రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, ఫిబ్రవరి 2016, సోమవారం

నాటి సినిమా!



దేశం దుర్మతుల పాలయినప్పుడు, అమాయకులు అన్యాయాలకి బలౌతున్నప్పుడు, ధర్మానికి తానే  రాజు అయి, న్యాయానికి తానే బుద్ధి అయ్యి, ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అని ఆ గీతాచార్యుడు సాకార రూపంలో ఈ లోకాన అవతరిస్తాడు. ఆ రూపం ‘బొబ్బిలి పులి’ అయినప్పుడు,  ఆ ప్రక్షాళనా  శతఘ్నులు భళ్ళున భళ్ళున అగ్ని వర్షాలు కురిపిస్తాయి!
          ఎస్, ఇందుకే కనక వర్షం కురిసింది!

        స్ట్రాంగ్ క్యారెక్టర్.. స్ట్రాంగ్ స్టోరీ.. చివరికి  ఇవన్న మాట సినిమా సిల్వర్ జూబ్లీ  అవడానికి మూలస్థంభాలు! సినిమా అంటే ఇప్పుడొస్తున్న  పాసివ్ పాత్రలతో పేలవమైన కథనాలతో చుట్టేసే క్రేజీ కాంబినేషన్ల ప్రదర్శన కాదు. డాక్టర్ ఎన్టీ రామారావు - డాక్టర్ దాసరి నారాయణ రావుల కాంబినేషన్ ఇలాటిది కాలేదు. వాళ్ళ బాధ్యతాయుతమైన భాగస్వామ్యంలో  ‘బొబ్బిలిపులి’ అనే పరాకాష్ట ధూర్తజనులకి కొరడా చరుపైంది. అవినీతిని ఏదో లంచం రూపంలో చూపించేసి, చంపడం వేరు. అవినీతి వల్ల భౌతిక నష్టతీవ్రతని పెంచి చూపించి, శత్రువుని వధించడం పూర్తిగా వేరు. మొదటిది ( లంచం ) ప్రేక్షకులు తేలిగ్గా తీసుకున్నే నిత్య వ్యవహారమే. రెండోది ( ప్రాణ నష్టం, ఆస్తి నష్టం) మాత్రం సీరియస్ గా పట్టించుకోవాల్సిన పవర్ ఫుల్ వ్యక్తీ కరణ అవుతుంది. ఇందుకే ‘బొబ్బిలిపులి’ ది  పవర్ఫుల్ స్టోరీ అయింది. ఇందుకే ‘బొబ్బిలి పులి’  ఎన్టీఆర్  నట జీవితానికో కుదుపు నిచ్చిన బ్లాక్ బస్టర్ మాత్రమే కాలేదు, అంతలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ఉత్తరీయమిచ్చిన ఉపాఖ్యానం కూడా అయింది.

        ‘బొబ్బిలి పులి’  అనే నాణేనికి ఇలా రెండు ముఖా లేర్పడ్డాయి. ఇందుకు ఉత్తరాది పాత్రి కేయ బృందమూ సాక్ష్యమే. ఓ వైపు ఊరూరా ప్రభంజనం సృష్టిస్తున్న ఎన్టీఆర్ చైతన్య రథ యాత్రా విశేషాల్ని కవర్ చేస్తూనే, మరో వైపు మారు మూల పల్లెల్లో క్రిక్కిరిసిన థియేటర్ లలో ‘బొబ్బిలిపులి’  బాక్సాఫీసు గాండ్రింపుల్ని సైతం  లోకానికి చాటిన చరిత్రా వుంది.

        అపూర్వంగా  ఎన్టీఆర్ నటించిన  ఈ శక్తిమంతమైన పాత్ర తప్ప, మరింకో చర్చనీయాంశం సాక్షాత్తూ షెర్లాక్ హోమ్స్ వచ్చి తన ట్రేడ్ మార్క్ భూతద్ధం పెట్టి గాలించినా ఈ సినిమాలో దొరకదు. కాబట్టి ఒక పాత్ర బలంగా ఎదగడానికి ఏవి దోహద పడతాయో, తెలుసుకోవడమే  మనకి ముఖ్యాంశ మవుతుంది.

        సినిమాల్లో కథే పాత్రని నడిపితే అది  నసపెట్టే పాసివ్ పాత్రవుతుంది. పాత్రే కథని నడిపిస్తే అప్పుడది యాక్టివ్ పాత్ర,  లేదా స్ట్రాంగ్ క్యారెక్టర్ అవుతుంది. స్ట్రాంగ్ క్యారెక్టర్ కి వ్యక్తిగత ఆశయమే వుంటే,  అది అంతవరకే  పరిమితమైన దాని సొంత కథవుతుంది. ఇంకో మెట్టు పైకెళ్ళి ఇతరుల సమస్యల్ని పట్టించుకుంటే అప్పుడది సామాజిక కథగా, పాత్రగా ప్రమోటవుతుంది. మరింకో మెట్టు పైకి చేరుకుని అంతర్జాతీయ సమస్యని తలకెత్తుకుంటే, అప్పుడు విశ్వజనీన కథగా, పాత్రగా పదోన్నతి పొందుతుంది. మరింకో మెట్టు పైకి చేరుకుని అక్కడ పారలౌకిక అంశాల్ని స్పృశిస్తే,  భక్తి లేదా ఆథ్యాత్మిక కథగా, పాత్రగా పరమోన్నతమవుతుంది. కథల, పాత్రల గౌరవ ప్రపత్తులు ఈ ఆరోహణా క్రమంలో వుంటాయి. మెట్లెక్కే కొద్దీ  పెరుగుతూంటాయి.

        1982 లో విడుదలై అఖండ విజయాన్ని సాధించిన ‘బొబ్బిలిపులి’  లో ఎన్టీఆర్ పోషించిన మేజర్ చక్రధర్ పాత్ర  పై ఆరోహణా క్రమంలో రెండో స్థానాన్ని అలంకరిస్తోంది. ఇతరుల సమస్యల్ని పట్టించుకుంటూ సామాజిక పాత్ర అయింది. దుష్టులు ధర్మాన్ని చె రబట్టడం ప్రపంచ వ్యాప్త సమస్యే. దీనిమీద సామాజిక బాధ్యతతో తిరగబడ్డ చక్రధర్  విశ్వ జనీన ఆశయంతో ప్రతీ ఒక్కర్నీ అందుకే కదిలించ గలిగాడు. సినిమాల్లో కనీసం అయిదు కదిలించే సన్నివేశాలుంటే  విజయం ఖాయమని  నటి ఇంగ్రిడ్ బెర్గ్ మాన్ చెప్పినట్టు మూడు  ఆస్కార్ ల రచయిత విలియం గోల్డ్ మాన్ తన పుస్తకంలో రాశాడు. ఐదేం ఖర్మ, అరడజనుకి పైగా కుదిపివేసే సన్నివేశాలు కొలువు దీరాయి ‘బొబ్బిలిపులి’ లో.

      పాజిటివ్ సహిష్ణుతతో మేజర్ చక్రధర్ తన వాళ్ళ పట్ల ఔదార్యం వహించే ప్రతీ  మలుపూ కదిలించే సంఘటనే! అదే పాజిటివ్ సహిష్ణుత రీత్యా నిస్పృహ కి లోనవకుండా, ఆత్మ స్థయిర్యమూ కోల్పోకుండా, ప్రజా కంటకుల మీద దండయాత్ర చేసినప్పటి ప్రతీ ఘట్టమూ  కదిలించే సంఘటనే! 

        ఇలా పరస్పర భిన్నమైన అంతర్గత, బహిర్గత ఆశయాలుండబట్టే  మర్చిపోలేని సజీవ పాత్రయ్యాడు. ఇది యాక్షన్ సినిమాయే అయినా ఇందులో పాత్ర వ్యక్తిగత జీవిత చిత్రణకి కూడా ( దాదాపు 50 సీన్లు) ప్రముఖ స్థానముంది. మనం డబ్బు సంపాదన అనే యాక్షన్లో పడిపోయి  వ్యక్తిగత  జీవితాన్నిపట్టించుకోం. దీని ఫలితాన్ని మానసిక రుగ్మతల రూపంలో అనుభవిస్తున్నాం. జీవించడానికి బయట యాక్షన్ తో బాటు, ఇంటి మీద కాస్త ఎఫెక్షనూ అంత ముఖ్యమే. ఈ సంగతి పైకి చెప్పకుండా అన్ కాన్షస్ గా సైకో ఎనాలిసిస్ చేసేదే పవర్ఫుల్ పాత్ర. కాకి కేం తెలుసు సైకో ఎనాలిస్ అన్నాడో కవి. చరిత్రలో నిలచిపోయిన కొటేషను. కాకి సంగతేమో గానీ, మన టైంపాస్ తెలుగు సినిమా  పాత్రలు కూడా సైకో ఎనాలిస్  చేయగలవని మేజర్ చక్రధర్ నిరూపిస్తున్నాడు.

        సెలవు మీద ఊరొచ్చిన సైనికుడతను. ఇక్కడ ప్రేమించినమ్మాయి ( శ్రీదేవి) తో పెళ్లను కుంటోండగానే  సైన్యం నుంచి అర్జెంటుగా పిలుపు! ఆ పిలుపందుకుని పెళ్లి కంటే దేశ రక్షణే ముఖ్యమనుకుని వెళ్లి పోతాడు. అంతలో తల్లి అస్తమించిన వార్త. విధి నిర్వహణలో తల్లి ఋణం కూడా తీర్చుకోలేని దైన్యం. ఎలాగో ఊరొస్తే, చెల్లెలి (అంబిక)  తొందరపాటు ఫలితంగా కుండ మార్పిడి పెళ్ళిళ్ళు తప్పవు. అసలు ప్రేమించినమ్మాయిని పెళ్లి చేసుకోలేని బాధని కూడా దిగమింగుకుని, మతిస్థిమితం లేని ఈ భార్య (జయచిత్ర) తో రాజీ పడి,  ఇక విధి నిర్వహణకి తిరుగు ప్రయాణమవబోతూంటే, నడిరాత్రి నగరంలో దుష్ట త్రయం (సత్యనారాయణ, రావు గోపాలరావు, రాజనాల)  దగుల్బాజీ తనం నగ్నంగా కళ్ళబడుతుంది!

        ఇక దేశ సరిహద్దుల్లో కాదు విధి నిర్వహణ, ఈ దేశం నడిబొడ్డునే అని కళ్ళు తెర్చి సమరభేరి మోగిస్తాడు దుష్టజాతి మీద! 

      ఇలాటి సైనికుల కథల్లో  రొటీన్ గా కొన్ని స్టాక్ సీన్లు వుంటాయి. వాటిలో ముఖ్యమైనది సరిహద్దులో డ్యూటీ చేస్తూ ప్రియురాలి నుంచి ఉత్తర మందుకోవడం. అలనాటి హీరో బాలరాజ్ సహానీ లా ‘హకీఖత్’ లో   ‘హోకే  మజ్బూర్ హమే ఉస్నే బులాయా హోగా’ అని తల్చుకుని పాట పాడుకోవచ్చు. లేదా జేపీ దత్తా ‘బోర్డర్’  లో లాగా ‘సందేశే ఆతే హై  హమే తడ్పాతే హై’ అని కూడా పాడుకోవచ్చు. మేజర్ చక్రధర్ కూడా ఇలాటి లేఖే ప్రేమించినమ్మాయి నుంచి అందుకుని  ‘ఇది ఒకటో నంబరు బస్సూ’  అని ఎంటర్ టైన్ చేస్తాడు.

        ఇలాటి రోమాంటిక్  హీరో జ్వలిత హృదయుడు అవడానికి రెండు బలమైన సంఘటనలు ఎదురవుతాయి. ఒకటి, సమాజ ద్రోహులు గోడౌన్ లో చక్కర నిల్వల్ని తరలించుకుపోయి అగ్ని ప్రమాదం సృష్టించే  సంఘటన. ఇది ఎప్పుడో రాజేష్ ఖన్నాతో మన్మోహన్ దేశాయ్ తీసిన ‘రోటీ’ లో రేషన్ డీలర్ జీవన్ దాచేసిన సరుకుని సింపుల్ గా పట్టుకోవడం లాంటి సాత్విక సంఘటన కాదు – చాలా నీచమైన తామసిక సంఘటన! 

        ఒక నేరాన్ని దాచడానికి నిప్పెట్టి ఇంకో దుర్మార్గం చేసే రాక్షస చర్య.  అవినీతి అనగానే ఓ లంచం పుచ్చుకునే  సీనుతో సరిపెట్టేసే  సాదా కథనం కాదు. ఆ అవినీతి దుష్పరిణామంగా నష్ట తీవ్రతని భౌతికంగా చూపించే మేజర్ సీను. ఇందుకే దీంతో తలపడి కోర్టులో నిరూ పించలేక, చక్రధర్ పడే వేదన - విజువల్ గా నష్ట తీవ్రతని  చూసి చలించిన ప్రేక్షకులు కూడా అంత ఆవేశంతో రగిలిపోవడానికి వీలయ్యింది.

        ఇలా అమాయక ప్రజల ఆస్తి నష్టానికి కారణమయ్యీ, కోర్టులో దుష్టులు తప్పించుకుంటే, రెండోసారి ప్రాణ నష్టం చూస్తాడు చక్రధర్. ఇదింకా బలమైన సంఘటన. రోడ్డుపక్క నిద్రపోతున్న అభాగ్యుల మీదికి  తాగిన మైకంలో కారు తోలిన దుర్మార్గం కూడా కళ్ళెదుటే కోర్టులో వీగిపోతుంది!

