రచన –కూర్పు - దర్శకత్వం : వెంకటేష్ మహా
తారాగణం : సత్యదేవ్, దీపా
థామస్, వికాస్ ముప్పాల, బాలా పరాశర్, ఆనంద్
భారతీ, ప్రణయ్ వాకా, కునాల్ కౌషిక్, మాస్టర్
కిరణ్ తదితరులు
సంగీతం : స్మరణ్ సాయి, ఛాయాగ్రహణం
: కార్తీక్ పర్మార్, కళ : : రోషన్ సింగ్,
సమర్పణ: ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్
బ్యానర్స్ : శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్
నిర్మాతలు: చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్
రెడ్డి, శరత్ చంద్ర
విడుదల : జులై 3, 2026
***
దర్శకుడు వెంకటేష్ మహా (‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్) కొత్త
కళాత్మక కానుక ‘రావు బహదూర్’ ప్రేక్షకుల ఉత్తమాభిరుచిని పరీక్షిస్తూ వెండితెర
మీదికొచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పించడంతో దీనికి మంచి బజ్ వచ్చింది.
హీరో సత్యదేవ్ ని కొత్తావతారంలో చూపిస్తూ వచ్చిన అత్యంత సాహసోపేత, వినూత్న, విలక్షణ చలన చిత్రాల్లో ఒకటిగా నిలిచేందుకు
విచ్చేసింది. తెలుగు సినిమాల్లో ప్రయోగాలెప్పుడూ
ప్రశ్నార్దకాలుగానే వుంటూ వచ్చాయి. ఆర్ట్ సినిమాల్లాంటి యూరోపియన్ సినిమాల
గొడవ మనకెందుకని హాలీవుడ్ కూడా తనదారిలో తానూ కమర్షియల్ సినిమాల వైపే వుంటూ
వస్తోంది. మన దేశంలో కూడా యూరోపియన్ సినిమా లేవీ థియేటర్లలో విడుదల కావు. ఎందుకంటే
ప్రేక్షకులు చూడరు. మరి ‘రావు బహదూర్’ లాంటి ఫ్రెంచి అబ్సర్డ్ థియేటర్ బాపతు సినిమా ప్రేక్షకుల
ఉత్తమాభిరుచిని గెలుచుకోగలదని ఎలా నమ్మి నిర్మించారు. ఇది పూర్తిగా అబ్సర్డ్
థియేటర్ బాపతేనా, లేక సగం అబ్సర్డ్ సగం రెగ్యులర్ తెలుగు సినిమా కల్తీ జరిగి
కళ్ళముందు కరాళ నృత్యం చేసిందా తెలుసుకుందాం...
బ్రహ్మానంద నగరంలో ‘భువనాలయం’ అనే ఒక
శిథిలావస్థకి చేరుకుంటున్న రాజభవనంలో మొదలవుతుంది కథ. ఇక్కడ అరవై ఏళ్ళ భువనం రావు
బహదూర్ రామప్ప (సత్యదేవ్) అనే అతను చివరి దశ కాలేయ క్యాన్సర్తో బాధపడుతూ వుంటాడు.
కులాహంకారం, పితృస్వామ్య వ్యవస్థాపేక్ష, సామాజిక మూఢనమ్మకాలూ దండిగా నిండిన
గతాన్ని మోస్తూ జీవిస్తుంటాడు. డాక్టర్లు అతను చనిపోతాడని చెప్పినా, మెడికల్ సైన్సుని
ఛాలెంజ్ చేస్తూ బతికేస్తుంటాడు. శారీరక
స్థితికి తోడూ చిత్తభ్రాంతులతో, తనతో తానూ మాట్లాడుకునే స్వగతాలతో అతడి మానసిక
స్థితి కూడా ఘోరంగా వుంటుంది. దీనికి కారణం అనుమానమనే భూతం. ఇతడ్ని మందలిస్తూ డాక్టర్
ఆచారి (వివేక్ ముప్పల) అనే అతను తోడుగా వుంటాడు.
