Back Again!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1నుంఛి సింగిల్ స్క్రీన్ థియేటర్లు నడుస్తాయా, బంద్ అవుతాయా అన్న సస్పెన్స్ తరహా కథనం నడుస్తోంది. రెంటా, పర్సెంటేజా వివాదం తేలాల్సి వుంది. పర్సెంటేజీ ప్రకారమైతేనే సినిమాల్ని ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు అంటున్నారు. మల్టీప్లెక్సుల్లో పర్సెంటేజీ విధానమే నడుస్తోంది. కానీ సింగిల్ స్క్రీన్స్ కి ఈ విధానం లేదు. అక్కడంతా రెంటల్ సిస్టమే నడుస్తోంది. దీని వల్ల నష్టపోతున్నామని ఎగ్జిబి టర్ల ఆందోళన. పర్సెంటేజీతో అయితే తాము నష్టపోతామని నిర్మాతల అభ్యంతరం. ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు పెద్ద నగరాలతో బాటు బీసీ సెంటర్లలో కూడా వున్నాయి. ఈ వివాదం ఇలా వుండగా, ఆ బీసీ సెంటర్ల పైనే కన్నేసి పీవీఆర్- ఐనాక్స్ గ్రూపు ఇక్కడ భారీ యెత్తున మల్టీప్లెక్సులు ప్రారంభించడానికి ప్రణాళికలు రచించుకుని ముందుకి దూసుకెళ్తోంది. అంటే ఈ విధానంలో ఎగ్జిబిటర్లు వుండరు. నగరాల్లో పీవీఆర్- ఐనాక్స్ తో అమల్లో వున్న పర్సెంటేజీ పైనే నిర్మాతలు బీసీ సెంటర్లలో సినిమాలు విడుదల చేసుకోక తప్పదు-చిన్న సినిమా లైనా పెద్ద సినిమాలైనా!
ముందుగా పీవీఆర్- ఐనాక్స్ ప్రణాళికేమిటో చూద్దాం. దేశంలో అతిపెద్ద సినిమా థియేటర్ల సంస్థ పీవీఆర్- ఐనాక్స్ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లని దేశంలోని మారు మూలలకూ విస్తరించాలని భావిస్తోంది. ఈ విస్తరణ ప్రక్రియలో కంపెనీ సినిమా థియేటర్లలో ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ (FOCO) మోడల్తో లాభాల్ని ఆర్జించాలని ఆశిస్తోంది. ఈ కొత్త మోడల్ భాగస్వాములకెలా పని చేస్తుందో, సినిమా ప్రేక్షకులకి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుందో కంపెనీ వివరించింది.
ఈ కంపెనీ మూడు సంవత్సరాలుగా ఈ మోడల్ పై పనిచేస్తోంది. ఈ మోడల్ కింద ఓ సినిమా థియేటర్ని మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లో ప్రారంభించి ఏడాది దాటింది. ఈ మోడల్ ని ప్రకటించే ముందు దాని విజయాన్ని నిర్ధారించడానికి మొదట కొన్ని తమ సినిమా థియేటర్లని నిలిపివేయాలని కోరుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది.
ప్రదర్శనా రంగంలో దేశంలో రెక్కలు విప్పాలనే కంపెనీ ఆలోచన అడ్డంకులు కూడా ఎదుర్కొంది. ఎందుకంటే కేవలం ఆర్థిక సహాయం మాత్రమే దానిని సాధ్యం చేయదు. మన దేశం భారీ బాక్సాఫీసు టర్నింగ్ వున్న దేశం. ఇందులో హాలీవుడ్ సినిమాలు ఎనిమిది శాతం మాత్రమే రాబడిని అందిస్తే, మిగిలిన 92% బాక్సాఫీసు కలెక్షన్లు ప్రాంతీయ, స్థానిక, హైపర్ లోకల్, బాలీవుడ్ తదితర కంటెంట్ ల నుంచి వస్తాయి. ఈ క్రమంలో కంపెనీని బీసీ సెంటర్లకి విస్తరిస్తే, కంటెంట్ అప్పీల్ ని మరింత పెంచడంలో సహాయపడుతుందని భావిస్తోంది.
FOCO మోడల్ కింద ఈ రాబోయే కొత్త ‘సోషల్ హబ్లు’ పట్టణ- గ్రామీణ ప్రేక్షకులకి సినిమాలతో బాటు ఆహారాన్నీ, ఆట పాటల్నీ అందిస్తాయి. పూర్తిగా సామాజిక కేంద్రాలుగా ఇవి వుంటాయన్న మాట. ప్రేక్షకులు తిన్నంత తిని, ఆటలాడుకుని వెళ్ళిపోవచ్చు, సినిమాలు చూడాలని రూలేం లేదు. లేదా సినిమాలతో పాటు ఆహారం, ఆటపాటలు కూడా వినోదించవచ్చు.ఈ విధానం సరసమైన లగ్జరీ సినిమా అనుభవాన్ని బీసీ ప్రేక్షకులకి సైతం అందింహడానికి వీలు కల్పిస్తుంది.
