రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, అక్టోబర్ 2018, మంగళవారం

700 : స్క్రీన్ ప్లే అప్డేట్స్


       టెర్రీ రోసో హాలీవుడ్ లో నెంబర్ టూ స్క్రీన్ రైటర్. అలాడిన్, ష్రెక్, మెన్ ఇన్ బ్లాక్, పైరేట్స్ ఆఫ్ ది కెరీబీన్ సిరీస్ వంటి అనేక బాక్సాఫీసు హిట్ సినిమాలు రాశారు. ప్రస్తుతం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ నిర్మాణంలో వుంది. తన అనుభవంతో స్క్రీన్ ప్లే రచనలో భావి రచయితలకి ఉపయోగపడాలన్నఉద్దేశంతో ఎంత బిజీగా వున్నా ఆయన అనేక ఇంటర్వ్యూలివ్వడమే గాక, స్క్రీన్ ప్లే వ్యాసాలూ రాస్తూంటారు. రచనాపరమైన అన్ని సందేహాలు తీరుస్తూ, కొత్త రచయితలు అవకాశాలు పొందడానికి చేయూత కూడా అందిస్తూంటారు. అయితే ఫలానా సినిమా కంపెనీలో మా బంధువు వున్నాడనో, స్వయంగా సినిమా తీసుకోవడానికి డబ్బులుంటేనో, ఎవరికీ అర్ధంగాని కళాఖండాలు రాస్తేనో తన దగ్గరకి రావద్దంటారు. చూడగానే నిర్మాత రెండు చేతులతో లాగేసుకునే ష్యూర్ హిట్ కమర్షియల్ స్క్రీన్ ప్లేలు రాస్తేనే తన పూర్తి సహాయ సహకారాలుంటాయంటారు. ఈ సౌమనస్యంతో ఆయన రాసిన ఎన్నో వ్యాసాల్లో సీన్ ఎలా రాయాలనే వ్యాసం వొకటి. నేర్చుకోవాలన్న ఆసక్తిగల రచయితల కోసం ఇక్కడ అందిస్తున్నాం.

          పాత్రకి స్పష్టమైన సిట్యుయేషన్ లేకుండా సీన్ రాసేందుకు మీకు అనుమతిలేదు. కారులో వూరికే పిచ్చాపాటీ వేసుకుంటూ పోయే సీను రాయడానికి కూడా మీకు పర్మిషన్ లేదు. వాళ్ళలో ఒకరు సర్జరీ కోసమో, విమానాన్ని క్యాచ్ చేయడంకోసమో వెళ్తూండాల్సిందే. లేదా వాళ్ళ వెనకాల సీటులో హంతకుడు దాక్కుని కూర్చుని వుండాల్సిందే. సిట్యుయేషన్లు కథకి సంబంధించినవై వుంటే బెస్ట్. ఇవేవీ కుదరకపోతే కారు టైరు పంక్చర్ అయ్యేట్టయినా  చూడాలి. 

        ముందుగా ఇంటరెస్ట్ క్రియేట్ చేయాలి. ఇది స్క్రీన్ రైటర్ గా మీ ప్రథమ కర్తవ్యం. ఇంటరెస్ట్ ని క్రియేట్ చేయడానికి సాధనం సిట్యుయేషన్. సిట్యుయేషన్లు పరిస్థితుల నుంచి పుడతాయి. లేదా బలమైన పాత్ర ఫీలయ్యే అవసరం లోంచి పుడతాయి. లేదా రెండూ. మొత్తం స్క్రీన్ ప్లేని కేవలం సిట్యుయేషన్ ఆధారిత సీన్లతో రాయడం కూడా చేయవచ్చు. సిట్యుయేషన్స్ క్రియేట్ చేయడానికి మొదటి మార్గం పరిస్థితి. రెండో మార్గం బలమైన పాత్ర ఫీలయ్యే అవసరం. ఇవిలా వుంటాయి : పరిస్థితులు చుట్టూ వున్న బయటి ప్రపంచంలోంచి పుట్టుకు వచ్చి పాత్ర మీద ప్రభావం చూపిస్తాయి. ఇది మొదటి మార్గం విషయంలో. రెండో మార్గం విషయంలో,  పాత్ర ఫీలయ్యే అవసరం పాత్రలోంచి వచ్చి చుట్టూ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది.  

          ఎగ్జాంపుల్ 1 : అతను కూతురితో ఏర్ పోర్టుకెళ్ళి టికెట్లు కొంటున్నాడు. భార్య చనిపోవడంతో కొత్త జీవితం ప్రారంభించడానికి కూతురితో దేశం విడిచి వెళ్ళిపోతున్నాడు...

          ఈ పాత్రల్ని సిట్యుయేషన్ లో పెట్టాలంటే, పరిస్థితుల్ని మార్చెయ్యండి. ఆ బాలిక తల్లి మరణించ లేదనుకోండి. ఆ బాలిక గురించి కోర్టులో కస్టడీ కేసు వుందనుకోండి. అతను కోర్టు కళ్ళు గప్పి బాలికని దేశం దాటించేస్తున్నాడు. పోలీసులు బయల్దేరి వస్తున్నారు. అతడి క్రెడిట్ కార్డు అప్పుడే రిజెక్ట్ అయ్యింది. టికెట్లు తీసుకోవడానికి డబ్బెక్కడ తేవాలో అర్ధం గావడం లేదు. బాలికకి తాము ఎక్కడికి,  ఎందుకు పోతున్నామో తెలీక ప్రశ్నలడుగుతోంది...

          ఎగ్జాంపుల్ 2 : అతనూ ఆమే ఓ పార్టీ కెళ్ళడానికి తయారవుతున్నారు. అతడి మాజీ భార్య ఆ పార్టీ ఇస్తోంది. ఆమెతో ఈమె అభద్రత ఫీలవుతోంది. నీకింకా ఆమె అంటే ఇష్టమేనా అని అతణ్ణి అడిగితే, లేదన్నాడు...

          ఇది రాయదగ్గ సీనే. కాకపోతే వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే సిట్యుయేషన్ నామమాత్రంగా వుంది (వివరణల గురించి పచ్చి నిజం తెలుసుకోండి : సినిమాలకి వివరణలు అవసరం లేదు. లేదు లేదు, ఆడియెన్స్ కి ఇది తెలీకపోతే ఎలా, అది తెలీకపోతే ఎలా, మరేదో తెలీకపోతే ఎలా ... అనొద్దు. ఇదంతా పచ్చి అబద్ధం. ఆడియెన్స్ కి  తెలియాల్సిన అవసరంలేదు. ఆడియెన్స్ ఆశ్చర్యచకితులవడాని కిష్టపడతారు). నామమాత్రంగా వున్న ఈ సీనులో ఆశ్చర్యమే ఇంటరెస్ట్ ని క్రియేట్ చేస్తుంది కాబట్టి, వివరణలు ఇచ్చుకునే కంటే సిట్యుయేషన్ రీత్యా సీను ఆ లోచించండి. 

          పై సీనులో అతన్నీ ఆమెనీ రోడ్డుపక్కన ఆపెయ్యండి. అప్పుడు పంక్చరైన టైరు మార్చుకుంటూ, ఆర్గ్యూ చేసుకుంటూ వుంటారు. ఆ మాజీ భార్య ఇస్తున్న పార్టీకి వాళ్ళు కలిసి వెళ్ళే పరిస్థితి లేనట్టే వుండాలి. అతను మాజీ భార్య దగ్గర డబ్బు బదులు తీసుకోవడం తప్పనిసరి కాబట్టి ఆమెని రమ్మని వొత్తిడి చేస్తూంటాడు. ఆమె అనుమానిస్తూంటుంది, అక్కడికెళ్తే ఆమెకి దగ్గరై పోతాడేమోనని. తాము డబ్బవసరంలో వున్నది నిజమే. ఆయినా వెళ్ళడానికి మనస్కరించకుంటే, ఆమెని ఇక్కడే వదిలేసి వెళ్లి పోతానంటాడు. ఇటుగా వస్తున్న వ్యాను ఆపి ఎక్కేసి వెళ్ళిపోతాడు. ఆమె కోపంతో రగిలిపోతుంది...

          ఇప్పుడీ సిట్యుయేషన్ చోదిత రైటింగ్ వెర్షన్ లో, ఆడియెన్స్ ని కథలో ఇన్వాల్వ్ అయ్యేట్టు చేసేందుకు వీలవుతోంది. ఎందుకంటే, ఈ సీనులో ఆడియెన్స్ కి అనేక ప్రశ్నలు తలెత్తుతూంటాయి. టైములోగా టైరు మార్చడం అవుతుందా? అతనుంటాడా, ఆమెని వదిలేసి వెళ్లి పోతాడా? వాళ్లకి డబ్బు దేనికవసరం? ఆ డబ్బు దొరుకుతుందా? అతను మాజీ భార్యని చూస్తే మళ్ళీ ప్రేమలో పడిపోతాడా? అసలీ వ్యాను డ్రైవర్ మంచోడేనా? తీసికెళ్ళి నిలువు దోపిడీ చేయడు కదా?...

          ఇప్పుడర్ధమై వుండొచ్చు మీకు. మంచి సిట్యుయేషన్ ఆధారిత సీను రాయడమంటే ఆడియెన్స్ ని వూహాగానాలతో ఉక్కిరిబిక్కిరి చేయడమే. ఫ్యూచర్ ఈవెంట్స్ పట్ల స్పెక్యులేషన్ కల్పించడమే. సిట్యుయేషన్ల సెటప్ ఆ తర్వాత మీరు ఆడియెన్స్ వూహాగానాల్ని ఉల్టాపల్టా చేయడానికి ఉపయోగపడ్తుంది. కాబట్టి ప్రతీ సింగిల్ సీనుకీ సిట్యుయేషన్ అవసరం. ఇందులో ఇంకెలాటి మినహాయింపులూ వెతకొద్దు.  

        వివరణ లిచ్చుకోవడానికి మీకు మీరు ఎలాటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకండి. పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్ సీన్లు రాయాలంటూ మీకు మీరే ఎలాటి అనుమతులూ జారీ చేసుకోకండి. కేవలం పాత్రల్ని ఎస్టాబ్లిష్ చేసేందుకే రాసే సీన్లకి స్క్రీన్ ప్లేలో చోటు లేదు. పాత్రలేమిటో సిట్యుయేషన్లే తెలుపుతూండాలి. మీరు కథనం గురించి కూడా వర్రీ అవనవసరం లేదు. అప్పుడు వివరణల ట్రాప్ లో చిక్కుకుంటారు. మీకు అవసరమున్నవల్లా, సంఘటనల క్రమం. సిట్యుయేషన్లతో కూడిన సంఘటనల క్రమం. ఇదే కథనాన్ని మీ కందిస్తుంది. 

          ఇందులో వున్న బ్యూటీ ఏమిటంటే, పాత్రకేం కావాలో స్పష్టంగా వున్నప్పుడు అదే సిట్యుయేషన్ అవుతుంది. బలమైన పాత్రకుండే అవసరం సిట్యుయేషన్ ని క్రియేట్ చేస్తుంది. దాంతో ఇంటరెస్ట్ పుడుతుంది. సిట్యుయేషన్లు పాత్రల్ని సృష్టిస్తాయి. అవసరం కోసమో, పరిస్థుతుల వల్లనో. లేదా రెండిటి వల్లనో. 

