రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, మార్చి 2014, సోమవారం


పాత కళ -కళ !


‘ముత్యాల ముగ్గు’ ముగింపు మెరుపులు!


‘డైరె‘డైరెట్రూ, పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ ఆకాశంలో? సూర్యుడు నెత్తురు గడ్డలా లేడూ? మాసిపోయిన మూస పాత్రలు, డైలాగులు, యాక్టింగులూ మర్డరై పోయిన దృశ్య మయ్యా ఇదీ. డైరెట్రు అన్నాక  కాస్తంత కళా పోసనుండాలయ్యా. ఉత్తినే కాపీకొట్టి కాలరెగరేస్తే డైరెట్రుకీ, దిగిపోయిన బ్యాట్రీకీ తేడా ఏటుంటది?’

ముత్యాలముగ్గు’ లో రావు గోపాలరావు ఫేమస్ విలనీ రీమిక్స్ అయిందని పై డైలాగు చూసి ఎవరైనా సీడీల కోసం రేసు మొదలెడితే అంతకన్నా ‘కర్సయిపోవడం’ వుండదు! అది ‘యాభైలో సగం పన్నెండున్నర’ బాపతు అమాయకత్వమే అవుతుంది. పై నివేదన నేటి అభిరుచిగల ప్రేక్షకుడి/ప్రేక్షకురాలి ఆవేదనే కావొచ్చు. ‘ముత్యాలముగ్గు’ ని చూసిన కళ్ళతో నేటి సినిమాల్ని చూడలేకపోతున్న రోదనే కావొచ్చు. వాస్తవమెప్పుడూ కర్కశంగానే వుంటుంది. ‘ముత్యాలముగ్గు’ దీన్ని  గుర్తు చేస్తూనే వుంటుంది.

సినిమా అన్నది కళాత్మక వ్యాపారమని అందరూ అంటారు. కళాత్మకంగా కమర్షియల్ సినిమాలు తీసే వాళ్ళే తక్కువ. ఓ కళాత్మక (ఆర్టు) సినిమా తీసే ముందు మామూలు కమర్షియల్ మసాలా లతో చేయి తిప్పుకోండని ‘స్టోరీ’ అన్న ఉద్గ్రంధం రాసిన  ప్రొఫెసర్ రాబర్ట్ మెక్ కీ సినిమా దర్శకులకి సలహా ఇస్తాడు. ఒకవేళ ఆ దర్శకుడు వెండితెర మీద కెమెరాని కుంచెలా  మల్చుకోక ముందు, బ్రష్ తో కాన్వాస్ ని రంగుల రమ్యలోకంగా చేస్తున్న చిత్రకారుడయితే? అప్పుడతను వేరే కమర్షియల్సూ, కాకరకాయలంటూ కళాత్మక సినిమాకోసం ప్రత్యేకంగా చేయి తిప్పుకోవాల్సిన అవసరముంటుందా? ఇదీ ‘బాపు’ గారి ప్రశస్తి అంటే!

ముదిమితనానికి నో !
1967లో ‘సాక్షి’ అనే తొలి కళాత్మక ప్రయత్నం చేసినప్పుడే ఆయన నేపధ్యం చిత్ర లేఖనం. అలా చిత్రకారుడు చలన చిత్ర కారుడైనప్పుడు ఆ సృజనాత్మకతకి  వయస్సే  మీదపడదేమో? ‘ముత్యాల ముగ్గు’ తీసి నలభై ఏళ్ళు కావొస్తున్నా ముదిమితనమే అంటలేదు. మళ్ళీ ఒక్కసారి సీడీ వేసుకుని చూస్తే, ఏ విభాగంలో ఇది ప్రస్తుత కాలానికి వెనుకబడింది?కథా కథనాలు, మాటలు, సంగీత  సాహిత్యాలు, నటనలు, చిత్రీకరణా ఏదీ కాలదోషం పట్టని అసమాన సృజనే. అసలే మేకప్పూ లేని నటీ నటులతో వాస్తవిక కథాచిత్రాల నడక నడుస్తూనే, కమర్షియల్ గా సూపర్ సక్సెస్ కావడం దీనికే చెల్లింది.

ఇంకో దశాబ్ద కాలంలో ఆర్టు సినిమాల చెలామణి చరమాంకం కొస్తుందనగా,  బాపు భవిష్యద్దర్శనం చేసినట్టు అప్పుడే (1975లో )ఈ ముందుకాలపు ‘కమర్షియలార్టు’ నిచ్చారు. ఉత్తరాదిన ఆర్టు సినిమాల ఉద్యమం ముగిశాక వాటి స్థానాన్ని భర్తీ చేస్తూ ఆతర్వాత బాలీవుడ్ లో క్రాసోవర్ సినిమాల పేరుతో  వచ్చినవన్నీ, నేటికీ వస్తున్నవీ ‘ముత్యాలముగ్గు’ టైపు కమర్షియలార్టు సినిమాలే.

‘ముత్యాలముగ్గు’ అనగానే రావుగోపాలరావు మెదలడం సహజం. కానీ ‘ముత్యాలముగ్గు’ అంటే కేవలం రావుగోపాలరావు క్లాసిక్ విలనీ మాత్రమే కాదు, బహు సుందరమైన కుటుంబ గాథ కూడా. హృద్యమైన శోకనాశన జానకీ వృత్తాంతం. ఆధునిక రామాయణం...ఉత్తర రామాయణం! విడిపోయిన భార్యా భర్తలమధ్య పసి పిల్లల గేమ్ ప్లాన్!

శ్రీధర్, సంగీతలు భార్యాభర్తలు. బాధితురాలు భార్యే. బాధకుడు డబ్బుకోసం ఏమైనా చేసే కాంట్రాక్టర్ రావుగోపాలరావు. అప్పుడా తల్లి అవస్థ చూడలేక కవలలిద్దరూ సదరు కాంట్రాక్టరు దురాగతాన్ని నిరూపించి, పునీతురాలిగా తిరిగి పునీతురాలిగా తిరిగి తల్లిని కన్నతండ్రితో కలిపి సుఖాంతం చేసే వృత్తాంతమే.
ఎందరికో భిక్ష!
సినిమా కథని ఆసక్తిగా మొదలెట్టాలంటే రెండు మార్గాలున్నాయంటాడు సిడ్ ఫీల్డ్. ఏదైనా ఒక సంఘటనతో యాక్షన్ దృశ్యాల్ని చూపడం, లేదా పాత్ర ద్వారా కథని వివరిస్తూ పోవడం. బాపుగారు తన మూడంకాల స్క్రీన్  ప్లేకి ఈ రెండో విధానాన్నే ఎంచుకున్నారు. శ్రీధర్ పాత్ర ద్వారా జమీందారు అయిన తండ్రి కాంతారావుని, ఆయన అక్కగార్ని, ముక్కామలని, అతడి మోడరన్ కూతుర్ని, అక్కడి ఉద్యోగి అల్లు రామలింగయ్యని, శ్రీధర్ స్నేహితుడ్నీ చకచకా పరిచయం చేసేసి- ఆ స్నేహితుడి చెల్లెలి పెళ్ళికి శ్రీధర్ ని పంపించేసి, ఆ పెళ్ళికూతురి రూపంలో సంగీతాని చూపిస్తారు.
ప్రారంభంలోనే ఇది చాలా ఆసక్తి రేపే ఘట్టం. హీరోయిన్ పెళ్ళవుతోంటే హీరో రావడం! ...ఇలాంటి ప్రారంభంతో మొన్నటివరకూ అదేపనిగా చాలా సినిమా లొచ్చాయి. ఇది ‘ముత్యాలముగ్గు’ పెట్టిన భిక్షే. ఈ ప్రారంభ ఘట్టంలోనే సంగీత పెళ్లి చెడిపోయి, శ్రీధర్ ఆపద్ధర్మంగా ఆమెనే చేసుకోవాల్సిరావడంతో టెన్షన్ గ్రాఫ్ అమాంతం పెరిగి, కథకి గట్టి ముడి పడిపోతుంది. ఇదంతా కేవలం ఎనిమిది సీన్లలోపే జరిగిపోతుంది.

