రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, July 15, 2026

1429 : రైటర్స్ స్పెషల్



కాజ్ అండ్ ఎఫెక్ట్ కథనాన్ని తప్పించుకోలేరు!

    ప్పట్లో ఒక ఇంటర్వ్యూలో ‘తని ఒరువన్’ దర్శకుడు మోహన్ రాజా, చాలా యాక్షన్ థ్రిల్లర్స్ లో విలన్ తో హీరో ఎందుకు పోరాడుతున్నాడనే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ వేస్తారనీకానీ తని ఒరువన్లో దుష్ట శక్తుల్ని ఓడించడం హీరో బాధ్యతగా చూపించాననీ, దానధర్మాలు చేయడానికి ఎలా కారణాలు అవసరం లేదో, అలా ఇది కూడా అంతేననీ  చెప్పాడు (ఇది సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రాం చరణ్ తో ‘ధృవ’ గా తెలుగులో రీమేకైంది). ఇందుకే నేమో కథలో ప్లాట్ పాయింట్ వన్ తో ఏం చేసుకోవాలో ఎటూ తేల్చుకోలేకపోయిన హీరో (జయం రవి), దాన్నలా వుంచేసి, మిడిల్లోకి ఎంటరవాలని ట్రై చేస్తాడు. కానీ ఒక టోల్ గేట్ దగ్గర దొరికిపోతాడు. స్క్రీన్ ప్లే కి అనవసరంగా ఈ ప్లాట్ పాయింట్ వన్ ని కనిపెట్టిందెవరా అన్నదే  ఆ హీరో  పాత్ర  బాధ కావచ్చు. దీంతో లేనిపోని చావొచ్చింది. ఈ మిడిల్లో అసలు తన సమస్య ఏమిటో, ఎవరితో పోరాడాలో ఇంకా స్పష్టత రాదు. ఇలాటి కథనం ఇంకే సినిమాలోనూ చూసి వుండం బహుశా. తను పోరాడాల్సిన శత్రువెవరో తెలీక, చీకట్లో రాయి విసిరి చూద్దామా అన్నట్టు- ఎవరో  చెల్లదురై అనే మైన్స్ మాఫియా మీద నిఘా పెట్టాలనుకుంటాడు. పట్ట పగలు వెంబడిస్తాడు. ఇంకేదో చేస్తాడు, ఇంకేదో చేస్తాడు, చేసుకుంటూ పోతూనే వుంటాడు...కాజ్ లేకుండా ఎఫక్ట్ ని వెతుక్కుంటూ!

లా అలా విలువైన మిడిల్ కథ ప్రారంభమే కాక సాగిపోతూంటే, మరి కొన్ని ఘోరాలు చూశాక, అప్పుడు తన శత్రువెవరో తెలిసినట్టూ, ఇక ఆ శత్రువు జీవితంలో రానున్న ఒక తేదీని మర్చిపోలేని రోజుగా చేస్తాననీ  ప్రతిజ్ఞ చేస్తాడు సదరు హీరో!

ఇక్కడ ఒక సందేహం రావచ్చు:  హీరోకి తన శత్రువెవరో నిర్ణయమై, గోల్ ఏర్పడింది ఇక్కడే గనుక, ఇదే ప్లాట్ పాయింట్ వన్ ఎందుకు కాకూడదూ అని.

2. ఎందుకంటే...
1. ఎప్పుడైనా బిగినింగ్ లో ఒక సెటప్ (కాజ్) ఏర్పాటు చేశాక, దాన్ని పే ఆఫ్ (ఎఫెక్ట్)  చేస్తున్నప్పుడే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడి పోతుంది. 2. శివలో నాగార్జున జేడీ అగడాల్ని చూసీ చూసీ (సెటప్/కాజ్)ఇక తిరగబడి అతణ్ణి కొట్టేశాక (పే- ఆఫ్/ ఎఫెక్ట్) ప్లాట్ పాయింట్ వన్ వచ్చి, గోల్ ఏర్పడి పోతుంది. 3. 24లో గడియారమున్న తెరచుకోని పెట్టెని రకరకాల పనిముట్లుగా అటు విసిరి ఇటు విసరీ వాడుకున్నాక (సెటప్/కాజ్ ), దాని తాళం చెవి దొరికి తెరవడంతో (పే-ఆఫ్/ఎఫెక్ట్) ప్లాట్ పాయింట్ వన్ వచ్చిచిన్న సూర్యకి గోల్ ఏర్పడుతుంది.

4. ఇలాగే తని ఒరువన్లో కూడా రాత్రి పూట నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావని అప్పుడప్పుడు కొలీగ్స్ అడగడం (సెటప్/కాజ్ )ఒక తప్పనిసరి పరిస్థితిలో హీరో వాళ్ళని తన గదికి తీసికెళ్ళి తన రీసెర్చి ప్రపంచాన్ని చూపడం ( పే- ఆఫ్/ఎఫెక్ట్  ) తో, అక్కడే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడిపోయింది. కానీ ఇది తెలుసుకోక పోవడంవల్ల గోల్ ఏర్పడక, స్ట్రక్చర్ చెదిరిపోయింది.  5. సినిమాల్లో ప్లాట్ పాయింట్ వన్ ఎక్కడుందో గుర్తించాలంటే బిగినింగ్ లో సెటప్ ని ఫాలో అవుతూంటే చాలు, అది పే- ఆఫ్ అయ్యే సీనే ప్లాట్ పాయింట్ వన్ అవుతుంది. ఇలా  కాజ్ అండ్ ఎఫక్ట్ సూత్రం పని చేయకుండా ఏ కథా పనిచెయ్యదు!

స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్ వన్ ని స్థాపించడానికి  బిగినింగ్ విభాగం లోనే కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడ పునాది పడకుండా, మిడిల్ లో ఇంకెక్కడో ప్లాట్ పాయింట్ వన్ వేసినా, దాంతో కథ నడపాలన్నా కుదరదు!

3. బలాబలాల పోరు!
కాజ్ అండ్ ఎఫెక్ట్ (కార్యకారణ సంబంధం) తోనే మన ఆలోచన, మాట, చేత, జీవితం అన్నీ నడుస్తున్నాయి. మొత్తం సృష్టే దీని ఆధారంగా నడుస్తోంది. కాబట్టి హీరో కారణం లేకుండా పోరాడలేడు. దాన ధర్మాలు చేయడానికీ కారణం వుంటుంది- దానం పుచ్చుకుంటున్న వ్యక్తి  బావుండాలన్నకారణం కావచ్చు. అలాగే తని ఒరువన్లో  హీరో పోరాటానికి కారణం వుండే వుంటుంది. చుట్టూ జరుగుతున్న నేరాలు చూసి (కాజ్) తను పోలీసాఫీసర్ అవ్వాలనుకున్నానని (ఎఫెక్ట్) హీరోగా నటించిన జయం రవియే  స్వయంగా చెప్పుకున్నాడు. జీవితంలో ఇంతే కదా, మరి సినిమాలో ఎందుకు కాదనుకున్నారు?

అయితే సర్వసాధారణంగా కథల్లో కాజ్ ని ఎంత బలంగా సృష్టిస్తారో, ఎఫెక్ట్ నీ అంతే  బలంగా సృష్టిస్తారు. ఇలా రెండు వ్యతిరేక శక్తుల మధ్య యాక్షన్ –రియక్షన్ల ఇంటర్ ప్లే సాగుతూ వుంటుంది. కానీ నిజంగా ఇలాగే జరుగుతుందా? జరుగుతుంది, కానీ ఇంకోలా కూడా జరుగుతుంది.  ఎంతో బలంగా అమెరికా ప్రయోగించిన (కాజ్) మిస్సైల్స్ ని, అవి ఇరాన్ మీద పడి పేలక ముందే (ఎఫెక్ట్), ఇరాన్ తన మిస్సైల్స్ తో పడగొట్టుకుంటూ పోవడాన్ని నేటి పశ్చిమాసియా యుద్ద దృశ్యాల్లో  చూస్తున్నాం. అంటే ఏమిటర్ధం? కాజ్ మనం కోరుకున్న  ఎఫెక్ట్ ని చూపాలనేం లేదు, తగిన పవర్ లేక ఫెయిలవ్వొచ్చు. బ్రహ్మాండంగా ప్రారంభించిన సినిమా విడుదలై ఫ్లాప్ అయినట్టు.

