రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, జనవరి 2019, ఆదివారం

726 :స్క్రీన్ ప్లే సంగతులు


          ‘మహానటి’ విజయం సాధించడానికీ, మంచి రేటింగ్స్ ఇచ్చినా ‘ఎన్టీఆర్’ బయోపిక్ సక్సెస్ కాకపోవడానికీ కారణాలేమిటని ఒక దర్శకుడి సందేహం. ‘ఎన్టీఆర్’ బయోపిక్ నే ఎలా చేసివుంటే బావుండేదో చెప్పమన్నారు. బాలకృష్ణకి, క్రిష్ కి చెప్పేంత  మనదగ్గరే ముంది, వాళ్లకన్నీ తెలుసు. అయినా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ రివ్యూలో బయోపిక్ అంటే ఏమిటో కొంత అప్పటికే చెప్పుకున్నాం. అలాగే ‘ఎన్టీఆర్’ బయోపిక్ గురించి రెండు ముక్కలు చెప్పుకున్నాం. బయోపిక్ అంటే మరేమిటో కాదు, అది కూడా ఓ పక్కా సినిమా కథే! సినిమా కథే!! సినిమా కథే!!! తేదీల వారీ ఆ వ్యక్తి  డైరీ కాదు!!!!  

         
సినిమా కథంటే మరేమిటో కాదు- పాత్ర (బిగినింగ్) - ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య (మిడిల్)  -  ఆ పాత్ర కనుక్కునే పరిష్కారం (ఎండ్). ఇది ఒకటో తరగతి పాఠం. ఎంతటి వాళ్ళయినా ఈ బ్రాకెట్ లోకొచ్చి సినిమా కథ చేసుకోవాల్సిందే. కానీ ఒకటో తరగతి కూడా తెలియని వాళ్ళు స్క్రిప్టులు చేస్తూంటేనే సినిమా కథలు రావడం లేదు. నర్సరీ స్కూలు కతలే వస్తున్నాయి. మళ్ళీ పాత్ర (బిగినింగ్) - ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య (మిడిల్)  - ఆ  పాత్ర కనుక్కునే పరిష్కారం (ఎండ్) అని పొల్లుపోకుండా అనుకోకుండా – చివర ‘పాత్ర కనుక్కునే పరిష్కారం’ లోంచి పాత్రని తీసేసి ఒట్టి పరిష్కారమే తీసుకుని – “పాత్ర, ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య, పరిష్కారం”  – అనుకుని తప్పులో కాలేస్తే కూడా సినిమా కథవదు. ఆర్ట్ సినిమా పాసివ్  వ్యవహారమవుతుంది. పరిష్కారం పాత్ర కనుక్కోకపోతే – రచయిత  కనుక్కుంటాడన్న మాట. అంటే పాత్ర చేయాల్సిన పని రచయిత చేస్తాడన్న మాట. అంటే పాత్ర సమస్యలో పడ్డ దగ్గర్నుంచీ (మిడిల్ నుంచీ) రచయితే జోక్యం చేసుకుని పాత్రని నడిపిస్తాడన్న మాట. అంటే పాసివ్ పాత్ర తయారు చేస్తాడన్న మాట. అంటే సినిమాని అట్టర్ ఫ్లాప్ చేస్తాడన్న మాట. అంటే ఎందుకు ఫ్లాపయ్యిందో తెలుసుకోకుండా ఇంకో పది ఇలాగే అట్టర్ ఫ్లాపులు చేస్తాడన్న మాట. ఇదింకో రకం నర్సరీ స్కూలు తనమన్న మాట. కాబట్టి ఖచ్చితంగా ‘పాత్ర కనుక్కునే పరిష్కారం’ అని క్రియాత్మకంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇక్కడ రచయిత అనడం కూడా సరి కాదు. ఇప్పుడు-  అంటే గత రెండు దశాబ్దాలుగా రచయిత లెక్కడున్నారు. దర్శకులే రచయితలు. వాళ్ళదే చెల్లుబాటు, వాళ్ళవే ఫ్లాపులు. కాబట్టి ఇలాటి కతల వ్యవహారం రచయితల కాపాదించ కూడదు. 

          కనుక సినిమా కథంటే పైన చెప్పుకున్న బ్రాకెట్లో పొల్లుపోకుండా వుండేదే. ఇలా లేనివి ఏవీ సినిమా కథలు కావు, సినిమాలన్పించుకోవు. కథతో వుంటేనే సినిమా. కాకుండా కథ వుండని గాథ సినిమా అవదు, కథ వుండని ఉపోద్ఘాతం సినిమా అవదు, కథ వుండని ఫ్లాష్ బ్యాక్ సినిమా అవదు, కథ వుండని డాక్యుమెంటరీ సినిమా అవదు, కథ వుండని ఎపిసోడ్లు సినిమా అవదు, కథ వుండని ఆంథాలజీ (కథల సంపుటి) సినిమా అవదు, కథ వుండని ఆర్ట్ సినిమా సినిమా అవదు, కథ వుండని వరల్డ్ మూవీ సినిమా అవదు, కథ వుండని ఇండీ ఫిలిం సినిమా అవదు, కథ వుండని క్రౌడ్ ఫండింగ్ కళాత్మకం సినిమా అవదు, కథ వుండని న్యూస్ బులెటిన్ సినిమా అవదు, కథ వుండని డైరీ సినిమా అవదు, కథ వుండని బయోపిక్  సినిమా అవదు. కెమెరాతో తీసిందల్లా సినిమా అవదు. 

