రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, ఏప్రిల్ 2017, శనివారం

రివ్యూ!








తారాగణం : విద్యాబాలన్, నసీరుద్దీన్ షా ,ఆశీష్ విద్యార్థి ,రజిత్ కపూర్, చంకీ పాండే, గౌహర్ ఖాన్, పల్లవీ శారద ,ఇళా అరుణ్ తదితరులు
కథ : శ్రీజిత్ ముఖర్జీస్క్రీన్ ప్లే : శ్రీజిత్ ముఖర్జీకౌసర్ మునీర్మాటలుపాటలు  : కౌసర్ మునీర్
సంగీతం : అనూ మాలిక్, ఖయ్యాం, ఛాయాగ్రహణం : గోపీ భగత్
బ్యానర్ : విశేష్  ఫిలిమ్స్, ప్లే ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాతలు : ముఖేష్ భట్విశేష్  భట్
విడుదల : ఏప్రెల్  14, 2017
            ***
        దేశ విభజన మీద హిందీలో అనేక సినిమాలొచ్చాయి. దేశ విభజన నేపధ్యంలో వేశ్యల పోరాటంతో ‘బేగం జాన్’ వచ్చింది. బెంగాలీ దర్శకులతో విద్యాబాలన్ నటించినప్పుడల్లా అదొక కళాత్మక సినిమా అవుతోంది. ఈ మధ్య సరిగా సినిమాలు తీయక వెనకబడ్డ మహేష్ భట్ ఈసారి విద్యాబాలన్ తో, దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీతో ఈ కళాత్మకం  తీసి వార్తలకెక్కారు. దేశ విభజన గురించి వేశ్య పాత్రలతో ఇప్పుడు కొత్తగా ఏం చెప్పారన్న ఆసక్తి రేకెత్తించారు. విద్యాబాలన్ మరో షబానా అజ్మీ అవుతున్న క్రమంలో, శ్యాం బెనెగళ్ తీసిన ‘మండి’లో లాంటి షబానా అజ్మీ పాత్ర సంఘర్షణని ఇంకో స్థాయికి తీసికెళ్ళి ఎలా బలమైన ముద్ర వేశారో ఒకసారి చూద్దాం...

కథ 
       2016 డిసెంబర్ లో ఒక రాత్రి న్యూ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో బస్సులో పోతున్న బాయ్  ఫ్రెండ్- గర్ల్ ప్రెండ్ జంటని పోకిరీలు వేధిస్తూంటే,  బస్సు దిగి పారిపోతుంది గర్ల్ ఫ్రెండ్.  ఆమెని వెంబడించి రేప్ చేయబోతారు. అప్పుడొక ముసలవ్వ ఆ అమ్మాయికి రక్షణగా నిలబడి- తన బట్టలు విప్పేస్తూ పోకిరీలని ఆహ్వానిస్తుంది...ఈ దృశ్యంతో  పోకిరీలు జన్మకి సరిపడా గుణపాఠం నేర్చుకుంటారు. 

          ఈ ఓపెనింగ్ టీజర్ తో కథ 1947 నాటి కాలంలోకి పోతుంది. అక్కడ పంజాబ్ కొండ కనుమల మధ్య ఒకే పెద్ద కోటలాంటి ఇల్లు. ఆ ఇంట్లో బేగం జాన్ ( విద్యా బాలన్ ) అనే యజమానురాలు. ఆమె కింద పదకొండు మంది వేశ్యలు, ఒక అమ్మ (
ఇళా అరుణ్), ఇంకో మైనర్ బాలిక. సుర్జిత్ (పితో బాష్  త్రిపాఠీ) అనే ఒక సేవకుడు, సలీం మీర్జా (సుమిత్ నిఝావన్) అనే అంగరక్షకుడు వుంటారు. ఆ వేశ్యా గృహంలో వేశ్యల మధ్య కులమత ప్రాంతీయ బేధాల్లేవు. అందరిదీ బతకడం కోసం ఒకే పోరాటం. బేగం జాన్ దేనికీ రాజీ పడని, లొంగని  మొండి ఘటం. ఒక సంస్థానానికి చెందిన రాజాజీ (నసీరుద్దీన్ షా) తో, ఇంకో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాస్టర్ (వివేక్ ముష్రాన్) అనే నేతతో సంబంధాలు పెట్టుకుని తన జోలికి ఏ చట్టమూ, ఏ తెల్లవాడి నిర్బంధమూ రాకుండా చూసుకుంటూ వుంటుంది. స్థానిక పోలీసు అధికారిని పూచిక పుల్లలా తీసిపారేస్తుంది. ఆమె దగ్గరికి వచ్చే విటుల్లో పెద్ద మనుషులూ వుంటారు, ఆ పెద్ద మనుషుల్లో కులీనులూ వుంటారు. 

