రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, సెప్టెంబర్ 2015, సోమవారం

మళ్ళీ మిడిల్ మటాషే !

రచన- దర్శకత్వం : తేజ
తారాగణం : దిలీప్, దక్ష, చస్వ, సీమా, ఎం.వి.ఎస్. హరనాథ రావు, అభిరాం తదితరులు
సంగీతం : కళ్యాణ్ కోడూరి, ఛాయాగ్రహణం : దీపక్ భగవంత్
బ్యానర్ : శ్రీ రంజిత్ మూవీస్,  నిర్మాత: కె. ఎల్. దామోదర ప్రసాద్
విడుదల : 11 సెప్టెంబర్, 2015
***

       ఒకప్పటి ట్రెండ్ సెట్టర్ ఇంకా తన పాత ఫార్ములానే  రీసైక్లింగ్ చేస్తూ ఆ రింగులోంచి బయటికి రావడం లేదు. గతంలో ఎప్పుడో తను తీసిన ‘జయం’ (2003),  ‘నువ్వు నేను’ ( 2001) అనే రెండు హిట్సే  ఆయన సినిమాలు  తీయడానికి ముడిసరుకు అవుతున్నాయి. ప్రేమకథలు ఎదిగి వచ్చాయి. ప్రేమ కథల దర్శకుడు మాత్రం ఎదగడం లేదు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత, పన్నెండేళ్ళ నాటి తన పాత ‘జయం’ ని రీసైక్లింగ్ చేసి, 4 G స్పీడుకి అప్ డేట్ అవుతున్న నేటి యువ ప్రేక్షకులకి మళ్ళీ వడ్డించే దుస్సాహసం చేశారు. దీంతో తనకీ తన ప్రేమ కథల లక్ష్యిత ప్రేక్షకులకీ జనరేషన్ గ్యాప్ ఎంతుందో తెలిసిపోతోంది. అలాంటప్పుడు కాలం చెల్లిన  తాజా ప్రేమకథ ‘హోరాహోరీ’ ని తీసుకుని బాక్సాఫీసుతో ఎంత బాహాబాహీకి దిగితే మాత్రం ఏం లాభం.

          కరకాల వినోదమాధ్యమాలు బహుముఖాలుగా విస్తరించాయి. వినోదించడానికి సినిమా అనేది చిట్ట చివరి ఆప్షన్ అయిపోయింది. గ్లోబలైజేషన్ పుణ్యమాని ఇది చాలా ఆందోళనకర పరిణామం. ఆ మాధ్యమాలన్నిటినీ దాటుకుని ప్రేక్షకులు థియేటర్లకి కదిలిరావాలంటే ఆ మాధ్యమాలకి మించిన వినోదం ఏదో సినిమాల్లో వుండి తీరాలి. ఇది గమనించకుండా కేవలం బ్రాండ్ నేములు, గతకాలపు గ్రాఫులూ చూసుకుని సినిమాలు చుట్టేస్తే ఫలితాలు చాలా బాధాకరంగా వుంటాయి.  

          బ్రాండ్ నేములూ, గత కాలపు గ్రాఫులూ రీసైక్లింగ్స్ తో నిలబడతాయా? 24x7 వర్తమాన కాలంతో కనెక్ట్ అవడానికి ప్రయత్నిస్తున్నప్పుడే నిలబడతాయోమో ఆలోచించ కూడదా? దర్శకుడు తేజ దీన్నే అందుకోలేక పోతున్నారు.

          ‘హోరాహోరీ’ తో అసలు ఒక సినిమాకి ఉండాల్సిన కనీస లక్షణాలని కూడా మర్చిపోయారు. చాలా విచారకరం. ఒక విజయవంతమైన దర్శకుడి పట్ల ప్రేక్షకులకి క్రేజ్ ఎలా ఏర్పడుతుందో, అలా ఔత్సాహిక-వర్ధమాన దర్శకులకీ ఒకలాంటి  భక్తి భావం ఏర్పడుతుంది. తననుంచి సక్సెస్ మంత్రా నేర్చుకోవాలను కుంటారు, తన క్రాఫ్ట్ తో ఎడ్యుకేట్ అవాలనుకుంటారు. తన బాట అనుసరించాలనుకుంటారు. అలా మార్గదర్శకంగా ఉండాల్సిన దర్శకుడు, తిరోగమించి గతకాలపు విజయాల్లో తలదాచుకుంటే వాళ్ళని చాలా నష్టపర్చిన వాడవుతాడు. రంగంలో ఉండాలనుకున్నప్పుడు రింగుల్లో వుండిపోకుండా - స్పీడ్ బోటులో దూసుకెళ్ళాల్సిందే !


                                                     ***
ఎవరి కథ?
       బసవ ( చస్వా) అనే వాడు ఓ కాంట్రాక్ట్ కిల్లర్. ఓ హత్య కేసులో ఎసిపి ( అభిరాం) కి లంచమిచ్చి సేఫ్ అవుతాడు. ఎసిపికి ఆ డబ్బు చెల్లెలు మైథిలి ( దక్ష) పెళ్ళికి అవసరం. ఇతనూ ఇతడి సీఐ తండ్రీ ( డీఎస్ రావు)  లంచగొండులు. మైథిలి పెళ్ళికి వచ్చిన బసవ మైథిలి మీద మనసు పడి పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకుని చంపించేస్తాడు. పెళ్లి చేసుకుంటానని మైథిలి వెంట పడతాడు. ఎసిపి వేరే సంబంధం చూస్తే, ఆ కాబోయే పెళ్లి కొడుకునీ చంపేస్తాడు. దీంతో మతి స్థిమితం కోల్పోతుంది మైథిలి. 