          సినిమా కథంటే డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు వచ్చేది. గాథకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు. ఉపోద్ఘాతానికి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఫ్లాష్ బ్యాక్ కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, డాక్యుమెంటరీకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఎపిసోడ్లకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఆంథాలజీ (కథల సంపుటి) కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఆర్టు సినిమాకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, వరల్డ్ మూవీకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఇండీ ఫిలిం కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, క్రౌడ్ ఫండింగ్ కళాత్మకానికి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, న్యూస్ బులెటిన్ కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, డైరీకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, డబ్బులు పెట్టి తీయకపోయినా వీటికి డబ్బులు రానేరావు! 

        ఇక రెండు భాగాల బయోపిక్ కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు వస్తాయో రావో ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం కూడా విడుదలయ్యాక తెలుస్తుంది. ఎందుకంటే ఇలా  బయోపిక్ ని రెండు భాగాలుగా తీసింది ఎక్కడా లేదు. 

          ఒక పని చేయొచ్చు :  సినిమా కథంటే ఏమిటో ఒకటోతరగతి ప్రాథమిక అవగాహన పక్కాగా వుండి - మనం సినిమా కథ తీయట్లేదు, కాబట్టి సినిమా తీయట్లేదు, కనుక డబ్బులు రాకపోయినా ఫర్వాలేదు, మన టేస్టు ప్రకారం మనం తీసుకుందామనుకుని-  పైన చెప్పిన ఉపోద్ఘాతాల దగ్గర్నుంచీ, కథ లేని బయోపిక్ ల వరకూ ఎన్నైనా తీసుకోవచ్చు. చేస్తున్న పనేదో ఒక అవగాహనతో, మార్కింగ్ చేసుకుని చేస్తే ఏ బాధా వుండదు. తీస్తున్నది సినిమా కాదనీ, డబ్బులు రావనీ తెలిసే చేస్తారు కాబట్టి. అంతే గానీ సినిమా కథంటే ఏమిటో కామన్ సెన్సు లేకుండా ఏది పడితే అది తీసేసి, అదే సినిమా అనుకుంటేనే, బాధపడుతూ కూర్చోవాల్సి వస్తుంది. తప్పు ఎక్కడ  చేశామో కూడా అర్ధం జేసుకోలేక బాధపడ్డం. ప్రదర్శించేది సినిమా అయితేనే ధియేటర్లు నడుస్తాయి. పక్కన పాన్ షాపు వాడు బతుకుతాడు. 

          సినిమా అంటే – ఆబాల గోపాలమని పాత తరం జర్నలిస్టులు ప్రేమతో రాసేవాళ్ళు కదా – అలా ఆశేష ప్రజానీకాన్ని అలరించే అతి పెద్ద సామూహిక మాస్ మీడియా, వినోద సాధనం. దీనికి కథే పునాది. తొలినాటి సినిమాలన్నీ కథలతో కూడిన వినోద సాధనాలే. సినిమా ఇలాగే సహజ పుట్టుక పుట్టింది. వెండితెర వినోదం కోసమే ప్రాణం పోసుకుంది. పూర్వీకులు కష్టపడి ఇలా డెవలప్ చేసిన సినిమా అనే పదాన్నీ, మాధ్యమాన్నీ, వినోద సాధనాన్నీ, వెండితెరనీ, మధ్యలో ఎక్కడ్నించో  కొందరు సినిమాయేతరులు  కాలుమోపి – పూర్వీకులు వినోదం కోసం కనిపెట్టిన సినిమా అనే కళని హైజాక్ చేసి, పైన చెప్పుకున్న అన్నిరకాల విన్యాసాలతో అష్టవంకర్లూ తిప్పుతూ వెండితెరతో ఆడుకుంటున్నారు. ఈ వర్గం వ్యాపారం కోసం వుండదు. ఈ వర్గానికి చెందిన వ్యాపారేతరులకి హాలీవుడ్ లో స్థానం లేదు కాబట్టి బతికిపోతోంది. ప్రేక్షక బాహుళ్యానికి సినిమా అనే వినోద సాధనం దక్కుతోంది.  లేకపోతే  హాలీవుడ్ నుంచి కూడా ఆర్ట్ మూవీస్, వరల్డ్ మూవీస్ లాంటివి దిగి కొంపలు ముంచేవి. హాలీవుడ్ నిర్మాతల్ని కథలని చెప్పి కథలుకాని వాటితో ఏమార్చడం కుదరదు. ‘వాటీజ్ కాన్ ఫ్లిక్ట్’ అని ముందే అడుగుతాడు ఏ నిర్మాతైనా. వాళ్ళ కుండేంత స్ట్రక్చర్ స్పృహ ప్రపంచంలో ఇంకే నిర్మాతలకీ వుండదు. అందుకే కథల్ని సినిమాలుగా మల్చి  ప్రపంచాన్ని ఏలుకోగల్గుతోంది హాలీవుడ్. 

