రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, ఆగస్టు 2017, శుక్రవారం

491 : రివ్యూ!

రచన- దర్శకత్వం : కృష్ణవంశీ 
తారాగణం : సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, తనీష్, రేజీనా కాసాండ్రా, ప్రగ్యా జైస్వాల్, శ్రియా శరణ్, ప్రకాష్ రాజ్, జేడీ చక్రవర్తి, వీవా హర్ష, రఘుబాబు, శివాజీ  రాజా, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం : భీఎమ్స్ , భరత్ మధుసూదన్, హరిగోరా, మణిశర్మ, ఛాయాగ్రహణం : శ్రీకాంత్ నరోజ్
బ్యానర్ : శ్రీ చక్ర మీడియా, బుట్ట బొమ్మ క్రియేషన్స్, విన్ విన్ విన్ క్రియేషన్స్
నిర్మాతలు  : ఎస్ వేణుగోపాల్, సజ్జు
విడుదల : ఆగస్టు 4. 2017
***
     ‘నక్షత్రం’ విడుదల సందర్భంగా ప్రతీ సినిమా తనకో పాఠమని చెప్పుకున్న సీనియర్ దర్శకుడు కృష్ణ వంశీ, నేర్చుకోవడానికి ఇంకా పాత పాఠమే మిగిలివుంది.  గత రెండు సినిమాలప్పుడే నేర్చుకోవాల్సిన   పాఠాల్ని నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ‘నక్షత్రం’ ప్రత్యక్షమైంది. చాలా నవ్వొచ్చే విషయం. ఇప్పుడాయన ‘నక్షత్రం’ నుంచి ఏం పాఠం నేర్చుకున్నారో చెప్పగలరేమో చూడాలి. ఒకవేళ తెలుగు సినిమాల కంటూ తనే ఒక కొత్త పాఠాన్ని ఇతరులకి నేర్పాలనుకుంటున్నారేమో తెలీదు. సినిమాలు రెగ్యులర్ గా అలాగే ఎందుకుండాలి, ఇర్రెగ్యులర్ గా ఇలా ఎందుకు ఇరగ దీయకూడదని ఉద్దేశపూర్వకంగానే ‘మొగుడు’, ‘పైసా’, తర్వాత ఇప్పుడు ‘నక్షత్రం’ తీసి పారేస్తున్నారా ఒకవేళ, ఈసారి ఏకంగా 12 కోట్లని ప్రమాదంలోకి నెడుతూ? 

     సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, తనీష్, రేజీనా కసాండ్రా, ప్రగ్యా జైస్వాల్, ప్రకాష్ రాజ్ పేర్లతోనే ఇంత ప్రకాశించిపోతున్న ‘నక్షత్రం’ నఖశిఖపర్యంతం నగుబాటుపాలు కావడానికి కారణాలేమిటో ఈ కింద చూద్దాం. 

