది కూడా శబ్దమే. అంతరంగం శోషించుకునే శబ్దం.

      ఇంకో చోట క్లైమాక్స్ లో రఘువరన్ ని కొడుతున్నప్పుడు కూడా ఇదే సౌండ్ టెక్నిక్. కాకపోతే రఘువరన్ రొప్పులు అందులో కలగలిసి వుంటాయి. నిశ్శబ్దం లో శబ్దం ఏమందిస్తుంది నిజానికి? ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ కి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు పొందిన మనదేశపు శబ్ద గ్రాహకుడు రసూల్ పోకుట్టి ఆస్కార్ సభలో ఏమని చెప్పాడు? నిశ్శబ్దం తర్వాత నిశ్శబ్దాన్నీ దాటుకుంటూ పోతూంటే, విన్పించేది చిట్ట చివర ఓంకార నాదమే! విశ్వ మానవాళికి ఇలాంటి పవిత్ర మంత్రాక్షరిని అందించిన దేశాన్నుంచీ వచ్చిన వాణ్ణి నేనూ అని చాటాడు. శ్రీశ్రీ ఆనంద మూర్తి దీన్నిలా వివరిస్తాడు : మౌన ముద్రలో మొదట క్రికెట్ ఆడుతున్నట్టు శబ్దాలు విన్పిస్తాయి. తర్వాత ఒక్కో అంచులో గజ్జెల శబ్దం, వేణువూదుతున్న శబ్దం, సముద్ర ఘోష, గణగణ గంటల శబ్దమూ విన్పించి, చిట్ట చివర్న స్థంభింప  జేసేదే ఓంకార నాదం! ఏమీ వుండదు దీనికావల. చెవులు పగిలే నిశ్శబ్దమే ఆవరించుకుని వుంటుంది. ఇప్పుడు ‘శివ’ ని తిలకిస్తున్న ప్రేక్షకోత్తముడి అంతరంగం ఏ శిఖరాలకి వెళ్లి తాకుతుందో సులభంగా ఊహించేసుకో వచ్చు. రుషుల్లేని ఈ కాలంలో టెక్నాలజీయే ఆత్మిక దాహాన్ని తీర్చే రుషి. ఇది గ్రహించక చాలా మంది దర్శకులు టెక్నాలజీని సవ్యంగా వినియోగించుకోలేకో, లేదా ఆ దివ్యౌషధం లాంటి టెక్నాలజీ కి దీటైన స్క్రిప్టులు తయారు చేసుకోలేకో అంతా కాలుష్యపు కాసారాలుగా మార్చేస్తున్నారు సినిమాల్ని.  

        పోతే, ‘శివ’ అంటే తలపండిన సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే నమూనా కూడా! ‘శివ’ ని చూడ్డం, సిడ్ ఫీల్డ్ ని చదవడం ఒకటే. స్క్రీన్ ప్లే పరంగా వియవంతమైన సినిమాల్లో ఉంటున్న ఒక సారూప్యాన్ని పసిగట్టిన  సిడ్ ఫీల్డ్,  దాని ఆధారం గా ఓ స్క్రీన్ ప్లే నమూనాని ఆవిష్కరించి ప్రచారం లోకి తెచ్చాడు. దీని ప్రకారం సినిమా కథల్లో వుండే మూడంకాలూ 1 : 2 : 1 నిష్పత్తిలో వుంటాయి. ‘శివ’ కూడా సరాసరి ఈ నిష్పత్తినే పంచుకుని, మొదటి అంకం 20 సీన్లు, రెండో అంకం 55 సీన్లూ, మూడో అంకం 25 సీన్లు గా స్క్రీన్ ప్లే సాగించుకుంటుంది. 


          ఈ అంకాల్లో ఏమేం జరుగుతాయో శాంపిల్ గా మొదటి అంకాన్ని తీసుకుని చూస్తే – ఇందులో జరిగే కార్యకలాపం లేదా బిజినెస్ ఎలా ఉంటుందంటే- ప్రధాన పాత్రని పరిచయం చేసి, కథ దేనిగురించో చెప్పడం; ఇతర పాత్రలతో ప్రధాన పాత్ర సంబంధాల్ని నిర్వచించడం, ప్రధాన పాత్ర చర్య తీసుకునేందుకు ప్రేరేపిస్తున్న శక్తులేవో చూపడం, ఇదంతా చేసుకొస్తూనే అంకం చివర ఏదైతే పాయింటు లేదా సమస్యని ఏర్పాటు చేస్తామో, దానికి దారి తీసే పరిస్థితుల కల్పనా పూర్తి చేసుకు రావడమూ జరుగుతుంది. ఇక్కడే కథలో మొదటి మలుపు అనేది ఏర్పడి అసలు కథ మొదలౌతుంది. అంటే రెండో అంకం ప్రారంభమౌతుంది.

      ‘శివ’ లో మొదటి అంకం ప్రారంభం లోనే ఓ స్టూడెంట్ ని గూండాలు గాయపరచడం ద్వారా కథ దేనిగురించి అయి వుంటుందో సూచించారు. అప్పుడు ప్రధాన పాత్రగా నాగార్జునని ప్రవేశపెట్టి, అతడి సహవిద్యార్థులుగా అమల, శుభలేఖ సుధాకర్, చిన్నా, విశ్వనాథ్ తదితరులతో పాటు నాగార్జున పాత్రని పరిచయం చేసి, వాళ్ళ సంబంధ బాంధవ్యాలని చూపారు. ఇంటి దగ్గర నాగార్జున అన్నా వదినెల్నీ, వాళ్ళ కూతుర్నీ పరిచయం చేసి, ఇంకా అటు అమల అన్నగా సీఐ పాత్రలో సాయిచంద్ ని చూపించారు.


