దర్శకత్వం
: రవి నంబూరి
తారాగణం : కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ
ప్రియ, త్రిగుణ్, దేవీ ప్రసాద్, ప్రమోదిని, సిరి
హనుమంతు తదితరులు
రచన : సాయి రాజేష్, సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం : విశ్వాస్ డానియేల్
బ్యానర్స్ : మాస్ మూవీ మేకర్స్, అమృతా ప్రొడక్షన్స్
నిర్మాతలు : ఎస్ కె ఎన్,
సాయి
రాజేష్
విడుదల : జూలై
24, 2026
***
స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అంటే
ఎలర్జీ వల్ల తీస్తున్న సినిమాల జాతకం ఏమంత బావుండడం లేదు. స్ట్రక్చర్ అవసరం
లేదనుకుని ఇష్టారాజ్యంగా తీసి రిస్కులో పడేసుకుంటే గానీ, సినిమా తీసినట్టు అన్పించదేమో.
వాళ్ళకో నమస్కారం. ఇంకా ఇంకా ఇలాగే తీస్తూ వుండాలి. పూర్తిగా ప్రేక్షకులు
థియేట్రికల్ రిలీజుల్ని బాయ్ కాట్ చేసి, ఓటీటీ కొస్తే చూద్దాంలే అని రీల్సు
చూసుకుంటూ కాలక్షేపం చేసే రోజు వైపు నెట్టేసి చేతులు దులుపుకుంటే గానీ, ఈ ఎలర్జీ
తగ్గదేమో. పనికిరాని సొంత క్రియేటివ్ స్కూల్లో క్రిక్కిరిసి, స్ట్రక్చర్ స్కూల్ని
స్క్రూ లూజ్ చేస్తున్న మేకర్లకి మరోసారి నమస్కారం పెడుతూ, ‘చెన్నై లవ్ స్టోరీ’ స్క్రీన్
ప్లే రివ్యూలో కెళ్దాం...
కథ చూద్దాం
నివీ (శ్రీ గౌరీ ప్రియ) తో
ఐదేళ్ళుగా ప్రేమలో (ఇందులో రెండేళ్ళు స్నేహం)వుంటున్న అజయ్ (త్రిగుణ్) పెళ్ళి
సమయంలో అడ్డం తిరిగి తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెళ్ళిపోతాడు. తీవ్రంగా దెబ్బ తిన్న నివీ తాగుడుకి
బానిసై, చెన్నైలో జాబ్ చేసుకుంటూ వుంటుంది. కొలీగ్స్ తో కలిసి ఒకే ఇంట్లో
వుంటుంది. ఒకరోజు స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) అనే సినిమా దర్శకుడు కావాలని
ప్రయత్నిస్తున్న అనాధ పరిచయమవుతాడు. అతడికి కొలీగ్స్ ఆశ్రయమిస్తారు. నివీకి
స్టీవెన్ ధోరణి నచ్చదు..అతను తీసుకుంటున్న చొరవకి తిడుతుంది. తర్వాత అతడి కథ
తెలుసుకుని అతడికి సాయపడుతుంది. కానీ యా పోద్యూసర్ కి స్టీవెన్ రాసిన కథ నచ్చదు.
అయినా తనకి సాయపడిన ఆమె దేవత అని చెప్పి, తను బానిసగా వుంటానని చెప్తాడు. అలా
ఆమెకి దగ్గరవుతాడు.
ఒకరోజు ఆమె పేరెంట్స్ (దేవీ ప్రసాద్, ప్రమోదిని)
వస్తే ఆమె పెళ్ళి వ్యవహారం తెలుస్తుంది స్టీవెన్ కి. అజయ్ మంచివాడేనని, ఎందుకలా
చేశాడు తెలియడం లేదని అంటాడు ఆమె తండ్రి. ఇంకా బాధలోనే వున్న ఆమె ఒక సందర్భంలో
స్టీవెన్ మీద ప్రేమ పెంచుకుంటుంది. నేరుగా
పెళ్ళి చేసుకుందామనే సరికి తట్టుకో లేక
కన్నీళ్ళు పెట్టుకుంటాడు స్టీవెన్. ఇక పెళ్ళి కాబోతోందనగా రోడ్డు ప్రమాదంలో
చనిపోతాడు.
ఇప్పుడేం జరిగింది? నివీ జీవితం
ఏమైంది. ఆమె జీవితంలోకి స్టీవెన్ తిరిగి ఎలా వచ్చాడు? అజయ్ కూడా ఆమె జీవితంలోకెలా
వచ్చాడు? ఈ పరిస్థితుల్లో నివీ సమస్య ఎలా పరిష్కారమైంది? ఇదీ మిగతా కథ.
