రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, ఏప్రిల్ 2015, మంగళవారం

సాంకేతికం



సి. జగన్మోహన్, సిఈఓ, త్రికోణా టెక్నాలజీస్ ప్రై. లి. 

          పాత కళాఖండాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రపంచమార్గం తెలుసుకుని అవికూడా గ్లోబల్ భాగస్వాములవుతున్నాయి. మళ్ళీ ఓసారి శతదినోత్సవాలతో కొత్త చరిత్ర రాసుకుంటున్నాయి. మా తెలుపు నలుపు స్వరూపాల వెనకాల నాటి కెమెరాల ముందు మా మౌలిక రంగులివీ అని ప్రకటించు కుంటున్నాయి. డీఐ లో ఇమేజి ప్రాసెసింగ్ అనే టెక్నాలజీ తో బ్లాక్ అండ్ వైట్ కి వర్ణ యోగం పట్టిందిప్పుడు. తెలుగులో మహోజ్వల ‘మాయాబజార్’ అయితే ఇంకో అడుగు ముందుకేసి, రంగులకి తోడూ సినిమా స్కోప్ బొమ్మా, డీటీఎస్ శబ్ద ఫలితాలూ కలుపుకుని,  ఈ తరం జెనెక్స్ మూవీగా  ముస్తాబై హర్షధ్వానాలనుకుంది.
 

            ‘మాయాబజార్’ – దానికదే ఓ ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్ అయినప్పుడు ఇంకా రంగులవసర మేమిటి’ అన్న ప్రశ్నకి-  ‘ఎందుకవసరమంటే, అది నా చిన్ననాటి కల  కాబట్టి’ - అని జగన్మోహన్ సమాధానం- ‘నేనెలాగూ దృశ్య శబ్ద మాధ్యమాల్లో ఇదివరకే కళా కారుణ్ణి కాబట్టి, నా కల ఇలా లోకామోద్య యోగ్యంగా సాకారమైంది’ అని వివరణ.
          ఈ స్వప్న సాకారానికి తన పనిలేని తనమే పురిగొల్పిందట. ఒకప్పుడు తను పనిలోకి చేరిన సంస్థలో మొదటి మూడు నెలలూ ఏ పనీ లేకపోవడంతో ఉద్యోగం మానేసి వెళ్లి పోతానన్నారట జగన్మోహన్. యాజమాన్యం వెళ్ళిపోకుండా ఆపి, ఏదో ఒక పని కల్పించుకోండని ఆయనకే వదిలేస్తే, ‘మాయాబజార్’ కి రంగు లేస్తానన్నారట! అలా ఉబుసుపోక మొదలెట్టిన పనే మహా యజ్ఞమై కూర్చుందిట!

      సిబ్బంది 185 మంది, ఫిలిం ఫ్రేములు రెండు లక్షల 80 వేలు, కలర్ షేడ్స్ 16.7 మిలియన్లు, కాలం ఏడాదిన్నర, ఖర్చు మూడున్నర కోట్లూ...ఇదీ రంగులేయడానికి కూల్ గా ‘మాయాబజార్’ డిమాండ్ చేసిన సాధన సంపత్తి. ‘గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్’ సంస్థ దీని కంతటికీ సిద్ధంగానే వుంది. పని మొదలైంది...చూస్తే నెగెటివ్ అంతా శిథిలా వస్థలో వుంది. ఇక లారీ వేసుకు తిరిగి, రాష్ట్రంలో ఎక్కెడెక్కడి ప్రింట్లూ 70 సేకరించి తీసుకొచ్చారు. ప్రసాద్ లాబ్స్ లో మొదటి నెగెటివ్ ని కఠినమైన అల్ట్రా క్లీనింగ్ ప్రాసెస్ కి గురి చేసి దుమ్మూ ధూ ళినీ, యాసిడ్ మరకల్నీ వదిలించారు. స్కాన్ చేసి మొత్తాన్నీ డిజిటల్ ఫైల్స్ గా మార్చుకున్నారు. శిథిల భాగాల్ని తీసేసి, ప్రింట్ల నుంచి తీసిన పాజిటివ్ భాగాల్ని జోడించారు. కంప్యూటర్లలో ప్రతీ ఫ్రేమునీ  తనిఖీ చేసి గీతలూ అవీ తొలగించారు. వీటన్నిటితో తిరిగి ఈ సినిమా 1957 లో విడుదలైన నాటి తాజా రూపాన్ని సంతరించుకుంది.

        ఇక చరిత్ర శోధన మొదలైంది. ‘మాయాబజార్’ పౌరాణికానికి కాల్పనిక రూపమే అయినా, ఇష్టారాజ్యంగా కలరింగ్ చేస్తే కుదరదు. బ్లాక్ అండ్ వైట్లో కన్పిస్తున్న తెలుపు వస్త్రాల్ని పట్టు వస్త్రాలనుకుని ఆవేశపడి, ఆ మేరకు కలరింగ్ ఇచ్చేస్తే పప్పులో కాలేసినట్టే. అవి నార బట్టలై ఉంటాయని గుర్తించకపోతే ఇంతే సంగతులు. శ్రీ కృష్ణుడు నీల మేఘశ్యాముడన్న విషయం దృష్టిలో పెట్టుకుని, ఎన్టీఆర్ వొంటికి ఆ కలరే ఇవ్వాలి. పాత్రలు ధరించే కిరీటాల్లో, ఆభరణాలూ వగైరాల్లో పొదిగిన రాళ్ళ రంగులు వరస మారకుండా సినిమా యావత్తూ జాగ్రత్త వహించాల్సి వుంటుంది. కట్టడాలకీ  ఇతర వస్తు సామగ్రికీ ఏయే రంగు లుండచ్చో పరిశోధించి ఆ రంగుల సమ్మేళనమే కల్పించాలి. ఇలా 200 పేజీల రీసెర్చి పేపర్ ని తయారు చేసింది టీము.

      ఇక ఇదివరకే డిజిటల్ గా రీమాస్టరైన ఫైల్స్ తో ఫిలిం బ్రేకింగ్ అనే ప్రక్రియకి పూనుకుని, స్టోరీ బోర్డు తయారు చేస్తూ, కీ ఫ్రేము (ఒక షాట్ లోని తొలి ఫ్రేము) కి నిర్ణయించిన కలర్స్ ఆధారంగా దృశ్యా లన్నిటికీ రంగులు సృష్టిస్తూ పోయారు. ఎవరైనా టీములోని టెక్నీషియన్ ఈ రంగులతో సొంత సృజనాత్మకతకి పాల్పడితే, జగన్మోహన్ తన దగ్గరున్న అప్రూవ్డ్ కలర్స్ ని సిస్టంలో రన్ చేసుకునే సదుపాయం ఎలాగూ వుంది. ప్రాజెక్ట్ క్రియేటివ్ హెడ్ గా ఇంకో సమస్య ఎదురైందాయనకి - ఇదివరకు చెప్పినట్టు పూర్తిగా లేని నెగెటివ్ లెన్త్ కి అక్కడక్కడా ప్రింటు భాగాల్ని కలపడం వల్ల  డెప్త్ కి సంబంధించి తలెత్తిన  సమస్య అది. తెరమీద ప్రొజెక్షన్ వేస్తే  కుడుపులూ జంప్ లూ వచ్చే అవకాశముంది. దీనికి  హై ఎండ్ లస్టర్ వర్క్ స్టేషన్ మీద ఎగుడు దిగుడుల్ని తీసేసి, ఏకత్వాన్ని సాధించారు. 3 : 4 నిష్పత్తిలో వున్న35 ఎం.ఎం.  సినిమా రీళ్ళని 70 ఎం.ఎం. కి బ్లో అప్ చేయడం అదో ప్రత్యెక కళ. అంతే  క్లిష్ట తరమైన కళ డీటీఎస్ మిక్సింగ్. దీనికి రామోజీ ఫిలిం సిటీలో వాద్య కారులతో అచ్చం అలాటి నేపధ్య సంగీతమే మళ్ళీ సృష్టించి, వివిధ ట్రాకుల్లో కొత్తగా ముద్రించి, 5.1 డీటీఎస్ టెక్నాలజీకి మార్చేశారు. కొన్ని ఒరిజినల్ లో లేని ఎఫెక్టుల్ని కూడా సృష్టించారు. ఘటోత్కచుడి కిర్రుచెప్పుల చప్పుళ్ళు, గాలి ఒరిపిదిగి గద చేసే ధ్వనీ వగైరా.
          రెండు పాటలకి , మరికొన్ని సన్నివేశాలకీ మరమ్మత్తు ఏవిధంగానూ కుదరక తీసేసినా, మొత్తం మీద 50 ప్రింట్లతో రంగుల ‘మాయాబజార్’ గా విడుదల చేస్తే, రాష్ట్రవ్యాప్తంగా అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

రష్యన్ చిత్రాల కలరీకరణ
      ‘ఆపరేషన్ కన్వర్షన్ మాయాబజార్’  ఇలా సక్సెస్! దీని తర్వాత జగన్మోహన్ జీవితమే మారిపోయింది. మెదక్ లో జన్ప్మించిన జగన్మోహన్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రేడియో జర్నలిస్టుగా కెరీర్ రారంభించారు. అక్కడ మూడుసార్లు రాష్ట్రపతి పురస్కారాలందుకున్నారు. అక్కడ్నించీ వైదొలగి ‘ప్రతిన వీడియో’ అనే రాష్ట్రంలోనే  మొదటిదైన  హైబ్యాండ్ స్టూడియో  ప్రారంభించారు. 

