రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, జులై 2014, శుక్రవారం

రివ్యూ..
మాస్ మసాలా శీను!

స్క్రీన్ ప్లే- దర్శకత్వం : వి.వి.వినాయక్
తారాగణం : బెల్లంకొండ శ్రీనివాస్, సమంతా, తమన్నా, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, తనికెళ్ళ భరణి, రవిబాబు, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్    ఛాయాగ్రహణం : ఛోటా కె. నాయుడు  కూర్పు: గౌతమ్ రాజు
రచన: గోపీమోహన్   మాటలు : కోన వెంకట్
బ్యానర్ : శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్       నిర్మాతలు  : బెల్లకొండ సురేష్, బెల్లంకొండ గణేష్
విడుదల : 25 జులై 2014     సెన్సార్ : ‘A’
**
మరో కొత్త యువ వారసుడు రంగప్రవేశం చేశాడు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్ వెండితెర ఎంట్రీ కోట్లరూపాయల భారీ బడ్జెట్ ని వెదజల్లుతూ అట్టహాసంగా జరిగింది. బడాబడా సాంకేతికుల సపోర్టుతో బ్రహ్మాండమైన కమర్షియల్ పండుగని  ప్రేక్షకులకి నజరానాగా సమర్పించడానికి తీవ్ర కసరత్తు చేశారు.  భారీఎత్తున పబ్లిసిటీతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ని సృష్టించిన ఈ మాస్ కమర్షియల్ ని పక్కాగా అందించడానికి ముందువరసలో నడుంకట్టి నిలుచున్నారు టాప్ దర్శకుడు వి.వి. వినాయక్. ఆయనకి తోడుగా క్యాచీ కెమెరా వర్క్ తో ఛోటా కె.నాయుడు, హిట్ ట్యూన్స్ తో దేవీశ్రీ ప్రసాద్ నిలిచారు. ఇంకా ప్రముఖ కోరియోగ్రాఫర్లూ, యాక్షన్ డైరక్టర్లూ, ఇతర పేరున్న టెక్నీషియన్లూ అందరూ తోడై పోటాపోటీగా పనిచేశారు. మరైతే ఇన్నిహంగులూ వరించడానికి యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిజంగా అర్హుడైన టాలెంటేనా?


ఈ యువ హీరోని పరిచయం చేయడానికి రొటీన్ కథనే ఎన్నుకున్నారు. ఎమోషనల్ సీన్లకి తావులేకుండా జాగ్రత్త పడ్డారు. శ్రీనివాస్ కి అమెరికాలో శిక్షణ ఇప్పించి ముందు మంచి డాన్సర్ గా, ఫైటర్ గా ఎష్టాబ్లిష్ చేయడానికే  పూనుకున్నారు. నటనమీద అప్పుడే వొత్తిడి అనవసరమన్పించి,  హావభావాల ప్రద ర్శనకంటే, కామెడీతో అలా అలా నడిపించెయ్యడమే బెటరని నిర్ణయించుకున్నట్టుంది. 

కథేంటి?
రొటీన్ కథ అని ముందే చెప్పుకున్నాం. ఒకానొక వూళ్ళో మామ నరసింహా (ప్రకాష్ రాజ్ ) తో కలిసి బాగా అప్పులు చేసి తీర్చలేక అతన్తో పారిపోయి రైలెక్కేస్తాడు శీను (బెల్లంకొండ శ్రీనివాస్). చెన్నై వెళ్తున్నామనుకుని హైదరాబాద్ లో దిగుతారు. ఆటోవాలా (వెన్నెల కిషోర్) ఈ అమాయకుల్ని ఇదే చెన్నై అని నమ్మిస్తూ నాయుడు (రఘుబాబు) అనే హోటల్ యజమానికి అప్పగిస్తాడు. నాయుడు తన గ్యాంగ్ తో కలిసి వీళ్ళని దోచేద్దా మానుకుంటే ఏమీ వుండదు. ఇలా వుండగా ట్రాఫిక్ లో శీను అంజలి (సమంతా) ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె భాయ్ (ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయం) అనే ఒక గ్యాంగ్ లీడర్ కూతురు. ఇంకోరోజు సాక్షాత్తూ భాయ్ ని చూసి అతను అచ్చం తన మామ నరసింహా లాగే ఉండడంతో, ఓ ప్లానేస్తాడు. మామని భాయ్ లాగా  తిప్పుతూ భాయ్ చేయాల్సిన బిజినెస్ ని కొట్టేస్తూంటాడు. మరో వైపు షార్జాలో వుండే భాయ్ పార్టనర్ (ప్రదీప్ రావత్) కొడుకు రోహిత్ తో అంజలికి పెళ్లి కుదుర్తుంది. త్వరలో రోహిత్ ఇక్కడికి రాబోతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శీను తనే రోహిత్ అని నమ్మిస్తూ అంజలికి దగ్గరవుతాడు.

