రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, మే 2014, శుక్రవారం


   రివ్యూ..         

                              సృజనాత్మక నివాళి!
రచన- దర్శకత్వం : విక్రమ్ కె. కుమార్
తారాగణం : అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సమంతా, శ్రియ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ  తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్ - ఛాయాగ్రహణం :  పి ఎస్ వినోద్ - కళ : రాజీవన్ - ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
యాక్షన్ : విజయన్ - నృత్యాలు : బృంద  - సంభాషణలు : హర్షవర్ధన్
బ్యానర్ : అన్నపూర్ణా స్టూడియోస్  - నిర్మాతలు : అక్కినేని కుటుంబం
విడుదల :  23 మే, 2014 - సెన్సార్ : U/A
***
డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు నిండు జీవితం సెలెబ్రేషన్ ఆఫ్ లైఫ్ అయినట్టు ఆయన నటించిన చివరి చలనచిత్రం సెలెబ్రేషన్ ఆఫ్ న్యూ యేజ్ తెలుగు సినిమా.  ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే నవరసాల పనోరమా. ఈ శుక్రవారం నుంచి మల్టీ స్టారర్ సినిమాలకి కొత్తర్ధం చెబుతూ కొత్త శకం ప్రారంభమయిందని చెప్పొచ్చు.

దర్శకుడు విక్రం కుమార్ ముందుగా ’ఇష్క్’ తో ప్రూవ్ చేసుకున్నాకే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మీద సాహసించి చె య్యేసేందుకు అనుమతి లభించింది. వేసిన చెయ్యి సరాసరి అక్కినేనికి నిజమైన సృజనాత్మక నివాళి అయి నిరూపించుకుంది. ఒక కుటుంబంలోని మూడు తరాలకి చెందిన నల్గురు హీరోలతో కొత్తతరహా కథా సంవిధానంతో కట్టిపడేసే చాతుర్యం ఈ దర్శకుడిది.

మల్టీ స్టారర్ ‘మనం’ వాణిజ్య సినిమాలతో వుండే అన్ని మూఢ విశ్వాసాల్నీ బద్దలు కొడుతూ, మూస పద్ధతుల అన్ని సంకెళ్ళనీ తెంపేసుకుంటూ, తెలుగు ప్రేక్షకులు సినిమా నిరక్షరాశ్యులనే స్థిరపడిన నమ్మకాల్ని, అవకరాల్ని  అపహాస్యం చేస్తూ ఇవాళ బిగ్గెస్టు బాక్సాఫీసు బొనంజా అయికూర్చుంది.

దీని క్రెడిట్ ఎల్లప్పుడూ కొత్తదనాన్ని ప్రోత్సహించే అక్కినేని నాగార్జునకి పోతుంది. ‘మనం’ సినిమా చూడకపోతే మనోలోకాల లోతుల సెలెబ్రేషన్ కి మనుషులు దూరమైనట్టేనని లాకులు ఎత్తేసి మరీ చెబుతున్నారు...


వందేళ్ళ ప్రయాణంలో బంధాలు!
1920లో ప్రారంభమై, ప్రస్తుత కాలానికి ఐదారేళ్ళు ముందుకెళ్ళి 2020 లో ముగిసే శతాబ్ద కాలపు ఈ పునర్జన్మల సైకో ఎనాలిసిస్ కథ,  1983లో ప్రారంభమై ఇలా సాగుతుంది... రాధామోహన్ (నాగ చైతన్య), కృష్ణవేణి (సమంత) లు పెళ్ళిచేసుకుని బిట్టూ అలియాస్ నాగేశ్వరరావు ని కంటారు. నాగేశ్వరరావు ఐదారేళ్ళు వున్నప్పుడు ఇద్దరూ కొట్లాడుకుని విడిపోదామనుకుంటారు. లాయర్ ని కలవడానికి కారులో బయల్దేరినప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోతారు. ముప్పై ఏళ్ల తర్వాత బిట్టూ అలియాస్ నాగేశ్వరరావు (నాగార్జున) బిజినెస్ మ్యాగ్నెట్ గా ఎదిగి ఓ పెద్ద కార్పొరేట్ సంస్థ నడుపుతుంటాడు. ఓరోజు ఫ్లయిట్ లో పక్కసీట్లో కూర్చున్న కాలేజీ స్టూడెంట్ ని చూసి స్టన్ అవుతాడు. ఈ స్టూడెంట్ నాగార్జున (నాగచైతన్య) అచ్చం తన తండ్రి రాధా మోహన్ లాగే ఉండడంతో తండ్రే మళ్ళీ పుట్టాడని - నాన్నా-  అంటూ దగ్గరవుతాడు. తండ్రే మళ్ళీ పుడితే తల్లికూడా పుట్టే ఉంటుందని ఆమెకోసం వెతుకుతుంటాడు.


ఇంకో బిజినెస్ మేనేజ్ మెంట్ స్టూడెంట్ గా అచ్చం తన అమ్మలాగే ప్రియ (సమంత) కన్పించడంతో అమ్మా అని పిలుస్తూ ఆమెకి దగ్గరవుతాడు. ఇలా  అమ్మానాన్నలతో  ఇంటరాక్ట్ అవుతూ  గతజన్మలో పోట్లాడుకుని విడిపోయిన వీళ్ళిద్దర్నీ కలిపేదెలా అని లోచిస్తున్నప్పుడు, ఒక యాక్సిడెంట్ కేసులో డాక్టర్ అంజలి(శ్రియ) పరిచయమవుతుంది. ఈమె కోరిక మీద ఆ ప్రమాద  బాధితుడు చైతన్య (అక్కినేని నాగేశ్వర రావు ) కి రక్తదానం చేయడాని నాగేశ్వర్రావు వెళ్ళినప్పుడు,  అక్కడ ఎనభై ఏళ్ల చైతన్య వీళ్ళిద్దర్నీ పూర్వ జన్మలో తన తల్లిదండ్రులుగా గుర్తించి ఎక్సైట్ అవుతాడు. 1920లలో వీళ్ళిద్దరూ లక్ష్మీ- సీతారాముడులు!

గతజన్మలో ప్రియ, నాగార్జునలు నాగేశ్వరరావు తల్లిదండ్రులైతే, నాగేశ్వర్రావూ అంజలిలు చైతన్య పేరెంట్స్ అన్నమాట. ఆర్టిస్టులుగా చెప్పుకుంటే, నాగ చైతన్య నాగార్జున తండ్రి అయితే, నాగార్జున అక్కినేని నాగేశ్వర రావు తండ్రి అన్నమాట!

ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే సరికొత్త కాన్సెప్ట్, కాంబినేషన్లు. ఇలా సూపర్ స్టార్ల కుటుంబాలతో చాలా సినిమాలొచ్చాయి. అవన్నీ రొటీన్ మూస ఫార్ములా సినిమాలే. కొన్నయితే వాళ్ళ  వంశాలదే గొప్ప అన్న టైపులో ఇగోలకి పోయిన చిత్రీకరణలు. ‘మనం’లో ఈ మూస లేదు, మీసాలు తిప్పడాలూ లేదు. మనమంటూ .. సినిమాచూసే ఆబాలగోపాలాన్నీ తమతో బాటూ కలుపుకుపోయే సమ్మిళిత వినోదాల పంట. ఓ పాత పాటని గుర్తు తెచ్చుకుంటే, ‘రానున్న విందులో నీవంతు అందుకో’ అని ప్రేక్షకుల్ని సమాదరించిన  నిరాడంబరత. అక్షరాలా ప్రేక్షకులు అక్కినేని కుటుంబపు ఈ సెలెబ్రేషన్ లో తామూ పాలుపంచుకుంటున్న ఫీలింగ్ ని పంచిపెట్టిన హ్యూమిలిటీ.

తమిళ-తెలుగు సినిమాల దర్శకుడు విక్రం కుమార్ - మిమ్మల్ని ఇంద్రుల్నీ చంద్రుల్నీ చేసి చూపిస్తానని అక్కినేని హీరోలతో చెప్పివుండొచ్చు. దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చి వుంటే ఈ సినిమా గురించి ఇవ్వాళ్ళ చెప్పుకోడానికి ఏమీ వుండేది కాదు. ఎన్నో జన్మలు, పునర్జన్మలు –ఏంతో సంక్లిష్టత-అయినా చాలా సింప్లిసిటీ, కన్ఫ్యూజన్ లేని క్రియేటివిటీ, పాత్ర చిత్రణలు, సంభాషణలు. ఇక  సంగీతం, ఛాయాగ్రహణం, కళా దర్శకత్వం, యాక్షన్ కోరియోగ్రఫీ, ఎడిటింగ్  సమస్తం అంతర్జాతీయ ప్రమాణాలకి తీసిపోకుండా  వున్నాయి.

మెలోడ్రామానీ, విషాదాల్నీ చూపించినట్టే చూపించి, కట్ చేసే మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ చిత్రీకరణ పద్ధతితో గురుదత్ ‘ప్యాసా’ ని తలపించే దర్శకత్వాన్ని చూడొచ్చిక్కడ.

అయితే 1920ల నాటి పల్లె వాతావరణాన్ని చూపిస్తున్నప్పుడు, ఆ దృశ్యాత్మక విశేషాలకి తగ్గట్టే కాలీన స్పృహ తో సంగీతబాణీలూ ఉండాల్సింది. ఇటీవల విడుదలైన హిందీ సినిమా ‘రివాల్వర్ రాణి’లో ఇలాటిదే 1990ల నాటి కాలానికి తగిన బాణీలతో ఓ పాట పెట్టారు. ‘మనం’ లో కూడా సంగీతపరంగా ఆ ఫ్లాష్ బ్యాక్ కి పీరియడ్ ఫీల్ తీసుకు రావొచ్చు- ‘ఆదిత్య -369’ లో ‘జాణవులే’ పాటతో ఇళయరాజా తెచ్చినట్టు. డిజైనర్ పీరియడ్  ఫ్లాష్ బ్యాక్ వల్ల వేరియేషన్ లోపించి కథాకాలాలన్నీ ఒకేలా తయారయ్యాయి.

ఇక నాగార్జున-నాగచైతన్యల బాండింగ్, సమంతాతో నాగార్జున కెమిస్ట్రీ, నాగచైతన్య-సమంతాల కెమిస్ట్రీ/ఫిజిక్సూ, మళ్ళీ నాగార్జున-శ్రియల రెండుజన్మల ‘ఐలవ్యూ అంటే ఇలాఇవ్వు’ రోమాన్స్...మొత్తం వీళ్ళందరితో వయసుమీరిన అక్కినేని నాగేశ్వరరావు రియల్ టైమ్ తక్కుటమారాలూ... ‘ధర్మదాత’ లో ఎవ్వడికోసం ఎవడున్నాడు పొండిరా పొండి-అని కొడుకుల్ని తరిమేసిన వైరాగ్యం నుంచీ ఇప్పుడందరూ వున్న ఏకాకిలా అక్కినేని ఎంతో హుషారు నటన కనబర్చి జోష్ తెప్పించారు. చివర్లో సూపర్ ఇంపోజ్ చేసిన ‘నేను పుట్టాను’ పాట బిట్ తో అల్లరల్లరి!


విడుదలకాని ‘ఆటోనగర్ సూర్య’ ని పట్టుకుని సినిమాలేక త్రిశంకు స్వర్గంలో వున్న నాగచైతన్య బాగా ఇంప్రూవ్ అయి తిరిగొచ్చాడు. వెళ్ళిపోయిన తాతగారి  లెగసీని ముందుకు తీసుకుపోయేందుకు తాతగారికి హామీపడినట్టు నటించాడు. అయితే నటించినవన్నీ-ఒకటిరెండు తప్ప-కామెడీ సీన్లే కావడంతో అతనెంత వరకూ ఆల్ రౌండర్ అవగలడో ఈ సినిమాతో చెప్పడం కష్టం.

సీనియారిటీ కొచ్చిన నాగార్జునకి సీనియర్ శ్రియతో రోమాన్స్ వల్ల ఇబ్బందేం ఏర్పడలేదు. హీరోయిన్ సమంత యూత్ అప్పీల్ కే గాక, పాత్రలో వున్న ‘బరువుబాధ్యతల్ని’ కూడా మోయడానికి సరీగ్గా సరిపోయింది. కమెడియన్లు బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ లు అంత కామెడీ లేని పక్కపాత్రలకి సర్దుకున్నారు.

బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రానున్న మరో అక్కినేని వంశాంకురం అఖిల్ ల అతిధి పాత్ర ప్రవేశాలతో కలుపుకుని ఈ ‘మనం’ పరిపూర్ణం అయింది.

