రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, జనవరి 2020, గురువారం

903 : కొత్త శీర్షిక!



రచన, దర్శకత్వం: రీతేష్ రానా
తారాగణం :  శ్రీ సింహ, త్య, రేష్ అగస్త్య, అతుల్యా చంద్ర, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, విద్యుల్లేఖా రామన్, అజయ్ ఘోష్ దితరులు
సంగీతం: కాల భైర, ఛాయాగ్రహణం : సురేష్ సారంగం, కూర్పు : కార్తీక శ్రీనివాస్
బ్యానర్స్‌: మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: చిరంజీవి,  హేమలత
***
      అందరికీ కొత్త దశాబ్ద కానుకగా ఈ కొత్త శీర్షిక - కొత్త డైరెక్టర్ కహానీ!...2019 లో చిన్న చిన్న సినిమాలు తీసిన కొత్త దర్శకులు 88 మంది పరిచయమయ్యారు. ఎప్పటిలానే ఇద్దరే సక్సెస్ అయ్యారు (ఏజెంట్ ఆత్రేయ, మత్తు వదలరా). 2018 లో మొదటి సినిమా సక్సెస్ అయి 2019 లో రెండో సినిమాతో కూడా సక్సెస్ అయిన దర్శకుడు ఒక్కడే వున్నాడు (బ్రోచే వారెవరురా). మన్మథుడు 2, రాజుగారి గది 3, కొబ్బరి మట్ట తీసిన మలి ప్రయత్నం దర్శకులు షరామామూలుగానే ఫ్లాపయ్యారు. ఈ 88 లో 86 మంది అవకాశాల కోసం కొన్నేళ్ళ పాటు ఎంతో శ్రమపడి వుంటారు. హోం వర్క్ సరిగ్గా లేక దొరికిన ఆ వొక్క అవకాశాన్ని వృధా చేసుకున్నారు. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో. ఇదే తంతు  ప్రతీ సంవత్సరం జరుగుతోంది. ఇప్పుడు వీళ్ళల్లో 95 శాతం రోమాంటిక్ కామెడీలు తీసే లోకంలోనే ఏదో సాధిద్దామని ఇంకా కొట్టు మిట్టాడుతున్నారు. చాలా సార్లు చెప్పుకున్నట్టు, సమస్య ఏమిటంటే, గత రెండు దశాబ్దాలుగా తెలుగు యూత్ సినిమా అంటే రోమాంటిక్ కామెడీలనే నమ్మకంతో వచ్చి పడుతున్న రోమాంటిక్ కామెడీలే చూసి చూసి, పెరిగిన తరం, మళ్ళీ ఆ రోమాంటిక్ కామెడీలే  తీయడం! ఇవి తప్ప ఇంకో జానర్ తెలియని పరిస్థితుల్లో వుండి పోవడం. వీళ్ళకి దొరికే నిర్మాతలకి సినిమాల గురించి ఏమీ తెలియక పోవడం. సరే, మొత్తం మీద 2019 సస్పెన్స్ - మిస్టరీ థ్రిల్లర్ల సంవత్సరంగా చిన్న సినిమాలకి కొంత దారి చూపించింది. ఓ ఐదారు తీశారు. మూడు సక్సెస్ అయ్యాయి -బ్రోచే వారెవరురా, ఏజెంట్ ఆత్రేయ, మత్తు వదలరా. 

         ‘మత్తు వదలరా’ న్యూయేజ్ సినిమా అనీ, కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమా అనీ అంటున్నారు గానీ రెండూ కాదు. ఫలానా హాలీవుడ్ సినిమా శైలి ప్రభావమనడమూ కరెక్ట్  కాదు. ‘స్కాట్ పిల్గ్రిమ్స్ వర్సెస్ ది వరల్డ్’ ఓ కామిక్ బుక్ ఆధారంగా తీసిన సెమీ ఫాంటసీ. దాని మేకింగ్ శైలి పూర్తిగా వేరేగా వుంది. ‘మత్తు వదలరా’ దర్శకుడు రీతేష్ రానా సొంత శైలిని నిర్మించుకుని మేకింగ్ చేశాడు. ఐతే చాలావరకూ ఏమవుతుందంటే, ఒక సొంత శైలితో ముద్ర వేస్తూ వచ్చే కొత్త దర్శకులు ఈ కాలంలో లేరు. బాపు శైలి, వంశీ శైలి, భారతీరాజా శైలీ అనేవి గత చరిత్రలు. ఒకరిద్దరు సొంత శైలితో ముద్ర వేస్తూ వచ్చినా రెండో సినిమాకి ఆ శైలీ వుండదు, భావ సంపదా వుండదు, మూసలోకి ముస్తాబై విచ్చేస్తారు. డీఐ వచ్చేసి కెమెరా మాన్ సొంత శైలినెలా తినేసిందో, చిన్న చిన్న సినిమాల కొత్త దర్శకులు టెక్నాలజీ కాలుష్యమే స్టయిల్ అనుకుని గుర్తింపు లేకుండా పోతున్నారు. డిజిటల్ టెక్నాలజీ స్టయిల్ నివ్వదు, అది కళారూపానికి అస్థిపంజరాన్నేఇస్తుంది. మిగతా రక్తమాంసాల్ని కళాకారుడి అంశతో చేత్తో అద్దాల్సిందే. దీన్ని కథా కథనాల మీద, నటనల మీదా ప్రదర్శించాల్సిందే.      

