రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, సెప్టెంబర్ 2016, శనివారం

స్క్రీన్ ప్లే సంగతులు-2

   




    కథల్లోలాగా ఒక ఆసక్తికర ప్రధాన సమస్య చుట్టూ పరిష్కారాన్ని పొందే సంఘర్షణగా కాక, కేవలం కొన్ని సంఘటనల కూర్పు మాత్రంగా సాగే ‘గాథ’ లాగా,  ‘గ్యారేజ్’ లో విషయం ఇలా వుంటుంది : 
   1980 లలో స్వగ్రామంలో మెకానిక్ గా పనిచేస్తూ తమ్ముడు శివ(రెహమాన్) ఉన్నత చదువుకీ, ఆపై ఉద్యోగానికీ తోడ్పడ్డ సత్యం (మోహన్ లాల్), అదే తమ్ముడి ప్రోద్బలంతో హైదరాబాద్ వచ్చి జనతా గ్యారేజ్ అనే అన్ని రకాల వాహనాలని మరమ్మత్తు చేసే కేంద్రాన్ని నెలకొల్పుతాడు. పేదల పక్షపాతికూడా  అయిన సత్యం మరోవైపు గ్యారేజీలో పనిచేసే బోసు ( అజయ్), నాగరాజు (బ్రహ్మాజీ), సైదులు (బెనర్జీ పోషించిన ఈ పాత్ర పేరు సైదులు నల్లగొండ జిల్లాలో వుండే పేరు?) అనే వాళ్ళ బృందంతో  పేదల సమస్యలు కూడా పరిష్కరిస్తూ ఒక బలమైన శక్తిగా ఎదిగి, అక్రమాలు చేసే బడా బిజినెస్ మాన్ ముఖేష్ రాణా ( సచిన్ ఖెడేకర్) కి కంటగింపుగా మారతాడు. ఒక రేప్ అండ్ మర్డర్ కేసుని యాక్సిడెంట్ గా చిత్రించి తప్పించుకున్న రాణా తమ్ముడూ అతడి ఫ్రెండ్స్ మీద చర్య తీసుకోవాలని పోలీసు అధికారి చంద్ర శేఖర్ (సాయి కుమార్) ని కోరతాడు సత్యం. చంద్రశేఖర్ సత్యం తమ్ముడు శివతో పాటు చదువుకున్న వాడే. అయినా సత్యం మాటల్ని పట్టించుకోడు. దీంతో సత్యం తనే రంగంలోకి దిగి ఆ రేపిస్టులు నల్గుర్నీ యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు. దీంతో రాణా పగబట్టి సత్యం తమ్ముడు  శివనీ, అతడి భార్యనీ చంపించేస్తాడు. వాళ్ళ కొడుకు ఆనంద్ అనాధ అవుతాడు. ముంబాయి నుంచి వాడి మామయ్య (సురేష్) వచ్చి, మేనల్లుడు ఆనంద్ ని ఈ వాతావరణంలోంచి దూరంగా తనతో తీసుకెళ్ళి పోతాడు సత్యం కోరిక మీద. వాడి తల్లిదండ్రులు ఎలా మరణించారో కూడా వాడికి తెలియనివ్వ కూడదని మాట తీసుకుంటాడు సత్యం.

       పాతికేళ్ళూ గడిచిపోతాయి. ముంబాయిలో ఆనంద్ (ఎన్టీఆర్) ఒక యువశక్తిగా ఎదుగుతాడు. మామయ్య, అత్త, మరదలు బుజ్జి (సమంతా)లతో కలిసి వుంటూ, ప్రకృతిని ప్రేమించే పర్యావరణ కార్యకర్తగా, పరిశోధకుడుగా బిజీగా ఉంటాడు. పనీపాటా లేని బుజ్జి ఇతణ్ణి ప్రేమిస్తూంటుంది. బయట ఆనంద్ జనాలకి మొక్కల పెంపకం గురించి, ప్లాస్టిక్ బ్యాగుల వాడకం గురించీ అవగాహన కల్పిస్తూంటాడు. ఇలాటి ఒక సందర్భంలో ఒకమ్మాయి (నిత్యా మీనన్) పరిచయమవుతుంది. ఈమె హైదరాబాద్ లో పోలీసు అధికారి చంద్ర శేఖర్ కూతురు. ముంబాయిలోనే ఆనంద్ ఒక పార్కు పరిశ్రమగా మారడాన్ని అడ్డుకుంటాడు. ఆ ఎమ్మెల్యే పదవి కోల్పోతాడు. ఆనంద్ శ్రేయోభిలాషి వచ్చి ఆనంద్ మామయ్యని హెచ్చరిస్తాడు- ఎమ్మెల్యే మనుషులు ఆనంద్ కి హాని తలపెట్ట బోతున్నారనీ, ఆనంద్ ని ఇక్కడ్నించీ దూరంగా పంపించెయ్యాలనీ. కానీ హైదరాబాద్ హైదరాబాద్ వెళ్లేందుకు ఆనంద్ నిరాకరిస్తాడు.