          ‘జూనో’ లో హీరోయిన్ ని చూడండి : గర్భవతైంది. గర్భవతవడమే సిట్యుయేషన్. పరిస్థితులు క్రియేట్ చేసిన సిట్యుయేషన్. తద్వారా గాఢంగా ఆమెకి పుట్టిన కోరిక, అవసరం : బిడ్డని దత్తత తీసుకునే కేంద్రం కోసం. ఇదే ఆమె ఏమిటో నిర్వచించేస్తోంది. బోనస్ ఏమిటంటే, ఈ బలమైన పాత్ర కోరిక, అవసరం వాటికవే కొత్త సిట్యుయేషన్ కి దారి తీయిస్తాయి - ఆమె కడుపులో బిడ్డకి భావి తండ్రిని పరిచయం చేస్తూ. ఇది అదనపు బ్యూటీ. గాఢమైన పాత్ర కోరిక, ఆవసరం, భద్రతగల సిట్యుయేషన్స్ ని క్రియేట్ చేస్తాయి. ఈ సిట్యుయేషన్స్  సందిగ్ధంలో కూడా పడెయ్యొచ్చు.  

          ‘లిటిల్ మిస్ సన్ షైన్’ లో చూడండి : ఈమెకి డాన్స్ పోటీల్లో పాల్గొనాలని చాలా బలమైన కోరిక. దీంతో కుటుంబానికి కుటుంబం గమ్మత్తయిన, తీపీ చేదు సిట్యుయేషన్ల బారిన పడతారు. పైలట్ కావాలన్న కోరికతో వున్న ఆమె అన్న కూడా సైలెంట్ అయిపోతాడు...

       సిట్యుయేషన్ లో సంక్షోభం వుండి తీరాలనేం లేదు. ఎందుకంటే కొన్ని సినిమాటిక్ సిట్యుయేషన్స్ సంక్షోభం లేకపోయినా, నామమాత్రంగా వున్నా చెల్లిపోతాయి. ఉదాహరణకి ఇది చూడండి : ఒక అందమైన అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్స్ తో కాఫీబార్ లో కూర్చుని వుంది. ఒక అందగాడు కాస్త దూరంలో కూర్చుని వున్నాడు. చిర్నవ్వు నవ్వాడు. ఆమే నవ్వింది. ఆమె రెస్పాండ్ అయినందుకు ఆనందించాడు. ఇక ఆమెని మీటవ్వాలన్న కోరిక పుట్టింది. పక్కనున్న మొక్క నుంచి ఒక గులాబీ పీకి ఆమె టేబుల్ మీద పడేస్తూ వెళ్ళిపోయాడు. ఆమె తీసుకుని వాసన చూసింది. అతను వెళ్లిపోయిన టేబుల్ పైన కీస్ కన్పించాయి. ఆ కీస్ నందుకుని బయటికి పరుగెత్తింది. బయట అతనామె కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏకాంతంలో దొరకడంతో ఆమెకి హలో చెప్పి, చాటుకి లాగి కిస్ చేశాడు...

          ఇది రొడ్డ కొట్టుడు బాయ్ మీట్స్ గర్ల్ సీనే. క్యూట్ మీట్ ఫ్లర్టింగ్ సీను. ఇది చెల్లిపోతుంది. సిట్యుయేషన్ ఏమిటంటే, ఒకతను ఒకామెని చూస్తాడు, ఆమెని కలవాలనుకుంటాడు, క్యూట్ గా ఆమెని ఏకాంతంలో కలుసుకునే మార్గం ఆలోచిస్తాడు. ఇంతే. దీంతో మీలో అలజడి రేగవచ్చు. ఇందులో సంక్షోభం ఏదీ? సోసైటీయా? ఆమె బిడియమా? గర్ల్ ఫ్రెండ్స్ ని వదిలి ఆమె వెళ్లి పోవడమా? అతనూ ఆమే ఇంకా పరిచయస్థులే కాకపోవడమా? ... ఏమైనా కానీ సిట్యుయేషనే రచయిత కనుగొనాల్సిన అవసరమైన ముడి పదార్ధం. సంక్షోభం దానికదే వుంటుంది. సంక్షోభం సులభం, సిట్యుయేషనే కష్టం.
***

28, అక్టోబర్ 2018, ఆదివారం

THE MAYOR (2017) Official Trailer | Choi Min-Sik | Korean Movie





     రాజకీయ కీకారణ్యంలో ఎన్నికల ప్రచారం...వ్యక్తిగత రహస్యాలు లాగి బురద జల్లుకోవడం...ఎట్టి పరిస్థితిలో తను మూడోసారి మేయర్ ఎన్నికలు గెలవాలి... గెలిస్తే రేపు దేశాధ్యక్షుడి పీఠం తనది... ఏం చేశాడు? ఇందుకేం అక్రమాలకి పాల్పడ్డాడు... హైటెక్ ప్రచార టీం మేనేజర్లని నియమించుకుంటే ప్రత్యర్ధులేం ఎత్తుగడ పన్నారు... హోరాహోరీ ప్రచార రగడలో  ... పోయిందేమిటి... మిగిలిందేమిటి ....కొరియన్ పొలిటికల్ థ్రిల్లర్ ‘ది మేయర్’ (2017) లో వీటన్నిటికీ సమాధానం... స్క్రీన్ ప్లే సంగతులు...ఈ వారం!

***


27, అక్టోబర్ 2018, శనివారం


Q : ‘దొంగరాముడు’ లో హీరోయిన్ సావిత్రి విలన్ తో పోరాడి కథకి ముగింపునిస్తే మీ పరిభాషలోనే హీరో పాసివ్ అయిపోయాడన్నారు. ఇది ఆ రోజుల్లో చెల్లిందన్నారు. ఈ రోజుల్లో హీరో పాసివ్ అవకుండా హీరోయిన్ తో కథ ముగించే మార్గం ఏదైనా వుందా? ఇలా చేసిన సినిమాలేమైనా వున్నాయా?
పేరు వెల్లడించ వద్దన్న దర్శకుడు 

A : పాసివ్ పాత్రనేది స్క్రీన్ ప్లే పరిభాష. ‘దొంగరాముడు’ చూడకముందు ఒక అసోసియేట్ కథకి పరమ రొటీన్ గా వున్న-  క్లయిమాక్స్ లో హీరోయిన్ ని విలన్ కిడ్నాప్ చేసే అరిగిపోయిన ఫార్ములాని - తిరగేసి హీరోయినే విలన్ ని కిడ్నాప్ చేసేట్టు చేయాలన్నప్పుడు అందులో స్పార్క్ గుర్తించలేకపోయాడు. ఆ కథ ప్రకారం హీరో పాసివ్ అవకుండా చేసే మార్గముంది. ‘దొంగరాముడు’ చూసినప్పుడు ఈ తిరగేసిన ఫార్ములా ఎదురై మనకి మనమే థ్రిల్లయ్యాం. ఇందులో క్లయిమాక్స్ హీరో చేతిలో లేక పాసివ్ అయ్యాడు. హీరోయినే నిభాయించింది. దీనికి హీరో పాసివ్ అవకుండా చూసే మార్గముంది. హీరోయిన్ ని హేండాఫ్ పాత్రగా మార్చేస్తే. అంటే ఎక్కడో వుండి హీరో ఆదేశాలిస్తూంటాడు. ఆ ఆదేశాలందుకుని హీరోయిన్ విలన్ సంగతి చూస్తుంది. క్లయిమాక్స్ వ్యూహం హీరోది గనుక అతను కథలో పాల్గొంటూ యాక్టివ్ పాత్రగా వున్నట్టే. అదే సమయంలో హీరోయిన్ కూడా యాక్టివ్ పాత్రే. గతంలో ఒక మూలనబడ్డ కథలో ఇలాటిదే యాక్టివ్ పాత్ర చిత్రణ చేశాం. అసలు సెకండాఫ్ లో హీరో యాక్షన్ లోకి రాడు. హీరోయిన్ తో తనపని తాను చూసుకుంటాడు. ప్రత్యర్ధులైన పోలీసులు ఒకళ్ళ నొకళ్ళు చంపుకుంటూ వుంటారు. ఒక్క ఫోన్ కాల్ తో హీరో క్లయిమాక్స్ మొదలెట్టేసి వూరుకుంటాడు. ఆ ఫోన్ కాల్  ఫలితంగా విలన్లయిన పోలీసులు ఒకర్నొకరు కాల్చుకు చావడం. క్లయిమాక్స్ వెనుక మాస్టర్ మైండ్ హీరో అయితే చాలు - అందులో చేతులు పెట్టక పోయినా యాక్టివ్ పాత్రగానే వుంటాడు. ఇలా వున్న సినిమాలు మనకి తెలిసినంత వరకూ రాలేదు. వస్తే కాపీ కొట్టడానికి క్యూలో చొక్కాలు చించుకుంటారు. ఇప్పుడు చెప్తే అర్ధమవక పాత మూసలోనే కమ్మగా కునుకు తీస్తారు.

Q : ‘దొంగ రాముడు’ కి చాలా లోతైన విశ్లేష చేశారు. ఇప్పటికిప్పుడు దొంగ రాముడు’ చూస్తూ మీ విశ్లేష సాయంతో అధ్యయనం చేయాలనిపిస్తోంది. అయితే సందేహం. మీ విశ్లేషణలో ఇలా పేర్కొన్నారు – “ఇందులో మిడ్ ఫ్రాక్చర్ ఇలా వుంటుంది : లావు తగ్గాలని (సైజ్ జీరోలో) ఇంటర్వెల్ దగ్గర ప్లాట్ పాయింట్ -1 తో వేసే గోల్ అక్కడితోనే ఆగిపోతుంది. సెకండాఫ్ ప్రారంభం కాగానే వేరే కథ మొదలెడతారు. అంటే ఫస్టాఫ్ లో ఎత్తుకున్న కథా దాని పాయింటూ సఫా. ఇక రెండో సినిమా షురూ. 

          “సెకెండాఫ్ సిండ్రోమ్ ఇలా వుంటుంది : ఇంటర్వెల్లో ప్లాట్ పాయింట్ -1 వేసి లావు తగ్గే పాయింటు వేశాక, దాన్నెలా కొనసాగించాలో తెలీనట్టు, ఇంటర్వెల్ తర్వాత దాన్నొదిలేసి, క్లినిక్ అక్రమాల పాయింటు నెత్తుకుంటారు. ఇంటి దగ్గర తల్లిగారు పెళ్లి కోసం లావు తగ్గమంటే, తల్లీనీ పెళ్ళీనీ వదిలేసి క్లినిక్ అక్రమాలంటూ వూరు మీద పడేశారు. ఉన్న పాయింటుతో సెకెండాఫ్ ఏం చేయాలో తెలీక, వేరే పాయింటుతో ప్లేటు ఫిరాయిస్తే, ఇలా సెకెండాఫ్ సిండ్రోమ్ లో- సుడిగుండంలో పడుతుంది సినిమా” అని.  