దేశవ్యాప్తంగా సినిమా మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయడం ద్వారా, బాక్సాఫీసు ఆదాయం ద్వారానూ స్థానిక నిర్మాతలకి, కళాకారులకి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, తద్వారా నిరంతర కంటెంట్ సృష్టిని ప్రోత్సహించాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఈ ఆర్ధిక సంవత్సరం మొదట్లో FOCO మోడల్ ని ఉపయోగించి రాయ్పూర్లో 5-స్క్రీన్ల మల్టీప్లెక్సుని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా దీని విస్తరణని వేగవంతం చేయడానికి ఇదొక కీలక వ్యూహంగా భావిస్తోంది. బీసీ సెంటర్లు ప్రీమియం సినిమా అనుభవాల కోసం గణనీయ వృద్ధి సామర్థ్యాన్ని కలిగి వున్నాయని తెలిపింది. ఈ మోడల్ ని మెరుగుపరచడానికి కంపెనీ గత మూడున్నర సంవత్సరాలుగా పెట్టుబడులు వెచ్చించిందని, దీని ఫలితంగా అమలు సమయంలో 50% ఆదా అయిందనీ పేర్కొంది.
వినోద అవకాశాలు పరిమితంగా వున్న ఈశాన్య ప్రాంతాన్ని ఉదాహరణగా పేర్కొంటూ, దేశమంతటా సినిమా యాక్సెస్ ని విస్తృతం చేయవలసిన అవసరాన్ని కూడా హైలైట్ చేసింది. మూడవ త్రైమాసిక నివేదికలో, 22 సినిమాహాళ్ళ లో 100 స్క్రీన్ల కోసం ఒప్పందాలపై సంతకం చేసినట్లు వెల్లడించింది. వీటిలో 8 FOCO సినిమాహాళ్ళలో 31 స్క్రీన్లు, 14 అసెట్-లైట్ సెటప్లలో 69 స్క్రీన్లూ సరసమైన లగ్జరీ సుఖాన్ని అందిస్తాయని, కొత్త అనుభవాల కోసం పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్ ని ఇవి తీరుస్తాయనీ కంపెనీ తెలియజేసింది.
మరి ఇది తెలుగు రాష్ట్రాల్లో నిర్మాతల్ని, ఎగ్జిబిటర్లని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇప్పుడంటే ఇప్పుడు కాకపోవచ్చుగానీ, రాబోయే మూడు నుంచి ఐదేళ్ళ కాలంలో బీసీ సెంటర్లలో ఈ మోడల్ విస్తరణ పూర్తయితే, నిర్మాతలూ ఎగ్జిబిటర్లూ ఇరుకున పడొచ్చు. పీవీఆర్ - ఐనాక్స్ దేశంలో ఎక్కడా పర్సెంటేజీ తప్ప మరో విధానాన్ని అనుమతించదు. ఇలాంటప్పుడు సింగిల్ స్క్రీన్స్ కి పర్సెంటేజీ డిమాండ్ చేస్తున్న ఎగ్జిబిటర్ల పంట బీసీ సెంటర్లలో పండొచ్చు. నిర్మాతలు బీసీ సెంటర్లలోని పీవీఆర్ -ఐనాక్స్ మల్టీప్లేక్సులతో బాటు, మొత్తం ఏబీసీ సెంటర్లలోని సింగిల్ స్క్రీన్స్ అన్నిటికీ పర్సెంటేజీకి అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడొచ్చు. ఇక పీవీఆర్- ఐనాక్స్ పుణ్యమాని బీసీ సెంటర్లలో పర్సెంటీజీ లభించినా, అక్కడ పీవీఆర్ -ఐనాక్స్ ధాటికి తట్టుకోలేక, సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతబడి, ఎగ్జిబిటర్ల వ్యవస్థ తుడిచిపెట్టుకు పోవచ్చు.
ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ ని నడపాలంటే నెలసరి 5 లక్షలు ఖర్చవుతోందన్న ఎగిబిటర్లు- సింగిల్ స్క్రీన్స్ ని ఇంకా అదే కాలం చెల్లిన థియేటర్లలో నిర్వహించడం విచిత్రం. నగరాల్లో సింగిల్ స్క్రీన్స్ ని ఆధునికంగా మార్చి నిర్వహిస్తున్న మల్టీప్లెక్స్ కంపెనీల విజ్ఞత ఎగ్జిబిటర్లకి కూడా కలిగితే, బీసీ సెంటర్ల స్క్రీన్స్ ని ఆధునీకరించడానికి పెట్టుబడులు పెట్టక తప్పదు.
ఓటీటీల కాలంలో వందల కోట్లు వెచ్చించి బీసీ సెంటర్లలో పీవీఆర్- ఐనాక్స్ కంపెనీ చేపట్టిన విస్తరణ కార్యక్రమం తెలివితక్కువ తనమనుకోవాలా? ఎగ్జిబిటర్లు మిగలాలంటే సింగిల్ స్క్రీన్ల నవీకరణకి పెట్టుబడులు పెట్టి, టికెట్ల రేట్ల దగ్గర మల్టీప్లెక్సులకి గట్టి పోటీ నివ్వొచ్చు- వాళ్ళ పర్సెంటేజీ విధానంతోనే. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏనాటికైనా తీపిగుర్తులు. వీటిని పరిరక్షించుకోవడం ఎగ్జిబిటర్లదే కాదు నిర్మాతల బాధ్యత కూడా!