   'ఈటీవీ’ వివిధ కార్యక్రమాలకి లోగోలు రూపొందించిందీయనే. ‘గోల్డ్ స్టోన్’ లో ‘మాయాబజార్’ కలరీ కరణ తర్వాత ‘త్రికోణా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సొంత సంస్థ  స్థాపించుకుని, ప్రస్తుతం 50 రష్యన్ సినిమాల్ని రంగుల్లోకి మారుస్తున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న ఆర్డర్స్ లో భాగంగా మరికొన్ని ఫ్రెంచి సినిమాల కన్వర్షన్ ని కూడా చేపట్టనున్నారు చిందు జగన్మోహన్.


సికిందర్
(అక్టోబర్ 2010 ఆంధ్రజ్యితి సినిమా టెక్ శీర్షిక) 









27, ఏప్రిల్ 2015, సోమవారం

రెండోది ఇలా!

చన-  – దర్శకత్వం : సుధీర్ వర్మ
తారాగణం :  నాగ చైతన్య, కృతీ సనన్ , పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, రవిబాబు, ప్రవీణ్, సత్య తదితరులు
సంగీతం : సన్నీ ఎం ఆర్,   ఛాయాగ్రహణం : రిచర్డ్ ప్రసాద్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర ,   నిర్మాత : బి వి ఎస్ ఎన్ ప్రసాద్
విడుదల :  24 ఏప్రెల్ 2015

*** 

There are two ways, my way and highway
 -Quentin Tarantino 
        సర్ప్రైజ్!  ‘స్వామిరారా’ ప్రామిజింగ్ యువ దర్శకుడు రెండో సినిమాకే డీలాపడి, పాత ప్రేక్షకులు ఎన్నోసార్లు చూసి విసిగిపోయిన అదే కాలం చెల్లిన మూస ఫార్ములాతో న్యూవేవ్ థ్రిల్లర్ నీ కాచి వడబోసి చిక్కటి కషాయాన్ని తయారు చేశాడు! బ్రహ్మాండమైన యూత్ అప్పీల్ తో హిట్టయిన పక్కా న్యూవేవ్ థ్రిల్లర్ ‘స్వామిరారా’ కి ఆదర్శంగా పెట్టుకున్న క్వెంటిన్ టరాంటినోనీ, రాంగోపాల్ వర్మనీ, ఈ సినిమాలో ఓ సీనులో ఓ గదిలో పోస్టర్లకే  పరిమితం చేసేసి, 1970-80 లనాటి ‘తల్లి జబ్బుతో మరణించెను, మరియు తండ్రి చేయని నేరానికి  జైలుకెళ్ళెను, మరియు అనాధ అయిన చిన్నారి హీరో దొంగ గా మారి, మరియునూ ఆ చోరీ సొత్తుతో చెల్లిని డాక్టరీ  వరకూ  చదివించుకొనిన’  బాపతు పాత చింతకాయ రివెంజి స్టోరీని వడ్డించాల్సి వచ్చింది!  వెరసి వన్ ఫిలిం వండర్ గా మిగిలిపోయిన యువ దర్శకుల జాబితాలో తనూ చేరిపోతున్న సూచన లిచ్చుకున్నట్టయ్యింది!

          ‘షోలే’ తీసిన సిప్పీ మళ్ళీ అలాటిదే ‘షాన్’ తీసి బోల్తా పడినట్టు, లేదా ‘అత్తారింటికి దారేది’ తీసిన దర్శకుడు మళ్ళీ అలాటిదే ‘సన్నాఫ్ సత్యమార్తి’ తీసి దెబ్బ తిన్నట్టూ - ఈ దర్శకుడు కూడా  తనకి ఎలాగో కుదిరిన ‘స్వామిరారా’ లాంటి దొంగల కథనే రిపీట్ చేయడం వినా కొత్త ఐడియా రాలేదు. ఈ సినిమాలో బ్రహ్మానందం చేత దర్శకుడు పలికించే డైలాగు - స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపిస్తారు, తీసేటప్పుడు నరకం చూపిస్తారు- అనేది ఈ దర్శకుడికే వర్తిస్తుంది బహుశా!

I have never been insecure about my work
   -Ram Gopal Varma 
        నాగచైతన్యకి యాక్షన్ సినిమాలు కలిసిరావడం లేదంటే కారణం ప్రామిజింగ్ దర్శకులు నాగ చైతన్యతో ఇలా పాత మూస రివెంజులు తీస్తూ కూర్చోవడమే!

          సాధారణంగా ఈ తరహా మూస రివెంజులు స్టార్లకి పెట్టి తీస్తారు. నాగచైతన్య లాంటి స్టార్ తో అలాటి అవకాశం రాగానే దర్శకుడు తన ‘స్కూల్’ ని తీసి పక్కన పెట్టేసి, బిగ్ స్టార్ల బరిలోకి వెళ్ళిపోవాలని ఆరాటపడినట్టుంది ఈ తరహా కషాయంతో. టాప్ పొజిషన్ కి చేరుకోవాలనుకోవడంలో తప్పేం లేదు, ఆ చేరుకునేందుకు ఇలా వేసుకున్న బాటలోనే సిన్సియారిటీ కన్పించడం లేదు. తను లాజిక్ ని డిమాండ్ చేసే న్యూవేవ్ థ్రిల్లర్ వైపు ఉండాలా, లేక లాజిక్ ని ఎగవేసే మూస ఫార్ములా వైపు ఉండాలా -ఏదో ఒక్కదానికే కట్టుబడాలన్నజానర్ మర్యాదని తీసి గట్టుమీద పెట్టినట్టే వుంది!

          ఈ మూస + న్యూవేవ్ కాక్ టెయిల్ లో కూడా సమంజసమైన కథా కథనాలు కన్పించవు.  బలహీన కథ, దానికి హాస్యాస్పదమైన బలహీన కథనం, అతి బలహీన అర్ధంలేని పాత్రలు, సెకండాఫ్ లో ఏం చేయాలో అర్ధంగానట్టు శ్రీనువైట్లే వాడేసి వదిలేసిన బ్రహ్మానందం టైపు కామెడీ తో బ్రహ్మానందంతోనే ఎపిసోడు!  ఒరిజినాలిటీ జోలికి పోకుండా, కొన్ని పాత తెలుగు సినిమాలు చూసి ఈ సినిమా కథ అల్లేసినట్టుంది.

           అప్పుడెప్పుడో చిన్నప్పుడు చందూ (నాగ చైతన్య) తల్లి జబ్బున పడి దగ్గుతుంటుంది శాంతాకుమారిలా.  రొటీన్ గా వైద్యానికి డబ్బుల్లేవు కారు డ్రైవరైన గుమ్మడి లాంటి తండ్రి సీతారాం ( రావురమేష్) దగ్గర. చందూ చిన్నారి చెల్లెలు తల్లి బాధ చూసి డాక్టర్నై పోతానని పిల్ల శపథం చేసేస్తుంది తధాస్తు దేవతలు వణికిపోయేలా. రొటీన్ గా ఆ తల్లి చనిపోతుంది. ఓ సత్యనారాయణ లాంటి కిరాతకుడు భీమవరం వెళ్ళడానికి గుమ్మడి సీతారాం కార్లో బయల్దేరి, దార్లో ఓ మాయ చేసి డబ్బుతో పారిపోవాలనుకుంటాడు రొటీన్ గా. వాణ్ణి చంపి ఆ నేరం గుమ్మడి సీతారాం మీదే వేసి  డబ్బుతో పారిపోతాడు నాగభూషణం లాంటి మాణిక్యం కూడా రొటీన్ గానే.  గుమ్మడి సీతారాం యావజ్జీవ ఖైదీ అవుతాడు జైల్లో ఫార్ములా ప్రకారం. ఇక అనాధ అయిపోయిన చందూకి అప్పుడే ఐదారేళ్ళ వయసులోనే, ఓ జామపళ్ళు అమ్మేవాడు అన్యాయం చేస్తున్నాడని తీవ్రంగా అన్పించేసి - అన్యాయంతోనే తను బతకాలని ఆ క్షణాన్నే రొటీన్ గా, అసురలోకం ఆనందించేలా ప్రతినబూని- చిల్లర దొంగగా మారిపోయి-చెల్లెలి శపథం కూడా నెరవేర్చడానికి  కంకణం కట్టుకుంటాడు కాంతారావులా. ఇలా పెద్దవాడై ఇప్పుడు చంద్రకళలా వున్న చెల్లెల్ని మంది సొమ్ముతో మెడిసిన్ చదివిస్తూనే, మరో వైపు మంది దగ్గర కొట్టేస్తున్న సొమ్ముతోనే  తండ్రిని జైల్లోంచి విడిపించుకోవాలన్న మహత్తర లక్ష్యంతో ఊరుమీద పడి దోచేస్తూంటాడు-
ఇదీ యువ హీరో నాగ చైతన్యకోసం తీర్చిదిద్దిన అద్భుతమైన వ్యక్తిత్వమున్న పాత్ర!

