రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, జూన్ 2019, సోమవారం

844 :సందేహాలు - సమాధానాలు


Q:  మీరు బ్లాగ్ లో డిక్టేటర్’ మూవీ స్క్రీన్ ప్లే సంగతులు రాస్తూ, ఈక్వలైజర్’ సినిమా గురించి ప్రస్తావించారు. ‘ఈక్వలైజర్’  ఏమంత గొప్ప సినిమా కాదనీ, పాత్రతో, కథతో దాని బలహీనతలు దానికున్నాయనీ రాశారు. వాటి గురించి ఒక్కసారి విపులంగా వివరిస్తారా?
అశోక్ పొడపాటి, Asso. Dir.
A: 'డిక్టేటర్’ స్క్రీన్ ప్లే సంగతుల్లోనే ‘ఈక్వలైజర్’ గురించి ఇలా వుంది : ఈ క్యారెక్టర్ గతాన్ని చెప్పడం కోసం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళలేదు. పొడిపొడి మాటల్లో అతడిచేతే చెప్పిస్తారు. దీనివల్ల ఓ వెలితి వెన్నాడుతూంటుంది మనల్ని. గతంలో ఉద్యోగ రీత్యా అతను చేసిన పాపాలేమిటో  దృశ్య రూపంలో ప్రత్యక్షంగా చూపించి వుంటేఇప్పుడు అతను  చేసుకుంటున్న ప్రాయశ్చిత్తానికి మనకి ఎనలేని సానుభూతి కలిగే అవకాశం వుంది. కానీ ఈ పాత్ర గురించి ఏమీ చెప్పకూడదని నిర్ణయించామని రచయిత రిచర్డ్ వెంక్ వింతగా చెప్పాడు. ఇది టిపికల్ యాక్టర్ మూవీ కాదనీ, అతను సూపర్ హీరో కూడా కాదనీ, కానీ  ఏది తప్పో ఏది ఒప్పో అంతరాత్మకి తెలిసిన వాడనీ చెప్పుకొచ్చాడు. ఇది ఎంత వరకు కరెక్టో గానీ,  గతంలో 2005 లో రాం గోపాల్ వర్మ నిర్మించిన జేమ్స్అనే యాక్షన్ సినిమాలో కూడా హీరో ఎవరో, ఎక్కడ్నించీ వచ్చాడో, ఏమీ చెప్పకుండా నానా యాక్షన్ హంగామా చేయించారు. ఈ అట్ట ముక్క పాత్ర చూళ్లేక మొహం చాటేశారు ప్రేక్షకులు.
                పోతే, ‘ఈక్వలైజర్’  మిడిల్ ఒక దశ దాటాక డొల్లగా మారడమూ జరుగుతుంది. సాగుతున్న కొద్దీ కథ విస్తరించకుండా, కొత్త విషయాలు బయటపడకుండాఅదే హీరో- అదే మాఫియాతో  ఫ్లాట్ యాక్షన్ గా వెళ్లి ముగుస్తుంది.

          దీంతో మీ సందేహాలు తీరే వుంటాయి. పాత్ర ఇప్పుడు కథలో పాల్పడుతున్న చర్యలకి మూలాలు గతంలో వుంటే, అది డైలాగ్స్ తో చెప్పేకన్నా విజువల్స్ లో చూపిస్తేనే  అప్పటి ఎమోషన్స్ బలంగా ప్రేక్షకుల్లో నాటుకుంటాయి. పాత్ర చెప్తే విన్నప్పటికన్నా ప్రేక్షకులకి కళ్ళారా చూపిస్తే  వుండే ప్రభావం వేరు. పాత్ర గతాన్ని కథ మధ్యలో రివీల్ చేయాల్సి వచ్చినప్పటి సంగతి ఇది. కథ చివరివరకూ అట్టి పెట్టుకుని రివీల్ చేస్తే, విజువల్స్ తో చెప్పాల్సిన అవసరం లేదు, డైలాగ్స్ తో చెప్తేనే ఎఫెక్టివ్ గా, షాకింగ్ గా వుంటుంది. విజువల్స్ వల్ల ఇక్కడి ఫినిషింగ్ టచ్ డ్రామా డైల్యూట్  అయిపోతుంది. ఇందుకుదాహరణగా  ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ వుంది. ఇదే ‘ఈక్వలైజర్’ హీరో డెంజిల్ వాషింగ్టన్ తో, ఇదే దర్శకుడు అంటాయిన్ ఫుఖ్వా తీసిన రీమేక్ ఇది. ఇందులో ఎక్కడ్నించో వచ్చిన కౌబాయ్ హీరో డెంజిల్ వాషింగ్టన్, ఎందుకు ఒక వూరిని కాపాడడానికి పోరాడుతున్నాడో అర్ధంగాక అసంతృప్తి కల్గిస్తుంది. అప్పుడు చివర్లో విలన్ని చంపుతూ - నా మదర్ నీ, సిస్టర్స్ నీ చంపింది నువ్వు కదరా - అని రివీల్ చేస్తాడు. ఈ రహస్యం ఇప్పుడు ముగింపులో చెప్పడం వల్ల పాత్ర పట్ల వున్న సందేహాలన్నీ తీరిపోయి, సానుభూతి ఏర్పడుతుంది. ఇదే కథ కత మధ్యలో చెప్పివుంటే, ఈమూవీ రొటీన్ రివెంజి డ్రామాగా తెలిసిపోయి తేలిపోయేది. ఏదైతే బలహీనంగా వుంటుందో దాన్ని ముగింపులో చెప్పడం వల్ల బలాన్ని చేకూరుస్తుంది. ఇక్కడ చెప్పాలి, చూపించకూడదు. ఇది అకిరా కురసావా టెక్నిక్.  ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ రెండు రీమేకులకీ మూలం కురసావా తీసిన ‘సెవెన్ సమురాయ్’.  

      ఇక కథా పరంగా వున్న బలహీనతేమిటంటే, తమ ఏజెంట్ ని చంపినందుకు, రష్యన్ మాఫియా హీరో మీద ప్రతీకార దాడులకి దిగడం, దీన్ని హీరో ఎదుర్కోవడమనే  యాక్షన్ తో సాగడం. కేవలం దాడులు ప్రతి దాడులల్ని  రెండు గంటల సినిమాగా చూడాల్సి రావడం. మళ్ళీ దీనికి విరుగుడు ఈ దర్శకుడు ఫుఖ్వానే, రచయిత రిచర్డ్ వెంక్ నే ‘ఈక్వలైజర్-2’ లో కనిపెట్టారు. రెండు గంటల సినిమాలో కథని ఇరవై నిమిషాలకే కుదించేశారు. గంట నిడివి అంతా కథతో సంబంధం లేని కొన్ని సబ్ ప్లాట్స్ తో,  కొందరి పట్ల హీరో డెంజిల్ వాషింగ్టన్ సేవాగుణం చూపించారు. ఇక మిగిలిన 40 నిమిషాలు క్లయిమాక్స్ చూపించారు!

        ఇంటర్వెల్ కి పది నిమిషాల ముందు, హీరో మాజీ కొలీగ్ ని మాఫియాలు హత్య చేయడంతో ప్లాట్ పాయింట్ వన్ వేశారు. ఇంటర్వెల్ తర్వాత పది నిమిషాలకి మఫియాలని పిలిచి -మీరు చావడనికి సిద్ధంగా వుండండి  - అని హీరోతో చెప్పించి, ప్లాట్ పాయింట్ టూ వేసేశారు. అంతే, ఇక నస పెట్టకుండా చంపడాలతో క్లయిమాక్స్ మొదలేట్టేశారు.

        సెకండాఫ్ పదినిమిషాలకే ప్లాట్ పాయింట్ టూ వచ్చేసి, క్లయిమాక్స్ మొదలయ్యే  సినిమా ఎక్కడైనా వుందా? ఇక్కడుంది. నస పెట్టే రొటీన్ రివెంజి కథని రెండు గంటల సేపు ఈ కాలంలో చూపించలేమని ఇలా చేశారు. కథని బాగా కుదించి, కథతో సంబంధం లేని పాత్రలతో, వాటి ఉపకథలతో భర్తీ చేశారు. ఇంటర్వెల్ కి పదినిమిషాల ముందు ప్లాట్ పాయింట్ వన్ - ఇంటర్వెల్ తర్వాత పది నిమిషాలకే ప్లాట్ పాయింట్ టూ - ఈ రెండిటి మధ్య ఇరవై నిమిషాలే మిడిల్. సినిమాలో యాభై శాతం వుండాల్సిన మిడిల్ ఇక్కడ నామమాత్రంగా వుండిపోయింది. ఈ ఇరవై నిమిషాల్లోనే కాసింత కథ. రివెంజి అని తెలిసిపోయాక ఇంకా కథెవరు చూస్తారు - అందుకే ఇరవై నిమిషాల్లోనే వేస్టు కథ ముగించి పారేసి క్లయిమాక్స్ కెళ్ళి పోయారు. ఈ క్లయిమాక్స్ 40 నిముషాలూ ఏక బిగి యాక్షన్ తో చాలా క్రేజీగా వుంటుంది. అదీ వర్ష బీభత్సంతో.
        క్లయిమాక్స్ పూర్తయాక సబ్ ప్లాట్ తో ముగించారు. అరవై ఏళ్ల క్రితం తప్పిపోయిన అన్నా చెల్లెళ్ళని హీరో కలపడం ద్వారా. ఈ సబ్ ప్లాట్స్ వల్లే హీరో ఉన్నతంగా కన్పిస్తాడు. కొన్ని రోజుల పాటు ఈ పాత్రలో డెంజిల్ వాషింగ్టన్ ని మర్చిపోలేం.

        అంటే,  కథాబలం లేని సినిమాలకి ఇదొక మోడల్ అన్న మాట. ఉపకథలతో, సెకండాఫ్ లో వెంటనే మొదలయ్యే క్లయిమాక్సుతో, బోరు కొట్టే కథనుంచి ఇలా తప్పించుకోవడమన్నమాట. వద్దన్నా ఇంకా ఎండ్ సస్పన్స్ లు, మిడిల్ మటాషులు తీస్తూ తీరా షాకిచ్చే ఫలితాల్ని చూసుకునే కన్నా, ఈ ప్రయోగం బెటరే.  