పై కథలో స్టీవెన్ మరణంతో ఇంటర్వెల్ వస్తుంది. సెకండాఫ్ లో స్టీవెన్ ఆత్మ రూపంలో
తిరిగి వస్తాడు. ఈ ఇంటర్వెల్లో చనిపోవడం, సెకండాఫ్ లో ఆత్మగా తిరిగి రావడం రెండూ
ఆలస్యమైపోయి కథకి హాని చేశాయి. ఇదే కథ త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లో కూర్చి వుంటే ఏ
హానీ జరిగేది కాదు. అప్పుడు అతను చనిపోవడమనే మొదటి మలుపు ఇంటర్వెల్ లోపే, ఫస్టాఫ్ అరగంటలో
వచ్చేసి, కథ అతుకుపడకుండా వుండేది. కథ అతుకుపడడ మేమిటి?
దీని గురించి తర్వాత తెలుసుకుందాం.
ఇంటర్వెల్ లోపు, ఫస్టాఫ్ అరగంటలో మొదటి మలుపు (ప్లాట్
పాయింట్ వన్) అనేది ఎందుకు రావాలంటే, అతడి
మరణం ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం కింది కొస్తుంది కాబట్టి. ప్లాట్ పాయింట్ వన్ ని తీసికెళ్ళి
ఎక్కడో ఇంటర్వెల్లో ఏర్పాటు చేయకూడదు
కాబట్టి. ప్లాట్ పాయింట్ వన్ ని తీసికెళ్ళి ఎక్కడో ఇంటర్వెల్లో పారేస్తే, సినిమాని
డస్ట్ బిన్ లో పడేసినట్టవుతుంది కాబట్టి!
అంటే ఫస్టాఫ్ ప్రారంభంలో వుండే బిగినింగ్
విభాగం అరగంట సమయం తీసుకుని, ముగిసిపోయి ప్లాట్ పాయింట్ వన్ కొస్తే –ఇక్కడే కథ ప్రారంభమై మిడిల్ -1 విభాగం మొదలవుతుంది.
అంటే అతను అరగంటలో వచ్చే ప్లాట్ పాయింట్ వన్ లో చనిపోయి, ఆ తర్వాత ఫస్టాఫ్ లోనే
ప్రారంభమయ్యే మిడిల్ -1 లో వెంటనే ఆత్మగా తిరిగి వస్తే, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్
లో వుంటుందన్న మాట.
ఇలా లేకపోవడంతో- ఇంటర్వెల్లో అతడి యాక్సిడెంట్ తో
బాటు మరణం చూపించడంతో, స్క్రీన్ ప్లే మధ్యకి ఫ్రాక్చరై, అక్కడ్నుంచి సెకండాఫ్ వేరే
కథ అతికించినట్టు సెకండాఫ్ సిండ్రోంలో పడింది సినిమా. సెకండాఫ్ సిండ్రోం అనేది
సినిమాకి గండం. కథ అతుకు పడడమంటే అర్ధం ఇదే.
ఇంటర్వెల్లో యాక్సిడెంట్, అతడి మరణం చూపించడంతో
ఇంకో అనర్ధం కూడా జరిగింది- కథ
ముగిసిపోయిందన్న ఫిలింగుతో, సినిమా పూర్తయ్యినట్టు అర్ధం వచ్చేసింది. ఎందుకంటే
యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఫస్టాఫ్ ఆపెయ్యలేదు. ఆపెయ్యకుండా యాక్సిడెంట్ సీను,
తర్వాత హాస్పిటల్ సీను, నివీ దిగ్భ్రాంతి చెందే సీను, అతడికి వీడ్కోలు, ఆతర్వాత
అంత్య క్రియల సీను వరకూ సుదీర్ఘంగా అన్నీ చూపించడంతో, ఇక కథ ౯సినిమా) ముగింపు పార్టు
చూపిస్తున్నట్టే తయారయ్యింది
ఇలా కాకుండా, యాక్సిడెంట్ జరిగిన క్షణాన్నే ఇంటర్ వెల్ వేసేసి వుంటే- ప్రేక్షకులు
ఆలోచించడానికి టైం వుండేది కాదు. షాకులో వుంటారు. సెకండాఫ్ కోసం ఎదురు
చూస్తారు.
అప్పుడు సెకండాఫ్ ని హాస్పిటల్, సంతాపం, అంత్య క్రియలూ మొదలైన సీన్లు చూపిస్తూ ప్రారంభించి
వుంటే, ప్రేక్షకులు ఇంటర్వెల్ షాకు లోంచి
తేరుకుని, ఆలోచనలో పడి సెకండాఫ్ కి అడ్జెస్ట్ అయిపోయే అవకాశముండేది.