          తనలాంటి సాటి యువకుణ్ణి, అదీ జాబ్ చేసుకుంటూ న్యాయంగా సంపాదించుకుంటున్న వాణ్ణి,  సెల్ ఫోన్ అమ్ముతానంటూ బుట్టలో వేసుకుని, సబ్బు అంటగట్టి నలభై వేలు కొట్టేసి  ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం తనకి అన్యాయంగా ఏమీ అన్పించదు. ఇలాటి అమాయకులే ఇతడి బాధితులు. ఆ సొమ్ములతో విలాసవంతమైన జీవితం. మెడికో అయిన ఆ అర్భక చెల్లెలి పాత్రకి  అన్న ఏం చేసి సంపాదిస్తున్నాడన్నఆలోచనే వుండదు. ఇంకో నిరర్ధక పాత్ర పోలీసు అధికారి రిచర్డ్ ( రవిబాబు) అని ఉంటాడు. ఇతడికి చందూ  దగ్గర లంచం కూడా సరిగ్గా డిమాండ్ చేసి లాగడం చేతగాదు.

          జైల్లో వున్న తండ్రి విషయానికొస్తే, లెక్కప్రకారం ఇప్పుడు చందూ ఈ వయసుకొచ్చేటప్పటికి, తండ్రి ఎప్పుడో యావజ్జీవం పూర్తి చేసుకుని విడుదలై పోయి వుండాలి. కానీ చందూ వచ్చి అధికార్లకి రెండు కోట్లు లంచమిచ్చి విడిపించడం కోసమే  ప్రభుత్వం అతణ్ణి పట్టుక్కూర్చున్నట్టుంది. అది కూడా పంద్రాగస్టున రొటీన్ గా ప్రభుత్వం విడుదల చేసే సత్ప్రవర్తనగల ఖైదీల కోటాలోనే తండ్రిని అంత డబ్బు పెట్టి విడిపించుకుంటు న్నాడాయె ఉదారంగా!

          డామ్ ష్యూర్ గా గుమ్మడి లాంటి ఆ తండ్రి సత్ప్రవర్తనగల ఖైదీయే అయివుండాలి ( నిజానికి ఇది రావు రమేష్ లాంటి సమర్ధుడికి పనీపాటా లేని నిరర్ధక పాత్ర!). ఈ లెక్కన శిక్షాకాలం పూర్తి కాకుండానే ఎప్పుడో విడుదలై పోవాలి కదా? క్రైం  థ్రిల్లర్ తీస్తూ కాకమ్మ కథలు చెప్తే ఎలా? పోనీ ఈ పంద్రాగస్టున అయినా గుండెజబ్బుతో వున్న తండ్రిని విడుదల చేయాలని చందూ డిమాండ్ చేయొచ్చుగా? జామకాయల  దగ్గర అన్యాయాన్ని  సహించక అసురలోకాన్ని ఆనందింప జేసిన వాడు,  ప్రభుత్వం ఇంత ‘అన్యాయం’ చేస్తున్నా లంచంతో కాళ్ళ బేరాలేమిటి? అసురలోకం మండి పడదా?

          కథనం ఇంకెంత  దయనీయంగా  ఉన్నదంటే, ఈ తండ్రి ఎపిసోడ్ కి ఒక ఎజెండా అంటూ లేకుండా, గజిబిజిగా రెండు పాయింట్లు ఇరికించి వున్నాయి. 1. గుండెపోటుతో హాస్పిటల్లో చేర్చిన తండ్రికి అర్జెంటుగా చేయాల్సిన యాంజియో ప్లాస్టీ సర్జరీకి ప్రభుత్వ అనుమతి కావాలని చెప్తాడు డాక్టర్. ఈ డాక్టర్ సలహా ప్రకారం హోం మంత్రి పియ్యే ( జీవా) ని కలుస్తాడు చందూ. అనుమతి కోసం ఆ పియ్యే పది లక్షలు డిమాండ్ చేస్తాడు. ఈ పదిలక్షలు ఎక్కడ కొట్టేయాలా అని ప్లాన్లేస్తాడు చండూ. ఇదంతా అవసరమా? యావజ్జీవ ఖైదీ ఆరోగ్య బాధ్యత జైలు అధికారులది కాదా? ఇది డిమాండ్ చేయొచ్చుగా ఒక హీరోగా చందూ?

          2. ఇంకా ఈ విషయం ఇలా ఉండగానే, పంద్రాగస్టు వ్యవహారం వస్తుంది. దీనికి మళ్ళీ కోట్ల రూపాయలు లంచమిచ్చి తండ్రిని విడిపించుకోవాలని ప్లాను! ఆపరేషనుకి పది లక్షలు- ఇప్పుడు పంద్రాగస్టున విడిపించుకోవడానికి రెండు కోట్లు! ఇతను కథానాయకుడా, వెర్రిబాగుల వాడా? పంద్రాగాస్టున ఘోర నేరాలు చేసిన ఖైదీలనే సత్ప్రవర్తన కలిగివుంటే, విడుదల చేస్తున్నప్పుడు, ఏ నేరం చేయకుండానే శిక్ష అనుభవిస్తున్న హీరో తండ్రి ఎందుకు విడుదల కాడు?అసలు తండ్రి ఆపరేషన్ అప్పుడే విడుదలై పోయే పరిస్థితి వుండగా, మళ్ళీ పంద్రాగస్టు ప్రహసనమేమిటి?

          ఎందుకంటే,  హీరో కోసం కథ నడిపించాలి కాబట్టి. ఇంకెక్కడో తను కొట్టేయాల్సిన రెండున్నర కోట్ల రూపాయల సీన్ ఎదురు చూస్తోంది కాబట్టి,  ఆ సీన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ పంద్రాగస్టు ఎపిసోడ్ నడిచి చందూకి రెండు కోట్లు అవసరపడి తీరాలి. ఇలావుంది కథనం. కథలో ప్రధాన పాత్రే తన ప్రాథమ్యాలని ఎంచుకుని కథని నడపాలి తప్ప, ప్రధాన పాత్ర కోసం పనిగట్టుకుని కథని నడపరాదన్న ప్రాథమిక పాఠం పట్టనందువల్లే ఈ గజిబిజి కథనం. సమస్య ప్రధాన పాత్రకి ఎదురవకుండా, కథకే ఎదురయినట్టుంది ఈ కథనం. ఎవరైనా కథానాయకుడి కి ఎదురయిన సమస్యని ఆ కథా నాయకుడ్నే పరిష్కరించుకోనిస్తారా? లేక కథలో రచయితకి ఓ సమస్య ఎదురయ్యిందని చెప్పి- ఆ సమస్య తను పరిష్కరించుకోవడానికి కథానాయకుణ్ణి బలిచేస్తారా? ఇందుకే సినిమా సాంతం నాగచైతన్య పాత్ర చైతన్యం లేని పేలవమైన పాసివ్  పాత్రగా లా తిరుగాడు తూంటుంది...

          నాగచైతన్యే కాదు, ఎక్కడో నేపాల్ భూప్రకంనలు ఇక్కడ బెజవాడ దాకా ప్రాకినట్టు- నాగచైతన్య పాత్రతో మొదలైన విధ్వంసం- కృతీ సనన్, రావురమేష్, రవిబాబు, పోసాని తదితరులు పోషించిన పాత్రలన్నిటికీ ఎగబ్రాకి వాటిని డమ్మీలుగా మార్చేసింది. కేవలం ముందే ఫిక్సయిపోయిన కథా కథనాల కోసం!

