రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, June 30, 2026

1420 : మూవీ నోట్స్


 

    అంకెలేమిటి?  70 87 54 50 00 (ఏడు వందల ఎనిమిది కోట్ల, డెబ్బై ఐదు లక్షల, నలభై ఐదు వేలు), 34 96 90 14 500 (ముప్పై నాలుగు వేల తొంభై ఆరు కోట్ల, తొంభై లక్షల, పద్నాలుగు వేల, ఐదు వందలు)... లేదా 750, 000 డాలర్లకి 370 మిలియన్ డాలర్లు. మొదటిది బడ్జెట్, రెండోది కలెక్షన్లు. ఈ సంవత్సరం ఇప్పటికి హాలీవుడ్ బాక్సాఫీసు చార్ట్స్ లో ఐదవ స్థానం. దీంతో సినిమా గురించి చర్చ తక్కువ, కలెక్షన్ల గురించి రచ్చ  ఎక్కువై పోయింది. ఇది ‘అబ్సెషన్’ సంగతి.  ఇంకా షాకింగ్ ఏమిటంటే, ఒక బిగ్ మల్టీ స్టారర్ సినిమా కాదు, ఇంకెవరో టాప్ స్టార్ సినిమా కూడా కాదు – కేవలం ఒక యానిమేషన్ అడ్వెంచర్ కామెడీ ‘ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ’ 110 మిలియన్ డాలర్ల బడ్జెట్  (ఒక వెయ్యీ ముప్పై తొమ్మిది కోట్ల, అరవై రెండు లక్షల రూపాయలు) కి, 1008 బిలియన్ డాలర్లు (తొంభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఒక కోట్ల, అరవై ఏడు లక్షల రూపాయలు) వసూలు చేసి టాప్ పొజిషన్లో నిలవడం!

దారు పాత్రలతో చిన్న తారాగణంతో ‘అబ్సెషన్’ లాంటి హార్రర్, అసలు తారాగణమే లేని ఇంకో యానిమేషన్ ఈ విధంగా వేలకోట్ల వసూళ్ళతో నిలబెట్టి రికార్డుల్ని బద్దలు కొడుతూంటే, మాంద్యం ఎక్కడుంది? నిరుద్యోగం ఎక్కడుంది? ద్రవ్యోల్బణపు తాకిడి ఎక్కడుంది? సినిమాలు చూసేందుకు ప్రేక్షకుల దగ్గర డబ్బులే డబ్బులు! ఓటీటీల్లో వచ్చేదాకా ఆగే కక్కుర్తి కాదు. ఏకంగా థియేటర్లకి వెల్లువెత్తి వాటి కళకి కొవ్వొత్తులు వెలిగించే కమిట్మెంట్. ఇంకో యానిమేషన్ ‘టాయ్ స్టోరీ 5’ ఐదో స్థానంలో వుంది. హాలీవుడ్ నిజంగా సెలెబ్రేట్ చేసుకుంటోంది.  బిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులు కడుతూ, జీడిపీ లో 0. 5 శాతం, అంటే 1.17 ట్రిలియన్ల డాలర్ల వాటాతో  అత్యంత భారీ వినోద పరిశ్రమగా నమోదవుతోంది...

నిజమేమిటంటే, మళ్ళీ  ‘అబ్సెషన్’ లాటి పాకెట్ మనీకి బకెట్స్ తో బాక్సాఫీసు తన్నుకు  వచ్చే మూవీ ఎప్పుడొస్తుందో, ఎవరు తీస్తారో ఏమీ తెలియదు, ఎవరూ చెప్పలేరు. ఇలాటి హిట్స్ ని అనుకుని ఎవరూ తీయలేరు. దీనికొక ఫార్ములా, మంత్రం, తంత్రం ఏమీ వుండవు. ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ గుజరాతీ మూవీ 50 లక్షలతో తీస్తే 120 కోట్లు వచ్చాయి! ఇదింకో అరుదయిన సంఘటన. దీని  రహస్యమేమిటి? ఆ సూత్రం ఏమిటి?  దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు వీటి నుంచి ఏ పాఠం నేర్చుకోవాలి? ఏమో, ఏమీ చెప్పలేం!


సింపుల్ గా చెప్పాలంటే, ‘అబ్సెషన్’ మూవీ ని మిలియన్ డాలర్ల లోపు బడ్జెట్ తో నిర్మిస్తే, భారీగా 370 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని26  ఏళ్ళ ఒక యూట్యూబర్  సాధించాడు. తను తీసింది ఇండిపెండెంట్ (స్వతంత్ర) సినిమా. ‘ది బ్లేర్ విచ్ ప్రాజెక్ట్’, ‘పారానర్మల్ యాక్టివిటీ’, ‘మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్’ లాటి స్వతంత్ర సినిమాలు అనూహ్య విజయాలు సాధించాయి. రిస్కు లేని మైక్రో బడ్జెట్. పోతే తక్కువ నష్టంతో పోతాయి, వస్తే భారీ లాభాలు వస్తాయి. కథగా చెప్తే అందులో నిర్మాతలకి కనకవర్షం కనిపించని అనుభవాలుంటాయి దర్శకులకి. అప్పుడు స్వయంగా నిర్మించుకోవడమే. స్వయంగా నిర్మించాలంటే డబ్బులుండవు. ‘అబ్సెషన్’ దర్శకుడు కర్రీ బార్కర్ ముందుగా 2024 లో కేవలం 800 డాలర్లతో ‘మిల్క్ & సీరియల్’ అనే హార్రర్ తీసి యూట్యూబ్ లో ఫ్రీగా వదిలాడు. అది జెన్ జీ ప్రేక్షకుల్లో బాగా సక్సెస్ అయింది. దాంతో నల్గురు నిర్మాతల్ని పోగేసుకుని ఏడున్నర లక్షల డాలర్లతో   జెన్ జీ ని టార్గెట్ చేస్తూ ‘అబ్సెషన్’ తీస్తే, అది బంపర్ సక్సెస్  కావడంతో హాలీవుడ్ లో ఈజీగా ఎంట్రీ సంపాదించేశాడు. ప్రస్తుతం ఏం చేయాలో అర్ధం కానన్ని ఆఫర్స్ వస్తున్నాయి. మన దగ్గర ఏళ్ళ తరబడి నిర్మాతలకోసం తిరగడమే గానీ, టార్గెట్ ప్రేక్షకులకి శాంపిల్ గా ఒక క్రేజీ థాట్ ని యూట్యూబ్ లో ఫ్రీగా వదలడానికి లక్ష రూపాయలు తెచ్చి పెట్టుకునే ప్రయత్నాలు కూడా చెయ్యరు. నిర్మాతలే పెట్టాలి, కెరీర్ కోసం తామేమీ ఖర్చు పెట్టుకోరు.

 

స్పష్టంగా కనిపిస్తోందేమిటంటే,  కర్రీ బార్కర్ ‘అబ్సెషన్’  తీయకముందే అతడికి ప్రేక్షకులు తయారుగా వున్నారు. 800 డాలర్లతో ఓ హార్రర్ తీసి యూట్యూబ్‌లో ముందే ఫ్యాన్స్ ని సంపాదించుకుని రెడీగా వున్నాడు. అయినా అతను  స్టూడియోలకెళ్ళి అది చూపించుకుని అవకాశాలు పొందే ప్రయత్నం చేయలేదు. స్వయంగా ఇండిపెండెంట్ సినిమా మాత్రమే తీయాలనుకున్నాడు. స్టూడియోల్లో ప్రయత్నించి వుంటే, ‘అబ్సెషన్ ‘ ఈ సంవత్సరపు ప్రధాన థియేట్రికల్ సక్సెస్ స్టోరీస్ లలో ఒకటిగా నిలుస్తుందని ఎవరూ గుర్తించి ప్రోత్సహించే వాళ్ళు కారు. ఈ మొత్తం బ్యాక్ గ్రౌండ్ లో నీతి : లక్ష పెట్టుబడితో ఒకటి తీసి యూట్యూబ్ ఫ్యాన్స్ ని సమకూర్చుకో, ఆ పైన తీయాలనుకుంటున్న దానిని ఇండిపెండెంట్ సినిమాగా తీయ్, టాలీవుడ్ ద్వారాలు వాటికవే బార్లా తెరచుకుంటాయ్! వూరికే టైం వేస్ట్, లైఫ్ వేస్ట్ చేసుకుంటూ టాలీవుడ్ గడపలో కూర్చోకు!

