రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, నవంబర్ 2022, బుధవారం

1252 : స్క్రీన్ ప్లే సంగతులు-2


        క కథా నడక నియమాలకి విరుద్ధంగా, ఫస్టాఫ్ లో ముగియాల్సిన బిగినింగ్ విభాగమింకా సెకండాఫ్ లో కంటిన్యూ అవుతూ, కూతుర్ని హాస్పిటల్ కి తీసికెళ్తారు నీలం, గోపి. వెంట అల్లావుద్దీన్ వుంటాడు. హాస్పిటల్లో తిరగబడి బీభత్సం సృష్టిస్తుంది కూతురు. అల్లావుద్దీన్ ఆమె బ్రాస్లెట్ ఏమిటాని ముట్టుకోబోయి ఎగిరి అవతల పడతాడు. డాక్టర్ వచ్చి గట్టిగా తిడతాడు. ఇక పీర్ బాబాకే చూపించాలని చెప్పకుండా హాస్పిటల్నుంచీ కూతుర్ని తీసికెళ్ళి పోతారు. ఇప్పుడు హవేలీలో పీర్ బాబా ఎంటర్ అవుతాడు. ఒక రోగికి ట్రీట్ మెంట్ చేస్తాడు. నీలం చెప్పింది విని- క్షుద్ర పూజ చేయాలనీ, కూతురితో రక్త సంబంధమున్న ఇద్దరు మగాళ్ళు కావాలనీ అంటాడు. నీలం ఇరుకున పడుతుంది.    
 
        క పీర్ బాబా ఇంటికొచ్చి కూతుర్ని పరీక్షిస్తాడు. అప్పుడు మంచం పక్కన మసూదాబీ అని రాసి వుండడం చూసి, ఎదురు సందులో పాత ఇంటివైపు చూస్తాడు. ఇలా ఇప్పుడు సెకెండాఫ్ 15 వ నిమిషంలో బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడి, గోల్ తో కథ – అంటే మిడిల్ ప్రారంభమవుతుంది! ఇది బలహీన ప్లాట్ పాయింట్ వన్ అనాలి. అంటే బిగినింగ్ విభాగం స్థానభ్రంశం చెంది, సెకండాఫ్ నాక్రమిస్తూ 15 వ నిమి

1. విజువల్ కాన్ఫ్లిక్ట్ మిస్
పై ప్లాట్ పాయింట్ వన్ లో విజువల్ కాన్ఫ్లిక్ట్ లేకపోవడంతో బలహీన ప్లాట్ పాయింట్ వన్ అయింది. అంటే ఇప్పుడైనా మసూదాబీ దెయ్యం ప్రత్యక్షమై తిరగబడలేదు. దెయ్యాలకి మంత్రగాళ్ళని మించిన ప్రత్యర్ధులు లేరు. పీర్ బాబా వచ్చి జోక్యం చేసుకుంటూ వుంటే ఇక ముందుకొచ్చి మీద పడకుండా వుండదు. మీదపడి వుంటే ఇప్పుడైనా ఇంటర్వెల్లో మిస్సయిన ప్రత్యక్ష కాన్ఫ్లిక్ట్ పుట్టేది. బలమైన ప్లాట్ పాయింట్ వన్ గా వుండేది విజువల్ నేరేషన్ తో.

కానీ కథకుడు బలహీనంగా వర్బల్ నేరేషన్నే ఎంచుకున్నాడు. ఇక్కడ పీర్ బాబా లాజిక్ కూడా అర్ధంగాదు. మసూదాబీ అని రాసి వున్నంత మాత్రాన అది దెయ్యమేనని ఎందుకు అనుమానించాలి? నీలంని అడగాలి. ఆ అక్షరాలెలా వచ్చాయో నీలం కూడా చెప్పలేక పోతే, మసూదాబీ ఎవరోకూడా తెలీదంటే, అప్పుడు కూడా అనుమానం రాకూడదు. మసూదాబీ కూతురి ఫ్రెండ్ కావొచ్చు. కూతురే ఆ పేరు రాసుకుని వుండొచ్చు. ఆ కూతుర్నుంచి కూడా విషయం రాబట్టడానికి ప్రయత్నించాలి.

