రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, నవంబర్ 2022, సోమవారం

1251 : స్క్రీన్ ప్లే సంగతులు -1

    దెయ్యాలు ఎలాగైతే మూఢ నమ్మకమో, చేతబడి అలాటి మూఢ నమ్మకమే. దెయ్యాలతో హార్రర్ సినిమాలు తీసి ఎంటర్ టైన్ చేయడం వరకూ ఓకే. చేతబడి వుందంటూ నమ్మించేలా సినిమాలు తీయడం అంత ఆరోగ్యకరమైతే కాదు. చేతబడి చేస్తున్నారని అనుమానించి చంపే దురాగతాలు ఎన్నో జరుగుతున్నాయి- మసూద ఇలాటిదే కథ. మసూదాబీ చేతబడి చేస్తోందని నమ్మి ఆమెని చంపేయడం ఈ కథకి మూలం. చంపితే చంపారుగానీ, చంపిన వాళ్ళని జైల్లో వేసి వుంటే మూఢ నమ్మకాల్ని ఖండించే సినిమాగా పాజిటివ్ గా వుండేది.

        క భూత ప్రేతాలు ఆవహించడమన్నది ప్రపంచ వ్యాప్తంగా అన్ని మతాల్లో ఇంకో మూఢ నమ్మకం. భూతం ఆవహించిన వ్యక్తి విపరీత ప్రవర్తన అదో మానసిక రుగ్మతే తప్ప మరేం కాదు. దీన్ని చేతబడితో ముడి పెట్టకుండా దెయ్యం పట్టింది, భరతం పడదాం అన్నట్టుగా సినిమాలు తీసుకుంటే ఫర్వాలేదు. కానీ మసూదాబీని చేతబడి చేస్తోందని చంపిందిగాక, ఆమె ప్రేతాత్మే ఓ అమ్మాయిని పూనినట్టు చూపించి, మళ్ళీ ఆమెని చంపడం దగ్గరే వచ్చింది సమస్య.

హాలీవుడ్ క్లాసిక్ హార్రర్ ది ఎక్సార్సిస్ట్ చేతబడితో ముడి పెట్టకుండా దెయ్యం పట్టింది, భరతం పడదాం అన్నట్టుగా తీసిన సినిమా. ఆ ఎక్సార్సిస్ట్-  అంటే మంత్రగాడి పాత్ర చర్చి ఫాదరే పోషిస్తాడు. 1973 లో తీసిన ఈ సంచలన అమెరికన్ హార్రర్ సినిమాలో- క్షుద్ర శక్తి (దెయ్యం) మరెక్కడిదో కాదు, ఇరాక్ నుంచి తెచ్చుకున్నారు. తర్వాత ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేనే ఒక దెయ్యమని ముద్రవేసి చంపారు, అది వేరే విషయం. ఎక్సార్సిస్ట్ స్ఫూర్తితోనే తెలుగులో చేతబడి క్షుద్ర సాహిత్యం మొదలైంది.

ఈ సినిమా నమాజ్ కోసం పిలుపునిచ్చే అజాన్ తో ప్రారంభమవుతుంది. ఉత్తర ఇరాక్ లో ఆర్కియాలజిస్టులు త్రవ్వకాలు జరుపుతున్న దృశ్యాలు మొదలవుతాయి. పురావస్తు త్రవ్వకాల్లో కాథలిక్ పూజారి పాల్గొంటాడు. త్రవ్వకాల్లో సెయింట్ జోసెఫ్ పతకం,  ఇంకో ఇరాక్ మైథాలజీలో ఫుజుజు అనే క్షుద్ర శక్తి విగ్రహమూ బయట పడతాయి. కాథలిక్ పూజారి సెయింట్ జోసెఫ్ పతకం తీసుకుని వెళ్ళిపోతాడు. ఫుజుజు కళ్ళు అతన్నే చూస్తాయి... అక్కడ రెండు కుక్కలు కాట్లాడుకుంటూ వుంటాయి.