     ఇప్పుడు హైదరాబాద్ లో సత్యం అదే గ్యారేజ్ నడుపుతూ అదే పేదల పాలిట దేవుడిగా కంటిన్యూ అవుతూంటాడు. రాణాతో వైరం అలాగే వుంటుంది. సత్యంకి ఇంట్లో భార్యా కొడుకూ వుంటారు. కొడుకు రాఘవ (ఉన్ని ముకుందన్) కి తండ్రి చేసే పనులు నచ్చవు. అతను  రాణా కూతుర్ని ప్రేమిస్తూంటాడు. సీఎంతో సన్నిహితంగా వుండే రాణా, ఓ పేదల బస్తీ మీద కన్నేసి దాన్ని ఆక్రమించాలని చూస్తాడు. సత్యం అడ్డుకుంటాడు. సత్యం కి యాక్సిడెంట్ జరిపిస్తాడు రాణా. బతికి బయట పడ్డ రాణాకి గుండె సమస్య వుందని, అతను గ్యారేజీ కార్యకలాపకి దూరంగా వుండాలనీ డాక్టర్ చెప్తాడు. ప్రజలకి దూరంగా ఎలా వుండనని ఆక్రోశిస్తాడు సత్యం. కష్టాలతో ప్రజలు వచ్చి నిరాశపడి తిరిగి వెళ్లి పోతూంటారు. రాణా వచ్చి తన కూతురితో పెళ్లి సంబంధం కలుపు కుంటాడు. కొడుకుని కాదనలేక ఆ సంబంధం ఒప్పుకుంటాడు సత్యం. రాఘవని అల్లుడిగా చేసుకున్న రాణా,  ఇక రెచ్చిపోతాడు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ మైనింగ్ పనులు రాఘవకి అప్పజెప్తాడు. ఇది ముంబాయిలో వున్న ఆనంద్ కి తెలుస్తుంది. వెంటనే వచ్చేసి మైనింగ్ ని అడ్డుకుని రాఘవకి బుద్ధి చెప్తాడు. రాఘవని ఆపలేని సత్యం ఇందుకు సంతోషించి, ఆనంద్ ని రప్పించుకుంటాడు. గ్యారేజ్ వ్యవహారాలు, సత్యం పరిస్థితీ తెలుసుకున్న ఆనంద్, సత్యం బాధ్యతలు తీసుకోవడానికి అంగీకరించి- బాధిత పేదలకి సాయం చేసేందుకు తిరిగి గ్యారేజీ ద్వారాలు తెరుస్తాడు...

        ఇప్పుడు రాణా ఈసారి ఆస్పత్రి నిర్మాణంతో తెర మీదికొస్తాడు. దాని అక్రమ పర్మిషన్ కి మున్సిపల్ ఉద్యోగి (రాజీవ్ కనకాల) ని వేధిస్తాడు. ఆనంద్ వెళ్లి ఆ గూండాలకి బుద్ధిచెప్పి, రాణా అక్రమాన్ని ఆపుతాడు. భార్యతో ఇంట్లోనే వుంటున్న రాఘవకి ఆనంద్ అంటే పడదు. ఓ అర్ధరాత్రి భార్యతో తాగి  వచ్చినందుకు వారిస్తాడు ఆనంద్. ఆ గొడవలో భార్యని తీసుకుని వెళ్ళిపోతాడు రాఘవ. గ్యారేజీ వర్కర్ బోసు భర్త లేని ఒకావిణ్ణి ప్రేమిస్తూంటాడు. ఆనంద్, సత్యంలు వెళ్లి ఆ పెళ్లి జరిపిస్తారు. అటు కూతురితో ఆనంద్ పెళ్లి చేయాలనుకుని ఆనంద్ మామయ్యా అత్తా వస్తారు. వస్తే ఆనంద్ సత్యం దగ్గరే వుంటున్నాడని తెలుస్తుంది. దీంతో తామిద్దరెవరెవరో పరస్పరం తెలుస్తుంది ఆనంద్, సత్యంలకి. ఐతే ఈ ఇంట్లో ఒకసారి తన చెల్లెల్ని ఇచ్చి పోగొట్టుకున్నానని, ఇప్పుడు కూతుర్ని కూడా ఇచ్చి పోగొట్టుకోలేనని ఆనంద్ మామయ్య చెప్పేస్తాడు. ఆనంద్ కి బుజ్జి కావాలంటే తమతో వచ్చెయ్యాలని, లేదూ పెదనాన్న సత్యమే కావాలంటే బుజ్జిని వదులుకోవాలనీ  కండిషన్ పెడతాడు. దీంతో తీవ్ర మానసిక సంఘర్షణకి లోనైన ఆనంద్ బుజ్జినే వదులుకుంటాడు.