కథ 
      ఇది ఒక కొరియర్ డెలివరీ బాయ్ కథ. బాబూ మోహన్ (సింహా), యేసు బాబు (సత్య), అభి (నరేష్ అగస్త్య) లు ఒక బస్తీలో రూమ్మేట్స్. బాబూ మోహన్ కొరియర్ డెలివరీ బాయ్ గా, యేసు బాబు డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూంటారు. అభి కంప్యూటర్లో సినిమాలు చూస్తూ వుంటాడు. ఏదో షెర్లాక్ హోమ్స్ టాలెంట్ వున్నట్టు కన్పిస్తాడు. బాబూ మోహన్ కి వచ్చే జీతం చాలదు. మేనేజర్ జీతంలో కోత  పెడుతూంటాడు. చాలీ చాలని జీతంతో అద్దెలు కట్టలేక విసిగి ఈ పని మానేద్దా మనుకుంటాడు. యేసు బాబు ఆపుతాడు. ఆపి, ఇదే వృత్తిలో అదనపు డబ్బులు ఎలా సంపాదించుకోవాలో చిట్కా చూపిస్తాను పదమని డెలివరీకి తీసికెళ్తాడు. అక్కడ క్లయంట్ దగ్గర పేమెంట్ తీసుకుంటున్నప్పుడు, ఓ అయిదు వందల నోటు ఎలా నొక్కేసి అడగాలో చూపిస్తాడు. దీనికి బాబూమోహన్ ఒప్పుకోడు. ఎలాగో ఒప్పిస్తాడు యేసుబాబు. 

        మరో డెలివరీ కెళ్ళినప్పుడు ఆ చిట్కా ప్రయత్నిస్తాడు బాబూ మోహన్. ఆ రిచ్ అపార్ట్ మెంట్ లో ఓ బామ్మ (పావలా శ్యామల) కి డెలివరీ ఇచ్చి పేమెంట్ తీసుకున్నప్పుడు, అతను నోట్లు లెక్క బెట్టడాన్ని పట్టి పట్టి చూస్తుంది బామ్మ. అతడి చిట్కా పారదు. మంచి నీళ్ళు కావాలంటే తేవడానికి వెళ్తుంది. ఆమె నీళ్ళు తెచ్చేటప్పటికి చిట్కా అమలు చేసేసి ఒక నోటు తగ్గిందంటాడు. ఆమె తిరగబడుతుంది. ఆ పెనుగులాటలో ప్రమాదవశాత్తూ చనిపోతుంది. మత్తు ఆవరించి అతనూ పడిపోతాడు. కళ్ళు తెరిచి చూస్తే  పక్కన ఇంకో శవం వుంటుంది. డెలివరీ బ్యాగు తీసుకుని పారిపోయి వచ్చేస్తాడు. వచ్చేసి చూస్తే డెలివరీ బ్యాగులో 50 లక్షలుంటాయి.

        ఈ డబ్బెక్కడిది? బామ్మ తన వల్లే చనిపోయిందన్నభయంతో వుంటే, ఆ రెండో శవం ఎలా వచ్చింది? ఇప్పుడు తనేం చెయ్యాలి? ఇదీ కథ.   


