రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, మే 2021, బుధవారం

1041 : సందేహాలు - సమాధానాలు

 Q : కుల వివక్షపై సినిమాలు తీస్తున్న దర్శకులు నేటి సమాజంలోని వివక్షను చూపించకుండా దశాబ్దాల కిందటి కాలం ఎందుకు ఎంచుకుంటున్నారు? ఉదా: కర్ణన్, అసురన్, పలాస, ఉప్పెన. కాంటెంపరరీ వివక్ష కథలు చెప్పవచ్చు కదా?

మహేష్ రెడ్డి, రైటర్
A : పాయింటే. ఫలానా ఆ రోజుల్లో ఇలా జరిగిందని ఇలాటి సినిమాలు తీయడం కంటే సమకాలీనంగా చెబుతూ తీస్తే వివాదాలొస్తాయని కావచ్చు. కానీ సమకాలీనంగా కె. విశ్వనాథ్ సప్తపది తీశారు, ముత్యాల సుబ్బయ్య ఎర్రమందారం తీశారు. ఆ మధ్య ఒక అసోసియేట్ కోసం సమకాలీన కథే చేశాం. అయితే కుల వివక్ష గురించి కాక ఈర్ష్య గురించి. దీనికి సామాజికార్ధిక చారిత్రక నేపథ్యాల్ని విస్తృతంగా రీసెర్చి చేసి. ఇది కమర్షియలే  అయినా ఎంటర్ టైనర్ గా కూడా వుంటుంది. దీనికి పెద్ద బడ్జెట్, పెద్ద హీరో అవసరం. ఎన్నేళ్ళు  పడుతుందో తెలీదు. కుల వివక్ష సినిమాలు పీరియెడ్ మూవీస్ గా తీసినా అణిచివేత గురించే వుంటున్నాయి. కర్ణన్ లో కుల వివక్ష కూడా కనిపించదు. అలాటి పరిస్థితుల్లో ఎవరితోనైనా పోలీసులలాగే ప్రవర్తిస్తారు. కర్ణన్ లో ఆ వ్యక్తి తలపాగా తీయలేదని పగ పెంచుకుని అదంతా చేశాడు పోలీసు అధికారి. ఆ వ్యక్తి స్థానంలో ఇంకే కులం వాడున్నా పోలీసులతో అదే జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా ఒక కులంతో ఇలా జరిగినట్టు కర్ణన్ లో చూపించారు. ఒకసారి ఒక పోలీసు అధికారికి పరిచయం చేయడానికి ఒక కొత్త దర్శకుణ్ణి పిలిపించాం. అతను చాలా లేటుగా, పైగా బ్లాక్ స్పెక్ట్స్ పెట్టుకుని స్టయిలుగా వచ్చేసరికి, ముందు స్పెక్ట్స్ తీసేయమని మనం చెప్పాల్సి వచ్చింది. లేకపోతే ఆ అధికారి చూసే చూపులకి చెంప ఛెళ్ళు మనే దేమో! ఇలాటి పరిస్థితిని ఆహ్వానించడానికి కులమే అవసరం లేదు. కొందరి ముందు కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సి వుంటుంది. కర్ణన్ లో కులాన్ని ఆపాదించారుగానీ, నిజానికది ప్రోటోకాల్ సమస్య.

Q : నేను కథ రాసేటప్పుడు ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతున్నాను. ప్రతీ కథతో ఇలాగే జరిగి ఆపేస్తున్నాను. ఎందుకిలా జరుగుతోంది? నేనేం చేయాలి?
బిందు కుమార్, అసోసియేట్  
A : అసలు కథకి తీసుకున్న ఐడియాతో కనెక్ట్ కాకపోతే ఇక దేంతోనూ కనెక్ట్ కాలేరు. ముందు మీ ఐడియాల క్వాలిటీ ఏమిటో పరిశీలించుకోండి. ఐడియాలో స్పార్క్ వుంటే ఆలోచనలు వాటికవే స్పార్క్ అయి లాక్కెళతాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి చేరడం రొటీన్, సాధారణ ఐడియా. బిల్ గేట్స్ కాలేజీ డ్రాపవుట్ అయితే, మన హీరో బిల్ గేట్స్ ని తలదన్నేలా హై స్కూల్ డ్రాపవుట్ గా, హై స్కిల్స్ తో సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరడం స్పార్క్ వున్న ఐడియా. ఈ కథ రాయడంలో థ్రిల్ వుంటుంది. అసాధారణ ఐడియాల్లో స్పార్క్, దాంతో థ్రిల్ వుంటాయి. అసాధారణ ఐడియాలతో కూడా కనెక్ట్ కాలేక పోతే, మీరు మనస్ఫూర్తిగా సినిమాల్లోకి రావాలనుకున్నారో లేదో ఆత్మ పరిశీలన చేసుకోండి.

Q :  'నెయిల్ పాలిష్ 2021' కథావస్తువుకు, 'దీవాన్గీ 2002 కథావస్తువుకు తేడా ఏమిటి? ఇంకో ప్రశ్న, అమ్మాయిలకు మాత్రమే నేషనల్ క్రష్ అనే బిరుదు ఎందుకు ఇస్తారు? అబ్బాయిలకు ఎందుకు కాదు?

ఎంఆర్, రైటర్
A : రెండూ స్ప్లిట్ పర్సనాలిటీతో హత్య చేయడం గురించే. కాకపోతే, మొదటి దానిలో అది నిజంగా స్ప్లిట్ పర్సనాలిటీ. అంతేగాకుండా ఒక న్యాయ సమస్యతో కోర్టు రూమ్ డ్రామా. రెండోదానిలో ఆ స్పిల్ట్ పర్సనాలిటీ నటన. రెండో ప్రశ్నకి, మేల్ నేషనల్ క్రష్ అవార్డులు కూడా వున్నాయి. విజయ్ దేవరకొండ మేల్ నేషనల్ క్రష్ -2021.

***

 

 

23, మే 2021, ఆదివారం

1040 :రివ్యూ


 రచన- దర్శకత్వం : జిస్ జాయ్

తారాగణం : కొంచాకో బొబన్, సిద్దిఖ్, అనార్కలీ నాజర్, వినయ్ ఫోర్ట్, ముఖేష్ తదితరులు
కథ:బాబీ- సంజయ్
, సంగీతం : విలియం ఫ్రాన్సిస్, పాటలు : ప్రిన్స్ జార్జి, ఛాయాగ్రహణం : బహుళ్ రమేష్
బ్యానర్ : మ్యాజిక్ ఫ్రేమ్స్
నిర్మాత : లిస్టిన్ స్టీఫెన్
విడుదల : మార్చి 19
, 2021, అమెజాన్ : మే 19, 2019
***

         ఫీల్ గుడ్ సినిమాల మలయాళ దర్శకుడు జిస్ జాయ్ తనకి మాత్రమే జాయ్ వుంచుకుని, ప్రేక్షకులకి నస పంచే పథకం పెట్టుకున్నట్టుంది. ఈ ఫీల్ గుడ్ నస లైటర్ వీన్ ప్రేమ సినిమాల పేరుతో గతంలో తెలుగులో అనుభవించిందే. మళ్ళీ ఇన్నాళ్ళకి మలయాళ రూపం తొడిగి ఫీల్ గుడ్- ఫీల్ గుడ్- ఫీల్ గుడ్- అంటూ రెచ్చగొడుతోంది. నస ఫీల్ గుడ్ ఎలా అవుతుందో అర్ధం గాదు. ఇండియన్ ఫీల్ గుడ్ సినిమా అంటేనే నస. సినిమా లక్షణాలని పీకి పారేసి, పిప్పిని విప్పి చూపించే నసోపాఖ్యానం. ఫీల్ గుడ్ అంటున్న దర్శకుణ్ణి హాలీవుడ్ లో నిర్బంధించి, ముందు బేసికల్ గా సినిమాని ఫీలయ్యేలా సానబట్టాలి- ఎన్టీఆర్ నిప్పులాంటి మనిషి లో కత్తికి సాన మీ కత్తికి సాన సాంగేసి. 

