రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, మే 2022, ఆదివారం

1167 : స్క్రీన్ ప్లే సంగతులు -2


  స్టాఫ్ కథ : ప్రిన్స్ మహేష్ బాబు వ్యాఖ్యానంతో ప్రారంభం - ఓ 800 సంవత్సరాల క్రితం సిద్ధవనం అడవుల్లో గిరిజన గూడెం వుండేది. వందమంది జనాభా. జీవధార నది ప్రవహించేది. అక్కడ యోగులు, మహర్షులు ఎక్కువ సంచరించే వాళ్ళు. తపస్సులు చేసుకునే వాళ్ళు. ఆ గిరిజన గూడేనికి పెద్ద దిక్కుగా వుండే వాళ్ళు. గిరిజనులకి ధర్మం నేర్పారు. అంతేగాక సిద్ధవనం మూలికలతో వాళ్ళకి ఆయుర్వేదం నేర్పి గొప్ప నాగరికతకి బీజం వేశారు. ఎన్ని విపత్తు లొచ్చినా ఈ అడవిని విడిచి పెట్టకూడదని వాళ్ళకి సృష్టి రహస్యాన్ని బోధించారు.

      లా వుండగా ఓ రాక్షస మూక దండెత్తి వచ్చింది. యోగుల తపో బలంతో అమ్మవారు ప్రత్యక్షమై రాక్షస మూకని సంహరించింది. అలా ఘట్టమ్మ అమ్మవారు అక్కడే వుండి పోయింది. జీవధార అవతలి వైపు నిలబడి సిద్ధవనంకి కాపలాగా వుంది. గిరిజనులు అమ్మవారికి గుడి కట్టుకున్నారు. ఆ ప్రాంతానికి పాద ఘట్టం అని పేరుపెట్టారు. ఆ పాదఘట్టం నెమ్మదిగా పెరిగి ఇప్పుడు ధర్మస్థలి అయింది. ఈ ధర్మస్థలిలో ప్రస్తుతం అధర్మ కలాపాలు జరుగుతున్నాయి...

        ఇదీ కథా ప్రారంభం, పరిచయం. ఋషులు గిరిజనులకి ఆయుర్వేదం నేర్పితే?’ అన్న ప్రశ్నతో ఈ కథ చేస్తే ప్రయోగాత్మకమయ్యేది.  What if?  (ఇలా జరిగితే?) అన్న ప్రశ్నని ఆధారంగా  చేసుకుని హాలీవుడ్ లో సినిమాలు తీస్తూంటారు. ఎవరూ చూడలేని చనిపోయిన వ్యక్తుల్ని ఒక బాలుడు చూస్తూంటే?’ అన్న ప్రశ్నతో సిక్స్త్ సెన్స్’, మనం చూస్తున్న ప్రపంచం నిజానికి కంప్యూటర్ ప్రతి సృష్టి అయితే?’ అన్న ప్రశ్నతో మ్యాట్రిక్స్ మొదలైనవి.

        ఇలా ఇప్పుడు ఋషులు గిరిజనులకి ఆయుర్వేదం నేర్పితే?’ అన్న ప్రశ్న కూడా వూహా గానమే అవుతుంది. లేనిది, జరగనిది కల్పన చేసి చూపడం. నిజంగా ఆసక్తి రేపే వూహాగానమే  ఇది. ఋషులేమిటి, అడవిలో వున్న మూలికలతో గిరిజనులకి ఆయుర్వేదం నేర్పడమేమిటి? అలా ఆయుర్వేదం నేర్చుకున్న గిరిజనులు అప్పటికే తమకి తెలిసి వున్న మూలికా వైద్యంతో కలిపి ఇంకేం చేసి వుంటారు? ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అయ్యే  అవకాశముంది. సరదాగా వూహాగాన మాత్రంగా. అంతేగానీ, వాస్తవంలో ఇలా జరిగే అవకాశం లేదు. అసహజ కథ అవుతుంది. అయింది కూడా. అడవిలో వున్న మూలికలు, దాంతో మూలికా వైద్యం ఋషుల కంటే పూర్వమే గిరిజనులకి తెలుసు. మరి అడవిలో వున్న మూలికలతో గిరిజనులకి ఋషులు ఆయుర్వేదం నేర్పడమేమిటి?

నమ్మించని నేపథ్యం

ఋషులు శూద్రులకి శాస్త్రాలు నేర్పడం, సృష్టి రహస్యాలు చెప్పడం, ధర్మాన్ని బోధించడం - ఇదంతా వాస్తవ దూరమైన సెటప్. పైగా మూల వాసులైన గిరిజనులకి ఈ శాస్త్రాలకంటే పూర్వం నుంచీ వాళ్ళ వైద్య పద్ధతులు, జీవన విధానం, విశ్వాసాలు వాళ్ళకున్నాయి. ఇంకో కల్చర్ ని తమ మీద రుద్దితే ఒప్పుకోరు. వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళి ఇంకెవరూ ఏం నేర్పాలన్నా, మార్చాలన్నా నేర్చుకోరు, మారరు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం - ప్రభుత్వ సమగ్ర గిరిజానాభివృద్ధి సంస్థ వైఫల్యం.