అంటే కాజ్ ఎంత బలంగా వున్నా, ఎఫెక్ట్ దాని బలం మీద ఆధారపడి వుండదు ఒక్కోసారి. ఇతర శక్తులకున్న కాజ్ ఎదుటి శక్తి ఎఫెక్ట్ ని నిర్వీర్యం  చేయవచ్చు. అలాగే ఒక బలహీన కాజ్, బ్రహ్మాండంగా ఎఫెక్ట్ చూపించ వచ్చు. ఇలాటివి కామెడీ సినిమాల్లో కనిపిస్తూంటాయి. సీరియస్ యాక్షన్లో కూడా చూపించ వచ్చు.

4. కాన్సెప్ట్ తో అప్రమత్తత!
అలాగే  సినిమాలో చెప్పాలనుకున్న ముఖ్య విషయానికి  బలహీన వాదనని (కథనాన్ని) జోడిస్తే, చెప్పాలనుకున్న ముఖ్య విషయం మొత్తం ప్రభావం తగ్గిపోతుంది. ఇలాటి ఫ్లాపులు ఎన్నో చూశాం. కాబట్టి కథకి ఒక ఐడియా అనుకున్నా, కాన్సెప్ట్ అనుకున్నా, దాన్ని కాజ్ గానే  పరిగణించాలి. అప్పుడే స్క్రిప్టు మీద తగిన ఎఫెక్ట్ కోసం పని చేయగలుగుతాం. ఐడియాని లేదా కాన్సెప్ట్ ని కాజ్ గా పరిగణించక పోతే, ఎఫెక్ట్ మాయమై కాజ్ తేలిపోతుంది. కాబట్టి చెప్పాలనుకున్న విషయమో, ఇవ్వాలనుకున్న మేసేజో దాన్ని కాజ్ అనుకుని  ఫిక్స్ అయిపోతే, ఆటోమేటిగ్గా దాని ఎఫెక్ట్స్ కోసం ఇంగిత జ్ఞానంతో పనిచేసే టూల్ గా మారిపోతుంది మెదడు, కథ చేస్తూంటే.

కొండని తవ్వి ఎలుకని పట్టుకోవడం కూడా ఫెయిలైన కాజ్ అండ్ ఎఫెక్ట్ బాపతే. ప్రభుత్వ పథకాల కోసం భారీ సన్నాహాలు చేస్తారు (కాజ్), దానికి గట్టి వాగ్దానాలు, అపార ప్రయత్నాలూ చేస్తారు. చివరికి ఎఫెక్ట్ దగ్గరి కొచ్చేసరికి చేతులెత్తేసి దండం పెడతారు. రాజకీయాల్లో జరిగే సంగతే.

5. కాజ్ కి రెండు జోన్లు!
కథల్లో కాజ్ రెండు జోన్స్ లోంచి పుడుతుంది : వ్యవస్థ లోంచి, పౌరజీవితం లోంచి. వ్యవస్థ లోంచి కాజ్  పుట్టాలంటే వ్యక్తిగత అన్యాయమో నష్టమో జరిగి వుండనవసరం లేదు. ఆ అధికారి, లేదా ఉద్యోగి ఉద్యోగ ధర్మమే కాజ్ అవుతుంది. దాంతో చర్య తీసుకుంటారు (ఎఫెక్ట్). అదే పౌర జీవితంలో అయితే, వ్యక్తిగతంగా అన్యాయం జరక్కుండా (కాజ్) అన్యాయాల్ని ఎదుర్కోలేరు (ఎఫెక్ట్). ఒక ఆటో డ్రైవర్ అన్యాయాల్ని ఎదుర్కొవాలంటే (ఎఫెక్ట్) వ్యక్తిగతంగా అతడికి అన్యాయం జరిగి వుండాలి (కాజ్).

 ‘శివలో పౌర జీవితంలో వుండే స్టూడెంట్ నాగార్జున, తన సన్నిహితురాలు అమలతో జేడీ మిస్ బిహేవ్ చేసినందుకే (కాజ్) జేడీని కొట్టి, మాఫియా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తాడు (ఎఫెక్ట్). ఇక్కడ కాజ్అతడి పౌర జీవితంలో జరిగిన వ్యక్తిగత నష్టమే.

డెత్ విష్’  అనే ప్రసిద్ధ సినిమాలో, పౌర జీవితంలో వుండే బిజినెస్ మాన్ అయిన ఛార్లెస్ బ్రాన్సన్, దోపిడీ దొంగలు తన భార్యని చంపి, పెళ్ళయిన కూతుర్ని రేప్ చేసిన అన్యాయంతో వ్యవస్థతో విసిగి(కాజ్), ఇలా మరొకరికి జరక్కూడదని, రాత్రిపూట తనే నగరంలో దొంగల్ని ట్రాప్ చేసి చంపుతూంటాడు(ఎఫెక్ట్). ఇక్కడ కూడా కాజ్’  పౌర జీవితంలో జరిగిన వ్యక్తిగత నష్టమే.

 ‘బొబ్బిలిపులిలో వ్యవస్థలో భాగంగా సైనికుడైన ఎన్టీఆర్ సొంతవూరికి వచ్చి, పెళ్ళి కుదుర్చుకుని పోతూ విలన్ల దురాగతాలు చూసి, తన డ్యూటీ (కాజ్) సరిహద్దుల్లో కాదనీ, ఇక్కడే ననీ డిసైడ్ అయిపోయి, సంఘవిద్రోహుల మీద సమరభేరి మోగిస్తాడు (ఎఫెక్ట్). ఇక్కడ కాజ్సైనికుడుగా వ్యవస్థలో భాగంగా డ్యూటీ పట్ల వుండే స్పృహే. వ్యక్తిగత నష్టం జరిగి వుండాల్సిన అవసరం లేదు.

సరైనోడులో సైనికుడిగా తన డ్యూటీ (కాజ్) సరిహద్దుల్లో కాదనీ, దేశం లోపలే దుష్టుల  పని పట్టడమేనని వచ్చేసి వివాదాలు సెటిల్ చేస్తూంటాడు అల్లు అర్జున్ (ఎఫెక్ట్). ఇక్కడ కూడా కాజ్వ్యవస్థలో భాగంగా డ్యూటీ పట్ల స్పృహే గానీ వ్యక్తిగతం కాదు.  అయితే ఇది బలహీన కాజ్. ఎందుకంటే, ఇలా ఫీలవడానికి పేపర్స్ లో వార్తలేవో చదివి వుంటాడేమో తప్ప, ఇదమిత్థంగా ఓ ప్రత్యక్ష సంఘటనంటూ కళ్ళతో చూసిన వాడు కాదు. అందుకే ఇది బలహీన కాజ్. దీని ఎఫెక్టు కూడా అంతే  బలహీనంగా వుంటుంది- కథ వేరే పాయింటు మీదికి వెళ్ళిపోతూ. బొబ్బిలిపులిలో  ఇలాకాకుండా, ఎన్టీఆర్ సంఘవిద్రోహుల కరాళనృత్యం కళ్ళారా చూస్తాడు గనుకే, అది బలమైన కాజ్ అయింది. దాని ఎఫెక్ట్ కూడా ఆద్యంతం అంతే బలంగా వుంది.