       ‘మోహన్ కుమార్ ఫ్యాన్స్ ఒక పరిపూర్ణ నస పురాణం. షార్ట్ ఫిలింకి సరిపోయే కథని రెండు గంటలు తీస్తూ పోతూ వుంటే, బడ్జెట్ దాటి నానేసిన నసే అవుతుంది. షార్ట్ ఫిలిం కథగా కూడా అర్ధముండాలి. కథకి ఐడియానే నెగెటివ్ గా వుంటే పాజిటివ్ ఫలితాలు కూడా రావు. గుర్తింపు రావడం వేరు, నన్ను గుర్తించండీ అని అడుక్కోవడం వేరు. అవార్డులనేవి వరించి వస్తాయి. వెంటపడి వేటాడితే వచ్చేవి అవార్డు లన్పించుకోవు. డబ్బిచ్చి చేయించుకున్న సన్మానాలవుతాయి. అవార్డు కోసమే నటించాను, నాకు అవార్డు రావాలని ప్రకటించుకుంటే చులకనై పోవడం తప్ప మరేం వుండదు. సినిమా హిట్టవ్వాలని ప్రేక్షకుల్ని అడుక్కుంటూ ప్రచారం చేసుకుంటే అర్ధముంది గానీ, అవార్డు అడుక్కోవడమేమిటి.

        కానీ ఈ పనే చేస్తాడు మోహన్ కుమార్ (సిద్ధీఖ్) అనే మాజీ హీరో. ముప్ఫై ఏళ్ళ క్రితం ఇతను మమ్ముట్టి, మోహన్ లాల్ ల రాకతో తెరమరుగయ్యాడు. మళ్ళీ ఇప్పుడు అద్భుత పాత్ర నటించి వార్తల కెక్కాడు. ఈ నేపథ్యంలో ఉత్తమ నటుడి జాతీయ అవార్డు ఆశిస్తాడు. ఇందుకు ఆ సినిమా తీసిన నిర్మాత ప్రకాష్ (ముఖేష్), డ్రైవర్ కృష్ణన్ ఉన్ని (కొంచాకో బొబన్) ఇంకా మరికొందరు సిబ్బందీ, మోహన్ కుమార్ కూతురు శ్రీ రంజని (అనార్కలీ నాజర్ -  వీళ్ళే మోహన్ కుమార్ ఫ్యాన్స్) నడుం కడ్తారు. ఇక అవార్డు ఎలా వచ్చిందీ, రావడానికి వీళ్ళేం చేశారు, వచ్చాక ఏం జరిగిందీఈ మొత్తం రెండు గంటల సినిమాలో ఓ అరగంట కథ మాత్రమే.

***

        మోహన్ కుమార్ పాత్రలో ఆ పాత్రెలా వున్నా సిద్ధీఖ్ చాలా డీసెంట్ గా నటించాడు. ఈ సినిమా పేరు చెబితే తన నటనే మెదిలేలా ఫీల్ గుడ్ గా నటించాడు (ఈ సినిమాలో అన్ని పాత్రలూ ఫీల్ గుడ్ గా మనం ఫీలయ్యి తీరాలని కంకణం కట్టుకున్న పాత్రలే, నటనలే-  కథ ఓ కథలా లేకున్నా). అయితే సిద్దీఖ్ అవార్డు ఆశిస్తున్న సినిమాలో అసలెలా నటించాడో మనం చూసేందుకు సరైన అవకాశం కల్పించలేదు దర్శకుడు. ఆ నటించిన సినిమా థియేటర్లో వేసి చూపిస్తూంటే ఆ మినియేచర్ బొమ్మ స్పష్టంగా కనపడదు. అదేదో వైడ్ స్క్రీన్ మీద చూపిస్తే చూసి తెలుసుకునే వాళ్ళం.

        ఇక మోహన్ కుమార్ పాత్రలో సిద్ధీఖ్ చేసేదేమీ వుండదు. అవార్డు సంగతి ఇతర పాత్రలు చూసుకుంటాయి. తను అవార్డు కోసం ఎదురు చూస్తూ ఇంట్లో పాత వస్తువులతో ఆ రోజుల్ని నెమరేసుకోవడం, కాఫీ తాగడం, పార్టీలు చేసుకోవడం వంటివి మాత్రమే చేస్తూంటాడు. తను ముప్ఫై ఏళ్ళ తర్వాత గుర్తింపుకోసం నటించి అవార్డు కోరుకుంటున్నాడు. అదే సమయంలో కూతురు శ్రీ రంజని గాయనిగా ప్రయత్నిస్తోంది. అలాంటప్పుడు తను నటిస్తున్న సినిమాలో ఆమె చేత పాడించ వచ్చుగా. పాడించి వుంటే అవార్డు తనకి కాకుండా ఆమెకి వచ్చి - ఈ ట్విస్టుకి పుత్రికోత్సాహం కలిగేది కదా. ఒకసారి బాలీవుడ్ లో గాయకుడు కిషోర్ కుమార్ కి ఫిలిం ఫేర్ అవార్డు వస్తుందనుకున్నారు. కొడుకు అమిత్ కుమార్ కొచ్చింది!    
   
        అవార్డు ఆశిస్తున్న సిద్ధీఖ్ ఎవరో హేళన చేస్తూంటే కొడతాడు. ఇది వైరల్ అవుతుంది. తర్వాత అయ్యే తతంగాన్నిఫీల్ గుడ్ గా దాటవేశాడు దర్శకుడు. సత్యజిత్ రే తీసిన నాయక్ లో సినిమా నటుడుగా నటించిన ఉత్తమ్ కుమార్, ఒక పార్టీలో ఇలాగే ఎడాపెడా కొట్టి వార్తల కెక్కుతాడు. అయితే ఈ సంఘటన అవార్డు తనకి ప్రకటించాక, అది తీసుకోవడానికి ప్రయాణ మయే ముందు జరుగుతుంది. కాబట్టి అవార్డుకి ప్రమాదముండదు.

        సిద్దీఖ్ సీన్ వేరు. అవార్డుకి అప్లయి చేశాక కొట్టి సీన్ క్రియేట్ చేస్తాడు. ఈ స్టోరీ బీట్ ని దర్శకుడు డైల్యూట్ చేశాడు ఫీల్ గుడ్ పథకం కోసం. లేకపోతే, అలా కొడితే, అది వైరల్ అయి సమసిపోవడం కాదు, అతడి అవార్డుకి వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ అయ్యేది. అవార్డు కమిటీకి ట్యాగ్ అయి అవార్డు గల్లంతయ్యేది. ఈ అనివార్య కథనాన్ని ఫీల్ గుడ్ కోసం దాటేశాడు దర్శకుడు. ఫీల్ గుడ్ అంటే కామన్ సెన్సు, లాజిక్ వదిలె య్యాలన్న మాట. 

        అసలింకో బుర్ర బద్దలు చేసుకున్నా అర్ధం గాని ఫీల్ గుడ్ సంగతేమిటంటే, క్రోనాలజీ... సినిమా విడుదలయింది, జాతీయ అవార్డుకి అప్లయి చేశారు, తర్వాత సినిమా శతదినోత్సవం కూడా అయ్యింది. ఇక అవార్డు నందుకునే శుభకార్యం కోసం ఎదురు చూపులు. ఈ సంవత్సరం ఇచ్చే అవార్డులకి ఈ సంవత్సరం ఎలా అప్లై చేసి ఎదురు చూస్తారు. ఈ సంవత్సరం తీసిన సినిమాకి ఈ సంవత్సరమే జాతీయ అవార్డు వస్తుందా -ఇలా వుంది ఫీల్ గుడ్ కథ!

