రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, July 27, 2026

1433 : కొత్త చూపు!

    రిత్ర సినిమా దర్శకులకి, రచయితలకీ నిరంతరం కొత్త ప్రపంచాల తలుపులు తెరుస్తూనే వుంటుంది’ అంటాడు  స్టీవెన్ స్పీల్ బెర్గ్. ఇప్పుడు మన దేశంలో జెన్ జీ (కాక్రోచ్) ఉద్యమం ఈ పనే చేసింది. సినిమా త్రీ యాక్ట్స్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కో కొత్త ప్రపంచపు తలుపులు తెరిచింది. ఈ పని 2017 లో ‘ది మేయర్’ అనే కొరియన్ మూవీ చేసి పెట్టింది. అయితే  అది చరిత్రతో  కాదు, చరిత్ర ఆధారంగా తీసిందీ కాదు, ఫక్తు కాల్పనికం. కానీ జెన్ జీ ఉద్యమం చరిత్రయితే, ఇది కూడా ఆ పనే చేసి పెట్టింది. దీంట్లో ఇమిడి పోయిన సంఘటనలు స్క్రీన్ ప్లేలకి కొత్త ప్రపంచాన్ని-కొత్త క్రియేటివిటీనీ విప్పి చూపిస్తోంది!

        మర్షియల్ సినిమాలకి స్ట్రక్చర్ ఒకటే అయినా, దానికి విధిగా లోబడి క్రియేటివిటీలు అనేక విధాలుగా చేసుకునే స్వేచ్ఛ చాలా వుంటుంది. కానీ ఈ స్వేచ్ఛని వినియోగించుకోక పోవడం వల్ల, క్రియేటివిటీలు ఒకే మూసలో పడి, ఎవరైనా స్క్రీన్ ప్లేలు రాసేసే ఈజీ టెంప్లెట్ గా మారిపోయాయి. దీంతో స్ట్రక్చర్ అనే స్క్రీన్ ప్లే సౌధం బోసిపోయినట్టుగా తయారవుతోంది. స్ట్రక్చర్ కి సొగసులు అద్దేవి టెంప్లెట్ లోంచి బయటికి వచ్చే విభిన్న క్రియేటివిటీలే. బిగినింగ్ విభాగంలో పాత్రల పరిచయం, కథా నేపధ్యపు ఏర్పాటు, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటూ (ప్లాట్ పాయింట్ వన్) అనే నాల్గు తప్పనిసరి ఉపకరణాలు సదరు బిజినెస్ ని నిర్వహిస్తాయి సరే, ఈ బిజినెస్ లో ఒకే మూస క్రియేటివిటీ ఎందుకుండాలి? ఈ ప్రశ్న ఎవరూ వేసుకోవడం లేదు.
       
అంటే బిగినింగ్ లో హీరో హీరోయిన్లు సహా ముఖ్య పాత్రల్ని పరిచయం చేస్తూ
, అదే జానర్ కథో ఆ ఫీల్ ని నేపధ్యంలో ప్రతిఫలింపజేస్తూ, హీరో సమస్యలో ఇరుక్కునే పరిస్థితుల కల్పన చేసుకొస్తూ, చివరికి ఓ అరగంట సమయానికి హీరోని ఎదుటి పాత్రతో సమస్యలో ఇరికించి ఆ ప్లాట్ పాయింట్ వన్ సీనుతో బిగినింగ్ విభాగాన్ని ముగిస్తూ, హీరోకి గోల్ ఏర్పాటు చేసేలాంటి ఒకే తరహా క్రియేటివిటీ కదా సినిమా తర్వాత సినిమాగా చేసుకుంటూ వస్తున్నది!
       
ఇలా కాకుండా, కాస్త కొత్తదనం కోసం ప్రయత్నిస్తే, ఉదాహరణకి  
శివ బిగినింగ్ విభాగాన్నికొత్త క్రియేటివిటీతో మార్చేస్తే, ముందుగా నాగార్జున సైకిలు చైనుతో జేడీని కొట్టే దృశ్యంతో సినిమా ప్రారంభించి, ఎందుకు కొడుతున్నాడో తెలియని సస్పన్స్ సృష్టిస్తూ, ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించి సినిమాలో ఇదే  బిగినింగ్ విభాగంలో వున్న సీన్లన్నీ అదే వరసలో అదే అరగంటలో చూపించుకుంటూ వచ్చిసినిమా ప్రారంభ దృశ్యమైన నాగార్జున జేడీని కొట్టే దృశ్యంతో కలపడం లాంటి దన్నమాట. అప్పుడీ ప్రారంభ దృశ్యమే ప్లాట్ పాయింట్ వన్ అయి థ్రిల్ చేస్తుంది. అంటే ప్లాట్ పాయింట్ వన్ తో సినిమా ప్రారంభించి, ఫ్లాష్ బ్యాక్ లో బిగినింగ్ విభాగాన్నంతా చూపించుకుంటూ వచ్చి, ప్రారంభంలో సస్పెన్స్ క్రియేట్ చేసిన ప్లాట్ పాయింట్ వన్ సీనుతో ఒక వర్తులాకారంలో కలపడమన్న మాట!
        
2005 లో రియాన్ జాన్సన్ తీసిన మొట్టమొదటి హాలీవుడ్ టీనేజీ నోయర్ ‘బ్రిక్’ తో ఇదే చేశాడు. 2018 లో ‘అదుగో’ తో రవిబాబు చేసిందిదే. ఈ క్రమంలో 2017 లో కొరియన్ మూవీ ‘ది మేయర్’  తో దర్శకుడు పార్క్ ఇంజే బిగినింగ్ విభాగంతో ఇంకో కొత్త  క్రియేటివిటీని  ప్రదర్శించాడు. ఇది నేటి కాక్రోచ్ జెన్ జీ ఉద్యమ క్రమాన్ని పోలి వుంటుంది.
          
ది మేయర్ విజయవంతమైన్ కొరియన్ రాజకీయ జానర్ సినిమా. ఎన్నికల ప్రచార కథ. మేయర్ పదవికి గెలుపు కోసం పరస్పర పాపాల చిట్టా విప్పుకుని, చేయరాని పనులు చేయడం. దక్షిణ కొరియా అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థ. రాజధాని సియోల్ నగర మేయర్ గా వరసగా నాల్గోసారి ఎన్నికైతే, దేశాధ్యక్ష పదవి వచ్చి కాళ్ళమీద పడుతుంది. ఇందుకే కథలో ఇప్పుడున్న మేయర్ ఖతర్నాక్ పనులు చేస్తాడు. మేయర్ పాత్రలో ప్రముఖ కొరియన్ నటుడు చోయీ మిన్సిక్ నటించాడు. ఇంకో ముఖ్యపాత్ర ఎన్నికల ప్రచార స్పెషలిస్టుగా షిమ్ క్యుంగ్ నటించింది. బడ్జెట్ 9 మిలియన్ డాలర్లు, వసూళ్ళు  93 మిలియన్ డాలర్లు.


ఇందులో 17 సీన్లతో ఈ బిగినింగ్ విభాగం ఇరవై నిమిషాలుంటుంది.  ఈ బిగినింగ్ విభాగంలోనే కథనం అప్పుడే కథ ప్రారంభమయినట్టూ వుండీ, ప్రారంభం కానట్టూ కూడా వుంటుంది. ఇదేంట్రా బాబూ అనుకుంటాం. రూలు ప్రకారం బిగినింగ్ విభాగంలో ఎప్పుడూ కథ ప్రారంభం కాదనేది తెలిసిందే. బిగినింగ్ విభాగంలో పాత్రల పరిచయమూసమస్యకి దారి తీసే పరిస్థితులూ వగైరా ముగిసిప్లాట్ పాయింట్ వన్ వస్తే – అక్కడా  పాత్రకి ఏర్పడే ఆ సమస్య తాలూకు గోల్ తోఏ సినిమా కథయినా ప్రారంభమయినట్టు లెక్క. దీనికి ముందు బిగినింగ్ లో చూపించే కథనమంతా కథని ప్రారంభించడానికి చేసే సన్నాహాలే. అయితే ప్రస్తుత సినిమా విషయంలో ఈ సన్నాహాలూ దీంతో బాటే పరోక్షంగా కథా ప్రారంభమూ బిగినింగ్ విభాగంలోనే కన్పిస్తాయి. 

సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన లేకపోతే బిగినింగ్  విభాగంలో నడిచే దృశ్యాలు కథ ప్రారంభమైన మిడిల్ విభాగపు దృశ్యాల్లాగే కనబడతాయి. సమస్యతో సంఘర్షణ జరుగుతున్నట్టే వుంటాయి. ఈ ది మేయర్బిగినింగ్ విభాగపు దృశ్యాల్లో ప్లాట్ పాయింట్ వన్ తాలూకు సమస్యాదాని గోల్ కన్పించవు. ప్రారంభ సీను నుంచీ ఇది ఎన్నికల సందర్భమని తెలుస్తూనే వుంటుంది. కథా నేపథ్యాన్ని ఏర్పాటు చేయడం వరకే వుంటుంది. దాని విస్తరణ వుండదు. కథానేపథ్యపు ఏర్పాటుతో పాత్రల పరిచయాలే వుంటాయి. మేయర్ పాత్ర, అతడి సహాయకురాలు షిమ్ పాత్ర, పబ్లిసిటీ స్పెషలిస్టు పార్క్ పాత్ర, యాడ్స్ లివింగ్ లెజెండ్ పాత్ర, ప్రతిపక్ష అభ్యర్ధి యాంగ్ పాత్ర మొదలైనవి. ఈ పాత్రలు  కథకవసరమైన రాజకీయ జీవితాల మేరకే వృత్తిగత పరిచయ మాత్రంగానే  వుంటాయి.
        