Q:  నేనింకా రైటర్ గా స్థిరపడలేదు. నాకొచ్చే సమస్యేమిటంటే రెమ్యునరేషన్ ఎంత అడగాలో అర్థం గావడం లేదు. ఎంత అడిగితే ఎక్కువన్పించి పొమ్మంటారో, ఎంత అడిగితే తక్కువై ఇబ్బంది పడతానో అర్ధం గావడం లేదు. స్ట్రగుల్ చేస్తున్న నాలాటి వాళ్ళు దేన్ని బేస్ చేసుకుని రెమ్యునరేషన్ అడగాలి?
వినోద్, రైటర్ (పేరు మార్పు)
A: ఇలాటివి చెప్పడం కష్టం. సొంత జీవితంలోనే రైటర్ కి అర్ధంగాకపోతే, కథలేం రాస్తారు, పాత్రల చేత ఏం ప్రవర్తింపజేస్తారు, కదా? కాబట్టి రైటర్స్ సొంత ప్రాబ్లమ్స్ చెప్పుకోకుండా జాగ్రత్త పడితేనే బావుంటుంది. రచనల గురించి, కథల గురించి సందేహాలు అడిగితే వ్యక్తిత్వం పోదు. అడిగారు కాబట్టి చెప్పుకుందాం. రెమ్యునరేషన్ తీసుకునే మెట్టెక్కాలంటే కింద చాలా మెట్ల మీద ఉచిత సేవ చేయాలి. రెమ్యునరేషన్ తీసుకునే మెట్టెక్కాక ఇచ్చింది తీసుకోవాలి. ఇంకో చోట అవకాశం వస్తే ఇక్కడ తీసుకున్న అంకె అక్కడ చెప్పాలి. ఇదే బేస్. తడుముకోకుండా చెప్పాలి. చెప్పినప్పుడే డీల్ చేస్తున్నట్టు అన్పిస్తుంది. ఆలోచించి మీరే చెప్పండంటే మీరు ఫీలవుతున్నట్టు అన్పిస్తుంది. డీలింగ్స్ లో ఫీలింగ్స్, మొహమాటాలు వుండవు. బేర సారాలే వుంటాయి. ఆ బేస్ మీద ఎక్కువ తక్కువలు మాట్లాడుకోవాలి. ఎంత తీసుకుంటారని అడిగినప్పుడు ఆ అంకె చెప్పాలేగానీ ఎదురు ప్రశ్న వేయకూడదు. మీ మూవీ బడ్జెట్ ఎంతని ప్రశ్నించారో ఇక కట్ అయిపోతారు. తెలిసిన వాళ్ళయినా సరే ఇలా అడక్కూడదు. ఈ చిన్నపొరపాటుతో  కట్ అయిపోయిన వాళ్ళున్నారు. అడ్వాన్సు తీసుకున్నాక,  సబ్జెక్టు మీద కఠినమైన హోం వర్క్ తో మీవంతు కంట్రిబ్యూట్ చేస్తూంటేనే, ఇచ్చిన రూపాయలకి పది రూపాయలు ఎక్కువ వాళ్ళే ఇస్తారు. రెండో సారి పిలుస్తారు. పిలిచినప్పుడు మొదటి సారి ఇచ్చిన దానికి పెంచి ఇవ్వ బుద్ధి కాదు. అదంతే. ఇప్పుడు బయట మీరు ఎక్కువ పొందుతున్నా సరే, ఆ రేంజిలో ఇవ్వబుద్దికాదు. పెంపుదలలు ఇంకో చోటే  చూసుకోవాల్సిందే. ఇక్కడ మానవ సంబంధాలు నిలుపుకోవాలన్పిస్తే ఒప్పుకోవాలి, లేకపోతే గుడ్ బై చెప్పేయాలి...ఇలాటి ప్రశ్నలు అడిగే వాళ్లకి విన్నపమేమిటంటే, ఇలాటి ప్రశ్నలు అడక్కుండా కథల గురించి అడగాలని.

Q: నాది మరో అనుమానం. సీరియస్ కారెక్టర్ బోర్ కొట్టకుండా వుండాలంటే రచయిత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా? ముఖ్యంగా హీరో గతం తాలూకు విషాదాన్ని మోస్తున్నప్పుడు, పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా ఎలా నిర్వహించాలి? ‘అరవింద సమేత’, జోష్’ సినిమాల్లో హీరో పాత్రలు ఇబ్బందిని ఎదుర్కొన్నాయి అనిపిస్తుంది. విషయంలో ఈక్వలైజర్’ పాత్ర నుంచి ఏదైనా నేర్చుకోవచ్చా?
అశోక్ పొడపాటి, Asso. Dir.
A: నేటి ఎంటర్ టైన్మెంట్ల కాలంలో సీరియస్ పాత్రలు తట్టుకుని నిలబడాలంటే గంభీరమైన కథ తప్ప మార్గం లేదు. ‘దీవార్’ లో అమితాబ్ బచ్చన్ కథలోని గంభీర విషయంతో, పూర్తిగా సీరియస్సే. ‘దీవార్’ తో బాటు ‘శివ’ విషయ గాంభీర్యంతో సీరియస్ నెస్ కి ఒక పధ్ధతి, ఇది లీనియర్ స్ట్రక్చర్ తో. నాన్ లీనియర్ స్ట్రక్చర్ తో ‘ఖైదీ’ ఇంకో పద్దతి. సీరియస్ కథల్లో  లీనియర్ స్ట్రక్చర్ తో బిగినింగ్ విభాగం వరకూ పాత్ర ఎంటర్ టైన్ చేసినా, బిగినింగ్ ముగిసే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర విషాదయుక్త సీరియస్ గోల్ ఏర్పడ్డాక,  ఇంకాతర్వాత  సుదీర్ఘమైన మిడిల్, ఎండ్ విభాగాల్లో  పాత్ర అదే విషాద యుక్త సీరియస్ నెస్ తో వుంటుంది. దీవార్, శివలలో హీరో పాత్రలు బిగినింగ్ విభాగంలో ఎంటర్ టైన్ కూడా చెయ్యవు, పైగా తక్కువ మాట్లాడతాయి. అయినా ఇవి సక్సెస్ అయ్యాయి.

          ఇందుకే సిడ్ ఫీల్డ్ అంటాడు - పాత్ర అనుకుంటున్నప్పుడు ముందుగా దాని దృక్పథాన్ని నిర్ణయించాలని. ప్రపంచం పట్ల పాత్ర దృక్పథమేమిటి? ఏ భావజాలంతో పాత్ర వుంది? ఇది లేకుండా పాత్ర కథా ప్రపంచంలోకి అడుగు పెట్టజాలదు. మనందరికీ ప్రపంచాన్ని చూసే విధానంతో ఒక దృక్పథం వుండి తీరుతుంది. ఆ దృక్పథం ఏదైనా కానీ అదుంటే తమలాగే ఇది వుందన్న భావం ప్రేక్షకులకి ఏర్పడుతుంది. ప్రేక్షకులతో కనెక్ట్ చేయడానికి మొట్టమొదటి ఎలిమెంట్ పాత్ర దృక్పథం. ఈ దృక్పథమన్నది మామూలు విషయం కాదు. మొత్తం కథే ఈ దృక్పథాన్ని బట్టి కథనం మార్చుకుంటుంది. అప్పుడిక ప్రేక్షకులు కట్టేసినట్టు కూర్చుంటారు. ఉన్నట్టుండి కథ గంభీరమై పోతుంది. ఆ గాంభీర్యం పాత్ర దృక్పథంలోంచి వస్తుందే తప్ప, ఎన్ని రక్తాలు పారించినా రాదు.

          ఈ మధ్య ఒక కథతో ఇదే సమస్య వచ్చింది. కథ చూస్తే  అనేక పొరలుగా, అనేక పాయలుగా గంభీరమైనది. దీన్ని వినోదాత్మకంగా చెప్పాలి. హీరో తనకో విషాద నేపథ్యముందని తర్వాత తెలుసుకుంటాడు. దీని కంటే ముందు ఒక గోల్ ఏర్పడి నప్పుడు ఈ ప్రపంచం ఎంజాయ్ చేయడానికే వుందన్న దృక్పథంతో అలాగే ఎంటర్ టైన్ చేస్తూ పోతాడు. అప్పుడు దీంతో వచ్చేసి విషాద నేపథ్యం ఢీకొంటే, దృక్పథం కూడా మారిపోయి-  ఇక ఎంటర్ టైన్  చేసే మాటే లేదు. కానీ ఎంటర్ టైన్ చేయాలి. లేకపోతే దీంట్లో వున్న విషయ గాభీర్యంతో సినిమా నిలబడదు. హిందీలో ప్రకాష్ ఝానే పెద్ద స్టార్స్ తో రిజర్వేషన్ల గంభీర కథ నడపలేక, ఇంటర్వెల్ తర్వాత కార్పొరేట్ కాలేజీల అక్రమాల కథంటూ తెచ్చి అతికించి, చతికిల బడ్డాడు.

          పాత్ర దృక్పథమైతే వుంది, కానీ తర్వాత తెలుసుకున్న విషాద  నేపథ్యంతో ఈ దృక్పథం ఏమవుతుంది? ఇలాగే  కామెడీలు చేస్తూ పోవడమేనా? అప్పుడు బెడిసి కొడుతుంది పాత్ర చిత్రణ. ఎక్కడ జరిగింది తప్పని చూస్తే, పాత్రకి దృక్పథాన్ని ఏర్పర్చేప్పుడు దాని గతం లోకి చూడలేదని అర్ధమైంది. పాత్ర కుటుంబ గతం చూస్తే ఘన కీర్తి, ఇప్పుడు వర్తమానం చూస్తే  వంకాయ. ఈ వంకాయతనం తోనే దృక్పథం ఏర్పాటయ్యింది. ఇందుకే ఇప్పుడు  బయటపడిన విషాద నేపథ్యంతో దృక్పథం కలవడం లేదు. ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలన్న దృక్పథం ఇప్పుడు విషాద నేపథ్యంతో కూడా ఎంజాయ్ చేస్తూ సంఘర్షించలేదు. అందుకని తన లోని వంకాయతనానికి- అంటే ఫన్నీ పార్టుకి-  ఇప్పుడు శాడిజాన్ని జోడించి పీడిస్తూ ప్రతీకారం తీర్చుకుంటే, విషాద నేపథ్యానికి న్యాయం జరగడమే గాక, ఎంటర్  టైన్మెంట్ ఏ ఇబ్బందీ లేకుండా కంటిన్యూ అవుతుంది.