          మరో వైపు కాలేజీలో జేడీ చక్రవర్తి బ్యాడ్ బ్యాచిని చూపిస్తూ, భవానీ అనే పెద్ద గూండాతో అతడికి సంబంధాలున్నట్టు చెప్పించారు. నాగార్జున వేసుకొచ్చే సైకిలు మీద ఘరానాగా జేడీ ని  కూర్చోబెట్టడం ద్వారా, ఓ బాయ్ ఫ్రెండ్ ని అతడి చేత కొట్టించడం ద్వారా, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనని మెల్లగా చేసుకొచ్చారు.
      కాలేజీలో ఈ పరిస్థితులు ప్లస్ ఇంటి దగ్గర వదినతో ఇబ్బందులూ నాగార్జున చర్యకి పూనుకునేందుకు ప్రేరేపించే శక్తులుగా ఎష్టాబ్లిష్ చేశారు. పెద్ద గూండా భవానీకి మినిస్టర్ అండ ఉందని సాయిచంద్ తో చెప్పించి నాగార్జునకి రిస్కు తీవ్రతని పెంచారు. అప్పుడు ఫైనల్ గా 20 వ సీనుకల్లా, అంటే ఈ మొదటి అంకం ముగింపులో,  జేడీతో అమలకి డ్యాష్ కొట్టించి, ఇక తప్పని సరి పరిస్థితుల్లో నాగార్జున సైకిల్ చైన్ లాగేసి దాంతో  జీడీ మీదికి విజృంభింప జేయడం ద్వారా, కథని పూర్తిగా మలుపు తిప్పేసి రెండో అంకంలో పడేలా చేశారు.



       బ్యూటిఫుల్ క్రియేషన్. మంచి స్క్రీన్ ప్లే కి రిఫరెన్స్ బుక్. హైదరాబాద్ లో గొల్ల రవి (నాగార్జున పాత్ర), విజయవాడలో వంగవీటి రాధా ( రఘువరన్ పాత్ర) లని స్ఫూర్తిగా తీసుకుని, బ్రూస్ లీ నటించిన ‘ఎంటర్ డి డ్రాగన్’ ఆధారంగా కథ తయారుచేసుకున్నట్టు చెప్పొచ్చు వర్మ. కా నీ కథ నడక ‘ఎంటర్ ది డ్రాగన్’ లా వుండదు. ‘అన్ టచబుల్స్’ (1987) అనే హాలీవుడ్ సినిమా కథా నడకని పోలి వుంటుంది. అదే శైలి, సహజత్వం, మూడ్, ఫీల్, తక్కువ మాటలు, ఎక్కువ ఎక్స్ ప్రెషన్స్ . నేపధ్యంలో భవానీ తాలూకు టెన్షన్ వున్న విషయం గురించి సీన్లు వెర్బల్ గా పలకవు. ఏ హడావిడీ  లేని సబ్ టెక్స్ట్ ద్వారా ఆ టెన్షన్ పుడుతుంటుంది. కాకపోతే ఒకటే తేడా- ‘అన్ టచబుల్స్’ లో సీన్ కానరీ -  ‘వాడు కత్తి తీస్తే నువ్వు పిస్తోలు తీస్తావు. వాడు నీ మనుషుల్ని ఆస్పత్రి పాల్జేస్తె, వాడి మనుషుల్ని నువ్వు చంపుకుంటూ పోతావు. నేర ప్రపంచపు ఆనవాయితీయే ఇది, కాదనను. కానీ ఈ లెక్కన వాణ్ణసలు నువ్వెప్పుడు పట్టుకుంటావ్?’ అని నిలదీస్తాడు.  అప్పుడు కెవిన్ కాస్టనర్  ఆ రాబర్ట్ డీ నీరో పాల్పడుతున్న తీవ్ర హింసని ఎదుర్కొంటూనే, అవకాశం చూసుకుని పన్ను ఎగవేత స్కాం లో అతణ్ణి పట్టేసుకుని వెన్ను విరుస్తాడు పూర్తిగా!

     ‘శివ’ లో నాగార్జున రఘువరన్ కి పోటీ మాఫియాగా ఎదిగి, ‘ఇలాంటి వ్యవస్థని నాశనం చేయాలి. భవానీని చంపడం కాదు’ అని స్పష్టం చేసి ఆ రూటులో నరుక్కొస్తాడు 

    
      ‘శివ’ లో నాగార్జున రఘువరన్ కి పోటీ మాఫియాగా ఎదిగి, ‘ఇలాంటి వ్యవస్థని నాశనం చేయాలి. భవానీని చంపడం కాదు’ అని స్పష్టం చేసి ఆ రూటులో నరుక్కొస్తాడు

     క్లాస్ నీ, మాస్ నీ ఆకర్షించేదే నిజమైన కమర్షియల్ సినిమా. ‘శివ’ సహజ పాత్రలతో రియలిస్టిక్ గా వుంటూనే ఎంటర్ టైన్ చేస్తుంది. ‘ద్వారం’  సినిమాలెన్నో అయితే, ‘కిటికీ’ సినిమా ఒక్కటే!

సికిందర్

( జులై 2009, ‘సాక్షి’ కోసం)


రేపు : స్ట్రక్చర్ 4 – సినాప్సిస్ 

27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

నాటి సినిమా..


సరి ‘గమ్యాల’ సరిత!