        కూతురు శ్రీరంజని పాత్రలో కొత్త నటిగా పరిచయమైన అనార్కలీ నాజర్ సింగర్ పాత్రలో ఒక ఆడిషన్ ఇచ్చాక ఇక  ప్రయత్నాలుండవు. వాణీ జయరామ్ ని సుమధురంగా ఆలపించిన ఆమెని మెచ్చుకుని వదిలేస్తాడు సంగీతదర్శకుడు. ఇక ఆ తర్వాత ఆమె కథలో ఏం చేయాలో తెలీక అన్నట్టు ఆందోళనగా కనిపిస్తూ, ఫాదర్ సెంటి మెంటుతో ఫీల్ గుడ్ సన్నివేశాల్లో పాలు పంచుకోవడానికి సెటిలై పోతుంది. ఆ హీరో అయిన ఫాదర్ కి తన అవార్డే గానీ, ఈమె సింగింగ్ స్ట్రగుల్ అస్సలు పట్టదు.

***

       కారు డ్రైవర్ గా కొంచాకో బొబన్ ఇంకో ఫీల్ గుడ్ నమూనా. ఇతనసలు సిద్దీఖ్ నటించిన సినిమా కంపెనీ కారు డ్రైవర్. సిద్దీఖ్ తో వుంటాడు. ఇతడికి సింగర్ నవ్వాలని కోరిక. ఆడిషన్ లో జేసుదాస్ ని కమనీయంగా గానం చేసిన ఇతణ్ణి కూడా సంగీత దర్శకుడు మెచ్చుకుని వదిలేస్తాడు. ఇక ఇతను సిద్దీఖ్ తో ఫీల్ గుడ్ సన్నివేశాల్లో పాలు పంచుకోవడం కోసం నమ్మిన బంటుగా సెటిలై పోతాడు. ఇతనే కాదు, ఇంకో రైటర్ వుంటాడు. ఇతను కథలు వినిపిస్తూ ట్రయల్స్ లో వుంటాడు. ఇంకో యంగ్ స్టార్ వుంటాడు. ఇతడికి ప్రైవసీ లేకుండా సోషల్ మీడియాతో డిస్టర్బ్ చేసే సీన్లూ, వాళ్ళకి బుద్ధి చెప్పే ఇతడి మెసేజిలూ వుంటాయి. ఇంకో దర్శకుడు వుంటాడు. ఇతను సినిమా తీసే దృశ్యాలుంటాయి... శ్రీరంజనితో మొదలుకొని ఇవన్నీ సబ్ ఫ్లాట్స్. టచ్ చేసి అసంపూర్ణంగా వదిలేసిన సబ్ ఫ్లాట్స్. పిసరంత మోహన్ కుమార్ అసలు కథకి, ఈ సబ్ ఫ్లాట్స్ తో సినిమా భర్తీ.

        ఈ సబ్ ఫ్లాట్స్ ఆంతర్యమేమిటా అంటే, దర్శకుడు పూర్వం డబ్బింగ్ ఆర్టిస్టు, తర్వాత లిరిక్ రైటర్, ఆ తర్వాత దర్శకుడయ్యాడు. ఇందుకేనేమో ఈ సబ్ ఫ్లాట్స్ వేసి తన బయోపిక్ ని చూసుకునే ముచ్చట తీర్చుకున్నాడు ఫీల్ గుడ్ గా. ఇంతటితో వదల్లేదు, సినిమాలో దర్శకుడి పాత్ర తనే నటించాడు! ఇంకో ముచ్చట కూడా బలవంతంగా ఇరికించాడు - సింగర్ ప్రయత్నాలు చేసే కొంచాకో బొబన్ ఏడని సిద్ధీఖ్ నిర్మాతని అడుగుతాడు. డాన్స్ ప్రాక్టీసు చేస్తున్నాడని నిర్మాత చెప్తాడు. అతను డాన్సర్ కూడానా అని సిద్దీఖ్ న  అనేసరికి- జామ్మని పాట వచ్చేస్తుంది. కొంచాకో బొబన్ విరగదీసి డాన్స్ పాటేసుకుంటాడు (ఫోటో చూడండి)!  

***

    ఫీల్ గుడ్ కోసం కష్టాలు ఇట్టే తీరిపోతూంటాయి. అవార్డు కోరుకుంటున్న మోహన్ కుమార్ ఫ్యాన్స్ కి రేపే అప్లికేషను ఆఖరు తేదీ అని తెలీదు. దాంతో ఉరుకులు పరుగులు. ఇందులో ఆటంకాలు. ఆటంకం ఎదురైన ఘట్టంలోనే ఎవరో ఒక ఆపద్బాంధవుడు / బాంధవురాలు ప్రత్యక్షమై ఆదుకోవడం! జీవితం జీవించడం చాలా ఈజీ. ఎందుకంటే ఇలా డీఫాల్టుగా మనల్ని ఆదుకునేస్తూ వుంటారు సూపర్ మేన్లు. డోంట్ వర్రీ, లైఫ్ ఈజ్ ఇలాటి ఫీల్ గుడ్ మూవీ.

        ఫీల్ గుడ్ కోసం ఆరు పాటలు. సిద్దీఖ్ కి గుండె పోటు వచ్చినా కూడా పాటే. మొదటి గంట సినిమా సబ్ ఫ్లాట్స్ నిండిపోయి ఎటు పోతోందో అర్ధం గాదు. ఇంటర్వెల్ ముందు అవార్డుకి అప్లయి చేసే ఉరుకులు పరుగులతో కాసేపు అసలు కథ చూపించాడు. సెకండాఫ్ మళ్ళీ సబ్ ఫ్లాట్స్ వేసుకుని, అరగంట తర్వాతే మిగతా అసలు కథ చూపించాడు. గుండెపోటు ఎపిసోడ్. ఇక్కడ ట్విస్టు ఏమిటంటే, అవార్డుకి ఢిల్లీకి అప్లికేషన్ పంపినప్పుడు నిర్మాత అఫిడవిట్ మిస్సయిందిట. ఇక అప్లికేషన్ అడ్మిట్ అవదు. అందుకని గుండెపోటుతో హాస్పిటల్లో చేరిన తమ హీరో గార్ని నమ్మిస్తూ అవార్డు వచ్చినట్టు డ్రామా సృష్టిస్తారు. చాలా ఇల్లాజికల్ డ్రామా. ఇంతకంటే ఫీల్ బ్యాడ్ డ్రామా వుండదు.

        లైటర్ వీన్ ఫీల్ గుడ్ తెలుగు ప్రేమ సినిమాలు మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేతో వుండేవి. కాసేపు బిగినింగ్, చివర్లో ఎండ్ విభాగంలో కథా దాని ముగింపూ తప్ప, మిడిల్ వుండేది కాదు. ఇదే ఇక్కడ చూడొచ్చు. గుండె పోటు ఎపిసోడ్ తో ఎండ్ విభాగం వచ్చేస్తుంది. ఇందులో అర్ధం పర్ధం లేని ట్విస్టులు. ఈ ట్విస్టులతో ప్రేక్షకుల్ని ఫూల్స్ చేస్తూ పోతాడు. విషయం తేల్చడానికి ఒకటే నస పెడతాడు ఎండ్ లో కూడా. ఈ ఫీల్ గుడ్ నసతో కథ దాని కథా లక్షణాలు కోల్పోయి దిక్కులేనిదై పోయింది.