కథ
       రామారావ్ (సందీప్ కిషన్) తన తాతా తండ్రుల్లాగే పోలీసుద్యోగం చేయాలనుకుంటాడు. చదువు సరీగ్గా లేక (చిన్న చిన్న ఇంగ్లీషు ముక్కలు కూడా రావు) ఎస్సై పోస్టుకి ప్రతీసారీ రాత పరీక్ష తప్పుతూంటాడు. ఓ తల్లి (తులసి) వుంటుంది. ఇంకో  పోలీసు అయిన మావయ్య (శివాజీరాజా) వుంటాడు. అతడి కూతురు  జమున (రేజీనా) సినిమాల్లో కొరియో గ్రాఫర్ (వైవా హర్ష) కి అసిస్టెంట్ గా వుంటుంది.  ఇంకో ఘరానా దొంగ కిరణ్ రెడ్డి ( ప్రగ్యా) వుంటుంది. ఓ పోలీస్ కమీషనర్ గా రామబ్రహ్మం (ప్రకాష్ రాజ్) వుంటాడు. ఇతడికో  కొడుకు మత్తుబానిస అయిన రాహుల్ (తనీష్)  వుంటాడు. ఈ రాహుల్ రామారావ్ వల్ల ఓసారి అవమానపడి  అవకాశం కోసం చూస్తూంటాడు. మరోసారి రామారావ్ రాతపరీక్ష పాసవుతాడు. ఇక ఇతర పరీక్షలకి వెళ్తున్నప్పుడు రాహుల్ అడ్డుకుంటాడు. ఆ పరీక్షలకి వెళ్ళలేకపోయిన రామారావ్, మావయ్య మాటలతో పోలీసుకాని పోలీసు అవుతాడు. ఓ పోలీసు యూనిఫాం వేసుకుని తిరుగుతూంటాడు. ఇది చూసి కిరణ్ రెడ్డి అతణ్ణి పట్టుకుని కమీషనర్ రామబ్రహ్మం ముందు ప్రవేశపెడుతుంది. ఈ యూనిఫాం ఎక్కడిదని రామబ్రహ్మం ఇంటరాగేషన్ చేస్తాడు. ఆ యూనిఫాం కనిపించకుండా పోయిన పోలీసాఫీసర్ అలెగ్జాండర్ (సాయి ధరం తేజ్) ది. ఐతే నగరంలో జరిగిన బాంబు పేలుళ్ళ కేసు దర్యాప్తుకి నియమితుడైన అతను ఏమైపోయాడు? ఆ శత్రువులెవరు? దీన్ని రామారావ్ ఎలా పరిష్కరించాడు?...ఇదీ మిగిలిన కథ (?)

ఎలావుంది కథ 
      కథే లేదు. ఏవేవో పోగేసిన గాలి విషయా లున్నాయి. ప్రారంభంలో నగరంలో బాంబు పేలుళ్లు చూపించినప్పుడే ఈ సినిమాకి కాలీన స్పృహ బొత్తిగా లేదని, బద్దకించి అవుట్ డేటెడ్ విషయం చూపిస్తున్నారని, ఏ పాటి రీసెర్చ్ చేశారో తెలిసిపోతోందనీ మనకి అన్పిస్తుంది. మార్కెట్ స్పృహ, క్రియేటివ్ స్పృహా లేకుండా అందరి సమయమూ వృధా చేశారని తోస్తుంది. కనీసం ఓ నాల్గేళ్ళుగా దేశంలో టెర్రర్ దాడులు జరగడం లేదు. టెర్రరిజం కాశ్మీర్ కి పరిమితమయ్యింది. టెర్రరిస్టుల ఎజెండాలు మారిపోయాయి. పాక్ సహా కాశ్మీర్ లో కరుడుగట్టిన వహాబీ ఇస్లాంని స్థాపించాలని చూస్తున్నారు. భారత్- పాక్ లలో వున్నది లిబరల్ సూఫీ ఇస్లాం. ఈ సినిమాలో విషయం ఇంకా ఏనాటిదో గోకుల్ చాట్  పేలుళ్ళ దగ్గరే తిష్ట వేసుకుని వుంది. ఇది చాలనట్టు తర్వాత్తర్వాత మరో రెండు పేలుళ్లు కూడా అలాగే చూపిస్తారు. దీంతోబాటు అక్రమాయుధాల దందా, డ్రగ్స్ స్మగ్లింగ్, బాలల అక్రమరవాణా, దేశభక్తీ  వగైరా వగైరా బోలెడు పాయింట్లతో ఏకసూత్రత అనే కనీస లక్షణాన్నే వదిలేసి, ఏం చెప్తున్నారో అర్ధంగాని పెద్ద గందరగోళాన్నే  సృష్టించారు. కథే లేనప్పుడు కథా ప్రయోజనమూ, సినిమా ప్రయోజనమూ ఏవీ లేవు. 