        అటు రాణాకి సీఎంతో తేడా వస్తుంది. ఏం చెయ్యాలో పాలుపోదు. సీఎం వ్యతిరేకి ఒకడు (ఆశీష్ విద్యార్థి) ఒక ఐడియా ఇస్తాడు. సీఎంని గద్దె దింపి తను సీఎం అయితే రాణా పనులన్నీ జరుగుతాయని. అందుకు బాంబు దాడులు జరపాలని ప్లాన్ ఇస్తాడు. అల్లుడు రాఘవతో కలిసి రాణా నగరంలో బాంబు దాడులు జరుపుతాడు. ఎంతోమంది చనిపోతారు. గ్యారేజీ వర్కర్ బోసు భార్య కూడా చనిపోతుంది. ఇంకోసారి కూడా దాడులు జరపాలని ప్లానేస్తూంటారు. అంతలో బోసు రైలుపట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది.          పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ ఆ బాంబు దాడుల వెనుక తెలిసిన వాళ్ళ కుట్రే వుందని డిజిపితో వాదిస్తాడు. డిజిపి ఒప్పుకోడు. చంద్రశేఖర్ వచ్చి గ్యారేజీ తలుపులు తడతాడు. తను చేయలేకపోతున్న పనిని ఆనంద్, సత్యంలు పూర్తి చేయాలనీ విన్నవించు కుంటాడు. ఆనంద్ కి ఒక లారీ డ్రైవర్ ద్వారా బోసు అనుమానపు పోకడ తెలుస్తుంది. దాన్ని పట్టుకునిపోతే, ఒక బాంబుల తయారీ డెన్ తెలుస్తుంది. ఈ డెన్ తెలుసుకున్నాడనే, రాఘవ బోసు ని చంపి రైలు పట్టాల మీద పడేశాడన్న మాట. ఇంట్లో గంభీర వాతావరణం తలెత్తుతుంది. ఇలాటి కొడుకు రాఘవని చంపెయ్యాలనే తీర్పు చెప్తాడు సత్యం. తనే కొడుకుని చంపేస్తాడు. అక్కడే వున్న రాణాని ఆనంద్ చంపేస్తాడు. సమాప్తం.

గాథకి స్క్రీన్ ప్లే?

        ది కథలా వుందా? వుంటే ఎక్కడెక్కడ  ప్లాట్ పాయింట్స్ వున్నాయి? ఎక్కడ ప్రాబ్లం సెటప్ అయింది? ఎక్కడ్నించి ఎక్కడిదాకా బిగినింగ్, ఎక్కడ్నించి ఎక్కడి దాకా మిడిల్, ఎక్కడ్నించీ ఎక్కడి దాకా ఎండ్ ఇందులో వున్నాయి?  గుర్తు పట్టగలమా? మిడిల్, ఎండ్ వుండాలంటే బిగినింగ్ ముగియాలి కదా? బిగినింగ్ ఎప్పుడు ముగుస్తుంది? కథ ప్రారంభమైనప్పుడు. కథ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ప్రాబ్లం సెటప్ అయినప్పుడు. పైన చెప్పుకున్న విషయంలో బిగినింగ్ ఎక్కడ ముగిసింది, ఇంటర్వెల్లో ముంబాయి నుంచి ఆనంద్ వచ్చి మైనింగ్ ని అడ్డుకుని సత్యంని మొట్ట మొదటిసారిగా కలిసినప్పుడా? కలిసినప్పుడు ఏ ప్రాబ్లం సెటప్ అయ్యింది? ఇలాటివి సహించనని ఆనంద్ చెప్పి వెళ్ళాడు, ఎవరితో? సత్యంతో. సత్యం ఎవరు?ఆనంద్ చేసిన పనికి (మైనింగ్ ని అడ్డుకోవడం) ఇంప్రెస్ అయిన పాజిటివ్ క్యారక్టర్. పాజిటివ్ క్యారక్టర్ తో ప్రాబ్లం సెటప్ అవుతుందా? అవదు కదా, నెగెటివ్ క్యారక్టర్ తో అవుతుంది. 

        కాబట్టి ఇక్కడ కూడా, అంటే ఇంటర్వెల్ దగ్గర కూడా, ప్రాబ్లం సెటప్ అయి బిగినింగ్ ముగియలేదు; అంటే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడలేదు. అంటే కథ ప్రారంభంకాలేదు. ఇంటర్వెల్ అర్ధోక్తిలో, విషయమేమిటో తేల్చకుండా పడింది- ‘హోరాహోరీ’ లో లాగా, ‘కిక్-2’ లో లాగా.   

        ఇలా కాక, ఒకవేళ ఇంటర్వెల్ లోపే ఎక్కడైనా కథ ప్రారంభమయ్యిందా? ముంబాయి నుంచి ఆనంద్ రాక ముందు- ఇంటర్వెల్ లోపే ఇటు సత్యంకి - విలన్ రాణాకీ మధ్య ప్లాట్ పాయింట్ వన్ వచ్చి వాళ్ళిద్దరి మధ్య కథ ఏమైనా ప్రారంభమయ్యిందా? పాతికేళ్ళ నుంచీ వాళ్ళ మధ్య తగాదాలు తెమలడమే లేదు. ఎప్పుడో 1980లలో ప్రారంభమైన వాళ్ళిద్దరి మధ్య వైరం పాతికేళ్ళయినా కొలిక్కి రాకుండా నాన్చుడు గానే వుంది తప్ప కొత్త డెవలప్ మెంట్ ఏమైనా వుందా? ఆనంద్ వచ్చే ముందు, ఫస్టాఫ్ లో రాణా నుంచి సత్యం ఎదుర్కొన్న సమస్యలేమిటి- పేదల బస్తీ ఆక్రమణ, తన మీద హత్యా యత్నం, అక్రమ మైనింగ్. ఈ మూడిట్లో  ఏవొక్క దాని  దగ్గరైనా కథనం ఆగి, ఇదిగో ఈ పాయింటుతో బిగినింగ్ ముగిస్తున్నాం, ప్లాట్ పాయిట్ వన్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం,  ఇలా కథ ప్రారంభిస్తున్నాం, సంఘర్షణ  మొదలెడుతున్నాం, కథకి కేంద్ర బిందువు ఇదే అన్నట్టుందా?