          ఇక్క మిడ్ ఫ్రాక్చర్, సెకెండాఫ్ సిండ్రోమ్ రెండింట్లోనూ స్టాఫ్కు భిన్నంగా సెకెండా ఫ్ లో వేరే చెప్పమే దా. అంటే రెండూ ఒకటే దా అనిపిస్తోంది. వాటి ధ్య భేదమేంటో కాస్త విపులంగా చెప్పరు.
-
ల్లా నాగార్జున, పాత్రికేయుడు

A :  మరేమీ లేదు, మిడ్ ఫ్రాక్చర్ రెండు రకాలుగా వుంటుంది : ఒకటి ఇంటర్వెల్ కే కథ అయిపోవడం; మరొకటి, ఇంటర్వెల్ కి ప్లాట్ పాయింట్ వచ్చినా కథేమిటో తేల్చక పోవడం. మొదటిది బాగా అర్ధమవాలంటే 2014 లో సుమంత్ అశ్విన్ నటించిన ‘చక్కిలిగింత’ ఒకటి చూస్తే చాలు. ఇందులో పాయింటేమిటంటే, ఫస్టాఫ్ ప్రారంభంలోనే హీరో ఒక గోల్ పెట్టుకుని ప్లాట్ పాయింట్ వన్ వేసుకుంటాడు. అమ్మాయిల వెంట అబ్బాయిలు పడకుండా, అమ్మాయిలే అబ్బాయిలకి ప్రేమని ప్రతిపాదించాలన్న పట్టుదలకి పోతాడు. కానీ హీరోయినే అతణ్ణి ప్రేమలోకి దింపి, ఆ గోల్ ని పటాపంచలు చేస్తుంది. ఈ ఇంటర్వెల్ సీన్లో ఓటమిని ఒప్పుకుంటాడు హీరో. ఇక్కడితో కథ అయిపోయినట్టే. ఇక సెకెండాఫ్ ప్రారంభం కాగానే, అయినా నన్ను ప్రేమలో పడేసి నిజంగానే నాలో ప్రేమని పుట్టించావంటూ ఇంకో రాగం ఎత్తుకుంటాడు హీరో. ఇది  అయిపోయిన కథకి ఇంకా అవసరం లేని కథని అనవసరంగా అతికించడం. అందువల్ల ఇది మొదటి రకం మిడ్ ఫ్రాక్చర్. 

          ‘సైజ్ జీరో’ లో ఈ రకం మిడ్ ఫ్రాక్చర్ లేదు. ఇంటర్వెల్ కి కథ అయిపోలేదు. పెళ్లవడానికి లావు తగ్గమంటే, లావు తగ్గాలా అని ఏడుస్తుంది హీరోయిన్. దీంతో ఇంటర్వెల్. ఇది ప్లాట్ పాయింట్ వన్ సన్నివేశమే. కానీ హీరోయినేం చేయాలో గోల్ ఏర్పడని అసంపూర్ణ ప్లాట్ పాయింట్ వన్. పోనీ సెకెండాఫ్ లోనైనా దీని కొనసాగింపు వుండదు. వూసే వుండదు. గోల్ లేకుండా వేరే గొడవ లెత్తుకుంటుంది. అందుకని ఇది రెండో రకం మిడ్ ఫ్రాక్చర్ అయింది. మొదటి రకం ఇంటర్వల్ కల్లా కథ ముగిసిపోతే, రెండో రకం ఇంటర్వెల్లో వచ్చిన ప్లాట్ పాయింట్ వన్ అసంపూర్ణంగా వున్నప్పుడు. 

          ఈ రెండిటికీ, సెకెండాఫ్ సిండ్రోంకీ తేడా ఏమిటంటే, ఇంటర్వెల్లో ప్లాట్ పాయింట్ వన్ లో ఏర్పడ్డ గోల్ కి భిన్నంగా సెకెండాఫ్ వేరే కథ ఎత్తుకుంటే సెకండాఫ్ సిండ్రోంలో పడ్డట్టు. ‘సైజ్ జీరో’ లో హీరోయిన్ గోలేమిటో ఇంటర్వెల్లో వచ్చిన ప్లాట్ పాయింట్ వన్ లో చెప్పలేకపోయినా, అమె లావు తగ్గడమే గోల్ అని మనకర్ధమై పోతుంది. ఈ గోల్ వదిలేసి క్లినిక్ అక్రమాలతో వేరే గోల్ ఎత్తుకోవడం వల్ల సెకెండాఫ్ సిండ్రోం అయింది.
***

698 : శనివారం సంత


    ఓ కొత్త దర్శకుడు వెళ్లి కథ చెప్తే నమ్మేస్తారు హీరోలు, నిర్మాతలు. అదే ఒక కొత్త రచయిత వెళ్లి కథ చెప్తే నమ్మరు. కొత్త దర్శకుడికి తెలిసిందేమిటి, కొత్త రచయితకి తెలియని దేమిటి? రచన చేయడానికి  కొత్త దర్శకుడికి వున్న అర్హతలేంటి, కొత్త రచయితలకి లేని అర్హతలేంటి? కొత్త దర్శకుడు కొత్త రచయితతో ఎందులో గొప్పవాడు? కొత్త దర్శకుడొచ్చి గందరగోళంగా ‘వీరభోగ వసంత రాయలు’ కథ చెప్పేస్తే అద్భుతమైన వాడా? ఒకరు కాదు, ముగ్గురు హీరోలు పోటీలు పడి నటించేస్తారా? కొత్త దర్శకుల కథల టాలెంట్ కి ‘వీరభోగ వసంతరాయలు’ పరాకాష్ట! దీనికి రేటింగ్ 1 కాదు, జీరో ఇచ్చినా ఎక్కువే. కొత్తవాళ్ళు దర్శకుడి లేబిల్ తగిలించుకుంటే రచయితలై పోతారా? అన్ని హక్కులు, అధికారాలు  వచ్చేస్తాయా? హీరోలు, నిర్మాతలు రచయితల కథలు తీసుకునే సాంప్రదాయం ఇరవై ఏళ్ల క్రితమే ముగిసిపోయింది, అదివేరు. ప్రత్యాన్మాయంగా ఆ స్థాయి కథలు వింటున్నారా అంటే అంత ఓపిక లేదు. అదే 90 % అట్టర్ ఫ్లాపులతో దశాబ్దాలు గడిపేస్తున్నారు. అట్టర్ ఫ్లా పులకి కారణం రచనలా, దర్శకత్వాలా? రచయితల్ని చంపేసిన ఈ ట్రెండ్ లో కొత్త బచ్చా దర్శకుడు కూడా రచయితల్ని చులకనగా చూస్తున్నాడు. రాసుకోలేక తను తీసేది అట్టర్ ఫ్లాపే. అది తెలుసుకోడు. మరిన్ని వీరభోగ వసంత రాయళ్ళు తీయాల్సిందే. ఎన్ని తీస్తే అన్ని బండారాలు బయటపడి మూతబడతారు. ‘కథ – మాటలు – స్క్రీన్ ప్లే – చాదస్తం’ అని వేసుకోలేక వాళ్ళే పారిపోతారు.
 ***



25, అక్టోబర్ 2018, గురువారం

697 : రైటర్స్ కార్నర్


సినిమా రచయిత్రిగా మారిన నవలా రచయిత్రి కణికా థిల్లాన్ ఇటీవల ‘మన్మర్జియా’తో బాగా పాపులరయ్యారు. తన ఈ సినీ యానంలో ఎన్నడూ తన నవలల్ని సినిమాలుగా మార్చాలనే ఆలోచనే చెయ్యని కణికా,  సాహిత్యమూ సినిమా వేర్వేరు జాతులంటారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన కణికా, 2008 లో షారుఖ్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’ కి సహాయ దర్శకురాలిగా పనిచేయడంతో సినిమా వృత్తిని  ప్రారంభించారు. ఆ తర్వాత ఓ రెండు లో - బడ్జెట్ సినిమాలకి స్క్రిప్టు సూపర్ వైజర్ గా పనిచేశారు. 2012 లో షారుఖ్ ఖాన్  నిర్మించిన ‘రా. వన్’ కి స్క్రీన్ ప్లే, మాటలూ రాసి పూర్తి స్థాయి సినిమా రచయిత్రి అయ్యారు. ఆ తర్వాత 2015 లో తెలుగులో ‘సైజ్ జీరో’ కి స్క్రీన్ ప్లే రాశారు. దీని తర్వాత 2018 లో  హిట్టయిన ‘మన్మర్జియా’ కి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించి అరుదైన క్రియేటివ్ ప్రొడ్యూసర్ హోదా పొంది, రచయిత్రిగా తన  స్క్రిప్టు పై పూర్తి స్వాతంత్ర్యమూ, హక్కులూ సాధించారు. సలీం - జావేద్ ల తర్వాత కరువైపోయిన  ‘ఇది ఫలానా రచయిత సినిమా’ అనే బ్రాండింగ్ ని తను పొందారు. ఈ సందర్భంగా ‘మన్మర్జియా’ రచన గురించి ఆమె వెల్లడించిన  ఆసక్తికర విషయాలేమిటో చూద్దాం...

మన్మర్జియా మీ హృదయానికి ఎంత దగ్గరగా వుంది?
         
నేను అమృత్ సర్ లో పుట్టి పెరిగాను. మన్మర్జియా లోని పాత్రలు ఆ ప్రపంచంలో లోతుగా పాతుకుని వున్నాయి. ఇది పూర్తి స్థాయిలో నేనొక్క దాన్నే రాసిన మొదటి స్క్రిప్టు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు నేనే రాసుకున్నాను. ఈ స్క్రిప్టు రాయడానికి నా మూలాల్లోకి నేను వెళ్ళడం సరైన ఆలోచననుకున్నాను. అందుకని ఈ సినిమాలో నా కంఠ స్వరాన్నే ఫీలవుతారు మీరు.
మీరు దర్శకుడుగా అనురాగ్ కశ్యప్ నే బలంగా కోరుకున్నారు, ఎందుకని?
         