          ఇంకో యాంగిల్లో చూస్తే, పాత్ర గత ఘన కీర్తి ప్రకారం వాళ్ళది శాసించే కుటుంబం. అప్పుడు తనకి తెలియకుండానే ఆ జీన్స్ వల్ల మొదట ఆదేశిస్తాడు, పని జరక్కపోతే ఫన్నీగా మారి ఆకర్షిస్తాడు. ఈ ద్వంద్వాలు ప్రదర్శిస్తాడు. అప్పుడు విషాద నేపధ్యం బయట పడ్డాక, తన లోని శాసించే గుణం ఎక్కడ్నుంచి వచ్చిందో అర్థమయ్యాక, ఇక దానికి మసాలా జోడించి  శాడిస్టిక్ వినోదానికి పాల్పడతాడు.

          సీరియస్ కథలతో ఎప్పుడూ సమస్యే. సినిమా అనే వినోద సాధనానికి వ్యతిరేకంగా పోవడం. ఇదంతా లీనియర్ కథల విషయంలో. నాన్ లీనియర్ తో సమస్య రాదు. ‘ఖైదీ’ లాంటి నాన్ లీనియర్ ని చూస్తే, చిరంజీవి ప్రేమా పాటలూ సరదాలూ ఇవి బిగినింగ్. రావు గోపాలరావుతో ఘర్షణ మిడిల్, విజయం ఎండ్. దీన్ని సినిమాలో ఇలా చూపించారు - మిడిల్ తో ప్రారంభించి, బిగినింగ్ ని ఫ్లాష్ బ్యాక్ చేసి చూపించి, ఎండ్ తో ముగించారు. అంటే సీరియస్ గా  వుంటున్న మిడిల్, ఎండ్ ల మధ్య ఎంటర్ టైన్ చేస్తున్న బిగినింగ్ ని ఫ్లాష్ బ్యాకుగా చూపించడం. దీంతో బోరుకొట్ట కుండా ఏకబిగి సీరియస్ నెస్ సడలింది.

        ఇక సీరియస్ కథ సీరియస్ నెస్ తగ్గించాలంటే, పై ప్రశ్నకి చెప్పుకున్నట్టు, ‘ఈక్వలైజర్ -2’ మార్గం ప్రయత్నించడం. అంటే సీరియస్ కథని వీలైనంత తగ్గించి, ఉప కథలతో అర్ధవంతంగా నడిపి, సీరియస్ కథకి క్లయిమాక్స్ ని బారెడు చేయడం. 
          ఇలా లీనియర్ గా క్యారక్టర్ తో, నాన్ లీనియర్ గా స్ట్రక్చర్ తో, స్ట్రక్చర్ తో క్రియేటివిటీతో, సీరియస్ పాత్ర బోరు కొట్టకుండా చేయవచ్చు. 

Q:  నా ప్రశ్నలు ఏమిటంటే, 1. ‘ఏజెంట్ ఆత్రేయ’ సినిమా హిట్ అని అందరూ దాన్ని బాగా పొగుడుతున్నారు. కానీ మీరు మాత్రం సినిమా ఎవరేజి అంటూ 2.5 రేటింగ్ ఇస్తూ, ఎండ్ సస్పెన్స్ చేశారనీ, క్యారక్టర్ కొత్తగా ఏం ట్రై చేయకుండా అదే మూస పద్ధతిలో వెళ్ళారనీ రాశారు. సినిమాకి జనాల ఆదరణ లభించింది. మిగతా క్రిటిక్స్ నుంచి మంచి రేటింగ్స్ వచ్చాయి. ఒక వెబ్సైట్  వాళ్ళు అయితే సినిమాకి సీక్వెల్స్ లేదా సిరీస్ చేసుకోవచ్చనీ సలహా కూడా ఇచ్చారు. స్ట్రక్చర్ లో లేకుండా మూవీస్ హిట్టవుతున్నాయి, మీరేమో స్ట్రక్చర్  అంటారు. ఇలా ఎందుకు జరుగుతోంది,  2. ‘ఏజెంట్ ఆత్రేయ’ స్క్రీన్ ప్లే సంగతులు రాయగలరు. 3. ఇతర భాషల మూవీస్ విశ్లేషణ అడిగాము, రాస్తానన్నారు. కానీ ఇంకా ఏదీ రాయడం లేదు, 4. బ్లాగ్ లో వారం వారం ప్రశ్నల కోసం ఒక రోజు కేటాయించండి. దీని వల్ల ప్రతీ వారంమా ప్రశ్నలకి  సమాధానాలు ఆశించే వీలవుతుంది. 
రవి, AD
A: ముందు ఈ లింక్ క్లిక్ చేసి చూడండి. ఇదీ పరిస్థితి. ‘ఏజెంట్ ఆత్రేయ’ ఎవరేజిగా బయటపడుతుంది, అంత హిట్టేమీ కాదు. ఈ డిటెక్టివ్ పాత్ర దాని డ్రెస్ తో సహా ఏనాటిదో పాత మూసలోనే వుంది. ఎండ్ సస్పెన్స్ వున్నా సినిమా ఆడుతుందని మీకు నమ్మకమైతే అలాగే తీయండి. కానీ అసలు ఎండ్ సస్పెన్స్ అంటే ఏమిటో తెలుసా? ఈ సినిమాలో ఎండ్ సస్పెన్స్ విప్పుతూ డిటెక్టివ్ చెప్పే ప్రసంగ పాఠం మీకేమైనా అర్థమైందా? ఇది నవలలకి పనికొచ్చే ప్రక్రియ. సినిమాల్లో దీంతో ఎదురవుతున్న బాక్సాఫీసు ప్రమాదాల్ని  హలీవుడ్ ఏనాడో గుర్తించి, సీన్ టు సీన్ సస్పెన్స్ గా మార్చుకుంది. ఈ విషయం బ్లాగులో వంద సార్లు రాశాం. అయినా తప్పుబడుతున్నారంటే, ఏది ఒప్పో మీరే చెప్పాలి. ఎండ్ సస్పెన్స్ తో వచ్చిన తెలుగు సినిమాలన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి, రవితేజతో తీసిన ‘బెంగాల్ టైగర్’ సహా. ఈ విషయం తెలుసా? 

          ఇక ఇలాటి ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలు కూడా సాహిత్యంలో, సినిమాల్లో లేవెక్కడా. 40 ఏళ్ల క్రితమే వాస్తవికతతో ప్రజలందరికీ తెలిసిన పోలీస్ డిటెక్టివ్ పాత్రలు వచ్చేశాయి! తెలుగులో నైతే యాక్షన్ ఓరియెంటెడ్ మధుబాబు ‘షాడో’ వచ్చేశాడు. అప్పుడే తెలుగు డిటెక్టివ్ సాహిత్యం కనుమరుగైంది. ఈ మొత్తం సబ్జెక్టు గురించి చెప్పుకోవాలంటే చాలా వుంటుంది.

         
స్ట్రక్చర్ లో లేకుండా మూవీస్ హిట్టవుతున్నాయా? ఎన్ని హిట్టవుతున్నాయి? ప్రతీ ఏటా 90 శాతం సినిమాలు స్ట్రక్చర్ వల్లే అట్టర్ ఫ్లాపవుతున్నాయా? అయితే వెంటనే ఫిలిం ఇనిస్టిట్యూట్స్ కెళ్ళి, మీరు స్ట్రక్చర్ నేర్పుతూంటే 90 శాతం సినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయని ఆ కోర్సులు ఆపించాలి. ఈ బ్లాగు చదవడం మానెయ్యాలి. స్ట్రక్చర్ లో వుండే హాలీవుడ్, కొరియన్ సినిమాలూ చూడ్డం మానెయ్యాలి. స్ట్రక్చర్ వుండని వరల్డ్ మూవీస్ చూస్తూ, అలా సినిమాలు తీస్తూ, అట్టర్ ఫ్లాపుల పర్మనెంట్ శాతాన్ని  సదా కాపాడాలిలాగే.

          ఇక చివరి ప్రశ్నలకి- ‘ఏజెంట్ ఆత్రేయ’ స్క్రీన్ ప్లే సంగతులకి అవకాశం లేదు. ఎండ్ సస్పెన్స్ తో ఎక్కడెక్కడి క్లూలు ఎక్కడెక్కడ కలిపి ఊహాగానం చేస్తున్నాడో, ఆ తేదీలు, అనుమానితులు, స్థలాలకి ఎలా సంబంధాలు కలుపుతూ ప్రసంగిస్తున్నాడో, మెదడుకెక్కడం కష్టం. కష్టపడి రాసి ఇలా తీయొచ్చని కూడా చెప్పదల్చుకోలేదు.

          ఇతర భాషల సినిమాల గురించి రాసేంత టైము దొరకడంలేదు. దొరికినప్పుడు రాద్దాం. ఇక వారం వారం ప్రశ్నలూ సమాధానాల గురించి. ప్రశ్నలే రాకపోతే ప్రతీవారం శీర్షిక ఏముంటుంది. అప్పుడప్పుడు వచ్చిన ప్రశ్నల్ని కూడేసి ఒకసారి ఇస్తున్నాం. దీంతో అత్యవసరంగా సమాధానం ఆశించే వారు నిరీక్షించాల్సి వస్తోంది.

సికిందర్






19, జూన్ 2019, బుధవారం

843 ; స్క్రీన్ ప్లే సంగతులు - 3

Concluding part of  8 - 15 points have been  added to this article today, ie 20.6.19


లీనియర్ కథా విశ్లేషణ:
         
లీనియర్ కథలో మొదటి ప్లాట్ పాయింట్ తల్లీ కూతుళ్ళు వంశీని చంపితే, ప్రభాకర్ హెల్ప్ చేయడంగా; రెండో ప్లాట్ పాయింట్ ప్రభాకర్ పోలీసులకి లొంగి పోవడంగా వున్నాయి. నిజంగా జరిగితే రెండూ కరెక్టే స్ట్రక్చర్ విధుల రీత్యా. కానీ ఈ రెండిట్లో మొదటిది నిజంగా జరగలేదు. ఇదే సమస్య. ప్రపంచ సినిమా చరిత్రలో నిజంగా జరగని సంఘటనతో ప్లాట్ పాయింట్ వన్ రావడం ఇదే బహుశా. ఇదే విచిత్రం, ఇదే వింత. 

