రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, ఆగస్టు 2020, సోమవారం

964 : రివ్యూ


దర్శకత్వం : అనూ మీనన్
తారాగణం: విద్యాబాలన్, సాన్యా మల్హోత్రా, అమిత్ సాద్, జిష్షూ సేన్ గుప్తా తదితరులు
సంగీతం: సచిన్ -జిగర్, ఛాయాగ్రహణం: కీకో నకహరా
బ్యానర్ : సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా, విక్రం మల్హోత్రా
విడుదల : అమెజాన్

***
ణిత మేధావి, మానవ కంప్యూటర్, లెజెండ్ శకుంతలా దేవి బయోపిక్ గా నిర్మించిన ‘శకుంతలా దేవి’ పూర్తిగా విద్యాబాలన్ వన్ వుమన్ వండర్ఫుల్ షో. వచ్చిందంటే బాలన్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ నే మోసుకొస్తుంది. శకుంతలా దేవియే స్వయంగా గణితంతో జగమెరిగిన ఎంటర్ టైనర్ అయినప్పుడు, బోరుకొట్టే గణితానికి హుషారు తెప్పించే  గ్లామర్ తీసుకొచ్చినప్పుడు, సర్కస్ లో రింగ్ మాస్టర్ లా వేదికల మీద గణితంతో వినోదం పంచినప్పుడు, బాలన్ కి పండగే అయిపోతుంది ఫన్ చేయడానికి. బరువైన జీవిత గాథలతో యమ బోరుగా, సీరియస్ గా వుండే బయోపిక్స్ జానర్ కి, శకుంతలా దేవి పుణ్యమాని కమర్షియల్ సినిమా రెక్కలొచ్చాయి. ఆమె జీవితం ఒక కమర్షియల్ సినిమా. విద్యాబాలన్ డైలాగు చెప్పినట్టు - చెట్టుకీ మనిషికీ తేడా వుంది. చెట్టుకి వేళ్ళుంటాయి, మనిషికి కాళ్ళుంటాయి. వేళ్ళు నేలలో పాతుకుని అక్కడే వుండి పోతాయి, కాళ్ళు ప్రపంచమంతా చుట్టేస్తాయి. శకుంతలా దేవి బయోపిక్ వేళ్ళు లాంటిది కాదు, కాళ్ళు వంటిది. పరుగులు తీసే పాదాలతో గ్లోబల్ లేడీగా ఆమె బయోపిక్ ఒక వరల్డ్ టూరు. టోటల్ ప్రపంచం బ్రహ్మరధం పట్టిన సెలెబ్రేషన్.

        సెలెబ్రేషన్ని ఈ తరం ప్రేక్షకుల ముందుకు డైనమిక్ గా తీసుకువచ్చింది కొత్త దర్శకురాలు అనూ మీనన్, రచయిత్రులు నయనికా మహ్తానీ, ఇషితా మోయిత్రాలతో కూడిన ఫిమేల్ టీం. ఇలాటి ఫిమేల్ టీములు బాలీవుడ్ లో చూసి టాలీవుడ్ లో ఏర్పడ్డం ఎప్పటికి జరుగుతుందో తెలీదు. ఈ బయోపిక్ ఫిమేల్ టీము ఇగోలు తెచ్చుకుని మేల్ ఆలోచనలతో ఫేక్ మేకింగ్ చేయకుండా, ఆద్యంతం కోమలమైన స్త్రీ సుగుణాలు ప్రతిఫలించేలా శకుంతలా దేవికి నీరాజనాలు పట్టారు. 