 స్క్రిప్టు రాస్తున్నప్పుడు అనురాగ్ కశ్యపే నా మనసులో మెదులుతున్నారు. ఆయనే రైటర్ - డైరెక్టర్ కదా అని కొందరన్నారు. ఇతరుల స్క్రిప్టులకి ఆయన దర్శకత్వం వహించరని చెప్పారు. అయినా సరే నా అదృష్టాన్ని పరీక్షించు కుందామనుకున్నాను. మన్మర్జియా సంక్లిష్ట ప్రేమ కథ. అందులో చెప్పాల్సింది నాన్ జడ్జి మెంటల్ గా, నిర్భయంగా చెప్పాను. అనురాగ్ ని ఒప్పించగలననే నమ్మకం నాకుండేది. ముందు నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ కి విన్పించాను. ఆయన వెంటనే దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. అప్పుడు అనురాగ్ పేరు చెప్పాను. అనురాగ్ అప్పుడు వేరే సినిమాతో బిజీగా వున్నారు. ఆనంద్ గారు అనురాగ్ చేస్తున్న సినిమాతో బాటు, నా స్క్రిప్టుని కూడా ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమయ్యారు. అలా అనురాగ్ పిక్చర్ లోకి వచ్చారు. ఆనంద్ గారికి ఎన్నోఇబ్బందులెదురయ్యాయి. అయినా నా పక్షానే నిలిచారు. రైటర్స్ కి ఆయన చాలా మర్యాదా స్వేచ్ఛా ఇవ్వడం చూశాను.
తారాగణం ఎంపిక ఎలా జరిగింది?
          షార్ట్ టెంపర్ తో, అర్ధంకాకుండా ప్రవర్తించే నటులు ఈ కథకి అవసరమనుకున్నాం. దీనికి తాప్సీ, విక్కీలు సరిపోయారు. రాబీ పాత్రకి ఆనంద్ గారే ఆభిషేక్ బచ్చన్ పేరు సూచించారు. అభిషేక్ నటిస్తున్నప్పుడు చూస్తే, సరీగ్గా నా వూహల్లో వున్న పర్సనాలిటీనే ఆయన నటించారు.
కథ తాప్సీపాత్ర చుట్టే తిరుగుతుంది...
          తాప్సీకి ఇందులో నటించే అవసరం లేదు, ఎందుకంటే తనే రూమీ...రూమీ పాత్రని నేనెలా వూహించి రాశానో అచ్చం అలాగే వుంది తను - సూఫీ స్మూత్ నెస్ తో. అందుకని రూమీ అని పేరు పెట్టాను.
నవల రాయడానికీ, స్క్రీన్ ప్లే రాయడానికీ తేడా ఏమిటంటారు?
          నవల రాయడం వ్యక్తిగత అనుభవం. సినిమాకి రాయడం సమిష్టి కృషి. నవలలో ఎన్ని వాక్యాలతో ఎన్ని అద్భుత వర్ణన లైనా చేసుకోవచ్చు పేజీల కొద్దీ. కానీ సినిమాకి రాయాలంటే క్లుప్తత, విజువల్ అప్పీల్ చాలా అవసరం. నవలకీ సినిమాకీ వేర్వేరు స్కిల్స్ వుంటాయి.
మన్మర్జియా తర్వాత వెనువెంటనే మీ సినిమాలు రెండు రాబోతున్నాయి – కేదార్ నాథ్, మెంటల్ హైయ్ క్యా. మీకు దర్శకత్వం వహించాలని లేదా?
          తప్పకుండా వుంది. ప్రస్తుతానికి రాయడాన్నే ఎంజాయ్ చేస్తున్నాను. దర్శకత్వం వహించడానికి సరైన కథ దొరికినప్పుడు తప్పకుండా డైరెక్షన్ లోకి దూకుతాను.  
అనురాగ్ కశ్యప్ సెట్స్ మీద ఇంప్రూవ్ మెంట్లు చేస్తూంటారని ఒక ఫిర్యాదు వుంది. మీకేమైనా ఇబ్బందులు కలిగాయా?
          ప్రతీ రోజూ ఆయనతో నేను సెట్స్ లోనే వున్నాను. కొన్ని సీన్లు తీసేప్పుడు సుదీర్ఘంగా చర్చ చేసే వాళ్ళం. ఆ చర్చల్లో ఆయన నా విజన్ ని మార్చేస్తున్నారని నాకెప్పుడూ అన్పించలేదు. గుండె లోతుల్లోంచి ఆయన నా స్క్రిప్టుకి కనెక్ట్ అయిపోయారు. ఎప్పుడైనా వాదోపవాదాలు జరిగితే, ఆయన నన్ను ఒప్పించడమో, లేదా తనే నాతో ఒప్పుకోవడమో చేసేవారు. అదే ఆయనలో అద్భుతం. స్క్రిప్టు చదివి, తన వరకూ తను తీసిన ‘దేవ్ డీ’ ఎక్కడ ముగిసిందో, అక్కడ ‘మన్మర్జియా’ ప్రారంభమవుతోందని చెప్పారు. 

గత కొన్ని నెలలుగా మీరు ఒక సెట్ నుంచి ఇంకో సెట్ కి విశ్రాంతి లేకుండా తిరుగుతూ బాగా బిజీ అయినట్టున్నారు?
          చాలా హడావిడి. కానీ ఇదంతా నేనింత కాలం చేస్తూ వచ్చిన కృషికి  ఫలితంగా మీకన్పించొచ్చు గానీ - ఈ ప్రయాణాలూ, ఒక సినిమా సెట్స్ నుంచి ఇంకో సినిమా సెట్స్ కి తిరగడాలూ, నాకేమీ ఆసక్తికరంగా వుండవు. అయినా ఎంజాయ్ చేస్తున్నాను. దర్శకుడితో నా ఈక్వేషన్ మీద ఆధారపడుంటుంది. కథలకి నేనే సొంతదారు కాబట్టి నేను సెట్స్ లో వుండాలని దర్శకుడు కోరుకుంటే కాదనలేను.
దాదాపూ మీ మూడు స్క్రిప్టులూ ఒకేసారి ప్రొడక్షన్ లో కొచ్చి నట్టున్నాయి? ఇదెలా జరిగింది?
         
మన్మర్జియా కొంత కాలంగా నిర్మాణంలో వుంది. దీంతో బాటు కేదార్ నాథ్, మెంటల్ హై క్యా నిర్మాణంలో వున్నా, ఇవన్నీ నేనొకేసారి రాసినవి కావు. ఒకటి రాశానంటే మొత్తం నేనే రాసుకుని ఎవరికైనా ఇంట్రెస్టుందేమో వెళ్లి కలుస్తూంటాను. అలా రాసింది ఒకటి ఓకే అయ్యాకే మరోటి రాయడం మొదలెడతాను. అలా నేను రాసి ఓకే చేయించుకోవడంలో ఈ మూడిటి మధ్య ఎడం వున్నా, అవి నిర్మాణాలు ప్రారంభం కావడంలో జాప్యాల వల్ల, మూడూ వెంట వెంటనే విడుదల కొస్తున్నాయి.  
మన్మర్జియా మీకు మైలు రాయి. మీరు  రా. వన్ తో ప్రారంభమయ్యారు. అంతకి ముందు మీరు నవలా రచయిత్రి.  మరి మీకు సినిమా రైటర్ అవాలని ఎలా అన్పించింది?
          రా. వన్ కి రాసిన రచయితల్లో నేనొక రైటర్ని. సాంకేతికంగా రైటర్ గా నా మొదటి సినిమా మన్మర్జియా అవుతుంది. రా. వన్ నా ఇల్లు. షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ సంస్థ నుంచి నేను మొదలయ్యా. అక్కడే అన్నీ నేర్చుకున్నాను. అక్కడే ట్రైనీ గా చేరి అసిస్టెంట్ డైరెక్టర్ ని అయ్యాను. మూవీ మేకింగ్ లో ప్రతీదీ అప్పుడే నేర్చుకున్నాను. ట్రైనీగా వుంటున్నప్పుడే మూడు నవలలు రాశాను. ‘డాన్స్ ఆఫ్ దుర్గా’ నవల రాస్తున్నపుడు వ్యక్తిగతంగా నేను బాగా లేను. నాన్న పోయారు. నా మానసిక శారీరకారోగ్యాలు చెడిపోయాయి. ఆ సమయంలో ఎక్కడో చదివాను – జీవితంలో నీ దుర్భర క్షణాల్ని డబ్బుగా మార్చే ప్రక్రియే రచన చేయడమని. కానీ నవలలు రాసే ఏకాంత వ్యాపకం నేను కోరుకోలేదు. ఆ ఏకాంతంలోకి, ఆ వొంటరి తనంలోకి వెళ్ళ వద్దని కొందరు వారించారు. అందుకని సినిమా స్క్రిప్టులు రాయడం ప్రారంభించాను. ఇదైతే నల్గురితో టీంవర్క్ ని డిమాండ్ చేస్తుంది కదా.
అనురాగ్ కశ్యప్ తానే రైటర్. ఆయన ఏంరాసి తీస్తున్నారో ఆఖరి క్షణాల వరకూ చెప్పరని యాక్టర్స్ అంటూంటారు. మీకూ ఇదే అనుభవమా?
          అలాటిదేమీ లేదు. ముందే చాలా చర్చించుకునే వాళ్ళం. ఎల్లవేళలా ఆయన సెట్స్ లో వుండమనే వారు. మన్మర్జియా పాత్ర ప్రధాన కథ. మంచి దర్శకుడైతేనే నటుల నుంచి ఈ పాత్రల్ని వెలికి తీయగలడు. పాత్రల్ని నటింప జేయడం కాదు, వాళ్ళని పాత్రలుగా మార్చేయగలడు. అనురాగ్ నటులతో నటింప జేయడం ఎలా వుంటుందంటే, వాళ్ళ  పర్సనాలిటీల్ని  పాత్రల్నుంచి అడ్డు తొలగించేస్తారు. అప్పుడా నటులు కేవలం వ్యక్తులుగా మిగులుతారు. ఇలా ఫిల్టర్ చేయడం చాలా కష్టమైన పని.  
రైటర్స్ కి ఫ్రెండ్లీ టీమ్స్ దొరకడం కష్టమే. అనురాగ్ తో మీ టీం వర్క్ అంత కష్టం కాలేదేమో...
         
ప్రతీ దర్శకుడిలో నేను అనురాగ్ లాంటి ప్రొఫెషనల్ ని కోరుకుంటాను. అనురాగ్ తానే రైటరైనా సాటి రైటర్స్ తో అభద్రత ఫీలవరు. పైగా స్నేహపూర్వకంగా వుంటారు. టాలెంట్ ని ప్రోత్సహించడంలో చాలా ముందుంటారు. తామొక్కరే వెలిగిపోవాలనుకోకుండా టాలెంటున్న ఇతరుల్ని ప్రోత్సహించే వాళ్ళు అతి తక్కువ మంది వుంటారు. అనురాగ్ నుంచి నేను నేర్చుకున్న గొప్ప విషయమేమింటే, మనతో పాటూ ఇతరులూ ఎదిగేలా చూడాలి, తొక్కేసి ముందుకెళ్ళి కూడదు...
కరణ్ జోహార్ తీస్తున్న ‘తఖ్త్’ పోస్టర్ లో రైటర్స్ పేర్లు వేశారు. రచయితలెంతో  ధన్యులైనట్టు ఫీలయారు. అనురాగ్ కూడా ఎప్పుడూ మన్మర్జియా కథ మీదేనని ప్రకటిస్తూ వచ్చారు. ఇది మీకు ఎంకరేజింగ్ గా వుందంటారా?
         