         
ల్లీ కూతుళ్ళు వంశీని చంపే దృశ్యంగానీ, ఆ తర్వాత ప్రభాకర్ హెల్ప్ చేసిన వైనంగానీ నిజంగా జరిగినవి కావు. డిసిపి కార్తికేయ ఊహాగానం మాత్రమే. సెకండాఫ్ లో అతను ఊహించి దృశ్యాన్ని అల్లి చెప్పినట్టుగా చూశాం. దీన్నే లీనియర్ కథ అర్ధమవడానికి ప్లాట్ పాయింట్ వన్ లో సెట్ చేసి, లీనియర్ కథ  రాయాల్సి వచ్చింది. కార్తికేయ తను జయంతి ఫ్లాట్ కెళ్ళినప్పుడు డోర్ చైన్ తోబాటు గ్రానైట్ దిమ్మె డ్యామేజీ అయివుండడాన్ని గుర్తు చేసుకుని, హత్యా దృశ్యాన్ని అల్లాడు. వంశీ వచ్చి మీటర్ రీడింగ్ అంటూ డోర్ బెల్ నొక్కిందగ్గర్నుంచీ, తల్లి కూతుళ్ళు అతణ్ణి చంపిన విధానం, ఆ తర్వాత ప్రభాకర్ వచ్చి హెల్ప్  చేస్తాననడం వరకూ దృశ్యాన్ని అల్లి చెప్పాడు. ఈ ఊహా గానాన్నే లీనియర్ కథలో ప్లాట్ పాయింట్ వన్ గా వాడుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందో తల్లీకూతుళ్ళు గానీ, ప్రభాకర్ గానీ చెప్తేనే నిజ సంఘటనగా నమ్మ వీలవుతుంది. కార్తికేయ ఊహించి చెప్తే కాదు. అంటే ప్లాట్ పాయింట్ వన్ లేనట్టే భావించాల్సి వస్తుంది. ఊహాజనిత ప్లాట్ పాయింట్ వన్ తో కథ వుండదుగా అంటే, ఇలా వుంటుందని దర్శకుడు భావించాడంతే, మనమేం చేస్తాం?         

      మనతో సహా ఈ కథలో ఎవ్వరికీ తెలీదు - అసలు తల్లీ కూతుళ్ళు వంశీని చంపారా, ప్రభాకర్ వాళ్లకి హెల్ప్ చేశాడా అన్న విషయం - కేవలం ఆ తల్లీ కూతుళ్ళకీ, ప్రభాకర్ కీ  తప్ప! ఊహాగానాలతో వాళ్ళ మీద అన్యాయంగా నిందమోపి వాళ్ళని క్షమించి వదిలెయ్యడం పెద్ద మనసు అన్పించుకోదు, కేసుని తేల్చలేని చేతగాని తనమన్పించు కుంటుంది. ఇలా పోలీసు ఉన్నతాధికారుల పాత్రచిత్రణలు లోపభూయిష్టంగా మారాయి, ఊహాజనిత ప్లాట్ పాయింట్ వన్ వల్ల. 

ఎందుకు హెల్ప్ చేశాడు?
          సినిమాలో చూపించినట్టుగా నాన్ లీనియర్ కథనంలో ఏం చేశారంటే, సూపర్ మార్కెట్ లో వంశీని చూసి జయంతి పారిపోయి రావడం, తల్లితో కలిసి భయపడుతూ వుంటే, డోర్ బెల్ మోగడం, అప్పుడు ‘ఎవరూ?’ అంటే, ‘మీటర్ రీడింగ్’ అంటూ సమాధానం రావడం (మీటర్లు ఫ్లాట్ లో వుంటాయా?) వరకూ చూపించి కట్ చేసేశారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సెకండాఫ్ లో కార్తికేయ ఊహాగానంతో మాత్రమే దృశ్యం వేసి చూపించారు. దీనివల్ల మొత్తం కేసు దర్యాప్తే  అనుమానాస్పదమవడంతో బాటు, బూటకపు ప్లాట్ పాయింట్ వన్ సీను వచ్చింది. కథకూడా బూటకంగా తయారయింది. ‘మీటర్ రీడింగ్’ అన్న తర్వాత ఏదో సస్పెన్స్ పోషిద్దామనుకుని కట్ చేశారు. ఈ కట్ అవడం కట్ అవడం మొత్తం స్క్రిప్టులోంచి అన్నీ కట్ అయిపోయాయి. 

          కార్తికేయ ఊహాగానం కూడా పరిపూర్ణం కాదు, పాత్ర చిత్రణల్లేవు. ఈ సీన్ని ఊహాగానంగా కాకుండా నిజంగా చూపించి వుంటే, అంటే ‘మీటర్ రీడింగ్’ అన్న తర్వాత కంటిన్యూ చేసివుంటే ప్లాట్ పాయింట్ వన్ గా వుండడమే గాక, ప్లాట్ పాయింట్ వన్ ధర్మాల్ని నిర్వర్తించేది. పాత్ర చిత్రణల్ని సమగ్రం చేసేది. పైగా కథ పట్ల నమ్మకం కల్గించేది.

         కార్తికేయ ఊహాగానంతో తల్లీ కూతుళ్ళు వంశీని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో మనకి అర్ధమైనా, అసలు ప్రభాకర్ ఎందుకు హెల్ప్ చేయడానికి వచ్చాడో అర్ధంగాదు. చనిపోయిన అతడి భార్య మానస జయంతి లాగే వుందని మనకి తెలుసు. ఆ ఫీలింగ్ తో హెల్ప్ చేయడాని కొచ్చాడా? అయితే అదిక్కడ చెప్పించి క్లియర్ చేయాలి. ఆ తల్లీ కూతుళ్ళు అడగాలి – మీరెందుకింత రిస్కు తీసుకుంటున్నారని. జయంతికి అనుమానాలు వచ్చేయాలి. ‘రోజూ మీరు బయటి వరకూ నన్ను ఫాలో అవుతున్నారెందుకు? ఒన్ సైడ్ లవ్వా? ఇప్పుడీ హెల్ప్ చేసి నన్ను మీ గ్రిప్ లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారా? సారీ, నేనింకో వంశీని కోరుకోవడం లేదు, ప్లీజ్ లీవ్...’ అనెయ్యాలి. 

          అతను మనసులో మాట చెప్పుకోలేని వ్యధ ననుభవించాలి -  ‘నువ్వు నా చనిపోయిన భార్యలాగే  వున్నావన్న ఫీలింగ్ తో ఫాలో అయ్యా, హెల్ప్ చేసున్నా’- అన్నాకూడా దొరికిపోతాడు. ఆమె అనుమానాల్ని నిజం చేసిన వాడవుతాడు. ఇదెలా కొలిక్కి వచ్చిందనేది ఇక్కడ చెప్పి ముందుకెళ్లాలి. ప్లాట్ పాయింట్ వన్ వరకూ బిగినింగ్ విభాగంలో జరిగిన సంబంధిత విషయాలు కొలిక్కి వచ్చేయాలి. అప్పుడే అర్ధం, బలం. పాత్ర చిత్రణలు కూడా సవ్యంగా వుంటాయి. 

     కానీ ఏం జరిగిందంటే, ఈ మొత్తం హత్యా దృశ్యాన్ని, అంటే ప్లాట్ పాయింట్ వన్ సీనుని – దీని తర్వాత శవాన్నిమాయం చేయడాన్నీ ఖండ ఖండాలు చేసి, ఫ్లాష్ బ్యాకులతో నాన్ లీనియర్ గా చూపడంతో, ప్రభాకర్ మనసులోనిమాట - అసలెందుకు హెల్ప్ చేయాలనుకున్నాడో -  సినిమా ముగింపులో అతడి చేతే  జయంతికి చెప్పించాల్సి వచ్చింది. నాన్ లీనియర్ కథకి ఇలా దాచి ముగింపులో చెప్పడం మంచిదే.

          అయితే ఇందువల్ల జయంతి పాత్ర డమ్మీ అయింది. ముగింపులో కూడా అతణ్ణి ప్రశ్నించలేని, అతను చెప్పిందే నమ్మాలన్న పాసివ్ నెస్ కి మారిపోయింది. నాన్ లీనియర్ కథనంలో సీన్ల ఏకత్వం చెదిరిపోక తప్పదు. దీంతో కొన్ని నష్టాలూ తప్పవు. ఇందుకే నాన్ లీనియర్ కథనాల్లో ప్లాట్ పాయింట్స్ తెలియవు, వీటిని లీనియర్ గా మార్చి చూసినప్పుడే లోపాలు సహా తెలుస్తాయి. 

మరికొన్ని లోపాలు :

          లీనియర్ కథని వరసగా చూసుకుంటూ వస్తే ఈ కింది కథన లోపాలతో వుంటుంది. అంటే నాన్ లీనియర్ కథనంలో ఈ లోపాలు తొలగిపోయాయని కాదు. లీనియర్ కథ వచ్చిందే నాన్ లీనియర్ ఆర్డర్ లోంచి. లోపాలు నాన్ లీనియర్ లోనే వున్నాయి. 

           1. మార్నింగ్ జయంతి ఆఫీసు కారెక్కి ఆఫీసుకి పోతూ ఏదో గుర్తు కొచ్చినట్టు సూపర్ మార్కెట్ దగ్గరాప మంటుంది. ఆ టైంలో షాపింగ్ చేయడమేమిటి. పైగా ఏం షాపింగ్ చేయడానికి వచ్చిందో లోపలికి వెళ్ళాక కూడా తెలీదు. రోజూ కారులో వుండే కొలీగ్ కూడా ఇప్పుడుండదు. అంటే వంశీ ఆమెని కనిపెడితే ఆమె పారిపోవడం కోసం, తద్వారా వచ్చే సీన్ల కోసం, కావాలని ఆమెని మధ్యలో సూపర్ మార్కెట్ లోకి పంపించారన్న మాట షాపింగ్ నెపంతో అసహజంగా. 