భార్య రేణుక (దీపా థామస్) ఇంకో గదిలో ఏళ్ళ తరబడీ తలుపు
లేసుకుని వుండి పోతుంది. రాజ భవన
వ్యవహారాల్ని, రామప్ప బాగుగుల్నీ చూసుకుంటూ పెద్ద కొడుకు లవణప్ప వుంటాడు.
వివాదాస్పదుడైన చిన్న కొడుకు కుసుమప్ప (మాస్టర్ కిరణ్) చిన్నప్పుడే నీటమునిగి
చనిపోయాడు. రామప్పని చూసుకుంటూ పని మనిషి అచ్చమ్మ (బాలా పరాశర్) కూడా వుంటుంది. అనుమానం
అనే భూతం పట్టిన రామప్ప, అది పోయే వరకూ తను పోయే ప్రసక్తే లేదని చెబుతూంటాడు.
అనుమాన భూతంతో జీవితాన్ని, మానవ సంబంధాల్నీ కచరా చేసుకుని,
సమస్యగా మారిన రామప్పని భరించేదెలా? ఇతను బాగు పడేదెలా? ఇతడి అనుమానం దేని
గురించి? భార్య ఎందుకు బందీ చేసుకుని వుండి పోయింది? చిన్న కొడుకు చావుకి
కారణమేమిటి? ఇవన్నీ మిగతా కథలో తేలే
అంశాలు.
అనుమానం పెనుభూతం అనే పాయింటుతో కథ చెప్పాలనుకున్నారు. అనుమానం అనేది సినిమాలకి
సక్సెస్ ఫార్ములా కిందే వర్కౌట్ అవుతూ వచ్చింది- రాం గోపాల్ వర్మ మాఫియా యాక్షన్ ‘కంపెనీ’ అయితేనేం, రాజేష్ ఖన్నా- ముంతాజ్ ల
ఫ్యామిలీ డ్రామా ‘ఆప్ కీ కసమ్’ అయితేనేం ఈ ఫార్ములాకి ఫోటో ఫ్రేములా నిలిచాయి.
అయితే ఈ కథలు కేవలం అనుమానం ఎంత పనిచేస్తుందో ఆ ఒకే పాయింటు చుట్టూ తిరుగుతూ
తేలికగా అర్ధమవుతూ వుంటాయి. ఏ కథైనా ఒక సమస్యనే తీసుకుని చర్చించాలన్న ఏక సూత్రతకి
కట్టుబడుతూ.
‘రావు బహదూర్’ కథతో వున్న అనుమానమనే పాయింటే గాకుండా, వంశాభివృద్ధి,
కులాహంకారం, వర్ణవివక్ష, పితృస్వామ్య
వ్యవస్థాపేక్ష, సామాజిక మూఢనమ్మకాలూ, ఫ్యూడల్ మనస్తత్వం వంటి సవాలక్ష
అంశాల్నీ స్పృశించడంతో రెండు జరిగాయి -
అనుమానం పెనుభూతమనే అసలు పాయింటు గల్లంతై, కథ కలగాపులగమవడం.
రామప్ప అనారోగ్యంతో
బాధపడుతూ, గత కాలపు జ్ఞాపకాల్లోనే బతికే ఒక జమీందారీ వంశస్థుడు.
పతనమవుతున్న ఆ వైభవంలో చిక్కుకుపోయిన అతను, చిత్తభ్రాంతులతో కూడిన మానసిక సమస్యలతో పతనమయ్యే తాగుబోతు కథ.
ప్రాణం పోయే లోపు తనని వెంటాడుతున్న అనుమానానికి సమాధానం కనుగొనాలని తపించే కథ. ఈ
క్రమంలో కథ విభిన్న కాలాల మధ్య సాగుతూ, సమాజంలో వర్గ భేదాలు, వారసత్వం, వంశాన్ని
నిలబెట్టే వారసుడి కోసం పడే ఆరాటం, అంతరించిపోయిన వైభవాన్ని కాపాడుకోవడానికి పడే
మానసిక వేదనా వంటి అనేక అంశాల్ని చిత్రిస్తూ పోతుంది.