కథ
    ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి శకుంతలా దేవి (విద్యాబాలన్) మీద ఆమె కుమార్తె అనుపమ (సాన్యా మల్హోత్రా) పదేళ్ళ పాటు జైలుకి పంపే క్రిమినల్ కేసు వేయడంతో ప్రారంభ మవుతుంది బయోపిక్. అనుపమ జ్ఞాపకాల్లో ఫ్లాష్ బ్యాకుల్లో వస్తూంటుంది శకుంతలా దేవి గత జీవితం...1930 లలో కర్ణాటకలో ఐదేళ్ళ శంకుంతల స్కూలు కెళ్లకుండానే లెక్కల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తుంది. ఎలాటి గణిత సమస్యనైనా సెకన్లలో సాల్వ్ చేసేస్తూంటుంది. ఆ వయసులోనే ఆమె గణితావధాని. ఎనిమిదేసి అంకెలున్న సంఖ్యని, ఇంకో ఎనిమిదేసి అంకెలున్న సంఖ్యతో హెచ్చ వేసి, ఎంత వస్తుందో చెప్పమని బోర్డు మీద రాస్తే, రెండు క్షణాలు ఓ లుక్కేసి చట్టుక్కున చెప్పేసి ఆశ్చర్యంలో ముంచేస్తూంటుంది. క్యూబ్ మూలాలైతే  కంప్యూటర్ కంటే వేగంగా లెక్కించి ఠకీల్మని చెప్పేస్తూంటుంది. లెక్కలు ఆమె ఎడం చేతి వాటం అయిపోతాయి. 


        ఇదంతా గమనించి సంపాదన లేని పేద బ్రాహ్మణుడైన ఆమె తండ్రి (ప్రకాష్ బెలవాడీ) ఆమెని స్కూళ్ళకి తిప్పి ప్రదర్శన లిప్పిస్తూ డబ్బులు సంపాదిస్తూంటాడు. స్కూల్లో చేరి చదువుకోవాలన్న ఆమె కోరిక మాత్రం నెరవేర్చడు. తండ్రి ముందు తల్లి (ఇస్పితా చక్రవర్తి) నోరు విప్పలేని నిస్సహాయురాలు. తల్లిదండ్రు లిద్దరూ ఇలా వుండేసరికి విసిగిపోయిన శకుంతల, ‘సంపాదిస్తున్నది నేనైనప్పుడు నాన్న కాదు నేను తండ్రిని’ అని తిరుగుబాటు ప్రకటిస్తుంది ఐదేళ్లప్పుడే. తను సంపాదిస్తున్నా ఆ డబ్బుతో వైద్యం చేయించక పోవడంతో వికలాంగు రాలైన అక్క చనిపోతుంది. దీంతో తల్లిదండ్రుల పైన ఇంకా అసహ్యం పెంచుకుంటుంది. ఇక జీవితంలో క్షమించనని తల్లికి చెప్పేస్తుంది. నీలా నేను తయారుకానని తల్లిని ద్వేషిస్తుంది. భూమి గుండ్రంగా వుందమ్మా, నీ కూతురితో నీకూ నాలాటి పరిస్థితే వస్తుందని తల్లి అంటుంది.

        శకుంతల యుక్త వయస్కురాలయ్యే టప్పటికి ఆమె పేరు దేశంలో మార్మోగిపోతుంది. ఇక నగరాల్లో ప్రదర్శనలివ్వడం మొదలెడుతుంది. తన కంప్యూటర్ కంటే వేగవంతమైన మెదడుతో గణిత మేధావులు సైతం అవాక్కయ్యేలా చేస్తూంటుంది. 1955 కల్లా లండన్ నుంచి ఆహ్వానం వస్తుంది. అక్కడ ఆమె గణితావధానం అంతర్జాతీయ మవుతుంది. ఇక ఆమెని  మానవ కంప్యూటర్ గా కీర్తించడం మొదలెడతారు. ప్రపంచ మంతా ప్రదర్శన లిస్తుంది. దేశవిదేశాల్లో అపార ధనరాసులు, ఆస్తులు గడిస్తుంది. స్కూలుకే వెళ్ళని తను ఇంగ్లీషు మాట్లాడేస్తుంది. ఆమె మెదడు శాస్త్రవేత్తలకి కూడా అంతు చిక్కని రహస్యమై పోతుంది.  