 

నిజానికి ఈ బ్యాక్ గ్రౌండ్ లోకి లోతుగా వెళ్ళేకొద్దీ, ఆసక్తి కలిగించింది  సినిమా కాదనీ,  ప్రేక్షకులేనని తెలుస్తోంది. యువ ప్రేక్షకుల్ని  తిరిగి థియేటర్లకి ఎలా తీసుకురావాలా అని హాలీవుడ్ కూడా  సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే వుంది. ఆర్భాటంగా పెద్ద పెద్ద ఫ్రాంచైజీలు ఈ సమస్యని పరిష్కరిస్తాయోమో  ననుకున్నారు. అది రుజువు కాలేదు. కానీ ఒక చిన్న హార్రర్ సినిమా వస్తే  ఒక్కసారిగా యువ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో సినిమా హాళ్ళకి  రావడం మొదలుపెట్టేశారు. ఈ సినిమాలో చూపించింది తమ కథ అన్న ఒకేఒక్క మౌత్ టాక్ తో వెల్లువెత్తారు ప్రేక్షకులు. ఫ్రాంచైజీలు తమ కథలతో కూడిన సినిమాలు కావుగా? ఈ రోజుల్లో యూట్యూబ్, టిక్‌టాక్, డిస్కార్డ్, ట్విచ్, రెడ్డిట్, గ్రూప్ చాట్‌లు, గేమింగ్ కమ్యూనిటీలలో జోరుగా మౌత్ టాక్ వ్యాపిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్స్  సినిమా థియేటర్లకి పోటీ అని విమర్శిస్తారు. కానీ ప్రేక్షకుల్ నాడిని పట్టుకోవడానికి ఇవే ప్రధాన వనరులు.

'అబ్సెషన్' గురించి  చెప్పుకోవాల్సిన ప్రధానాంశం ఏమిటంటే, ఇది హాలీవుడ్ సాంప్రదాయ మార్కెటింగ్ యంత్రాంగం నుంచి రాలేదు. సమాజాల నుంచి వచ్చింది. సామాజిక మాధ్యమాల నుంచి వచ్చింది. సమాజాలు శక్తివంతమైనవి,  అవి ప్రచారకుల్ని సృష్టిస్తాయి.

ఇంతా చేసి విజయం సాధిస్తే అప్పుడు రెగ్యులర్ నిర్మాతలు రంగ ప్రవేశం చేసి వాటి నకిలీలని తయారు చేయడానికి ముందు కొస్తారు. ‘అబ్సెషన్’ లాంటివి మరెన్నో నిర్మించి అవతల పడేస్తారు. ప్రతీ ‘బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్‌’ కి వందల సంఖ్యలో ఫౌండ్-ఫుటేజ్ సినిమాలు తీసి వదిలారు. ప్రతీ ‘పారానార్మల్ యాక్టివిటీ’ కి లెక్కలేనన్ని కాపీలు కుమ్మారు.

ఈ మొత్తం నుంచీ, యువ ప్రేక్షకులు ఇప్పటికీ తమ గురించి కొత్త విషయాల్ని వెండితెర మీద చూడాలని ఆరాటపడుతున్నారన్నదే  నేర్చుకోవాల్సిన పాఠం. నిర్మాతలు  తరచుగా మరచిపోయే విషయం అదే. తెలిసిన వాటినే, చూసిన వాటినే సీక్వెల్స్. ప్రీక్వెల్స్, రీబూట్స్. రీమేక్స్ అంటూ తీస్తూ ప్రచారంలో వుండడాన్నే కోరుకుంటున్నారు. 

-సికిందర్

‘అబ్సెషన్’ రివ్యూ రేపు!

Wednesday, June 17, 2026

1420 : రివ్యూ!

 

రచన –దర్శకత్వం : సింగీతం శ్రీనివాస రావు

తారాగణం: అయాన్, అహల్యా బమ్రూ, షాలినీ కొండేపూడి, తులసి, శివ నారాయణ, బెనర్జీ తదితరులు
రచయితలు : గౌతమి, శశాంక్, రత్న శ్రీకర్
, నంద కిషోర్, రాహుల్ రాజేశ్వర్
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : అంకుర్ సంజీవ్
బ్యానర్స్  : వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా
నిర్మాత : నాగ్ అశ్విన్, అశ్వినీ దత్, స్వప్నా దత్  
విడుదల : జూన్ 12, 2026
***
      40 ఏళ్ళ నాటి ఆలోచనకి తెరరూపమిచ్చారు సుప్రసిద్ధ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ప్రయోగాలకి పేరుబడ్డ తను, ఈసారి మాటలే పాటలై కథ చెప్పుకుంటూ పోయే మ్యూజికల్ ఫాంటసీని సృష్టించారు. దీనికి ‘సింగ్ గీతం’ అని పేరు పెట్టారు. పుష్పక విమానం, ఆదిత్య 369, అపూర్వ సహోదరులు, మయూరి మొదలైన ప్రయోగాలతో బాటు కామెడీలూ కలుపుకుని 60 సినిమాలు తీసిన తను,13 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత, ఇప్పుడు 61వ సినిమాగా ఈ మ్యూజికల్ ఫాంటసీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. టీజర్ రిలీజైనప్పుడు ఇంటర్నెట్లో పెద్ద దుమారమే రేగింది. 94 ఏళ్ళ వయస్సున్నసింగీతం దర్శకత్వ ప్రతిభ చూసి జేన్ జీ దర్శకులకి గట్టి పోటీ నిస్తున్నట్టు, తెలుగు సినిమా తిరిగి తలెత్తుకోబోతోందనీ, 94 ఏళ్ళ వయస్సులో  దృఢ సంకల్పం అంటే ఏమిటో టాలీవుడ్ కి  ఆయన రుచి చూపిస్తున్నారంటూ నెటిజనులు వెల్లువెత్తారు.

      తరులు పది సినిమాలు తీసి ఔట్ డేటెడ్ అయిపోతున్న ఈ రోజుల్లో, సింగీతం తన లోని ఇన్నర్ చైల్డ్ ని కాపాడుకోవడమే ఈ విజయానికి మూల కారణం. రోమాంటిక్ కామెడీలు తీసే వుడీ అలెన్ కూడా 2023 లో, 87 ఏళ్ళ వయస్సులో 50 వ సినిమా ‘కూప్ డీ ఛాన్స్’ తీస్తే, థ్రిల్లర్లు తీసే, నటించే క్లింట్ ఈస్ట్ వుడ్ కూడా 2024 లో 94 వ యేట   ‘జ్యూరర్ నంబర్ 2’ కి దర్శకత్వం వహించి 45 సినిమాలు పూర్తి చేశాడు. ఇలా నానేజనరియన్లు అయివుండి కూడా తమ ఉనికిని చాటుకుంటున్న వెనుకటి తరం దర్శకులకి, 80 సమీపిస్తున్న స్టీవెన్ స్పీల్ బెర్గ్ కూడా తోడై ‘డస్క్లోజర్ డే’ తీసి జూన్ 12 నే  విడుదల చేశాడు సింగీతం సినిమాతో బాటు.

కథేమిటి?


    ఒక ఆర్ధిక నేరంలో కేడీగా జైలు కెళ్ళి విడుదలవుతాడు ప్రతాప్ (అయాన్). బయటికి రాగానే లాయర్ అతడికో బ్రీఫ్ కేసు ఇచ్చి ఇది మీ నాన్నది అంటాడు. నాన్న మీద కోపంతో దాన్ని విసిరేస్తాడు ప్రతాప్. అందులో మీనాన్న ఆస్తి పత్రాలున్నాయిరా బాబూ అనగానే పరుగెత్తుకెళ్ళి  బ్రీఫ్ కేసు తెచ్చుకుంటాడు. తండ్రి (రాహుల్‌ రవీంద్రన్‌) తనకి రాసిచ్చిన ఆ పత్రాలతో భూమిని సొంతం చేసుకుని ఎంజాయ్ చేద్దామని కుబేర పురం వెళ్తాడు. వెళ్తే అక్కడ ఆ భూమి మధ్యలో ఒక పెద్ద చెట్టు, దాని మీద ఈగని కూడా వాలనివ్వని ఒక సెంటిమెంటల్ గర్ల్ గౌరీ (అహల్యా బమ్రూ), ఆ చెట్టుని కూల్చి ఆ భూమిలో బంగారాన్ని తవ్వుకోవాలనుకునే మైనింగ్ కాంట్రాక్టర్లూ ఎదురవుతారు.

ఆ వూళ్ళో మనుషులు తప్ప ఇతర జీవులు కనపడవు. సంవత్సరాల తరబడి జరిగిన బంగారం అక్రమ మైనింగ్ కారణంగా ఎండిపోయిన బీడు భూములు మిగిలాయి. ఎటు చూసినా కనీసం ఒక్క మొక్క లేకుండా ఎడారిలా వుంటుంది. ప్రతాప్ భూమిలో గోల్డ్ ని కాజేసే ఇంకో ప్లానుతో ఇంకో నాన్ సెంటిమెంటల్ గర్ల్ రేణూ (షాలినీ కొండేపూడి) వుంటుంది. ఈమె నల్ల జాతీయుడు స్వాహిలి (అగు స్టాన్లీ చిడోజీ) తో వంద కోట్లకి డీల్‌ కుదుర్చుకుంటుంది. ఈ విషయం ప్రతాప్ కి తెలిసి ఫిఫ్టీ - ఫిఫ్టీ డీల్ కుదుర్చుకుంటాడు. ఇప్పుడా చెట్టుని కొట్టాలంటే ఆ చెట్టు తొర్ర లోనే నివాసం ఏర్పాటు చేసుకున్న గౌరీ అడ్డుంది.