          స్థలమార్పు కోసం ఆమెని కర్ణాటక లోని ఆగుంబే కి పంపిస్తారు. ఎవరితోనూ మాటాడకుండా పిచ్చిదానిలా శూన్యంలోకి చూస్తూండే మైథిలి పెళ్లి గురించి వినపడ్డా, పెళ్లి దృశ్యం కనపడ్డా హిస్టీరికల్ గా మారిపోతుంది. వెంటనే ఒక మాత్ర వేసి కంట్రోల్ చేయాలి.

           ఊళ్లోనే ఒక నెట్ సెంటర్ నడుపుకునే స్కంధ( దిలీప్) అనే కుర్రాడుంటాడు. ఇతడికి నానమ్మ (సీమా), ఆంటీ ( రోహిణి) వుంటారు. ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఒకరు చేస్తున్న వ్యాపారం మరొకరు చేయకూడదన్న కట్టుబాటు వుంటుంది. నెట్ సెంటర్ పెట్టి స్కంధ దీన్ని ఉల్లంఘించాడని పక్క గ్రామం వాళ్ళు గొడవ కొస్తారు. అప్పుడు ఒక ఒప్పందం చేసుకుంటారు. ఏ  నెట్  సెంటర్ స్పీడ్ టైపింగ్ లో గెలుస్తుందో, ఆ నెట్ సెంటర్ నడుపుకోవాలని. ఈ పోటీ లు మొదలవుతాయి. ఈ లోగా స్కంధ కి మైథిలి పరిచయమవుతుంది. అతడి కారణంగానే మాటా డ్డం మొదలెడుతుంది. టైపింగ్ లో ఆమె నేర్పు చూసి పోటీల్లో పాల్గొనమని ఒప్పిస్తాడు. ఈ పోటీలు కొన్ని తడవలుగా జరుగుతాయి. ఈ క్రమంలో ఆమెతో ప్రేమలో పడ్డ స్కంధ కి సమస్య లొస్తాయి. 

          అప్పుడు బసవ ఆ ఊళ్లోనే ఒక కాంట్రాక్టు కిల్లింగ్ ని ఒప్పుకుని వస్తాడు. ఇక్కడ స్కంధ సమస్య తెలుసుకుంటాడు. స్కంధ తో బసవకి పూర్వ పరిచయముంటుంది. తను ప్రేమించిన అమాయి పెద్దలు ఒప్పుకోవడంలేదని స్కంధ చెప్పేసరికి రంగంలోకి దిగుతాడు బసవ. ఇలా స్కంధ ప్రేమించిన అమ్మాయే తను ప్రేమిస్తున్నఅమ్మాయని తెలీని బసవ, బసవ ప్రేమిస్తున్న  ఆమ్మాయినే తను ప్రేమించాడని తెలీని స్కంధ ల మధ్య ఆట మొదలవుతుంది. ఇదెప్పుడు బయటపడి ఏం జరిగిందనేది మిగతా కథ.


          కథ ఇలా చెప్పుకుంటూ పోతే కథానాయకుడెవరో తెలుసిపోతోంది గానీ, సినిమా చూస్తే మాత్రం ఇదెవరి కథగా తేలుతుందో చెప్పుకుంటే అంత బావుండదు.. కమర్షియల్ సినిమా ప్రాథమిక లక్షణం కన్పించదు.

ఎవరెలా చేశారు.
       కొత్త హీరో హీరోయిన్లు దిలీప్, దక్షల పాత్రలూ వాళ్ళ నటనలూ ఆకట్టుకునే ప్రసక్తి లేదు.  దక్ష ది ఫోటోజెనిక్ ఫేసు కాదు, వాయిసూ హీరోయిన్ కుండాల్సిన వాయిస్ కాదు.  ఎప్పుడూ బోలెడు మంది ఆర్టిస్టులతో నిండిపోయే సీన్లలో దిలీప్ కన్పించకుండానే పోతాడు. బ్యాడ్ ప్రెజెంటేషన్ బారిన పడి అతడేమిటో, అతడిలో విషయమేమిటో కూడా సరీగ్గా రిజిస్టర్ చేసుకోలేకపోతాడు. ఈ ఇద్దరూ యూత్ అప్పీల్ కి సరిపోక, పాత్రలూ పండక అనామకంగా మిగిలిపోతారు.  

          ఏసీపీ గా వేసిన అభిరాం మరో మైనస్. ఏసీపీ లెవెలే కన్పించదు. విలన్ గా వేసిన చస్వా- విలన్ల పక్కన వుండే అనుచరుడిలా ఉంటాడు. పాత్రకి సరిపోయే స్థాయి లేకపోగా, చిల్లర కామెడీ చేస్తాడు. 