కానీ ఆ పేరు చూడగానే పీర్ బాబా అక్కడే కూర్చుని అనుమానంగా తలతిప్పి కిటికీలోంచి పాడుబడ్డ ఇంటి వైపు ఎలా చూస్తాడు? అక్కడో పాడుబడ్డ ఇల్లుందని ముందే తెలుసా? తెలియక పోతే అక్షరాల మీంచి నేరుగా ఫోకస్ తీసికెళ్ళి ఇంటి మీద ఎలా వేస్తాడు? త్వరత్వరగా జరిగిపోవాలని కదా వెర్బల్ నేరేషన్ని కూడా ఇలా డీలా చేశాడు కథకుడు.

ఇక్కడ కూతురికి రిలీఫ్ కోసం సరదాగా మాట్లాడతాడు పీర్ బాబా. నాజియా హసన్ ఫేమస్ సింగర్ పేరు పెట్టుకున్నావా అని. దీనికి నీలం కల్పించుకుని ఔనని చెప్తుంది. దీంతో టాపిక్ కట్ అవుతుంది. ఇలా ప్రేక్షకులకే మర్ధమవుతుంది? నాజియా హసన్ పాపులర్ పాకిస్తానీ పాప్  సింగర్. 1980 లో హిందీ ఖుర్బానీ లో ఆమె పాడిన ఆప్ జైసా కోయీ మేరే జిందగీమే ఆయే, తో బాత్ బన్ జాయే అప్పట్లో సెన్సేషనల్ హిట్. ఉత్తమ గాయనిగా ఫిలింఫేర్ అవార్డు తీసుకుంది. ఈ పాటని సంగీత దర్శకుడు బిద్ధూ లండన్లో రికార్డు చేశాడు. అప్పుడు నాజియా వయస్సు 15 యేళ్ళు. 2000 లో క్యాన్సర్ తో మరణించింది. కథకుడు తను ఫీలైన ఆనందం తనొక్కడే ఫీలై రాసుకుంటూ పోతే ఎలా? ఇప్పటి ప్రేక్షకులకి తెలిసేలా వివరంగా రాసి ఫీలింగులు పంచుకోవాలిగా? బ్యాక్ గ్రౌండ్ లో ఆ సాంగ్ ప్లే చేయొచ్చుగా? 

ఇక అసలు దెయ్యం తన పేరు రాయడమే అసమంజసమని గత వ్యాసంలో చెప్పుకున్నాం. అలా రాశాక ఇప్పుడొచ్చి పీర్ బాబాని ఎదుర్కొక పోవడం దెయ్యం చేస్తున్న ఇంకో తప్పు. ఇక్కడ పీర్ బాబా కూతురి రూపంలో వున్న మసూదాబీ దెయ్యంతో దాడికి గురై వుంటే ఇప్పుడైనా -విజువల్ కాన్ఫ్లిక్ట్ తో కథ మొదలై అర్ధవంతంగా వుండేది.

ఇంకోటేమిటంటే, దెయ్యానికి విరుగుడుగా ప్రయోగ సాధనాలు కూడా సీను కొకటి చొప్పున చూపించడం కన్ఫ్యూజన్ ని సృష్టిస్తోంది. హాస్పిటల్లో బ్రాస్లెట్ ని ముట్టుకోబోయి అల్లావుద్దీన్ ఎగిరవతల పడ్డాక- ఆ బ్రాస్లెట్ ని తీసి పారేస్తే దెయ్యం కూడా వదిలిపోతుంది. సింపుల్. పాడుబడ్డ ఇంటి ముందు దొరికిన ఆ బ్రాస్లెట్ కూతురు ధరించడం వల్లే అందులో వున్న మసూదా దెయ్యం పూనినట్టు తర్వాత ఓపెనవుతుంది. అలాంటప్పుడు దాన్ని తీసి పారేస్తే దెయ్యం గియ్యం వదిలి పోతాయి. సెకండాఫ్ లో తర్వాత బ్రాస్లెట్ రహస్యం తెలిశాక కూడా, దాన్ని తీయొద్దు- సమయం వచ్చినప్పుడు తీద్దామంటాడు బాబా. ఎందుకు? కథ నడవడం కోసమా?

