రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, ఆగస్టు 2014, ఆదివారం


సాంకేతికం 
ఆనాటి ఇంటర్వ్యూ..

రసాత్మక అనుభూతి కోసమే..
ఆదిల్ అదీలీ- కమలాకణ్ణన్- పీటర్ డ్రేపర్
హీరో సునీల్ పరుగుదీస్తున్నాడు... ప్రాణాలరజేత బట్టుకుని పరుగెత్తుకుంటూ వచ్చి, నిండుగా ప్రవహిస్తున్న నదిపైన కళ్లు తిరిగే ఎత్తులో ఉన్న భారీ చెక్క వంతెన మీదికొచ్చేశాడు. మధ్యలో ఆ వంతెన ప్రమాదకరంగా రెండుగా చీలిపోయి ఉంది. దాటేందుకు బల్లకట్టు మాత్రమే ఉంది. భయపడలేదు సునీల్. ఆ బల్లకట్టు మీదుగా అటు దాటేశాడు. తనని వెంటాడి వస్తున్న ముఠా సమీపించే లోగా, ఆ బల్లకట్టుని లాగేశాడు. అక్కడి కొచ్చేసిన ముఠా ఠక్కున ఆగిపోయింది... అంతే ఇక హై ఓల్టేజీ డ్రామా మొదలైంది. ముఠా ఆ గ్యాపుని దాటేసి సునీల్‌ని పట్టేసుకుంటుందా? ఎలా దాటుతుంది? దాటి సునీల్ మీద ఎలా వేటు వేస్తుంది?... తీవ్ర ఉత్కంఠ!

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మర్యాద రామన్న'లో ప్రేక్షకులకి విపరీతంగా థ్రిల్ కలిగిస్తున్న సన్నివేశమిది. గగుర్పాటు కల్గించే దృశ్యం. అయితే ఒక సందేహం. రాయలసీమలో ఏ నదిమీద ఇంత ఎత్తులో చెక్క వంతెన ఉందబ్బా? దీనికి సమాధానం మనకు ‘మకుటా వీఎఫ్ఎక్స్’ అధినేతల దగ్గర దొరుకుతుంది. కమలా కణ్ణన్- ఆదిల్ అదీలీ -పీటర్ డ్రేపర్ త్రయం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో ఆ పేరుతో ఒక సంస్థ నేర్పాటు చేసుకుని కూల్‌గా పనిచేసుకుపోతున్నారు.

వాళ్ల టెక్నికల్ బ్రిలియెన్సే ఈ అద్భుతాల్ని సృష్టించింది. 'మర్యాద రామన్న'లో మెగా వంతెనేమిటి, పాట సన్నివేశంలో కార్లు గాల్లో కెగరడమేమిటి, 'మగధీర'లో కోట, స్టేడియం నిర్మాణాలేమిటి- అన్నిచోట్లా లేనిది ఉన్నట్టు సృష్టించడమే వీళ్ల గ్రాఫిక్స్ మాయాజాలం. వీళ్ల కలయిక మాత్రం గ్రాఫిక్స్ కాదు, దైవ సంకల్పం. 'అంజి'తో కమలా కణ్ణన్‌కి ఆదిల్ పరిచయమయ్యారు. హిందీ 'గజిని' తో పీటర్ సన్నిహితుడయ్యారు. 'మగధీర' కి ఈ ఇద్దరి సహాయమూ తీసుకున్నారు కమల్. 'మగధీర' తర్వాత వాళ్లిద్దరినీ కలుపుకుని ‘మకుటా వీఎఫ్ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ స్థాపించి 'మర్యాద రామన్న' గ్రాఫిక్స్ వర్క్స్ ని చేపట్టారు.


చెన్నైకి చెందిన కమల్, బ్రిటన్ దేశస్థుడైన పీటర్ ఇద్దరూ డివిజన్ హెడ్ అండ్ చీఫ్ టెక్నీషియన్స్ గా ఉంటే, ఇరాన్ నుంచి వచ్చిన ఆదిల్ వీఎఫ్ఎక్స్ క్రియేటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈయన త్రీడీ ఆర్టిస్టుగా ప్రసిద్ధుడు. ముగ్గురికీ ఈ రంగంలో దశాబ్దాల విశేష అనుభవముంది. పీటర్ తన అనుభవాన్నంతా రంగరించి గ్రాఫిక్స్ మీద మూడు గ్రంథాలు రచించారు కూడా. అవి బ్రిటన్ యూనివర్సిటీల్లో బోధిస్తున్న వీఎఫ్ఎక్స్ కోర్సుల తీరు తెన్నులనే మార్చివేశాయట.