     ఒక కలకత్తాకి చెందిన ఐఎఎస్ అధికారి పరితోష్ బెనర్జీ (జిష్షూ సేన్ గుప్తా) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ కూతురు పుట్టగానే భర్త కప్పజెప్పి ప్రపంచ యాత్రకి వెళ్ళిపోతుంది. గణితం లేకుండా తను వుండలేదు. తనని విడిచి అంకెలు వుండలేవు. పైగా బానిస లాంటి తన తల్లికి తానేమిటో నిరూపించాలన్న కసి, తల్లిలా తను ఐపోకూడదన్న పట్టుదలా ఇంకోవైపు. తల్లి ప్రేమ కరువైన కూతుర్ని గుర్తించి లండన్ కి తెచ్చుకుంటుంది. కానీ స్కూల్లో వేయకుండా తనవెంటే దేశాలు తిప్పుతుంది. అక్కడ్నించీ తల్లీ కూతుళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు సంక్షుభితమవడం మొదలెడతాయి. ఇరవయ్యేళ్ళూ సుఖ శాంతులుండవు. తన తల్లితో తనేం చేసిందో అదే తన కూతురూ తనకూ చేయడం భూమి గుండ్రంగా వుందన్న తల్లి వాక్కుని గుర్తుచేస్తుంది. 

        చివరికి తల్లిని జైలుకి పంపే క్రిమినల్ కేసు వేసే పరిస్థితి కూతురి కెందు కొచ్చింది? కూతురి సర్వం లాక్కుని రోడ్డున పడేసే పని తల్లి ఎందుకు చేసింది? ఎందుకీ శత్రుత్వాలు?  కూతురు కూడా తల్లి అయిందిప్పుడు. భావికాలంలో ఈ కూతురికి పుట్టిన కూతురూ తల్లితో ఇలాగే చేస్తుందా? ఈ చక్రభ్రమణం ఆగేదెలా? ఇదెలా పరిష్కరమయింది? అసలు సమస్య ఎక్కడుంది? ఇదీ మిగతా కథ.

నటనలు- సాంకేతికాలు
      ముందే చెప్పినట్టు ఇది విద్యాబాలన్ వన్ వుమన్ వండర్ఫుల్ షో. గ్రేట్ షో. ‘బ్రిటన్ కి రాణి ఎవరైనా, ప్రపంచానికి రాణి ఈ హిందుస్తానీ’ అని పాటేసుకుని ప్రపంచాన్ని చుట్టేస్తూ శకుంతలా దేవికంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది. తనలా హాస్యం నటించే నటీమణులు లేరు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్వించేస్తూ, గర్వం లేకుండా ఎవరితోనైనా కలిసిపోతూ, యూనివర్సల్ సిటిజన్ లా మెరిసిపోతూ ఫెంటాస్టిక్ గా నటించడం ఒకెత్తు. ఈ షుగర్ కోటింగ్ పొర తీసి లోపల చూస్తే - కూతురితో, భర్తతో ఏర్పడ్డ పరిణామాల తాలూకు విషాదచ్ఛాయల వికృతి దొలిచేస్తూంటే పడే వేదన. ఈ రెండిటిని కమ్మేస్తూ వృత్తిగతంగా అనితరసాధ్యమైన సింప్లిసిటీని ప్రదర్శించడం, తానొక ప్రఖ్యాతురాలన్న అహం లేని తనంతో ప్రవర్తించడం, మేథమేటిక్స్ తో మెజీషియన్ లా ప్రదర్శనలివ్వడంలో వయసు మీద పడ్డా అదే స్పోర్టివ్ నెస్ తో వుండడం- ఈ మూడంచెల అత్యంత సంకీర్ణ నిజ జీవిత పాత్రలో విద్యాబాలన్ నిలువెత్తు శకుంతలా దేవియే అన్పించుకోవడం ఆమెకే సాధ్యమవుతుంది. 


        ఓటమెరుగని ఇంత రోమాంచితమైన గణితావధాన ప్రస్తానంలో రెండే రెండు సార్లు ఆమె తొట్రుపాటు పడే సీన్లు ఇంకే సస్పెన్స్ - ఎమోషనల్ సినిమాలోనూ మనల్ని గాభరా పెట్టలేదు బహుశా. ఆమె ప్రస్థానంలో ఢక్కా మొక్కీ లుంటాయని అస్సలూహించకుండా షోని ఎంజాయ్ చేస్తున్న మన మీద రెండు సీన్లు బాంబుల్లా ప్రయోగిస్తుంది దర్శకురాలు.        


