రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, July 29, 2026

స్క్రీన్ ప్లే రివ్యూ!


 దర్శకత్వం : రవి నంబూరి

తారాగణం : కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ, త్రిగుణ్, దేవీ ప్రసాద్, ప్రమోదిని, సిరి హనుమంతు తదితరులు
రచన : సాయి రాజేష్, సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం : విశ్వాస్ డానియేల్
బ్యానర్స్ : మాస్ మూవీ మేకర్స్, అమృతా  ప్రొడక్షన్స్
నిర్మాతలు : ఎస్ కె ఎన్, సాయి రాజేష్
విడుదల : జూలై 24, 2026
***

        స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అంటే ఎలర్జీ వల్ల తీస్తున్న సినిమాల జాతకం ఏమంత బావుండడం లేదు. స్ట్రక్చర్ అవసరం లేదనుకుని ఇష్టారాజ్యంగా తీసి రిస్కులో పడేసుకుంటే గానీ, సినిమా తీసినట్టు అన్పించదేమో. వాళ్ళకో నమస్కారం. ఇంకా ఇంకా ఇలాగే తీస్తూ వుండాలి. పూర్తిగా ప్రేక్షకులు థియేట్రికల్ రిలీజుల్ని బాయ్ కాట్ చేసి, ఓటీటీ కొస్తే చూద్దాంలే అని రీల్సు చూసుకుంటూ కాలక్షేపం చేసే రోజు వైపు నెట్టేసి చేతులు దులుపుకుంటే గానీ, ఈ ఎలర్జీ తగ్గదేమో. పనికిరాని సొంత క్రియేటివ్ స్కూల్లో క్రిక్కిరిసి, స్ట్రక్చర్ స్కూల్ని స్క్రూ లూజ్ చేస్తున్న మేకర్లకి మరోసారి నమస్కారం పెడుతూ, ‘చెన్నై లవ్ స్టోరీ’ స్క్రీన్ ప్లే రివ్యూలో కెళ్దాం...

కథ చూద్దాం

నివీ (శ్రీ గౌరీ ప్రియ) తో ఐదేళ్ళుగా ప్రేమలో (ఇందులో రెండేళ్ళు స్నేహం)వుంటున్న అజయ్ (త్రిగుణ్) పెళ్ళి సమయంలో అడ్డం తిరిగి తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని  వెళ్ళిపోతాడు. తీవ్రంగా దెబ్బ తిన్న నివీ తాగుడుకి బానిసై, చెన్నైలో జాబ్ చేసుకుంటూ వుంటుంది. కొలీగ్స్ తో కలిసి ఒకే ఇంట్లో వుంటుంది. ఒకరోజు స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) అనే సినిమా దర్శకుడు కావాలని ప్రయత్నిస్తున్న అనాధ పరిచయమవుతాడు. అతడికి కొలీగ్స్ ఆశ్రయమిస్తారు. నివీకి స్టీవెన్ ధోరణి నచ్చదు..అతను తీసుకుంటున్న చొరవకి తిడుతుంది. తర్వాత అతడి కథ తెలుసుకుని అతడికి సాయపడుతుంది. కానీ యా పోద్యూసర్ కి స్టీవెన్ రాసిన కథ నచ్చదు. అయినా తనకి సాయపడిన ఆమె దేవత అని చెప్పి, తను బానిసగా వుంటానని చెప్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు.

ఒకరోజు ఆమె పేరెంట్స్ (దేవీ ప్రసాద్, ప్రమోదిని) వస్తే ఆమె పెళ్ళి వ్యవహారం తెలుస్తుంది స్టీవెన్ కి. అజయ్ మంచివాడేనని, ఎందుకలా చేశాడు తెలియడం లేదని అంటాడు ఆమె తండ్రి. ఇంకా బాధలోనే వున్న ఆమె ఒక సందర్భంలో స్టీవెన్ మీద  ప్రేమ పెంచుకుంటుంది. నేరుగా పెళ్ళి  చేసుకుందామనే సరికి తట్టుకో లేక కన్నీళ్ళు పెట్టుకుంటాడు స్టీవెన్. ఇక పెళ్ళి కాబోతోందనగా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు.

ఇప్పుడేం జరిగింది? నివీ జీవితం ఏమైంది. ఆమె జీవితంలోకి స్టీవెన్ తిరిగి ఎలా వచ్చాడు? అజయ్ కూడా ఆమె జీవితంలోకెలా వచ్చాడు? ఈ పరిస్థితుల్లో నివీ సమస్య ఎలా పరిష్కారమైంది? ఇదీ మిగతా కథ.

2. స్క్రీన్ ప్లే రివ్యూ!


పై కథలో స్టీవెన్ మరణంతో ఇంటర్వెల్ వస్తుంది. సెకండాఫ్ లో స్టీవెన్ ఆత్మ రూపంలో తిరిగి వస్తాడు. ఈ ఇంటర్వెల్లో చనిపోవడం, సెకండాఫ్ లో ఆత్మగా తిరిగి రావడం రెండూ ఆలస్యమైపోయి కథకి హాని చేశాయి. ఇదే కథ త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లో కూర్చి వుంటే ఏ హానీ జరిగేది కాదు. అప్పుడు అతను చనిపోవడమనే మొదటి మలుపు ఇంటర్వెల్ లోపే, ఫస్టాఫ్ అరగంటలో వచ్చేసి, కథ అతుకుపడకుండా వుండేది. కథ అతుకుపడడ మేమిటి?  దీని గురించి తర్వాత తెలుసుకుందాం.

ఇంటర్వెల్ లోపు, ఫస్టాఫ్ అరగంటలో మొదటి మలుపు (ప్లాట్ పాయింట్ వన్) అనేది ఎందుకు రావాలంటే,  అతడి మరణం ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం కింది కొస్తుంది కాబట్టి. ప్లాట్ పాయింట్ వన్ ని తీసికెళ్ళి  ఎక్కడో ఇంటర్వెల్లో ఏర్పాటు చేయకూడదు కాబట్టి. ప్లాట్ పాయింట్ వన్ ని తీసికెళ్ళి ఎక్కడో ఇంటర్వెల్లో పారేస్తే, సినిమాని డస్ట్ బిన్ లో పడేసినట్టవుతుంది  కాబట్టి!

అంటే ఫస్టాఫ్ ప్రారంభంలో వుండే బిగినింగ్ విభాగం అరగంట సమయం తీసుకుని, ముగిసిపోయి ప్లాట్ పాయింట్ వన్ కొస్తే –ఇక్కడే  కథ ప్రారంభమై మిడిల్ -1 విభాగం మొదలవుతుంది. అంటే అతను అరగంటలో వచ్చే ప్లాట్ పాయింట్ వన్ లో చనిపోయి, ఆ తర్వాత ఫస్టాఫ్ లోనే ప్రారంభమయ్యే మిడిల్ -1 లో వెంటనే ఆత్మగా తిరిగి వస్తే, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో వుంటుందన్న మాట.

ఇలా లేకపోవడంతో- ఇంటర్వెల్లో అతడి యాక్సిడెంట్ తో బాటు మరణం చూపించడంతో, స్క్రీన్ ప్లే మధ్యకి ఫ్రాక్చరై, అక్కడ్నుంచి సెకండాఫ్ వేరే కథ అతికించినట్టు సెకండాఫ్ సిండ్రోంలో పడింది సినిమా. సెకండాఫ్ సిండ్రోం అనేది సినిమాకి గండం. కథ అతుకు పడడమంటే అర్ధం ఇదే.