ఇలా వుంటే, మామ నరసింహం తో కలిసి శీను ఆడుతున్న నాటకం భాయ్ కి తెలిసి పోతుంది. ఏనాడో చనిపోయాడ నుకున్న నరసింహం బతికే వుండడం భాయ్ ని కంగారు పెడుతుంది. వెంటనే నరసింహం –శీను లిద్దర్నీ చంపెయ్యమని ఆర్డరేసి కూతురి పెళ్లి చేయడానికి ఆమెని తీసుకుని షార్జా వెళ్లి పోతాడు భాయ్.
ఇప్పుడు శీను ఈ హత్యా ప్రయత్నం నుంచి ఎలా తప్పించుకున్నాడు, అసలు నరసింహం గతం ఏమిటో తెలుసుకుని షార్జా వెళ్లి భాయ్ పనిబట్టి, అంజలిని తన సొంతం ఎలా చేసుకున్నాడన్నది ఇక్కడ్నించీ సాగే సెకండాఫ్ కథ!
కామెంట్!
అనేక సార్లు చూసి వున్న రొటీన్ ఫార్ములా కథే. కాకపోతే నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉండడంతో కళ్ళప్పగించి చూసేలా చేస్తుంది. మరీ బాగా పేలే పంచ్ డైలాగులు లేవుగానీ, ఉన్నంతలో కమేడియన్ల చేత సాఫ్ట్ కామెడీని పండించగలిగారు. భాయ్ అనుచరుడుగా బ్రహ్మానందం పోషించిన డింపుల్ పాత్ర రొటీన్ గా సెకండాఫ్ లో రాకుండా ఫస్టాఫ్ నుంచే వుంటుంది. ఒకేలా వున్న నరసింహం, భాయ్ లతో తికమక పెట్టే సన్నివేశాల్లో బ్రహ్మానందం హాస్యం కొన్ని చోట్ల బాగా పేలింది. షార్జా పార్టనర్ అనుచరుడి పాత్రలో రవిబాబు ఇంకో వెర్రిబాగులవాడి కామెడీని పండించాడు. రఘుబాబు, వెన్నెల కిషోర్, వేణు తదితర హాస్యబృందం ప్రేక్షకుల్ని వినోద పరచడానికి ఉన్న పాత్రల పరిధిమేరకు కృషి చేశారు. అయితే మొత్తంగా చూస్తే సినిమాలో కామెడీ ఉండాల్సిన రేంజిలో మాత్రం లేదు.
ఇక ద్విపాత్రాభినయంలో ప్రకాష్ రాజ్ సన్నివేశాల బలం పెంచుతాడు. ప్రదీప్ రావత్  గెటప్ అతడి కరకు విలనిజాన్ని పండించడానికి అడ్డుపడింది. గడ్డం మీసాల తీరు సాఫ్ట్ నేచర్ ని వ్యక్తీకరించడంతో వచ్చిన సమస్య ఇది!

ఇక కొత్త హీరో శ్రీనివాస్ గురించి ముందే చెప్పుకున్నాం. ఈ సినిమా ఇతడికి ఇంజనీరింగ్ కోర్సులో చేరడానికి ఎంసెట్ రాయడం లాంటిది అనుకుంటే ఇందులో ఇతను ఉత్తీర్ణుడైనట్టే. తర్వాత వచ్చే సినిమాల్లో ఇతను డాన్సులూ పోరాటాలతో బాటు, తన నటనాభినివేశాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి వుంటుంది. లేకపోతే కార్డ్ బోర్డు నటుడిగా ఫేడవుట్ అయిపోయే ప్రమాదముంది.
హీరోయిన్ సమంతా గ్లామర్ కోషెంట్ కోసం ఉపయోగపడింది. అయితే మరీ ‘దూకుడు’, ‘ఆటోనగర్ సూర్య’ ల్లో లాగా సెకండాఫ్ లో కథలోంచి మాయమైపోకుండా ఆద్యంతం ఉంటూ రక్షించింది. మొదటి పాటలో ఐటం గర్ల్ గా వచ్చిపోయే తమన్నా మరో కమర్షియల్ దినుసు!