         2. కార్తికేయకి లాడ్జిలో వ్యక్తి  మిస్సయ్యాడని ఫోరెన్సిక్ టీముతో వెళ్ళినప్పుడు- ఇలాటి సీన్లు చూడడడం చాలా తమాషాగా వుంటుంది - ఆ ఫోరెన్సిక్ టీము లోపలికి వచ్చి - మనం ఏం వూహిస్తూ వుంటామో అదే చేసి పారేస్తారు!  చాలా సినిమాల్లో లాగే, గ్లవ్స్ తొడుక్కోకుండా ఉత్త చేతులతో వస్తువులు ముట్టుకుంటారు, తర్వాత గ్లవ్స్ తొడుక్కుంటారు! ఇప్పుడు కూడా ఫోరెన్ ‘సిక్’ మహానుభావుడు రూమ్ లోకి రాగానే ఉత్త చేత్తో లైటు స్విచ్ వేస్తాడు, తర్వాత గ్లవ్స్ తొడుక్కుంటాడు - శవ్వ శవ్వ!! ఇక్కడకొచ్చిందే సాక్ష్యాధారాల సేకరణ కోసం. ఆ సాక్ష్యాధారాల్ని తన వేలిముద్రలేసి కలుషితం చేస్తున్నానన్న ఇంగితం కూడా వుండి చావదు. 

           3. ఇక్కడ కొచ్చింది బీచ్ రోడ్డులో కాలిన గుర్తు తెలియని శవాన్ని కనుగొన్న నేపధ్యంలో. ఈ లాడ్జి కొచ్చాక ఈ రూము వంశీ బుక్ చేసుకున్నాడని తెలుస్తుంది. అప్పుడు కాలిన శవం వేలిముద్రలతో ఇక్కడి వేలిముద్రల్ని టాలీ చేసి, కాలిన శవం వంశీదని డిక్లేర్ చేస్తాడు ఫోరెన్ ‘సిక్’ మహానుభావుడు! లీనియర్ కథలో కాలిన శవం ప్రభాకర్ హత్య చేసిన అలీదని మనం తెలుసుకున్నాం. ఆ అలీ వేలిముద్రలతో ఈ వంశీ వేలిముద్రలెలా కలిశాయి?  అలీ శవం వంశీ శవమెలా అయిపోయింది? దీనికి డిసిపి కార్తికేయ గారు సమాధానం చెప్పాల్సి వుంది. 

          4. 
హెల్ప్ లేకుండా ఇద్దరు లేడీస్ చంపి శవాన్ని తెచ్చి బీచ్ రోడ్డులో పడెయ్యడమా... ఎవరో హెల్ప్ చేసి వుండాలనీ, అతను లవరై వుండొచ్చనీ పై అధికారి విశ్లేషణ. ఎవరో ఎందుకు హెల్ప్ చేయాలి. ఆ లేడీసే వంశీని బీచ్ రోడ్డుకి రప్పించి ఫినిష్ చేసి వుండొచ్చుగా? వేలిముద్రల్ని అనుకూలంగా మార్చుకుని, అలీ శవాన్ని ఇంకా వంశీ దని నమ్ముతున్నాడు విశ్లేషణాధికారి కూడా. 

           5. ప్రభాకర్ జయంతికి కాల్ చేసి పోలీసులకి ఏం చెప్పావని అంటాడు. మీరు చెప్పిందే చెప్పామంటుంది. అతను చెప్పింది, మనమధ్య కాంటాక్ట్స్ వున్న విషయం బయట పెట్టవద్దని మాత్రమే.

     6. డిసిపి కార్తికేయ తల్లీ కూతుళ్ళని ప్రశ్నించినప్పుడు ఎవరో బ్లాంక్ కాల్స్ చేస్తున్నాడని తల్లి అంటుంది. ఆ కాల్స్ ఎవరు చేస్తున్నారో కార్తికేయ తెలుసుకోవచ్చు. తల్లీ కూతుళ్ళ కాల్ లిస్ట్స్ కూడా తెప్పించుకుని పరిశీలించ వచ్చు. అప్పుడు ప్రభాకర్ కాల్స్ అందులో తెలిసిపోతాయి. ఇక ఆమె గూగుల్ మ్యాప్స్ హిస్టరీని కూడా చెక్ చేస్తే, ఏఏ రోజు ఏఏ సమయాల్లో ఎక్కడెక్కడుందో డేటా అంతా తెలిసి పోతుంది. ఇవేవీ చెయ్యడు. ఆమె సోషల్ మీడియా ఎక్కౌంట్స్  ని కూడా చెక్ చెయాలనుకోడు.  భూతద్దం మాత్రం పట్టుకుని వుంటాడు. 

           7. కార్తికేయ ప్రభాకర్ ఫ్లాట్ దగ్గర నిఘా వేసినప్పుడు, జయంతిని అనుసరించి వస్తూ కనపడతాడు ప్రభాకర్. వాళ్ళు మాట్లాడుకోకుండా ఎవరి దారిని వాళ్ళు  వెళ్లిపోతూంటే, వాళ్ళిద్దరికీ ఏ సంబంధమూ లేదని నిర్థా రించుకుంటాడు కార్తికేయ. హత్య కేసులో అనుమానితులుగా వున్న ఇలాటి వాళ్ళు సంబంధమున్నట్టు కన్పిస్తారా? అసలు జయంతి తన భార్యలా వుందని ప్రభాకర్ ఇంకా ఫాలో కావడమేమిటి? కేసు నేపధ్యంలో కాంటాక్ట్ వున్నట్టు కన్పించ కూడదని తనే ఆమెకి జాగ్రత్త చెప్పాక కూడా? ఇప్పుడు కథ మిడిల్ లో వుంది. ఈ ఫాలో అయ్యే వ్యవహార మంతా కేసుకి పూర్వం బిగినింగ్ విభాగం లోనిది. ఇది ఆటోమేటిగ్గా ప్లాట్ పాయింట్ వన్ లో హత్య తర్వాత అతను  హెల్ప్ ఆఫర్ చేసినప్పుడు కొలిక్కి వచ్చేస్తుంది- పైన చెప్పుకున్నట్టు, ‘మీరెందుకింత రిస్కు తీసుకుంటున్నారు? రోజూ మీరు బయటి వరకూ నన్ను ఫాలో అవుతున్నారెందుకు? ఒన్ సైడ్ లవ్వా? ఇప్పుడీ హెల్ప్ చేసి నన్ను మీ గ్రిప్ లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారా? సారీ, నేనింకో వంశీని కోరుకోవడం లేదు, ప్లీజ్ లీవ్...’ అని సహజాతిసహజంగా జయంతి అనడం ద్వారా, ఈ ఫాలో అయ్యే వ్యవహారం ముగిసిపోవాలి. కానీ ప్లాట్ పాయింట్ వన్ లేకపోవడం వల్ల, పాత్రచిత్రణల్లేక, ఇలా మిడిల్లో ఈ విషమ పరిస్థితిలో  కూడా ఆమెని ఫాలో అవుతూ తిరుగుతున్నాడు మాజీ ఐపీఎస్ అధికారి అయిన ప్రభాకర్!
(మిగిలిన భాగం రాత్రి)



Added on 20.6.19
      8.  ఒక కానిస్టేబుల్ వచ్చి ప్రభాకర్ ఎవరో తెలిసిందని వెబ్ సైట్లో చూపిస్తాడు. ప్రభాకర్  ని ఐపీఎస్ అధికారిగా  పేర్కొంటూ వున్న ఆ న్యూస్ చూసి స్టన్ అవుతాడు కార్తికేయ...అలీ గ్యాంగ్ ని పట్టుకున్న ఐపీఎస్ అధికారి ప్రభాకర్ అని రివీలవుతుంది. ఇది చాలా విచిత్రంగా వుంటుంది. వంశీ హత్య కేసు సందర్భంగా కార్తికేయ ప్రభాకర్ ని ఒకసారి  కలిసి ఆరా తీశాడు. అప్పుడు ప్రభాకర్  మాజీ ఐపీఎస్సే నని గుర్తుపట్టకుండా వుంటాడా, ఈ రాష్ట్రంలోనే పని చేసినప్పుడు? గుర్తు పట్టడమే కాదు, అతడి గతమంతా తెలిసి కూడా వుండాలి. అతడి భార్య మానసని అలీ చంపాడనే విషయం సహా. ఆ తర్వాత అతను జాబ్ కి రిజైన్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడన్న విషయంతో బాటు.  ఈ నేపథ్యమంతా ప్రభాకర్ ని కలిసినప్పుడే గుర్తుకు రావాలి సాటి ఐపీఎస్ అయిన కార్తికేయకి, ఇప్పుడు వెబ్ సైట్లో చూపిస్తే కాదు. ఇది చాలా సిల్లీ. ఈ నేపథ్యంలో ఇంకో అనుబంధ  అంశమేమిటంటే, ఐపీఎస్ అధికారియైన ప్రభాకర్ భార్య హత్య కేసు నమోదు కాలేదా? పోలీస్ శాఖ దర్యాప్తు చేయకుండా వదిలేశారా? ఈ సినిమా ఇలా తీయడానికి వదిలేసి వుంటారు. 

          ఇక ప్రభాకర్ ఐపీఎస్ అని రివీలయ్యాక, అలీ గ్యాంగ్ ని వెంటాడుతున్న దృశ్యంతో ఇంటర్వెల్ వేశారు. అంటే ఐపీఎస్ కార్తికేయ పాయింటాఫ్ వ్యూలోనా? కాదు, దర్శకుడి పాయింటాఫ్ వ్యూలో. ఇదేం చిత్రణో అర్థం గాదు, కథకి శిల్పం గిల్పం లేకుండా అల్పం. వెబ్సైట్లో చూడగానే కార్తికేయ తన పాయింటాఫ్ వ్యూలో ఈ షాట్ వేసుకోవడానికి అతడికి ప్రభాకర్ గురించేమీ తెలీదు- ఇంటర్వెల్ తర్వాత ఇంకో పై అధికారిని అడుగుతాడు ప్రభాకర్ గురించి.
ఇలా వుంది వ్యవహారం!     
     