ఆ విగ్రహంలోని ఫుజుజు క్షుద్ర శక్తియే అమెరికాలో పన్నెండేళ్ళ బాలికని ఆవహిస్తుంది. ఈమె తల్లి సినిమా హీరోయిన్. నాస్తికురాలు. సింగిల్ మదర్. ఆ విపత్తు నుంచి కూతుర్ని కాపాడుకోవడానికి నాస్తికత్వాన్ని వదులుకుని మతాన్ని ఆశ్రయించే ఈ హార్రర్ కథ అత్యంత జుగుప్సాకరంగా తీశారు. ప్రేక్షకులు వాంతులు చేసుకున్నారని, కొందరు గుండెపోటుతో చనిపోయారనీ సమాచారం. ఆ క్షుద్ర శక్తిని బాలిక నుంచి వదిలించడానికి, చివరికి చర్చి ఫాదరే తనలో ఆవాహన చేసుకుని ఆత్మబలి దానం చేస్తాడు. ఇందులో చేతబడి లేదు, మంత్రగాడిగా చర్చి ఫాదర్ దెయ్యాన్ని వదిలించడమే వుంది.

మసూద ముస్లిం చేతబడి కథగా తీసినప్పుడు చేతబడి మూఢ నమ్మకమని చెప్పలేదు సరే, విరుగుడు మంత్రాలు కూడా శాస్త్రోక్తంగా చూపించలేదు. ఇస్లాంలో ఖురాన్ లో వున్నదొకటి, బయట చేసేదొకటి. ఇస్లాంలో చేతబడిని సిహ్ర్ అంటారు. సిహ్ర్ కి పాల్పడడం సైతాను సాయం కోరడంగా నిషేధించింది ఖురాన్. సిహ్ర్ కి విరుగుడుగా మంత్రాలు కూడా వివరించింది. అంతేగానీ సిహ్ర్ కి పాల్పడే వాళ్ళని చంపమనలేదు. ఈ ముఖ్యమైన విషయాలు సినిమాలో చూపించలేదు. జిన్ అంటే క్షుద్ర శక్తుల్ని వదిలించే సెంటర్ నడిపే మోడరన్ పీర్ బాబా ఏ మంత్రాలూ చదవకుండా అదిలిస్తాడు లేకపోతే హూంకరిస్తాడు. లేదా తలమీద చేయిపెట్టి శాంతింప జేస్తాడు. క్లయిమాక్స్ లోనైతే ఎక్కడో కూర్చుని తస్బీర్ పట్టుకుని పెదాలు కదుపుతూంటాడు. అది మంత్రాలు చదవడంలా వుండదు.

ఇస్లాంలో చేతబడికి స్థానమేంటో, క్షుద్ర విద్యలు ఎంత నిషిద్ధమో, విరుగుడుగా ఏం చెప్పారో, కథ కవసరమయ్యే కనీస సమాచారంతో సినిమా తీస్తే తెలియని ప్రేక్షకులు తెలుసుకుంటారు. చూపించడానికి కొత్త విషయం తీసుకున్నప్పుడు అది ఇన్ఫో టైన్మెంట్ గా వుంటే బావుంటుంది.

2. బిగినింగ్ విభాగం  

    ఇప్పుడు కాన్సెప్ట్ విశ్లేషణ పక్కనబెట్టి, కథా కథనాల స్క్రీన్ ప్లే సంగతులు చూద్దాం. మనిషి మానసిక లోకమెలా వుంటుందో స్క్రీన్ ప్లే రూపం అచ్చం అలా వుంటుంది. వుండాలి. అప్పుడే ప్రేక్షకులతో సినిమా కనెక్ట్ అయీ దానికి రాసిన క్రియేటివ్ రాతల కొద్దీ ఆడుతుంది. కాన్షస్ మైండ్ (స్క్రీన్ ప్లేలో బిగినింగ్), సబ్ కాన్షస్ మైండ్ (మిడిల్), మధ్యలో ఇగో (ప్రధాన పాత్ర) కలిపి మనిషి మానసిక లోకం. కాన్షస్ మైండ్ తో వుండే ఇగో, సబ్ కాన్షస్ మైండ్ లోకి దూకి, అక్కడుండే సమస్యలతో పొరాడి విజయాన్ని పొందే (ఎండ్), పొందమని చెప్పే మనోవైజ్ఞానిక శాస్త్ర నమూనాయే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. సినిమా కథలే కాదు, సాహిత్యంలో రాసే ఏ కథలైనా ఇంతే.

