రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, ఆగస్టు 2018, శుక్రవారం

671 : స్క్రీన్ ప్లే సంగతులు




       నిర్మాతలు పెట్టుబడి కథ మీద పెట్టాలా, పాయింటు మీద పెట్టాలా? హాలీవుడ్ లో సెన్సేషనల్ పాయింటు మీదే పెడతారు, కథ మీద కాదు. మార్కెట్ లో అమ్ముడుబోయే పాయింటునే కొంటారు, దాన్నే ప్రేక్షకులకి అట్టహాసంగా అలంకరించి అమ్ముతారు. ముందు కాన్ఫ్లిక్ట్ (పాయింట్) ఏమిటాని అడుగుతారు, అందులో కలెక్షన్స్ కన్పిస్తూంటే అప్పుడు కథేమిటో చూస్తారు. ‘హీరోకి కోటి రూపాయల లాటరీ తగిల్తే టికెట్ చించి పారేశాడు సర్!’  అని రచయిత క్రేజీగా పాయింటు చెప్పాడనుకుందాం, ‘కోటి రూపాయలు తగిల్తే చించి పారేశాడా? భలే వుందే, స్క్రిప్టు పంపు!’ అంటాడు ఎగ్జిక్యూటివ్ వెంటనే. ‘లవర్స్ చిన్నమాట తేడా వచ్చి విడిపోయారు సర్’ అని రచయిత టాలీవుడ్ తమాషా చెప్పాడనుకుందాం, ‘బొంద కాదూ, అందులో డాలర్స్ ఎక్కడ కనబడి చస్తున్నాయ్?’ అని సినిమా ఫీల్డుకి కొత్త పిచ్చోడిలా వున్నాడని, అసమర్ధుడని విరక్తిగా చూస్తాడు ఎగ్జిక్యూటివ్. అక్కడ కథంటే బిజినెస్సే. బిజినెస్ ఆలోచించే వాడే ప్రొఫెషనల్ రచయితా, దర్శకుడూ. ఏవో కవిత్వాలూ క్రియేటివిటీలూ తర్వాత. ముందు బిజినెస్ ఆలోచిస్తారు. రచయితలు ఏ కాన్ఫ్లిక్ట్ కి బిజినెస్ వుంటుందా ఆలోచిస్తూనే, పరిశోధిస్తూనే నెలలు గడిపేస్తారు. రచయితలూ పాయింటుని అమ్ముతారు, నిర్మాతలూ పాయింటునే కొంటారు. పాయింటుకుండే ప్రాముఖ్యం అంతటిది. దీన్నే ప్లాట్ పాయింట్ ఏమిటి, లేదా వాట్ ఇఫ్ (ఇలా జరిగితే?) ఫ్యాక్టర్ ఏమిటని కూడా టెక్నికల్ గా అడుగుతారు. రచయితల తరపున ఏజెంట్లు పిచింగ్ చేసినా పాయింటునే మార్కెటింగ్ చేస్తారు. అంతేగానీ ఈ రచయిత దగ్గర మంచి కథ వుందని ఎక్కడా సిల్లీగా చెప్పరు. అలా చెప్తే ప్రొఫెషన్ తెలియని వ్యక్తి అయిపోతారు. కథెవరిక్కావాలి? కథలూ, స్క్రీన్ ప్లేలూ, మాటలూ మురిపాలూ తర్వాత. ముందు కథకి పాయింటు విలువ తెలియని వాడు, హాలీవుడ్ బిజినెస్ మోడల్ తెలియని వాడు, ఏం రాసినా ర్యాగ్ పికర్ కూడా అవతల పారేస్తాడు.

        ‘శ్రీనివాస కళ్యాణం’ తో ఇదే జరిగింది. అనేక సినిమాల్లో జరుగుతోంది. పాయింటుని అమ్మాలనుకోకపోవడం. పాయింటు విలువని గుర్తించాలనుకోక పోవడం. కథ సంగతి తర్వాత, ముందుగా ఒక ఆకర్షణీయమైన, అర్ధవంతమైన, బలమైన పాయింటని ప్రేక్షకుల ముందు, వంద రూపాయల టికెట్టుకి సరిపడా అమ్మకానికి పెట్టాలనుకోకపోవడం. పాయింటు అంటే ఐడియానే. ఏ ఐడియా కమర్షియల్ గా భిన్నంగా వుంటుందాని ఆలోచించకపోవడం. ఐడియా దగ్గర్నుంచీ రాయలేక పోవడం. మూడంకాలతో పటిష్టంగా ఐడియాని నిర్మించుకోవాలనుకోక  పోవడం. మధించాలనుకోక పోవడం. ఎంత కాలమైనా సరే, స్ట్రక్చర్ లో ఐడియా కుదిరే వరకూ ఐడియా మీదే పని చేయాలనుకోక పోవడం. ఐడియా రీసెర్చిని కోరితే, ఆ రీసెర్చి క్షుణ్ణంగా చేయాలనుకోక పోవడం. కొత్త ఐడియా అని చెప్పి ప్రేక్షకులకి తప్పుడు సమాచారమివ్వకూడదనుకోక పోవడం. లోపభూయిష్ట ఐడియాకి స్క్రిప్టు రాసేసి, నిర్మాతల చేత పెట్టుబడులు పెట్టించకూడదనుకోక పోవడం.