6. ఎఫెక్ట్ యూటర్న్ తీసుకుంటుంది!
ఇక వ్యవస్థలో భాగమైన పాత్రలు వ్యక్తిగత నష్టా లెదుర్కొనే కథలు కూడా వున్నాయి. ఈ పాత్రలు ఉదాత్తంగా వ్యక్తిగత నష్టాన్ని ఓర్చుకుని పదవీ బాధ్యతలకే ప్రాణమిస్తాయి. ఉదాహరణకి కొండవీటి సింహంలో పోలీస్ అధికారి అయిన ఎన్టీఆర్ కొడుకుని విలన్ కిడ్నాప్ చేసి బేరం పెడితే లొంగడు. అలాగే అంకుశంలో సీఎంని కాపాడే ఇన్స్ పెక్టర్  పాత్రలో రాజశేఖర్ భార్యని విలన్లు చంపేస్తే, సీఎంని రక్షించడానికే పోరాడతాడు రాజశేఖర్!

ఇలాటి పాత్ర లు చాలా సానుభూతిని పొంది బలంగా కనెక్ట్ అవుతాయి.ఇక్కడేం జరుగుతుందంటే, ఎవరో తన మీద ప్రయోగించిన కాజ్ కి రెస్పాండ్ అవక, అంతకంటే ఉదాత్త ఆశయంతో, డ్యూటీని ప్రధానంగా తీసుకుని, యూటర్న్ తీసుకుని ఎఫెక్ట్ ని ఛానలైజ్ చేస్తారు.

7. ఇది గొలుసుకట్టు కథనమే!
సినిమా కథకి అసలు ప్రాణం కాజ్ అండ్ ఎఫెక్ట్ (కారణంఫలితం) కథనమే. కథలో జరిగే ప్రతి సంఘటనకూ ఒక కారణం వుండాలి. ఆ కారణం వల్ల వచ్చే ఫలితమే తరువాతి సన్నివేశాన్ని ముందుకు నడపాలి. ఇలా సంఘటనలు ఒకదానికొకటి గొలుసులా అనుసంధానమైతే ప్రేక్షకులు కథలో పూర్తిగా లీనమవుతారు. ఈ గొలుసుకట్టు కథనం ఇలా సాగుతుంది- కారణం పరిణామం కొత్త కారణం కొత్త పరిణామం.  ఉదాహరణకి : హీరో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం వల్ల ఒక సమస్య వస్తుంది. ఆ సమస్యని పరిష్కరించడానికి ఇంకో  నిర్ణయం తీసుకుంటాడు.ఆ నిర్ణయం ఇంకింత పెద్ద సమస్యని  సృష్టిస్తుంది. చివరికి ఆ సంఘటనలన్నీకలిసి  క్లయిమాక్స్‌కి దారి తీస్తాయి.

కాజ్ అండ్ ఎఫెక్ట్ ని ఆధారంగా చేసుకుని కథనం చేస్తే- సీన్లు రాస్తే- కథ ఎక్కడా బలహీనపడే సమస్యే వుండదు. చాలా రివ్యూల్లో  చూస్తూనే వుంటారు. సెకండాఫ్ లో కొంత సేపు డల్ అయిందనీ, లాగ్ వుందనీ, తర్వాత పుంజుకుందనీ రాస్తూంటారు. అంటే ఇక్కడ కథనంలో కాజ్ అండ్ ఎఫెక్ట్ ని మర్చిపోయి కథకుడు ఇంకా ఇంటర్వెల్ మూడ్ లో పడుకున్నాడేమో తెలీదు. తర్వాతెప్పుడో నిద్రలేచి, పొయ్యి వెలిగించి, వంటకం మొదలెడతాడు.

 ఇందుకే ప్రతీ సీనూ తర్వాతి సీనుకి కారణం (కాజ్) కావాలి. బలమైన కథనం ఇలా వుంటుంది :  హీరో విలన్‌ని  అవమానిస్తాడు (కాజ్), విలన్ హీరో కుటుంబం మీద  దాడి చేస్తాడు (ఎఫెక్ట్), హీరో ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు (కాజ్),  ప్రతీకారం ప్రయత్నం విఫలమవుతుంది (ఎఫెక్ట్),  హీరో తన వ్యూహాన్ని మార్చుకుంటాడు (కాజ్). ఇక్కడ ఒక్క సీన్ కూడా యాదృచ్ఛికంగా జరగడం లేదని గమనించాలి.

8. హాలీవుడ్ టెక్నిక్!
మంచి కథనం కోసం హాలీవుడ్ రచయితలు ఒకపని చేస్తారు. ప్రతీ సీను తర్వాత  ‘అందుకే...’, లేదా ‘కానీ...’ అనుకుని రెండో సీను రాస్తారు. అంటే ఒక సీను రాశాక  ‘అందుకే’ (Therefore)’ లేదా ‘కానీ (But)’-అనుకుని  దీన్ని బట్టి తర్వాతి సీను రాస్తారు. 
ఉదాహరణ: హీరో ఉద్యోగం కోల్పోయాడు. ‘అందుకే’  కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. ‘కానీ’ విలన్ అడ్డుపడ్డాడు. ‘అందుకే’ హీరో మరో మార్గం వెతికాడు...ఇలా సాగితే కథనం తెగకుండా సాఫీగా ముందుకు వెళుతుంది.

తెలుగు సినిమాల్లో కనిపించే బలమైన కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉదాహరణలు మరికొన్ని : ‘శివ’- కాలేజీలో ర్యాగింగ్ కి హీరో ఎదురు తిరగడం, దాంతో గ్యాంగ్‌తో ఘర్షణ జరగడం, దీంతో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం, దీంతో హీరో వ్యక్తిగత యుద్ధం...ఇలా  ప్రతీ  సంఘటన ముందున్న సంఘటన నుంచే పుడుతుంది.

‘రంగస్థలం’ : గ్రామంలో అన్యాయం, హీరో అన్న తిరుగుబాటు, అన్న హత్య, హీరో ప్రతీకారం, గ్రామ విముక్తి అన్నీ కాజ్ అండ్ ఎఫెక్ట్  గొలుసులోనే సాగుతున్నాయి.

 ‘జెర్సీ’ : కొడుకు కోరిక, తండ్రి మళ్ళీ  క్రికెట్‌లోకి రావడం, వయస్సు వల్ల కష్టాలు, విజయాలు, అపజయాలు; ఒక భావోద్వేగ ముగింపు. ప్రతి సంఘటనా పాత్ర నిర్ణయాల నుంచే వస్తోందిక్కడ.

ఈగ : నిర్దయుడైన పారిశ్రామికవేత్త సుదీప్, సమంతని సొంతం చేసుకోవడానికి నానిని హత్య చేస్తాడు (కాజ్).  నాని ఈగగా పునర్జన్మ ఎత్తి, సినిమా మిగిలిన భాగమంతా పకడ్బందీగా ప్రతీకారం తీర్చుకోవడానికి కుట్రలు పన్నుతాడు (ఎఫెక్ట్). దీనివల్ల సుదీప్‌కి  భయాందోళనలు, ఆర్థిక పతనం, శారీరక హానీ వంటి పరిణామాలు ఎదురవుతాయి.

కాజ్ అండ్ ఎఫెక్ట్  లేని కథ ఎలా వుంటుంది? చాలా సినిమాల్లో ఇలా జరుగుతుంది : చేతిలో వున్న కథకి కాజ్ అండ్ ఎఫెక్ట్ తో కథనం చేసుకోవాలని తెలీక, ఒక్కసారిగా ఓ పాట, కారణం లేకుండా ఒక ఫైట్, అకస్మాత్తుగా కొత్త విలన్ ఎంట్రీ, ఎక్కడి నుంచో ఒక ట్విస్ట్, చివర్లో హడావిడిగా ముగించేసి చేతులు దులుపుకోవడం.

9. ఐదు ప్రశ్నలు!
గొప్ప స్క్రీన్‌ప్లే రచయితలు పాటించే నియమం : ప్రతీ సీను రాసిన తర్వాత  ఈ ఐదు ప్రశ్నలు వేసుకుంటారు : ఈ సీన్ ఎందుకు జరిగింది? దీనికి కారణం ఏమిటి? దీని వల్ల తర్వాత ఏం  జరుగుతుంది? హీరో నిర్ణయం ఏమిటి? ఆ నిర్ణయం కొత్త సమస్యని సృష్టిస్తోందా? ఈ ఐదు ప్రశ్నలకి  సమాధానం వుంటే కథనం బలంగా వుంటుంది.

కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది కేవలం స్క్రీన్‌ రైటింగ్ టెక్నిక్ కాదు, కథకి  వెన్నెముక. సినిమాల్లో  ప్రేక్షకుల్ని మొదటి సీను నుంచి క్లయిమాక్స్ వరకూ కట్టిపడేసే శక్తి ఇదే. పాత్రల నిర్ణయాలు సంఘటనల్ని సృష్టించాలి; సంఘటనలు కొత్త నిర్ణయాల్ని తీసుకునేలా  చేయాలి. అప్పుడు మాత్రమే కథ సహజంగా, ఉత్కంఠగా, భావోద్వేగభరితంగా ఎదుగుతుంది. బలమైన కథలన్నీ ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ సూత్రంపైనే నిర్మాణమవుతాయి.

కాజ్ అండ్ ఎఫెక్ట్ సూత్రం యాక్షన్ కథల కోసమే కాదు- కామెడీ, రోమాన్స్, ఫ్యామిలీ, డివోషనల్, హార్రర్- ఇలా అన్ని జానర్ కథలకీ వర్తిస్తుంది. డివోషనల్ కి- పాత ‘పాండురంగ మహాత్మ్యం’ చూస్తే తెలుస్తుంది. రోమాంటిక్ కామెడీకి  ‘అహ నా పెళ్ళంట’ చూడొచ్చు.

స్క్రిప్టులో నిర్ణయమైనదే బాక్సాఫీసులో నిర్ణయమవుతుంది. కథనంలో ఏదో కాజ్ అనుకుని, దాని ఎఫెక్ట్ దద్దరిల్లాలని డిస్కషన్స్ పెట్టుకుంటే, బాక్సాఫీసు దద్దరిల్లదు. కారణం, ఏదో ఒక కాజ్ వుంటే చాలనుకోవడం. స్క్రిప్టులో కాజ్ కూడా బలంగా, లాజికల్ గా వుండాలి. స్క్రిప్టులో లేనిది స్క్రీన్ మీద రాదు. బాక్సాఫీసులో భాంగ్రా వేయదు.

-సికిందర్


Monday, July 13, 2026

1428 :


 

సినిమా డైలాగులు రాయడం లోతుగా
నేర్చుకోవాలంటే ఈ సూత్రాలు  
ఉపయోగపడవచ్చు, ట్రై చేయండి!

1. డైలాగ్ అంటే సమాచారం కాదు, భావోద్వేగం
డైలాగ్ ద్వారా ప్రేక్షకులు కథని  వినకూడదు; పాత్ర మనసుని అనుభవించాలి.
ఫ్లాట్ డైలాగు :
నాన్న చనిపోయిన తర్వాత నేను చాలా కష్టపడ్డాను’
ఫీల్ తో వున్న డైలాగు :
నాన్న వెళ్ళిపోయిన రోజు నుంచి... ఇంట్లో నిశ్శబ్దం కూడా నన్ను భయపెడుతోంది’
2. ప్రతి పాత్రకీ  ఒక పదజాలం వుండాలి
చదువుకున్న వ్యక్తి: ‘ఇది సరైన నిర్ణయం కాదు’
గ్రామీణ వ్యక్తి: ‘ఇది మన పని కాదు రా’
రౌడీ: ‘ఇలారా, ఒక్క మాట చెబుతా... విను!’
ప్రతి పాత్ర ఒకేలా మాట్లాడకూడదు.

3. చిన్న డైలాగులు ఎక్కువ ప్రభావం చూపుతాయి
పొడవైన ప్రసంగాల కంటే చిన్న మాటలు గుర్తుండిపోతాయి.
ఉదాహరణ:
‘ఒక్క అవకాశం చాలు’
‘నేను ఓడిపోలేదు... ఇంకా గెలవలేదు’

4. పంచ్ డైలాగ్‌కి ముందు బిల్డ్-అప్ వుండాలి
పంచ్ ఒక్కసారిగా వస్తే ప్రభావం తగ్గుతుంది.
ఉదాహరణ:
విలన్: ‘నువ్వు నన్ను ఆపలేవు’
హీరో: ‘నిన్ను ఆపడానికి రాలేదు...’
కొన్ని క్షణాలు ఆగి, మళ్ళీ హీరో : ‘...ముగించడానికి వచ్చాను’

 5. ప్రతి డైలాగ్ ఒక చర్యలా వుండాలి
పాత్రలు కేవలం మాట్లాడకూడదు; మాటలతోనే ఎదుటివారిని మార్చడానికి ప్రయత్నించాలి.
భయపెట్టడం, ప్రేమని వ్యక్తం చేయడం, అవమానించడం, ప్రోత్సహించడం, మోసం చేయడం వగైరా.

6. పాత్రకి తగిన భాష
ఒక పదేళ్ళ పిల్లవాడు ఇలా మాట్లాడడు:
‘నీ ప్రవర్తన నన్ను తీవ్రంగా నిరాశపరిచింది’
అతను ఇలా అంటాడు : ‘నువ్వు అలా చేస్తావని అనుకోలేదు’

7. గుర్తుండిపోయే డైలాగులు రాయాలంటే:
అవి మూడు లక్షణాలు కలిగి ఉండాలి:
చిన్నవి, కొత్త ఆలోచన కలిగినవి, భావోద్వేగంతో నిండినవి
ఉదాహరణలు:
‘భయం గెలవదు... మనమే ఓడిపోతాం’
‘గాయం మానిపోతుంది... అవమానం కాదు’
‘సమయం అందరికీ దొరుకుతుంది... అవకాశం కాదు’

8. డైలాగ్‌కి రిథమ్ వుండాలి
మాటలు సహజంగా ప్రవహించాలి.
ఉదాహరణ :
‘వస్తావా?
“రాను’
‘ఎందుకు?’
నువ్వున్నావు కాబట్టి’
చిన్న వాక్యాలు వేగాన్ని పెంచుతాయి.

9. మంచి డైలాగ్ ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తుంది
ఉదాహరణ:
‘అబద్ధం చెప్పినవాడిని క్షమించొచ్చు... కానీ నమ్మినవాడిని ఎలా మర్చిపోగలం?

10. డైలాగ్ రాయడానికి ఒక సులభమైన ఫార్ములా
Emotion + Conflict + Surprise = Memorable Dialogue
ఉదాహరణ:
‘నిన్ను ద్వేషించడం లేదు...’
‘మరి?
‘నువ్వు నాకు పరాయివాడివయ్యావు’
ఇక్కడ భావోద్వేగం వుంది, సంఘర్షణ వుంది, చివర్లో ఊహించని మలుపు వుంది.

11. రోజూ చేయాల్సిన  ఒక మంచి అభ్యాసం
ఒకే పరిస్థితిని మూడు రకాలుగా రాయాలి:
హీరోలా, విలన్‌లా, హాస్య పాత్రలా
ఇలా చేస్తే ప్రతి పాత్రకి ప్రత్యేక గొంతు ఎలా ఇవ్వాలో సహజంగా అలవాటవుతుంది. అదే బలమైన సినిమా డైలాగ్ రచనకి పునాది.

డైలాగులు రాయడంలో నిజమైన నైపుణ్యం మాటలు రాయడంలో కాదు, పాత్రని  వినడంలో వుంటుంది. పాత్రని వింటే దాని మనసు తెలుస్తుంది. అప్పుడు పాత్ర మనసులోంచి వస్తాయి డైలాగులు- రైటర్ మనసులోంచి కాదు. ప్రొఫెషనల్ రైటర్లు అనుసరించే మరికొన్ని ముఖ్యమైన పద్ధతులు మరోసారి!