హార్రర్ సినిమాల్లో పాడుబడ్డ ఇళ్ళు, దెయ్యాలు, దెయ్యం పూనిన మనుషులూ ఇవన్నీ సబ్ కాన్షస్ మైండ్ కి ప్రతీకలే. ఇటీవల విడుదలైన, మమ్ముట్టి నటించిన రోషాక్ అనే సైకలాజికల్ థ్రిల్లర్ లో మమ్ముట్టి దుష్టశక్తి వున్న పాడుబడ్డ ఇంట్లోనే దిగుతాడు. దీంతోనే- ఈ సబ్ కాన్షస్ మైండ్ కి ప్రతీకతోనే - నిజాలు తెలుసుకోవడానికి మమ్ముట్టి పాత్ర ఇగో పోరాటన్న మాట.

అలాగే మసూద లో మసూదాబీ దెయ్యం పూనిన అమ్మాయే సబ్ కాన్షస్ మైండ్ కి ప్రతీక. ఈమెతోనే కథ. మసూద కథ చేతబడి తీసేస్తే ఎక్సార్సిస్ట్ కథే. తల్లీ కూతుళ్ళు, వాళ్ళకి సాయపడే మగ పాత్ర, చర్చి ఫాదర్ సహా. ఎక్సార్సిస్ట్ లో దుష్టశక్తి ఇరాక్ మైథాలజీ లోంచి వస్తే, మసూద లో ముస్లిం చేతబడి లోంచి వచ్చింది.

ఈ స్క్రీన్ ప్లే 1989 లో చిత్తూరు జిల్లా గ్రామంలో మీర్ తాజ్ అనే ముస్లిం రైతు కుటుంబంలో హింసాత్మక ఘటనలతో ప్రారంభమవుతుంది. తర్వాత హైదరాబాద్ లో ఓ భవనంలో ఓ యువతి దారుణ హత్యతో ముగుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికొస్తే స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగం ప్రారంభమవుతుంది. ఇందులో కథా పరిచయం, పాత్రల పరిచయం, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా వుంటాయి. సమస్య స్థాపన వుండదు, ఇదే లోపం.

హైదరాబాద్ లో ఆ హత్య జరిగిన పాడుబడిన భవనం ఎదురుగానే పాత అపార్ట్ మెంట్ ఫ్లాట్లో నీలం అనే సైన్స్ టీచర్, స్కూలుకెళ్ళే కూతురు నాజియాతో వుంటుంది. పక్క ఫ్లాట్లో గోపీ అనే సాఫ్ట్ వేర్ వీళ్ళతో స్నేహంగా వుంటాడు. నీలంని వదిలేసి దూరంగా వుంటున్న భర్త డబ్బుల  కోసం వేధిస్తూ వుంటాడు. గోపీ ఆఫీసులో మినీని ప్రేమిస్తూంటాడు.

ఇలా పాత్రల పరిచయాలయ్యాక, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన ఇలా మొదలవుతుంది - నాజియా చేతికి కొత్తగా వేసుకున్న బ్రాస్లెట్ చూసి క్లాస్ మేట్ అడిగితే మదర్ కొనిచ్చిందని అంటుంది. ఓ రాత్రి నాజియా భయానక రూపంలో వేరే గొంతుతో భయపెట్టేలా మాట్లాడుతుంది. నా శక్తి గురించి తక్కువ అంచనా వేశారు అంటుంది. ఎవరు?’ అంటే వాడే అంటుంది.

దీంతో భయపడి డాక్టర్ కి చూపిస్తారు. డాక్టర్ పరీక్షలు చేసి మందులు రాస్తాడు. సైన్సుని నమ్మే నీలం సైన్స్ మీద నమ్మకం లేక భూత వైద్యుడ్ని చూపిద్దామంటుంది. పీర్ బాబా దగ్గరి కెళ్తారు. పీర్ బాబా అసిస్టెంట్ అల్లావుద్దీన్ తావీజు ఇచ్చి కట్టమంటాడు. ఆ తావీజు స్కూల్లో తీసేస్తుంది కూతురు. ఆమెని చూసి మీర్ తాజ్ అనే అతను (సినిమా ప్రారంభంలో 1989 పూర్వ కథ పాత్ర) దగ్గరికొస్తాడు. దూరం నుంచి ఇది చూస్తుంది- 1989 లో దారుణ హత్యకి గురైన యువతి ఆత్మ. వెంటనే మీర్ తాజ్ రక్తం కక్కుకుని చచ్చిపోతాడు.