‘నా జీవితం అనేక విధాలా అంతులేని కథతో పోలి వుంటుంది’ అని జయప్రద అన్నప్పుడు అందువల్లే ఆ పాత్రకి అంత జీవం పోసిందేమో అన్పించక మానదు.
1.  తను హర్ట్ అయినప్పుడు పెల్లుబికే హావభావాలు
2. అనుకున్నది అవనప్పుడు ఎగిసిపడే రియాక్షన్స్
3. సెల్ఫ్ పిటీ అప్పడు  పాతాళం లోకి జారే శోక ముద్ర
4. త్యాగాలు చేసినప్పుడు ఆకాశాన్నంటే ఆనందం

      ముఖం ఒకటి – భావాలే మరీ కోటి. తెలుగు తెరకి మునుపెన్నడూ లేనంత సంకీర్ణ  స్త్రీ పాత్ర సృష్టి జయప్రద పోషించిన సగటు సరిత పాత్ర.  ఈ సినిమా నాటికి స్త్రీల వృత్తులు ఇప్పుడున్నంత పోటాపోటీగా లేవు. అప్పట్లో ఉద్యోగినులు, ఇప్పుడు వర్కింగ్ వుమెన్.  అప్పట్లో కెరీర్ నిచ్చెన మెట్ల గురించి పెద్దగా చింత లేని తనం, ఇంటి చుట్టూ ఆలోచనలతో సతమతం. తేడా అల్లా ఈ సినిమాలో ఆ ఇంటి బాధ్యతలు మీద పడ్డందుకే ఆక్రందనలు!
      వై? ఎందుకలా? 1976 లో ఆశా పూర్ణా దేవీ ( 1909 – 1995 ) రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా హిందీలో తారాచంద్ బర్జాత్యా తీసిన ‘తపస్య’ లో కథానాయిక ఇలా కాదే?  1974 లో కె. బాలచందర్ తమిళంలో సృష్టించిన సరిత అనే పాత్రతో ‘అవళ్ ఒరు తోడుర్కథాయ్’ తీసినప్పుడు అందులో అలవాటైన తన బ్రాండ్ యాంటీ హీరోయిజాల, యాంటీ క్లైమాక్సుల మోజు వెనుక వెలిగించిన అభ్యుదయ దీపమే, 1976 లోనూ తిరిగి తెలుగులో ‘అంతులేని కథ’ లో వెలుగులు జిమ్మింది.

      పాత కట్టుబాట్లూ,  కాలం చెల్లిన సాంప్రదాయాల సంకెళ్ళూ తెంచి పారెయ్యాలన్నదే బాలచందర్ ‘విజన్’  అయినట్లయితే, దీనికి ప్రతిగా ఆ పాత కట్టుబాట్ల,  సాంప్రదాయాల విలువలకే పట్టం గడుతూ, భారతీయ స్త్రీని శాంతీ సహనాలకీ, యుగాల కట్టుబాట్లకీ చిహ్నంగా చూపడమే ఆశా పూర్ణా దేవీ దృక్పథం అయింది. అయితే ఈవిడ చేసిన పాత్ర చిత్రణ తన వాదానికి బలం చేకూర్చినట్టుగా, బాలచందర్ సృష్టి కన్పించదు. కారణం, ఆయన అభ్యుదయవాదం కాస్తా అవగతమైన సాంప్రదాయవాదం లోకి తిరగ బెట్టడమే. ఆయన సృష్టించిన రివల్యూషనరీ సరిత పాత్ర కాస్తా ఏమీ సాధించలేని కౌంటర్ రివల్యూషనరీగా పలాయనం చిత్తగించడమే. ‘తపస్య’ లోని పాత  సాంప్రదాయ పాత్రలాగా స్థిరపడి పోవడమే. గాడ్, ఇంత దానికి ఈ డొంక  తిరుగుడంతా దేనికో?

       గమ్మత్తేమిటంటే ఆ సంవత్సరం విడుదలైన ఈ రెండూ సూపర్ హిట్సే!

      ‘అంతులేని కథ’ జయప్రదకి సుదీర్ఘమైన తిరుగు లేని సురక్షిత సినీ జీవితాన్ని ప్రసాదించింది. సావిత్రికి ‘చివరకు మిగిలేది’ ఎలాగో, జయప్రదకి ‘అంతులేని కథ’ అలాగ. ముక్కు పుటాలు కంపిస్తాయ్- తన మీద తనకే ఎందుకో కోపం; కోర చూపులు ప్రసరిస్తాయ్ - కసికసిగా ఇతరులంటే చిన్న చూపు; ముక్తసరి మాటలు ఉడుకుతాయ్- నత్తలా తనలోకి తాను  ముడుచుకోవడం...ఇప్పుడు ముప్పయ్యేళ్ళ తర్వాతయినా ఈ లెవెల్లో ఇంత ఫైర్ బ్రాండ్ సరితని మర్చిపోగలరా ఎవరైనా? కాస్త సహనవతి అయ్యుంటే ఎంత బావుణ్ణురా భగవంతుడా అని మగ ప్రేక్షక  ప్రపంచం మొర పెట్టుకుంటూనే ఉండొచ్చు ఇంకా.

      సహనం శాంతి సౌఖ్యాలూ అభ్యుదయం కాకుండా పోవు. ఈ గుణాలే అభ్యుదయమైతే తిరుగుబాట్ల తలనొప్పులే వుండవు. ఏదైతే అందదో, దాని గురించి తియ్యటి బాధ వుంటుంది. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రా ల్లాగా, ఏదో మంచి చేయడానికే సినిమాల్లో స్త్రీ పాత్రలకి ఆ నెగెటివిజాన్నేదో వండివార్చినట్లయితే, పొలోమని అప్పుడు వెంట పడుతుందేమో పురుష ప్రేక్షక దండు. ఈ సినిమా ఇంతటి శాస్వత తత్వాన్ని మూట గట్టుకోవడానికి ఈ మేల్ ఫ్యాక్టరే మంత్రంలా పని చేసిందేమో.