-సికిందర్

Tuesday, July 7, 2026

1427 : స్క్రీన్ ప్లే సంగతులు



రచన –కూర్పు - దర్శకత్వం : వెంకటేష్ మహా
తారాగణం : సత్యదేవ్, దీపా థామస్, వికాస్ ముప్పాల, బాలా పరాశర్, ఆనంద్ భారతీ, ప్రణయ్ వాకా, కునాల్ కౌషిక్, మాస్టర్ కిరణ్ తదితరులు
సంగీతం :  స్మరణ్ సాయి,  ఛాయాగ్రహణం : కార్తీక్ పర్మార్, కళ : : రోషన్ సింగ్,
సమర్పణ: ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్
బ్యానర్స్ : శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్
నిర్మాతలు: చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర
విడుదల : జులై 3, 2026
***
ర్శకుడు వెంకటేష్ మహా (‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్) కొత్త కళాత్మక కానుక ‘రావు బహదూర్’ ప్రేక్షకుల ఉత్తమాభిరుచిని పరీక్షిస్తూ వెండితెర మీదికొచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పించడంతో దీనికి మంచి బజ్ వచ్చింది. హీరో సత్యదేవ్ ని కొత్తావతారంలో చూపిస్తూ వచ్చిన అత్యంత సాహసోపేత, వినూత్న, విలక్షణ చలన చిత్రాల్లో ఒకటిగా నిలిచేందుకు విచ్చేసింది. తెలుగు సినిమాల్లో ప్రయోగాలెప్పుడూ  ప్రశ్నార్దకాలుగానే వుంటూ వచ్చాయి. ఆర్ట్ సినిమాల్లాంటి యూరోపియన్ సినిమాల గొడవ మనకెందుకని హాలీవుడ్ కూడా తనదారిలో తానూ కమర్షియల్ సినిమాల వైపే వుంటూ వస్తోంది. మన దేశంలో కూడా యూరోపియన్ సినిమా లేవీ థియేటర్లలో విడుదల కావు. ఎందుకంటే ప్రేక్షకులు చూడరు. మరి రావు బహదూర్లాంటి ఫ్రెంచి అబ్సర్డ్ థియేటర్ బాపతు సినిమా ప్రేక్షకుల ఉత్తమాభిరుచిని గెలుచుకోగలదని ఎలా నమ్మి నిర్మించారు. ఇది పూర్తిగా అబ్సర్డ్ థియేటర్ బాపతేనా, లేక సగం అబ్సర్డ్ సగం రెగ్యులర్ తెలుగు సినిమా కల్తీ జరిగి కళ్ళముందు కరాళ నృత్యం చేసిందా తెలుసుకుందాం...

1. కథేమిటి?


    బ్రహ్మానంద నగరంలో  భువనాలయంఅనే ఒక శిథిలావస్థకి చేరుకుంటున్న రాజభవనంలో మొదలవుతుంది కథ. ఇక్కడ అరవై ఏళ్ళ భువనం రావు బహదూర్ రామప్ప (సత్యదేవ్) అనే అతను చివరి దశ కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ వుంటాడు. కులాహంకారం, పితృస్వామ్య వ్యవస్థాపేక్ష, సామాజిక మూఢనమ్మకాలూ దండిగా నిండిన గతాన్ని మోస్తూ జీవిస్తుంటాడు. డాక్టర్లు అతను చనిపోతాడని చెప్పినా, మెడికల్ సైన్సుని  ఛాలెంజ్ చేస్తూ బతికేస్తుంటాడు. శారీరక స్థితికి తోడూ చిత్తభ్రాంతులతో, తనతో తానూ మాట్లాడుకునే స్వగతాలతో అతడి మానసిక స్థితి కూడా ఘోరంగా వుంటుంది. దీనికి కారణం అనుమానమనే భూతం. ఇతడ్ని మందలిస్తూ డాక్టర్ ఆచారి (వివేక్ ముప్పల) అనే అతను తోడుగా వుంటాడు.

భార్య రేణుక (దీపా థామస్) ఇంకో గదిలో ఏళ్ళ తరబడీ తలుపు లేసుకుని వుండి  పోతుంది. రాజ భవన వ్యవహారాల్ని, రామప్ప బాగుగుల్నీ చూసుకుంటూ పెద్ద కొడుకు లవణప్ప వుంటాడు. వివాదాస్పదుడైన చిన్న కొడుకు కుసుమప్ప (మాస్టర్ కిరణ్) చిన్నప్పుడే నీటమునిగి చనిపోయాడు. రామప్పని చూసుకుంటూ పని మనిషి అచ్చమ్మ (బాలా పరాశర్) కూడా వుంటుంది. అనుమానం అనే భూతం పట్టిన రామప్ప, అది పోయే వరకూ తను పోయే ప్రసక్తే లేదని చెబుతూంటాడు.

అనుమాన భూతంతో జీవితాన్ని, మానవ సంబంధాల్నీ కచరా చేసుకుని, సమస్యగా మారిన రామప్పని భరించేదెలా? ఇతను బాగు పడేదెలా? ఇతడి అనుమానం దేని గురించి? భార్య ఎందుకు బందీ చేసుకుని వుండి పోయింది? చిన్న కొడుకు చావుకి కారణమేమిటి?  ఇవన్నీ మిగతా కథలో తేలే అంశాలు.

2. ఎలావుంది కథ?


    అనుమానం పెనుభూతం అనే పాయింటుతో కథ చెప్పాలనుకున్నారు. అనుమానం అనేది సినిమాలకి సక్సెస్ ఫార్ములా కిందే వర్కౌట్ అవుతూ వచ్చింది- రాం గోపాల్ వర్మ మాఫియా యాక్షన్  ‘కంపెనీ’ అయితేనేం, రాజేష్ ఖన్నా- ముంతాజ్ ల ఫ్యామిలీ డ్రామా ‘ఆప్ కీ కసమ్’ అయితేనేం ఈ ఫార్ములాకి ఫోటో ఫ్రేములా నిలిచాయి. అయితే ఈ కథలు కేవలం అనుమానం ఎంత పనిచేస్తుందో ఆ ఒకే పాయింటు చుట్టూ తిరుగుతూ తేలికగా అర్ధమవుతూ వుంటాయి. ఏ కథైనా ఒక సమస్యనే తీసుకుని చర్చించాలన్న ఏక సూత్రతకి కట్టుబడుతూ.

‘రావు బహదూర్’ కథతో వున్న అనుమానమనే పాయింటే గాకుండా, వంశాభివృద్ధి, కులాహంకారం, వర్ణవివక్ష, పితృస్వామ్య వ్యవస్థాపేక్ష, సామాజిక మూఢనమ్మకాలూ, ఫ్యూడల్ మనస్తత్వం వంటి సవాలక్ష అంశాల్నీ స్పృశించడంతో  రెండు జరిగాయి - అనుమానం పెనుభూతమనే అసలు పాయింటు గల్లంతై, కథ కలగాపులగమవడం.

రామప్ప అనారోగ్యంతో బాధపడుతూ, గత కాలపు జ్ఞాపకాల్లోనే బతికే ఒక జమీందారీ వంశస్థుడు. పతనమవుతున్న ఆ వైభవంలో చిక్కుకుపోయిన అతను, చిత్తభ్రాంతులతో  కూడిన మానసిక సమస్యలతో పతనమయ్యే తాగుబోతు కథ. ప్రాణం పోయే లోపు తనని వెంటాడుతున్న అనుమానానికి సమాధానం కనుగొనాలని తపించే కథ. ఈ క్రమంలో కథ విభిన్న కాలాల మధ్య సాగుతూ, సమాజంలో వర్గ భేదాలు, వారసత్వం, వంశాన్ని నిలబెట్టే వారసుడి కోసం పడే ఆరాటం, అంతరించిపోయిన వైభవాన్ని కాపాడుకోవడానికి పడే మానసిక వేదనా వంటి అనేక అంశాల్ని చిత్రిస్తూ పోతుంది.

