రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, సెప్టెంబర్ 2017, బుధవారం

513 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు - 16

    సీను చేసే పనులు రెండు అని చెప్పుకున్నాం. ఒకటి,  పాత్ర గురించి కొత్త విషయాలు చెప్పడం; రెండు, సీనుని ముందుకి నడిపించడం. పాత్ర గురించి పది విషయాలు చెప్పినా ఫర్వాలేదు. ఎందుకంటే వాటి బిజినెస్ సీనుని  ముందుకి నడిపించడం కాదు. సీనుని ముందుకి నడిపించడానికి కథకి సంబంధించిన సమాచారమే కావాలి. ఈ సమాచారం సీను కొక్కటి మాత్రమే వుండాలి. రెండు మూడు సమాచారాలిస్తే సీను ఎటు పోవాలో అర్ధం కాదు. సొనాలిక ఫోన్ చేసి మాయాంక్ తో- వచ్చేటప్పుడు నీ సర్టిఫికెట్లు పట్రా  – అంటే, తర్వాతి సీన్లో మాయాంక్ సర్టిఫికేట్లతో  రావడానికి ఇది లీడ్ లేదా సమాచారమవుతుంది. తర్వాతి సీనులో  సర్టిఫికెట్లతో వస్తే ఏం జరుగుతుందోనన్న ఆసక్తి ఏర్పడుతుంది. ఇలాకాక సర్టి ఫికెట్లు, కాఫీ పౌడరు, సపోటాలు పట్రా అంటే, మర్చిపోయా- అగ్గిపెట్టె కూడా కావాలి- అంటే  సర్టిఫికెట్ల ప్రాధాన్యం తగ్గిపోతుంది. తర్వాతి సీను దేని గురించో కూడా స్పష్టత వుండక ఆసక్తి కల్గించదు. ఆసక్తి కల్గించే దృష్టితోనే సమాచారమివ్వాలి, అదీ పాయింటెడ్ గా ఒకే సమాచార  మిచ్చినప్పుడే ఆసక్తి పుట్టిస్తుంది. ఐతే ఒక్కోసారి సీనులో రెండేసి సమాచారాలు కూడా వుంటాయి. ఈ రెండేసి  సమాచారాలు సీను సాదాగా వుండకుండా, మలుపులు (ట్విస్టులు) సృష్టించడానికి ఉపయోగ పడతాయి. అంతిమంగా బాబు లాంటి ఒక్క సమాచారమే సీనుని ముందుకి నడిపిస్తుంది. అంటే మొదటి సమాచారాన్ని తలదన్నేట్టు రెండో సమాచారం ట్విస్టు ఇవ్వాలన్న మాట. ఇది  ‘బ్లడ్ సింపుల్’  లో ఎలా ప్లే అయిందో చూద్దాం!


          ‘బ్లడ్ సింపుల్’ గత సీనులో  విస్సర్ ఫోటోలనికాలుస్తున్నప్పుడు సిగార్ లైటర్ ని వెతుక్కుని కంగారు
పడ్డంలో పెద్ద బ్లండర్ వుంది గమనించారా? మనకి చూపించిన ప్రకారం అతను మార్టీ ని షూట్ చేసిప్పుడు లైటర్ ని ఆ నేర స్థలంలోనే టేబుల్ మీద మర్చిపోయాడు. అందుకే లైటర్ ఇప్పుడు జేబుల్లో  లేదు. మరి ఇక్కడ ఫోటోలని ఎలా కాలుస్తు
న్నట్టు? 

          ఇలాటి బ్లండర్ ఇంకొకటి, మార్టీ ‘చనిపోయాక’ రే బార్ కొచ్చి హెడ్ లైట్స్ ఆఫ్ చేయకుండా కారుని పార్క్ చేసిన సందర్భంలో గమనించాం. సీనులో ఒక మిర్రర్ ఎఫెక్ట్ కోసం లాజిక్ ని అలా త్యాగం చేశారు. కారు హెడ్ లైట్స్ తో అంత బాహాటంగా  కొట్టొచ్చినట్టూ వుంటే, అప్పుడు బార్ కొచ్చిన మారీస్ అది చూడకుండా వుంటాడా? చూడనట్టే చూపించారు. ఇలాటి లాజికల్ బ్లండర్స్  మామూలు ఫార్ములా థ్రిల్లర్స్ లో చెల్లిపోవచ్చు గానీ, ప్రొఫెషనల్ గా  వుండాల్సిన డార్క్ మూవీస్ లో పంటికింద రాయిలా వుంటాయి.