ఏ సిల్వర్ స్క్రీన్ అయితే నిండుగా కన్నులపండువగా వెలిగిపోతుందో- అది ఛోటా కె.నాయుడు కెమెరా వర్క్ కి నిదర్శనంగా గుర్తుపట్ట వచ్చు- అని గతంలో ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న సందర్భంగా ఈ సమీక్షకుడికి వెల్లడించిన ఛోటా కె. నాయుడు మరోసారి ఆ మాట నిలబెట్టుకున్నారు. ఈ సినిమా ఆయనెందుకు టాప్ డీ ఓ పీ నో అడుగడుగునా నిరూపిస్తుంది- పాటల చిత్రీకరణలో మరీనూ!

పాటలతో దేవీశ్రీ ప్రసాద్ దీన్నో మ్యూజిక్ ఫెస్టివల్ గా మార్చేశారు. పాటలు, పోరాటాలు, కాసింత కామెడీ ఈ భారీ కమర్షియల్ ని వినోదించడానికి పోటీపడ్డాయి. అయితే, ఇందరు టాప్ కళాకారులతో భారీ హంగులతో రూపొందిన  ఈ సినిమాకి వెనకబడిపోయింది స్క్రిప్ట్ ఒక్కటే! ఇంతమంది పెద్ద తారాగణం,  పేరున్న టెక్నీషియన్లూ అందరూ పోటాపోటీగా పనిచేసి సినిమాని నిలబెట్టడానికి విపరీతంగా కృషిచేస్తే, స్క్రిప్టు బాధ్యతలు తీసుకున్న రచయితలు  మాత్రం ఈ పోటీలో భాగం కాలేకపోయారు. రచయితలు  కోన వెంకట్- గోపీ మోహన్ లు  అరిగిపోయిన మూసలోంచి బయటికి రావడానికి ససేమిరా అంటున్నారు! అదిసరే, స్క్రీన్ ప్లే నిర్వహణలోనూ పెద్ద పొరపాట్లు చేస్తున్నారు!

దర్శకుడు వినాయక్ ఈ మూస కథకి  తనదైన చిత్రీకరణతో నవ్యత సాధించడానికి చేసిన కృషి కూడా తెరమీద కన్పిస్తుంది- మొత్తం మీద బెల్లంకొండ వారసుడికి సేఫ్ పాసేజ్ కల్పించి ముందుకు నెట్టారు!

 స్క్రీన్ ప్లే సంగతులు

ఈ స్క్రీన్ ప్లేలో సమయం వృధా చేయకుండా కథనంలో రావాల్సిన మలుపుల్ని, కొన్ని ప్రధాన పాత్రల షేడ్స్ ని, మరికొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ నీ  వెంటవెంటనే బాగానే ఏర్పాటు చేసుకుంటూ పోయారు. ప్రధాన సమస్య- భాయ్ పాత్ర తనకో డబుల్ (నరసింహం) ఉన్నాడని తెలుసుకుని హీరోతో సహా మిత్రబృందాన్నంతటినీ సజీవ దహనానికి ఆర్డరేసి,  హీరోయిన్ తో షార్జా పారిపోయే ఘట్టం- ఇది ఇంటర్వెల్లో వస్తుంది. అంటే ఫస్ట్ యాక్ట్ ఇక్కడి దాకా సాగి  ముగిసిందన్నమాట.

నిజానికి సినిమా ప్రారంభమైన అరగంట లోపే, శీను హైదరాబాద్ లో తన మామ లాగే వున్న భాయ్ ని చూసి, మామతో భాయ్ లా గేమ్ ఆడ్డం ప్రారంభించినప్పుడే, సమస్య ఇక్కడే పుట్టి కథ సెకండ్ యాక్ట్ లో పడిందనుకుంటాం. ఇది చాలా మంచి ఎత్తుగడ. క్యారక్టర్ కలర్ ఫుల్ గా  ఎప్పుడు కన్పిస్తుందంటే, ఇలాటి సాహసాలకి తెగించి సంఘటన సృష్టించినప్పుడే! ఆ సంఘటన ప్రత్యర్ధికి ఇంకా తెలీయకుండా, ఆడియెన్స్ కి తెలిసిపోతున్నప్పుడే. దీంతో ఉత్కంఠ, ఏమవుతుందో నన్న సస్పెన్సూ ఏర్పడతాయి. What is character but the determination of incident? And what is incident but the illumination of character?- అని హెన్రీ జేమ్స్ అంటాడని దివంగత సిడ్ ఫీల్డ్ అనేక సార్లు పేర్కొన్నాడు!