        పైకి నిరర్ధకంగా కన్పించే నెగెటివ్ పాత్ర సరిత. అది పాజిటివ్ గా మారే క్రమాన్నే మనం చూస్తాం. పాజిటివిజం తో ఎప్పుడూ భౌతిక  సుఖాలే ఉండక పోవచ్చు. అంతకి మించిన మాననసిక శాంతి, సంతృప్తీ తప్పక వుంటాయి. మనకి తెలిసిపోతూ తనకి తెలీకుండా సరిత ఇదే సాధిస్తుంది చివరికి. ‘నాలో వున్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు’ అని పాడుతుంది మొదట్లో. అది ఉత్త ట్రాష్. ఏం తెల్సని ఆమెకి? ‘నన్ను కూర్చో బెట్టి ఇంత అన్నం పెట్టే నాధుడు కావాలీ’  అనేనా? ఎప్పుడు ఈ ఇంటి బాధ్యతల పీడా వదిలి పెళ్లి కూతుర్నై కులుకుదామనేనా? పెళ్ళయితే చాలు, ఈ వెధవ ఉద్యోగం కూడా వదిలిపారేసి హాయిగా మొగుడు పెట్టింది తింటూ కూర్చో వచ్చనేనా? కాబట్టి ఈ అజ్ఞానానికి శాస్తి అన్నట్టుగానే ఇలాటి ఆమె కలలన్నీ పటాపంచలయ్యాయి చివరికి. ఇక పునీతురాలయింది. పాత్రలోకి వెళ్లి మనం చూస్తే ఈ సంగతే ఆమె తెలుసుకున్నట్టు వుండదు. మనం ఫీలవుతాం ఆమె ఫీలవ్వాల్సిన సంగతిని. ఇదింకో అజ్ఞాన పర్వానికి తెర తీయడం!

     వైజాగ్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూంటుంది సరిత. ఆ జాబ్ కి తగ్గట్టు స్లీవ్ లెస్ జాకెట్లు, పెదాలకి లిప్ స్టిక్, పాదాలకి హై హీల్స్, చదువుకోవడానికి ఇంగ్లీషు నవలలు; తన గదిలో విశ్రమించడానికి తనకంటూ ప్రత్యేక ఫోం బెడ్, ఫ్యానూ, సోఫా సెట్ ఎట్సెట్రా ...ఇది తన వాళ్ళ మీద కసితో ఏర్పాటు చేసుకున్న తన గొప్ప ప్రపంచం. చుట్టూ ఇంకో దిక్కుమాలిన ప్రపంచం. పోష్ లొకాలిటీని అనుకునే మురికి స్లమ్ వాడ వున్నట్టు...ఇందులో తన మీద ఆధారపడ్డ కన్న తల్లి, విధవరాలైన చెల్లి, ఎదిగిన మరో చెల్లెలు, అంధుడైన తమ్ముడు, ఆవారా అన్న, వదిన, వాళ్ళ ముగ్గురు పిల్లలూ..దిక్కుమాలిన సంత! వీళ్ళంతా ఏదో కతకడం, కటిక నేల మీద పడి కునుకు తీయడం, సరితమ్మ వుంటే కిక్కురుమనకుండా తొంగోవడం. ఆవిడ ఆఫీసుకి బయల్దేరిందే తడవు ఇల్లంతా పండగే పండగ చేసుకోవడం. ఆఫీసులోనూ ఆవిడ ఆడపులే. చాలా పొగరుబోతు. గయ్యాళి. కొరకరాని కొయ్య. గర్విష్టి పైగా. తండ్రేమో సన్యాసుల్లో కలసిపోయి, అన్నేమో బేవార్సుగా మారి, కుటుంబ పోషణంతా తన ఆడ ప్రాణం మీద పడి, ఎప్పుడు ఈ రొంపి లోంచి విముక్తి దేవుడా అని అలమటిస్తున్నట్టు ప్రవర్తించడం..

       అటు ప్రేమిస్తున్న తిలక్ (ప్రసాద్ బాబు) ని పెళ్ళాడాలంటే ఇంటి బాధ్యతల్ని విడిచి పెట్టాలి. ఇది కుదరదు. ఇక ఈమెతో లాభం లేదని విధవరాలైన ఈమె చెల్లెలితో ఇతను వరస కలుపుకోవడం. ఈ గుండె కోతని కూడా భరించి  ఆ చెల్లెల్ని (శ్రీప్రియ) ఈ ప్రేమిస్తున్న ప్రియుడికే ఇచ్చి పెళ్లి చేసేయడం.


    ఈ చెల్లెల్నే మూగగా ప్రేమిస్తున్న ఒక వికట కవి (నారాయణరావు) ఉంటాడు. ఇతడికి జీవితంలో దారి తప్పిన తన కొలీగ్ (ఫటాఫట్ జయలక్ష్మి) కిచ్చి పెళ్లి చేసేస్తుంది సరిత. ఇటుపైన సరిత జీవితం లో దేవుడు కరుణించా డన్నట్టుగా శుభాలే జరుగుతూంటాయి. ఆవారా బేకార్ అన్న( రజనీ కాంత్ ) కూడా కాస్త ప్రయోజకుడవుతాడు. హమ్మయ్యా అని జాబ్ మానేస్తుంది సరిత. ఈమె రాజీనామా  స్వీకరించిన బాస్ (కమల్ హాసన్) ఈమెతో పెళ్లిని ప్రతిపాదిస్తాడు. ఇక పెళ్లి పీట లెక్కడమే తరువాయి ఆ ప్రయోజకుడైన అన్న కాస్తా హత్యకి గురవుతాడు. సమాప్తం. ఖేల్ ఖతం. తిరిగి మొదటి కొచ్చింది కొలిక్కి రాబోయిన సరిత కథ..నీదొక అంతులేని వ్యధాభరిత గాథే సుమా అనేసి. 