ఇంటర్వెల్లో యాక్సిడెంట్, అతడి మరణం చూపించడంతో ఇంకో అనర్ధం  కూడా జరిగింది- కథ ముగిసిపోయిందన్న ఫిలింగుతో, సినిమా పూర్తయ్యినట్టు అర్ధం వచ్చేసింది. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఫస్టాఫ్ ఆపెయ్యలేదు. ఆపెయ్యకుండా యాక్సిడెంట్ సీను, తర్వాత హాస్పిటల్ సీను, నివీ దిగ్భ్రాంతి చెందే సీను, అతడికి వీడ్కోలు, ఆతర్వాత అంత్య క్రియల సీను వరకూ సుదీర్ఘంగా అన్నీ చూపించడంతో, ఇక కథ ౯సినిమా) ముగింపు పార్టు చూపిస్తున్నట్టే తయారయ్యింది

ఇలా కాకుండా, యాక్సిడెంట్ జరిగిన క్షణాన్నే ఇంటర్ వెల్ వేసేసి వుంటే- ప్రేక్షకులు ఆలోచించడానికి టైం వుండేది కాదు. షాకులో వుంటారు. సెకండాఫ్ కోసం ఎదురు చూస్తారు. 

అప్పుడు సెకండాఫ్ ని హాస్పిటల్, సంతాపం, అంత్య క్రియలూ మొదలైన సీన్లు చూపిస్తూ ప్రారంభించి వుంటే,
  ప్రేక్షకులు ఇంటర్వెల్ షాకు లోంచి తేరుకుని, ఆలోచనలో పడి సెకండాఫ్ కి అడ్జెస్ట్ అయిపోయే అవకాశముండేది.

ఎప్పుడో ఫస్టాఫ్ అరగంటలో రావాల్సిన ప్లాట్ పాయింట్ వన్ తో బిగినింగ్ ముగింపు, గంటా 20 నిమిషాలూ బారెడు సాగి, ఇంటర్వెల్లో వస్తే స్ట్రక్చర్ మొత్తం చెదిరిపోయింది. ఫస్టాఫ్ లో బిగినింగ్ ముగిసి  మిడిల్ 1 తో కథ ప్రారంభం కాక, ఇంటర్వెల్ వరకూ సాగి, సెకండాఫ్ లో  గానీ మిడిల్ -1 ఏర్పడి కథ ప్రారంభం కాలేదు. ఈ సెకండాఫ్ లోనే మిడిల్ 1, మిడిల్ 2, ఎండ్ మూడు విభాగాలూ ఇరికించే సరికి, సినిమా నిడివి 2 గంటలా 45 నిమిషాలకి చేరింది! ఈ కథకి బడ్జెట్ వృధా చేస్తూ ఇంత నిడివి అవసరమా?  కథ ప్రారంభంకాని సినిమా బిగినింగ్ విభాగం ఒక్కటే ఇంటర్వెల్ వరకూ గంటా 20 నిముషాలూ సాగవచ్చా?

అయితే పైన చెప్పినట్టు ఇంటర్వెల్లో అతడి యాక్సిడెంట్ తో కట్ చేసి, సెకండాఫ్ లో మరణం వగైరా చూపించి వుంటే వర్కౌట్ అయ్యేదా? చెప్పలేం. ఎందుకంటే అప్పటికీ ఆ యాక్సిడెంట్ ఎంత షాక్ పుట్టించినా, అది సహజంగా జరిగిన సంఘటన కాదు కాబట్టి కన్విన్స్ చెయ్యదు. ఎందుకంటే కథల్లో అకస్మాత్తుగా ఇలా దైవికంగా జరిగే సంఘటనతో పాత్రని చంపలేం. ఆ సంఘటన కథలోంచి సహజంగా రావాలి. వేరే తెచ్చి అకస్మాత్తుగా అతికించినట్టు వుండకూడదు.

రెండోది, ఇంటర్వెల్లో హీరోని చంపి, సెకండాఫ్ లో అతడి ఆత్మతో ఫాంటసీ కథగా మార్చడంతో మల్టీ జానర్ కథ కాలేదు. అతుకు వేసిన జానర్ జంప్ కథ అయింది.

వీటన్నిటికీ ఒక్కటే పరిష్కారం - ఫస్టాఫ్ అరగంటలో యాక్సిడెంట్ తో ప్లాట్ పాయింట్ వన్ కి రావడమే. ప్లాట్  పాయింట్ వన్ లో యాక్సిడెంట్ వల్ల ఇంటర్వెల్ కి వచ్చినట్టు కంటిన్యూటీ గ్యాప్ రాదు కాబట్టి, వెంటనే మిడిల్ 1 తో కథ ప్రారంభమవుతుంది కాబట్టి,  హీరో మరణం తర్వాత అతడి ఆత్మతో ఫాంటసీ లోకి సాఫీగా విలీనం జరుగుతుంది. ఏదీ అతుకు వేసినట్టు వుండదు. పైగా ఫస్టాఫ్ గంట, సెకండాఫ్ గంట రెండు గంటల్లో సినిమా ముగిసిపోతుంది.

మరి ప్లాట్ పాయింట్ వన్ లోనే అతను చనిపోతే ఇంటర్వెల్ లో ఏం చెయ్యాలి? ఇది తెలుసుకోవాలంటే ఇలాటిదే కథ ‘ఘోస్ట్’ లో కెళ్ళాలి.

2/a మోస్ట్ వాంటెడ్ ‘ఘోస్ట్’


    జెర్రీ జుకర్ దర్శకత్వంలో పాట్రిక్ స్వాయెజ్, డెమీ మూర్, వూపీ గోల్డ్ బెర్గ్ లు నటించిన 1990 నాటి హాలీవుడ్ హిట్ ‘ఘోస్ట్’ సేమ్ కథ. 1991 లో సునీల్ వర్మ దర్శకత్వంలో సుమన్, లిజ్జీ నటించిన ‘ఆత్మబంధం’ దీనికి పక్కా అనుసరణ. ఇందులో ప్లాట్ పాయింట్స్ టైమింగ్స్, ప్లేస్ మెంట్లు కూడా మార్చకుండా ఉన్నదున్నట్టు కథ చేశారు. ఇది రెండు గంటల సినిమా. ‘ఘోస్ట్’ రెండు గంటలా 7 నిమిషాల సినిమా.

ఇందులో ఫస్టాఫ్ 30 నిమిషాల లోపు ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. సామ్ (పాట్రిక్ స్వాయెజ్), మోలీ (డెమీ మూర్) సహజీవనం చేస్తూంటారు. ఒక రాత్రి సినిమా కెళ్ళి వస్తూంటే దారి దొంగ సామ్ మీద దాడి చేసి కాల్పులు జరుపుతాడు. సామ్ అకస్మాత్తుగా తన శరీరం నుంచి బయటికి వచ్చి, రక్తసిక్తమై, చనిపోతున్న తన శరీరాన్ని పట్టుకుని ఏడుస్తున్న మోలీని చూస్తాడు. అతను అక్కడే వుండి తన మరణాన్ని చూడడంలోని దిగ్భ్రాంతిని , అపనమ్మకాన్నీ హృదయ విదారకంగా అనుభవిస్తాడు. ఇది ఐకానిక్ సీను. ఇది అరగంట లోపు వచ్చే  ప్లాట్ పాయింట్ వన్ మలుపు.