          క్యారక్టర్ సింప్టమ్స్ ని డయాగ్నసిస్ చేస్తే- ఇటు మూస ఫార్ములా మాస్ ధోరణులతోనైనా  హుషారెక్కించకుండా, అటు న్యూవేవ్ ఇంటలిజెంట్ చర్యలతోనైనా థ్రిల్లూ కల్గించకుండా, పాత్రలన్నీ త్రిశంకుస్వర్గంలో వేలాడాయి పాపం!  

***

          సినిమా ప్రారంభమే పట్టపగలు బ్యాంకు దోపిడీ జరుగుతుంది. ఈ ప్రారంభ సన్నివేశమే ‘స్వామిరారా’ క్వాలిటీ ముందు దిగదుడుపుగా వుండి షాకిస్తుంది. ఏమిటి- ‘స్వామిరారా’ దర్శకుడేనా? అన్పించేలా ఆషామాషీగా లాగించేసిన ధోరణి కన్పిస్తుంది. అలా రెండున్నర కోట్లు ఈజీగా దోచుకున్న దొంగలు ఓ ఫ్లాట్ లో కూర్చుని గొడవపడతారు. యాభై లక్షలు బాస్ కిచ్చేసి, చెరో కోటితో పరారవుదామని ఒకడంటే, కాదు అది చాలా రిస్కూ, బాస్ చంపేస్తాడని రెండో వాడంటాడు. ఇంతకీ ఈ చంపేసేంత బాస్ ఎవడయ్యా అంటే, హీరో చిన్నప్పటి విలన్, తండ్రిని జైలుకి పంపిన మాణిక్యం ( పోసాని) అనే జోకరే! ఈ జోకర్ కి ఇతడికంటే పరమ కిరాతకంగా కన్పించే అనుచరులు ఎందుకు భయపడతారంటే- ఇందాకా చెప్పుకున్నట్టు కథకోసమే! ఫిక్సయిపోయిన కథే ప్రాణం, పాత్రలు కాదు! కథని బట్టే పాసివ్ పాత్రలు- యాక్టివ్ పాత్రల్ని బట్టి కథ కాదన్న మాట!

          ఒక ట్రెండ్ సెట్టర్ దర్శకుడు సినిమా తీస్తే అదెంతో మంచి స్టడీ మెటీరియల్ ని అందించాలి, వర్ధమాన దర్శకులకి స్ఫూర్తి కల్గించాలి. 12 కోట్ల రూపాయల బడ్జెట్ గల సినిమాతో ఇలా ధ్వంస రచన చేయకూడదు.

          సరే, అలా గొడవ పడి ఒకరికొకరు గన్స్ గురి పెట్టుకుంటారు దోపిడీ దొంగలు. మెక్సికన్ స్టాండాఫ్ సిట్యుయేషన్ కాని మెక్సికన్ స్టాండాఫ్ సిట్యుయేషన్ లాంటిదన్న మాట (మెక్సికన్ స్టాండాఫ్ సిట్యుయేషన్ లో ముగ్గురు ప్రత్యర్ధులు ఒకరికొకరు గన్స్ గురిపెట్టుకుంటారు. ఎవరు ముందు షూట్ చేసినా ఈ స్టాండాఫ్ లో రెండో వాడే బతికి బయట పడతాడు. ఇది ఈ సిట్యుయేషన్ థియరీ. ఎవరూ చావకుండా దీనికో సూపర్ రేషనల్ థియరీ కూడా వుంది. ముగ్గురూ కాంప్రమైజ్ అయిపోవడమే. క్వెంటిన్ టరాంటినో సినిమాల్లో ఇవి కన్పిస్తూంటాయి).

          అన్నట్టు ఇదే ఫ్లాట్ లోదర్శకుడి కుల దైవాలైన క్వెంటిన్ టరాంటినో, రాం గోపాల్ వర్మల పోస్టర్లు గోడకి అంటించి వుంటాయి. మూసగా ప్రారంభమైన సినిమా ఈ సన్నివేశంతో న్యూవేవ్ గా మారిందేమిటా అనుకుంటాం. మూడ్ ని డిస్టర్బ్ చేసే ఈ చిత్రణతో అర్ధోక్తిలో వదిలేస్తాడు ఈ సన్నివేశాన్ని. కట్ చేస్తే హీరోమీద ప్రారంభమౌతుంది కథనం. హీరో ఎంట్రీ, చోరీలు, చెల్లెలు, తండ్రి ట్రాకులు, మాణిక్యం జోకర్ కామెడీలు, రిచర్డ్స్ పసలేని బిల్డప్పులు, హీరోకి హీరోయిన్ తో పరిచయం – ప్రేమా.. ఈ హీరోయిన్ (కృతీ సనన్) కూడా హీరో చెల్లెలు చదువుతున్న కాలేజీలోనే ఫార్ములా ప్రకారం మెడికో! ఈమె వారానికి రెండు మూడు సినిమాలు చూసేస్తూ, సిగరెట్లు పీల్చి పారేస్తూ,  హీరో వెంట పడి తిరిగే భావి డాక్టరమ్మ- అరిగిపోయిన ఫార్ములా పాత్ర!

          ఇలా గంటంపావు గడుస్తున్నాకథ పాయింటుకే  రాదు. కథేమిటో అర్ధంగాదు. కథకీ కథనానికీ త్రీయాక్ట్స్ అనే ఫ్రేమింగ్ ఉంటుందన్న స్పృహే వున్నట్టు కన్పించదు. లాజిక్ నీ, క్యారక్టరైజేషన్ నీ, స్ట్రక్చర్ నీ కూడా ఎగేసి, స్టార్ డమ్ కి నిచ్చెన వేసుకోవాలన్న ఆదుర్దాయే కన్పిస్తుంది అంతటా.

          ఈ గంటంపావు సేపూ ముక్కలు ముక్కలుగా అది కాసేపు ఇది కాసేపు దృశ్యాలు మారిపోతూ స్క్రీన్ టైం వెస్ట్ అవడమే తప్ప విషయం  కనపడదు. ముప్పావు గంట సమయంలోనే ఇరికించేసి మూడు పాటలు పెడుతూ సహన పరీక్ష. ఈ పాట లేమైనా అద్భుతమా అంటే అదీ కాదు. ‘స్వామిరారా’ కి పనిచేసిన ఇదే సంగీత దర్శకుడు అందులో జాజ్ మ్యూజిక్ ని ఫ్యూజన్ చేసి కొత్తదనంతో హుషారెక్కించాడు. సంగీతం ఆ సినిమాకి ఎసెట్ అయ్యింది. ప్రస్తుతం అలాటి క్రియేషన్ ఏమీలేని అపస్వరాల మూట అయింది.

          చివరికి ఇంటర్వెల్లో పైన చెప్పుకున్న పియ్యే చెప్పిన ప్రకారం, ఆ పదిలక్షల్ని అందించడానికి ఒక ఫ్లాట్ కెళ్తాడు చందూ. ఆ ఫ్లాట్ కాదనుకుని ఇంకో ఫ్లాట్ బజర్ నొక్కుతాడు. అంతే, ఆ ఫ్లాట్ లో ఒకరికొకరు గన్స్ గురి పెట్టుకుని మెక్సికన్ స్టాండాఫ్ సిట్యుయేషన్లో వున్న దొంగలిద్దరూ, పోలీసులనుకుని పరస్పరం కాల్చుకు చచ్చిపోతారు!

          ప్రారంభించిన కథని తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికే తీసుకురావడమనే ఈ కథనపు టెక్నిక్ ని క్వెంటిన్ టరాంటినో తన ప్రథమ సినిమా ‘పల్ప్ ఫిక్షన్’ లో పరిచయం చేశాడు. దీన్నే ఆల్రెడీ ‘స్వామిరారా’ లో వాడేసుకున్నాడు దర్శకుడు. మళ్ళీ ఇదే రిపీట్ చేస్తూ జాలి కల్గించాడు దర్శకుడు. మూసఫార్ములాలో ఇలాగే న్యూవేవ్/ఆఫ్ బీట్ కథనపు టెక్నిక్కులకి పాల్పడిన ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ అనే ఫ్లాప్ ఉండనే వుంది. అందులో సన్నివేశాల్ని  ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి, రిట్రీట్ అయి, రియల్ టైం లో రిపీట్ చేసే,  మాస్ సినిమాలకి నప్పని ఆఫ్ బీట్ టెక్నిక్ వుంది. ఇలా ‘పల్ప్ ఫిక్షన్’ టెక్నిక్ ని కూడా ఈ మూసఫార్ములాలోకి జొప్పించి రసభంగం గావించాడు  దర్శకుడు. నిజానికి అంతవరకూ మూస ఫార్ములా కథనాన్ని ఫాలో అవుతున్న ప్రేక్షకులకి ఈ టర్నింగ్ ఏమిటో అర్ధంగాలేదు.