        ఇక దౌర్జన్యంగా చెట్టుని కొట్టి పడేస్తారు. ఆమె ఏడుస్తూ కుబేరుడి గుడికెళ్ళి చెప్పుకుంటే
 భూకంపం వస్తుంది. ఆ గుహలో పడిపోతుంది. అందులో తన గోడునంతా చెప్పుకుంటుంది. తర్వాత బయటికొస్తే, వూళ్ళో  షాకింగ్‌ దృశ్యాలు ఎదురవుతాయి. వూళ్ళో జనాలెవరికీ మాటలు రావు. మాట్లాడితే మాటలే పాటలుగా వస్తూంటాయి. ఎటు చూసినా పాటలే. గ్రామ దేవత శాపం. దీంతో బెంబేలెత్తిపోతారు. గౌరీకి  కూడా ఇదే శాపం తగులుతుంది.

ఇప్పుడా చెట్టుతో గౌరీకి చిన్నప్పట్నుంచీ వున్న అనుబంధం ఎలాటిది? గోల్డ్ మైనింగ్ వెనకున్న కథేంటి
? ప్రతాప్‌ పేరెంట్స్ కి, ఈ సంఘటనలకీ సంబంధమేమిటి? శాప విముక్తికి చేసిన ప్రయత్నాలేమిటి? అందులో సఫలమయ్యారా? ఈ ప్రశ్నలతో సాగేదే మిగతా కథ.

ఎలావుంది కథ?

    పర్యావరణ పరిరక్షణ గురించి సింగీతం 40 ఏళ్ళ క్రితం అనుకున్న కథ. ఒక ఫ్రెంచి మూవీ ‘అంబ్రెల్లాస్ ఆఫ్ షెర్బోర్గ్’ (1964) చూసినప్పుడు మాటలే పాటలుగా వుండే సినిమా తీయాలన్న ఐడియా వచ్చినట్టు చెప్పారు. ఆ ఐడియాని పర్యావరణ పరిరక్షణ కథకి అన్వయించి సినిమా రూపొందించామన్నారు. ప్రకృతికి నష్టం చేస్తే ప్రకృతి పగదీర్చుకుంటుంది. అన్ని విధ్వంసాలూ చూస్తూ వున్న ప్రకృతి, ఇక చెట్టు కూడా ధ్వంసం కావడంతో మనుషులు మాటలే పలక్కుండా చేసింది. ఏ మాటైనా పాటగానే పలికే వింత మనుషులుగా వుండమని శాపం పెట్టింది.

కథ సింపుల్. ఫాంటసీ కావడంతో దీన్ని ఆ దృష్టితోనే చూడాలి. కథనం బలంగా లేకపోయినా ప్రయోగం కొత్తది కావడంతో, ఆ ప్రయోగం కోసం చూడాలి. మాటని  పాటగా వినిపించే ప్రయోగం దేశంలోనే మొదటిది. దీంతో రొటీన్ కి భిన్నంగా మొత్తం కథా ప్రపంచమే సరదాగా, ఫన్నీగా, నాటకీయంగా మారిపోతుంది.

మొదటి ఇరవై నిమిషాలు మామూలు సినిమాలాగానే డైలాగులతో సాగుతుంది. కథ, దాంతో బాటు అన్ని పాత్రలూ పరిచయమవుతాయి. ఈ ఇరవై నిమిషాల తర్వాత ఎప్పుడైతే చెట్టుని కొట్టేస్తారో, అప్పుడు శాపం అనే కాన్ఫ్లిక్ట్ తో కథ, సన్నివేశాలూ మాటల స్థానంలో పాటల్ని పలకడం ప్రారంభిస్తాయి.  ఒక కొత్త ప్రపంచంలో కెళ్ళి పోతాం. అయితే ఫస్టాఫ్ నిడివి ఎక్కువకావడంతో ఈ కొత్త ప్రపంచం నావెల్టీని కోల్పోవడం ప్రారంభిస్తుంది. ఇంటర్వెల్లో బలమైన మలుపేమీ వుండదు. మొత్తం కథ లైటర్ వీన్ గా సాగుతుంది.

సెకండాఫ్ లో తిరిగి అదే ధోరణి. వివిధ పాత్రల మధ్య వాటి వ్యక్తిగత సంఘర్షణలు, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమలో సమస్యలు, మైనింగ్ పాత్రల కుయత్నాలూ మొదలైన సన్నివేశాలు వస్తూంటాయి. చెట్టుతో గౌరీ పాత్ర అనుబంధం గురించి వచ్చే ఫ్లాష్ బ్యాక్ కథకి ఎమోషనల్ సపోర్టు నిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ తప్ప మిగతా కథ భావోద్వేగా బలంతో కాక లైటర్ వీన్ లోనే సాగుతుంది. ఫాంటసీ కాబట్టి అద్భుతాలే తప్ప భావోద్వేగాలు వున్దకూదదనుకున్నారేమో తెలీదు. చివరికి పర్యావరణం గురించి ఒక సందేశంతో ముగుస్తుంది.

నటనలు- సాంకేతికాలు

    అయాన్, అహల్యా, షాలినీ కొత్తవాళ్ళు ముగ్గురూ ఈ ప్రయోగాన్ని నిర్వహించడంలో పూర్తిగా రాణించారు. ఎవరి మాటని వాళ్ళే పాటగా మార్చి పలికే ధోరణి కొత్త వాళ్ళకి సవాలే అయినా సహజంగా నటించేశారు. రేణూ పాత్ర తండ్రిగా బెనర్జీ, హీరో తండ్రిగా రాహుల్ రవీంద్రన్, ఇంకో పాత్రలో తులసి, నల్లజాతీయుడు స్టాన్లీ చిడోజీ పాత్ర చిత్రణలు, నటనలు చెప్పుకోదగ్గవి. ఇక  అనుదీప్‌ ఒక చోట,విజయ్‌ దేవరకొండ క్లయిమాక్స్ లో సర్‌ప్రైజ్‌ చేస్తారు. చిన్న పాత్రైనా అందులో నివేదా పేతురాజ్ బలంగా నటించింది.

ఈ మాటలే పాటలుగా పలికే సినిమాకి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ చేసిన కృషి చాలా కలిసొచ్చింది. దాదాపు రెండు గంటలు మాటల్ని పాటలుగా మార్చడం మామూలు విషయం కాదు. వివిధ పాత్రలకి వివిధ బాణీల్లో సంగీతం లేని పద్యాలుగా మాటలు కూర్చి నాన్ స్టాప్ గా వినిపించడం అన్నిటికన్నా కష్టమైన ప్రయోగం. ఇక ఫ్లాష్‌ బ్యాక్‌ లో వచ్చే పాట థీమ్ ని ఎమోషనల్ గా ఎలివేట్ చేస్తుంది. నటీనటులే ప్రాక్టీసు చేసి ఈ మాటల్ని పాటలుగా పలికారు.

అంకుర్ సంజీవ్ కెమెరా వర్క్ ఫాంటసీ ప్రపంచాన్ని ఉన్నతంగా ఆవిష్కరించింది. అన్యాయాల, అక్రమాల పాలబడిన ఎడారిలాంటి ఒక డిస్టోపియన్ ప్రపంచాన్నిసృష్టించడం లో ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ మూలే కూడా కష్టపడ్డాడు. ప్రొడక్షన్ విలువలు బ్యానర్స్ కి తగ్గట్టే బలంగా వున్నాయి. నిర్మాతలు నాగ్ అశ్విన్, అశ్వనీ దత్, స్వప్నా దత్, సింగీతం చిరకాలపు కలని నిజం చేసిన అదృష్టవంతులుగా మిగులుతారు. వయస్సుతో బాటు ఆరోగ్య సమస్యల కారణంగా సింగీతం ఇంట్లోనే  ఏర్పాటు చేసుకున్న వర్చువల్ మానిటర్ ద్వారా రిమోట్‌గా సినిమాకి దర్శకత్వం వహించారు అసిస్టెంట్ల సాయంతో.

చివరికేమిటి?

    ఈ సినిమాకి అయిదుగురు రచయితలు పని చేశారు-గౌతమి, శశాంక్, రత్న శ్రీకర్, నంద కిషోర్, రాహుల్ రాజేశ్వర్. అందరూ సింగీతం చేసిన ప్రయోగానికి న్యాయం చేశారు. అయితే ఇలాటి అసాధారణ ప్రయోగానికి రెండున్నర గంటల నిడివి సినిమా అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే మొదటి ఇరవై నిమిషాలు బిగినింగ్, సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ పది నిముషాలూ తీసేస్తే, రెండు గంటల సేపు నటీనటులు మామూలు ధోరణిలోకి రాకుండా మాటల్ని పాటలుగా చేసుకుని పాడుతూ పోతూంటే ఏ సమయంలోనైనా సినిమా క్రాష్ అయ్యే అవకాశముంది. ప్రయోగం అపూర్వమే గానీ నిడివి సమస్యగా వుంది.

ఇదే ప్రయోగంతో ‘అంబ్రెల్లాస్ ఆఫ్ షెర్బోర్గ్’ ఫ్రెంచి మూవీ గంటన్నర సినిమానే. ఈ ప్రయోగాన్ని 17 శతాబ్దపు ఇటాలియన్ ఒపెరాల ఆధారంగా తీశారు. మాటల్ని పాటలుగా ప్రయోగించే ఈ టెక్నిక్ ని ‘రెసిటేటివ్’ కళ అన్నారు. దీన్లో డైలాగుల్ని సాంప్రదాయ రాగంలా మాట్లాడడం లేదా ప్రదర్శించడం కాకుండా, ప్రసంగం లాంటి లయలో పాడతారు. ఇలాటి ఒక ఒపెరాలో ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ తండ్రి విన్సెంజో గెలీలీ ఒక ముఖ్య పాత్ర నటించాడు.