స్కూల్లో కూతురు ముక్కు నుంచి రక్తం వస్తుంది. రాత్రి కూతుర్ని పడుకోబెట్టిన నీలం - బ్రాస్లెట్ ని చూసి ఇదెక్కడిదని అడిగితే, క్లాస్ మేట్ ఇచ్చిందంటుంది కూతురు. క్లాస్ మేట్ కి మదర్ ఇచ్చినట్టు చెప్పి వుంది. నీలం కి మంచం పక్కన మసూదాబీ అని రాసి వుండడం కన్పిస్తుంది. అదే రాత్రి ఫ్లాట్ కొస్తున్న నీలం ఫ్లాట్ యజమాని కొడుకు, ఎదురుగా పాడుబడ్డ ఇంటి సందులో ఏదో చూసి కేకలు పెడతాడు. నీలం, గోపీ వెళ్ళి చూస్తే భీకరంగా కూతురు కన్పిస్తుంది. దీంతో విశ్రాంతి పడి ఫస్టాఫ్ పూర్తవుతుంది.

3. ఫస్టాఫ్ లోనే సమస్యలు

    ఈ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో సమస్యలున్నాయి. మొదటి పదినిమిషాలు పూర్వ కథ తీసేస్తే, పైన చెప్పుకున్న బిగినింగ్ విభాగం ఇంటర్వెల్ వరకూ దాదాపు గంట సాగుతుంది. ఈ గంటలో పాత్రల పరిచయాల మొదటి 40 నిమిషాల్లో, 20 నిమిషాలు ప్రేమ ట్రాకే తీసుకుంటుంది. స్టార్ సినిమాల నుంచి దిగుమతి అయిన ఈ టెంప్లెట్ ప్రేమ ట్రాకు నుంచి నుంచి ఇంకా విముక్తి లభించడం లేదు ప్రేక్షకులకి. ఇంకెన్నిసార్లు హీరోయిన్ని ప్రేమలో పడేసే అవే హీరో చేష్టలు మొదలు పెట్టి చూపిస్తూ పోతారో తెలీదు. వీటిని ఎవరు ఎంజాయ్ చేస్తున్నారిప్పుడు.

ఈవారం విడుదలైన అలిపిరికి అల్లంత దూరంలో నూ ఇదే అరిగిపోయిన టెంప్లెట్. సినిమా కేవలం ప్రేమ కథే అయితే వేరు, సినిమా ప్రేమ కథ కానప్పుడు ప్రేమ కథే అన్నట్టుగా ఫస్టాఫ్ లవ్ తో ఎలా నింపేస్తారో తెలీదు. ఆల్రెడీ ప్రేమలో వున్నట్టు హాఫ్ వేలో చూపిస్తే పోయేదానికి.

ఈ నెల తమిళ హిట్ లవ్ టుడే (బడ్జెట్ 5 కోట్లు- బాక్సాఫీసు 70 కోట్లు) లో ఇలాగే చూపించారు. ఆల్రెడీ ప్రేమలో వున్న హీరో హీరోయిన్లతోనే సినిమా ప్రారంభమవుతుంది. ఇది ప్రేమ కథే అయినా ఎలా ప్రేమలో పడ్డారో టెంప్లెట్ జోలికి పోకుండా దాన్ని కట్ చేసి- హాఫ్ వేలో ఆల్రెడీ ప్రేమలో వున్నట్టు చూపించేసి, కాన్షష్ గా సినిమాల్ని చూసే ప్రేక్షకుల్ని రక్షించాడు దర్శకుడు. 

ఇక 40 వ నిమిషంలో కూతురికి దెయ్యమావహించడంతో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన ప్రారంభమవుతుంది. ఈ కల్పన తప్పుగా  రివర్స్ చేసి చూపించారు. అంటే 40 వ నిమిషంలో కూతురికి దెయ్యంపట్టినట్టు ముందే చూపించేసి- తర్వాత డాక్టర్, పీర్ బాబా, తావీజు, ఆత్మ, మీర్ తాజ్ చావు, స్కూల్లో కూతురి ముక్కు నుంచి రక్తం, బ్రాస్లెట్, మసూదా పేరు, కూతురి భీకర రూపం వగైరా చూపించుకుంటూ పోయారు. ఇది ఉద్దేశపూర్వకంగా ప్రయోగం కోసం చేసి వున్నట్టయితే బెడిసి కొట్టింది.