          ఇలా ఒక శైలీ శిల్పం అనేదికూడా లేకుండా ఎలాపడితే అలా సినిమా చుట్టేసిన విధం కూడా ఇక్కడ చూడొచ్చు. ఇంకేముంది, చందూ  ఆ రెండున్నర కోట్లు తీసుకుని పారిపోతాడు! ఈ సీను కోసమే  హాస్పిటల్లో ఆ గజిబిజి బీట్స్ అన్నమాట!
***


          తన కుటుంబాన్ని నాశనం చేసిన మాణిక్యం తో  చందూ రివెంజి కూడా ఆషామాషీ గానే వుంటుంది. అసలు ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచనే ఎక్కడా వుండదు. అప్పనంగా మాణిక్యం డబ్బు దొరికేసరికి ఆ డబ్బుతో తండ్రిని విడిపించేస్తాడు. దీంతో మాణిక్యం హాస్పిటల్లోనే వున్న చందూ  తండ్రినీ, చెల్లెల్నీ కిడ్నాప్ చేసి, ఆ డబ్బు డిమాండ్  చేస్తాడు. వాళ్ళని విడిపించుకోవడానికి మళ్ళీ బుల్లెట్ బాబు ( బ్రహ్మానందం) అనే మూవీ స్టార్ని మోసం చేసి డబ్బు సంపాదించడానికి హీరోయిన్ తో బయల్దేరతాడు చందూ. ఇంత సిల్లీ హీరోని ఏ కథలోనైనా చూస్తామా!

          ఇక ఓ అరగంట కథ లాగించెయ్యడానికి, శ్రీను వైట్ల వదిలేసిన ‘సెకండాఫ్ లో బ్రహ్మానందం తో కామెడీ ట్రాకు’  అనే తప్పనిసరి తద్దినం ఫార్ములాయే శరణ్యమయింది దర్శకుడికి! ఇదయ్యాక మాణిక్యం పాత్రతో ఇదే శ్రీను వైట్ల ‘గుడ్ బై లెనిన్’ కథని 'దూకుడు' లో ప్రకాష్ రాజ్ పాత్రకి వాడేసినట్టే, దాన్నే రూపం మార్చి క్లయిమాక్స్ అంతా మాణిక్యం పాత్రకి పెట్టి లాగించేశాడు దర్శకుడు. ఇంత అతుకులబొంతని నేషనల్- ఇంటర్నేషనల్ సినిమాలతో దిగ్విజయంగా కుట్టిన యువ ప్రామిజింగ్ దర్శకుడు అభినందనీయుడే!

          డైలాగులు కూడా ఇంకా హచ్ కుక్కలా వెంటపడ్డావ్ అంటూ అవుట్ డేటెడ్ గా వున్నాయి. హచ్ సెల్ కనెక్షనూ, కుక్కతో హచ్ యాడ్సూ కన్పించకుండా పోయి ఏళ్ళు గడిచిపోయాయి. ఇంకో చోట వారానికి రెండు మూడు సినిమాలు కాదు ముఖేష్ యాడ్ చూస్తే తెలుస్తుంది...అంటూ హీరోయిన్ని  ఉద్దేశించి హీరో అనే డైలాగేదో వుంది. ఈ ముఖేష్ యాడ్ ఏమిటా అని తికమక పడతాం. అప్పుడు మన బుర్రకి తడుతుంది- అప్పుడెప్పుడో రెండేళ్ళ క్రితం గుట్కా  తింటే ఏమౌతుందో ముఖేష్ అనే రోగిని చూపిస్తూ థియేటర్లలో యాడ్ ఫిలిమ్స్ వేయించేది ప్రభుత్వం. అదన్న మాట! ఈ అవుట్ డేటెడ్ లోనూ మెదడుకి పరీక్షే!

          చాలా చోట్ల- చాలా చోట్లా- కథ చెప్తే అందులో లాజిక్కులు లాగి, పాత్రచిత్రణల్ని ప్రశ్నించి ముప్పుతిప్పలు పెట్టి పొమ్మనే నిర్మాతలూ, హీరోలూ వున్నారు. ప్రస్తుత సినిమా దర్శకుడికి ఇంత ఈజీ గోయింగ్ నిర్మాతా, హీరో దొరకడం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం!  ఇలాగే కంటిన్యూ అయి సినిమాలు తీస్తూ కొత్త చరిత్ర రాస్తూ వుండాలని కోరుకుందాం!

— సికిందర్




































21, ఏప్రిల్ 2015, మంగళవారం

అప్పీల్ ప్లీజ్!

 రచన- దర్శకత్వం  : సతీష్ కార్తికేయ 
తారాగణం : క్రాంతి, శ్రీదివ్య, హేమంత్, రంగనాథ్, ఎమ్మెస్, శ్రీనివాస రెడ్డి, కృష్ణ భగవాన్, ధన్ రాజ్
సంగీతం : విజయ్ గొర్తి, ఛాయాగ్రహణం :  రాజేంద్ర కోసాని
బ్యానర్  : కాస్మిక్ ఇమాజినేషన్స్ ప్రొడక్షన్,  నిర్మాత : పి. వివేకానంద వర్మ
విడుదల : 17 ఏప్రెల్ 2015
***
కొత్త దర్శకులు ప్రతియేటా కనీసం ఓ వంద మంది దాకా పరిచయమౌతున్నారు తెలుగు సినిమాలతో. ఆ ఒక్క సినిమాతోనే  మళ్ళీ  కన్పించకుండా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ సంవత్సరం ఇంకో వందమంది వచ్చిపోతున్నారు. ఇదొక చక్ర భ్రమణంలా రిపీటవుతూనే ఉంటోంది. ఫీల్డులో వివిధ శాఖల్ని పోషించడానికీ, రెండు రాష్ట్రాల్లో థియేటర్లు మూతబడకుండా వారం వారం వాటికి టంచన్ గా ఫీడింగ్ ఇవ్వడానికీ,  తమ వంతుగా  నిర్మాతల్ని బలి తీసుకుని, లెక్క కోసం ఓ వంద సినిమాలు తీసేసి అప్పగించి వెళ్లి పోతున్నట్టుందే తప్ప- తాము నిలదొక్కుకునే పాపాన పోవడం లేదు. మొదటి సినిమా పట్టుకోవడానికి ఎన్నేళ్ళు తిప్పలు పడతారో, మళ్ళీ అన్నేళ్ళు రెండో సినిమా కోసం కష్టాలు తప్పడం లేదు. నూటికి 99 శాతం ఇక రెండో సినిమా అనేదే లేకుండా కాలగర్భంలో కలిసిపోతున్నారు. నిజానికి మొదటి సినిమాని ఏవరేజిగా నిలబెట్టుకో గల్గినా కెరీర్ కంటిన్యూ అవడానికి పెద్దగా అవరోధం వుండదు. మొదటి సినిమాతోనే తమ కెరీర్ కి డెత్ వారెంట్ రాసుకోవడం తెలియకుండానే జరిగిపోతోంది. మొదటి సినిమా పట్టుకోవడానికి ఇన్నేళ్ళు కష్ట పడ్డావు కదా, దీని తర్వాత మళ్ళీ ఇదే స్ట్రగుల్ కంటిన్యూ అయితే నీ సినిమా డ్రీమ్స్ కి అర్ధంలేదు- దీన్ని ఏం చేసి నిలబెడతావో ఆ టెక్నిక్ పట్టుకో- నీదైన ప్రత్యేక ముద్రతో, శైలితో దృష్టిలో పడు- ప్రపంచం దృష్టి నాకర్షించూ..అని చెప్పామనుకోండి, చాలా ఇగో వచ్చేస్తుంది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యాకనో, లేదా విడుదల నొప్పులు ప్రారంభమయ్యాకనో, మళ్ళీ పాత జీవితం మొదలైతే అప్పుడు అర్ధమవుతుంది!
ఈ నేపధ్యంలో మరో కొత్త దర్శకుడి ఈ మొదటి సినిమా ఎలా వుందో ఓసారి  చూద్దాం :
అతడు- ఆమె- ఆత్మలు!
        వైజాగ్ లో కాలేజీలో చదివే గౌతమ్ (హేమంత్) అదే కాలేజీ స్టూడెంట్ ఆరాధన ( శ్రీదివ్య) ని ప్రేమిస్తూంటాడు. ఆమె ఓకే చెప్పడానికి మూడేళ్ళూ తీసుకుంటుంది. అదే సమయంలో రోడ్డు ప్రమాదంలో గౌతమ్ చనిపోతాడు. కథ ఆరేళ్ళు ముందు కెళ్తుంది. ఆరాధన హైదరాబాద్ లో జాబ్ చేస్తూంటుంది. గౌతమ్ ని మర్చిపోలేక పోతున్న ఆమె పెళ్ళి గురించి ఇక ఆలోచించదు. ఆమె తల్లిదండ్రులు బాధపడుతూంటారు. హైదరాబాద్ లోనే  వినయ్ ( క్రాంతి)  అనే ఒక సైకో ఉంటాడు. అందర్నీ ఇబ్బంది పెట్టి ఆనందించడం, ఎవరికీ సాయం చేయకపోవడం ఇతడి అతి లక్షణాలు. ఓ శుభ ముహూర్తాన ఆరాధనని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెని ఫాలో అయి కంపెనీ బాస్ ని పట్టుకుంటాడు. ఆమె మీద ఆ బాస్ కి చాడీలు చెప్పి ఆమె డిస్మిస్ అయ్యేలా చూస్తాడు. ఆమెని తన కంపెనీలో నియమించుకుని జోరుగా ప్రేమించడం మొదలెడతాడు. ఓ రోజు రోడ్ యాక్సిడెంట్ లో గాయపడతాడు. అప్పట్నించీ అతడికి ఆత్మలు కన్పించడం మొదలెడతాయి. గుంపు గా ఆత్మలు ఇతడి వెంటపడుతూ, తమ సమస్యలు తీర్చ మంటూ వేధిస్తూంటాయి.  గౌతమ్ ఆత్మ కూడా ప్రత్యక్ష మవుతుంది. ఆరాధనని ఇలా చూడలేకపోతున్నాననీ, ఎలాగైనా ఆమె పెళ్లి చేసుకునేలా చేసి, ఈ ఇహ లోకం నుంచి తనకి విముక్తి కల్గించమనీ ప్రాధేయపడుతుంది...


