రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, ఫిబ్రవరి 2018, మంగళవారం

611 : స్పెషల్ ఆర్టికల్



   ఇది ఇన్పుట్స్ ప్రపంచం.  ఎందుకు ఇన్ పుట్స్ ప్రపంచం? ఇవ్వాళ  ప్రపంచం అందరికీ తెలిసిపోతోంది. ఎలా తెలిసిపోతోంది? అరచేతిలో స్మార్ట్స్ ఫోన్ల ద్వారా కూడా తెలిసిపోతోంది. ఐతే ఏం చేయాలి? సినిమా రచయిత గ్లోబలీకరణ చెందాలి. ఏ సినిమా రచయిత గ్లోబలీకరణ చెందాలి? హాలీవుడ్ నుంచీ టాలీవుడ్ దాకా, ఇంకేమైనా వుంటే మూసీ పక్కన వుండే డెక్కన్ వుడ్ దాకా అందరూ గ్లోబలీకరణ చెందాలి. చెందకపోతే  ఏమవుతుంది? కాలం కంటే,  ప్రేక్షకులకంటే వెనుక బడితాయి స్క్రిప్టులు. తుపాకీ రాముడికైనా ప్రపంచజ్ఞానముంటుంది. వాడి వ్యాఖ్యానాల కంటే అన్యాయంగా కనపడతాయి స్క్రిప్టులు. అట్టర్ ఫ్లాపయిన భారీ జవాన్, ఆక్సిజన్, టచ్ చేసి చూడు లాంటి  అవే మూస కథలు అలాగే రాస్తారు. నాల్గు మూస సినిమాలు చూసి ఒక మూస కథ  అల్లే పాత మేస్త్రీలుగా  మిగిలిపోతారు...

        మూస ఎందుకు పనికిరాదు? ప్రపంచం మూసుకుని వున్న రోజుల్లో అవతలి విషయాలు తెలిసేవి కావు ప్రేక్షకులకి. అప్పుడా వచ్చే ఫార్ములా కథలు, మూస పాత్రలు, కృత్రిమ చిత్రీకరణలూ వాళ్ళ వినోదానికి సరిపోయేవి. ఇప్పుడు ప్రపంచం తెర్చుకున్నాక ఎన్నో కొత్త కొత్త విషయాలు – వాస్తవంగా ప్రపంచం అబ్బురపరుస్తున్న విధమూ  ఎప్పుటికప్పుడు తెలిసిపోతున్నాయి. వీటి ముందు ప్రపంచంలోకి చూడని ఫార్ములా కథలు, మూస  పాత్రలు, కృత్రిమ చిత్రీకరణలూ వెలవెలబోతున్నాయి. ఇప్పటి సినిమా రచయిత / దర్శకుడు ఇది గ్రహించక, సినిమా అంటే ఇంకా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,  వెంకటేష్ సినిమాలే, కథలే, పాత్రలే అనుకుంటూ వాటి వైపే చూస్తూ, వాటిలోంచే తీస్తూ, తరం మారిన ప్రేక్షకులకి దూరంగా దయనీయంగా మిగిలిపోతున్నాడు. 

          సొంత వూహలతో, ఆ వూహల్నికూడా పాత సినిమాలతో ధృవీకరించుకుని, ఇవ్వాళ  తోచిందల్లా స్క్రిప్టులు రాసుకునే కాలం కాదు. బయటి ప్రపంచంలోకి చూస్తేనే గానీ  ఇవ్వాళ్టి ప్రపంచంతో సంబంధం ముండే కాలీన స్క్రిప్టులు రాని అగత్యమేర్పడింది. ఒకప్పుడు హాలీవుడ్ లో క్రిమినల్స్ , గ్యాంగ్ స్టర్స్ సినిమాలు రాయాలంటే అలాటి పాత సినిమాలవైపే చూసి రా సేవారు. ఇలా పాత సినిమాలని చూసి కాదని, ఇవ్వాళ్టి ప్రపంచపు రియలిస్టిక్ క్రిమినల్, గ్యాంగ్ స్టర్ పాత్రలతో రాయాలని వొత్తిడి వచ్చినప్పుడు.....ఆ జానర్ సినిమాల్లో కొత్తదనం ప్రారంభమయింది. 

          ఐడియాలు కొత్తగా రావడం లేదని కాదు. వాటికి కొత్త కథనాలే  రావడంలేదు. కొత్త ఐడియాలకే కాదు, ఎలాటి ఐడియాల కైనా కొత్త కథనాలు రావాలంటే ఇప్పుడు ఇన్పుట్స్ చాలా అవసరం. ఇన్పుట్స్ కి మొట్ట మొదట చూడాల్సింది ఇవ్వాళ్టి మార్కెట్ యాస్పెక్ట్ నే తప్ప, అప్పుడే క్రియేటివ్ యాస్పెక్ట్ కాదు. ఫలానా ఈ ఐడియాకి నేటి మార్కెట్ కి తగ్గట్టు ఏఏ అంశాలని దృష్టిలో పెట్టుకోవాలో నిర్ణయించినప్పుడే అలాటి ఇన్పుట్స్ తీసుకోవాలి. సినిమా కథంటే మొదట మార్కెట్టే, ఆ తర్వాతే  క్రియేటివిటీ. 

          ఈ ఇన్పుట్స్ తీసుకోవడానికి కమర్షియల్ దృక్పథం వుండాలి. కమర్షియల్ సినిమాలు కాకుండా వాస్తవిక, సమాంతర సినిమాలే రాయాలనుకుంటే కమర్షియల్ ఇన్పుట్స్ తీసుకోకూడదు. ఆ వాస్తవిక దృక్పథంతో అలాటి వార్తల్లోంచో సినిమాల్లోంచో ఇన్పుట్స్  తీసుకోవాలి. ఇవ్వాళ్ళ తెలంగాణాలో  ఔత్సాహిక దర్శకులు విపరీతంగా దూసుకొచ్చేస్తున్నారు.  వీళ్ళు ఒక దగ్గరే ఆగిపోతున్నారు. కానీ అక్కడ ఆగిపోవడానికి తెలంగాణాలో ఇంకా బి.  నరసింగ రావు, గౌతం ఘోష్ సినిమాల కాలం కాదు.  తెలంగాణా ఉద్యమకాలంలోనే ఉద్యమ సినిమా లెవరూ చూడలేదు. తరం మారింది. తెలంగాణాలో కూడా ఈ తరానికి ఎకనమిక్స్, లేదా రోమాంటిక్స్ వుండే ఎంటర్ టైనర్లు కావాలి. 

          కానీ తెలంగాణా వైపు నుంచి వచ్చే ఔత్సాహిక దర్శకులు షార్ట్ ఫిలిమ్సో, వరల్డ్ మూవీసో అంటూ మోజు పెంచుకుంటున్నారు. దీనికి కమర్షియల్ సినిమాల ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేదు. ఈ ఇన్పుట్స్ కమర్షియల్ సినిమాలు తీయడానికి ఏమాత్రం పనికి రావు. టాలీవుడ్ వరల్డ్ మూవీస్ ఉత్పత్తి చెయ్యదు. ప్రధాన స్రవంతి కమర్షియల్ సినిమాలే ఉత్పత్తి చేస్తుంది. తెలంగాణా నుంచి టాప్ డైరెక్టర్లు చాలా మందే వున్నారు. సురేంద్ర రెడ్డి, హరీష్ శంకర్, దశరథ్, వంశీ పైడిపల్లి, సంపత్ నంది, ఎన్. శంకర్, సందీప్ రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్, హను రాఘవ 
పూడి వీళ్ళంతా వరల్డ్ మూవీస్ చూసి కమర్షియల్ డైరెక్టర్లు కాలేదు. ఇద్దరు ముగ్గురు షార్ట్ ఫిలిమ్స్ తీసి వచ్చారు తప్ప, మిగిలిన వాళ్ళందరూ కమర్షియల్ సినిమాలకి పనిచేసి వచ్చిన వాళ్ళే. తెలంగాణా నుంచి ఇంకో రాబోతున్న దర్శకుడు  వేణు ఊడుగుల కూడా కమర్షియల్ దర్శకుల దగ్గర పనిచేసిన వాడే.   ఇప్పుడు తెలంగాణా ఔత్సాహిక దర్శకులకి తాము  కూడా ఇలా  టాప్ దర్శకులవ్వాలనే కలలుంటే,  అవి వరల్డ్ మూవీస్ ఇన్పుట్స్ తో నేరవేరవు. అలాగని తెలంగాణా జీవితపు వాస్తవిక కథా చిత్రాలు తీయాలనుకుంటే వరల్డ్ మూవీస్  అధ్యయనం చేసుకోవచ్చు. కానీ అలాటి తెలంగాణా జీవితపు వాస్తవిక కథా  చిత్రాలకి ఇప్పుడు మార్కెట్ ఎక్కడిది? పైన చెప్పుకున్నట్టు ఎకనమిక్స్ లేదా రోమాంటిక్సే. ఈ ఔత్సాహిక దర్శకులు టాప్ తెలంగాణా దర్శకుల్లాగా ఎదగాలనుకుంటే అది మంచి ఆలోచనే. అప్పుడేం చేయాలంటే, ఇదే బ్లాగులోనే  కొన్ని వ్యాసాల్లో రాసినట్టు,  వరల్డ్ మూవీస్ కి ధడాలున తలుపులు మూసి పారేసి,  హాలీవుడ్ మూవీస్ మాత్రమే చూసుకోవాలి. ఆ ఇన్పుట్స్  మాత్రమే తీసుకోవాలి. 

          ఇక్కడ కూడా తప్పులో కాలేసే వీలుంది. మళ్ళీ హాలీవుడ్ సినిమాలనగానే కొందరు పాత మేధావులకి అదే ‘క్లాసాబ్లాంకా’, అదే ‘రోమన్ హాలిడే’, అదే ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ లే తప్ప,  ఇక హాలీవుడ్డే  లేదన్నట్టు వుంటారు. నేటి తెలుగు సినిమాలతో సంబంధం లేని వీళ్ళ రికమెండేషన్ల కి, ఉపన్యాసాలకి దూరంగా వుంటూ, గత ఇరవై ఏళ్లుగా వస్తున్న హాలీవుడ్ సినిమాలని ఇన్పుట్స్ గా తీసుకుంటే ప్రయోజన ముంటుంది.

          ఎందుకు హాలీవుడ్ ని తీసుకోవాలంటే, అవి కమర్షియల్ సినిమాల త్రీయాక్ట్  స్ట్రక్చర్ లో వుంటాయి. వరల్డ్ మూవీస్ కి,  ఆ మాటకొస్తే ఒకప్పుడు వచ్చిన భారతీయ కళాత్మక సినిమాలకీ స్ట్రక్చర్ అనేది వుండదు. స్ట్రక్చర్ అంటే స్క్రీన్ ప్లేలో బిగినింగ్ - మిడిల్ - ఎండ్ లు. స్ట్రక్చర్  లేకపోవడమంటే మిడిల్ లేకపోవడం. అంతే గాక ప్రధాన పాత్రలు యాక్టివ్ పాత్రలుగా వుండవు, పాసివ్ గా వుంటాయి. ఇంకా చెప్పుకుంటే,  ప్రధాన పాత్ర కథ నడపదు, కథే ప్రధాన పాత్రని నడుపుతుంది. ఇన్ని వరల్డ్ సినిమాలు చూస్తున్న వాళ్ళు ఈ పాటికి ఈ సాంకేతిక తేడాలు గమనించే వుండాలి. మిడిల్ మిస్సయిన సినిమా కమర్షియల్ గా ఆడదు. వరల్డ్ మూవీస్ కీ, కమర్షియల్ సినిమాలకీ సాంకేతికంగా ఈ తేడా తెలిసిన తెలుగు ఔత్సాహిక దర్శకుడు / రచయిత ఛస్తే వరల్డ్ మూవీస్ చూడడు. ఈ వ్యాసకర్త కూడా వాటి జోలికి పోవడం లేదు.

          తెలంగాణా ఔత్సాహిక దర్శకుల ఇన్పుట్స్ విశేషాలు చెప్పుకున్నాక, అసలు ఇన్పుట్స్  అంటే ఏమిటి? సినిమాలేనా? ఇంకా ఏమైనా వున్నాయా?  ఇది రేపు తెలుసుకుందాం...