రిచర్డ్ గెర్ నటించిన విజయవంతమైన సినిమా ‘అన్ ఫెయిత్ ఫుల్’ (2002) లో ఐదవ సీనుకల్లా కథ ముడి పడిపోతుంది. ఇలాటి క్లుప్తీ కరించిన కథనాలే అసలుసిసలు సృజనాత్మకతకి నిదర్శనాలవుతాయి. ‘ముత్యాలముగ్గు’ ఈ సెక్షన్ లో అపూర్వంగా నిలబడుతుంది. బాపూ- ఈ కథా, సంభాషణలూ రాసిన రమణా ‘ముత్యాలముగ్గు’ ని భావి తరాలకి రిఫరెన్స్ గైడ్ లా అందించారు. ఏ కథైనా సరదాగా మొదలై, సంక్షుభితంగా మారి, తిరిగి శాంతి సామరస్యాలు స్థాపించే మూడంకాల నిర్మాణంలోనే  వుంటుంది. ఆనందంగా సాగుతున్న శ్రీధర్-సంగీతల వైవాహిక జీవితంలోకి రావుగోపాల రావుని ప్రవేశపెట్టి సంక్షుభితం చేస్తారు బాపు. కడుపుతో వున్న సంగీత శీలమ్మీద నిందపడి వీధి పాలవుతుంది. ఫస్టాఫ్ లో ఇలా విడదీయడం సులభమే. సెకండాఫ్ లో ఔచిత్య భంగం కలక్కుండా తిరిగి కలపడమే పెద్ద సమస్య. ఈ చౌరాస్తా నుంచీ కథ ఎటువైపు వెళ్ళాలి? పిల్లలు పుట్టి రావడానికి ఇంకా చాలా టైముంది. సంగీత మీద పడ్డ నింద తొలగించేందుకు ఉపయోగపడే సాధనాలు వాళ్ళే.  వాళ్ళు దూకాల్సిన కార్య క్షేత్రంలోకి ముందుగానే ఇంకో పాత్రని పంపి కథ నడిపించడం కోరి (సెకండాఫ్) గండాన్ని తెచ్చుకోవడమే.

పోనీ శ్రీధర్-సంగీతల ఎడబాటు తాలుకూ బాధల్ని వాళ్లిద్దరి మీదా  చిత్రీకరిస్తూ కాలక్షేపం చేద్దామా అంటే అదీ సుడిగుండంలో పడేస్తుంది. పైగా  రసభంగం కల్గిస్తూ శోక రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరి పిల్లలు పుట్టి వచ్చేవరకూ కథ ఎలా నడపాలి? మొదట్నించీ చూస్తే  ఈ కథ అద్భుత రస ప్రధానంగానే నడుస్తూ వచ్చింది. ఈ అద్భుత రసాన్నే ఇక ముందూ కొనసాగించాల్సి వుంటుంది. అప్పుడే కథకి ఏకసూత్రత చేకూరుతుంది.  అందుకని ఈ అద్భుతరస స్రవంతికి  ఒక సాధనంగా ఉంటూ వస్తున్న  రావుగోపాలరావు అండ్ గ్యాంగు ని పోస్ట్ మార్టం చేసే పని చేపట్టారు సిద్ధహస్తులైన బాపూ-స్వర్గీయ రమణలు దిగ్విజయంగా!

ఇదీ సరైన సెకండాఫ్ కథనానికి మార్గం! ఇదే సూత్రం! ఏ రసప్రధానంగా కథ ప్రారంభమై దాని ఆలంబనగా కొనసాగుతోందో, అదే రస స్రవంతిని పట్టుకుని ఇంటర్వెల్ చౌరస్తా నుంచీ దారితప్పకుండా సాగిపోవడమే దిశ-దశ-సమస్తం కూడా!

పంచభూతాలు మింగేసుకున్నాయి!
సరే, ఎవరీ రావుగోపాలరావు అండ్ గ్యాంగులో దొంగలు? ఓ అమాయకురాలి కాపురాన్ని చెడగొట్టిన రావుగోపాలరావు, ముక్కామల, అల్లురామలింగయ్య, నూతన్ ప్రసాద్ లు- మరి ఈ దుష్ట చతుష్టయం చెడబుట్టిన బతుకుల్లో చీకటి కోణాలేమిటి?...అనే సెకండ్ ట్రాక్ ఓపెన్ చేసి, వాళ్లకి వాళ్ళు వెన్నుపోట్లు పొడుచుకునే ఆత్మవినాశక చర్యలతో టైం అండ్ టెన్షన్ థియరీకి న్యాయం చేస్తూ అమాంతం కథనంలో టెంపో- దాంతోబాటు కొత్త సస్పెన్సూ సృష్టించేశారు!

చేసిన పాపం చావదనే కదా? సృష్టిలో ప్రతిదీ బూమరాంగ్ అవుతుంది. మంచి చేస్తే మంచీ, చెడు చేస్తే చెడూ చుట్టూ తిరిగి మనకే వచ్చి తగుల్తాయి. ఈ దుష్ట చతుష్టయం ధనదాహంతో సంగీత ని వనవాసం పట్టించినప్పుడు, సృష్టి చూస్తూ ఊరుకోదు. సృష్టెప్పుడూ హెచ్చు తగ్గుల్ని సమతూకం చేసే దిశగానే కదుల్తూంటుంది. సంగీతకి ఆ స్థాయిలో అన్యాయం చేసి హెచ్చిపోయిన కీచకుల అదృష్టాల్ని ఛిన్నాభిన్నం చేసి, ఆ నష్టపరిహారం సంగీతకి ఇప్పించడం సృష్టి ధర్మం కదా? ఇదే కదా ది గ్రేట్ ఫిలాసఫర్ ఎమర్సన్ సూత్రీకరించిన, సృష్టి తనపని తానుగా చేసుకుపోయే ‘లా ఆఫ్ కంపెన్సేషన్’ ప్రక్రియ?