          ఇలా వుండగా ఓ అర్ధరాత్రి దేశానికి స్వాతంత్ర్యం వస్తుంది. రేడియోలో ఈ ప్రకటనకి వేశ్యలంతా  ఆనందాతిరేకాలతో  నృత్యాలు చేస్తారు, బాణసంచా కాలుస్తారు. బేగం జాన్ మాత్రం నిర్లిప్తంగా  కూర్చుని వుంటుంది. ఆమె దృష్టిలో దేశానికి స్వాతంత్ర్యం రాలేదు, మగాళ్ళకి వచ్చింది. మగాళ్ళ నుంచి ఆడవాళ్ళకి స్వాతంత్ర్యం లభించినప్పుడే దేశానికి లభించినట్టు. 

          ఇదిలా వుండగా,  
ఢిల్లీలో దేశ విభజనకి విభజన రేఖ గీసే నిర్ణయాలు జరుగుతాయి.
 లూయిస్ మౌంట్ బాటెన్ (పాట్రిక్ ఐర్) ఈ పనిని బ్రిటిష్ లాయర్ సిరిల్ రాడ్ క్లిఫ్ (రాజా బిస్వాస్)కి అప్పజెప్తాడు. వారం రోజుల్లో అటు బెంగాల్లో, ఇటు పంజాబ్ లో రెండు గీతలు గీసేసి దేశాన్ని విభజించేస్తాడు రాడ్ క్లిఫ్. అటు తూర్పు పాకిస్తాన్, ఇటు పశ్చిమ పాకిస్తాన్, మధ్యలో ఇండియా అంటాడు. 

          దీంతో అటూ ఇటూ స్థానచలనం, వలసలు ప్రారంభమవుతాయి. మరో వైపు విభజన రేఖ మ్యాప్ పట్టుకుని కంచె వేసే పని చేపడతారు  పంజాబ్ వైపు ఇద్దరు చిన్ననాటి మిత్రులు. వీళ్ళు హరిప్రసాద్ (ఆశీష్ విద్యార్థి), ఇలియాస్ ( రజిత్ కపూర్) లనే కాంగ్రెస్,  ముస్లిం లీగ్ నేతలు. కంచె వేసుకుంటూ వస్తూంటే, సరీగ్గా రాడ్ క్లిఫ్ రేఖ మీద బేగం జాన్ కోట తగుల్తుంది. ఖాళీ చేయాల్సిందిగా ఆమెకి నోటీసు లిస్తారు. ఆమె చించి పారేస్తుంది- ‘మీరు సాని కొంప అంటున్న ఈ ఇల్లు నా ఇల్లు, నా దేశం. మమ్మల్ని ఇక్కడ్నించి కదిలించాలని చూశారో, మీ కాళ్ళూ చేతులూ తీసేసి “దేహ విభజన” చేస్తాం’ అని వార్నింగ్ ఇస్తుంది. 

          ఇదీ సమస్య. ఇదెలా పరిష్కార మైంది? ఎవరిది పై చేయి అయింది? బేగం జాన్ తన బృందంతో కలిసి దేశానికి ఇచ్చిన సందేశం ఏమిటి? పైకి కన్పించని ఈ సందేశం ఆమె పోరాటానికి ఎలా సంసిద్ధం చేసింది?...ఇవీ మిగిలిన కథలో తెలిసే అంశాలు.