          కాబట్టి ఇక్కడ ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి ప్రభాకర్ ని ఐపీఎస్ గా చూపిస్తూ మధ్యలో దర్శకుడు తన పాయింటాఫ్ వ్యూతో ఎంటరవుతూ ఇంటర్వెల్ షాట్ వేసుకున్నాడు.  అలీ గ్యాంగ్ ని వెంటాడుతూ సడెన్ గా ఇదెలా వుంటుందంటే, ఏదో మూస మాస్ ఫార్ములా సినిమా లోంచి ముక్క వచ్చి పడ్డట్టుంటుంది. జానర్ మర్యాద చెడి రసభంగం కూడా అవుతుంది.

          9. సెకెండాఫ్ ప్రారంభంలో ఐపీఎస్ కార్తికేయ, ఇంకో పై అధికారికి కాల్ చేసి ప్రభాకర్ గురించి అడుగుతాడు. ప్రభాకర్ మాజీ ఐపీఎస్ అధికారి అనీ, అతడి గురించిన సమాచారం అతడి దగ్గర  పని చేసిన కోలా వెంకట్ అనే ఎస్సై కి తెలుసనీ అంటాడు పై అధికారి. కార్తికేయ కోలా వెంకట్ ని కలుసుకుంటాడు. ప్రభాకర్ చాలా మంచి ఆఫీసర్ అనీ, ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నామనీ, ఆయన రెండేళ్ళ క్రితం రిజైన్ చేశారనీ అంటాడు కోలా వెంకట్. 

          ఈ ఎస్సై కోలా వెంకట్ కూడా ఎంత సిల్లీ ఫెలో అంటే, ప్రభాకర్ గురించి అన్ని విషయాలు చెప్పిన వాడు, ఎందుకు రిజైన్ చేశాడో చెప్పడు. ప్రభాకర్ భార్య మర్డరయిన ముఖ్య విషయమే గాలి కొదిలేసి మాట్లాడతాడు. అసలు ప్రభాకర్ గురించి అడగగానే అతడి ముఖం విషాదమవ్వాలి. కాకుండా తన్మయత్వంతో ప్రభాకర్ గుణగణాలు చెప్తాడు. 

        10. కార్తికేయ తిరిగి వచ్చి ప్రభాకర్ ని కలుస్తాడు. ఆ తల్లీ కూతుళ్ళని అనుమానిస్తున్నామనీ, ఇన్ఫర్మేషన్ కావాలనీ అంటాడు.  వాళ్ళనే పట్టుకుని అడగ మంటాడు ప్రభాకర్. ఇంతకీ కార్తికేయ కోలా వెంకట్ దగ్గర తెలుసుకున్న పనికొచ్చే ముక్కేమిటి? ఏమీ లేదు, మంచి వాడన్న పొగడ్తలు తప్ప. ఎందుకు రిజైన్ చేశాడని కూడా అడగాల్సిన అసలు ప్రశ్న అడగడు. ఇప్పుడు మళ్ళీ ప్రభాకర్ దగ్గరకి అనవసరంగా వచ్చి, తల్లీ కూతుళ్ళని అనుమానిస్తున్నామని అంటాడు. అసలు అనుమానాలు రావాల్సింది ప్రభాకర్ మీద. ఇప్పుడు కూడా అతడికి ప్రభాకర్ భార్య హత్య  గురించి ఏమీ తెలీదు. మీరెందుకు రిజైన్ చేశారని కూడా అడగడు. ఈ విషయం తను ఫోన్ చేసినప్పుడు ఆ ఇంకో పై అధికారియే క్లియర్ చేసి వుండాలి. అతనేమో కోలా వెంకట్ ని కలవమన్నాడు. కోలా వెంకట్ సోది చెప్పాడు.  

          ఇది ప్లాట్ పాయింట్ - 2 కి దారి తీసే పించ్ - 2 సీను. ఆ తల్లీ కూతుళ్ళనే పట్టుకుని అడగమని ప్రభాకర్ అనడం. తల్లీ కూతుళ్ళని కాపాడుతున్న వాడు నోరు జారి అనేశాడా? ఏమో తెలీదు. ఎక్కడా పాత్రల మనసులో ఏముందో బయట పెట్టాలనుకోడు దర్శకుడు, మనకి తోచింది మనం వూహించుకోవాలంతే.

          11. కార్తికేయ పై అధికారి నాజర్ ని కలుస్తాడు. ప్రభాకర్ కి జయంతితో కాంటాక్ట్ వుండి వంశీ హత్య విషయంలో ఆమెకి హెల్ప్ చేసివుంటే, కాంటాక్ట్ లేనట్టే  రోజూ ఉదయం ఆమెని ఎందుకు ఫాలో అవుతున్నాడని అంటాడు నాజర్. అంటే నాజర్ ఉద్దేశంలో ప్రభాకర్ హెల్ప్ చేయలేదు. మరెవరు చేశారు?

     12. తల్లీ కూతుళ్ళనే పట్టుకు అడగండని కార్తికేయతో అనేసినందుకు తల్లీ కూతుళ్ళని ప్రమాదంలోకి నెట్టాడని తనే వెళ్లి లొంగి పోతాడు ప్రభాకర్. ఇది ప్లాట్ పాయింట్ టూ సీను. వంశీని తనే హత్య చేశానంటాడు. తను చేసిన అలీ హత్యని వంశీ హత్యగా వర్ణించి చెప్తాడు. అంటే ఇప్పుడు కూడా అలీ శవాన్ని వంశీ శవంగానే నమ్ముతాడు కార్తికేయ తెలివితక్కువగా. లావుగా వున్న అలీ శవాన్ని బక్కగా వుండే వంశీ శవమనుకుంటాడు. విచిత్రంగా. ఇక  తల్లీ కూతుళ్ళనే పట్టుకు అడగమన్న ప్రభాకర్ ఇప్పుడొచ్చి లొంగిపోతే ఆంతర్యం ఆలోచించడు కార్తికేయ.  

          13. ప్రభాకర్ ని సైకియాట్రిస్టు విచారిస్తాడు. జయంతిని ప్రేమిస్తున్నానంటాడు ప్రభాకర్. నువ్వు జయంతిని ప్రేమించలేదు, వూహించుకుని చెప్తున్నావని అంటాడు సైకియాట్రిస్టు. ఇతడి మాటలు నిరాధారాలని కార్తికేయకి  చెప్పేస్తాడు.  కేస్ క్లోజ్ అని కార్తికేయకి నాజర్ చెప్పేస్తాడు. కేసుని ఏదో రకంగా కొలిక్కి తేవాలన్నట్టు సైకియాట్రిస్టు ఏదో సర్టిఫికేట్ ఇచ్చేస్తే, అది పట్టుకుని నాజర్ కేసు క్లోజ్ అనడం సిల్లీ. 

          14. హత్య రాత్రి 8 - 9 మధ్య జరిగినట్టు పీఎం రిపోర్టు వుందనీ, ఆ సమయంలో తల్లీ కూతుళ్ళ ఎలిబీలు చెక్ చేశాననీ, వాళ్ళు ఇంటి దగ్గరే వున్నారనీ, 8.30 కి వాటర్ బాయ్ వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళినప్పుడు చూశాడనీ, ఆ తర్వాత వాళ్ళు చంపి శవాన్ని తీసి కెళ్ళి బీచ్ రోడ్డులో పడేసి తగులబెట్టారనుకున్నా, 9 గంటలకి బీచ్ రోడ్డులో మంటని చూసినట్టు సాక్షి చెప్పినప్పుడు - అంత స్వల్ప వ్యవధిలో తల్లీ కూతుళ్ళు శవాన్ని తీసుకుని బీచ్ రోడ్డుకి చేరుకోవడం అసాధ్యమనీ, కనుక వాళ్ళని అనుమానించ లేమనీ వివరిస్తాడు నాజర్. తల్లీ కూతుళ్ళే చంపి వుంటే,  వంశీనే బీచ్ రోడ్డుకి రప్పించి చంపి వుంటారని ఇప్పటికీ ఎందుకను కోడు? వాళ్ళు  ఫ్లాట్ లోనే చంపారని ఇప్పుడు కార్తికేయ ఊహాగానం చేసినందుకా? ఆ ఊహాగానానికి సాక్ష్యా ధారాలేమున్నాయి? సాక్ష్యాధారాలకోసం కనీసం ఆ ఫ్లాట్ ని సీజ్ కూడా చేయలేదు. కేవలం డోర్ చైను, గ్రానైట్ దిమ్మె - ఈ రెండూ హత్య జరిగిందనేందుకు నిదర్శనా లవుతాయా? 

        15. కార్తికేయ జిల్లా వార్తల్లో ఒక కేసు చూస్తాడు – 4 వ తేదీ నదిలో కొట్టుకు వచ్చిన మంత్రి తమ్ముడు వంశీ శవం గురించి. ఆ శవాన్ని ప్రభాకరే  నదిలో పడేశాడనీ, అది పక్క జిల్లాకి కొట్టుకు పోయి దొరికితే అది జిల్లా వార్త అవుతుంది తప్పితే ప్రముఖ వార్త అవదని అనుకున్నాడనీ అంటాడు.  అసలు మంత్రి తమ్ముడి  శవం దొరికితే అప్రధాన వార్త అవుతుందా? జిల్లా ఎడిషన్ లో వేసి వదిలేస్తారా? ఐపీఎస్ ఇలాగే ఆలోచిస్తాడా? పైగా ఈ సీను ఎంత నిర్లక్ష్యంగా తీశారంటే. అతను చదివేది జిల్లా ఎడిషన్ కూడా కాదు. ‘ఈనాడు’ మెయిన్ ఎడిషన్. ఇది కూడా ఊహాగానమే. ప్రభాకరే  శవాన్ని నదిలో పడేశాడనడానికి ఏ సాక్ష్యాధారమూ లేదు. 

          ఇలా ఇన్ని పొసగని విషయాలతో ఈ హత్యా దర్యాప్తు కథ వుంది. నాన్ లీనియర్ గా ముక్కలు చేసి చూపించడంతో లొసుగులు తెలియడం లేదు. ఇక నాన్ లీనియర్ కథా కమామిషు చూద్దాం...