కానీ ఆలోచిస్తే కథకి, పాత్రకీ ఇవేవీ ముఖ్యం కావు- అతడి
ప్రాణాలకి పట్టుకున్న అనుమానమనే భూతమొక్కటే ముఖ్యం కావాలి. నిజమేంటో తెలుసుకుని
ప్రాణాలు వదలడమే అతడి గోల్. ఈగోల్ చెదిరిపోయేలా ఇతర వ్యాపకాలు పెట్టుకోవడం
వ్యక్తిత్వ వికాస పాఠాలతో చూసినా రాంగ్.
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ కథ అనుమానం పాయింటుతో రామప్ప క్యారక్టర్
స్టడీ. రామప్ప పాత్ర విశ్లేషణ. అయితే ఇదే శృతి మించి కొంప ముంచింది. ఇదెలాగో చివర
చూద్దాం. నల్లగా పుట్టిన రెండో కొడుకు తనకే పుట్టాడా అనే అనుమానంతో భార్యని దూరం
చేసుకుని, నానా రభస చేసే రామప్ప పాత్ర ముగింపు చూస్తే, 1971 లో బీవీ కారంత్-
గిరీష్ కర్నాడ్ లు దర్శకత్వం వహించిన కన్నడ ఆర్ట్ సినిమా ‘వంశవృక్ష’ లో వెంకటరావు
తలిగెరీ నటించిన ప్రధాన పాత్ర కిచ్చిన ముగింపునే పోలి వుంటుంది -తన జన్మ వృత్తాంతం
తెలిసే షాకింగ్ వాస్తవంతో. తెలుగులో దీన్ని బాపు ‘వంశవృక్షం’ గా రీమేక్ చేశారు జేవీ
సోమయాజులు పాత్రకి అదే ముగింపు నిస్తూ (ప్రస్తుతం ‘పాలపిట్ట’ పత్రిక్కి
‘వంశవృక్షం’ సమీక్ష రాస్తూంటే, ఇందులో రావు బహదూర్ ముగింపుతో పోలికలు బయటపడ్డాయి).
కథనంలో తలెత్తే పైన చెప్పుకున్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు
దొరుకుతాయి. మనుషుల కుల, మత వర్గ వ్యవస్థలు కేవలం సామాజిక కండిషనింగ్
మాత్రమే నని చెప్తూ, ఆ రాజభవనం పాత గోడలపై వున్న పూర్వీకుల
చిత్రపటాల వెనుక వున్న అసలు సత్యాన్ని విప్పుతూ కథని ముగించాడు దర్శకుడు. దీనికీ
అనుమానం పెనుభూతం పాయింటుకీ ఏమిటి సంబంధం? ఈ సామాజిక కండిషనింగ్ నుంచి అనుమానమనే పెనుభూతం
పుట్టనప్పుడు, ఆ సామాజిక కండిషనింగ్ ని నిందించడమెందుకు పాపం? అసలు అతడి
అనుమానానికీ సామాజిక కండిషనింగ్ కీ సంబంధమే లేనప్పుడు, పరస్పరం లడాయి కూడా పెట్టనప్పుడు,
ఈ ముగింపు ఎందుకు? ముగింపు ‘అనుమానం’ అనే పాయింటు
కివ్వాలి కదా?
ఇంకా ముగింపు రామప్ప జన్మ వృత్తాంతంతో, ‘వంశవృక్షం’ మార్కు వూహించని మలుపులతో సాగుతుంది. రామప్ప తన
పితృస్వామ్య బంధాల నుంచీ,సామాజిక అహంకారం నుంచీ ఎలా విముక్తి పొందాడో కూడా ఈ కథలో
భాగమే. క్యారక్టర్ స్టడీ పేరుతో పాత్ర మీద ఇన్ని సమస్యల భారాన్ని మోపడంతో కథే బలి
అయింది. 1977 లో కృష్ణంరాజు నటించిన ‘అమరదీపం’ లో తమ్ముడు మురళీ మోహన్ తన భార్య
జయసుధ తో అన్నకి సంబంధముందని అనుమానించడంతో, కృష్ణంరాజు చివరికి ఆ అనుమాన నివృత్తికి ఇంకో
దారి లేక, ఆత్మహత్య చేసుకుని కళ్ళు తెరిపిస్తాడు. అనుమానం పాయింటుతో సింపుల్ గా
అర్ధమయ్యే కథ. ‘రావు బహదూర్’ అనుమానం పాత రోగం కథని వెతుక్కుని మరీ చూడాలి.