        దీంతో తిరగబడతాడు చక్రధర్. కోర్టులోనే అవినీతి యంత్రాంగాన్ని పట్టుకుని చితకబాది చితకబాది  వదుల్తాడు. కిష్కింధ అవుతుంది కోర్టు.

        ఫిలిం ఈజ్ బిహేవియర్ అంటారు స్క్రీన్ ప్లే పండితులు. పాత్రంటే ఏంటి?  సంఘటనని సృష్టించేది. మరి సంఘటనంటే? పాత్రకి వన్నెచేకూర్చేది...అని అంటాడు 19 వ శతాబ్దపు ప్రసిద్ధ నవలా రచయిత హెన్రీ జేమ్స్.  మనుషులు నాల్గు భౌతిక తత్త్వాల ( అగ్ని, భూమి, వాయు, జల౦) తోనూ, మూడు మానసిక తత్త్వాల ( చర, స్థిర, ద్విస్వభావాలు) తోనూ ఉంటారని అంటారు ప్రాచీన శాస్త్రకారులైన పరాశరుడు, వరాహ మిహిరుడు ప్రభృతులు.

      ఈ పైవన్నీ క్రోడీకరించుకుని,  రక్తమాంసాలతో సజీవంగా అవతరించిందే మేజర్ చక్రధర్ పవర్ఫుల్ పాత్ర!

        కోర్టు లో తిరగబడి ఇలా ప్రకాశించిన చక్రధర్, ఇక బొబ్బిలిపులియై కొండ కోనల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని  ప్రజా ద్రోహుల్ని బంధించి హతమారుస్తూంటాడు. ఇదంతా యమలోకం వాతావరణాన్ని స్ఫురింపజేస్తుంది. తనేమో యమధర్మ రాజు, అనుచరులు యమ భటులు, వాళ్ళు పట్టుకొచ్చే జీవులు పాపులు. వాళ్ళకి కఠిన శిక్షలు. మరణ శిక్షలు.

        ప్రపంచ పురాణా లన్నిటినీ కూలంకషంగా పరిశోధించడానికే  జీవితాన్నంతా వెచ్చించిన గ్రేట్ జోసెఫ్ క్యాంప్ బెల్ -  ఓ చిన్న జోకు అయినా, మహా గొప్ప ఫిక్షన్ అయినా అన్నిటి మూలాలూ పురాణాల్లోనే ఉన్నాయని అంటాడు. అందుకే ఒక కల్పిత పాత్రలో వివిధ పురాణ పాత్రల కోణాలూ  కనిపిస్తాయనీ పేర్కొంటూ- ‘ది హీరో విత్ ఎ థౌజండ్ ఫేసెస్’ అన్న ఉద్గ్రంథాన్ని రచించాడు. సశాస్త్రీయంగా ఇలాటి మిథికల్ క్యారెక్టరే మేజర్ చక్రధర్ కూడా! 

        నవలా పాత్రలాగా సినిమా పాత్ర డైలాగులతో కథ నడపలేదు. చేతలతో నడిపితేనే చెల్లుబడి అయ్యేది. చేతలన్నీ  అయ్యాకా మాటలతో ఎంతైనా నడపొచ్చు. ఇలాటి మేకప్ ఉండబట్టే క్లయిమాక్స్ లో చాలా సుదీర్ఘమైన  ఆ వాదోపదావాలతో కూడిన కోర్టు సీనుని విగు పుట్టించకుండా డైలాగులతో లాక్కు రాగలిగాడు చక్రధర్. పైగా తన వాదపటిమకి తగ్గట్టు కథనంలో మొదటి మలుపు ( ప్లాట్ పాయింట్- 1)  దగ్గర స్థాపించిన సమస్య ( ప్రాణ నష్టం) కూడా అంత బలంగానూ వుంది. ప్లా పా- 1 దగ్గర సమస్య ఏర్పాటు బలంగా వుంటే దాంతో పోటీ పడుతూ ఆటోమేటిగ్గా క్లయిమాక్స్ కూడా బలంగా వచ్చేసినట్టే. ఇలాటి కథా పథకం బలం వల్లే సినిమా మొత్తం మీద చివరి కోర్టు సీనుని అంత హైలైట్ గా మార్చగలిగాడు చక్రధర్. 

      అతడి వాదం ఒక్కటే. ఒకే కేసులో ఒక కోర్టుకీ దాని పై కోర్టు కీ పొంతన లేని తీర్పు లేమిటి? శత్రువుని సైనికుడు సరిహద్దులో చంపితే  సత్కారమా? అదే దేశం లోపల నేరస్థుల్ని వధిస్తే మరణశిక్షతో ఛీత్కారమా? నిజంగా సైనికుడు దేశాన్ని ఎప్పుడు కాపాడినట్టు? మర లాంటప్పుడు ఈ మరణశిక్ష తన కెందుకు విధించినట్టు?

        యంత్రాంగం సమాధానం ఇవ్వలేని లేని ప్రశ్నలు.  దేశం మొత్తం మీద ఒక్క సైనిక జవాను మాత్రమే వేయగల కఠిన ప్రశ్నలు. 

        అతడి ఆవేదన మాత్రమే గొప్పది. 

        ప్రాణాల్ని పణంగా పెట్టి దేశాన్ని కాపాడు కొస్తూంటే, పందికొక్కులు దేశంలోపల సర్వ వ్యవస్థల్నీ నాశనం చేస్తున్నాయి.

        స్ట్రాంగ్ క్యారెక్టర్ కి నషాళాన్నంటే అంతే స్ట్రాంగ్ స్టోరీ!

        ఈ పాత్ర చిత్రణతో  తెరమీద మహానటుడు ఎన్టీఆర్ ప్రేక్షకులకి ఊపిరి సలపనీయడు. తెరవెనుక సూత్రధారి దాసరి కూడా కళ్ళు తిప్పుకోనివ్వడు.

        తెలుగు ప్రజల సాంస్కృతిక, రాజకీయ భావజాలాల మీద ‘బొబ్బిలిపులి’ ది చెరగని ముద్ర!


- సికిందర్
(2009- ‘సాక్షి’)
http://www.cinemabazaar.in/

       

        

28, ఫిబ్రవరి 2016, ఆదివారం



రచన – దర్శకత్వం : చునియా

తారాగణం : కార్తీక్ రాజు, నిత్యా శెట్టి, జహీదా, అలీ, విశ్వ, రాశి, కృష్ణుడు, నరేష్, అనితా
చౌదరి తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయా గ్రహణం : కన్నా కూనపరెడ్డి
బ్యానర్ : అయాన్ క్రియేషన్స్,   నిర్మాత : ఆయాన్ క్రియేషన్స్ 
విడుదల : 26 ఫిబ్రవరి, 2016
***
రో దర్శకురాలు చునియా అలియాస్ సాహెబా తెలుగుకి పరిచయమవుతోంది. కె.  రాఘవేంద్రరావు శిష్యురాలిగా, నాగార్జున సంస్థ సీరియల్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవంతో, సినిమా దర్శకత్వ అవకాశాన్ని సంపాదించుకుంది. మేకింగ్ లో ఉన్నప్పడు ఆమె ప్రతిభా పాటవాల గురించి పాజిటివ్ విషయాలు చాలా వినవచ్చాయి. మరి ‘పడేసావే’  అన్న టైటిల్ తో ప్రేమ సినిమాని అందిస్తూ, ప్రేక్షకుల మధ్య కొచ్చినప్పుడు ఆ పాజిటివ్ విషయాలు ఎలావున్నాయో చూద్దాం.

కథ
       కార్తీక్ (కార్తీక్ రాజు), నిహారిక (నిత్యా శెట్టి) లు చిన్ననాటి స్నేహితులు.  పెద్దయ్యాక కార్తీక్ నిహారికని ఫ్రెండ్ లాగానే చూస్తాడు. ఆమె ప్రేమిస్తున్నాడనుకుంటుంది. ఒకరోజు తన ఫ్రెండ్ స్వాతి ( జహీదా) ని కార్తీక్ కి పరిచయం చేస్తుంది. ఆమెని చూసి వెంటనే ప్రేమలో పడతాడు కార్తీక్. అప్పటికే ఆమెకి ఎంగేజ్ మెంట్ జరిగి వుంటుంది. అయినా ఆమె కార్తీక్ మీద  ప్రేమని పెంచుకుంటుంది. ఇది తెలుసుకున్న నిహారిక హర్ట్ అవుతుంది. నిహారిక కూడా కార్తీక్ ని ప్రేమిస్తోందని స్వాతికి తెలుస్తుంది. ఇప్పుడు ఈ ముగ్గురి మధ్యా  సమస్య ఎలా పరిష్కారమయిందనేది  మిగతా కథ.

ఎలా వుంది కథ
       ఈ ముక్కోణ ప్రేమ కథ ట్రెండ్ లో లేకపోవడం మొదటి డ్రా బ్యాక్. ఆతర్వాత దీన్ని చెప్పిన విధానం రెండో మైనస్. ఓ పదేళ్ళ క్రితం ఈ కథ ప్రేక్షకులకి నచ్చేదేమో. ఇప్పుడు కాలాతీతమై పోయింది. ఇప్పుడున్న మార్కెట్లో ఇలాటి కాలం చెల్లిన కథకి స్థానం లేదు. ప్రేమ కథలు చాలా ముందుకెళ్ళి పోయాయి. 

ఎవరెలా చేశారు
       
హీరోగా నటించిన కార్తీక్ రాజుకి ఇది రెండో సినిమా. ‘టిప్పు’ అనే మొదటి సినిమాతోనే ప్రేక్షకుల ఆదరణా గుర్తింపూ పొందలేకపోయాడు. ఇదే ఇప్పుడు రిపీటయ్యింది. ముందుగా ఈ పోటీ రంగంలో తను నటనని సాన బెట్టుకోవాల్సి వుంటుంది. తనని మించిన కొత్త హీరోలు వస్తున్నారు. నటన ఎలా వున్నా ఈ సినిమా దాని బలహీనతల  వల్ల తనకే విధంగానూ ఉపయోగపడే అవకాశం లేదు. హీరోయిన్ లిద్దరూ  ఈ సినిమాకి ఏమాత్రం ప్లస్ కాలేకపోయారు. కారణం,  కథా కథనాలకి తోడు వాళ్ళ పాత్రల తీరుతెన్నులే. ఇప్పటి అమ్మాయిలూ ఈ పాత్రల్లాగా వుండరని వాళ్ళకీ తెలిసివుంటుంది. పాత ఫార్ములా  హీరో పాత్రలాగే ఈ నాటి యూత్ కి ప్రతినిధులు అన్పించుకునే ఛాయలు ఎక్కడా ఈ హీరోయిన్లు ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది.
         ఇక ఒకనాటి హీరోయిన్ రాశి ఇందులో తల్లి పాత్ర పోషించింది. అలీ, వెన్నెల కిషోర్ లు కామెడీ కోసం వున్నారు గానీ అదీ విఫలమయ్యింది. కన్నా కూనపరెడ్డి ఛాయాగ్రహణం, అనూప్ రూబెన్స్ పాటలు ఫర్వాలేదనిపించుకున్నా, ఇవొక్కటే సినిమాని నిలబెట్టలేవు. 

చివరికేమిటి?
       
తెలుగులో దర్శకురాళ్ళు రావడం చాలా అరుదు. అలాటిది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వీలయినంత జెండర్ ప్రధానమైన ప్రత్యేకతని ముందు చాటుకోవడం తెలియాలి. అందరు మగాళ్ళ లాగే తనూ సినిమా తీస్తే జెండర్ ప్రత్యేకత కాదుకదా ఏ  ప్రత్యేకతా వుండదు. సబ్జెక్టుని ఒక స్త్రీగా తాను  చూసే కోణం ఎలావుంటుందో ప్రేక్షకులకి పరిచయం చేసినప్పుడే తేడా తెలుస్తుంది. మేల్ డైరెక్టర్లు సినిమా అంటే, పాత్రలూ అంటే రొటీన్ గా వాళ్ళ దృక్కోణం లోంచి ఇలా చూపిస్తున్నారు, నేను వీళ్ళని ఫాలో అవకుండా ఒక ఫిమేల్ డైరెక్టర్ గా భిన్నత్వంతో నా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు దర్శకురాలు నాల్గు కాలాలు గుర్తుండే సినిమాలు తీయగల్గుతుంది. మరీ దీపా మెహతానో, మీరా నాయరో కానవసరం లేదుగానీ, దర్శకురాలిగా తన కమర్షియల్ విజన్ ని తను రూపొందించుకుంటే చాలు. లేకపోతే తనకీ శ్రమ వృధా, నిర్మాతలకీ పెట్టుబడి వృధా.

        ఇవ్వాళ్ళ మార్కెట్ కి కావాల్సింది ఇలాటి ప్రేమలు కాదు- ప్రేమల పేరుతో  యూత్ పాల్పడే క్రేజీ చేష్టలు. కథ కంటే కథన కుతూహలమున్న వర్కౌట్లు. బాలీవుడ్ లో ఇది చేస్తున్నారు, టాలీవుడ్ లో పదేపదే పాత  ప్రేమలు పట్టుకుని మార్కెట్ లో అపహాస్యం పాలవుతున్నారు.