        కాబట్టి  ఇటు సత్యం - విలన్ ల పరంగానూ, లేదా అటు ఆనంద్- సత్యంల పరంగానూ, ఇంకా లేదా ఆనంద్- విలన్ ల పరంగానూ  ఫస్టాఫ్ లో పాయింటు లేదు. సెకండాఫ్ లో విలన్ మళ్ళీ ఆస్పత్రి వ్యవహారం అంటూ మొదలెట్టాడు- దీనిదగ్గరైనా ప్లాట్ పాయింట్ వన్ వచ్చిందా? రాలేదు, ఆస్పత్రి గొడవ కూడా కథకి కేంద్ర బిందువు కాలేదు. క్లయిమాక్స్ లో విలన్ మళ్ళీ ఇంకొక కుట్ర ఎత్తుకున్నాడు- బాంబు దాడులంటూ. ఇలా ఒకటి కాదు, దేని దగ్గరా ఆగడు, ఎక్కడా జండా పాతి జమాయించి కూర్చోడు విలన్ రాణా అనే వాడు. ఇదిగో ఈ కథకి హీరోని నేనేనండోయ్ అని విలన్ గనుక తెగ ఫీలై పోకపోతే ఆ స్క్రీన్ ప్లే  అచ్చంగా చచ్చుబడి పోతుందని -
Your Screenplay Sucks! -  అన్నపుస్తకంలో విలియం ఎకర్స్ హెచ్చరిస్తాడు. ఎందుకు హెచ్చరిస్తూ పుస్తకాలు రాస్తాడు, పనిలేకా?

        పోనీ, ఫైనల్ గా వచ్చిన ఈ బాంబు దాడులే ప్లాట్ పాయింట్ వన్ అనుకుందామానుకుంటే క్లయిమాక్స్ లో ఎక్కడైనా ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడుతుందా? ఆఫ్ కోర్స్, ఒకప్పుడు  ఏర్పడేవి. పదిహేనేళ్ళ క్రితం యూత్ సినిమాల ట్రెండ్ లో  ‘మిడిల్ మటాష్’ అనే మనం పేరెట్టిన కథలొచ్చేవి. క్లయిమాక్స్ దగ్గర  ప్లాట్ పాయింట్ వన్ వచ్చి, అప్పుడు మాత్రమే మిడిల్లో పడేది కథ! అయిదు నిమిషాల్లో ఆ మిడిల్ కాస్తా ముగిసి ఎండ్ ప్రారంభమయ్యేది! 

        కనుక ‘గ్యారేజ్’ స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ కూడా కాదు. ఇక్కడ జాగ్రత్తగా తేడా గుర్తించాలి. మిడిల్ మటాష్ అంటే, కథనంలో మరెక్కడా పాత్రల మధ్య  ఇంకే సమస్యా పుట్టకుండా, కేవలం క్లయిమాక్స్ దగ్గరే ఆ చెప్పాలనుకున్న ఒకే సమస్య పుడుతుంది.  అప్పుడది ఆలస్యమైపోయిన ప్లాట్ పాయింట్ వన్ అన్పించుకుంటుంది. ఆలస్యపు పెళ్లి హాస్యంగా ఉన్నట్టే ఇలాటి స్క్రీన్ ప్లేలు కూడా వెక్కిరింతగా ఉండేవి. పైన చెప్పుకున్న ప్రేమ సినిమాల ట్రెండ్ లో ఇలాగే ఉండేవి. 

      ‘గ్యారేజ్’ లో ఇలా కాదు, అడుగడుగునా సమస్యలు పుడుతూ పోతాయి క్లయిమాక్స్ వరకూ- ఒక కేంద్రబిందువైన సమస్యంటూ లేకుండా! ఒక కేంద్రబిందువైన సమస్య వుండి, దాంతో పోరాట ఫలితంగా అందులోంచి పుట్టే పిల్ల సమస్యలు ఉంటాయే తప్ప- కేంద్రబిందువైన ఒక ప్రధాన సమస్య లేకుండా- ‘గ్యారేజ్’ లాంటి కథనాల్లో లాగా విడివిడి సమస్య లుండవు. విడివిడి సమస్యలతో కథ వుండదు, స్క్రీన్ ప్లే వుండదు. స్క్రీన్ ప్లే అంటే మూడంకాలు, ఒక కేంద్ర బిందువు, అంతే.  కేంద్ర బిందువూ దాంతో బాటు అంకాలూ అటూ ఇటూ జరగవచ్చు;  కానీ ఇవంటూ వుంటాయి కథకి, దాని స్క్రీన్ ప్లేకి.  గాథలకే ఇవి వండవు. ఆ మాటకొస్తే గాథలకి అసలు స్క్రీన్ ప్లేనే వుండదు, కుదరదు కూడా. స్క్రీన్ ప్లేలో గాథల్ని కూర్చలేరు. స్క్రీన్ కి (వెండి తెరకి) పనికి రాని విషయానికి స్క్రీన్ ప్లేనే ఉండదు. కాబట్టి గాథలు రాసుకుని దానికి  స్క్రీన్ ప్లే అని పేరేసుకోవడం కామెడీ అవుతుంది. 