        కాబట్టి ఋషులు- గిరిజనులు- సిద్ధవనం, ఆయుర్వేద వృత్తి- అమ్మవారు- పాద ఘట్టం, జీవధార, ధర్మస్థలి - ఈ నేపథ్యమంతా, పాత్రలన్నీ అసహజంగా అన్పిస్తాయి. అసలు ఇదంతా దేనికి? ఈ బిల్డప్ కథకేం ఉపయోగపడింది? అక్కడున్న గిరిజనుల భూములు మైనింగ్  మాఫియాలకి కావాలి - ఇంతేగా స్క్రిప్టుని వొలిచి చూస్తే కథ? ది ఎమరాల్డ్ ఫారెస్ట్ (1985) లో అమెజాన్ అడవుల్లో ప్రభుత్వం డామ్ కట్టే ప్రయత్నం చేస్తే దాన్నెదుర్కొనే రెడ్ ఇండియన్స్ (గిరిజనులు) కథ సూపర్ హిట్ కాలేదా? ఈ మాత్రం సూటి కథ వుంటే సరిపోదా ఆచార్య కి?

        మైనింగ్ మాఫియాకి కావాల్సింది గిరిజనుల అటవీ ప్రాంతం. చెట్లు చేమలు, నీరు, వనరులు, వ్యవసాయంతో కూడిన గిరిజనుల జీవికని లాగేసుకునే దుష్కృత్యం. గిరిజనుల జీవికని లాగేసుకోవడానికి మించిన ఎమోషనల్ అప్పీల్ కథ కింకెక్కడుంటుంది? ఆ భూముల మీద సిద్ధవనం, పాదఘట్టం, ధర్మస్థలి, ఆయుర్వేదం - ఇవన్నీ ఋషులు రుద్దిన పరాయి హంగులే. ఇవి వున్నా లేక పోయినా గిరిజన పాత్రలతో ఎమోషనల్ అప్పీల్ వుండదు. ప్రేక్షకులూ ఫీల్ కారు.

         అల్లూరి సీతారామరాజు లో - విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం మద్రాసు అటవీ చట్టాన్ని పరమ ఆటవికంగా అమలు చేస్తూ గిరిజనుల పొట్ట కొడుతూంటే కదా -అల్లూరి పోరాటానికి దిగింది? కేవలం జీవిక కోసం, పొట్ట కోసం అడవుల్ని నమ్ముకుని వుంటున్న ఆదివాసుల్ని నిరాశ్రయుల్ని చేయడమనే  - జీవిక లాగేసుకుని వాళ్ళ పొట్ట కొట్టడమనే - అన్యాయానికి మించిన పరాకాష్ట ఇంకోటుంటుందా?

కథా ప్రయోజనంతో వాస్తవికత

జీవికని లాగేసుకోవడాన్ని ఇంకో సెటప్ లో చూద్దామా అప్డేట్ చేసి సమకాలీనంగా మార్కెట్ యాస్పెక్ట్, యూత్ అప్పీల్, ఎకనమిక్స్ వగైరాలతో కలిపి? అడవుల్లో తిప్పతీగ అని వన మూలిక వుంటుంది. దీన్ని ఆయుర్వేద ఔషధ తయారీలో ఉపయోగిస్తూంటారు. మహారాష్ట్రకి చెందిన ఒక గిరిజనుడు ఈ తిప్పతీగెని పండిస్తూ కోట్లు ఆర్జిస్తున్నాడు. ఆయుర్వేద కంపెనీలు ఈ తిప్ప తీగె సాగుని కొనుగోలు చేస్తున్నాయి. కరోనా మహమ్మారి అధికం కావడంతో ప్రతీ ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే పనిలో పడ్డారు. దీంతో తిప్ప తీగెలకి డిమాండ్ పెరిగింది. ఇంతేగాక, కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది ఉపాధిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  గిరిజనుడు తిప్పతీగల సాగుచేస్తూ ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు.

         పై స్టోరీ ఐడియా లాజికల్ అప్రోచ్ తో లేదూ? గిరిజనులు తమది కాని ఆయుర్వేద వైద్య వృత్తిని చేపట్టకుండా, ఆయుర్వేద ఔషధ ఉత్పత్తిలో తోడ్పడే వన మూలికని సాగుచేస్తూ, సోదర ఆయుర్వేద శాస్త్రానికి చేయూతనందిస్తున్న లాజికల్ అప్రోచ్? ఉత్తమ - సామాజిక ప్రయోజనం గల కథా రచన?

        ఇలాటి అటవీ భూమిని మైనింగ్ మాఫియా లాక్కుంటే ఎంత మంది పొట్టకొట్టి నట్టవుతుంది...??? దీనికెంత యూనివర్సల్ అప్పీల్ వుంటుంది? కదిలించే ఈ సూటికథ చేయకుండా- విశ్వసనీయత లేని స్టోరీ ఐడియాతో- సమస్య మీద ఫోకస్ లేక- ఫస్టాఫ్ కథాకథనాలూ ఫోకస్ చెదిరి - అత్యంత బలహీన స్క్రీన్ ప్లే చేశారు.

వాయిసోవర్ అయోమయం

        ప్రారంభంలో ప్రిన్స్ మహేష్ బాబుకి వాయిసోవర్ కోసం రాసిన స్క్రిప్ట్ సినిమా చూస్తూంటే అయోమయంగా వుంటుంది. సిద్ధవనం, పాదఘట్టం, జీవధార, ధర్మస్థలి, ఘట్టమ్మ గుడి- ఈ ప్రాంతాలేమిటి, ఏ ప్రాంతం ఏ ప్రాంతానికేమవుతుంది, ఆ ప్రాంతం ఈ ప్రాంతమైతే, ఈ ప్రాంతం ఏ ప్రాంతమవుతుంది- ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఒకటేనా, ఒకటి కాకపోతే ప్రాణాంతకమా - ఇదంతా పరాయీ కరణ చెందిన గిరిజన ప్రాంతమా- చరిత్రలో ఆదివాసుల మీద ద్రవిడ, ఆ తర్వాత ఆర్య వలస వాదమా? ఈ వలస వాదం ఓకే అయితే, ఇక నయా వలస వాదులమని మైనింగ్ మాఫియాలూ ఆ ప్రాంతం మీద హక్కుదార్లే అవుతారా?