ఇక్కడ్నుంచి మిడిల్ వన్ ప్రారంభమై, వెంటనే అతడ్ని హాస్పిటల్ కి తీసికెళ్తే బతికి వుండడు. మోలీ మీద ప్రేమ చావక ఆత్మగా తిరిగి వస్తాడు. ఇక్కడ ప్లాట్ పాయింట్ వన్ లో  మరణం, వెంటనే మిడిల్ వన్ లో ఆత్మగా రావడం గ్యాప్ లేకుండా సీన్లు పడిపోవడం వల్ల ప్రేక్షకుల అపనమ్మకానికీ, అసంతృప్తికీ అవకాశమివ్వకుండా స కంటిన్యూటీతో సాఫీగా విలీనం జరిగిపోయింది, జానర్స్  సహా. అయితే అతడి మీద దారిదొంగ దడి చేసి చంపడం అకస్మాత్తుగా దైవిక సంఘటనగా అతికించినట్టు లేదా అనొచ్చు. అలా లేదు. అది కథనం లోంచి సహజంగా వచ్చిందే. ఇది ఇంటర్వెల్లో తెలుస్తుంది. తర్వాత మిడిల్ 1 లో అతను ఆత్మగా ఫాంటసీ కథ మొదలై,  ఇంటర్వెల్  వెల్ పాయింట్ లో  తనని చంపిన దారిదొంగ నిజానికి తన శత్రువు అనుచరుడనీ, పథకం ప్రకారం తనని హత్య చేశాడనీ తెలుసుకుంటుంది సామ్ ఆత్మ. అంటే ఇది దైవిక సంఘటన కాదు, కథలోంచి పుట్టిందే. ఇదీ ఇంటర్వెల్ సీను.  

ఈ రోమాంటిక్  ఫాంటసీకి సామ్ హత్యతో కూడిన క్రైం ఎలిమెంట్ ఎందుకు చేర్చారంటే, కేవలం రొమాంటిక్ ఫాంటసీతో కథ నిలబడదని.

చెన్నై లవ్ స్టోరీలో రోమాంటిక్ ఫాంటసీ డ్రామాతోనే సెకండాఫ్ కథ నడపడంతో నిలబడలేదు. ఇందులో అజయ్ పాత్రతో ట్రయాంగిల్ లవ్ ట్రాక్ ఏర్పడినా దాన్ని ఫన్ తో నడపలేదు. దీంతో సెకండాఫ్ మొత్తం యూత్ అప్పీల్ కి వ్యతిరేకంగా శాడ్ ఫాంటసీగా మారిపోయి భారంగా ముగిసింది. క్లయిమాక్స్ లో  డాగ్స్ తో యాక్షన్ సీసు- 1985 లో విజయ్ రెడ్డి దర్శకత్వంలో జాకీష్రాఫ్ నటించిన ‘తేరీ మెహర్బానియా’ క్లయిమాక్స్ ని గుర్తు చేస్తుంది. ఇందులో జాకీష్రాఫ్ ని శత్రువులు చంపేస్తే, అతడి పెంపుడు కుక్క మోతీ వాళ్ళని చంపేసి పగదీర్చుకుంటుంది.

‘చెన్నై లవ్ స్టోరీ’ నేర్పుతున్న కథా రచనా విధానం ఇతర నిర్మాతల కళ్ళు తెరిపిస్తే, రాబోయే సినిమాల జాతకాలు మెరుగుపడతాయోమో చూద్దాం!

-సికిందర్ 

1434: డైలాగ్ రైటింగ్ టిప్స్


వి అప్పుడప్పుడూ రాసుకుంటూ పోయిన డైలాగ్ రైటింగ్  టిప్స్. డేటా బ్యాంక్ లో వుంటే తీసి అందిస్తున్నాం. ఇది నాల్గవ భాగం. పని కొస్తాయనుకంటే ప్రయత్నించవచ్చు.
1. ‘ప్రతి డైలాగు ఒక ఆయుధం
పాత్రలు మాట్లాడడం కోసం మాట్లాడవు. ప్రతి మాటతో ఎదుటి పాత్ర మీద ప్రభావం చూపాలని చూస్తాయి.
ఉదాహరణ:
‘నీకు కోపం వస్తోందా?
“లేదు’
‘మరెందుకు వణుకుతున్నావు?
ఇక్కడ ఈ చివరి లైన్ ప్రత్యర్థిని బలహీనపర్చే ఉద్దేశంతో వుంది.
2. పాత్రలకి ఒక ఫిలాసఫీ ఇవ్వాలి
గుర్తుండిపోయే పాత్రలు జీవితంపై ఒక నమ్మకంతో వుంటాయి :
ఉదాహరణ:
హీరో: ‘మనిషిని డబ్బు కాదు... మాట నిలబెడుతుంది’
విలన్: ‘మాటతో తలుపులు తెరుచుకోవు,డబ్బుతో తెరుచుకుంటాయి’
ఈ ఫైలాసఫీలు పాత్రల్లో స్థిరంగా కనిపిస్తే, డైలాగులు బలంగా వుంటాయి.

3. ఒకే డైలాగు వేర్వేరు అర్ధాలతో వుండాలి
ఒక డైలాగ్‌ ని మొదట ఒక అర్థంలో, చివర్లో మరో అర్థంలో వాడాలి :
మొదట:  ‘నువ్వు ఎప్పటికీ గెలవలేవు’
క్లయిమాక్స్‌లో: ‘గెలుపు అంటే ఎదుటివాడిని ఓడించడం కాదు... నన్ను నేను ఓడిపోనివ్వకపోవడం’
అదే డైలాగుకి ఇది  కొత్త అర్థం.
4. మాటల వెనుక చరిత్ర వుండాలి
ఉదాహరణ:
‘ఆ గడియారం ఇంకా నీ దగ్గరే వుందా?
ఈ ఒక్క లైన్‌తో ప్రేక్షకులు ఆ గడియారం వెనుక ఒక కథ వుందని ఊహించడం మొదలుపెడతారు.
‘చెన్నై లవ్ స్టోరీ’ లో ఒక డైలాగు :
5. ప్రతి పాత్రకూ ఒక సిగ్నేచర్ స్టైల్ వుండాలి
కొంతమంది ప్రశ్నలతో మాట్లాడతారు.
‘ఎందుకు?
‘ఎవరు?
‘ఎప్పుడు?
మరికొందరు సామెతలతో :
‘మంటని దాచినా పొగ దాగదు’
ఇంకొందరు వ్యంగ్యంగా :
‘చాల్లే, చాలా గొప్ప పనే చేశావ్!’
6. ఈ ప్రత్యేకతలు పాత్రల్ని గుర్తుండేలా చేస్తాయి
డైలాగులో రిథమ్ వుండాలి
మంచి డైలాగు సంగీతంలా వినిపిస్తుంది :
‘వచ్చావు’
‘చూశావు’
‘ఓడిపోయావు’
చిన్న లైన్లు టెన్షన్‌ ని పెంచుతాయి.
7. చెప్పొద్దు - చూపించాలి
బలహీనం:
‘నేను చాలా ధైర్యవంతుడిని’
బలమైనది:
‘ముందు పిల్లల్ని బయటికీ  పంపండి...’
‘నేను చివరిగా వస్తాను’
అతడి ధైర్యాన్ని ప్రేక్షకులు చూస్తారు.
8. ప్రేమ డైలాగులు
ప్రేమలో నేరుగా ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అనడం కంటే, శ్రద్ధ చూపే మాటలు ఎక్కువ ప్రభావం చూపుతాయి:
ఉదాహరణ :
‘వర్షం పడుతోంది’
‘గొడుగు తీసికెళ్ళు’
ఈ మాటల్లోనే ప్రేమ వుంది.
9. క్లయిమాక్స్ డైలాగ్
క్లయిమాక్స్‌లో హీరో కొత్త విషయాలు చెప్పకూడదు. సినిమా మొత్తం చెప్పిన భావానికి ముగింపు ఇవ్వాలి :
ఉదాహరణ:
సినిమా మొత్తం భావం :
‘భయం మనసులో వుంటుంది’
క్లయిమాక్స్:
‘ఈ రోజు నా భయం చచ్చి పోయింది’
10. గొప్ప డైలాగ్ రాసే ఫార్ములా
ఒక మంచి డైలాగ్‌లో ఈ ఐదు ప్రశ్నలకి  సమాధానం వుండాలి :
ఈ పాత్ర ఎందుకు ఇప్పుడు ఈ మాట చెబుతోంది?
ఈ మాట వల్ల ఏం మారుతుంది?
ఇంకెవరైనా ఇదే మాట చెప్పగలరా?
(అవును అయితే, ఇది ప్రత్యేకమైన డైలాగ్ కాదు)
ఈ మాటని ఇంకా చిన్నగా చెప్పవచ్చా?
ఈ మాట వినగానే ప్రేక్షకులు  ఏ భావంతో వుండాలి?
11. చివరిగా ప్రముఖ రచయిత ఒక చెప్పే రహస్యం
చాలా మంది కొత్త రచయితలు ప్రేక్షకులు వినాలనుకునే డైలాగు రాస్తారు.
మంచి రచయితలు పాత్ర తప్పకుండా చెప్పే డైలాగు రాస్తారు.
ఈ రెండింటి మధ్యే సాధారణ డైలాగ్‌కి, గొప్ప డైలాగ్‌కి  తేడా వుంటుంది.
(మరికొన్ని మరోసారి)

