రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, డిసెంబర్ 2022, శుక్రవారం

1273 : రివ్యూ!


దర్శకత్వం : త్రినాథరావు నక్కిన
తారాగణం : రవితేజ, శ్రీలీల, జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, రావు రమేష్, చిరాగ్ జానీ, అలీ, ప్రవీణ్, హైపర్ ఆది, పవిత్రా లోకేష్, తులసి, రాజశ్రీ నాయర్ తదితరులు
కథ స్క్రీన్ ప్లే మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీతం : బీమ్స్ సిసిరోలియో ఛాయాగ్రహణం : కార్తీక్ ఘట్టమనేని
బ్యానర్స్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్

నిర్మాతలు : టి జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్  
విడుదల : డిసెంబర్ 23, 2022
***
        మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.  గత ఖిలాడీ’, రామారావు ఆన్ డ్యూటీ రెండూ ఫ్లాప్ అవడంతో అసహనంగా వున్నారు. మాస్ మహారాజా కావడంతో ఆప్షన్స్ ఎక్కువ వుండవు. అవే మాస్ సినిమాలు అలాగే నటించాలి. ఈడియట్ నాటి ముద్రపడిన క్యారక్టరైజేషన్, యాక్టింగ్ కొనసాగిస్తూ పోవాలి. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గురించి ఇమేజి చట్రంలో ఇరుక్కున్నాడని అనుకునే వాళ్ళు. ఇదే పరిస్థితి రవితేజది. కాబట్టి ఇప్పుడు తాజా ధమాకా ని వేరే ఆశలేం పెట్టుకోకుండా చూడాలి. ఈసారి అలా చూస్తే ఎలా వుంటుంది? ఫ్యాన్స్ కి ఓకేనా? దర్శకుడు నక్కిన త్రినాధరావు మాస్ మహారాజాకి హిట్ ఇచ్చినట్టేనా? ఇవి తెలుసుకుందాం...

కథ  
వైజాగ్ లో నంద గోపాల చక్రవర్తి (సచిన్ ఖేడేకర్) ఓ కంపెనీ బాస్. కంపెనీకి కొడుకు ఆనంద్ చక్రవర్తి (రవితేజ)ని సీఈఓ గా నియమించాలని నిర్ణయిస్తాడు. ఇది నచ్చని కంపెనీలో వ్యతిరేకులు జెపి (జయరాం) తో కలిసి కుట్ర చేస్తారు. జెపికి కొడుకుని సీఈఓ చేయాలని పథకం. ఇంకోవైపు మధ్యతరగతికి చెందిన స్వామి(రవితేజ) వుంటాడు. ఇతడికి తండ్రి వాసుదేవరావు (తనికెళ్ళ భరణి), తల్లి దేవకి (తులసి), చెల్లెలు (రాజశ్రీ నాయర్) వుంటారు. స్వామికి చేస్తున్న ఉద్యోగం పోవడంతో చెల్లెలి పెళ్ళి సమస్య అవుతుంది. ఇతను చెల్లెలి ఫ్రెండ్ పావని (శ్రీలీల) ని ప్రేమిస్తూంటాడు. పావని తండ్రి (రావు రమేష్) కి స్వామి నచ్చడు. దీంతో ఒకేలా వున్న స్వామి, ఆనంద్ లని పరీక్షించి ఎవర్ని చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటుంది. ఇంతలో జెపి కుట్ర అమలుకావడంతో ఆనంద్ ప్రమాదంలో పడతాడు. ఆనంద్ ని కాపాడేందుకు స్వామి రావడంతో జెపి, శ్రీలీల సహా అందరూ వూహించని షాక్ కి లోనవుతారు.
        
ఏమిటా షాక్? దేని గురించి? ఆనంద్, స్వామిలకి సంబంధించిన రహస్యమేమిటి? ఆ తర్వాత ఏం జరిగింది? జెపి కుట్రని స్వామి ఎలా ఎదుర్కొన్నాడు? అసలు తనెందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? ఇవి తెలుసుకోవాలంటే మిగతా ధమాకా ఏమిటో చూడాల్సిందే. 