అయితే మాటే పాటయిన ఈ రెసిటేటివ్కళతో కథనంలో భావోద్వేగ బలం బలైంది. ఎంతసేపూ లైటర్ వీన్ కథనానికే వీలిచ్చేలా ఒకే ధోరణిలో డైలాగులు పాటలుగా మారడంతో కథనం ఫ్లాట్ గా మారింది. ఎలాగూ ఈ మాటల పాటలకి సంగీతం లేనప్పుడు- ఈ పరాయి  రెసిటేటివ్కళ కాకుండా, స్వదేశీ కళ- అందునా తెలుగులో మాత్రమే సాధ్యమవుతున్న పద్యాలతో సినిమా అంతా కథ నడిపివుంటే, ఆ వూపే వేరుగా వుండేది నవరసాల్ని పలికిస్తూ.

2002 లో ఆరు ఆస్కార్లు పొందిన బ్రాడ్వే మ్యూజికల్ లాంటి ‘షికాగో’ లో, హేమాహేమీలైన నటీనటులతో ఎడతెగని 16 పాటల మర్డర్ కథ ఎంత ఉర్రూతలూగించిందో తెలిసిందే. ఈ 1930 లలో జరిగే కథకి అప్పటి జాజ్ మ్యూజిక్ తో పాటలు చేసి - ఆ సాంగ్ అండ్ డాన్సులతోనే థ్రిల్లింగ్ సన్నివేశాల్ని చూపించేశారు. ఇంత బిగ్ బడ్జెట్ హంగామా నిడివి గంటా 55 నిమిషాలే.

ఈ ప్రస్తావనలన్నీ భావోద్వేగ బలాన్ని పెంచడం కోసమే. కానీ సింగీతం లైటర్ వీన్ ధోరణిలో చందమామ కథల సింప్లిసిటీని ఊహించి వుంటారు కాబట్టి ఆయన విజన్లో వినోదాత్మక ప్రయోగంగా చూస్తే- దీనికిదే అద్భుతమన వచ్చు.

-సికిందర్

Links :
Sing Geetham,  Trailer
Umbrellas of Cherbourg, Trailer


Sunday, June 14, 2026

1419 : స్క్రీన్ ప్లే సంగతులు


 

రచన-దర్శకత్వం : బుచ్చిబాబు సానా
తారాగణం : రాం చరణ్, జాహ్నవీ కపూర్, జగపతిబాబు, శివరాజ్ కుమార్, బోమన్ ఇరానీ
రచయితలు : నాగేంద్ర కాశి, వర ప్రసాద్ తోలేటి, కృష్ణ హరి, వెంకట ప్రసాద్ గండి, శ్రీ రామన్
సంగీతం : ఏఆర్ రెహ్మాన్, ఛాయాగ్రహణం : ఆర్ రత్నవేలు, కూర్పు : నవీన్ నూలి
బ్యానర్ : వృద్ధి సినిమాస్
నిర్మాత : కె వెంకట సతీష్
విడుదల : జూన్ 6, 2026
***

      థకీ, గాథకీ తేడాల గురించి చాలా సార్లు చెప్పుకున్నా ఇంకా కథలనుకుని గాథలతో సినిమాలు తీస్తూనే వున్నారు...మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి సింపుల్ భాషలో ఇంకోసారి తెలుసుకుందాం. కథకీ,  గాథకీ వుండే తేడా ఇదీ : కథ (Story) అనేది  హీరోకీ, విలన్ కీ మధ్య వాళ్ళ వాళ్ళ గోల్స్ కోసం జరిగే సంఘర్షణలో ఎవరు రైట్, ఎవరు రాంగ్ అన్న తప్పొప్పుల ఆర్గ్యుమెంట్ (వాదన) ని తేల్చి చెప్పే జడ్జిమెంట్. అంటే కథంటే వేడి పుట్టించే వాదన  అన్నమాట. ఒక అనిల్ కుమార్ అనే రైటర్ / డైరెక్టర్ వున్నాడనుకుందాం. అతను కథ ఆలోచించుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ పోతూంటే అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. కాలు విరిగి హాస్పిటల్లో చేరాడు. అప్పుడా  వాహనదారుడి మీద కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టాడు. వాడెవరో తెలియడం లేదని అన్నారు పోలీసులు. దీన్ని తల రాతగా సరిపెట్టుకోమన్నారు. నేను కమర్షియల్ సినిమా రైటర్ / డైరెక్టర్ని- నాకు తల రాత గురించీ, విధి ఆట గురించీ చెప్పకండి- వాణ్ణి పట్టుకుని కేసు పెట్టండి అని వాదించాడు. పోలీసులు వాణ్ణి పట్టుకుని కోర్టులో కేసు వేశారు. కోర్టు లో వేడి వేడి ఆర్గ్యుమెంట్ జరిగింది. వాహనదారుడిదే తప్పని తీర్పు వెలువడింది. అనిల్ కుమార్ కేసు గెలిచి నష్టపరిహారం పొందాడు. ఇదీ కథంటే. పాత్రల మధ్య ఇది ఒక వాదులాటని ముందుకు తెచ్చి,  ఆట చూపిస్తూ ఎవరు రైటో ఎవరు రాంగో జడ్జిమెంటు నిస్తోంది. అంటే కథంటే వాదన తో కూడిన వేడి పుట్టించే  గరంగరం మసాలా అని  తెలుస్తోంది.

రి గాథంటే? గాథ (Tale) అంటే, విలన్ లేకుండా హీరో ఒక్కడే తనకి జరిగే కొన్ని అనుభవాల జర్నీని ఒక కొలిక్కి తెచ్చుకుని, ఇదీ నా జీవితమని  చివర్లో ఇచ్చే స్టేట్ మెంట్ (ప్రకటన) లాంటిది మాత్రమే. అంటే గాథంటే వేడి పుట్టించని ప్రకటన అన్నమాట. ఇంకో సునీల్  కుమార్ అనే రైటర్ / డైరెక్టర్ వున్నాడనుకుందాం. అతను కథ ఆలోచించుకుంటూ రోడ్డుమీద నడుచుకుంటూ పోతూంటే, విధి వక్రించి యాక్సిడెంట్ జరిగింది. కాలు విరిగి హాస్పిటల్లో చేరాడు. కాలు బాగా ఫ్రాక్చరైందని, తిరిగి లేచి నడవాలంటే కొన్ని నెలలు పడుతుందనీ చెప్పారు డాక్టర్లు. అలాగా, నా తల రాత ఇలా రాసి పెట్టి వుంటే ఇంకేం చేస్తాం, సరే ఇలాగే తంటాలు పడతాను, అదే సర్దుకుంటుందని రాజీ పడిపోయాడు. యాక్సిడెంట్ చేసిన వాడితో అమీతుమీ తేల్చుకోవాలన్పించలేదు. అలాగే ఇబ్బందులు పడుతూ కొన్ని నెలల తర్వాత కోలుకుని, తిరిగి ఎప్పటిలా నడవసాగాడు. ఇలా తన అనుభవాల్ని రికార్డు చేసి, దానికి తగ్గ ప్రకటనగా ముగించేదే గాథ. ఇలా గాథంటే వేడి పుట్టించని ప్రకటన మాత్రమే అవుతోంది. గరం మసాలా లేదు, వీర రసం లేదు. కమర్షియల్ సినిమా తీయాలనుకుంటే,  వేడి పుట్టించే వాదన కావాలా,  వేడి పుట్టించని ప్రకటన కావాలా  -ఏది అవసరం?

కమర్షియల్ సినిమాకి కచ్చితంగా  వాదులాటతో వేడి పుట్టించే కథే కావాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే ఇందులో వాదులాటకి హీరోతో బాటు విలన్ వుంటాడు, వాళ్ళ మధ్య వేడి పుడుతుంది. కానీ ఆర్ట్ సినిమాల్లో సాధారణంగా కన్పించేవి గాథలే. విలన్ లేని హీరో అనుభవాల వేడి పుట్టించని ప్రకటనల్లాగా.  ‘పెద్ది’ ఈ కోవకి చెందుతుంది. ఇది గాథ అయినా బాక్సాఫీసులో నిలబడిందంటే ఒకటే కారణం- ప్రత్యర్ధి పాత్రలేని పెద్ది తన ఏకపక్ష ప్రయాణంలో చివరి భాగంలో సానుభూతిని  సంపాదించుకోవడమే.