ఎలా వుంది కథ
     క్రైం జానర్లో కాలం చెల్లిన మిస్టరీ సబ్ జానర్. మార్కెట్ యాస్పెక్ట్ వచ్చేసి ఎకనమిక్స్. క్రియేటివ్ యాస్పెక్ట్ వచ్చేసి ఎండ్ సస్పెన్స్ మిస్టరీకి కామెడీని జత చేయడం. సినిమాల్లో నేటి యూత్ అప్పీల్ ఎకనమిక్స్ లేదా రోమాంటిక్స్ కథలుగా వుంటోందని తెలిసిందే. ఈ మర్డర్ మిస్టరీ డబ్బు గురించి ఎకనమిక్స్ యాస్పెక్ట్ తోనే యూత్ ని ఆకట్టుకునే బాక్సాఫీసు అప్పీల్ తో వుంది. ‘బ్రోచేవారెవరురా’ క్రైం జానర్ కూడా ఎకనమిక్స్ తోనే సక్సెస్ అయ్యింది. ‘హుషారు’ అనే రెగ్యులర్ యూత్ కూడా. ప్రస్తుత మర్డర్ మిస్టరీలో మాట వరసకైనా రోమాంటిక్స్ ని జత చేయ లేదు. అంటే హీరోయిన్ లేదు, అంతేగాకుండా పాటలూ లేవు. ‘బ్రోచేవారెవరురా’ లో హీరోయిన్ వున్నా రోమాన్స్ లేదు. ఆ రోమాన్స్ ని సబ్ టెక్స్ట్ లో ఫీలవుతారు ఆడియెన్స్. అరుదుగా కొత్త మేకర్స్ బాక్సాఫీసు రూల్స్ ని బ్రేక్ చేస్తున్నారు.

         సాధారణంగా సీరియస్ గా వుండే మర్డర్ మిస్టరీకి కామెడీతో క్రియేటివ్ యాస్పెక్ట్ ని జత చేయడం ఒక ప్రయోగమే. హార్రర్ కి కామెడీని జత చేసే హార్రర్ కామెడీల్లాగా. ఇక్కడ ఆయా హత్యా స్థలాల్లో  హీరో తన పక్కన ఫ్రెండ్స్ ని వూహించుకునేలాటి  కల్పన - ఫాంటసీ -  హార్రర్ సినిమాల్లో వుంటుంది. హార్రర్ కాకుండా,  ‘చమత్కార్’ లాంటి కామెడీల్లో కూడా వుంటుంది. ఇందులో సర్వం పోగుట్టుకున్న షారుఖ్ ఖాన్ స్మశానంలో కూర్చుంటే, ఆత్మ రూపంలో నసీరుద్దీన్ షా వచ్చేసి తోడ్పడే ఫాంటసీ కామెడీ ఇది. ప్రస్తుత మర్డర్ మిస్టరీ లో, హీరో ఇమాజినేషన్లో ఫ్రెండ్స్ ని ప్రవేశ పెట్టి కామెడీ చేయకపోతే ఈ సినిమా నిలబడేది కాదు. 

        ఇక క్రియేటివ్ యాస్పెక్ట్ లో ఇలాటి మర్డర్ మిస్టరీ కథలతో వుండే సమస్యే మిటంటే, ఇవి ఎండ్ సస్పెన్స్ తో వుంటాయి. ఈ నేరస్థుడెవరో పరిశోధిస్తూ / దర్యాప్తు చేస్తూ చిట్ట చివరి దాకా ప్రేక్షకులకి తెలియకుండా వుంచే సస్పన్స్ ఇది. ఇది ఏనాడో సినిమాలకి వర్కౌట్ కాదని, కాలం చెల్లిందని హాలీవుడ్ గుర్తించి, అవే మిస్టరీల్ని సీన్ టు సీన్ సస్పెన్స్ గా మార్చి తీయడం మొదలెట్టింది. ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ అనే బ్రిటిష్ నమూనాని పెట్టుకుని హిందీ, బెంగాలీ, తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో కూడా ఫ్రీమేక్స్ చేసేశారు. అది కృష్ణతో  ‘అవేకళ్ళు’, కాంతారావుతో ‘గుండెలు తీసిన మొనగాడు’ వంటి ఎండ్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీలు వస్తున్న కాలం. దీన్ని బ్రేక్ చేస్తూ పై భాషల్లో బ్రిటిష్ నమూనాతో వచ్చిన మర్డర్ మిస్టరీల్లో మర్డర్ వుంటుంది. కానీ మర్డర్ జరిగినట్టు చూపించరు, చెప్పరు, తెలియనివ్వరు. ఇంకో కథ నడిపిస్తూంటారు. అది ప్రేమ కథ కావచ్చు, కుటుంబ కథ కావచ్చు, ఇంకేదేనా కావచ్చు. ఈ కథ వెళ్లి వెళ్లి చివరికి, దాచి పెట్టిన మర్డర్ మిస్టరీని రివీల్ చేసి, అంతవరకూ నడిపిన కథలో క్యారక్టర్ ని కిల్లర్ గా పట్టుకోవడంగా ట్విస్ట్ ఇస్తారు. అంటే ఈ జరిగిన కథంతా జరిగిన ఒక హత్యలో హంతకుణ్ణి పట్టుకోవడం గురించే జరిగిందని అప్పుడు బయట పడుతుంది. దీంతో మర్డర్ తో వుండే బాక్సాఫీసు వ్యతిరేక ఎండ్ సస్పెన్స్ కథనం కవరై పోతుంది. అసలు మనం చూస్తున్నది మర్డర్ మిస్టరీ అనే ఫీలే వుండదు.  