-సికిందర్

 

Monday, July 27, 2026

1433 : కొత్త చూపు!

    రిత్ర సినిమా దర్శకులకి, రచయితలకీ నిరంతరం కొత్త ప్రపంచాల తలుపులు తెరుస్తూనే వుంటుంది’ అంటాడు  స్టీవెన్ స్పీల్ బెర్గ్. ఇప్పుడు మన దేశంలో జెన్ జీ (కాక్రోచ్) ఉద్యమం ఈ పనే చేసింది. సినిమా త్రీ యాక్ట్స్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కో కొత్త ప్రపంచపు తలుపులు తెరిచింది. ఈ పని 2017 లో ‘ది మేయర్’ అనే కొరియన్ మూవీ చేసి పెట్టింది. అయితే  అది చరిత్రతో  కాదు, చరిత్ర ఆధారంగా తీసిందీ కాదు, ఫక్తు కాల్పనికం. కానీ జెన్ జీ ఉద్యమం చరిత్రయితే, ఇది కూడా ఆ పనే చేసి పెట్టింది. దీంట్లో ఇమిడి పోయిన సంఘటనలు స్క్రీన్ ప్లేలకి కొత్త ప్రపంచాన్ని-కొత్త క్రియేటివిటీనీ విప్పి చూపిస్తోంది!

        మర్షియల్ సినిమాలకి స్ట్రక్చర్ ఒకటే అయినా, దానికి విధిగా లోబడి క్రియేటివిటీలు అనేక విధాలుగా చేసుకునే స్వేచ్ఛ చాలా వుంటుంది. కానీ ఈ స్వేచ్ఛని వినియోగించుకోక పోవడం వల్ల, క్రియేటివిటీలు ఒకే మూసలో పడి, ఎవరైనా స్క్రీన్ ప్లేలు రాసేసే ఈజీ టెంప్లెట్ గా మారిపోయాయి. దీంతో స్ట్రక్చర్ అనే స్క్రీన్ ప్లే సౌధం బోసిపోయినట్టుగా తయారవుతోంది. స్ట్రక్చర్ కి సొగసులు అద్దేవి టెంప్లెట్ లోంచి బయటికి వచ్చే విభిన్న క్రియేటివిటీలే. బిగినింగ్ విభాగంలో పాత్రల పరిచయం, కథా నేపధ్యపు ఏర్పాటు, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటూ (ప్లాట్ పాయింట్ వన్) అనే నాల్గు తప్పనిసరి ఉపకరణాలు సదరు బిజినెస్ ని నిర్వహిస్తాయి సరే, ఈ బిజినెస్ లో ఒకే మూస క్రియేటివిటీ ఎందుకుండాలి? ఈ ప్రశ్న ఎవరూ వేసుకోవడం లేదు.
       
అంటే బిగినింగ్ లో హీరో హీరోయిన్లు సహా ముఖ్య పాత్రల్ని పరిచయం చేస్తూ
, అదే జానర్ కథో ఆ ఫీల్ ని నేపధ్యంలో ప్రతిఫలింపజేస్తూ, హీరో సమస్యలో ఇరుక్కునే పరిస్థితుల కల్పన చేసుకొస్తూ, చివరికి ఓ అరగంట సమయానికి హీరోని ఎదుటి పాత్రతో సమస్యలో ఇరికించి ఆ ప్లాట్ పాయింట్ వన్ సీనుతో బిగినింగ్ విభాగాన్ని ముగిస్తూ, హీరోకి గోల్ ఏర్పాటు చేసేలాంటి ఒకే తరహా క్రియేటివిటీ కదా సినిమా తర్వాత సినిమాగా చేసుకుంటూ వస్తున్నది!
       
ఇలా కాకుండా, కాస్త కొత్తదనం కోసం ప్రయత్నిస్తే, ఉదాహరణకి  
శివ బిగినింగ్ విభాగాన్నికొత్త క్రియేటివిటీతో మార్చేస్తే, ముందుగా నాగార్జున సైకిలు చైనుతో జేడీని కొట్టే దృశ్యంతో సినిమా ప్రారంభించి, ఎందుకు కొడుతున్నాడో తెలియని సస్పన్స్ సృష్టిస్తూ, ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించి సినిమాలో ఇదే  బిగినింగ్ విభాగంలో వున్న సీన్లన్నీ అదే వరసలో అదే అరగంటలో చూపించుకుంటూ వచ్చిసినిమా ప్రారంభ దృశ్యమైన నాగార్జున జేడీని కొట్టే దృశ్యంతో కలపడం లాంటి దన్నమాట. అప్పుడీ ప్రారంభ దృశ్యమే ప్లాట్ పాయింట్ వన్ అయి థ్రిల్ చేస్తుంది. అంటే ప్లాట్ పాయింట్ వన్ తో సినిమా ప్రారంభించి, ఫ్లాష్ బ్యాక్ లో బిగినింగ్ విభాగాన్నంతా చూపించుకుంటూ వచ్చి, ప్రారంభంలో సస్పెన్స్ క్రియేట్ చేసిన ప్లాట్ పాయింట్ వన్ సీనుతో ఒక వర్తులాకారంలో కలపడమన్న మాట!
        
2005 లో రియాన్ జాన్సన్ తీసిన మొట్టమొదటి హాలీవుడ్ టీనేజీ నోయర్ ‘బ్రిక్’ తో ఇదే చేశాడు. 2018 లో ‘అదుగో’ తో రవిబాబు చేసిందిదే. ఈ క్రమంలో 2017 లో కొరియన్ మూవీ ‘ది మేయర్’  తో దర్శకుడు పార్క్ ఇంజే బిగినింగ్ విభాగంతో ఇంకో కొత్త  క్రియేటివిటీని  ప్రదర్శించాడు. ఇది నేటి కాక్రోచ్ జెన్ జీ ఉద్యమ క్రమాన్ని పోలి వుంటుంది.
          