 

తెలుగులో తీస్తున్నది కథలనుకుని గాథలతో తీసిన  ఇతర చిన్నా పెద్దా సినిమాలూ హీరో మీద ఏ భావోద్వేగాలూ పుట్టించకుండా ఫ్లాపయ్యాయి.  ‘పెద్ది’ కూడా తీస్తున్నది కథే అనుకుని తీస్తే అది ఎందుకో గాథ అయినట్టుంది- అయితే ‘పెద్ది’ గాథకీ, మిగతా సినిమాల గాథలకీ తేడా గుర్తించాలి- ‘పెద్ది’ కి చివర్లో సానుభూతి వర్కౌట్ అయింది. అయితే ప్రత్యర్ధి పాత్ర వుందని గాథల్లో హీరో మీద సానుభూతిని సృష్టిస్తే ఫర్వాలేదా అంటే చెప్పలేం. అన్నిసార్లూ వర్కౌట్ కాకపోవచ్చు. గాథ అని తెలిసి గాథతో స్క్రీన్ ప్లే ఆలోచించడం ఎప్పుడైనా రిస్కే. ప్రత్యర్ధి పాత్ర వుండే కథలతో సేఫ్ బిజినెస్ వుంటుంది.

గాథ అనేది వేడి పుట్టించని ఓ ప్రకటన కాబట్టి - ఈ రకమైన గాథల్ని, ముఖ్యంగా సినిమాల పరంగా, ఒకసారికి మించి చూడాలనిపించదు. మొదటిసారి చూసిన తర్వాత, మళ్ళీ చూసే ఏ ప్రయత్నమైనా చాలా విసుగ్గా మారుతుంది.  కానీ కథ అనేది వేడి పుట్టించే వాదన కాబట్టి-  ఇది సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేలా పురికొల్పుతుంది. బాగా తీస్తే కథతో వున్న సినిమాని  పదే పదే చూడాలని ఎందుకు అనిపిస్తుందంటే,  నిజ జీవితంలో మనకి అనుభవం కాని  అర్థం పరమార్ధం అందిస్తుంది కాబట్టి.

ఈ నేపథ్యంలో ‘పెద్ది’ గాథని స్క్రీన్ ప్లేగా ఎలా సర్దుబాటు చేశారో చూద్దాం...

2. ‘పెద్ది’  గాథలో విషయమిలా వుంది :

2016 ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, జాతీయ క్రీడా మంత్రిత్వ శాఖకి చెందిన ఉన్నతాధికారి కిరణ్ సింగ్ జైస్వాల్ (బొమన్ ఇరానీ) ని క్రీడా మంత్రి మందలిస్తాడు. ఆ తర్వాత జైస్వాల్ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక పట్టణంలో పర్యటిస్తున్నప్పుడు, అక్కడి స్థానిక యువత అథ్లెటిక్స్ పట్ల చూపిస్తున్న అసాధారణ అంకిత భావాన్ని గమనిస్తాడు. యువత క్రీడా స్ఫూర్తికి పెద్ది’ (రాం చరణ్) అనే ఆట కూలీ కారణమని తెలుసుకున్న  జైస్వాల్, పెద్ది వెనకున్న అసలు కథని తెలుసుకోవడానికి ముందుకు సాగుతాడు. అలా పెద్ది చరిత్రని వెలికితీసే క్రమంలో, విజయనగరం జిల్లాలోని అడవులు, కొండలు దాటుతూ మారుమూలనున్న పేరులేని కొండ గ్రామానికి చేరుకుంటాడు ఓ గ్రామస్తుడ్ని వెంటబెట్టుకుని. ఈ గ్రామస్థుడు పెద్ది గాథ చెప్పుకు పోతూంటాడు...


ఫ్లాష్ బ్యాక్ లో గాథ 1980ల చివర్లో విజయనగరం పరిసర ప్రాంతాల్లోని ఒక వెనుకబడిన, ప్రభుత్వ గుర్తింపు లేని గిరిజన కుగ్రామానికి మారుతుంది. ఆ గ్రామస్థులు పొరుగున వున్న అగ్రవర్ణ భూస్వాముల నుంచి తీవ్ర సామాజిక వివక్షని, ఆర్థిక దోపిడీనీ ఎదుర్కొంటూ వుంటారు.

ఆ గ్రామానికి చెందిన అప్పలసూరి (జగపతిబాబు) తమ ఊరికి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని, దానికి ఒక పేరు పెట్టి, బయటి ప్రపంచంతో అనుసంధానించేలా ఒక రైల్వే స్టేషన్ మంజూరు చేయాలనీ  ముప్పై ఏళ్ళుగా అధికారుల చుట్టూ తిరుగుతూంటాడు. అప్పలసూరి స్నేహితుడు పెద్ది. ఇతను క్రికెట్ లో మంచి టాలెంటున్న రోజువారీ ఆట కూలీ. కేవలం ఆటకి ఇంతని కూలి డబ్బుల కోసం స్థానిక టోర్నమెంట్లలో ఆడుతూ విజయాలు సాధిస్తూ వుంటాడు.

ఈ క్రమంలో స్థానిక రాజకీయ నాయకుడి కుమార్తె అచ్చియమ్మ (జాహ్నవీ కపూర్) తో ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి రాజకీయ ప్రత్యర్థి మేనల్లుడైన రాంబుజ్జి (దివ్యేందు) అచ్చియమ్మని  బహిరంగంగా అవమానించడానికి ప్రయత్నించినప్పుడు పెద్ది అడ్డుకుంటాడు. ఈ ఘర్షణ పగగా మారి, రాంబుజ్జి ఒక స్థానిక టోర్నమెంట్‌లో పెద్దిని కుట్రతో ఓడించి, అవమానిస్తాడు. అయినా సరే, పెద్ది ప్రజల గుండెల్లో నాయకుడిగానే నిలుస్తాడు. అతడి లోని శారీరక సామర్థ్యాన్ని గమనించిన గౌర్నాయుడు (శివరాజ్ కుమార్) అనే సీనియర్ మల్లయోధుడు, అంతరించిపోతున్న సాంప్రదాయ కుస్తీలో పెద్దికి శిక్షణ ఇస్తానని ముందుకొస్తాడు. పెద్ది నిరాకరిస్తాడు.

ఒకరోజు అడవిలో పనికి వెళ్ళిన ఒక గిరిజన బాలుడు ప్రమాదవశాత్తూ మరణించడంతోగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంటుంది. తీవ్రంగా కుంగిపోయిన అప్పలసూరి ఇక ఎలాగైనా సమస్యని  పరిష్కరించాలని స్థానిక మంత్రిని  కలిసి వినతిపత్రం ఇస్తాడు. కానీ ఆ మంత్రి అతడ్ని దారుణంగా అవమానించి తరిమేస్తాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేకతీవ్ర నిరాశతో అప్పలసూరి వేగంగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతే పెద్ది వచ్చి కాపాడతాడు. తర్వాత ఇంకో సంఘటనలో అప్పలసూరి మరణించడంతోమృత దేహాన్ని తీసికెళ్ళడానికి గుర్తింపు కార్డు చూపించమంటాడు మంత్రి. గుర్తింపు లేని వూళ్ళో ఎవరికీ గుర్తింపు కార్డు లుండవు. దీంతో పెద్ది మంత్రి ముఠాతో పోరాడి అప్పలసూరి మృతదేహంతో పారిపోతాడు.

సెకండాఫ్ లో - ఇక తమ గ్రామస్థుల సమస్యలన్నిటికీ తమకు ప్రభుత్వ గుర్తింపు లేకపోవడమే కారణమని గ్రహించిన పెద్ది
, తన గ్రామానికి న్యాయం చేయడం కోసం గౌర్నాయుడు దగ్గర కుస్తీ శిక్షణకి ఒప్పుకుంటాడు. అందులో కఠోర శ్రమతో స్థానిక, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలుస్తాడు.

 

ఇక జాతీయ స్థాయి పోటీలకి  సిద్ధమవుతున్న రెజ్లింగ్ ఈవెంట్ లో, తనమీద అసూయతో రగిలిపోయిన  ప్రత్యర్థి, పెద్ది కాలి నరాలు దెబ్బతినేలా గాయపరుస్తాడు. అయినా ఆ బాధని ఓర్చుకుంటూ పెద్ది సెమీ-ఫైనల్స్‌ గెలిచి స్పృహ కోల్పోతాడు. కళ్ళు తెరిచేసరికి, తను ఇకపై ఎప్పటికీ కుస్తీ ఆడలేడని డాక్టర్లు చెబుతారు. పెద్ది నేరుగా ఢిల్లీ వెళ్ళి  రైల్వే మంత్రిని కలుస్తాడు. కానీ ఆ మంత్రి కూడా అతడి శారీరక స్థితిని ఎగతాళి చేస్తూ విజ్ఞప్తిని తోసిపుచ్చుతాడు.

 

రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి విసిగిపోయిన పెద్ది ఒక సంచలన నిర్ణయం తీసుకుని, దెబ్బతిన్న కాలుని పూర్తిగా తొలగించుకుని, కృత్రిమ కాలుని  అమర్చుకుంటాడు. మళ్ళీ ఇంకో కఠోర శారీరక శిక్షణతో పారా-ట్రాక్ అథ్లెట్‌గా మారుతాడు.

 

చివరికి  జాతీయ ట్రాక్ రేసులో పాల్గొని అద్భుత విజయాన్ని సాధిస్తాడు. విజయోత్సవ ప్రసంగంలో, ప్రభుత్వ గుర్తింపు లేక తన గ్రామం ఎదుర్కొంటున్న కష్టాల్ని దేశానికి ఏకరువు పెడతాడు.