ఎలావుంది కథ 

రవితేజ ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ వున్న కథ. లేనిదల్లా కథే. కథ బదులు కామెడీలు, పాటలూ వస్తూంటాయి. ఫ్యాన్స్ అదృష్టం బావుండి మధ్య మధ్యలో వచ్చే కామెడీలూ పాటలూ బావుండడంతో, పాటలకి మాస్ మహారాజా విరగదీసి డాన్సులు చేయడంతో, పక్కన అందమైన శ్రీలీల వుండడంతో ఫుల్ ఖుష్ అవుతారు.  
        
ఫ్యాన్స్ కాని వాళ్ళకి ఇంటర్వెల్లో రవితేజ ద్విపాత్రాభినయానికి సంబంధించి ట్విస్టు రావడంతో, అది మంచి కమర్షియల్ ధమాకాలా అనిపిస్తుంది. ఆ తర్వాత సెకండాఫ్ లో ధమాకా ఏమీ వుండదు. చిచ్చుబుడ్డి ఇంటర్వెల్లోనే పేలిపోవడంతో సెకండాఫ్ సైలెంట్ గా వుండిపోతుంది.  సైన్స్ ప్రకారం చూసినా పేలిన చిచ్చుబుడ్డి ప్రకంపన లుంటాయి. కానీ ప్రకంపనలు లేకపోవడంతో విలన్ కూడా వీక్ అయిపోయాడు. ఆ ప్రకంపనలు సెకండాఫ్ లో వుండి వుంటే, మరో చిచ్చుబుడ్డి చివర్లో పేలివుంటే డబుల్ ధమాకాగా వుండేది.

ఫస్టాఫ్ లో స్వామి పాత్రలో రవితేజ ఉద్యోగం పోవడంతో మాస్ తిరుగుళ్ళు తిరగడం, హీరోయిన్ శ్రీలీలని రౌడీల బారినుంచి కాపాడడం, సాంగ్, సాంగ్ తర్వాత శ్రీలీలతో లవ్ ట్రాక్, మరోవైపు కంపెనీ మీద కుట్రతో సీన్లు, ఆనంద్ పాత్రలో రవితేజని స్వామి అనుకుని శ్రీలీల ప్రేమించడం, కన్ఫ్యూజ్ కామెడీ, మరో సాంగ్... ఇలా రెగ్యులర్ టెంప్లెట్ లో కొత్తదనం లేని కథనంతో సాగుతూ, పైన చెప్పుకున్న ధమాకాతో ఇంటర్వెల్ పడుతుంది.

ఇక సెకండాఫ్ లో సమస్యేమిటంటే, ఇంటర్వెల్ ధమాకాతో రవితేజ డబుల్ యాక్షన్ రహస్యం తెలిశాక, సెకండాఫ్ లో ఇక స్వామి పాత్రతోనే నడపాల్సి వచ్చింది. చాలా సింపుల్ గా ఆలోచిస్తే, ద్విపాత్రాభినయం రహస్యం విలన్లకి తెలియకుండా, ప్రేక్షకులకి మాత్రమే తెలిసి వుంటే, సెకండాఫ్ లో ద్విపాత్రాభినయం కంటిన్యూ అయి విలన్లతో కన్ఫ్యూజింగ్ గేమ్ గా కథంటూ వుండేది. ఇలా చేయకపోవడంతో, చేయడానికేమీ లేక, కామెడీలూ పాటలతో భర్తీ చేశారు. ముగింపు కూడా కుదర్లేదు.