-సికిందర్






27, ఫిబ్రవరి 2016, శనివారం

షార్ట్ రివ్యూ!


దర్శకత్వం : రవికాంత్ పారెపు
తారాగణం : అడవి శేష, అదా శర్మ, అనసూయ, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, రవి వర్మ, సత్యదేవ్ తదితరులు
కథ : అడివి శేష్,  స్క్రీన్ ప్లే : అడివి శేష్- రవికాంత్ పారెపు, డైలాగ్స్- స్క్రిప్ట్ గైడెన్స్ : అబ్బూరి రవి,  సంగీతం : శ్రీ చరణ్ పాకాల, ఛాయాగ్రహణం : షానీల్ దేవ్
బ్యానర్ : పివిపి సినిమా- మాటనీ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత : పరమ్  వి. పొట్లూరి, కెవిన్ ఏన్
విడుదల :26 ఫిబ్రవరి 2016
***
        సృజనాత్మకంగా తెలుగు సినిమాకి  శిఖరాగ్ర తలాల్ని తాకే సృష్టి ఇక అసాధ్యమేమో అనుకుంటున్న నాటు దర్శకత్వాల కాలంలో, కొత్తగా పాతికేళ్ళ యువదర్శకుడు అత్యంత పరిణతితో, దృశ్యమాధ్యమం మీద సంపూర్ణావగాహనతో, పట్టుతో, ప్రావీణ్యంతో, తన పనితనాన్ని తెలుగులో అరుదైపోయిన క్వాలిటీ సినిమా స్థాయికి చేర్చి ‘క్షణం’ ని సార్ధకం చేశాడు. సినిమా కళని కాలాన్ని బట్టి ఏమాత్రం సానబట్టకుండా అరిగిపోయిన దర్శకత్వాలతో అవే రకం నాసి సినిమాలు తీసే వాళ్లకి మార్కెట్లో సవాలు  విసిరాడు. సాధారణంగా  మార్కెట్లో ఓ కొత్త తరహా ఉత్పత్తి వచ్చిందంటే మిగతా ఉత్పత్తి దారులు అప్రమత్తమై దాంతో పోటీ పడే మరో కొత్త ఉత్పత్తి తో మార్కెట్లోకి వస్తారు. ఇది సినిమా ఫీల్డుకు వర్తించదనుకుంటారు. కొత్త మేకింగ్ తో ఓ సినిమా వచ్చిందని ఎంత ప్రచారం జరిగినా, వెళ్లి చూడమని ఎందరు చెప్పినా దర్శకులయ్యే వాళ్ళు, దర్శకులైన వాళ్ళూ అటువైపు కన్నెత్తి చూడరు. పోటీతత్వం ఇలా పడకేయడం మరే రంగంలో చూడం. మేకింగ్ పరంగా ‘క్షణం’ అనే కళాసృష్టి విసురుతున్న కొత్త సవాళ్లు ఎవరికీ పట్టడం లేదు. నాటు దర్శకత్వాల్లోనే వాళ్లకి స్వర్గసుఖాలున్నట్టున్నాయి.

      కొత్త దర్శకుడు రవికాంత్ పారెపు మొదటి ప్రయత్నంగా ఒక థ్రిల్లర్ ని, అందునా చాలా సంక్లిష్ట కథా సంవిధానంతో కూడిన ప్రయత్నానికి సాహసించాడు. ఇందులో పూర్తి విజయం సాధించాడు. అయితే పూర్తి క్రెడిట్ తానొక్కడికే దక్కదు, రైటింగ్ సైడ్ అడివి శేష్ కీ,  అబ్బూరి రవికీ కూడా కలిపి దక్కుతుంది. ఏదైనా ముందు క్వాలిటీ రైటింగ్ వల్లే సాధ్యమవుతుందని నిరూపించారు ఈ ముగ్గురూ.

        ‘క్షణం’ ఒక కళ్ళు తిప్పుకోనివ్వని అద్భుత విజువల్ కాన్వాస్ తో, మనసు మరల్చుకోనివ్వని ఉర్రూతలూగించే విషయ వ్యక్తీకరణతో, ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ జాతి లక్షణాల్ని ప్రదర్శించుకుంటుంది. కల్తీ లేని దీని జాతి లక్షణమే దీని విజయరహస్యం. ఇప్పుడున్న సోకాల్డ్ సృష్టి కర్తలు ఈ విజయరహస్యాన్ని పట్టుకోవడం అంత సులభం కాదు, పట్టుకోవాలన్న ఆసక్తి వుంటే కదా! 

        థ్రిల్లర్ అనగానే ‘ఒక వస్తువు కోసం కొంతమంది వెంటాడే’  ఈజీగా వుండే రోడ్ మూవీస్ గానే ఉంటున్న వైనం ఇటీవల ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ తో  కూడా మళ్ళీ చూశాక,  ఈ మూసని  బ్రేక్ చేస్తూ వచ్చిన ‘క్షణం’ ఏం చెబుతోందో ఒకసారి చూద్దాం...


కథ
       అమెరికాలో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా ఉంటున్న ( రిషి) కి ఇండియానుంచి మాజీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి అర్జెంటుగా రమ్మంటుంది. నాల్గేళ్ళ క్రితం వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన శ్వేత ( అదా శర్మ) పిలుపుకి కారణమేంటో తెలుసుకోవడానికి ఇండియా వస్తాడు. హైదరాబాద్ లో ఉంటున్న శ్వేత తన నాల్గేళ్ళ  కూతురు రెండు నెలల నుంచీ  కన్పించకుండా పోయిందనీ, ఎవరూ- ఆఖరికి పోలీసులు కూడా కనుక్కోలేక పోతున్నారనీ వాపోతుంది. రిషి రంగం లోకి దిగుతాడు. అంతటా తికమక పెట్టే సమాచారమే వస్తూంటుంది అతడికి... ఎవర్నడిగినా,  పోలీసులు సహా,  లేని కూతుర్ని ఎలా వెతికి పెట్టమంటారని ప్రశ్నిస్తారు. పోలీసులు కేసు క్లోజ్  చేశామంటారు. రిషి కి ఎవర్ని నమ్మాలో అర్ధం గాదు. శ్వేత అబద్ధం చేప్తోందా తనకి కూతురుందనీ?. డ్రగ్స్ బానిసైన శ్వేత మరిది బాబీ (రవివర్మ) మీద కన్నేస్తాడు. ఆఫ్రికన్లతో కుమ్మక్కై వున్న అతడి డ్రగ్ రాకెట్ ని చూసి  శ్వేత కూతుర్ని ఇతనే  కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానిస్తాడు. పిక్చర్లోకి ఈ డ్రగ్ రింగ్ తో సంబంధమున్న బాబూ ఖాన్ ( వెన్నెల కిషోర్) వస్తాడు. ఇంకెవరెవరో వస్తారు.  ఆ పిల్ల తన కూతురేనని  ఇంకొకడొస్తాడు ... అసలేం జరిగి వుంటుంది? శ్వేత మానసిక స్థితిని అనుమానిస్తాడు. ఒకటొకటే అమ్మాయి అదృశ్య రహస్యాన్ని ఛేదిస్తూ పోతాడు...ఒకటొకటే నమ్మలేని నిజాలు బయటపడుతూంటాయి...ఒకటి తవ్వితే ఇంకోటి.. ఆఖరికి తెలుసుకున్న కూతురి రహస్యం ఎదురుతిరిగి తనకే కొట్టడంతో షా కవుతాడు. తన గురించి తనకే తెలీని నిజం బయట పడి అవాక్కవుతాడు...

ఎలావుంది కథ : 
       
హెన్రీ కథల్లోలాగా కొసమెరుపు వున్న షాకింగ్ కథ. కూతురు వుందా లేదా - అసలుందా లేదా -  అన్న సెంట్రల్ పాయింటుతో ప్రేక్షకుల్ని ఆద్యంతం లాక్కెళ్ళే  సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కథ ఒక కొత్త అనుభూతినిచ్చే విధంగా వుంది చాలా కాలం తర్వాత. అయితే చివర్లో సస్పెన్స్ వీడిపోయాక ఒక నైతిక సంబంధమైన ప్రశ్న ఈ కథ పట్ల గౌరవాన్ని కొంచెం తగ్గిస్తుంది. పుట్టిన కూతురు వేరొకడి రక్తమన్న విషయం దాచి పెట్టి భర్తతో కాపురం చేయడం హీరోయిన్ పాత్రకి తగదు అన్పించేలా వుంటుంది. ఇదేదో విదేశీ కథైతే  అక్కడ ఓకే అనుకోవచ్చు, ఇక్కడ  కాదు. ఎంత  ఈ రహస్యం తెలిసేటప్పటికి సినిమా ముగింపుకొచ్చినా – హీరోయిన్ అనైతికత మనల్ని వెంటాడుతూనే వుంటుంది.

ఎవరెలా చేశారు
         
అందరూ చాలా బాగా చేశారు, నటీనటుల కాడ్నించీ టెక్నీషియన్స్ వరకూ. అడివి శేష్ ఒక హీరోలా హీరోయిజం ప్రదర్శించకుండా, ఓ సామాన్యుడిలా సహజ నటన కనబర్చాడు. ఇంతవరకూ చేసిన సినిమాలు ఒకెత్తు- ఇదొక్కటీ ఒకెత్తు. అతను కేవలం హీరో పాత్రలే వేయకుండా కొన్ని సినిమాల్లో  హీరోయేతర పాత్రలు కూడా వేస్తూ ఇమేజి చట్రాలకి దూరంగా ఉంటున్నాడు. ‘దొంగాట’ లో బుద్ధి తెచ్చుకునే నెగెటివ్ పాత్ర వేశాక, ఇప్పడు బుద్ధి నేర్చుకునే మాజీ బాయ్ ఫ్రెండ్ పాత్ర వేశాడు. తను వున్న ప్రతీ సీనూ ఏ బిల్డప్పులూ లేకుండానే వేడి పుట్టించాడు. అతడి గ్లామరస్ రూపం ఈ పాత్రకి  చాలా ప్లస్ అయింది. 

        హీరోయిన్ అదా శర్మ ఈ సారి మసాలా సినిమాలకి దూరంగా ఒక  విషయమున్న, నటిగా తనకి పని వున్న పాత్ర నటించింది. అసలు పిల్ల ఉందా లేదా, తనని నమ్మాలా వద్దా, తను సైకోనా కాదా అన్న షేడ్స్ అన్నిటినీ అలవోకగా ప్రదర్శిస్తూ ఎమోషనల్ డ్రామాని బాగా రక్తి కట్టించింది. 

        కమెడియన్ సత్యం రాజేష్ పోలీసు అధికారి పాత్రలో తను చౌదరి అయి, కానిస్టేబుల్ ని రెడ్డీ అని పిలుస్తూ కమ్మా రెడ్ల కనిపించని సెటైరికల్ ప్లేని సైడ్లో ప్రదర్శించుకుంటూ పోయాడు. ఇది కాదు  పాయింటు - చాలా సర్ప్రైజింగ్ గా, నిజమైన  బంజారా హిల్స్ పోలీసు వాడిలా ఖతర్నాక్ లుక్ తో, పర్వెర్టెడ్ డైలాగ్స్ తో, ప్రతీచోటా హైలైట్ అవుతూ పోయాడు. అతడికి అవార్డు రావొచ్చు. 

        ఇంకో సర్ప్రైజ్  గిఫ్ట్, ఎసిపి జయగా నటించిన అనసూయ. ప్రతీ పాత్ర వెనకాలా కొంత చీకటి చరిత్ర ఉన్నట్టే, తన నంగనాచి పాత్రని కూడా  టెర్రిఫిక్ గా పోషించు కెళ్ళింది తన క్లాస్ నటనతో.

        ఇక వెన్నెల కిషోర్ బాబూఖాన్ పాత్రలో ఓ షేర్ ఖాన్ త్యాగమొకటి చేస్తూ పాత్రని ఎక్కడికో తీసికెళ్ళాడు. ఇది కూడా కామెడీ పాత్ర కాదు. సత్యం రాజేష్, ఇతనూ ఇక్కడ కామెడీ పాత్రలు కావు. వెన్నెల కిషోర్ ఇహ కామెడీ మానేసి ఇలాటి సెన్స్ వున్న క్యారక్టర్లు వేస్తే ప్రేక్షకుల ఆదరణ ఇంకా బాగా పొందగలడు.

        ఈ సినిమాలో ఆఫ్రికన్ నటులు కూడా ఫెంటాస్టిక్ గా వున్నారు. ఇక డ్రగ్ బానిసగా రవివర్మ డ్రగ్ బానిసలకే గురువు అన్నట్టుగా వున్నాడు. హీరోయిన్ భర్తగా నటించిన సత్యదేవ్ కూడా పైకి కన్పించని శాడిస్టుగా మెత్త మెత్తగా తనవంతు కార్యక్రమం నిర్వహించాడు. ఈ సినిమాలో అందరూ పైకి పవిత్రులే, వెనకాల మాత్రం గోతులే. అయితే కూతురి పాత్రలో అమ్మాయి సెలక్షన్ కుదర్లేదు. చూస్తే ఆమెకి తల్లి పాత్ర అదాశర్మ రంగూ పోలికలూ లేవు, తండ్రి పాత్ర సత్యదేవ్ కి మ్యాచ్ అయ్యే రంగూ పోలికలతో వుంది. కానీ తండ్రి ఈ పాత్ర కానప్పుడు- అసలు తండ్రెవరో ఆ  రూపురేఖలకి దగ్గరగా ఆమె వుండాలేమో...?