        ఇంకో టైపు కథనం సీన్ టు సీన్ సస్పెన్స్ క్రియేట్ చేసేది. ఇందులో హత్యనీ, హంతకుణ్ణీ ముందే చూపించేసి, వాణ్ణి పట్టుకోవడం గురించి సీనుకి సీనుకీ సస్పెన్స్ ని  పోషిస్తూ, ఓపెన్ గేమ్ గా చూపిస్తారు.

        ఈ బ్లాగులోనే ఇలాటి సందర్భాల్లో పదేపదే చెప్పుకున్నట్టు, చివరి దాకా నేరస్థుడెవరో  ప్రేక్షకులకి తెలియకుండా వుంచడమనే ఎండ్ సస్పెన్స్ కథనాలనేవి నవలా ప్రక్రియలు. ప్రసిద్ధ నవలల నుంచే ఆ కాలంలో ఇలాటి సినిమాలు రావడం మొదలెట్టాయి. కానీ నవలా కథనం వేరు, సినిమా కథనం వేరు. నవల చదువుతున్నప్పుడు మనస్సొక్కటే కథనం మీద ధ్యాసతో వుంటుంది. మిస్టరీ గురించి రకరకాలుగా వూహించుకుంటూ, ప్రశ్నలు వేసుకుంటూ చిట్ట చివరి పేజీల్లో మిస్టరీ వీడిపోయేదాకా. కానీ సినిమా చూస్తున్నప్పుడు మనస్సుతో బాటు కళ్ళు కూడా పనిచేస్తూంటాయి. ఇక్కడ మనసూ కళ్ళూ మ్యాచ్ అయితేనే సినిమాని చూడగలం. అంటే ఆ కళ్ళకి నేరస్థడు లేదా విలన్ తెరమీద కనపడిపోవాలి. అప్పుడే ప్లే రక్తి కట్టి సినిమాలో ఇన్వాల్వ్ అవగల్గుతారు.       
             ఎందుకిలా? మన మనో ప్రపంచం అలా వైరింగ్ అయి వుంది కాబట్టి. నిండు వెండి తెరమీద సినిమా చూడ్డమంటేనే, మనలోని  కాన్షస్ మైండ్ - సబ్ కాన్షస్ మైండ్ లు లడాయి పెట్టుకోవడం. దీన్నే కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లే అంటారు. మన కాన్షస్ మైండ్  తెర మీద తన ప్రతినిధిగా హీరోని చూస్తూంటే, సబ్ కాన్షస్ మైండ్ విలన్ కి ప్రతీకగా వుంటుంది. అలాటిది ఎండ్ సస్పెన్స్ మిస్టరీ కథల్లో విలన్ని చివరి దాకా మరుగున పెట్టేస్తే, మన సబ్ కాన్షస్ మైండ్ ని పక్కన పెట్టేసి కథ నడపడమే నన్న మాట. అంటే సినిమా చూస్తున్నప్పుడు మానసికంగా మనం కోరుకునే కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లేని తొలగించెయ్యడమన్న మాట. అంటే మన మనస్సుల్లో సగ భాగాన్ని కత్తిరించి అవతల పారెయ్యడమన్న మాట. అంటే పరిపూర్ణ వీక్షణానుభవాన్ని నిరాకరించడమన్నమాట. అంటే అన్నం పెట్టి కూర వేయక పోవడమన్న మాట. అంటే న్యూ ఇయర్ కి స్నాక్స్ పెట్టి డ్రింక్స్ దాచేయడమన్న మాట. సినిమా తీసి నాలుగు డబ్బులు కళ్ళ జూడాలనుకునే రీజనబుల్ మానవుడు చేసే పనేనా ఇది? ఇదో రకం ఆత్మహత్య!