'మా పని సినిమా దర్శకులు కోరుకున్నది అందించడమనేది నిజమే, అయితే అంతిమంగా చూసుకుంటే ఆ ఫలితం ప్రేక్షకులతో పాటు మేమూ రసాత్మకంగా అనుభూతించేలా ఉండాలి కదా' అంటారు పీటర్.

'స్థానిక మార్కెట్‌ని గుణాత్మకంగా (అంటే సృజనాత్మకంగా) అభివృద్ధి పర్చాలన్నది కూడా మా ధ్యేయమే' అంటారు ఆదిల్. ఇక- 'మగధీర' కి మేం చేసి పెట్టిన వర్క్ ప్రేక్షకుల నుంచే కాదు, తలపండిన టెక్నీషియన్స్ నుంచి కూడా ప్రశంసల్ని పొందింది' అని ఆనందం వ్యక్తం చేశారు కమల్.


ఎక్కడి పౌరులు వీళ్లు... ఎక్కడి కొచ్చి పరిశ్రమిస్తున్నారు! తెలుగు సినిమాలు వస్తుపరంగా గ్లోబలీకరణ చెందడం కలలో మాట. అయినా గ్లోబల్ కళాకారులైన వీళ్ళు తెలుగు సినిమాల కోసం తెలుగు నేల మీద స్థిరపడి, వాటికి టెక్నికల్‌గా జవసత్వాలు కల్పించడం- అదీ పబ్లిసిటీ కోరుకోకుండా కూల్‌గా పనిచేసుకుపోవడం- తెలుగు సినిమాల అదృష్టమే. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న 'బద్రీనాథ్'కి ఈ టీమ్ పనిచేస్తోంది. ఇటీవల రజనీకాంత్ 'రోబో' వర్క్ కూడా పూర్తి చేశారు. ఏడాదికి రెండు మూడు సినిమాలకి చేస్తామని చెప్పారు కమల్. సినిమాలే గాక అంతర్జాతీయంగా వివిధ ప్రాజెక్టులు కూడా చేపట్టామన్నారు.

కమల్ అందించిన వివరాల ప్రకారం- 'మగధీర'లో కోట, స్టేడియం నిర్మాణాల్లో పదిహేను శాతం మాత్రమే కళాదర్శకుడు రవి నిర్మించినది, మిగిలినదంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ (సీజీ)తో తాము సృష్టించిందే. ఈ సెట్స్ రామోజీ ఫిలిం సిటీలో వేశారు. స్టేడియం డ్రాయింగ్ ఇటలీకి చెందిన కాన్సెప్ట్ ఆర్టిస్ట్ మార్కో రోనాల్డీ చేత వేయించుకుని, ఆదిల్ చేత త్రీడీ ఎఫెక్ట్ చేయించుకున్నారు. 


సినిమాలో కనిపించే ఉదయ్‌గఢ్ పట్టణమంతా కూడా ఆదిల్ సృష్టే. ఆదిల్‌తో 'అంజి', 'యమదొంగ', 'అరుంధతి' చిత్రాలకి కూడా కలిసి పనిచేశామని కమల్ అన్నారు. ఏ సినిమాకీ ఒక్క కంపెనీయే పూర్తి గ్రాఫిక్స్ వర్క్ చేయదనీ, రెండు మూడు సంస్థలు కలిసి పనిచేస్తాయనీ చెప్పారు. చెన్నైలో ఫ్రీలాన్స్ టెక్నీషియన్‌గా ఉన్నప్పుడు పురోగతి లేకపోయిందని, అలాంటి పరిస్థితుల్లో ఎస్.ఎస్. రాజమౌళి తనను నమ్మడమే కాకుండా తన మీద తనకు ఎంతో ఆత్మవిశ్వాసం కల్గించారని, ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు కమల్.



-సికిందర్
(ఏప్రెల్ 2011 ‘ఆంధ్రజ్యోతి’ కోసం)