 

దీంతో దేశవ్యాప్తంగా వచ్చిన ప్రజా ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ఆ గ్రామాన్ని అధికారికంగా గుర్తించి, అక్కడ ఒక రైల్వే స్టేషన్‌ని  నిర్మిస్తుంది. దానికి పెద్ది పేరు పెట్టాలని ప్రభుత్వం భావించినా, పెద్ది తన స్నేహితుడి త్యాగానికి గుర్తుగా ఆ గ్రామానికి ‘అప్పలవలస’   అని పేరు పెట్టాలని కోరతాడు.

ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా తెలుసుకున్నాక, ప్రభుత్వ అధికారి జైస్వాల్ దేశంలోని ప్రతి మారుమూల గ్రామంలో దాగివున్న స్పోర్ట్స్ టాలెంట్స్ ని వెలికితీసి, ప్రోత్సహించడానికి ఒక భారీ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో  గాథ ముగుస్తుంది.

 

3. ఎలావుంది ఈ గాథ?

ఈ రెండు దశాబ్దాల కాలంలో గాథలుగా తీస్తే ఫ్లాపయిన తెలుగు సినిమాలెన్నో వున్నాయి- వాటిలో మచ్చుకి కొన్ని - బ్రహ్మోత్సవం, పైసా, మొగుడు, ఓకే బంగారం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, జక్కన్న, ఉన్నది ఒక్కటే జీవితం, రాజుగారి గది 2, రాజాధి రాజా, ద్వారక, ఒక్కడు మిగిలాడు, డియర్ కామ్రేడ్, జార్జి రెడ్డి, రాధే శ్యామ్, శాకుంతలం, బ్రో, బచ్చలమల్లికింగ్డమ్ ...ఇలా పొరపాటున తీసిన ఇన్నేసి గాథలు ఫ్లాపవుతున్నా మళ్ళీ పెద్దితీశారంటే, మిగతా వాటిలాగే  తాము తీస్తున్నదీ గాథ అని తెలుసుకోకుండా తీశారని భావించాల్సి వస్తోంది. వందల కోట్లతో సినిమా తీస్తున్నప్పుడు ఈ చిన్న విషయం తెలియకుండా ఎలా వుంటుంది? ఏమో, దీన్ని పక్కనబెట్టి కంటెంట్ గురించి మాట్లాడుకుందాం.

జానర్ పరం గా ఇది స్పోర్ట్స్ సినిమా. అయితే రెగ్యులర్ కమర్షియల్ స్పోర్ట్స్ సినిమాల టెంప్లెట్ లో ఇది లేకపోవడానికి కారణముంది.  స్పోర్ట్స్ జానర్ సినిమాఎవరు తీసినా కథకి ఈ టెంప్లెట్టే వుంటుంది- 1. ఆట నేర్పే ఒక ట్రైనర్, 2. ఒక పీడితుడైన హీరో, 3. హీరోకి ట్రైనింగ్, 4. ట్రైనింగ్ లో సమస్యలు, 5. హీరోకి ఒక ప్రత్యర్థి, 6. ఆటలో ఆ ప్రత్యర్ధితో హీరో ఓటమి, 7. హీరోకి మరింత కఠినమైన ట్రైనింగ్, 8. ఫైనల్ గా ఆటలో ప్రత్యర్ధి మీద హీరో విజయం, 9. విజేతగా హీరోకి మెడల్, ఇంతే!

స్క్రీన్ ప్లే ట్యూటర్ కెన్ మియమోటో ఈ టెంప్లెట్ ని అప్డేట్ చేశాడు. గొప్ప స్పోర్ట్స్ డ్రామాని క్రియేట్ చేయాలంటే దృష్టి పెట్టాల్సింది పాత్ర క్రీడలో ఏం సాధించాలనుకుంటోందో ఆ గోల్ మీద కాదు, ఆ మార్గంలో ఎదురైన ఆటంకాల్ని పాత్ర ఎలా బీట్ చేసిందన్నది, ఆ అవసరం ఎందుకన్నది- వీటి మీద దృష్టి పెట్టాలి. సిల్వెస్టర్ స్టాలోన్ తో రాకీసిరీస్  స్పోర్ట్స్ సినిమాల విజయ రహస్యమిదే అన్నాడు.

‘పెద్ది’ విషయానికొస్తే, దీని గాథ 2024 హిందీ స్పోర్ట్స్ బయోపిక్ ‘చందూ ఛాంపియన్’ ని పోలి వుంటుంది. మన దేశపు మొట్టమొదటి పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్టు, మురళీకాంత్ పెట్కర్ జీవిత కథ ఆధారంగా హీరో కార్తీక్ ఆర్యన్ తో దర్శకుడు కబీర్ ఖాన్ దీన్ని తీశాడు. పారాలింపిక్స్ (లేదా పారాలింపిక్ గేమ్స్) అనేది శారీరక, దృష్టి, మానసిక వైకల్యాలున్న అథ్లెట్ల కోసం ఒలింపిక్స్ లో సమాంతరంగా నిర్వహించే వివిధ క్రీడా పోటీలు. ఈ బయోపిక్ లో ఇందులో వృద్ధుడైన మురళీకాంత్ పెట్కర్, తన విజయాలకి  గాను అర్జున అవార్డు ఇవ్వనందుకు భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలనుకుంటున్నానని  పోలీస్ స్టేషన్‌కొస్తాడు. ఆ అవార్డు తనకి లభిస్తే తన గ్రామం అభివృద్ధికి సహాయపడుతుందని అంటాడు. అతడి అర్హతల గురించి అధికారి ప్రశ్నించినప్పుడు, షెట్కర్ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొస్తాడు.

పాయింటేమిటంటే, దేశానికి ఒలింపిక్ గోల్డ్ మెడల్ సంపాదించి పెట్టి, తన గ్రామానికి గుర్తింపు తేవాలన్న లక్ష్యంతో ఇల్లు వదిలి పారిపోయి సైన్యంలో చేరిన షెట్కర్, అక్కడ బాక్సర్‌గా ఎంపికై శిక్షణ పొందుతాడు. తీరా 1964 లో టోక్యోలో బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొన్నప్పుడు శ్రద్ధతో బాటు ఏకాగ్రత లేక ఓడిపోతాడు. దీంతో బాక్సింగ్ పట్ల షెట్కర్ కి కమిట్ మెంట్ లేదని ట్రైనింగ్ ఇవ్వను పొమ్మంటాడు ట్రైనర్.

1965 ఇండో-పాక్ యుద్ధంలో వైమానిక దాడిలో ఒక బుల్లెట్ షెట్కర్ వెన్నెముకని  దెబ్బతీయడంతో  పక్షవాతానికి గురవుతాడు. ఇక తాను ఎప్పటికీ ఒలింపిక్ గోల్డ్ గెలవలేననే నిరాశతో ఆత్మహత్యకి  ప్రయత్నిస్తాడు. అప్పుడు ట్రైనర్ అతడ్ని మందలించి  పారాలింపిక్స్‌లో పోటీపడమని ప్రోత్సహిస్తాడు. దీంతో కఠోరంగా శిక్షణ పొంది, 1972  పారాలింపిక్స్‌లో  ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్‌ లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి, గోల్డ్ మెడల్ గెల్చుకుంటాడు. ఈ వార్త అతని గ్రామానికి చేరగానే సెలబ్రిటీ అయోపోతాడు. గ్రామస్తులు అతడికి ఘన స్వాగతం పలుకుతారు.

గ్రామం అభివృద్ధి, ఒలింపిక్ గోల్డ్ మెడల్, బాక్సింగ్, పక్షవాతం, పారాలింపిక్స్, గోల్డ్ మెడల్ తో సత్కారం వంటి ఈ బయోపిక్ లోని గాథని నడిపిన బేసిక్ థీమ్స్ ‘పెద్ది’ లోనూ వున్నాయి. గ్రామానికి గుర్తింపు, ఒలింపిక్ గోల్డ్ మెడల్, బాక్సింగ్, కాలు దెబ్బతినడం, పారాలింపిక్స్, గోల్డ్ మెడల్ తో సత్కారం మొదలైనవి ఈ బయోపిక్ తో పోలిన ‘పెద్ది’ గాథని నడపడానికి వాడుకున్న థీమ్స్.

ఐతే ‘పెద్ది’ గాథని ముగించిన విధానం కాన్సెప్ట్ కి గండి కొట్టినట్టుంది. పెద్ది గోల్డ్ మెడల్ గెలవడంతో  ప్రభుత్వం ఎట్టకేలకు అతడి  గ్రామాన్ని అధికారికంగా గుర్తించి, డిమాండ్ లో వున్న రైల్వే స్టేషన్‌ ని ప్రారంభిస్తుంది. దీంతో పెద్ది గాథ తెలుసుకుంటున్న అధికారి జైస్వాల్, దేశవ్యాప్తంగా వున్న మారుమూల గ్రామాల్లో క్రీడా ప్రతిభని గుర్తించి, ప్రోత్సహించడానికి ఒక జాతీయ కార్యక్రమాన్ని అమలు చేయాలని సంకల్పించుకుంటాడు. అయితే ఈ కాన్సెప్ట్ ని ఇందుకు ఉద్దేశించలేదు. మారుమూల గ్రామాల్లో క్రీడా ప్రతిభని గుర్తించి ప్రోత్సహించడం గురించి ఈ గాథ కాన్సెప్ట్ కాదు. ఏ గుర్తింపుకూ నోచుకోకుండా మగ్గుతున్న మారుమూల గ్రామాలని జాతీయ పటంపైకి తీసుకువచ్చే ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేయడం గురించి ఈ కాన్సెప్ట్. ఇది కాస్తా ముగింపులో వూసులోకి లేకుండా పోయింది!