      ఒకటి: అంకెలు తప్పు చెప్పి, కంప్యూటర్ అడిగిన ప్రశ్నలోనే తప్పుందని ఆమె దబాయించడం. ఓటమి ఒప్పుకోకుండా దబాయిస్తూంటే మనకి కోపం కూడా వస్తుంది. ఓటమి పాలైనందుకు ఈమె పనై పోయిందని ప్రదర్శనలో వున్న ప్రేక్షకుల్లాగే మనకూ చులకన భావమేర్పడుతుంది. చాలా డిస్టర్బింగ్ ఘట్టం (వాస్తవంగా ఇది బిబిసి షో). ఆమెని కూడా డిస్టర్బ్ చేసే ఈ సంఘటన తర్వాత కంప్యూటర్ అడిగిన ప్రశ్నలోనే తప్పుందని తేలడంతో సుఖాంతమవుతుంది. 

        ఇంతకి మించిన సీను రెండోది: ఇలాటిదే ఇంకో షోలో నిజంగా విఫలమవుతుంది. నిండు సభలో గణితం లెక్కిస్తున్న క్షణాల్లో, హఠాత్తుగా కూతురితో పడిన ఘర్షణ గుర్తుకొచ్చి మెదడు అదుపు తప్పిపోతుంది. షాక్ అవుతాం. ఇలా ఈ సమయంలో కూతురు గుర్తొస్తుందని అస్సలనుకోం. చూసి చూసి తురుపు ముక్కల్లా ఈ రెండు సీన్లని గురి చూసి  ప్రయోగించింది దర్శకురాలు. ఈ రెండు సీన్లు బాలన్ ప్రతిభని నిరూపిస్తాయి.      
   
       నటనకి ఇంకో బలం ఆమె సంభాషణలు. ఇలాటి స్ఫూర్తి మంతమైన క్లుప్త సంభాషణలు గత కొన్నేళ్ళ కాలంలో ఏ నటులూ నోచుకోలేదు - ‘మనసు చెప్పింది విని, హృదయం విప్పి మాట్లాడే ఆడదంటే ఎంత భయమో’, ‘ప్రపంచంలో రెండే ప్రశ్నలుంటాయి: నాకు డబ్బొస్తుందా? నాకు ప్రేమ లభిస్తుందా?’, నువ్వు అందరు అమ్మల్లాగా నార్మల్ గా ఎందుకుండవని కూతురు నిలదీసినప్పుడు- ‘అమేజింగ్ గా నేనుండే అవకాశం నాకున్నప్పుడు నార్మల్ గా ఎందుకుండాలి?’, ‘నీ కళ్ళల్లో మెరుపు కంటే ఎక్కువ కాదు ఎంత డబ్బైనా’, ‘నువ్వు నా మ్యాథ్స్ నుంచి నన్నుదూరం చేశావ్’, ‘మ్యాథ్స్ తెలిసిన రెండు జడలమ్మాయిని చూస్తే మొహం ఇలా పెడతారు’, ‘నేనెప్పుడూ ఓడిపోను, రిమెంబర్ దట్’...ఇలా వందకి పైగా ఇన్నోవేటివ్ డైలాగులు సన్నివేశాల్లో కలిసిపోయి ప్రవహిస్తూంటాయి. 

        విద్యాబాలన్ తర్వాత కూతురి పాత్రలో సాన్యా మల్హోత్రా. పుట్టింది మొదలు తల్లితో సంఘర్షణ తోనే గడిచిపోయే పాత్ర. జుట్టు పీక్కున్నా అర్ధంగాని తల్లిని చూసి, ‘నువ్వొక అర్ధం గాని ప్రహేళిక’ అనేసినప్పుడు ప్రదర్శించే వేదన పవర్ఫుల్. ఇంకోచోట తన బ్రతుకు దుర్భరం చేస్తూంటే తట్టుకోలేక, ‘అమ్మా, నీకు అలసట రాదా?’ అన్నప్పటి నిస్సహాయత  సాన్యాలోని నటిని పట్టిస్తుంది. ‘చిన్నప్పుడు ఇతరుల ఇళ్ళల్లోకి తొంగి చూసేదాన్ని...నాకు నాదంటూ ఒకిల్లు ఏర్పాటు చేసుకోవాలనుంది’ అన్నప్పటి పసితనం ఆమె లోని నటికి ఇంకో పార్శ్వం. 