          ఇప్పుడు వినయ్ ఈ ఆత్మల సమస్యలు తీరుస్తాడా? ఆరాధనతో తన ప్రేమ ఏమవుతుంది? ఈ రెండు పాయింట్లు ఆధారంగా కథ ఇక్కడ్నించీ ముందుకు సాగుతుంది. అమ్మాయి- అబ్బాయి,  మధ్యలో ఆత్మల కథతో తెరకెక్కిన ఈ సినిమాలో మిగతా విషయాలు ఎలా వున్నాయో ఈ కింద చూద్దాం..

క్రాంతి-దివ్య  కూర్చోబెడతారు?
       ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’, ‘ఆ అయిదుగురు’ అనే రెండు  సినిమాలతో ఇదివరకే ప్రేక్షకులకి పరిచయమున్న క్రాంతి ఈ  సినిమాకి చెప్పుకోదగ్గ ఎస్సెట్. అలాగే ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ లో క్రాంతి తోనే హీరోయిన్ గా నటించిన శ్రీదివ్య,  మరోసారి ఈ సినిమాకి కూడా మెయిన్ ఎట్రాక్షన్. ఈమె ‘మనసారా’, ‘బస్టాప్’ అనే రెండు సినిమాల్లో కూడా నటించి వుంది. తమిళంలో ప్రముఖ హీరోలతో  అనేక సినిమాల్లో నటించింది, ఇంకా నటిస్తోంది. ఇచ్చిన పాత్రల్ని అర్ధం జేసుకుని ఆ మేరకు వాటిని పండించగల నేర్పు ఈ ఇద్దరికీ వుంది. కథా కథనాలెలా వున్నా, ఈ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చివరివరకూ కూర్చోబెడుతుంది. అయితే కేవలం హీరో హీరోయిన్లనే చూస్తూ కూర్చోవాలని ప్రేక్షకులందరూ అనుకోకపోవచ్చు. ఇలా ఈ ఇద్దరికీ ఇది చెప్పుకోదగ్గ సినిమా కాలేదంటే, అది పూర్తిగా కథా కథనాల పరంగా, పాత్ర చిత్రణల పరంగా దర్శకుడి బాధ్యతే.

          కామెడీకి శ్రీనివాసరెడ్డి, ధన రాజ్, కృష్ణ భగవాన్, ఎమ్మెస్ లున్నారు. రంగనాథ్ హీరోయిన్ తండ్రి పాత్ర పోషిస్తే, శంకర్ మెల్కోటే కంపెనీ జీఎం గా నటించారు. రెండో హీరో పాత్రలో హేమంత్ కి నటనతో పెద్దగా పనిలేకుండా పోయింది.

    కెమెరా వర్క్, సంగీతం చెప్పుకోదగ్గ స్థాయిలో వున్నాయి. సినిమాని సాంకేతికంగా తీర్చి దిద్దడం లోనూ, నటీ నటులనుంచి ఫీల్ తో కూడిన నటనలు రాబట్టుకోవడంలోనూ కొత్త దర్శకుడికి ప్రతిభ వుంది. మూస సినిమాలకి ఓ మెట్టు పైనే వుంది ప్రమాణాల పరంగా. ఐతే తనదైన ఒక శైలిని సృష్టించుకునే ప్రయత్నం చేయలేదు. పేర్లు తీసేసి ఇలాటి సినిమాలు నాలుగు వేస్తే  ఏది ఈ కొత్త దర్శకుడి సినిమా చెప్పడం కష్టం. టెక్నికల్ గా  ‘డీ ఐ’ కారణంగా ఈ రోజుల్లో ఛాయాగ్రాహకుల్ని గుర్తు పట్టలేక పోవచ్చు నేమో గానీ, దర్శకులకి ఆ ఇండివిడ్యువాలిటీ చూపించుకోవడానికి ఇంకేవో మిగిలే వున్నాయి. ఉదాహరణకి విజువల్ స్టైల్ ని తీసుకుంటే, ట్రాకింగ్ షాట్స్ విధానం వుంది. హీరో హీరోయిన్లు కలుసుకున్నప్పుడల్లా ఒకే  రకమైన ట్రాకింగ్ షాట్స్ వేస్తూంటే, అది ఆ దృశ్యాల్ని ఉద్విగ్నభరితంగా మార్చేసే వీలుంది. కేవలం కంటికి కనబడ్డానికే కాక మనసు లోతుల్లోకి దిగినప్పుడే దృశ్యపరంగా దర్శకుడు బలమైన ముద్ర వేయగల్గుతాడు. ట్రాకింగ్ షాట్ ల  దర్శకుడని పేరు తెచ్చుకుంటే ఎవరూ తప్పుబట్టరు.

          కథాకథనాల్లో, పాత్ర చిత్రణల్లో లోపాల్ని మరిపించడానికి స్పీడ్ రాంపింగ్ షాట్స్ వేసి సినిమాలు తీసిన దర్శకులున్నారు. ఐతే ముందుగా కొత్త దర్శకుడికి తన స్క్రిప్టులో బలాబలాలేమిటో తెలిసి వుండాలి. ఈ సినిమాలో అవెలా వున్నాయో ఇక్కడ చూద్దాం..

స్క్రీన్ ప్లే సంగతులు
       ఇది త్రీ యాక్ట్ స్క్రీన్ ప్లేనే ( అన్ని సినిమాలూ త్రీ యాక్ట్ స్క్రీన్ ప్లేలతోనే వున్నా కొన్నే వాటిలోని బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాల సమగ్ర నిర్వహణలతో పక్కాగా వుంటాయి).  యాభయ్యోవ నిమిషంలో కథలో కొచ్చారు, బావుంది. ఆతర్వాత మిడిల్ నుంచే సమస్య మొదలయింది. కారణం లాజిక్ లేకపోవడం, సినిమా ప్రారంభంలోనే ఘోర తప్పిదం చేయడం!

          తెలుగు సినిమాలు అదేమిటో గానీ, ఇంకా పాతబడిపోయిన కథన టెక్నిక్ గా ఓపెనింగ్ బ్యాంగ్ నే పట్టుకు వెళ్ళాడుతున్నాయి. ఈ సినిమా ప్రారంభంలోనే హీరోయియిన్ తో కార్లో వెళ్తున్న హీరోకి యాక్సిడెంట్ చేసి చంపేసి ఓ బ్యాంగ్ ఇచ్చామనుకున్నారు. దీంతో ప్రేక్షకులు ఉలిక్కి పడి కనెక్ట్ అయిపోతారుకున్నట్టుంది- కనెక్ట్ అవడం కాదు కదా, రిపల్స్ అయ్యే చర్యే ఇదని తెలుసుకోలేకపోయారు!