సినిమా ప్రారంభ సీనులో మేయర్ పాత్ర పరిచయం యూత్ అప్పీల్ తోనే వుంటుంది. అతను యూత్ ర్యాలీలో డాన్స్ చేయడం, అతణ్ణి యూత్ అడిగే మొదటి ప్రశ్న యూత్ ప్రేమలకి సంబంధించే వుండడమూ మార్కెట్ యాస్పెక్టే. తర్వాతి ప్రశ్న అతడి కుటుంబంతో కనెక్ట్ అయి వుంటుంది. ఆ తర్వాతి ప్రశ్న వృత్తికి, ఎన్నికలకి కనెక్ట్ అవుతుంది.

         
ఇంకా అవతల మేయర్ పదవికి పోటీ చేయడానికి ప్రకటనకి సిద్ధమైన ప్రతిపక్ష అభ్యర్ది యాంగ్
వుంటుంది. ఈమె కావాలని ఆ కాగితాలు ఎగరేసుకుని, ఆ వంకతో వాటి కోసం వంగినట్టు నటించి, వక్ష సంపదని ఎక్స్ పోజ్ చేసుకుంటుంది.  ఓట్లు పొందడానికి ఇదొక్కటే మార్గమనుకుంటుంది. ఆ సంపద వైరల్ అవుతుంది. కానీ ఈ ప్రతిపక్ష మేయర్ అభ్యర్ధికి  వ్యతిరేకంగా వ్యూహాలు పన్నుతున్నసీన్లు వుండవు.  మేయర్ పదవికి కి ప్రత్యర్ధులు అతడి పార్టీలోనే వున్నట్టు షిమ్ పాత్రద్వారా తెలుస్తుంది. అయినా ఇది కూడా సమస్యకి అంటే ప్లాట్ పాయింట్ వన్ కి దారితీయదు. ఇలా రెండు మూడు ట్రాకుల్లో పరస్పరం సంబంధం లేని సంఘటనలు నడుస్తూ, చివరికి మేయర్ వచ్చేసి అబద్ధాలతో ఎన్నికల ప్రసంగం చేయడంతో, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటై పోతుంది! ఇది కల్పన మాత్రమే, ఇక చరిత్ర చూద్దాం...
        
మన దేశంలో మే 3 న నీట్ పరీక్ష నిర్వహించారు. మే 7 న ప్రశ్నా పత్రం లీకయిందని వెల్లడించారు. మే 12 న ఆ జరిగిన పరీక్షని రద్దు చేశారు. ఇలా నీట్ కి సంబంధించి ఈ సంఘటనలు ఒక పక్క జరుగుతూంటే, మే 15 న దీంతో సంబంధం లేని ఒక కేసు విచారణ సందర్భంగా, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నిరుద్యోగ యువత నుద్దేశించి  బొద్దింకలుగా, పరాన్న జీవులుగా  ఘాటైన విమర్శ చేశారు. మే 16 న దీనికి రియాక్షన్ గా ఎక్కడో బోస్టన్ యూనివర్సిటీ విద్యార్థి అభిజిత్ దీప్కే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అని వ్యంగ్యాత్మక పార్టీ ప్రకటన సోషల్ మీడియాలో చేశాడు. దీనికి ఇంస్టాలో వారం రోజుల్లో రెండు కోట్ల మంది జెన్ జీ యువత స్పందించి ఫాలోవర్స్ గా మారిపోయారు.
       
ఇదంతా కేవలం చీఫ్ జస్టిస్ కి తమ నిరసన తెలియజేయడానికే జరిగింది. కానీ దీప్కే దీన్ని సీరియస్ గా తీసుకున్నాడు. పార్టీకి అయిదు సూత్రాల మేనిఫెస్టో ప్రకటించాడు. అందులో నీట్ ప్రస్తావన ఎక్కడా లేదు. నీట్  పేపర్ లీకవడం, పరీక్ష రద్దవడం, మళ్ళీ పరీక్ష జూన్ 21 న జరుగుతుందని ప్రకటించడం – ఈ సంఘటనలతో  ఏ సంబంధమూ లేకుండా వుండి పోయింది ఆన్ లైన్ లో మనుగడ సాగిస్తున్న పార్టీ.        

పైపెచ్చు తమ పార్టీ  సామాజిక
, ఆర్థిక, రాజకీయ సమస్యలపై ప్రచారం చేస్తుందంటూ, చీపుర్లు పట్టి స్వచ్ఛ భారత్ పనులు మొదలెట్టారు. ముగ్గురు అధికార ప్రతినిధులు నియమితులయ్యారు. ఒక పక్క నీట్ రద్దుతో విద్యార్థుల ఆత్మహత్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నా ఇటు వైపు తొంగి చూడలేదు కాక్రోచ్ పార్టీ. ఈ పార్టీ ఏర్పాటే ఒక కుట్ర అంటూ విమర్శల నెదుర్కొంటూ గడిపింది.
       
చివరికి  మే 22 న దీప్కే
,  నీట్ పరీక్షల వ్యవహారం తీవ్రమవడంతో స్పందించి, విద్యా మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ గొంతు కలిపి ఆందోళన ప్రారంభించాడు.  తను జూన్ 6 న న్యూఢిల్లీ వచ్చి జంతర్ మంతర్ లో ప్రత్యక్ష నిరసనకి  నాయకత్వం వహిస్తాననీ  ప్రకటించాడు. అన్నట్టు జూన్ 6 న వచ్చి నిరసన చేపట్టడంతో ఉద్యమం ప్రారంభమయింది.

ఇంతవరకూ దీన్ని ఒక కథగా చూస్తే ఇది స్క్రీన్ ప్లే లో బిగినింగ్ విభాగం కింది కొస్తుంది. ఈ బిగినింగ్ విభాగంలో రెండు విడి విడి కథనాలు రన్ అవుతున్నాయి. ఒకటి నీట్ కథనం, రెండోది కాక్రోచ్ పార్టీ కథనం. ముందుగా నీట్ పేపర్ లీకవడం దగ్గర నీట్ కథనం మొదలైతే,  తర్వాత చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలతో కాక్రోచ్ పార్టీ పుట్టి దాని కథనం మొదలైంది. అంటే ఈ మొత్తం కథకి బిగినింగ్ విభాగం ప్రారంభంలోనే నీట్ పరీక్ష రద్దుతో సమస్య ఏర్పాటయి పోయింది. నిత్యం కథల్లో చూసే బిగినింగ్ విభాగం ముగింపులో కాకుండా, ప్రారంభం లోనే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటై పోయింది.

ఇప్పుడు ఈ సమస్య ప్రకృతి అనుకుంటే, ప్రకృతిని సాంఖ్య శాస్త్రం ఇలా వివరిస్తుంది : ‘ప్ర’ -అంటే విశ్వంలో ఆల్రెడీ పదార్థం వుంది. దానికి ‘కృతి’ చేసే చేతులు కావాలి.
  అంటే మనం జీవితంలో ఏం సాధించాలన్నా అది ప్రకృతిలో కొదవ లేకుండా ఆల్రెడీ వుంది-జస్ట్ దానికి కృతి చేసి అందుకునే చేతులే కావాలి. ఆ చేతుల కోసం ఎదురు చూస్తూ వుంటుంది పదార్ధం. కృతి చేసి తన వైభవం ప్రపంచానికి చాటాలని ఎదురుతెన్నులు కాస్తూ వుంటుంది. అబ్సర్వర్ ఎఫెక్ట్ ప్రయోగంతో క్వాంటం థియరీ కూడా ఇదే నిరూపించింది.

కనుక నీట్ పేపర్ లీక్ సమస్య దాన్ని సాధించే చేతుల కోసం ఎదురు చూస్తూ వుంది. అప్పుడు తర్వాత చీఫ్ జస్టిస్ ఎంట్రీ ఇచ్చి కాక్రోచ్ పార్టీ పుట్టుకకి బీజం వేశారు.
  కానీ పుట్టిన కాక్రోచ్ పార్టీ క్వాంటం థియరీ తెలీక ఏమేమో చేస్తూ వుండి పోయింది. నీట్ వ్యవహారం బాగా వేడెక్కితేగానీ గానీ చురుక్కుమనలేదు. దాంతో రంగంలోకి దిగి జంతర్ మంతర్ మొదలెట్టింది. అలా నీట్ సమస్య అనే పదార్ధంతో కృతి చేయడం మొదలెట్టింది...

కథా ప్రారంభంలో నీట్ సమస్య పుట్టినా దానికి కృతి చేసే చేతుల్లేక ప్లాట్ పాయింట్ ఏర్పాటు కాలేదు. జంతర్ మంతర్ ఆందోళన ప్రారంభమయ్యాకే, కృతి చేసే చేతులతో (కాక్రోచ్ పార్టీతో) ప్లాట్ పాయింట్ ఏర్పాటై సంఘర్షణ మొదలైంది. స్క్రీన్ ప్లేలో మిడిల్ విభాగం మొదలై కథ ప్రారంభమైంది.

ఇక్కడ్నుంచీ మిడిల్  సంఘర్షణలో భాగంగా చలో పార్లమెంట్ చేపట్టడం, అది పోలీసు లాఠీ చార్జీకి దారితీయడం వంటి సంఘటనలు జరిగి, చివరికి ఎండ్ విభాగం విద్యామంత్రి రాజీనామాతో పూర్తయింది.

సర్వసాధారణంగా బిగినింగ్ విభాగంలో ప్రశ్నలు తలెత్తవు. సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన జరగనప్పుడే ప్రశ్నలు తలెత్తి ఆసక్తికరంగా మారుతుంది కథనం. పై చరిత్ర చెప్పే కథలో రెండు సంబంధం లేని వేర్వేరు సంఘటనలు సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన జోలికెళ్ళ కుండా, ఇవి ఎందుకు జరుగుతున్నాయి, ఏమవుతాయి, ఇలాగెందుకు జరుగుతోందీ అన్న ప్రశ్నలతో బిగినింగ్ విభాగాన్ని బలీయం చేస్తున్నాయి.
         
    మూసలోంచి బయటికి రావాలంటే నడిచిన, నడుస్తున్న చరిత్ర మీద కన్నేసి వుంచాలి.