కథలో ఈ ఫిలాసఫీ ఎంచక్కా ఇమిడిపోయి సంగీత పాత్ర పట్ల ప్రేక్షకులకి ఎనలేని సానుభూతేర్పడుతుంది!

ఇలా సాగుతూండగా, సంగీతకి పుట్టిన కవలలు తల్లిదండ్రుల్ని కలిపే అధ్యాయం మొదలౌతుంది. వీళ్ళ చేత ఈ పని ఎలా చేయించాలి?  ఇది మిలియన్ రీళ్ల ప్రశ్న! ఎవరికీ? కథని ఉదాత్తంగా చెప్పాలని సమకట్టిన వాళ్ళకే. ఇందుకు ముందుగా శాస్త్రం తెలియాలి...

కృతయుగంలో మనుషులు సత్వర ఫలితాలు పొందేందుకు ధ్యానం చేసే వాళ్లట. త్రేతాయుగంలో యాగాలు చేశారని, ద్వాపరయుగంలో అర్చనద్వారా పొందారనీ, ఇక కలియుగంలో జ్ఞాన శూన్యులైన అల్పులు అధైర్య పడకుండా సంకీర్తన ద్వారా సత్వర ఫలితాలు పొందవచ్చనీ  సూత మహర్షి చెప్పాడు.

అల్పులైన పిల్లల చేత బాపుగారు ఈ పనే చేయించారు!

రామాలయంలో ఒకర్నీ, రావుగోపాలరావు ఇంట మరొకర్నీ పడేసి సంకీర్తనలతో మస్కాలు కొట్టిస్తూ స్వకార్యం పూర్తి చేయించారు. అక్కకేమో ఆంజనేయుడితో ఫాంటసీ, తమ్ముడికేమో కోతితో ప్రాక్టికాలిటీ! తత్ఫలితంగా రావుగోపాలరావు చాపకింద నీళ్ళొచ్చేయడం!
ఇప్పుడు ఈ మజిలీకి చేరిన కథని ఎలా ముగించడం? మళ్ళీ శాస్త్రమే! సృష్టికర్త ఈ సృష్టిని ఎలా ఉపసంహరిస్తాడు? బ్రహ్మ పురాణం ఏం చెప్తోంది? త్రివిధాలుగా సృష్టి ఉపసంహారం జరగవచ్చంది. నైమిత్తికం, ప్రాకృతికం, ఆత్మీంద్రికం...మొదటిదాంతో పంచభూతాలు ఒకదాన్నొకటి మింగేసుకుని ఆకాశం శూన్యమైపోతుంది. రెండోదాంతో ప్రకృతి పరమాత్మలో కలిసిపోతుంది. మూడో ప్రక్రియలో మానవాళి మోక్షమార్గం ద్వారా జరుగుతుంది.

సినిమాలో ఆల్రెడీ వెన్నుపోట్లతో కలహించుకుంటున్న దుష్టచతుష్టయం కీచులాటలన్నిటినీ  ఇక పతాక స్థాయికి చేర్చి , పంచ మహాభూతాల్లా ఒకర్నొకరు మింగేసుకునే నైమిత్తిక ముగింపు నే ఇచ్చారు చాలా టెర్రిఫిక్ చిత్రీకరణతో!
అప్పుడంతా  ఆకాశం శూన్యమైపోయినట్టు శ్మశాన నిశ్శబ్దం!

తిరిగి సృష్టి తాజాగా మొదలైనట్టూ...శ్రీధర్-సంగీతల కాపురం - కళకళలాడుతూ...సీతారాములు తామై, పిల్లలు లవకుశలై ఉత్తరరామాయణం పరిసమాప్తం!

-సికిందర్
(సాక్షి, 2009)






29, మార్చి 2014, శనివారం

రివ్యూ..
బాలయ్య వేసవి బ్యాంగ్ !

** నందమూరి బాలకృష్ణ, సోనల్ చౌహాన్, రాధికా ఆప్టే, జగపతిబాబు, బ్రహ్మానందం, సుమన్, జయప్రకాష్ రెడ్డి, రావురమేష్, చలపతిరావు, ఎల్బీ శ్రీరాం, సుహాసిని, కల్యాణి, హంసానందిని తదితరులు..
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్,  ఛాయాగ్రహణం : సి. రాంప్రసాద్   కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు  కళ : ఏఎస్ ప్రకాష్   యాక్షన్ : రాం- లక్ష్మణ్, కణల్ కన్నన్  మాటలు : ఎం. రత్నం
బ్యానర్ : వారాహి చలన చిత్రం- 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : రాం ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర
రచన- దర్శకత్వం : బోయపాటి శీను
విడుదల : 28 మార్చి 2014     సెన్సార్ : ‘A’

***
వేసవికీ, ‘నందమూరి బాలకృష్ణ- బోయపాటి శీను’ ల కాంబినేషన్ కీ ఏదో బలమైన బాక్సాఫీసు బంధం ఉన్నట్టుంది. సరిగ్గా నాల్గేళ్ళ క్రితం 2010 వేసవిలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘సింహా’ ఎంత బలమైన హిట్ గా నిల్చిందో, అందుకేమాత్రం తీసిపోని విజయ ఢంకా మోగిస్తూ ఇప్పుడు ‘లెజెండ్’ వచ్చింది. మధ్యలో బోయపాటికి  ‘దమ్ము’తో శృంగభంగమైతే- ఈ సారి ఆ వైఫల్య కారణాన్ని హీరో మీదనుంచి విలన్ మీదికి తోస్తూ తప్పించుకో జూశాడు. దీంతో ‘లెజెండ్’ దంతా ఏకపక్ష గోడు అయ్యింది!

అసలే ఎన్నికల సమయంలో విడుదలౌతున్న ఈ సినిమా- బాలకృష్ణ ఇంటి పార్టీ కి ప్రచారంచేసిపెట్టే అస్త్రంగా రాబోతోందన్న ఊహాగానాల్ని పటాపంచలుచేస్తూ, ఫక్తు ఫ్యాక్షన్ మార్కు మరో ఫార్ములాగా మాత్రమే ఫ్యాన్స్ కోసం ‘సర్వాంగ సుందరంగా’ ముస్తాబయింది.


అడుగడుగునా భగభగ మండిపోతూ బాలకృష్ణ తన భుజాలమీద  ఒన్ మాన్ షోగా అవలీలగా మోసుకొచ్చి బాక్సాఫీసు ముంగిట పడేసిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఒక్కటి రుజువు చేసింది- బిగ్ స్టార్స్ కి ఇంతకంటే గత్యంతరం లేదు. గతం వైపే చూపు తప్ప వర్తమాన భవిష్యత్ కాలాల కొత్తదనంతో సంబంధం వుండదు. ఒక పాత  ఫ్యాక్షన్ ఫార్ములాలోంచి, రూపం మార్చి ఇంకో ఫ్యాక్షన్ ఫార్ములాని లాగే అనివార్య విన్యాసమే శ్రీరామరక్ష అయితే ఇందుకు తప్పుబట్టాల్సిందేమీ వుండదు. 