4. ఈ స్క్రీన్ ప్లే గాథ ఎలా అయిందో చూద్దాం...

కథకి మాత్రమే స్క్రీన్ ప్లే త్రీ యాక్ట్స్  స్ట్రక్చర్ వుంటుంది. గాథకి ఏ స్క్రీన్ ప్లే స్ట్రక్చరూ వుండదు. ఎలా బావుందని అనిపిస్తే అలా తోచినట్టూ రాసుకుంటూ, తీసుకుంటూ  పోవడమే. చేస్తున్నది గాథ అని తెలియక పోతే ఇదే జరుగుతుంది. చేస్తున్నది కథే అనుకుని చేస్తూంటే అది కథ కాకుండా, సరైన గాథ కూడా గాకుండా పోతుంది. ఇదే ఎక్కువ జరుగుతోంది. కథలతో బాటు గాథలూ వుంటాయనీ, ఈ విషయం తెలియకపోతే గాథలు చేసేసే ప్రమాదముందనీ తెలుసుకోవడం లేదు. గాథలతో హాలీవుడ్ సినిమాలూ వస్తూంటాయి. చేస్తున్నది గాథ అని తెలిసి గాథలాగా తీసి సక్సెస్ చేస్తూంటారు. కొన్ని వరల్డ్ మూవీస్ కూడా గాథలుగా వస్తూంటాయి. 2016లో తెలుగులో నాగార్జున- కార్తీ- తమన్నా లతో దర్శకుడు వంశీ పైడిపల్లి  ‘ఊపిరి’ ని గాథగా తీస్తే హిట్టయ్యింది. ఇదెలా జరిగిందో చివర్లో చూద్దాం. ముందుగా ‘పెద్ది’ కి తయారు చేసిన స్క్రీన్ ప్లే గురించి...

పై సెక్షన్ 2 లో చెప్పుకున్న ‘పెద్ది’ గాథ ఫస్టాఫ్ ఇంటర్వెల్ వరకూ చూస్తే, గ్రామానికి గుర్తింపు కోసం పెద్ది రెజ్లర్ గా మారాలని నిర్ణయించుకోవడం ఇంటర్వెల్ లో వస్తుంది. ఈ ఫస్టాఫ్ లో ముందు దిక్కులేని  గ్రామ పరిస్థితి, భూస్వాముల ఆగడాలు, రైల్వే హాల్ట్ కోసం అప్పలసూరి ప్రయత్నాలు, మరోవైపు ఆట కూలీగా పెద్ది క్రికెట్ లో గెలుస్తూ వుండడం, ఇలా బిగినింగ్ సుదీర్ఘంగా సాగుతూ వుంటుంది. ఇంకా టోర్నమెంటులో కుట్ర చేసి ప్రత్యర్ధి రాంబుజ్జి పెద్దిని ఓడించడం, గౌర్నాయుడు వచ్చి కుస్తీలో పెద్దికి శిక్షణ ఇస్తానని ఆఫరివ్వడం, పెద్ది కాదనడం, ఇంకా అప్పల సూరి మరణం, దాంతో గుర్తింపు ప్రశ్న తలెత్తడం, పెద్ది మంత్రి మనుషులకి బుద్ధి  చెప్పి- వూరికి గుర్తింపు కోసం కుస్తీ పోటీలకి వెళ్ళాలని నిర్ణయించుకోవడం వగైరా జరుగుతాయి.

ఇంటర్వెల్ వరకూ గంటంపావు సేపూ సుదీర్ఘంగా సాగుతూ వుంటుంది బిగినింగ్. ఇదే కథ అయితే బిగినింగ్ ఇంటర్వెల్ వరకూ సుదీర్ఘంగా సాగినా, అందులో ఇంత కథ వుండదు. బిగినింగ్ బిజినెస్ లో ఏఏ 4 అంశాలైతే వుండాలో ఆ నాల్గు అంశాలతో బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. హీరోకి విలన్ తో సంఘర్షణ పుడుతుంది. విలన్ మీద గెలవాలన్న గోల్ హీరోకి ఏర్పడుతుంది.

ఇవేవీ లేకపోవడంతో, చివరికి ఒక విలన్ అంటూ ఎవరూ లేకపోవడంతో, ఇంటర్వెల్ లో పెద్ది ఏకోన్ముఖంగా కుస్తీ పోటీలకి వెళ్ళాలని నిర్ణయించుకోవడంతో ఇది కథ కాదు, గాథ అని స్పష్ట మవుతోంది. కథయితే, ఎదురుగా  విలన్ అనే వాడుంటే,  పెద్ది తీసుకునే ఈ నిర్ణయంలో రిస్కు కనపడుతుంది. ఊరికి గుర్తింపు కోసం పోరాటం అనే ఆర్గ్యుమెంట్ పుడుతుంది. ఈ ఆర్గ్యుమెంట్ తో విలన్ తో సంఘర్షణ పుట్టి కథ రక్తి కడుతుంది. ‘పెద్ది’ లో ఇలాటి ఎదుటి శక్తిగా విలన్ కనిపించనప్పుడు,  పెద్ది నిర్ణయంలో రిస్కూ కనిపించడం లేదు. పరిణామాల హెచ్చరికా, చివరికి ఎమోషన్ కూడా కనిపించడం లేదు. ఇలా క్యారక్టరైజేషన్ బలహీన పడింది గాథ కాబట్టి. చూద్దాం, ఒకటి కాకపోతే ఇంకో  ఆట ఆడి చూద్దామని రాజీ పడుతూ ఏకపక్ష ప్రయాణం చేస్తున్నాడు. ఇందుకే ఈ మొత్తం గాథ పథకం ఎక్కడి కక్కడ ముగిసిపోయే చిన్న చిన్న ఎపిసోడ్లుగా సాగింది. పెద్ది ప్రయాణంలో కాన్ఫ్లిక్ట్ అనేది సహజంగానే గాథల్లో లాగా పరిస్థితులతో ఏర్పడుతోంది. అంటే పరిస్థితులతో పోరాటమన్నమాట, విలన్ తో పోరాటం కాదు. కథల్లో విలన్ తో కాన్ఫ్లిక్ట్ ఏర్పడి ఎమోషన్ డ్రైవ్ అవుతుంది.

ఇక సెకండాఫ్ కొస్తే, కుస్తీ శిక్షణ పొందడం, రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలవడం, జాతీయ పోటీలకి వెళ్ళడం, అక్కడ ఇంకో ఇంకో ప్రత్యర్ధి పెద్ది కాలుకి హాని చెయ్యడంతో, ఆ ప్రత్యర్ధి మీద పగ తీర్చుకునే బదులు, నా ఖర్మ ఇంతే ననుకుని ఆ కాలు తీసేయిన్చుకుని, కృత్రిమ కాలుతో  పారా-ట్రాక్ అథ్లెట్‌గా మారి గెలుస్తాడు. ఊరికి గుర్తింపూ రైల్వే స్టేషనూ సాధిస్తాడు. ఇలా తను పడ్డ కష్టాలతో స్టేట్ మెంట్ మాత్రంగా గాథ ముగిస్తాడు. ముందుగా  చెప్పుకున్నట్టు, చివరి ఎపిసోడ్ లో పాత్ర మీద సానుభూతి ఏర్పడడంతో, దీన్ని క్యాష్ చేసుకుంటూ రాం చరణ్ గట్టెక్కాడు.

5. ఎందుకిలా జరిగింది?

ఎందుకంటే పోలికలున్న ‘చందూ ఛాంపియన్’ లాగే కథనం చేయడం వల్ల. అంటే నిజ జీవిత చరిత్రతో బయోపిక్ గా వున్న ‘చందూ ఛాంపియన్’ కథనాన్ని అలాగే బయోపిక్ గా తీసేయడం వలన ‘పెద్ది’ ది కూడా బయోపిక్ గాథలా అయింది. బయోపిక్ నిజ వ్యక్తులతో వుంటుంది. కల్పిత పాత్రతో బయోపిక్ ఏమిటి? ‘పెద్ది’ తో రెండు జరిగాయి : తీసింది గాథ అయితే, ఆ గాథని బయోపిక్ లా తీయడం!

బయోపిక్ అంటే ఈ భూమ్మీద పుట్టిన నిజ వ్యక్తి జీవిత చరిత్ర. భూమ్మీద పుట్టని కల్పిత పాత్రతో బయోపిక్ వుండదు. ‘చందూ ఛాంపియన్’ లో అతను నిజ క్రీడా కారుడు. కాబట్టి అతడి మీద సినిమా బయోపిక్ అయింది స్పోర్ట్స్ జానర్ లో. అయితే ఈ బయోపిక్ ని గాథలా తీయడంతో బాక్సాఫీసులో నష్టపోయింది.