          తేజ లోని  విజువల్, క్రియేటివ్ సెన్సుల్ని  దిగువస్థాయికి తీసికెళ్ళిన ఈ సినిమాలో బావున్నదల్లా రెండే- కళ్యాణ్  కోడూరి సంగీతం, దీపక్ భగవంత్ కెమెరాపనితనం మాత్రమే. పాటలకి పెద్దాడ మూర్తి రాసిన గీతాలు బావున్నాయి. జునైద్ ఎడిటింగ్ మళ్ళీ కొన్ని తప్పుల్ని సవరించ లేకపోయింది. ఈ సినిమా ముప్పాతిక కథ కర్ణాటకలోని అధిక వర్ష పాతముండే - అస్తమానం వర్షం పడుతూనే  వుండే గ్రామం ఆగుంబే లో జరుగుతుంది. అయితే తేజ తీసినప్పుడు కిటికీ లోంచి చూపిస్తే వర్షం పడుతూంటుంది, అదే కెమెరాని ఇటు పాన్ చేసి తలుపు అవతలకి చూపిస్తే,  బయట చక్కటి ఎండ కాస్తూంటుంది.  హీరోయిన్ తో ఎసిపి మాట్లాడుతూంటే వర్షం పడుతూంటుంది, అదే హీరోయిన్ వున్న వైపు చుక్క వర్షం పడని ఎర్రటి ఎండ వుంటుంది.  కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ చాలా వున్నాయి.  

          సినిమా ఓపెనింగే తేజ అలసత్వాన్ని పట్టిస్తుంది. సిటీ నడి సెంటర్లో గొడ్డలితో నరికి భార్యా భర్తల్ని విలన్ చంపుతోంటే, చంపి చాలా నింపాదిగా అన్నీ సర్దుకుని వెళ్లిపోతూంటే, జనమంతా  చుట్టూ చేరి అదేదో గారడీ ప్రదర్శన అన్నట్టుగా చూస్తూంటారు- అది గారడీ ప్రదర్శనా? అతనలా మర్డర్లు చేస్తూంటే చుట్టు  పక్కల ఎవరూ లేకుండా భయంతోనైనా పారిపోవాలి, లేదా తెగించి వాణ్ణి  పట్టుకుని పోలీసులకైనా అప్పగించాలి- ఇదేమీ చేయకుండా, గిరి గీసుకుని చుట్టూ నిలబడి తమాషా చూస్తూంటారు. ఎవరూ ఒక్క ఫోటో- ఒక్క వీడియో కూడా తీసి అప్ లోడ్ చేయరా ఈ కాలంలో? 

స్క్రీన్ ప్లే సంగతులు

   ఇది మరో మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అని చెప్పడానికి చాలా...బాధేస్తోంది. సినిమా నిడివి రెండు గంటలా నలభై నిమిషాలు(!) వుంటే, ఒక్క బిగినింగ్ విభాగమే రెండుంపావు గంటలు   తినేస్తుంది! అప్పుడు మాత్రమే సినిమాకి వెన్నెముక అనదగిన, సినిమాలో యాభై శాతం నిడివి ఉండాల్సిన, మిడిల్ ప్రారంభమవుతుంది!

              మిడిల్ తో బాటు ఎండ్ కూడా మిగిలిన అరగంట వ్యవధిలోనే ఇరుక్కుంటాయి. స్క్రీన్ ప్లే ఇలా ఉన్నాక, సినిమాని ఎంత ప్రమోట్ చేసుకుంటే ఏం లాభం. అమ్మాల్సిన సరుకు సినిమానా, స్క్రీన్ ప్లేనా? అమాయక ప్రేక్షకుల మీద ఎలాటి స్క్రీన్ ప్లేలు పడేస్తున్నారో సరిచూసుకుని ప్రమోట్ చేసుకోవాలా, వద్దా? నీ స్క్రీన్ ప్లే లో థర్డ్ యాక్ట్ బాగాలేదయ్యా, నీ స్క్రీన్ ప్లే లో ఫస్ట్ యాక్ట్ ప్లాట్ పాయింట్ ఏమిటి? - అని హాలీవుడ్ నిర్మాతలు ప్రొఫెషనల్ గా అడిగే లాంటి కల్చర్ రానంతవరకూ తెలుగు సినిమాలకి మోక్షం లేదు. తొంభై శాతం ఫ్లాపుల రికార్డు కొనసాగుతూనే వుంటుంది

          స్ట్రక్చర్ స్పృహ వుండని ఇలాటి కథా కథనాలకి పాల్పడే కంటే, అసలు స్ట్రక్చరే వుండని గాథలుతయారు చేసుకోవడానికి సిద్ధపడితే మంచిదేమో.

          ఆర్ట్ సినిమాలు తీయని టాలీవుడ్ మీద విధి ఇలా పగ తీర్చుకుంటోందేమో ఒకవేళ. బిగ్ హీరోలతో, భారీ బడ్జెట్లతో తీస్తున్నవి కూడా స్ట్రక్చర్ పరంగా ఆర్ట్ సినిమాలేనని తెలీకనే తీసేయడం  విధి చేయు వింతేనేమో. కానీ ఆత్రేయ రాసినట్టు, ఇక్కడ ఇది మతిలేని చేష్ఠమాత్రం కాదు-తను చేయాల్సిన పని కరెక్టుగానే చేసుకుపోతోంది విధి. ఎమర్సన్ అన్నట్టు విధి ఎప్పుడూ గ్రేట్ లెవెలర్- హెచ్చు తగ్గుల్ని సమానం చేసేస్తుంది.  

           స్ట్రక్చరూ వుండని పాసివ్ పాత్రల గాథలేఆర్ట్ సినిమాలు. రాసుకుంటున్న కథలకి స్ట్రక్చర్ ఉండక, వున్నా హీరో పాత్ర పాసివ్ గా మారిపోయి- అట్టహాసంగా తీస్తున్నవినిజానికి బిగ్ బడ్జెట్ల ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలే.