బాలకృష్ణ లోని శక్తివంతమైన నటుణ్ణి ఎలా బయటికి తీసి హిట్ కొట్టాలో  తెలుసుకోవాలంటే కేరాఫ్ అడ్రసుగా మారిన బోయపాటిని స్టడీ చేయాల్సిందే. ఇక బాలకృష్ణ ఉన్నంత కాలం బోయపాటీ, బోయపాటి ఉన్నంత కాలం బాలకృష్ణా ఉభయకుశలోపరిగా వుంటారనుకోవచ్చు వేసవికో ఫ్యాక్షన్ రీసైక్లింగ్ చేసుకుంటూ!

విశాఖ తీరాన ఫ్యాక్షన్ ఘరానా!
కర్నూలు నుంచి ఫ్యాక్షన్ తొడగొట్టి విశాఖపట్నంలో మకాం వేసే చిత్రణ అదేదో వర్తమాన రాజకీయ ముఖచిత్రంలా అన్పిస్తే అదిక్కడితో అంతమౌతుంది. మిగతా కథాకమామిషు అంతా పాతఫ్యాక్షన్ కాల్పనికమే. కర్నూలునుంచి పెళ్లి సంబంధానికి వైజాగ్ వచ్చి వెళ్తూ ఫ్యాక్షనిస్టు జితేంద్ర (జగపతిబాబు) పక్కూళ్ళో అనుకోకుండా ఓ రోడ్డుప్రమాదం చేసి అక్కడి పెద్ద మనిషి  (సుమన్) ముందు పంచాయితీకి హాజరవుతాడు. ఆ పెద్దమనిషి బాధితుడికి నష్టపరిహారమూ క్షమాపణా డిమాండ్ చేస్తాడు. మాట వినని జితేంద్ర కి లెంపకాయకూడా కొడతాడు. 

దీంతో ఈ వైజాగ్ లోనే మకాం వేసి ఆ పెద్దమనిషి కుటుంబాన్ని తుదముట్టిస్తానని ప్రతిన బూనుతాడు జితేంద్ర.
దరిమిలా ఆ పెద్దమనిషినీ, అతడి భార్య (సుహాసిని)నీ మట్టుబెట్టేస్తాడు జితేంద్ర. దీనికి రియాక్టయిన పెద్దమనిషి పెద్దకొడుకు జయదేవ్ (బాలకృష్ణ-1) జితేంద్ర తండ్రిని హతమార్చేస్తాడు. ఈ హత్యలు చూసి చలించిన నాయనమ్మ పెద్దమనవణ్ణి కుటుంబ బహిష్కారం గావించి, చిన్న మనవడు కృష్ణ (బాలకృష్ణ-2) ని లండన్ పంపించివేస్తుంది.
ఈ పూర్వకథ లోంచి వర్తమానానికొస్తే, కృష్ణ దుబాయిలో ప్రత్యక్షమౌతాడు. అక్కడ  స్నేహ (సోనల్ చౌహాన్) అనే మోడర్న్ గర్ల్ ని ప్రేమించి నానమ్మ కి పెళ్లి ప్రతిపాదన పంపుతాడు. పెళ్లి శత్రువు పొంచివున్న వైజాగ్ లో వద్దనీ, మేమంతా దుబాయ్ కేవచ్చి చేస్తామనీ నానమ్మ అంటుంది. కానీ కృష్ణ వెంటవుండే మాణిక్యం (బ్రహ్మానందం) ప్రోద్బలంతో వైజాగ్ కే చేరతాడు కృష్ణ స్నేహతో.
చేరగానే ఒక అన్యాయాన్ని ఎదుర్కొని జితేంద్ర ముఠా ని తంతాడు. దీంతో జితేంద్ర లో పాత  పగ మేల్కొని కృష్ణ పెళ్లి బృందం మీద దాడి చేస్తాడు. కృష్ణ సహా బృందమంతా ఇక హతమౌతారన్న క్షణాన అజ్ఞాతంగా వున్న జయదేవ్ ప్రచండంగా ఏతెంచి శత్రుసంహారం  గావిస్తాడు. జితేంద్ర తప్పించుకుంటాడు...ఇప్పుడు అజ్ఞాతంలో వున్న జయదేవ్ కథతో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమౌతుంది...

ఇక కుటుంబాన్ని జితేంద్ర బారినుంచి కాపాడే ఏకైక దిక్కుగా జయదేవ్ ఉంటాడు. ఓ పక్క బామ్మ ఛీత్కారాల్ని భరిస్తూ, మరదలి ప్రేమతో సతమతమౌతూ ఏకాకి జీవితం గడుపుతున్న అతను ఎన్ని అవమానాలు, అవాంతరాలూ ఎదురైనా కుటుంబ క్షేమాన్నే కాంక్షిస్తూ ఉద్యమిస్తూంటాడు...

బాలయ్య బాలయ్యా రాసుకుంటే...
ఇద్దరు బాలయ్యల బలాబలాల జుగల్బందీ ఇది. ఇందులో రెండో బాలయ్యది ప్రథమార్ధంలో ముగిసిపోయే రోమాంటిక్ పాత్రైతే, మొదటి బాలయ్యది ద్వితీయార్ధం పగ్గాలందుకునే  యాక్షన్ పాత్ర. ఈ యాక్షన్ బాలయ్య పాత్రే కథకి బలాన్నీ అర్ధాన్నీ చేకూరుస్తుంది. ఈ పాత్రలో బాలకృష్ణ నటనని ప్రేక్షకులు కళ్ళప్పగించి వీక్షిస్తారు. ఎందుకంటే ఇది వయసుకుకి తగ్గట్టున్న సీరియస్ పాత్ర. అదే ప్రథమార్ధమంతా రోమాంటిక్ బాలయ్యని ఆ వయసులో చూడలేక ఒకటే గగ్గోలు పెడతారు ప్రేక్షకులు. మొదటి పాటకి డాన్సులూ డ్రెస్సులూ అయితే మరీ ఎబ్బెట్టుగా కూడా వుంటాయి.

జయదేవ్ పాత్రకిచ్చిన గెటప్, డ్రెస్ సెన్స్, డైలాగులు, అంతర్గత-బహిర్గత సంఘర్షణల సమాహారంతో సమగ్ర పాత్రచిత్రణా ఈ సినిమాకి ప్రత్యేకాకర్షణలు. ద్వితీయార్ధంలో కామెడీ లేదనే విమర్శ అసంగతమైనది. బోయపాటి ఒక సీరియస్ ఆర్గ్యుమెంట్ తో ఆలోచనాత్మకంగా ప్రవేశించిన జయదేవ్ పాత్ర కోసం గాక, కామెడీ వైపు నిలబడి వుంటే మొత్తం అభాసయ్యేది.