       ఇక తన ఈ రెండో కాబోయిన వరుణ్ణి కూడా రెండో చెల్లెలికి త్యాగం చేసేసి, తిరిగి గానుగెద్దు జీవితం మొదలు ... మళ్ళీ పెదాలకి అదే దొరసాని లిప్ స్టిక్, వొంటికి అవే స్లీవ్ లెస్ షో పీసెస్, టిక్కు టిక్కు మని కాళ్ళకి హై హీల్స్, ఉద్యోగిని హోదా వెలగబెడుతూ చేత్తో లంచ్ బాక్స్- ‘అమ్మా ఆఫీసు కెళ్తాను’ అనేసి ఈసురోమని నడక బస్టాపు కేసి..

        కాకపోతే ఇప్పుడు వైధవ్యం ప్రాప్తించిన వదిన వుంది. ఇంట్లో ఈ మార్పు తో బాటు తనలో కూడా ఎంతో మార్పు. ఎంతో పరిపక్వత. భద్రకాళి సరిత కాదిప్పుడు. పాఠాలన్నీ ఎంచక్కా  నేర్చేసుకున్న ప్రౌఢ ఇప్పుడు. ఇంటి బాధ్యతలు ఎంతో అపురూపంగా కన్పిస్తున్న సహనవతి ఇప్పుడు.

 

      వృద్ధ కన్యలు ఆ కాలంలోనూ వున్నారు. పరిస్థితుల కారణంగా తోబుట్టువుల బాధ్యతలన్నీ తీర్చుకుని తెప్పరిల్లే సరికి వైవాహిక జీవితం కాస్తా ఎండమావులై పోయిన వాళ్ళున్నారు. సరిత లాగా కసిని పెంచుకుని వుండరు. తమ దయాదాక్షిణ్యాలతో కుటుంబ సభ్యులు ఇంత తిని చస్తున్నారన్న ఏహ్యభావంతో వుండరు. అలా జరిగితే ఆడతనానికి అర్ధమే ఉండదు. స్త్రీ సహజాతాన్ని ఏ స్త్రీ జయించ జాలదు. జెండర్ సమానత్వం గురించి మాట్లాడినప్పుడు సరితకి లాంటి పరిస్థితులు ఎదురైతే బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. ఎక్కడో నూటికో కోటికో ఎవరో ఉండొచ్చు. అలాటి అరుదాతి అరుదైన ఉదంతాల్ని తీసుకుని  సామాన్యీకరించలేం. హిందీ సినిమా ‘తపస్య’ లో హీరోయిన్ రాఖీ పోషించిన ఇలాటిదే పాత్ర సహజమైన పెద్దరికంతో,  అవివాహితగానే కుటుంబ బాధ్యతంతా మీదేసుకుని మహా సహనశీలీ, విశాల హృదయినీ అయి, ఎంతో శ్రమించి తోడబుట్టిన వాళ్ళని ప్రయోజకుల్ని చేస్తే, వాళ్ళు తన్నేసి పోతారు. ప్రేమిస్తున్న ప్రియుడు (పరీక్షిత్ సహానీ) – ‘ఫర్వాలేదు, నీ ఇంటి బాధ్యత నేను తీసుకుంటానంటే, వద్దని వారిస్తుంది. స్త్రీ కుండే త్యాగ గుణానికీ, పురుషుడు కనబర్చాల్సిన ఓర్పుకీ  ప్రబల నిదర్శనం గా నిల్చి పోయిందీ చిత్రీకరణ.

    తెలుగులో దీన్ని కోదండ రామిరెడ్డి సుజాత తో ‘సంధ్య’ గా తీస్తే ఇదీ హిట్టయ్యింది.

      ఇలాంటి యాంటీ మిత్ / యాంటీ హీరోయిన్ లేదా హీరో పాత్రలు దేనికో టెంప్ట్ అయి, పతనాన్ని కొని తెచ్చుకోవడం మామూలే. అన్న ప్రయోజకుడయ్యాడని సరిత టెంప్ట్ అయి ఉద్యోగం వదిలెయ్యడమే మూర్ఖత్వ మన్పించుకుంది.

      ఈ సినిమాతో రజనీకాంత్, శ్రీ ప్రియ, నారాయణ రావులు పరిచయమయ్యారు. అప్పుడే రజనీకాంత్ సిగరె ట్టెగరేసే దృశ్యా  లిందులో వున్నాయి. ఆయన మీద జేసుదాస్ పాడిన సూపర్ హి ట్ ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ’ పాట చిత్రీకరణ కూడా వుంది. 

     జయప్రద మీద ఎస్. జానకి స్వరంలో ‘కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు’ గీతం ఓ సంచలనం అప్పట్లో. ఇక ఫటాఫట్ జయలక్ష్మి, నారాయణ రావులవి వెరైటీ పాత్రలనడం కంటే కల్ట్ పాత్రలనడం న్యాయం. ఫటాఫట్ అనే జయలక్ష్మి ఊతపదం ఇప్పటికీ పాపులరే. ఆమె మీద ఎల్లారీశ్వరి పాడిన ‘అరె ఏమిటీ లోకం పలుగాకుల లోకం’ పాట, నారాయణ రావు మీద మిమిక్రీతో ‘తాళి కట్టు శుభవేళ’ పాటా అంతే హిట్స్. పాటల, మాటల సృష్టికర్త ఆత్రేయ.