సికిందర్ 

24, ఫిబ్రవరి 2018, శనివారం

‘610 : 'పాలపిట్ట’ జనవరి సంచిక ఆర్టికల్


         1975 - ‘దీవార్’ అతడి కళా జీవితానికి నిర్వచనమిచ్చింది. కళ కన్నతల్లే. దాంతో వ్యాపారం చేస్తే సరస్వతి కాలేపోవచ్చునేమో గానీ లక్ష్మి కాకుండాపోదు. ‘దీవార్’ లో అమితాబ్ బచ్చన్ ‘నా దగ్గర బంగళాలున్నాయి, కార్లున్నాయి, నీ దగ్గరేముంది?’ అన్నప్పుడు, ‘మేరే పాస్ మా హై’  అని శశికపూర్ పలికిన అజరామరమైన డైలాగుకి ఇప్పటికీ చప్పట్లు పడతాయి. ఆ ‘మా’ కేవలం భౌతికంగా కన్పించే అమ్మేనా? అమ్మలాంటి కళ కాదా? నీ దగ్గర కమర్షియల్ సినిమాలతో లక్ష్మి వుంటే, నా దగ్గర కళాత్మక సినిమాలతో సరస్వతి లాంటి అమ్మ కూడా వుందని చెప్పడం కాదా? ఒకవైపు కళాత్మక సినిమాలతో తను చేస్తున్న సేవని అలా క్లెయిమ్ చేసుకుంటున్నట్టే కన్పిస్తాడు శశికపూర్ ఆ క్లాసిక్ దృశ్యంలో.
          ళాత్మక సినిమాలేకాదు, నాటకరంగం కూడా. ఏకకాలంలో కళాత్మక వ్యాపారాత్మక సినిమాలతోబాటు నాటకరంగాన్నీ చిత్తశుద్ధితో పోషించిన త్రివిధ దళాధిపతి అతను. బాలీవుడ్ లో ఉద్భవించిన మొట్ట మొదటి క్రాసోవర్ స్టార్ తనే. ఆర్టు సినిమాలకి కాలం చెల్లాక, వాటికి  కొత్త జవసత్వాలు చేకూర్చడానికి, శ్యాం బెనెగళ్  మొట్టమొదటి సారిగా కరిష్మా కపూర్, మనోజ్ బాజ్ బాయ్, అమ్రిష్ పురి లవంటి బాలీవుడ్ స్టార్స్ తో రాజీపడి, 2001లో ‘జుబేదా’ తీశారు. అలా  బాలీవుడ్ స్టార్స్ క్రాసోవర్ చేసి ఆర్ట్ సినిమాల్లో నటించే ఒరవడి ప్రారంభమయ్యింది. కానీ దీనికంటే దశాబ్దాల నాడే శశి కపూర్ తొలి క్రాసోవర్ స్టార్ గా ప్రయోగాత్మక కళా జీవితానికి నాంది పలికాడు. అందులో ఒకటి శ్యాం బెనెగళ్  తీసిన జునూన్ (1978) కూడా వుంది. ఒకవైపు రోమాంటిక్ హీరోగా కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, తనలోని నిజమైన కళాకారుణ్ణి చాటుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్నీ ఆర్ట్ సినిమాలతో వదులుకోలేదు.  సర్వసాధారణంగా ఏ భాషా స్టార్లు అయినా తమ వైభవం తరిగిపోయాకే, ఇతర తావుల కేసి చూస్తారు. 

      కానీ శశికపూర్ అలా విశ్రాంత నటుడయ్యాకే కళాత్మక సినిమాలవైపు రాలేదు. రో మాంటిక్ స్టార్ గా, డాషింగ్ హీరోగా విస్తృత ప్రేక్షక లోకాన్ని అలరిస్తూనే, ‘ఉత్సవ్’ (1984), లాంటి  ఆర్ట్ సినిమాలో విలన్ గా, ‘విజేత’ (1984) అనే కళాత్మకంలో వయసు మళ్ళిన తండ్రిగా ... అలా అలా ఎన్నో కమర్షియలేతర పాత్రలు పోషించుకుంటూ పోయాడు. చాలామంది స్టార్లకి లాగే తనకి ఇమేజి అన్న భయమే లేదు. చలనచిత్రాల్లో నటుడిగా పాదం మోపడమే బాలనటుడిగా అన్నగారు విఖ్యాత రాజ్ కపూర్ పాత్రలకి చిన్ననాటి వెర్షన్స్  నటిస్తూ, ‘ఆగ్’ (1948), ‘సంగం’ (1950), ‘ఆవారా’ (1951) లతో వెండితెర వేల్పు అవడానికి శ్రీకారం చుట్టాడు. హీరోగా నటించిన మొదటి చలనచిత్రం చూస్తే  అది వినోదాత్మకం ఏమీ కాదు. 1961 లో యశ్ చోప్రా నిర్మించిన ‘ధర్మపుత్ర’ హీరోగా  శశి మొదటి చలనచిత్రమైతే, అది దేశ విభజనకి సంబంధించిన  విషమ  సమస్యతో కూడుకున్నది. ముస్లిములకు పుట్టి, హిందూ కరుడుగట్టిన స్నేహితులతో కలిసి పెరిగి, కాషాయదళంలో చేరే సంచలనాత్మక పాత్ర పోషించాడు. 

          ఆ వెంటనే బిమల్ రాయ్ దర్శకత్వంలో ‘ప్రేమ్ పత్ర’ (1962) లో రోమాంటిక్ హీరోగా నటించాడు గ్లామర్ హీరోయిన్ సాధనతో కలిసి.  దీని వెంటనే జేమ్స్ ఐవరీ దర్శకత్వంలో ఇస్మాయిల్ మర్చంట్  నిర్మించిన ‘హౌస్ హోల్డర్’ అనే ఇంగ్లీషు చిత్రంలో నటించేశాడు. దీన్నిబట్టి ఏమనుకోవాలి? 1961 లో ‘ధర్మపుత్ర’ తో సీరియస్ హీరోగా ప్రారంభమై, 1962 లో ‘ప్రేమ్ పత్ర’ తో రోమాంటిక్ హీరోగా, మళ్ళీ 1962 లోనే ‘హౌస్ హోల్డర్’ ఇంగ్లీషుతో వివాహితుడైన టీచర్ గా వాస్తవిక పాత్రగా వెంటవెంటనే దశ, దిశా మార్చుకుంటూ ప్రస్థానం సాగించే నటుడింకెవరైనా వున్నారా? 


       నాటకాలు, కళాత్మక వ్యాపారాత్మక సినిమాలే గాక, హిందీ చలనచిత్ర రంగం నుంచి  తొలి అంతర్జాతీయ నటుడిగానూ గుర్తింపు పొందిన ఘనత సాధించాడు. ‘హౌస్ హోల్డర్’ తర్వాత ‘షేక్స్ పియర్ వాలా’ (1965), ‘ప్రెట్టీ పాలీ’ (1967), ‘బాంబే టాకీ’ (1970), ‘సిద్ధార్థ’ (1972), ‘హీట్ అండ్ డస్ట్’ (1982), ‘సాలీ అండ్ రోజ్  గెట్ లేయిడ్’ (1986), ‘ది డిసీవర్స్’ (1988), ‘సైడ్ స్ట్రీట్స్’ (1996) మొదలైన ఎనిమిది అంతర్జాతీయ సినిమాల్లో నటిస్తూ తన ఎల్లలు చాటుకున్నాడు. 

          సినిమాల్లో బాల నటుడిగా ప్రవేశానికి ముందే నాటక రంగంలో అనుభవం సంపాదించాడు. తండ్రి, నట దిగ్గజం పృథ్వీరాజ్ కపూర్ స్థాపించిన రంగస్థల నాటక కంపెనీ, ‘పృథ్వీ థియేటర్స్’ వేసే నాటకాల్లో చిన్నప్పుడే వేషాలు వేసేవాడు. ఆ నాటక కంపెనీనే తనతో పాటు సమానంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. నాటక సంస్థలు ఇంకా పాత  అంబాసిడర్, ఫియెట్ కార్లలాగే ఎందుకుండాలని ప్రశ్నించేవాడు. ఇక పృథ్వీ థియేటర్ ని మెర్సిడెస్, షెవర్లెట్ ల వంటి ఆధునిక కార్ల లాగా ఆధునీకీకరణ చేస్తూ, అత్యాధునిక సౌకర్యాలతో అమోఘంగా తీర్చిదిద్దాడు. 



      పెద్దన్న రాజ్ కపూర్ భారతీయ సినిమాకి ఒక దిక్సూచిలా ప్రఖ్యాతుడయ్యాడు. చిన్నన్న షమ్మీ కపూర్ ఫక్తు రోమాంటిక్ సినిమాలకి చిరునామాగా పాపులర్ అయ్యాడు. తను రోమాంటిక్ తో బాటు రియలిస్టిక్ సినిమాలకి పెట్టింది పేరయ్యాడు. అప్పటికి దిలీప్ కుమార్, దేవానంద్, అశోక్ కుమార్ లవంటి హేమాహీమీలు హిందీ సినిమాలని ఏలుతున్నారు. వాళ్ళతో సమానంగా తనూ ప్రేక్షక హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. శశికపూర్ రోమాంటిక్ సినిమాలు, ఆర్ట్ సినిమాలు, అంతర్జాతీయ సినిమాలు, మరోవైపు నాటకాలూ చేస్తూ  సోలోగా కొనసాగుతున్న కాలంలో కూడా,  తోటి స్టార్లతో కలిసి నటించడానికి వెనుకాడలేదు. అమితాబ్ బచ్చన్ తో, నసీరుద్దీన్ షాతో కలిసి నటించిన సినిమాల్లో తను సెకెండ్ హీరోయేనన్న నిమ్న భావానికి కూడా లోను కాలేదు. 

          అమితాబ్ తో దీవార్, త్రిశూల్, కభీ కభీ, సిల్సిలా, నమక్ హలాల్, దో ఔర్ దో పాంచ్,  కాలా పత్తర్, షాన్  వంటి సూపర్ హిట్స్ లో నటించాడు. ఇక సోలోగా నటించిన జబ్ జబ్  ఫూల్ ఖిలే, కన్యాదాన్, ప్యార్ కా మౌసమ్, హసీనా మాన్ జాయేగీ, అభినేత్రి, సుహానా సఫర్, ఆ గలే  లగ్ జా, షర్మిలీ, రోటీ కపడా ఔర్ మకాన్, ఫకీరా, చోర్ మచాయే షోర్... ఒకటేమిటి ఎన్నో కలర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్లు. రోమాంటిక్ హీరోగా సూపర్ హిట్లు. 



       ఇంకెన్నో  సూపర్ హిట్ పాటలు : చలే థే సాథ్  మిల్ కే  (హసీనా మాన్ జాయేగీ), పర్దేశీయో సే నా అఖియా మిలానా (జబ్ జబ్  ఫూల్ ఖిలే), లిఖే జో ఖత్ తుజే (కన్యాదాన్), నిసుల్తానా రే ప్యార్ కా మౌసమ్ ఆయా (ప్యార్ కా మౌసమ్), సరిగమప (అభినేత్రి), ఖిల్ తే హై గుల్ యహా (షర్మిలీ), తేరా ముజ్ సే హై పెహ్లే కా నాతా కోయీ (ఆ గలే  లగ్ జా ), లే జాయేంగే లే జాయేంగే దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే (చోర్ మచాయే షోర్), ఎక్ రాస్తా హై జిందగీ (కాలా పత్తర్) ...ఇలా కొన్నివందల ఎవర్ గ్రీన్ పాటలుంటాయి.

          శశి కపూర్ నటించిన ‘ఆ గలే  లగ్ జా’ (1973)  తెలుగులో శోభన్ బాబు - మంజుల తో ‘మంచి మనషులు’  గానూ, ‘చోర్ మచాయే షోర్’ (1974) కృష్ణ - మంజుల -మోహన్ బాబులతో ‘భలే దొంగలు’ గానూ రీమేక్ అయ్యాయి. శశి కపూర్ నటించిన కమర్షియల్, ఆర్ట్, అంతర్జాతీయ సినిమాలన్నీ కలిపి 160 వరకూ వుంటాయి. తీసిన ఆరు ఆర్ట్ సినిమాలకి తనే నిర్మాత. ఒక దానికి దర్శకుడు. అవన్నీ నష్టాల పాలు జేశాయి. కానీ పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి. 