-సికిందర్

 

 

Saturday, July 25, 2026

1432 :రైటర్స్ కార్నర్


            క్వింటా బ్రన్సన్ హిట్టయిన ఎబిసి టీవీ కామెడీ ‘అబట్ ఎలిమెంటరీ' రచయిత్రి. ఆమె పాత్రల ప్రవర్తన, వాస్తవిక వ్యక్తిగత అనుభవాలు మొదలైన వాటిపై దృష్టి సారించి స్క్రిప్ట్ రచన చేస్తుంది. ఫిలడెల్ఫియా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా తన తల్లి అనుభవాలు వంటి నిజ జీవిత సంఘటనల నుంచి నేరుగా స్ఫూర్తి పొంది, వాస్తవికతతో కూడిన సంఘర్షణలని  హాస్యభరితం చేస్తూ, వినూత్న పరిష్కారాలతో  కథల్ని అల్లుతుంది.

        విస్తృత సాధారణ ప్రేక్షక శ్రేణిని దృష్టిలో పెట్టుకుని కామెడీని, హృద్యమైన వాస్తవికతని, సందర్భోచిత హాస్యంతో బ్యాలెన్స్ చేస్తూ ఆకట్టుకునేలా రూపొందిస్తుంది. కేవలం సంభాషణలతో కాకుండా, పాత్రల ప్రవర్తనలతో జీవం పోయడానికి ప్రయత్నిస్తుంది. పూర్తిగా  ఫన్నీ డైలాగ్స్ మీదే ఆధారపడకుండా, ఒక పరిస్థితిలో వివిధ పాత్రలు ఎలా అలోచిస్తాయన్నమైండ్ సెట్ ని పట్టుకుని సీన్లు రాస్తుంది.
        అబట్ ఎలిమెంటరీ' తో హాస్యంతో గొప్ప ఆలోచనల్ని ఎలా ముందుకి తీసుకెళ్ళ వచ్చో, ప్రపంచాన్ని ఎలా మరింత మెరుగైన ప్రదేశంగా మార్చవచ్చో ఆమె చూపిస్తోంది. ఈ క్రమంలో ఆమె తను రాస్తున్న పాత్రల్ని అర్ధం జేసుకోవడానికి ఒక మైండ్ సెట్ టెస్ట్ ని ప్రయత్నిస్తోంది. అదేమిటో తెలుసుకుందాం...

1. నోటుతో ఎవరేంటి?
        కమెడియన్ లారీ విల్మోర్ నుంచి నేర్చుకున్న ఈ టెక్నిక్ కి ‘5 డాలర్ టెస్ట్’ అని పేరుపెట్టింది.  ఇదిలా వుంటుంది : రచయిత్రో రచయితో నేల మీద 5 డాలర్ల నోటుని పడేసి చాటుకెళ్ళి  గమనిస్తున్నారనుకుందాం-  అప్పుడు కథలో అనుకుంటున్న వివిధ పాత్రలు ఆ నోటుని చూసి ఎలా రియాక్ట్ అవుతాయో అవే బయట పెట్టుకోవడం కనిపిస్తుంది. పాత్రల నైజాలు, ప్రాధాన్యాలు, దృక్కోణాలూ అన్నీ వాస్తవికంగా సులభంగా అర్ధమవుతాయి.
        
తను రాస్తున్న పాత్రలు ఎలాంటివో, ప్రపంచాన్ని ఎలా చూస్తాయో తెలియజేయడానికి డబ్బు ఒక సరైన ఎర. ఈ డబ్బుని  ఎలా చూస్తాయో, వాటి జీవితంలో దానికున్న  అర్థమేమిటో చాటు నుంచి బాగా గమనించ వచ్చు.
       
అవి అటూ ఇటూ ఎవరో లేరని చూసి చటుక్కున్న ఆ నోటుని తీసి జేబులో పెట్టేసుకున్నాయా? ఈ నోటుని పడేసుకున్నదెవరా అని వెతుకుతున్నాయా?
ఆ నోటుని చూసి ఆశ్చర్య పడ్డాయా? దానికి తాము పూర్తి అర్హులమని భావిస్తున్నాయా? మైండ్ సెట్  తవ్వి తీయడానికి ఇక్కడే వుంది అంతా. అయితే ఏ రెండు పాత్రలు ఆ నోటుతో ఒకే పని చేశాయంటే, వాటిలో ఒకటి స్క్రిప్టులో  పేజీలోని ఓ విలువైన స్థలాన్ని దురాక్రమిస్తున్నట్టేనని ఆమె హెచ్చరిక.
       
‘అబట్ ఎలిమెంటరీ’ లో అత్యుత్తమ తారాగణ బలముంది. ఎన్నో పాత్రలున్నాయి
, కానీ దారిలో దొరికిన  డబ్బుని  చూసే విషయంలో ప్రతి ఒక్కటీ ఎంత ప్రత్యేకంగా వున్నాయో చూపించడానికి ఆమె ఇలా రాసుకుంది :
        జానైన్ : ఆ నోటు తీసుకుని తీవ్రంగా కలత చెందుతుంది. దాని అసలైన యజమానిని వెతికి పట్టుకోవడానికి ఆమె ఒక పెద్ద పోరాటాన్నే మొదలు పెడుతుంది.
        అవా : దాన్ని జేబులో పెట్టుకుని ఒక్క ప్రశ్న కూడా వేసుకోదు.
        మెలిస్సా : ఇది ట్రాపేమో అనుకుని ముట్టుకోకుండా జాగ్రత్తపడుతుంది.
  బార్బరా : నిశ్శబ్దంగా నవ్వి, సర్వశక్తిమంతుడైన దేవుడే ఆశీర్వదించాడని తీసి కళ్ళకద్దుకుంటుంది.
        గ్రెగరీ : ఛీఛీ, దీన్ని ముట్టుకుంటే నానా క్రిములూ అంటుకుంటాయని ఇగ్నోర్ చేస్తాడు.
      జాకబ్ : చివరి దశ పెట్టుబడిదారీ విధానంలోని భయానక పరిణామాలపై గంభీరమైన ఉపన్యాసం ఇవ్వడం మొదలుపెడతాడు.
   మిస్టర్ జాన్సన్: తాను యూఎస్ మింట్‌లో పనిచేస్తున్నప్పుడు, సరిగ్గా ఇదే నోటుని ముద్రించడంలో సాయం చేశానని చెప్పుకుంటాడు.

ఈ రియాక్షన్లలో దేనికీ పది పేజీల క్యారక్టర్ బయోగ్రఫీ అవసరం లేదని గమనించ వచ్చు. అంతా చేతల్లోనే వుంది. ఈ టెక్నిక్ ని  సిట్‌కామ్, మరేదైనా జానర్ సినిమా, ఒక డ్రామా రాస్తున్నప్పటికీ
కూడా ఉపయోగించవచ్చు.

పాత్రల ప్రపంచ దృక్పథాలు ఒక చిన్న కాగితం ముక్క విషయంలో కూడా ఘర్షణ పడేంత విభిన్నంగా వున్నప్పుడు
, ఆ తర్వాత సంభాషణ సహజంగానే సాగాలి. తర్వాతిసారి, ఒక సీను ఎందుకు చప్పగా అనిపిస్తోందని ఆలోచిస్తూ ఖాళీ పేజీ ముందు కూర్చుండిపోక పోతే, నేల మీద ఒక ఐదు డాలర్ల నోటు పడేసి, దాన్ని ఎవరు తీస్తారో చూస్తే సీను వర్కౌటై పోతుంది.

2. క్వింటా గురించి...
        క్వింటా బ్రన్సన్ ‘అబట్ ఎలిమెంటరీ’ ని  ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల అంకితభావాన్ని, పట్టుదలని  గౌరవించడానికి దశాబ్దాల పాటు బోధించిన తన తల్లి నుంచి ప్రేరణ పొంది, అత్యంత తక్కువ జీతాలు పొందే వృత్తులలో ఒకటైన బోధన వృత్తి  వెనకున్న హాస్యం, ఆప్యాయతలతో కూడిన వాస్తవిక వ్యక్తులపై దృష్టి పెట్టానని చెబుతోంది. అదే సమయంలో, ప్రామాణికమైన, పాత్రల ఆధారిత కామెడీని నెట్‌వర్క్ టెలివిజన్‌కి  తిరిగి తీసుకురావాలని కూడా ఆమె ఆకాంక్షిస్తోంది.
     
క్వింటా బ్రన్సన్ (36)  అమెరికన్ నటి, హాస్యనటి, రచయిత్రి, నిర్మాత.  ఆమె పోర్ట్ ఫోలియోలో 23 టీవీ సిరీస్, 7 సినిమాలూ వున్నాయి. ‘అబట్ ఎలిమెంటరీ’ లో రెండవ తరగతి ఉపాధ్యాయురాలు జానైన్ టీగ్స్‌గా నటించింది.  ఆమె 2022 టైమ్ మేగజైన్ 100 అత్యంత ప్రభావవంత వ్యక్తుల జాబితాలో కూడా స్థానం సంపాదించింది .
-సికిందర్

(టాలీవుడ్ కి ఈ టెక్నిక్ ఎందుకవసరం? మూసలో ఆలోచించుకుంటూ లేజీగా కూర్చుని రాయకుండా, బ్రెయిన్ కి కాస్త పని కల్పించి కొత్త పద్ధతులు నేర్చుకుంటూ వుంటే,  బాడీ గార్డులా నిలబడుతుంది బాక్సాఫీసు)

 

 

Thursday, July 23, 2026

1431 : డైలాగ్ రైటింగ్ టిప్స్!


    వి అప్పుడప్పుడూ రాసుకుంటూ  పోయిన  డైలాగ్ రైటింగ్  టిప్స్. డేటా బ్యాంక్ లో వుంటే తీసి మూడవ భాగం అందిస్తున్నాం. పని కొస్తాయనుకంటే ప్రయత్నించవచ్చు.