     స్వరకర్త ఎం.ఎస్. విశ్వనాథన్. బీ ఎస్ లోకనాథన్ ఛాయాగ్రాహకుడైతే, ఈ సినిమా ఘనవిజయం తర్వాత వెంటనే ‘మరో చరిత్ర ‘అనే ఇంకో సూపర్ హిట్ నిర్మించిన రామ అరణ్ణంగళ్  నిర్మాత. మద్రాస్ నెప్ట్యూన్ స్టూడియోలోనూ, వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనూ షూటింగ్ జరిపారు. 

     1982 లో తాతినేని రామారావు దర్శకత్వంలో సూపర్ స్టార్ రేఖ హీరోయిన్ గా ‘జీవన్ ధారా’ అని హిందీలో రిమేక్ చేస్తే అదీ హిట్టయ్యింది.

సికిందర్
(జనవరి 2010, ‘సాక్షి’ కోసం)










26, ఫిబ్రవరి 2015, గురువారం

ఆ నాటి సినిమా..


మ్యూజికల్ మాస్టర్ పీస్!

నం తీసే సినిమాలని విదేశీయులెవరైనా  ప్రశంసించినప్పుడు సార్వజనీనత సిద్ధించి మనం ఎదిగినట్టు లెక్క. ఓ పొద్దుటే మద్రాసులో గానకోకిల లతా మంగేష్కర్ రికార్డింగ్ థియేటర్ కి కారులో ప్రయాణిస్తూ ‘ఎంత బాగా తీశారు, ఇంత మంచి సినిమాని డబ్బింగ్ చేసేకన్నా రీమేక్ చేస్తే బావుంటుంది కదా’- అని పట్టుబట్టడం చూసి అంజలీ దేవి- ఆదినారాయణరావుల జంటకి నోట మాట రాలేదు. ఆ ముందు రోజే లతామంగేష్కర్  హిందీకి డబ్బింగ్ పాడేందుకు బొంబాయి నుంచి వచ్చారు. రాత్రే సినిమా చూశాక తెల్లారే రికార్డింగ్ కి వెడుతూ ఈ మాట!

     రికార్డింగ్ థియేటర్లో కూర్చుని ఈ అంశం పైనే చర్చోప చర్చలు. ఇంకాలస్యం చేయకుండా  అప్పటికప్పుడు నిర్ణయం. 1957 మార్చి 27 న ‘మాయాబజార్’ విడుదలైన సుమారు నెలన్నర రోజులకే, అంటే మే 10 న విడుదలై ఆ ‘మాయాబజార్’ తో గట్టి పోటీని సైతం తట్టుకుని నిలబడి, ఘానాతిఘన విజయం సాధించిన మ్యూజికల్ మాస్టర్ పీస్ ‘సువర్ణ సుందరి’ ని హిందీలో డబ్బింగ్ కాకుండా, రీమేక్ చేసేందుకు ఆ లతా మంగేష్కర్ సాక్షిగానే నిర్ణయం.

     సాక్షాత్తూ  ఉత్తరాది లతే ప్రశంసించాక ఇంకా ఓ తెలుగు సినిమా విశ్వజనీనత కి వేరే సర్టిఫికేట్ అవసరమేముంటుంది ?
     తెలుగు సినిమా ఆస్కార్ కి ఎప్పుడెళ్ళొచ్చు? ‘సువర్ణసుందరి’ లాంటి దేశీయత ప్రదర్శించినప్పుడు కనీసం నామినేషన్ గడప తొక్కొచ్చు. దేశీయత వినా ఏ కళకీ అంతర్జాతీయ సమాజపు మద్దతు లేదు.

     కొందరు  కళాకారులకి వాళ్ళ కళాభినివేశాన్ని గుర్తుచేస్తే పసిపిల్లలై పోతారు. బింకాలూ ఇగోలూ పోజులూ వుండవు. పోటీ యావలోపడి కరప్ట్ అవని ఒరిజినాలిటీ గల కళాకారులై వుంటారు వాళ్ళు. ఇప్పుడు ఎనభై రెండో ఏట ఇంత పండు వయసులో అంజలీదేవి అర్ధదశాబ్దం నాటి ‘సువర్ణసుందరి’ జ్ఞాపకాల్లోకి విహరిస్తే,  అదేమిటో వివశత్వం, అద్భుత ఆనందం, ఆర్తి ఆమెకు! ఆ కాసేపూ  వినిపించిన సంగతులు నిన్న జరిగినట్టే అన్పిస్తున్నాయి.  ఇన్ని దశాబ్దాల తర్వాతా అంత మెమరీనీ, ఆ ఫీల్ నీ జనరేట్ చేయడం ఒకరివల్ల అయ్యే పనే కాదు. ఎవరైనా తమకు సొంతమైన కళని ప్రేమించి, తదాత్మ్యం చెందకుండా ఇతరుల్ని మెప్పించలేరు.  ఈ  విషయంలో అంజలీ దేవికి హేట్సాఫ్ చెప్పాల్సిందే!

      స్ట్రైకింగ్ బ్యూటీ అంజలీదేవి ‘సువర్ణసుందరి’ లో. అప్పటికింకా నిండా ముప్పయ్యేళ్ళు లేవేమో.- వదనంలో ఆ లావణ్యం, మేనిలో ఆ హొయలు మనల్ని కట్టి పడేస్తాయి. పోషించిన గంధర్వ కన్య సువర్ణసుందరి పాత్ర, ప్రతీ కార్తీక పౌర్ణమి నాడామె దివి నుంచి భువి కేతుంచుతుంది.  భూమ్మీద రాకుమారుడు జయంత్ (అక్కినేని నాగేశ్వర రావు) చేయని ఒక తప్పుకి రాజ్య బహిష్క్రుతుడై, సువర్ణ సుందరి దృష్టిలో పడతాడు. ఆ తర్వాత ఇద్దరి ప్రేమకలాపాలూ ఇంద్రుడి దృష్టిలో పడి ఆయన శపిస్తే, స్త్రీగా మారిపోతాడు జయంత్. పురుష వేషం ధరించి సువర్ణ సుందరి కొడుకుని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. తిరిగి ఈ జంట ఎలా ఒకటయ్యారనేది చిత్ర విచిత్ర సంఘటనలతో,  మనస్సుని గెలుచుకునే సెంటిమెంట్లతో, ఉత్తమ సంగీత సాహిత్యాల  మేళవింపు తో నవరసభరితంగా వుంటుంది.   