ఎలావుంది కథ 
         ‘రాజ్ కహిని’ (రాజుల కథ) పేరుతో 2015 లో ఇదే దర్శకుడు తీసిన బెంగాలీకి ఇది రీమేక్. అందులో రీతూ పర్ణ సేన్ గుప్తా నటించారు. అయితే 1983 లో  శ్యాం బెనెగళ్ తీసిన ‘మండి’ స్ఫూర్తితోనే  ‘రాజ్ కహిని’ తీశారు. ‘మండి’ (సంత) కూడా ‘ది బెస్ట్ లిటిల్ వోర్ హౌస్ ఇన్ టెక్సాస్’  (1982) అనే హాలీవుడ్ తో బాటు, గులాం అబ్బాస్ రాసిన ‘ఆనంది’ అనే ఉర్దూ కథ ఆధారంగా తీశారు. ఇందులో  రుక్మిణీ బాయి (షబానా అజ్మీ)  హైదరాబాద్ లో నడిపే వేశ్యాగృహాన్ని నగర శివార్లకి తరలించాలని నేతలు నిర్ణయించడంతో రుక్మిణీ బాయి సంఘర్షిస్తుంది. అది స్థానిక సమస్య, దాంతో వ్యక్తిగత సంఘర్షణ. 

          ‘బేగం జాన్’ కొచ్చేసరికి విశాలప్రాతిపదికన దేశ విభజన సమస్యకి కేంద్ర బిందువు అయింది. ఈ సినిమా చూస్తూంటే ఆమె ఓ ఇంటికోసం తను గెలవలేని పోరాటం ఎందుకు చేస్తోందని అన్పిస్తుంది. మూర్ఖత్వమని కూడా అన్పిస్తుంది. కొన్ని భూసేకరణ  కథల్లో రైతు పొలం అమ్మనని భీష్మించుకునే లాగ. అమ్మక తప్పదు, అభివృద్ధిని ఆపలేరు. బ్రిటిష్ వాడు నిర్ణయించిన విభజన రేఖని మార్చడం బేగం వల్ల కాదు, ఆమె ఖాళీ చేసి పోవాల్సిందే. 

          కానీ రైతుకీ ఓ రక్షణ వుంటుంది, కనీసం నష్టపరిహారం లభిస్తుంది. ఈ వేశ్యల చేత ఖాళీ చేయించి తమలో కలుపు కోడానికి సరిహద్దు కిరువైపులా ఎవరూ సిద్ధంగా వుండరు.  వాళ్ళ ఖర్మానికి వదిలేస్తారు.  ఈ నేపధ్యంలో బేగం, ఆమె బృందం ఆయుధాలు చేపట్టి, ఓడిపోతామని తెలిసీ  కోటని రక్షించుకోవడాని చేసే భీకర పోరాటం చూస్తూంటే, మామూలు కంటికి ఓ యాక్షన్ – మెర్సినరీ జానర్ లో ఫిక్స్ చేసి కమర్షియల్ గా సొమ్ములు చేసుకోవాలనుకున్న కథలాగే అన్పిస్తుంది. వేశ్యలు వాళ్ళ  వృత్తి కోసం చేస్తున్న ప్రాణత్యాగం లాగే అన్పిస్తుంది. 

          ఇంతే కథ అనుకుంటే పప్పులో కాలేసినట్టే, సినిమా చూడ్డం రానట్టే. అర్ధవంతమైన సినిమా కథకి ఓ సంస్కారం వుంటుంది. అది కంటికి కాదు, మనసుకి కథని అందిస్తుంది. అందుకని ఈ పైకి కన్పించేదంతా నిజం కాదనీ - దీనికి సమాంతరంగా అంతర్లీనంగా వేరే అర్ధంలో అసలు కథ నడుస్తోందనీ పసిగడతాం. వేశ్యలు వాళ్ళ వృత్తి కోసం ప్రాణత్యాగం చెయ్యరు. అలా చూపిస్తే సినిమా ఒక్క ఆట కూడా ఆడదు. 

          బేగం సహా పదకొండు మంది వేశ్యలు ప్రాణాలకి తెగించి చేసే ఆ  పోరాటం కేవలం వృత్తి కోసమో, ఇంటి కోసమో కాదు. దేశం కోసం. ఆ కోటలాంటి ఇల్లు  దేశానికి రూపకాలంకారమని మనకి  అర్ధమవుతుంది. ఆ వేశ్యల పోరాటం దేశ విభజననే అడ్డుకుంటున్న పోరాటమని తెలుస్తుంది. సంకేత భాషలో  అంతర్గతంగా  ఈ కథ నడుస్తోంది. నీలకంఠ తీసిన ‘షో’ లో కూడా సంకేత భాషలో అంతర్లీనంగా కూడా ఓ కథ నడుస్తూంటుంది. ఇది మనసుకి కన్పిస్తుంది. 