జయదేవ్ పాత్రలో బాలకృష్ణ ని చూస్తే సమీప భవిష్యత్ లో ఏ యంగ్ స్టారూ ఆయన్ని బీట్ చేయలేడని రాసిచ్చేయొచ్చు. అసలు ఈ పాత్రే యంగ్ స్టార్స్ కి దుస్సాధ్యమైనది. యంగ్ స్టార్సే కాదు- తన సమకాలీనులు సైతం హిట్టివ్వలేని తరుణాన బాలకృష్ణ  ఇంకో విజయం సాధించాడు.
ఇక జగపతిబాబు ఈ సినిమాకి రెండో దన్ను. వయసుమళ్ళిన విలన్ గా అవతారమెత్తి తనలో ఇన్నాళ్ళూ బయల్పడని అసలుసిసలు నటుణ్ణి దృశ్యమానం చేశాడు. మోహంలో, కళ్ళల్లో ఆ కరుడుగట్టిన విలనీ ఎక్స్ ప్రెషన్స్ తెలుగు తెరకి ఇక హిందీ దుష్టనాయక అవసరాన్ని వేలెట్టి ప్రశ్నిస్తున్నట్టున్నాయి.

హీరోయిన్లిద్దర్లో సోనల్ చౌహాన్ అందాల ఆరబోతకి, రాధికా ఆప్టే సెంటిమెంట్ల పంటకీ ఉపయోగపడ్డారు. ఇతర తారాగణమంతా  ప్యాడింగ్ అవసరాలు తీరిస్తే, బ్రహ్మానందం కాసేపు వెర్బల్ కామెడీ చేసి తప్పుకున్నాడు.

సాంకేతికాలు సోసో...
అత్యధిక బడ్జెట్ కేటాయించి ఎంత కనువిందు చేసినా వీనులవిందు చేయలేకపోవడం ఒక లోటు. దేవీశ్రీప్రసాద్ సంగీతంలో పాటలు ఒక్కటీ క్యాచీగా లేవు. థియేటర్ లోంచి  బయటికొస్తే గుర్తుండవు. కానీ బ్యాక్ గ్రౌండ్ సంగీతం మాత్రం చెవులు పగిలే స్థాయిలో సమకూర్చాడు. ఈ హోరులో డీ టీ ఎస్ అనే శబ్దగ్రాహక కళ కకావికలమై పోయింది. ఇక అగ్రస్థాయి ఛాయాగ్రాహకుడు రాంప్రసాద్ కేమేరాపనితనం ఎంత ఉన్నతంగా వుందో, దాంతో పోటీపడుతూ ఏఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం అంత ద్విగుణీ కృతమైంది. పోతే, యాక్షన్ కోరియోగ్రఫీలో రాం-లక్ష్మణ్, కణల్ కన్నన్ లు లాజిక్ ని తీసి అవతలపెట్టి గాలిలో చేసిన విన్యాసాలు ఇలాటి బిగ్ స్టార్ కమర్షియల్స్ కే నప్పుతాయని ఇంకోసారి రుజువుచేశాయి. కోటగిరి కూర్పు దర్శకుడు ఉద్దేశించిన కథన వేగాన్ని అందుకున్నట్టే వుంది.

ఎం. రత్నం రాసిన సంభాషణలు ఫ్యాన్స్ కి మంచి హుషారు. దర్శకుడుగా బోయపాటి శీను కమర్షియల్ గా బాలకృష్ణ ని ఆకాశాని కెత్తేస్తూ ప్రెజెంట్ చేయడంలో మరోసారి  సక్సెస్సయ్యాడు.

స్క్రీన్ ప్లే సంగతులు
గతంలో ఫ్యాక్షన్ సినిమాలు వెల్లువెత్తిన కాలంలో వేషం కట్టిన ‘ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్’ అనే ఓకే తరహా మూస స్క్రీన్ ప్లే తనాన్నే ‘లెజెండ్’ లో కూడా  చూడొచ్చు. నడుస్తున్న ప్రస్తుత కథ ఆగిపోయి, గతం తాలూకు ఫ్లాష్ బ్యాక్ కథ సుదీర్ఘంగా  క్లైమాక్స్ వరకూ సాగడం వల్ల – ఇంటర్వెల్ దగ్గర ఆగిపోయిన ప్రధాన కథ- అంటే  ప్రస్తుత కథ తాలూకు టెన్షన్ గ్రాఫ్ కూడా పతనమై చప్పబడిపోతుంది సినిమా. అంతేగాక ఇప్పుడు రెండో పాత్ర కథ కూడా మొదట్నించీ చూడాల్సి వస్తుంది. ఇలా మొదటిపాత్ర కథ ఫస్టాఫ్ లో, రెండో పాత్ర కథ సెకండాఫ్ లోనూ చూడ్డంతోనే సరిపోయి- క్లైమాక్స్ లో పిసరంత అసలు కథ చూస్తాం. అదీ తెలిసిపోయే కథగానే వుంటుంది. ఏమంటే దుష్టసంహారం గావించడమే హీరోకి మిగిలివుండే పిసరంత అసలు కథ.

ఎలాటి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కీ, రొటీన్ మూస కథకీ అతీతంగా వ్యక్తిపూజ ఇమేజులతో  అలరారే స్టార్స్  మాత్రమే తమ భుజాలమీద ఇలాటి లోపభూయిష్ట రచనతో కూడిన సినిమాల్ని ఒన్ మాన్ షోగా లాక్కురాగలరు. కాకపోతే ఆ పాత్ర చిత్రణ ‘దమ్ము’ లో ఎన్టీఆర్ లా వుండకూడదు. వుంటే  అట్టర్ ఫ్లాపవుతుంది.  ‘దమ్ము’లో ఎన్టీఆర్ ది పసలేని పాసివ్ పాత్ర. విలన్ మత్రమే యాక్టివ్ క్యారక్టర్. హీరో ఎంతసేపూ రియాక్టివ్ గా తిరగబడుతూ అయ్యోపాపం అన్పించుకునే స్థితిలో దయనీయంగా ఉంటాడు. పైగా యుద్ధం కూడా చేయనంటాడు.

‘లెజెండ్’ లో హీరో ఒక లక్ష్యం కోసం నిత్యం రగిలిపోయే యాక్టివ్ పాత్రకావడం వల్ల –స్టార్ ఇమేజి కూడా తోడయ్యి బలహీన స్క్రీన్ ప్లే గండాన్ని దాటేసింది. అయితే దర్శకుడు ఎటుతిరిగీ పాసివ్ పాత్రల పట్ల మమకారం చంపుకోనట్టుంది. ‘దమ్ము’లో హీరో పాసివ్ గానూ, విలన్ ని యాక్టివ్ గానూ చూపించినట్టు- ‘లెజెండ్’ లో దీన్ని తిరగేసి విలన్ ని పాసివ్ చేసి, హీరోని యాక్టివ్ చేశాడు. దీంతో విలన్ గా వేసిన జగపతిబాబు పాత్ర రియాక్టివ్ గా పెడబొబ్బలు పెడుతూ చతికిలబడే బలహీనుడిగా మారిపోయింది. బలమైన విలన్ లేకపోవడంతో ఏకపక్షంగా హీరో గొడవే ఎంతసేపూ చూడాల్సిన మొనాటనీకి దారితీసిందీ సినిమా!