1. ప్రతి పాత్రకూ  ఒక ‘వాయిస్’ ఇవ్వాలి
అదే విషయాన్ని మూడు  పాత్రలు ఎలా చెబుతాయంటే:
పోలీస్ : ‘చట్టం ముందు అందరూ సమానమే
గ్యాంగ్‌స్టర్ : చట్టం డబ్బున్న వాళ్ళ జేబులో వుంటుంది’
మదర్ : ‘తప్పు చేసినవాడు ఎప్పుడో ఒకరోజు ఫలితం చూస్తాడు’
ఒకే ఆలోచన, మూడు వేర్వేరు ‘వాయిస్’ లతో గమనించ వచ్చు.
2. డైలాగ్‌లో మలుపు వుండాలి
ప్రేక్షకులు వూహించిన దాని కంటే వేరేలా ముగియాలి :
ఉదాహరణ:
‘నిన్ను చంపడానికి వచ్చాను’
‘మరెందుకు నిలబడి పోయావ్?
‘ఇప్పటికే నువ్వు చచ్చావని’
4. భావోద్వేగం పెరుగుతూ వుండాలి
ప్రతి లైన్ ముందు లైన్ కంటే బలంగా వుండాలి :
ఉదాహరణ :
‘వెళ్ళు’
‘వెళ్తానని అనుకోకు’
‘నేణు పంపిస్తున్నాను’
5. డైలాగ్‌కి ముందు, తర్వాత జరిగే చర్యలు కూడా ముఖ్యం
కొన్నిసార్లు ఒక చూపు, ఒక నవ్వు, ఒక గ్లాస్ పెట్టే శబ్దం మాటలకంటే ఎక్కువ చెబుతాయి
ఉదాహరణ:
(అతను టీ కప్పు టేబుల్‌పై నెమ్మదిగా వుంచుతాడు)
‘ఇక నిన్ను నమ్మను’
6. ప్రతి డైలాగ్‌తో ఒక  పరిణామం వుండాలి
పాత్ర ఒక మాట చెప్పిన తర్వాత ఏదో మారాలి:
సంబంధం మారాలి. నిర్ణయం మారాలి.ప్రమాదం పెరగాలి.
నిజం బయటపడాలి.
ఏమీ మారకపోతే, ఆ డైలాగ్ అవసరం లేకపోవచ్చు.
7. మంచి విలన్ డైలాగులు
విలన్ తనని తాను చెడ్డవాడిగా భావించడు.
బలహీనం :
‘నేను చెడ్డవాడిని’
బలీయం :
‘ప్రపంచం నన్ను రాక్షసుడని అంటుంది... ఎందుకంటే వాళ్ళకి నిజం నచ్చదు’
8. హీరో డైలాగులు
హీరో తన గొప్పతనాన్ని చెప్పుకోడు; పరిస్థితి అతడి గొప్పతనాన్ని బయటపెడుతుంది :
ఉదాహరణ :
‘నన్ను గెలవడం నీ వల్ల కావచ్చు...’
‘కానీ నన్ను వంచడం మాత్రం కాదు’
9. హాస్య డైలాగులు
హాస్యం జోక్ చెప్పడం వల్ల కాదు, పాత్ర స్వభావం వల్ల వస్తుంది:
ఉదాహరణ:
‘భయపడుతున్నావా?
‘లేదు... నా కాళ్ళు లగెత్తాలని  చూస్తున్నాయి’
10. నిశ్శబ్దానికి విలువ ఇవ్వాలి
ప్రతి ప్రశ్నకూ వెంటనే సమాధానం అవసరం లేదు.
‘నిజంగా నన్ను ప్రేమించావా?
(నిశ్శబ్దం)
‘అర్థమైంది’
ఈ నిశ్శబ్దమే డైలాగ్‌లో భాగం.
11. ప్రేక్షకులు గుర్తుంచుకునే డైలాగులు ఎలా పుడతాయి?
చాలా ప్రసిద్ధ డైలాగులు ఈ నాలుగు లక్షణాల్లో కనీసం రెండింటిని కలిగి వుంటాయి:
నిజం - జీవితానికి దగ్గరగా వుండాలి.
ఆశ్చర్యం వూహించని కోణం వుండాలి.
భావోద్వేగం మనసుని తాకాలి.
సరళత్వం  ఒక్కసారి వింటే గుర్తుండాలి.
ఉదాహరణలు:
‘గెలవడం కష్టం కాదు... గెలిచాక మనిషిగా వుండడమే కష్టం’
శత్రువుని  ఓడించడం విజయం... కోపాన్ని ఓడించడం గొప్ప విజయం

నువ్వు నన్ను మోసం చేయలేవు... మోసంతో నీకు మూన్నాళ్ళ ముచ్చటే’

12. ఒక ప్రొఫెషనల్ అభ్యాసం
ఒక సీన్ రాసేటప్పుడు ముందుగా డైలాగులు లేకుండా ఆ సీన్‌ని వూహించాలి. పాత్రలు ఏం చేస్తున్నాయి?  ఎలా చూస్తున్నాయి? ఎప్పుడు మౌనంగా వున్నాయి? ఆ తర్వాత అవసరమైన మాటలు మాత్రమే రాయాలి.  ఈ పద్ధతి వల్ల డైలాగులు సహజంగా, ప్రభావవంతంగా మారుతాయి.
13. సినిమా డైలాగ్ రచనలో ఒక మంచి రూలు
ప్రేక్షకులు విన్న మాటల్ని కాదు, ఆ మాటల వల్ల కలిగిన ఫీలింగ్ ని గుర్తుంచుకుంటారు.

(మరికొన్ని మరోసారి)

-సికిందర్ 

Wednesday, July 22, 2026

1430 : హాలీవుడ్ రివ్యూ!

రచన- దర్శకత్వం : క్రిస్టఫర్ నోలన్
తారాగణం : మాట్ డామన్, టామ్ హాలండ్, ఏన్ హాథ్వే, రాబర్ట్ పాటిన్సన్, లుపిటా న్యోంగో, సమంత మోర్టన్, జెండయా, చార్లిజ్ థెరాన్
సంగీతం : లుడ్విగ్ గోరాన్సన్, ఛాయాగ్రహణం : హోయ్టే వాన్ హోయ్టెమా, కూర్పు : జెన్నిఫర్ లేమ్
బ్యానర్స్ : యూనివర్సల్ పిక్చర్స్, సింకపీ
నిర్మాతలు : ఎమ్మా థామస్, క్రిస్టోఫర్ నోలన్
విడుదల : జూలై  17, 2026
***
      250 మిలియన్ డాలర్ల (అక్షరాలా ఇరవై నాలుగు వందల కోట్ల పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలు మాత్రం) సూపర్ జంబో బడ్జెట్ తో, వందలాది జూనియర్ ఆర్టిస్టులు సహా 28 మంది ప్రముఖ తారలతో, అదీ గ్రాఫిక్స్ ని నామమాత్రం చేసి భారీగా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ తో, 4 మోతబరుపు ముడి ఫిలిం ఐమాక్స్ 65 ఎంఎం భారీ కెమెరాలతో, కేవలం 91 అంటే 91 రోజుల్లో, ‘ది ఒడిస్సీ’ అనే ఆధునిక మహా కళాఖండపు షూటింగ్ ని పూర్తి చేసి అవతల పడేసిన క్రిస్టఫర్ నోలన్, మనిషి కాదు- మూవీ మేకింగ్ బ్రహ్మ రాక్షసుడనాలి. పని రాక్షసులే సమయాన్ని గుప్పెట పట్టి శాసించగలరు. ఆ తర్వాత 11 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ ముగించి ప్రపంచం మీద పడేశాడు. కనీసం రెండు మూడేళ్ళు తీసుకునే మన పానిండియా మూవీ మేకర్లు (‘రాజాసాబ్’కి దాదాపు నాల్గేళ్ళు), నోలన్ దగ్గర అప్రెంటీసులుగా చేరి సమయం విలువ తెలుసుకుంటే మంచిదేమో ఆలోచిస్తే, బడ్జెట్లు బలి కాకుండా బయటపడతారేమో!

విడుదలకి ముందునుంచే  ‘ది ఒడిస్సీ’ ని  కాస్టింగ్ నుంచీ కాస్ట్యూమ్స్ వరకూ వివాదాల్లో ముంచెత్తారు. హెలెన్ ఆఫ్ ట్రాయ్ పాత్రలో ఆ నటి సరికాదనీ, ఈ గ్రీకు పౌరాణికంలో గ్రీకు నటులే లేరనీ, సంభాషణలు అమెరికన్ యాసలో వున్నాయనీ...ఇలా విడుదలకి ముందే సాకులు మొదలెట్టారు పండితులు, సోషల్ మీడియా జనులూ- ప్రతికూల వాతావరణాన్ని సెట్ చేస్తూ. సినిమాలో వాడిన దుస్తుల మీద, కవచాల మీద కూడా అస్త్రాలు ఎక్కుపెట్టారు.
తీరా సినిమా విడుదలయ్యాక సైలెంట్ అయిపోయారు. లండన్ ప్రీమియర్ లో పేలిన మాటలు కూడా వినిపించడం లేదు. మొత్తానికి అందరి నోళ్ళూ మూయించాడు నోలన్. వెర్నాకులర్, ఇంటర్నేషనల్ పత్రికలూ, సాంస్కృతిక సంగతుల వెబ్సైట్లూ –ఒకటేమిటి, ప్రతీ సమాచార వేదికా నోలన్ ని నోరారా ప్రశంసించకుండా వుండలేదు.

అయితే  తను ఏ ప్రేక్షక వర్గాన్ని టార్గెట్  చేస్తూ ఈ గ్రీకు పురాణం తీస్తున్నట్టు చెప్పాడో, ఆ 17 ఏళ్ళ మాస్ కుర్ర ప్రేక్షకుల దగ్గర్నుంచీ, అంతకంటే పెద్దవాళ్ళ ఆమోదాన్నీ పొందగాలిగాడా అన్నది ప్రశ్న. పొందకపోతే కారణమేమిటో తెలుసుకునే ప్రయత్నం  చేద్దాం. కారణం నోలన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోనే వుంది. అదెలా పనిచేసిందో చూద్దాం...