ఎప్పుడో ఫస్టాఫ్ అరగంటలో రావాల్సిన ప్లాట్
పాయింట్ వన్ తో బిగినింగ్ ముగింపు, గంటా 20 నిమిషాలూ బారెడు సాగి, ఇంటర్వెల్లో
వస్తే స్ట్రక్చర్ మొత్తం చెదిరిపోయింది. ఫస్టాఫ్ లో బిగినింగ్ ముగిసి మిడిల్ 1 తో కథ ప్రారంభం కాక, ఇంటర్వెల్ వరకూ
సాగి, సెకండాఫ్ లో గానీ మిడిల్ -1 ఏర్పడి
కథ ప్రారంభం కాలేదు. ఈ సెకండాఫ్ లోనే మిడిల్ 1, మిడిల్ 2, ఎండ్ మూడు విభాగాలూ
ఇరికించే సరికి, సినిమా నిడివి 2 గంటలా 45 నిమిషాలకి చేరింది! ఈ కథకి బడ్జెట్ వృధా
చేస్తూ ఇంత నిడివి అవసరమా? కథ ప్రారంభంకాని సినిమా బిగినింగ్ విభాగం ఒక్కటే ఇంటర్వెల్
వరకూ గంటా 20 నిముషాలూ సాగవచ్చా?
అయితే పైన చెప్పినట్టు ఇంటర్వెల్లో అతడి
యాక్సిడెంట్ తో కట్ చేసి, సెకండాఫ్ లో మరణం వగైరా చూపించి వుంటే వర్కౌట్ అయ్యేదా?
చెప్పలేం. ఎందుకంటే అప్పటికీ ఆ యాక్సిడెంట్ ఎంత షాక్ పుట్టించినా, అది సహజంగా
జరిగిన సంఘటన కాదు కాబట్టి కన్విన్స్ చెయ్యదు. ఎందుకంటే కథల్లో అకస్మాత్తుగా ఇలా
దైవికంగా జరిగే సంఘటనతో పాత్రని చంపలేం. ఆ సంఘటన కథలోంచి సహజంగా రావాలి. వేరే
తెచ్చి అకస్మాత్తుగా అతికించినట్టు వుండకూడదు.
రెండోది, ఇంటర్వెల్లో హీరోని చంపి, సెకండాఫ్ లో
అతడి ఆత్మతో ఫాంటసీ కథగా మార్చడంతో మల్టీ జానర్ కథ కాలేదు. అతుకు వేసిన జానర్ జంప్
కథ అయింది.
వీటన్నిటికీ ఒక్కటే పరిష్కారం - ఫస్టాఫ్
అరగంటలో యాక్సిడెంట్ తో ప్లాట్ పాయింట్ వన్ కి రావడమే. ప్లాట్ పాయింట్ వన్ లో యాక్సిడెంట్ వల్ల ఇంటర్వెల్ కి
వచ్చినట్టు కంటిన్యూటీ గ్యాప్ రాదు కాబట్టి, వెంటనే మిడిల్ 1 తో కథ
ప్రారంభమవుతుంది కాబట్టి, హీరో మరణం
తర్వాత అతడి ఆత్మతో ఫాంటసీ లోకి సాఫీగా విలీనం జరుగుతుంది. ఏదీ అతుకు వేసినట్టు
వుండదు. పైగా ఫస్టాఫ్ గంట, సెకండాఫ్ గంట రెండు గంటల్లో సినిమా ముగిసిపోతుంది.
మరి ప్లాట్ పాయింట్ వన్ లోనే అతను
చనిపోతే ఇంటర్వెల్ లో ఏం చెయ్యాలి? ఇది తెలుసుకోవాలంటే ఇలాటిదే కథ ‘ఘోస్ట్’ లో
కెళ్ళాలి.
2/a మోస్ట్
వాంటెడ్ ‘ఘోస్ట్’
జెర్రీ జుకర్
దర్శకత్వంలో పాట్రిక్ స్వాయెజ్, డెమీ మూర్, వూపీ గోల్డ్ బెర్గ్ లు నటించిన 1990
నాటి హాలీవుడ్ హిట్ ‘ఘోస్ట్’ సేమ్ కథ. 1991 లో సునీల్ వర్మ దర్శకత్వంలో సుమన్,
లిజ్జీ నటించిన ‘ఆత్మబంధం’ దీనికి పక్కా అనుసరణ. ఇందులో ప్లాట్ పాయింట్స్
టైమింగ్స్, ప్లేస్ మెంట్లు కూడా మార్చకుండా ఉన్నదున్నట్టు కథ చేశారు. ఇది రెండు
గంటల సినిమా. ‘ఘోస్ట్’ రెండు గంటలా 7 నిమిషాల సినిమా.