మేమెందుకు ధన్యులమనుకోవాలి? ఇలా రైటర్స్ ని గుర్తించాల్సిందే కదా. అనురాగ్ విషయానికొస్తే నా ఒక్కరి విషయంలోనే అలా చేయలేదు. చాలా మంది రైటర్స్ విషయంలో ఇవ్వాల్సిన క్రెడిట్ ఇచ్చారు. ఎవ్వరూ పాటించని సాంప్రదాయాన్ని ఆయన పాటిస్తున్నారు. ఇందుకు అభినందిస్తానే తప్ప, నేను రుణపడి వుండాలనుకోను. రైటర్స్ ని నమ్మి ఆదరించే మరొకరు ఆనంద్ గారు. సినిమా మీడియా అంటే కంటెంట్ క్రియేషన్ అనీ, అందుకని క్రియేటర్స్ ని చాపకింద తోసేయలేమనీ ఆయనకి తెలుసు. రైటర్స్ ని పోషించడం తమ అవసరమనీ కూడా ఆయనకి తెలుసు. మరలాంటప్పుడు రుణపడడం దేనికి? రైటర్ పేరు పోస్టర్ మీద వుండాల్సిందే. ఈ ట్రెండ్ ని కరణ్ జోహార్ ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. మన్మర్జియా కి నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్ ని. అనురాగ్, ఆనంద్ ఇద్దరూ రైటర్ గా నా పేరేయడమే గాక, ఓనర్ షిప్ కూడా నాకే ఇస్తున్నట్టు చెప్పారు. పోస్టర్ మీద పేరుకంటే నాకు ఇది ముఖ్యం.
***

22, అక్టోబర్ 2018, సోమవారం

696 : స్క్రీన్ ప్లే సంగతులు


4
          దొంగరాముడులో నేటి అట్టర్ ఫ్లాప్ స్క్రిప్టుల్లో  రిపీటవుతున్నతప్పుల్లో ఓ మూడు తప్పులకి తరుణోపాయముంది. మిడ్ ఫ్రాక్చర్లు, సెకండాఫ్ సిండ్రోములు, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ లనే మూడు చీడపురుగులు మాంచి మాంచి స్టార్ కాస్ట్ వున్న సినిమాలని సైతం ఎలా దొలిచేసి డొల్లగా మారుస్తున్నాయో ఆయా సినిమాలు విడుదలైనప్పుడల్లా చెప్పుకుంటూ వచ్చాం. కానీ విరుగుడుకి స్ట్రక్చర్ నే ఆశ్రయించాం. ఇలాటి చీడ పట్టిన స్క్రిప్టుల్లో స్ట్రక్చర్ ప్రకారం కథ ఏకశిలా సదృశంగా వుండాల్సిందేనని నివారణ చెప్పుకున్నాం. ఐతే ప్రతీ చీడకీ స్ట్రక్చర్ తోనే చికిత్స వుండక్కర్లేదని దొంగరాముడు చెప్తోంది. శాశ్వతమైన స్ట్రక్చర్ లోపల చలనశీలమైన కథనంతో పాల్పడే క్రియేటివిటీలు అనేకం. ఈ క్రియేటివిటీలు వికటించడం వల్లే చీడలు పట్టి పల్లారుస్తున్నాయి. క్రియేటివిటీలు వికటించకుండా వుండాలంటే ముందు స్ట్రక్చర్ తెలిసి వుండాలి. దురదృష్టవశాత్తూ ఈ శతాబ్దం అరంభంనుంచీ - అంటే 2000 నుంచీ వస్తున్నఅత్యధిక శాతం మంది దర్శకులు / రచయితలు స్ట్రక్చరాశ్యులు కాలేకపోతున్నారు. అందువల్ల వాళ్ళ కేవల క్రియేటివిటీలు వికటాట్ట హాసం చేస్తూ ఫ్లాపుల బాట పడుతున్నాయి. దొంగరాముడు స్ట్రక్చర్ లో వుంటూనే  క్రియేటివ్ విన్యాసాలు విభిన్నంగా చేస్తోంది. అందువల్ల స్ట్రక్చర్ సహిత క్రియేటివ్ విన్యాసాల్లో కూడా చీడపీడలకి నివారణోపాయాలు కన్పిస్తున్నాయి. ఇవేమిటో తర్వాత చూద్దాం. ముందు మిడిల్ - 2 ఎలా వుందో పరిశీలిద్దాం...

         
 వ్యాసంలో వివరించుకున్న  మిడిల్ -1 ముగింపులో,  మళ్ళీ దొంగరాముడు చట్టానికి దొరికిపోయే విషాదాన్ని చూశాం. ఇప్పుడు మిడిల్ – 2, అంటే ఇంటర్వెల్ తర్వాత కథ కొస్తే, ఈ విషాదాన్ని ఏకరువు పెట్టే పాటతో మొదలవుతుంది. దొంగరాముడు జైల్లో వుంటాడు, చెల్లెలు లక్ష్మి అనాధాశ్రమం నుంచి సర్దుకుని వెళ్ళిపోతుంది. ఉద్యోగ ప్రయత్నం చేసి విఫలమవుతుంది. వాహనం కోసం రోడ్డు మీద నిలబడి ఎదురు చూస్తూంటే, వేశ్య అనుకుని ఒకడు బేరమాడబోతాడు. పరుగెత్తుకుని పోయి వర్షంలో షెడ్డు కింద నిలబడితే, వీధి రౌడీ బాబుల్ గాడు కన్నేస్తాడు.

          బాబుల్ గాడు బలవంతం చేస్తూంటే, సీత వచ్చి కాపాడి లక్ష్మిని తనింటికి తీసి కెళ్తుంది. లక్ష్మికి జ్వరం పట్టుకుంటే వెళ్లి డాక్టర్ మోహన్రావుని (జగ్గయ్య ఎంట్రీ) తీసుకొచ్చి చూపిస్తుంది. అటు జైల్లో వున్న రాముడుకి లక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్టు కలొచ్చి వణికిపోతాడు. ఇటు సీత, లక్ష్మీ వెళ్లి డాక్టర్ మోహన్రావుని కలుస్తారు. మోహన్రావుకి జబ్బుతో తీసుకుంటున్న తల్లి వుంటుంది, భార్య చనిపోయిన లాయర్ అన్న వుంటాడు, అతడి చిన్న పిల్ల లిద్దరుంటారు. మోహన్రావు తల్లికి చికిత్స చేస్తూంటే, లక్ష్మి చొరవ తీసుకుని సపర్యలు చేస్తూంటుంది. అమ్మకి తగ్గేదాకా ఇక్కడే వుంటానని మోహన్రావుకి  చెప్తుంది. 

         వంటింట్లో తిన్నది అరక్క వంటవాడు, డ్రైవర్ కొట్టుకు చస్తూంటే మోహన్రావు అన్న వాళ్లిద్దర్నీ వెళ్లగొట్టేస్తాడు. దీంతో వంట బాధ్యత లక్ష్మి తీసుకుంటుంది. పిల్లల్ని తయారు చేసి స్కూలుకి పంపుతుంది. ఇలా రోజులు గడుస్తూండగా, ఒక రోజు మోహన్రావు ఫోటో ముందు లక్ష్మి పూలు పెడుతూంటే, వచ్చి చూసి సరస సంభాషణ చేస్తాడు మోహన్రావు. ఆమె తలలో పువ్వు పెడతాడు. 

          జైలు నుంచి రాముడు విడుదలవుతాడు. అతను అనాధాశ్రమానికి వెళ్తే ఉత్తరం రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్తాడు వాచ్ మన్. ఇక చచ్చి పోయిందని నమ్మేసి సీత ఇంటికెళ్తాడు. పోపో, నీతో మాట్లాడను - అనేస్తుంది సీత. చేసిన తప్పులకి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చానని అంటాడు. తన తప్పుల ఫలితంగా లక్ష్మి ఆత్మహత్య చేసుకుందనీ, తనే పొట్టనబెట్టుకున్నాననీ అంటాడు – నన్ను నమ్ముకున్నోళ్ళందరి గొంతులు కోయమని దేవుడు నా మొహాన రాసి పెట్టాడు, ఈ పాపిష్టి వాడి నీడ తగిల్తే పచ్చి గడ్డి కూడా భగ్గుమంటుంది – అని వాపోతాడు. చెల్లెలి కోసం ఏ పరిస్థితుల్లో ఆనాడు రాంబాబులా నటించి మోసం చేయాల్సి
వచ్చిందో చెప్పేసి వెళ్లిపోతూంటాడు. సీత ఆపుతుంది. 

         
ఇటు వడ్డీ వ్యాపారి భద్రయ్యకి డాక్టర్ మోహన్రావుని అల్లుడిగా చేసుకోవాలనుంటుంది. ఈ విషయమే వచ్చి మోహన్రావు అన్న దగ్గర కదుపుతాడు. లక్ష కట్నం అడుగుతాడు మోహన్రావు అన్న. కళ్ళు తేలేస్తాడు భద్రయ్య. రాముడు రోడ్డు మీద నడుచుకుంటూ పోతూంటే, కారు పంక్చరై నిలబడి వుంటాడు మోహన్రావు. రాముడు టైరు మార్చేసి మోహన్రావుని  కార్లో కూర్చోబెట్టుకుని నడుపుకుంటూ ఇంటికి చేరేస్తాడు. అక్కడే కారు డ్రైవర్ గా జాయినై పోతాడు.

          మోహన్రావు అన్న భద్రయ్య తెచ్చిన సంబంధం గురించి మోహన్రావుకి చెప్తాడు. మోహన్రావు లక్ష్మినే  చేసుకుంటానంటాడు. దాంతో అన్నతో తేడా వస్తుంది. తల్లి వచ్చి లక్ష్మి మంచిదని మోహన్రావునే సమర్ధిస్తుంది. లక్ష్మి పిల్లల్ని స్కూలుకి తయారుచేస్తూ పాట పాడుతూంటే, బయట రాముడు విని గొంతు గుర్తు పడతాడు. లక్ష్మి చనిపోలేదనీ, ఇక్కడే వుందనీ తెలుసుకుని ఆనందిస్తాడు. 

      ఇంతలో పిల్లాడు సోఫా ఎక్కితే సోఫా మీదున్న వాచీ జారి అటు కింద పడిపోతుంది. లక్ష్మి పిల్లలతో బయటికి వచ్చి కారు దగ్గరున్న రాముణ్ణి చూసి మాటరాక నిలబడి పోతుంది. ఆమెనీ పిల్లల్నీ తీసుకుని కారులో స్కూలుకి బయల్దేరతాడు. స్కూలు దగ్గర ఆమెకి చెప్తాడు – తాము అన్నా చెల్లెళ్ళన్న సంగతి ఇంట్లో తెలియ నివ్వద్దని, ఇప్పుడే తను వెళ్లిపోతాననీ. మోహన్రావు దగ్గరి కెళ్ళి ఉద్యోగం మానేస్తానంటాడు. ఇంతలో వాచీ కనపడక మోహన్రావు అన్న కంగారుపడుతూంటాడు. అప్పుడే భద్రయ్య వచ్చి రాముణ్ణి చూసి చిందులేస్తాడు. తనింట్లో దొంగతనం చేసి జైలు కెళ్ళింది వీడేనని చెప్పేస్తాడు. వాచీ దొంగతనం రాముడి మీద పడుతుంది. మోహన్రావు అన్న పోలీసుల్ని పిలవమంటాడు. మోహన్రావు ఆపి, ఇందుకేనా ఉద్యోగం మానేస్తానన్నావని రాముణ్ణి వెళ్ళగొట్టేస్తాడు. లక్ష్మి ఏమీ చేయలేక తల్లడిల్లుతుంది. 

          రాముడు వెళ్ళిపోయి బాబుల్ గాడి గానా బజానాలో కూర్చుంటాడు. సరైన చోటుకే వచ్చావనీ, తన ముఠాలో చేరిపొమ్మనీ అంటాడు బాబుల్ గాడు. ఇది సీత చూస్తుంది. అవతల లక్ష్మితో మోహన్రావు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు. లక్ష్మికి మంచి నగ కొనివ్వాలనుకుంటాడు రాముడు. సీతతో షాపు కెళ్తాడు. వంద రూపాయల నగ కొనాలంటే చాలా కష్టపడాలని, రకరకాల పనులు చేసి ఆ వందా సంపాదించి నగ కొంటాడు. 