        తక్కువ బడ్జెట్ తోనే టెక్నికల్ గా ఈ మూవీ చాలా సాధించింది. దీని విజువల్ కాన్వాస్, డ్రమ్స్ ప్రధానంగా మ్యూజికల్ ట్రాక్,  తెలుగు సినిమాకి ఒక కొత్త జన్మ ప్రసాదించి నట్టున్నాయి. నిజంగానే నిన్న తెలుగు సినిమా పునర్జన్మెత్తింది. కెమెరామాన్ షానీల్ దేవ్ ఈ విజువల్ వండర్ కి చాలా పెద్ద ఎస్సెట్. శ్రీ చరణ్ పాకాల కూడా డ్రమ్స్ తో, అతి కొద్ది ఇన్ స్ట్రుమెంట్స్ తో- సినిమా ఆద్యంతం కథాకథనాలకి తోడ్పడే ఒక థీమ్ ట్రాక్ ని క్రియేట్ చేశాడు. రొడ్డ కొట్టుడు బ్యాక్ గౌండ్ మ్యూజిక్ కాలుష్యం నుంచి విముక్తి కల్గించాడు. లోకేషన్స్, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిటింగ్, ఫైట్స్,  యాక్షన్ దృశ్యాలు కూడా ఉన్నతంగా వున్నాయి.

        ఈ కథని అడివి శేష్ ఇస్తే, అడివి శేష్ తో  దర్శకుడు రవికాంత్ కలిసి స్క్రీన్ ప్లే చేశారు. అబ్బూరి రవి మాటలు రాసి స్క్రిప్టు గైడెన్స్ ఇచ్చారు. ఇదంతా ముగ్గురు విద్యార్ధులు శ్రద్ధగా చదువుకుని  పరీక్ష రాసినట్టుంది. పకడ్బందీ కథా కథనాలు, పకడ్బందీ పాత్రచిత్రణలు, పకడ్బందీ సంభాషణలు ఇందుకే సాధ్యమయ్యాయి. కమర్షియల్ సినిమాని బిల్డప్పుల హీరోతనాలూ, పాటలూ స్టెప్పులూ, లవ్వులూ కామెడీలూ, ఇంకేవో  సెంటిమెంట్లూ సున్నాలూ పూసుకోకుండా కూడా తీయవచ్చని (రాయవచ్చని)  ఓ గైడ్ లా తయారుచేసి పెట్టారు దీన్ని. 

        చిన్నవయసులో దర్శకుడుగా రవికాంత్ తను కొత్తవాడనే ఛాయలు ఎక్కడా కన్పించకుండా- చాలా మెచ్యూరిటీతో దర్శకత్వం వహించాడు. చివర్లో నైతికతకి తిలోదకాలివ్వడం తప్పితే, ఇంకే తప్పులూ దొర్లకుండా చేసిన ఈ తొలిప్రయత్నం థ్రిల్లర్స్ జాతిలో ఒక కళా సృష్టిగా నిలిచిపోతుంది. ప్రేమ కథని మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో అవసరమున్నప్పుడల్లా రివీల్ చేస్తూపోయిన క్రియేటివిటీ - సమయస్ఫూర్తి - సబ్జెక్ట్ మీదున్న కమాండ్ ని తెలియజేస్తుంది. 

        ఒక సినిమా తీయాలంటే ఇంత వుంటుందా అని పునరాలోచనలో పడెయ్యకపోతే, ఎవడుపడితే వాడొచ్చి  రొడ్డ కొట్టుడు సినిమాలు తీసేసి పోతాడు. ఈ ‘క్షణం’ చూసి ఒక్క క్షణం ప్రేక్షకులు కూడా ఇలా నిజమైన క్వాలిటీ సినిమాలు చూసే అవకాశమివ్వకుండా, ఎందుకు  రాచిరంపాన పెడుతున్నారో ఆలోచించాలి.


-సికిందర్
(స్క్రీన్ ప్లే సంగతులు : సోమవారం)






షార్ట్ రివ్యూ!





కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సతీష్ కాసెట్టి
తారాగణం: శ్రీకాంత్, నిఖితా తుక్రాల్, నాజర్, కోట శ్రీనివాస రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పృథ్వి, వినయ్  వర్మ తదితరులు
మాటలు : లక్ష్మీ భూపాల్, సంగీతం : సాయి కార్తీక్, ఛాయాగ్రహణం : శ్యాం ప్రసాద్
బ్యానర్ : అఖండ భారత్ క్రియేషన్స్ , నిర్మాత: షేక్ మస్తాన్
విడుదల : 26 ఫిబ్రవరి 2016
***
          టెర్రరిజం మీద సినిమాలు ఇవ్వాళ కొత్త కాదు. హిందీలో  రొటీన్ కి కాస్త పక్క కెళ్ళి క్యారక్టర్ బేస్డ్ టెర్రరిజం సినిమాలు వాస్తవికంగా తీసిన సందర్భాలున్నాయి. కానీ తెలుగులో ఒకే టెంప్లెట్ ని పెట్టుకుని, అవే మూస టెర్రరిజాలు తీస్తున్నారు. నగరం మీద టెర్రరిస్టులు దాడికి ప్లాను చేయడం, దాన్ని హీరో సాయంతో పోలీసులు భగ్నం చేయడం... ఈ చట్రం లోంచి బయటికి వచ్చి తీసిన టెర్రరిజం సినిమాలు తెలుగులో జీరో. ఇంతేగాక కథా కథనాల పరంగానూ ఇవి మూసపాత్రలతో సహా మూస ఫార్ములా సినిమాలుగానే ఉంటున్నాయి. తీస్తే కమర్షియల్ మసాలాగా తీయడమో, లేకపోతే రియలిస్టిక్ పేరు చెప్పి దాన్ని మళ్ళీ మూస ఫార్ములా గా తీయడమో చేస్తున్నారు. ఇంకో కేటగిరీ ఏమిటంటే,  ఎప్పుడో పాతబడిన, చూసి చూసి వున్న  ‘ముఖ్యమంత్రి సీటు కోసం హోం మంత్రి కుట్ర చేయు’  టైపు పాత చట్రంలోకే మళ్ళీ టెర్రరిజం కథల్ని కూడా ఇరికించేసి చూపించెయ్యడం. ప్రస్తుత ‘టెర్రర్’ ఈ పథకం కిందికే వస్తుంది. తెలుగు సినిమా కథ తయారుచేయడం ఎంత ఈజీ అయిపోయింది!! 

        ఈ మధ్య సినిమాలతో వెనుకబడ్డ హీరో శ్రీకాంత్ పోలీసు పాత్రతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అలాగే  ‘హోప్’, ‘కలవరమాయే మదిలో’ సినిమాల దర్శకుడు సతీష్ కాసెట్టి చాలా కాలం గ్యాప్ తర్వాత యాక్షన్ సినిమాతో రావడం ప్రత్యేకత. విడుదలకి ముందు ఈ సినిమా పబ్లిసిటీతో ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి రేపింది. ఈ ఆసక్తినీ అంచనాలనీ అందుకునే విధంగా  ‘టెర్రర్’  ఏయే ప్రత్యేకతలు మోసుకొచ్చిందో ఒకసారి చూద్దాం. 

కథ
       
క కేసు విషయంలో పనిష్మెంట్ గా  కౌంటర్ ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ కి బదిలీ అవుతాడు సీ ఐ విజయ్( శ్రీకాంత్). ఆ కేసులో అతను  ప్రవర్తించిన తీరుని వ్యతిరేకించి అతడి తండ్రి ( నాజర్) దూరమవుతాడు. భార్య పూజ  ( నిఖితా తుక్రాల్) తో వేరే కాపురం ఉంటాడు విజయ్. తన మీద కేసు ఎంక్వైరీ అనుకూలంగా రావడానికి ఓ ఎమ్మెల్యే ( పృథ్వీ) కి  డబ్బులిస్తూంటాడు విజయ్. ఇలా వుండగా కౌంటర్ ఇంటలిజెన్స్ డిసిపి  రాథోడ్ (వినయ్ వర్మ) అనే పై అధికారి విజయ్ కి ఓ ఆపరేషన్ అప్పజెప్తాడు.  సిటీలో టెర్రరిస్టు కార్యకలాపాల మీద నిఘా వెయ్యమని. విజయ్ దర్యాప్తు చేపట్టి ఇన్ఫార్మర్ల తోడ్పాటుతో కేసుని ఛేదిస్తూంటాడు. ఇంకో వైపు ఎమ్మెల్యేకి డబ్బులివ్వాల్సిన వొత్తిడి వుంటుంది. విజయ్ దృష్టికి  రాకుండా ఒక బాంగ్లాదేశ్  కి చెందిన టెర్రరిస్టు ముఖ్యమంత్రిని హతమార్చేందుకు పథకం వస్తాడు. ఇది హోంమంత్రి (కోట శ్రీనివాసరావు) కీ, కేంద్ర నాయకుడికీ తెలిసి వాళ్ళ రాజకీయప్రయోజనాల కోసం సైలెంట్ గా ఉండిపోతారు. టెర్రరిస్టు దాడిలో ముఖ్యమంత్రి చనిపోతే ఆ పదవిలోకి  తను రావాలన్న ఆశతో హోం మంత్రి ఉంటాడు. ఇతడికి డిసిపి రాథోడ్ తోడవుతాడు. దీంతో విజయ్ మీద వొత్తిడి తెస్తాడు దర్యాప్తు ఆపెయ్యమని. విజయ్ కి తెర వెనుక కుట్ర అర్ధమైపోయి ఎదురు తిరుగుతాడు. తను లొంగే సమస్యే లేదనీ, కుట్రని భగ్నం చేస్తాననీ సవాలు విసిరి హోం మంత్రికి శత్రువవుతాడు. ఇదీ విషయం. ఇప్పుడు తన మీద జరిగే హత్యాయత్నాల్ని  తిప్పికొడుతూ, నగరానికి టెర్రరిజం ప్రమాదాన్ని విజయ్ ఎలా నివారించాడన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ
       
ముందే చెప్పుకున్నట్టు ఇది ‘ముఖ్యమంత్రి సీటు కోసం హోం మంత్రి కుట్ర చేయు’  రొటీన్ టెర్రర్ మూస కథే. ఇన్నేళ్ళుగా మనం చూస్తున్న దాని ప్రకారం దేశం లో నాయకులెవరూ టెర్రరిస్టులతో చేతులు కలిపిన దాఖలాల్లేవు. నాయకులెవరికైనా వుంటే గింటే మాఫియాలతో, స్మగ్లర్లతో సంబంధాలుంటున్నట్టు చూస్తున్నాం. ఇది కూడా ఆర్ధిక ప్రయోజనాలకోసమే. టెర్రరిస్టులతో చేతులుకలిపి దేశద్రోహానికి పాల్పడే దుర్మార్గులుగా లేరు నాయకులు. వాళ్లకి దోచుకోవడానికి దేశం వుండాలి, జనం వుండాలి. బాంబులు పేల్చి మారణహోమం సృష్టించడం వాళ్ళ సిద్ధాంతంలో భాగం కాదు. ఇప్పుడు పార్లమెంట్ లో జరుగుతున్న చర్చ ఇదే. దేశంలో ఏ నాయకుడినీ యాంటీ నేషనల్ అనలేని, రుజువు చేయలేని చర్చ. మన నాయకులు ఇంతవరకు పుణ్యాత్ములే. కాబట్టి- పార్లమెంట్ సాక్షిగా పరిస్థితి ఇలా వుంటే,  వాస్తవదూరంగా నాయకుల్ని టెర్రరిస్టులుగా చూపించడం ఎలాటి సామంజస్యత? సగటు ప్రేక్షుకుడు పార్లమెంట్ ని నమ్మాలా, ఈ సినిమాని నమ్మాలా? 

        ఇంకెవరో మసాలా దర్శకుడు ఇలా తీస్తే పోనీలే అనుకోవచ్చు, కానీ ఒక జాతీయ అవార్డు పొందిన దర్శకుడుగా సతీష్ కాసెట్టి సామాజిక స్పృహ ఇలా వుండాల్సింది కాదు. దీనికి కమర్షియల్ మసాలాలు లేని వాస్తవిక సినిమా అనడం కూడా సమంజసం కాదు.

ఎవరెలా చేశారు
       
ప్రధానపాత్ర లో శ్రీకాంత్ ఇంకా బాగా చేయడానికి స్కోప్ వుంది, పాత్ర అనుమతిస్తే. కానీ పాత్రకి  చాలా సంకెళ్ళు పడ్డాయి. తనకి బలమైన విలన్ లేకపోవడం, ఉన్న విలన్ కూడా క్లయిమాక్స్ కి ముందు వరకూ ఎదురుపడకపోవడం, ఆ విలన్ తో కూడా కథ కొనసాగక, క్లయిమాక్స్ అంతా  ఆ విలన్ అనుచరుడైన బచ్చాలా వున్న జ్యూనియర్ ఆర్టిస్టు తో తలపడాల్సి రావడం వంటి బాక్సాఫీసు వ్యతిరేక అంశాల సంకెళ్ళు శ్రీకాంత్ నట సామర్ధ్యాన్ని కుదించి వేశాయి. శ్రీకాంత్ యమ సీరియస్ గా నటించ వచ్చు, కఠినమైన ఎక్స్ ప్రెషన్స్ డైలాగులూ ఇవ్వొచ్చు. ఎన్కౌంటర్లు చేయవచ్చు. ఇవన్నీ ఎవరి మీద? అసలైన ప్రత్యర్ధి ఎవరో తెలీకుండా, వాడి జోలికెళ్ళాకుండా, ఛోటా మోటా పక్క పాత్రల మీద ప్రతాపం చూపించడమా? నటనని పాత్రచిత్రణతో కలిపి చూడాలి. 