2. ముందుగా గాథ!

ప్రాచీన ట్రాయ్ (టర్కీ) యుద్ధం ముగిసిన తర్వాత ఒక రాజు తన ఇంటికి చేరుకోవడానికి పదేళ్ళ పాటు సాగించిన సుదీర్ఘ, ప్రమాదకర ప్రయాణమే ఈ సినిమా గాథ. ఇథాకా రాజ్యానికి రాజైన ఒడిస్సీయస్ (మాట్ డామన్) తన తెలివితేటలతో, జిత్తులమారితనంతో,  పదేళ్ళుగా సాగుతున్న ట్రోజన్ యుద్ధాన్ని చివరికి చెక్క గుర్రం వ్యూహంతో గెలిచి స్వదేశానికి బయల్దేరతాడు. యుద్ధం తర్వాత తన సైన్యంతో కలిసి సముద్ర మార్గం ద్వారా ఇథాకాకు తిరుగు ప్రయాణం కట్టిన ఒడిస్సీయస్, ఆ యుద్ధంలో పాల్పడిన క్రూరత్వానికి, వినాశనానికి సముద్ర దేవుడైన పొసైడాన్ పెట్టిన శాపానికి  గురవుతాడు. ఫలితంగా సముద్ర జలాల్లో చిక్కుకుని, 10 రోజుల్లో ముగించాల్సిన ఇంటికి ప్రయాణాన్ని, ఇంకో పదేళ్ళ పాటు మాయాశక్తులతో సుదీర్ఘ పోరాటం చేస్తూ గడిపే అవస్థలో పడిపోతాడు.

ఈ ప్రయాణంలో సైక్లోప్స్ అనే ఒంటికన్ను రాక్షసుడ్ని, పాటలతో ఆకర్షించే  సైరన్లని, మంత్రగత్తె సిర్సీని, ఇంకా భయంకర సముద్ర రాక్షసుల వంటి ఎన్నోజీవుల్నీ ఎదుర్కొంటాడు. జ్ఞాన దేవత అథీనా (జెండయా) అతడికి పరోక్షంగా అండగా నిలుస్తుంది.

మరోవైపు ఇథాకాలో ఒడిస్సీయస్ చనిపోయాడని భావించి, అతడి  భార్య పెనెలోప్ (ఏన్ హాథ్వే ) ని పెళ్ళాడి రాజ్యాన్ని దక్కించుకోవాలని ఆంటినస్ (రాబర్ట్ పాటిన్సన్) వేధిస్తూ వుంటాడు. ఇంకోవైపు తండ్రి బతికే వున్నాడనే నమ్మకంతో కుమారుడు టెలీమాకస్ (టామ్ హాలెండ్) తండ్రి కోసం అన్వేషిస్తూ వుంటాడు.

చివరికి తన సైన్యాన్నీ, సహచరుల్నీ కోల్పోయి ఒంటరిగా, బిచ్చగాడి మారువేషంలో ఇథాకా రాజ్యానికి చేరుకుంటాడు ఓడిస్సియస్. ఇప్పుడు ఇక్కడ పెనెలోప్ భర్తకి చెందిన ప్రత్యేకమైన వింటినారిని ఎక్కుపెట్టి, 12 గొడ్డళ్ళ కళ్ళ గుండా బాణాన్ని కొట్టిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని స్వయంవరం ప్రకటిస్తుంది. స్వయంవరాని కొచ్చిన రాజులెవ్వరూ ఈ పరీక్షలో నెగ్గలేక పోతారు. అప్పుడు మారువేషంలో వున్న ఒడిస్సీయస్ సులువుగా గురి తప్పకుండా విల్లు ఎక్కుపెట్టి బాణం కొట్టేస్తాడు. ఈ విజయంతో కుమారుడితో కలిసి కుయుక్తుల శత్రురాజులందర్నీ సంహరించేసి,  రాజ్యాన్ని కాపాడుకుని భార్యతో పునస్సమాగమవడం క్లుప్తంగా ఈ గాథ.

3. ఎలావుంది గాథ?

మహాకవి హోమర్ రచించిన ప్రాచీన గ్రీకు కావ్యం ది ఒడిస్సీ’ (ఇంగ్లీషులో ఆడిసీ’, గ్రీకులో ఒడ్హసీ’, తెలుగులో చక్కగా  తెలుగైజుడు ఒడిస్సీ’ - ఒడిశాలో ఒడిస్సీఅనే ప్రసిద్ధ నృత్య రూపకం పేరు లాగా. దీనర్ధం ఆత్మశోధన యాత్ర) ఆధారంగా సినిమా తీశాడు క్రిస్టఫర్ నోలన్. ఇది కేవలం ఒక వీరుడి సాహసగాథ కాదు, యుద్ధం తర్వాత ఇంటికి చేరాలనుకునే ఒక మనిషి చేసే శారీరక, మానసిక, నైతిక ప్రయాణపు ఆత్మశోధన గాథ, కథ కాదు. అలాగే చరిత్ర కాదు, కల్పన. గ్రీకు పురాణం.

ఈ గాథలో ప్రధాన సంఘర్షణ రాజైన ఒడిస్సీయస్ (ఈ పేరుకి అర్ధం కోపిష్టి) అహంకారం నుంచే మొదలవుతుంది. ట్రోజన్ యుద్ధంలో గెలిచిన తర్వాత, తనే సర్వాంతర్యామిని అన్నట్టు ఫీలవుతూ  సముద్ర దేవుడైన పొసైడన్ ఆగ్రహానికి – శాపానికి గురవడంతో ఈ గాథ మొదలవుతుంది.

పదేళ్ళ సముద్రపు సంక్షుభిత ప్రయాణంలో అతడికి ఎదురయ్యే అందమైన అప్సరసలు అతడ్ని లోబర్చుకోవాలని చూసినా, అతను వాటన్నింటినీ కాదనుకుని భార్య దగ్గరికే వెళ్ళా లనుకోవడంలోని మానవ విలువల ఔన్నత్య  ప్రదర్శన. నైతిక విలువలున్నప్పటికీ, అతను లోపాలూ అహంకారం నిండిన వాడు కూడా. ఒక క్రూర యుద్ధ యోధుడి నుంచి, ఓపికా వివేకమూ గల గ్రీకు వీరుడిగా, తిరుగు ప్రయాణంలో దశాబ్దకాలం పాటు ఎదుర్కొన్నవివిధ  పరీక్షల్లో శారీరకంగా, మానసికంగా పరివర్తన  చెందడం గురించే, ఆధ్యాత్మిక పరిణితి సాధించడం గురించే ఈ గాథ.

ఈ గాథని  సినిమాగా తీయడమంటే సముద్రాలు, రాక్షసులు, దేవతలు, యుద్ధాలూ చూపించడం మాత్రమే కాదు, ఆ ప్రయాణం వెనుక దాగి వున్న మనిషి ఒంటరితనం, ఆశ, ప్రలోభం, గర్వం, కుటుంబం కోసం తపనా వంటి భావోద్వేగాలని తెరపై జీవింపజేయడం కూడా.

మనదేశపు ప్రేక్షకులకి  ఈ సినిమాలో రామాయణ, మహాభారతం ఛాయలు కన్పించి సంతోషం కలగొచ్చు. రాముడి వనవాసం లాగే ఒడిస్సీయస్ సముద్ర యానం అన్పించ వచ్చు. భార్య కోసం భర్త సముద్రాలు దాటి రావడం, లంకలో సీత ఎదురు చూసినట్టు ఇక్కడ రావణ మేళం లాంటి ఆమె మీద కన్నేసిన రాజుల గుంపుని ఎదుర్కొంటూ భర్త కోసం పెనెలోప్ ఎదురు చూడడం భలే వుందే అన్పించొచ్చు. సీతా స్వయంవరంలో రాముడు శివధనస్సుని  విరిచినట్టు గానే, ఇక్కడ కూడా విల్లు ఎక్కుపెట్టే పరీక్ష ద్వారానే ఒడిస్సీయస్ భార్యని పొందడం చూసి మన సినిమానే అన్పించొచ్చు. చివర్లో తండ్రీకొడుకులు (లవ-కుశ తరహాలో) కలిసి కుట్రపన్నిన శత్రు రాజులపై విరుచుకుపడడం వంటి దృశ్యాలు  చూసి, హోమర్ భలే కాపీ కొట్టాడే  అన్పించొచ్చు. ఎవరికెంత తోస్తే అంత సంతృప్తి!

3/a ఎపిసోడిక్ కథనం!

ఈ ప్రయాణం ఎపిసోడ్ల వారీగా సాగుతుంది. సముద్రం, సైరన్లు, సైక్లాప్స్, సిర్స్,  స్కైల్లా –చారిబ్డిస్ మొదలైనవి. ట్రోజన్ యుద్ధం ఈ గాథకి ఉపోద్ఘాతం వంటిది. చివర్లో ఇల్లు చేరుకోవడం ఉపసంహారం. మధ్యలో ఎపిసోడ్లు ఒక్కో మాయా శక్తితో పొందిన ఒక్కో అనుభవం. సముద్రం మీద సముద్ర దేవుడు పొసైడన్  శాపం, సిరెన్స్ - వీళ్ళు తమ మధుర గానంతో నావికుల్ని ఆకర్షించి, నావలు మునిగిపోయేలా చేసే రాక్షస కన్యలు, సిర్సీ -ఈవిడ మనుషుల్ని జంతువులుగా మార్చేసే మంత్రగత్తె, సైక్లాప్స్- మనుషుల్ని తినే ఒంటి కన్ను రాక్షసుడు, కాలిప్సో - ఈవిడ మార్గ నిర్దేశం చేసే జ్ఞాన దేవత. ఇలా ఒడిస్సీయస్  ఒకదాని తర్వాత ఒకటి ఎపిసోడ్లుగా వీళ్ళందర్నీ ఎదుర్కొంటూ పోతాడు. ఈ ఆత్మశోధన యాత్రలో పాఠాలన్నీ నేర్చుకుని, చివరికి ఒక ఉత్తమ వ్యక్తిగా, ఒక ఉత్తమ రాజుగా ఇంటికి  చేరుకుంటాడు.