     కథకి పాయింటు, కాన్ఫ్లిక్ట్, వాటిఫ్ ఫ్యాక్టర్, సమస్యా ఇవన్నీ ఒకటే. ఐడియాకి పర్యాయ పదాలే. ఇది ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పాటవుతుంది. అక్కడే కథని పుట్టించి, మొదటి మూల స్థంభాన్ని నిర్మిస్తుంది. రెండో మూల స్థంభం ప్లాట్ పాయిట్ టూ దగ్గర సమస్యకి పరిష్కార మార్గంగా ఏర్పాటవుతుంది. స్క్రీన్ ప్లే అనే చలనచిత్ర సౌధం ఈ రెండు మూల స్థంభాల మీదే నిలబడుతుంది. మొదటి మూల స్థంభం బలంగా లేకపోతే, రెండో మూల స్థంభం కూడా బలంగా వుండదు. అంటే క్లయిమాక్స్ హాస్యాస్పదంగా మారుతుంది. మొత్తం స్క్రీన్ ప్లే సౌధం కుప్పకూలుతుంది. 

          మొదటి మూల స్థంభం మొత్తం కథకి డీఎన్ఏ లాంటి ఐడియాని సరఫరా చేసే ప్రధాన కేంద్రం. ఇది అయోమయంగా, లోపాలమయంగా పుచ్చిపోయి వుంటే,  మిగతా వ్యవహారమంతా కూడా పుచ్చి పోతుంది. ఇందులో ఎలాంటి సందేహలవసరం లేదు. ఎంత సూపర్ స్టార్ అయినా ఏమీ చేయలేడు. ‘బ్రహ్మోత్సవం’ లో చూశాం, ఇప్పుడు ‘శ్రీనివాస కళ్యాణం’ లో చూస్తున్నాం. ఈ రెండిటి ఇంకో సమస్య ఏమిటంటే, వీటి పాయింటుల్లో అసలు యూత్ అప్పీల్ అనేదే లేకపోవడం. మార్కెట్ యాస్పెక్ట్ నే ఆలోచించకపోవడం. మొదటిది ఏదో ఏడుతరాల బంధువుల్ని వెతికే పాయింటైతే, రెండోది పెళ్లి సాంప్రదాయాలు నేర్పే పాయింటు. రెండూ యూత్ కే మాత్రం పట్టని, వాళ్ళు ఏ కోశానా కోరుకోని, వెనకటి తరం ప్రేక్షకులతో అరిగిపోయిన, ఇప్పుడు బిజినెస్ ని హుళక్కి చేసే పాయింట్లు. యూత్ అప్పీల్ లేని వయసు ముదిరిన పాయింట్లు. యూత్ కి నునులేత, కోడె గిత్తలా దూకే పాయింట్లు కావాలి. 

          ఓ పెద్ద మనిషికి ఓ కుర్రోడు పెళ్లి సాంప్రదాయాలు నేర్పడం కోడెగిత్తలా దూకే పాయింటవుతుందా? అసలిప్పుడు ఇంకా పెళ్లి సాంప్రదాయాల పాయింటుకి మార్కెట్ విలువుందా? అలాటి పెళ్లి సాంప్రదాయాల పాయింటే చెప్పాలనుకుంటే, ప్రయోగాలకి సిద్ధపడాలి. ఒక క్రేజీ ప్రాజెక్టుకి నడుం కట్టాలి. ప్రయోగాల్ని ప్రేక్షుకుల మీద రుద్దవచ్చు, కాలం చెల్లిన పాయింట్లని కాదు. కథా కాలాన్ని ఓ నలభై- యాభై ఏళ్ల వెనుక  ఏర్పాటు చేసి, అప్పట్లో పెళ్ళిళ్ళు ఎలా జరిగేవో, అప్పటి అన్ని సాంప్రదాయాలూ ఆచారాలూ సహా, అప్పటి మనుషుల ఆనందాలు సహా, ఉమ్మడి కుటుంబాలు సహా, కడు మధురంగా ఈతరం ప్రేక్షకులకి - క్రేజీ ప్రాజెక్టుగా సినిమా తీసి పరిచయం చేయవచ్చు. వీలయితే ‘సీతారాముల కళ్యాణము చూతము రారండి’ పాట కూడా అప్పట్లో పెళ్ళిళ్ళలో ఎలా మార్మోగేదో ఈతరం ప్రేక్షకులకి చూపించవచ్చు. గొప్ప నాస్టాల్జియాతో పీరియడ్ ఫిలింని (ఫిలిం లేదిప్పుడు) సృష్టించవచ్చు. అలాటి గొప్ప గొప్ప పెళ్ళిళ్ళ  వైభవాల్ని ఇప్పుడెలా కోల్పోయామో, తులనాత్మకంగా చూపిస్తూ చెబితే, యువతరం ఆలోచనలో పడవచ్చు. అప్పుడది యూత్ అప్పీలున్న, మార్కెటబిలిటీ వున్న పాయింటు అయ్యే అవకాశముంటుంది.