        మేకప్ కూడా పోలీస్ అధికారిని తలపించే విధంగా లేకపోవడం ఇంకో లోపం. శ్రీకాంత్ పోలీస్ పాత్రకి రియలిస్టిక్ లుక్ తీసుకురావడం మీద కూడా శ్రద్ధ పెట్టలేదు దర్శకుడు- ఇక్కడ సందర్భం కాకపోయినా ‘క్షణం’ లో సత్యం రాజేష్ పోషించిన పోలీసు అధికారి పాత్రని చూస్తే, ఆ లుక్- అచ్చం పోలీస్ అధికారి అన్నట్టుగానే వుంది. ఆ లుక్, దానికి తోడూ పర్వర్టెడ్ మెంటాలిటీవీటితో అతడి నటనా, మాట తీరూ  ప్రేక్షకులకి వెర్రెత్తించే విధంగా వున్నాయి.  తనొక కమెడియన్ అన్న విషయాన్నే పూర్తిగా మరిపించేశాడు. 

        కోట, పృథ్వీ ల నటన మూస ఫార్ములా సినిమాల నటనే తప్ప కథ చేస్తున్న డిమాండ్ మేరకు సీరియస్ రియలిస్టిక్ పాత్రలుగా కన్పించరు. దేశద్రోహం కూడా కామెడిగానే చేసేట్టున్నారు. ఇవి కథకి పొసగని పాత్ర చిత్రణలు. ఇతరపాత్రల్లో దాదాపు అందరూ కొత్త వాళ్ళే- చాలా వరకూ జ్యూనియర్ ఆర్టిస్టులుగా కన్పిస్తారు. టెర్రరిస్టుగా వేసిన నటుడు  సైతం ఆ పాత్ర స్థాయిలో లేడు. ఇలా కాస్టింగ్ లోపం అడుగడుగునా ఇబ్బంది పెడుతుంది.

        పాటలు లేని ఈ సినిమాలో సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు, అలాగే శ్యాం ప్రసాద్ ఛాయాగ్రహణం కూడా.

చివరికేమిటి?
        దర్శకుడిలో చిత్రీకరణ సామర్ధ్యం వుంది. అయితే కాన్సెప్ట్ స్పృహ, కథా కథనాలకి  ఇంకాస్త నిబద్ధతా అవసరమన్నట్టు కన్పిస్తుంది. చాలావరకూ డైలాగుల రూపంలో కథ నడిచిపోతుంది. ఇంటర్వెల్ పడగానే అంతవరకూ చూసింది నాటకం లాగుందే అన్పించిక మానదు. ఈ టెర్రరిజం - ఈ 'వాస్తవికత'  కూడా థ్రిల్లర్ జాతి  కిందికే వస్తాయి. వాస్తవికత అయినంత మాత్రాన కథా లక్షణాల్ని విస్మరించలేం. కానీ 
 ఎంతసేపూ శ్రీకాంత్ పాత్ర టెర్రరిస్టెవరో తెలుసుకునే దర్యాప్తుతోనే సరిపోతుంది- దర్యాప్తు అంశం బాక్సాఫీసు ఫ్రెండ్లీ గా వుండేది కథలో కొంత మేరకే. వీలయినంత త్వరగా దర్యాప్తు పర్వం ముగించుకుని కనుగొన్న విలన్ తో సంఘర్షణ ప్రారంభం కాకపోతే అది థ్రిల్లర్ అవదు. ‘డే ఆఫ్ ది జాకాల్’ ఇందుకు క్లాసిక్ ఉదాహరణ. ఫ్రాన్స్ ప్రెసిడెంటుని చంపేందుకు కుట్రపన్నిన టెర్రరిస్టెవరా అని కనుక్కునే దర్యాప్తు కాస్సేపే- వాడు తెలిసిపోగానే వాణ్ణి పట్టుకునే ఎలుకా పిల్లి చెలగాటంలోకి మలుపు తిరుగుంతుంది. మహాత్మా గాంధీని చంపే కథతో కమల్ హా సన్ తీసిన ‘హేరామ్’ అనే కల్పిత కథ కూడా ఇంతే. పోరాడేందుకు విలన్ లేక క్లయిమాక్స్ దాకా వాడెవరో తెలుసుకునే ఏకపక్ష  కథనం వల్ల,   విజువల్ మీడియా అయిన సినిమాకి ఎంతో అవసరమైన యాక్షన్- రియాక్షన్ ల థ్రిల్లింగ్ ప్లే లేకుండా పోయింది ‘టెర్రర్’ లో.

        ఇంతగ్యాప్ తర్వాత సతీష్ కాసెట్టి తీయకతీయక తీసిన ఈ టెర్రర్ స్టోరీ  స్క్రీన్ ప్లే లో పాత్రల పరమైన, కథా కథనాల పరమైన లోపాలన్నిటినీ తొలగించుకుని పూర్తి ప్రొఫెషనలిజం ఉట్టిపడేలా తీసి వుంటే, ఫలితాలు చాలా చాలా బావుండేవి. తనూ నిర్మాతా శ్రీకాంత్ ఎక్కడో వుండేవాళ్ళు!

--సికిందర్
(స్క్రీన్ ప్లే సంగతులు : సోమవారం)


23, ఫిబ్రవరి 2016, మంగళవారం

రివ్యూ!

రచన – దర్శకత్వం : సత్య ప్రభాస్ పినిశెట్టి


తారాగణం : ఆది పినిశెట్టి,  నిక్కీ గల్రానీ, రిచా పల్లోడ్, ప్రగతి, మిథున్ చక్రవర్తి, హరీష్ ఉత్తమన్, నాజర్, పశుపతి తదితరులు.
సంగీతం : ప్రసన్-  ప్రవీణ్ – శ్యామ్ , ఛాయాగ్రహణం : షణ్ముగ సుందరం
బ్యానర్ : ఆదర్శ చిత్రాలయా ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాత : రవిరాజా పినిశెట్టి
విడుదల : 19   ఫిబ్రవరి 2016

***

2006 లో ఒక విచిత్రం ద్వారా తేజ పరిచయం చేసిన ప్రసిద్ధ దర్శకుడు రవిరాజా పినిశెట్టి రెండో కుమారుడు ఆది పినిశెట్టి ఆతర్వాత ఓ పది  సినిమాలతో తమిళ హీరోగా స్థిరపడ్డాడు. రవిరాజా పెద్ద కుమారుడు సత్య ప్రభాస్ దర్శకుడుగా మారాడు. ఈ ముగ్గురి కాంబినేషన్లో (హీరో- దర్శకుడు- నిర్మాత)  2015 లో యాగావరాయినం నా కాక్కాఅనే తమిళ థ్రిల్లర్ విడుదలయ్యింది. తమిళంలో అంత ఆశాజనకంగా ఫలితాలు సాధించని దీన్ని తెలుగులోకి మలుపుగా డబ్ చేసి ఈ నెల 19 న విడుదల చేశారు. చెన్నై లో ఒక యదార్ధ సంఘటన ఆధారంగా దీన్ని నిర్మించామంటున్న దర్శకుడు సత్యప్రభాస్ చిత్రీకరణలో తనదంటూ  ఒక శైలిని ఏర్పాటు చేసుకుని దీన్నెలా రూపొందించాడో  ఈ కింద చూద్దాం

 కథేమిటి
      సగా అనే సతీష్ గణేష్ ( ఆది), శివ ( శ్రీ కార్తీక్), రాజేష్ ( శ్యాం కుమార్), కిషోర్ ( సిద్ధార్థ్ గోపీనాథ్) ముగ్గురూ బీకాం ఫైనల్ కొచ్చిన క్లోజ్ ఫ్రెండ్స్. ఎంతటి క్లోజ్ ఫ్రెండ్స్ అంటే, తన ముగ్గురు ఫ్రెండ్స్ పేర్లలోని మొదటి అక్షరాలతో ఎస్ ఆర్ కేఅని సగా  పచ్చబొట్టు పొడి పించుకునేంత.  కాబట్టి పరీక్షలు రాసేస్తే రేపట్నుంచీ తండ్రులు వేరే బాధ్యతలు అప్పజెప్పేస్తారని పరీక్షలు ఎగ్గొట్టి ఇంకో ఆర్నెల్లు కలిసి ఎంజాయ్ చేద్దామనుకుంటారు. సగా కి తల్లి దండ్రులు (ప్రగతి, ఆడుకాలం నరేన్), ఓ అక్కా (అనితా అయ్యర్) వుంటారు. ఆ ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కాదని తండ్రి మందలిస్తున్నా సగా వినకుండా వాళ్ళతో తిరుగుతూంటాడు. అతడికి లాస్య ( నిక్కీ గల్రానీ) అనే అమ్మాయి పరిచయమై తన దూకుడు స్వభావంతో ముప్పు తిప్పలు పెడుతూంటుందిపెళ్లి వరకూ లాక్కెళ్ళి వెళ్ళిపోతుంది

          ఈలోగా డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలొస్తాయి. ఒక రెస్టారెంట్ కెళ్తారు. అక్కడ (ప్రియ)  రిచా పల్లోడ్, సూర్య (శ్రవణ్) అనే లవర్స్ తో సగా ఫ్రెండ్స్ గొడవ పడతారు. ఆ గొడవ అక్కడే తన్నులాటకి దారి తీసి పోలీసుల్ని రప్పిస్తుంది. ఆ అమ్మాయి మరెవరో కాదు, ముంబాయి డాన్ ముదలియార్ ( మిథున్ చక్రవర్తి ) కుమార్తె. ఇది తెలుసుకున్న సగా భయపడిపోయి జరిగినదానికి ముదలియార్ కి క్షమాపణ చెప్పుకునేందుకు ముంబాయి బయల్దేరతాడు... ఇక ముంబాయిలో ముదలియార్ తో ఏం జరిగిందీ, అక్కడ్నించీ  ముదలియార్ ఉక్కు హస్తాల్లో ఇరుక్కుని సగా ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇరుక్కున్న హత్యా నేరంలోంచి ఫ్రెండ్స్ ని కాపాడుకుంటూ ఎలా బయట పడ్డాడూ అన్నవి మిగతా కథ

ఎవరెలా చేశారు
     మొదటి మార్కులు మాత్రం ఆదికీ, హీరోయిన్ నిక్కీకీ పడతాయి. ప్రధాన కథలో  నిక్కీకి పెద్దగా పాత్ర లేకపోయినా దానికి ముందు నడిచే ప్రేమ ట్రాకులో  ఆమె హైలైట్ అవుతుంది. ‘కుమారి 21 ఎఫ్ లో హెబ్బా పటేల్ హార్డ్ కోర్ పాత్ర ప్రవర్తనకి పాలిష్ చేసిన నేటివ్ వెర్షన్ గా  నిక్కీ ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ క్యారక్టరైజేషన్ గనుక ఈమెకి లేకపోయి వుంటే ఫస్టాఫ్ అంతా ఆక్రమించుకున్న లవ్ ట్రాక్ రిస్కులో పడి వుండేది. లవ్ ట్రాకుల్లో ఈ రోజుల్లో  కావలసింది లవ్ కాదు, క్రేజీగా వుండే లవర్స్ ప్రవర్తనలే. అది నిక్కీ పాత్రతో వర్కౌట్ అయ్యింది. ఆమె మంచి ఎక్స్ ప్రెజషన్స్ ఇవ్వగలదు, నవ్వించ గలదు.

          ఆది నటిస్తున్నా నన్న స్పృహ లేకుండా పాత్రలో లీనమైపోతాడుఅతడిలో సందర్భానికి తగ్గ భావప్రకటనా సామర్ధ్యం వుంది. పాత్రపరంగా దాని దైన్యాన్ని ప్రదర్శించే దృశ్యాల్లో, ముఖ్యంగా డాన్ మిథున్ చక్రవర్తిని బతిమాలుకునే దృశ్యాల్లో గుర్తుండిపోయే నటనని ప్రదర్శించాడు. క్లయిమాక్స్ లో బుద్ధి తెచ్చుకుని ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయే హృదయవిదారక దృశ్యంలో కూడా ఇంతే. తప్పకుండా ఆది ఇలాటి సెమి రియలిస్టిక్ పాత్రలకి  న్యాయం చేయగలడు

          డాన్ గా మిథున్ చక్రవర్తి, హీరో తల్లిగా ప్రగతి లకి మంచి పాత్రలే దొరికాయి. ఎక్కువగా పరిస్థితిని ఆకళింపు జేసుకునే ముఖకవళికలు, తక్కువ మాటలు కఠినంగా మాటాడే  స్వభావం ఈ రెండూ మిథున్ క్యారక్టర్ ని నిలబెట్టాయి- నిలబడేలా ఆయన చేశాడు. తెలుగు సినిమాల్లో ఏవో   అంటీ ముట్టని తల్లి పాత్రలు చేయిస్తూ తెలుగు దర్శకులు ప్రగతిని ఎంత వృధా చేసుకున్నారో ఈ సినిమాలో తల్లి పాత్రలో ఆమెని చూస్తే  తెలుస్తుంది

          సంగీతానికి పెద్దగా ప్రాధాన్య మివ్వలేదు. మ్యూజికల్ థ్రిల్లర్స్ అనేవి పూర్వకాలంలో గడిచిపోయిన సంగతులు. ఇప్పట్లో ఆశించరాదు. కెమెరా వర్క్ మాత్రం ఉన్నతంగా వుంది. ఇది దర్శకుడి విజన్ వల్ల సాధ్య పడింది. ఒక కథని ఏవిజన్ లో,  ఎలాటి మూడ్ ని క్రియేట్ చేస్తూ చూపాలా  అన్న దృక్పథం దృశ్య మాధ్యమానికి చాలా అవసరమే అయినట్టు, ఆ కథని కూడా  ఏ విజన్ లో పెట్టి నడపాలా అన్నదానిపై కూడా అవగాహన అవసరం. దర్శకుడు సత్య ప్రభాస్ కి  మొదటిది వుండి,  రెండోది లేకుండా పోయింది.