ఈ గాథని ఇలాటి ఎపిసోడ్లతో ఆత్మ శోధన యాత్రగా ఎందుకు చూపించాలి? ఈ ఎపిసోడ్లకి అర్ధాలేమిటి? ఇవి తెలుసుకుంటే గానీ ఈ గాథ యాక్షన్ అడ్వెంచర్ గా కాకుండా, ఇలాగెందు కుందో అర్ధం గాదు.

3/b. అంతరాత్మ శుద్దితో అమరత్వ సిద్ది!

ముందుగా సినిమా కథల మీద ఇరవయ్యేళ్ళూ పరిశోధన చేసిన జేమ్స్ బానెట్  దగ్గరికెళ్ళి అసలు గొప్ప  సినిమా కథంటే ఏమిటో తెలుసుకుందాం : సింపుల్ గా చెప్పుకోవాలంటే మనుషులమైన మనలో మేట వేసిన ఇగోని, మెచ్యూర్డ్ ఇగోగా మార్చే ప్రక్రియే గొప్ప సినిమా కథంటే. సమస్త కథలూ మన మానసిక ప్రపంచాలకి ప్రతిరూపాలే. కాన్షస్ సబ్ కాన్షస్ మైండ్ ల సయ్యాట (ఇంటర్ ప్లే) లే. సౌలభ్యం కోసం పదజాలాన్ని వాడుక భాషలోకి మార్చుకుంటే - కాన్షస్ మైండ్ అంటే మన వెలుపలి మనసు, సబ్ కాన్షస్ మైండ్ అంటే లోపలి మనసు. వెలుపలి మనసునే మనసుఅనీ, లోపలి మనసుని అంతరాత్మఅనీ అనుకుంటే, మనం మనసుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు మంచివో కావో అంతరాత్మ చెబుతుంది. ఈ రెండిటి మధ్య మన ఇగో (అహం) నిర్ణేతగా వుంటుంది.  అదెప్పుడూ అంతరాత్మ విజ్ఞతతో చెప్పే మంచి మాట, శాశ్వత పరిష్కారం  లాంటివి వినదు. నిలకడ లేని మనసు చెప్పే ఆకర్షణీయమైన మాటలే, తాత్కాలిక పరిష్కారాలే  ముచ్చటపడి వింటుంది. ఇదెప్పుడూ చుట్టూ అందంగా కన్పించే బాహ్యప్రపంచాన్నే అనుభవిస్తుంది. లోపల గంభీరంగా కన్పించే ప్రపంచమైన  అంతరాత్మలోకి ప్రయాణించడానికి భయపడుతుంది.

 పైపెచ్చు ఆ అంతరాత్మని నొక్కేసే ఎజెండాతోనే ఇగో నిత్యం ప్రవర్తిస్తుంది. ఇగో ఎప్పుడూ మనసుతోనే జతకలిసి వుంటుంది. మనసుతోనే చెట్టపట్టాలేసుకుని బాహ్యప్రపంచంలోనే  షికార్లు కొడుతుంది. ఇగో అంటే మనమే. భౌతికంగా మన గుర్తింపు. భౌతికంగా మనం చేసుకునే అలంకరణ, మేకప్ ల ద్వారా నేను ఫలానా అని తెచ్చుకునే గుర్తింపు. అలాటి మనం’  అంతరాత్మలోకి తొంగి చూడ్డానికి ఇష్ట పడం. ఎందుకంటే అక్కడ ఎన్నో తెలుసుకోవాల్సిన నగ్నసత్యాలు, పాటించాల్సిన శాశ్వత విలువలూ వంటి మనిషి పుట్టినప్పటినుంచీ, జీన్స్ లో నిబిడీకృతం చేసుకుని తిరుగుతున్న చేదు వాస్తవాలతో బాటుదేవుడి నియమావళి భయపెడుతూ వుంటుంది.

మనకు (ఇగోకి) వున్న ఈ లక్షణాలు  పక్కాగా సినిమాల్లో హీరో కుండే లక్షణాలే. అంతరాత్మ తో మనం పడే సంఘర్షణ  సినిమాల్లో  మిడిల్ తో హీరో చేసే సంఘర్షణే. ఇది జాగ్రత్తగా గమనించాలి.  స్క్రీన్ ప్లేలో మిడిల్ కథ అంటే మన అంతరాత్మకి ప్రతి (తెర) రూపమే. అంతరాత్మ సర్వాంతర్యామి. ఈ విశ్వమంతా వ్యాపించి వుంది. అందరిలోనూ వుండేది ఒకే అంతరాత్మ. ఒకే నగ్న సత్యాలు, ఒకే శాశ్వత విలువలు, ఒకే దేవుడి నియమావళి.

కానీ  మనం అంతరాత్మలో  ప్రయాణించి ఈ కఠిన విషయాలు తెలుసుకోవడానికి, చేదుగా వుండే  పచ్చి నిజాల్ని రుచి చూడడానికీ  వెనుకాడుతాం. గొప్ప సినిమాలు మన మెడబట్టి ఈ పనే చేయిస్తాయి. మనల్ని- అంటే మనలాంటి  హీరోని, మెడబట్టి  మిడిల్ కథ లోకి నెట్టి సంఘర్షణలో పడేస్తాయి. ఏ అంతరాత్మకి భయపడి దూరం దూరంగా వుంటున్నామో, ఆ అంతరాత్మ ( మిడిల్ ) లోకి నెట్టి-  అక్కడి నగ్నసత్యాల పట్ల, ఆ శాశ్వత విలువల పట్ల, ఆ దేవుడి నియమావళి పట్లా మన భయాలని పోగొట్టి ఒడ్డున పడెయ్యడమే కదిలే బొమ్మల రూపంలో గొప్ప సినిమాలు చేసే పని- చెయ్యాల్సిన పని.

బరి లోకి దిగి అమీతుమీ తేల్చుకుంటే తప్ప మన భయాలు పోవు. అంతరాత్మలో పొడసూపే భయ కారకాలతో  పోరాడివాటి పట్ల భయాలు తొలగించుకునివిజేతలుగా అవతరించడమే జరిగేది. విజేతలుగా అవతరించడమే స్క్రీన్ ప్లేలో ఎండ్ విభాగం. అంటే అసంపూర్ణ వ్యక్తులుగా, పలాయన వాదం పఠిస్తూ, ప్రియమైన మనసుతో –ఇగోతో కలిసి షికార్లు కొట్టే మనం, అంతరాత్మతో భయాలని పోగొట్టుకుని, పరిపూర్ణ వ్యక్తులుగా ఎదగడమే పరోక్షంగా  గొప్ప సినిమా చూపించే మన జీవితపు సినిమా!

 సింపుల్ గా చెప్పాలంటే మనలోని ఇగో చంపుకున్నా చావదు కాబట్టి దాన్ని మెచ్యూర్డ్ ఇగోగా మార్చుకుని సుఖపడ వచ్చు. ఈ ప్రక్రియనే గొప్ప  సినిమా  కథైనా, ఏ పురాణమైనా, ఏ జానపదమైనా, ఇంకేదయినా చేపట్టేది. మనసూ అంతరాత్మల సయ్యాటలతో మనిషిని  మోక్ష మార్గాన నడిపించడం.  కురుక్షేత్రమంటే,  ‘ది ఆర్ట్ ఆఫ్ మాన్ మేకింగ్’ పుస్తకంలో చిన్మయానంద స్వామి ప్రకారం, మన మనస్సులో అంతరాత్మతో ఎడతెరిపి లేకుండా నిత్యం జరుగుతూ వుండే సంఘర్షణే. మనస్సులో వుండే ఐదు పాజిటివ్ ఫీలింగ్స్, నూరు నెగెటివ్  ఫీలింగ్స్ తో  చేస్తూ వుండే పోరాటం.

 రాముడి అరణ్య వాసంలో అరణ్యం అంతరాత్మకి ప్రతీకే. అర్జునుడి కురుక్షేత్రంలో కురుక్షేత్రం అంతరాత్మకి  సింబాలిజమే., ‘తెలివైన ఇంద్రజాలికుడుఅనే జానపద కథలో ఇంద్ర జాలికుడు అంతరాత్మ రూపమే.

జేమ్స్ బానెట్  కొన్ని గొప్ప  సినిమాలని ఉదహరిస్తాడు- ఈటీ, కాంటాక్ట్, అర్మగెడ్డాన్ సినిమాల్లో అంతరిక్షం అంతరాత్మ అయితేభూమి వెలుపలి మనసు. ఏలియెన్ లో అంతరిక్ష నౌకలోని కంట్రోల్ రూమ్ అంతరాత్మ అయితే, జురాసిక్ పార్క్ లో కాంపౌండు, మిగతా పార్కూ అంతరాత్మ. టైటానిక్ లో టైటానిక్ నౌక వెలుపలి మనసు అయితే, అది మునిగిపోయిన తర్వాత సముద్ర గర్భం అంతరాత్మ, జాస్ లో లంక అనేది వెలుపలి మనసు అయితేదాని చుట్టూ సముద్రం అంతరాత్మ, సముద్రం లోంచి దాడి చేసే సొరచేప నగ్న సత్యాలకి ప్రతీక, ఈ సొరచేపతో తలపడే హీరో మన ఇగోనే! ఈ చిత్రణలు ప్రేక్షకులతో  సైకలాజికల్ గా కనెక్షన్ ని ఏర్పాటు చేసుకుంటాయి.