ది మేయర్ విజయవంతమైన్ కొరియన్ రాజకీయ జానర్ సినిమా. ఎన్నికల ప్రచార కథ. మేయర్ పదవికి గెలుపు కోసం పరస్పర పాపాల చిట్టా విప్పుకుని, చేయరాని పనులు చేయడం. దక్షిణ కొరియా అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థ. రాజధాని సియోల్ నగర మేయర్ గా వరసగా నాల్గోసారి ఎన్నికైతే, దేశాధ్యక్ష పదవి వచ్చి కాళ్ళమీద పడుతుంది. ఇందుకే కథలో ఇప్పుడున్న మేయర్ ఖతర్నాక్ పనులు చేస్తాడు. మేయర్ పాత్రలో ప్రముఖ కొరియన్ నటుడు చోయీ మిన్సిక్ నటించాడు. ఇంకో ముఖ్యపాత్ర ఎన్నికల ప్రచార స్పెషలిస్టుగా షిమ్ క్యుంగ్ నటించింది. బడ్జెట్ 9 మిలియన్ డాలర్లు, వసూళ్ళు  93 మిలియన్ డాలర్లు.


ఇందులో 17 సీన్లతో ఈ బిగినింగ్ విభాగం ఇరవై నిమిషాలుంటుంది.  ఈ బిగినింగ్ విభాగంలోనే కథనం అప్పుడే కథ ప్రారంభమయినట్టూ వుండీ, ప్రారంభం కానట్టూ కూడా వుంటుంది. ఇదేంట్రా బాబూ అనుకుంటాం. రూలు ప్రకారం బిగినింగ్ విభాగంలో ఎప్పుడూ కథ ప్రారంభం కాదనేది తెలిసిందే. బిగినింగ్ విభాగంలో పాత్రల పరిచయమూసమస్యకి దారి తీసే పరిస్థితులూ వగైరా ముగిసిప్లాట్ పాయింట్ వన్ వస్తే – అక్కడా  పాత్రకి ఏర్పడే ఆ సమస్య తాలూకు గోల్ తోఏ సినిమా కథయినా ప్రారంభమయినట్టు లెక్క. దీనికి ముందు బిగినింగ్ లో చూపించే కథనమంతా కథని ప్రారంభించడానికి చేసే సన్నాహాలే. అయితే ప్రస్తుత సినిమా విషయంలో ఈ సన్నాహాలూ దీంతో బాటే పరోక్షంగా కథా ప్రారంభమూ బిగినింగ్ విభాగంలోనే కన్పిస్తాయి. 

సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన లేకపోతే బిగినింగ్  విభాగంలో నడిచే దృశ్యాలు కథ ప్రారంభమైన మిడిల్ విభాగపు దృశ్యాల్లాగే కనబడతాయి. సమస్యతో సంఘర్షణ జరుగుతున్నట్టే వుంటాయి. ఈ ది మేయర్బిగినింగ్ విభాగపు దృశ్యాల్లో ప్లాట్ పాయింట్ వన్ తాలూకు సమస్యాదాని గోల్ కన్పించవు. ప్రారంభ సీను నుంచీ ఇది ఎన్నికల సందర్భమని తెలుస్తూనే వుంటుంది. కథా నేపథ్యాన్ని ఏర్పాటు చేయడం వరకే వుంటుంది. దాని విస్తరణ వుండదు. కథానేపథ్యపు ఏర్పాటుతో పాత్రల పరిచయాలే వుంటాయి. మేయర్ పాత్ర, అతడి సహాయకురాలు షిమ్ పాత్ర, పబ్లిసిటీ స్పెషలిస్టు పార్క్ పాత్ర, యాడ్స్ లివింగ్ లెజెండ్ పాత్ర, ప్రతిపక్ష అభ్యర్ధి యాంగ్ పాత్ర మొదలైనవి. ఈ పాత్రలు  కథకవసరమైన రాజకీయ జీవితాల మేరకే వృత్తిగత పరిచయ మాత్రంగానే  వుంటాయి.
        
సినిమా ప్రారంభ సీనులో మేయర్ పాత్ర పరిచయం యూత్ అప్పీల్ తోనే వుంటుంది. అతను యూత్ ర్యాలీలో డాన్స్ చేయడం, అతణ్ణి యూత్ అడిగే మొదటి ప్రశ్న యూత్ ప్రేమలకి సంబంధించే వుండడమూ మార్కెట్ యాస్పెక్టే. తర్వాతి ప్రశ్న అతడి కుటుంబంతో కనెక్ట్ అయి వుంటుంది. ఆ తర్వాతి ప్రశ్న వృత్తికి, ఎన్నికలకి కనెక్ట్ అవుతుంది.

         
ఇంకా అవతల మేయర్ పదవికి పోటీ చేయడానికి ప్రకటనకి సిద్ధమైన ప్రతిపక్ష అభ్యర్ది యాంగ్
వుంటుంది. ఈమె కావాలని ఆ కాగితాలు ఎగరేసుకుని, ఆ వంకతో వాటి కోసం వంగినట్టు నటించి, వక్ష సంపదని ఎక్స్ పోజ్ చేసుకుంటుంది.  ఓట్లు పొందడానికి ఇదొక్కటే మార్గమనుకుంటుంది. ఆ సంపద వైరల్ అవుతుంది. కానీ ఈ ప్రతిపక్ష మేయర్ అభ్యర్ధికి  వ్యతిరేకంగా వ్యూహాలు పన్నుతున్నసీన్లు వుండవు.  మేయర్ పదవికి కి ప్రత్యర్ధులు అతడి పార్టీలోనే వున్నట్టు షిమ్ పాత్రద్వారా తెలుస్తుంది. అయినా ఇది కూడా సమస్యకి అంటే ప్లాట్ పాయింట్ వన్ కి దారితీయదు. ఇలా రెండు మూడు ట్రాకుల్లో పరస్పరం సంబంధం లేని సంఘటనలు నడుస్తూ, చివరికి మేయర్ వచ్చేసి అబద్ధాలతో ఎన్నికల ప్రసంగం చేయడంతో, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటై పోతుంది! ఇది కల్పన మాత్రమే, ఇక చరిత్ర చూద్దాం...
        
మన దేశంలో మే 3 న నీట్ పరీక్ష నిర్వహించారు. మే 7 న ప్రశ్నా పత్రం లీకయిందని వెల్లడించారు. మే 12 న ఆ జరిగిన పరీక్షని రద్దు చేశారు. ఇలా నీట్ కి సంబంధించి ఈ సంఘటనలు ఒక పక్క జరుగుతూంటే, మే 15 న దీంతో సంబంధం లేని ఒక కేసు విచారణ సందర్భంగా, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నిరుద్యోగ యువత నుద్దేశించి  బొద్దింకలుగా, పరాన్న జీవులుగా  ఘాటైన విమర్శ చేశారు. మే 16 న దీనికి రియాక్షన్ గా ఎక్కడో బోస్టన్ యూనివర్సిటీ విద్యార్థి అభిజిత్ దీప్కే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అని వ్యంగ్యాత్మక పార్టీ ప్రకటన సోషల్ మీడియాలో చేశాడు. దీనికి ఇంస్టాలో వారం రోజుల్లో రెండు కోట్ల మంది జెన్ జీ యువత స్పందించి ఫాలోవర్స్ గా మారిపోయారు.
       