          కథంటే స్ట్రక్చర్. నిబిడీకృతమై వున్న స్ట్రక్చరే కథ. కథంటేనే స్ట్రక్చర్, స్ట్రక్చర్ అంటేనే కథ. పైన చెప్పుకున్న దేనికీ స్ట్రక్చర్ వుండదు. ఎందుకు స్ట్రక్చరనే కథలే కావాలంటే, మాటలు నేర్చినప్పట్నుంచీ  మానవుల మెదడు కథల్ని రిసీవ్ చేసుకోవడానికి అలా వైరింగ్ అయివుంది కాబట్టి. సినిమాల్ని ఎన్ని అష్టవంకర్లు తిప్పినా ఈ మెదడులోని వైరింగ్ ని - సాఫ్ట్ వేర్ ని - మార్చి ప్రేక్షకుల్ని మెప్పించలేరు. ప్రకృతి ప్రకృతే, వికృతి అవదు. ఇది కూడా ఒకటో తరగతి పాఠమే! దీన్ని అర్ధం జేసుకుంటే వెండితెరకి  సినిమా కథలు తప్ప మరోటి రాయడానికి మనస్కరించదు. సినిమాల్ని ఆడించే ప్రేక్షకులు వెండితెర కేసి కథ కోసమే చూస్తారు.
***
బయోపిక్ కి ఇన్నోవేషన్ 
         మహానటి’ విజయం సాధించడానికి అది కథవడమే కారణం. అదీగాక ఆవిడ రాజకీయ వ్యక్తి కాదు. ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళని గాక అన్ని పార్టీల వాళ్ళూ నోర్మూసుకుని బుద్ధిగా చూశారు. హీరోల అభిమాన సంఘాలు కూడా ట్రోలింగ్ చేయలేని నిరుద్యోగులై సినిమా కెళ్ళారు. ‘మనం’ తర్వాత అంత హిట్టయిన సాత్విక, సాంఘిక మూవీ ‘మహానటి’. ఇది కథయినందుకే సుమా. ఈ బయోపిక్ ని తెలివిగా కథగానే చేశాడు దర్శకుడు. దీనికి ప్రసిద్ధి చెందిన ‘సిటిజన్ కేన్’ (1941) మిస్టరీ డ్రామా కథనాన్ని వాడుకున్నాడని తెలిసిందే. ఎలా వాడుకున్నాడన్నది తెలుసుకోవాలి. ఇద్దరు జర్నలిస్టులు పొరలుపొరలుగా సావిత్రి జీవితాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం. ‘సిటిజన్ కేన్’ లో రిపోర్టర్ ఇన్వెస్టిగేట్ చేసినట్టు. ‘సిటిజన్ కేన్’ లో మిస్టర్ కేన్ మరణిస్తూ ‘రోజ్ బడ్’ అని పలుకుతాడు. ఈ ‘రోజ్ బడ్’ ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలోనే మిస్టర్ కేన్ జీవితం గురించి తెలుసుకుంటాడు. ‘మహానటి’ లో సావిత్రి కోమాలో కెళ్ళే ముందు రాసిన ఉత్తరంలో ‘శంకరయ్య’ దగ్గరికి తనని తీసికెళ్లమని కోరుతుంది. రోజ్ బడ్ మిస్టరీ చివర్లో వీడినట్టే, శంకరయ్య మిస్టరీ ముగింపులో తేలుతుంది. రోజ్ బడ్, శంకరయ్య అనే ప్లాట్ డివైసులు కథని నడిపేందుకు పనికొచ్చాయి. మరి వీటిలో ఏది కథ? వ్యక్తులదా, జర్నలిస్టులదా? జర్నలిస్టులదే. ప్లాట్ డివైసు లేమిటో తెలుసుకునే సమస్య జర్నలిస్టులకే వుంది – సావిత్రికి గానీ, మిస్టర్ కేన్ కి గానీ లేదు. వాళ్ళిద్దరూ పజిల్ విసిరి కూర్చుకున్నారు. ఆ పజిల్ ని విప్పడానికే  జర్నలిస్టుల సంఘర్షణ. 

          సావిత్రి జీవితంలో గానీ, మిస్టర్ కేన్ జీవితంలో గానీ, ఒక పాత్ర (సావిత్రి లేదా మిస్టర్ కేన్) -  ఆ పాత్రకి ఎదురైన సమస్య – ఆ పాత్ర కనుక్కున్న పరిష్కారం – అనే కథా చట్రం లేదు. అందుకని ఈ కథా చట్రాన్ని వేరే పాత్రలతో కల్పించారు – జర్నలిస్టుల పాత్రలతో. కాబట్టి ఇవి జర్నలిస్టుల కథలయ్యాయి. ఈ జర్నలిస్టులు తవ్వుతున్న జీవితాలు ఫ్లాష్ బ్యాకులు. ఫ్లాష్ బ్యాకులెప్పుడూ కూడా కథలు కావని తెలిసిందే. అవి నడుస్తున్న కథకి కావలసిన సమాచారాన్నందించే వనరులు మాత్రమే. కాబట్టి వీటికి కథా లక్షణాలుండనవసరం లేదు, వుండవు కూడా. పాత్ర - పాత్రకి ఎదురైన సమస్య – ఆ పాత్ర కనుక్కున్న పరిష్కారం – అనే కథా చట్రం వుండక, డైరీ మాత్రంగా వున్నా సరిపోతుంది ఫ్లాష్ బ్యాక్కి.          