***
   అందుకని తమ వల్ల కాదని తేలిపోయిన కథలకి బదులు,  అసలే స్ట్రక్చరూ వుండని, సులభంగా తయారు చేసుకోగల  ‘గాథలు’ రాసుకుంటే గొడవే వుండదేమో.   ‘గాడ్ ఫాదర్’ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా కుమార్తె, సోఫియా కపోలా దర్శకత్వం వహించి ఆస్కార్ అవార్డు కూడా పొందిన ‘సమ్ వేర్’ (2010) అనే సినిమాకి ఏ స్ట్రక్చరూ వుండదు. కారణం అది ‘గాథ’ కాబట్టి. గాథ (tale) కీ,  కథ(story) కీ తేడా గురించి గతంలో కొన్ని సార్లు చెప్పుకున్నాం. కథ ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తుంది, గాథ స్టేట్ మెంట్ ని మాత్రమే ఇస్తుంది. కథలో పాత్ర యాక్టివ్ గా వుంటుంది, గాథలో పాసివ్ గా వుంటుంది. కథ కమర్షియల్ సినిమాకి పనికొస్తుంది, గాథ పనికి రాదు. అయినా శ్రమలేకుండా పని జరిగిపోయే గాథలే రాసుకోవాలనుకుంటే, పైన ఉదాహరించిన ‘సమ్ వేర్’ ని పరిశీలించుకోవచ్చు. అనంతరం అవార్డులకి పంపుకోవచ్చు. అసలు స్క్రీన్ ప్లేల  పరంగా ఫ్లాపయిన సినిమాలన్నిటినీ అవార్డులకి పంపుకోవచ్చు. వాటికి అక్కడే తప్ప, ప్రేక్షకుల మధ్య స్థానం లేదు.  

          దర్శకుడు తేజ చాలా విచిత్రంగా స్ట్రక్చర్ ని భంగపర్చడమే గాక, హీరో (కథానాయకుడు) కి కొత్త నిర్వచనమిచ్చారు. విచిత్రంగా అని అనడమెందుకంటే- తను తీసిన సూపర్ హిట్స్ ‘జయం’, ‘నువ్వునేను’ ల  బలమైన స్ట్రక్చర్స్ ని తనే మర్చిపోయినందుకు.

          ఈ రెండూ అరగంటలో బిగినింగ్ ని ముగించుకుని, చక్కగా మిడిల్లో పడతాయి. సార్వజనీన త్రీ యాక్ట్  స్ట్రక్చర్ కి లోబడి వుంటాయి. 

          అలాటిది ‘హోరాహోరీ’ తో - పైన చెప్పుకున్నట్టు, నేటి యువ ప్రేక్షకులతో ఆయన కనెక్ట్ కాలేకపోవడమే కాదు, ఏకంగా స్ట్రక్చర్ తోనే కనెక్షన్ కోల్పోయారు. ఇది డబుల్ ట్రబుల్. మూడో ట్రబుల్ - తన సినిమాకి హీరో ఎవరో కూడా మర్చిపోవడం!


***
     People have forgotten how to tell a story. Stories don't have a middle or an end any more. They usually have a beginning that never stops beginning- Steven Spielberg …ఇలా పదేపదే ప్రస్తావించుకోవాల్సి వస్తోంది!

   beginning that never stops beginning...!  అంటే ఏమిటో ఒకసారి శివాజీ గణేశన్ బాగా వివరించారు. పడవేసుకుని పోతున్నవాడు తెడ్డు వేసుకుంటూ పోతూనే ఉంటాడు...పోతూనే ఉంటాడు..సినిమా ఎండ్ దాకా అలా పోతూనే ఉంటాడు- అదే ఆర్ట్ సినిమా-అని! ఇంతకంటే అవమానకరమైన ఎత్తిపొడుపు వుండదు కమర్షియల్ సినిమాకి!


          తేజ సినిమాలో కూడా ప్రారంభమైన బిగినింగ్ పోతూనే వుంటుంది..పోతూనే వుంటుంది..ఆయన తెడ్డు వేసుకుని బిగినింగ్ తో పోతూనే వుంటారు..అలా వెళ్లి పోతూనే వుంటారు..హైలెస్సా అనుకుంటూ బలప్రయోగం చేసి లాగుతూనే వుంటారు.. లాగుతూనే వుంటారు..క్లయిమాక్స్ దాకా లాక్కెళ్ళి, అప్పుడు హమ్మయ్యా అని పూర్తి సంతృప్తి చెంది, బిగినింగ్ ని  భద్రంగా వదిలేస్తారు. ఇంత కష్ట పడి సినిమా సాంతం బిగినింగే రాసుకుంటే ఇది స్క్రీన్ ప్లే కాదనడం పాపం.


***
ఉండాల్సిన స్ట్రక్చర్..  
హోరా హోరీ’ లో ఉన్న స్ట్రక్చర్..

       పై రెండు చిత్ర పటాలని చూస్తే ఎలా ఉండాల్సిన స్ట్రక్చర్ ‘హోరా హరీ’ లో ఎలా అయిపోయిందో తెలుస్తుంది. ‘హోరాహోరీ’ స్ట్రక్చర్ లో బిగినింగ్ చేసిన ర్యాగింగ్ దెబ్బకి, మిడిల్-ఎండ్ లు బిక్కుబుక్కుమంటూ చివరి క్లాస్ రూమ్ లో ఎలా ఇరుక్కుని కూర్చున్నాయో తెలుస్తుంది. ప్రభుత్వం కన్నుగప్పి స్క్రీన్ ప్లేల్లో కూడా ఇలా చేస్తున్న ర్యాగింగ్ ని ఎక్స్ పోజ్ చేయాల్సిందే!