        ఇలా చిట్టచివర్లో నేరస్థుడు తెలిసే మిస్టరీ సినిమాలకి రిపీట్ ఆడియెన్స్ కూడా వుండరు. నేరస్థుడెవరో తెలిసిపోయాక రెండోసారి చూడ్డానికి సస్పెన్స్ ఏముంటుంది. సినిమా ఒకసారి చూస్తే చాలనుకుంటారా నిర్మాతలు? ఒకసారి చూడ్డానికైనా మిగిలేదెంతమంది? విడుదలైతే మార్నింగ్ షోకే ఆ ఎండ్ సస్పెన్స్ కొంపముంచుతుంది. షో చూసి వచ్చిన ప్రేక్షకులు నేరస్థుడెవరో చెప్పేస్తే చూడాలనుకునే ప్రేక్షకులకి చూడ్డానీకేమీ వుండదు. అప్పట్లో ‘అవేకళ్ళు’ చూసిన పాతాయన వున్నాడు. ఆయన ఇదే చెప్పాడు - ‘అవే కళ్ళు’ లో చివరికి దొరికే హంతకుడు నాగభూషణమేరా, నాగభూషణమేరా’ అని సినిమా చూసిన ప్రేక్షకులు బయటి కొచ్చి టాంటాం చేసి పారేశారని. ఓస్, ఐతే ఇంకేం చూస్తామని జనాలు అనుకోవడం. కనుక ఎండ్ సస్పెన్స్ సినిమా షెల్ఫ్ లైఫ్ అనేది ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే ప్రేక్షకుల వరకే. ఇలా చెప్తే నొచ్చుకోవచ్చు, కానీ వాస్తవమిది. 


        నాటి ప్రపంచ ప్రఖ్యాత క్రైం నవలా రాణి అగథా క్రిస్టీ ఈ రకమైన మూస మర్డర్ మిస్టరీలకొక ఉపాయం కనిపెట్టింది. ఆమె రాసిన నవలలన్నీ ఎండ్ సస్పెన్స్ మిస్టరీలే. డిటెక్టివ్ హె ర్క్యూల్ పైరట్, లేదా డిటెక్టివ్ మిస్ మార్పుల్ పాత్రలతో మర్డర్ మిస్టరీలు రాసింది. ఆమె షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త సర్ అర్ధర్ కానన్ డాయల్ సరసన నిల్చింది. ఒక హత్య జరుగుతుంది. కొంత మంది అనుమానితులుంటారు. వీళ్ళల్లో ఎవరు హంతకుడో / హంతకురాలో డిటెక్టివ్ దర్యాప్తు చేసి చివర్లో రట్టు చేయడం. హత్య - అనుమానితులు -ఎవరు హంతకుడు చెప్పుకోండి చూద్దాం? - బాపతు టెంప్లెట్ లో అనాదిగా వుంటున్న మర్డర్ మిస్టరీల మూస కుంపటిని బద్దలు కొట్టి క్రైం సాహిత్యాభిమానుల్నిసంభ్రమాశ్చర్యాలకి గురి చేసింది. ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ లో పన్నెండు మంది అనుమానితుల్లో ఎవరు హంతకుడనే కథ నడుపుతూ నడుపుతూ చివరి కొచ్చేసరికి కథని రివర్స్ చేసేసింది. అనుమానితుల్లో ఒకడే హంతకుడయ్యే సాంప్రదాయాన్ని తీసి అవతల పెట్టింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ పన్నెండు మంది అనుమానితుల్నీ హంతకులుగా పట్టించేసింది! అనుమానితుల్లో ఒకరు హంతకుడు అనే టెంప్లెట్ ని, అనుమానితులందరూ హంతకులే అనే కొత్త కథగా మార్చేసింది. ఇది ఎండ్ సస్పెన్స్ కే బిగ్ బ్యాంగ్. దిమ్మ దిరిగిపోయింది పాఠకులకి. ఇది మరో రీమేక్ గా సినిమా రూపంలో ఇటీవలే వచ్చింది. 

        ఒక కథ చేస్తున్నప్పుడు దాని సరికొత్త లాభదాయక వైవిధ్యాల కోసం రీసెర్చి కూడా అవసరమే. కథ రాసేపని తొంభై శాతమనీ, దాన్ని సినిమాగా తీసే పని పది శాతమేనని ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అంటాడు. దీన్నిలా మార్చుకోవచ్చు : కథ రాసేపని పది శాతమే, దాని రీసెర్చి తొంభై శాతం శ్రమ. ఐడియాని 90 రోజులు రీసెర్చి చేయండి, 10 రోజుల్లో రాసి అవతల పడెయ్యండి!