          సరే, విస్సర్ కి లైటర్ లేదని తెలిసింది. పరుగెత్తాడు. ఈ సీనులో సమాచారమేమిటి? లైటర్ మిస్ కావడమే. అంటే తర్వాతి సీన్లో వెళ్ళాల్సిన చోటికి వెళ్లి వెతుక్కుంటాడన్న మాట. ఆ సీను మార్టీ ఆఫీసులో వుండదు, ఎందుకంటే లైటర్ అక్కడ మర్చిపోయాడని అతడికి తెలీదు. ఐతే ఈ లైటర్ లేకపోవడం గమనించడానికంటే ముందు, మార్టీ  కవర్లో ఫోటో పెట్టకుండా చేసిన మోసం అతడికి తెలిసింది. ఇది ఈ సీనులో ముందు దొర్లిన సమాచారం. దీని ప్రకారం ఈ సీను అప్పుడే మార్టీ ఆఫీసులో ఫోటో వెతుక్కునే సీనుకి దారితీయాలి. అయితే అంతలో లైటర్ మిస్సయిందనే ఇంకో సమాచారం బయటపడింది. ఇది ముందు సమాచారాన్ని తలదన్నే రెండో సమాచారం. మొదటి సమాచారానికి ట్విస్టు ఇచ్చింది. ముందు సమాచారంతో ఫోటో ఎక్కడుందో విస్సర్ కి తెలుసు. మార్టీ ఆఫీసుకి వెళ్లి దాన్ని తొలగించగలడు. అది సమస్య కాదు. కానీ లైటర్... లైటర్ ఎబ్బీ బ్యాగులో పడిపోయి వుంటుంది!  ఎబ్బీ బ్యాగులో తను రివాల్వర్ ని దొంగిలిసున్నప్పుడు పొరపాటున అందులో లైటర్ పడిపోయివుంటుంది. ఆమె గనుక చూస్తె కొంపలంటుకుంటాయి, బ్యాగులో రివాల్వర్ లేకపోవడం, లైటర్ వుండడం తన మెడకి చుట్టుకుంటాయి. 

          ఇలా మొదటి సమాచారానికి రెండో సమాచారం ట్విస్టు ఇవ్వడంతో ఈ ఒక్క సమాచారంతో అతను పరిగెత్తాడు.

30. ఎబ్బీ బ్యాగులో విస్సర్ లైటర్ వెతకడం
         ఇలా రాశారు : పైన లయబద్ధంగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాను శబ్దం. టిల్ట్ డౌన్ చేస్తే రే ఫ్లాట్ లో లివింగ్ రూమ్.  

          ఫోర్ గ్రౌండ్ లో చైర్ లో టెలిఫోన్ వొళ్ళో పెట్టుకుని,  డో ర్ వైపు తిరిగి కూర్చుని వుంటాడు విస్సర్.  డోర్ ఓపెనై వుంటుంది. టేబుల్ మీద ఎబ్బీ బ్యాగులోని వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడుంటాయి. ఆమె పర్సు వుండదు. ఒక క్షణం తర్వాత విస్సర్ లేచి ఆ వస్తువులన్నీ తిరిగి  బ్యాగులో పడేస్తూ వుంటాడు.

          ఇదీ సీను.  పైన సీలింగ్ ఫ్యాను తిరుగుతూ వుండడం వెనుక సీనులో ఫోనులో ఎబ్బీ విన్న శబ్దానికి అర్ధం. విస్సర్ వొళ్ళో టెలిఫోన్ అతనే ఫోన్ చేశాడనడానికి నిదర్శనం. బ్యాగులో వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి వుండడం అతను లైటర్ కోసం వెతికేశాడనడా నికి తార్కాణం. 

          సీను గమ్మత్తుగా భూతకాలంలో వుంది. సీను ఓపెనై విస్సర్ లైటర్ని వెతుక్కుంటూ కూర్చునే వర్తమాన కాలంలో లేదు. సీనులో జరగాల్సిందంతా ఆల్రెడీ జరిగిపోయింది. స్పిరిట్యువల్ మీనింగ్. కాలానికి కాలాల్లేవు. ఏకకాలంలో అన్నీ జరిగిపోతాయి. మనకి జరిగినవీ, జరగాల్సినవీ అన్నీ ఆల్రెడీ ఏకకాలంలో జరిగిపోయి వుంటాయని శాస్త్రవేత్త  ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కూడా అంటాడు. 