    మూడో కీలక పాత్ర భర్తగా జిష్షూ సేన్ గుప్తా ఈ బయోపిక్ కి ఇంకో బలం. ఐఏఎస్ ఆఫీసర్ గా హూందా అయిన నటన. భార్య నుంచి కూతుర్ని రక్షించడం కోసం పడే పాట్లే అతడి పాత్ర. తను చెట్టు లాంటి వాడు. వేళ్ళు నేలలోనే పాతుకుని వుంటాయి. చెట్టు నీడలోనే  కూతురు పెరగాలి, బంజారాలా తిరిగే భార్య వెంట కాదు. కూతుర్ని దేశాలు తిప్పేస్తూంటే, ‘అది నీ కూతురు, సూట్ కేసు కాదు’ అంటాడు. ఊళ్ళు తిరిగే బంజారా అయిన ఆమెతో విధి లేక రాజీ పడతాడు - ‘నువ్వు నీలాగా వుంటేనే మనం మనలాగా వుంటాం కదూ?’ అని విరక్తిగా అనేసి. పెళ్లి పేరు మార్చి సారీ అని పెట్టాలంటాడు. మదర్ వయ్యాక నీ బ్రెయిన్ పోయిందంటాడు. కన్నంత మాత్రానా తల్లివి కాలేవంటాడు. పిల్లలకి తల్లిదండ్రుల మీద హక్కులుంటాయి గానీ తల్లి దండ్రులకి పిల్లల మీద హక్కులుండవంటాడు. అతడెన్ని చెప్పినా ఉల్లాసరకమైన ఆమె దృష్టిలో అతను మాత్రం ‘ఐఏఎస్ -  సర్కారీ సూపర్ హీరో’ నే.      
  
        లండన్ దృశ్యాల్లో బ్రిటిష్ నటీనటులతో బంపర్ లుక్ వచ్చింది. 1950 లనాటి లండన్ నేపథ్య దృశ్యాలు, ఆ తర్వాత 1990 లనాటి దృశ్యాలూ ఆయా కాలాలకి తగ్గట్టు  నిర్దుష్టంగా వున్నాయి. అలాగే బెంగళూరు దృశ్యాలు కూడా. కీకో నకహరా ఛాయాగ్రహణం అతి పెద్ద ఆకర్షణ. కోమలమైన కలర్స్ తో, లైటింగ్స్ తో ఫిమేల్ కాన్సెప్ట్ మూడ్ కి అద్దం పట్టేలా వుంది. ఉయ్యాల్లో సాన్యా కూతురున్నప్పటి దృశ్యపు చిత్రీకరణ ఆర్ట్ డైరెక్షన్ తో కూడా కలుపుకుని ఒక అద్భుతం. బడ్జెట్ ధారబోస్తే స్వర్గాల్నే చూపించొచ్చు. 

        సెట్ ప్రాపర్టీస్ విషయంగా చాలా రీసెర్చి చేసినట్టు కనబడుతూనే వుంటుంది. పాతకాలపు భవనాలు, కంప్యూటర్లు, మోబైళ్ళు, బళ్ళూ, కాస్ట్యూమ్సూ వగైరా. సచిన్ - జిగర్ సంగీతం సన్నగా కురిసే వర్షాకాలపు తుంపర లాంటిది. తల్లీ కూతుళ్ళ మీద సరదా సాంగ్ - ‘తుజే ఖైద్ కర్లూ మై’ ప్లెజంట్ కంపోజిషన్. దర్శకురాలు అనూ మీనన్ ప్రొఫెషనల్ దర్శకత్వం ఈ బయోపిక్ తో ఒక లెసన్ లా వుండొచ్చు.