          బేగం ఈ పోరాటంలో ఓడిపోతుందని తెలుసు- దేశం అఖండ భారత్ గా వుండాలన్న వాళ్ళ కోరికలోని బలం ముందు ప్రాణాలు ముఖ్యం కాదు. కథ ముగుస్తున్నప్పుడు వచ్చే పాట వాళ్ళ నినాదాన్ని తెలుపుతుంది-  ‘వోహ్ సుభాహ్ హమీసే ఆయేగీ’ - ఆ శుభోదయం మాతోనే వస్తుంది అంటూ. మిమ్మల్ని స్వర్గానికి తీసి కెళ్ళడానికి ఏ కాంతి పుంజమూ ఆకాశంలోంచి దిగిరాదు, మీరే కాంతి పుంజం కావాలని పాడతారు. నిజమే, ఎవళ్ళ  స్వార్ధాలతో వాళ్ళు మనుషులు దేశాన్ని చీకట్లోనే వుంచుతారు- వాళ్ళతో శుభోదయం ఎలా ఎప్పుడు వస్తుంది? 

          దేశభక్తి గురించి ఇంతగా మాట్లాడే సంస్థలు, పార్టీలు ఏవీ ఆ నాడు దేశ విభజనని అడ్డుకునే చిన్న ఉద్యమం కూడా రేపి ప్రజల్నిజాగృతం చేయలేదు. పైపెచ్చు ప్రజల్ని అనాధలుగా వదిలేసి, విభజన వంకతో  వాళ్ళు వూచకోతకి గురవుతూంటే ప్రేక్షక పాత్ర వహించాయి.

          దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ ఈ కథతో అలాటి పార్టీలకి, సంస్థలకి చెంపపెట్టు లాంటి సమాధానమిచ్చాడు.

ఎవరెలా చేశారు 
       ఎవరెలా చేశారంటే చెప్పడం కష్టం. ప్రతీ ఒక్క పాత్రలో ప్రతీ ఒక్కరూ 1940 ల నాటి మనుషులే  అన్పించేలా పోకడలు ప్రదర్శించారు. పచ్చి వేశ్యలుగా నటించిన ప్రతి వొక్కరూ నటుల్లా అన్పించరు. వేశ్యలే వచ్చి నటిస్తున్నట్టు వుంటుంది. పచ్చి భాష మాట్లాడే బేగం పాత్రలో విద్యాబాలన్ ని తప్ప ఇప్పట్లో ఇంకొకర్ని వూహించలేం.  ఈ పాత్రకి ఒకలాంటి ఫెమినిజం వుంటుంది. తిడితే ఆడదానికి తగిలే తిట్లు తిట్టే మగ నాకొడుకులతో ఆడదానికి స్వాతంత్ర్యం ఎప్పుడూ రాదనే ఈమే, ఆడవాళ్ళకి తగిలే తిట్లే  ఘోరంగా తిడుతూంటుంది. ఇది పాత్రచిత్రణ లోపం కావచ్చు. 

          ఈమె పుట్టుపూర్వోత్తరాలు పోలీసులకి కూడా తెలీవు. ఈమె అసలెవరో, వేశ్య గా ఎలా మారిందో  తెలపడానికి దర్శకుడు అద్భుతమైన క్రియేటివిటీ చేశాడు. మామూలుగానైతే  ఓ పాత్ర వచ్చి ఈమె ఫలనాఫలనా అని స్టేజి నాటకం పద్ధతిలో  చెప్పేసి చెక్కేస్తుంది. అది క్రియేటివిటీ కాదు, కుక్కలు కూడా ఆపని చేయగలవు. మొరగడం సినిమా కళ కాదు. మొరగకుండా  దృశ్యపరంగా చూపించేదే సినిమా కళ. కుక్కలకి  సినిమా కళ సింహాసనం తెలీదు. 

          విభజన రేఖ గీసి ఆమెని నెట్టేస్తున్న నేపధ్యంలో దర్శకుడు సమయోచితంగా ఆమె గతాన్ని బయట పెడతాడు. దేశానికి ఈ విభజన రేఖ లాంటిదే ఆమె జీవితంలోనూ విభజన రేఖే దగా చేసిందని. దీన్ని ఆమె ఈ సందర్భంగా  తల్చుకుంటుంది. మొగుడు పోయాడని లేత వయసులోనే తనకి శిరో ముండనం చేసి, తెల్ల చీర చుట్టి తనవాళ్ళు  వీధిలోకి నెట్టేసిన విభజన రేఖ! అలా అలా తిరిగి వేశ్యగా మారి, ఓ నవాబు దగ్గర బేగం జాన్ అయింది. దీనికి సోదిలా ఫ్లాష్ బ్యాక్ ఏమీ వుండదు. షాక్ వేల్యూ కోసం కొన్ని కట్ షాట్స్ తో  మెరుపు వేగంతో చూపించేస్తాడు దర్శకుడు. తేరుకోవడం మనవల్ల  కాదు. సినిమా తీయడమంటే మజాకా కాదు. డాగీ బిజినెస్ కాదు.