సికిందర్  

20, మే 2021, గురువారం

1039 : రివ్యూ


 దర్శకత్వం : రమేష్ రాపర్తి 
తారాగణం : అనసూయా భరద్వాజ్, విరాజ్ అశ్విన్, మౌనికా రెడ్డి, వివా హర్ష, అనీష్ కురువిల్లా, అన్నపూర్ణమ్మ తదితరులు
కథ : రమేష్ రాపర్తి, నియీ అఖిన్ మోలయాన్  ఛాయాగ్రహణం : ఆర్ సురేష్
బ్యానర్ : జస్ట్ ఆర్డినరీ ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు :  మాగుంట శరత్ చంద్రా రెడ్డి, బొమ్మిరెడ్డి తారకా నాథ్
విడుదల : ఆహా, మే  7, 2021

***

        కోవిడ్ -2 తో తిరిగి థియేటర్ల ప్రదర్శనలు నిలిచి పోవడంతో సినిమాలకి ఓటీటీల అవసరం తప్పడం లేదు. ఓటీటీ సీను ఇప్పుడు మారింది. బడ్జెట్ కూడా చేతికి రానంతగా రైట్స్ నిర్ణయిస్తున్నారని వినికిడి. నాణ్యత లేని సినిమాలు తీసి ఓటీటీలతో లాభపడ్డమే దీనికి కారణం. ఒకప్పుడు శాటిలైట్ సినిమాలతో ఇదే చేసి బహిష్కృతులయ్యారు. గుణాత్మకంగా మేకర్లలో మార్పు వస్తేగానీ మంచి రోజులు వచ్చేలా లేవు.

      ఈ క్రమంలో కోవిడ్ రెండో విడత తాకిడిలో మొదటి ఓటీటీ విడుదలగా థాంక్యూ బ్రదర్ ప్రేక్షకుల ముందు కొచ్చింది. అయితే గత సంవత్సరం ఇదే పరిస్థితుల్లో లేనంతగా భయం నీడన ఇప్పుడు మనుషులు జీవిస్తున్నారు. రెండో విడత తీవ్రత అలా వుంది. వాతావరణంలో ధైర్యాన్ని నింపే వైబ్రేషన్స్ లేవు. ధైర్యాన్ని నింపే, లేదా భయాన్ని మరిపించే వైబ్రేషన్స్ తో కూడిన కంటెంట్ నివ్వడం ఇప్పుడు సినిమాల కవసరం. థాంక్యూ బ్రదర్ ఈ పని చేయగల్గీ చేయలేకపోయింది.  దీన్ని నైజీరియన్ మూవీ ఎలివేటర్ బేబీ (2019) కి రీమేక్ గా తీసినట్టు తెలుస్తోంది. రమేష్ రాపర్తి కొత్త దర్శకుడుగా పరిచయమయ్యాడు. అనసూయా భరద్వాజ్ ప్రధాన పాత్ర పోషించింది. విరాజ్ అశ్విన్ ఇంకో ప్రధాన పాత్ర పోషించాడు. ఇతను గత సంవత్సరం మనసా నమః అనే షార్ట్ ఫిలిం లో నటించి పరిచయమయ్యాడు. 

        కథలో వీళ్ళిద్దరూ అపరిచితులు. ప్రియ (అనసూయ) గర్భవతి. భర్త చనిపోయాడు. అతను పని చేసిన కంపెనీ నుంచి చెక్కు తీసుకోవడానికి ఓ అపార్ట్ మెంటు కొస్తుంది. అభి (విరాజ్) బాగా డబ్బున్న ఆవారా బ్యాచి. అదే అపార్ట్ మెంటుకి ఒక పని మీద వస్తాడు. ఇద్దరూ పని ముగించుకుని వెళ్తూ లిఫ్ట్ లోకి ప్రవేశిస్తారు. ఆ లిఫ్ట్ మధ్యలో పాడయి ఆగిపోతుంది. ఆమెకి నొప్పులు ప్రారంభమై ఏం చేయాలో అర్ధంగాదు. ఇప్పుడేమిటన్నది మిగతా కథ.

***

    ఈ నైజీరియన్ కథని తెలుగుకి మార్చినప్పుడు అలవాటు చొప్పున అదే మూసకి పాల్పడ్డారు. పాడిందే పాడరా అన్నట్టు... ఔటాఫ్ బాక్స్ ఐడియాలకి కూడా మూస టెంప్లెట్లు వాడేస్తే ఏం చేస్తాం. కాలం, కాలంతో బాటు ప్రేక్షకుల అభిరుచుల్లో వస్తున్న మార్పులూ గమనించే ఆసక్తి లేక, ఇలా పాత నమూనాలే చూపిస్తూ కూర్చోవడం.


        ఇద్దరు అపరిచితుల్ని లిఫ్ట్ లో ఇరికించిన ఈ కథకి ఫ్లాష్ బ్యాక్స్ తో పూర్వరంగం ఏర్పాటు చేశారు. ఫస్టాఫ్ మొత్తం ఈ మూస ఫ్లాష్ బ్యాక్స్ సహన పరీక్ష పెడతాయి. పైగా ఇది హీరో కథయినట్టు, కొత్త హీరోకి అనసూయకి మించి 40 నిమిషాల ఫ్లాష్ బ్యాక్! ఈ ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి చనిపోయిన హీరో, రెండో పెళ్ళి చేసుకున్న తల్లి మాట వినక, ఫ్రెండ్స్ తో తాగుడు పార్టీలతో ఆవారాగా గడుపుతాడు. బాగా డబ్బున్న వాడే అయినప్పటికీ ఏ పనీ చేయకపోతే గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తుంది. తల్లి వొత్తిడి కూడా పెరిగేసరికి, ఇక ఏదైనా పని చూసుకోవాలని ఒక ప్రపోజల్ తో తండ్రి పాత మిత్రుడ్ని కలవడానికి అపార్ట్ మెంట్ కెళ్తాడు. ఎన్నోసినిమాల్లో చూసి చూసి వున్న ఆవారా హీరో ఫస్టాఫే ఇక్కడా దర్శనమిస్తుంది. ఇంతకన్నా విషయం లేదు ఫస్టాఫ్ లో. ఫస్టాఫ్ స్క్రిప్టంతా బడ్జెట్ వృధా అని తెలిసిపోతోంది.

        మరో వైపు కాసేపే అనసూయ ఫ్లాష్ బ్యాక్. ఈమెది దిగువ మధ్య తరగతి కుటుంబం. భర్త వుంటాడు. తల్లి వుంటుంది. కంపెనీలో పని చేస్తున్న భర్త చనిపోతాడు. తను గర్భవతి. భర్త తాలూకు డబ్బులు తీసుకోవడానికి హీరో వెళ్ళిన అపార్ట్ మెంట్ కే  వెళ్తుంది. ఇద్దరూ అక్కడ లిఫ్ట్ ఆగిపోయి అందులో ఇరుక్కుంటారు.

***

        ఈ కథని నాన్ లీనియర్ గా ఫ్లాష్ బ్యాక్స్ చేసి చెప్పడంతోనే కొంపమునిగింది. దర్శకుడు ఓపెనింగ్ బ్యాంగ్ గా బావుంటుందనుకుని ఫీలైనట్టు, లిఫ్ట్ లో ఇరుక్కునే సీను ముందే చూపించేస్తూ సినిమా ప్రారంభించాడు. కథాక్రమంలో డెవలప్ అయి దాని సమయంలో అది రావాల్సిన ఈ ప్లాట్ పాయింట్ వన్ సీనుతో ఓపెనింగ్ వేయడంతో, ఇప్పుడే కథేమిటో తెలిసిపోయింది! ఇలా ప్రారంభంలోనే  లిఫ్ట్ సీను వేసి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్స్ చూపించడంతో ముందేం జరుగుతుందో కథ తెలిసిపోవడమేగాక, ఈ సీను తర్వాత ఫ్లాష్ బ్యాక్స్ వల్ల  ఏ సస్పెన్సూ కూడా లేకుండా పోయింది. ఇంటర్వెల్లో వేయాల్సిన లిఫ్ట్ సీను అనాలోచింతంగా సినిమా ఓపెనింగ్ లో వేసేస్తూ ఘోరమైన పొరపాటు చేసి - సినిమా మొత్తాన్నీ నీరు గార్చేశాడు.