          కాబట్టి జర్నలిస్టుల కథ అనే ఒడ్డున, జర్నలిస్టులతో బాటే కూర్చుని, జర్నలిస్టులు చెరువులో పడుతున్న ఫ్లాష్ బ్యాకులనే చేపల్ని, చేతిలో వున్న పాప్ కార్న్ ని పక్కన పడేసి  చూశారు ప్రేక్షకులు. చేపలు కనువిందు చేస్తాయి. అవి అక్వేరియంలో వుంటే దేన్నీ దాయలేవు. ఉన్నదున్నట్టు అన్ని కోణాల్లో కనబడిపోతాయి. ‘గోల్డ్ ఫిష్ హేవ్ నో హైడింగ్ ప్లేస్’ అని జేమ్స్ హేడ్లీ ఛేజ్  రాసిన ఫేమస్ నవల్లో లాగా. కాకపోతే ఈ నవల్లో జర్నలిస్టే అక్వేరియంలో గోల్డ్ ఫిష్ లా వుంటూ - అవినీతి పరుల మీద రాస్తూంటాడు పాపం. ఈ బయోపిక్స్ లో జర్నలిస్టులు తాము ఒడ్డున వుండి -  సావిత్రి, మిస్టర్ కేన్ లనే గోల్డ్ ఫిష్షుల్ని చూపిస్తున్నారు. 

          ఒక సినిమాలో రెండు కథలు ఇమడవు. కథ ఎప్పుడూ లైవ్  పాత్రలతో ఆపరేటివ్ గా చూపించేదే అవుతుంది. డ్రీమ్ పాత్రలతో చూపిస్తే ఫ్లాష్ బ్యాక్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ కథవదు గనుక, డ్రీమ్ టైమ్ అవుతుంది గనుక, దాన్ని డ్రీమ్ పాత్రలతో వాటి జీవితంగా చూపించాల్సి వుంటుంది. జర్నలిస్టుల పాత్రలు ఇప్పుడు రియల్ టైమ్ లో ఒక లక్ష్యం కోసం కథతో ఆపరేటివ్ గా వుంటున్న లైవ్ పాత్రలు. వీళ్ళతో మనం చూసేది లైవ్ టేకింగ్. కాబట్టి వీళ్ళదే కథయింది. సావిత్రీ,  మిస్టర్ కేన్ లు డ్రీమ్ పాత్రలు కాబట్టి, వాళ్ళవి డైరీ మాత్రపు ఫ్లాష్ బ్యాక్ జీవిత చిత్రణ లయ్యాయి. జర్నలిస్టుల పాత్రలు లేకపోతే, సావిత్రి జీవితాన్ని గానీ, మిస్టర్ కేన్ జీవితాన్ని గానీ కథలుగా చేయడం అస్సలు కుదరదు. కథలుగా చేయాలంటే వాళ్ళకి లక్ష్యం (గోల్) వుండాల్సిందే. సావిత్రి జీవితంలో గానీ, మిస్టర్ కేన్ జీవితంలో గానీ గోల్స్ ని పట్టుకోలేం. మహాత్మా గాంధీ జీవితంలో పట్టుకోవచ్చు. అందుకని కథగా చేయగల్గి ఆ బయోపిక్ హిట్టయింది. మన్మోహన్ సింగ్ జీవితంలో గోల్ వున్నా దాన్ని పట్టుకుని కథగా చేయలేదు, అది డాక్యుమెంటరీలా మిగిలింది. 

          నీతి : బయోపిక్స్ లో వ్యక్తుల జీవితాల్లో లక్ష్యంతో కూడిన కథల్లేక పోతే, వాటిని ఫ్లాష్ బ్యాకు డాక్యుమెంటేషన్ చేసి, వేరే ఇప్పటి లైవ్ పాత్రలతో, ఈ పాత్రల లక్ష్యంతో కూడిన కథ సృష్టించి – ఫాష్ బ్యాకుల్ని తవ్వే కార్యక్రమమే పెట్టుకోవాలి.  కథల్లేని బయోపిక్స్ కి ఈ ఫార్మాట్ తప్ప ఇంకో మార్గమే లేదు. ఇలాటి బయోపిక్స్ కి వచ్చే ప్రేక్షకుల కోసం, ఫ్లాష్ బ్యాక్స్ ని తవ్వే లైవ్ పాత్రలతో కథని సృష్టించి, ఈ రూపంలోనైనా కాంపెన్సేట్ చేయడం ధర్మం. ఈ కాంపెన్సేషన్ లేకుండా తీసివుంటే ‘మహానటి’ ని గానీ, దీని స్ఫూర్తి అయిన ‘సిటిజన్ కేన్’ ని గానీ వూహించలేం. ప్రేక్షకులకి సినిమా అనగానే బ్రెయిన్ కథకోసం రెడీ అయిపోతుంది. ఏదో ఒక రూపంలో కథ కన్పిస్తే - ఓకే బ్రదర్, అవర్ బ్రెయిన్ ఈజ్ యువర్ బ్రెయిన్ అంటుంది. ఇక్కడ జర్నలిస్టుల కథలతో ప్రేక్షకుల బ్రెయిన్ - ఓకే బ్రదర్, అవర్ బ్రెయిన్ ఈజ్ ట్రూలీ యువర్ బ్రెయిన్ – సూపర్ హిట్ గ్రాంటెడ్! – అంది. ఇద్దరి బ్రెయిన్స్ లో వైరింగ్స్ కలిశాయి. దర్శకులు వేరే మంకీ బిజినెస్ తో వైరింగ్ మార్చుకుని, ప్రేక్షకుల వైరింగ్ ని షార్ట్ సర్క్యూట్ చేసి బ్లాస్ట్ చేయలేదు. సినిమా కథంటే పరస్పరం వైరింగ్స్ కలవడమే. కానీ సినిమాలు  తీసేవాళ్ళకి ఎవరికో తప్ప, తమలో ప్రకృతి ఇచ్చిన వైరింగ్ వుందన్నవిషయమే తెలీదు! సినిమా బిజినెస్ క్రియేటివిటీతో ముడిపడి వుంది గనుక ఇది చాలా పెద్ద మిస్టరీ. ఈ బిజినెస్ లో తెలియని విషయాలు చాలా వుంటాయి. 