ఎవరెలా చేశారు
      ఎవరూ  బాగా చేయలేదు. చేసింది నటన అనుకుంటే ఇంతకంటే  నటనకి పట్టిన దుర్గతి వుండదు. ప్రతీ ఒక్కరూ అరిచి లౌడ్ గా మాట్లా
డతారు. బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాల్లో కూడా ఇలావుండదు. కానీ కృష్ణవంశీ కిలాదబాయించి, అరిచి గోలగోలగా  మాటాడితే తప్ప అది
నటన 
లా అన్పించదు. సినిమా మొదలయ్యింది లగా యత్తూ  చివరి షాటు వరకూ, రెండు గంటలా 47 నిమిషాలూ,  ఎవరో రాజకీయ నాయకులు  మైకులు పెట్టి ఒకటే  అరుస్తున్నట్టు వుంటుంది డైలాగులమీద డైలాగుల మోత. దీనికి తోడూ దాదాపు ప్రతీ ఆల్టర్నేట్ సీనులో ఇరవయ్యేసి, ముప్పయ్యేసి మంది గుంపులు గుంపులుగా జనం వుంటారు. ఎక్కడా కాస్త  రిలీఫ్ అనేదే వుండదు. నరాలమీద భరించలేని సమ్మెట పోట్లు. కృష్ణవంశీ దృశ్య, శబ్ద కళల కి జోహార్లు అర్పించాలి. 

     సందీప్ కిషన్ రామారావ్ పాత్ర ఏం చేయాలో కొలిక్కి రావడానికే ఫస్టాఫ్ గంటంపావంతా పట్టింది. ఇక్కడ బాంబు పట్టుకుని చావబోవడం, ముగింపులో మళ్ళీ విలన్ కట్టిన బాంబులతో మానవ బాంబుగా మారి రక్షించమని గగ్గోలు పెట్టడం అనేది హీరోగారి పాత్రచిత్రణ. సెకండాఫ్ గంటన్నరలో దాదాపు గంట వరకూ  తనెక్కడున్నాడో  మర్చిపోతాం- సుదీర్ఘంగా సాయి ధరమ్  ఫ్లాష్ బ్యాక్, అందులో విలన్ కట్టిన బాంబులతో ఎంతకీ ముగియని అతడి చావు తతంగమూ ఇవే ఆక్రమిస్తాయి. ఇదొక చేతకాని పాత్ర.

     పై రెండు పాత మూస ఫార్ములా పాత్రల్లాగే ప్రగ్యా జైస్వాల్ దొంగగా వుంటూ పోలీసుగా బయటపడడం ఇంకో పురాతన –పురావస్తు శాలలోంచి వొళ్ళు దులుపుకుని బయటికొచ్చిన  అయోమయపు పాత్ర. అన్నీ పాత సినిమా మూస పాత్రలే, ఈ కాలపు సహజ పాత్రలు కానరావు. రేజీనా అంగాంగ ప్రదర్శనా వైభవమే నటన అనుకుని చాలా పాటు పడింది పాపం ఆ కళలో. ఏమీ చెయ్యని పాత్ర కూడా గొప్ప పాత్రే అనునుకుని వగలుపోయింది. 

      ఇక ప్రకాష్ రాజ్ అయితే అందరి కంటే పెద్ద లౌడ్ స్పీకర్. దేశం గురించి, పోలీసుల  గురించి, ప్రజల గురించీ చెవులు పగిలేలా  అన్నన్ని భీకర  కేకలు వేసే తన ఇంట్లోనే రేపిస్టు, డ్రగ్గిస్టు, శాడిస్టు, సైకో కిల్లర్, మాఫియా, స్మగ్లర్, టెర్రరిస్టుల తొత్తూ అయిన కొడుకు వున్నాడని, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోలాగా ముగింపు సీను వరకూ తెలుసుకునే పాపాన పోడు. ఇలా వుంది ఈ పాత్ర చిత్రణ కూడా ఈ రోజుల్లో. 

     తులసి, శివాజీరాజాలది చీప్ గోల కామెడీ.  బొత్తిగా సున్నితత్వం లేని తోలు మందం  వ్యవహారం. సాంకేతికంగా చూసినా కూడా చాలా దిగదుడుపు.  కెమెరావర్క్ మరీ చీప్ గా వుంది ఏకత్వం కూడా లేకుండా. సంగీతమూ డిటో. ప్రతీ రెండో సీనూ పరమ హింసాత్మకంగా వుంటుంది. మాటాడితే పోరాటాలకి దిగుతారు. ఒకటే కొట్టుకుంటారు. దాదాపు ముప్పాతిక సినిమా ఫైట్ మాస్టర్ల పనే అన్నట్టు వుంటుంది. దర్శకుడి పనేమిటో అర్ధంగాదు. కిందటి శతాబ్దంలో తమిళ డబ్బింగ్ యాక్షన్ సినిమా లొచ్చేవి – కుక్కలు గుర్రాలూ కౌబాయ్ ల ఎడతెరిపి లేని ఫైట్లతో. కృష్ణవంశీ దీన్ని మళ్ళీ కళ్ళకి కట్టారు. 