కానీ ఆలోచిస్తే కథకి, పాత్రకీ ఇవేవీ ముఖ్యం కావు- అతడి ప్రాణాలకి పట్టుకున్న అనుమానమనే భూతమొక్కటే ముఖ్యం కావాలి. నిజమేంటో తెలుసుకుని ప్రాణాలు వదలడమే అతడి గోల్. ఈగోల్ చెదిరిపోయేలా ఇతర వ్యాపకాలు పెట్టుకోవడం వ్యక్తిత్వ వికాస పాఠాలతో చూసినా రాంగ్.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ కథ అనుమానం పాయింటుతో రామప్ప క్యారక్టర్ స్టడీ. రామప్ప పాత్ర విశ్లేషణ. అయితే ఇదే శృతి మించి కొంప ముంచింది. ఇదెలాగో చివర చూద్దాం. నల్లగా పుట్టిన రెండో కొడుకు తనకే పుట్టాడా అనే అనుమానంతో భార్యని దూరం చేసుకుని, నానా రభస చేసే రామప్ప పాత్ర ముగింపు చూస్తే, 1971 లో బీవీ కారంత్- గిరీష్ కర్నాడ్ లు దర్శకత్వం వహించిన కన్నడ ఆర్ట్ సినిమా ‘వంశవృక్ష’ లో వెంకటరావు తలిగెరీ నటించిన ప్రధాన పాత్ర కిచ్చిన ముగింపునే పోలి వుంటుంది -తన జన్మ వృత్తాంతం తెలిసే షాకింగ్ వాస్తవంతో. తెలుగులో దీన్ని బాపు ‘వంశవృక్షం’ గా రీమేక్ చేశారు జేవీ సోమయాజులు పాత్రకి అదే ముగింపు నిస్తూ (ప్రస్తుతం ‘పాలపిట్ట’ పత్రిక్కి ‘వంశవృక్షం’ సమీక్ష రాస్తూంటే, ఇందులో రావు బహదూర్ ముగింపుతో  పోలికలు బయటపడ్డాయి).

కథనంలో తలెత్తే పైన చెప్పుకున్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. మనుషుల కుల, మత వర్గ వ్యవస్థలు కేవలం సామాజిక కండిషనింగ్ మాత్రమే నని చెప్తూ, ఆ రాజభవనం పాత గోడలపై వున్న పూర్వీకుల చిత్రపటాల వెనుక వున్న అసలు సత్యాన్ని విప్పుతూ కథని ముగించాడు దర్శకుడు. దీనికీ అనుమానం పెనుభూతం పాయింటుకీ ఏమిటి సంబంధం? ఈ సామాజిక కండిషనింగ్ నుంచి అనుమానమనే పెనుభూతం పుట్టనప్పుడు, ఆ సామాజిక కండిషనింగ్ ని నిందించడమెందుకు పాపం? అసలు అతడి అనుమానానికీ సామాజిక కండిషనింగ్ కీ సంబంధమే లేనప్పుడు, పరస్పరం లడాయి కూడా పెట్టనప్పుడు, ఈ ముగింపు ఎందుకు? ముగింపు ‘అనుమానం’  అనే పాయింటు కివ్వాలి కదా?

ఇంకా ముగింపు రామప్ప జన్మ వృత్తాంతంతో, ‘వంశవృక్షం’  మార్కు వూహించని మలుపులతో సాగుతుంది. రామప్ప తన పితృస్వామ్య బంధాల నుంచీ,సామాజిక అహంకారం నుంచీ ఎలా విముక్తి పొందాడో కూడా ఈ కథలో భాగమే. క్యారక్టర్ స్టడీ పేరుతో పాత్ర మీద ఇన్ని సమస్యల భారాన్ని మోపడంతో కథే బలి అయింది. 1977 లో కృష్ణంరాజు నటించిన ‘అమరదీపం’ లో తమ్ముడు మురళీ మోహన్ తన భార్య జయసుధ తో అన్నకి సంబంధముందని అనుమానించడంతో,  కృష్ణంరాజు చివరికి ఆ అనుమాన నివృత్తికి ఇంకో దారి లేక, ఆత్మహత్య చేసుకుని కళ్ళు తెరిపిస్తాడు. అనుమానం పాయింటుతో సింపుల్ గా అర్ధమయ్యే కథ. ‘రావు బహదూర్’ అనుమానం పాత రోగం కథని వెతుక్కుని మరీ చూడాలి.


3. ఎవరెలా చేశారు?


    సత్యదేవ్ చాలా ఆశ్చర్యపర్చే సినిమా ఇది. ఇలా నటించడం ఇతడికి సాధ్యమా అని అడుగడుగునా సవాలు విసురుతాడు. ఏక పాత్రాభినయం సీన్లు కూడా ఉత్తమంగా పోషించాడు. తన పాత్ర రావు బహదూర్ జీవితంలోని విభిన్న కాలాల్ని చూపించడానికి శారీరకంగా మారిన విధానం, పాత్ర మానసిక స్థితిని పండించిన తీరూ ప్రశంసనీయం. ఏక పాత్రాభినయపు విరుపులతో బాటు, ఫోర్త్-వాల్ బ్రేక్స్ సందర్భాలు గల మానసిక పీడితుడి  క్లిష్ట పాత్రని అద్వితీయంగా పోషించాడు. యవ్వనంలో వుండే దూకుడు నుంచి, వృద్ధాప్యంలో వచ్చే మానసిక దైన్యం వరకూ అద్భుత వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ప్రొస్థెటిక్ మేకప్‌లో కూడా కళ్ళతోనే హావభావాలు నేర్పుగా పలికించాడు.

యౌవనంలో జాన్ లెన్నన్ లుక్ తో హిప్పీ సంస్కృతికి దగ్గరగా వుండే రామప్పనుంచీ , వ్యవస్థ ఒత్తిడి వల్ల ఒక క్రూర, సాంప్రదాయవాదిగా మారే మెటామార్ఫసిస్ ని ఉన్నతంగా ప్రెజెంట్ చేశాడు.

ఒకవైపు క్యాన్సర్‌తో చనిపోతున్నా, తన రక్తం గొప్పదనే అహంకార ప్రదర్శన కూడా ఒకెత్తు.  అదే సమయంలో, గతంలోచేసిన తప్పులు చిత్తభ్రాంతుల రూపంలో బీభత్సంగా వెంటాడే తీరునీ బలంగా ప్రదర్శించాడు. ఇలా ఈ పాత్రని సృష్టించిన దర్శకుడు కూడా అంతే ప్రశంసార్హుడనాలి.

అలాగే, హీరోయిన్ రేణుక (దీపా థామస్) పాత్ర ఫస్టాఫ్‌లో చాలా స్వతంత్రంగా, బలంగా వుంటూ, సెకండాఫ్‌ కొచ్చేసరికి సరైన కారణాలు లేకుండానే భర్త వేధింపుల్ని భరించే సాధారణ స్త్రీగా మారిపోతుంది. భర్త అనుమానించిన వెంటనే కొడుకుని తీసుకుని వాకౌట్ చేయడం ఆమె చేయాల్సిన పని. కొడుకు చనిపోయాక కూడా వెళ్ళిపోకుండా అక్కడే తలుపులేసుకుని వుండి పోతుంది. తన గురించి పెద్ద కొడుకు కూడా తండ్రిలాగే మాట్లాడు తున్నప్పుడూ వచ్చి లాగి కొట్టకుండా గదిలోనే వుండి పోతుంది.

డాక్టర్ పాత్రలో వికాస్ ముప్పాల  చాలా పరిణతి చెందిన నటనని కనబర్చాడు. రామప్ప పాత్రతో సంఘర్షణాత్మక  సీన్లని సులువుగా ఎదుర్కొన్నాడు. పాత్రకి ఒక రకమైన గ్రే షేడ్ వున్నా, పాత్రలో వున్న హూందాతనాన్ని కాపాడుతూ వచ్చాడు.