          గుడి దగ్గర భద్రయ్య సీతతో రాముడి చెల్లెలు లక్ష్మిని చూసి అర్ధమైపోయి, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానని ఒంటి కాలిమీద లేస్తాడు. సీత వచ్చి రాముడికి ఈ సంగతి చెప్తుంది. రాముడు కత్తి తీసుకుని బయల్దేరుతాడు. లక్ష్మి గురించి నోరు విప్పితే పొడిచి పారేస్తానని భద్రయ్యని హెచ్చరిస్తాడు. చెల్లెలి పెళ్ళయేదాకా యిల్లు కదలకుండా ఇక్కడే కాపలా వుంటానంటాడు. భద్రయ్య కిక్కురుమనకుండా పడుంటాడు. 

          రాత్రి వరకూ కాపలా కాసిన రాముడికి, లక్ష్మికి నగ ఇవ్వాలన్న విషయం గుర్తుకొస్తుంది. భద్రయ్య ఇంటి ముందు తనలాగే కన్పించే దిష్టి బొమ్మ పెట్టి వెళ్తాడు. పెళ్ళిలో రహస్యంగా లక్ష్మికి నగ పెట్టి దీవిస్తాడు. భద్రయ్య వుండబట్టలేక బయటికి వచ్చి, దిష్టి బొమ్మని రాముడే అనుకుని బ్యారుమని ఇంట్లో కెళ్ళి పడుకుంటాడు. అటు పెళ్ళిలో రాముడు షేర్వానీ, చుడీదార్ వేసుకుని జడ్జిలా నటిస్తూ వచ్చి, గతంలో తనని పట్టుకున్న పోలీసు అధికారి పక్కనే కూర్చుంటాడు. పెళ్లి పీటల మీద లక్ష్మి ఇది చూసి ఆనందిస్తుంది. 

          అటు భద్రయ్య మళ్ళీ వుండబట్టలేక బయటికొచ్చి, అప్పుడది దిష్టి బొమ్మని తెలుసుకుని చీల్చి చెండాడుతూంటే, వెనుక నుంచి బాబుల్ గాడు ఇంట్లోకి దూరుతాడు. దర్జాగా ఇనప్పెట్టె ఖాళీ చేస్తూంటే వచ్చేసి మీద పడతాడు భద్రయ్య. ఆ పెనుగులాటలో భద్రయ్య వీపులో బాబుల్ గాడి కత్తి కసిక్కున దిగుతుంది. 

          ఇక కొనప్రాణాలతో వున్న భద్రయ్య తనని పొడిచింది రాముడేనని చెప్పి చనిపోతాడు. అదే సమయంలో మళ్ళీ కాపలా కొచ్చిన రాముడు, ఇది చూసి పారిపోతూంటే పోలీసులు వెంటాడి పట్టుకుంటారు. రాముడి మీద భద్రయ్య హత్య కేసు పెట్టి అరెస్టు చే స్తారు.
***
        ఇదీ మిడిల్ – 2 లో విషయం, దాని కథనం. మిడిల్ -2 ఇంటర్వెల్ తర్వాత సాగే మిడిల్ విభాగపు మలి కథనమేనని తెలిసిందే. ఇప్పుడు చూస్తే, బిగినింగ్ విభాగపు ముగింపులో  చిన్నరాముడు దొంగగా బాల నేరస్థుల కేంద్రాని కెళ్ళడాన్ని చూశాం. దీని తర్వాత మిడిల్ -1 ముగింపు చూస్తే, పెద్ద రాముడు మళ్ళీ దొంగగా జైలుకెళ్లడాన్ని చూశాం. ఇప్పుడు మిడిల్ – 2 కి ముగింపుగా కూడా రాముడు హత్య కేసులో అరెస్టవడాన్నే  చూస్తున్నాం. 

          స్ట్రక్చర్ పరంగా ఇవి మొదటిది ప్లాట్ పాయింట్ -1 గా, రెండోది మిడ్ పాయింట్ (ఇంటర్వెల్) గా, మూడోది ప్లాట్ పాయింట్ – 2 గా ఏర్పాటవడాన్ని గమనించ వచ్చు. ఒకే రకమైన మలుపులతో మూడు మూలస్థంభాలు. ఇవి రిపిటీషన్ గానే అన్పిస్తాయి. మూడు సార్లు కథ అరెస్టవడం దగ్గరే ముగింపుకొచ్చి, మళ్ళీ కొత్తగా మొదలవుతున్నట్టే వుంటుంది. దీంతో ఇవి మూడు క్లయిమాక్సులన్న పేరు కూడా వచ్చింది. మూడు కాదు, నాల్గు క్లయిమాక్సులున్నాయి, తర్వాత వచ్చే అసలు ముగింపుతో కలుపుకుంటే. ఐతే ఇవి అలాటి కథాపరమైన క్లయిమాక్సులేనా? కాదు. ఇవి నిజానికి అంకాల (యాక్ట్స్)పరమైన క్లయిమాక్సులు. మొదటి అంకం బిగినింగ్, రెండో అంకం మిడిల్, మూడో అంకం వచ్చేసి ఎండ్ గా చెప్పుకున్నప్పుడు  – ఇవి అంకాల పరమైన క్లయిమాక్సులే అవుతాయి తప్ప, కథాపరమైన క్లయిమాక్సులు కావు. కథాపరమైన క్లయిమాక్సు లెలా వుంటాయో తర్వాత చూద్దాం. అంటే మొదటి అంకానికి ప్లాట్ పాయింట్ -1 క్లయిమాక్స్ అనీ, రెండో అంకానికి ప్లాట్ పాయింట్ -2 క్లయిమాక్స్ అనీ,  అలాగే మూడో అంకానికి ముగింపు క్లయిమాక్స్ అనీ టెక్నికల్ గా చెప్తారు. వాడుకలో ప్లాట్ పాయింట్స్ అనే మాట్లాడుకుంటారు. 

          ఉదాహరణ చెప్పుకుంటే ‘శివ’ బిగినింగ్ కథనం సాగి సాగి, నాగార్జున సైకిల్ చైనుతో జేడీని కొట్టడంతో క్లయిమాక్స్ కి వస్తుంది. ఇది బిగినింగ్ కి క్లయిమాక్స్, అంటే ప్లాట్ పాయింట్ -1. అదన్న మాట. ఇలాగే దొంగరాముడులో చిన్న రాముడు రెండ్రూపాయలు కొట్టేసి బాలనేరస్థుల కేంద్రంలో పడ్డం ఆ బిగినింగ్ విభాగపు క్లయిమాక్స్. తర్వాత పెద్ద రాముడు చెల్లెలి కోసం దొంగతనం చేసి జైలుకెళ్ళడం మిడిల్ -1 క్లయిమాక్స్, అలాగే చేయని హత్యకి రాముడు అరెస్టవడం మిడిల్ – 2 క్లయిమాక్స్ అయ్యాయి. కాబట్టి ఇవి విడివిడి కథలు, వాటి విడివిడి క్లయిమాక్సులూ కావు. కథ ఒక్కటే వుంది, చెల్లెలి కోసం తాపత్రయం గురించి. ఇదే పాయింటు అంకాల్లో ఎడతెగకుండా ప్రవహిస్తోంది. ఎత్తుకున్న పాయింటు అంకాల్లో ఎడతెగకుండా ప్రవహిస్తూంటే అది కథాపరమైన పాయింటు అవుతుంది. ఈ కథాపరమైన పాయింటు అంకాల పరంగా చిన్నచిన్న క్లయిమాక్సులు ఏర్పాటు చేసుకుంటూ సాగుతుంది. చిట్టచివరికి మొత్తం కాన్సెప్ట్ కీ ముగింపుగా గ్రాండ్ షోడవున్ గా శుభం వేస్తుంది. ఈ శుభంకల్లా కాన్సెప్ట్ లో వుండే కథనపరమైనవే గాక, పాత్ర చిత్రణ పరమైన అన్ని సెటప్స్ కొలిక్కి వస్తూ పేఆఫ్ అయిపోతాయి. ఇదీ అంకాల పరమైన, కథాపరమైన క్లయిమాక్సుల సంగతి. 

         అయితే  దొంగరాముడు కథలో అంకాల పరమైన మూడు క్లయిమాక్సులు ఒకేలా వున్నా, అవి తీవ్రత పెంచుకుంటూ వున్నాయి. ముందు చిన్న రాముడుగా చిన్న దొంగతనం చేసి బాల కేంద్రానికే వెళ్ళాడు, తర్వాత పెద్ద దొంగతనంతో నేరం పెరిగి జైలుకెళ్ళాడు, ఆతర్వాత చేయని హత్య కేసులో నేరం ఇంకా పెరిగి అరెస్టయాడు. ఈ తీవ్రతల స్థాయులు క్యారెక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) ని ఏర్పరుస్తున్నాయి. అంటే ఈ క్లయిమాక్సులు పాత్ర చిత్రణకీ పనికొచ్చాయి. అలాటిలాటి పాత్ర చిత్రణా కాదు, పరివర్తనే ధ్యేయంగా సాగే పాత్రచిత్రణ. ఇలాకాక, జడప్రాయమైన పాత్రగా వుండిపోతే, ఎన్ని అంకాల క్లయిమా క్సులున్నా పాత్రలో మార్పు రాదు. క్యారెక్టర్ ఆర్క్ ని ఏర్పర్చదు. ఇప్పటి సినిమాల్లో లాగా, ఆవారా హీరో పాత్ర వుందనుకుందాం. ఈ పాత్ర నేరాలు చేసి పదేపదే అరెస్టయ్యే మలుపులెన్ని వస్తున్నా, ఏ మలుపూ ఆ పాత్ర ఉన్నతీకరణకి దోహదం చేయకపోతే సినిమా ఎలా వుంటుందో, ఈ ఉత్తుత్తి క్లయిమాక్సులు చూస్తూ కూర్చున్న ప్రేక్షకుల మానసికారోగ్య మెలా వుంటుందో వూహించుకోవచ్చు. ఇవి పాత్రని వదిలేసిన క్లయిమాక్సులు. ఎలాగూ మన హీరోల పాత్రలు ఆవారా అనాధ పాత్రలే కదా. 
***
       ఇలాకాక దొంగరాముడులో పాత్రని అంటి పెట్టుకునే అంక క్లయిమాక్సులు కన్పిస్తాయి. ఇందుకే ప్రతీ క్లయిమాక్సూ అక్కడితో కథని తెంపెయ్యకుండా కొత్తాసక్తిని రేపుతోంది. ఇదంతా చేయి తిరిగిన క్రియేటివ్ స్పర్శ. స్ట్రక్చర్ తోనే. ఈ స్ట్రక్చర్ సహిత క్రియేటివ్ అభివ్యక్తితో ఇప్పుడే జానర్ కథైనా చేసుకోవచ్చు. స్ట్రక్చర్ ని పట్టించుకుంటేనే. స్ట్రక్చర్ మాత్రమే  సినిమాకి వ్యాపారాన్నిస్తుంది, మిగతా క్రియేటివిటీలన్నీ స్ట్రక్చర్ కి చేసే షోకులే.