        ‘మత్తువదలరా’ లో అనుమానితులుండరు కానీ అదృశ్యంగా హంతకుడున్నాడన్న అంచనా ఇస్తూ కథ నడిపారు. చివర్లో ఆ అదృశ్య హస్తం రివీలయ్యాక, ఎండ్ సస్పెన్స్ తో వచ్చే సమస్యే వచ్చింది. అప్పటి వరకూ విలన్ కన్పించక కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లే లోపించింది. అంటే పాసివ్ కథనం అనివార్యమైంది. విలనే లేకపోతే ఎంత సేపని హీరో తంటాలు పడతాడు. పైగా చివర్లో హంతకుడు రివీలయ్యాక రిపీట్ ఆడియెన్స్ సమస్యతో బాటు, ఫస్ట్ షో వరకే షెల్ఫ్ లైఫ్ ప్రాబ్లం ఏర్పడింది. ఫలానా వాడు హంతకుడని టాక్ బయటికి వచ్చేస్తే, సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకి అది స్పాయిలర్ అవుతుంది.  గత రెండు దశాబ్దాలుగా నయా మేకర్లు పదేపదే ఎండ్ సస్పెన్స్ సినిమాలు, పదేపదే పా సివ్ హీరో సినిమాలు, పదేపదే మిడిల్ మటాష్ సినిమాలు తీస్తున్నారు. వీటి గురించి పదేపదే రాసిరాసి, ఈ బ్లాగు ఉప్పెనలా పొంగి పొరలుతోంది. జై హింద్. బ్లాగు దారి బ్లాగుదే, మేకర్ల దారి మేకర్లదే.
ఎవరెలా చేశారు 
         హీరోగా శ్రీ సింహ కొత్త వాడయినా వున్న పాత్రని, పాత్ర చిత్రణని చిత్రిక పట్టాడు. ఐతే ఫ్రెండ్ నేర్పిన చిట్కా ప్రాక్టికాలిటీని కూడా అతను చిత్రిక పట్టాల్సింది. ఒకవేళ చిట్కా ప్రయోగిస్తూ దొరికిపోతే ఏం చేయాలన్న దాని గురించి. ఆ ఏం చేయాలన్న విరుగుడు మంత్రం తను అడగలేదు, ఫ్రెండ్ చెప్పలేదు. ఈ లోపం వల్ల ఫ్రెండ్ మాటే వేదంలా తీసుకుని పాసివ్ గా వెళ్లి ఇరుక్కున్నాడు. ఇది హీరో కుండాల్సిన లక్షణం కాదు. ఏదో విరుగుడు మంత్రాన్ని కూడా బామ్మ దగ్గర దొరికి పోయినప్పుడు ప్రయోగించి వుంటే పాత్ర పాసివ్ స్థాయి నుంచి  ఆ సన్నివేశంలో ఎదిగేది. ఏ సన్నివేశమైనా త్రీ యాక్ట్స్ లో వుంటుంది. అతను చిట్కా ప్రయోగించడం ఫస్ట్ యాక్ట్ ప్లాట్ పాయింట్ వన్ అయితే, సెకండ్ యాక్ట్ ఆ ప్రయోగ ఫలితంతో సంఘర్షణగా వుంటుంది. సంఘర్షణ ఫలితంగా బామ్మ పడిపోవడం సెకండ్ యాక్ట్ ప్లాట్ పాయింట్ టూ అవుతుంది. ఇక్కడ అతను ఆ విరుగుడు మంత్రాన్ని ప్రయోగించిన ఫలితంగా బామ్మ పడిపోతే, ప్లాట్ పాయింట్ టూ అర్ధవంతంగా వుంటుంది. సన్నివేశం స్ట్రక్చర్ లో వుంటుంది. ప్లాట్ పాయింట్ వన్ చిట్కా ప్రయోగిస్తే అది బెడిసి కొట్టడమైతే, ప్లాట్ పాయింట్ టూ దీనికి పరిష్కారంగా విరుగుడు మంత్రం ప్రయోగిస్తే ఇది కూడా బెడిసి కొట్టడం. ఇలా చూస్తూ పోతే ఈ సినిమాలో అనేక సన్నివేశాలు బలహీనంగా వున్నాయి. సింహా ఎంత బాగా నటించినప్పటికీ సన్నివేశాల బలం కూడా అవసరం. 

        సత్య ఈ మిస్టరీకి ఎంటర్ టైన్మెంట్ సారధిలా నిల్చాడు. సింహా ఇమాజినేషన్ లో వచ్చి అతను చేసే ‘దెప్పి పొడిచే’ రివర్స్ కామెడీ, వివిధ గెటప్స్ లో నటనా కొత్తగా వున్నాయి. ఇంకో ఫ్రెండ్ పాత్రలో నరేష్ అగస్త్య, ఇమాజినేషన్ సీన్స్ లో షెర్లాక్ పరిష్కారాలు చెప్పేప్పుడు, ప్రొఫెషనల్ బిహేవియర్ తో మెప్పిస్తాడు. ఇతర ఫన్నీ పాత్రల్లో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సుదర్శన్, విద్యుల్లేఖా రామన్ లు ఎంటర్ టైన్ చేశారు. చాలా కాలం తర్వాత ఒక దర్శకుడు బ్రహ్మాజీ ఎక్స్ ప్రెషన్స్ ని సమున్నతంగా క్లోజప్స్ లో పట్టుకోవడం ఇదే. బ్రహ్మాజీ క్లోజప్స్ నటనకి ఫిలిం స్కూల్ పాఠాలు. ఇక డ్రగ్ ఎడిక్ట్ గా అతుల్యా
చంద్రది నెగెటివ్ పాత్ర నటన. 