          ప్రస్తుతానికొస్తే, కోట ఖాళీ చేయమని తనని వేధిస్తున్న వాళ్ళ సంగతి చూడమని రాజాజీ (నసీరుద్దీన్ షా) ని పొదరింటికి ఆహ్వానించి, ఎర్ర చీరా నిండుగా ఆభరణాలతో ధగధగ మెరిసిపోతూ కొత్త పెళ్లి కూతుర్లా  విద్యాబాలన్ అతడి ముందు కూర్చున్నప్పుడు- ఇంకొక డిస్టర్బింగ్ సీను వస్తుంది. అతను ఆమె పెంచుకుంటున్న మైనర్ బాలిక కావాలంటాడు. షాక్ అవుతుంది. ఏం చెప్పినా విన్పించుకోడు. పైగా పాట పాడితే తప్ప తనకి మూడ్ రాదం టాడు.  మైనర్ బాలికతో అతను  పవళిస్తే అతడి ముందు కూర్చుని పాడే విద్యాబాలన్ పెళ్ళికూతురి ముస్తాబంతా పోయి పడే వేదన అంతాఇంతా కాదు. ‘శంకరాభరణం’ లో  మానభంగం జరుగుతున్నపుడు అరిగిపోయిన రికార్డు తిరుగుతూంటే, ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చుని నరకం అనుభవిస్తూ పాడాల్సి వస్తుంది. ఈ భజన్ రాజాజీ పక్కలో ఆ మైనర్ బాలికకి జోల పాడే భజన్. ఇలాటి డిస్టర్బింగ్  సీన్లు విద్యాబాలన్ కి చాలా వున్నాయి. పీరియడ్ ఫిలిం కావడం వల్ల  ఈ వెయిట్ వున్న పాత్ర కావాల్సినంత క్లాసిక్ లుక్ తో విజువల్ గా బలమైన ముద్ర  వేస్తుంది. 

         ఆశీష్ విద్యార్థి, రజిత్ కపూర్ మిత్రుల సీన్లలో కూడా దర్శకుడి పనితనం వల్ల వాళ్ళు అద్భుతంగా హత్తుకునేలా కన్పిస్తారు. ఒకరు ఇండియన్, ఇంకొకరు పాకిస్తానీ అన్నట్టుగా విడిపోబోతున్నారు కంచె వేసే పని పూర్తి చేశాక. వీళ్ళిద్దర్నీ ఎప్పుడు చూపించినా, స్క్రీన్ కి ఇటు చివర ఒకరి సగం ముఖం -  అటు చివర ఇంకొకరి సగం ముఖం మాత్రమే చూపిస్తాడు దర్శ కుడు. ఈ విభజన ప్రాణమిత్రుల్ని కూడా ముక్కలు చేసిందనే అర్ధంలో ఇలాటి  షాట్ డివిజన్ చేస్తాడు దర్శకుడు. ఇతను ఇండియాలో వుంటే సగమే వుంటాడు, తన ఇంకో సగం మిత్రుడితో పాకిస్తాన్ లో వుంటుందన్నట్టు,   అలాగే అతను  పాకిస్తాన్ లో వుంటే సగమే వుంటాడు, తన ఇంకో సగం మిత్రుడితో ఇండియాలో వుంటుందన్నట్టు కదిలించే దృశ్యీకరణ. విద్యాబాలన్ సహా ఏ పాత్రని చూపించినా విభజన కాన్సెప్టే దృశ్యాల్లో నిశ్శబ్దంగా వెల్లడయ్యేలా చిత్రీకరణ  చేస్తాడు  దర్శకుడు. 

          ఇక ఇందులో కిరాయి హంతకుడుగా పేరు చెప్తే తప్ప గుర్తుపట్టలేని విధంగా వుంటాడు చంకీ పాండే విరిగిన, గారపట్టిన పళ్ళతో.  కిల్లర్ కబీర్ గా అవసరాన్ని బట్టి హిందువుగా, ముస్లిం గా మారిపోయే ఊసర వెల్లిలా ఖతర్నాక్ గా వుంటాడు. 