సికిందర్

17, జూన్ 2019, సోమవారం

842 : స్క్రీన్ ప్లే సంగతులు - 2


లీనియర్ కథ
            ప్రభాకర్ (విజయ్ ఆంటోనీ) ఒక ఐపీఎస్ ఆఫీసర్. మానస (ఆషిమా నర్వాల్) ని చూసి ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుంటాడు. వూళ్ళో కాంట్రాక్ట్ కిల్లర్ అలీని, అతడి గ్యాంగ్ నీ పట్టుకునే ప్రయత్నాల్లో వుంటాడు. ఘర్షణలో కొంత మంది గ్యాంగ్ మెంబర్స్ చచ్చిపోతారు. అలీ దొరుకుతాడు. అతను పగబట్టి తప్పించుకుని ప్రభాకర్ భార్య మానసని హత్య చేస్తాడు. అతణ్ణి  పట్టుకోవడానికి ప్రభాకర్ విజృంభిస్తాడు. ఇక చంపడమే లక్ష్యంగా పెట్టుకుని జాబ్ కి రిజైన్ చేసి, వెతుక్కుంటూ వైజాగ్ వచ్చి మకాం పెడతాడు. 

          ఎదుటి ఫ్లాట్ లో అచ్చం మానస లాగే వున్న జయంతి (ఆషిమా నర్వాల్), తల్లి (సీత) తో వచ్చి దిగడంతో స్టన్ అవుతాడు. ఆమె తల్లి కోరిక మేరకు లగేజి సాయం పడుతూ క్లోజ్ గా ఆమెని చూస్తాడు. అప్పట్నుంచీ ప్రతీరోజూ ఆమె ఆఫీసు కెళ్ళాడానికి ఫ్లాట్ డోర్ తీసుకుని బయటికి రాగానే, తనూ డోర్ తీసుకుని కాకతాళీయంగా వచ్చినట్టు ఆమెని కింద ఆఫీసు కారుదాకా అనుసరించి, పక్క కెళ్ళి పోవడం మొదలెడతాడు.

          ఇది గమనించిన జయంతి కోలీగ్ అతడి గురించి హెచ్చరిస్తుంది. అతనలాటి వాడు కాదని మందలిస్తుంది జయంతి. ప్రభాకర్ ఒక కన్ స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూంటాడు. కానీ సరిగ్గా వెళ్ళడు. అతణ్ణి చూస్తేనే భయమేస్తుందని వాపోతుంది రిసెప్షనిస్టు. ఇంకా అలీ అన్వేషణలో వున్న ప్రభాకర్ ని ఒక ఇన్ఫార్మర్ కలిసి లొకేషన్ షేర్ చేస్తానంటాడు. ఆ లొకేషన్ లో అలీ వుంటాడు. అలీ అనుచరుడు అలీకి సమాచారమిస్తాడు. ప్రభాకర్ కోటిని చంపేశాడనీ, బాబ్జీ కోమాలో కెళ్ళిపోయాడనీ అంటాడు. ఇక్కడికి ప్రభాకర్ వచ్చేటప్పటికి అలీ తప్పించుకుంటాడు. 

        మర్నాడుదయం జయంతితో అదే ఫాలోయింగ్ రిపీట్ చేస్తాడు ప్రభాకర్. ఆమె కారెక్కి వెళ్తూ ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఆపమంటుంది. దిగి లోపలికి వెళ్తుంది. కావాల్సిన వస్తువు చెక్ చేస్తూంటే ఒకడు గమనించడం కంటబడుతుంది. అతణ్ణి చూసి ఆమె పారిపోతూంటే వెంటాడతాడు. ఆమె తప్పించుకుని ఫ్లాట్ కొచ్చేసి తల్లికి చెప్తుంది వంశీ వైజాగ్ వచ్చేశాడని. ఇద్దరికీ భయాందోళనలు మొదలవుతాయి. ఇంతలో డోర్ బెల్ మోగుతుంది. భయపడుతూ ‘ఎవరూ?’ అంటే, ‘మీటర్ రీడింగ్’ అని వాయిస్ వస్తుంది. జయంతి తల్లి డోర్ తీయగానే జొరబడిపోతాడు వంశీ.

          అతడితో పెనుగులాడి పెనుగులాడి, కేబుల్ మెడకి చుట్టి లాగి చంపేస్తారు తల్లీ కూతుళ్ళు. ఈ శబ్దాలు విని ప్రభాకర్ వస్తాడు. పరిస్థితి చూసి హెల్ప్ చేస్తానంటాడు. వాళ్ళు నేను చంపానంటే నేను చంపానని నేరం మీదేసుకుని లొంగి పోతామంటారు. మీలో ఎవరు నేరంమీదేసుకున్నా మరొకర్ని పోలీసులు వదలరని అంటాడు. ఐతే ఇద్దరం లొంగిపోతామంటారు. లొంగిపోతే లొంగి పోవచ్చు గానీ, కేసులోంచి తప్పించుకోవాలంటే మాత్రం బాడీని మాయం చేయాలంటాడు. ఇతనెవరో చెప్పమంటాడు. ఇతను  మంత్రి తమ్ముడు, రెండేళ్ళ నుంచి జయంతి తనని పెళ్లి చేసుకోవాలని వేధి స్తూంటే తప్పించుకుని వైజాగ్ వచ్చేశారు. ఇది కనుక్కుని వచ్చేసి దాడి చేశాడు. ఇ
ది ఫిబ్రవరి 4 పగలు జరిగిన సంఘటన. 

        ఫిబ్రవరి 6  రాత్రి 8 - 9 గంటల మధ్య, బీచ్ రోడ్డు మైదానంలో ప్రభాకర్ తన భార్యని చంపిన అలీని చంపేసి పెట్రోలు పోసి నిప్పంటిస్తాడు. తెల్లారి సమాచారమందుకుని డీసీపీ కార్తికేయ (అర్జున్) వచ్చి, మొహం పూర్తిగా కాలిపోయిన శవాన్ని చూస్తాడు. వేలి ముద్రలు చెడకుండా చేతులు బాగానే వుంటాయి. ఇతనెవరో గుర్తు పట్టడానికి ఒకే ఒక్క ఆధారంగా ప్యాంటుకి టైలర్ లేబుల్ వుంటుంది. ఒక సాక్షి వచ్చి, రాత్రి తొమ్మిది గంటలప్పుడు ఇక్కడ మంట చూశానంటాడు.  

          అటు ప్రభాకర్ జయంతికి కాల్ చేసి, ప్రాబ్లమేం లేదుగా అనడుగుతాడు. పోలీసులు వస్తే తామిద్దరికీ కాంటాక్ట్ వున్న విషయం చెప్పవద్దంటాడు. కార్తికేయ పోస్ట్ మార్టం రిపోర్టు తెలుసుకుంటాడు. మరణం రాత్రి 8
- 9 గంటల మధ్య జరిగి వుండాలి. వూపిరి తిత్తుల్లోకి పొగ చేరలేదు కాబట్టి, చనిపోయిన తర్వాత అగ్నికి ఆహుతై వుండాలి. తాడు లేదా కేబుల్ నుపయోగించి ఊపిరి  తీసి వుండాలి. ఇంతలో లాడ్జిలో ఒక గెస్ట్ మిస్సయ్యాడని సమాచారం వస్తుంది. 

          ప్రభాకర్ కారు నడుపుకుంటూ పోతూంటాడు. పక్క సీట్లోకి చూస్తాడు. ఖాళీగా వుంటుంది. మళ్ళీ చూస్తాడు. మానస కన్పిస్తుంది. ఎక్కడికి తీసి కెళ్తున్నావని అడు గుతుంది. వెళ్ళాక నీకే  తెలుస్తుందని అంటాడు. ఇప్పుడే చెప్పమంటుంది. మళ్ళీ చూస్తే  ఆమె వుండదు. కారు నది దగ్గరాపుతాడు. కారులోంచి ప్యాక్ చేసిన వంశీ శవాన్ని తీసి నదిలో పడేస్తాడు. 

         
లాడ్జిలో ఒక గెస్ట్ మిస్సయ్యాడని వచ్చిన సమాచారంతో ఫోరెన్సిక్ టీముతో వెళ్తాడు కార్తికేయ. అక్కడ వేలి ముద్రలు కాలిన శవం వేలి ముద్రలతో సరిపోతాయి. ఆ లాడ్జిలో దిగింది వంశీ అనీ, అతనే హత్యకి గురయ్యాడనీ అభిప్రాయాని కొస్తాడు కార్తికేయ. 

          వంశీ గురించి తెలుసుకుంటే అతను మంత్రి కొడుకు. జయంతిని పెళ్లి చేసుకొమ్మని వేధిస్తున్నాడు
.  ఈ సమాచారంతో జయంతినీ, ఆమె తల్లినీ అనుమానించి ప్రశ్నిస్తాడు కార్తికేయ. అప్పుడు వాళ్ళ డోర్ చైనూ, లోపల గ్రానైట్ దిమ్మే డ్యామేజి అయి వుండడాన్ని ఓరకంట గమనిస్తాడు. వంశీ ఎవరో తెలియదంటారు వాళ్ళు. ఫిబ్రవరి 6 తేదీ రాత్రి ఎక్కడున్నారని అడుగుతాడు. ఆఫీసు నుంచి లేటుగా వచ్చానని అంటుంది జయంతి.

          కార్తికేయ వెళ్ళిపోతూ, ఎదుటి ఫ్లాట్ దగ్గరికి తిరిగొస్తాడు. ఫ్లాట్ లో వున్న ప్రభాకర్ ని చూసి, ఆ తల్లీ కూతుళ్ళ గురించి ఆరా తీస్తాడు.  జయంతి గురించి తెలియదంటాడు ప్రభాకర్. వాళ్ళు అనుమానాస్పదంగా ఏమీ లేరంటాడు. తర్వాత ప్రభాకర్ జయంతికి కాల్ చేసి, పోలీసులకి ఏం చెప్పారని అడుగుతాడు. మీరేం చెప్పమన్నారో అదే చెప్పామని అంటుంది.