      కథాపరంగా ఈ సినిమా ప్రత్యేకతలు రెండు : హీరో స్త్రీగా, హీరోయిన్ పురుషుడిగా మారిపోయే జెండర్  రివర్సల్ గిమ్మిక్కు, కమెడియన్లని విలన్లుగా చూపించే అవుటాఫ్ బాక్స్ థింకింగ్.  త్రీ ఈడియెట్స్ లాంటి కైలాసం, ఉల్లాసం, చాదస్తం (రేలంగి, రమణా రెడ్డి, బాలకృష్ణ) లు  చేసే అకృత్యాలు నేటి కాలంలో మళ్ళీ రాం గోపాల్ వర్మ తీసిన ‘జంగిల్ ‘లో  పొట్టి కమెడియన్ రాజ్ పల్ యాదవ్ పాల్పడే రాక్షసానందం లోనే చూడగలం. ఇమేజిల బ్యాగేజీ లేని ఆ కాలమే ఎంతో హాయైనది.

      ‘దేవదాసు’ ఫే మ్ వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ప్రతి సన్నివేశం ఇందులో ఓ కళాఖండమే. పాండురంగ మహాత్మ్యం’ ని వెండితెర వెలుగుగా మార్చేసిన టాప్ ఛాయాగ్రాహకుడు ఎం.ఏ. రెహ్మాన్ చేతిలో ‘సువర్ణ సుందరి’  మరో అద్భుత దృశ్య కావ్యం. వాలి కళ, వెంపటి సత్యం నృత్యాలు, నారాయణ మూర్తి ఆహార్యం, ప్రకాష్ కూర్పు...ప్రతి ఒక్కటీ ఎస్సెట్సే.

    ‘దేవదాసు’  తర్వాత మరోసారి  అక్కినేని వెంట పేకేటి శివరాం, ఇతరపాత్రల్లో నాగయ్య, గుమ్మడి, సీఎస్సార్, రాజసులోచన, గిరిజ తదితరులు కన్పించే ఈ అంజలీ దేవి పిక్చర్స్ వారి దివ్య సృష్టిని తమిళంలో జెమినీ గణేశన్ తో, హిందీలో తిరిగి అక్కినేని- అంజలీ దేవిలతో రీమేక్స్ చేస్తే అవీ హిట్సే.

    తెలుగు ఒరిజినల్ కి ఆ ఏటి  ఉత్తమ జాతీయ చలన చిత్రం అవార్డుని రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా అందుకున్నారు ది గ్రేట్ అంజలీ దేవి.

ఎక్కడిదీ కథ?

క్కినేని- అంజలి జంటగా నటించిన ‘బాలరాజు’ (1948), ‘స్వప్న సుందరి’ (1950), జానపదాలు రెండూ 1957  లో ‘సువర్ణసుందరి’ కి స్ఫూర్తి కావొచ్చన్న విశ్లేషకుల - పోనీ సినిమా చరిత్రకారుల అభిప్రాయంతో విభేదించారు అంజలీ దేవి. సుప్రసిద్ధ సంగీత దర్శకుడైన భర్త ఆదినారాయణ రావు విరివిగా ఇంగ్లీషు పుస్తకాలు చదివేవారనీ, బహుశా వాటి లోంచి ఎక్కడో స్ఫూర్తి పొంది ఆయన ‘సువర్ణ సుందరి’ కథ రాసుకున్నారనీ అన్నారు. కాకినాడలో రంగస్థల కళాకారుడిగా వున్నప్పట్నించే ఆయన రచయిత అనీ, కవి అనీ, సంగీత దర్శకుడు కూడాననీ చెప్పుకొచ్చారు అంజలి. అలా  ‘సువర్ణ సుందరి’ కథని ఆదినారాయణరావు రచయిత సదాశివ సుబ్రహ్మణ్యం కి చెప్తే,  ఆప్పుడాయన పూర్తి స్థాయి స్క్రిప్టు రాసిచ్చారనీ, దాన్ని మళ్ళీ సముద్రాల రాఘవాచార్య మెరుగులు దిద్దారనీ, మాటలు కూడా కొన్ని ఆయనే రాశారనీ వివరించారామె. టైటిల్స్ లో సంభాషణల రచయితగా మల్లాది రామకృష్ణ శాస్త్రి పేరుంటుంది. కథకి సదాశివ బ్రహ్మంతో బాటు ‘ఆదిత్యన్’ అనే పేరు వేశారు. ఈ ‘ఆదిత్యన్’  ఎవరంటే ఆదినారాయణ రావే. ఎందుకో సొంత పేరు వేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదట. ఇక పాటలు సముద్రాల, జూనియర్ సముద్రాల, కొసరాజు రాశారు.
      మొత్తం 14 పాటలున్న ఈ మూడున్నర గంటల సంగీత రసాత్మక జానపద ఫాంటసీ లో  సముద్రాల రాఘవాచార్య రాసిన ‘పిలవకురా’ పాట పి. సుశీల కంఠంతో టాప్ సాంగ్ గా చెప్పొచ్చు. ఐతే అంజలీ దేవి తన మీద చిత్రీకరించిన ఆరు పాటలూ సుశీల చేత పాడించి, ఒక్క ‘హాయి హాయి గా  ఆమని సాగే’  పాటని మాత్రం జిక్కీ చేత ఎందుకు పాడించారని అడిగినప్పుడు, ‘ఏమో ఆమె మరుగున పడిపోతోందని పాడించి వుంటారేమో!’ అన్నారు అమాయకంగా అంజలీదేవి.