          ‘ఏక్ విలన్’ ( 2014-హిందీ) లో ఇలాగే సినిమా ప్రారభంలోనే హంతకుడు వెంటాడి హీరోయిన్ ని దారుణంగా చంపేస్తాడు. ఆ తర్వాత అదే హీరోయిన్ కథ ఫ్లాష్ బ్యాక్ గా వస్తుంది. హీరోయిన్ని అంత దారుణంగా చంపిన దృశ్యాలే కళ్ళముందు కదలాడుతూంటే ఇప్పుడు ఫ్రెష్ గా ఆ హీరోయిన్ గ్లామర్ ని, రోమాన్స్ నీ, చిలిపితనాన్నీ  ఎంజాయ్ చేయగలిగే మూడ్ ఉంటుందా? సరే, ఇది హంతకుడి థ్రిల్లర్ కథ కాబట్టి ఆ జానర్ నుంచి సెన్సిబిలిటీస్ ని ఆశించకుండా చూడొచ్చనుకుందాం. కానీ అదే ఓ ప్రేమకథలో వెంటనే ప్రేమికుణ్ణి చంపేశాక, ఇంకా ఆ హీరోయిన్ తాలూకు గ్లామర్ కోషెంట్, యూత్ అప్పీల్ ఏం మిగిలుంటాయని ఎంజాయ్ చేయాలి? ఈ రెండూ లేకపోయాక అదెలాటి ప్రేమ కథ అన్పించుకోవాలి?

          టైటిల్స్ ముగిసిందే  మొదలు... ప్రియుణ్ణి  కోల్పోయిన హీరోయిన్ శ్రీదివ్య విషాద ముద్ర- మౌన ముద్రలతో గంభీర వాతావరణమే నెలకొంది చివరంటా.  హీరోయిన్నుంచీ ప్రేక్షకు లాశించే సరదాతనం, కవ్వింపు, ప్రేమ ప్రహసనాలూ ఇవేవీ లేకపోవడంతో – ‘షోలే’ లో వితంతువైన జయబాధురిని చూస్తున్నట్టో, లేదా ‘కటీ పతంగ్’ లో విధవరాలైన ఆశా పరేఖ్ ని చూస్తున్నట్టో తయారయ్యింది సినిమా! చూసేది ఈ కాలం యువ ప్రేక్షకులు, వాళ్ళకి ఇలాటి వడ్డన! తొలి సినిమాకే మార్కెట్ పట్ల అవగాహన ఇలా వున్నప్పుడు,  షో వేస్తే ఇలాగే నల్గురే ప్రేక్షకులుండి, వాళ్ళలో ఇద్దరు లేచిపోయే దృశ్యాలే కనపడతాయి అనివార్యంగా.

          ఈ సినిమా అప్పీల్ ఫ్యాక్టర్  ఏమిటో ఏ కోశానా కనపడదు. హీరోయిన్ చూస్తే అలా  వుంది, హీరో చూస్తే రానురానూ ఫన్ ఫ్యాక్టర్ బోరుగా మారిపోయింది, కథ చూస్తే కామెడీనా కాదా తెలియకుండా వుంది, క్లయిమాక్స్ లో బయట పడే క్రైం ఎలిమెంటు తో మరీ కన్ఫ్యూజన్ గా వుంది- ఇంకేం చూసి ప్రేక్షకుడు ఈ సినిమాని అక్కున జేర్చుకోవాలి? పాటలా? ఫైట్లా? పంచ్ డైలాగులా?

         ఇలా గజిబిజిగా ఎందుకయ్యిందంటే, ఈ కొత్త దర్శకుడు తనదైన ష్యూర్ షాట్ సొంత కథతో రాలేదు. హాలీవుడ్ నుంచి ఎత్తేసిన కథతో వచ్చాడు. ‘ఘోస్ట్ టౌన్’ అనే 2008 లో వచ్చిన హాలీవుడ్ సినిమా ఫక్తు కామెడీ. దీనిదర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ సినిమాల రచయిత డేవిడ్ కెప్. హీరో రికీ గెర్వైస్ అనే బ్రిటిష్ టీవీ కమెడియన్. ఇది తొలి సినిమా. ఈ సినిమాలో అమెరికాలో నివసించే డెంటిస్టు పాత్ర. మనుషులంటే పడదు. వాళ్ళ మాటలూ భరించలేడు. ఈ మనుషుల నుంచి దూరంగా పారిపోయి బతకాలనుకుంటాడు. పేషంట్లని కూడా మాట్లాడ నీయకుండా వాళ్ళ నోళ్ళల్లో స్వాబ్స్ కుక్కి పళ్ళు బాగు చేస్తాడు. ఒంటరిగా నివసిస్తాడు. ఒకప్పుడు ప్రేమలో దెబ్బ తిన్నాడు. ఇలాటి ఇతనికి ఓ వ్యాధి సోకి చికిత్సకి వెళ్ళినప్పుడు, తన నిర్వాకం వల్లే  దాదాపు ఏడు నిమిషాలు టెక్నికల్ గా చనిపోతాడు. బతికి లేచి కూర్చుంటే, ఆత్మలు కన్పించడం ప్రారంభిస్తాయి. అయితే ఇతడి కథకి ముందు ఇంకో పాత్రతో వేరే ప్రారంభం వుంది..

          సెకెండ్  హీరో గ్రెగ్ కిన్నెర్, సెల్ ఫోన్లో పెళ్ళాం తో మాట్లాడుతూ, ఉంపుడుగత్తె కోసం ఫ్లాట్ కొనడానికి నడుచుకుంటూ పోతూంటాడు. అంతలో ఒక బిల్డింగ్ పై నుంచి ఊడి పడుతున్న ఏర్ కండిషనర్ ని తప్పించుకోవడానికి, పక్కకి దూకి బస్సుకింద పడి చచ్చిపోతాడు. ఓపెనింగ్ బ్యాంగ్ అనుకుంటే ఇదే ఓపెనింగ్ బ్యాంగ్!

          ఇక హీరోకి కన్పిస్తున్న ఆత్మలకి ఇతను కూడా ఆత్మగా మారి తోడవుతాడు. ఆ వివిధ ఆత్మలు తమ సమస్యలు, కోర్కెలూ తీర్చి పుణ్యం కట్టుకోమని ప్రాధేయ పడుతూంటాయి.  ఇప్పుడు ఈ కథ అప్పీల్ ఫ్యాక్టర్  ఏమిటంటే, ఏ మనుష్య ప్రపంచమంటే అసహ్యంతో హీరో దూరం పారిపోవాలనుకుంటున్నాడో, సరీగ్గా ఆ మనుష్యుల మధ్యకే, వాళ్ళ జీవితాల్ని బాగుచేసేందుకే  వెళ్ళాల్సిన పరిస్థితి రావడం- ఇది సీన్ రివర్సల్!  కథ ఉన్నపళంగా ఉల్టాపల్టా అయిపోయే టర్నింగ్- ప్రేక్షకుల్ని కట్టిపడేసే  ఆసక్తికరమైన అప్పీల్ ఫ్యాక్టర్! 

          మనిషనేవాడు మనుషులమధ్య... మనుషుల పాటూ జీవించడం వినా గత్యంతరం లేదన్న శాశ్వత సత్యాన్ని ప్రతిపాదిస్తున్నాడిలా హాలీవుడ్  దర్శకుడు. దీనికి ఆత్మలనే సినిమాటిక్ టూల్ ని రూపకాలంకారం (metaphor)  గా వాడుకున్నాడు. కథ రాస్తున్నప్పుడు కథకుడి ప్రతీ ఆలోచన వెనుకా ఒక ఉద్దేశం వుంటుంది.

      ఇక ఆత్మగా వచ్చిన సెకండ్ హీరో ప్రపోజల్ తో కథలో ఇంకో డైనమిక్, ఒక సబ్ ప్లాటూ పుట్టుకొస్తాయి. అదేమిటంటే- తను చచ్చాక తన పెళ్ళాం ఒక డకోటా గాడితో అమాయకంగా మూవ్ అవుతోంది- ఆమె వాడి వల్లో  పడకుండా చూస్తే, నీకీ ఆత్మల పీడా నేను వదిలిస్తానని ఆ ప్రపోజల్. ఈ ప్రపోజల్ ని సృష్టించి, దీని ద్వారా ఈ సినిమాకి అవశ్యమైన ఇంకో అప్పీల్ ఫ్యాక్టర్ కి న్యాయం చేశాడు దర్శకుడు- అదేమిటంటే, ఆ పెళ్ళాం అంటే హీరోయిన్ (టీ లియోనీ) ని పిక్చర్లో కి తేవడం ద్వారా,  హీరోకి రోమాంటిక్ యాంగిల్ ని అంటగట్టి వదలడం! దీంతో మొండిగా ఒంటరిగా బతుకుతున్న హీరోకి –ఆడా మగా కలిస్తేనే జీవితమని ఇంకో శాశ్వత సత్యాన్ని చెప్పాడు దర్శకుడు. ఇది  చెప్పడం కోసం సెకండ్ హీరో ఆత్మని రూపకాలంకారంగా  వాడుకున్నాడు. మిగతా ఆత్మలు సమ్మిళిత మానవ సమాజానికి ప్రతీకలైతే, సెకండ్ హీరో ఆత్మ ఆడా మగా ప్రేమలకి ప్రతీక. ఇదీ ఈ సినిమా కర్ధం!