          అనూ మాలిక్, ఖయ్యూం ల సంగీతాల్లో పాటలూ, వాటి చిత్రీకరణా దృశ్య కావ్యంలా వుంటాయి. దర్శకుడి చేతిలో ప్రతీదీ కళాత్మకమే. గోపీ భగత్ సమకూర్చిన ఛాయాగ్రహణం, దాని డీఐ ఇంకో చెప్పుకోవాల్సిన కళా నైపుణ్యం. కాస్ట్యూమ్స్, కళా దర్శకత్వం, పోరాటాలు ఛత్తీస్ ఘడ్ లొకేషన్స్  ప్రతీదీ కథాకాలంలో సింక్ అయిపోతూ కన్పిస్తాయి.  ఇందులో ముగింపు పాట కోసం దర్శకుడు చాలా అన్వేషించి 1958 లో రాజ్ కపూర్ సినిమా ‘ఫిర్ సుభాహ్  హోగీ’ లొ వాడకుండా వుంచేసిన, సాహిర్ లుథియాన్వీ రాసిన ‘వోహ్ సుభాహ్ తో కభీ ఆయేగీ ‘ పాటని కొద్ది మార్పులు చేసి వాడుకున్నారు. 

          పోతే, దేశ విభజన నేపధ్యంలో కేవలం వలసలు పోతున్న ప్రజలనే చూపించి, అప్పట్లో చెలరేగిన హింసాగ్ని, లక్షలాది మరణాలూ  చూపించలేదన్న ప్రశ్న తప్పక వస్తుంది. అదంతా చూపిస్తే, బేగం చేసే పోరాటం దాని ముందు డైల్యూట్ అయిపోతుంది. ప్రధాన కథనీ, ప్రధాన పాత్రనీ కాపాడుకోవాలంటే ఒక్కోసారి నేపధ్యాన్ని సెలెక్టివ్ గా వాడుకోక తప్పదు. 

          బాలీవుడ్ కొస్తున్న బెంగాలీ దర్శకులు అత్యంత కళాత్మకంగా తీస్తూ ఇతర దర్శకులకి సవాలు విసురుతున్నారు. ‘పింక్’ లాంటి  థ్రిల్లర్ తీసినా కళాత్మకమే- వాళ్ళు ఏం తీస్తే అది హిట్టే!
చివరికేమిటి 
దర్శకుడు శ్రీజిత్  ముఖర్జీ
        స్ట్రక్చర్ తో క్రియేటివిటీకే అందం వస్తుంది. స్ట్రక్చర్ లో వుంచడం వల్ల ఈ స్క్రీన్ ప్లే ఇంత బలంగా, అర్ధవంతంగా వుంది, కళాత్మకంగా వుంది. హాలీవుడ్ సినిమాల్లో ఓపెనింగ్ టీజర్లు వుంటాయి- మన సినిమాల్లో ఓపెనింగ్ బ్యాంగులు వున్నట్టు. ఓపెనింగ్ టీజర్లు ఇంకా వాడిగా, బలంగా, కత్తిలా వుంటాయి. దీన్ని ఈ కథ మొదలెట్టడానికి వాడుకున్నారు. పైన చెప్పుకున్న కథలో మొదటి పేరాలో ముసలవ్వ వివస్త్ర అయ్యే సన్నివేశం అలాటి పవర్ఫుల్ టీజరే.  ఈ టీజర్ లో  సన్నివేశం 2016 నాటిది. మరి వెంటనే మరుసటి సీన్లో 1947 లోకి కథ వెళ్ళాలి - ఎలా? 