        శశికపూర్ ఇమేజి లేని నటుడైనప్పటికీ  కమర్షియల్ సినిమా కొచ్చేసరికి రోమాంటిక్ హీరో ఇమేజికే బందీ అయ్యాడు. కారణం తను యాక్షన్ హీరో గా చేస్తే ప్రేక్షకులు భరించలేక పోయారు. కనీసం మాస్ హీరోగానూ తను రాణించలేడు. అందుకే తను నటించే మల్టీ స్టారర్స్ లో అమితాబ్ వంటి  స్టార్లు మాస్ పాత్రలేస్తే, తను క్లాస్ పాత్రలేసేవాడు. అప్పట్లో బాలీవుడ్ లో ఇద్దరు చాక్లెట్ బాయ్స్ వుండేవాళ్ళు. మొదటి చాక్లెట్ బాయ్ జాయ్  ముఖర్జీ అయితే, రెండో చాక్లెట్ బాయ్ శశి కపూర్.  కమర్షియల్ సినిమాల్లో ఈ ఇమేజి చట్రంలో బందీ అయిపోయాడు. ప్రేక్షకులు ఇలాగే తనని గుర్తుపెట్టుకున్నారు. కమర్షియలేతర సినిమాల్లో తన లోని అసలు నటుణ్ణి ప్రదర్శించాడు. నటనలో మెళకువలు చిన్నప్పుడు తండ్రి పృథ్వీ రాజ్ కపూర్ నుంచి నేర్చుకున్నవే. నువ్వేమీ యువరాజువనుకోకు, సగటు కుర్రాడివి అనుకుని యూనిట్ సభ్యులతో కలిసిపో అని తండ్రి అన్నప్పుడు – ఆ చిన్నప్పట్నించీ అలవాటయిన పనే, తను స్టార్ అయ్యాకా కూడా చేస్తూపోయాడు. తన హోదా పక్కన పెట్టి సెట్ లో కింది స్థాయి యూనిట్ సభ్యులతో కలిసి కూర్చుని మాట్లాడడం, చాయ్ లు తాగడం వంటి దృశ్యాలు నిత్యం కన్పించేవి. తండ్రి నడిపిన నాటక కంపెనీ ఒక వూళ్ళో వున్నది కాదు. అది వూరూరా తిరిగే టూరింగ్ నాటక కంపెనీ. దీంతో చిన్నప్పుడే మనసు విశాలమైంది శశికి. తండ్రి కంపెనీయే గాక,   బ్రిటిష్ నటుడు జెఫ్రీ కెండాల్ నడిపే షేక్స్ పియరియానా అనే నాటక కంపెనీలో నటించేవాడు శశి. జెఫ్రీ కుమార్తె జెన్నిఫర్ తో ఆ పరిచయమే ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది.  
          శశి తనకి నటన  నేర్పిన చిన్ననాటి పృథ్వీ థియేటర్ ని కాలగర్భంలో కలిసిపోనీయలేదు. 1960 లో మూతబడ్డ కంపెనీని జెన్నిఫర్ తోడ్పాటుతో ముంబాయి లోని జుహూ ప్రాంతంలో పునరుద్ధరించాడు. ఇది దేశవ్యాప్తంగా నాటక రంగంలో ఎందరో నటులకి వేదిక అయింది, శిక్షణా తరగతి అయింది. 1984 లో జెన్నిఫర్ మరణంతో శశి జీవితమే మారిపోయింది. అతను తిరిగి మనిషే కాలేక పోయాడని అంటారు సన్నిహితులు. విపరీతంగా వోడ్కా సేవించేవాడని, కాలక్రమంలో అదే ఆరోగ్యాన్ని దెబ్బతీసిందనీ అంటారు. జెన్నిఫర్ జ్ఞాపకాలు అతణ్ణి రేయింబవళ్ళూ వెంటాడేవి.


     అయితే సినిమాల్లో నటించడం తగ్గించినా, క్రమం తప్పకుండా పృథ్వీ థియేటర్ కెళ్ళి యువ టాలెంట్ ని ప్రోత్సహించేవాడు. ఆఖరికి చక్రాల కుర్చీకి పరిమితమయిన ముదిమి వయసులో 2015లో, అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు నందుకున్నపుడు పలకడానికి నోరు కూడా లేదు. కపూర్ కుటుంబంలో ఈ అవార్డు ముగ్గురికి వరించింది- తండ్రి పృథ్వీ రాజ్ కి, అన్న రాజ్ కపూర్ కి, తనకీ. ఇలా మూడు దాదా ఫాల్కే అవార్డు లందుకున్న మరో సినీ కుటుంబం లేదు.
         
         శశి రోమాంటిక్ స్టార్ గా వెలిగిన కాలంలోనే రాజేంద్ర కుమార్, రాజ్ కుమార్, సునీల్ దత్, దేవానంద్, ధర్మేంద్ర, షమ్మీ కపూర్, జితేంద్ర వంటి పాపులర్ స్టార్స్ తో బాటు రాజేష్ ఖన్నా కూడా వుండేవాడు. కానీ ఓ ఆరు సినిమాల్లో నటిస్తూ వచ్చిన రాజేష్ ఖన్నా పెద్దగా పాపులర్ కాలేక
పోయినా, 1969 లో ‘ఆరాధన’ తో తిరుగు లేని సూపర్ స్టార్ అయిపోయాడు. రాజేష్ ఖన్నా తర్వాత 1975 లో ‘దీవార్’ తో అమితాబ్ బచ్చన్ తిరుగు లేని సూపర్ స్టార్ అయ్యాడు. అమితాబ్ తర్వాత ఒకరొకరే ఖాన్లు సూపర్ స్టార్లు అవుతూ పోయారు. కానీ ఇందరు సూపర్ స్టార్లని చూస్తూ వున్న శశి కపూర్ తనధోరణిలో తను మల్టీ స్టారర్స్  లో  సైతం నటిస్తూ పోయాడే తప్ప కనుమరుగై పోలేదు. 



        తన కళ్ళ ముందే అన్న రాజ్ కపూర్  కుమారులు రణధీర్ కపూర్,  రిషీ కపూర్, రాజీవ్ కపూర్  లు హీరోలయ్యారు. రాజీవ్ కపూర్  వెంటనే కనుమరుగైపోయాడు. రణధీర్ కపూర్ ఎక్కువకాలం నిలదొక్కుకో లేకపోయాడు. కానీ రిషీ కపూర్ యంగ్ స్టార్ గా ఒక తరం యువతని ఉర్రూతలూగించాడు. తర్వాత పెద్ద తరహా పాత్రలకి ఎదిగాడు. ఇప్పటికీ నటిస్తున్నాడు. తండ్రి రాజ్ కపూర్ ‘మేరా నామ్  జోకర్’ తీసి కోలుకోలేనంత  నష్టపోయి- చిన్న కుమారుడు రిషితో ‘బాబీ’ తీశాక మళ్ళీ కోలుకున్నాడు. కష్టాల్లో వున్న  అన్నని ఆదుకునే ఉద్దేశంతో శశి కపూర్ తనే ‘బాబీ’ ని విడుదల చేశాడు. అయితే అన్న కష్టాలు తనకి చుట్టుకున్నాయి. ‘బాబీ’ కనకవర్షం కురిపించినా తనకేమీ రాలేదు!

          ఇక నటనకి వారసత్వంగా తన పిల్లల్ని అందించలేకపోయానన్న తీరని వెలితి శశిని వెంటాడేది. కునాల్, కరణ్,  సంజనా కపూర్ లు ముగ్గురూ తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసికెళ్ళాలేక,  నటనని విరమించుకుని వేరే రంగాల్లోకి వెళ్ళిపోయారు. బాలీవుడ్ లో వారసులుగా మిగిలింది అన్న రాజ్ కపూర్ మనవలైన కరీనా కపూర్ (రణధీర్ కపూర్ కుమార్తె), రణబీర్ కపూర్ ( రిషికపూర్ కుమారుడు)లు.  రణధీర్ పెద్ద కుమార్తె కరీనా కపూర్ స్టార్ గా ఓ ఊపు వూపింది.


       మాలాసిన్హా, మీనా కుమారి, షర్మిలా టాగూర్, ఆశా పరేఖ్, సాధన, హేమమాలిని, రేఖ, రాఖీ, వహీదా రెహమాన్, షబానా అజ్మీ, ముంతాజ్, జీనత్ అమన్, నఫీసా అలీ, నీతూ సింగ్, సుప్రియా పాఠక్ ల వంటి కలర్ఫుల్ హీరోయిన్లతో కళా, వ్యాపార సినిమాలు  రెండిట్లో నిండు చంద్రుడులా ప్రకాశించిన శశికపూర్ ని అమరుణ్ణి చేయాలంటే,  నేటి నటులెవరైనా ఆయన అనుసరించిన విభిన్న మార్గాల్లో నడవాల్సిందే. అలా నడిచినప్పుడు,   ‘ఏముంది? ఏముంది  నీదగ్గర?’ అని ఎవరైనా టాలెంట్ ని  ప్రశ్నిస్తే, ‘శశి కపూర్ వున్నాడు నా  దగ్గర!’  అని సగర్వంగా చెప్పుకోవచ్చు!  

సికిందర్ 





కథ రాయాలంటే ఇన్ పుట్ అవసరం, ఇన్ పుట్ లేక 
మూసకి బానిసలవుతున్నారు...


\






23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

609 : సందేహాలు -సమాధానాలు!




 Q :   ‘అ!’  మూవీ కథని  ‘ఐడెంటిటీ’ (2003) లోంచి ఎత్తేశారు. అవసరాల శ్రీనివాస్ ట్రాక్ ‘ప్రీ డెస్టినేషన్’ (2014) నుంచి కాపీ చేశారు. ప్రియదర్శి పాత్ర Ratatouille (2007) నుంచి కాపీ కొట్టారు...??
కె. శ్రవణ్, అసోసియేట్
 
A :   అలాగేమీ కన్పించడం లేదు. ‘ఐడెంటిటీ’ కథ వేరు. ఒక రెస్టారెంట్ కి ఓ పది మంది వచ్చి ఒకరొకరే హత్యకి గురవుతారు. ఇది 1939 లో అగథాక్రిస్టీ నవల ‘అండ్ దెన్ దేర్ వర్ నన్’ కాధారం. దీన్ని 1945196519741987, 1989 లలో ఐదుసార్లు తెరకెక్కించారు. నవల మొట్టమొదట ‘టెన్ లిటిల్ నిగ్గర్స్’  పేరుతో  విడుదలయ్యింది. హిందీలో 1969 లో మనోజ్ కుమార్ తో ‘గుమ్నామ్’ తీశారు. దీన్ని తెలుగులో 1974 లో ‘గుండెలు తీసిన మొనగాడు’ గా కాంతారావు నటించి నిర్మించారు. 1970 లో తమిళంలో ‘నడు ఇరవిల్’ గా, 2012 లో ‘ఆడుత్తత్తు’ గా తీశారు.  2015 లో కన్నడలో ‘ఆటగారా’ గా తీశారు. 2015 లో మళ్ళీ హిందీలో ‘ఖామోష్...ఖౌఫ్ కీ రాత్’ గా తీశారు. 
          క్రైం – మిస్టరీ నవలా సాహిత్యంలో ఇది ఆగథా క్రిస్టీ మరో గేమ్ ఛేంజర్ నవల.  హోటల్లో వున్న పదిమందీ ఒకరొకరే హత్యకి గురైతే, మరి చంపిందెవరనే పెద్ద పజిల్ తో ఈ కథ వుంటుంది. దీనికి ‘అ!’ తో సంబంధంలేదు. ఒక హోటల్ – లేదా రెస్టారెంట్, అక్కడికి కొన్ని పాత్రల రాక  అన్న సెటప్ తప్పితే.
          ‘ప్రీ డెస్టినేషన్’ హీరో కాలంలో వెనక్కి వెళ్లి 1975 లో ఒక బాంబు పేలకుండా చేస్తాడు. కాలంలో వెనక్కి ప్రయాణించే కథలతో సినిమా లెన్నో వున్నాయి. ‘ప్రీ డెస్టినేషన్’ లో ఏమిటంటే, ఫ్యామిలీ ఎలిమెంట్ ని కూడా జోడించారు. అతను గడిచిపోయిన  కాలంలో తల్లి దండ్రుల్ని కూడా కలుసుకోవాలనుకుంటాడు. తీరా తనే తండ్రి, తనే తల్లినని తెలుసుకుంటాడు.  ఏకకణ జీవి అమీబాలాగా తనే సంతానోత్పత్తి చేసుకోగలడు. ఇదంతా ఎలా జరిగిందో కాలంలో వెనక్కి వెళ్తూ చూపించుకొచ్చే కథ వుంటుంది. కానీ అవసరాల శ్రీనివాస్ పాత్రకి ఈ పాయింటుతోనే పోలిక. అతను కాలంలో వెనక్కి వెళ్ళడు. దేవదర్శిని వచ్చి అంటుంది, నువ్వూ నేనూ ఒకే మనిషికి రెండు రూపాలమని, అంతే.
          ఇక  పిక్సార్ సంస్థ తీసిన యానిమేషన్ కామిక్ ‘రాటచ్యుల్లీ’ (
Ratatouille ఫ్రెంచి పదాన్ని ఉచ్ఛారణ యాప్ రాటచ్యుల్లీ అనే పలుకుతోంది, అంటే అయోమయ నివృత్తి అట) లో కథ షెఫ్ (వంటవాడు లేదా బావర్చీ) కీ, అతడికి వంట నేర్పే ఎలుకకీ మధ్య వుంటుంది. దీన్నుంచి స్ఫూర్తి పొంది, చేపా ఇంకా చెట్టూ కలిపి ప్రియదర్శి తో చేసి వుండవచ్చు.  

 Q :   మీ బ్లాగులో రివ్యూలు మిస్ అవుతున్నందుకు నాతో పాటు చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. ‘శివ’ సినిమా కాకుండా మూడంకాల నిర్మాణంలో పక్కాగా వున్న ఓ పది ప్రముఖ సినిమాల పేర్లు మీ బ్లాగులో చెప్తారా? ఏ భాషా చిత్రమైనా, ఏ దేశ చిత్రమైనా సరే!
 