స్క్రీన్ ప్లే సంగతులు

ఈ స్క్రీన్ ప్లే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏమిటంటే, నిజజీవితంలో అక్కినేని హీరోల బంధుత్వాల్ని తిరగేసి చూపించడం! ఇదే లేకపోతే ఈ  పునర్జన్మల కథలకి కొత్తదనమే లేదు. మొత్తం ప్రపంచ సినిమా చరిత్రలోనే పునరావృత మవుతూ వస్తున్న  అవే పునర్జనల కథలకి ఇది అనూహ్యమైన టర్నింగ్ పాయింట్. వంశంలో మూడు నాలుగు తరాల హీరోలు ఉంటేతప్ప సాధ్యంకాని అపూర్వ  ప్రయోగం.

అయితే సమస్యల్లా ఓ నూరేళ్ళ సుదీర్ఘ కాలపు కథ చెప్పాల్సి రావడం. దీన్ని ఎక్కడ ప్రారంభించి, ఏ ఏ మజిలీలు దాటించి, గమ్యానికి చేర్చాలి?

ఇలాటి సందేహమే వరల్డ్ క్లాసిక్ ‘గాంధీ’ (1982) తీసిన దర్శకుడు రిచర్డ్ అటెన్ బరోకీ వచ్చిందని సిడ్ ఫీల్డ్ పేర్కొంటాడు ‘ది స్క్రీన్ రైటర్స్ ప్రాబ్లం సాల్వర్’ అన్న పుస్తకంలో. శాఖోప శాఖలుగా విస్తరించిన ఓ మహావృక్షంలాంటి మహాత్ముడి జీవితాన్ని సినిమా కథగా  ఎలా రూపొందించాలి? మహాత్ముడి జీవితంలో అన్ని ఘట్టాలనీ చూపించుకు రాలేం. అప్పుడది డాక్యుమెంటరీ అవుతుంది. క్రియేటివిటీ తో పనుండదు. అందుకని అటెన్ బరో శల్యపరిక్ష జరిపి మహాత్ముడి జీవితంలో మూడే ఘట్టాలు స్క్రీన్ ప్లేకి బలమైన ఫౌండేషన్స్ కాగలవని నిర్ణయించాడు. అవి 1. దక్షిణాఫ్రికాలో యువ న్యాయవాదిగా పోరాట జీవితం, 2. భారత దేశంలో సహాయ నిరాకరణోద్యమం, 3. హిందూ ముస్లిముల సమస్య. ముగింపుగా హత్య!

ఈ మూడింటి ఆధారంగానే  సంఘర్షణాత్మక కథ అల్లి,  తెరమీద మహాత్మాగాంధీ జీవిత చరిత్రకి సమగ్రత సాధించాడు అటెన్ బరో. సిడ్ ఫీల్డ్  చేసిన ఈ విశ్లేషణ ప్రకారమే చూస్తే,  2007లో అబ్బాస్ ఖాన్ తీసిన ‘గాంధీ మై ఫాదర్’ సినిమాకీ ఇదే స్క్రీన్ ప్లే ఫౌండేషన్ కన్పిస్తుంది. గాంధీ కుమారుడి యాభై ఏళ్ల జీవితకాలాన్ని అటెన్ బరో ఫార్ములా ననుసరించే చిత్రించినట్టు మనకర్ధమౌతుంది.
2007 లోనే శేఖర్ కమ్ముల తీసిన సూపర్ హిట్  ‘హ్యాపీ డేస్’ స్క్రీన్ ప్లే కీ ఇదే అటెన్ బరో ఫౌండేషన్ కన్పిస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఓ నాల్గేళ్ళు  హ్యాపీ గా గడిచిపోయే అనుభవాల సారంగా ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు, ఆ అనుభవాల్లో వేటిని తీసుకుని కథ తయారుచేయాలి? అనుభవాలు కలగాపులంగా వుంటాయి. వ్యక్తిగత, కాలేజీ గత, ప్రాపంచిక...ఇలా విభిన్న పార్శ్వాలుగా  అనుభవాలు కలగలిసిపోయి వుంటాయి. గాంధీ జీవిత కథ  లాంటి సమస్యే ఇక్కడ కూడా. కాకపొతే టైంలైన్ తక్కువ. అప్పుడు 1. కాలేజీలో కొత్త విద్యార్థుల ర్యాగింగ్, 2. చదువుల్లో ఎదురయ్యే సమస్యలు, 3.  ప్రేమల గురించి స్ట్రగుల్- అనే మూడు బ్లాకులుగా నాల్గేళ్ళ  టైంలైన్ ని విభజించి, వాటి తాలూకు అనుభవాల్ని మాత్రమే పొందుపర్చడంతో స్క్రీన్ ప్లేకి అంత బలం చేకూరింది.

 ‘మనం’ లో నూరేళ్ళ  టైం లైన్ని చూసినప్పుడు ఇందులో మూడు జీవిత కాలాలు ఇమిడివున్నాయి.  1. నాగార్జున-శ్రియ ల పూర్వజన్మ జీవితకాలం, 2. నాగ చైతన్య- సమంతల పూర్వజన్మ జీవితకాలం, 3. తిరిగి అక్కినేని నగెశ్వర రావుని కలుపుకుంటూ, ఈ రెండు జంటల వర్తమాన జీవితకాలం. వీటిన్నిటినీ కలిపి ఓ కథగా చెప్పాలంటే ఈ జీవితకాలాల్లో ఏ ఏ ఘట్టాల్ని ప్రధానంగా తీసుకోవాలి?

ఈ కథ ఆదిమధ్యంతాలన్నిటా (గత జన్మల్లో, ఇప్పుడూ) ఓకే సంఘటన పునరావృతమవుతూంటుంది. అది మోటారు వాహన ప్రమాద సంఘటన. దీంతో చావుపుట్టుకల చక్రభ్రమణంలో పడి పాత్రలు నలుగుతూంటాయి. చావకపోతే పునర్జన్మ లేదుకాబట్టి వేర్వేరు కాలాల్లో రెండు జంటల చావులు చూపించక తప్పదు. మళ్ళీ పునర్జన్మల్లో వాళ్ళకి పుట్టిన పిల్లలతో కనెక్ట్ చేయకా తప్పదు. ఇలా కథా పథకం డిసైడ్ అయితే వాటికి  తగ్గ ఘట్టాల్ని  ఎంపిక చేసుకోవడం సులభమే.