       ఇప్పుడు ఈ వ్యాసం మొదట్లో చెప్పుకున్న స్క్రీన్ ప్లేకి పట్టే చీడల విషయానికొద్దాం. ఇవి చీడలని తెలియక సినిమాలు తీస్తే ఫ్లాపవుతున్నాయి. 2000 నుంచీ ముందు ఓ మూడు చీడలు పుట్టుకొచ్చాయి – మిడిల్ మటాషులు, ఎండ్ సస్పెన్సులు, పాసివ్ పాత్రలూ. తర్వాత ఇంకొన్ని కొత్త చీడలు వచ్చి చేరాయి : మిడ్ ఫ్రాక్చర్లు, సెకెండాఫ్ సిండ్రోములు, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్కులు. ఉన్న వైరస్ లకి తోడు ఎబోలా, హంటా, జికా అంటూ కొత్తకొత్త వైరసులు సెలబ్రిటీలైనట్టు.

          కానీ దొంగరాముడులో రిపీటయ్యే అవే అంక క్లయిమాక్సులతో ఎంత కథ నడిపినా, 1. ఇంటర్వెల్లో కథ తెగి స్క్రీన్ ప్లే మిడ్ ఫ్రాక్చర్ కాలేదు, 2. ఇంటర్వెల్ కల్లా కథ ముగిసిపోయి సెకండాఫ్ సిండ్రోమ్ ఏర్పడలేదు, 3. అంకాలు వేటికవి విడివిడి మినీ కథలై స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ బారిన పడలేదు. అసలీ మూడు చీడలేమిటో, ఎలా గుర్తుపట్టాలో ఈ కింద చూద్దాం...
***
       ఒక సినిమా ఏదో ఒక చీడ పట్టి వుంటుంది. రెండు మూడు చీడలు పట్టి భయపెట్టడం చాలా అరుదు. మిడ్ ఫ్రాక్చర్ కి రభస, జ్యోతి లక్ష్మి, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి కొన్నిటిని, సెకెండాఫ్ సిండ్రోమ్ కి ఊసరవెల్లి, అశోక్, బ్రహ్మోత్సవం లాంటి కొన్నిటిని, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ కి ఆటోనగర్ సూర్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సిటిజన్ లాంటి కొన్నిటినీ చెప్పుకోవచ్చు. అయితే రికార్డులన్నీ బద్దలు కొడుతూ ఈ మూడు చీడలూ పట్టింది ఒకటుంది – అదే ‘సైజ్ జీరో’ అనే కొవ్వెక్కిన స్క్రీన్ ప్లే. 

          స్పెషల్ బాడీతో అనూష్కా నటించిన ‘సైజ్ జీరో’ చీడ పీడలకి మంచి నిలవనీడ. దీని సృష్టికర్తలకి చేతులెత్తి నమస్కరించాలి. ఇందులో హీరోయిన్ అనూష్కా సమస్య లావు తగ్గాలని. ఎలా తగ్గుతుంది, మిడ్ ఫ్రాక్చర్, సెకెండాఫ్ సిండ్రోమ్, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్కుటమారాలతో స్క్రిప్టే కొవ్వెక్కిపోతే? కొవ్వెక్కిన స్క్రిప్టు బాక్సీఫీసు దివ్వెల్ని వెలిగిస్తుందా? మార్నింగ్ షోకే కొవ్వు చూసి కెవ్వుమన్నారు ప్రేక్షకులు. ఆఖరికి సినిమా ముగింపులో అనూష్కా కూడా కొవ్వు తగ్గని అదే సైజుతో పహిల్వాన్ లా మిగిలింది!  చీడలంటించుకున్నాక స్క్రిప్టుకి చీరలు బావుండవు. 

          ఇందులో మిడ్ ఫ్రాక్చర్ ఇలా వుంటుంది :
లావు తగ్గాలని ఇంటర్వెల్ దగ్గర ప్లాట్ పాయింట్ -1 తో వేసే గోల్ అక్కడితోనే ఆగిపోతుంది. సెకండాఫ్ ప్రారంభం కాగానే వేరే కథ మొదలెడతారు. అంటే ఫస్టాఫ్ లో ఎత్తుకున్న కథా దాని పాయింటూ సఫా. ఇక రెండో సినిమా షురూ. 

         
సెకెండాఫ్ సిండ్రోమ్ ఇలా వుంటుంది : ఇంటర్వెల్లో ప్లాట్ పాయింట్ -1 వేసి లావు తగ్గే పాయింటు వేశాక, దాన్నెలా కొనసాగించాలో తెలీనట్టు, ఇంటర్వెల్ తర్వాత దాన్నొదిలేసి,  క్లినిక్ అక్రమాల పాయింటు నెత్తుకుంటారు. ఇంటి దగ్గర తల్లిగారు పెళ్లి కోసం లావు తగ్గమంటే, ఆ తల్లీనీ పెళ్ళీనీ వదిలేసి క్లినిక్ అక్రమాలంటూ వూరు మీద పడేశారు. ఉన్న పాయింటుతో సెకెండాఫ్ ఏం చేయాలో తెలీక, వేరే పాయింటుతో ప్లేటు ఫిరాయిస్తే, ఇలా సెకెండాఫ్ సిండ్రోమ్ లో- సుడిగుండంలో పడుతుంది సినిమా. 

         
ఇక స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ ఇలా వుంటుంది : సెకెండాఫ్ లో క్లినిక్ మీద పోరాటంతో మొదలెట్టి,  ఫ్రెండ్ కోసం ఫండ్ రైజింగ్ ఎపిసోడుగా, ప్రజలకి అవగాహన కోసం స్పోర్ట్స్ ఈవెంట్ ఎపిసోడుగా ... ఇలా తోచిన పాయింటల్లా ఎత్తుకుంటూ ఎపిసోడ్లమయంగా చెప్పుకుంటూ పోయి, డాక్యుమెంటరీలకి పనికొచ్చే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ బారిన పడేశారు. ఒకటేదో సమస్యని  ఎత్తుకోవడం, దాన్ని పరిష్కరించడం, ముగించడం; మళ్ళీ ఇంకో సమస్యేదో ఎత్తుకోవడం, దాన్ని పరిష్కరించడం, ముగించడం... ఇలా కొన్ని ఎపిసోడ్లుగా చూపించడానికి - సినిమా మినీ కథల సంపుటి కాదు. ఒకే పెద్ద కథ. దానికొకటే పాయింటు. దాంతోనే సంఘర్షణా, దానికే పరిష్కారమూ.
  ***
           దొంగరాముడు ఒకే తానుగా వున్న కథ మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తున్నా, ఎపిసోడిక్ కథనం బారిన పడలేదు. ఇంటర్వెల్లో కథ తెగి మిడ్ ఫ్రాక్చర్ అవలేదు. ఇంటర్వెల్ తర్వాత ఉన్న పాయింటుని వదిలేసి ఇంకో పాయింటునెత్తుకుని సెకండాఫ్ సిండ్రోంలోకి జారుకోలేదు.  ఏమిటి కారణం? కారణమేమిటంటే ఒకే కథ, ఆ కథ చివరంటా అన్ని అంకాల్లో అంతర్లీనంగా కొనసాగుతున్న ఒకే పాయింటు - చెల్లెలి కోసం తాపత్రయం. పాయింటు తెగకపోతే ఏదీ తెగదు. ఇంతకంటే మూలసూత్రం లేదు దొంగ రాముడులో. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ మూడు చీడలకి అతీతంగా వుంటాయి రాసుకునే కథలు.  
                                                   
             ఇక దొంగరాముడు మిడిల్ - 2 ని పరిశీలిస్తే,  మిడిల్ - 1 లో చూసిన యాక్షన్ రియాక్షన్లతో కూడిన డైనమిక్సే కొనసాగుతాయి. ఈసారి డైనమిక్స్ సంక్షోభాన్ని- సంఘర్షణనీ పెంచుతూ ప్లాట్ పాయింట్ - 2 కేసి సాగుతాయి. ఇదంతా ఈ వ్యాస ప్రారంభంలో రెండో పేరా నుంచీ వున్న కథా సంగ్రహంలో స్టెప్ బై స్టెప్ కనిపెట్టొచ్చు. డైనమిక్స్ ఎలా వుంటాయో గత వ్యాసంలో మిడిల్ -1 కథా సంగ్రహం ఆధారంగా చెప్పుకున్నాం. ఆ విధానాన్నే ఇక్కడ అప్లయి చేసి చూస్తే అర్ధమైపోతుంది. పాత్రగా దొంగరాముడి డైనమిక్స్ కి పరాకాష్ఠ - పెళ్ళిలో జడ్జి వేషంలో రావడం! దొంగ పోలీసుగా కాదు, జడ్జిగా రావడం! జడ్జిగా వచ్చి గతంలో తనని పట్టుకున్న పోలీసు పక్కనే కూర్చోవడం! ఇలాటి ఎక్స్ ట్రీం ద్వంద్వాలే సీన్లని హుషారెక్కిస్తాయి. ఎలా వచ్చాడు? పెళ్ళికి జడ్జిని పిలిచివుంటే, ఆ జడ్జిని పిలిచిన మోహన్రావు అన్న, ఒక లాయర్ గా ఇతను జడ్జి కాదే అనుకోడా? ఇలాటి  ప్రశ్నలు అబ్సర్డ్  కామెడీకి చెల్లవు. అబ్సర్డ్ – అసంబద్ధ కామెడీ ఇలాగే వుంటుంది. అయితే దీనికి మూలంలో లాజిక్ వుండాలి. లేకపోతే అబ్సర్డ్ కామెడీ విఫలమవుతుంది. రాముడుకి దొంగోడనే ముద్ర లాజికల్ గా వుంది. ఈ మూలంలోంచి అతను ఎక్స్ ట్రీం కెళ్ళి జడ్జిగా సీనుని ఆపరేట్ చేశాడు. దొంగోడు కాకుండా మంచోడై వుంటే సీనుకి అర్ధముండదు. మూలంలో లాజిక్ వుంటే ఎంత అసంబద్ధ కామెడీనైనా లాగించెయ్యొచ్చని అరిస్టాటిల్ చెప్పాడు. అప్పుడు  ‘పట్నంలో జడ్జి ఎవరో ఎవరికీ తెలీదా’ అన్న లాజిక్ ని వదిలేస్తారు ప్రేక్షకులు. ఒకటి వదిలేయాలంటే ఇంకోదాంతో కాంపెన్సేట్ చేయాలి. 

       కొన్ని సినిమాల్లో అకస్మాత్తుగా పాత్రలు మాయమవుతూంటాయి. ఆ మధ్య ఒక సినిమాలోంచి హీరోయిన్ వెళ్ళిపోతే డూప్ ని పెట్టి అన్నీ వెనుకనుంచి షాట్లే తీశారు. మరి సూర్యకాంతంతో ఏమయ్యిందో ఆమె ధరించిన భద్రయ్య భార్య పాత్ర సడెన్ గా అదృశ్యమైపోతుంది. రాముడు కత్తితో భద్రయ్యని హెచ్చరిస్తున్నప్పుడు లోపలినుంచి ఆమె వాయిస్ విన్పిస్తుంది. ఏదో సర్ది చెప్పేస్తాడు భద్రయ్య, ఆ తర్వాత బాబుల్ గాడొచ్చి దాడి చేస్తున్నప్పుడూ, భద్రయ్య చనిపోయి పోలీసులొచ్చినప్పుడూ, ఇంకా తర్వాతెక్కడా ఆమె కన్పించదు కూతురూ కొడుకు సహా! ఇది లాజిక్ కి అడ్డం పడేదే. 