        అన్నట్లు సందట్లో సడేమియాగా ఒక ముస్లిం క్యారక్టర్ వుంటుంది. అంటే ఆర్యుల తర్వాత ముస్లింల వలస వాదమా, ఇంకొకటి తగ్గింది- ఇంగ్లీషు క్యారక్టర్. ఇది కూడా వుండి వుంటే బ్రిటిష్ వలస వాదంతో ఆమూలాగ్ర చరిత్ర పుటలు రికార్డయ్యేవి.

        ఇలా బోల్డు కన్ఫ్యూజన్. ఇలా వుంది కథా ప్రారంభం. ఈ కథ ఓ రొటీన్ మాస్ కథయితే ఈ వలసల మీదికి దృష్టి పోదు. ఈ కథని చిరంజీవి నక్సల్ పాత్ర  డ్రైవ్ చేస్తుంది కాబట్టి - ఆ పాత్ర దృక్కోణంలో వలసల మీదికి దృష్టి పోతుంది, జానర్ మర్యాద కొద్దీ. ఈ ప్రాంతంలో గిరిజనులు కాకుండా అసలు వీళ్ళంతా ఎవరూ  - అన్న మార్క్సిస్టు కళ్ళతో చూడదా చిరంజీవి పాత్ర?

తర్వాతి కథ
        పై చారిత్రక నేపధ్యంలో ఇప్పుడు ధర్మ స్థలి మునిసిపాలిటీ టౌనుగా వుంటుంది. గిరిజనులకి సిద్ధ గురుకుల మహా విద్యాలయం కూడా వెలస్తుంది. ఇంకో సంగీత పాఠశాల వుంటుంది. ఇక్కడ నీలాంబరి (పూజా హెగ్డే) సంగీతం నేర్పుతూంటుంది. ఘట్టమ్మ వారి ఆలయానికొక పూజారి (తనికెళ్ళ భరణి) వుంటాడు. ఇతను ప్రతీయేటా అమ్మవారి రథోత్సవం జరిపిస్తూంటాడు. మరో పక్క మందీ మార్బలంతో గిరిజనుడు వేద (అజయ్) ఆయుర్వేద కేంద్రం నడుపుతూంటాడు. ఆయుర్వేదంలో ఇతడి ప్రఖ్యాతి తెలుసుకుని ఓ యూనివర్సిటీ నుంచి ప్రముఖులు వచ్చి కలుస్తారు.

        ఇలా వుండగా, మునిసిపల్ ఛైర్మన్ బసవ (సోనూ సూద్) అని వుంటాడు. ఇతను ధర్మస్థలిలో అక్రమాలు చేస్తూంటాడు హత్యలు సహా. సిటీలో రాథోడ్ (జీశ్శూ సేన్ గుప్తా) అని మైనింగ్ మాఫియా వుంటాడు. ఇతను బసవ ద్వారా మొత్తం ఈ గిరిజన ప్రాంతాన్ని కబళించాలని చూస్తూంటాడు. తాజాగా తనిఖీకొచ్చిన ప్రభుత్వ బృందాన్ని చంపించేస్తాడు బసవ. ఇక అమ్మవారు కాపాడదాని వేద విలపిస్తూంటే, ఖడ్గ ధారియై ఆచార్య (చిరంజీవి) వచ్చేస్తాడు.

        వచ్చి వడ్రంగి పనులు చేస్తూంటాడు నేస్తం నాగులు (వెన్నెల కిషోర్) ఇంట్లో బస చేసి. తనెవరో బయట తెలియకుండా రహస్యంగా వుంచుతాడు. ఓబులు అనే బసవ అనుచరుడు వేదని వేధించి గుండెల మీద తంతే, ఆ కాలు విరగ్గొట్టేస్తాడు ఆచార్య. కాలు విరిగిన ఓబులుకి వేద వైద్యం చేయడాన్ని గమనిస్తాడు ఆచార్య. శత్రువుకైనా వేద వైద్యం చేస్తాడని తెలుసుకుంటాడు.

        సిటీలో రాథోడ్ పార్టనర్స్ తో సమావేశమై సిద్ధవనం అడవులు కబ్జా చేసే విషయం మాట్లాడతాడు. వేరే అడవుల్లో ఆచార్య ఏం చేశాడో తెలుసుగా అని ఓ పార్టనర్ అంటాడు. అడవుల్లో రాథోడ్ అనుచరుల్ని ఆచార్య కామ్రేడ్ ఆచార్యగా చంపుతున్న దృశ్యం పడుతుంది. దీంతో ఆచార్య నక్సల్ అని మనకి అర్ధమవుతుంది. ఇది గుర్తు చేసుకుని ఆచార్య మీద మరింత  రగిలిపోతాడు రాథోడ్.

        ధర్మస్థలిలో నీలాంబరి ఒక చిన్నపిల్లకి సంగీతం నేర్పడం గురించి మాట్లాడుతూంటే, నీలాంబరిని గుర్తు పట్టినట్టు చూస్తాడు ఆచార్య. ఒక దేవఘట్టమ్మ అనే గిరిజన అమ్మాయిమీద జరుగుతున్న అత్యాచార యత్నాన్ని ఎదుర్కొని, దుండగుల్ని చిత్తుగా తంతాడు ఆచార్య. ఈ అత్యాచార యత్నం సిద్ధ గురుకుల మహా విద్యాలయంలో జరుగుతుంది. ఇది సిద్ధ (రామ్ చరణ్) చదువుకున్న పవిత్ర విద్యాలయమని దుండగులకి చెప్తాడు ఆచార్య. సిద్ధ ధర్మస్థలి కోసం చేసిన త్యాగం మీకు తెలీదంటాడు. సిద్ధ స్లోమోషన్ దృశ్యం పడుతుంది. దీంతో సిద్ధ గురించి కొంత మనకి తెలుస్తుంది.