          ఈ ముసలవ్వ ‘టైటానిక్’ ముసలావిడ అయ్యింది... అంటే ఆ అమ్మాయిని పోకిరీల బారినుంచి తను కాపాడేక, తీక్షణమైన చూపులు చూస్తూ తన గతంలో కెళ్ళి పోతుంది. వెంటనే ఈ ముసలవ్వ పాయింటాఫ్ వ్యూలో 1947 లో కథ ప్రారంభమవుతుంది. ఆనాటి కథలో మైనర్ బాలికే ఇప్పుడున్న ముసలవ్వ. 1947 లొ మైనర్ గా వున్నప్పుడు ఒకావిడ్ని పోలీసు అధికారి రేప్ చేయకుండా ఇలాగే బట్టలు విప్పుకు నిలబడి ఆహ్వానిస్తుంది. పోలీసు అధికారికి  సెక్స్ మీదే వైరాగ్యం పుట్టి పారిపోతాడు. ఈ ఓపెనింగ్ టీజర్ కి  1947 తో లింకు వుందన్న మాట. రేపిస్టులకి బుద్ధి చెప్పడానికి చిన్నప్పుడు ఏం చేసిందో,  ముసలావిడ అయ్యాకా అదే చేయాల్సి వచ్చిందన్న మాట. ఇది కొరడా చరుపు లాంటి  సోషల్ కామెంట్ అన్నమాట!

          స్ట్రక్చర్ లో బిగినింగ్ వచ్చేసి, బేగం జాన్ వేశ్యాగృహం, బిజినెస్ వగైరా ఒక పక్క చూపిస్తూ, ఇంకో పక్క దేశ పరిణామాలు, స్వాతంత్ర్యం, దేశ విభజన ప్రక్రియా, సరిహద్దుల ఏర్పాటూ అంచెలంచెలుగా చూపించు కొస్తూంటారు. ఈ ట్రాక్ అంతా బేగంతో ఎక్కడ ఎందుకు ఎలా కనెక్ట్ అవుతుందా అన్న సస్పెన్స్ పుడుతుంది. ఈ ట్రాక్ అంతా ముందు ముందు  ప్లాట్ పాయింట్ -1 దగ్గర కథకి అవసరమైన ‘సమస్య’ ఏర్పాటు కోసం దారితీసే పరిస్థితుల కల్పనే అని అర్ధమవుతుంది నియమాల ప్రకారం.

          నలభై ఐదో నిమిషం కల్లా సరిహద్దు కంచె వేసుకుంటూ వస్తే ఏముంది- విభజన రేఖ మీద బేగం కోట వుంటుంది. అంతే, ప్లాట్ పాయింట్ -1, దాని సమస్యా ఏర్పాటై పోయాయి. కోట ఖాళీ చేసి వెళ్ళాలంటూ బేగంతో అధికారుల వాదన, వాళ్లతో ఆమె  ఘర్షణ - కథ ప్రకారం బలంగా భీకరంగా వుంటాయి. 

          అయితే ఇక్కడ ఏ సినిమాలోనూ జరగని విధంగా ‘సీనస్ ఇంటరప్టస్’ జరుగుతుంది. ఇది తికమక పెడుతుంది. ప్లాట్ పాయింట్ -1  సన్నివేశాన్ని బ్రేక్ చేసి మరో సీన్ కి వెళ్ళడం జరగదు. కానీ ఇక్కడ జరిగింది.  అధికారులూ, బేగంల మధ్య రసపట్టులో వున్న సంఘర్షణ అకస్మాత్తుగా  వీగిపోతూ సీన్ మారుతుంది- అక్కడ దూరంగా వేశ్యా ఆమె ప్రియుడుల మధ్య  ఎమోషనల్ సీను, వర్షం. ఇదొక అద్భుత దృశ్య కావ్యం, అది వేరే విషయం. దీని తర్వాత తిరిగి ప్లాట్ పాయింట్ -1 సీనుకి!  

          కథనంలో ఎక్కడైనా సీన్లకి ‘సీనస్ ఇంటరప్టస్’ జరగవచ్చు గానీ, ప్లాట్ పాయింట్ -1 సీనుని మధ్యకి విరిచి తిరిగి అతికిస్తూ చేయడం ఎక్కడా వుండదు. సమస్య ఎంత తీవ్రమైనదో చరిత్ర తెలిసిన మనకి తెలుసు కాబట్టి ప్లాట్ పాయింట్ -1 ని ఇలా విరిచినా కథనానికి డ్యామేజి జరగలేదు. వెంటనే ఇంటర్వెల్ వస్తుంది యాభయ్యో నిమిషంలో. 