నటనలు –సాంకేతికాలు

ఫ్యాన్స్ కి, మాస్ ప్రేక్షకులకి నచ్చే అదే వెటకారం, నటన, కామెడీలతో మార్పులేకుండా ఇమేజి చట్రంలో ఎంటర్ టైన్ చేశాడు రవితేజ. ఇంత పెద్ద స్టార్ కి ఎమోషనల్ బ్యాగేజీ లేని పాత్రచిత్రణ, కథా కథనాలు సరిపెట్టడం కూడా ఇందుకే. రామ్- లక్ష్మణ్, వెంకట్ లు సమకూర్చిన యాక్షన్ కొరియోగ్రఫీ అంత హైపర్ నటనతో వున్న రవితేజని అందుకోలేదు. ఒక గ్రౌండ్ లో, ఒక యార్డులో సెట్ చేసిన ఫైట్ సీన్లు మాస్ మహారాజానీ కట్టేశాయి. ఛేజింగ్స్ తో మూవ్ మెంట్లో యాక్షన్ సీన్స్ వుండి వుంటే రవితేజ హైపర్ యాక్షన్ కి జోడు గుర్రంలా వుండేది.
        
అన్ని పాటలకి చేసిన డాన్సులు, రెండు పాత్రలపట్ల చూపిన వేరియేషన్స్ కమర్షియల్ విలువలకి తగ్గట్టున్నాయి. పాత్రల పరంగా కష్టపడి నటించాల్సిన అవసరం రాలేదు. హీరోయిన్ శ్రీలీల కేవలం ప్రేమ కోసం వుండే గ్లామర్ పాత్ర, నటన. రావురమేష్, పక్కన హైపర్ ఆది చేసే కామెడీ అక్కడక్కడా వర్కౌట్ అయింది. తనికెళ్ళ రొటీనే. కానీ ఫోన్ తీసుకుని ఇంటర్వెల్లో రవితేజ డబుల్ యాక్షన్ రహస్యం ఇతర పాత్రలకి టాంటాం చేయడంతో సెకండాఫ్ విషయం లేకుండా పోయింది. శివ లాంటి సినిమాకి రచయిత అయిన తను- ఇలా చెయ్యకయ్యా బాబూ, సెకండావ్ కొంప కొల్లేరవుతుందని ఈ సినిమా రైటర్ కి చెప్పి వుండాల్సింది.
        
కాస్ట్యూమ్స్, సెట్స్, ఔట్ డోర్స్ ప్రొడక్షన్ విలువలతో అత్యంత రిచ్ గా, కలర్ఫుల్ గా వున్నాయి. కార్తీక్ ఘట్టమేని కెమెరా వర్క్ కనువిందు చేస్తుంది. బీమ్స్ సంగీతంలో పాటలు, నేపథ్య సంగీతం ఇంకో హైలైట్. దర్శకుడు త్రినాధరావు దర్శకత్వం బాగానే వుందిగానీ, ఇంకెన్ని సినిమాలు అవే మూస కథలతో తీస్తారనేది ప్రశ్న.

—సికిందర్
               

1272 : రివ్యూ!

 

రచన -దర్శకత్వం : ఎ వినోద్ కుమార్
తారాగణం: విశాల్, సునైనా, ప్రభు, రమణ, తలైవాసల్ విజయ్, మునిష్కాంత్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : బాలసుబ్రమణ్యం
బ్యానర్: రానా ప్రొడక్షన్స్
నిర్మాతలు: రమణ, నంద
విడుదల : డిసెంబర్ 22, 2022
***
          మిళంలో విశాల్ సినిమాలంటేనే యాక్షన్ సినిమాలు. తెలుగులో మార్కెట్ వుండడంతో డబ్బింగ్స్ విడుదలవుతూంటాయి. గత ఫిబ్రవరిలో విడుదలైన సామాన్యుడు కూడా సక్సెస్ కాలేదు. కారణం విశాల్ సినిమాలన్నీ విషయపరంగా ఒకేలా వుంటాయి. ఆ విషయం పాతబడి వుంటుంది. ఇదే ధోరణిని కొనసాగిస్తూ లాఠీ కూడా విడుదలైంది. 30 ఏళ్ళ క్రితం ప్రసిద్ధ నిర్మాత ఎంఎస్ రాజు, దర్శకుడు గుణశేఖర్ కి తొలి అవకాశమిచ్చి  తమిళ హీరో ప్రశాంత్, తమిళ విలన్ రఘువరన్ లతో తెలుగులో లాఠీ అని తీస్తే మంచి హిట్టయ్యింది. ఉత్తమ తొలి సినిమా దర్శకుడుగా గుణశేఖర్ కి నంది అవార్డు కూడా లభించింది. మరో రెండు అవార్డులు ఎడిటర్ కి, కెమెరా మాన్ కీ లభించాయి. పోలీస్ లాఠీ అంటే ఏంటో పవర్ఫుల్ గా చూపించిన ఈ సినిమా ముందు విశాల్ లాఠీ ఏ స్థానంలో నిలబడుతుందనేది ప్రశ్న. దీనికి సమాధానం ఏం చెబుతుందో, ఈ కొత్త దర్శకుడు ఏం కొత్త లాఠీ కథ చెప్పాడో వివరాల్లోకి వెళ్ళి చూద్దాం...  