ఇక క్షుద్ర పూజలు చేయాలనీ, కూతురితో రక్త సంబంధమున్న ఇద్దరు మగాళ్ళు కావాలనీ ఇంకో ప్రయోగ సాధనం చెప్తాడు. ఎందుకు? వాళ్ళని అడ్డంగా బలి ఇవ్వడానికా? తర్వాత ఈ పూజలేమవుతాయో- దీని గురించి వుండదు.

తర్వాత నీలం, గోపీలకి ఒక చాదర్ ఇచ్చి, మసూదాబీ కంకాళం మీద కప్పమంటాడు. చివరికిదే జరుగుతుంది, విజయవంత మవుతుంది. మహేష్ భట్ తీసిన రాజ్ లో- దహన సంస్కారాలు జరగని ఆత్మకి దహన సంస్కారాలు జరపడమే మార్గమని మంత్రగాడు తేల్చి, పాతి పెట్టిన శవం మీద పెట్రోలు పోసి నిప్పంటించేసి హార్రర్ కథ ముగించినట్టే ఇది కూడా!

ఈ చాదర్ అప్పట్లో మీర్ తాజ్ కి ఇంకో పీర్ బాబా ఇచ్చాడు (ఇది సినిమా ప్రారంభంలో పూర్వ కథలో చూపిస్తారు). మీర్ తాజ్ చాదర్ తో మసూదా ఆత్మని నిర్వీర్యం చేసే ముందే చనిపోయాడు. అలాంటప్పుడు విరుగుడుగా ఆ చాదర్ ఒక్కటే కథలో వుంటే కన్ఫ్యూజన్ వుండదు. దీంతో కూడా ఆగకుండా సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ చెప్పే క్యారక్టర్ గోపీకి మసూదాబీ వాడిన కత్తి ఇస్తుంది. ఇది మళ్ళీ ఇంకో కన్ఫ్యూజుడు సాధనం! కథకుడు ఏం చెప్పాలనుకున్నాడో తనే కన్ఫ్యూజన్లో వున్నట్టుంది.

2. ఇప్పుడు మిడిల్ బిజినెస్!

పీర్ బాబా మంచం పక్కన మసూదా పేరు చూడడంతో ప్లాట్ పాయింట్ వన్ తో మిడిల్ ప్రారంభమయ్యాక- ఆ ఇంటి దగ్గరికెళ్ళి చూసి వస్తాడు. ఇలా మిడిల్ విభాగం బిజినెస్ ప్రారంభమవుతుంది. మిడిల్ బిజినెస్ - అంటే ప్రత్యర్ధి పాత్రతో సంఘర్షణ- ప్రతీకాత్మకంగా ఇగో సబ్ కాన్షస్ మైండ్ లోకి ఎంటరై- సమస్య సాధనకి యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లేకి అంకురార్పణ చేయడం. ఎప్పుడో ఫస్టాఫ్ లో ప్రారంభమవాల్సిన ఈ మిడిల్ బిజినెస్ దారితప్పి వచ్చి ఇక్కడ ప్రారంభమవుతోంది. ఇందుకే ఫస్టాఫ్ లో ఏమీలేని లేదని ఫీలవుతున్నారు ప్రేక్షకులు.

లాయర్ దగ్గర ఇంటి వివరాలు సేకరిస్తాడు గోపీ. ఆ ఇల్లు మీర్ తాజ్ కీ, అతడి తమ్ముడికీ మధ్య కోర్టు వివాదంలో వుందని బాబాకి చెప్తాడు. మసూదాబీ ఫోటో కూడా ఇస్తాడు. ఇక మధ్య మధ్యలో దెయ్యం పూనిన కూతురు ఎటాక్ కూడా చేస్తూంటుంది. కత్తి తీసుకుని గోపీని పొడిచేస్తుంది. దీంతో అసలే భయస్థుడైన గోపీ ఇక నీలంకి గుడ్ బై చెప్పేసి పోతాడు. గోపీని ఆఫీసులో కొలీగ్ మొదట్నుంచీ మందలిస్తూంటాడు. వాళ్ళు నీకేమవుతారని వాళ్ళ కోసం రిస్కు తీసుకుంటున్నావని.