సత్యదేవ్ చాలా ఆశ్చర్యపర్చే సినిమా ఇది. ఇలా నటించడం ఇతడికి సాధ్యమా అని
అడుగడుగునా సవాలు విసురుతాడు. ఏక పాత్రాభినయం సీన్లు కూడా ఉత్తమంగా పోషించాడు. తన
పాత్ర రావు బహదూర్ జీవితంలోని విభిన్న కాలాల్ని చూపించడానికి శారీరకంగా మారిన
విధానం, పాత్ర మానసిక స్థితిని పండించిన తీరూ ప్రశంసనీయం.
ఏక పాత్రాభినయపు విరుపులతో బాటు, ఫోర్త్-వాల్ బ్రేక్స్ సందర్భాలు గల మానసిక
పీడితుడి క్లిష్ట పాత్రని అద్వితీయంగా
పోషించాడు. యవ్వనంలో వుండే దూకుడు నుంచి, వృద్ధాప్యంలో వచ్చే
మానసిక దైన్యం వరకూ అద్భుత వైవిధ్యాన్ని
ప్రదర్శించాడు. ప్రొస్థెటిక్ మేకప్లో కూడా కళ్ళతోనే హావభావాలు నేర్పుగా పలికించాడు.
యౌవనంలో జాన్ లెన్నన్ లుక్ తో హిప్పీ సంస్కృతికి దగ్గరగా వుండే
రామప్పనుంచీ , వ్యవస్థ ఒత్తిడి వల్ల ఒక క్రూర, సాంప్రదాయవాదిగా మారే
మెటామార్ఫసిస్ ని ఉన్నతంగా ప్రెజెంట్ చేశాడు.
ఒకవైపు క్యాన్సర్తో చనిపోతున్నా, తన రక్తం
గొప్పదనే అహంకార ప్రదర్శన కూడా ఒకెత్తు. అదే సమయంలో, గతంలోచేసిన
తప్పులు చిత్తభ్రాంతుల రూపంలో బీభత్సంగా వెంటాడే తీరునీ బలంగా ప్రదర్శించాడు. ఇలా ఈ
పాత్రని సృష్టించిన దర్శకుడు కూడా అంతే ప్రశంసార్హుడనాలి.
అలాగే, హీరోయిన్ రేణుక (దీపా
థామస్) పాత్ర ఫస్టాఫ్లో చాలా స్వతంత్రంగా, బలంగా వుంటూ, సెకండాఫ్
కొచ్చేసరికి సరైన కారణాలు లేకుండానే భర్త వేధింపుల్ని భరించే సాధారణ స్త్రీగా
మారిపోతుంది. భర్త అనుమానించిన వెంటనే కొడుకుని తీసుకుని వాకౌట్ చేయడం ఆమె
చేయాల్సిన పని. కొడుకు చనిపోయాక కూడా వెళ్ళిపోకుండా అక్కడే తలుపులేసుకుని వుండి
పోతుంది. తన గురించి పెద్ద కొడుకు కూడా తండ్రిలాగే మాట్లాడు తున్నప్పుడూ వచ్చి
లాగి కొట్టకుండా గదిలోనే వుండి పోతుంది.
డాక్టర్ పాత్రలో వికాస్ ముప్పాల చాలా పరిణతి చెందిన నటనని కనబర్చాడు. రామప్ప
పాత్రతో సంఘర్షణాత్మక సీన్లని సులువుగా
ఎదుర్కొన్నాడు. పాత్రకి ఒక రకమైన గ్రే షేడ్ వున్నా, పాత్రలో వున్న
హూందాతనాన్ని కాపాడుతూ వచ్చాడు.
ఇంకో పాత్ర పనిమనిషి అచ్చమ్మ. ఈ పాత్రలో బాలా పరాశార్ కాస్త
తిక్క, మరికొంత కొంటెతనం ప్రదర్శిస్తూ కథ కెంతో ఉపయోగపడే పాత్రయింది.