కథ

మురళీ కృష్ణ (విశాల్) ఒక కానిస్టేబుల్. అతడికి భార్య కవిత (సునైనా), కొడుకూ వుంటారు. ఆనందమయ జీవితం గడుపుతూంటాడు. ఓ రోజు డ్యూటీలో భాగంగా ఒకడ్ని లాఠీ పెట్టి విపరీతంగా కొట్టి సస్పెండ్ అయిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత డిఐజి కమల్ (ప్రభు) మంచి తనం వల్ల ఉద్యోగంలో చేరతాడు. ఇంకో రోజు డాన్ సూరా (సన్నీ పిఎన్) కొడుకు వీర (రమణ) డిఐజి కమల్ కూతుర్ని వేధిస్తాడు. దీంతో డిఐజి కమల్ వాడ్ని కిడ్నాప్ చేసి లాకప్ లో వేసి, మురళీ కృష్ణని పిలిచి లాఠీ పెట్టి బాగా విరగదీయమని ఆదేశిస్తాడు. వీర ఎవరో తెలియని మురళీ కృష్ణ వీరని లాఠీ పెట్టి బాగా విరగదీస్తాడు. కొడుకు వీరని రాజకీయ ప్రవేశం చేయించాలని ప్రయత్నాల్లో వుంటాడు సూరా. లాకప్ లో వొళ్ళు హూనమయ్యేసరికి మురళీ కృష్ణ మీద పగబడతాడు. ఈ క్రమంలో మురళీ కృష్ణ ఒంటరిగా తననీ, తన కుటుంబాన్నీ ఎలా కాపాడుకున్నాడన్నది మిగతా కథ.  

ఎలా వుంది కథ

ఇంకో విశాల్ బ్రాండ్ పాత మోడల్ కథే. పోలీసు కానిస్టేబుల్, డిఐజి కూతురు, డాన్, డాన్ కొడుకు వంటి మూస ఫార్ములా పాత్రలతో; డిఐజి కూతుర్ని డాన్ కొడుకు వేధిస్తే, కానిస్టేబుల్ కొట్టడం, కానిస్టేబుల్ మీద డాన్ పగబట్టడం వంటి పాత మూస కథనం తోడై సినిమా ప్రాణం తీసింది. నేటి కాలానికి సరిపడే ఓ మార్కెట్ య్యాస్పెక్ట్ గానీ, దానికి అనుగుణమైన క్రియేటివ్ యాస్పెక్ట్ గానీ కొత్త దర్శకుడికి తెలీక తను చూసిన పాత సినిమాలే సినిమా అనుకుని చుట్టేసినట్టుంది. ఫలితంగా ఈ కథకి కనీస బాక్సాఫీసు అప్పీల్ గానీ, యూత్ అప్పీల్ గానీ కానరాకుండా పోయాయి. ఇందులో ఫ్యామిలీ సెంటిమెంటు జోడించి ఎమోషన్లు పెంచాలనుకున్నాడు. ఆ పాత ఫ్యామిలీ కథ కూడా ఎమోషన్లు పెరిగేంతగా లేకపోవడంతో పూర్తిగా విశాల్ చేజారిపోయి- బి గ్రేడ్ మాస్ ప్రేక్షకుల సినిమాగా మిగిలింది.