1. నాగచైతన్య-సమంతల ప్రేమా పెళ్ళీ, రోడ్డు ప్రమాదంలో మరణం, వాళ్ళ కొడుకుగా నాగార్జున మిగలడం, 2. నాగార్జున- శ్రియల ప్రేమాపెళ్ళీ, రోడ్డుప్రమాదంలో మరణం, వీళ్ళ కొడుకుగా అక్కినేని నాగేశ్వర రావు మిగలడం, 3. మొత్తం అందరూ కలిసి వర్తమానకాలంలో మళ్ళీ రోడ్డు ప్రమాద ఘటనలో చిక్కుకోవడం!

ఐతే కథ ఎక్కడ్నుంచీ ప్రారంభించాలి? 1920లలో నాగార్జున- శ్రియల కథ దగ్గర్నుంచా? ఇలాటి పని అటెన్ బరో కూడా చేయలేదు. అటెన్ బరో 1948లో గాంధీ హత్యతో సినిమా ప్రారంభించి, ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి గాంధీ కథ మొదట్నుంచీ చెప్పుకొస్తాడు. అలాగని మరీ గాంధీ ప్రారంభ దినాల జోలికి పోకుండా, 55 ఏళ్ల క్రితం 1893లో 24 ఏళ్ల యువలాయర్ గా వున్నప్పుడు, దక్షిణాఫ్రికాలో జాత్యాహంకారంతో అతణ్ణి రైల్లోంచి తోసేసే- అతడి జీవితాన్ని సమూలంగా మలుపుతిప్పేసే - సంఘటనతో ప్రారంభిస్తాడు.

ఎందుకిలా చేశాడంటే, పాశ్చాత్య స్క్రీన్ ప్లేలని సశాస్త్రీయంగా రచించు కుంటారు కాబట్టి. సొంత నమ్మకాలతో ఏదో బుద్ధికి ఎంత తోస్తే అంత రాసుకునే  మనబోటి వాళ్ళం రచిస్తే, భలే సెంటిమెంటల్ గా ఉంటుందని, గాంధీ బాల్యజీవితం దగ్గర్నుంచీ ఎత్తుకుని అవతలివాడికి తెగ బోరు కొట్టిస్తూ, మనం తెగ సంతృప్తి చెంది తరిస్తాం!
శాస్త్రీయంగా ఓ కథ అనుకోవాలంటే,  ముందుగా ప్లాట్ పాయిట్ -1, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్-2 లని గుర్తించి, వాటినాధారంగా చేసుకుని ఆలోచించకపోతే, సినిమా కథ సవ్యంగా రానట్టే!

అందుకే, మొదటి అంకం అంతంలో ప్లాట్ పాయింట్- 1 కి దారి తీసేందుకు పనికొచ్చే, కథని మలుపు తిప్పే ‘రైలు సంఘటన’ గాంధీ జీవితంలో ఉందని గుర్తించిన అటెన్ బరో- దాంతోనే కథని (మొదటి అంకాన్ని) ప్రారంభించాడన్న మాట సశాస్త్రీయంగా!

‘మనం’ లో కూడా మరీ 1920 ల దాకా వెనక్కెళ్ళ కుండా, మధ్యస్తంగా 1983 లో,  నాగచైతన్య 23 ఏళ్ల కుర్రాడిగా వున్నప్పట్నుంచే  కథ నెత్తుకున్నాడు దర్శకుడు. యువ పాత్రలతో కథ ప్రారంభించడం బాక్సాఫీసు అప్పీలుకి దోహదం చేస్తుంది కాబట్టి ‘గాంధీ’ లో ఫాలో అయినట్టే  ‘మనం’ లోనూ ఫాలో అయ్యారు.

contd...




















ప్రకటనేసుకుని పొగత్రాగొచ్చు!


సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగిరెట్టూ...పట్టుబట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికే ఇది తొలి మెట్టూ!’...అన్నాడు తెలుగు సినీకవి.  ‘మై జిందగీకా సాథ్ నిభాతా చలాగయా...హర్ ఫిక్ర్ కో ధువేమే ఉఢాతా చలాగయా’ (జీవితం ఎలా సాగితే అలా సాగిపోతున్నా- వర్రీస్ ని పొగలో ఊది పారేస్తున్నా! ) అన్నాడింకో  హిందీ సినీ కవి. నిన్నమొన్న కాదు, ఎప్పుడో రెండుతరాల క్రితం అర్ధ శతాబ్దం కూడా దాటిపోయిన ...ఆ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో... ఇంటిల్లిపాదీ ఈ సినిమాలకెళ్ళి ఎంజాయ్ చేసిన ఈ సిగరెట్ పాటలు, ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిల్చిపోయి, ఇప్పటికీ సిగరెట్ పాటలన గానే ఇవే గుర్తొచ్చేట్టు మనోఫలకాల మీద ముద్రించుకు పోయాయి!

‘రాముడు-భీముడు’లో రేలంగి- గిరిజలు  జంటగా,  ’హమ్ దోనో’ లో దేవానంద్ సోలోగా వెలింగించిన ఈ పాటలు కామెడీ ఒకటైతే, ఫిలాసఫీ మరొకటిగా ఉత్త కాలక్షేప సాహిత్యంగా గాక, జీవితసత్యాలకి దర్పణం పట్టాయి.
ఆ తర్వాత సినిమాల్లో సిగరెట్ తాగడం స్టయిల్ స్టేట్ మెంట్ కింద మారిపోయి కాస్త వన్నె తగ్గుతూ, సూపర్ స్టార్ రజనీకాంత్ సిగరెట్ ని  పైకెగరేసి నోటకరిచే ట్రిక్కుగా కమర్షియల్ గా  ఎంత పండిందో, ఆయన్ని అనుకరిస్తూ అటు హిందీలోనూ శత్రుఘ్న సిన్హా అదే ట్రిక్ ని కాపీ కొడితే అంతగానూ పేలింది. దుర్వ్యసనాలతో ఈ పాటలేంటి, హీరోయిజాలేంటీ అని ఎవరూ చీదరించుకోలేదు.