సంభాషణలు పదునుగా, లోతైన అర్ధాలతో
సాగుతాయి. కార్తీక్ పర్మార్ ఛాయాగ్రహణంలో ఫ్రేమింగ్స్ చాలా క్లాసీగా, విజువల్స్ మూడ్కి తగ్గట్టుగా వున్నాయి- ఆ పాత
జమీందారీ ఇల్లు కూడా కథలో ఒక పాత్రలా చేస్తూ. స్మరణ్ సాయి అందించిన బ్యాక్గ్రౌండ్
స్కోర్, పాటలు పీరియడ్ కథకి తగ్గట్టు వున్నాయి. రోషన్ సింగ్ కళాదర్శకత్వానికే
బడ్జెట్ ఎక్కువ ఖర్చయినట్టుంది.
ముందుగా చెప్పుకున్నట్టు ఇది ఫ్రెంచి
అబ్సర్డ్ (అసంబద్ధ) థియేటర్ కోవకి చెందిన మేకింగ్. ఇది అహేతుకమైన కథాంశాలు, పొంతన లేని
సంభాషణలు, రిపీటయ్యే, అక్కడక్కడే తిరిగే వలయాకార కథనాలకి పెట్టింది పేరు. ఇది ఆల్బర్ట్
కామూ ఫిలాసఫీ నుంచి ఎక్కువగా ప్రేరణ పొందింది. కామూ ‘అసంబద్ధత’ ని అర్ధాన్ని
అన్వేషించే వాడి అర్థాన్వేషణకూ- ప్రశాంత, నిశ్శబ్ద విశ్వానికీ మధ్య వుండే సంఘర్షణగా నిర్వచించాడు. ఇది అర్ధం
జేసుకోవాల్సిన అవసరం లేదు. యూరోపియన్ కల్చర్ లో భాగమైన సినిమాలు తెలుగులో అవసరం
లేదు. రామప్ప పాత్ర చిత్రణతో సమస్య ఇదే.
పాత్రలు పొంతన లేకుండా, మూస ధోరణిలో, పునరావృతాలతో మాట్లాడతాయి. సాంప్రదాయ కథా
వస్తువు లేకపోవడం కూడా ఒకటీ. ఈ కథలకి స్పష్టమైన ఆరంభాలు, మధ్య భాగాలు, ముగింపులూ వుండవు.
అంటే త్రీ యాక్ట్స్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వుండదు. సంఘటనలు సరళరేఖలో కాకుండా
లూప్ లో వున్నట్టు తిరుగుతూ వుంటాయి.
దర్శకుడు వెంకటేష్ మహా ఈ థియేటర్ ఆఫ్ ది అబ్సర్డ్ కి, బ్లాక్ కామెడీని కలిపి
క్యారక్టర్ స్టడీకి ప్రాధాన్యమిచ్చి కథ చేసినప్పుడు ఏం నష్టం జరిగిందో ఇప్పుడు
చూద్దాం. రెండు గంటలా 50 నిమిషాలూ సాగే ఈ కథ, గంటా 50 నిమిషాలు కథే లేకుండా కేవలం
వివిధ పార్శ్వాల్లో రామప్ప పాత్ర పరిచయ పాఠంగానే సాగుతుంది. అంటే ఇంతసేపూ కథలోకి వెళ్ళకుండా
రామప్ప క్యారక్టటర్నే చెప్పుకుంటూ పోయారు. ఆ క్యారక్టర్ కూడా చాలావరకూ ఏక
పాత్రాభినయం చేస్తూ, స్వగతంతో వీరంగం వేయడం. కథ ప్రారంభించకుండా, క్యారక్టర్ స్టడీ
చేస్తూ పాత్రనే చెప్పుకుంటూ పోతే వర్కౌట్ కాదని కొన్నేళ్ళ క్రితం అనుభవపూర్వకంగా
రుజువయ్యింది. ఇప్పుడు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా బిజీగా వుంటున్న డాక్టర్
రాయల హరిశ్చంద్ర అడిగితే, ‘నేను రాముణ్ణి’ అనే 45 నిమిషాల నాటిక రాసిచ్చాడు ఈ
వ్యాసకర్త. ఇది స్వగతంతో పూర్తిగా ఏకపాత్రాభినయం. ఇంకో పాత్ర వుండదు. దీన్ని నంది
నాటకోత్సవాల సెలక్షన్స్ కి బ్రహ్మాండంగా నటించి, దర్శకత్వం వహించి చూపారు
హరిశ్చంద్ర. నిర్ద్వంద్వంగా రిజెక్ట్ అయింది. కారణం? స్వగతం చెప్పుకునే ఏక
పాత్రాభినయం వర్కౌట్ కాదు. ఎందుకంటే, ఇందులో పాత్ర తప్ప కథ లేదు.