మహేష్ రెడ్డి, డైరెక్షన్ / రైటింగ్
 
A :   భజరంగీ భాయిజాన్, దంగల్, ఒక్కడు, జయం, నువ్వు –నేను, పాండురంగ మహాత్మ్యం, ప్రముఖం కాకపోవచ్చు కానీ తమిళ 24, రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్, టైటానిక్, ఫస్ట్ బ్లడ్... ఇలా ఓ పది చెప్పుకోవచ్చు. ఇతర దేశాల సినిమాలంటే హాలీవుడ్, కొరియన్, చైనీస్ దేశాల సినిమాలు కమర్షియల్స్ గా వుంటాయి. మిగిలిన దేశాల సినిమాల గురించి చెప్పలేం.  ఎక్కువగా పరిమిత మార్కెట్ – ప్రేక్షకులు వుండే వరల్డ్ మూవీస్ (యూరోపియన్) కేటగిరీకి చెందుతాయి. ఒకటి అర్ధంజేసుకుంటే  ఏమిటంటే, వరల్డ్ మూవీస్ వేరు, కమర్షియల్ సినిమాలు వేరు. భారతీయ కమర్షియల్ సినిమాలు, హాలీవుడ్, కొరియన్ సినిమాలు మూడూ విస్తృత మార్కెట్ ని కలిగి వుండే పక్కా వ్యాపార సినిమాలు. కొరియన్ సినిమాలు కమర్షియల్ గా వుండే అమెరికన్ మార్కెట్ ని కూడా ఆక్రమించాయి. అందువల్ల ప్రధాన స్రవంతి సినిమాలకే  తెలుగులో మార్కెట్ అని గ్రహించి అలాటి వ్యాపార సినిమాలే తీసుకోవాలి. వ్యాపార సినిమాల రంగంలో వుంటూ ఎక్కడో పనికిరాని వరల్డ్ మూవీస్ ఆలోచనలు, షార్ట్ ఫిలిమ్స్ ని పొడిగించే ఆలోచనలు చేస్తే సర్వనాశనమే
కొనితెచ్చు
కుంటారు. హాలీవుడ్ లో దేశదేశాల నుంచి వచ్చి స్థిరపడిన నిర్మాతలు, నటులు, దర్శకులు,  రచయితలు, సాంకేతికులూ వుంటారు.  వీళ్ళందరూ హాలీవుడ్ ఏకైక మంత్రం వినోదాత్మక కమర్షియల్  సినిమాలు తీయడానికే ఏకత్రాటిపై కదం తొక్కుతూంటారు. టాలీవుడ్ లో అలాకాదు. వివిధ జిల్లాలనుంచి, లేదా ఓవర్సీస్ నుంచి వచ్చే కేవలం తెలుగు వాళ్ళే,  ఒకళ్ళు వరల్డ్ మూవీస్ అంటూ దూసుకొస్తారు,  ఇంకొకళ్ళు షార్ట్ ఫిలిమ్స్ అని తోసుకుంటారు, మరోకళ్ళు ఇండీ ఫిలిమ్స్ అని నెట్టి పారేస్తూంటారు... వీటికి పైసలొస్తాయనుకుంటారు. అందరూ కలిసి తోపులాటతో టాలీవుడ్ ని మంటగలిపి, చేతులు దులుపుకుని వెళ్ళిపోతారు. వీళ్ళు సపరేట్ గా ఖాళీవుడ్ పెట్టుకుని, టాలీవుడ్ లో తలదూర్చకుండా  ఇంటలెక్చువల్ సినిమాలతో కోరికలు తీర్చుకోవచ్చు. అసలు యూరప్ కే వెళ్ళిపోయి వరల్డ్ సినిమాలు తీసి  తృప్తి తీర్చుకోవచ్చు. 
          చెప్పొచ్చేదేమిటంటే, మూడంకాల కమర్షియల్ నిర్మాణంలో ప్రముఖ విదేశీ సినిమాలేమిటీ అని అమెరికా, దక్షిణ కొరియా,  యూరోపియన్, ఇరాన్, జపాన్ వగైరా వగైరా దేశాల సినిమాలన్నీ కలగలిపేసి చూడకూడదు. కేవలం హాలీవుడ్, కొరియన్ మూవీస్ వరకే హద్దులు గీసుకుని ఆ హద్దుల్లో వుండి అవే చూస్తూంటే చాలు. కొరియన్ మూవీస్ ఎన్ని కాపీ కొట్టినా హిట్ కావు, అది వేరే సంగతి. ఇక హాలీవుడ్ సినిమాల్ని కాపీకొడితే ఇక్కడే ఆఫీసులు తెరచిన హాలీవుడ్ వాళ్ళు  ఇప్పుడు  పట్టుకుంటారు. బాలీవుడ్ లో పెద్దపెద్ద వాళ్ళనే పట్టుకున్నారు.
          ఇండియన్ కమర్షియల్ సినిమాలు, హాలీవుడ్, కొరియన్ సినిమాలు యూరోపియన్ దేశాల సినిమాల్లాగా ఇంటలెక్చువల్ సినిమాలుకావు. కాబట్టి తెలుగులో ఇంటలెక్చువల్స్ అవసరం లేదు, కాస్త ఇంటలిజెంట్ గా తయారయ్యేందుకు ప్రయత్నిస్తే చాలు- ఒక అమీతుమీ, ఒక ఘాజీ లాంటివి తీసుకోవచ్చు. ఒక్క కమర్షియల్  సినిమాలే మూడంకాల నిర్మాణంలో వుంటాయి. ఎందుకంటే కమర్షియల్ గా  ఆడాలి కాబట్టి. ఇతర వరల్డ్, ఇండీ, షార్ట్ సినిమాలు వగైరాలు రెండకాల్లోనే వుంటాయి. ఆదిమధ్యంతాల్లో మధ్యమం వుండదు. ఆది, అంతం రెండే వుంటాయి. ఎందుకంటే, మేధావితనం ప్రదర్శించుకోవాలి కాబట్టి దాని తాలూకు ఎడమ మెదడు ఒక్కటే పనిచేసి అలా సగం మెదడు సినిమాలు తయారవుతాయి. మూడంకాల (త్రీ యాక్ట్ స్ట్రక్చర్) కమర్షియల్ వాళ్ళకి కుడి మెదడు కూడా పనిచేస్తుంది. ఇది తెలీక కమర్షియలేతరులు అదీ ఇదీ అంతా ఒకటే, మనమంతా భాయీ భాయీ అని ఆవురావురంటూ వచ్చేసి,  ప్రేక్షకుల చేత హాహాకారాలు పెట్టిస్తూంటారు. నిర్మాతల కళ్ళల్లో కారాలు.
          ముడి ఫిల్ము వున్న కాలంలో బి. నరసింగ రావు, శ్యాం బెనెగళ్, రుత్విక్ ఘటక్,  గౌతమ్ ఘోష్, గోవింద్ నిహలానీ లవంటి వాస్తవిక సినిమాలు తీసే ఆర్ట్ సినిమా దర్శకులు,  కమర్షియల్ సినిమాల వైపే తొంగి చూసే వాళ్ళు కాదు. రెండు రంగాలూ  విడివిడిగా వుండేవి. నటులు కూడా విడివిడిగా వుండే  వాళ్ళు. ఎప్పుడయితే ఆర్టు సినిమాల ఉద్యమం అంతరించి చాలా కాలం గ్యాప్ వచ్చిందో, ఇక ప్రేక్షకుల్ని ఆర్ట్ సినిమాలవైపు ఆకర్షింపజేసుకోవడానికి, శ్యాం బెనెగళ్ పూనుకుని, బాలీవుడ్ స్టార్స్ ని పెట్టి తీయడం ప్రారంభించారు. గోవింద్ నిహలానీ అనుసరించారు. దీంతో వీటికి క్రాసోవర్ (ఆర్టు నుంచి కమర్షియల్ కి క్రాసోవర్ అవడం) సినిమాలనీ, కమర్షియలార్టు సినిమాలనీ కొత్త పేరుపెట్టారు. ఇక అప్పుడప్పుడే మల్టీ ప్లెక్సులు రావడంతో, కొత్తకొత్త దర్శకులకి ఇదే బాటలో చిన్నచిన్న బడ్జెట్ లతో సినిమాలు తీసే వీలుకలిగింది. అప్పుడు మల్టీ ప్లెక్స్ సినిమాలుగా పేరు మారింది. అప్పుడివి కూడా క్వాలిటీతోనే వుండేవి.
          కానీ ఎప్పుడైతే ముడి ఫిల్ముపోయి డిజిటల్ వచ్చిందో, ఇక సినిమాలంటే ఓనమాలు తెలీని యంగ్ బ్యాచీలు షార్ట్ ఫిలిమ్స్ పట్టుకుని దిగిపోయారు. ముడి ఫిల్ము వున్నప్పుడు షార్ట్ ఫిలిమ్స్ దర్శకులు కూడా వేరే వుండే వాళ్ళు. ఒక అవగాహనతో షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ, యూట్యూబు లేనికాలంలో  దేశ విదేశాల్లో ఫెస్టివల్స్ లో మాత్రమే ప్రదర్శిస్తూ గొప్ప వాళ్ళయి పోయేవాళ్ళు. డిజిటల్ వచ్చాక, గల్లీకొక షార్ట్ ఫిలిం తీయడం, యూ ట్యూబులో పారెయ్యడం, పారేశాక వచ్చిన  వ్యూవ్స్ లెక్కెట్టుకుని టాలీవుడ్ లో పడ్డం.
          చాలావరకూ షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళకి వరల్డ్ మూవీస్ తో అక్రమ సంబంధాలుంటాయి. అవే చూస్తూంటారు. హాలీ – బాలీ -  టాలీవుడ్ సినిమాలు చీప్ గా కన్పిస్తాయి. కాబట్టి షార్ట్ ఫిలిమ్స్ అనుభవాల్ని వరల్డ్ మూవీస్ కి పెంచి, గొప్పగా చూపించబోతారు.  ఇదెంత కాలం సాగదు. షార్ట్ / వరల్డ్ – కమర్షియల్ ఒక వొరలో ఎప్పుడూ ఎక్కడా ఏ భాషలోనూ ఇమడలేదు. వాళ్ళంతా ముందు కమర్షియల్ సినిమాలకి పనిచేసి అవి తీయడం తెలుసుకోవడం, కమర్షియల్ సినిమాలకి పని చేసేవాళ్ళు కూడా పొరపాటున కమర్షియల్ సినిమాలు తప్ప,  ఇతర కేటగిరీలు చూడకపోవడం ఒక్కటే చెయ్యాలి. పది దేశ విదేశ సినిమాల పేర్లడిగినందుకు,  పాలూ నీళ్ళు వేరుచేసి చెప్పడానికే ఇదంతా.