          సిడ్ ఫీల్డ్ కూడా అంటాడు, సీను చివర్లో ఎంటరై చప్పున బయటికి వచ్చేయమని. దెబ్బకి సీను ఖతం. సినిమా కళలో మనకి తెలియని కోణాలెన్నో వున్నాయి. ఇంకే కళ లోనూ ఇన్నిన్ని కోణాలుండవు. 

          ఈ సీనులో సమాచారం లైటర్ మీద ఇక ఆశ వదులుకున్నాడని. ఇది అతడి ఫేసు చూస్తేనే తెలుస్తుంది. ఇక వెనుక సీనులో సెకండరీ సమాచారం ప్రకారం ఫోటో కోసం మార్టీ బార్ కి వెళ్ళడమే మిగిలింది...


(సశేషం)

(యూనివర్సిటీ ఆఫ్ హోస్టన్ స్కూల్ ప్రాజెక్టు కోసం విద్యార్ధులు ఎనాక్ట్ చేసిన ‘బ్లడ్ సింపుల్’ లో విస్సర్ మార్టీని చంపే దృశ్యం కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

-సికిందర్
         





 


              




512 : స్పెషల్ ఆర్టికల్

        తెలుగు సినిమాల కర్తలు ఒక విచిత్రమైన – కొంపలు ముంచుకునే  కమ్యునికేషన్ గ్యాప్ తో హాయిగా గడిపేస్తున్నారు. దేశంలో లేదా రాష్ట్రంలో  ఏ పరిణామం సంభవించినా సినిమాలకది  శాశ్వత కమర్షియల్ ముడి సరుకవుతుందని సంబరపడి  సినిమాలు నిర్మించేస్తున్నారు. మాసి పోయిన పరిణామాలు ఇంకా సమసిపోని బాక్సాఫీసు దినుసులే అనుకుంటూ అహోరాత్రాలు కష్టపడిపోతున్నారు. వాటిని సజీవంగా వుంచడానికి పదుల కోట్ల రూపాయలు పణంగా పెడుతూ ప్రతిష్టాత్మకంగా ఫీలవుతున్నారు. తీరా బాక్సాఫీసు ఇస్తున్న సందేశాలు చూసి లబోదిబోమంటున్నారు. బాక్సాఫీసు ఎప్పుడూ వర్తమానంలో వుండి,  రియల్ టైం ఫలితాలనే అందిస్తుందనీ,  ‘The Power of Now’ ని ఎత్తిచూపుతుందనీ తెలుసుకోలేక పోతున్నారు. బిజినెస్ అంటే ప్రేక్షకుల మార్కెట్ అని కాక, బిజినెస్ అంటే బయ్యర్లే అనుకుంటున్నారు. మార్కెట్ యాస్పెక్ట్ అనే ఒక నిర్లక్ష్యం చేస్తున్న పదాన్ని అర్ధంజేసుకోలేక, క్రియేటివ్ యాస్పెక్ట్ లకి పాల్పడుతున్నారు. మార్కెట్ యాస్పెక్ట్ లేని క్రియేటివ్ యాస్పెక్ట్ ఎందుకూ కొరగాదని తెలుసుకోలేకపోతున్నారు. పూర్తిగా ప్రేక్షకులతో, సమాజంతో, దేశంతో సంబంధాలు తెగిపోయిన కూపస్థ మండూకపు కళలు పోతున్నారు. ఇలా కఠినంగా చెప్పాల్సి వస్తున్నా చెప్పక తప్పడంలేదు. సినిమాలు  తీయడానికి నక్సలిజాన్ని వాడుకోవడం అయిపోయింది, ఫ్యాక్షనలిజాన్ని అరగదీయడం అయిపోయింది, మాఫియాయిజంని  అడపాదడపా సానబట్టడం జరుగుతోంది; నక్సలిజానికీ, ఫ్యాక్షనలిజానికీ  కాలదోషం పట్టిందని వదులుకున్న ప్రాప్త కాలజ్ఞత, మాఫియాయిజంతో కలగడం లేదు. సరే, మాఫియాలు ఎప్పుడూ వుండే అసాంఘీక శక్తులే అనుకుందాం, బాలీవుడ్ దీన్ని వాడుకోవడం ఎప్పుడో మానేసింది.  తీస్తే గీస్తే  గతంలో కి వెళ్లి ‘ఒన్స్ అపాన్ ఎ టైం....’ బాపతు  గతకాలపు మాఫియా వ్యవహారాలు  తీస్తున్నారు.  రెండు వారాల క్రితం విడుదలైన ‘డాడీ’ 1980 లనాటి ముంబాయి డాన్ అరుణ్ గావ్లీ కథే. ఇక ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తనకంటూ ప్రియమైన  తెలుగు మాఫియాల్ని సృష్టించుకుని, మూవీ మేకింగ్ మేడీజీ చేసుకున్న పూరీ జగన్నాథ్ కూడా తన కెరీర్ ని ‘నిల్లేరు’ మీద నడకలా ఫీలవుతున్న చారిత్రక సందర్భంలో, ఇంకోపక్క ఇంకొందరు ఆరిపోయిన టెర్రరిజపు నిప్పుల్ని రాజేస్తున్నారు. దీపపు పురుగుల్లా అందులోపడి ఆహుతైపోతున్నారు. ఇదీ ఇప్పటి సమస్య!