        కాల భైరవ సంగీతం ట్రెండీగా, క్యాచీగా వుంది యూత్ ని దృష్టిలో పెట్టుకుని. అలాగే  కెమెరా వర్క్ తో సురేష్
సారంగం, ఆర్ట్ డైరెక్షన్ తో ఏఎస్ ప్రకాష్, యాక్షన్ తో యు. శంకర్ లో- బడ్జెట్ అన్న ఫీల్ రాకుండా క్వాలిటీ నిచ్చారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ స్ప్లిట్ ఎడిట్ తో ట్రెండీ లుక్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఐతే క్లయిమాక్స్ నిడివిని తగ్గించ లేకపోయింది. లొకేషన్స్ పరంగా ఇంటీరియర్సే తొంభై శాతం వున్నాయి. ఒక అపార్ట్ మెంట్ బిల్డింగ్, ఒక బస్తీలో పోర్షన్, లో- బడ్జెట్ కివే లొకేషన్స్. డ్రగ్ మత్తు హేల్యూసినేషన్స్ సీజీ వర్క్ అభౌతిక లోకాల్ని సృష్టిస్తూ నాణ్యతతో వుంది. 

చివరికేమిటి
       రీతేష్ రానా, తేజాల రచన నూలు పోగంతటి కథని కథనంతో నిలబెట్టే ప్రయత్నం చేసింది. మొదటి ముప్ఫై ఐదు నిమిషాల్లో బామ్మ చావుతో మొదటి మలుపు (ప్లాట్ పాయింట్ వన్) వచ్చేసింతర్వాత, చివరి ఇరవై నిమిషాలకి హంతకుడి గుర్తింపుతో రెండో మలుపు(ప్లాట్ పాయింట్ టూ) వస్తుంది. మధ్యలో గంటకి వచ్చే ఇంటర్వెల్ ఫాల్స్ ఇంటర్వెల్ బ్లాక్. ఏదో ఘోరం జరిపోతోందన్నట్టు ఇంటర్వెల్లో ఆపి, ఓపెన్ చేస్తే - అది ఉట్టిదే నని తేల్చేయడం ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడమే. కథనం ట్రాకు నుంచి తప్పిపోవడమే. దీని బదులు ఆ తలుపు కొట్టిన వ్యక్తిగా బ్రహ్మాజీనే చూపించి ఇంటర్వెల్ వేసి వుంటే, సస్పెన్స్ క్రియేట్ అయ్యేది. చచ్చిపోయిన బ్రహ్మాజీ పాత్ర ఎలా బ్రతికి వచ్చింది?- ఇదీ ప్రేక్షకులు వేసుకునే ప్రశ్న. కథమంటే ప్రశ్నలు వేసి జవాబులు చెప్పడమేగా? అలా ప్రేక్షకుల్ని బిజీగా వుంచడమేగా? లేకపోతే ఖాళీగా మరబొమ్మల్లా కూర్చోవడానికి ప్రేక్షకులు సినిమాల కొస్తారా?       

        తర్వాత ఆ తలుపు కొట్టిన బ్రహ్మాజీ పాత్ర కూడా హీరో ఇమాజినేషనే నని లాజికల్ గా వివరణ ఇవ్వొచ్చు. కథనం చెదిరి పోకుండా ట్రాకులో వుంటుంది. ఇంటర్వెల్ అంటే కథలోనే వెతుక్కుని సృష్టించే మలుపు, అంతేగానీ పక్క నుంచి ఇంకేదో తెచ్చుకుని కలిపేది కాదు.   ఫస్టాఫ్ ముప్ఫై ఐదవ నిమిషం నుంచీ ఇంటర్వెల్ ముందు సీను వరకూ బామ్మ సీనుతో ఒకే 25 నిమిషాల సుదీర్ఘ సీను. క్వెంటిన్ టరాంటినో తీసిన ‘కిల్ బిల్’ లో సీన్స్ లాగా. ఈ టెక్నిక్ వాడి వుంటే, ఇంత సుదీర్ఘ సీను ఉండుండి ఒక పెద్ద బ్యాంగుతో ముగిసివుంటే -‘కిల్ బిల్’ లో లాగా ఒక ‘వామ్మో’ (whammo) క్రియేట్ అయ్యేది. 