 Q :   తొలిప్రేమ రివ్యూ ఇవ్వలేదు, అ! రివ్యూ ఇవ్వనన్నారు. కనీసం క్లుప్తంగా అదేంటో చెప్పండి.
కొందరు పాఠకులు
 A :   తొలిప్రేమ చూడలేదు. అ! గురించి క్లుప్తంగా కాన్సెప్ట్ వరకే చూస్తే -
          ఆమె బాల్యం నుంచీ పురుష ప్రపంచంలో ఎదుర్కొన్న బాధాకర అనుభవాలు –లైంగిక హింసా వికటించి, ఆమెలో మానసికంగా మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ (ఎంపిడి) కి దారితీశాయి –‘అపరిచితుడు’ లాగా.
          ఇక ఆమె ఆ పుట్టిన రోజు కొందర్ని చంపి కక్ష తీర్చుకుని, చచ్చిపోవాలనుకుంది.
          1. మగాళ్ళంటే ఆమె దృష్టిలో మాయగాళ్ళు. అందుకని తన ఎంపిడి తాలూకు చిత్త భ్రాంతితో, మాయలు చేసే మేజీషియన్ ని ఎమోషనల్ గా సృష్టించుకుని, వాడితో ఆడుకుని,  జోకర్ని చేసి కసి తీర్చుకుంది.
          2. తను కోల్పోయిన తల్లిదండ్రుల్ని కలుసుకోవాలన్న కాంక్షతో, కాలంలో వెనక్కి వెళ్ళే ప్రయత్నంతో సైంటిస్టు (అవసరాల) ని సృష్టించుకుంది. కానీ తల్లిదండ్రులంటే ఆడా - మగ. మగవాడి అవసరం ఎక్కడుంటే అక్కడ అతణ్ణి తొలగిస్తూ,  ఆడపాత్రనే (దేవదర్శిని) ప్రవేశపెట్టుకుని, నేనే నీ రెండో రూపాన్నీ అంటూ సైంటిస్టుకి చెప్పించింది. నీకు తల్లిదండ్రు లేమిటి, నువ్వే తండ్రివి - నువ్వే తల్లివి, మగాడి అవసరం లేకుండా ఏక కణ జీవి అమీబాలాగా కణభజన చేసుకుంటే,  నీదే సంతానమన్న స్వైరకల్పన.
          3. మగవాళ్ళ పట్ల అసహ్యంతోనే లెస్బియన్ పాత్రల్ని సృష్టించుకుంది. ఆడదానికి ఇక మగాడి అవసరమే లేదని, వాణ్ణి నిషేధించాలనీ ధిక్కార స్వరం. మాతృస్వామ్య వ్యవస్థ కోరుకుందేమో బహుశా.
          4. తనని క్రేజీగా (రేజీనా పాత్ర) ని సృష్టించుకుని, ఆడపిల్లంటే ఇక తెగించాల్సిందే, అన్నీ మరిగి చెడిపోయి – కోన్ కిస్కా గాళ్ళని దోచుకుని బతికేయాల్సిందే నన్నఇంకో ధిక్కారం. దీనికి వత్తాసుగా అక్కడ దెయ్యం తాలూకు నెక్లేసు మెళ్ళో వేసుకోమని చెట్టు తొర్రలో దొరికింది.
          5.  ఒక ఇల్లుండి, అందులో గృహిణిగా సంసారం చేసుకునే అదృష్టానికి నోచుకోకుండా మగప్రపంచం సమాధి  చేసిందా కలల్ని(ఇంటిని కూల్చి అదే  రెస్టారెంట్ కట్టిన వైనం లోంచి). ఆ ప్రతీకారానికి ప్రతిరూపమే ఆ పీడించే దెయ్యంగా మారిన  తను.
          6. ఆఖరికి వంట చేసుకునే స్త్రీ సహజ లక్షణాన్ని కూడా చంపేసుకుంది. అందుకని వంటే తెలీని తన ప్రతిరూపంగా చెఫ్ (ప్రియదర్శి) తో నానా పాట్లు.
          ఈ ఆరు ఎమోషన్స్ ఆమె అణగారిపోయిన స్త్రీత్వపు శిథిలాల్ని పెకిలించుకొచ్చి బాహ్యంగా నర్తించాయి. ఆ పాత్రలన్నీ ఆమె భావోద్వేగాల ప్రతీకాలంకారాలే (metaphors). చివరికి వాటన్నిటినీ కాల్చి పారేసి, తనూ కాల్చుకుని చచ్చిపోయింది.
          మగప్రపంచంలో జీవితమంతా లైంగిక హింసే / వివక్షే  మోసిన బాధితురాలి ఆక్రందన. వయసుతో నిమిత్తంలేకుండా ఇదీ ఇప్పుడున్న కాలం. దీన్ని వరల్డ్ మూవీ దృష్టితో చూడాలి.
          జాతీయ పత్రికలు  మంచి మార్కులేశాయి : హిందూస్తాన్ టైమ్స్ 5 / 5, టైమ్స్ ఆఫ్ ఇండియా 4 / 5, ఇండియన్ ఎక్స్ ప్రెస్ 4 / 5,  ఇండియా టుడే 3 / 5,  ఫస్ట్ పోస్ట్  3 / 5... ది హిందూ రేటింగ్స్ ఇవ్వదు. బెస్ట్ అని చెప్పింది.

సికిందర్


20, ఫిబ్రవరి 2018, మంగళవారం

608 : స్పెషల్ ఆర్టికల్




          స్క్రిప్టు రాయడానికి కూర్చుంటే మూడ్ రాదు. గది బాగా లేదనో, సౌకర్యాలు బాగా లేవనో, ఇంకేదో తగ్గిందనో మూడ్ రాదు. ప్రతిఘటన వల్ల రాని మూడ్ ఇది. నచ్చని బాహ్యపరిస్థితుల పట్ల ప్రతిఘటన. ఇది తనకే నష్టం. ప్రతిఘటనతో బోలెడు స్కిల్స్ ని చంపుకుని కూర్చోవడం. ఇది కండిషనల్. రాయాలంటే  ఇంకేదో  వుండాలనే కండిషన్ వల్ల మూడ్ రాకపోవడం. ఇలాకాక, బద్ధకం వల్ల మూడ్ లేకపోవడం వుంటుంది. ఇది అన్ కండిషనల్. దీనికి  బాహ్య పరిస్థితులతో సంబంధం  వుండదు. ఇది లాభం కల్గించేది.  బద్ధకం వల్ల మూడ్ రాకపోయినా,  రాయాలనుకున్న విషయం మీద మెదడు దాని పని అది చేస్తూనే వుంటుంది. అదే ప్రతిఘటనతో  మూడ్ రాకపోవడంలో ఆలోచనలు కూడా బంద్ అయిపోతాయి. బద్ధకం వల్ల మూడ్ రాకపోయినా  మెదడులో ఆలోచనలు పోగు పడిపోతూనే వుంటాయి.  అంతే గాక ఆలోచనలని పొదగడం కూడా వుంటుంది. మూడ్ వచ్చేటప్పటికల్లా మెదడు ఆలోచనల్ని పొదిగి పొదిగి పిల్లని బయటికి తీస్తుంది. అప్పుడు రాసుకుపోవడం సులభంగా, వేగంగా జరిగిపోతుంది. బద్ధకం వల్ల మూడ్ రాకపోయినా మెదడు గుడ్లు పెట్టక మానదు. ఆ గుడ్లని పొదగకా మానదు. ఆ పిల్లని బయటికి తీయకా మానదు. బద్ధకం వల్ల రాని  మూడ్ ని బలవంతంగా తెచ్చుకుని రాసే ప్రయత్నం చేస్తే మెదడు మొరాయిస్తుంది. అప్పుడు రాయడానికి ఆలోచనలు సరీగ్గా కుదరవు. పూర్తి చేయడానికి సమయం కూడా ఎక్కువ పడుతుంది. 

         
మెదడు ద్విపాత్రాభినయం కూడా చేస్తుంది. ఒకవైపు పూర్తి చేయాల్సిన పని గురించి ఆలోచిస్తున్నా, మరో వైపు ఆ పనిని  వాయిదాలు వేయడానికి సాకులు వెతుకుతుంది.  ఒక సినిమా గురించి ఏదో రాస్తూ, ఆ సినిమా ఎప్పుడు విడుదలయ్యిందా అని నెట్ లో సెర్చి చేస్తూంటే, అక్కడ ఒక గాసిప్పో ఇంకేదో  ఆసక్తిగా కన్పిస్తుంది. అది చదువుకుంటూ అసలు విషయాన్ని పక్కన పడేస్తుంది మెదడు. ఆ రాయడం కంటే ఈ చదువుకోవడమే  హాయిగా అన్పిస్తుంది  మెదడుకి. ముందా పని  పూర్తి చెయ్ అని మెదడు గుర్తుచేస్తే,  ఆకలిగా వుందిగా, తిన్నాక పూర్తి  చేయవచ్చులే అని  సాకులు వెతుకుతుంది మెదడే.

          మెదడుని జయించగల వాడే వృత్తి రచయిత. వృత్తి రచయితకి అసలు మూడ్ తో పనేముంది? సినిమా కెళ్ళి  బయట వెయిట్ చేస్తున్నప్పుడు కూడా ఫోన్లో టకటకా టైపు చేసేసుకుంటాడు ఐడియాల్ని. సబ్జెక్టు మీద ఎక్కడ ఎప్పుడు ఏ ఆలోచన తట్టినా ఫోన్లో వాయిస్ రికార్డర్ లో  చెప్పేస్తూంటాడు. హైదరాబాద్ - విజయవాడ హైవే మీద నార్కెట్ పల్లి దగ్గర్లో  హోటల్ వివేరా అని వుంటుంది. అక్కడొక వ్యక్తి  బైక్ మీద వచ్చాడు. కాఫీ తెచ్చుకున్నాడు. కాఫీ తాగుతూ బ్యాగులోంచి పెన్సిలు, రబ్బరు, పేపర్లు తీసి రాయడం మొదలు పెట్టాడు. రాస్తూ చెరిపేస్తూ మళ్ళీ రాస్తూ వున్నాడు. మీరేం చేస్తూంటారని అడిగితే, టీవీ సీరియల్ అని చెప్పాడు. డిస్టర్బ్ చేయకుండా దూరంగా నించుని గమనిస్తోంటే, కాఫీ పూర్తయ్యే వరకూ రాసుకోవడం చేసి, పేపర్స్ పెన్సిలు రబ్బరూ తిరిగి  బ్యాగులో పెట్టేసుకుని,  బైక్ ఎక్కేసి వెళ్ళిపోయాడు. అతడికి మూడ్ తో పనిలేదు, ఎప్పుడు పడితే అప్పుడు రాయగలడు. ప్లేస్ తో పనిలేదు, ఎక్కడ పడితే అక్కడ రాయగలడు. టైంతో పనిలేదు, ఐదు నిముషాలు వీలుంటే ఆ ఐదు నిమిషాలూ రాసెయ్యగలడు. బైక్ మీద ప్రయాణిస్తూ కూడా పనిచేయగలడు, రాస్తున్న విషయం  గురించిన ఆలోచనలతో. అతను వృత్తి రచయిత. 

          ఒకసారి స్క్రీన్ ప్లే గురు సిడ్ ఫీల్డ్ సినిమా కంపెనీలో పని చేస్తున్నప్పుడు, కాళ్ళు టేబుల్ మీద ఎత్తి పెట్టుకుని, కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాడు. ఆ నిర్మాత ఆఫీసులో ఎవరేం చేస్తున్నారో కనిపెట్టడానికి బూట్లు తీసేసి  స్లిప్పర్స్ వేసుకుని పిల్లిలా వచ్చేవాడు. అలా వచ్చేసి సిడ్ ఫీల్డ్ అలా లేజీగా కూర్చుని కన్పించడంతో పట్టేసుకున్నాడు. ఫైరయ్యాడు. తను కిటికీ లోంచి చూస్తూ సబ్జెక్టు గురించే ఆలోచిస్తూ కూర్చున్నానని సిడ్ ఫీల్డ్  ఎంత చెప్పినా విన్పించుకోలేదు. సబ్జెక్టు గురించే ఆలోచిస్తున్నట్టు ఎలా నిరూపించుకోవాలి?  చేసిన ఆలోచనల్ని తీసి చూపించలేం కదా?  ఈ తగాదా తేలలేదు. రచయిత ఖాళీగా కన్పిస్తే ఇతని పనై పోయిందనో, పనికిరాడనో అనుకుంటారు. అతను రాయాల్సిన ఆలోచనల్నే భారంగా మోస్తూ వుంటాడని అర్ధంజేసుకోరు.

బ్రేక్ లేదు
          వృత్తి రచయిత అనేవాడికి జీవితంలో బ్రేక్ అనేది వుండదని అంటారు. రచన నుంచి విరామం తీసుకుని విహారయాత్ర కెళ్ళినా ఆలోచనలు రచనల గురించే వుంటాయి. బ్రేక్ లేదు. ఏ మెదడుతో వెళ్ళిన వాడు అలాగే ఆ మెదడుతోనే వచ్చి మళ్ళీ రచన చేస్తాడు. ఒక సబ్జెక్టు మీదే పనిచేసే వృత్తి రచయితలకే ఇలావుంటే, ఇక ఒకేసారి ఎక్కువ సబ్జెక్టులు చేయాల్సి వస్తే? ప్రపంచ ప్రసిద్ధ నవలా రచయిత, క్రిమినల్ లాయర్ పెర్రీమేసన్ పాత్ర సృష్టి కర్త,  ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ కి నాలుగు వేల ఎకరాల ఎస్టేట్ వుండేది. అక్కడే వుంటూ ఏడుగురు సెక్రెటరీలకి  ఏకకాలంలో ఏడు నవలలు డిక్టేట్ చేసేసే వాడు. మరోవైపు, ఒక పేరు మోసిన లాయర్ గా పేదల కోసం ఉచిత న్యాయసంస్థ స్థాపించి, వివిధ కోర్టుల్లో కేసులు పోరాడేవాడు. 

          రచనలతో కూర్చుని మానసిక, కేసులతో బయట తిరిగి భౌతిక - దినచర్యలు రెండూ సునాయాసంగా నిర్వహించేవాడు. ఇదెలా సాధ్యం? ఆయన మెదడు ప్రత్యేకంగా ఏమైనా తయారైందా? అదేం కాదు. అందరి మెదడు లాంటిదే. కాకపోతే దాదాపు మనుషులందరూ పది శాతం  మెదడునే వాడుకుని పనిచేస్తారు, గార్డెనర్  ఇంకొంచెం ఎక్కువ వాడుకున్నాడు. పనిచేయించుకుంటే మెదడుకి అసాధ్య మనేదేదీ లేదు. ఇక సాధారణంగా రచయితలు రాసే పనుంటే తిరగలేరు, తిరిగే పనులుంటే రాయలేరు. ఏకకాలంలో ఏడు నవలలనే సంగతి పక్కన పెడితే, ఏడు పేజీలు  రాయడానికే ఎన్నో వాయిదా లేస్తూంటారు. వృత్తి రచయితలిలా వుండరు. 