ఇంకో పాత్ర పనిమనిషి అచ్చమ్మ. ఈ పాత్రలో బాలా పరాశార్ కాస్త తిక్క, మరికొంత కొంటెతనం ప్రదర్శిస్తూ కథ కెంతో ఉపయోగపడే పాత్రయింది.

సంభాషణలు పదునుగా, లోతైన అర్ధాలతో సాగుతాయి. కార్తీక్ పర్మార్ ఛాయాగ్రహణంలో  ఫ్రేమింగ్స్ చాలా క్లాసీగా, విజువల్స్ మూడ్‌కి తగ్గట్టుగా వున్నాయి- ఆ పాత జమీందారీ ఇల్లు కూడా కథలో ఒక పాత్రలా చేస్తూ. స్మరణ్ సాయి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు పీరియడ్ కథకి తగ్గట్టు వున్నాయి. రోషన్ సింగ్ కళాదర్శకత్వానికే బడ్జెట్ ఎక్కువ ఖర్చయినట్టుంది.

4. చివరికేమిటి?


    ముందుగా  చెప్పుకున్నట్టు ఇది ఫ్రెంచి అబ్సర్డ్ (అసంబద్ధ) థియేటర్ కోవకి చెందిన మేకింగ్. ఇది అహేతుకమైన కథాంశాలు, పొంతన లేని సంభాషణలు, రిపీటయ్యే, అక్కడక్కడే తిరిగే వలయాకార కథనాలకి పెట్టింది పేరు. ఇది ఆల్బర్ట్ కామూ ఫిలాసఫీ నుంచి ఎక్కువగా ప్రేరణ పొందింది. కామూ ‘అసంబద్ధత’ ని అర్ధాన్ని అన్వేషించే వాడి అర్థాన్వేషణకూ- ప్రశాంత, నిశ్శబ్ద విశ్వానికీ  మధ్య వుండే సంఘర్షణగా నిర్వచించాడు. ఇది అర్ధం జేసుకోవాల్సిన అవసరం లేదు. యూరోపియన్ కల్చర్ లో భాగమైన సినిమాలు తెలుగులో అవసరం లేదు. రామప్ప పాత్ర చిత్రణతో సమస్య ఇదే.

పాత్రలు పొంతన లేకుండా, మూస ధోరణిలో,  పునరావృతాలతో మాట్లాడతాయి. సాంప్రదాయ కథా వస్తువు లేకపోవడం కూడా ఒకటీ. ఈ కథలకి స్పష్టమైన ఆరంభాలు, మధ్య భాగాలు, ముగింపులూ వుండవు. అంటే త్రీ యాక్ట్స్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వుండదు. సంఘటనలు సరళరేఖలో కాకుండా లూప్ లో వున్నట్టు తిరుగుతూ వుంటాయి.

దర్శకుడు వెంకటేష్ మహా ఈ థియేటర్ ఆఫ్ ది అబ్సర్డ్ కి, బ్లాక్ కామెడీని కలిపి క్యారక్టర్ స్టడీకి ప్రాధాన్యమిచ్చి కథ చేసినప్పుడు ఏం నష్టం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రెండు గంటలా 50 నిమిషాలూ సాగే ఈ కథ, గంటా 50 నిమిషాలు కథే లేకుండా కేవలం వివిధ పార్శ్వాల్లో రామప్ప పాత్ర పరిచయ పాఠంగానే సాగుతుంది. అంటే ఇంతసేపూ కథలోకి వెళ్ళకుండా రామప్ప క్యారక్టటర్నే చెప్పుకుంటూ పోయారు. ఆ క్యారక్టర్ కూడా చాలావరకూ ఏక పాత్రాభినయం చేస్తూ, స్వగతంతో వీరంగం వేయడం. కథ ప్రారంభించకుండా, క్యారక్టర్ స్టడీ చేస్తూ పాత్రనే చెప్పుకుంటూ పోతే వర్కౌట్ కాదని కొన్నేళ్ళ క్రితం అనుభవపూర్వకంగా రుజువయ్యింది. ఇప్పుడు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా బిజీగా వుంటున్న డాక్టర్ రాయల హరిశ్చంద్ర అడిగితే, ‘నేను రాముణ్ణి’ అనే 45 నిమిషాల నాటిక రాసిచ్చాడు ఈ వ్యాసకర్త. ఇది స్వగతంతో పూర్తిగా ఏకపాత్రాభినయం. ఇంకో పాత్ర వుండదు. దీన్ని నంది నాటకోత్సవాల సెలక్షన్స్ కి బ్రహ్మాండంగా నటించి, దర్శకత్వం వహించి చూపారు హరిశ్చంద్ర. నిర్ద్వంద్వంగా రిజెక్ట్ అయింది. కారణం? స్వగతం చెప్పుకునే ఏక పాత్రాభినయం వర్కౌట్ కాదు. ఎందుకంటే, ఇందులో పాత్ర తప్ప కథ లేదు.

దీనికి ముందు ‘హెన్ కౌంటర్’ అనే రెండు గంటల నాటకం రాసిస్తే, బీ హెచ్ ఈ ఎల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో 5 మొదటి బహుమతులు గెలుచుకొచ్చారు హరిశ్చంద్ర. ఎందుకంటే ఇందులో పాత్రలున్నాయి, కథా వుంది-  హీరోయిన్ ఎన్ కౌంటర్ చేస్తుంది కాబట్టి టైటిల్ హెన్ కౌంటర్ అయింది- అంటే కోడి పెట్ట చేసే ఎన్ కౌంటర్.


4/a స్ట్రక్చర్ అంటే ఏమిటి?
త్రీ యాక్ట్స్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తెలిస్తే కథతో చేసే పొరపాట్లు తెలిసిపోతాయి. ‘రావు బహదూర్’
లో బిగినింగ్ (ఫస్ట్ యాక్ట్ ) చాంతాడంత సాగి, గంటన్నర సేపు సాగే ఫస్టాఫ్ ని కూడా దాటుకుని, సెకండాఫ్ లో మరో ఇరవై నిమిషాలవరకూ కబ్జా చేసిందని తెలుసుకున్నారా? అంటే బిగినింగే అక్రమంగా గంటా 50 నిమిషాలు సాగింది. ఇదంతా బిగినింగే అని ఎలా చెప్తాం? బిగినింగ్ అంటే పాత్రల పరిచయం, సమస్య ఏర్పాటుకి సంబంధించి తంతూ వగైరా కాబట్టి. అంటే ఈ బిగినింగ్ లో వుండేది కథ కాదు, కథకి తోడ్పడే ఉపోద్ఘాతం. ఇది ఫస్టాఫ్ లో 30 -40 నిమిషాలకి మించి వుండకూడదు. ఇది ముగిసిన చోట ప్లాట్ పాయింట్ -1  వచ్చి సమస్య ఏర్పాటవుతుంది.

ఇక్కడ్నుంచీ మిడిల్ (సెకండ్ యాక్ట్) ప్రారంభమవుతుంది. అంటే బిగింగ్ లో ఇచ్చిన ఉపోద్ఘాతాన్ని పురస్కరించుకుని కథ ప్రారంభమవుతుంది. కథ ప్రారంభమయిందని ఎలా తెలుస్తుంది? బిగినింగ్ ని ముగించే  ప్లాట్ పాయింట్ – 1 దగ్గర సమస్య, దాన్ని పరిష్కరించేందుకు పాత్రల మధ్య  సంఘర్షణా ప్రారంభమవుతాయి కాబట్టి. ఈ మిడిల్ అనేది మొత్తం స్క్రీన్ ప్లే నిడివిలో 50 శాతం ఆక్రమించి  వుంటుంది.  అంటే ప్లాట్ పాయింట్ -1 నుంచీ ఇంటర్వెల్ వరకూ 25 శాతం, ఇంటర్వెల్ నుంచీ సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్- 2 వరకూ మరో 25 శాతం. ఈ మొత్తం 50 శాతం గంటకి పైగానే సాగవచ్చు. ఈ మిడిల్ సమస్యకి పరిష్కార మార్గాన్ని సూచిస్తూ ప్లాట్ పాయింట్ -2 దగ్గర ముగుస్తుంది.