దీనికి ముందు ‘హెన్ కౌంటర్’ అనే రెండు గంటల నాటకం రాసిస్తే, బీ హెచ్ ఈ ఎల్ రాష్ట్ర
స్థాయి పోటీల్లో 5 మొదటి బహుమతులు గెలుచుకొచ్చారు హరిశ్చంద్ర. ఎందుకంటే ఇందులో
పాత్రలున్నాయి, కథా వుంది- హీరోయిన్ ఎన్ కౌంటర్
చేస్తుంది కాబట్టి టైటిల్ హెన్ కౌంటర్ అయింది- అంటే కోడి పెట్ట చేసే ఎన్ కౌంటర్.
4/a స్ట్రక్చర్ అంటే ఏమిటి?
త్రీ యాక్ట్స్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తెలిస్తే కథతో చేసే పొరపాట్లు
తెలిసిపోతాయి. ‘రావు బహదూర్’
లో బిగినింగ్ (ఫస్ట్ యాక్ట్ ) చాంతాడంత సాగి, గంటన్నర సేపు సాగే ఫస్టాఫ్ ని కూడా
దాటుకుని, సెకండాఫ్ లో మరో ఇరవై నిమిషాలవరకూ కబ్జా చేసిందని తెలుసుకున్నారా? అంటే
బిగినింగే అక్రమంగా గంటా 50 నిమిషాలు సాగింది. ఇదంతా బిగినింగే అని ఎలా చెప్తాం?
బిగినింగ్ అంటే పాత్రల పరిచయం, సమస్య ఏర్పాటుకి సంబంధించి తంతూ వగైరా కాబట్టి.
అంటే ఈ బిగినింగ్ లో వుండేది కథ కాదు, కథకి తోడ్పడే ఉపోద్ఘాతం. ఇది ఫస్టాఫ్ లో 30
-40 నిమిషాలకి మించి వుండకూడదు. ఇది ముగిసిన చోట ప్లాట్ పాయింట్ -1 వచ్చి సమస్య ఏర్పాటవుతుంది.
ఇక్కడ్నుంచీ మిడిల్ (సెకండ్ యాక్ట్) ప్రారంభమవుతుంది. అంటే
బిగింగ్ లో ఇచ్చిన ఉపోద్ఘాతాన్ని పురస్కరించుకుని కథ ప్రారంభమవుతుంది. కథ
ప్రారంభమయిందని ఎలా తెలుస్తుంది? బిగినింగ్ ని ముగించే ప్లాట్ పాయింట్ – 1 దగ్గర సమస్య, దాన్ని
పరిష్కరించేందుకు పాత్రల మధ్య సంఘర్షణా
ప్రారంభమవుతాయి కాబట్టి. ఈ మిడిల్ అనేది మొత్తం స్క్రీన్ ప్లే నిడివిలో 50 శాతం
ఆక్రమించి వుంటుంది. అంటే ప్లాట్ పాయింట్ -1 నుంచీ ఇంటర్వెల్ వరకూ
25 శాతం, ఇంటర్వెల్ నుంచీ సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్- 2 వరకూ మరో 25 శాతం. ఈ
మొత్తం 50 శాతం గంటకి పైగానే సాగవచ్చు. ఈ మిడిల్ సమస్యకి పరిష్కార మార్గాన్ని
సూచిస్తూ ప్లాట్ పాయింట్ -2 దగ్గర ముగుస్తుంది.