        సంగీతం నేర్చుకుంటున్న చిన్నపిల్ల ఫ్లూటు కొనిమ్మంటే తన తండ్రి కొనివ్వడం లేదని ఆచార్యకి చెప్పుకుంటుంది. ఆచార్య పెట్టెలోంచి ఒక ఫ్లూటు తీసిస్తాడు. ఆ ఫ్లూటుని నీలాంబరి గుర్తుపట్టి తండ్రియైన పూజారితో వచ్చి ఆచార్యని అడుగుతుంది. ఆ ఫ్లూటు సిద్ధదని చెప్తాడు ఆచార్య. సిద్ధ మీకు తెలుసాంటే తెలుసంటాడు.

        సిద్ధ వెళ్ళిపోయినప్పట్నుంచీ బసవ ఆగడాలు పెచ్చుమీరిపోయాయనీ, రేపు అమ్మవారి రథోత్సవం వుందనీ, ఈ రథోత్సవాన్ని ప్రారంభించడానికి ఎప్పటిలాగే బసవ వస్తాడనీ, ఇది భరించలేకపోతున్నాననీ ఆచార్యకి చెప్పుకుంటాడు పూజారి.

       ఆచార్య రథోత్సవ ప్రారంభోత్సవంలో చాటుగా బసవ చేతుల్ని గాయపర్చి అడ్డుకుంటాడు. తన చేతుల్ని గాయపర్చిందెవరో అర్ధంగాక వాణ్ని పట్టుకోమని ఆదేశిస్తాడు బసవ.

        బసవ దగ్గరికి రాథోడ్ వచ్చి ప్లాన్ మాట్లాడతాడు. ఏదో వొక తప్పు చేయించి ఇక్కడి ప్రజల్ని వెళ్ళగొట్ట మంటాడు. బసవ ఆయుర్వేద మందుల్లో విషం కలిపి జనం ప్రాణాల మీదికి తెస్తాడు. దీంతో వేద దోషిగా నిలబడతాడు. బసవ అనుచరుల దాడిలో వేద చనిపోతాడు. దీంతో ధర్మస్థలి ఖాళీచేసి ప్రజలు వెళ్ళి పోతూంటారు. ఆచార్య ఆపి బసవ అనుచరుల మీద దాడి చేస్తాడు. బసవ దగ్గరి కెళ్ళిపోయి తను కామ్రేడ్ ఆచార్యనని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఇక సిద్ధ ఎంటరవుతున్నట్టు దృశ్యం పడుతుంది. సిద్ధ సిద్ధం అని అక్షరాలు పడి, ఇంటర్వెల్ తో ఫస్టాఫ్ కథ ముగింపు కొస్తుంది.

నాన్ కమర్షియల్ స్క్రీన్ ప్లే

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో ప్రేక్షకులు ఎంతో వూహించుకుంటారు. ఇద్దరూ కమర్షియల్ కథాకథనాలతో వూహించని వీక్షణానుభవాన్నిస్తారని ఆశిస్తారు. కానీ మొదటి పదీ పదిహేను నిమిషాల్లోనే కథ నడక చూసి అట్టర్ ఫ్లాపని చెప్పేసే స్థితిలో దీని స్క్రీన్ ప్లే వుంది. సినిమా విడుదలైన మొదటి పదిహేను నిమిషాల్లోనే అట్టర్ ఫ్లాపైన పరిస్థితి ఆచార్య ది.

        ఆచార్య బడ్జెట్ 140 కోట్లు అనుకుంటే, స్క్రీన్ ప్లే కోసం రాసిన ప్రతి వొక్క పేజీ సుమారు 9 లక్షల రూపాయల విలువ చేయాలి. పేజీకి 9 లక్షల రూపాయల విలువైన  వ్రాత యేం రాశారబ్బా అన్పించి గుండె ఝల్లుమంటుంది. ఏ పేజీలోనూ రక్తి కట్టించే, ఆసక్తిపర్చే విషయం ఒక్కటీ లేదు- మార్కెట్ యాస్పెక్ట్ పరంగానూ, క్రియేటివ్ యాస్పెక్ట్ పరంగానూ. 140 కోట్ల బడ్జెట్ కి బాక్సాఫీసు 70 కోట్లే వచ్చింది. అంటే రాసిన పేజీలు బడ్జెట్లో సగమే రాబట్టాయి. రాసిన ఒక్కో పేజీ 9 లక్షల బడ్జెట్ ని డిమాండ్ చేస్తే, రాబట్టింది 4.5 లక్షలే. ఇదీ క్రియేటివిటీ స్థాయికి సూచిక.