మానవాతీత  శక్తుల మెగా ఇమేజుడికి ఎదురెవరూ ఉండరని ఉద్దేశమేమో!

లాజిక్ కూడా బలాదూరవుతుంది. అన్నేళ్ళూ హీరో అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరమేమిటి? ఎప్పుడో విలన్ కథ ముగించేసి వుండొచ్చు కదా? తన పగ కోసం కర్నూలు విలన్ వైజాగ్ వచ్చి పాగా వేస్తే , వైజాగ్ ని ఏలే వంశంలోని హీరో సీనులోంచి మాయమవడమేమిటి? ఇలాటి లాజిక్ ని పూర్వపక్షంజేసే అంశాలెన్నో అడుగడుగునా కన్పిస్తాయి.

-సికిందర్













21, మార్చి 2014, శుక్రవారం

రివ్యూ..


ఈ 'జర్నీ' దారితప్పింది!

విక్రం ప్రభు, సురభి, హరిరాజన్, వంశీకృష్ణ, గణేష్ వెంకట్రామన్ తదితరులు
సంగీతం : సి. సత్య        ఛాయాగ్రహణం : శక్తి    యాక్షన్:  రాజశేఖర్   కూర్పు : శ్రీకర్ ప్రసాద్ 
బ్యానర్ :  లక్ష్మి గణపతి ఫిలిమ్స్     నిర్మాత : సుబ్రహ్మణ్యం.బి 
రచన- దర్శకత్వం : శరవణన్. ఎం 
 విడుదల :  21 మార్చి, 2014 
***
2011లో రొటీన్ కమర్షియల్స్ నుంచి కాస్త ఆటవిడుపుగా  ‘జర్నీ’ అనే ప్రయోగాత్మక సినిమాతో ప్రతిష్టాత్మకంగా పరిచయమైన దర్శకుడు ఎం. శరవణన్- తిరిగి ఇప్పుడు ‘సిటిజన్’ అనే సోషియో థ్రిల్లర్ తో తెలుగు ప్రేక్షకుల్ని అలరిద్దామని విచ్చేశాడు. ఈ సినిమా తమిళంలో ‘ఇవన్ వేరమాతిరి’ [అతను ను డిఫరెంట్] గా గత డిసెంబర్ లో విడుదలయ్యింది. దివంగత మహానటుడు శివాజీ గణేశన్ మనవడైన విక్రం ప్రభుని  హీరోగా, కొత్తనటి సురభిని  హీరోయిన్ గానూ తీసుకుని శరవణన్ ఈ సినిమాని కొత్తఆలోచన- కొత్త స్క్రీన్ ప్లే- కొత్త ప్రయత్నం- ప్రతీదీ కొత్తే- నంటూ ప్రచారం చేసుకుంటూ అదృష్టాన్ని పరీక్షించుకోబోయాడు.  

‘జర్నీ’తో మొదలైన అతడి వెండితెర ప్రస్థానం అంతే  సాంఘీక  ప్రయోజనంతో, క్రాసోవర్ సినిమాల వైపే ఇకపైన కూడా కొనసాగుతుందని ఊహించి ఉన్నవారికి, ఈ తాజా నజరానా ఏమిచ్చిందని విషయంలోకి తొంగి చూస్తే- సంభ్రమాశ్చర్యాలు కలక్క మానదు- దటీజ్ శరవణన్ అన్నమాట!

న్యాయవిద్యలో అన్యాయపాలన
2008 లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నై అంబేద్కర్ న్యాయ కళాశాల హింసాత్మక ఉదంతాన్నిఐడియా గా తీసుకుని, యువతరం తమ చుట్టూ జరిగే అన్యాయాలకి స్పందించి ప్రతిఘటించాలంటూ అంతర్లీన సందేశాన్నిస్తూ మొదలౌతుందీ సోషియో థ్రిల్లర్.

ఆ న్యాయ కళాశాలలో మంత్రి కోటాకింద కేటాయించాల్సిన అభ్యర్ధుల జాబితాని న్యాయ శాఖా మంత్రి ఆదిశేషయ్య (హరి రాజన్ ) పంపిస్తే, ఆ అభ్యర్ధులందరూ క్రిమినల్ కేసులున్న వాళ్ళని తిరస్కరిస్తాడు ప్రిన్సిపాల్. దీంతో  ఆదిశేషయ్య కొందరు విద్యార్థుల్ని ఎగదోసి కళాశాలలో విధ్వంసం సృష్టిస్తాడు. ముగ్గురు విద్యార్థులు చనిపోతారు. పోలీసులతో బాటు ప్రజలూ  ఇదంతా మనకెందుకులే అని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఈ ఘోరాన్ని సహించలేకపోతాడు గుణశేఖర్ (విక్రం ప్రభు). బాధ్యుడికి శిక్ష పడాల్సిందేనని ఉద్యుక్తు డవుతాడు. ఇతను విజ్ కాం (విజువల్  కమ్యూనికేషన్స్ ) చదివిన నిరుద్యోగి. పక్కా ప్లాను వేసి ఆదిశేషయ్య తమ్ముడు ఈశ్వర్ (వంశీ కృష్ణ )ని కిడ్నాప్ చేసి ఓ నిర్మాణంలో వున్న భవనం టాయిలెట్లో బంధిస్తాడు.
ఈశ్వర్ ఆరు హత్యలు చేసి జైలుశిక్ష పడ్డ హంతకుడు. ఇటీవలే పదిహేను రోజులు పెరోల్ మీద విడుదలై వచ్చాడు. ఇతడ్ని కనపడకుండా చేస్తే, తిరిగి జైలు కెళ్ళకుండా ఆదిషేశయ్యే మాయం చేశాడన్న ఆరోపణ లెదుర్కొని మంత్రి పదవికి రాజీనామా చేస్తాడనీ, అదే అతడికి తగిన శిక్షవుతుందనీ గుణశేఖర్ అంచనా.
పెరోల్ గడువుతీరి తమ్ముడు కన్పించకపోవడంతో ఆదిశేషయ్య వేట మొదలెడతాడు. మరో వైపు ఈశ్వర్ ఉప్పందించడంతో ప్రతిపక్ష నాయకుడు గోలెడతాడు. తమ్ముడు దొరక్క ఆదిశేషయ్య రాజీనామా చేయాల్సి వస్తుంది. దీంతో తన ఆపరేషన్ పూర్తయి ఈశ్వర్ ని విడుదల చేసేస్తాడు గుణశేఖర్.
బయటపడ్డ ఈశ్వర్ తనని బంధించిన ‘గుర్తు తెలియని’ యువకుడ్ని పట్టుకునేందుకు తన వేట మొదలెడతాడు. ఇలా వుండగా, గుణశేఖర్ కి ఒకమ్మాయి మాలిని (సురభి) పరిచయమై ప్రేమలో కూడా పడుతుంది. గుణశేఖరే ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేక పోతాడు. ఇంతలో ఆమె కన్పించకుండా పోతుంది....