కథాకథనాలు
    తెలుగులో ‘మనం’ తర్వాత ఇంకో ఇన్నోవేట్ చేసిన ట్రెండీ ఫ్యామిలీ డ్రామా ఇది. ‘మనం’ లాగే ఇంకో సంక్లిష్ట మోడరన్ స్క్రీన్ ప్లే. ఫిమేల్ టీం విజయం. రైటింగ్ ని బట్టే మేకింగ్ వస్తుంది. ఫ్యామిలీ డ్రామాని ఈతరం ప్రేక్షకుల కోసం రాసినప్పుడు తీసిందీ అంతే ట్రెండీగా  వస్తుంది. ముఖ్యంగా శకుంతలా దేవి జీవితాన్ని ఈతరం కెరీర్ మైండెడ్ ప్రేక్షకుల ముందుంచాల్సిన అవసరముంది. పాత తరం ప్రేక్షకులు కాదు. ఈ తరం ప్రేక్షకులకి ఆమె గణితావధానం వరకూ ఓకే, బాగానే కనెక్ట్ అవుతారు. స్ఫూర్తి పొందుతారు. ఫ్యామిలీ డ్రామా ఎందుకు? ఎందుకంటే, కెరీర్స్ వెల్లువలో కొట్టుకుపోయే యువతరం ఆమె జీవితంలోంచి నేర్చుకోకపోతే తీవ్రంగా నష్టపోతారని. కుటుంబ జీవితంలో సక్సెస్ సాధించనిది బయట సాధించే ఇంకే సక్సెస్ కూడా సక్సెస్ అన్పించుకోదని పర్సనాలిటీ నిపుణులంటారు.


        శకుంతలా దేవి జీవితాన్ని పూర్తిగా చూపించలేదనే ఫిర్యాదు వుంది. నిజమే, ఆమె రచయత్రి కూడా. సంఘ సేవిక కూడా. రచయిత్రిగా గణితం మీదే గాకుండా జ్యోతిషం మీద, వంటల మీద, హోమో సెక్సువాలిటీ మీదా పుస్తకాలు రాసింది. ఆఖరికి ‘పర్ఫెక్ట్ మర్డర్’ అన్న మిస్టరీ నవల కూడా రాసింది! బయోపిక్ అనగానే జీవితమంతా చూపించాలని లేదు. జీవితంలో ఒక కోణాన్ని తీసుకుని చూపించవచ్చు. ‘గాంధీ మై ఫాదర్’ లో గాంధీకి పెద్ద కుమారుడితో గల దుష్ప్రవర్తనని చూపించారు. గాంధీ చేసిన స్వాతంత్ర్య పోరాటం చూపించ లేదంటే ఎలా? 

        శకుంతలా దేవి కుటుంబ జీవితం ఎవరికీ తెలీదు. దర్శకురాలు ఆమె కుమార్తెని  కలిశాకే తెలిసింది. ఆ కుమార్తె అనుపమా బెనర్జీ జ్ఞాపకాల్లోంచి కనుగొన్నదే ఈ బయోపిక్. అందుకని ఈ బయోపిక్ ని కుటుంబ జీవితమనే కోణానికే పరిమితం చేశారు. ఈ కథనాన్ని మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో చూపించారు. కూతురి పాత్ర నటించిన సాన్యా దృక్కోణంలోనే సీన్లు వస్తూంటాయి. పోను పోనూ కొన్ని చోట్ల ఏది ఫ్లాష్ బ్యాక్, ఏది కాదన్న కన్ఫ్యూజన్ కూడా ఏర్పడుతుంది. దీన్ని నివారించి వుండాల్సింది. 

        అయితే పెద్ద లోపం ఏమమిటంటే, తల్లి కథ ఆమె చిన్నప్పట్నుంచీ చెప్పుకొచ్చే కూతురికి - తల్లి ఎలా కష్టపడి పైకొచ్చిందో ఇంత తెలిసినప్పుడు, ఆమెతో తగువు పడ్డంలో అర్ధం కన్పించదు. చిట్టచివరికి తనే ఒక మాట అని తల్లి కళ్ళు తెరిపిస్తుంది - నువ్వు అమ్మనే చూశావ్, అమ్మలో ఆడదాన్ని చూడలేదని. తనుకూడా తన తల్లిలో ఆడదాన్నే చూసి వుంటే ఇంత జరిగేది కాదుగా?         