అంటే బిగింగ్ లో పాత్రల పరిచయాలతో, సమస్య ఏర్పాటు తంతుతో చేసే కథనం కథ కానే కాదన్న మాట. కథకి ఉపోద్ఘాతం మాత్రమే. కానీ ఇది కూడా కథ అనుకుంటూ ఘోరాలు చేస్తున్నారు. ప్లాట్ పాయింట్-1, ప్లాట్ పాయింట్- 2 ల మధ్య మిడిల్లో వుండేది మాత్రమే కథ అని ఇప్పటికైనా బాగా గుర్తించాలి!! ఇక మిడిల్ ముగిసి, ప్లాట్ పాయింట్ -2 నుంచీ పరిష్కార మార్గంతో క్లయిమాక్స్ వైపు వెళ్ళే కథనం ఎండ్ విభాగం. ఇది 25 శాతం వుండొచ్చు. అంటే స్క్రీన్ ప్లేలో ఉపోద్ఘాతంతో 25 శాతం బిగినింగ్ – కథతో 50 శాతం మిడిల్- ఆతర్వాత ముగింపుతో 25 శాతం ఎండ్ వుంటే అది త్రీ యాక్ట్స్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అన్పించుకుంటుందన్న మాట.


4/b జడివాన వెలిసిన వెనుక...
ఈ స్ట్రక్చర్ తెలియకో, లేదా తెలిసినా వద్దనుకునో చేస్తే ఏమవుతుంది? ఫస్టాఫ్ అంతా ఆక్రమించి, సెకండాఫ్ లో ఇంకో ఇరవై నిమిషాల వరకూ దురాక్రమించి, రామప్ప పాత్ర పరిచయ తంతే, అంటే ఉపోద్ఘాతమే ప్రేక్షకుల సహన శక్తి మీద దాడి చేస్తూ పోతుంది.  సెకండాఫ్ లోకి ప్రవేశించినా కూడా కథేమిటో అర్ధం గాకుండా పోతుంది. ఇంకోటేమిటంటే, ఫస్టాఫ్ లో ఈ బిగినింగ్ లోనే ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించి హీరోయిన్ తో రోమాన్స్ కొనసాగిం

చారు. మిడిల్ కథలో భాగంగా వుండే ఈ ఫ్లాష్ బ్యాకుని, బిగినింగ్ ఉపోద్ఘాతంలో ఎలా చూపిస్తారు? సకాలంలో కథ ప్రారంభమవక పోవడానికి ఇది కూడా ఒక కారణం.

సెకండాఫ్ ఇరవై నిమిషాలు గడిస్తే గానీ ఈ ఉప్పోద్ఘాతమనే ఉరితాడు తెగి మిడిల్ ప్రారంభం కాలేదు. ఫస్టాఫ్ ప్రారంభంలో 25 శాతం వుండాల్సిన ఉపోద్ఘాతం (బిగినింగ్) తెగసాగి,  మిడిల్ ని దాదాపు 75 శాతం స్వాహా చేసి ముగిసింది. ఇప్పుడు గానీ ప్లాట్ పాయింట్ -1 వచ్చి మిడిల్ సంఘర్షణ మొదలు కాలేదు. ఎప్పుడో ఫస్టాఫ్ అరగంటలో రావాల్సిన ఈ  ప్లాట్ పాయింట్ -1, సెకండాఫ్ లో ఇరవై నిమిషాల  కొచ్చింది!

ఇక్కడ ఇప్పుడు  రామప్ప చిన్న కొడుకు మరణాన్ని పురస్కరించుకుని పోలీస్ ఇన్స్ పెక్టర్ దర్యాప్తుకి రావడంతో, కథ ప్రారంభమై సమస్య ఏమిటో తెలుస్తుంది! అంటే మొత్తం కలిపి గంటా 50 నిముషాలు  ఉపోద్ఘాతం వల్ల కథే ప్రారంభం కాలేదు. ఇలా ఇది మిడిల్ ని కబ్జా చేసిన  బిగినింగ్ కాబట్టి ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయ్యింది. స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ లో పడ్డాక ఆ సినిమాని దేవుడు కూడా కాపాడ లేడు. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలే మట్టి కరిచాయి!

ఇప్పుడు సెకండాఫ్ ఇరవై నిమిషాలకి కథ ప్రారంభమయ్యాక, క్యారక్టర్ స్టడీ పేరుతో రామప్ప సృష్టించిన గందరగోళమంతా ఆగిపోయి, వాన వెలసినట్టు ప్రశాంతంగా మారుతుంది సినిమా. అంటే అబ్సర్డ్ థియేటర్ చిత్రీకరణలు అంతమై, రెగ్యులర్ సినిమా కథగా దారి కొస్తుంది. అయితే- జడివాన వెలిసిన వెనుకా జరిగింది తెలియును లేరా- విరిగేటి చెట్లెన్నో, వొరిగేటి ఇళ్ళెన్నో- అన్నట్టు, ఇప్పుడు ప్రారంభమైన ఈ కాసింత కథకూడా బాక్సాఫీసుకి అంది రాలేదు.

కారణం, అనుమానమనే పాయింటు మీద ఇప్పటికైనా ఫోకస్ చేయకుండా, సామాజిక అంశాలపై లెక్చర్ ఇస్తున్నట్టుగా మారుతుంది. ఫస్టాఫ్ లో భ్రమలు, తాగుబోతు వాదనల ద్వారా- మహాభారతం, మహాత్మా గాంధీ, ఆధునిక భౌగోళిక రాజకీయాలూ, కులం, రంగు, పేద-ధనిక తేడాల గురించిన బ్యాగేజీనంతా ప్రేక్షకుల మీద పడేసింది గాక.

కేవలం అనుమానమనే భూతం తప్ప ఇంకేం పట్టని మొండి ఘటంలా రామప్పని చూపిస్తూ, ఇంకా కావాలంటే పైన చెప్పిన బ్యాగేజీలో ఒకట్రెండు అంశాలు తీసుకుని, వేరే పాత్రతో సబ్ ప్లాట్ నడిపి వుండొచ్చు. గొడవుండదు.

ప్రయోగాలు  చేయకూడదని కాదు, చేయొచ్చు. అయితే ముందు త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ అంటూ వుండాలి. అప్పుడే ఆ స్ట్రక్చర్ కి లోబడి ఎలాటి క్రియేటివిటీలకైనా పాల్పడ వచ్చు. స్ట్రక్చరే లేకుండా క్రియేటివిటీ ఎలా కుదురుతుంది. ప్రయోగమెలా అన్పించుకుంటుంది. ఫ్రెంచి ఫిలిం నోయర్ జానర్ ని హాలీవుడ్ ఎత్తుకొచ్చుకుని, తను వాడే కమర్షియల్ మంత్రాల పెట్టె త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లో కూర్చి, వందలాది కమర్షియల్  ఫిలిం నోయర్ సినిమాల్ని తీసి అవతల పడేసింది. హాలీవుడ్ అనుసరించే త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ ని తెలుగు మేకర్లు అనుసరించేందుకు మొహమాటం దేనికి?

తీరా ఫలితం చూసి, తెలుగు ప్రేక్షకులకి సినిమాలే చూడ్డం రాదనీ ప్రెస్ మీట్లు పెట్టి నిందించడం దేనికి? ఇలాటి ప్రయోగాలే చేయదల్చుకుంటే, ప్రేక్షకులు నోరెత్తకుండా ఏం పాట్లు పాట్లు పడతారో పడి, సినిమా తీసి చూపించొచ్చు. తీయరాక ఏదో తీసి ప్రేక్షకులు నోరెత్తితే, దాని మీద రియాక్ట్ అవుతూ పోతే ఎవరికీ నష్టం? ‘రావు బహదూర్’ కి తేలిన నష్టమెంత సింగిల్ డిజిట్ దాటని కలెక్షన్లతో?

-సికిందర్