          ఈ వాయిదాలేయడం పైన చెప్పుకున్నట్టు ద్విపాత్రాభినయం చేసే మెదడు (సాకులు వెతికే) రెండో స్వభావమైతే, దీనికి బద్ధకం కూడా కారణమవుతుంది. ఐతే  బద్ధకం వల్ల కాకుండా,  మెదడు రెండో స్వభావంతో సంబంధం లేకుండా, బుద్ధిపూర్వకంగా వాయిదా వేస్తే?  అప్పుడు మెదడు పొదిగే పనిని ఇంకా బలంగా యాక్టివేట్ చేసుకుంటుంది. బుద్ధిపూర్వకంగా రాయడాన్ని ఆపాం కాబట్టి, రాసే మూడ్ లో మంచి వూపు మీదున్న మెదడు, ఆ అవాంతరానికి అంతే దీటుగా సమాధానమిస్తూ పని చేస్తుంది. అంటే ఆలోచనల్ని మరింత బలంగా పొదగడం చేస్తుంది. బద్ధక స్థితిలో ఆలోచనల్ని పొదగడం పాసివ్ చర్య అయితే, కావాలని రాయడం ఆపిన స్థితిలో ఆలోచనల్ని పొదగడమనేది యాక్టివ్ చర్య. 

          బద్ధకంతో మూడ్ లేక అసలే రాయకపోవడం, చురుగ్గా రాస్తున్నప్పుడు ఇంకేదో దానిమీదికి దృష్టి మళ్ళి రాయలేకపోవడం రెండూ వేర్వేరు. మొదటి దాని విషయంలో మెదడు ఆలోచనలని పొదుగుతుంది. రెండో దాని విషయంలో రాయడానికి చేస్తున్న ఆలోచనలని ఆపేస్తుంది. పైన చెప్పుకున్నట్టు ఏ గాసిప్సో చదువుకుంటూ కూర్చుంటుంది. 

          గాసిప్స్ వరకూ చదువుకుంటూ కూర్చుంటే  ఫర్వాలేదు, అదేదో పూర్తయ్యాక మళ్ళీ రాసేపని మీదికి వస్తుంది మెదడు. కానీ రాస్తూరాస్తూ వుండగా, చెయ్యి స్మార్ట్ ఫోను మీద పడిందా, ఇకంతే. బుక్కయిపోతుంది మెదడు. దాన్నుంచి విమోచనం పొందదు.  సోషల్ మీడియాలో మునకలేయడం మొదలెడుతుంది. ఏవేవో పోస్టులు చదివి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. అంతుండదు. వూరుకోక తానో పోస్టు పెట్టేస్తుంది- ఈ రోజు నేను చాలా లక్కీ అని.  దీనికి ఎన్ని లైకులు వచ్చాయా అని పదేపదే చూసుకోవడం మొదలెడుతుంది. ఎన్ని కామెంట్లు వచ్చాయా అని చీటికీ మాటికీ చూసుకుంటుంది. రాసుకుంటున్నప్పుడు స్మార్ట్ ఫోన్ మీద చెయ్యి పడిందా, ఇక రాసేపని గోవిందా.

సోషల్ మీడియా నిషా!
          కొత్త రచయితలు ఇంకో ఉత్సాహాన్ని ప్రదర్శించుకుంటారు. తమగురించి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడం. ఆ రకమైన పోస్టులూ, సెల్ఫీలూ నిత్యం పెట్టుకోవడం. రచయితలుగా విజిబిలిటీ పెంచుకోవడం. ఎక్కడ చూసినా తామే కన్పించడం. ప్రపంచ ప్రసిద్ధ థ్రిల్లర్  రచయిత జేమ్స్ హేడ్లీ ఛేజ్ మీడియాలో ఎక్కడా కన్పించే వాడే కాదు. జీవితకాలమంతా ఇంటర్వ్యూలే ఇవ్వలేదు. ఒకటే చెప్పే వాడు – ప్రపంచవ్యాప్తంగా ముప్పయ్యారు భాషల్లో నా నవలల్ని కోట్లాది మంది చదువుతూండగా, పదేపదే రీప్రింట్లు అవుతూండగా, నేనెందుకు పాఠకుల ముందుకొచ్చి నాగురించి చెప్పుకోవాలి? వాళ్ళకీ,  వాళ్ళు చదివే నా నవలలకీ మధ్య నేనెందుకు పానకంలో పుడకలా? నవలలు అమ్ముడుపోకపోతే కదా వాళ్ళ ముందుకెళ్ళి ప్రమోట్ చేసుకోవాలి, ఇంటర్వ్యూలతో పబ్లిసిటీ చేసుకోవాలి? – అని నిర్మొహమాటంగా అనేవాడు. 

          షాడో మధుబాబుదీ  ఇదే పధ్ధతి. మొన్న మొన్నటి వరకూ ఆయనెలా వుంటారో ఎవరికీ తెలీదు. ఎంత పాపులర్ అయినా నవలల మీద ఫోటోలే వేసుకోలేదు. పేరొచ్చాకైనా నేనే మధుబాబు నంటూ ముందుకూ  రాలేదు. అజ్ఞాతంగా వుంటూ ఎన్నో షాడో నవలల్ని సృష్టిస్తూ లక్షలాది మంది పాఠకులని నిలుపుకున్నారు. అంటే రాసింది పాఠకుల్లోకి వెళ్ళాలే గానీ, రచయిత కాదు. రచయిత ఫేసుని, కబుర్లనీ ఎవరూ కేర్ చెయ్యరు- నువ్వేం రాశావయ్యా అనే చూస్తారు. ఈ విజిబిలిటీ హీరోహీరోయిన్లకి, దర్శకులకి, నిర్మాతలకీ సినిమా పబ్లిసిటీ కోసం అవసరం. కదలిక వాళ్ళకవసరం. రచయితకి కదలిక కాదు, తెర వెనుక కదలకుండా కూర్చుని రాయడం అవసరం. పరుచూరిబ్రదర్స్, సత్యానంద్, దివాకర్ బాబు, పోసాని, తనికెళ్ళ భరణి, ఎల్బీ శ్రీరాం వంటి రచయిత లెవరూ పబ్లిసిటీ చేసుకుని పాపులర్ అవలేదు. రాయగల్గి పాపులర్ అయ్యారు. కొత్త రచయితలు సినిమా అవకాశం రాగానే సోషల్ మీడియాలో ధూం ధాం చేసేస్తూంటారు. సక్సెస్ కొట్టామని పోస్టులు పెట్టేస్తూంటారు. వాళ్ళేం సక్సెస్ కొట్టలేరు. ఈ ప్రపంచంలో విజయాలనేవి లేవు, త్యాగాలే వున్నాయి. అలాగే ఆయా నిర్మాతలు త్యాగం చేస్తేనే ఒక రచయితకి ఒక అవకాశం, అంతే. అది తన విజయం కాదు. వాస్తవాల పునాది మీద నిలబడి రచయితలు  కూడా ఆలోచించకపోతే ఎలా? 

          ఇతర రచయితలు రాసింది పత్రికలకి పంపుకుంటారు, లేదా సోషల్ మీడియాలో పెట్టుకుంటారు, లేదా సొంత బ్లాగులో పెట్టుకుంటారు. సినిమా రచయిత ఫైలు తయారు చేసుకుని నిర్మాతల దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ ఫైలు ఇంకెప్పుడు తయారుచేసుకుంటారు – సోషల్ మీడియాతో ఏకాగ్రత చెదరగొట్టుకుంటూ! 

          సోషల్ మీడియాని వృత్తిరీత్యా వాడుకుంటే అది వేరు. స్కిల్స్ పెంచుకోవడానికి నిర్మాతలతోనో,  దర్శకులతోనో, సీనియర్ రచయితలతోనో సమాచార వినిమయం కోసం  సోషల్ మీడియాని పరిమితం చేసుకుంటే ఏకాగ్రతతో వుండగల్గుతారు. ఇదివరకంటే నిర్మాతల, దర్శకుల, సీనియర్ రచయితల గేట్ల దగ్గర కాపేయాల్సి వచ్చేది.  ఇప్పుడలా  కాదు, ఆన్ లైన్ లో స్పందించి తమ విలువైన సూచనలివ్వడానికి వాళ్ళకేం  అభ్యంతరం వుండదు. అలా వాళ్ళ దగ్గర విజిబిలిటీ పెంచుకోవచ్చు. ఇది వదిలేసి వూరికే సోషల్ మీడియాలో వెలిగిపోవాలని ప్రయత్నిస్తే మాత్రం కొత్త రచయితలు మలిగిపోతారు. సోషల్ మీడియాలో అంత  యాక్టివ్ గా  వుండే కొత్త రచయితలు వృత్తిగతంగా ఏం రాశారా అని చూస్తే ఏమీ కన్పించదు. వృత్తి రచయితలైతే రాసిన కట్ట కనపడాలి, సోషల్ మీడియాలో డప్పులు కాదు. అయితే, పక్కాగా సినిమా ఫీల్డులో స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళతో ఇలా వుండదు. అత్యధికశాతం స్ట్రగుల్ చేస్తున్న రచయితలకి, అసోషియేట్స్ కి, అసిస్టెంట్స్ కి ఫేస్ బుక్ ఎక్కౌంట్ కూడా వుండదు. వుంటే నామమాత్రమే.  వాళ్ళ ధ్యాసంతా  క్రియేషన్ మీదే,  రిక్రియేషన్ మీద కాదు. అనుత్పాదక కార్యకలాపాల మీద కాదు. షూటింగ్ నుంచి అర్ధరాత్రి రూముకొచ్చినా రాసుకుంటారు, లేదా ఓ సినిమా చూస్తారు.

కుడి ఎడమల కుసుమ పరాగం!
          ఒకసారి చెన్నై సన్ టీవీ ఆఫీసు రిసెప్షన్ లో పక్కనే ఒక పెద్దాయన లాప్ టాప్ మీద బిజీగా వున్నాడు. అది తమిళ సీరియల్ స్క్రిప్టులా వుంది. ఆయన ఇటు వైపు చూసి, ఏం పనిమీద వచ్చారని అడిగాడు. ‘చివరకు మిగిలేది’ శాటిలైట్ హక్కులు అమ్మడానికి వచ్చినట్టు చెప్తే, బయటికి తీసికెళ్ళి టీ ఇప్పించాడు ( ‘చివరకు మిగిలేది’ నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ ఎం ఆర్ కొండలరెడ్డి కోరిక మేరకు వెళ్ళాల్సి వచ్చింది).  టీ తాగుతూ ‘చివరికిమిగిలేది’ గురించీ, అందులో సావిత్రి గారి నటన గురించీ గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు. సార్, ఇప్పుడు కూడా మీరింత టైం వేస్ట్ చేయకుండా రాస్తున్నారే అంటే, ‘వయసులో వున్నప్పుడు అబ్బిన డిసిప్లిన్. ఇప్పుడు రిలాక్స్ అయి లీజర్ గా రాసుకుందామన్నా సాధ్యం కావడం లేదు. శరీరాన్ని కష్ట పెట్టుకోవాల్సి వస్తోంది. ఇది శిక్షో భిక్షో తెలియడం లేదు’ అన్నాడు.

          క్రమశిక్షణ పురుగు దొల్చిందంటే అది శిక్షలా అన్పిస్తూనే, భిక్షలా కూడా ఊరిస్తూ చివరిశ్వాస  దాకా నడిపిస్తుంది. క్రమశిక్షణే బద్ధకానికి విరుగుడు. క్రమశిక్షణే ఏకాగ్రతకి ఎరువు. క్రమశిక్షణే ఉత్పాదకతకి ఇంధనం. ఇందుకే వృత్తి రచయిత అనుత్పాదక కార్యకలాపాలకి దూరంగా వుంటాడు, లేదా బాగా పరిమితం చేసుకుని, కాసేపు ఉపశమనానికి వాడుకుంటాడు. వృత్తి రచయిత రాసింది ప్రజల మధ్యకి పంపుతాడు, తను వెళ్ళడు. ఇంకా రాయడంలో తలమునలకై వుంటాడు. మధుబాబు ఎంత పేరొచ్చినా  దాన్ని ఎంజాయ్ చేయలేదు. పేరొచ్చిన సినిమా రచయితలు కూడా ఎంజాయ్ చేయరు. అంత తీరిక వుండదు. అంతేగాక,  ఎంజాయ్ చేయడానికి అదేమన్నా తమ గొప్పా? పాఠకులో ప్రేక్షకులో ఒప్పుకుని పెట్టిన భిక్ష! 