ఇందులో ఫస్టాఫ్ 30 నిమిషాల లోపు ప్లాట్ పాయింట్
వన్ వస్తుంది. సామ్ (పాట్రిక్ స్వాయెజ్), మోలీ (డెమీ మూర్) సహజీవనం చేస్తూంటారు.
ఒక రాత్రి సినిమా కెళ్ళి వస్తూంటే దారి దొంగ సామ్ మీద దాడి చేసి కాల్పులు
జరుపుతాడు. సామ్ అకస్మాత్తుగా తన శరీరం నుంచి బయటికి వచ్చి, రక్తసిక్తమై, చనిపోతున్న తన శరీరాన్ని
పట్టుకుని ఏడుస్తున్న మోలీని చూస్తాడు. అతను అక్కడే వుండి తన మరణాన్ని చూడడంలోని
దిగ్భ్రాంతిని , అపనమ్మకాన్నీ హృదయ విదారకంగా అనుభవిస్తాడు. ఇది ఐకానిక్
సీను. ఇది అరగంట లోపు వచ్చే ప్లాట్
పాయింట్ వన్ మలుపు.
ఇక్కడ్నుంచి మిడిల్ వన్ ప్రారంభమై, వెంటనే
అతడ్ని హాస్పిటల్ కి తీసికెళ్తే బతికి వుండడు. మోలీ మీద ప్రేమ చావక ఆత్మగా తిరిగి
వస్తాడు. ఇక్కడ ప్లాట్ పాయింట్ వన్ లో మరణం, వెంటనే మిడిల్ వన్ లో ఆత్మగా రావడం గ్యాప్
లేకుండా సీన్లు పడిపోవడం వల్ల ప్రేక్షకుల అపనమ్మకానికీ, అసంతృప్తికీ అవకాశమివ్వకుండా
స కంటిన్యూటీతో సాఫీగా విలీనం జరిగిపోయింది, జానర్స్ సహా. అయితే అతడి మీద దారిదొంగ దడి చేసి చంపడం అకస్మాత్తుగా
దైవిక సంఘటనగా అతికించినట్టు లేదా అనొచ్చు. అలా లేదు. అది కథనం లోంచి సహజంగా
వచ్చిందే. ఇది ఇంటర్వెల్లో తెలుస్తుంది. తర్వాత మిడిల్ 1 లో అతను ఆత్మగా ఫాంటసీ కథ
మొదలై, ఇంటర్వెల్ వెల్ పాయింట్ లో తనని చంపిన దారిదొంగ నిజానికి తన శత్రువు
అనుచరుడనీ, పథకం ప్రకారం తనని హత్య చేశాడనీ తెలుసుకుంటుంది సామ్ ఆత్మ. అంటే ఇది
దైవిక సంఘటన కాదు, కథలోంచి పుట్టిందే. ఇదీ ఇంటర్వెల్ సీను.
ఈ రోమాంటిక్ ఫాంటసీకి సామ్ హత్యతో కూడిన క్రైం ఎలిమెంట్
ఎందుకు చేర్చారంటే, కేవలం రొమాంటిక్ ఫాంటసీతో కథ నిలబడదని.
చెన్నై లవ్ స్టోరీలో రోమాంటిక్ ఫాంటసీ
డ్రామాతోనే సెకండాఫ్ కథ నడపడంతో నిలబడలేదు. ఇందులో అజయ్ పాత్రతో ట్రయాంగిల్ లవ్
ట్రాక్ ఏర్పడినా దాన్ని ఫన్ తో నడపలేదు. దీంతో సెకండాఫ్ మొత్తం యూత్ అప్పీల్ కి
వ్యతిరేకంగా శాడ్ ఫాంటసీగా మారిపోయి భారంగా ముగిసింది. క్లయిమాక్స్ లో డాగ్స్ తో యాక్షన్ సీసు- 1985 లో విజయ్ రెడ్డి
దర్శకత్వంలో జాకీష్రాఫ్ నటించిన ‘తేరీ మెహర్బానియా’ క్లయిమాక్స్ ని గుర్తు
చేస్తుంది. ఇందులో జాకీష్రాఫ్ ని శత్రువులు చంపేస్తే, అతడి పెంపుడు కుక్క మోతీ
వాళ్ళని చంపేసి పగదీర్చుకుంటుంది.
‘చెన్నై లవ్ స్టోరీ’ నేర్పుతున్న కథా రచనా విధానం
ఇతర నిర్మాతల కళ్ళు తెరిపిస్తే, రాబోయే సినిమాల జాతకాలు మెరుగుపడతాయోమో చూద్దాం!
-సికిందర్