          ముందు బిగినింగ్ విభాగం ఎలా వుందో చూద్దాం..

          బిగినింగ్ లో అరగంట దాకా హీరోయిన్ వ్యవహారమే. హీరోయిన్ పెళ్లి చెడగొట్టి బెదిరించే  విలన్ ప్రయత్నాలే. దాంతో ఆమె పిచ్చిదై పోవడం, వాతావరణ మార్పు కోసం వేరే వూరికి తరలించడమూ-   అక్కడా ఫిట్స్ వస్తూ పేషంట్ గానే ఉండడమూ- పూర్తిగా హీరోయిన్ తో ఉండాల్సిన యూత్ అప్పీల్ నీ, గ్లామర్ కోషెంట్ నీ నీరుగార్చేసింది. 

          ఆమెకి రెండేసి ధమాకా లెందుకుండాలి? ఒకటుంటే సరిపోతుంది. చంపుతానని విలన్ చేస్తున్న బెదిరింపులే ఆమెకి ఎక్కువ. మళ్ళీ పిచ్చిదవడం క్యారక్టరైజేషన్ ప్రాబ్లం. ఆమెకి ప్రాణభయం ఉన్నందుకే వేరే వూరు తరలించినట్టు చూపడంలో వున్న థ్రిల్, సస్పెన్స్, ఆమెతో వుండే యూత్ అప్పీల్ వగైరా - డబుల్ ధమాకా గా మతిస్థిమితం కూడా తప్పినట్టు చూపడంలో వుండదు. దీనివల్ల కథకి ఒనగూడే ప్రయోజనం లేకపోగా, వినోద కాలక్షేపాన్నీ, రోమాంటిక్ ఫీల్ నీ  సినిమా ప్రారంభంలోనే  ఈ అరగంట సేపూ హరించి వేసినట్టయింది. 

          మతిస్థిమితం కూడా తప్పడం ఎప్పుడు అవసరమంటే, వాణ్ణి భరించీ భరించీ, ఇక భరించలేక పిచ్చెక్కి - ఒరేయ్ ఇక నువ్వు బతకవురా, రారా, రా - అని ఎదురుతిరిగి ఒక్క వేటు వేసినప్పుడు, ఆ మతి స్థిమితం కూడా తప్పడం కథకి అవసరమవుతుంది. ఒన్ క్యారక్టర్- ఒన్ సిట్యుయేషన్- ఒన్ క్యారక్టరిస్టిక్- అంతే!  డబుల్ ధమాకాతో కథ దవాఖానాకే. 

          ఈ అరగంట తర్వాత ప్రవేశించే హీరో, నెట్ సెంటర్ పోటీల కోసం స్పీడ్ టైపింగ్ కి హీరోయిన్ ని ఒప్పించాక,  నడిపిన కథనమంతా ఇప్పటి సినిమాలకి పని కొచ్చేది కాదు. చాలా నీరస పడి పోతుంది నడుస్తున్న కథనమంతా.  ‘జయం’, ‘నువ్వునేను’ తీసిన కాలంలో యువత ఇంకా నెటిజన్లు కారు, సరీగ్గా సెల్ వాడకం దార్లు కూడా కాదు. అప్పుడు టీనేజర్లని అమాయకులుగా, ఓ చిన్న ప్రపంచంలో జీవించే లేత పిండాలుగా చూపిస్తే సరిపోయింది. ఇప్పుడు సరిపోతుందా? రూరల్ యూత్ అయినా కనెక్ట్ అవుతారా?

          అసలు నెట్ సెంటర్ కి వచ్చే అమ్మాయిలూ అబ్బాయిలు టైపింగ్ నేర్చుకోవడానికి రావడ మేమిటో అర్ధంగాదు. ఇక హీరో ప్రేమని వ్యక్తం చేశాడు, హీరోయిన్ లాగి కొట్టింది- హీరో వెళ్లి రైలు పట్టాల మీద పడుకున్నాడు.

          ఈ పడుకోవడం కూడా యితరులు చూసేట్టు చూసుకుని మరీ డ్రమెటిగ్గా పడుకున్నాడు. ఎదురుగానే ఇల్లుంది. అంటే ఏంటి అతడి  ఉద్దేశం-  చావు నటిద్దామనా? ఆ ఇంట్లో ఎవరో చూసి కాపాడితే హీరోయిన్ కరిగిపోతుందనా? అసలది రైలొచ్చే టైమేనా? ఇది కామెడీ సినిమా అయితే ఇలా బాగానే వుంటుంది, కానీ ఒక  సీరియస్ పరిస్థితిని ఇలా కామెడీగా చూడాల్సి వస్తోంది. ఇంతలో  ఓ చిన్న కుర్రాడు ఆ ఇంట్లోంచి రివ్వున రానే వచ్చాడు, వచ్చేసి సీను చూసేసి, హీరోయిన్ కి చెప్పేందుకు తుర్రుమన్నాడు. హీరో చచ్చాడు! - ‘ఒరే ముందు మీ ఇంట్లో చెప్పి కాపాడరా, రైలొచ్చేస్తుంది- ఆ హీరోయిన్ కి తర్వాత చెప్పేడ్చినా  నా ఎక్స్ పెరిమెంట్ సక్సెస్ అవుతుంది’ - అని అరవాలి హీరో. కుర్రాడు కూడా, తానలా హీరోయిన్ దగ్గరికి తుర్రుమంటే, ఇలా సర్రుమని ట్రైనొచ్చి హీరో మీదికి ఎక్కేస్తే? - అని ఆలోచించలేదు వాడి తెలివికి! 