          ప్రభాకర్ కి మానస మెదులుతుంది. ఎందుకు ఎక్కువ ఆలోచిస్తావ్ అనడుగుతుంది. ఆమెతో రోమాన్స్ చేసిన దృశ్యం మెదులుతుంది. కార్తికేయ వెళ్లి జయంతి కొలీగ్ ని విచారిస్తాడు. ఆమె జయంతికి బాయ్ ఫ్రెండ్ లేడని చెప్తుంది. వంశీ గురించి కూడా చెప్పలేదంటుంది.  ఫిబ్రవరి 6 రాత్రి 8 -9 గంటల మధ్య ఆమె ఎక్కడుందని అడుగుతాడు. ఆ తర్వాత వెళ్లి పై అధికారి (నాజర్) ని కలుస్తాడు.  హెల్ప్ లేకుండా ఇద్దరు లేడీస్ చంపి శవాన్ని తెచ్చి బీచ్ రోడ్డులో పడెయ్యడమా... ఎవరో హెల్ప్ చేసి వుండాలనీ, అతను లవరై వుండొచ్చనీ అంటాడు పై అధికారి.

        కార్తికేయ ఇంకో జయంతి కొలీగ్ ని విచారిస్తాడు. జయంతి ఎదుటి ఫ్లాట్ లో వున్న ప్రభాకర్ ప్రవర్తన గురించి చెప్తుంది కొలీగ్. మార్నింగ్ ప్రభాకర్ ఫ్లాట్ దగ్గర నిఘా వేస్తాడు కార్తికేయ. ముందు జయంతి బయటికి వచ్చి కారెక్కి వెళ్ళిపోతుంది. ఆమె వెనకాలే వచ్చిన ప్రభాకర్ జాగింగ్ చేస్తూ వెళ్లి పోతూంటాడు. వాళ్ళిద్దరికీ ఏ సంబంధమూ లేదని నిర్థారించుకుంటాడు కార్తికేయ. 

           ఒక కానిస్టేబుల్ వచ్చి ప్రభాకర్ ఎవరో తెలిసిందని వెబ్ సైట్లో చూపిస్తాడు. ప్రభాకర్  ని ఐపీఎస్ అధికారిగా  పేర్కొంటూ వున్న ఆ న్యూస్ చూసి స్టన్ అవుతాడు కార్తికేయ...అలీ గ్యాంగ్ ని పట్టుకున్న ఐపీఎస్ అధికారి ప్రభాకర్...
          ఐపీఎస్ ప్రభాకర్ అలీ గ్యాంగ్ ని వెంటాడుతున్న దృశ్యంతో ఇంటర్వెల్.
***
          కార్తికేయ పై అధికారికి కాల్ చేసి ప్రభాకర్ గురించి అడుగుతాడు. ప్రభాకర్ మాజీ ఐపీఎస్ అధికారి అనీ, అతడి గురించిన సమాచారం అతడి దగ్గర  పని చేసిన కోలా వెంకట్ అనే ఎస్సై కి తెలుసనీ అంటాడు పై అధికారి. కార్తికేయ కోలా వెంకట్ ని కలుసుకుంటాడు. ప్రభాకర్ చాలా మంచి ఆఫీసర్ అనీ, ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నామనీ, ఆయన రెండేళ్ళ క్రితం రిజైన్ చేశారనీ అంటాడు కోలా వెంకట్. 

          ప్రభాకర్ ఐపీఎస్ మీద  దృశ్యాలు వస్తాయి. అలీ గ్యాంగ్ ని వెంటాడడం, అలీని పట్టుకుంటే అతను పగతో అరవడం వగైరా. ఈ వార్త న్యూస్ పేపర్లో ప్రముఖంగా వస్తుంది. 

          ఇక కార్తికేయ తిరిగి వచ్చి ప్రభాకర్ ని కలుస్తాడు. ఆ తల్లీ కూతుళ్ళని అనుమానిస్తున్నామనీ, ఇన్ఫర్మేషన్ కావాలనీ అంటాడు.  వాళ్ళనే పట్టుకుని అడగ మంటాడు ప్రభాకర్. కార్తికేయ పై అధికారి నాజర్ ని కలుస్తాడు. ప్రభాకర్ కి జయంతితో కాంటాక్ట్ వుండి వంశీ హత్య విషయంలో ఆమెకి హెల్ప్ చేసివుంటే, కాంటాక్ట్ లేనట్టే  రోజూ ఉదయం ఆమెని ఎందుకు ఫాలో అవుతున్నాడని అంటాడు నాజర్. 

       ప్రభాకర్ వర్రీ అవుతాడు. వెళ్లి లొంగి పోతాడు. వంశీని తనే హత్య చేశానంటాడు. అపార్ట్ మెంట్ లో వంశీ తన కెదురై జయంతి గురించి అడుగుతూంటే, వాళ్ళు బీచ్ రోడ్డుకి మారిపోయారని దారి మళ్ళించాననీ, రాత్రి బీచ్ రోడ్డులో వున్నఅతణ్ణి  చంపేశాననీ అంటాడు. 

          కార్తికేయ జయంతిని ప్రశ్నిస్తాడు. ప్రభాకర్ గురించి తనకేమీ తెలీదని అంటుంది. ప్రభాకర్ ని సైకియాట్రిస్టు విచారిస్తాడు. జయంతిని ప్రేమిస్తున్నానంటాడు ప్రభాకర్. మానసని కార్లో తీసుకుపోతున్న అదే దృశ్యాన్ని మళ్ళీ వూహించుకుంటాడు. ఒక చోటికి చేరుకున్నాక  పెళ్లిని ప్రతిపాదిస్తాడు. నువ్వు జయంతిని ప్రేమించలేదు, వూహించుకుని చెప్తున్నావని అంటాడు సైకియాట్రిస్టు. ఇతడి మాటలు నిరాధారాలని కార్తికేయకి  చెప్పేస్తాడు.  కేస్ క్లోజ్ అని కార్తికేయకి నాజర్ చెప్పేస్తాడు.

          కార్తికేయ ఒప్పుకోడు. తను జయంతి ఫ్లాట్ కెళ్ళినప్పుడు డోర్ చైన్, గ్రానైట్ దిమ్మె డ్యామేజీ అయివుండడాన్ని గుర్తు చేసుకుని, హత్యా దృశ్యాన్ని అల్లుతాడు. వంశీ వచ్చి మీటర్ రీడింగ్ అంటూ డోర్ బెల్ నొక్కిందగ్గర్నుంచీ, తల్లి కూతుళ్ళు అతణ్ణి చంపిన విధానం, ఆ తర్వాత ప్రభాకర్ వచ్చి హెల్ప్  చేస్తాననడం వరకూ దృశ్యాన్ని అల్లి చెప్తాడు. 

          హత్య రాత్రి 8 - 9 మధ్య జరిగినట్టు పీఎం రిపోర్టు వుందనీ, ఆ సమయంలో తల్లీ కూతుళ్ళ ఎలిబీలు చెక్ చేశాననీ, వాళ్ళు ఇంటి దగ్గరే వున్నారనీ, 8.30 కి వాటర్ బాయ్ వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళినప్పుడు చూశాడనీ, ఆ తర్వాత వాళ్ళు చంపి శవాన్ని తీసి కెళ్ళి బీచ్ రోడ్డులో పడేసి తగులబెట్టారనుకున్నా, 9 గంటలకి బీచ్ రోడ్డులో మంటని చూసినట్టు సాక్షి చెప్పినప్పుడు - అంత స్వల్ప వ్యవధిలో తల్లీ కూతుళ్ళు శవాన్ని తీసుకుని బీచ్ రోడ్డుకి చేరుకోవడం అసాధ్యమనీ, కనుక వాళ్ళని అనుమానించ లేమనీ వివరిస్తాడు నాజర్. 

       కార్తికేయ జిల్లా వార్తల్లో ఒక కేసు చూస్తాడు – 4 వ తేదీ నదిలో కొట్టుకు వచ్చిన మంత్రి తమ్ముడు వంశీ శవం గురించి. వెంటనే ఎలర్ట్ అవుతాడు. ఇప్పుడు కేసు అర్ధమైనట్టు ప్రభాకర్ తో చెప్తాడు. వంశీ హత్య 6 వ తేదీ కాదు, 4 వ తేదీన జరిగిందనీ. ఆ శవాన్ని ప్రభాకర్ నదిలో పడేశాడనీ, అది పక్క జిల్లాకి కొట్టుకు పోయి దొరికితే అది జిల్లా వార్త అవుతుంది తప్పితే ప్రముఖ వార్త అవదని అనుకున్నాడనీ, అసలు వంశీని తను చంపలేదనీ, చంపిన తల్లీ కూతుళ్ళని కాపాడడానికి శవాన్ని మాయం చేశాడనీ, ఆతర్వాత 6 వ తేదీ రాత్రి బీచ్ రోడ్డులో  అలీని హత్య చేసి ఆ శవాన్ని వంశీగా నమ్మించే ప్రయత్నం చేశాడనీ చెప్పుకొస్తాడు. 

          ప్రభాకర్ జయంతిని  కలిసి సరెండర్ అవుతున్నట్టు చెప్తాడు. చెయ్యని హత్యకి మీరెందుకు సరెండర్ అవాలని అంటుందామె. అప్పుడు మానస గురించి చెప్తాడు. మానస లాగే వున్న నిన్ను చూసి హెల్ప్ చేశాను, సరెండర్ అవుతున్నది వంశీ హత్యలో కాదు, మానసని చంపిన అలీని చంపిన కేసులో... కాబట్టి మీరు సేఫ్ అంటదు.  ఆమె ఏడుస్తుంది.      

         లొంగిపోయిన ప్రభాకర్ కార్తికేయతో చెప్తాడు  - జయంతి భయపడితే తట్టుకోలేననీ, ఆమె భయం పోగొట్టడానికి ఎన్ని హత్యలైనా చేస్తాననీ అంటాడు. చేయని హత్య గురించి పిచ్చిగా మాట్లాడుతున్నాడనీ, తన భార్యని చంపిన అలీని చంపినా, ఆ తల్లీ కూతుళ్ళ పట్ల మానవత్వంతో ప్రవర్తించి నేరం తన మీదేసుకున్నాడనీ, ఇలాటి ఐపీఎస్ ని మనం కాపాడుకోవాలనీ, కేసు క్లోజ్ చేస్తాడు నాజర్.
(విశ్లేషణ రేపు) 

 
సికిందర్  
telugurajyam.com