చివరికేమిటి
     అంతా బాగానే వుంది గానీ,  యదార్ధ సంఘటన అని చెప్పుకున్న ఈ కథలో  ఆ యాదార్ధ్యం కేంద్ర బిందువు కాకుండా పోయే, ప్రధానాకర్షణ కూడా కాకుండా పోయే కథనమే యమపాశం లా మారింది. సస్పెన్స్ థ్రిల్లర్ అనగానే పనిగట్టుకుని ఏవో తోచిన కథన టెక్నిక్కులు ప్రదర్శిస్తే గానీ మనస్సూరుకోని నేటి దర్శకులని చూస్తున్నాం.  ఈవారం మలుపుతో బాటే విడుదలైన నీరజఅనే హిందీ హైజాక్ డ్రామాలో ఏ  టెక్నిక్ బిల్డప్పులు లేకుండానే, ఫ్లాష్ బ్యాకులే కాకుండా, ఇంటర్ కట్స్ తో కలిపి అంత అర్ధవంతమైన ఎఫెక్టివ్ డ్రామాగా  తీశారు. ‘మలుపు దర్శకుడు మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులతో చేయరాని హాని చేసుకున్నాడు. ఈ ఫ్లాష్ బ్యాకుల వల్ల ఫస్టాఫ్ అంతా గడిచిపోయినా కథేమిటో, దేనికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలియకుండా పోయింది. సెకండాఫ్ తర్వాత పది  నిమిషాలకి గానీ అసలు కథేమిటో తెలిసి- ఫ్లాష్ బ్యాకుల హడావిడి తగ్గి,  సూటి కథనం నడవదు. ఈ దృష్ట్యా అసలు ఫస్టాఫ్ అవసరమే లేదు. ఫస్టాఫ్ వరకూ సినిమా తీయకున్నా నష్టమేమీ లేదు- సెకండాఫ్ లోనే కథా  ప్రారంభం, దాని ముగింపులున్నాయి కాబట్టి

          దృశ్యపరంగా ఏ విజన్ లో  కథ చూపాలన్న అవగాహన వున్నట్టు, ఏ విజన్ లో కథ చెప్పాలన్న దానిపై  విషయపరిజ్ఞానం లోపించడం వల్ల ఇదొక బలహీన థ్రిల్లర్ గా తయారయ్యింది

          క్లైమాక్స్ అనేక ములుపు తిరుగుతూంటుంది. ఇదంతా భరించాలంటే మొదట ఫస్టాఫ్ లో ఫ్లాష్ బ్యాకులతో అంత భారం మోపి వుండకూడదు. క్లయిమాక్స్ లో ఇరవై నిమిషాలు కోర్టులో భారీ డైలగులతో బరువైన సన్నివేశాలుంటాయి కాబట్టి,  అదంతా ప్రేక్షకులకి బోరు కొట్టకుండా తట్టుకోవడానికి,  దాసరి నారాయణరావు బొబ్బిలిపులి లో ఫస్టాఫ్ నుంచే క్లయిమాక్స్ వరకూ జరిగే కథని సీనుకొక్క డైలాగు చొప్పున మాత్రమే ఉండేట్టు తేలికపాటి  కథనం చేశారు. ‘మలుపులో ఈ టెక్నిక్ లేకపోగా, క్లైమాక్స్ లో అనేక ట్విస్టులకి తోడు మితిమీరిన హింస అదనపు భారమైపోయింది. ముగింపు దృశ్యం హృదయవిదారకంగా వున్నా- ఈ ముగింపుతో ఏం  చెప్పదలిచాడు దర్శకుడు? అనవసరంగా గొడవలు పెట్టుకుంటే అనుభవిస్తారనేనా? అలాగే అన్పిస్తుంది ముగింపు సందేశం

           కానీ అనవసరంగా భయపడితే అనుభవిస్తారనే సందేశం కూడా కథ మధ్య లోనే వెళ్ళింది. ఎలాగంటే, తెలీక డాన్ కూతురితో గొడవపడ్డారు, అంత మాత్రానా ఏదో జరిగిపోతుందని భయపడిపోయి అతడికి క్షమాపణ చెప్పుకోవడానికి  ముంబాయి దాకా పరిగెత్తడ మెందుకు?  కథలోనే ఇంకో మాట అనిపించారు :  తప్పు చేయనప్పుడు భయపడనవసరం లేదని. మరి ఎందుకు అంతగా భయపడడం? యదార్ధ సంఘటన అంటున్నారు కాబట్టి ఆ ఫ్రెండ్స్ ఎవరో అలాగే అర్ధం పర్ధం లేకుండా  ప్రవర్తించి ఉండవచ్చు. అయితే ప్రేక్షకులు తీసుకోవాల్సిన సందేశాల్లో ఈ వైరుధ్యాల్ని తొలగించి వుండాల్సింది.తప్పే  చేయనప్పుడు మీరు భయపడితే, ఆ చేయని తప్పే మిమ్మల్ని వెంటాడి మీరు అనుభవించేలా చేస్తుందనే  సందేశం వచ్చేలా చూసుకోవాల్సింది

          అలాగే ఈ కథలో ఇంకో సందేశం కూడా ఉత్పన్న మవుతోంది- వీళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఎన్నుకున్నమార్గం పరీక్షలు ఎగ్గొట్టడం. ఇది అక్రమమే. ఇలా అక్రమంగా  ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అందుకు ఇలా అనుభవించారనే అర్ధం కూడా వస్తోందా?

          నిజజీవితంలో జరిగే సంఘటనలకి అర్ధం పర్ధం వుండదు. ఎవరి జీవితమూ బిగినింగ్- మిడిల్- ఎండ్ అన్న స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో క్రమపద్ధతిలో సాగదు. కానీ జీవితాన్ని సినిమా చేసేటప్పు సంఘటనల్ని ఒక అర్ధవంతమైన క్రమంలో  కూర్చి స్ట్రక్చర్లో పెట్టాల్సి వుంటుంది...


      కే  కథని ఒకే  పాత్ర దృక్కోణంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో చూపించిన ఏ సినిమా బాగుపడింది లేదు. ఈ మధ్యే హిందీ ‘కట్టీ బట్టీ’ కూడా ఈ విషయం నిరూపించింది. ఒకే కథని ఒకే పాత్ర దృక్కోణంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో చూపిస్తే ఆ కథకి ఏ కథా లక్షణాలూ వుండవు. ‘కంచె’ లో చూపించినట్టుగా రెండు వేర్వేరు కథల్ని ఒకే పాత్ర దృక్కోణంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో చూపించ వచ్చు. అలాగే ఒకే సంఘటన గురించి వేర్వేరు వ్యక్తులు కథనాలు చెప్తున్నప్పుడు ( రోషోమన్) మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ వర్కౌట్ అవుతాయి. కానీ ఒకే కథ ఒకే పాత్ర దృక్కోణంలో  మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ గా పనికిరాదు. ఈ తేడాలు  తెలుసుకోకపోతే  ‘మలుపు’ లాంటి ప్రమాదాలు  మరిన్ని తప్పవు.

మామూలుగా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు కాకుండా, ఒకే  పెద్ద ఫ్లాష్ బ్యాక్ వేయడమంటేనే నడుస్తున్న కథని వెనక్కి తిప్పడమే. మళ్ళీ గంటో అరగంటో  గడిచాక ఆపిన చోటుకొచ్చి మళ్ళీ  ముందుకు  నడపడమే. ఈ ఫ్లాష్ బ్యాక్ లో కథ బలంగా వుంటే ఫర్వాలేదు, లేదా నడుస్తున్న అసలు కథ మీద ప్రేక్షకులకి ఫోకస్ చెదిరిపోతుంది. అలాటిది మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులేస్తే తడవతడవకీ ఎన్ని సార్లు నడుస్తున్న కథ వెనక్కి వెళ్తుంది! ఈ సందర్భంలో ఆడియెన్స్ ఫోకస్ చెదరడం కాదు- అదెప్పుడో చచ్చూరుకుంటుంది ఓపికతో సహా – ఏకంగా దర్శకుడి ఫోకస్సే చెల్లా చెదురై పోతుంది. స్ట్రక్చర్ గల్లంతై పోతుంది. సీక్వెన్సులు ముక్కలవుతాయి. ప్లాట్ పాయింట్స్ సెకండాఫ్ లోనే ఏర్పడతాయి. క్యారక్టర్ గ్రోత్ మటాషై పోతుంది. టెన్షన్ తెల్లారిపోతుంది. సస్పెన్స్ అయిపు లేకుండా పోతుంది. టెంపో సెలవు తీసుకుంటుంది...ఇవన్నీ ‘మలుపు’ లో ఫస్టాఫ్ అంతా కనిపించే లోపాలే. 

        ఒకసారి మలుపు’  కథని సూటిగా ‘ప్రధాన సంఘటన’కి  ముందు, ప్రధాన ‘సంఘటనకి తర్వాత’ గా చూస్తే, అదిలా వుంటుంది : నల్గురు ఫ్రెండ్స్ పరీక్షలు ఎగ్గొట్టి చదువు పేరుతో  ఇంకో ఆర్నెల్లు ఎంజాయ్ చేద్దామని పథకం వేస్తారు. ఆ ప్రకారం ఎంజాయ్ చేస్తూంటారు. హీరోకి హీరోయిన్ పరిచయమవుతుంది.  అది ప్రేమగా మారుతుంది. హీరో అక్క పెళ్లి సంబంధం చూడ్డం,  ఆ పెళ్లి ఏర్పాట్లలో వుండడం జరుగుతుంది. రేపు న్యూ ఇయర్ అనగా ఇంట్లో వాళ్ళందరూ వూరెళ్తారు

          (ప్రధాన సంఘటన) :  ఫ్రెండ్స్ తో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి హీరోయిన్ తో రెస్టారెంట్ కి బయల్దేరతాడు హీరో. అప్పటికే  రెస్టారెంట్ లో హీరో ఫ్రెండ్స్ లో ఒకడు ఒకమ్మాయిని ఫోటో తీస్తాడు. ఆమె అభ్యంతరం చెప్తుంది. అయినా మళ్ళీ ఫోటో తీస్తాడు తాగిన మైకంలో. ఆమె బాయ్ ఫ్రెండ్ కి చెప్తుంది. బాయ్ ఫ్రెండ్ కీ  హీరో ఫ్రెండ్ కీ గొడవై కొట్టుకుంటారు. హీరో వచ్చి చూసి బాయ్ ఫ్రెండ్ నే బాదుతాడు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేయబోతే, హీరో ఫ్రెండ్స్ లో ఒకడు పోలీసు కమీషనర్ కొడుకూ, ఇంకొకడు ఎంపీ కొడుకూ అని తెలుస్తుంది. వీళ్ళని వదిలేసి బాయ్ ఫ్రెండ్ నే  పట్టుకుపోతారు. ఆ అమ్మాయిని ఎక్కువ మాటాడితే బ్రోతల్ కేసు పెడతానని ఇన్స్ పెక్టర్ అవమానిస్తాడు. పోలీసు  కమీషనర్ కి ఆ అమ్మాయి అన్న నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ముంబాయి డాన్ ముదలియార్ కూతురని తెలిసి కంగారు పడతాడు. వాళ్ళు చంపడానికి వచ్చేస్తారని ఫ్రెండ్స్ నల్గుర్నీ అజ్ఞాతంలోకి పంపేస్తాడు కమీషనర్. కానీ అక్క పెళ్లి పనులుండడంతో  హీరో అజ్ఞాతంలోకి వెళ్ళడు. ముదలియార్ గ్యాంగ్ వచ్చేసి హీరో మీద ఎటాక్ చేస్తారు. ముదలియార్ స్థానిక ఏజెంటు  హీరోని కాపాడి, పరిస్థితి తెలుసుకుని, వెళ్లి సారీ చెప్పుకోమంటాడు ముదలియార్ కి. ముదలియార్ అర్ధం జేసుకుని క్షమిస్తాడని భరోసా ఇస్తాడు. హీరో పిస్తోలు తీసుకుని ముంబాయి బయల్దేరతాడు.