        ఇలా కాకుండా, ఎలివేటర్ బేబీ లో లీనియర్ గానే కథ చెప్పాడు. దీనివల్ల ముందేం జరుగుతుందో తెలీదు. డిజాస్టర్ జానర్ మూవీ కథనం ఇలాగే వుంటుంది. లీనియర్ గా హీరో కథ, హీరోయిన్ కథా చూపించుకుంటూ వెళ్ళి, లిఫ్ట్ లో ఇరికించి అప్పుడు ఇంటర్వెల్  బ్యాంగ్ ఇచ్చాడు. దీని నిడివి గంటన్నర కూడా లేదు కాబట్టి, తెలుగులో చూపించిన హీరో హీరోయిన్ల పూర్వరంగమే ఇందులో ఎక్కువ నస పెట్టకుండా చప్పున ముగిసిపోతుంది.

***

   ఇక లిఫ్ట్ లో ఇరుక్కున్నాక సెకండాఫ్ మరీ బలహీనంగా వుంది. ఆమె నొప్పుల బాధ, అతడి మొండి తనం. ఈ కథకి అనసూయా భరద్వాజ్ ప్రధాన పాత్ర కాదని ఎందుకనో నిర్ణయించారు. బాక్సాఫీసు అప్పీల్ గురించి ఆలోచించకుండా కొత్త వాడైన విరాజ్ అశ్వినే కథానాయకుడనుకున్నారు. అందుకే ఫస్టాఫ్ లో 40 నిమిషాల పాటూ అతడితో వృధా ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ లో ఆవారాగా, మానవత్వం లేకుండా వున్న అతను మారడం గురించిన కథ అనుకున్నారు కాబట్టి, అతనే కథానాయకుడయ్యాడు. ఒక మొండివాడు, ఆవారా మంచివాడుగా ఎలా మారాడన్నది ఈ కథతో చెప్పాలనుకున్న అతి పురాతన మూస విషయం. ఇది ఈ రోజుల్లో వర్కౌటయ్యే ఐడియాయేనా? అతను మారితే ఎవరిక్కావాలి, మారకపోతే ఎవరిక్కావాలి. సెల్ ఫోన్ చేతిలో వున్న నేటి యూత్ ప్రోయాక్టివ్ కథ కావాలి గాని. ఇలా ఇరుక్కున్న పరిస్థితిలో మాతృత్వం ప్రమాదంలో వుందని హీరో రెస్పాండ్ అయి ఒక్క మెసేజ్ కొడితే, పోలోమని వందమంది యూత్ మాతృత్వం కోసం వచ్చేసి లిఫ్ట్ లోంచి కాపాడతారు. ఇంత స్పష్టంగా అపాయంలో మాతృత్వం కనపడుతోంటే, ఇంకెవరో హీరో మారడం గురించి కథేమిటి బాక్సాఫీసు వ్యతిరేకంగా? హీరో మారితే ఎవరిక్కావాలి, మారకపోతే ఎవరిక్కావాలి. అతగాడి సొంత జీవితం ఎవరికవసరం.

        గత సంవత్సరం లాక్ డౌన్ లో ఢిల్లీ శివారులో హోటల్ నడవక ముసలాయన ఒకాయన వాపోతూంటే, వీడియో తీసి పోస్ట్ చేశాడొక యూత్. అంతే, అది వైరల్ అయి నిమిషాల్లో వందలాది  యూత్ ఎక్కడెక్కడ్నించో వచ్చేసి, కోలాహలంగా హోటల్లో ఉన్నదంతా తినేసి, గల్లా పెట్టె పట్టనంత డబ్బులు వేసి వెళ్ళారు. యూత్ నెట్వర్క్ ని తక్కువ అంచనా వేయకూడదు. యూత్ తో ఇన్స్పైర్ అయి కథ చేయాలి. సాయం చేయడానికి సెల్ ఫోన్ యూత్ ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటున్న కాలమిది. ఇందుకు దాహరణలు కోకొల్లలు.

        ఈ లిఫ్ట్ కథ కి లాక్ డౌన్ కాలాన్ని నేపథ్యంగా పెట్టారు. అందువల్ల ఆపరేటర్, మెకానిక్ ఎవరూ అందుబాటులో లేనట్టు చూపించారు. ఒకరంటే ఒకరికి పడని ఆ రెండు పాత్రల మధ్య అనవసర ఘర్షణ, అనవసర క్యారక్టర్ ఎనాలిసిస్ లు చూపించారు. ఇదికాదు కావాల్సింది. కావాల్సింది భయాన్ని పోగొట్టే డిజాస్టర్ మేనేజ్ మెంట్. హీరో కొన్ని కాల్స్ చేసి వుంటే, నొప్పులు పడుతున్న ఆమె కోసం  అంబులెన్స్ వస్తుంది, డాక్టర్లు వస్తారు, వైద్య సిబ్బంది, పోలీసులూ వస్తారు, యూత్ సరే, వాళ్ళ హీరోయిజం ఎలాగూ వుంటుంది. ఇలా లాక్ డౌన్లో అందరూ మనతో వుంటారని ధైర్యం చెప్పే నేటి ఆశాజనక కథ కావాలిగానీ, ఎవరో హీరో మంచివాడుగా మారి చివరికి చిటికెడు సాయం చేసిపోయే కాలం చెల్లిన కథ ఎవరిక్కావాలి.

***

        ఎలివేటర్ బేబీ' లో పాలనా వ్యవస్థ మీద విమర్శలు గుప్పించడం వుంటుంది. లిఫ్ట్ కథకి వీటితో సంబంధమేమిటాని సినిమా మీద ఒక నైజేరియన్ రివ్యూ చదివితే విషయం అర్ధమైంది. నైజేరియూలో పాలనా వ్యవస్థ ఎలా వుంటుందో ఆ రివ్యూకర్త రాసుకొచ్చాడు. అక్కడ ఏ శాఖా ఏదీ పట్టించుకోదు. రోడ్లు, కరెంటు, నీరు వంటి మౌలిక సదుపాయాలు  అడ్డగోలుగా వుంటాయి. ఏ శాఖ వాడూ దేన్నీపట్టించుకోడు. రిపేరుకు రమ్మంటే ఏడాది కొస్తాడు. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కడో టిఫిను తింటూ వుంటాడు. కరెంటు పోతే, పోతే పోయిందను కుంటాడు. ప్రజలకి నానా ఇక్కట్లు, టెన్షన్. ఇలాటి పాలనా యంత్రాంగం వల్లే కథలో లిఫ్ట్ లో ఇరుక్కుని నానా పాట్లు పడ్డారన్న మాట. నైజేరియన్ లిఫ్ట్ కథకి ఇదీ నేపథ్యం. సహజ నేపథ్యం. అందుకని లిఫ్ట్ లో ఇందుకు తగ్గట్టు టెన్షన్ తో కూడిన వ్యవస్థ బాధిత డ్రామా. నైజేరియన్ దర్శకులు అక్కడి పాలనా యంత్రాంగం ప్రస్తావన లేకుండా సినిమాలు తీయలేరని రివ్యూలో రాసుకొచ్చాడు.

         తెలుగు రీమేక్ కథకి ఈ నేపథ్యం వుండే అవకాశం లేదు. మన పాలనా యంత్రాంగం లంచాలతో దివ్యంగానే నడుస్తూ వుంటుంది. దీనికి లాక్ డౌన్ నేపథ్యంతో చెక్  పెట్టి, బైటి సాయాన్ని మూసేసి కథ నడిపారు. ఇది బెడిసికొట్టింది. సెల్ ఫోన్ చేతిలో వున్న హీరో అలా వూరికే కూర్చోడు. లాక్ డౌన్ అంటే పరస్పరం సహించుకోవడమని ఉజ్వలమైన కథ నడిపించగలడు యూత్ నెట్వర్క్ తో, పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ.  