          ఇదంతా ప్రేక్షకులకి తెలియాల్సిన అవసరం లేదు. ఈ టెక్నికాలిటీస్ డైరెక్టర్లకి తెలిసి వుండాలి. తెలియకపోతే బయోపిక్కులు బాక్సాఫీసు బరిలోంచి జంప్ అవుతాయి. ఎక్కడో వున్న బయోపిక్ చెడిన ఆత్మ డైరెక్టర్ ని వెంటాడి వెంటాడి...డైరెక్టర్ బయోపిక్ రాయిస్తుంది.     ఇంతా చేసి ‘మహానటి’ స్క్రీన్ ప్లే స్ఫూర్తి ‘సిటిజన్ కేన్’ కూడా బయోపిక్కేనా అంటే కాదు. బయోపిక్ తీయాలంటే ఇతర బయోపిక్సే చూసి ఫాలో అవాలనేం లేదు, ఫిక్షన్ కథల్లోంచి కూడా కథనాల్ని తీసుకోవచ్చు. అది ఇన్నోవేషన్ (ఉన్నదానికే నూతన కల్పన) అవుతుంది. బయోపిక్స్ కి నూతన కల్పన ‘మహానటి’.
***
బయోపిక్స్ కి వార్నింగ్
      ‘ఎన్టీఆర్’ బయోపిక్ మొదటిభాగం మంచి రేటింగ్స్ ఇచ్చినా జనం చూడలేదంటే రేటింగ్స్ తప్పని కాదు. ఈ మొదటి భాగం ఆభిరుచిగల ప్రేక్షకులు చూడదగ్గ కంటెంట్ తో వుంది. దురదృష్టవశాత్తూ అభిరుచిగల ప్రేక్షకులు తక్కువ వుంటారు. సినిమాలని అదే పనిగా వూర మాస్ కమర్షియల్స్ గా తీస్తూ వస్తూ అభిరుచిగల ప్రేక్షకుల్ని తగ్గించుకున్నారు. దీని ఫలితం బయోపిక్ మొదటి భాగం అనుభవించింది. అభిరుచిగల ప్రేక్షకులు తక్కువున్నారు, సినిమా బడ్జెట్ ఎక్కువుంది. ఈతేడా కొట్టింది. సినిమాల్లో ఉత్తమ విలువలుంటే, కలెక్షన్ల దృష్టితో కాకుండా, మంచి రేటింగ్స్ ఇచ్చి ప్రోత్సహించాల్సిందే. ఇదే జరిగింది. కానీ దీనికి మించి రాజకీయాలు, ట్రోలింగ్ వెల్లువెత్తాయి. ఈ రచ్చ ఎక్కువైపోయింది. 

          నెట్ లో రేటింగ్స్ చూసే జనులెవరు? నెటిజన్లు. నెటిజన్లని మించిన సాధారణ ప్రేక్షక జన సమూహం మౌత్ టాక్ మీద ఆధారపడతారు. ఈ తరం సాధారణ జన సమూహాని కేం కావాలి? అవే మాస్ మసాలా, లవ్, కామెడీ, స్టెప్పుల డాన్సులు, ఫైట్లు. బయోపిక్ తో మౌత్ టాక్ ఇలా రాలేదు. దీంతో రూఢీ అయిందేమిటంటే అభిరుచిగల సినిమాలు తీస్తే జనాలు రారని. బయోపిక్ లో ఎన్టీఆర్ సినిమాల్లో చేస్తున్న రకరకాల ప్రయోగాల గురించి ఒక పాత్ర చేత చెప్పిస్తారు - ఆయనే ఒక ప్రయోగ శాల అని. బయోపిక్ విడుదలయ్యాక మార్కెట్ ని అర్ధం జేసుకునే ప్రయోగ శాలగా పనికొచ్సింది. ఇదే బయోపిక్ మొదటి భాగం ఓవర్సీస్ లో పెద్ద సక్సెస్ అయింది. అభిరుచుల్లో తేడా! ఇక్కడ అభిరుఛీఛీ ప్రేక్షకులు, అక్కడ అభిరుచిగల ప్రేక్షకులు అన్నట్టు తేలింది. 

           రేటింగ్స్ చూసే నెటిజనుల్లో తెల్లారే సినిమాలు  చూసే నెటిజనులెవరు? యూతే... ఎడ్యుకేటెడ్ యూతే  ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోల నుంచీ, మార్నింగ్, మ్యాటినీ షోలకీ నిండి పోతారు. ట్విట్టర్లో సీను సీనుకీ ఒకటే అప్డేట్స్ కొడుతూ, సినిమా జాతకాన్ని సినిమా పూర్తవకముందే తమ స్టాండర్డ్స్ తో కొలిచి, లీక్ చేస్తూ వైరల్ చేసేస్తారు. ఇది పైరసీ కన్నాతక్కువ చేష్ఠేం కాదు. సినిమా నడుస్తూండగానే సినిమాని ఇలా బయటికి లీక్ చేయడం ఇదో పైరసీ. కనీసం మ్యాట్నీ వరకైనా బతకనీయడం లేదు సినిమాల్ని. ఇక ఫ్యాన్స్ అయితే సరే! 