చీదరించుకోవడం ఎప్పట్నుంచీ మొదలయ్యిందంటే,  ఈ శతాబ్దం ఆరంభంనుంచీ అప్పుడున్న హీరోల మార్కెట్ తగ్గుతూ, కొత్త కొత్త కుర్ర హీరోల రాకతో,  వాళ్ళు పోషించే ఆకతాయి స్టూడెంట్స్ పాత్రలు ఎడాపెడా సిగరెట్లూ మద్యం లాగించేసే సీన్లతో నిండిపోవడం ప్రారంభమై నప్పట్నుంచీ!

అప్పుడు 2005లో గత కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరచింది. సినిమాల్లో ధూమపానాన్నిపూర్తిగా  నిషేధించింది. 2003లోనే సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల నియంత్రణా చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టంతో  సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్ని నిషేధించింది. 2004 లో ఇతర అన్ని ప్రసార-ప్రచార మాధ్యమాల్లోనూ ప్రకటనలపై నిషేధం విధించింది. అప్పుడు 2005లో సినిమాలపై దృష్టి సారించింది. నవతరం సినిమాలతో పొగాకు ఉత్పత్తులు దొడ్డిదారిన విచ్చలవిడిగా ప్రచారమవుతున్నాయని గుర్తించి- సినిమాలతో పాటు టీవీ సీరియళ్ళలోనూ ఏ పాత్రా పొగాకు ఉత్పత్తుల్ని వాడుతున్నట్టు చూపించరాదని  నిషేధం విధించింది. పాత సినిమాలు ప్రదర్శించాల్సి వస్తే ముందుగా హెచ్చరిక వేయాలని  ఆదేశించింది గత ప్రభుత్వంలోని కేంద్ర ఆరోగ్య శాఖ.

ఐతే ఈ ఆదేశాల్ని అమలుపర్చాల్సింది కేంద్ర సమాచార ప్రసారాల శాఖ. ఈ శాఖ పై ఆదేశాల్ని పరిశీలించి కొంత సడలింపు నిస్తూ సృజనాత్మక స్వేచ్ఛ ని కాపాడాలని నిర్ణయించి, ధూమపాన  దృశ్యాలు తప్పని  సరయితే ఆ సినిమాలకు ‘ఏ’ సర్టిఫికేట్ జారీచేయాలని కేంద్రీయ సెన్సార్ బోర్డుకి  సూచించింది. అంతే గాక సినిమాల్లో  పొగత్రాగిన నటుడి చేత సినిమా ప్రారంభంలో పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరమనే  ప్రకటన  ఇప్పించాలనీ, ఆ దృశ్యాల కిందిభాగంలో  కూడా ఇదే హెచ్చరిక స్క్రోలింగ్ వేయాలనీ ఉత్తర్వు లిచ్చింది.

దీనిపై ప్రముఖ హిందీ నిర్మాత మహేష్ భట్  ఢిల్ల్లీ హై కోర్టుని ఆశ్రయించారు. 2009 లో ఢిల్ల్లీ హై కోర్టు ధూమపానం పై సెన్సార్ ఆంక్షల్ని కొట్టి వేసింది. అయినప్పటికీ, ప్రజారోగ్య పరిరక్షణకు రాజ్యాంగం ప్రకారం ఓ పరిధిలో చర్యలు తీసుకునే వెసులుబాటు వుందని వాదిస్తూ,  కేంద్ర ప్రభుత్వం అదే సంవత్సరం సుప్రీం కోర్టు కెళ్ళింది. సుప్రీం కోర్టు ఢిల్ల్లీ  హైకోర్టు ఆదేశాల్ని కొట్టి వేసింది. అప్పట్నుంచీ 2011 వరకూ కేంద్ర ప్రభుత్వం ఇటు తనకూ, అటు సినిమా రంగానికీ అనుకూలంగా  వుండే సవరణల్ని ప్రతిపాదించడానికి  ఆలోచిస్తూ వుండి  పోయింది. అప్పుడు అదే సంవత్సరం నవంబర్ 14 నుంచి అమలయ్యేలా కొత్త నోటిఫికేషన్ని విడుదల చేసింది.

2011 అక్టోబర్ 27న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం...

1. ధూమపానం చేసే దృశ్యాలున్న సినిమాలకి ఏ/యూఏ సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయాలి , 2. ధూమపానం చేసిన నటుడి వాయిసోవర్ తో, సినిమా ప్రారంభం లోనూ మళ్ళీ విశ్రాంతి తర్వాతా 20సెకన్ల నిడివితో డిస్ క్లెయిమర్ వేయాలి, 3. ధూమ పానం చేస్తున్న దృశ్యాల మీద పొగత్రాగడం ప్రాణాలకు హానికరం అన్న స్క్రోలింగ్ వేయాలి, 4. ఈ నోటిఫికేషన్ అమలయ్యే తేదీ, 2011 నవంబర్ 14 నుంచి విడుదలయ్యే సినిమాలకు ‘న్యూ ఫిలిమ్స్’ వర్గీకరణతో సర్టిఫై చేయాలి, 6. ఇవన్నీ అమలయ్యాయా లేదా చూసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖాధికారి ఒకరు సెన్సార్ బోర్డు స్క్రీనింగ్ లో పాల్గొనాలి, 7. ఈ నోటిఫికేషన్ కంటే ముందున్న ‘పాత’ సినిమాలకి సంబంధించి సదరు ప్రదర్శనాశాల నిర్వాహకుడు 30సెకన్ల పొగాకు ఉత్పత్తుల వ్యతిరేక హెల్త్ స్పాట్ ని సినిమా ప్రారంభ్నికి ముందు ప్రదర్శించాలి, 8. హలీవుడ్/వరల్డ్ సినిమాలకు ఈ నోటిఫికేషన్ నుంచి మినహాయింపు వుంటుంది, ఎందుకంటే అవి దిగుమతైన సినిమాలు కాబట్టి...