          దారితప్పిపోతున్న హీరోకి సామాజిక సంపర్కమూ, ప్రేమ సంపర్కమూ రెండూ కలగజేసి పరిపూర్ణ  వ్యక్తిగా మలచడమే దర్శకుడి కార్యాచరణ పథకం. ఈ రెండూ ఉంటేనే పరిపూర్ణ జీవితమని పరోక్షంగా చెప్పడమే ధ్యేయం.  

          సినిమా కథలు మన మానసిక లోకపు భావోద్వేగాల్ని పాత్రలుగా మల్చి  సైకో థెరఫీ చేస్తాయి- సినిమాలనేవి సైకో థెరఫీ సాధనాలు- అని జేమ్స్ బానెట్ ఏనాడో చెప్పాడు. హాలీవుడ్ సినిమాలు శాస్త్రం తెలిసి సైకో థెరఫీ చేస్తాయి, తెలుగు సినిమాలు ఏమీ తెలీక సైకోలుగా తయారు చేస్తాయి. ఒకసారి ప్రముఖ నిర్మాత- దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అననే అన్నారు- ఏ సైన్సూ లేకుండా సినిమాలు తీసేది మనమే నని!

          ‘ఘోస్ట్ టౌన్’ టైటిల్ లోనే వుంది ప్రేమకథ కాదని. ఇది మనుష్య ప్రపంచంతో, ఆత్మలతో హీరో పడే పాట్లతో కామెడీ ప్రధానంగా సాగే మెయిన్ స్టోరీ, ఇందులో భాగంగా మాత్రమే సబ్ ప్లాట్ ( ఉప కథ) గా సాగే ప్రేమాయణం వున్న స్ట్రక్చర్. ఈ ప్రేమాయణం కూడా కామెడీయే.
\
          ఉపకథ గా వున్న ఈ ప్రేమాయణాన్ని ప్రధాన కథగా చేసి, ప్రధానమైన  కామెడీ కథని ఉపకథ గా మార్చేసి చాలా హాస్యాస్పదంగా  ‘వారధి’ గా తీశారు! అమెచ్యూరీష్ చేష్ఠ! ఇందుకే  ఎటూ చెప్పుకోలేని ప్రొడక్టు అయింది.

          ‘ఘోస్ట్ టౌన్’ లో ఓపెనింగ్ లో సెకెండ్ హీరోకి జరిగే ప్రమాదాన్నే, ‘వారధి’లో సెకెండ్ హీరో తో హీరోయిన్ని కలిపి ప్రమాదంగా చూపెట్టేస్తే ఎలా కుదుర్తుంది? అందుకే హీరోయిన్ కడదాకా అదే విషాదాన్ని మోయాల్సి వచ్చింది. క్లయిమాక్స్ లో క్రైం ఎలిమెంట్ తో అనవసర ట్విస్టు-ఆ ప్రమాదాన్ని హీరోయిన్ తండ్రే జరిపించాడని! మరి అంత కర్కోటకుడైన వాడు కూతురికి అంతే ఫోర్సుగా  మరొకడికిచ్చి పెళ్లి చేసేయ్యకుండా ఏళ్ల తరబడి ఎందుకు ఊరుకున్నాడు? ఇదొక అర్ధం లేని పాత్ర చిత్రణైతే, మరణించిన ప్రేమికుడి ఆత్మది మరో అర్ధం లేని బాధ. ఘోస్ట్ టౌన్ లో ఈ పాత్ర తన పెళ్ళాం ఫలానా వాడితో ప్రేమలో పడకుండా చూడమని అర్ధవంతంగా అడిగి- ఒక రోమాంటిక్  ట్రాక్ కి తెరతీయిస్తే, ఇక్కడ నిస్తేజంగా హీరోయిన్ పెళ్లి చేసుకునేలా చూడమని వేడికోలు! ఆ పెళ్లి ఎలాగూ హీరోయే చేసుకుంటాడని అందరికీ తెలిసిందే, ఇంకా ఆత్మకి బాధెందుకు? కథని కూడా ఇంత కీలక పాత్ర ఎక్కడ మలుపు తిప్పింది? 

         
ఇక హీరో విషయానికొస్తే, ఒరిజినల్ లోని నిరాశావాది హీరో కాస్తా ఈ కాపీలో అరాచక వాది అయ్యాడు. మనుషుల మధ్యే ఉంటూ మనుషుల్ని హింసించి ఆనందిస్తాడు. ఇలాటి వాణ్ణి ఆత్మలు వచ్చి సాయం కోరడంలో అర్ధముందా, ఇలాటి వాడి అంతు చూస్తాయేమో గానీ? ఏ సైకో ఎనాలిసస్ ప్రాతిపదికన ఇలా పాత్రని మార్చేసి సృష్టించినట్టు? ఇండియానా జోన్స్, జురాసిక్ పార్క్, స్పైడర్ మాన్, మిషన్ ఇంపాసిబుల్.. ఇప్పుడు ఇన్ ఫెర్నో మొదలైన 27 హాలీవుడ్ సినిమాల రచయిత డేవిడ్ కెప్ తప్పుడు పాత్ర చిత్రణ చేశాడనా ఇలా మార్చేసి సృష్టించారు?

          పైగా ఒరిజినల్లో ఈ పాత్రకి ఆత్మలు కన్పించడానికి ఏడు నిమిషాల పాటు చచ్చిపోయాడని ఏవో  మెడికల్ కారణాలు చెప్పారు, కానీ ఈ కాపీలో హీరోకి యాక్సిడెంట్ జరికగి చేతికి మాత్రమే  గాయమైతే ఆత్మలెలా కన్పిస్తాయి?

        హీరోకి ఈ యాక్సిడెంట్ జరిపించడం కోసమే అన్నట్టు దొరికిపోయే కథనం ఏమిటంటే- అతణ్ణి సిటీ బయట చీప్ ధాబా కి డ్రింక్ కోసం పంపడం!  ఆ హైవే మీదైతే యాక్సిడెంట్ బాగా జరుగుతుందనీ!

          ఒక సినిమాని విశ్లేషించలేని దర్శకుడు సినిమా కథ తయారు చేయలేడు. కాపీని ప్రోత్సహించడం కాదు గానీ, ఆ ఒరిజినల్ ని ఉన్నదున్నట్టు కాపీ కొట్టి తీసి వున్నా ‘వారధి’ ఒక ఎంతో కొంత కామిక్ రిలీఫ్ అయ్యేది. ఒరిజినల్ ని అన్నిరకాలుగా తారుమారు చేయడంతో దీని జాతకం తారుమారై పోయింది.  ఒరిజినల్లో వున్న ఓపెనింగ్ బ్యాంగ్ ఆ కథకి అవసరం. తెలుగులో తారుమారు చేసి హీరోయిన్ పాత్రని బలి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రమాదంలో ప్రియుణ్ణి కోల్పోయిన విషయం దాచిపెట్టి,  కథాక్రమంలో ఎప్పుడో రివీల్ చేసి వుంటే- అంతవరకూ అయినా హీరోయిన్ పాత్ర బతికి పోయేది.

          సినిమా సక్సెస్ మంత్రమేమిటో బ్రహ్మ రహస్యమే కావొచ్చు, కానీ ఫ్లాపయ్యే  కళలు పైకి తెలిసిపోతూనే వుంటాయి. ఫ్లాపవుతున్న ఏడాదికి వంద సినిమాల్లో అవే కళలు పదేపదే జడలు విప్పుకుంటున్నా- కొత్తగా మరో ‘కళ’ వచ్చేసి ఆ సంఖ్యని పెంచేసే  ట్రెండే  ఆప్రతిహతంగా  ఇంకా కొనసాగుతోంది. 

          ఒక మంచి సినిమాని అందిస్తూ, ఆ సినిమాకీ ప్రేక్షకులకీ మధ్య వారధిగా ఉండాల్సిన దర్శకుడు, తానే విరోధిగా మారిపోయే చిత్రీకరణలకి పాల్పడ్డం  చాలా విచారకరం. పోస్టర్స్ లో కనబర్చిన కొత్తదనం, క్రియేటివిటీ, విజువల్ బ్యూటీ సినిమాకొచ్చేసరికి శూన్యమవడం ఇంకా విచారకరం.

          కావాల్సింది థియేటర్లకి ఫీడింగ్ ఇస్తూ సినిమాల సంఖ్య తగ్గకుండా చూసే క్యాజువల్ దర్శకులు కాదు, దిక్కులేని చిన్న సినిమాకి ప్రాణమైన కథాబలాన్ని పెంపొందించుకునే లేబర్ వ్యక్తులు చాలా అవసరం.  


సికిందర్