        కనుక ‘గ్యారేజ్’ ది కథ కాదు, గాథ అని నిరూపణ అవుతోంది. గాథలతో ఎలాటి భ్రాంతిలో వుంటామంటే,  మనం చూస్తున్నది కథ కాదు, గాథ అని చాలా సేపటి వరకూ పసిగట్టలేం. ఇంటర్వెల్లోనూ ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడకపోతే సెకండాఫ్ లో పెట్టి అప్పుడు మొదలేదతాడేమో చూద్దాం అనుకుంటాం. మిడిల్ మటాష్ కి లాగా క్లయిమాక్స్ లోనూ ప్లాట్ పాయింట్ రాకపోతే, అప్పుడర్ధ మవుతుంది- మనం క్లయిమాక్స్ దాకా చూస్తూ కూర్చుని టైం వేస్ట్ చేసుకుంది కథతో  కాదూ గాథతో  అని- మోసపోయామనీ! ఇది జనరల్ ఆడియెన్స్ కీ తెలీక, సినిమాలు తీసే వాళ్లకీ తెలీక తెగ ఆడేస్తూంటాయి సినిమాలు కాని  సినిమాలు- అటూ ఇటూ తెలుగునాట, ఇంకా అటు ఓవర్సీస్ లో వుండే కొద్ది శాతం  మనలాంటి వాళ్ళం తెల్లబోయి చూస్తూంటాం!

పాయింటేంటి?
       పోనీ, ఇదంతా వదిలేద్దాం- అసలు ‘గ్యారేజ్’ పాయింటేంటి? చెప్పాలనుకున్న దేంటి? దేనిగురించి? కాన్సెప్ట్ ఏంటి?  పర్యావరణం గురించా, పేద బాధితుల గురించా, లేకపోతే కుటుంబం గురించా? కుటుంబం గురించే ఎక్కువ కన్పిస్తుంది. సినిమా ప్రారంభంలో  ‘ఇది ఒక కుటుంబ కథ’ అనే వేశారు. మరైతే కుటుంబ కథ ఇలాగా చెప్పడం? కుటుంబ కథలో కుటుంబానికి ఎదురైన సమస్యేమిటి? మరుగున వుండి బయటపడ్డ ఆనంద్- సత్యంల బంధుత్వమా? ఆనంద్ - బుజ్జిల పెళ్లి సమస్యా? చెడ్డ కొడుకు రాఘవ సమస్యా? వీటిలో ఏ ఒక్కటి పరిష్కారమైంది? ‘ఇచ్చట అన్నీ రిపేర్లు చేయబడును’ అన్నాక,   ఆనంద్- బుజ్జిల పెళ్లి  సమస్యని ఎందుకు రిపేరు చేయలేకపోయారు? చెడ్డ కొడుకు రాఘవని మంచి కొడుకుగా ఎందుకు మార్చలేకపోయారు? రిపేరు చేయడమంటే కొడుకుని చంపడమా? ఇది కుటుంబ కథే అయితే దీని ద్వారా చెప్పిందేమిటి? చెడ్డ కొడుకు విలన్ కి అల్లుడవడం, చెడ్డ కొడుకు విలన్ పక్షం వహించి తల్లిదండ్రుల్ని బాధించడం, కుట్రలు చేయడం; పెద్దాయనకి తనతో ఉంటున్న హీరో చిన్నప్పటి ఫలానా తన బంధువేనని రివీల్ అవడం, పెద్దాయన కోసం హీరో మరదల్ని త్యాగం చేయడం - ఇవెంత పాత రొటీన్, ప్రాక్టికల్ గా నేటి ప్రేక్షకుల అనుభవంలోకి రాని మెలోడ్రామాలు! కుటుంబ కథని నేటి కాలమాన పరిస్థితుల్లో పెట్టి  కొత్తగా చెప్పాల్సింది. కుటుంబ కథ అనగానే  పాత సినిమాల్లోంచి అవే అరిగిపోయిన డ్రామాల్ని దిగుమతి చేయకుండా, సొంత పరిజ్ఞానంతో స్వయంగా సృష్టించుకుంటే పరువు ప్రతిష్ట లేమీ మాయమై పోవుగా?

        ‘గ్యారేజ్’ బిజినెస్ కొస్తే, ఇది ‘సర్కార్’,  ‘రౌడీ’,  ‘గాడ్ ఫాదర్’  ల మిక్చర్ లా వుంటుంది. ‘సర్కార్’ లో లాగే ప్రారంభ దృశ్యాల్లో ఒక రేప్  అండ్ మర్డర్, దాంతో సత్యం వెళ్లి  దుష్టుల్ని శిక్షించడం జరుగుతాయి! శ్రీకాంత్ నటించిన, ఈవారం విడుదలైన ‘మెంటల్’ లోనూ ఇలాటి మాస్ కాపీయింగ్ దృశ్యాలే వచ్చేశాయి... ‘సర్కార్’ లో అయినా ‘గాడ్ ఫాదర్’ లోనైనా, పెద్దాయన మంచాన పడో మరణించో ఆయన కొడుకు బాధ్యతలు తీసుకుంటాడు. ‘గాడ్ ఫాదర్’ లో పెద్దాయన  కొడుకైన హీరో ఆ బిజినెస్ పట్ల వైముఖ్యంతో వుంటాడు. అలాంటి వాడు గుండె పోటుతో పెద్దాయన పోవడంతో,  మాఫియా బిజినెస్ బాధ్యతలు తీసుకోక తప్పదతడికి. పాత్రచిత్రణ పరంగా ఇక్కడ గుర్తించాల్సిన ప్రవర్తన ఒకటుంది : హీరో సైన్యం లో పని చేసిన అనుభవంతో సమస్య మూలాల్ని తొలగించకుండా, పైపైన సమస్యకి ప్రతిరూపాలుగా వున్న వాళ్ళని కాల్చి చంపుతూంటాడు. మన ప్రభుత్వాలు చేసే పని ఇదేగా? హీరో కూడా ఒకప్పటి ప్రభుత్వోద్యోగియే. దటీజ్ క్యారక్టరైజేషన్.