          మళ్ళీ ఇదొక బుర్ర దొలిచేసే పని. ప్లాట్ పాయింట్ -1 తో ఎవరైనా ఇంటర్వెల్ వేస్తారా? ప్లాట్ పాయింట్ -1 ని అనవసరంగా సాగదీసి సాగ దీసి గంటకో, గంటంపావుకో ఎస్టాబ్లిష్ చేసి ఇంటర్వెల్ వేయడం వేరు. కానీ యాభై నిమిషాలకి ప్లాట్ పాయింట్ -1 అవగానే ఇంటర్వెల్ ఇవ్వడం నాటక పద్దతి. నాటకాల్లో ఒక అంకం అయిపోగానే తెరదించినట్టు, ఇక్కడ బిగినింగ్ అనే మొదటి అంకం అవగానే విశ్రాంతి నిచ్చేశారు.  ఇంకో బెంగాలీ దర్శకుడు తీసిన ‘పింక్’ లో నైతే కోర్టు సీన్లన్నీ నాటక రంగ టెక్నిక్ తోనే నడుస్తాయి!

రచయిత్రి కౌసర్ మునీర్
         ఇక విశ్రాంతి తర్వాత మిడిల్ లో పడ్డ కథ అత్యంత సంఘర్ష ణాత్మకంగా వుంటుంది. నియమాల ప్రకారం. ఈ సంఘర్షణలో ఆమెకి ఎదురయ్యే అడ్డంకులు అంతకంతకీ తీవ్రత పెంచుకుంటూ వుంటాయి. ఇక విధిలేక తుపాకులు పేల్చడంలో తనతో సహా అందరూ శిక్షణ పొందడం, బయటి నుంచి ప్రత్యర్ధుల దాడులు పెరిగి, చివరికి ఆమె అంగ రక్షకుడు సజీవ దహన మైనప్పుడు,  ప్లాట్ పాయింట్ -2 ఏర్పడి  మిడిల్ ముగుస్తుంది.

          ఈ ప్లాట్ పాయింట్ -2 కూడా బలంగా రిజిస్టర్ అవుతుంది. ప్లాట్ పాయింట్-1, ప్లాట్ -పాయింట్ -2  రెండూ కూడా విజువల్ గా బలంగా రిజిస్టర్ చేసినప్పుడే ఈ మిడిల్ అనే స్క్రీన్ ప్లేకి  వెన్నెముక పటిష్టవంతంగా వుంటుంది.

          ఈ ప్లాట్ పాయింట్ -2 దృశ్యాన్ని  ఎవరూ జీవితంలో మర్చిపోలేరు. మర్చిపోయారంటే మనసుతో సినిమా చూడనట్టే. అంగరక్షకుడు నిలువెత్తు మంటల్లో ఒక ప్రభాలా వెలిగిపోతూ, గాలికి వూగుతున్న వరికంకిలా అటూ ఇటూ స్వింగ్ అవుతూంటాడు. అతన్నే చూస్తూంటుంది. జీవితంలో ఏదీ వూరికే జరగదు. ప్రతిదీ మనకో అర్ధాన్నిస్తాయి. సింక్రో డెస్టినీ అంటారు. దీని ప్రాధాన్యాన్ని గుర్తించకుండా-  ఏదో తగలబడ్డాడు, ఆమె చూసింది, అతను కిందపడ్డాడు, చచ్చి పోయాడు, ఏడ్చింది –అన్న చందంగా  సీను తీసేస్తే అది అజ్ఞానం. క్రియేటివిటీకి అవమానం. 

          నిలువెల్లా మంటల్లో అలా ఊగుతూ అతనేదో మూగగా చెప్తున్నాడు - ఈ పోరాటాన్ని గెలవలేవు, ఆనందంగా ఆహుతైపో- అంటున్నాడేమో? ఇదే ప్లాట్ పాయింట్ -2 దగ్గర ఆమెకి దొరికిన పరిష్కారమార్గం. దీంతో ఎండ్ విభాగంలో ఆమె బృందంతో కలిసి తీసుకునే నిర్ణయం ఎంత హృదయవిదారకంగా వుంటుందంటే...

          కళ, క్రియేటివిటీ, ఇతర సాంకేతికాలు ఒక స్ట్రక్చర్ పరిధిలోకి వచ్చినప్పుడే పురులు విప్పుకుంటాయి. స్ట్రక్చర్ లేని క్రియేటివిటీ మృత దేహానికి అలంకరణ చేయడం లాంటిది. దర్శకుడు శ్రీజిత్  ముఖర్జీ, రచయిత్రి కౌసర్ మునీర్ ల చేతుల్లో ఈ స్క్రీన్ ప్లే అంతా ఒక స్టడీ మెటీరియల్.


-సికిందర్
http://www.cinemabazaar.in