తెలుగులోకి వస్తే,  ‘ఏలియెన్లో అంతరిక్ష నౌకలోని కంట్రోల్ రూమ్ ఎలాగో, ‘ఒక్కడులో భూమికని దాచిన గది అలా అంతరాత్మకి ప్రతీక అయితే, భూమిక పాత్ర పరిష్కరించాల్సిన  ఆ అంతరాత్మ సంధిస్తున్న పజిల్. మిగతా ఇల్లూ, చార్మినార్ అంతస్తూ అంతా వెలుపలి మనసు. మహేష్ బాబు మన ఇగో. శివలో నాగార్జున పాత్ర మన ఇగో. అతడి కాలేజీ వాతావరణ మంతా వెలుపలి మనసు, అతను తలపడే చీకటి మాఫియా ప్రపంచం అంతరాత్మ, రఘువరన్ విలన్ పాత్ర అంతరాత్మలోంచి పొడసూపుతున్న ఒక చేదు వాస్తవం.

 ఇక ప్రపంచ పురాణాలన్నీకూడా ఇలా  పాఠకులకి / ప్రేక్షకులకి మానసిక  చికిత్స చేసే- సైకో థెరఫీ చేసే పాఠాలే.  వీటిలో పురాణ పురుషుడి ప్రయాణం వివిధ మజిలీలు (ఎపిసోడ్లు) గా  సాగుతూ, ఒక్కో మజిలీ  ఒక్కో మానసిక రుగ్మతని/ బలహీనతని  క్షాళనం చేసే దిశగా సాగి పునీతుడ్ని చేసే అధ్యాయాలే. పురాణాల్లో కనిపించే వివిధ పాత్రలు, వస్తు సంచయాలు భావోద్వేగాలకి ప్రతీకలే.

3/c ‘ఒడిస్సీ’ ప్రతీకలేం చెప్తున్నాయి?

అలాగే ‘ఒడిస్సీ’ లో ఇథాకా అనేది కేవలం ఒక వూరు కాదుఅతడికి ఆత్మశాంతి నిచ్చే స్థానం. ఇంటికి చేరడమంటే పునీతుడై అంతరాత్మని చేరుకోవడం. ఇక్కడ ఇల్లు అంతరాత్మకి ప్రతీక. సినిమాలో సముద్రం కేవలం ఒక లొకేషన్ కాదుఅదొక సజీవ పాత్ర. అహంకారం పొటమరించిన ఒడిస్సీయస్ కి బుద్ధి చెప్పే అంతరాత్మకి సంకేతం సముద్రం. యుద్ధం పేరుతో చేసిన ఘోరాలు చాలు. ఇప్పుడు ఇల్లు అనే అంతరాత్మకి తిరిగి వెళ్ళాలంటే ఆత్మశుద్ధి చేసుకోనిదే వీల్లేదని సముద్ర దేవుడు సృష్టించే ఆటంకాలు.


ప్రయాణంలో ప్రతి ద్వీపం,.ప్రతి రాక్షసుడు, ప్రతి దేవత...అతను ఎదుర్కొనే ఒక అంతర్గత బలహీనతకి ప్రతీకలు. సైరన్లు : ఆత్మ శుద్ధికి అడ్డుపడే ఫీలింగ్. సగం పక్షి, సగం స్త్రీ రూపంలో వుండే జీవులు. అందమైన పాటలతో నావికుల్నిఆకర్షించి, మార్పు అనే తీరం చేరకుండా ముంచేసే ఒడిస్సీయస్ లోని నెగెటివ్ ఫీలింగ్స్. దీన్ని జయించాలి.

సిర్సీ : ఈ మంత్రగత్తె జంతు ప్రవృత్తికి – ఫీలింగ్స్ కి సింబల్.  మనుషుల్ని నీచ స్థాయిలో పందులుగా మార్చేస్తుంది. అంటే ఒడిస్సీయస్‌ తనలో వున్న జంతు ప్రవృత్తి అనే ఫీలింగ్ ని జయించాలన్న మాట.

స్కైల్లా అండ్ చారిబ్డిస్ : ఒకవైపు ఆరు తలల రాక్షసి (స్కైల్లా) ఓడలోని మనుషుల్ని  ఎత్తుకుపోతుంది. మరోవైపు సముద్రంలో పెద్ద సుడిగుండం (చారిబ్డిస్) ఓడని  మింగేయడానికి చూస్తుంది. అంటే తనలోని దురాశ, దుర్నీతి అనే రెండు అత్మవినాశక ప్రవృత్తుల్ని అంతమొందించుకుని బయటపడాలన్న మాట.

కాలిప్సో : ఒడిస్సీయస్‌ని  ప్రేమించి, అతడికి అమరత్వం ప్రసాదిస్తానని ఆశచూపి తన ద్వీపంలో ఏడు సంవత్సరాల పాటు బంధించే వాంప్. అంటే తనది కాని దానిపట్ల వ్యామోహం పెంచుకునే బలహీనత. దీన్ని అతను జయించాలి. దీంట్లో ఏడు సంవత్సరాలనే కాలపరిమితి దేనికి? దేనికంటే - ఇంగ్లీషులో  సెవెన్ ఇయర్స్ ఇచ్ అంటారు. వివాహంలో లేదా ఓ దీర్ఘకాలిక సంబంధంలో ఆనందం, సంతృప్తి అనేవి  ఏడేళ్ళ  తర్వాత తగ్గిపోతాయని ఓ నమ్మకం. అందుకని భార్య వున్న అతడ్ని ఆమె ఏడు సంవత్సరాల పాటు బంధించి వుంచింది. 

సైక్లాప్స్ : ఈ ఒంటికన్ను రాక్షసుడు  పక్షపాతానికి సంకేతం. ఇతను మనుషుల్ని తింటాడు. అంటే ఒంటి కన్నుతో పక్షపాతం కూడదని, రాజుగా రెండుకళ్ళతో సమన్యాయం చేయాలనీ ఒడిస్సీయస్ తెలుసుకుని, వాడి ఒంటికన్నుని (తనలోని ఒంటి కన్నుని)  పొడిచేసి పారిపోతాడు.

ఇలా ‘ఒడిస్సీ’ లోని రాక్షసులు కేవలం ఫాంటసీ పాత్రలు కాదు. వాటికి తాత్విక అర్ధాలున్నాయి. మన ఊహకందిన అర్ధాలు ఇవీ. మనో వైజ్ఞానికులు ఇంకా బాగా చెప్పవచ్చేమో. ఈ ప్రతీకల్ని కేవలం దృశ్య వైభవంగా కాకుండా, లోతయిన భావోద్వేగ స్థాయిలో చూపడం గొప్ప విజయంగా నిలిచింది.

ఈ సినిమాలో విలన్ లేడు. కానీ సముద్రం ఒక ప్రత్యర్థి. దేవతలు, రాక్షసులు  ప్రత్యర్ధులు, కాలం ఒక ప్రత్యర్ధి, అతడి అహంకారం (ఇగో) అసలు ప్రత్యర్ధి!  ఈ సినిమా వేసే తాత్విక ప్రశ్నలు - నిజమైన విజయం అంటే  ఏమిటి? ఇంటి విలువ ఎప్పుడు తెలుస్తుంది? యుద్ధంలో గెలిచినవాడు జీవితంలో కూడా గెలుస్తాడా? మనిషిని  ముందుకు నడిపించేది అహంకారమా, ప్రేమా? ఈ ప్రశ్నలే ఒడిస్సీని శాశ్వత క్లాసిక్‌గా నిలబెడతాయి.

3/d  ఆ ఇద్దరి పక్కన మరి ఇతను?



ఇక్కడ యాదృచ్చికంగా అశోక చక్రవర్తి గుర్తుకు రాక మానడు. ఒడిస్సీయస్, అశోకుడు ఒకే నాణేనికి రెండు ముఖాలుగా కనబడతారు. యుద్ధంతో చివరికి ఇద్దరూ నేర్చుకున్నది ఒకటే. ఇద్దరూ క్రూరమైన యుద్ధంలో తమ తొలి పరాక్రమంతో గుర్తింపు పొందారు, కానీ ఇద్దరూ దాని తర్వాత కలిగే వినాశకర భావోద్వేగ పరిణామాల్నికూడా  ఎదుర్కొన్నారు. ట్రోజన్ యుద్ధపు  నైతిక మూల్యాన్ని ఒడిస్సీయస్ నెమ్మదిగా గ్రహించడం, అప్పుడతడికి కలిగిన దుఃఖం, కళింగ యుద్ధం తర్వాత అశోకుడికి కలిగిన ప్రగాఢ పశ్చాత్తాపమూ ఒకటే కదా?

ఘోర ప్రాణనష్టాన్ని చూడడం ఆ ఇద్దరి ప్రపంచ దృక్పథాన్ని పూర్తిగా మార్చుకునేలా ప్రేరేపించిందే. ఒడిస్సీయస్, తన హక్కు అయిన ఇంటికి  తిరిగి చేరుకోవాలని తపించే విజేత నుంచి, మరింత వివేకవంతుడైన, సంయమనం గల నాయకుడిగా పరివర్తన చెందడం; అదేవిధంగా, అశోకుడు దురాక్రమణ విజయాల్ని విడనాడి, అహింసకి తలవంచి, బౌద్ధమతాన్నిస్వీక్కరించి,  దాని వ్యాప్తికి పాటు పడే ఆథ్యాత్మిక మార్గాన నడవడం - తేడా ఏమిటంటే ఒకటి పురాణం, మరొకటి చరిత్ర. బాగానే వుంది- మరి ఇప్పుడు నడుస్తున్న చరిత్ర? అందులో ట్రంప్? వాట్ ఎబౌట్ ది గ్రేట్ డోనాల్డ్ ట్రంప్? తను ఒడిస్సీయస్-అశోకుడుల పక్కకొచ్చి ఇంకెప్పుడు  నించుంటాడని!