ఫస్టాఫ్ విశాల్ ఉద్యోగం పోగొట్టుకున్న జీవితం, భార్యతో కొడుకుతో కుటుంబ కష్టాలు, డాన్ కొడుకుని కొట్టడంతో ఆ కష్టాలు మరింత పెరిగి సెకండాఫ్ కి రంగం సిద్ధం కావడం జరిగి, సెకండాఫ్ లో పగబట్టిన డాన్ తో పోరాటం సాగి సాగి- కొడుకు కిడ్నాప్ తో ఓ భవనంలో బందీ అయిపోతుంది కథ. అక్కడ 45 నిమిషాలూ ఇంకా సాగదీసిన కథతో యాక్షన్ క్లయిమాక్స్, ముగింపూ.
        
చివరి 45 నిమిషాలు యాక్షన్ నిలబడిందా అంటే, భవనంలో అక్కడక్కడే కొట్టుకుంటూ సహనాన్ని పరీక్షిస్తుంది. ఎంతకీ ముగియని క్లయిమాక్స్ ప్రేక్షకుల మీద లాఠీ చార్జి లా వుంటుంది. గాయాలతో బయటపడేసరికి రెండున్నర గంటలు గడిచిపోతాయి.  కథకి లాజిక్ కూడా వుండదు. తన అవసరానికి కానిస్టేబుల్ ని ఉపయోగించుకున్న డిజిపి, అదే విలన్ తో ప్రమాదంలో పడితే కనిపించకుండా పోతాడు డిజిపి. ఇది కానిస్టేబుల్ ఒంటరి పోరాటం చేసే కథ కాబట్టి డిపార్ట్ మెంట్ అతడ్ని అతడి ఖర్మానికి వదిలేయాలన్నట్టు మాయమైపోతారు. ఇలా విశాల్ ఆఖరికి ఇలాటి సినిమాతో లాఠీ చార్జి కూడా చేశాక, ఇలాటి సినిమా ఇదే చివరిదవుతుందా, లేక ఉరికంబం ఎక్కించే ఇంకో సినిమా వస్తుందా చూడాలి.

నటనలు- సాంకేతికాలు

విశాల్ నిజాయితీగా కష్టపడ్డాడు. సామాన్య కానిస్టేబుల్ పాత్రలో సహజత్వంతో ఇమిడిపోయేందుకు ప్రయత్నించాడు. ఉద్యోగం పట్ల నిబద్ధత వరకూ ఓకే, కానీ ఫ్యామిలీ సీన్లు సరిగ్గా లేక పాత్రతో బాటు నటన కుదర్లేదు. యాక్షన్ సీన్స్ లో మాత్రం విజృంభించాడు. రిస్కు తీసుకుని కొన్ని యాక్షన్ బిట్స్ నటించాడు. యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ చాలా కాలం తర్వాత తన స్కిల్స్ చూపించాడు. 45 నిమిషాల యాక్షన్ సీన్స్ కరువుదీరా కంపోజ్ చేశాడు.
        
కవిత పాత్రలో సునైనా ఫర్వాలేదు. ఎక్కువ కనపడని పాత్ర. క్లయిమాక్స్ కొడుకు పాత్రలో చైల్డ్ ఆర్టిస్టు చుట్టూ వుంటుంది. భయం, ఏడుపు వగైరా బాగా నటించాడు. ఇక నాటు విలన్ గా సన్నీ, అతడి నాటు కొడుకుగా రమణ క్రూడ్ గా నటించారు.
        
సాంకేతికంగా బాగా ఖర్చుపెట్టారు. కానీ కొత్త దర్శకుడు వినోద్ కుమార్ అరిగిపోయిన పాత కథని  దాదాపు రెండు గంటలు బలహీన దర్శకత్వంతో ఎలాగో క్లయిమాక్స్ కి చేర్చి, సినిమాని విశాల్ - పీటర్ హెయిన్స్ చేతుల్లో పెట్టేశాడు. వీళ్ళిద్దరూ ప్రేక్షకుల మీద లాఠీ చార్జి చేశారు!

—సికిందర్