        ప్రాబ్లం పిల్లల్లోనే వుంది. సంతానంతో తల్లిదండ్రుల దుష్ప్రవర్తనని, నిర్లక్ష్యాన్నీ జడ్జి చేయలేమంటాడు స్పిరిచ్యువల్ గురు స్వామి సుఖబోధానంద. వాళ్ళేం చేసినా వాళ్ళని స్వీకరించాల్సిందే నంటాడు జన్మ నిచ్చినందుకు.

        కూతురు జడ్జి చేసి బొక్క బోర్లా పడింది. కొన్నాళ్ళు తనని స్కూల్లో వేయకుండా తన వెంట దేశాలు తిప్పిందని ద్వేషం పెంచుకుంది. తల్లి చేస్తున్నది మూర్ఖత్వమని మనమూ జడ్జి చేసేస్తాం. చిట్టచివరికి కూతురు వేసిన కేసు గురించి కలిశాక, తల్లి ఇచ్చిన ఆల్బం చూసుకున్న కూతురి పరిస్థితేంటి? ఆ చిన్నప్పుడు వివిధ దేశాధ్యక్ష్యులతో, ప్రధానులతో దిగిన ఫోటోలు ఎన్ని జన్మలెత్తితే తను చూసుకోగలదు? ప్రపంచానికి చూపెట్టుకోగలదు? కాబట్టి డోంట్ జడ్జ్ యువర్ పేరెంట్స్ అన్నది నీతి. అలాగే ఇంట్లో సక్సెస్ లేకుండా ఇల్లెక్కి కూసేదీ సక్సెస్ కాదని ఇంకో నీతి. డబుల్ బ్యారెల్ మోరల్ అన్నమాట.

సికిందర్

(ఈ బయోపిక్ గురించి నాలుగైదు ఫోన్లు వచ్చాయి. కరోనా కాలంలో ఈ నాల్గు నెలలుగా కనపడకుండా ఫోన్లలో మాట్లాడుకోవడం, కనపడకుండా దాక్కుని ఇలా రాసుకోవడం, 1918 తర్వాత మనకే లభించిన సువర్ణావకాశం. చైనా వాడిచ్చిన ఫోటో ఆల్బం. ఈ బయోపిక్ లో కాన్ఫ్లిక్ట్ సరిగా లేదని ఫిర్యాదు. కూతురు కేసేయడంతో ప్రారంభించిన కాన్ఫ్లిక్ట్ మళ్ళీ చివర్లోనే చూపించి నిమిషంలో తేల్చేశారని  విశ్లేషణ చేశారు. కథల్ని ఇలా అర్ధం జేసుకుంటే ఎలా? కేసేయడం కాన్ఫ్లిక్ట్ అని ఎవరన్నారు? కేసుకి దారి తీసిన తల్లీ కూతుళ్ళ మధ్య ఏం జరిగిందన్నదే కాన్ఫ్లిక్ట్. కేసేయడం కాన్ఫ్లిక్ట్ కాదు. అది ప్లాట్ పాయింట్ టూ దగ్గర వచ్చే థర్డ్ యాక్ట్ మలుపు. మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ ని లీనియర్ గా చూస్తే అర్ధమవుతుంది. ప్రారంభంలో చూపించిన కేసేయడమే కాన్ఫ్లిక్ట్ అయితే, ఇంటర్వల్ కల్లా ఫ్లాష్ బ్యాక్స్ ముగించి, కేసేసిన కాన్ఫ్లిక్ట్ తో సెకండాఫ్ వుండేది. ఈ బయోపిక్ లో సీన్లతో వున్న డైనమిక్స్, ప్రతీ సీన్లో కట్టి పడేసే డైలాగ్స్, పాత్ర చిత్రణలు మొదలైన వాటిలోంచి నేర్చుకోవడానికి బోలెడుంది. కానీ స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే సమయం చిక్కడం లేదు, అదీ సమస్య)