***
      అంతేగానీ, ఈ కాలపు పాత్రలతో, గ్లోబలైజ్డ్ అయిన యువ పాత్రలతో, ఈ కాలపు కథ చూపిస్తూ, ఒకప్పటి కాలపు గొప్పలు జొప్పిస్తే జీర్ణమై చావదు. ఏంట్రా ఈ సుత్తి అని విసుక్కుంటారు. ‘శంకరా భరణం’ శంకర శాస్త్రి పాప్ సంగీతాన్ని ద్వేషించలేదు. శాస్త్రీయ సంగీతం తెలిసిన తను పాప్ సంగీతం తనకి కరతలామలకమని, మంచినీళ్ళ ప్రాయమనీ అదే పాప్ గీతమందుకుని, గేలి చేసిన కుర్రాళ్ళ నోళ్ళు మూయిస్తాడు. ఇది నాలెడ్జి వినిమయం. శంకరశాస్త్రి తన నాలెడ్జితో తన కాలంలోనే బెల్లం కొట్టిన రాయిలా వుండిపోలేదు. కొత్త తరంతో పాత సాంప్రదాయాల వాదనలు పెట్టుకోలేదు. పాత నాలెడ్జిని కొత్త నాలెడ్జిలోకి  ప్రవహింపజేస్తూ (వినిమయం), దారీతెన్నూలేని కొత్త నాలెడ్జిని అర్ధవంతంగా మార్చాడు. కానీ ‘శ్రీనివాస కళ్యాణం’ లో నానమ్మ జయసుధ తన కాలంలో తానుండి పోయి, తన కాలపు సంస్కృతీ సంప్రదాయాల్ని ఈ కాలం మీద రుద్దాలన్నదుగ్ధతో – నాలెడ్జి వినిమయానికి దూరంగా వుండిపోయింది. డెబ్బై ఏళ్ల జీవితాన్ని చూస్తున్నానంటుంది. కానీ తన నాలెడ్జితో తనకి వూహ తెలిసిననాటి జీవితం దగ్గరే ఆగిపోయానని తెలుసుకోవడం లేదు. డెబ్బై ఏళ్ల జీవితంలో మారుతున్న అన్ని కాలాల ప్రవాహాలూ లేవా? శంకరశాస్త్రి సంధి కాలంలో ఇరుక్కోలేదు. జయసుధ గారు ఇరుక్కుపోయారు. కాలానికి హద్దుల్లేవు. ఆలోచనలకి హద్దు లేర్పరచుకుని, కాలంలో ఎక్కడో ఘనీభవించుకు పోతారు. వర్తమాన కాలాన్ని నిరసిస్తూ, వర్తమాన కాలపు కొత్త సౌఖ్యాలని అనుభవిస్తారు. 

          ఓ అపరాత్రి ఏమున్నాయా అని యూట్యూబ్ సర్ఫింగ్ చేస్తూంటే, బాలీవుడ్ గీత రచయిత జావేద్ అఖ్తర్ ప్రసంగం కన్పించింది. ఆయన పాతనీ కొత్తనీ మేళవించి చెప్తూంటే ఒకటే చప్పట్లు కొడుతున్నారు సభలో వున్న యువ ప్రేక్షకులు. ఇవాళ్టి పాట ఏమైంది, అవాళ్టి పాట ఇంకా ఎలా బతుకుతోందీ వివరిస్తూంటే, జోకులేస్తూంటే, ఘోల్లున నవ్వూలూ చప్పట్లూ. ఛానెల్స్ లో ఇండియన్ ఐడల్ లాంటి కార్యక్రమాల్లో పాడే కుర్రకారు ఎందుకు లతా, ఆశా, రఫీ, కిషోర్, ముఖేష్, మన్నాడే పాటలే పాడుతున్నారు- ఆ తర్వాతి తరం కొత్త పాటలెందుకు పాడ్డం లేదన్న ప్రశ్నకీ విశేష స్పందన. కాబట్టి కుర్రకారు పాతని  వదిలేసుకోరు. వాళ్ళకి తగిన వేదిక, అవకాశం లభిస్తే పాతనే  బైటికి తీస్తారని, దాన్ని బతికిస్తారనీ హామీ ఇచ్చారు. 

    అంతేగానీ పెద్దతరం పెత్తనం చేసి, కొత్తతరం పతనమై పోతున్నారని, పాతదాన్ని పాతరేస్తున్నారని, చించి పోగులెడుతున్నారనీ, వాళ్ళ నెత్తిన పాత అభిరుచులు రుద్దితే, తలంటు పోస్తే, వికర్షిస్తుంది కొత్త తరం. కొత్త తరానికి పాత దానితో సంబంధం వాళ్ళు నమ్మే దేవుడితో వుండే ఆత్మిక సంబంధం లాంటిది. అదెప్పుడు ఫీలవ్వాలి, ఎలా ఫీలవ్వాలి వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా నిలువునా ఆత్మ నిబిడీకృతమైన అందరిలాంటి మనుషులే, మర మనుషులు కాదు. సినిమానీ, సంగీతాన్నీ, రచననీ కనుక్కున్నది కొత్తోళ్ళు కాదు, పాతోళ్ళే. ఆ మౌలిక విలువలు తరం నుంచి తరానికి వాటికవే ప్రవహిస్తాయి. ప్రతీదీ విద్యుత్ వలయంలా సర్క్యులేట్ అయ్యేదే. వలయంలోనే ప్రకృతి తిరుగుతుంది.