ఎప్పుడైనా మిడిల్ సంఘర్షణలో అస్మదీయులు దూరమవడమనే మలుపు కథలో బాధాకర పరిస్థితిని సృష్టిస్తుంది. తర్వాతేంటి- అన్న సస్పెన్సుతో. ఇప్పుడు నీలం ఏం చేస్తుంది ఒంటరిగా? ఒక మాంటేజ్ సాంగ్ వేసి- అటు తల్లీ కూతుళ్ళ పరిస్థితి, ఇటు వాళ్ళని గమనిస్తున్న గోపీ గిల్టీ ఫీలింగ్ -వీటితో సాంగ్ పూర్తయ్యాక మనసు మార్చుకుని వచ్చేస్తాడు. అడ్డుకున్న కొలీగ్ కి గాంధీ సూక్తి చెప్తాడు.  

వచ్చేసి, నీలం భర్త అబ్దుల్ ని కలిసి కూతుర్ని కాపాడుకోవడానికి రమ్మంటాడు ( రక్త సంబంధమున్న ఇద్దరు మగాళ్ళు కావాలి). అబ్దుల్ గోపీని అవమానించి, డబ్బిస్తేనే  వస్తానని వెళ్ళ గొడతాడు. గోపీ బాబా ఆదేశంతో చిత్తూరు జిల్లా గ్రామాని కెళ్తాడు. అక్కడ ఒక కన్ను పోయిన నర్గీస్ వుంటుంది. ఈమె మీర్ తాజ్ తమ్ముడి కూతురు. ఈమెనడిగి మసూదా గురించి తెలుసుకుంటాడు.
        
ఈ ఫ్లాష్ బ్యాక్ లో చెరకు పండించే, గుర్రాలమ్మే మీర్ తాజ్ అన్నదమ్ముల ఉమ్మడి కుటుంబం. ఈ కుటుంబంలో చిన్న తమ్ముడు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగంలో చేరి ఉద్ధరిస్తాడనుకుంటే, మసూదాబీ అనే ఆమెని పెళ్ళాడి తీసుకొస్తాడు. హైదరాబాద్ కి చెందిన మసూదా బురఖాలో వుంటుంది. ఆమె ఎవ్వరికీ నచ్చదు. మీర్ తాజ్ పెద్ద తమ్ముడితో సరసాలాడుతుంది. మందలిస్తే తమ్ముడు వూరుకోడు. ఇంతలో వూళ్ళో మాయ రోగాలొచ్చి చచ్చి పోతూంటారు జనం. మసూదాబీ చేతబడి చేస్తూంటుంది. దీంతో కుటుంబం ఎదురు తిరిగితే, చాలా మందిని చంపేసి పారిపోతుంది. ఆమెని హైదారాబాద్ వచ్చి పట్టుకుంటాడు మీర్ తాజ్. ఆమె వుంటున్న భవనంలోనే చెట్టుకి కట్టేసి అనుచరుల సాయంతో దారుణంగా పొడిచి చంపేస్తాడు.  

ఒంటి కన్నునర్గీస్ ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పి, ఒక గుహలో చాదర్ వుంటుంది, తీసికెళ్ళ మంటుంది. మసూదాబీ వాడిన కత్తి కూడా ఇస్తుంది. ఇలా బాబా దగ్గరికి తిరిగొస్తాడు గోపీ. బాబా నీలం, గోపీలకి చాదర్ ఇచ్చి, వెళ్ళి ఆ వూళ్ళో మసూదా సమాధి తవ్వి, ఆమె ఎముకల మీద చాదర్ కప్పేయ మంటాడు. దీంతో మిడిల్ విభాగం పూర్తయి, ప్లాట్ పాయింట్ 2 వస్తుంది.

3. కొసరు మిడిల్ తో ఎసరు  

పై మిడిల్ 50 నిమిషాలుంటుంది. అయితే ఇందులో ఫ్లాష్ బ్యాక్ 17 నిమిషాలుంటుంది. ఫ్లాష్ బ్యాక్ మిడిల్ కిందికి రాదు. లీనియర్ గా చూస్తే ఇది బిగినింగే. నాన్ లీనియర్ లో ఈ బిగినింగ్ మిడిల్ మధ్యలో వచ్చింది. కనుక ఫ్లాష్ బ్యాక్ తీసేస్తే మిడిల్ కి మిగిలింది 33 నిమిషాలే. రెండు గంటల 40 నిమిషాల సినిమాలో మిడిల్ 33 నిమిషాలే వుందంటే ఎంత కథా బలంతో వున్నట్టు. మనబుర్రలో సబ్ కాన్షస్ మైండ్ 90 శాతానికి పైగా వుంటే, దీని నమూనా అయిన మిడిల్ 13 శాతమే తేలుతోంది ఈ స్క్రీన్ ప్లేలో! 90 శాతం సబ్ కాన్షస్ మైండ్ వున్న వాళ్ళం 13 శాతం కథనెలా చూస్తామబ్బా!