        ‘సర్కార్’ లో పెద్దాయన హత్యానేరం మీద జైలు కెళ్ళడంతో కొడుకు బాధ్యతలు తీసుకుంటాడు. తర్వాత పెద్దాయన మంచాన పడతాడు. అంటే ఇక్కడేం అర్ధం జేసుకోవాలంటే, వయసులో భారీ వ్యత్యాసమున్న రెండు ప్రధాన పాజిటివ్ పాత్రలు, విలన్ కి వ్యతిరేకంగా వుంటే, వాటిలో పెద్ద పాజిటివ్ పాత్ర  పిక్చర్లోంచి తప్పుకోవడమో (గాడ్ గాదర్), లేదా ఇన్వాలిడ్ అవడమో (సర్కార్) జరగాలి. చిన్న పాజిటివ్ పాత్ర – అంటే హీరో- ఒక్కడే విలన్ అంతు చూడాలి. అప్పుడే అది కమర్షియల్ సినిమా రూలు. 

        ‘గ్యారేజ్’ లో ఇదే జరిగింది. కాకపోతే వేరే రూటులో. ఇక్కడ చిన్న పాజిటివ్ పాత్ర ఆనంద్ వచ్చి, పెద్ద పాజిటివ్ పాత్ర  సత్యంతో చేతులు కలిపాడు. గాడ్ ఫాదర్ కి లాగే సత్యం మీద హత్యాయత్నం జరిగి గుండె బలహీన పడ్డా చావలేదు. చస్తే మలయాళంలో మోహన్ లాల్ ని చూపించడానికేమీ వుండదు. పోనీ ‘సర్కార్’ లోలాగా మంచాన కూడా పడలేదు. అలా కూడా మలయాళ సోదరులకి చూపించలేరు. ఈ సమస్యని మనం అర్ధం జేసుకోగలం. అప్పుడేం చేయాలి? చేయాల్సిందంతా కాన్సెప్ట్ లోనే దాగి వుంది- చేయాలన్పిస్తే. 

        ఆనంద్- సత్యంలని పరస్పరం శత్రువుల్లా మార్చెయ్యాలి. ఇది కాన్సెప్ట్ డిమాండ్ చేస్తోంది- కాన్సెప్ట్ పట్ల నిజాయితీతో వుంటే. కాన్సెప్ట్ ని కుటుంబ కథ అనో ఇంకేదో అనో స్పష్టత లేని పలాయన వాదంతో నిర్వచించుకోకుండా- తమిళ దర్శకులు, స్టార్లు చూపించే తెగువ ప్రదర్శించ గల్గితే -కమర్షియల్ గానే విషయాన్ని పాత చింతకాయ మూస నుంచి ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళి 
స్థాపించుకోగల్గితే – అన్ని స్క్రిప్టింగ్ లోపాలూ సమసిపోగలవు- గాథ అనే పెద్ద గుదిబండ సహా!

        వీళ్ళిద్దరూ శత్రువులైతే  మరి విలన్ ఏం చేస్తాడనొచ్చు. ఇప్పుడు విలన్ వుండి  కూడా ఏం చేశాడు- కాసేపు అది కావాలంటాడు, కాసేపు ఇది కావాలంటాడు, అదీ ఇదీ కాకపోతే బాంబులు పేల్చుకుంటాడు! సినిమా క్లయిమక్స్ ని ఎలా తెచ్చి బ్యాడ్ గా అతికించారో అలాగే అంత సడెన్ గానూ  ఎండ్ అయ్యింది సినిమా. ఇదంతా కాన్సెప్ట్ పట్ల నిబద్ధత లేకపోవడం వల్లే.

హీరో లక్ష్యమే కాన్సెప్ట్!
      కమర్షియల్ సినిమాల్లో హీరో పాత్రల  కొనసాగింపు రెండు రకాలుగా వుంటుంది : హీరోకి ఏదైనా స్పెషల్ ఇంటరెస్ట్ వుంటే ప్రారంభంలో ఒకటి రెండు సీన్లలో చూపించి దాన్ని కట్ చేసి అనుకున్న కథలోకి పంపించెయ్యడం; స్పెషల్ ఇంటరెస్ట్ తోనే ఫస్టాఫ్ అంతా హీరోని చూపించుకొస్తే, దాన్నే కంటిన్యూ చేసి సెకండాఫ్ కూడా దాన్నాధారంగానే నడపడం, అదే కథవడం. 