అక్కినేనికి బహుమతి!

కూలీ’ షూటింగులో అమితాబ్ బచ్చన్ బల్ల అంచుకి గుద్దుకుని ప్రమాదం పాల
య్యారు. తర్వాత కోలుకుని అదే స్థాయిలో ఫైట్స్ చేస్తూ వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు విషయంలో అలా జరగలేదు. ఆయనకి  ‘సువర్ణ సుందరి’ రైట్ ఎబౌట్ టర్న్ కి శాస్వత చెక్ పెట్టేసింది. కుడివైపు నుంచి ఎడమకి చుట్టూ తిరగలేని పరిస్థితి ఇప్పటికీ వెన్నాడుతోంది !

‘సువర్ణ సుందరి’ లో కోయ వాళ్ళతో ఒక పోరాట దృశ్యంలో పైనుంచి దూకాలి అక్కినేని. అలా దూకినప్పుడు కాలు మడత పడిపోయింది. దాంతో హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. దీంతో తను నటిస్తున్న వేరే సినిమా  ‘మాయాబజార్’ విడుదల మూడు నెలలు ఆలస్య మైపోయింది.  అప్పటినుంచీ అక్కినేని ఒక్క ‘ప్రేమనగర్’ మినహా ఏ సినిమా పాటలోనైనా ఆ స్టెప్స్ వేసినప్పుడు రైట్ అబౌట్ టర్న్ ఉండదు. ఇదీ ‘ఆయనకి ‘సువర్ణ సుందరి’  ఇచ్చిన బహుమానం.

హిందీ రీమేక్ లో నటించమని అక్కినేనిని కోరినప్పుడు ఒప్పుకోలేదు. తెలుగులోనే తనది ప్రాముఖ్యం లేని పాత్ర,  ఇంకా హిందీలో ఎందుకన్నారు. బలవంత పెడితే సరేననక తప్పలేదు. అదే ఆయన జీవితంలో నటించిన ఏకైక హిందీ సినిమా అయింది. ఇదికాదు విశేషం- హిందీలో తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. చిన్నప్పుడు హిందీ విశారద పరీక్ష పాసవడం వల్లే  ఇది సాధ్యమైంది.  అలాగే అంజలీ దేవి కూడా తన పాత్రకి  తనే హిందీ డబ్బింగ్ చెప్పుకున్నారు.


సికిందర్
(మార్చి 2010, ‘సాక్షి’ కోసం)


    పాటలంటే మాటలా!


    హాయి హయిగా ఆమని సాగే '  ఘంటసాల – జిక్కి - దీని హిందీ రూపం ‘కుహూ కుహూ బోలె కోయలియా’  లతా- రఫీ  పాడారు.  సంగీత దర్శకుడిగా ఆదినారాయణ రావుని అజరామరుడిగా చేసిన  పాటలు... రాగమాలికలో - అంటే  హంసానందిని, బహార్, యమన్, కానడ అనే నాల్గు రాగాల్లో ప్రయోగాత్మకంగా స్వర పరచిన ఈ పాట ఉత్తర, దక్షిణ తేడాల్ని చెరిపేసింది.

     బాంబే జర్నలిస్టుల సంఘం  ఆదినరాయనరావుని ఉత్తమ జాతీయ సంగీత దర్శకుడి అవార్డుతో సత్కరించింది. ఇవాళ  ఇళయరాజా, ఏ.ఆర్.  రెహ్మాన్ లకి జాతీయ స్థాయిలో దక్కుతున్న గౌరవాల గురించి ఎంతో ప్రచారం జరుగుతోంది గానీ, దక్షిణ భారతం నుంచి ఏనాడో ఆదినారాయణరావు సాధించిన ఈ ఘనత రికార్డయి వుంది. ఆదినారాయణరావు ట్యూన్స్ ని ఎక్కడ నుంచీ తీసుకుంటాడో  తెలీదు. ఎలా మౌల్ద్ చేస్తాడో అంతకన్నా తెలీదు. .కాస్త మహారాష్ట్ర టచ్ ఉంటుందంతే.  అందుకే ‘భక్త తుకారాం’ పాటలు కూడా మరాఠా నేపధ్యానికి అంతగా అతికిపోయాయి.

   ఇక ‘రండి రండి' పాటలో అంజలీ దేవి చీరకట్టు లతామంగేష్కర్ కి  ఎంత ముచ్చటో.   ఆ పాటకి ఆమె బాగా ఇష్టమై పోయింది.   హిందీ పాటల రికార్డింగ్ పూర్తయ్యాక, అప్పట్లో లతా తీసుకుంటున్న పారితోషికం పాటకి 40 వేల చొప్పున వేసి, అంజలీ దేవి –ఆదినారాయనరావులు అందించబోతే తీసుకోలేదు.  'ఇంత  అద్భుతమైన  సంగీతానికి ఎలా వెల  కట్టగలం, ఈ పాటలకి అసలేమీ తీసుకోకుండా పాడాలి. అలా చేస్తే భవిష్యత్తులో ఇబ్బందు లొస్తాయి కాబట్టి, పాటకి రెండు వేల చొప్పున మాత్రం ఇవ్వండి' అని లతా అనేసరికి కళ్ళు తిరిగాయి అంజలీ దేవి –ఆదినారాయణరావు జంటకి..

మ్యూజికాలజిస్టు ‘రాజా’ సౌజన్యంతో