***
          ఇలా ‘శ్రీనివాస కళ్యాణం’ కథలో పాత్రల మధ్య పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన సమస్యలో (పాయింటులో) ఇవన్నీ ఉపరితల సమస్యలు. ఇక సమస్యలోకి తొంగి చూస్తే చెప్పనవసరం లేదు. ఓ పల్లెటూళ్ళో సాంప్రదాయ ఉమ్మడి కుటుంబానికి చెందిన నితిన్, నగరంలో బిగ్ షాట్  ప్రకాష్ రాజ్ కూతురు రాశీ ఖన్నాని ప్రేమించి పెళ్లి ప్రతిపాదన చేస్తాడు. ప్రకాష్ రాజ్ కూతురి మాటలకి విలువిచ్చి ఒప్పుకుంటాడు. కానీ నితిన్ తో అహం అడ్డొచ్చి ఒక కండిషన్ పెడతాడు. తన పెద్దకూతురి విడాకుల కేసు తెగడం లేదు కాబట్టి, రేపొకవేళ నితిన్ తో కూడా ఇలా జరక్కుండా వుండేందుకు, వెంటనే విడాకులై పోయేందుకు, ప్రీ మారిటల్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమంటాడు. ప్రీ మారిటల్ అగ్రిమెంట్ అమెరికాలో వుందనీ, ఈమధ్యే ఇండియా కొచ్చిందనీ అంటాడు. 

       ఇదెలా వుంటుందంటే, ఇదేదో వెర్రితలలేసిన విదేశీ విపరీత పోకడ అన్నట్టుగా నెగెటివ్ అర్ధంలో – ప్రీ మారిటల్ అగ్రిమెంట్ అని పెద్ద పెద్ద అక్షరాలేసి, క్లోజప్ లో కంగారు పెట్టించే ప్రయత్నం చేస్తారు. ఇదే బ్రహ్మాండమైన ప్లాట్ పాయింట్ వన్ మలుపన్నట్టుగా చిత్రిస్తారు. ఈ పాయింటునే ప్రేక్షకులకి అమ్మకానికి పెట్టినట్టుగా బిల్డప్ ఇస్తారు. కథంటే ఆర్గ్యుమెంట్ కాబట్టి, ఈ పాయింటుతో పాత్రల మధ్య ఆర్గ్యుమెంట్ ని రగిలించి, వాళ్ళ తప్పొప్పుల నిగ్గు తేల్చబోతున్నట్టుగా ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తున్నట్టు - ప్రేక్షకులతో కనెక్ట్ అవబోతారు.  

          కానీ ఇలా ప్లాట్ పాయింట్ వన్ లో ఇన్ని లాభాలు చేకూరుస్తుందని సృష్టించిన సమస్యలోకి ఒకసారి తొంగి చూస్తే, అంతా డొల్ల అని తెలిసిపోతుంది.

          పెళ్ళికి ముందే విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టమనడం. ఇదీ పాయింటు. ఈ సమాచారం ఎక్కడ దొరికిందో గానీ, ఈ సీనులో చెప్పినట్టుగా అమెరికాలో ఇలాటిదేమీ లేదు. ప్రీ మారిటల్ అగ్రిమెంట్ అంటే విడాకుల పత్రాల మీద సంతకాలనే విధానం అక్కడ లేదు. ఒకవేళ విడిపోవాలనుకుంటే ఆస్తి పంపకాలేమిటి, పిల్లల పెంపకాలేమిటి మొదలైన వాటి గురించే ప్రీ మారిటల్ అగ్రిమెంట్ వుంటుంది. ఇది వధూవరులిద్దరి సమక్షంలో జరుగుతుంది. ఒకరి పరోక్షంలో థర్డ్ పార్టీ అగ్రిమెంట్ చెల్లదు. ఇదసలు ముందస్తు విడాకుల ఒప్పందం కూడా కాదు. 

          ఇక ప్రీ మారిటల్ అగ్రిమెంట్ ఈ మధ్యే అమెరికాలో చూసి ఇండియాకి వచ్చిందంటాడు ప్రకాష్ రాజ్. కానీ ఇది ఇండియాలో ఎప్పట్నించో వుంది. కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు. బోలెడు పాత కేసులు కనబడతాయి. కాబట్టి ప్రీ మారిటల్ అగ్రిమెంట్ అర్థాన్నే మార్చేసి, ముందస్తు విడాకుల పత్రమనడం సరికాదు. అలాటి ఒప్పందాన్ని నితిన్ కూడా అంగీకరించ కూడదు. అతను సంస్కృతీ సాంప్రదాయాలకి కాణాచి అయిన నానమ్మ ప్రతినిధి.  పెళ్లిని పవిత్ర కార్యంలా భావిస్తాడు. అందులో ఇలాటి అపశకునానికి చోటివ్వకూడదు. తిప్పి కొట్టాలి. అప్పుడే పాత్ర తత్త్వమన్పించు కుంటుంది. 

          కానీ సంతకం పెట్టడానికి సిద్ధపడుతూ, తనొక కండిషన్ కూడా పెడతానంటాడు. పెళ్ళిలో ఒక తండ్రిగా సాంప్రదాయాలనుసారం ప్రకాష్ రాజ్ నడుచుకోవాలంటాడు. పెళ్లి తన వూళ్ళో ఒక ఉత్సవంలా  కొన్ని రోజుల పాటు జరుగుతుందనీ, అన్ని రోజులూ ప్రకాష్ రాజ్ అక్కడుండాలనీ అంటాడు. ప్రకాష్ రాజ్ కి అసలు సాంప్రదాయాలూ, పూజా పురస్కారాలూ, ముహూర్తాలూ అంటే వొళ్ళు మంట. టైంవేస్ట్ అనుకుంటాడు. టైంని డబ్బుతో కొలిచే మహా బిజినెస్ మాగ్నెట్. అలాటిది అతను కూడా నితిన్ కండిషన్ కి ఒప్పుకుంటాడు. 