అంటే బిగింగ్ లో పాత్రల పరిచయాలతో, సమస్య ఏర్పాటు తంతుతో
చేసే కథనం కథ కానే కాదన్న మాట. కథకి ఉపోద్ఘాతం మాత్రమే. కానీ ఇది కూడా కథ అనుకుంటూ
ఘోరాలు చేస్తున్నారు. ప్లాట్ పాయింట్-1, ప్లాట్ పాయింట్- 2 ల మధ్య మిడిల్లో
వుండేది మాత్రమే కథ అని ఇప్పటికైనా బాగా గుర్తించాలి!! ఇక మిడిల్ ముగిసి, ప్లాట్
పాయింట్ -2 నుంచీ పరిష్కార మార్గంతో క్లయిమాక్స్ వైపు వెళ్ళే కథనం ఎండ్ విభాగం.
ఇది 25 శాతం వుండొచ్చు. అంటే స్క్రీన్ ప్లేలో ఉపోద్ఘాతంతో 25 శాతం బిగినింగ్ –
కథతో 50 శాతం మిడిల్- ఆతర్వాత ముగింపుతో 25 శాతం ఎండ్ వుంటే అది త్రీ యాక్ట్స్ స్క్రీన్
ప్లే స్ట్రక్చర్ అన్పించుకుంటుందన్న మాట.
4/b జడివాన వెలిసిన వెనుక...
ఈ స్ట్రక్చర్ తెలియకో, లేదా తెలిసినా వద్దనుకునో చేస్తే
ఏమవుతుంది? ఫస్టాఫ్ అంతా ఆక్రమించి, సెకండాఫ్ లో ఇంకో ఇరవై నిమిషాల వరకూ దురాక్రమించి,
రామప్ప పాత్ర పరిచయ తంతే, అంటే ఉపోద్ఘాతమే ప్రేక్షకుల సహన శక్తి మీద దాడి చేస్తూ
పోతుంది. సెకండాఫ్ లోకి ప్రవేశించినా కూడా
కథేమిటో అర్ధం గాకుండా పోతుంది. ఇంకోటేమిటంటే, ఫస్టాఫ్ లో ఈ బిగినింగ్ లోనే ఫ్లాష్
బ్యాక్ ప్రారంభించి హీరోయిన్ తో రోమాన్స్ కొనసాగిం
చారు. మిడిల్ కథలో భాగంగా వుండే ఈ ఫ్లాష్ బ్యాకుని, బిగినింగ్ ఉపోద్ఘాతంలో ఎలా చూపిస్తారు?
సకాలంలో కథ ప్రారంభమవక పోవడానికి ఇది కూడా ఒక కారణం.
సెకండాఫ్ ఇరవై నిమిషాలు గడిస్తే గానీ ఈ ఉప్పోద్ఘాతమనే ఉరితాడు తెగి మిడిల్
ప్రారంభం కాలేదు. ఫస్టాఫ్ ప్రారంభంలో 25 శాతం వుండాల్సిన ఉపోద్ఘాతం (బిగినింగ్) తెగసాగి,
మిడిల్ ని దాదాపు 75 శాతం స్వాహా చేసి ముగిసింది.
ఇప్పుడు గానీ ప్లాట్ పాయింట్ -1 వచ్చి మిడిల్ సంఘర్షణ మొదలు కాలేదు. ఎప్పుడో
ఫస్టాఫ్ అరగంటలో రావాల్సిన ఈ ప్లాట్
పాయింట్ -1, సెకండాఫ్ లో ఇరవై నిమిషాల
కొచ్చింది!
ఇక్కడ ఇప్పుడు రామప్ప చిన్న కొడుకు
మరణాన్ని పురస్కరించుకుని పోలీస్ ఇన్స్ పెక్టర్ దర్యాప్తుకి రావడంతో, కథ ప్రారంభమై
సమస్య ఏమిటో తెలుస్తుంది! అంటే మొత్తం కలిపి గంటా 50 నిముషాలు ఉపోద్ఘాతం వల్ల కథే ప్రారంభం కాలేదు. ఇలా ఇది మిడిల్
ని కబ్జా చేసిన బిగినింగ్ కాబట్టి ఇది
మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయ్యింది. స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ లో పడ్డాక ఆ సినిమాని
దేవుడు కూడా కాపాడ లేడు. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలే మట్టి కరిచాయి!