          1940 లలో ప్రారంభమైన హాలీవుడ్ ఫిలిం నోయర్ జానర్ డిటెక్టివ్ సినిమాల్లో ఒక సీనుని దాని తర్వాతి సీనుతో లింక్ చేస్తూ గమ్మతైన షాట్లేస్తారు. దీంతో అది మొదటి సీను తాలూకు ఇంకో షాట్ అనుకునే ప్రేక్షకులు కాస్తా, రెండో సీను చూసి ఫూల్స్ అవుతారు.  దొంగరాముడులో ఇలాగే ఒకచోట వుంది. డాక్టర్ మోహన్రావ్ డ్రైవర్ గా కొత్తగా చేరిన రాముడు, కారు తుడుస్తూంటే పనివాడు వచ్చి తొంగి చూస్తాడు. ఈ పనివాడు రాముణ్ణి దొంగరాముడుగా గుర్తు పట్టేశాడన్పించి - దీని పరిణామాల గురించి ఇంకెటో పోతుంది మన మైండ్. అంతలో ఈ సీను కట్ అయి ఇంకో సీను వస్తుంది. ఇక్కడ ఇంట్లో పెళ్లి మాటలు మాట్లాడుకుంటూ వుంటారు. అప్పుడు మళ్ళీ పనివాడు తొంగి చూస్తున్న షాట్ పడుతుంది. అప్పుడర్ధమవుతుంది మనమెంత ఫూలయ్యామో. పనివాడు తొంగి చూస్తోంది ఇంట్లోకన్న మాట, బయట రాముణ్ణి కాదు! ఇది ప్రేక్షకుల్నికంగారు పెట్టే డైనమిక్స్. జస్ట్ క్రియేటివ్ ఎగ్జీబరెన్స్! 



          రూపాయి రూపాయీ కూడేసి సినిమా తీస్తే ప్రేక్షకులు అచేతనంగా కూర్చుండిపోయి సినిమా చూడడం కాకుండా, క్షణంక్షణం స్పందిస్తూ బిజీగా చూసేలా చేయకపోతే – ఆ క్షణ క్షణానికీ పెట్టే ప్రతీ రూపాయీ దండగైనట్టే. పెట్టుబడికి పెట్టే ప్రతీ రూపాయీ ప్రేక్షకుల అటెన్షన్ ని వసూలు చేయాలి, ప్రేక్షకులు పైసా వసూల్ అనుకునే సంగతి తర్వాత! ఇంకో చోట – మళ్ళీ ఫిలిం నోయర్ సినిమాల్లో లాగే – నడుస్తున్నసీను దేనికి దారితీస్తుందో సూచనలిచ్చే బ్యాక్ గ్రౌండ్ విశేషముంటుంది. రాముడు చలాకీగా నడుచుకుంటూ వస్తూంటాడు. కారు టైరు పంక్చరై మోహన్రావు నిలబడి వుంటాడు. ఈ సీనులో ఏం జరుగుతుందో పైన మిడిల్ - 2 కథా సంగ్రహంలో చెప్పుకున్నాం. ఇది రాముడు, మోహన్రావు పరస్పరం పరిచయమయ్యే సీను. ఈ పరిచయం తర్వాత వీళ్ళ సంబంధం ఎలా వుండబోతోందో సంకేతాలిస్తూ వెనుక ఒక దృశ్యం కన్పిస్తుంది. ముందుగా వీళ్లిద్దరున్న ఫ్రేములో చెరో పక్క రెండు వృక్షాలుంటాయి. ఇప్పుడేగా వీళ్ళిద్దరూ పరిచయమయ్యారు, అందుకే ఇలా విడివిడిగా వృక్షాలు. ఈ ఫ్రేము నుంచి అవతలికి మన దృష్టి సారిస్తే, దూరంగా ఒకే చోట రెండు తాటి చెట్లుంటాయి : ఒకటి పొడవైనది, ఇంకోటి పొట్టిది. బ్యాక్ గ్రౌండ్ లో ఇంకేమీ వుండదు ఆకాశం తప్ప. అంటే వీళ్ళిద్దరూ యజమానీ పనివాడుగా ఒకటవుతారన్నమాట!

          కథనమంటే కార్యాకారణ (కాజ్ అండ్ ఎఫెక్ట్) సంఘటనల సమాహారమే కాబట్టీ- అందునా మిడ్ పాయింట్ సహా ప్లాట్ పాయింట్స్ రెండూ సంఘటనలతో కథని మలుపు తిప్పే థ్రిల్లింగ్ విజువల్ నేరేషన్ తో వుండాలి కాబట్టీ – దొంగరాముడు ఈ మూడు ఘట్టాలనీ థ్రిల్లింగ్ సంఘటనలతోనే చూపించారు. ప్లాట్ పాయింట్ -1 లో బాల రాముడు దొంగతనం చేసి పోలీసులకి దొరికిపోయే ఛేజింగ్ సీను, మిడ్ పాయింట్ లో రాముడు రాంబాబుగా నటించి పోలీసులకి దొరికిపోయే సస్పెన్స్ సీను, తర్వాత ఇప్పుడు ప్లాట్ పాయింట్ -2 లో, హత్యకేసులో మళ్ళీ పోలీసులతో ఛేజింగ్ సీను. ఆ మూడూ విజువల్ గా వున్నాయి. మాటలతో వెర్బల్ గా వుంటే మిగతా సీన్లకీ ఈ కీలక సీన్లకీ తేడా వుండక గంపగుత్త బేరంలా వుంటాయి. మాంచి చెత్తబుట్ట సినిమాని ఉత్పత్తి చేస్తాయి. ఈ మూడు కీలక సీన్లూ థ్రిల్లింగ్ సంఘటనలతో విజువల్ గా ప్రేక్షకుల మనస్సుల్లో ముద్రించుకోవాల్సిందే. సినిమాల్లో చూపిస్తున్నట్టు, ప్రేమికులు కేవలం మాటామాటా అనుకుని విడి పోవడం - విజువల్ మీడియా అయిన సినిమా ప్లాట్ పాయింట్ కాదు. దాన్ని నవలగా రాసుకుని అచ్చేసుకుని, పడక్కుర్చీలో మేనువాల్చి చక్కగా చదువుకుని ఆనందించ వచ్చు. భూతద్దం పెట్టి రకరకాల సైజుల్లో మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు – సినిమాల వైపు మాత్రం రాకుండా. 

          ప్లాట్ పాయింట్ - 2 అనేది కథ నడిపే పాత్ర అధఃపాతాళంలోకి జారిపోయే ఘట్టం కాబట్టి, రాముడి జీవితం పరాకాష్ఠకెళ్ళి హత్య కేసుతో పూర్తిగా సర్వనాశనమయ్యాడు. ఇక ఇందులోంచి ఫీనిక్స్ పక్షిలా పైకి లేవడం ఎండ్ విభాగానికి బదిలీ అయ్యే బిజినెస్.

***
           ఎండ్ విభాగం బిజినెస్ – సీత గబగబా వస్తూంటే బాబుల్ గాడు పూటుగా తాగి, జోరుగా డబ్బులు ఖర్చు పెడుతూ కనపడతాడు. వీడికింత డబ్బెక్కడిదా అని చూసి, వీడి సంగతి చూడాలని తన హొయలతో ట్రాప్ చేసి వాడింటికి తీసికెళ్తుంది. రావోయి మా ఇంటికీ పాటేసుకుని, వాడికి అర కోడి కూర తినిపించకుండానే ఉతికి ఆరేస్తుంది. వాడు భద్రయ్యని చంపి దోచుకున్న సొమ్మంతా తీసి చూపించి, ఆమెని తన దాన్నిగా చేసుకుందామని ఎరేస్తాడు. ఆ సొమ్ములు లాక్కుని వాణ్ణి తన్నడంలో బిజీ అయిపోతుంది
 .
            పోలీస్ స్టేషన్లో రాముణ్ణి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూంటారు. హత్య జరిగిన సమయంలో తను పెళ్ళిలో ఈ పోలీసు అధికారి పక్కనే జడ్జి వేషంలో వున్నానని చెప్పుకోలేని పరిస్థితి రాముడిది.

          అటు ఇంట్లో సోఫా కింద పడ్డ వాచీ దొరుకుతుంది. దీంతో మోహన్రావు, అతడి అన్న రాముడి మీద నేరం మోపినందుకు బాధపడతారు. ఇంతలో పనివాడొచ్చి రాముడు భద్రయ్యని చంపి అరెస్టయ్యాడని అంటాడు. అన్నదమ్ములకి నోట మాటరాదు. ఇక లక్ష్మి అగలేకపోతుంది. బయట పడిపోతుంది. లక్ష్మి ఎవరో తెలిసి విస్తుపోతారు వాళ్ళు. తనని  క్షమించమని కాళ్ళ మీద పడుతుంది. కానీ తన అన్నఈ హత్య చేయలేదనీ, సాక్ష్యం చెప్తాననీ ప్రాధేయపడుతుంది. 

          పోలీస్ స్టేషన్లో లక్ష్మి అన్నకి ఎలిబీ ఇచ్చేస్తుంది – హత్య జరిగిన సమయంలో అతను జడ్జి వేషంలో పెళ్ళికి వచ్చాడని. పోలీసు అధికారి ఠారెత్తిపోతాడు. ఇంతలో బాబుల్ గాణ్ణి పోలీసులకి పట్టించిన సీత ఆ దొంగ సొత్తుతో పోలీస్ స్టేషన్ కొస్తుంది...

          ఇదంతా సంఘటనలతో జరిగిందే, మాటలతో అపార్ధాలు తొలగించుకుని కాదు. అయితే హీరో పాత్రయిన రాముడు అంతవరకూ యాక్టివ్ పాత్రగా వుంటూ, తీరా అరెస్టయ్యా క ముగింపు వరకూ ఏమీ చెయ్యని పాసివ్ పాత్రగానే వుండిపోయాడు. ఈ ఉచ్చులోంచి తనని లక్ష్మీ సీతలే కాపాడారు. ఎందుకంటే ఆ రోజుల్లో యాక్టివ్ పాసివ్ తేడాల్లేవు. ఎలా వున్నా చూసే వాళ్ళు. ఈ మలి స్వర్ణ యుగం తర్వాత, వ్యాపారయుగంలో హీరోయిజాల స్వరం పెరిగి, అన్నీ హీరోగారే ఒంటి చేత్తో చేసేసే ఘనకార్యాల కథలు రావడం మొదలెట్టాయి.  

          సైకలాజికల్ గా చూస్తే, ఇక్కడ ఇగో మెచ్యూర్డ్ ఇగోగా మారని ముగింపు కొచ్చింది కథ. మిడిల్ – 2 లో మెచ్యూర్డ్ ఇగోగా మారే ప్రక్రియలోనే వుంది రాముడి పాత్ర. ఈ ప్రయత్నాన్ని ఎండ్ విభాగంలో లక్ష్మీ సీతల పాత్రలు హైజాక్ చేసి వాళ్ళే అతణ్ణి మెచ్యూర్డ్ ఇగోగా మార్చేశారు. నీతి ఏమిటంటే, చిన్నప్పటి తెలియని వయసే కావొచ్చు- ఒకసారి పోలీసు రికార్డుల కెక్కితే, చెయ్యని నేరాలు కూడా మీదపడి మర్యాద చేస్తాయి.

(సమాప్తం)

సికిందర్