     ఇక నితిన్ ఆ ప్రీ మారిటల్ అగ్రిమెంట్ అనే విడాకుల కాగితాల మీద సంతకం పెట్టేస్తాడు. అన్నేసి పేజీల్లో ప్రకాష్ రాజ్ ఏమేం ఘోరాలు రాశాడో చదవకుండానే. నితిన్ తన ప్రవచిత పవిత్ర పెళ్లి క్రతువుని మర్చిపోయాడే అనుకుందాం, ఒక చదువుకున్న యూత్ ఫుల్ క్యారెక్టర్ గానైనా, కథకి హీరోగా,  అంత అమాయకంగా విడాకుల కాగితాల మీద సంతకమెలా పెడతాడు? ప్రకాష్ రాజ్ చేతిలో బలిమేక ఐపోడా? ఎప్పుడంటే అప్పుడు ప్రకాష్ రాజ్ బ్లాక్ మెయిల్ చేయడా? బ్రతుకు నరకం చేస్తూ కక్ష తీర్చుకోడా? 

          రెండోది, ఈ అగ్రిమెంట్ సంగతి కూతురికి తెలుసా అనికూడా అడగడు నితిన్. ఆమె సమక్షంలోనే సంతకం పెడతానని కూడా అనడు. ఎందుకని? ఆమెకి తెలియకుండా ఆమె కోసం ఏమైనా త్యాగాలు చేస్తున్నాడా? అలాంటిదేమీ లేదు. ఆమెని పెళ్ళాడి తీరాలన్న యావ కొద్దీ అన్నట్టే సంతకం పెట్టేస్తాడు. 

          ఇదలా వుంచితే, అసలు ప్రకాష్ రాజ్ కి నితిన్ కండిషన్ పెట్టడ మేమిటి...తన స్థాయికాని ఓ పల్లెటూరి మధ్య తరగతి ఉమ్మడి కుటుంబానికి చెందిన నితిన్ ని మాటమాత్రం అనకుండా, అంతేసి బిగ్ షాట్ అయిన ప్రకాష్ రాజ్, కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నాడంటేనే అతడి ఉన్నతాదర్శం బయట పడుతోంది. అతను ఇక్కడే చాలా కాంప్రమైజ్ అయ్యాడు. కూతురికి ఎలాటి ఉన్నత సంబంధం గురించి కలలు గన్నాడో. కామన్ గై నితిన్ కిచ్చి చేయడానికి సిద్ధపడ్డాడు. చాలా త్యాగం చేశాడు. వీటి ముందు నితిన్ సాంప్రదాయాలెంత! వాటికి  తలొగ్గాలని డిమాండ్ చేయడమేం గొప్ప? 

          ప్రకాష్ రాజ్ సంస్కారం ముందు నితిన్ ఇంటిల్లి పాదీ ప్రాకులాడే సాంప్రదాయాలు వెలవెలబోవా? ఆ మనోభావాలన్నీ క్యాన్సిల్ అయిపోవా? అంటే ఈ కథే వుండకుండా పోదా? మారు మాట్లాడకుండా ప్రకాష్ రాజ్ ఇష్టప్రకారమే పెళ్లి జరిపించుకుని వెళ్లిపోవాలి నిజానికి. ఇంకోటే మిటంటే, పెళ్లి తమ వూళ్లోనే తమ ఇంట్లోనే జరగాలంటాడు నితిన్. మగపెళ్లి వారింట పెళ్లి జరగడం ఏ సాంప్రదాయమో?

     వీళ్ళతో ఎందుకు గోల అనుకున్నాడో ఏమో ప్రకాష్ రాజ్, దానికి కూడా ఒప్పుకుని వాళ్ళింట్లోనే పెళ్లి తంతు వాళ్ళకే వదిలేసి,  ప్రేక్షకుడిలా కూర్చుంటాడు. ప్రకాష్ రాజ్ ఇంటి కొస్తే, బూట్లు తీసి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చేలా టార్చర్ పెడతారు. అప్పుడు కూడా సాంప్రదాయపు క్లాసు పీకుతారు. తర్వాత చూస్తే, తామే చెప్పులేసుకుని ఇంట్లో తిరుగుతూంటారు. ప్రకాష్ రాజ్ బంగాళా కెళ్తే, కాళ్ళు కడుక్కుని లోపలి కొస్తాం నీళ్ళి మ్మంటారు. వొళ్ళు మండి పోతూంటుంది ప్రకాష్ రాజ్ కి. 

          నిశ్చితార్ధమప్పుడు, కట్నం గిట్నం అంటూ నసుగుతారు. ప్రకాష్ రాజ్ ఓ లుక్కేసే సరికి సర్దుకుని, ఇద్దరమ్మాయిలుంటే ఒకమ్మాయి ఆస్తి మనోడిదే కదా అని జోకులేసు
కుంటారు.