           (ఈ ‘ప్రధాన సంఘటన’ కి తర్వాత) : పిస్తోలు తీసుకుని హీరో ముంబాయి చేరుకున్న సమయంలోనే ముదలియార్ మీద హత్యా యత్నం జరుగుతుంది. ముదలియార్ ని చూడ్డానికి తరలివచ్చిన జనంతో కలిసి హీరో కూడా చూస్తాడు. తర్వాత ముదలియార్ అసిస్టెంట్ ని కలిసి తనని చెన్నైలో స్థానిక ఏజెంటు  పంపాడని చెప్తాడు. ముదలియార్ మీద హత్యా యత్నం చేసింది వీడేనని వాళ్ళు కొడతారు. తను ఎందుకొచ్చిందీ ముదలియార్ కి చెప్పుకుంటాడు  హీరో.  అది విన్న ముదలియార్, అరెస్టయిన బాయ్ ఫ్రెండ్ ని తన కూతురు  విడిపించుకుందనీ, కానీ ఆ రాత్రి నుంచీ వాళ్ళిద్దరూ కన్పించకుండా పోయారనీ అంటాడు. దీనికి మీరే కారణమని, ఫ్రెండ్స్ ఎక్కడున్నారో చెప్పమని హింసిస్తాడు. చెప్పక పోతే హీరో కుటుంబం బతికి ఉండదని వార్నింగిస్తాడు. రేపు పదింటికల్లా ఫ్రెండ్స్ ని తీసుకుని రావాలని గడువు పెడతాడు.

        చెన్నై తిరిగి వచ్చి ఫ్రెండ్స్ ని వెతికి పట్టుకుంటాడు హీరో. దాక్కుని వున్నవాళ్ళు విషయం తెలిసి బెదిరిపోతారు. హీరో మీద మ ఎటాక్ జరుగుతుంది. అతను తప్పించుకుంటాడు. కానీ ముదలియార్ చెన్నై ఏజెంట్ గాయపడతాడు. ఈ ఎటాక్ అప్పుడే ముదలియార్ చేయించడానికి వీల్లేదనీ, తన ఫ్రెండ్స్ తండ్రులే తమ కొడుకుల్ని కాపాడుకోవడానికి కమీషనర్  సాయంతో తనని చంపించడానికి  ప్రయత్నిస్తున్నారనీ అనుమానిస్తాడు హీరో. దీంతో ఫ్రెండ్స్ దాక్కుని వున్న చోటు గురించి ముదలియార్ కి సమాచారం ఇచ్చేస్తాడు. గాయపడ్డ చెన్నై ఏజెంట్ వున్న హాస్పిటల్ కెళ్తే కొత్త విషయం తెలుస్తుంది హీరోకి. అతడి మీద దాడి చేసిన వాడి చేతి మీద పచ్చ బొట్టు వుందని. అలాటి పచ్చబొట్టు తను ముదలియార్ కూతురి బాయ్ ఫ్రెండ్ చేతి మీద చూసినట్టు గుర్తు కొస్తుంది హీరోకి. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్ కెళ్తాడు హీరో.  ఆ ఫ్లాట్ లో మంచుతో గడ్డ కట్టుకు పోయిన బాయ్ ఫ్రెండ్ శవం కన్పిస్తుంది. అక్కడే ఆ బాయ్ ఫ్రెండ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ హీరో మీద ఎటాక్ చేస్తుంది. ఈమె సైకో. ఈ బాయ్ ఫ్రెండ్ ముదలియార్ కూతురితో తిరగడం సహించలేక ఇద్దర్నీ చంపేసింది. ముదలియార్ కూతురి శవం బీచికి కొట్టుకొస్తుంది. ఇక ముదలియార్ హీరో సహా ఫ్రెండ్ ముగ్గుర్నీ చంపెయ్యమని ఆదేశాలిస్తాడు.

        ముదలియార్ ముందే ఈ చంపే కార్యక్రమం మొదలవుతుంది. దోషులు తాముకాదని ఎంత చెప్పుకున్నా ముదలియార్ విన్పించుకోడు. అసలు దీనికంతటికీ తనే బాధ్యుడనీ, వాళ్ళని వదిలేసి తనని చంపెయ్యమనీ బతిమాలుకుంటాడు ఫోటోలు తీసి గొడవకి కారణమైన  ఫ్రెండ్. ముదలియార్ చలిస్తాడు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలిచ్చుకోవడానికి సిద్ధపడ్డారంటే,   వీళ్ళు తన కూతుర్ని చంపివుండరని తీర్మానించుకుంటాడు. 

బ్రతుకుజీవుడా అని హీరో, అతడి ఫ్రెండ్స్ కుంటుకుంటూ వెళ్లిపోతూంటే కథ ముగుస్తుంది. 

విషయం వెతుక్కోవాలి

లా ప్రారంభ ముగింపుల్ని వరసక్రమంలో చెప్పుకుంటూ పోతే ఇందులో ఏం తగ్గిందని? టెంపో, థ్రిల్, సస్పెన్స్  వంటివి ఏమైనా తగ్గాయా? ముందు పాత్రల పరిచయం,  తర్వాత ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత  ప్రధాన సంఘటన, దీని తర్వాత దాని పరిణామాలు...ఈ వరసలో ఆసక్తి కరంగానే వుంది కథనం పైన చెప్పుకున్నట్టు. దీన్ని ముక్కలు ముక్కలుగా  చేసి, ఫ్లాష్ బ్యాకులతో  ప్రారంభ ముగింపుల వరసని మార్చేస్తూ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? 

                 
సినిమా ప్రారంభం ఇలా వుంటుంది...డిసెంబర్ 31 రాత్రి ఒక ఫ్లాట్ లో ఒక యువతి ఎమర్జెన్సీ కాల్ చేస్తూ తనని చంపకుండా కాపాడమని సాయం అడుగుతూంటుంది...
        హీరో ముంబాయిలో దిగుతాడు...
        కథ నాలుగు నెలలు వెనక్కి వెళ్తుంది హీరో దృక్కోణంలో...
        ఫ్లాష్ బ్యాక్- ఇక్కడ కాలేజీ దగ్గర హీరోలు పరీక్షలు ఎగ్గొట్టి ఆర్నెల్లు ఎంజాయ్ చేయడం గురించి మాటాడు కుంటారు.
        ఇక వాళ్ళ ఎంజాయ్ మెంట్, హీరో కుటుంబ పరిచయం వగైరా జరుగుతాయి. మళ్ళీ ప్రస్తుత కథ ముంబాయిలో చూపిస్తారు. రాత్రి పూట హీరో అనుమానాస్పదం గా సంచరిస్తూంటే పోలీసులు ఆపుతారు.
        మళ్ళీ ఫ్లాష్ బ్యాక్.  పూర్వ కథ కంటిన్యూ. హీరోకి హీరోయిన్ పరిచయం వగైరా.
        మళ్ళీ ముంబాయిలో హీరోతో ప్రస్తుత కథ... 

        ఇలా పూర్వ  కథ పూర్తయ్యేవరకూ. ముంబాయి, చెన్నై ల మధ్య రెండు కాలాలకి సంబంధించిన సీన్లు వచ్చి పోతూంటాయి. ఇలా  అసలు కథ, పూర్వ కథ వంతులేసుకుని ఆల్టర్నేట్ గా ఇంటర్వెల్ వరకూ సాగడంతో..దేంట్లోనూ అసలు విషయమేమిటో బోధపడదు.  

ఇంకా సెకండాఫ్ లో పడ్డాక ఓ పది నిమిషాలు మళ్ళీ పూర్వ కథ నడిచాకనే ఆ పూర్వ కథలో భాగమైన ‘ప్రధాన సంఘటన’  అంటే పైన చెప్పిన రెస్టారెంట్ లో  జరిగిన గొడవ మొదలవుతుంది.


దీంతో ఫ్లాష్ బ్యాకుల వడ్డన ముగిసి అసలుకథ డాన్ వర్సెస్ హీరోగా సూటిగా పరుగులు తీస్తుంది. ఇక్కడ్నించీ మనం తెరిపిన పడతాం.

సెటప్స్ - పే ఆఫ్స్ 
    లా విషయమంతా సెకండాఫ్ లోనే వుంది. ఇందుకే ఫస్టాఫ్ సినిమా తీయకున్నా నష్టం లేదు. అది బడ్జెట్ కలిసివస్తూ చాలా లాభం. ఫస్టాఫ్ అంతా  మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ వేస్తూ చెప్పిన సంగతేమిటి? పాత్రల పరిచయం, కుటుంబం పరిచయం, హీరోయిన్ తో లవ్, హీరో అక్క పెళ్లి పనులు..ఇవీ. వీటితో ప్రధాన సంఘటనకి ఏ సంబంధమూ లేదు, ప్రధాన సంఘటనకి ఇవేవీ దారి తీయవు- ఒక్క పరీక్షలెగ్గొట్టి ఎంజాయ్ చేద్దామన్న ఫ్రెండ్స్ నిర్ణయం తప్ప. అయితే ఈ నిర్ణయం ప్రధాన సంఘటనకి దారితీయడానికి ఒక ట్రాక్ అంటూ వేసుకోవడమే మర్చిపోయారు. 

        ఎక్కడికక్కడ ఏర్పాటు చేసే పాయింట్లు అక్కడి కక్కడ ముక్కలే.  అంత కష్టపడి మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ లో చూపించుకొచ్చిన రోమాన్స్, అక్క పెళ్లి వ్యవహారం సెకండాఫ్ లో ఏమయ్యాయో జాడ వుండవు.

        గొప్పగా సెటప్స్ అయితే వుంటాయి- వాటి పే ఆఫ్సే  వుండవు. కథంతా ప్రారంభమవడానికి కారణమైన ‘పరీక్షలెగ్గొట్టి ఎంజాయ్ చేద్దామన్ననిర్ణయం’ అన్న సెటప్ కి కూడా పే ఆఫ్ నిర్వహణ సరీగ్గా లేదు. ఇక్కడ సెటప్ వేసి, ఎక్కడో ప్రధాన సంఘటన  చూపించి పే ఆఫ్ చేసేశారు. కానీ సెటప్ కీ దాని పే ఆఫ్ కీ మధ్య అందుకనుగుణమైన సీన్లు వుంటాయి. వాటి జాడ లేదు. ప్రధాన సంఘటన అనే సెటప్ కి మాత్రమే తదనుగుణ  పరిణామాలతో కూడిన సీన్లు దాని పే ఆఫ్ వరకూ వున్నాయి.

వాటికి స్థానం లేదు
      మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ ముంబాయి చేరిన హీరో దృక్కోణంలో వచ్చేవే. అతనెందుకు, ఏది, ఎలా గుర్తుచేసుకుంటున్నాడు? అతను ముంబాయి డాన్ ని కలవడానికి వెళ్ళిన అర్జెంటు పనికీ తను నడిపిన రొమాన్సు తో, అక్క పెళ్లి వ్యవహారాలతో సంబంధమేమిటి? అవెందుకు గురుకొచ్చి ఫ్లాష్ బ్యాకు లేసుకుంటున్నాడు? సరదాకా? సరదా సమయమా అది? మన ప్రాణాల మీదికేదో సమస్య వచ్చి, ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ కి పరిగెడుతున్నప్పుడు,  సరదా పుట్టి  ప్రేమ వ్యవహారాలు గుర్తు చేసుకుంటామా? ఆ సమయంలో సరదాలు పుడతాయా, ప్రాణాల మీది కొచ్చిన సమస్య వేధిస్తూంటుందా? ఆ సమస్య తాలూకు సంఘటన మెదులుతూంటుందా? How the  mind works?

        చాలా సినిమాల్లో ఫ్లాష్ బ్యాకులు అసందర్భంగా, పరిస్థితితో  సంబంధం లేని విషయాలతో ఆషామాషీగా  ప్రారంభమవుతూంటాయి. కానీ ‘ఖైదీ’ లో చిరంజీవి ఎంతటి విపత్కర పరిస్థితిలోనూ తన కేం జరిగిందో చెప్పడు. పోలీసులు కొట్టినా చెప్పడు. సినిమా ప్రారంభమయిన అరగంటకి,  సుమలత మోరల్ డైలెమా లో పడసినప్పుడే ఇక తప్పదనుకుని తన కథ చెప్పుకోవడం మొదలెడతాడు...సూటిగా తను ఇలా అయిపోవడానికి కారణమైన ప్రేమ కథే! సరదాపడి ఇంకేదో సోదితో ఫ్లాష్ బ్యాక్ కాదు. Mind ఇలా work చేస్తుంది..

        ‘కంచె’  లో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్న హీరోకి అసలలా యుద్ధానికి రావడానికి కారణమే తన ప్రియురాలు కాబట్టి, ఆమెకి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్స్ కి వెళ్తాడు. Mind ఇలా work చేస్తుంది..

        అలాగే ‘మలుపు’ లోనూ  అత్యవసర పరిస్థితిలో  హీరోకి ఆ ప్రధాన సంఘటన తాలూకు విషయాలే గుర్తుకు రావడం కాకతాళీయ న్యాయం. That’s how mind works! 

        ‘ఖైదీ’ లో పోలీస్ స్టేషన్లో చిరంజీవిని హింసిస్తున్నప్పుడు రెండు మాంటేజెస్ పడతాయి. వెనుకనుంచి పోలీసు మెడకి లాఠీ పెట్టి వొత్తుతున్నప్పుడు వూళ్ళో తనని బండికి కట్టి పైకి లేపిన ఫ్లాష్ కట్, మళ్ళీ చిడతల  అప్పారావు మంగలి కత్తితో గాయపర్చినప్పుడు, వూళ్ళో రావుగోపాలరావు మంగలి కత్తితో మీదికొస్తున్న ఫ్లాష్ కట్. రెండూ తనకి జరిగిన అన్యాయం తాలూకు మ్యాచింగ్ దృశ్యాలే. That’s how mind works!