చివరికేమిటి?  
       పోలీసులు గొప్పోళ్ళే . అందరికీ తెలిసిందే. అయితే ఏమిటి? ఎన్నిసార్లు అదే డబ్బాకొడతారు సినిమాల్లో? వూర మాస్ డైలాగులతో కృష్ణవంశీ లాంటి స్థాయి వున్న దర్శకుడు కూడా డబ్బా కొట్టమేమిటి- నీటుగా చేతలు చూపించకుండా?  ఈకాలపు సినిమా ఎందుకు తీయలేకపోయారు తను. పోలీసు హీరోకి హనుమంతుడి ఇమేజి ఇస్తే,  అతనేం చేశాడు రెండు సార్లూ- మెడకి బాంబులు తగిలించుకుని ఒకటే మొత్తుకు న్నాడు. వాయు
పుత్రుడి వ్యాపకం ఇదేనా? ఇంకో పెద్ద పోలీసాయనేమో ఏమీ చేయకుండా కూర్చుని అరుపులు అరుస్తూంటాడు. మరో యువపోలీసాఫీసర్ ఏదో చావడానికి కూడా అల్లరల్లరై,  బతికించమని బతిమాలుకుని మరీ చస్తాడు. వీళ్ళా పోలీసులు? అసలు చెప్పాలనుకున్న దేమిటి, ఏం చెప్పారు? ఏమీ చెప్పలేదు. ఎందుకంటే....

     కథే  చెప్పాలనుకుంటే ఇదంతా, ఇంత గందరగోళమంతా  వుండదు. చెప్పాలనుకున్నది ‘గాథ’  అయింది. లేదా చెబుతున్నది ‘గాథ’ అని తెలియక చెబుతూ కూర్చున్నారు. ‘మొగుడు’ తో గాథే  ఫ్లాప్ అయ్యింది. వెంటనే ‘పైసా’తో మళ్ళీ గాథే ఫ్లాపయ్యింది. ముచ్చటగా మూడోసారి, నక్షత్రమూ గాథే అయింది. నేర్చుకున్న పాఠమేమిటి? ముచ్చటగా మూడుసార్లు గాథలు తీసిన కృష్ణ వంశీ అని గోడ మీద వ్రాత. మూడు గాథలు- ఆరు వెతలు అని తలవ్రాత. 

     ‘గాథ’ తో అంతంత కమర్షియల్ సినిమాలెలా తీయడానికి సాహసిస్తారు. ‘గాథ’ గాబట్టే అంజనీపుత్రుడైన గాలి హీరోకి గోలీ మార్ గా గోల్ లేదు. పాసివ్ ఆట బంతి అయిపోయాడు. గోల్ లేకపోతే  స్ట్రక్చర్ వుండదు. కృష్ణవంశీ స్ట్రక్చర్ అని దేన్ని అనుకుంటున్నారో. స్ట్రక్చర్ ఏర్పడకపోతే ఏం చెప్తున్నారో అంతుపట్టదు. అనేక విషయాలు చొరబడి పోతాయి. ఇలా ఎటుపోవాలో అంతు పట్టక జీడిపాకంలా సాగుతూ సాగదీస్తూ మూడు గంటలకి చేరింది. హీరో చేయాల్సిన పనులన్నీ  ఎవరెవరో చేసేస్తున్నారు. ఇలా ఇంత జరిగాక, ఇప్పుడు  ‘నక్షత్రం’ తర్వాత కూడా గాథేతోనే ఇంకోటి తీస్తారా? గాథలతోనే కృష్ణవంశీ కాలక్షేపమా? ‘కథలు’ మర్చిపోయారా? లేక రెగ్యులర్ కథలు కాక, అందరికీ భిన్నంగా ఇర్రెగ్యులర్ గాథలతో మార్గదర్శి అవాలనా?

-సికిందర్
http://www.cinemabazaar.in