ఇదంతా కేవలం చీఫ్ జస్టిస్ కి తమ నిరసన తెలియజేయడానికే జరిగింది. కానీ దీప్కే దీన్ని సీరియస్ గా తీసుకున్నాడు. పార్టీకి అయిదు సూత్రాల మేనిఫెస్టో ప్రకటించాడు. అందులో నీట్ ప్రస్తావన ఎక్కడా లేదు. నీట్  పేపర్ లీకవడం, పరీక్ష రద్దవడం, మళ్ళీ పరీక్ష జూన్ 21 న జరుగుతుందని ప్రకటించడం – ఈ సంఘటనలతో  ఏ సంబంధమూ లేకుండా వుండి పోయింది ఆన్ లైన్ లో మనుగడ సాగిస్తున్న పార్టీ.        

పైపెచ్చు తమ పార్టీ  సామాజిక
, ఆర్థిక, రాజకీయ సమస్యలపై ప్రచారం చేస్తుందంటూ, చీపుర్లు పట్టి స్వచ్ఛ భారత్ పనులు మొదలెట్టారు. ముగ్గురు అధికార ప్రతినిధులు నియమితులయ్యారు. ఒక పక్క నీట్ రద్దుతో విద్యార్థుల ఆత్మహత్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నా ఇటు వైపు తొంగి చూడలేదు కాక్రోచ్ పార్టీ. ఈ పార్టీ ఏర్పాటే ఒక కుట్ర అంటూ విమర్శల నెదుర్కొంటూ గడిపింది.
       
చివరికి  మే 22 న దీప్కే
,  నీట్ పరీక్షల వ్యవహారం తీవ్రమవడంతో స్పందించి, విద్యా మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ గొంతు కలిపి ఆందోళన ప్రారంభించాడు.  తను జూన్ 6 న న్యూఢిల్లీ వచ్చి జంతర్ మంతర్ లో ప్రత్యక్ష నిరసనకి  నాయకత్వం వహిస్తాననీ  ప్రకటించాడు. అన్నట్టు జూన్ 6 న వచ్చి నిరసన చేపట్టడంతో ఉద్యమం ప్రారంభమయింది.

ఇంతవరకూ దీన్ని ఒక కథగా చూస్తే ఇది స్క్రీన్ ప్లే లో బిగినింగ్ విభాగం కింది కొస్తుంది. ఈ బిగినింగ్ విభాగంలో రెండు విడి విడి కథనాలు రన్ అవుతున్నాయి. ఒకటి నీట్ కథనం, రెండోది కాక్రోచ్ పార్టీ కథనం. ముందుగా నీట్ పేపర్ లీకవడం దగ్గర నీట్ కథనం మొదలైతే,  తర్వాత చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలతో కాక్రోచ్ పార్టీ పుట్టి దాని కథనం మొదలైంది. అంటే ఈ మొత్తం కథకి బిగినింగ్ విభాగం ప్రారంభంలోనే నీట్ పరీక్ష రద్దుతో సమస్య ఏర్పాటయి పోయింది. నిత్యం కథల్లో చూసే బిగినింగ్ విభాగం ముగింపులో కాకుండా, ప్రారంభం లోనే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటై పోయింది.

ఇప్పుడు ఈ సమస్య ప్రకృతి అనుకుంటే, ప్రకృతిని సాంఖ్య శాస్త్రం ఇలా వివరిస్తుంది : ‘ప్ర’ -అంటే విశ్వంలో ఆల్రెడీ పదార్థం వుంది. దానికి ‘కృతి’ చేసే చేతులు కావాలి.
  అంటే మనం జీవితంలో ఏం సాధించాలన్నా అది ప్రకృతిలో కొదవ లేకుండా ఆల్రెడీ వుంది-జస్ట్ దానికి కృతి చేసి అందుకునే చేతులే కావాలి. ఆ చేతుల కోసం ఎదురు చూస్తూ వుంటుంది పదార్ధం. కృతి చేసి తన వైభవం ప్రపంచానికి చాటాలని ఎదురుతెన్నులు కాస్తూ వుంటుంది. అబ్సర్వర్ ఎఫెక్ట్ ప్రయోగంతో క్వాంటం థియరీ కూడా ఇదే నిరూపించింది.

కనుక నీట్ పేపర్ లీక్ సమస్య దాన్ని సాధించే చేతుల కోసం ఎదురు చూస్తూ వుంది. అప్పుడు తర్వాత చీఫ్ జస్టిస్ ఎంట్రీ ఇచ్చి కాక్రోచ్ పార్టీ పుట్టుకకి బీజం వేశారు.
  కానీ పుట్టిన కాక్రోచ్ పార్టీ క్వాంటం థియరీ తెలీక ఏమేమో చేస్తూ వుండి పోయింది. నీట్ వ్యవహారం బాగా వేడెక్కితేగానీ గానీ చురుక్కుమనలేదు. దాంతో రంగంలోకి దిగి జంతర్ మంతర్ మొదలెట్టింది. అలా నీట్ సమస్య అనే పదార్ధంతో కృతి చేయడం మొదలెట్టింది...

కథా ప్రారంభంలో నీట్ సమస్య పుట్టినా దానికి కృతి చేసే చేతుల్లేక ప్లాట్ పాయింట్ ఏర్పాటు కాలేదు. జంతర్ మంతర్ ఆందోళన ప్రారంభమయ్యాకే, కృతి చేసే చేతులతో (కాక్రోచ్ పార్టీతో) ప్లాట్ పాయింట్ ఏర్పాటై సంఘర్షణ మొదలైంది. స్క్రీన్ ప్లేలో మిడిల్ విభాగం మొదలై కథ ప్రారంభమైంది.

ఇక్కడ్నుంచీ మిడిల్  సంఘర్షణలో భాగంగా చలో పార్లమెంట్ చేపట్టడం, అది పోలీసు లాఠీ చార్జీకి దారితీయడం వంటి సంఘటనలు జరిగి, చివరికి ఎండ్ విభాగం విద్యామంత్రి రాజీనామాతో పూర్తయింది.

సర్వసాధారణంగా బిగినింగ్ విభాగంలో ప్రశ్నలు తలెత్తవు. సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన జరగనప్పుడే ప్రశ్నలు తలెత్తి ఆసక్తికరంగా మారుతుంది కథనం. పై చరిత్ర చెప్పే కథలో రెండు సంబంధం లేని వేర్వేరు సంఘటనలు సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన జోలికెళ్ళ కుండా, ఇవి ఎందుకు జరుగుతున్నాయి, ఏమవుతాయి, ఇలాగెందుకు జరుగుతోందీ అన్న ప్రశ్నలతో బిగినింగ్ విభాగాన్ని బలీయం చేస్తున్నాయి.
         
    మూసలోంచి బయటికి రావాలంటే నడిచిన, నడుస్తున్న చరిత్ర మీద కన్నేసి వుంచాలి.

-సికిందర్

 

 

Saturday, July 25, 2026

1432 :రైటర్స్ కార్నర్


            క్వింటా బ్రన్సన్ హిట్టయిన ఎబిసి టీవీ కామెడీ ‘అబట్ ఎలిమెంటరీ' రచయిత్రి. ఆమె పాత్రల ప్రవర్తన, వాస్తవిక వ్యక్తిగత అనుభవాలు మొదలైన వాటిపై దృష్టి సారించి స్క్రిప్ట్ రచన చేస్తుంది. ఫిలడెల్ఫియా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా తన తల్లి అనుభవాలు వంటి నిజ జీవిత సంఘటనల నుంచి నేరుగా స్ఫూర్తి పొంది, వాస్తవికతతో కూడిన సంఘర్షణలని  హాస్యభరితం చేస్తూ, వినూత్న పరిష్కారాలతో  కథల్ని అల్లుతుంది.