ఇలా సాగే ఈ కథలో సాధారణ యువకుడి పాత్రలో హీరో విక్రం ప్రభు చాలా క్యాజువల్ గా కన్పిస్తాడు. అతడి రూపురేఖలు సాధారణ గల్లీ కుర్రాళ్ళని పోలి వుండడం కలిసివచ్చింది. ఎంత క్యాజువల్ గా కన్పిస్తాడో, యాక్షన్ సీన్లలో అంత విజృంభిస్తాడు. కొత్తనటి సురభి సైతం సాధారణ మధ్యతరగతి అమ్మాయి కి సరిపోయే హంగులతో వుంది. విలన్ గా వంశీ కృష్ణ  చాలా వయోలెంట్ గా కన్పిస్తాడు. ఆదిషేశయ్యగా హరిరాజన్, పోలీసు ఉన్నతాధికారిగా గణేష్ వెంకట్రామన్ కూడా ఫర్వాలేదు.

సంగీతానికీ, పాటలకీ పెద్దగా ప్రాధాన్యం లేదు అలాగే, యాక్షన్ డైరెక్ట్ రాజశేఖర్ సమకూర్చిన ఛేజింగ్స్, ఫైట్స్ అతి  హింసాత్మకంగా వున్నాయి. వీటికే భారీగా ఖర్చు పెట్టివుంటారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ షార్ప్ గానే వుంది, అయితే అసలు విషయమే సరుకులేనిదిగా వుంది.

దర్శకుడు శరవణన్ ఏదో ఎత్తుకుని ఇంకేదో ఎత్తేశాడు. ఈ సినిమాతో అతను వాస్తవిక సినిమా, ప్రయోగాత్మక సినిమా అనే కమిట్ మెంట్ల నుంచి పలాయనం చిత్తగిస్తూ –బిగ్ స్టార్స్ దృష్టిలో పడాలన్న తపన పెంచుకుని- ఒక పాత మూస యాక్షన్ ఫార్ములా చుట్టేసి హమ్మయ్యా అనుకున్నాడు! ఇక ఎవరో సూపర్ స్టార్ నుంచి కాల్ రావడమే తరువాయి...

స్క్రీన్ ప్లే సంగతులు..
నిజానికి శరవణన్ కి వాస్తవిక సినిమా మీద అవగాహన లేనట్టే, యాక్షన్ సినిమా కూడా తీయడం రాదు. మొదటి సినిమా ‘జర్నీ ‘ తీసినప్పుడు అది పేపర్లో చదివిన  ఘోర రోడ్డు ప్రమాద వార్త అని తనే చెప్పుకున్నాడు. అలా హైవే ప్రమాదాల గురించి సందేశాన్ని అందించడమే తన ధ్యేయమని చెప్పాడు. మూడు జంటల ప్రేమాయణాన్ని అకస్మాత్తుగా చివర్న రోడ్డు ప్రమాదం పాల్జేసి –అక్కడ్నించీ రోడ్డు ప్రమాదాల మీద డాక్యుమెంటరీలా ఎత్తుకున్నాడు. సినిమా బాణీ మారిపోయింది, వరస మారిపోయింది. ఒక సినిమా స్క్రీన్ ప్లేకి చివర్లో న్యూస్ ఐటెం జోడించిన అక్రమంగా కళ తెలిసిన సినిమా జీవులు ఆక్రోశించేలా చేశాడు. 

రోడ్డు ప్రమాదాలు అనేది  నాన్ ఫిల్మిక్ థీం. అందుకే  దాన్ని సినిమా కథగా మల్చడంలో విఫలమయ్యాడు. మరి ఈ సినిమా ఎందుకు గుర్తుండి పోతుందంటే – ఇందులో అనితరసాధ్యంగా –మూస ఫార్ములా జోలికి పోకుండా- క్రాసోవర్ సినిమాని తలపిస్తూ -అత్యంత సహజ ధోరణిలో మూడు ప్రేమ కథల్ని సృష్టించ గల్గాడు గనుక!


ప్రస్తుత సినిమాలోనూ 2008 నాటి సంఘటనంటూ వాస్తవిక ధోరణిలో మొదలెట్టి, దానికి మూసఫార్ములా కథనం జోడించేసి- కొత్తఆలోచన- కొత్త స్క్రీన్ ప్లే- కొత్త ప్రయత్నం- ప్రతీదీ కొత్తే- నంటూ ప్రచారం చేసుకున్నాడు. ఈ చెప్పిన నాల్గు ‘కొత్తల్లో’ ఏదీ సినిమాలో జాడలేదు. నిజానికి 2008 నాటి ఆ నిజ సంఘటన కులాల పోరుకు సంబంధించింది. హిందీలో ప్రకాష్ ఝా కూడా ఇలాగే రిజర్వేషన్ సమస్య (1990 నాటి మండల్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం) మీద కాలేజీ సినిమా (ఆరక్షణ్ -2011)అంటూ అగ్రవర్ణ పాత్రలో అమితాబ్ బచ్చన్ నీ, దళిత విద్యార్థి పాత్రలో సైఫలీ ఖాన్ నీ చూపించి- తీరాచూస్తే, ఆ సమస్య ఎలా చెప్పాలో తెలియనట్టు, కథ మధ్యలోనే వదిలేసి- ప్రైవేటు కాలేజీల అక్రమాలంటూ వేరే కథ ఎత్తుకుని సాగిపోయాడు!

శరవణన్ కూడా కులాల పోరు గురించి చెప్పలేకపోయినా, కనీసం ఆ ఎత్తుకున్న న్యాయ కళాశాలల్లో రాజకీయ జోక్యం పాయింటు నైనా ఆలోచనాత్మకంగా చర్చించి వుంటే ఒక మంచి సినిమా అయ్యేది.

పాయింటుకి వేరే తెలిసిన రొటీన్ యాక్షన్ ఫార్ములానే జోడించడంతో తను ‘జర్నీ’తో పొందిన మన్నన కూడా కోల్పోయాడు. సరే, ఈ మూస ఫార్ములా కూడా సవ్యంగా ఉందా అంటే ఇందులోనూ  హస్యాస్పదమైన గిమ్మిక్కులెన్నో!

కొత్త స్క్రీన్ ప్లే అన్నప్పుడు – హీరో లక్ష్యం ఇంటర్వెల్లోనే పూర్తవడం కొత్త స్క్రీన్ ప్లేనా?కొత్త స్క్రీన్ ప్లే అన్నప్పుడు – హీరో లక్ష్యం ఇంటర్వెల్లోనే పూర్తవడం కొత్త స్క్రీన్ ప్లేనా? అసలు స్క్రీన్ ప్లే అంటే ఏమిటో అదైనా తెల్సా? అసలంటూ రూల్స్ తెలిసి ఉంటేనే కదా ఆ రూల్స్ ని ఎలా బ్రేక్ చేసి  కొత్త ప్రయోగం చేయాలో తెలిసేది?