        ఈ ఫ్లాష్ కట్స్ వేసి చిరంజీవి గతం తెలుసుకోవాలన్న ఆసక్తిని చాలా పెంచారు రచయితలు  పరుచూరి బ్రదర్స్, దర్శకుడు ఎ. కోదండ రామిరెడ్డి. అలా ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేట్టు ఇక్కడ్నించే విజువల్ శాంపిల్స్ తో  దానికి లీడ్ వేశారు.

        ‘మలుపు’లో కూడా హీరోకి ఆ ప్రధాన సంఘటన తాలూకు విజువల్ శాంపిల్సే పడ్డం మళ్ళీ కాకతాళీయ న్యాయం.

        అంటే ఏ  మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ అయితే చూపించుకొచ్చారో అదంతా ప్రధాన సంఘటనకి దారి తీసే  సంఘటనల కూర్పుగానే వుండాలి తప్ప-  ఇంకేదో ప్రేమకథ కాదు, అక్క పెళ్లి కథా కాదు.

        అంటే ఈ రెండిటికీ ఫస్టాఫ్ కథలో స్థానం ఉండకూడదన్న మాట. ఫస్టాఫ్ కథ ఎత్తుగడకి -(‘పరీక్షలెగ్గొట్టి ఎంజాయ్ చేద్దామన్ననిర్ణయం’ అన్నసెటప్ కి ) న్యాయంగా పే ఆఫ్ జరిగే దిశగా సదానికి సంబంధించిన న్నివేశాల కూర్పు అన్నమాట! ఇదెలాగో తర్వాత చూద్దాం.

లీనియర్  కోణంలోనే ప్రాణం 

    సలు మొట్ట మొదట మనం చూసిందాని ప్రకారం కథా క్రమం బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే లీనియర్ కోణంలో సజావుగానే వుంది.  ప్రధాన సంఘటనకి ముందు కథ, తర్వాత ప్రధాన సంఘటన, ఆ ప్రధాన సంఘటనకి తర్వాతి కథ..బిగినింగ్- మిడిల్- ఎండ్ స్ట్రక్చర్ లోనే వున్నాయి. 

        ప్రధాన సంఘటనకి ముందు కథ బిగినింగ్ విభాగ మనుకుంటే, ప్రధాన సంఘటన అంటే రెస్టారెంట్ లో జరిగిన గొడవ  మొదటి మూలస్థంభం ( ప్లాట్ పాయింట్ -1) అవుతుంది.  ఇక్కడ్నించీ  హీరో తన ఫ్రెండ్స్ గురించి ముదలియార్ కి హీరో సమాచారం ఇచ్చేయ్యడం వరకూ మిడిల్ విభాగం అవుతుంది. అక్కడ్నించీ ముగిపు వరకూ ఎండ్ విభాగం.

        ముంబాయి సీన్లతో కలుపుకుని ఫ్లాష్ బ్యాకులుగా వస్తున్న బిగినింగ్ విభాగాన్నే చూసినా అది ఇంటర్వెల్ పైగానే సాగింది. ప్రధానసంఘటన ( ప్లాట్ పాయింట్ -1) ఇంకో పది  నిమిషాల తర్వాత వచ్చింది. అంటే ఇంటర్వెల్ లోపు రావాల్సిన ప్రధానసంఘటన ( ప్లాట్ పాయింట్ -1)  రాకుండా స్ట్రక్చర్ చెదిరిపోయింది. ఒకేఒక్క  కథని ఒకే పాత్ర దృక్కోణంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో చూపిస్తే జరిగే ప్రమాదమే ఇది.  ఇలా ‘కట్టీ బట్టీ’ లో క్లయిమాక్స్ లో తప్ప ప్లాట్ పాయింట్ -1  అనే బాధిత ప్రాణి రాదు. అప్పటివరకూ ప్రేక్షకులు కథేమిటో అంతుచిక్కక బోరు కొట్టించుకునీ కొట్టించుకునీ ఇక వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతారు. విచిత్రమేమిటే, ఇలాటి సినిమాలు తీస్తున్న  దర్శకులకి అసలేం  బోరు కొట్టదు. ఈ కథన టెక్నిక్కే బావుందని చూసుకుని సంతోషిస్తారు. అంటే  సదరు దర్శకులకి  సగటు ప్రేక్షకుడి పద్ధతిలో కూడా సినిమా చూడ్డం రాదనుకోవాలా?

 లాంగ్ ఫ్లాష్ బ్యాక్  

   కథని  మిడిల్- బిగినింగ్ - ఎండ్ ( 2 - 1 - 3) అనే ఒకే ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో పెట్టి చూసినా- హీరో ముంబాయిలో  దిగుతాడు, ముదలియార్ మీద ఎటాక్ జరుగుతుంది, పోలీసులనుంచి హీరో తప్పించుకుంటాడు,  అప్పడేదో లీడ్ తో ఫ్లాష్ బ్యాక్ మొదలు పెట్టామనుకుందాం... అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో హీరో రోమాన్సు, అక్క పెళ్లి ప్రయత్నాలూ బిగినింగ్ విభాగమంతా చూపించుకొచ్చి, అరగంట నలభై నిమిషాలో బిగినింగ్ ని ముగించి ప్లాట్ పాయింట్ -1 వేస్తూ, రెస్టారెంట్ సంఘటన సృష్టించామనుకుందాం...ఈ సంఘటన తర్వాత తను ముంబాయి వెళ్లేందుకు దారి తీసిన సీన్లు కూడా వేసేస్తూ మిడిల్  విభాగంలో కొచ్చా మనుకుందాం...ముంబాయికి వచ్చాక ముదలియార్ మీద జరిగిన ఎటాక్ తాలూకు సీన్ల దగ్గర ఫ్లాష్ బ్యాక్ ని ముగించేసి- అక్కడ హీరో  ముదలియార్ ని కలిసి జరిగింది చెప్పుకోవడం కాడ్నించీ ఏకబిగిన అతను ఫ్రెండ్స్ గురించి సమాచార మిచ్చేవరకూ మిగతా మిడిల్ ని పూర్తి చేసేసి- అక్కడ్నించీ యధాతధంగా ఎండ్ విభాగాన్ని ప్రారంభించి ముగింపు వరకూ వెళ్ళామనుకుందాం...

        చిరంజీవి ‘ఖైదీ’లో వున్నది ఈ స్ట్రక్చరే గా? 

సీదా కథనంతోనే లైఫ్
 అయితే ఈ కథని ఏ  ఫ్లాష్ బ్యాకుల అవసరమే లేకుండా స్ట్రెయిట్ నేరేషన్ లో 1-2- 3 సాంప్రదాయ పద్ధతిలో చెప్పడమే న్యాయమని మొట్ట మొదట ప్రారంభ ముగింపులు ఒక వరస క్రమంలో రాసుకుని చూసుకున్న కథనమే  చెప్తోంది. లీనియర్ కోణంలోనే  ప్రాణం. 

        మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులకి ఇదేం ‘కంచె’ లాగా రెండు కథానికల కథ కాదు.

‘కంచె’ లో Concentric Circles (CC) గా కలిసి వుంటాయి. ఫ్లాష్ బ్యాక్స్ లో వస్తూ  వుండే పూర్వ ప్రేమ కథకీ, ప్రస్తుత యుద్ధ కథకీ కలిపి ఒకే కథాంశం కేంద్ర బిందువై వుంటుంది. ఆ  కథాంశం జాతి రక్తం. ప్రేమ కథలో కులాల సంఘర్షణ, యుద్ధ కథలో జాతుల సంఘర్షణ. అక్కడా ఇక్కడా హీరోకి జాతిరక్తమనే  మౌఢ్యంతో పోరాటం. అక్కడ తను కులీనుడు కాదని ప్రేమని దూరం చేశారు, ఇక్కడ తమ ఆర్యన్ జాతి రక్తం కలుషితమయిందని యూదు పసి దాన్ని చంపడానికి నాజీలు వెంటపడ్డారు. ఈ రెండూ ఒకే కథాంశం చుట్టూ నడవడంతో CC గా ఏర్పడ్డాయి. లోపలి వృత్తం పూర్వ కథతో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్, వెలుపలి వృత్తం ప్రస్తుత ప్రధాన కథ.

        ‘మలుపు’ కి ఇంత సీను లేదు. వుంటే Concentration  చెదిరిపోయే Circles మాత్రమే వున్నాయి- రోమాన్సుతో, అక్కపెళ్ళి వ్యవహారంతో. కాబట్టి ఎలాటి టెక్నిక్కులకీ పాల్పడకుండా సీదా సాదా సాఫీ కథనంతోనే దీనికి లైఫ్ వుంది. అప్రస్తుతమైన బ్యాక్ స్టోరీ పేరు చెప్పి అడుగడుగునా బ్రేకు లేసుకోవడంలో యాక్సిడెంట్ లే వున్నాయి. 



ఇదిగో ఎత్తుగడతో విధానం

      
థ ఎత్తుగడ- పరీక్షలెగ్గొట్టి ఇంకో ఆర్నెల్లు ఎంజాయ్ చేద్దామన్ననిర్ణయం.
        దీని కొనసాగింపు-  అలా ఎంజాయ్ చేస్తున్నారు, హీరోయిన్ పరిచయమైంది, ఆమెతో నల్గురూ పోటీలు పడ్డారు, హీరోనే సెలెక్టు చేసుకుంది, కలిసి తిరుగుతున్నారు, ఇంకొటేదో జరిగి పేరెంట్స్ కి దొరికిపోయారు, మరింకేదో జరిగి అసలు పరీక్షలే  రాయకుండా డీ బార్ అయిపోయారు, అయినా లెక్క చేయకుండా  ఎంజాయ్ చేస్తూంటే హీరోయిన్ పెళ్లి ప్రస్తావన తెచ్చింది, ఇది  పెళ్లి ఎపిసోడ్ కాదన్నారు, హీరోయిన్ కి వొళ్ళు మండి  వీళ్ళు బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి కావాలనే పరీక్ష లెగ్గొట్టారని అసలు సంగతి పేరెంట్స్ కి చెప్పేసింది, వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళ గొట్టేశారు,  డబ్బుల్లేక తిప్పలు పడుతున్నారు, పేరెంట్స్ డబ్బుతో ఆర్నెల్లు మజా అనుకుంటే  మూన్నాళ్ళకే బికారులయ్యారు, అప్పులు చేసి మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ వచ్చింది, అప్పుకూడా పుట్టక జేబులు కొట్టి హీరోయిన్ తో రెస్టారెంట్ కెళ్ళారు. అక్కడ ముంబాయి డాన్ కూతుర్ని చూసి- ఎవరీ కోతి పిల్ల అని -ఫేస్ బుక్కులో పెడదామని ఫోటోలు తీసింది తగిన మైకంలో హీరోయిన్, గొడవ య్యింది, కొట్టుకున్నారు, హీరోతో బాటు ఫ్రెండ్స్ కూడా హీరోయిన్ తప్పుని కవర్ చేస్తూ తమ మీదేసుకున్నారు, పోలీసులు వచ్చారు, ప్రముఖుల కొడుకులని వీళ్ళని వదిలేసి డాన్ కూతురి బాయ్ ఫ్రెండ్ ని  పట్టుకెళ్ళారు...

        ఎత్తుగడ అనే సెటప్ అడుగడుగునా సస్పెన్స్ తో, థ్రిల్ తో ఇలా పే ఆఫ్ అయింది. ఈ ట్రాక్ ఇలాగే వుండాలని కాదు, ఉదాహరణకి మాత్రమే ఇది. ప్రధాన సంఘటనకి ఎవరో ఫ్రెండ్ కాకుండా హీరోయినే  ఎందుకు కారణమవ్వాలంటే, సినిమాకథకి హీరోయిన్ వల్ల వచ్చే Feminine Appeal  మంచి  ప్లస్ అవుతుంది కాబట్టి. అక్కడినించీ కథ హీరోయిన్ చేసిన తప్పు తమ మీదేసుకుని ఫ్రెండ్స్ పడే కష్టాలతో వేడెక్కితే బావుంటుంది కాబట్టి. అమ్మాయి క్షేమం కోరి కష్టాలూ త్యాగాలూ అనేవి ఎప్పుడూ బాక్సాఫీసు అప్పీలుండే  కథలే.

        ఇప్పుడు హీరోయిన్ క్షేమం కోసం ముంబాయి వెళ్లి డాన్ కాళ్ళ మీద పడ్డా, ఏడ్చి మొత్తుకున్నా అర్ధం పర్ధం వుంటుంది. ఎమోషన్ వుంటుంది. అక్కడ పిస్తోలు పట్టుకుని తిరిగితే ఎమోషన్ వుండదు. పిస్తోలేందుకు పట్టుకెళ్ళాడు హీరో? అర్ధం లేని బిల్డప్ కోసం పెడితే అది డాన్ ని కాల్చి చంపడానికని అర్ధం రావడం లేదా? నిజాయితీగా తప్పు ఒప్పుకోవడానికి వెళ్తూ ఆయుధం చేబట్టడం అతడి సిన్సియారిటీ నే ప్రశ్నించడం లేదా? అదే పిస్తోలుతో డాన్ కాల్చి పారేస్తే?



-సికిందర్