          ఇక యూఎస్ నుంచి రెండు మూడు వెబ్సైట్స్ రివ్యూలు తెల్లారేసరికి వచ్చేస్తాయి. అక్కడ ముందు రోజే సినిమాలు విడుదలవుతాయి కాబట్టి. వీటికి ముందే నెటిజనుల ట్విట్టర్ రివ్యూలు వచ్చేస్తాయి. వాళ్ళే రేటింగ్స్ ఇచ్చేస్తారు. మొత్తం ఈ నెటిజనుల రివ్యూలూ రేటింగ్స్ వ్యవహారం చాలా గందరగోళంగా తయారయ్యింది. వీళ్ళ దృష్టిలో అభిరుచిగల సినిమాలకి స్థానమెక్కడ. ఎన్టీఆర్ ని రాయకీయంగానో, కులంగానో పక్కన పెట్టి, వీటికి అతీతుడైన ఒక జగమెరిగిన కళాకారుడిగా గౌరవించలేని అసహనం ఎక్కువైపోయిది. ఇక చాలా విషయాలు దాచారని కంప్లెయింట్స్. తీసింది బాలకృష్ణ. ఆయన తండ్రి గారిని గొప్పగానే చూపించుకుంటారన్నది కామన్ సెన్స్. ఇది తెలిసికూడా చర్చలేమిటి  నాన్ సెన్స్ కాకపోతే. 

          ఇక మార్కెట్ యాస్పెక్ట్ కొస్తే, సినిమా నెటిజన్ యూత్ టేస్టేమిటి? అవే మాస్ మసాలా, లవ్, కామెడీ, స్టెప్పుల డాన్సులూ, ఫైట్లే! ఇలా ఆనందపరుస్తున్న తమకి తెలిసిన స్టార్లు ఎందరో వుండగా, మధ్యలో పాత వేషాలతో ఈ ఎన్టీఆర్ ఎవరు? తెలిసిన వాడు కాదే? ఈయన సినిమాలు చూస్తూ పెరగలేదే? ఆఫ్ కోర్స్, ఎన్టీఆర్ ఒక సీఎం అని తెలుసు. టీడీపీ వాళ్ళ పెద్దాయనగా ఆ ఇమేజి ఒక్కటే మాకు ప్రింటయింది, రోజూ విగ్రహాలూ ఫోటోలూ చూస్తూ వుండడం వల్ల. ఇంకే ఇమేజీలూ మాకు ప్రింటు కాలేదు. ఆ ప్రింటయిన సీఎం ఎన్టీఆర్ ఇమేజీతో బయోపిక్ చూపండయ్యా బాబూ, అలాటి పొలిటికల్ బయోపిక్ చూపండీ!  ఈ కాలంలో మాకూ తెల్సు రాజకీయాలు, ఈ పాతకాలం సినిమా వేషాలు మాకేం తెల్సు, బోర్! 

          ఇలా జనరేషన్ గ్యాప్, కనెక్టివిటీ సమస్యలు కూడా తోడయ్యాయి. దీనికొక్కటే మంత్రం. యూత్ అప్పీల్ తో కొట్టడం. ‘మహానటి’ లో పాతకాలపు సావిత్రి జీవితాన్ని, కొత్త కాలపు విజయ్ దేవరకొండ, సమంతాల కథతో చూపించి యూత్ అప్పీల్ కొట్టి జనరేషన్ గ్యాప్ ని పూడ్చారు. సినిమాలకి ఎప్పుడూ మార్కెట్ యాస్పెక్ట్ = యూత్ అప్పీలే. ఎన్టీఆర్ కి ఇది తెలుసు. కనుకే వయసు మీద పడినా అడవిరాముడు, యమగోల, వేటగాడు లాంటి కుర్ర పాత్రలేసి, కుర్ర పాటలు పాడారు. అంతేగానీ గడిచిపోయిన తన తరం వాళ్ళకోసం, ఇంకా వాళ్ళ అభిరుచులకి తగ్గ పాత్ర లేస్తూ కూర్చోలేదు. ఏ కళయినా ముసలితనంతో వుండదు, కుర్రతనంతోనే వుంటుంది ఏ కాలానికా కాలం. కళ జడం కాదు, చైతన్యం ప్రకృతిలాగే. 