         
టెర్రరిజం ఆరిపోయిన నిప్పా? ఆరిపోయిన నిప్పే కాశ్మీర్ ని వదిలేసి. దేశంలో నగరాల మీద జరిగిన టెర్రర్ దాడుల్లో 2013 లో హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ దాడి చిట్ట చివరిది. ఆ తర్వాత జరుగుతున్నవన్నీ కాశ్మీర్ లోనే. ‘రా’ వెబ్సైట్, ‘ఎన్ ఐ ఎ’ వెబ్సైట్ ఇది చెప్తాయి. నిన్నటికి నిన్న ‘టైమ్స్ నౌ’ బయట పెట్టిన టేపుల్లో కాశ్మీర్ నాయకుడి ప్రగల్భాలు చూస్తే, వాళ్ళ లక్ష్యం సిరియా ఐఎస్ తో కలిసి కాశ్మీర్ ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే. ఇందుకే గత కొంత కాలంగా కాశ్మీర్ కే పరిమితమవుతున్నాయి దాడులు. అమెరికా ప్రభుత్వం విడుదలచేసిన ఒక రిపోర్టులో,  2016 లో పాకిస్తాన్ లో కంటే ఇండియాలో ఎక్కువ దాడులు జరిగాయని పేర్కొంది. అదీ కాశ్మీర్, ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్, మణిపూర్ లలో. మావోయిస్టు దాడుల్ని కూడా కలిపి ఈ రిపోర్టు ఇచ్చింది. ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్, మణిపూర్ లలో మావోయిస్టు దాడుల్ని తీసేస్తే, టెర్రర్ దాడులు జరిగింది ఒక్క కాశ్మీర్ లోనే.

          ఈ పరిస్థితుల్లో ఇంకా 2013 నాటి దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళ మీదే  గ్లామర్ పెంచునుని నక్షత్రాలూ, యుద్ధం శరణాలూ  తీస్తే ఏమౌతుంది? మూడవుతాయి : ఒకటి - ప్రేక్షకులకి పరమబోరు; రెండు - టెర్రరిస్టులకి పరమానందం; మూడు - ప్రభుత్వానికి పరాభవం. 

          మూడోదే చాలా విచారకరమైనది. సినిమా కర్తల సెన్సిటీవిటీని వెల్లడిస్తుంది. 2014 నుంచి రాష్ట్రాల్లో ఎలాటి దాడులు జరక్కుండా నిఘా సంస్థలూ బలగాలూ కట్టు దిట్టం చేసుకు వస్తూంటే, సినిమాలుతీసి దాడులు చూపించడం ప్రభుత్వం మీద జోకేయడమే అవుతుంది. ఆల్రెడీ విమెన్ సేఫ్టీ విషయంలో పోలీసులకి ఈ పరాభవం ఎదురవుతూనే వుంది. పోలీసులో పక్క స్త్రీల భద్రత కోసం బయటికెళ్ళి నప్పుడు ఫలానా యాప్ వాడండీ, ఈఈ  జాగ్రత్తలు తీసుకోండీ - అని వూర ప్రచారం చేస్తూంటే, ఇదేం పట్టక సినిమాల్లో అజ్ఞానపు హీరోయిన్ పాత్రల్ని సృష్టించి ప్రమాదాల్లోకి నెట్టేయడం చేస్తున్నారు. ఎవేర్నెస్ బదులు పోలీసుల ప్రచారానికి గండి కొట్టడం. ఇది వరకు సినిమాల్లో సామాజిక సృహ అంతగా అవసరపడలేదు. ఇప్పుడు అత్యవసరంగా స్పృహ తెచ్చుకోకపోతే, వ్యతిరేక సంకేతాలివ్వడాన్ని డీఫాల్టు యాప్ గా ఇన్ స్టాల్ చేసుకునే ప్రమాదం వుంది.