4. నటనలు- సాంకేతికాలు


ఒడిస్సియస్ గా మాట్ డామన్ పదేళ్ళ ఆత్మశోధన  ప్రయాణంలో  జుట్టు నెరిసి, కళ్ళల్లో అలసట పెరిగి విరాగిలా అద్భుతంగా కనిపిస్తాడు. చివరికి బిచ్చగాడి మారువేషం హైలైట్. కండ బలం కంటే బుద్ధి బలంతో  యుద్ధాలు గెలిచే రాజు నుంచి ఒక మనిషిగా,  వివిధ ఎపిసోడ్లలో వివిధ ఎమోషన్స్ ని అనుభవించక తప్పని పరిస్థితులకి ప్రమోటయ్యే క్యారక్టర్ ఆర్క్ ని చక్కగా నిలబెట్టుకుంటూ పోయాడు. నోలన్ ఇతడ్ని ఒక పర్ఫెక్ట్ హీరోలా కాకుండా, తప్పులు చేసే, అహంకారం వున్న ఒక సాధారణ మనిషిగానే చూపించాడు.

భార్య పెనెలోప్ గా ఏన్ హాథ్వే  నటించింది. గ్రీకు పురాణాల్లో పెనెలోప్ అంటే పతివ్రత, ఓర్పుకి  ప్రతీక. కానీ ఈ సినిమాలో  ఆమెకి  కొంత ఆధునికతని జోడించారు. భర్త లేకపోయినా సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ, శత్రువుల వ్యూహాల్ని  తిప్పికొట్టే బలమైన రాజకీయ నాయకురాలిగా ఆమె పాత్ర, నటన ఆకట్టుకుంటాయి.

కొడుకు టెలిమాకస్ గా టామ్ హాలండ్ తండ్రిని చూడకుండానే పెరిగి, అతడి గురించిన  కథలు వింటూ పెరిగిన కుమారుడు. తండ్రి ఇమేజి తన మీద కలిగించే వొత్తిడిని, చివర్లో తండ్రితో కలిసి చేసే పోరాటాన్నీ  చాలా ఎమోషనల్‌గా క్యారీ చేశారు’

పెళ్ళికోసం పెనలోప్ ని వేధించే  జిత్తులమారి  ప్రేమికుడు ఆంటినస్ పాత్రలో, ప్యాటిన్సన్ కూడా అంతే ఆకట్టుకుంటాడు. అతడి నటన ఈ సినిమాలోని అతి పెద్ద హైలైట్లలో ఒకటి.

సాంకేతికంగా – భారీ గ్రాఫిక్స్ తో, ఇప్పుడు ఏఐతో కూడా, డిజైనర్ పురాణాలూ డిజైనర్ చరిత్రలూ కప్పుకుని వచ్చేస్తున్న నేటి కాలపు సినిమాలకి దూరంగా, పీరియెడ్ వాతావరణాన్ని సహజత్వంతో ప్రెజెంట్ చేసిన విధానం నోలన్ అజేయ క్రియేటివిటీకి ప్రబల నిదర్శనంగా వుంటుంది. సిజిఐ ని అవతలికి నెట్టి, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ తో చిత్రీకరించిన దృశ్యాలు ప్రేక్షకుల్ని నిజంగా ప్రాచీన కాలంలోకి తీసికెళ్ళి పోతాయి. 70% ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ నే  ఉపయోగించారు. సినిమా ప్రారంభంలో వచ్చే ట్రోజన్ గుర్రాన్ని కలపతో  నిజంగానే 80 అడుగుల ఎత్తుతో నిర్మించారు. సముద్రంలో వచ్చే చాలా సీన్లని  స్టూడియో పూల్స్‌లో కాకుండా, మాల్టా తీరంలో నిజమైన ఓడల్ని తయారు చేసి చిత్రీకరించారు. దీని కోసం నటీనటులు నెలల తరబడి సముద్ర ప్రయాణ శిక్షణ తీసుకున్నారు. అందుకే ఆ విజువల్స్‌లో అంత సహజత్వం కనిపిస్తుంది.

సినిమాలో సముద్రం కేవలం ఒక లొకేషన్ కాదు, అదొక సజీవ పాత్ర. లూడ్విగ్ గోరాన్సన్ అందించిన సౌండ్ డిజైన్, సముద్రపు అలల చప్పుడుని ఒక భయంకర  రాక్షసుడి గర్జనలా థియేటర్లలో ప్రతిధ్వనిస్తుంది. మోత బరువు ఐమాక్స్ కెమెరాలతో  తీసిన సముద్రపు సుడిగుండాల షాట్స్, మనల్ని ఇరుకు గొట్టంలో పడి ఊపిరాడక గిలగిల కొట్టుకుంటున్నట్టు చేస్తాయి. విశాలమైన సముద్ర దృశ్యాలు హీరో ఒంటరితనాన్ని మరింత బలంగా తెలియ
జేస్తాయి. ఛాయాగ్రాహకుడు హోయిట్ వాన్ హోయిటెమా ఈ పౌరాణిక ప్రపంచపు బేలతనాన్ని, సౌందర్యాన్నీ అద్భుతమైన డిటెయిలింగ్ తో చిత్రీకరించాడు.

జెన్నిఫర్  లేమ్ ఎడిటింగ్ లో ఒక కదిలించే సన్నివేశముంది- ఒడిస్సీయస్ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, అతడి భార్య ఇథాకాలో పడే వేదనని  సమాంతర ఎడిటింగ్ తో  చూపించడంతో, మనం ఆ ఇద్దరి మధ్య వున్న మానసిక బంధాన్ని బలంగా ఫీలవుతాం.

చెక్క గుర్రం, ట్రాయ్ విధ్వంసం, ఒంటికన్ను రాక్షసుడ్ని ఒడిస్సీయస్ ఎదుర్కోవడం వంటివి దృశ్యపరంగా ఆకట్టుకునే ఘట్టాల్లో కొన్ని. క్లయిమాక్స్ లో వచ్చే తండ్రీకొడుకులు కలిసి     శత్రువులందరినీ వేటాడే దృశ్యాన్ని నోలన్ ఒకే ఒక్క లాంగ్ షాట్  లో చిత్రీకరించడం ఒకెత్తు.  రక్తం ఏరులై పారుతున్నా, అందులో ఒక న్యాయం, ఒక కుటుంబపు ఆక్రోశం కన్పించి, సంతృప్తి వేస్తుంది ప్రేక్షకులకి.

5. చివరికేమిటి?

మతాలతో సంబంధం లేకుండా ఏ పురాణమైనా గాథగానే వుంటుంది, కథగా కాదు. ప్రపంచ పురాణాలని పరిశోధించిన జోసెఫ్ క్యాంబెల్ ఈ విషయమే కనుగొని, గాథలన్నిట్లో ఆయా పురాణ పాత్రల ప్రయాణ మెలా వుంటుందో పుస్తకం రాశాడు- ‘ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్’. ఈ ప్రయాణం 17 మజిలీలుగా వుంటూ, ఆ మజిలీల్లో సబ్ కాన్షస్ మైండ్ ప్రతీకలతో పోరాడుతూ వెళ్ళి, చివరికి ఆథ్యాత్మిక  ఔన్నత్యాన్ని –లేదా మోక్షాన్ని పొందుతుంది పురాణ పాత్ర. సబ్ కాన్షస్ మైండ్ తో ఈ సంఘర్షణ క్షీరసాగర మథనమే. ఇలా పురాణాలు మనసు గురించి చెప్పి, దాన్ని ఎలా మేనేజ్ చేసుకుని బాగుపడలో బోధిస్తాయి. కానీ వేల సంవత్సరాలుగా మనుషులు మాత్రం  దీన్ని అర్ధం జేసుకోక, భక్తితో కేవలం పురాణ పురుషుల్ని పూజించి తరిస్తున్నారు. నేర్చుకునేదేమీ లేదు.

పురాణాలు అసలుకి చేసేది సైకో తెరఫీ అయితే, అవి గాథలు కాబట్టి కథాగమనం  నిదానంగా వుంటుంది. జోసెఫ్ క్యాంప్ బెల్ ఇలాటి  గాథల నిర్మాణాన్ని ‘మోనోమిత్’ అన్నాడు. ఇందులో పురాణ పురుషుడుకి 17 మజిలీలతో కూడిన సుదీర్ఘ  ప్రయాణం వుం టుందన్నాడు. ఏ మజిలికి ఏ ప్రయాణం ఎలా సాగుతుందో వివరించాడు. దీంతో హాలీవుడ్ దీన్నుపయోగించి సొమ్ము చేసుకోవాలని  స్టార్ వార్స్ సిరీస్, ఇండియానా జోన్స్ సిరీస్ వంటి సినిమాలు అనేకం ఉత్పత్తి చేసింది. తర్వాత 17 మజిలీలు ఈ కాలానికి అవసరం లేదని, మైకేల్ హాగ్ వచ్చేసి 10 కి కుదించాడు. అయినా కాలానికి తగ్గట్టు కథల వేగం పెరగలేదు. అప్పుడు సిడ్ ఫీల్డ్ రంగ ప్రవేశం చేసి, 10 మజిలీల్ని 5 మజిలీలకి కుదించి అమాంతం స్పీడు పెంచాడు. అలా 1990 ల నుంచీ హాలీవుడ్ సినిమా కథలు సిడ్ ఫీల్డ్ పేరు పెట్టిన త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ ‘పారాడైం’ తోనే వస్తున్నాయి ఇప్పటికీ.

ఈ నేపథ్యంలో క్రిస్టఫర్ నోలన్ వచ్చేసి ‘ఒడిస్సీ’  స్క్రీన్ ప్లేకి క్యాంప్ బెల్ మోనోమిత్ ని వాడుకున్నానని చెప్పాడు. మోతబరువు కెమెరాల్లాగా మోతబరువు గాథ అయిపోయింది. పైగా దీన్ని ఆ 17 ఏళ్ళ మాస్ కుర్ర ప్రేక్షకుల దగ్గర్నుంచీ, అంతకంటే పెద్దవాళ్ళ నీ టార్గెట్ చేసి తీశానన్నాడు. 17 ఏళ్ళ మాస్ కుర్ర ప్రేక్షకులో, ఇంకెవరో దీన్ని వినోదం కోసం కాకుండా  విజ్ఞానం కోసం చూస్తారనే నమ్ముతూ ముగిద్దాం!

-సికిందర్