          రాజకీయ సినిమాల కెప్పుడూ యూత్ అప్పీల్, మాస్ అప్పీల్, అన్ని అప్పీల్సూ వుంటూ వస్తున్నాయి. రజనీకాంత్ ‘రోబో- 2’ తో  మార్కెట్ యాస్పెక్ట్ విషయంలో ఏం పొరపాటు జరిగిందో,  అదే ‘ఎన్టీఆర్’ బయోపిక్ మొదటి భాగంతో జరిగింది. ‘రోబో -2’ లో ఒక ప్రేక్షకులందరూ గుర్తించాల్సిన  పర్యావరణ సమస్యని సైన్స్ ఫిక్షన్ గా చెప్పారు. దీంతో ఇది నిజం కాదేమోలేనని ప్రేక్షకులు ఫీల్ కాలేదు. సైన్స్ ఫిక్షన్ నిజం కాదు కదా. ఇదే పర్యావరణ సమస్యని రాజకీయాలతో చూపించి వుంటే ఎక్కువ రెస్పాండ్ అయ్యేవారు. కనెక్ట్ అయ్యేవారు. రాజకీయాలు పర్యావరణాన్ని - పోనీ పిచ్చుకల్ని-  ఇంత ధ్వంసం చేస్తున్నాయా అని ఫీలయ్యే వారు. చేతిలో వున్న సెల్ ఫోన్ ని చూసినప్పుడల్లా పర్యావరణ హనన రాజకీయాలే కన్పించేవి, క్రోనీ కేపిటలిజంతో బాటు. 
           
          నీతి : ప్రేక్షకులనుభవించే సామాజిక సమస్యల్ని సైన్స్ ఫిక్షన్ గా పలాయనవాదంతో చూపరాదు, నిత్యజీవితంలో వాళ్ళు చూసే  రాజకీయాలతోనే ఆర్గానిక్ గా, ప్రాక్టికల్ గా కళ్ళకి కట్టాలి. సామాజిక సమస్యలు వేడి వేడిగా రాజకీయాలతోనే ముడిపడి వుంటాయి, సైన్స్ ఫిక్షన్ తో కాదు.  

          ఇలాగే ‘ఎన్టీఆర్’ బయోపిక్ మొదటిభాగం ఇదే మార్కెట్ యాస్పెక్ట్ ని మిస్సయింది. ఇప్పటి తరానికి ఎంతో కొంత పరిచయమున్న ఎన్టీఆర్ సమీప రాజకీయ జీవిత చరిత్రని చూపాలే గానీ, సుదూర నటజీవిత చరిత్రని కాదు. ఇది పార్టీ కార్యకర్తలకి కూడా వర్కౌట్ కాదు. ఇప్పటి పార్టీ కార్యకర్తలకి తమ పెద్ద నాయకుడి రాజకీయ జీవితం చూసి, ఏవైనా తెలియనివి వుంటే తెలుసుకోవాలని వుంటుంది. మార్కెట్ లోకి పంపాలని సినిమాలు తీస్తూ మార్కెట్ కేం కావాలో పరిశీలన చేయకపోతే ఇంతే. పైగా మార్కెట్ యాస్పెక్ట్ తో తీస్తే హిట్టవుతాయని గ్యారంటీ ఇస్తారా అంటారు. ఏ గ్యారంటీతో తీస్తూ 90% ఫ్లాపులిస్తున్నారో చెప్పలేరు. ఎంత సేపూ క్రియేటివ్ యాస్పెక్టే. మార్కెట్ యాస్పెక్ట్ లేని క్రియేటివ్ యాస్పెక్ట్ దండగ. పశ్చిమ బెంగాల్లో పదేళ్ళ క్రితం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఫిక్కీ)  అక్కడి సినిమా మార్కెట్ రీసెర్చి నిర్వహించి సమగ్ర నివేదిక రూపొందించింది. ఊరూరా ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయి సేకరించిన వివరాలు కూడా వున్నాయి. సినిమాలు ఎవరు చూస్తున్నారు, ఎన్ని చూస్తున్నారు, ఎలాటివి చూస్తున్నారు, ఎలా వుండాలి  వగైరా. ఫిక్కీ పనిలేక ఇదంతా చేసిందా? ఇలాటి రీసెర్చి ఇక్కడ వూహించలేం. 

          ఇక ‘ఎన్టీఆర్’ బయోపిక్ మొదటి భాగం క్రియేటివ్ యాస్పెక్ట్ చూసినా టెక్నికల్ గా ఒక తప్పు, ఒక ఒప్పు వున్నాయి. అయితే వర్కౌటయ్యే ఒప్పుకాదు. ముందుగా బయోపిక్ రెండు భాగాలుగా తీయనే కూడదు. తీసిన చరిత్ర చరిత్రలో లేదు. ఎందుకు తీయలేదంటే ఒక వ్యక్తి గురించి ప్రేక్షకులకి ఒక సినిమా చాలు. ఇంకా డబ్బా కొడతాం రమ్మంటే రారు. మహాత్మా గాంధీతోనూ ఇంతే. మొదటిదాన్ని బ్యాలెన్సు లేకుండా ‘కథగా’ ముగించి, రెండో దాన్ని ఇంకో పాయింటుతో సీక్వెల్ గా తీస్తే వస్తారు. 