        ఫస్టాఫ్ స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ అనేది కన్పించదు. ఫస్ట్ యాక్ట్ ఎలా వుండాలి, ఎంత వుండాలి స్పృహ లేదు. ప్లాట్ పాయింట్ వన్ ఎక్కడుండాలి, అదెలా వుండాలి లేదు. యాక్టివ్ క్యారక్టర్ పాత్రచిత్రణ లేదు. సీన్స్ డైనమిక్స్ తో, కాజ్ అండ్ ఎఫెక్ట్ తో కదలవు. సీన్స్ కి విజువల్ రైటింగ్ లేదు. స్టోరీ మేకింగ్ లేదు, ప్రింట్ మీడియాకి పనికొచ్చేట్టు స్టోరీ రైటింగే వుంది. అదీ పాసివ్ గా వుంది. డైలాగులూ పాసివ్ గా వున్నాయి (పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా, అందరూ ఆచార్య అంటూంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో), సన్నివేశాల్లో, ఫైట్స్ లో ఎమోషనల్ అప్పీల్ ఎక్కడా కన్పించదు. నవరసాలు మొత్తం కాకపోయినా కొన్నైనా లేవు. ప్రణయ, హాస్య రసాల్లేక యూత్ అప్పీల్ లేదు, అసలేమీ లేదు. కథనంలో ఇంకో తేడా ఏమిటంటే కథకుడు ప్రేక్షకులకి కథ చెప్తున్నట్టు వుండదు, తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు, గొణుక్కుంటున్నట్టు వుంటుంది! పరికించి ఏ దృశ్యమైనా చూడండి, ఇదే అనుభవమవుతుంది. ఆత్మాశ్రయ ధోరణీయే ఈ కథా ధార, జీవధార నదీ వార.

ఫస్ట్ యాక్ట్ పరిస్థితి
        ఫస్ట్ యాక్ట్ కథనంలో ధర్మస్థలి మునిసిపాలిటీ అన్నారు గానీ అది పంచాయితీ స్థాయిలో కూడా లేదు.  సిద్ధ గురుకుల మహా విద్యాలయం వుంటుంది గానీ విద్యార్థులుండరు. ఇంకో సంగీత పాఠశాల వుంటుంది గానీ నేర్పేది కర్ణాటక సంగీతమే, గిరిజన పాటలు, నాట్యాలూ కాదు.

        1976 లో కృష్ణంరాజు, బాపు దర్శకత్వంలో  నటించి నిర్మించిన సూపర్ హిట్ గిరిజన కథ, భక్తకన్నప్ప లో పాటలన్నీ గిరిజన సాహిత్యమే- ఒకటి తప్ప. అన్నీ ఇప్పటికీ హిట్టే. సాంప్రదాయ కళల బాపుగారు కమ్యూనిస్టు దృక్పథపు గిరిజన సినిమా భక్తకన్నప్ప తీశారు. డైలాగుల్లో కమ్యూనిజమే వుంటుంది. పాత్రల పేర్లు కూడా గిరిజనుల పేర్లే వుంటాయి. కృష్ణం రాజు పాత్ర పేరు తిన్నడు. గిరిజనుడు కాబట్టి హిందూ దేవుళ్ళని నమ్మడు, నాస్తికుడు. కానీ ఆచార్య లో ఆయుర్వేద మందులు తయారు చేసే అజయ్ నటించిన గిరిజన పాత్రకి వేద అని ఆర్యన్ నామం! గిరిజనుల సంస్కృతి అనే జానర్ మర్యాదని హైందవ ఆచారాలతో కప్పిపుచ్చేశారు.

         భక్తకన్నప్ప లో గిరిజనుల మీద కుట్రలు చేసే పాత్రలుగా కైలాస నాథ శాస్త్రి (రావు గోపాలరావు), కాశీనాథ శాస్త్రి (సారధి) అని చూపించడానికి మొహమాటపడలేదు బాపూ రమణలు.

        ఆచార్య ప్రారంభ దృశ్యాల్లో ఆయుర్వేదంలో వేద గడించిన ఖ్యాతి తెలుసుకుని యూనివర్సిటీ నుంచి ప్రముఖులు వచ్చి కలిసే సీను, రాధేశ్యామ్ ప్రారంభ దృశ్యాల్లో రోదసీ శాస్త్రవేత్తలు జ్యోతిష పండితుడు (కృష్ణం రాజు) ని కలిసే సీనూ ఒకటే.  

        ధర్మస్థలి చరిత్ర చెప్పి, కొన్ని పాత్రల్ని పరిచయం చేసి, మునిసిపల్ ఛైర్మన్ గా బసవ అనే విలన్ దురాగతాల్ని ఎస్టాబ్లిష్ చేసి- 15వ నిమిషంలో ఆచార్య పాత్రలో చిరంజీవిని ప్రవేశ పెడితే అది ఫస్ట్ యాక్ట్ అయిపోతుందా?

        ఫస్ట్ యాక్ట్ అవ్వాలంటే 1. కథా నేపథ్యం ఏర్పాటు, 2. పాత్రల పరిచయం, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, 4. సమస్య ఏర్పాటు- ఇవీ జరగాలి. వీటిలో మొదటి రెండే జరిగాయి. మూడోదీ నాల్గోదీ  లేకుండా కథానాయక పాత్ర ఎంటరైపోయింది. ఇలా ఫస్ట్ యాక్ట్  అసంపూర్ణంగా వుంది కాబట్టే చిరంజీవి ఎంట్రీ ఇంత పేలవంగా వుంది. ఫస్ట్ యాక్ట్ ముగిసిన ఈ ప్లాట్ పాయింట్ వన్ సీన్లో, అతను మామూలు మనిషిలా నడుచుకుంటూ ధర్మస్థలికి వచ్చి, వడ్రంగిగా నాగులు ఇంట్లో  బస చేస్తాడు...

        ఓ మైగాడ్! అసలేం చేయాలనుకున్నారు మెగా స్టార్ స్క్రీన్ ప్లేతో? స్క్రీన్ ప్లేలో స్టార్ ప్లే లేకుండా? ఎన్ని టెంప్లెట్లు తెచ్చి కలిపి కిచిడీ చేయాలనుకున్నారు? పేజీకి 9 లక్షలు ఖర్చు పెట్టిస్తూ చిరంజీవిని అరిగిపోయిన పాత ఫ్యాక్షన్ సినిమా టెంప్లెట్ లో చూపాలనుకున్నారా?