        విస్తృత సాధారణ ప్రేక్షక శ్రేణిని దృష్టిలో పెట్టుకుని కామెడీని, హృద్యమైన వాస్తవికతని, సందర్భోచిత హాస్యంతో బ్యాలెన్స్ చేస్తూ ఆకట్టుకునేలా రూపొందిస్తుంది. కేవలం సంభాషణలతో కాకుండా, పాత్రల ప్రవర్తనలతో జీవం పోయడానికి ప్రయత్నిస్తుంది. పూర్తిగా  ఫన్నీ డైలాగ్స్ మీదే ఆధారపడకుండా, ఒక పరిస్థితిలో వివిధ పాత్రలు ఎలా అలోచిస్తాయన్నమైండ్ సెట్ ని పట్టుకుని సీన్లు రాస్తుంది.
        అబట్ ఎలిమెంటరీ' తో హాస్యంతో గొప్ప ఆలోచనల్ని ఎలా ముందుకి తీసుకెళ్ళ వచ్చో, ప్రపంచాన్ని ఎలా మరింత మెరుగైన ప్రదేశంగా మార్చవచ్చో ఆమె చూపిస్తోంది. ఈ క్రమంలో ఆమె తను రాస్తున్న పాత్రల్ని అర్ధం జేసుకోవడానికి ఒక మైండ్ సెట్ టెస్ట్ ని ప్రయత్నిస్తోంది. అదేమిటో తెలుసుకుందాం...

1. నోటుతో ఎవరేంటి?
        కమెడియన్ లారీ విల్మోర్ నుంచి నేర్చుకున్న ఈ టెక్నిక్ కి ‘5 డాలర్ టెస్ట్’ అని పేరుపెట్టింది.  ఇదిలా వుంటుంది : రచయిత్రో రచయితో నేల మీద 5 డాలర్ల నోటుని పడేసి చాటుకెళ్ళి  గమనిస్తున్నారనుకుందాం-  అప్పుడు కథలో అనుకుంటున్న వివిధ పాత్రలు ఆ నోటుని చూసి ఎలా రియాక్ట్ అవుతాయో అవే బయట పెట్టుకోవడం కనిపిస్తుంది. పాత్రల నైజాలు, ప్రాధాన్యాలు, దృక్కోణాలూ అన్నీ వాస్తవికంగా సులభంగా అర్ధమవుతాయి.
        
తను రాస్తున్న పాత్రలు ఎలాంటివో, ప్రపంచాన్ని ఎలా చూస్తాయో తెలియజేయడానికి డబ్బు ఒక సరైన ఎర. ఈ డబ్బుని  ఎలా చూస్తాయో, వాటి జీవితంలో దానికున్న  అర్థమేమిటో చాటు నుంచి బాగా గమనించ వచ్చు.
       
అవి అటూ ఇటూ ఎవరో లేరని చూసి చటుక్కున్న ఆ నోటుని తీసి జేబులో పెట్టేసుకున్నాయా? ఈ నోటుని పడేసుకున్నదెవరా అని వెతుకుతున్నాయా?
ఆ నోటుని చూసి ఆశ్చర్య పడ్డాయా? దానికి తాము పూర్తి అర్హులమని భావిస్తున్నాయా? మైండ్ సెట్  తవ్వి తీయడానికి ఇక్కడే వుంది అంతా. అయితే ఏ రెండు పాత్రలు ఆ నోటుతో ఒకే పని చేశాయంటే, వాటిలో ఒకటి స్క్రిప్టులో  పేజీలోని ఓ విలువైన స్థలాన్ని దురాక్రమిస్తున్నట్టేనని ఆమె హెచ్చరిక.
       
‘అబట్ ఎలిమెంటరీ’ లో అత్యుత్తమ తారాగణ బలముంది. ఎన్నో పాత్రలున్నాయి
, కానీ దారిలో దొరికిన  డబ్బుని  చూసే విషయంలో ప్రతి ఒక్కటీ ఎంత ప్రత్యేకంగా వున్నాయో చూపించడానికి ఆమె ఇలా రాసుకుంది :
        జానైన్ : ఆ నోటు తీసుకుని తీవ్రంగా కలత చెందుతుంది. దాని అసలైన యజమానిని వెతికి పట్టుకోవడానికి ఆమె ఒక పెద్ద పోరాటాన్నే మొదలు పెడుతుంది.
        అవా : దాన్ని జేబులో పెట్టుకుని ఒక్క ప్రశ్న కూడా వేసుకోదు.
        మెలిస్సా : ఇది ట్రాపేమో అనుకుని ముట్టుకోకుండా జాగ్రత్తపడుతుంది.
  బార్బరా : నిశ్శబ్దంగా నవ్వి, సర్వశక్తిమంతుడైన దేవుడే ఆశీర్వదించాడని తీసి కళ్ళకద్దుకుంటుంది.
        గ్రెగరీ : ఛీఛీ, దీన్ని ముట్టుకుంటే నానా క్రిములూ అంటుకుంటాయని ఇగ్నోర్ చేస్తాడు.
      జాకబ్ : చివరి దశ పెట్టుబడిదారీ విధానంలోని భయానక పరిణామాలపై గంభీరమైన ఉపన్యాసం ఇవ్వడం మొదలుపెడతాడు.
   మిస్టర్ జాన్సన్: తాను యూఎస్ మింట్‌లో పనిచేస్తున్నప్పుడు, సరిగ్గా ఇదే నోటుని ముద్రించడంలో సాయం చేశానని చెప్పుకుంటాడు.

ఈ రియాక్షన్లలో దేనికీ పది పేజీల క్యారక్టర్ బయోగ్రఫీ అవసరం లేదని గమనించ వచ్చు. అంతా చేతల్లోనే వుంది. ఈ టెక్నిక్ ని  సిట్‌కామ్, మరేదైనా జానర్ సినిమా, ఒక డ్రామా రాస్తున్నప్పటికీ
కూడా ఉపయోగించవచ్చు.

పాత్రల ప్రపంచ దృక్పథాలు ఒక చిన్న కాగితం ముక్క విషయంలో కూడా ఘర్షణ పడేంత విభిన్నంగా వున్నప్పుడు
, ఆ తర్వాత సంభాషణ సహజంగానే సాగాలి. తర్వాతిసారి, ఒక సీను ఎందుకు చప్పగా అనిపిస్తోందని ఆలోచిస్తూ ఖాళీ పేజీ ముందు కూర్చుండిపోక పోతే, నేల మీద ఒక ఐదు డాలర్ల నోటు పడేసి, దాన్ని ఎవరు తీస్తారో చూస్తే సీను వర్కౌటై పోతుంది.

2. క్వింటా గురించి...
        క్వింటా బ్రన్సన్ ‘అబట్ ఎలిమెంటరీ’ ని  ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల అంకితభావాన్ని, పట్టుదలని  గౌరవించడానికి దశాబ్దాల పాటు బోధించిన తన తల్లి నుంచి ప్రేరణ పొంది, అత్యంత తక్కువ జీతాలు పొందే వృత్తులలో ఒకటైన బోధన వృత్తి  వెనకున్న హాస్యం, ఆప్యాయతలతో కూడిన వాస్తవిక వ్యక్తులపై దృష్టి పెట్టానని చెబుతోంది. అదే సమయంలో, ప్రామాణికమైన, పాత్రల ఆధారిత కామెడీని నెట్‌వర్క్ టెలివిజన్‌కి  తిరిగి తీసుకురావాలని కూడా ఆమె ఆకాంక్షిస్తోంది.
     