        ఫస్టాఫ్ తో పెద్దగా ఇబ్బంది లేదు, సెకండాఫ్ లోనే సమస్యలు. లాజికల్ సమస్యలతో బాటు, హంతకుడెవరన్న కాలం చెల్లిన మిస్టరీతో వచ్చే సమస్యలు. హంతకుణ్ణి రివీల్ చేశాక కథనంతో సర్వ సాధారాణంగా జరిగే తప్పే జరిగింది. ఇక ఆ హంతుకుడు ఏది ఎలా ఎప్పుడెందుకు చేశాడో సినిమా మొదట్నుంచీ వరసగా కార్యకారణ సంబంధాలు చెప్తూ వివరించే తతంగం. ఇది ప్రింట్ మీడియా నవలకి ఇప్పుడూ చెల్లుబాటవుతుంది, విజువల్ మీడియా సినిమాకి కాదు. అవన్నీ కలిపి ఆలోచించుకుంటూ అర్ధంజేసుకునే మానసిక శ్రమ ప్రేక్షకులు తీసుకోరు. పాసివ్ గా చూస్తూంటారు. అసలు దొరికిపోయిన హంతకుడు తన దుకాణ మంతా ఎందుకు విప్పుతూ కూర్చుంటాడు- అందునా ‘షెర్లాక్ హోమ్స్’ లాంటి వాడు? వాడు హీరో మెడకే బిళ్ళ వేసే ప్లానుతో వెంటనే ఉడాయిస్తాడు!

        అంటే ఈ సీను వెర్బల్ గా గాకుండా యాక్షన్ తో వుండాలి. వీడే హంతకుడని హీరో పట్టుకున్నాక, హంతకుడి చేత ఎలా హంతకుడో చెప్పిస్తూ కూర్చునే డైలాగుల దుకాణం పెట్టకుండా, ఆ హంతకుణ్ణి వెంటనే జంప్ అయ్యేలా చేస్తే - వాడి కోసం క్లయిమాక్స్ యాక్షన్ మొదలైపోతుంది. వీడే హంతకుడని హీరో పట్టుకోవడం ఆడియెన్స్ కి షాక్ వేల్యూయే అనుకుందాం- అప్పుడా షాక్ వేల్యూని సస్టెయిన్ చేయడం ఈ కీలక మలుపులో చాలా అవసరం. లేకపోతే ప్లాట్ పాయింట్ టూ కి అర్ధమే లేదు. ప్లాట్ పాయింట్ టూ అనేది స్క్రీన్ ప్లే కి మూడో మూల స్థంభం. వెంటనే హంతకుడు పారిపోయేలా చేస్తే ఇది సస్టెయిన్ అవుతుంది. అక్కడే వాడి చేత డైలాగుల దుకాణం పెట్టిస్తే, డైల్యూట్ అయిపోతుంది షాక్ వేల్యూ. పారిపోయిన వాణ్ణి హీరో పట్టుకుంటే, అప్పుడు హీరోయే వాడి అభియోగాల చిట్టా విప్పితే, యాక్టివ్ క్యారక్టర్ అవుతాడు. హీరోకి అసలేమీ తెలీదన్నట్టు హంతకుడే  తన బాగోతం చెప్పుకుంటే హీరో పాసివ్ క్యారక్టర్ అయిపోతాడు. తను ఏదెలా చేశాడో తనే చెప్పుకుంటే  ఆడియన్స్ కి గగుర్పాటు కలగదు. ఎందుకంటే అది పాసివ్, సెకండ్ హేండ్ ఇన్ఫర్మేషన్, వాడి మాటలు నమ్మాలని కూడా లేదు.  వాడి నిజ స్వరూపం హీరోయే విప్పి చెప్పేస్తూంటే - ఆడియెన్స్ కి తాము కనిపెట్ట లేకపోయిన పాయింట్స్ ని ఇంతసేపూ (ఈ మిడిల్ విభాగంలో కథ జరిగినంత సేపూ) హీరో కనిపెడుతూనే  వున్నాడన్న స్పృహలో కొచ్చి, హీరో మీద అభిమానం మరింత పెరిగే అవకాశం వుంటుంది. హీరో అనేవాడు ఎప్పుడూ ప్రేక్షకులకంటే పై స్థాయిలో వుంటాడు.

        ఇలా చేసినా ఈ మిస్టరీ నిలబడుతుందా? పైనే చెప్పుకున్నట్టు, ఇలాటి ఎండ్ సస్పెన్స్ మిస్టరీలతో హంతకుణ్ణి దాచి పెట్టి చివరికి చెప్పడంలో వున్న మౌలిక సమస్య - మౌత్ టాక్ తో రివీలై పోయే, రిపీట్ ఆడియెన్స్ కి నెగెటివ్ గా పరిణమించే - బాక్సాఫీసు వ్యతిరేక ఫలితాలు ఎప్పుడూ వుంటూనే వుంటాయి.

సికిందర్