ఎప్పుడైనా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన అంచెలంచెలుగా చేసుకుపోతారు. హార్రర్ కైనా ఇంతే. దెయ్యం పట్టినట్టు చూపించాలంటే ముందు దాని సింప్టమ్స్ చూపించుకుంటూ వస్తారు. క్లాసిక్ ఎక్సార్సిస్ట్ లో తల్లికి బీరువాలో శబ్దాలు వినిపిస్తాయి. కూతురు తనకి లేని ఫ్రెండ్ గురించి చెప్తుంది. తర్వాత చర్చిలో మేరీమాత విగ్రహం పాడు చేసి కన్పిస్తుంది. ఆ తర్వాత తల్లి ఏర్పాటు చేసిన ఒక విందులో కూతురు మూత్రం పోసుకుంటుంది. కూతుర్ని మంచం మీద పడుకోబెడితే మంచం వూగిపోతుంది. చర్చి ఫాదర్ కి చనిపోయిన తన తల్లి వచ్చి వికృతంగా కన్పిస్తుంది. కూతురు వయోలెంట్ గా మారుతుంది. డాక్టర్ కి చూపిస్తే పాజిటివ్ రిపోర్టు వస్తుంది.

ఇలా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన అంచెలంచెలుగా చేసుకొస్తూ- చివరిగా తల్లికి స్నేహితుడిగా వున్న ఒకడ్ని కూతురు కిటికీ లోంచి విసిరి చంపేయడంతో దెయ్యం పట్టిందన్న నిర్ధారణతో అప్పుడు సమస్యని ఏర్పాటు చేస్తారు. మసూద లో మనిషి మైండ్ రిసీవ్ చేసుకునే ఈ సహజ కథన ప్రక్రియని రివర్స్ చేసి - ముందు కూతురికి దెయ్యంపట్టినట్టు సమస్యని ఏర్పాటు చేసేసి- తర్వాత కారణాలు చూపించుకొచ్చారు. దీంతో బిగినింగ్ విభాగం చెదిరిపోయి ఫస్టాఫ్ విషయం లేక, కథే ప్రారంభం కాక - కథేమిటో అర్ధం గాకుండా పోయింది.

ఓపెనింగ్ బ్యాంగ్ కావచ్చు, పూర్వ కథ కావచ్చు - అక్కడ అర్ధోక్తిలో వదిలేసిన విషయాన్ని (హుక్ ని) ఇంటర్వెల్లో కనెక్ట్ చేసి ఇంటర్వెల్ బ్యాంగో మరోటో వేస్తే కథనం పాయింటుకొచ్చి అర్ధమవుతుంది. ఓపెనింగ్ ని ఇంటర్వెల్లో కనెక్ట్ చేయకుండా సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో చెప్తామంటే అప్పటిదాకా కథేమిటో అర్ధం గాదు!

4. ఆర్డర్ సవరిస్తే థ్రిల్
    కూతురికి దెయ్యం పట్టినట్టు ముందు వేసిన సీను (40వ నిమిషం) ఇంటర్వెల్ కి ముందు వేస్తే సమస్య సాల్వ్ అవుతుంది. 40 వ నిమిషం నుంచి సింప్టమ్స్ చూపించుకొస్తే సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన శరీగ్గా వుంటుంది. బ్రాస్లెట్, ఎవరితో మాట్లాడక పోవడం, ముక్కు నుంచి రక్తం, వింత ప్రవర్తన, డాక్టర్, పీర్ బాబా, తావీజు తీసేయడం, మీర్ తాజ్ చావు, మసూదా పేరు, అప్పుడు కూతురికి దెయ్యంపట్టినట్టు దెయ్యం మాటలు (నా శక్తి గురించి తక్కువ అంచనా వేశారు’)... ఇలా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చూపించి, వీటన్నిటి పర్యవసానంగా- పూర్వ కథలో దారుణ హత్యకి గురయిన యువతిని  ముందుకు తీసుకొచ్చి, ఇంటర్వెల్లో మసూదాబీ ప్రేతాత్మగా సమస్యని స్థాపిస్తే, ఆమె వార్ డిక్లేర్ చేస్తూ కాన్ఫ్లిక్ట్ సృష్టిస్తే, సరైన వరస!