          అలాగే ఇంకా బాంబు దాడులు జరిపించి టెర్రరిస్టు కథలతో సొమ్ము చేసుకోవా
లనుకోవడం, ప్రభుత్వాన్ని పరిహసించడమవుతుందో కాదో మైండ్ పెట్టి ఆలోచించాలి. దేశభక్తి నినాదాల వల్ల ఈ పరిహాసం నీరాజనమైపోదు. అయినా సరే పరిహాసం కాదనుకుంటే ఇలాగే మరిన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు, ఏం ఫర్వాలేదు. బాక్సాఫీసు చూసుకుంటుంది.  ముందు ఏ విషయం స్పష్టత తెచ్చుకోవాలి.  బాలీవుడ్ కూడా ఈ దాడుల సినిమాలు వదిలేసిందని గుర్తుంచుకోవాలి. 2013 లో వర్మ తీసిన ‘ది ఎటాక్స్ ఆఫ్ టెర్రర్ - 26 /11’ ఆఖరిది. ఆ తర్వాత “పాంథమ్’ (2015), ‘బేబీ’ ( 2015), ‘నీరజ’ (2016) వచ్చాయి. మొదటి రెండూ  విదేశాల్లో టెర్రరిస్టుల్ని పట్టుకోవడం గురించి. రెండోది,  1983  లో అబూ నిదల్ హైజాక్ చేసిన అమెరికా విమానం గురించి.

          అసలు విషయమేమిటంటే,  టీవీ సీరియల్స్ వచ్చేసి ఫ్యామిలీ కథలనే జానర్ ని సినిమాలకి లేకుండా చేశాక, అచ్చమైన ఫ్యామిలీ కథలు ఇక చెప్పలేమని, వాటిని ఫ్యాక్షన్ కథల రూపంలో తీసి తిరిగి ఫ్యామిలీ ప్రేక్షకుల్ని సంపాదించుకోవడం మొదలెట్టారు. ఫ్యామిలీ కథలకి హింసని జోడిస్తే తప్ప ఈ జనాలు చూసేట్టు లేరని అలా ఫ్యాక్షన్ సినిమాలు తీసి తగిన శాస్తి చేయడం మొదలెట్టారు. ఆ సినిమాల్లో అన్నీనరుక్కునే దుర్మార్గుల కుటుంబాల కథలే. ఇవే గొప్ప కుటుంబకథా చిత్రాలుగా తరించారు ప్రేక్షకులు కూడా. రానురాను ఫ్యాక్షన్ కి కాలదోషం పట్టి మాఫియాలు దొరికారు. ఇక మాఫియాల కుటుంబాల కథలు. ఒక మాన మర్యాదలున్న వాళ్ళ కుటుంబ కథలిక లేవ్!  అమాయక ప్రేక్షకులు కూడా మానమర్యాద ల్లేవ్, బొంగూ లేదన్నట్టుగా తయారయ్యారు.ఇలా వుండగా దిల్ సుఖ్ నగర్లో ధనా ధనా  బాంబులు పేలాయ్. దీంతో కుటుంబ కథలు దీని మీద పడ్డాయి. కుటుంబ కథ పరాన్న జీవి అయిపోయింది. ఎక్కడ కొత్త హింస వుంటే  అక్కడ దాన్ని పట్టి పల్లార్చడం మొదలెట్టింది. 

          ఇంతే గానీ, ఈ బాంబు దాడులతో సందేశాలిచ్చేదేమీ వుండదు. కుటుంబ కథలకోసం కరివేపాకులా వాడుకోవడమే. అయితే దారుణంగా ఇవే అట్టర్ ఫ్లాపవుతున్నాయి. ఇలాటిదే ఇంకో టెర్రర్ కథ (దీంట్లో కుటుంబ కథలేదు)  మూడేళ్ళుగా నలుగుతోంది. ఇప్పుడుదాన్ని మార్చాలని, ఇప్పుడున్న పరిస్థితులతో అప్ డేట్ చేసుకోవాలని చెప్పి చేయందించినా, బావిలోంచి పైకి రాలేని పరిస్థితి –  ఫ్లాపైన ‘నక్షత్రం’, ‘యుద్ధం శరణం’ టైపులోనే  ఆలోచనలు!



-సికిందర్ 
https://www.cinemabazaar.in