          ఇదంతా ఇంటర్వెల్ ఘట్టం. ఆ సమయంలో విలన్ వచ్చి కాపాడి కోప్పడతాడు. పక్క కెళ్ళి ఒకణ్ణి మర్డర్ చేస్తాడు. అట్నుంచి హీరోయిన్ వస్తూంటుంది. హీరోని కలుసుకుంటుంది. ‘చస్తావా? చచ్చిపోతావా?’ అని ఎడాపెడా లెంపకాయలు కొట్టి- ‘నన్ను చేసుకుంటే నీకు ప్రమాదమనే అప్పుడు రిజెక్ట్ చేసి కొట్టాను’ - అని సంజాయిషీ చెప్పుకుంటుంది. 

          ఇది చాలా కీలకమైన సన్నివేశం! ఇక్కడే హీరోయిన్ సమస్య బయటపడి, ఆ సమస్యతో హీరో సంఘర్షణ మొదలయ్యే- బిగినింగ్ ముగిసి చక్కగా మిడిల్ ప్రారంభమయ్యే ఘట్టం! కానీ ఇదేం  జరగదు..

          ఆమె అలా అనగానే  హీరో ఎలర్ట్ అవ్వాలి నిజానికి. తను ఈమెని చేసుకుంటే తనకే ప్రమాదమని ఎందుకన్నది అనైనా మానవ సహజ కుతూహలంతో అడగాలి. అసలామె సమస్యే మిటో, ఆందోళన దేనికో అప్పుడైనా అడిగి తెలుసుకోవాలి. అదేమీ చెయ్యడు. అటు పక్క మర్డర్ చేసిన విలన్ రక్తం తుడుచుకుంటూ ఉంటాడు. వీళ్ళు చూడరు, వీళ్ళని వాడూ చూడడు. ఎవరి దారిని వాళ్ళు వెళ్లిపోతూంటే ఇంటర్వెల్. ఇంతసేపూ అటు వెనకాల పట్టాల మీదే ట్రైనే వెళ్ళదు.
 
          నిజంగానే ఇక్కడ బిగినింగ్ ముగిసి కథ సెటప్ అయిందా? ఇక్కడ్నించీ మిడిల్ సాగడానికి సమస్య ఏర్పాటయ్యిందా? 

          ఎవరికి  సమస్య ఏర్పడాలి? కథానాయకుడికి ఏర్పడాలి. కథానాయకుడు హీరోనే అనుకుంటున్నాం. ఇతను చూస్తే ఇంతవరకూ హీరో లక్షణాలేవీ కనబరచలేదు. హీరోయిన్ కాదన్నదని పట్టాల మీద పడుకున్నాడు. పరిస్థితి తీవ్రత గురించి హీరోయిన్ హింట్ ఇచ్చినా పట్టించుకోలేదు. మరి ఇతడి గోల్ ఏమిటి? కనుక గోల్ లేదు కాబట్టి ఇతను ఈ కథకి కథానాయకుడు కాదు. ఎంత పాసివ్ హీరో క్యారక్టర్లయినా కథానాయకులు గానే వుంటాయి సినిమాల్లో. అలా పాసివ్ హీరోగా వున్న ఇతను కూడా కథానాయకుడు కానట్టు పాత్ర చిత్రణ, కథనం నడిచాయి. ఒక సినిమాలో హీరో కాక పోతే ఇంకెవరు కథా నాయకులవుతారు? అలాంటి సినిమాలుంటాయా? 

          హీరోయిన్ సంగతి చూస్తే, ఈమె విలన్ భయంతో బాటు- అటు హీరోని ప్రేమించడానికీ అన్న భయంతో బిక్కుబుక్కు మనే పాత్ర. ఈమెకి ఈ సమస్యలున్నాయి గానీ -పరిష్కరించుకునే తెగువ ( గోల్) లేదు. కనుక ఈమే కథానాయకురాలు కాదు.

          ఇక మిగిలింది విలన్. ఇతనే మన గ్రేట్ హీరో! సినిమా మొదలెట్టింది లగాయతూ హీరోయిన్ కోసం పడి చచ్చిపోతూ- మర్డర్లు చేసేస్తూ- ఆమెని వెతుక్కుంటూ-పిచ్చోడిలా తిరుగుతున్నాడు. ఇతడికి తిరుగులేని గోల్ వుంది- ఈ బిగినింగ్ లోనే కాదు- మిడిల్- ఎండ్ దాకా అన్నిటా ఈ గోల్ కోసం రగిలిపోతూంటాడు. కాబట్టి ఈ కథకి కథానాయకుడు ఇతనే అని తేలుతోంది.

          ఈ సినిమాకి విలనే కథానాయకుడు!
          ఈ కథ విలన్ దే!
          గోల్ వున్న క్యారక్టర్ విలనే! 
          ఇంత స్క్రీన్ ప్లే బ్లండర్ తో ఒక సినిమా ఎలా తీస్తారో విచిత్రం.