***

      ఈ కథ డిజాస్టర్ జానర్ మూవీ కథగా వుండాల్సింది. టవరింగ్ ఇన్ఫెర్నో, ది డే ఆఫ్టర్ టుమారో, ఇండిపెండెన్స్ డే, ట్విస్టర్, కంటేజియన్... ఇలా ఏ డిజాస్టర్ మూవీ తీసుకున్నా ఒకే టెంప్లెట్లో వుంటాయి. ఈ టెంప్లెట్ ని మార్చి ఇంకో విధంగా చేయలేరు. ముందుగా పాత్రల ప్రశాంత జీవితాలు, వాటి కలలు, ప్రమాద సూచనలు, ప్రమాదం, కలల భగ్నం, ప్రాణాల కోసం ప్రమాదంతో పోరాటం, విజయం, తిరిగి ప్రశాంతత... ఈ జానర్ బీట్స్ తోనే వుంటాయి.


        అనసూయ పాత్ర కథగా చేసి ఆమె జీవితం చూపించుకొస్తూ, గర్భంలో వున్న బిడ్డ కోసం కోవిడ్ బారిన పడకుండా ఆమె జాగ్రత్తలు చూపిస్తూ, లాక్ డౌన్ టైమ్ లో తప్పనిసరై హాస్పిటల్ కెళ్ళి లిఫ్ట్ లో ఇరుక్కుని బయటపడే ప్రమాద సూచనలు చూపిస్తూ, ఇంకో చోట హీరోతో భౌతిక దూరం గురించి గొడవపడడం చూపిస్తూ, హీరో ఎవరో చెప్పకుండా ఫ్రెండ్స్ తో కాలక్షేపం చూపిస్తూ, అపార్ట్ మెంట్లో ఆమెనీ హీరోనీ లిఫ్ట్ లో ఇరికించి, ఇప్పుడేమిటి?’ అన్న డ్రమెటిక్ క్వశ్చన్ తో పైన చెప్పుకున్న డిజాస్టర్ మేనేజిమెంట్ రియలిస్టిక్ కథగా  నడపకుండా, ఉపయోగం లేని మూస కథ చేశారు. హీరో ఎవరనేది, అతడి సమస్యలేమిటన్నది చివర్లో చెప్పవచ్చు. దేర్ విల్ బి బ్లడ్ హాలీవుడ్ మూవీలో హీరో ఎవరనేది ఏ తగిన సమయంలో (టైమింగ్), దేంతో ముడిపెట్టి చెబితే కథకి కిక్ వస్తుందో, ఆ తగిన సమయం సెకండాఫ్ లో వరకూ చెప్పలేదు. దీంతో సెకండాఫ్ లో ఇంకో కొత్త కథా లోకం ఆవిష్కృతమైంది. లక్షల మంది కోసం తీసే సినిమా కథ అనేది బహుళ కోణాల్లో ఆలోచించాల్సిన డైనమిక్స్ తో కూడిన కాసుల రూపం.

సికిందర్

 

17, మే 2021, సోమవారం

1038 : రివ్యూ


 రచన - దర్శకత్వం: ప్రవీణ్ కండ్రేగుల
తారాగణం: సందీప్ వారణాసి, వికాస్ వశిష్ట, రాగ్ మయూర్, సింధు, సిరివెన్నెల తదితరులు
సంగీతం : ఎస్. శిరీష్, ప్రవీణ్ రెడ్డి, ఛాయాగ్రహణం : అపూర్వ సాలిగ్రాం, సాగర్
బ్యానర్ డి 2 ఆర్ ఇండీ
నిర్మాతలు: రాజ్ నిడుమోరు, కృష్ణ డికె
విడుదల:  మే 14, 2021, నెట్ ఫ్లిక్స్
***

         ఇండీ ఫిలిం గా సినిమాబండి నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇండీ ఫిలిమ్స్ తో కొత్త దర్శకుల్ని ప్రోత్సహిస్తున్న డి 2 ఆర్ ఇండీ సంస్థ అధినేతలు దీన్ని నిర్మించారు. సహజత్వానికి దగ్గరగా సినిమాని తీసికెళ్ళాలన్న అభిరుచి సినిమా బండి ఆద్యంతం కన్పిస్తుంది. ఇటీవల కంబాలపల్లి కథలు తో ఇదే చూశాం. ఓటీటీలో క్వాలిటీ సినిమాలకి ఢోకాలేదని ఇప్పుడు  సినిమా బండి తో నిరూపించే ప్రయత్నం. అయితే  సినిమా బండి కంటెంట్ కి సంబంధించినంత వరకూ దాదా సాహెబ్ ఫాల్కే లాంటి ప్రయత్నం. కానీ ఈ కొత్త దర్శకుడి ఈ ప్రయత్నంలో కామన్ సెన్సుతో కూడిన వాస్తవికత కూడా వుండాల్సింది. కామన్ సెన్స్ లేకుండా కమర్షియల్ సినిమా కూడా రాణించదు. సెల్ ఫోన్లతో వూరూరా షార్ట్ ఫిలిమ్సే తీసేయడం అందరికీ తెలిసిన విషయమై పోయాక, వీడియో కెమెరాని అదేదో దివినుంచి వూడిపడిన దివ్యవరంగా ఆశ్చర్యపడి, దాంతో సినిమా తీయాలన్న అమాయకత్వాన్ని ప్రదర్శించడం ఈ కథలో కన్విన్సింగ్ వుందా ఆలోచించాల్సిన విషయం.

        మేకింగ్ సంగతి తర్వాత, ముందు రైటింగ్ ఎంత ముఖ్యమో ఇప్పుడు కూడా మైథిలీ ఇండీ ఫిలిం గమక్ ఘర్, నాగమీస్ ఇండీ ఫిలిం నానా -ఏ టేల్ ఆఫ్ అజ్ నిరూపిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధిస్తున్నాయి. ఇంటలిజెంట్ రైటింగే ఇండీ ఫిలిమ్స్ కి ప్రాణం. సినిమా బండి లాంటిదే కన్నడలో తీసిన పల్లెటూరి ఫన్నీ కథ తిధి, కొత్త దర్శకుడి ఇంటలిజెంట్ రైటింగ్ తో, త్రీ యాక్ట్ స్ట్రక్చర్ స్క్రీన్ ప్లేతో, 20 వరకూ జాతీయ, అవార్డులతో పేరుకి పేరూ డబ్బుకి డబ్బూ సంపాదించుకుంది. దేశంలో 30 కి పైగా ప్రాంతీయ భాషల్లో ఇండీ ఫిలిమ్స్ తీస్తూ జాతీయ, అంతర్జాతీయ దృష్టిని నాకర్షిస్తున్నారు. ఒక్క తెలుగులోనే తెలుగు మూస సినిమాల ప్రభావం నుంచి బయటికి రాలేక, ఇండీ ఫిలిమ్స్ మార్కెట్ యాస్పెక్ట్ ని లోకల్ గానే  తక్కువ చేసి చూస్తున్నారు. సినిమా బండి కథలో దొరకాల్సింది ఎవరో మర్చిపోయిన ఓ వీడియో కెమెరా కాకుండా, ఎవరో పారేసుకున్న ఆస్కార్ అవార్డు ఫారిన్ లాంగ్వేజీ మూవీ స్థాయి స్క్రిప్టూ, ఆ స్క్రిప్టుతో అమాయక జనం సినిమా తీసేయాలనుకునే వైరల్ ఐడియా అయివుండాల్సింది! వైరల్ ఐడియాల నిచ్చే హయ్యర్ ఇంటలిజెన్స్ ఇలాటి  లో - బడ్జెట్ ఇండీ ఫిలిమ్స్ వీక్షణాసక్తిని శిఖర స్థాయికి పెంచుతాయని గుర్తుంచుకోవాలి. ఇందుకు తెలుగు ఇండీ మేకర్లు ఫారిన్ సినిమాలు మానేసి, ముందు వివిధ ప్రాంతీయ సినిమాలు చూసి వాస్తవ జీవితాల్ని పరిశీలించాల్సిన  అవసరం చాలా వుంది. 