***
      పాయింటు కొద్దాం. ప్రకాష్ రాజ్ కి ఇచ్చే విడాకుల పత్రాల మీద నితిన్ సంతకం పెట్టడం పాయింటు. ప్రకాష్ రాజ్ కి నితిన్ సాంప్రదాయాల కండిషన్ పెట్టడం కౌంటర్ పాయింట్. ఇది మొదటి మూలస్థంభం. ఇక్కడ కథా ప్రారంభం. మరి కథ ప్రారంభమవడానికి తగిన ఎలిమెంట్లు ఈ పాయింట్స్ లో వున్నాయా? ఇక్కడ పాయింటు భవిష్యత్తులో అమలయ్యే అవకాశమున్నది. అది ప్రకాష్ రాజ్ అస్త్రం. కౌంటర్ పాయింటు తక్షణం అమలయ్యేది. ఇది నితిన్ చేతిలో అస్త్రం. తక్షణం అమలయ్యే కౌంటర్ పాయింటుతోనే కథ నడవాలి, నడిచింది కూడా.

          అయితే మార్కెట్ యాస్పెక్ట్ లో – ఈ కౌంటర్ పాయింటు కి యూత్ అప్పీలుందా? మార్కెటబిలిటీ వుందా? దీంతో బిజినెస్ అవుతుందా? దీన్ని ప్రేక్షకులకి అమ్మగలరా? పై పేరాల్లో ముందే విశ్లేషించుకున్నట్టు - ఓ పెద్ద మనిషికి ఓ కుర్రోడు పెళ్లి సాంప్రదాయాలు నేర్పడం ఏ విధంగానూ సేఫ్ పాయింటే కాదు. ఎలా కాదో పై పేరాల్లోనే సవివరంగా చెప్పుకున్నాం. 

          ఇక క్రియేటివ్ యాస్పెక్ట్ లో చూస్తే – ఇక్కడ తటస్థించిన ప్లాట్ పాయింట్ వన్ లో, నితిన్ కౌంటర్ పాయింటు వేశాడంటే ఏమిటర్ధం? అతడికి గోల్ ఏర్పడిందని అర్ధం. తన పెళ్ళిలో ప్రకాష్ రాజ్ సాంప్రదాయబద్ధంగా నడుచునేట్టు చేసి, అతణ్ణి మార్చెయ్యడం గోల్. అప్పుడీ గోల్ సక్సెస్ అవాలంటే అందులో ఎలిమెంట్స్ ఏవేవి వుండాలి? ఈ బ్లాగులోనే అనేక సార్లు చెప్పుకున్నట్టు – 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్.

          కోరిక : గొంతెమ్మ కోరిక. న్యూసెన్స్ చేయకుండా కూతుర్నిస్తున్న ప్రకాష్ రాజ్ ఉన్నతాదర్శమే, నితిన్ ఇంకేమీ కోరకుండా చేస్తోంది. కాబట్టి ఇంకా కోరికకి స్థానం లేదు. మొదటి ఎలిమెంట్  ఆవిరై పోయింది. 

          పణం : ప్రకాష్ రాజ్ ని మార్చడానికి నితిన్ దేన్ని పణంగా పెడుతున్నాడు? జీవితాన్నా? తను నమ్మిన సాంప్రదాయాల కోసం దేన్ని పణంగా పెడుతున్నాడు? దేన్నీ  లేదు. మొదటి ఎలిమెంట్ కోరికే క్యాన్సిలై నప్పుడు, ఆ కోరికకు కారణమైన సంప్రదాయాల వాదమే అప్రసుతమైపోయింది. దీంతో పణం కూడా అప్రస్తుతమైపోయింది. రెండో ఎలిమెంట్ కూడా ఆవిరైపోయింది. 

          పరిణామాల హెచ్చరిక :  ప్రకాష్ రాజ్ తో సాంప్రదాయాల చెలగాటంలో ఉత్పన్నమయ్యే అపాయాలేమిటి? పరిణామా లేమిటి? చూసి చూసి మంట రేగిపోయి ప్రకాష్ రాజ్ విడాకుల పత్రాలు పైకి తీసి నితిన్ పీచమణుస్తాడా? అప్పుడు పెళ్ళాగి పోతుందా? పెళ్ళే జరక్కుండా ప్రకాష్ రాజ్ అస్త్రాన్నేం చేసుకుంటాడు? దాంతో అతనే అల్లరవుతాడు. ఛీత్కారాలు పొందుతాడు. కాబట్టి ఆ అస్త్రాన్ని తీయడు. కాబట్టి నితిన్ కి రానున్న పరిణామాల హెచ్చరికేమీ లేదు. మూడో ఎలిమెంట్ కూడా ఆవిరి.

          ఎమోషన్ : పై మూడూ లేనప్పుడు ఎమోషన్ ఎక్కడిది?
          ఇలా గోల్ ఎలిమెంట్స్ నాల్గూ లుప్తమైనప్పుడు నితిన్ చేసేదేమిటి? అందుకే ఈ ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో నిర్లిప్తంగా వుండిపోయాడు. అంటే పాసివ్ గా మారిపోయాడు. కథానాయకుడి బాధ్యత కోల్పోయాడు. మంచిదో చెడ్డదో, ఏర్పాటైన పాయింటుకి హీరో అనే వాడు బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు. తన పాయింటుని ముందుకి నడిపించే కార్యశూర్యు డవుతాడు. ఇదేమీ కన్పించదు. 