***
      యినంత మాత్రాన ఈ ఇంటర్వెల్ తో బిగినింగ్ విభాగం ముగిసి మిడిల్ ప్రారంభమయి నట్టు కాదు. కథ కూడా ప్రారంభ మయినట్టు కాదు. ఇంటర్వెల్ సీన్ చాలా మిస్ లీడింగ్ సీన్. ఇక్కడ సమస్య ఏర్పాటయి నట్టే కన్పిస్తుంది కానీ ఏర్పాటు కాలేదు- ఏర్పాటయితే ఏదో ఒక పాత్ర ఎఫెక్ట్ అవ్వాలి. ఈ మైదాన ప్రాంతంలో  విలన్ - హీరోయిన్ ఎదురెదురు పడలేదు. విలన్ పొదల అవతలే ఉన్నాడని హీరోయిన్ కి తెలీదు, హీరోయినూ హీరో పొదలవతల ఉన్నారనీ విలన్ కూడా చూసుకోలేదు. హీరోయిన్ ఈ ఊళ్లోనే ఉంటోందని కూడా అప్పటికి తెలీదు. విలన్ అవతల ఉన్నాడని హీరోకి తెలిసినా- ఆ విలన్ కి,  హీరోయిన్ తో వున్న ప్రాబ్లం అసలే తెలుసు కోదల్చుకోలేదు హీరో.

          విలన్ చూసి వుంటే వెంటనే సమస్య ఏర్పాటయ్యేది-ఆ సమస్య విలన్ దే అయి దాన్ని సాధించే  క్రమంలో ఇక్కడ బిగినింగ్ ముగిసి- ఇంటర్వెల్ తర్వాత నుంచైనా మిడిల్ ప్రారంభమయ్యేది- మూడు పాత్రల మధ్య ఇంటరెస్టింగ్ ప్లేతో.

          ఇలా లేదు సెటప్. కేవలం విలన్ ఊళ్ళోకి వచ్చాడు కాబట్టి, పరోక్షంగా సమస్య క్రియేట్ అయ్యిందని ఆడియెన్స్ ఫీలవ్వాలి తప్ప, ప్రత్యక్షంగా పాత్రల మధ్య ఇంకా ఏమీ లేదు. కనుక  ఇక్కడింకా ఇంటర్వెల్ దగ్గర గంటన్నర గడిచినా, ఇంకా బిగినింగ్ ముగియలేదు, సమస్య- సంఘర్షణ ఏర్పాటుతో కథ ప్రారంభమూ  కాలేదు.


***
లాజోస్ ఎగ్రి 
     కథలన్నీ సంఘర్షణా యుతమైనవే. సంఘర్షణ లేక పాత్ర లేదు, పాత్రలేక చర్యల్లేవు, చర్యల్లేక  కథలేదు, కథ లేక స్క్రీన్ ప్లేనూ లేదు- సిడ్ ఫీల్డ్. 
          అంటే సంఘర్షణ మొదలవనిది కథ మొదలవనట్టే. సంఘర్షణ బిగినింగ్ లో మొదలవదు. బిగినింగ్ ముగిసేచోట సంఘర్షణ మొదలవుతుంది. అక్కడ అప్పుడు స్క్రీన్ ప్లే మిడిల్ లో పడి కథ మొదలవుతుంది. కాబట్టి ‘హోరాహోరీ’ లో పైన చెప్పుకున్నట్టు, ఇంటర్వెల్ దగ్గర కూడా సంఘర్షణ పుట్ట లేదంటే, బిగినింగ్ ఇంకా ముగిసిపోనట్టే. అంటే సెకండాఫ్ లో కూడా బిగినింగ్ అలా కొనసాగుతూనే ఉంటుందన్న మాట!  సంఘర్షణ ఎప్పుడు పుడుతుందో తెలీదు, కథ ఎప్పుడు ప్రారంభ మవుతుందో తెలీదు. ఈ నడుస్తున్నదంతా అవధులు దాటిన ఉపోద్ఘాతమే! ఉపోద్ఘాతం కథ వుతుందా?

          చాలా విచారించాల్సిన విషయమేమిటంటే, ఇప్పటికీ చాలా మంది స్క్రీన్ ప్లే ప్రారంభం నుంచీ చూపించేదంతా కథే అనుకుంటున్నారు! అందుకే ఇలాటి స్క్రీన్ ప్లేలు! సంఘర్షణ
పుట్టనంత సేపూ కథే కాదు- ఈ సంఘర్షణ గురించి- లాజోస్ ఎగ్రి  (1888 – 1967)  రాసిన ‘ది ఆర్ట్ ఆఫ్ డ్రమెటిక్ రైటింగ్’ అన్న ప్రసిద్ధ గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు  : ఏమీ కోరుకోని వ్యక్తినుంచి, తనకేం కావాలో తెలీని వ్యక్తి  నుంచీ సంఘర్షణని ఆశించలేం...కథలో నిర్ణయం తీసుకోలేని పాత్రలు స్తబ్దుగా ఉండిపోయే సంఘర్షణని సృష్టిస్తాయి. సంఘర్షణ పుట్టే పరిస్థితులు ఏర్పడినా పాత్రలు ఉపేక్షిస్తాయి...ఏ డైలాగూ, అదెంత బలంగా ఉన్నప్పటికీ, అది సంఘర్షణకి కారణం కానంత వరకూ కథ కూడా పుట్టదు. ఒక్క సంఘర్షణ మాత్రమే మరిన్ని సంఘర్షణలని పుట్టించ గల్గుతుంది. తొలి సంఘర్షణాత్మక పరిస్థితి- పాత్రకి తన లక్ష్యాన్ని(గోల్ ని) తను సాధించుకోవాలన్న స్పృహ కలగనంతవరకూ ఏర్పడదు..