ఈ చట్టం ఈ రూపం తీసుకోవడానికి ఆరేళ్ళు పట్టింది. 2005 లోనే ఈ చట్ట సవరణకి  బీజం వేసినప్పటికీ, భారతీయ సినిమాల్లో  పొగత్రాగే దృశ్యాల ప్రభావం పై 2003లోనే హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దాని ప్రకారం భారతదేశం ప్రతియేటా 8 కంటే ఎక్కువ  భాషల్లో 900 సినిమాలని ఉత్పత్తి చేస్తోంది. ఈ సినిమాలు పాతిక కోట్ల యువతని ఆకర్షిస్తున్నాయి.  వీటిలో 76% సినిమాలు పొగత్రాగే దృశ్యాలతో నిండి ఉంటున్నాయి. పొగత్రాగే అలవాటున్న యువతలో 52% మంది సినిమాల్లో చూసే నేర్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 2500 మంది పొగాకు ఉత్పత్తుల సేవనం కారణంగా చనిపోతున్నారు. సిగరెట్లు, గుట్కా, బీడీల వంటివి ఈ పొగాకు ఉత్పత్తుల్లో ఉంటున్నాయి. టీనేజిలో వుండే ప్రేక్షకులు తమ అభిమాన తార తెరమీద తరచూ పొగత్రాగడం చూసి ప్రభావితం అయ్యే అవకాశాలు పదహారు రెట్ల కంటే ఎక్కువే వుంటుంది.  హాలీవుడ్ సినిమాల్లో లాగే భారతీయ సినిమాల్లోనూ పొగత్రాగే దృశ్యాల సరళి ప్రమాదకర పోకడలకి పోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఈనేపధ్యంలో సినిమాల్లో ఈ పోకడల్ని అరికట్టే విధాన నిర్ణయాలు తీసుకుని అమలుపరచాలని వివిధ దేశాలకు సిఫార్సు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

మరో అధ్యయన సంస్థ ప్రకారం పొగత్రాగే వారి శాతం 1991లో 13% వుంటే, 2002 లో అది 52 శాతానికి పెరిగింది. హాలీవుడ్ సినిమాల్లో లాగే భారతీయ సినిమాలూ స్మోకింగ్ ని క్యాజువల్ చర్యగా చూపిస్తున్నాయి. అలాగే ఇళ్లల్లో పొగత్రాగే వారి సంఖ్య తగ్గి, బయట త్రాగే వారి సంఖ్య పెరిగింది. 16-18 మద్య వయసున్న యువతీ యువకుల్ని సర్వే చేస్తే, సినిమాల్లో పొగ త్రాగడాన్ని ఫ్యాషన్ అన్న అర్ధంలో చూపిస్తూంటే,  అది చూసి తామూ పొగత్రాగడం అలవాటు చేసుకున్నామనీ చెప్పారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత  సుభాష్ ఘాయ్ అయితే,  తను  టీనేజిలో వున్నప్పుడు తెర మీద దేవానంద్ పొగత్రాగడం చూసి ప్రభావితుడ్ని అయ్యానని చెప్పుకున్నారు. అప్పట్లో సిగరెట్ తాగే వ్యక్తి గొప్ప ఆలోచనాపరుడై ఉంటాడని భావించే వాళ్ళమనీ, అలాగే సిగరెట్ తాగే నటుడుకి మంచి నటనాసామర్ధ్యం కూడా ఉంటుందని అభిప్రాయముండే దనీ, సిగరెట్ తాగని నటుడికి టాలెంట్ గానీ, సృజనాత్మకతగానీ పెద్దగా ఉండవని డిసైడ్ అయ్యేవాళ్ళమనీ  వివరించారు.

ఈ అధ్యయనం ప్రకారం పొగ త్రాగడాన్ని యువత దైనందిన జీవితంలో ఒక భాగంగా తేలిగ్గా తీసుకుంటోంది. హిందీ సినిమాలతో బాటు దక్షిణాది సినిమాల్లో విలన్ గాక, హీరోయే  సిగరెట్లు తాగే దృశ్యాలు  పెరిగిపోతున్నాయి. సినిమాలకీ, యువత ప్రవర్తనలకీ  మధ్య బలమైన సంబంధం వుంది. సినిమాల్లో చూపిస్తున్న పొగ త్రాగే దృశ్యాల తీవ్రత వాస్తవంగా దేశంలో పొగత్రాగే పరిస్థితి కన్నా బాగా ఎక్కువ వుంది.

ఇంతవరకూ బాగానే వుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గత కేంద్రప్రభుత్వం చట్ట సవరణలు చేసి అమలుపరచడం మొదలుపెట్టింది- ఈ అమలు పరచడం దగ్గరే విమర్శల పాలవుతోంది! ధూమపాన నిషేధ బాధ్యతంతా సినిమాలదే అన్నట్టు చేతులు దులిపేసుకుంటోంది...

పాటకు తగ్గట్టే  పాట్లు!

మళ్ళీ సరదా సరదా సిగిరెట్టూ పాటేసుకుంటే..

‘ఊపిరి తిత్తుల క్యాన్సర్ కిదియే కారణం అన్నారు డాక్టర్లూ... కాదన్నారులే పెద్ద యాక్టర్లూ!
పసరు బేరుకొని కఫము జేరుకొని ఉసురు దీయు పొమ్మన్నారూ ...దద్దమ్మలు అది విన్నారూ!’

ఈ పాట స్ఫూర్తి తోనే స్పాట్ రూపొందించారేమో అన్నట్టుంది నిర్వాకం ... హాస్పిటల్ బెడ్ మీద నోటి క్యాన్సర్ రోగి...గుట్కాలు తిని తన పరిస్థితి ఎలా  తయారయ్యిందో చూడమన్నట్టు  స్టేట్ మెంట్. ఊపిరితిత్తుల్ని పిండుతున్న చేతులు...ఆ ఊపిరితిత్తుల్లోంచి సిగరెట్లలో వుండే టార్ –పాటలో అన్నట్టు ‘కఫము’ అందామా- కాలుష్యం పిండే కొద్దీ చిక్కటి ద్రవరూపంలో నల్లగా బీకరులోకి కారే దృశ్యం...శుభమా అంటూ సినిమాని ఎంజాయ్ చేసేందు కొస్తే వెగటు పుట్టే ఈ జుగుప్సాకర దృశ్యాలేమిటిరా బాబూ అన్పించే ట్టు, సినిమా మొదట్లో, మళ్ళీ ఇంటర్వెల్లో రిపీట్ చేసే ఆనందం!