      ప్లాట్ పాయిట్ వన్ దగ్గర ఒక పాయింటుతో కథ పుట్టిందంటే, మిడిల్ ప్రారంభమైనట్టే. మిడిల్ బిజినెస్ ప్రకారం ప్రధాన పాత్ర, ప్రత్యర్ధి పాత్రల మధ్య గోల్ కోసం యాక్షన్ రియక్షన్లతో సంఘర్షణ మొదలయినట్టే. ఇంతకంటే ఇంకేమీ జరగాల్సిన అవసరం లేదు. నితిన్ కి గోలే సరిగ్గా ఏర్పాటు కానప్పుడు, ప్రకాష్ రాజ్ తో ఇంకేమని సంఘర్షిస్తాడు. ఓ రెండు చోట్ల ప్రకాష్ రాజ్ టైముకి రాకపోతే వెళ్లి ఆ అడ్డంకుల్ని క్లియర్ చేస్తాడు తప్ప. 

          ఇక మిగతా విషయాల్లో నితిన్ పరివారమే ప్రకాష్ రాజ్ ని సాంప్రదాయాల్లో కలుపుకు
పోతూంటారు. ఇలా మిడిల్ బిజినెస్ ధర్మం కూడా ఆవిరైపోతుంది. అంతా నితిన్ పరివారపు పెళ్లి పనులూ, వాటికి పేరుపేరునా సాంప్రదాయాల నామకరణాల ప్రదర్శనగా సాగిపోతుంది.
ఏది కథ? ఏది నేపధ్యం? కథకి ఏది అవసరం? నేపధ్యమా? కథానాయకుడి కర్యశూర్య
త్వమా? ఇక్కడ పెళ్లి పనుల నేపధ్యమే కథై పోయి, కథతో వుండాల్సిన కథానాయకుడు నేపధ్యంలో కెళ్ళిపోయాడు! గోల్లేని హీరో గల్లంతే కదా?
          కౌంటర్ పాయింటుతో మార్కెట్ యాస్పెక్ట్ అలా వుంటే, క్రియేటివ్ యాస్పెక్ట్ కూడా ఇలా వుంది.
***

          ఇక విడాకుల అగ్రిమెంట్ పాయింటు గురించి. దీని మార్కెట్ యాస్పెక్ట్ ఎలా చెడిపోయిందో పైనే చెప్పుకున్నాం. ప్రేక్షకులు కన్విన్స్ అవ్వని పాయింటు. ప్రకాష్ రాజ్ రైటే, నితిన్ రాంగ్. తానేదో నమ్మే పెళ్లి పవిత్రతని పక్కన పెట్టి సంతకం పెట్టాడు. నైతికంగా దిగజారాడు. ప్రకాష్ రాజ్ హింసించి, బలవంతంగా సంతకం పెట్టించుకో లేదు. నితిన్ స్వచ్ఛందంగా సంతకం పెట్టాడు. మార్కెట్ యాస్పెక్ట్ కి చాలా బ్యాడ్. ఈ పాయింటుని ప్రేక్షకులకి అమ్మలేరు. 

          క్రియేటివ్ యాస్పెక్ట్ చూస్తే, కథలో ఈ పాయింటుకి స్థానం లేదు. ఈ అగ్రిమెంట్ సెటప్ అనేది కథలో పే ఆఫ్ అయ్యేది కాదు, అమలయ్యేదీ కాదు. పెళ్లి జరిగి, సంసారమేదో చేసుకుంటూ వుంటే, ఆ సంసారాన్ని చెడగొట్టడానికైతే పాయింటుకి స్థానం వుంటుంది. ఈ కథకి పెళ్ళే ముగింపు అయినప్పుడు, ఆ తర్వాత ప్రేక్షకుల్ని బయటికి పంపేసినప్పుడు, సంసారం కథ ఇక లేనట్టే. ఒకవేళ పెళ్లి చేసుకున్న పాత్రలు ప్రేక్షకులు వెళ్ళిపోయాక థియేటర్లో సంసారం చేసుకుంటూ వుంటే, ప్రకాష్ రాజ్ విడాకుల పత్రాలతో దుమారం రేపుతూంటే, అది ప్రేక్షకులు చూసే అవకాశం లేదు. కాబట్టి వున్నకథలో ఈ పాయింటుకి పౌరసత్వం లేదు. బంగ్లాదేశ్ పంపాల్సిందే. 

          ఇంటర్వెల్లో ఈ పాయింటుని ఏర్పాటు చేశారు. అప్పుడు ఇంటర్వెల్ తర్వాత పెళ్లి జరిగి సెకండాఫ్ కాపురం కథగా నడిస్తే, ఈ పాయింటుకి ప్లే అయ్యే అదృష్టం దక్కుతుంది. కథకావల ఎప్పుడో జరిగే అవకాశమున్న పాయింటుని సృష్టించి కథ నడడం సాధ్యం కాదు. కథకావల కాదు, కథలోనే క్లయిమాక్స్ లో పెళ్ళిపీటల మీద ఈ పాయింటే ప్లే అయింది కదా అనొచ్చు. నిజమే, అయితే ఎంత న్యాయంగా ప్లే అయిందో చూద్దాం. 