          ఇలా వృత్తి రచయిత లక్షణాల గురించి, అవసరాల గురించీ  చెప్పుకున్నాక, ఇప్పుడు తిరిగి బుద్ధిపూర్వక బద్దకం విషయానికొద్దాం. రాయలేక బద్ధకించినా దాని గురించే ఆలోచిస్తూ వుంటామని చెప్పుకున్నాం. అలాగే బుద్ధిపూర్వకంగా రాయడం ఆపడం గురించి కూడా చెప్పుకున్నాం. దీన్ని ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం. దీన్ని బుద్ధిపూర్వకంగా బద్దకించడం అందాం. 

          ఎంత మూడ్ లో వుండి టకటకా రాసుకుపోతున్నా పొద్దంతా రాయకూడదు. తెలియకుండానే క్వాలిటీ తగ్గిపోతూ వుంటుంది.  అందుకని ఎంత ఊపు మీద రాస్తున్నా సమయం చూసి ఆపెయ్యాలి. ఆపేసి బద్ధకించాలి. బద్ధకించమంటే పట్టపగలు నిద్రపొమ్మని కాదు. ఇంకో పనేదో చెయ్యాలి. రాయడానికి  బద్ధకించమన్నామే గానీ, ఇతర పనులు చేసుకోవడానికీ బద్దకించమనలేదు. ఆ ఇతర పనుల్లో మళ్ళీ చదవడం, టీవీ చూడడం మాత్రం  వుండకూడదు. అలాచేస్తే దృష్టి మళ్ళి,  రాస్తున్న విషయం మీద మెదడు ఆలోచనలు చెయ్యదు. బయట తిరిగి రావచ్చు, వ్యాయామం చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, ఆఖరికి టేబుల్ తుడుచుకోవచ్చు. మాన్యువల్ పనులేవైనా  చేసుకోవచ్చు.  ఈ సమయమంతా మెదడు పట్టుబట్టి ఇంకా ఏమేం ఆలోచిస్తోందో తెలుస్తూనే వుంటుంది.అప్పుడుకూర్చుని రాయడం మొదలెట్టాలి. అప్పుడా క్వాలిటీ తెలిసి పోతూనే వుంటుంది.  పైగా త్వరగా పనై పోతుంది. నాలుగు గంటలు పట్టే పని రెండు గంటల్లో పూర్తయిపోతుంది.  ఏకబిగిన రాసుకుంటూ కూర్చుంటే  నాలుగుగంటలు పట్టే టైము, ఆరుగంటలు తీసుకుంటుంది.

          ఈ వ్యాసకర్త జయించలేని సమస్య ఒకటుంది. రాస్తున్నప్పుడు ఏదైనా నవ్వొచ్చే వాక్యం పడిందా, ఇక ఫక్కున నవ్వొచ్చి లేచి బయటి కెళ్ళి పోతాడు. ఆ వాక్యాన్ని తల్చుకుంటూ తల్చుకుంటూ నవ్వుకోవడంతోనే సరిపోతుంది. ఇది తప్పని తెలుసు. మనం రాసి మనమే నవ్వుకోవడం. ఇందులోంచి తేరుకోవడానికి నిముషాలు కాదు,  కొన్ని సార్లు గంటలూ పట్టి టైం వేస్టయి పోతూంటుంది. ఇలా ఎన్ని వాక్యాలకి నవ్వొస్తే అన్నిసార్లు లేచెళ్లి పోయి నవ్వుకోవడమే. ఇలాటి వాక్యాలు పడకుండా చూద్దామంటే అవి పడిపోతాయి. పడ్డాయా సమయమంతా వృధా. డెడ్ లైన్లు సఫా. దీనికి పరిష్కారమనేది కన్పించడం లేదు. నవ్వడం టానిక్కే, కానీ ఇక్కడ టైటానిక్ అవుతోంది. ‘హౌ టు స్టాప్ లాఫింగ్ అండ్ స్టార్ లివింగ్’ అని డేల్  కార్నెగీ రాసి వుంటే బావుండేది. 

          మెదడు రెండుగా వుంటుంది : కుడి మెదడు ఎమోషనల్ గా, ఎడమ మెదడు లాజికల్ గా అని తెలిసిందే.  కుడి మెదడే రచన చేసుకుపోతుంది, ఎడమ మెదడు సహేతుకత చూస్తుంది. కుడి మెదడు కథ ఆలోచిస్తూ రాసుకుపోతుంది  – ఎడమ మెదడు దాన్ని పరిశీలిస్తుంది, ఎడిట్ చేస్తుంది, పాలిష్ చేస్తుంది. కాబట్టి బుద్ధిపూర్వకంగా రాయడం ఆపి నప్పుడు, మెదడు పనిచేయడాన్ని నియంత్రించాలి. ఇంకా రాయడం ముగించలేదు కాబట్టి, రాయడం మీదే కుడి మెదడు ఆలోచించేందుకు వదిలెయ్యాలి. ఇలా కాక, అంతవరకూ రాసిన దాన్ని ఇది కరెక్టా? ఇందులో లాజిక్ వుందా?  అని ఆలోచిండం మొదలెడితే, కుడి మెదడుని ఆపేసి,  ఎడమ మెదడు దాని పని అందుకుంటుంది. అంతవరకూ రాసి ఆపిన దాన్ని పరిశీలించడం, ఎడిట్ చేయడం, పాలిష్ చేయడం మొదలెడుతుంది. అప్పుడు తిరిగి రాయడానికి కూర్చున్నప్పుడు ఆలోచనలు సాగవు.  ఎందుకంటే,  బుద్ధిపూర్వకంగా కథ రాయడాన్ని ఆపినప్పుడు, కథ ఆలోచించే కుడి మెదడుని బంద్ చేసుకుని,  పోస్ట్ మార్టం చేసే ఎడమ మెదడుని తట్టి లేపాం కాబట్టి.

          అందుకని అప్రమత్తంగా వుండాలి. రాయడం పూర్తయ్యే వరకూ ప్రశ్నించుకోకూడదు. ఎమోషనల్ గా (కుడి మెదడు) రాసుకుపోవాలి. రాసేశాక లాజికల్ గా (ఎడమ మెదడు) చెక్ చేసుకుంటూ పోవాలి. ఏకకాలంలో రెండూ చేస్తే మెదడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే, ఏకకాలంలో కుడి - ఎడమ రెండు మెదడులూ పనిచేయడం అసాధ్యం.

          ఇదీ బుద్ధిపూర్వకంగా బద్ధకిస్తూ రాసే (ఆలోచించే) విధానం. రాస్తున్నప్పుడు ఎడమ లాజికల్ మెదడు పనిచేయడమే మూడ్ చెడిపోవడానికి, మూడ్ లేకపోవడానికి కారణం. రాస్తున్నప్పుడే కాక, కథ ఆలోచిస్తునప్పుడు కూడా లాజికల్ మైండ్ ని అనుమతిస్తేనే ఆ కథ ఆలోచించే మూడ్ పోతుంది...

సికిందర్
.


19, ఫిబ్రవరి 2018, సోమవారం

607 : నోట్ - 2


       
       ష్యూ క్లోజ్ అయ్యేట్టు లేదు. వాట్సాపులు, మెసెంజరులు బిజీ అవుతున్నాయి. ఫోన్ కాల్స్ లో చెప్పిందే చెప్పి నచ్చజెప్పాల్సి వస్తోంది. ఫైనల్ గా  ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చి ఇష్యూ క్లోజ్ చెయ్యాలి. ప్రపంచం ఆగిపోదు, the show must go on! ఈ బ్లాగులో రివ్యూలు రానంత  మాత్రాన కొంపలేమీ అంటుకోవు. కానీ ఇలా రివ్యూలు మానెయ్యాల్సిన పరిస్థితిని కల్పించిన వాళ్ళెవరు?  సినిమా వాళ్ళే!  రివ్యూలు రాస్తున్నంత కాలం ఈ వ్యాసకర్త ఏనాడూ సినిమా ప్రయత్నాలు చేసిందీ లేదు. ఎందుకంటే ఒకర్ని అడుక్కోవాలంటే మనసొప్పదు. చాలా వరకూ అజ్ఞాతంగా వుంటూ రివ్యూలూ ఇతర వ్యాసాలూ రాసి అవతల పడెయ్యడమే తప్ప, వాటినుంచి  మైలేజీ ఆశించే పని కూడా పెట్టుకోలేదు. సినిమా రచయితల సంఘంలో సభ్యత్వం లేదు. క్రిటిక్ అని భావించుకోలేదు కాబట్టి ఆ సంఘాల్లోనూ సభ్యత్వం లేదు. ఏ బంధనాలూ లేని ఫ్రీ బర్డ్ లా  వుంటే, ఒకరొకరే వచ్చి పట్టుకోవడం మొదలెట్టారు. 

          ఎవరు వీళ్ళు? ఒక దర్శకుడు దశరథ్ దగ్గర్నుంచీ అమలాపురంలో ఆటో డ్రైవర్ దుర్గారావు వరకూ వున్నారు. బెల్లంపల్లిలో ఒక అనంత్ దగ్గర్నుంచీ,  విజయవాడలో ఆదిత్యా చౌదరి వరకూ వున్నారు. 1996 లో ప్రారంభించి ఆంధ్రభూమిలో రాస్తున్నప్పట్నించే మొదలయ్యింది. కేరాఫ్ ఆంధ్ర భూమికి ఉత్తరాలు రాసి మేమొచ్చేస్తున్నామని అనే వాళ్ళు. వచ్చి రివ్యూలు రాసేవాడితో ఏంచేస్తారో అర్ధమయ్యేదిగాదు. రావద్దనే చెప్పాల్సి వచ్చేది. ఇక్కడొచ్చి బాధలు పడేకంటే అక్కడే ఫాస్ట్  ఫుడ్ సెంటర్ నడుపుకుని జీవించడం బెటరని చెప్పినా వినేవాళ్ళు కాదు. దుర్గారావొక్కడే  ఆగిపోయాడు. ఇప్పటికీ ఫోన్లు చేసి సినిమాల్ని ఎనాలిసిస్ చేస్తూంటాడు. ఇలా బయటి వాళ్లెందరో వున్నారు. దర్శకుడు దశరథ్ పిలిపించుకుని స్క్రీన్ ప్లే బుక్ ప్లాన్ చేద్దామన్నారు. అది ముందుకు సాగలేదు. ఇక అసిస్టెంట్లు, అసోషియేట్లు సరేసరి. సినిమా ఫీల్డులో అమాయకులకి ఒక నమ్మకముండేది. ఆంధ్రభూమి వెన్నెల్లో రివ్యూలు రాసే వాళ్ళు గొప్ప మేధావులని. ఎంత మేధావులో రాస్తున్న వాళ్లకి పరస్పరం తెల్సు. తెలుగు సినిమాలు తీయడానికీ, రివ్యూలు రాయడానికీ పెద్దగా మేధావితనం అవసరం లేదనీ తెలుసు. కానీ అమాయకులు అలా  బిల్డప్ ఇచ్చేసి ఆంధ్రభూమి ఆఫీసుకొచ్చేసి, బయట టీస్టాల్  దగ్గర ఫ్యాన్స్ గా ప్రకటించుకునే వాళ్ళు. కొందరు కృష్ణానగర్ లో ఫ్యాన్స్ క్లబ్ పెట్టుకుంటామంటే తిట్టి పంపాల్సి వచ్చింది. ఆంధ్రభూమి సంపాదకులు ఎంవీఆర్ శాస్త్రి గారు ఈ వ్యాసకర్త ఏం రాస్తున్నా, ఎలా రాస్తున్నా  ఏమీ అనేవారు కాదు. పైగా కొన్ని రివ్యూలకి  హెడ్డింగులు మార్చి ఘాటు హెడ్డింగులు పెట్టేవారు. నిర్మొహమాటంగా రాయడం ఆయనిచ్చిన స్వేచ్ఛ వల్లే సాధ్యమైంది. ఆయన లేకపోతే ఈ వ్యాసకర్త డబ్బాలు కొడుతూ అందర్నీ సంతోష పెట్టేలా రివ్యూలు రాస్తూ బతికే వాడేమో. ఈ నిర్మాణాత్మక నిర్మోహమాటానికి నెగెటివ్ అనే పేరొచ్చింది. ఏటేటా 90 శాతం అట్టర్ ఫ్లాపులు తీస్తున్న వాళ్ళే  సినిమా ఫీల్డుకి నెగెటివ్ లు కారేమో అన్పించేది మనకి.  దర్శకుడు వీర శంకర్ వెబ్ సైట్ పెట్టి రివ్యూలు రాయిస్తున్నప్పుడు, వీడికి దర్శకత్వం ఛాన్సు రాక, రైటర్ గా అవకాశాలు దొరక్క అక్కసు తీర్చుకుంటున్నాడనీ, కృష్ణా  నగర్ చీప్ లిక్కర్ బ్యాచి అనీ బూతులతో దీవిస్తూ  కామెంట్లు పెట్టే వాళ్లు  సినిమా వా
ళ్ళే. పట్టించుకోలేదు. ఇలాటి వాళ్ళు 90 శాతం అట్టర్ ఫ్లాపులిచ్చే  ఫీల్డుకి పట్టిన అదృష్టవంతులనీ తెలుసు. ఇలా రివ్యూలు రాస్తే కాదు, ఒక సినిమా తీసి చూపించమనే వాళ్ళూ వున్నారు. వాళ్ళే  ఒక్క రివ్యూ రాసి చూపించగల్గితే,  సినిమాలు తీయడానికి వాళ్ళెంత అర్హులో తేలిపోతుంది కదా?  రివ్యూలు రాయడం చాలా ఆషామాషీ బాధ్యత లేని తనమనుకుంటున్నారు ఇప్పటికీ.