***

      కొత్త దర్శకుడు, అతడి రచయితలూ విషయ పరంగా వాస్తవికతకి దూరంగా వున్నా, దృశ్యపరమైన వాస్తవికతని మాత్రం పోషించారు. చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో వీరబాబు (వికాస్ వశిష్ట) అనే ఆటోడ్రైవర్ వుంటాడు. అతడికి ఓ రోజు ఆటోలో ఎవరో మర్చిపోయిన ఎస్ ఎల్ ఆర్ కెమెరా దొరుకుతుంది. అర్ధంగాక దాన్ని విచిత్రంగా చూసి భార్యకి చూపిస్తే, ఆమే ఆశ్చర్యంగా చూస్తుంది. వూళ్ళో ఒక పెళ్ళిళ్ళ  ఫోటోగ్రాఫర్ గణపతి (సందీప్ వారణాసి) వుంటే అతడికి చూపిస్తాడు. అతనూ దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకోలేక పోతాడు. దాన్ని పదివేలకి అమ్మేసి ఆటో ఫైనాన్స్ తీర్చేయాలనుకుంటాడు వీరబాబు. కానీ టీవీలో చిన్న సినిమాల సక్సెస్ గురించి చూసి, ఆ కెమెరాతో సినిమా తీసి కోట్లు సంపాదించాలని నిశ్చయించుకుంటాడు. గణపతిని కెమెరామాన్ గా నియమించుకుంటాడు. సినిమా తీయడానికి ఒక ముసలి తాత (ముని వెంకటప్ప) రాసిన కథ దొరుకుతుంది. ఈ కథకి హీరోగా బార్బర్ మరిడయ్య (రాగ్ మయూర్) దొరుకుతాడు. హీరోయిన్ గా స్టూడెంట్ దివ్య (త్రిషారా) ని సెలెక్టు చేసుకుంటాడు. ఇక షూటింగ్ ప్రారంభిస్తాడు. ఈ షూటింగ్ మధ్యలో హీరోయిన్ దివ్య ఒకడితో లేచిపోతుంది...ఇప్పుడేం చేయాలో అర్ధం గాక ఇరకాటంలో పడతాడు వీరబాబు...

***
   ఈ కథలో ఇంకా ఆటోలో కెమెరా మర్చిపోయిన సిటీ గర్ల్ సింధు గా సింధూ శ్రీనివాస మూర్తి వుంటుంది. కథకి ఈమే ముగింపు నిస్తుంది. ఈమె క్యారక్టర్ ఎలా వున్నా, నటన బావుంది. ఆటో డ్రైవర్ వీరబాబు భార్య గంగోత్రిగా సిరివెన్నెల యలమందల నటించింది. వీరబాబు ఆటో నడపకుండా సినిమా తీయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఈమె, తర్వాత అర్ధం జేసుకుని సహకరిస్తుంది. వీరబాబు సినిమా మధ్యలో ఆగిపోయాక, ఈమెతో ఒక దృశ్యం మౌన భాష్యం చెబుతుంది. ఇంట్లో వీర బాబు చూస్తూండగా అతడి షర్టు వేసుకుని, తలకి తువ్వాల చుట్టుకుని, ఆమె బయటికెళ్ళే  మాటలు లేని మూకీ దృశ్యం ఆమె కూలి పనికి వెళ్లడానికి సిధ్ధ పడిందని చెప్పకనే చెప్తుంది. ఈ దృశ్యం సినిమా మొత్తం మీద గుర్తుండి పోయే టాప్ సింబాలిక్ దృశ్యం. కానీ ఉండాల్సిన కాన్సెప్ట్ ప్రకారం చూస్తే అర్ధరహితం.

        మొదటి హీరోయిన్ లేచిపోయాక రెండో హీరోయిన్ గా కూరగాయలమ్మే మంగ (వై జి ఉమ) వుంటుంది. ఈమెది కూడా బలమైన స్త్రీ పాత్రే. షూటింగ్ గ్యాప్ లో అక్కడే బుట్ట పెట్టుకుని కూరగాయ లమ్ముతుంది. సొంత జీవితంతో రాజీ పడే ప్రసక్తే లేదు. ఇలాగే లేచిపోయిన మొదటి హీరోయిన్ గా త్రిషారా కి ప్రియుడితో లేచిపోయి సొంత జీవితం చూసుకోవడమే ముఖ్యం. ఇలా ఈ పల్లెటూరి స్త్రీ పాత్రలు ఒక వ్యక్తిత్వంతో కన్పిస్తాయి.

        కథ రాసిన ముసలి తాతగా ముని వెంకటప్పకి మాటలుండవు. షూటింగు ఎలా  జరుగుతోందో గమనిస్తూ వుంటాడు. ఈ తాత క్యారక్టర్ తీరు కన్నడ తిధి లో తాత క్యారక్టర్ లా వుంటుంది. కథ వేరు. తాత రాసిన ప్రేమ కథ పేరు తాత రాసిన టైటానిక్ అని చివర్లో రివీల్ చేయడం బావుంది. దీన్నే సినిమా టైటిల్ గా పెట్టి వుండాల్సింది. 

     ఆటో డ్రైవర్ గా, సినిమా దర్శకుడుగా వీరబాబుగా వికాస్ వశిష్టది పూర్తిగా అమాయకత్వంతో కూడిన పాత్రే, నటనే. ఎంత బాగా పాత్రలో లీనమైపోయినా ఆ అమాయకత్వం ఒప్పించేలా వుండదు. ఇలా సినిమా తీసి కోట్లు గడించాలన్న అన్ రియలిస్టిక్ గోల్ ని వూళ్ళో అందరూ నమ్మడం ఇంకో ఇబ్బంది పెట్టే విషయం. ఆ కోట్ల డబ్బుతో(!) వూళ్ళో రోడ్డు, కరెంటు, నీటి సౌకర్యాలు కల్పించాలన్న కలలు మరీ చోద్యంగా వుంటాయి.

        అతడి నైతిక విలువలు కూడా ప్రశ్నార్ధకమే. ఎక్కడో ఒకరిద్దరు ఆటో డ్రైవర్లు దుర్బుద్ధితో వుంటారేమో గానీ, సర్వసాధారణంగా తమ ఆటోలో ప్రయాణికులు మర్చిపోయిన వస్తువుల్ని వీలుంటే వాళ్ళకి అందించే ప్రయత్నం చేయడమో, లేకపోతే పోలీసులకి అప్పజెప్పడమో చేస్తారు. వీర బాబు ఇవేమీ చెయ్యక, దాన్ని అమ్మేసి ఆటో మీద అప్పు తీర్చేయాలనుకుంటాడు. తర్వాత దాంతో సినిమా తీసి కోట్లు గడించాలనుకుంటాడు. ఆ కెమెరాలో దాని ఓనర్ సింధు తాలూకు వీడియోల్లో ఆమె కన్పిస్తున్నా గుర్తు పట్టనట్టే వుంటాడు. చివరికి ఆమె వెతుక్కుంటూ వచ్చాక సారీ కూడా చెప్పడు. ఇలా ఈ ప్రధాన పాత్ర చిత్రణ విలువలు లేకుండా దుర్బుద్ధితో కన్పిస్తుంది.

    కెమెరా కోసం ఆమె పోలీసుల చుట్టూ, వూళ్ళ చుట్టూ తిరుగుతూ వుంటుంది. ఆస్ట్రేలియా నుంచి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలని వచ్చిన ఆమె, కారు వదిలేసి ఆటో ఎందుకు ఎక్కిందో తెలీదు. ఆటో ఎక్కినట్టు కూడా ఆమెకి గుర్తుండదు.