          సడెన్ గా నితిన్ కి పెళ్లి పీటల మీద అంతర్మథనం మొదలవుతుంది. తను విడాకుల పత్రాల మీద సంతకం చేశాడన్న విషయం దాచి అందరికీ ద్రోహం చేస్తున్నాడని. ఇలాటి బుద్ధితో పవిత్రమైన పెళ్లి పీటల మీద, సప్తర్షులు కొలువుదీరే కళ్యాణ మంటపంలో ఎలా పెళ్లి చేసుకోను? అని వాపోతాడు. ఒక్కో పెళ్లి మంత్రం చదువుతూ, మంత్రాలలా చెప్తూంటే,  ఇలాటి మనసుతో ఎలా తాళి కట్టను? అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. 

          ఎవరూ ఎందుకు సంతకం పెట్టావని అడగరు, అతనూ చెప్పడు. చెప్పడానికి కారణం లేదు. వుంటే చెప్పుకునేది కాదు. ఎందుకు సంతకం పెట్టి వుంటాడో పై పేరాల్లోనే చెప్పుకున్నాం. దురదృష్టమేమిటంటే, ఆ సంతకం ఎందుకు పెడుతున్నాడో అప్పుడే ఏదో విధంగా తెలియజేయలేదు కథకుడు. దాటవేశాడు. అలాంటప్పుడు పాత్ర మనసులో ఏముందో ఎవరికెలా తెలుస్తుంది? అందుకే  హీరోయిన్ని పెళ్లి చేసుకుని కులకాలన్నఏకైక యావ కొద్దీ సంతకం పెట్టాడని అనుకోవాల్సి వస్తోంది.

          చెప్పుకుంటే ఇప్పుడా యావ గురించి చెప్పుకోవాలి. అందుకే ఎవరిచేతా సంతకం ఎందుకు పెట్టావని అడిగించలేదు కథకుడు. తెలివైన వాడు. సంతకం పెడుతున్నప్పుడు గుర్తుకు రాని సత్సాంప్రదాయాలు ఇప్పుడు గుర్తొచ్చాయా? సరే, అప్పుడేదో తప్పు చేశాడు, ఇప్పుడు దిద్దుకుంటున్నాడుగా అనొచ్చు. సత్సాంప్రదాయాలు తెలియని వాడు అప్పుడు తప్పు చేయవచ్చు, ఇప్పుడు కొత్తగా తెలుసుకుని తప్పు దిద్దుకోవచ్చు. ఈ క్యారక్టరైజేషన్ బావుంటుంది. అంతేగానీ, సత్సాంప్రదాయాలకే ఒక బ్రాండ్ అంబాసిడరైన వాడు తప్పు చేస్తాడా, అదిప్పుడే తెలుసుకుని దిద్దుకుంటాడా? బ్రాండ్ అంబాసిడర్ కాదు, గ్రాండ్ మాస్టర్. ఎందుకంటే, నితిన్ పాత్ర చిత్రణ తెలియకుండా ఇలా జరిగిపోయింది.

          ఎలాగంటే, క్లయిమాక్స్ లో నితిన్ పెళ్లి మంటపంలో విడాకుల పత్రాల్నివెల్లడి చేస్తూ తన ద్రోహం గురించి ప్రాయశ్చిత్తపు డైలాగులు చెప్తూంటే, ఎలాటి సెన్స్ వెళ్తూందంటే - ఇతను సంతకం పెట్టినప్పుడే ఇదంతా ప్లాన్ చేశాడనీ, ముందైతే సంతకం పెట్టేద్దాం, పెళ్లి సమయంలో దీన్ని రట్టు చేసి ప్రకాష్ రాజ్ ని ఇరికించేద్దాం, ఇక పెళ్లి చేసుకుని అవతల పడదాం – అనుకున్నట్టుందనీ అన్పిస్తుంది. దొంగాటకమాడుతున్నాడనే సెన్సే వెళ్తుంది. అదీ మళ్ళీ తను పెళ్లి పవిత్రత గురించి అంత చెప్తున్న మంటపం దగ్గరే!  
          పాయింటు కాని పాయింట్లు పెట్టుకుంటే ఇలాగే తప్పు మీద తప్పు చేసుకు పోవాల్సి వుంటుంది. ఏదీ నమ్మదు మార్కెట్.

***
          యథా ప్లాట్ పాయింట్ వన్, తథాప్లాట్ పాయింట్ టూ – ఇవి మారని స్క్రీన్ ప్లే శాస్త్రపు శిలాక్షరాలు. ఒక సినిమా జాతకమేమిటో అడ్డాల నాడే చెప్పవచ్చు. గడ్డాలు పెంచుకుని నెలల తరబడీ రాసి రాసి, తీసి రిలీజ్ చేసుకుని చూసుకునే దాకా ఆగనవసరం లేదు. ఓ మూడు లైన్ల అయిడియా వచ్చినప్పుడే దాని మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్ రెండూ క్షుణ్ణంగా ఎనాలిసిస్ చేసుకుని తెలుసుకోవచ్చు. కానీ ఎవరి కవసరం ఎనాలిసిస్ లు? వూరికే రివ్యూలు రాసుకోవడానికి అవసరం. స్క్రిప్టులు రాసే కథకుల కవసరం లేదు. వాళ్లకి ఇట్టే మ్యాజిక్కులు జరిగిపోతాయి. కథల్ని అమ్మాలి గానీ, పాయింట్లేమిటి? నాన్సెన్స్! విత్తనం లేకుండా చెట్టుని మొలిపించగలరు.

సికిందర్