క్వింటా బ్రన్సన్ (36)  అమెరికన్ నటి, హాస్యనటి, రచయిత్రి, నిర్మాత.  ఆమె పోర్ట్ ఫోలియోలో 23 టీవీ సిరీస్, 7 సినిమాలూ వున్నాయి. ‘అబట్ ఎలిమెంటరీ’ లో రెండవ తరగతి ఉపాధ్యాయురాలు జానైన్ టీగ్స్‌గా నటించింది.  ఆమె 2022 టైమ్ మేగజైన్ 100 అత్యంత ప్రభావవంత వ్యక్తుల జాబితాలో కూడా స్థానం సంపాదించింది .
-సికిందర్

(టాలీవుడ్ కి ఈ టెక్నిక్ ఎందుకవసరం? మూసలో ఆలోచించుకుంటూ లేజీగా కూర్చుని రాయకుండా, బ్రెయిన్ కి కాస్త పని కల్పించి కొత్త పద్ధతులు నేర్చుకుంటూ వుంటే,  బాడీ గార్డులా నిలబడుతుంది బాక్సాఫీసు)

 

 

Thursday, July 23, 2026

1431 : డైలాగ్ రైటింగ్ టిప్స్!


    వి అప్పుడప్పుడూ రాసుకుంటూ  పోయిన  డైలాగ్ రైటింగ్  టిప్స్. డేటా బ్యాంక్ లో వుంటే తీసి మూడవ భాగం అందిస్తున్నాం. పని కొస్తాయనుకంటే ప్రయత్నించవచ్చు.

1. ప్రతి పాత్రకూ  ఒక ‘వాయిస్’ ఇవ్వాలి
అదే విషయాన్ని మూడు  పాత్రలు ఎలా చెబుతాయంటే:
పోలీస్ : ‘చట్టం ముందు అందరూ సమానమే
గ్యాంగ్‌స్టర్ : చట్టం డబ్బున్న వాళ్ళ జేబులో వుంటుంది’
మదర్ : ‘తప్పు చేసినవాడు ఎప్పుడో ఒకరోజు ఫలితం చూస్తాడు’
ఒకే ఆలోచన, మూడు వేర్వేరు ‘వాయిస్’ లతో గమనించ వచ్చు.
2. డైలాగ్‌లో మలుపు వుండాలి
ప్రేక్షకులు వూహించిన దాని కంటే వేరేలా ముగియాలి :
ఉదాహరణ:
‘నిన్ను చంపడానికి వచ్చాను’
‘మరెందుకు నిలబడి పోయావ్?
‘ఇప్పటికే నువ్వు చచ్చావని’
4. భావోద్వేగం పెరుగుతూ వుండాలి
ప్రతి లైన్ ముందు లైన్ కంటే బలంగా వుండాలి :
ఉదాహరణ :
‘వెళ్ళు’
‘వెళ్తానని అనుకోకు’
‘నేణు పంపిస్తున్నాను’
5. డైలాగ్‌కి ముందు, తర్వాత జరిగే చర్యలు కూడా ముఖ్యం
కొన్నిసార్లు ఒక చూపు, ఒక నవ్వు, ఒక గ్లాస్ పెట్టే శబ్దం మాటలకంటే ఎక్కువ చెబుతాయి
ఉదాహరణ:
(అతను టీ కప్పు టేబుల్‌పై నెమ్మదిగా వుంచుతాడు)
‘ఇక నిన్ను నమ్మను’
6. ప్రతి డైలాగ్‌తో ఒక  పరిణామం వుండాలి
పాత్ర ఒక మాట చెప్పిన తర్వాత ఏదో మారాలి:
సంబంధం మారాలి. నిర్ణయం మారాలి.ప్రమాదం పెరగాలి.
నిజం బయటపడాలి.
ఏమీ మారకపోతే, ఆ డైలాగ్ అవసరం లేకపోవచ్చు.
7. మంచి విలన్ డైలాగులు
విలన్ తనని తాను చెడ్డవాడిగా భావించడు.
బలహీనం :
‘నేను చెడ్డవాడిని’
బలీయం :
‘ప్రపంచం నన్ను రాక్షసుడని అంటుంది... ఎందుకంటే వాళ్ళకి నిజం నచ్చదు’
8. హీరో డైలాగులు
హీరో తన గొప్పతనాన్ని చెప్పుకోడు; పరిస్థితి అతడి గొప్పతనాన్ని బయటపెడుతుంది :
ఉదాహరణ :
‘నన్ను గెలవడం నీ వల్ల కావచ్చు...’
‘కానీ నన్ను వంచడం మాత్రం కాదు’
9. హాస్య డైలాగులు
హాస్యం జోక్ చెప్పడం వల్ల కాదు, పాత్ర స్వభావం వల్ల వస్తుంది:
ఉదాహరణ:
‘భయపడుతున్నావా?
‘లేదు... నా కాళ్ళు లగెత్తాలని  చూస్తున్నాయి’
10. నిశ్శబ్దానికి విలువ ఇవ్వాలి
ప్రతి ప్రశ్నకూ వెంటనే సమాధానం అవసరం లేదు.
‘నిజంగా నన్ను ప్రేమించావా?
(నిశ్శబ్దం)
‘అర్థమైంది’
ఈ నిశ్శబ్దమే డైలాగ్‌లో భాగం.
11. ప్రేక్షకులు గుర్తుంచుకునే డైలాగులు ఎలా పుడతాయి?
చాలా ప్రసిద్ధ డైలాగులు ఈ నాలుగు లక్షణాల్లో కనీసం రెండింటిని కలిగి వుంటాయి:
నిజం - జీవితానికి దగ్గరగా వుండాలి.
ఆశ్చర్యం వూహించని కోణం వుండాలి.
భావోద్వేగం మనసుని తాకాలి.
సరళత్వం  ఒక్కసారి వింటే గుర్తుండాలి.
ఉదాహరణలు:
‘గెలవడం కష్టం కాదు... గెలిచాక మనిషిగా వుండడమే కష్టం’
శత్రువుని  ఓడించడం విజయం... కోపాన్ని ఓడించడం గొప్ప విజయం

నువ్వు నన్ను మోసం చేయలేవు... మోసంతో నీకు మూన్నాళ్ళ ముచ్చటే’

12. ఒక ప్రొఫెషనల్ అభ్యాసం
ఒక సీన్ రాసేటప్పుడు ముందుగా డైలాగులు లేకుండా ఆ సీన్‌ని వూహించాలి. పాత్రలు ఏం చేస్తున్నాయి?  ఎలా చూస్తున్నాయి? ఎప్పుడు మౌనంగా వున్నాయి? ఆ తర్వాత అవసరమైన మాటలు మాత్రమే రాయాలి.  ఈ పద్ధతి వల్ల డైలాగులు సహజంగా, ప్రభావవంతంగా మారుతాయి.
13. సినిమా డైలాగ్ రచనలో ఒక మంచి రూలు
ప్రేక్షకులు విన్న మాటల్ని కాదు, ఆ మాటల వల్ల కలిగిన ఫీలింగ్ ని గుర్తుంచుకుంటారు.

(మరికొన్ని మరోసారి)

-సికిందర్