        వున్న వూళ్ళో ఏదో జరిగి అజ్ఞాతవాసంలో కెళ్ళిపోయిన హీరో, ఇంకేదో వృత్తి చేసుకుంటూ జీవించే లాంటి అరిగిపోయిన పాత ఫ్యాక్షన్ టెంప్లెట్? ఇలా వొక గతాన్ని వుంచుకుని, ధర్మ స్థలికొచ్చి వడ్రంగి పనితో ఆచార్య అజ్ఞాత వ్రతం? ఫస్ట్ యాక్ట్ స్ట్రక్చర్ ని దెబ్బతీస్తూ బలవంతంగా, పేలవంగా కథలోకి ఎంట్రీ? ఇందుకే ఇది నాన్ కమర్షియల్ ఎంట్రీగా దెబ్బకొట్టింది. ఇక్కడే సినిమా అట్టర్ ఫ్లాప్ అన్పించుకుంది. ఫస్ట్ యాక్ట్ ని సరీగ్గా సెటప్ చేయకపోతే కథలో ఇంకేదీ సెట్ కాదు. ఇది అలనాటి విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు బిల్లీ వైల్డర్ హెచ్చరిక! ఫస్ట్ యాక్ట్ ని సరీగ్గా సెటప్ చేయకపోతే కథలో ఇంకేదీ సెట్ కాదంతే!

        ఫస్ట్ యాక్ట్ బిజినెస్ లో మూడో టూల్ ఏమిటి? సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన. ఈ కథకి ఏమిటా సమస్య? మైనింగ్ మాఫియా భూములాక్రమించే కుట్ర. ఆల్రెడీ ఆఫ్ స్క్రీన్ లో ఈ ప్లానుతో బసవతో బాటు మాఫియా రాథోడ్ వున్నాడు. గతంలో వేరే అడవుల్లో ఆచార్య కామ్రేడ్ గా ఇలాటిదే రాథోడ్ ప్లానుని విఫలం చేశాడని- రాథోడ్ పార్టనర్స్ మీటింగులో - మున్ముందు కథలో వెల్లడవుతుంది కూడా.      

        ఇలాంటప్పుడు ఫస్ట్ యాక్ట్ లో బసవ పాత్ర ఎలా వుండాలి? ధర్మ స్థలిని ఖాళీ చేయించే బెదిరింపులతో, దౌర్జన్యాలతో ప్రారంభమవాలి. అంతేగానీ పూజారి వాపోతున్నట్టు మద్యం, వ్యభిచారం, హత్యలు వంటి చిల్లరపనులతో ధర్మస్థలిని అధర్మ స్థలిగా మారుస్తూ కాలక్షేపం చేయడం కాదు- వెంటనే థింక్ బిగ్ అన్నట్టు ధర్మస్థలినే కాజేసే ఎజెండానే అమలు చేయడం. అంటే ఫస్ట్ యాక్ట్ ఎత్తుగడే ధర్మ స్థలిని కాజేసే కుట్రతో డైరెక్టుగా పాయింటు కొచ్చేయడం. 

        అప్పుడు ఇది కథ అన్పించుకుంటూ బలంగా వుంటుంది. ఫస్ట్ యాక్ట్ బిజినెస్ లో మూడో టూల్ ఏమిటనుకున్నాం? సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చేయడం... ఏమిటా సమస్య? మొత్తం సిద్ధవనంలో భూమూలాక్రమించే కుట్రని ధర్మస్థలితో ప్రారంభించడ మనుకుందాం...

        అప్పుడు  బసవ ఒకటొకటే చేసుకొస్తూ ఫస్ట్ యాక్ట్ చివర్లో ధర్మస్థలికి బ్యాంగ్ ఇవ్వబోవచ్చు. ప్రజల హాహాకారాలు చెలరేగుతాయి- ఇంకొన్ని క్షణాల్లో ధర్మ స్థలిని లేప్పారేస్తాడు- సరీగ్గా అప్పుడు ఆచార్య ఎంట్రీ ఇచ్చి బిగ్ యాక్షన్ కి తెర తీయొచ్చు...

కమర్షియల్ ఈవెంట్

        ఇలా ఫస్ట్ యాక్ట్ ని ముగిస్తూ ఈ ప్లాట్ పాయింట్ వన్ లో - బసవని ఆచార్య ఎదుర్కొనే బిగ్ యాక్షన్ కి తెరతీయడం. ప్రేక్షకులు ఎవరెవరి జేబుల్లో ఎన్నెన్ని డబ్బులున్నాయో, అవన్నీ బుకింగ్స్ లో నిలువు దోపిడీ లిచ్చుకునే  అల్ట్రా బిగ్ యాక్షన్ కమర్షియల్ ఈవెంట్!

        ఆచార్య స్క్రీన్ ప్లే సంగతులు మొదటి వ్యాసంలో చెప్పుకున్నట్టు, చిరంజీవి పాత్రని లెజెండ్ కి తక్కువ చేసి చూపిస్తే సినిమా క్యాలిబర్ ని తగ్గించడమే. అతను గుట్టు చప్పుడు కాకుండా కూర్చునే ఫ్యాక్షన్ క్యారక్టర్ కాదు- గుండెల్లో గుబులు పుట్టించే లెజెండ్ క్యారక్టర్. ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో, ప్రాంతాన్ని కాజేసే బసవ కుట్ర అమలవడం, దాన్ని మెరుపులా వచ్చేసి లెజెండ్ ఆచార్య ముక్కలు చేయడం జరిగితే - పాయింటు ఎస్టాబ్లిష్ అయిపోయి- కథ కూడా ప్రారంభమైపోతుంది నస పెట్టకుండా!