 

పెద్ది భూమ్మీద ఎప్పుడు పుట్టాడు? క్రీడా కారుడుగా అతడి చరిత్ర ఎక్కడుంది? కాబట్టి పెద్ది అనే కల్పిత పాత్రతో ‘చందూ ఛాంపియన్’ లో నిజ వ్యక్తి బయోపిక్ తో గాథ కిచ్చిన కథనాన్నే దృష్టిలో పెట్టుకుని, అందులోనూ పొరపాటున బయోపిక్ గా తీసేశారు.

ఒక తమాషా జరిగింది...2019 లో  సుధాకర్ కోమాకుల హీరోగా, హరినాథ్ అనే దర్శకుడు తీసిన ‘నువ్వు తోపురా’ వచ్చింది. దీన్ని కామన్ మాన్ బయోపిక్ అని నిర్మాత ప్రచారం చేశారు. ఏదో అప్పుడున్న బయోపిక్ ల ట్రెండ్ లో బిజినెస్ కోసం అని వుంటార్లే అనుకున్నాం. కానీ నిజంగానే బయోపిక్ లాగే తీయబోయారు. కల్పిత పాత్రతో బయోపిక్ ఏమిటి, బయోపిక్ అంటే నిజంగా జీవించిన మనిషి కథతో కదా వుండాలి - అన్న హద్దుల్ని కూడా చెరిపేయదల్చుకున్నారు. ఆ కల్పిత ఆవారా పాత్రతో బయోపిక్ ఎలా తీశారో చూస్తే మతిపోతుంది. అందుకే బాక్సాఫీసు పట్టించుకోలేదు.

గాథకి కథకి లాగా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ వుండకపోవచ్చు. కానీ, బయోపిక్ ని త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ తో కథ లాగా తీయొచ్చు. ఎలాగంటే, ఆ నిజ వ్యక్తి జీవితాన్ని మలుపు తిప్పిన ప్రధాన సమస్య ఒకటి తీసుకుని, దాంతో ఎలా సంఘర్షించాడో, ఫలితంగా ఏం సాధించాడో ఆ నిజ జీవితంలోని సంఘటనల్ని ఏర్చి కూర్చి - త్రీయాక్ట్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో ఇమిడ్చి, కమర్షియాలిటీ కల్పించ్చ వచ్చు. అంటే నిజ జీవితాన్ని- బయోపిక్ ని - సినిమాగా ఆడించుకోవాలన్నా దాన్ని సమస్య - సంఘర్షణ - పరిష్కారమనే త్రీయాక్ట్ స్ట్రక్చర్ తోనే చూపించాలన్న మాట. ఈ పని ‘చందూ ఛాంపియన్’ చేయలేక పోయింది.

ఇలాకాక నిజ  జీవితంలో జరిగిన అన్ని సంఘటనలూ అనుభవాలూ ఎపిసోడిక్ గా చూపించుకుంటూ పోతే అది సినిమా అవదు, డాక్యుమెంటరీ అవుతుంది. ఇది టీవీకి పనికొస్తుంది, సినిమాకి కాదు. అలాగే త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో బయోపిక్ అనేది సినిమాకే పనికొస్తుంది, టీవీ ఫిలింగా తీయడానికి కాదు. అయితే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో సినిమాగా తీసిన బయోపిక్ ని టీవీలో ప్రసారం చేయొచ్చు. ఈటీవీ ‘మార్గదర్శి’ ప్రోగ్రాంలో అమితాబ్ బచ్చన్ మీద రెండు భాగాల బయోపిక్ఈ వ్యాసకర్త రాసినప్పుడు, డాక్యుమెంటరీగానే రాయాల్సి వచ్చింది. కాకపోతే ప్రారంభం కూలీషూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్రంగా గాయపడిన ఆసక్తికర సంఘటనతో ఎత్తుకున్నాం. ఇదే సినిమా కోసం బయోపిక్ అనుకుంటేఅమితాబ్ జీవితంలో ఓ ప్రధాన సమస్యని  తీసుకుని, దాంతో సంఘర్షించిన విధం చూపించాల్సి వచ్చేది.

ఇలా సినిమాగా ఆడేందుకు నిజ జీవితాల్నే త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో పెట్టి తీయాల్సి వస్తున్నప్పుడు, ఇక రెగ్యులర్ గా వచ్చే కమర్షియల్ సినిమాల్లో కల్పిత హీరోయిజాల కథలకి ఇంకెంత త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వుండాలి!! ఇది గుర్తించకపోవడం వల్లే ఎవరి యాక్ట్’  ప్రకారం వాళ్ళు స్ట్రక్చర్ లేని సొంత క్రియేటివిటీలతో గాథలు తీసేస్తున్నారు.

 

6. ‘ఊపిరి’కి వూపిరి పోసిందేమిటి?

మరి గాథగా తీస్తే ‘ఊపిరి’ ఎలా హిట్టయ్యింది? ఎలాగంటే, దాన్ని ఇదివరకే హిట్టయిన ‘ఇన్ టచబుల్స్’ అనే ఫ్రెంచి మూవీ ఆధారంగా తీశారు. ‘ఇన్ టచబుల్స్’ ని చైనీస్ / జపనీస్ టెక్నిక్ తో గాథగా తీశారు. గాథలకి పనికొచ్చే ఈ చైనీస్ /జపనీస్ టెక్నిక్ కి త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ వుండదు, అంటే కాన్ఫ్లిక్ట్ వుండదు. ఈ టెక్నిక్ ని కిష్టెన్ క్యాచో’ (Kishotenketsu) అన్నారు.

ఈ టెక్నిక్ లో గాథ ఇలా సర్దుకుంటుంది :
1. Ki : Introduction
2. Sho : Development
3. Ten : Twist (complication)
4. Ketsu : Conclusion (reconciliation)

కమర్షియల్ సినిమా కథల్లో త్రీ యాక్ట్స్(బిగినింగ్, మిడిల్, ఎండ్) వుంటే, ఈ టెక్నిక్ లో ఫోర్ యాక్ట్స్  వుంటాయి. త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లోనైతే బిగినింగ్ లో పాత్రల పరిచయం, సమస్య ఏర్పాటు, మిడిల్ లో ఆ సమస్యతో సంఘర్షణ, ఎండ్ లో పరిష్కారం అనే పద్ధతి వుంటుంది. ఇక్కడ 4 యాక్ట్స్ విధానంలో ఇవేవీ వుండవు. ఇందులో ఫస్ట్ యాక్ట్ లో కథా పరిచయంపాత్రల పరిచయం, వాటి సామాన్య ప్రపంచమూ వుంటాయి. సెకండ్ యాక్ట్ లో  పాత్రలు పరస్పరం సంపర్కంలోకి వస్తాయి. వాటి ప్రపంచం మారుతుంది. ఆయా పాత్రల గురించి మరిన్ని విషయాలు బయటపడతాయి. ఇంతలో ఒక కొత్త ఎలిమెంట్ వచ్చి చేరుతుంది. ఇంతేగాక రకరకాల సంఘటనలతో ఆ పాత్రలు మరింత దగ్గరై ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడుతుంది. థర్డ్ యాక్ట్ లో ఎమోషనల్ కనెక్ట్ తో పాత్రలు మరింత ముందుకు సాగుతాయి.  చివర్లో ఒక ట్విస్టు వస్తుంది. ఫోర్త్ యాక్ట్ లో సెకండ్ యాక్ట్ లో ప్రవేశపెట్టిన ఎలిమెంట్ తో పరిష్కారం వుంటుంది. దీని గురించి పూర్తి ఆర్టికల్ ని ఈ లింక్ ని క్లిక్ చేసి చూడొచ్చు.

కమర్షియల్ గా ఏ కథయినా ఒక సమస్య (పాయింటు) చుట్టే వుంటుంది, కమర్షియల్ గా బయోపిక్ తీసినా ఒక సమస్య చుట్టే వుంటుంది. గౌతమీ పుత్ర శాతకర్ణి’ బయోపిక్ గణరాజ్యాల్ని  ఏకం చేసే సమస్య చుట్టే వుంటుంది. ఒక సమస్యా, దాంతో సంఘర్షణా అంటూ వుండనిది గాథలకే. విడివిడి ఎపిసోడ్లుగా సమస్యలు మారిపోతూ వుంటాయి. అంటే ఎమోషన్ ఎక్కడికక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ అనే పంథాలో ఆగుతూ సాగుతూ వుంటుంది. గాథలతో ఇలాటి రిస్కులు చాలా వుంటాయి.

ఒక విలన్, అతడితో కాన్ఫ్లిక్ట్ అంటూ లేని ‘పెద్ది’ అనే గాథకి, కిష్టెన్ క్యాచో టెక్నిక్ మంచి కమర్షియల్ ప్రయోగమయ్యేది. వందల కోట్ల బడ్జెట్ వున్నప్పుడు అనుకున్న కాన్సెప్ట్ ని ఏ తరహాగా చెప్పాలా రీసెర్చి అవసరం. ఐదారుగురు రచయితలతో భారీ రీసెర్చికి తెరతీయడానికి నిధుల కొరతేమీ వుండదు కాబట్టి. గాథల్నే కాదు, ఏ కథలనైనా రీసేర్చే కాపాడుతుంది. రీసెర్చి లేని స్క్రిప్టు రచ్చ.

-సికిందర్