పై విధంగా ఆర్డర్ వుంటే ఓపెనింగ్ ఇంటర్వెల్ దగ్గర కనెక్ట్ అయి విషయం అర్ధమవుతుంది. కానీ ఇంటర్వెల్లో ఏం చూపించారు? ఎవరో ఫ్లాట్ యజమాని కొడుకు భీకరరూపంలో నాజియానే చూస్తే ఇంటర్వెల్. దీంతో సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన ఏదో చేసుకొచ్చినా సమస్య ఎక్కడ ఏర్పాటయింది? సమస్య నాజియాతో కాదుగా? కథ ప్రకారం ఇంటర్వెల్లో ఏ సీను వేసి హార్రర్ ఎలిమెంటుకి ఎలివేషనివ్వాలి? నీలం ఫ్లాట్ యజమాని కొడుక్కి దెయ్యంలా నీలం కూతురే కన్పిస్తే అది ఎలివేషనా? ఇది కూడా ఇంకో రిపీట్ సీనే. రిపీట్ సీనే ఇంటర్వెల్లో వేసి టెన్షన్ గ్రాఫు పెంచగలరా? కథ కొచ్చి ఖలనాయికని దాస్తున్నాడెందుకు దర్శకుడు? కాన్ఫ్లిక్ట్ ఎవరితో? కూతురికి పట్టిన దెయ్యంతో. మరి ఆ మసూదాబీ దెయ్యాన్ని ఇప్పుడు తెర మీద ప్రత్యక్షం చేసి- కాన్ఫ్లిక్ట్ తో హార్రర్ కి ఎలివేషనిస్తూ ఇంటర్వెల్ వేయాలిగా? ఇంటర్వెల్లో అయినా కాన్ఫ్లిక్టే లేకపోతే ఎలా?

ఎక్సార్సిస్ట్ లో మొదట్లో మిస్టీరియస్ గా చూపించిన ఫుజుజు విగ్రహం లోని దుష్టాత్మే బాలికని ఆవహించిందన్న విషయం ఎక్కడా దాచలేదు. కథ కొచ్చి ఖలనాయకుడ్ని దాచలేదు. ఎండ్ సస్పెన్స్ చేయలేదు. శత్రువెవరో తెలిస్తే దానికి తగ్గ టెన్షన్ అనుభవిస్తాం, తెలియక పోతే బీపీ పడిపోయి పడుకుంటాం. ఇక దెయ్యమే వచ్చి లేపినా లేవం. సినిమా ప్రారంభంలో వేసిన 1989 హింసాత్మక ఘటనలు దేనికి జరుగుతున్నాయో చెప్పేయకుండా సస్పెన్స్ లో పెట్టేశారు. దీంతో మసూదాబీ కూడా తెలియకుండా పోయింది. ఈ సస్పెన్స్ ని సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో విప్పడానికి అట్టి పెట్టుకున్నారు. కానీ ఈ సస్పెన్స్ ని విప్పాల్సింది సూచనా ప్రాయంగానైనా ఇంటర్వెల్లోనే- దుష్టాత్మగా మారిన మసూదాబీ పాత్రతోనే. అప్పుడే కథ అర్ధమవుతుంది. లేకపోతే ఏమీ అర్ధంగాక ఇంటర్వెల్ తేలిపోతుంది. అందుకని ఇంటర్వెల్లో మసూదాబీ ప్రేతం ఫుల్ రేంజిలో ప్రత్యక్షమైతే సమస్య ఏర్పాటయినట్టు. ప్లాట్ పాయింట్ వన్ వచ్చినట్టు. ప్రధాన పాత్రకి ఇప్పుడేం చేయాలో గోల్ ఏర్పాటై, కాన్ఫ్లిక్ట్ తో కథ ప్రారంభమైనట్టు.

కనుక సినిమాలో వున్నట్టుగా ఇంటర్వెల్లో అది బిగినింగ్ కి ప్లాట్ పాయింట్ వన్ కానప్పుడు, బిగినింగ్ ఫస్టాఫ్ లో ఇంకా ముగియనట్టే. అంటే సెకండాఫ్ లో కూడా బిగినింగ్ కొనసాగితే గానీ ప్లాట్ పాయింట్ వన్ రాదన్న మాట. ఇలా ఫస్టాఫ్ లో చేసిన పొరపాట్లకి స్ట్రక్చర్ చెదిరిపోయింది. కాన్షస్ -సబ్ కాన్షస్ -ఇగో మోడల్ తో వుండే స్క్రీన్ ప్లే అనే వ్రాతప్రతి వరస తప్పింది.