స్ట్రక్చర్ స్కూలు కాకుండా క్రియేటివ్ స్కూలుకి చెందిన కథకులు స్క్రీన్ ప్లే మొత్తంలో వున్నది కథే అనుకుంటారు. ఇక్కడొచ్చింది చిక్కు. క్రియేటివ్ స్కూలుకి శతకోటి దండాలు పెట్టాలి. బిగినింగ్ 25% మిడిల్ 50% ఎండ్ 25% వుంటే మైండుకి సినిమా పడుతుంది.

        ఈ మిడిల్లో మసూదాబీ ఎందుకు చేతబడి చేస్తోందో చెప్పలేదు. ఇదొక లూప్ హోల్. ఫ్లాష్ బ్యాక్ లో హార్రర్ సీన్లు బాగావేశారు. కానీ లాజిక్ వుండాలి. వూళ్ళో చేతబడి చేసి అంత మందిని చంపాల్సిన అవసరం ఏమొచ్చిందామెకి.

4. ఎండ్ కి సాగతీత

ఇక బాబా సలహాతో చాదర్ కప్పడానికి నీలం, గోపీ వెళ్ళడంతో క్లయిమాక్స్ (ఎండ్) ప్రారంభమవుతుంది. బాబా తను చెప్పిన క్షుద్ర పూజ చేస్తానని వేరే చోట వుంటాడు. చాదర్ వున్నాక క్షుద్ర పూజ దేనికి? చెప్పిన రక్త సంబంధమున్న ఇద్దరు మగాళ్ళు లేకుండా క్షుద్ర పూజలేల! అది క్షుద్ర పూజలా వుండదు. నమాజ్ చదువుతున్నట్టు వుంటుంది.

పీర్ బాబా పాత్ర చూస్తే అతను అనవసరంగా వున్నాడనిపిస్తుంది. దెయ్యానికి విరుగుడుగా వేరే బాబా ఇచ్చిన చాదర్ వుండనే వుంది. ఇక పీర్ బాబాతో పనే లేదు.  ప్రాణాలు పోతున్నంత పనీ జరిగి, చచ్చీ చెడీ దెయ్యంతో పొరాడి నీలం, గోపీ తామే చాదర్ కప్పేసి కథ ముగించేస్తారు. పీర్ బాబా చేసిందేమీ లేదు. చాదర్ వేరే బాబా ఇచ్చాడని ఇగో ఫీలయ్యాడేమో, దాన్ని కప్పడానికి రాలేకపోయాడు. లేకపోతే సినిమా రూల్స్ ప్రకారం చాదర్ కప్పే యాక్షన్లో తనే పాల్గొని ప్రేక్షకుల్ని సంతృప్తి పర్చే వాడు.

ఈ చాదర్ కప్పే ఎపిసోడ్ చాలా సాగదీయడంతో హార్రర్ ఎఫెక్ట్ మాయమై సహన పరీక్ష పెడుతుంది. 35 నిమిషాల క్లయిమాక్స్ భరించడం కష్టమే. సుఖాంతమయ్యాక, మసూదాబీ మళ్ళీ వచ్చినట్టు సీక్వెల్ కోసమన్నట్టుగా ముగించారు. మూఢ నమ్మకాల చేతబడి దీంతో పూర్తి కాలేదేమో.

కొత్త దర్శకుడు సాయికిరణ్ కి మంచి విజువల్ సెన్స్, టెక్నికల్ బ్రిలియెన్స్ వున్నాయి. స్క్రిప్టు మీద పట్టు అంతగా లేదు. సెకండాఫ్ లో బిగినింగ్-మిడిల్- ఎండ్ మూడూ చూపించే పని ఇక ముందు చేయకుండా, మిడిల్ ని ఫస్టాఫ్ నుంచే చూపించుకొస్తే బావుంటుంది.

—సికిందర్