ఈ స్పాట్లో కన్పించే నోటి క్యాన్సర్ రోగి ముఖేష్ హరానే అమాంతం ఈ పొగాకువ్యతిరేక ఉద్యమం చేపట్టిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  ‘బ్రాండ్  అంబాసిడర్’ గా మారిపోయాడు. అంతలో చనిపోయాడనుకోండి, అది వేరే విషయం. అయితే స్మోకింగ్ సీన్లున్న సినిమాలకి ఈ స్పాట్ ని తప్పనిసరి చేయడంతో ప్రేక్షకుల పడిన నరకయాతన ఇంతా అంతా కాదు. పొగత్రాగడం వల్ల నష్టాలకన్నా ఈ హింస ఎక్కువైపోయింది. ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఈ హింసని ప్రేక్షకుల మీద రుద్దడం  భావ్యమా అని దేశంలో  ఏ నిర్మాత  కూడా ఆలోచించలేదు. ఆలోచించి వుంటే ఈ హింస నుంచి ప్రేక్షకుల్ని కాపాడడానికైనా స్వచ్చందంగా సిగరెట్ సీన్లు చిత్రీకరించే వాళ్ళు కాదు. ఈ రకంగా సినిమాల్లో ప్రభుత్వం ఉద్దేశించిన ధూమపాన దృశ్యాల నిషేధం అమలైపోయేది. సిగరెట్ ఫ్రీ సినిమాలతో కొత్తగా యువత స్మోకింగ్ అలవాటూ కొని తెచ్చుకునే ప్రమాదమూ  తప్పేది.

కానీ ఒక మంచి పని జరగడానికి అస్సలు వీల్లేదుగా?  ప్రజలే చచ్చినట్టూ వాళ్ళ యుక్తి కొద్దీ చెడు ప్రభావాల బారి నుంచి తెలివిగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడాలి.  ప్రభుత్వమూ నిర్మాతలూ పొగత్రాగని ప్రేక్షకుల మనోభావాలని పట్టించుకోకుండా,  అంత జుగుప్సాకర స్పాట్ తో పొగత్రాగే వాళ్ళనీ భయపెట్టినా ఫలితం లేకపోవడం వల్లనేమో- దాన్ని ఉపసంహరించుకుని మరో స్పాట్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘సిగరెట్ సినిమా’ లకి ఇదే అమలవుతోంది.  ‘ఏమయ్యిందీ నగరానికీ...’  అంటూ ఆందోళనగా ప్రారంభమయ్యే ఈ స్పాట్లో ఫ్యామిలీ రెస్టారెంట్ ని చూపిస్తూ,  అందులో కూర్చుని ఆడవాళ్ళు ఇబ్బంది పడేలా పొగ మేఘాలు సృష్టిస్తున్న పొగరాయుళ్ళ మీద కామెంట్లు చేస్తుంది...చూడగానే ఈ స్పాట్ ఎంత తెలివితక్కువైనదో తెలిసిపోతుంది. ఫ్యామిలీ రెస్టారెంట్లు కాదుకదా, ఇతర ఏ హోటళ్ళలోనూ కూర్చుని పొగ తాగరాదన్న ఇంగితజ్ఞానం స్మోకర్లకుంది. చాయ్ సిగరెట్లకి ఘనతవహించిన అడ్డాలైన చాలా ఇరానీ హోటళ్ళలో కూడా నో స్మోకింగ్ నోటీసులు పెట్టేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ కాల్చాలన్నా పక్కనెవరైనా వుంటే దూరంగా వెళ్లి కాలుస్తున్నారు స్మోకర్లు. స్మోకర్లకి ఈపాటి  స్మోకింగ్ మర్యాద తెల్సు. వాళ్ళని అవమానిస్తూ ఇంత  అవాస్తవికమైన స్పాట్ ని తయారుచేసి సినిమాహాళ్ళకి అంటగడితే ఏ ప్రయోజనం నెరవేరుతుంది? అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినా, ఇంకే అధ్యయన సంస్థ అయినా ఘోషిం చిందేమిటి? ప్రభుత్వం కూడా గుర్తించిం దేమిటి? సినిమాలు చూసి టీనేజర్లు సిగరెట్లకి అలవాటు పడుతున్నారనేగా? అలాటి టీనేజర్లని టార్గెట్ చేసే స్పాట్ లేనా ఇవి? టీనేజర్ల పాత్ర లేని ఇలాటి స్పాట్స్ ఎన్ని వేసి ఏం లాభం? ఈ హెచ్చరికలు మనక్కాదులే, పొగత్రాగే పెద్దోళ్ళకి – అనుకోరా వాళ్ళూ?

మీ ఆశయాలు నాకొద్దు బాబూ!

ఇలాటి  ధూమపానం నిషేధ విధానంతో ప్రభుత్వ నిర్వాకం చూసి ప్రేక్షకులు ఇంకో విధంగా కూడా నష్టపోతున్నారు. అసలు కాస్త కళాభిరుచి వున్న ప్రేక్షకులెవరికైనా ఈ ప్రభుత్వ విధానం కళారూపాల  పట్ల దొరతనంగానే  అన్పిస్తుంది. ఎందుకంటే విసుగుతో చూడాల్సి వచ్చే స్పాట్స్, అంతే గాక  సిగరెట్ సీన్లు  వచ్చినప్పడల్లా  ఆరోగ్యానికి హానికరమని కింద స్క్రోలింగ్...ఇవి ఓ  చిత్రకారుడు గీసిన బొమ్మ మీద ఇంకెవరో వచ్చి గీతలు గీసిన ఫీలింగ్ ని కలగజేస్తాయి. కోపం తెప్పిస్తాయి. దృశ్యం మీద నుంఛి ఆ స్క్రోలింగ్ మీదికి దృష్టి మళ్లుతూ,  మొత్తంగా సినిమా వీక్షణా నుభవం భంగమౌతుంది. ఇలా ఈ స్క్రోలింగ్- స్పాట్ ల వీరంగం ఇప్పటివరకూ దేశంలో ఏ దర్శకుడికీ, నిర్మాతకీ అభ్యంతరకరంగా తోచలేదు- ఆ ఒక్కడికి తప్ప! ఆయన సుప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు వుడీ అలెన్!  మీ మతిమాలినతనంతో నేను తీసిన దృశ్యాల్ని కలుషితం చేసుకోలేను, మీ ఆశయాలకో నమస్కారం , నా సినిమాని  మీ దేశంలో విడుదల చెయ్యను పొమ్మని వెళ్ళిపోయాడు.