5. ట్రైలర్ మూమెంట్స్ మిస్

    ఈ కాన్ఫ్లిక్ట్ తో తలపడే ఇద్దరు ప్రధాన పాత్ర ధారులున్నారు- నీలం, గోపీ. ఎక్సార్సిస్ట్ లో ఇద్దరు చర్చి ఫాదర్లు ప్రధాన పాత్రధారులుగా వున్నట్టు. నీలం, గోపీల గోల్ కూతురికి దెయ్యం నుంచి విముక్తి కల్గించడం. అయితే సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనని ట్రైలర్ మూమెంట్స్ తో చూపించక పోవడంతో కూడా ఫస్టాఫ్ హార్రర్ థ్రిల్ లేకుండా పోయింది. ట్రైలర్ మూమెంట్స్ అంటే, ట్రైలర్ కోసం ఏ ఎంపిక చేసిన షాట్లు/ సీన్లు కట్ చేస్తారో అలాటి థ్రిల్లింగ్ - హార్రర్ విజువల్స్ కథలో వుండాలి.

ఇక ప్లాట్ డివైసుల నిర్వహణ కూడా సరిగా లేదు. కూతురికి తావీజు కట్టాక ఒక టీచరైన నీలం కూతుర్ని అబ్సర్వేషన్ లో వుంచకుండా, కూతురు తావీజు తీసేసిన విషయమే గమనించకుండా వుంటుంది. చేతికున్న బ్రాస్లెట్ గురించి అడిగినప్పుడు తావీజు లేని విషయం చూడదు. మొదట్లోనే కూతురు దెయ్యం పట్టి నా శక్తి గురించి తక్కువ అంచనా వేశారు అన్నప్పుడు, ఎవరు?’ అంటే వాడే అన్నప్పుడు - ఎవరి గురించి మాట్లాడుతోందని తీవ్రంగా ఆలోచించదు. తెలుసుకోవడానికి ప్రయత్నించదు. మంచం పక్కన మసూదాబీ అని రాసి వుంటే ఇదెవరు రాశారని కూడా అడగదు. ఇలా ప్లాట్ హోల్స్ వదుల్తూ పాత్రచిత్రణ చేయడం సరైంది కాదు.

అసలు మసూదాబీ అని వారు రాశారు? దెయ్యమే రాసి వుంటుంది. ఎందుకు రాసి వుంటుంది? తర్వాత అది పీర్ బాబా చూడాలనీ, చూసి తన ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలనీ కథ నడవడం కోసం రాసి వుంటుందా? సిల్లీగా లేదూ? ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళడానికి లీడ్ కోసం ఇంతకంటే మంచి మార్గం దొరక లేదా?

రెండోది-  నా శక్తి గురించి తక్కువ అంచనా వేశారు అన్నప్పుడు, ఎవరు?’ అంటే వాడే అన్నప్పుడు -దెయ్యం తను రివెంజీతో వున్నట్టు చెప్పేసినట్టే. నాజియా తావీజు తీసేశాక, పూర్వ కథ క్యారక్టర్ మీర్ తాజ్, నాజియాని చూస్తున్నప్పుడు - దూరం నుంచి దెయ్యం చూస్తుంది. ఆమెని చూసి మీర్ తాజ్ రక్తం కక్కుకుని చచ్చిపోతాడు. పూర్వ కథలో ఇతనే కదా తనని దారుణంగా చంపింది? ఇప్పుడతను చచ్చాక రివెంజీ తీరిపోయినట్టేగా? ఇంకెందుకుండాలి దెయ్యం? అంటే కథ అయిపోయినట్టేగా?

ఎవరో మీర్ తాజ్ వచ్చి నాజియాని ఎందుకలా చూశాడు? దెయ్యం తనని చంపడానికి సెటప్ కోసమేనా? ఇంటలిజెంట్ మేకింగ్ చేసినప్పుడు దానికి తగ్గ ఇంటలిజెంట్ రైటింగ్ కూడా అవసరమే. కథకకి అతకని హార్రర్ దృశ్యాలతో భయపెట్టాలని ప్రయత్నించడం సరైంది కాదు. అసలు దెయ్యమనే నమ్మకమే ఇల్లాజికల్. అలాగని దాంతో కథ కూడా ఇల్లాజికల్ గా వుండడం బావుండదు.
(మిగతా రేపు)

—సికిందర్