        ‘గ్యారేజ్’ లో ఆనంద్ ఇంటరెస్ట్ అంతా పర్యావరణం గురించే. ఈ ఇంటరెస్ట్ ని ఏదో ‘టాగూర్’ లో సంఘసేవికగా శ్రియని పరిచయం చేసినట్టు, లేదా ‘టెంపర్’ లో జంతు ప్రేమికురాలిగా కాజల్ ని పరిచయం చేసినట్టు, ఆ కార్యకలాపాల్ని రెండు మూడు సీన్లకే పరిమితం చేసి వదిలేసినట్టూ - ఆనంద్ ని కూడా పర్యావరణం అనే ఇంటరెస్ట్ తో అలా పరిచయం చేసి వదిలేస్తే అది వేరు- అప్పుడది పైన  చెప్పుకున్న ఒకటో రకం హీరో పాత్ర కొనసాగింపు అయ్యేది.

        కానీ అలా చెయ్యలేదు. రెండో రకం హీరో పాత్ర కొనసాగింపు చేశారు. అంటే ఫస్టాఫ్ లో ముంబాయిలో అతడి జీవితాన్ని పర్యావరణమే ప్రాణంగా చూపించుకొచ్చారు. దాంతో వాళ్ళకీ వీళ్ళకీ అతడి ఎవేర్నెస్ పాఠాలు, పార్కు విషయంలో అతడి తిరుగుబాటు కూడా చూపించి, మొక్కల్ని ప్రేమించే అతడి ఇంటరెస్టే వినూత్నంగా అతడి లక్ష్యంగా డ్రైవ్ చేశారు ముంబాయిలో అతడి పాత్రని మొత్తం. అంటే ఇంటరెస్ట్ కాస్తా కథకి పూర్తి స్థాయి లక్ష్యమైందన్న మాట. అంటే దీని కొనసాగింపుతోనే సెకండాఫ్ కూడా నడవాలన్న మాట. 

        ‘గాడ్ ఫాదర్’ లోలాగా, ‘సర్కార్’ లో లాగా కొడుకులకి వేరే లక్ష్యాలు లేనప్పుడు వాళ్ళొచ్చి ఫాదర్స్ బిజినెస్సుల్ని బేపర్వాగా టేకప్ చేసి- శత్రు నిర్మూలనే లక్ష్యంగా కొనసాగుతారు. ఆనంద్ కూడా ముంబాయిలో ఇంకా లక్ష్యం ఏర్పడక, పైన చెప్పుకున్న ఒకటో రకం హీరో పాత్రలాగా  లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నప్పుడైతే,  ఆపద్ధర్మంగా వచ్చి సత్యంగారి ‘గ్యారేజీ’ దందాని టేకప్ చేయగలడు. ఈ దందాలో సత్యం గారి ఆశయమే తన ఆశయంగా చేసుకుని పోరాడనూగలడు. అంటే ఏమవుతోందంటే, ఇలా హీరో ప్రవేశించే అసలు కథా ప్రపంచంలో సాఫీగా ప్రవేశం జరుగుతుందన్న మాట. ఇది పాయింటాఫ్ ఎటాక్ : ఎక్కడో వున్న హీరో ఇంకెక్కడో వున్న అసలు కథా ప్రపంచంతో వచ్చి స్పర్శించడం. ఇలా స్పర్శించాలంటే అంతవరకూ హీరోకి వేరే లక్ష్యం వుండకూడదు. స్పర్శతోనే లక్ష్యం ఏర్పడాలి. 

        ముంబాయిలో ఆనంద్ పర్యావరణ ట్రాకు ఒకటి, హైదరాబాద్ లో గ్యారేజీతో సత్యం ట్రాకు ఒకటీ ఫస్టాఫ్ లో చూపించు కొస్తున్నప్పుడు- కథనంతో ఒక ఎజెండా వుంటుంది. దాన్ని తురుపు ముక్కలా ప్రయోగించి సర్ప్రైజ్ చెయ్యాలి. ఈ రెండు కథనాలూ ఎక్కడ ఎలా స్పర్శించి (పాయింటాఫ్ ఎటాక్), ఇంటర్వెల్లో రెండు పాత్రల మధ్య ఎలాటి ఉరుములు ఉరుముతాయో, ఎలాటి మెరుపులు మెరిపిస్తాయో- పిడుగులు కురిపించి సీట్లలో మనల్ని బిక్కచచ్చిపోయేలా చేస్తాయోనని గంటన్నర పాటుగా ఎదురు చూస్తోంటే- ఆనంద్ సాబ్ వచ్చేసి చల్లగా గ్యారేజీలో దూరిపోయాడు. పేలుతుందనుకున్న పర్యావరణ మందు పాతరని పక్కన పడేశాడు. సత్యం సాబ్ గ్యారెజీని ఆనంద్ సాబ్ కి అప్పజెప్పేసి పక్క వాద్యంగా మారిపోయాడు. ఛోటేమియా బడేమియా కలిసి వాళ్ళ కుటుంబ గోత్రాలు చూసుకోవడం మొదలెట్టారు. 

        కుటుంబ కథ చెప్పడానికి మొక్కలతో, బక్క జీవులతో ఇంత డొంకతిరుగుడు అవసరం లేదు : శుభ్రంగా ‘గాడ్ ఫాదర్’ లా చెప్పవచ్చు. 