తను తీసే సినిమాలకి ఎప్పుడూ ఏదో ఒక ఆస్కార్ అవార్డు పొందే దర్శకుడు వుడీ  అలెన్ 2013లో తీసిన ‘బ్లూ జాస్మిన్’ కి మనదేశంలో సెన్సార్  పొగ సీన్ల పట్ల అభ్యంతరం వ్యక్తం జేసింది . అందులో హీరోయిన్ కేట్ బ్లాంచెట్ పొగత్రాగే దృశ్యాలు రెండున్నాయి. వీటిమీద స్క్రోలింగ్ వేసి, సినిమా లో రెండు సార్లు స్పాట్ వేయాలని కోరింది సెన్సార్ బోర్డు. వుడీ అలెన్ తీవ్రంగా మండిపడ్డాడు. నా దృశ్యాల మీద  మీరెవరు పెత్తనం చెలాయించడానికి? అని విరుచుకు పడి, నా సినిమాని మీ దేశంలో విడుదల చెయ్యనని స్పష్టం చేశాడు. ఆ విధంగా ఆ సినిమాని చూసే అవకాశాన్ని ప్రేక్షకులు కోల్పోయారు. తర్వాత డీవీడీ ల్లో చూడొచ్చు, అది వేరు. అయితే  ఈ సినిమాలో సిగరెట్లు తాగి నటించిన కేట్ బ్లాంచెట్ కి ఆస్కార్ ఉత్తమనటి అవార్డు లభించడాన్ని ఎలా అర్ధం జేసుకోవాలో సెన్సార్ బోర్డే చెప్పాలి!

1975 ఎమర్జెన్సీ కాలం లో సినిమాల్లో మద్యం, రక్తం చూపించ కూడదని నిబంధనలు విధించినప్పుడు , విలన్ పాత్రలు విధిలేక కూల్ డ్రింకులు మాత్రమే  త్రాగి రంకె లేసేవి. రక్తాలు పారించలేక పిడిగుద్దులు మాత్రమే గుద్దుకుని ఫైటింగ్  సీన్లు ముగించేసేవి. పద్మాలయా బ్యానర్ లో  హీరో కృష్ణ తీసిన ‘రామరాజ్యంలో రక్తపాతం’ అన్న టైటిలున్న పోస్టర్లలో  ‘రక్తపాతం’ మీద ‘రక్త పాశం’ అంటూ సాత్వికమైన స్లిప్పులు అతికిం చుకోవాల్సి వచ్చింది. అప్పట్లో సృజనాత్మక స్వే చ్ఛా అంటూ నినదించడానికి వీల్లేదు. అప్పట్లో ఏ స్వేచ్ఛ కీ రోజులుకావు. ఇప్పడు అన్ని స్వేచ్ఛలూ పరిఢవిల్లుతున్నా ఏ గొంతూ పెగలడం లేదు. ఒక్క ఆ విదేశీయుడు మాత్రమే తన సృజనాత్మక స్వేచ్చ కోసం తన సినిమా విడుదలనే వదులుకుని పోయాడు.

ప్రకటనేసుకుంటే ఎంత ఉవ్వెత్తున పొగమేఘాలు సృష్టించుకున్నా మాకేం అభ్యంతరం లేదనే ధోరణిలో ప్రభుత్వ ప్రవర్తన వుంటే,  ఈ మాత్రం దానికి సృజనాత్మక స్వేచ్చంటూ మనకెందుకు గొడవని ప్రకటనేసేసి ఉధృతంగా పోగసీన్లు జొప్పించేస్తున్నారు మన నిర్మాతలు. బాలీవుడ్ లో చెప్పనవసరం లేదు, టాలీవుడ్ లోనూ మహేష్ బాబు దగ్గర్నుంచీ అల్లుఅర్జున్ వరకూ ప్రతీ పేరున్న యువ స్టారూ వెండితెర మీద పొగత్రాగేసి తరిస్తున్నారు.  దక్షిణ కొరియాలో కూడా ఈ ధోరణే ప్రబలి ఎక్కడికి దారితీసిందో తెలుసుకుంటే పొగ త్రాగకుండానే భయంతో జబ్బున పడతాం. దక్షిణ కొరియాలో సినిమాల్లో స్మోకింగ్ దృశ్యాలపై నిషేధాన్ని కచ్చితంగా అమలుపర్చక పోవడంతో, సినిమాల్లో కావాలని హీరోల చేత సిగరెట్లు తాగే సీన్లు ఎడాపెడా పెట్టేస్తూ, అది సృజనాత్మక స్వేచ్చంటూ దబాయిస్తూ పోయారు. ఫలితంగా దేశ జనాభాలో 80 శాతం  మంది పోగారాయుళ్ళుగా మారిపోయి ప్రమాదం అంచున చేరుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు సిగరెట్ల కంపెనీలు నిర్మాతల్ని ఇంకా ఎగదోసి, హీరోయిన్ల చేత కూడా తాగించడం మొదలెట్టించారు. అదేమని నిలదేస్తే,  మహిళా శక్తినీ , ఇంకా మాట్లాడితే స్త్రీ స్వేచ్చనీ ప్రమోట్ చేస్తున్నామంటున్నారు! ఆ విధంగా దేశంలో స్త్రీలు కూడా సిగరెట్లు తాగేట్టు ఎగదోసి వ్యాపారాలు పెంచుకుం టున్నారు.

ఈ పరిస్థితి మనదాకా రాదనీ గ్యారంటీ లేదు. అప్పుడు మనదేశంలో దమ్ముకొట్టే ఆడా మగా లెక్కకందకుండా పోయి, ఆ సమూహం థియేటర్ లలోకూడా స్మోకించుకోవడానికి ఛాన్సివ్వాల్సిందే నంటూ పెద్ద  ఉద్యమం చేపట్టినా ఆశ్చర్యం లేదు.

ఇందాకటి పాటని ఇంకో సారి వేసుకుంటే...

థియేటర్లలో పొగ త్రాగడమే నిషేధించి నారందుకే...కలక్షన్లు లేవందుకే! ‘ అన్నట్టు తయారవుతుంది ప్రకోపించిన పొగరాయుళ్ళ తో/పొగరాయమ్మ లతో పరిస్థితి!

కొసమెరు పేంటంటే –  గత ప్రభుత్వంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల్ని అమలుపర్చాల్సిన కేంద్ర సమాచార ప్రసారాల  శాఖ మంత్రివర్యులే - అంత సీనేం లేదు,  పొగగోల మనకెందుకు లెండి, లైట్ తీసుకోండి –అని కేంద్రీయ సెన్సార్ బోర్డు చెవిలో ఊదినట్టు ఓ ఎన్జీఓ  సంస్థ కూపీలాగి బయటపెట్టింది!


-సికిందర్
('ఈవారం' మేగజైన్, జూన్' 2014 సంచిక )