        ఫస్ట్ యాక్ట్ కి స్ట్రక్చర్ లేకపోవడం వల్లేకదా ఇంటర్వెల్లో కూడా పాయింటు ఎస్టాబ్లిష్ కాక, కథే ప్రారంభం కాలేదు...? ఫస్ట్ యాక్ట్ ని సరీగ్గా సెటప్ చేయకపోతే కథలో ఇంకేదీ సెట్ కాదంతే...

        ప్లాట్ పాయింట్ వన్ లో హీరో విలన్లు ముఖా ముఖీ అవకపోతే కథేమిటో ఎలా అర్ధమవుతుంది? విలన్ వల్ల ఏర్పడ్డ సమస్యని జయించే లక్ష్యం (గోల్) హీరో కెలా ఏర్పడుతుంది?

        లెజెండ్ మూవీస్ ఓపెన్ వార్ తో వుంటాయి. ఆచార్యలాగా చాటుగా విలన్ చేతులు గాయపర్చడం లాంటి దాగుడు మూతలతో వుండవు. ఇటీవల పోప్ ఫ్రాన్సిస్ ఒక మాటన్నాడు - నాటో దేశాలు రష్యా గుమ్మంలో కుక్కల్లా మొరగడం వల్లే యుద్ధం వచ్చిందని. ఆచార్య అలా యుద్ధం ప్రారంభించాలి- ఓపెన్ వార్. అంతేగానీ రష్యన్ అధ్యక్షుడు పుతిన్ రహస్యంగా యుక్రేన్ వెళ్ళి వడ్రంగిలా బసచేసి - చాటుగా వుండి యూక్రేన్ అధ్యక్షుడు జెలెంస్కీ  చేతులు కసిక్కున రక్కి రక్కి పారెయ్యాలని చూళ్ళేదు. యూక్రేన్ ని (ధర్మస్థలిని) నాటో దేశాల్లో (మైనింగ్ మాఫియాలో) కలిపేసి నాకే ఎసరు పెడతావా అని ఓపెన్ గా బాంబులు కురిపించడం మొదలెట్టాడు...

సెకెండ్ యాక్ట్ -1 పరిస్థితి
        ఆచార్య వడ్రంగిగా బస చేశాక సెకెండ్ యాక్ట్ -1 ప్రారంభమై, ఒకదాని వెంటే ఇంకోటి నాల్గు ఎపిసోడ్లతో ఇంటర్వెల్ వరకూ సెకెండ్ యాక్ట్ -1 వుంటుంది. బసవ అనుచరుడు ఓబులు వేదని తన్నాడని ఆచార్య వాడి కాలు విరగ్గొట్టడం. దేవఘట్టమ్మ అనే గిరిజన అమ్మాయిమీద అత్యాచార యత్నాన్ని ఎదుర్కోవడం,  రథోత్సవంలో చాటుగా ఆచార్య బసవ చేతుల మీద కత్తితో గీరడం (ఇది రాస్తున్నప్పుడల్లా నవ్వొస్తోంది), బసవ ఆయుర్వేదంలో విషంకలిపి ధర్మస్థలిని ఖాళీ చేయించే కుట్రని ఎదుర్కొని ఆచార్య బసవకి వార్నింగ్ ఇవ్వడం.

        ఈ నాల్గు ఎపిసోడ్లూ పొడిపొడిగా వెళ్ళి పోతాయి. దేనికీ ఎమోషనల్ అప్పీల్ లేకపోవడమే గాక, ఏవీ చిరంజీవి చేయాల్సిన ఎపిసోడ్లుగా వుండవు. విలన్ తో నేరుగా యుద్ధం ప్రారంభించి ఒకదాని తర్వాతొకటి బిగ్ యాక్షన్ బొనంజాలు ప్రేక్షకులకివ్వకుండా, చిన్న చిన్న విషయాలతో సరిపెట్టాడు. వేద ని తన్నినందుకు రియాక్ట్ అవ్వాలంటే, వేదతో ఆచార్యకి బాండింగ్ వుండాలి. అప్పుడు యాక్షన్లోకి దిగితే ఎమోషనల్ అప్పీలుంటుంది. గిరిజనురాలి మీద అత్యాచారాన్ని ఎదుర్కొనేప్పుడు కూడా ఆమె ఎవరో ఆచార్యకి తెలీక పోవడం వల్ల, ప్రేక్షకులు నిర్లిప్తంగా చూడడం. అసలు ఆమె స్థానంలో వుండాల్సింది నీలాంబరి (పూజా హెగ్డే) పాత్ర! అప్పుడే ఎమోషనల్ అప్పీళ్ళూ ఈలలూ చప్పట్లూ.

        దుండగులతో ఫైట్ చేస్తూ, గిరిజనురాలిని అమ్మవారి పాట పాడమంటాడు... గిరిజనురాలి నోటి వెంట సంస్కృత శ్లోకాలు ఫైట్ ని ఎలివేట్ చేయకపోగా ఎలిమినేట్ అయ్యేలా చేశాయి. గిరిజనుల మీద అడుగడుగునా సాంప్రదాయవాదం సవారీ చేయడం.

        ఇక... ఇక...రథోత్సవంలో ఆచార్య దాక్కుని... బసవ చేతుల్ని...LOL! LOL!! LOL!!!... మెగా స్టార్ తో ఇంత సిల్లీగానా? ఎన్ని పేజీలు రాశారో ఈ సీను, అన్ని 9 లక్షలు అంతేగా?