        హీరోకి ఏదైతే లక్ష్యంగా వుంటుందో అదే కాన్సెప్ట్  అవుతుంది. పర్యావరణ పరిరక్షణ హీరో లక్ష్యమని ఫస్టాఫ్ అంతా చూపించినప్పుడు అదే కాన్సెప్ట్ అవుతుంది! గ్యారేజీ కథ కాన్సెప్ట్ అవదు! రెండో పాత్ర లక్ష్యం ఎప్పుడూ హీరోకి మించి వుండదు. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఫస్టాఫ్ లో హీరోకి ఇంత  లక్ష్యం వున్నాక,  దాంతో పోరాటమూ చేస్తున్నాక- దాన్ని కొనసాగించే దమ్ముండాలి దర్శకుడికి. లేకపోతే దీని జోలికే పోకూడదు. 

        కొనసాగిస్తే ఏమవుతుంది? అన్ని స్క్రిప్టింగ్ లోపాలూ దూరమైపోతాయి- కథగా కళకళలాడుతూ - ప్రేక్షకులకి ఒక అపురూప వీక్షణానుభవాన్ని ఇస్తుంది!

       
ఎలా కొనసాగించాలి హీరో లక్ష్యాన్ని?
        వెళ్లి వెళ్లి హైదరాబాద్ లో విలన్ రాణా ఫ్యాక్టరీ ఏదైనా వుంటే దాన్ని పేల్చేయ్యాలి.
        అప్పుడేమవుతుంది?
        లబోదిబోమంటూ కార్మికులు రోడ్డున పడతారు- సత్యంకి చెప్పుకుంటారు.
        సత్యం ఏం చేస్తాడు?
        ఎవడ్రా నువ్వు నా కార్మికుల్ని రోడ్డున పడేశావ్? - అని ఆనంద్ ని పట్టుకుంటాడు.
        ఆనంద్ ఏం చేస్తాడు?
        వాడు నా మొక్కల్ని నాశనం చేశాడు అంటాడు.
        సత్యం ఏమంటాడు?
        ఎవడు నీ మొక్కల్ని నాశనం చేశాడు?
        ఆనంద్  రెస్పాన్స్?
        రాణా  గాడే. మొక్కల్ని కొట్టేసి ఫ్యాక్టరీ కట్టాడు. ఇంకెవడు మొక్కల్ని కొట్టేసి ఏది కట్టినా, కట్టబోతున్నా అవన్నీ పేలిపోతాయ్!
        సత్యం కౌంటర్?
        నీకు పిచ్చెక్కింది- ఇది జరగనివ్వను.
        ఆనంద్ క్వశ్చన్?
        ఎందుకు జరగనివ్వవ్?
        సత్యం ఆన్సర్?
        నీ మొక్కల కోసం నా కార్మికుల జీవితాల్ని నాశనం చేస్తావా?
        ఆనంద్ 
        మనిషికన్నా మొక్కెక్కువ నాకు!
        సత్యం వార్ డిక్లేర్!
        చూస్తా ఎలా పేలుస్తావో!
        ఆనంద్ వార్ స్లోగన్!
        పీకడం మీ పనైతే పేల్చడం నాపని!! ఎన్నిమొక్కలు పీకి నీ గ్యారేజీ కట్టావ్?
                                                           ***

   1992లో బ్రిటన్ లో ఒక గ్రూపు ఏర్పడింది. ఎర్త్ లిబరేషన్ ఫ్రంట్ అనే ఆ గ్రూపు పర్యావరణాన్ని నాశనం చేస్తున్న పరిశ్రమల్ని పేల్చేయడం మొదలెట్టింది. ఈ ఉద్యమం యూరప్ లో 17 దేశాలకూ ప్రాకింది. పరిశ్రమలు కడుతున్నప్పుడు చెట్లని  కొట్టేవద్దని, అడవుల్ని నాశనం చేయవద్దనీ సంబంధిత అధికారులకి, పోలీసులకి, రాజకీయ నాయకులకీ ఎంత ప్రాధేయపడినా వినకపోవడంతో, ఈ గ్రూపు సాయుధ పోరాటానికి దిగి అలాటి పరిశ్రమల్ని పేల్చేయ్యడం మొదలెట్టింది. వీళ్ళని ఎకో టెర్రరిస్టులుగా ముద్రవేశాయి ప్రభుత్వాలు. దశాబ్దానికి పైగా దొరక్కుండా పారిశ్రామికవేత్తల గుండెల్లో నిద్రపోయారు. చివరికి 2005 లో దొరికిపోయారు. 

       ఈ ఉదంతం మీదే ‘ఇఫ్ ఏ ట్రీ ఫాల్స్ అనే డాక్యుమెంటరీ తీశాడు మార్షల్ కర్రీ అనే దర్శకుడు. 2011 లో ఇది ఉత్తమ డాక్యుమెంటరీగా ఆస్కార్ అవార్డులకి నామినేట్ అయ్యింది. 

        సినిమా కథకి ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్. నిజ సంఘటన కాబట్టి కాపీ కొట్టినట్టు కాదు. మొక్క వర్సెస్ మనిషి పాయింటుతో ఆనంద్- సత్యంల మధ్య సంఘర్షణకి సరికొత్త టాపిక్. ‘జనతా గ్యారేజ్’ ది వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణని డిమాండ్ చేస్తున్న కాన్సెప్ట్. తమిళ స్టార్లు, దర్శకులైతే దీన్ని కళ్ళ కద్దుకుని ఎక్కడికో....తీసికెళ్ళి పోతారు!!



-సికిందర్ 
http://www.cinemabazaar.in