        హీరోగా రాగ్ మయూర్ ఫన్నీగా నటించాడు. కెమెరామాన్ గా సందీప్ వారణాసి ఒక్క బండి కాడె మీద కూర్చుని క్రేన్ షాట్ తీయడం తప్ప, వేరే స్కిల్స్ కెమెరాతో ప్రదర్శించడు. అసిస్టెంట్ గా బాలనటుడు రాంచరణ్ ఎంట్రీ ఫన్నీ.

        శిరీష్, ప్రవీణ్ రెడ్డి ల సంగీతంలో వ్యంగ్యంగా చేసిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ బావున్నాయి. అపూర్వ సాలిగ్రాం, సాగర్ ల ఛాయాగ్రహణం సహజత్వంతో కూడుకుని వుంది. కమర్షియల్ సినిమాల్లో చూపించని అసలైన గ్రామీణులు, వాళ్ళ జీవితాలూ ఎలా వుంటాయో కేరాఫ్ కంచర పాలెం’, కంబాలపల్లి కథలు’, ఇప్పుడు సినిమా బండి తెర కెక్కించడం మంచి పరిణామమే.

***

      రైటింగ్ సైడ్ కొత్త టాలెంట్ కన్పిస్తుంది. స్క్రీన్ ప్లే ప్రవీణ్ కండ్రేగుల, వసంత్ మరింగంటి, కృష్ణ ప్రత్యూష అయితే; మాటలు వసంత్ మరింగంటి. పోతే నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డికె లు కూడా దర్శకులే కాబట్టి, రచయితలే కాబట్టి, స్క్రిప్టులో వాళ్ళ ఆలోచనలు కూడా వుండి వుంటాయి. ఇది ఇంటలిజెంట్ స్క్రిప్టు కాకపోయినా మూసలో పడని క్వాలిటీ రైటింగ్ గా మాత్రం కన్పిస్తోంది కొన్ని లోపాలతో. ఇది దృశ్యాల వరకూ. ఇక కన్సెప్ట్ పరంగా చూస్తే ఇండీ ఫిలిం డిమాండ్ చేసే ఇంటలిజెన్స్ కనిపించడం లేదు.

        ముందుగా చెప్పుకున్నట్టు ఈ కథ సెల్ ఫోన్లు లేని కాలంలో నైతే వీడియో కెమెరాతో సినిమా తీసే ఆలోచనకి అద్భుతంగా వుండేది. సెల్ ఫోన్లు వచ్చాక ఎవరుపడితే వాళ్ళు షార్ట్ ఫిలిమ్సే తీసేస్తున్నాక, సినిమాకున్న గ్లామర్ పలచ బడ్డాక, ఈ కాలంలో వీడియో కెమెరా అద్భుతమని సినిమా తీయాలనుకోవడంలో సమకాలీనత లేదు. కంబాలపల్లి కథలు లో కంప్యూటర్ తో 2005 నాటి పీరియడ్ కథగా తీసినప్పుడు దానికి కాలీన స్పృహ వుంది. అప్పుడప్పుడే గ్రామాల్లోకి కంప్యూటర్లు, ఇంటర్నెట్ లు వస్తున్నాయి కాబట్టి ఆ క్రేజ్ పాత్రల్లో కనిపించడంలో సహజత్వముంది. సినిమా బండి లో పాత్రలకి వీడియో కెమెరాతో ఈ కాలంలో అంత వండర్ అనుకోవడం కాన్సెప్ట్ కి వైరల్ ఐడియా మాత్రం కాదు. ఒక పాసివ్ ఐడియా మాత్రమే. వైరల్ ఐడియా కావాలంటే పైనే చెప్పుకున్నట్టు, ఈ అమాయక పాత్రలకి ఎవరో పారేసుకున్న ఆస్కార్ లెవెల్ స్క్రిప్టు  దొరకడమే!  కోతికి కొబ్బరి కాయ దొరకాలి గానీ జామకాయ కాదు.

        వీడియో కెమెరాతో సినిమా తీసి కోట్లు సంపాదించి వూరుని బాగుచేయాలన్న హీరో గోల్ లో కూడా బలం, వాస్తవికత లేవు. ఇది కంబాలపల్లి కథలు లో రెండు కోట్ల ఫేక్ లాటరీతో కథలాంటి టెంప్లెట్ ఫార్ములా. జానర్ మర్యాద కాదు.

        స్క్రీన్ ప్లే మాత్రం త్రీయాక్ట్స్ ప్రమాణాలతో వుంది. ఫస్టాఫ్ లో మొదటి పావుగంటలో దొరికిన కెమెరాతో సినిమా తీయాలనుకునే గోల్ తో ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. సెకండావ్ చివర్లో అదే కెమెరా ధ్వంసమయ్యే ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. పరస్పర విరుద్ధంగా ఇవి మంచి డైనమిక్స్ తో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని నిలబెట్టాయి. ఇలాటి డైనమిక్సే హీరోయిన్ లేచిపోయి షూటింగు ఆగిపోవడం, తర్వాత షూటింగులో హీరో ఎక్కిన రైలు భువనేశ్వర్ దాకా వెళ్లిపోవడం మొదలైనవి. గోల్ కి అవరోధాలు కల్పించే ప్రత్యర్ధి పాత్ర లేకపోవడం షూటింగులోనే ఆటంకాలేర్పడ్డం మిడిల్ యాక్షన్ - రియాక్షన్ బిజినెస్ ని పోషించాయి. కథ హాస్యప్రధానంగా వున్నా, ఆటంకాలేర్పడ్డప్పుడు ఈ హాస్య ధోరణి వుండదు. డబ్బు సంపాదించడం గోల్ కాబట్టి శాడ్ మూడ్ లోకి జారుకోవడం. ఇదంతా సరైన కాన్సెప్ట్ లేకపోవడం వల్లే.  

        ఒక సరదాగానో, వ్యామోహంగానో, ఫాషన్ తోనో సినిమా తీయడం వరకే గోల్ గా కాన్సెప్ట్ వుండి వుంటే ఈ కథతో అంత ఇబ్బంది వుండేది కాదు. సినిమాతో కోట్లు గడించి బాగుపడాలన్న గోల్ వల్ల కథ కామన్సెన్సుని, వాస్తవికతనీ, అమాయక పాత్రల ఇన్నోసెన్స్ నీ కోల్పోయింది. భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ గా 2009 లో తీసిన, ఆస్కార్ ఎంట్రీ సంపాదించిన, మరాఠీ క్లాసిక్ హరిశ్చంద్రాచీ ఫ్యాక్టరీ లో ఫాల్కే పాత్రకి ఆర్ధిక ఇబ్బందులున్నా సినిమా తీసి డబ్బు సంపాదించాలన్న కోరిక మాత్రం అస్సలు వుండదు. కేవలం తెర మీద బ్రిటిష్ వాళ్ళు వేసిన సినిమా చూసి, ఆ కదిలే బొమ్మలకి వండరై పోయి, అలాటిది తనూ తీయాలని కేవలం వ్యామోహం పెంచుకుంటాడు.  
   
        ఇంటిల్లిపాదీ ఆ సినిమా తీయడంలో పాలు పంచుకుంటారు. చాలా హాస్య పాత్రలు, హాస్యమైన సన్నివేశాలు. కష్టాలు కూడా హాస్యమే. ఎక్కడా శాడ్ మూడ్ వుండదు. దేశంలో మొట్ట మొదటి సినిమా తీయడానికది ఏ సౌకర్యాలూ లేని కాలం, నటులు కూడా దొరకని కాలం. అలాటి కాలంలో సినిమా పట్ల కేవలం - కేవలం వ్యామోహంతో - సర్వం అమ్ముకుని, 1913 లో రాజా హరిశ్చంద్ర తీసి చరితార్ధుడయ్యాడు దాదా ఫాల్కే. వీరబాబులో ఈ వ్యామోహం లోపించి స్వార్ధం చోటు చేసుకోవడంతో మేకర్స్ తలపోసిన కాన్సెప్ట్ విఫలమైంది.

సికిందర్