ఇప్పుడు సెకండాఫ్ ఇరవై నిమిషాలకి కథ ప్రారంభమయ్యాక, క్యారక్టర్
స్టడీ పేరుతో రామప్ప సృష్టించిన గందరగోళమంతా ఆగిపోయి, వాన వెలసినట్టు ప్రశాంతంగా మారుతుంది
సినిమా. అంటే అబ్సర్డ్ థియేటర్ చిత్రీకరణలు అంతమై, రెగ్యులర్ సినిమా కథగా దారి కొస్తుంది.
అయితే- జడివాన వెలిసిన వెనుకా జరిగింది తెలియును లేరా- విరిగేటి చెట్లెన్నో, వొరిగేటి
ఇళ్ళెన్నో- అన్నట్టు, ఇప్పుడు ప్రారంభమైన ఈ కాసింత కథకూడా బాక్సాఫీసుకి అంది రాలేదు.
కారణం, అనుమానమనే పాయింటు మీద ఇప్పటికైనా ఫోకస్ చేయకుండా, సామాజిక
అంశాలపై లెక్చర్ ఇస్తున్నట్టుగా మారుతుంది. ఫస్టాఫ్ లో భ్రమలు, తాగుబోతు వాదనల ద్వారా-
మహాభారతం, మహాత్మా గాంధీ, ఆధునిక భౌగోళిక రాజకీయాలూ, కులం, రంగు, పేద-ధనిక
తేడాల గురించిన బ్యాగేజీనంతా ప్రేక్షకుల మీద పడేసింది గాక.
కేవలం అనుమానమనే భూతం తప్ప ఇంకేం పట్టని మొండి ఘటంలా రామప్పని
చూపిస్తూ, ఇంకా కావాలంటే పైన చెప్పిన బ్యాగేజీలో ఒకట్రెండు అంశాలు తీసుకుని, వేరే పాత్రతో
సబ్ ప్లాట్ నడిపి వుండొచ్చు. గొడవుండదు.
ప్రయోగాలు చేయకూడదని
కాదు, చేయొచ్చు. అయితే ముందు త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ అంటూ వుండాలి. అప్పుడే ఆ స్ట్రక్చర్
కి లోబడి ఎలాటి క్రియేటివిటీలకైనా పాల్పడ వచ్చు. స్ట్రక్చరే లేకుండా క్రియేటివిటీ ఎలా
కుదురుతుంది. ప్రయోగమెలా అన్పించుకుంటుంది. ఫ్రెంచి ఫిలిం నోయర్ జానర్ ని హాలీవుడ్
ఎత్తుకొచ్చుకుని, తను వాడే కమర్షియల్ మంత్రాల పెట్టె త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లో కూర్చి,
వందలాది కమర్షియల్ ఫిలిం నోయర్ సినిమాల్ని
తీసి అవతల పడేసింది. హాలీవుడ్ అనుసరించే త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ ని తెలుగు మేకర్లు
అనుసరించేందుకు మొహమాటం దేనికి?
తీరా ఫలితం చూసి, తెలుగు ప్రేక్షకులకి సినిమాలే చూడ్డం రాదనీ
ప్రెస్ మీట్లు పెట్టి నిందించడం దేనికి? ఇలాటి ప్రయోగాలే చేయదల్చుకుంటే, ప్రేక్షకులు
నోరెత్తకుండా ఏం పాట్లు పాట్లు పడతారో పడి, సినిమా తీసి చూపించొచ్చు. తీయరాక ఏదో తీసి
ప్రేక్షకులు నోరెత్తితే, దాని మీద రియాక్ట్ అవుతూ పోతే ఎవరికీ నష్టం? ‘రావు బహదూర్’
కి తేలిన నష్టమెంత సింగిల్ డిజిట్ దాటని కలెక్షన్లతో?
-సికిందర్