          సరీగ్గా ఇది  ‘హోరాహోరీ’ ఇంటర్వెల్ సీనుకి వర్తిస్తుంది.  పైన వివరించుకున్నట్టు, హీరో ఏం కోరుకుంటున్నాడో తెలీదు. హీరోయిన్ ని గెల్చుకోవాలనుకుంటున్నాడా, చచ్చిపోవా లనుకుంటున్నాడా తెలీదు. ఇంటర్వెల్ తర్వాత ఆమె పెద్దలు తన్నారు, తంతే వెళ్లి విలన్ కే  చెప్పుకున్నాడు. కాబట్టి ఇతన్నుంచీ సంఘర్షణ ని ఆశించలేం. ఇతను నిర్ణయాలు తీసుకోలేడు కాబట్టే ఇంటర్వెల్ దగ్గర పుట్టాల్సిన సంఘర్షణని పుట్టనివ్వకుండా  స్తబ్దుగా ఉండిపోయేట్టు చేశాడు.  హీరోయిన్ తో ప్రేమకి సంబంధించి ఇద్దరి మధ్యా  అసలు విషయం బయటపడే ఒక్క డైలాగూ - నోరి జారి కూడా ఇతనూ విలనూ చెప్పకపోవడం వల్ల సంఘర్షణ పుట్టలేదు. హీరో కి లక్ష్యమే లేదు కాబట్టి ఎంతసేపటికీ తొలి సంఘర్షణాత్మక పరిస్థితిని పుట్టించ లేకపోయాడు వదిలేద్దాం. హీరోయిన్ కోసం అంతగా అల్లాడుతున్న బలమైన లక్ష్యమున్న  విలన్ కూడా సంఘర్షణ పుట్టే పరిస్థితే వున్నా, దర్శకుడు చెప్పినట్టు విని, దాన్ని ఉపేక్షించడం వల్ల సంఘర్షణ నీరు గారిపోయింది. కథ పెండింగులో పడిపోయింది. విఫలమైపోయింది.


***
         సెకండాఫ్ లో బిగినింగ్ ఇంకా కొనసాగుతుంది. ఇక్కడ డ్రామా ఏమిటంటే, అసలు విషయం తెలీని హీరో-విలన్ లు జిగ్రీ దోస్తులై పోవడం..హీరో ప్రేమ కోసం విలన్ ప్లాన్లు చెప్పడం, చెప్పిన ప్లాన్లు మళ్ళీ ఆపుకోడం- (అమలైతే  విలన్ కి అసలు విషయం అప్పుడే తెలిసిపోతుందని దర్శకుడి భయం). ఆఖరికి కాలేజీ దగ్గర హీరోయిన్ని విలన్ చూసి అసలు విషయం చెప్పినప్పుడు హీరో లోలోన కుమిలిపోవడం, విలన్ ఇచ్చిన ఉంగరాన్ని అతడి తరపున హీరో తనే హీరోయిన్ కి తొడిగించడం, గోడచాటున కూర్చుని వెక్కి వెక్కి ఏడవడం, ఆ ఉంగరం హీరో ప్రేమ కానుక అనుకున్న హీరోయిన్ అన్న వచ్చేస్తున్నాడని, దాన్ని తీసేయడానికి ఇంటిల్లిపాది తో కలిసీ  విఫలయత్నం చేయడం...

          ఇలాసాగుతూ సాగుతూ ఈ బిగినింగ్ విభాగం ఇంకో ముప్పావుగంటా గడిచి- అప్పుడు అసలు విషయం విలన్ కి తెలిసి హీరోతో సంఘర్షణ పుడుతుంది. మిడిల్ ప్రారంభమై కథ మొదలవుటుంది. ఈ కథ పావుగంట మాత్రమే  నడిచి మిడిల్ అంతలోనే ముగిసిపోయి, కయిమాక్స్ తో ఎండ్ ప్రారంభమవుతుంది.

          ఇలా రెండు గంటలా నలభయి నిమిషాల సినిమాలో కథకి ఇచ్చిన సమయం ఎంత అంటే, కేవలం చిట్ట చివర పావుగంట! మిడిల్ మటాష్ తో మిగతాదంతా నస! ప్రేక్షకులు డబ్బులు చెల్లించేది స్క్రీన్ ప్లేలో యాభై శాతం కథ ( మిడిల్) కోసం!  ఇలా మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే తో సినిమా ఎలా సక్సెస్ అవుతుందనుకోవాలి?  ‘కిక్- 2’  సక్సెస్ అయిందా? 

          చివరగా, ఈ కథ పాయింటు 2013 లో విడుదలైన ‘ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబాయి దొబారా’ పాయింటూ ఒకటే. ఇందులో మాఫియాగా అక్షయ్ కుమార్, బస్తీ కుర్రాడు ఇమ్రాన్ ఖాన్ ని చేరదీసి, అనుచరుడుగా నియమించుకుంటాడు. ఇద్దరూ కలిసి సోనాక్షి సిన్హా తో ప్రేమలో పడతారు...


-సికిందర్