        ఇక బసవ ఆయుర్వేదంలో విషంకలిపి ధర్మస్థలిని ఖాళీ చేయించే కుట్రని ఎదుర్కొని ఆచార్య బసవకి వార్నింగ్ ఇవ్వడం. ఈ ఇంటర్వెల్ సీన్లో మొదటిసారి ఇప్పటికీ ముఖాముఖీ అవడం! ఇలా ఎందుకు చేస్తున్నావని బసవ అంటే-

దివ్య వనమొక వైపు
తీర్ధ జల మొక వైపు
నడుమ పాద ఘట్టం

-అని ఆచార్య సమాధానం. బసవకి ఏదో అర్ధమవుతుంది. ఏమిటది? ఏమో! దాంతో- రామ్ చరణ్ విజువల్స్ తో సిద్ధ సిద్ధంఅని చప్పిడి భాషలో ఇంటర్వెల్. ఇలా ఫస్టాఫ్ కథ ఇంటర్వెల్లో ఏం ఎస్టాబ్లిష్ అయిందో తెలియకుండా పోయింది.

        సెకండ్ యాక్ట్ -1 ధర్మం ప్రకారం ఏర్పాటైన సమస్యతో హీరో విలన్ల మధ్య యాక్షన్ - రియాక్షన్ల సంఘర్షణ జరగాలి. ఇంటర్వెల్లో కూడా సమస్యే ఏర్పాటు కాకపోతే సమస్యతో హీరో విలన్ల పోరాటం ఇంకెక్కడ వుంటుంది. ఇలా ఫస్ట్ యాక్ట్ ధర్మంతో బాటు, సెకండ్ యాక్ట్ -1 ధర్మమూ లేక - ధర్మస్థలి సంగతేమో గానీ - ముందు స్క్రీన్ ప్లే అధర్మ కార్యకలాపాలతో నిండిపోయింది.

పాత్రోచితానుచితాలు

ఆచార్య సిద్ధ గురించి చెప్తున్నప్పుడు సిద్ధ మాంటేజ్ వేయడం, రాథోడ్ ఆచార్యని తల్చుకున్నప్పుడు, ఆచార్య నక్సల్ గెటప్ లో కామ్రేడ్ గా చేసే యాక్షన్ మాంటేజ్ వేయడం ఏమీ వర్కౌట్ కాలేదు.  ఆచార్య క్యారక్టర్ యాక్టివ్ క్యారక్టర్ కాకపోవడం చాలా పెద్ద లోపం. పైన చెప్పుకున్న నాల్గు ఎపిసోడ్లలో ఏం జరుగుతోందో ఇంకొకళ్ళు చెప్తే గానీ తెలీని పాసివ్ రియాక్టివ్ క్యారక్టర్ గా వున్నాడు ఆచార్య. కల్తీ ఆయుర్వేదంతో నేరం మీద పడి ప్రజలు వూరు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఎదురు పడేవరకూ, జరిగిన అంత పెద్ద సంఘటన ఆచార్యకి తెలీనే తెలీదు. ఆచార్య ధర్మస్థలిలో కాక ఇంకెక్కడ వుంటున్నట్టు?

        పిల్ల అడిగిందని పిల్లన గ్రోవి ఇచ్చేస్తాడు. అది సిద్ధ జ్ఞాపకంగా తను వుంచుకున్న పిల్లన గ్రోవి. ఎలా ఇచ్చేస్తాడు? కథా సౌలభ్యం కోసం అలా ఇప్పించేశాడు కథకుడు. అప్పుడా పిల్ల దగ్గర పిల్లన గ్రోవిని నీలాంబరి చూడాలి, ఆమె వచ్చి సిద్ధ మీకు తెలుసాని ఆచార్యని అడగాలి. అప్పుడు సిద్ధ- నీలాంబరిలు ప్రేమికులని మనకి తెలియాలి - ఇందుకోసం ఈ రాంగ్ సీను. నీలాంబరి కూడా ఆ పిల్లన గ్రోవిని పిల్లకిచ్చేస్తే ఏమీ ఫీల్ కాదు. పట్టనట్టే వుంటుంది. అలావుంది సిద్ధ మీద ఆమె ప్రేమ.  

        సిద్ధ ఆచార్యకి అంత కావాల్సిన వాడైతే, ఏ రాత్రైనా కనీసం ఒక్కసారి ఆచార్య పిల్లనగ్రోవి వూదాలి. అది విని నీలాంబరి రావాలి- ఇక్కడ మనస్సుని హత్తుకునే సీను పడాలి. ఆ పిల్లన గ్రోవి ఆమె సొంతమవాలి. హత్తుకునే సీన్లు, కదిలించే సీన్లు ఈ సినిమాలో ఆశించకూడదు.

        ఇక విలన్ల వ్యవహారం. మెగాస్టార్ కి ప్రత్యర్ధిగా ఆఫ్టరాల్ ఓ మునిసిపల్ ఛైర్మన్ ఏమిటి? ఏనాటి సినిమా ఇది. వెనుక పెద్ద మాఫియా వున్నాడు కదా అనొచ్చు. ఆపరేటివ్ విలన్ మునిసిపల్ ఛైర్మన్ బసవేగా? ఇక ఆచార్య నక్సల్ పాత్ర నక్సల్ భావజాలంతో వుండదు. సీక్రెట్ గా వుంటున్న ఫ్యాక్షన్ హీరోలాగా ఫీలవుతూంటాడు...

—సికిందర్