          ‘ఎన్టీఆర్’ బయోపిక్ ని రెండు భాగాలుగా తీసినప్పుడు మొదటి భాగంలో కథ లేదు, ఉపోద్ఘాతమే వుంది. ఉపోద్ఘాతం సినిమా ఎలా అవుతుంది, ప్రేక్షకుల మీద అఘాయిత్యం తప్ప. ఇది వివరంగా పైనే చెప్పుకున్నాం. ‘బాహుబలి’ మొదటి భాగం కథ ప్రారంభం కాని ఉపోద్ఘాతమైనా హిట్టయిందనా? దాని మేకింగ్ తో అదలాగే హిట్టవుతుంది. దాంతో ఈ బయోపిక్ కి పోలిక లేదు. బయోపిక్ మొదటి భాగాన్ని కథగా తీయాల్సిందే. అంటే నట జీవితంలో ఎన్టీఆర్ ఎదుర్కొన్న ఒక ప్రధాన సమస్య తీసుకుని,  దాని చుట్టూ ఆయన సంఘర్షణ, పరిష్కారం చూపాల్సిందే. సినిమా జీవితంలో ఆయన ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏముందని. ఆయనే హీరో, అక్కడాయనకి ‘విలన్లు’ లేరు. రాజకీయ జీవితంలోనే ‘విలన్లు’ న్నారు. కథంతా ఇక్కడే వుంది – రాజకీయ జీవితంలో. కనుక మొదటి భాగం కథ కుదరక, ఆయన సినిమా జర్నీ తాలూకు డైరీ మాత్రంగానే మిగిలింది.  డైరీ సినిమా అవదని చెప్పుకున్నాం. 

          టెక్నికల్ గా ఒప్పు ఏమిటంటే, బయోపిక్ మొదటి భాగంతో బాటు రెండో భాగం కలుపుకుని మొత్తం ఒకే స్క్రీన్ ప్లే అనుకుంటే, ఈ స్క్రీన్ ప్లేలో మొదటి భాగం బిగినింగ్ విభాగం లక్షణాలని పుణికి పుచ్చుకుంది. ఎలాగంటే,  బిగినింగ్ విభాగంలో పాత్రల పరిచయం, కథా నేపధ్యం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటూ అనే నాల్గు టూల్స్ వుంటాయని తెలిసిందే. ఈ నాల్గూ వున్నాయి : 1. ఎన్టీఆర్ పాత్ర పరిచయం, 2. సినిమా నేపధ్య వాతావరణం, 3. ఆయనలో రాజకీయ భావాల్ని పాదుకోల్పే ఉదంతాలతో (రాయలసీమ కరువు, దివిసీమ ఉప్పెన, తిరుపతి భక్తులు వగైరా) సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, 4. సమస్య ఏర్పాటు (పార్టీ ప్రకటన). 

          ఇది బిగినింగ్, అంటే కథకి ఉపోద్ఘాతం. అంటే ఈ బిగినింగ్ (ఉపోద్ఘాతం) తో మొదటి భాగం ముగిసింది. ఇక దీనితర్వాత రెండో భాగంలో మొదలయ్యేదే మిడిల్ విభాగం, అంటే కథా ప్రారంభం. రెండో భాగంలోనే కథకి ముగింపుతో కూడిన ఎండ్ విభాగం (ఇలా వుంటుందో లేదో తెలీదు).  

          కాబట్టి మొదటి భాగం స్క్రీన్ ప్లేలో బిగినింగ్ వరకూ వచ్చి ఆగిందన్నమాట. ఇవే బిగినింగ్ విభాగపు టూల్స్ తో ‘బాహుబలి’ మొదటి భాగం కూడా ఆగుతుంది. రెండో భాగంలోనే  కథా ప్రారంభం (మిడిల్), ముగింపూ (ఎండ్) వుంటాయి.

        అయితే మొదటి భాగం ‘బహుబలి’ లో కథ లేకుండా ఉపోద్ఘాతం వుండడం వేరు, ఇదే బయోపిక్ లో వుండడం వేరు. ఉపోద్ఘాతమైనా ‘బాహుబలి’ తట్టుకున్న కాన్వాస్, మేకింగ్ వేరు; బయోపిక్ మొదటి భాగం కాన్వాస్, మేకింగ్ వేరు. ఈ మొదటి భాగాన్ని పూర్తి కథే నిలబెట్టాలి. కానీ పూర్తి కథ కుదరని మొదటి భాగమిది. అప్పుడు ‘సిటిజన్ కేన్’  స్కీములో పెట్టినా ‘మహానటి’ ముద్ర పడుతుంది. ఇది బావుండదు. వేరే చూడాలి. ఇన్నోవేషన్ కి వేరే కథనరీతులున్నాయోమో రీసెర్చి చేసుకోవాలి. 

          కానీ మౌలిక ప్రశ్న ఉండనే వుంది :  బయోపిక్ కి రెండు భాగాలేమిటని. ఇక ఈ వ్యాసం ముగిస్తూండగా ఒక రచయిత ఫోన్ చేసి రెండో భాగంతో సందేహాన్ని వ్యక్తపర్చాడు. రెండో భాగం ఎక్కడ ముగిస్తారు? ఎందుకంటే మొదటి భాగాన్ని ఎన్టీఆర్ సతీమణి బసవతా రకమ్మ గారి పాయింటాఫ్ వ్యూలో, ఆమె జ్ఞాపకాలుగా ఫ్లాష్ బ్యాక్ అన్నట్టు ప్రారంభించారు. మరి ఆవిడ ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక 1985లో అస్తమించారు. అంటే రెండోభాగం ఇంతవరకే వుంటుందా? పాయింటే! ఆవిడ పాయింటాఫ్ వ్యూ అయితే ఇంతవరకే వుండాలి. ఎన్టీఆర్ నిర్యాణం వరకూ వుండకూడదు. వుండాలంటే ఏం చేశారో చూడాలి. ఉండకపోతే 1985 వరకు ఆ కొద్ది కాలానికి కథే చేశారా లేక మళ్ళీ...???

సికిందర్