          మొత్తానికి వెన్నెల ఇంఛార్జులుగా మారుతూ వుండే చల్లా శ్రీనివాస్, అబ్దుల్, వీఎస్ ఎన్ మూర్తి ముగ్గురూ శాస్త్రి గారిచ్చిన  స్వేచ్ఛ ని అనుభవించారు. కానీ మొదట్లో వెన్నెల ఇంఛార్జిగా  వున్న అఫ్సర్ గారు ఈ వ్యాసకర్తచేత ఆదివారం ఆంధ్రభూమికి క్రైం కథలు రాయించుకునే వారు. ఒక రోజు అక్షయ్ కుమార్ నటించిన ఖిలాడీయోంకా ఖిలాడీ చూసి నవ్వొచ్చి,  రివ్యూలాంటిది రాసి అఫ్సర్ గారికి చూపిస్తే, ఆయనా నవ్వుకుని కంటిన్యూ చేయమన్నారు. ఆ నవ్వులాట వెన్నెల ద్వారా ప్రసిద్ధ రచయిత మైనంపాటి భాస్కర్ కీ చేరి ఆంధ్రభూమి గేటు బయట ఆలింగనం చేసుకున్నారు. అలా యాక్సిడెంటల్ రివ్యూ రైటర్ అయ్యాక, మొదలయ్యింది అసిస్టెంట్ల, అసోషియేట్ల రాక. ఇప్పటికొచ్చి చూసుకుంటే ఓ డెబ్బై మంది వుంటారు. 

          చల్లా శ్రీనివాస్ ఆంధ్రజ్యోతికి వెళ్ళాక అక్కడ ఆదివారం ఆంధ్ర జ్యోతి ఇంఛార్జి ఎడిటర్ కె. వసంత లక్ష్మి గారికి చెప్పి క్రైం కథలు రాయించాడు. రెండేళ్ళు రాశాక  ఆపమని చెప్పి, వసంత లక్ష్మి గారు ఒక సినిమా కాన్సెప్ట్ ఇచ్చారు. వివిధ శాఖల టెక్నీషియన్లని వారం వారం పరిచయం చెయ్యమని. అలా 45 మంది వివిధ శాఖల టెక్నీషియన్లని ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు, సాహిత్యాభిలాష గల ఛోటా కె నాయుడు,  ఇంటర్వూ రాశాక తనకి చూపించి మరీ ముద్రించాలన్నారు. రాసి చూపించాక చాలా ఫీలయ్యారు శైలికి. భుజం మీద చెయ్యేసి అటూ ఇటూ ఫిలాసఫర్ లాగా నడిచారు. అప్పటికి దశరథ్ కావాలని అడిగి రాయించుకున్న బిగ్ కమర్షియల్ స్క్రిప్టు ఈ వ్యాసకర్త దగ్గరుంది. ఇప్పుడు ఛోటా కె నాయుడు గారికి చెప్తే ఎక్కడో ఆయన సెట్ చేసేస్తారు. అయినా చెప్పలేదు.  మనం వెళ్ళింది పత్రిక తరపున ఇంటర్వ్యూ చేయడానికే గానీ, ఈ అవకాశాన్ని సొంత అవసరాలకి వాడుకోవడానికి కాదు. తిరిగి చల్లా  శ్రీనివాస్ ఆంధ్రజ్యోతికి వచ్చి క్రైం స్టోరీలు అడిగితే ప్రస్తుతం తొమ్మిది  నెలలుగా అవి రాయడం జరుగుతోంది. ఇలా అడిగితే తప్ప ఒకర్ని ఇబ్బంది  పెట్టి అడుక్కుని మరీ వెంటపడి రాసే అలవాటు లేకపోవడం చేత, సినిమా రైటర్ కాలేకపోయాడీ వ్యాసకర్త.  ఇది మంచిదే అయ్యింది కదా రివ్యూలు రాసుకుంటూ హేపీగా గడపడానికి? 

          ఇలాటి వాణ్ణి  అసిస్టెంట్లు, అసోషియేట్లు ముగ్గులోకి లాగడం  మొదలెట్టారు. వాళ్ళ కథలకోసం ఏళ్లతరబడి ఎంతో సమయం, శక్తీ కరిగిపోయేది.  కానీ ఏదీ వృధా పోదు – 
nothing goes waste  in God’s grand economy .  ప్రతీ ఒక్కరూ ఎదగాలని  స్ట్రగుల్ చేస్తూంటారు.  ఎవర్నీ చిన్న చూపు చూడలేం, ఎదుగుదల వైపు మనం వుండక తప్పదు. నమ్మి వచ్చిన వాళ్లకి సాయపడాలి. అపాత్ర దానమనేది ఒక నమ్మకం మాత్రమే –nothing goes waste  in God’s grand economy అనేదే సత్యం. చేజారిన నీళ్ళు కూడా నేలని తడుపుతాయి. అక్కడో మొక్కో సూక్ష్మ జీవులో బతుకుతాయి. ఏదీ వృధా పోదు. 

          ప్రతీ ఏటా 70 మంది కొత్త దర్శకులు వస్తే డెబ్బై మందీ అట్టర్ ఫ్లాపవుతున్నారు. వాళ్ళల్లో ఒకరో ఇద్దరో ఈ వ్యాసకర్తతో సంబంధమున్న వాళ్ళే. తీరా సమయం వచ్చేసరికి వాళ్ళేదో రాసుకుని, తీసుకుని,  వాళ్ళ దారిని వాళ్ళు వెతుక్కుని వెళ్ళిపోతున్న వాళ్ళే. ఇది తప్పేం కాదు. మనసుకి నచ్చినట్టు  చెయ్యాలి. ఎక్కువమంది అవకాశాల కోసం ఇప్పటికీ స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళే వున్నారు. ఎప్పుడూ కాంటాక్టులో  వుంటూ,  అవసరమైతే కొత్తవి రాయించుకుంటూ కొన్నేళ్లుగా మిత్రులైపోయి వున్నారు. ఇలా వివిధ దశల్లోనో  (వన్ లైన్ ఆర్డరో, ట్రీట్ మెంటో,  డైలాగ్ వెర్షనో), మొత్తంగానో,  మూడు డజన్ల స్క్రిప్టులు రాసి,  ఒక్కటీ తెరకెక్కకుండా తిరుగుతున్న రైటర్ కాని  రైటర్ ఎవరైనా ప్రపంచంలో వున్నాడంటే,  అది ఈ వ్యాసకర్తేనని ఇప్పటికీ జోకులేసుకోవాల్సి వస్తోంది. మనం సాధించిన రికార్డు ఇదే! 

          టాప్ స్టార్ కి స్క్రిప్టు రాసి, కొన్నేళ్ళు చూసి చూసి,  అపాయింట్ మెంట్ కి కూడా మనమే పూనుకుని ఏర్పాట్లు చేస్తే, ఆ అసోషియేట్ అప్పుడే డాక్టర్ దాసరి నారాయణ రావు గారిలా ఎక్స్ ప్రెషనిచ్చి అపాయింట్ మెంటే లేకుండా చేసుకుంటే ఏం చేయగలం. ఇలాటి మన డొమైన్ కాని పన్లు కూడా చేయాల్సి వచ్చేది. ఒక పేరున్న కో డైరెక్టర్ ఏరికోరి స్క్రిప్టు రాయించుకుని, తీరా ఇంకో సినిమాకి కో డైరెక్టర్ గానే జంప్ అయిపోతే ఏం చేయగలం. దశాబ్డంన్నర కాలంగా ఇలాటి ఫన్నీ సీన్లు ఎన్నో. 

          ఈ కాలంలో వేరే దర్శకుల ఓ నాల్గు సినిమాలు చేయకపోలేదు. వాటిలో రెండిటికి పే రేసుకోలేదు. ఒకదానికి మారు పేరు వేశాం. ఇంకోదానికి వద్దన్నా పేరేసేశారు. ఒక సినిమా చేస్తే మళ్ళీ చేస్తామో లేదో నమ్మకమే లేనప్పుడు, పేరేసుకోకుండా వుంటే రివ్యూ రైటర్ గా  కొనసాగ వచ్చన్న ముందు చూపుతోనే తప్ప మరొకటి కాదు. పేరేసిన సినిమా ఒక్క రోజే ఆడడంతో ఎవరి దృష్టిలో పడలేదు. చాలా హేపీ అన్పించింది. కానీ అప్పటికే యూసుఫ్ గూడా సెంటర్లో పోస్టర్ మీద పేరు చూశామని ఎవరో చెప్పనే చెప్పేశారు. విషయమేమిటంటే,  బతుకమ్మ అప్పట్నించీ సీనియర్ దర్శకుడు టి. ప్రభాకర్ గారంటే  గౌరవముంది. విభేదించి వెళ్ళిపోయినా ఫీలవకుండా మళ్ళీ పిలిపించుకుంటారు. ఆయన ఒక లిమిట్ లో ఆలోచిస్తారు. మనం ఇంకెక్కువ ఆలోచిస్తాం. కాబట్టి ఆయన లిమిట్ లో తీసే సినిమాలకి వర్క్ చేసి పే రేసుకోకుండా వుంటే చాలనుకుంటాం. ప్రస్తుతం ఆయన బిత్తిరి సత్తితో చేస్తున్న ‘తుపాకీ రాముడు’కి కూడా పిలిపించుకుని వర్క్ చేయించుకున్నారు. ఇలా పేరేసుకోకుండా వర్క్ చేసినా, బయట వేరే సినిమాలకి రివ్యూలనేవి రాయకూడదు. ఈ మానసిక సంఘర్షణ వుంటూనే వుంది.

          ఇప్పుడు పదేళ్లో ఐదేళ్లో స్ట్రగుల్ చేసి, క్రియేటివిటీ పరంగా ఈ వ్యాసకర్తతో ఒకే వేవ్ లెంత్ తో వుంటూ వస్తున్న నమ్మిన  మిత్రులకి  రాసిచ్చాంగా  పొమ్మనలేం. ఇంకా వాళ్ళతో పూర్తి స్థాయిలో రాసి, చివరంటా అందుబాటులో వుండాలి. మరో ఇద్దరో ముగ్గురో  మంచి గాలప్ మీద  వచ్చేస్తున్నారు. రేపో ఎల్లుండో ఫైనల్ గా వచ్చి పడతారు అనేట్టున్నారు. ఇలాంటప్పుడు ఇది పూర్తి స్థాయి వృత్తి అయిపోతుంది. రివ్యూలు ఇక ప్రవృత్తి కూడా కాదు. మానెయ్యాలి. ఇంత ఎథిక్స్ ఆలోచిస్తే ఎలా అని కొందరు అంటున్నారు. రివ్యూలు రాయాల్సిందే అంటున్నారు. ఇలా సినిమా వాళ్ళే  అనడం విచిత్రం, ఇతర పాఠకులు సరే. ఇదిక కుదరదని అంటున్నాం. ఇలాటి తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోక తప్ప లేదు. ఇటు వైపు లాగిందే సినిమా వాళ్ళు. ఇది గమనించాలి. 

          రివ్యూలు లేకపోయినా బ్లాగులో ఇతర పనికొచ్చే ఆర్టికల్స్ కొనసాగుతాయి. స్క్రీన్ ప్లేకి సంబందించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు  ప్రత్యక్ష మవుతాయి. ఇప్పుడు స్వీయానుభవం లోంచి రాసేవి కూడా కొన్ని జత కలుస్తాయి.ఇంతేకాకుండా ఎప్పట్లానే అసోషియేట్లకి అందుబాటులో వుండడం జరుగుతుంది. సేవలు యధావిధిగా కొనసాగుతాయి. అవన్నీ కథల గురించే. నిర్మాతలకి డబ్బులొచ్చే కమర్షియల్ కథల గురించి. వీటికి సంబంధించిన రీసెర్చ్ ఎప్పుడూ వుంటుంది. హాలీవుడ్డే  టాలీవుడ్ కి ఆదర్శం. వేరే  డబ్బులు రాని వరల్డ్ మూవీస్ బాపతు కథలు కాదు, షార్ట్ ఫిలిమ్స్  బాపతు కథలు కాదు. వీటికి దూరం.

-సికిందర్
         



         

.