ఈ కథని మూడంకాల స్క్రీన్ ప్లే లో అమర్చి చూస్తే  ఇలా వుంటుంది : మొదటి పదిహేను నిమిషాల్లోనే కాలేజీ హింస, హీరో రియాక్షన్, కిడ్నాప్ జరిగిపోయి మొదటి అంకం ముగిసిపోతుంది, రెండో అంకంలో కిడ్నాపైన తమ్ముడి కోసం మంత్రి వేట, హీరోతో హీరోయిన్ ప్రేమాయణం,  మంత్రి  రాజీనామా, హీరో ఆశయం నెరవేరడం జరిగి ఇంటర్వెల్  వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత ఇదే రెండో అంకం రెండో భాగంలో హీరో మీద పగ దీర్చుకోవడం కోసం విలన్ (మంత్రి తమ్ముడు) వేట, హీరోయిన్ కిడ్నాప్, హీరోయిన్ కోసం హీరో వెతుకులాట జరిగి, ఆమె ఎక్కడుందో కనుక్కోవడంతో రెండో అంకం ముగుస్తుంది. ఇక మూడో అంకం ప్రారంభమై హీరో విలన్లమధ్య ఫైట్, విలన్ ని చంపి హీరోయిన్ని హీరో పొందడంతో కథ ముగుస్తుంది.

సమస్యెక్కడ వచ్చిందంటే, ఇంటర్వెల్లో హీరో ఆశయం నెరవేరిపోవడంతో అక్కడే కథ ముగిసిపోయింది. సెకండాఫ్ లో హీరోకి అశయంలేదు, లక్ష్యంలేదు. అందుకే అతను కథలో బేకారుగా, పనిలేక ప్యాసివ్ గా వుంటున్నట్టు ఫీలింగ్ ఏర్పడి బోరుకోట్టడం ప్రారంభిస్తుంది. ఆశయమంతా సినిమా బాక్సాఫీసు విజయానికే ఆత్మహత్యా సదృశంగా, అసహజంగా విలన్ కే ఏర్పడ్డంతో- హీరోయిజం పూర్తిగా పక్కకు తప్పుకుంది. రెండోది, ఫస్టాఫ్ లో ఎలాటి కథైతే నడిచిందో, అదే సెకండాఫ్ లో రిపీటవుతుంది. కాకపోతే పాత్రలు తారుమారయ్యాయి. ఫస్టాఫ్ లో విలన్ ని హీరో కిడ్నాప్ చేసి మంత్రిని పరుగులు పెట్టిస్తే, సెకండాఫ్ లో విలన్ హీరోయిన్ని కిడ్నాప్ చేసి హీరోని పరుగులు పెట్టిస్తాడు...నఅలాగే దీన్ని (హీరోయిన్ని) నన్ను అడ్డం పెట్టుకుని అన్నయ్యని ఎలా దెబ్బ కొట్టాడో, అలాగే దీన్ని అడ్డం పెట్టుకుని వాణ్ణి దెబ్బ కొట్టాలి-అంటాడు విలన్. ఇది చాలా హాస్యాస్పదమైన కథా పథకం. ఫస్టాఫ్ కథనాన్నే సెకండాఫ్ లోనూ  చూపిస్తానంటే అదెలాటి కొత్తదనమున్న స్క్రీన్ ప్లేనో దర్శకుడికే తెలియాలి.

మూడోది, విలన్లకి (తండ్రీ కొడుకులకి) తమ ప్రత్యర్ధి ఎవరో చివరి వరకూ తెలీదు. క్లైమాక్స్ దాకా హీరో ముఖాముఖీ కానేకాడు. సాధారణ సూత్రాల ప్రకారం ముఖాముఖీ ఎప్పుడవుతారో అప్పట్నించే సినిమాలో అసలు కథ ప్రారంభ మైనట్టు లెక్క. ఈ సినిమాలో క్లైమాక్స్ లో నే ముఖాముఖీ అయ్యారు గనుక, ఇక్కడే అసలు కథ ప్రారంభ మయ్యిందనుకోవాలి. ఇలా మూడో అంకంలో కథ ప్రారంభం అయ్యిందంటే అంతవరకూ రెండో అంకం లేకుండా మొదటి అంకమే చాంతాడంత సాగిందన్నమాట. అప్పుడిది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవుతుంది.  స్పీల్ బెర్గ్ మాటల్నే ఇక్కడా  ఉటంకించుకుంటే -

ఇదీ విషయం. ఇంకా చెప్పాలంటే ఇంటర్వెల్లో ముగిసి పోయిన కథని మళ్ళీ ఎత్తుకోవడమంటే, అది సినిమాలకి పనికిరాని స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ కిందకొస్తుంది. ఎపిసోడ్లుగా సాగే టీవీ సీరియళ్ళకి పనికిరావొచ్చు. 2003లో నందమూరి హరికృష్ణ నటించిన ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’ ఇలాగే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ బారిన పడి విడివిడి ఎపిసోడ్లుగా సాగి ఫ్లాపయ్యింది.

ఇక ఉన్న స్క్రీన్ ప్లే లోనే కథనం కూడా ఎలా వుందో ఒక్క శాంపిల్ చూస్తే  చాలు. విలన్ని బంధించి ఉంచిన టాయిలెట్ బయటే హీరో, హీరోయిన్ బ్యాంక్ ఎక్కౌంట్ నంబర్ అడిగి తెలుసుకుంటూ- లోపల విలన్ కి వినపడేలా గట్టిగా ఆ నంబర్ రిపీట్ చేస్తాడు. దర్శకుడు ఇలా ఎందుకు చేశాడంటే, తర్వాత ఆ  నంబర్ పట్టుకుని విలన్ హీరోయిన్ని పట్టుకునేందుకట!

అంత ప్రమాదకరమైన ఖైదీ అయిన విలన్ పెరోల్ మీద వచ్చి ఇంకో హత్య కూడా చేస్తాడు. అసలతడికి పెరోల్ దొరికే అవకాశం ఏకోశానా లేదు. మరీ తప్పదనుకుంటే కస్టడీ పెరోల్ లభించాలి. అంటే ఎస్కార్టుగా పోలీసులుంటారు. అదీ చాలా ఎమర్జెన్సీ విషయానికి  ఆరుగంటల పాటు మాత్రమే అమలయ్యే పెరోల్ గా లభిస్తుంది. అసలీ తమ్ముడు కన్పించకపోతే మంత్రి ఆయన అన్న ఎలా బాధ్యుడవుతాడో అంతుపట్టదు. తక్షణం  ఎందుకు రాజీనామా చేయాలో కూడా ఓ పట్టాన అర్ధంగాదు!

బందీగా ఉంచుకున్న విలన్ని పనిపూర్తయ్యాక హీరో ఇంటర్వెల్లో పోలీసులకి దొరికేలా చేయకుండా, ఊరిమీదికి వదిలేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం- 'అతను డిఫరెంట్' అనడానికి నిదర్శనమేమో? 


-సికిందర్