పాత్రని ఆవిష్కరించడానికి తగిన సంఘటనల కోసం అన్వేషణ సాగుతుంది- అంటారు డా. వల్లంపాటి వెంకట  సుబ్బయ్య కూడా- తన కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన గ్రంథం ‘కథా శిల్పం’లో. అంతే గాక పాత్ర ఎవరికి  ప్రాతిధ్యం వహిస్తోంది? –అన్నది కూడా ముఖ్యమే నంటారు. ఈ వివరాల లోతుల్లోకి వెళ్ళకుండా స్థూలంగా చెప్పుకుంటే, ప్రతీ మనిషీ ఒక గుంపుకి చెందివ వాడై ఉంటాడు. మన దేశంలో మతం, కులం, భాష, ప్రాంతం మనుషుల్ని గుంపులుగా విభజించాయి....ఇవి కాకుండా వర్గ తారతమ్యాలూ, ఉద్యోగమూ, సామాజిక స్థాయీ, లింగ బేధమూ, వయస్సూ సైతం మనుషుల్ని గుంపులుగా విభజిస్తాయి..వీటిలో ఏ గుంపుకు చెందిన మనిషైనా తనకి తెలీకుండా ఆ గుంపు భావజాలానికి లోనవుతాడు...ఇలా గుంపు భావజాలానికి ప్రాతినిధ్యం వహించేలాగా కథలో చిత్రించిన పాత్రల్ని ప్రాతినిధ్య పాత్రలంటారు..వీరు గుంపుకు నమూనాలు, మచ్చు తునకలు...ఇంగ్లీషులో చెప్పాలంటే ‘టైప్స్’... కథా సాహిత్యంలో ఈ నమూనా ప్రాతినిధ్య పాత్రలే చాలా ఎక్కువ ఉంటాయని వివరించుకొస్తారు సుబ్బయ్య.

ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే, ఈసినిమా కథలో తర్వాత బయట పడే ఒక ఉదంతం వుంది. ఈ ఉదంతమే ఈ కథంతా పుట్టడానికి కారణం. ఈ ఉదంతం లేకపోతే కథే లేదు, సినిమా కూడా లేదు . ఇది అంతర్గతం గా ( హిడెన్ ట్రూత్ గా ) ఉంటూ, ఇంటర్వెల్ మలుపు తర్వాత బయట పడుతుంది. కథలో ఒక  హిడెన్ ట్రూత్ అంటూ ఉన్నాక, దాన్ని పక్కన పెట్టేసి,   పైపైన పాత్రలతో ఎంత ఆటాడించినా అది వెలవెల బోతూనే వుంటుంది. ఇదే జరిగిందిక్కడ. ఈ సినిమా సెకండాఫ్ దెబ్బతినిపోవడానికి ఇదే కారణం.

ఇరవై ఏళ్ల  క్రితం నల్లగొండ జిల్లాలో ఫ్లోరీన్ బాధితుల సమస్య తీసుకుని, దాని పరిష్కారాన్ని విలన్ చేత భంగ పరచిన ఫ్లాష్ బ్యాక్ ఈ కథలో వుంది. నరసింహం ఆ వూళ్ళో మోతుబరి. ఫ్లోరీన్ సమస్య తీర్చడానికి మంచి నీటి ప్లాంటు కోసం ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంలో తను పాతిక కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకుంటాడు. అందులో పది  కోట్లు ప్రజలనుంచి సేకరిస్తాడు. ఈ డబ్బు మీద కన్నేసిన తమ్ముడు (తర్వాత భాయ్ గా మారాడు) అన్న నరసింహం కుటుంబం మీద దాడి చేసి, ఆ డబ్బుతో, ఐదేళ్ళ అన్నకూతురు అంజలి తో పారిపోతాడు. అంజలిని ఎందుకు చంపలేదంటే, ఇంకో ఇరవై ఏళ్ల  తర్వాత తండ్రి ఆస్తి ఆమెకే వస్తుందని! లోకానికి మాత్రం అన్న తన కుటుంబాన్నీ, సెక్యూరిటీ పోలీసుల్నీ  చంపేసి డబ్బుతో పారిపోయినట్టు చిత్రిస్తాడు. లోకం మంచోడైన అన్నని అసహ్యించు కుంటుంది. అయితే తను చంపేశాడనుకున్న అన్న ప్రాణాలతో బయట పట్టాడన్న నిజం ఈ తమ్ముడికి తెలీదు. అలా బద్నాం అయిన అన్న వేరే వూరికి పారిపోయి బతికాడు. అక్కడే శీను దొరికి అతన్ని పెంచుకున్నాడు తమ్ముడేమో ఆ పాతిక కోట్లతో ఇప్పుడు వందలకోట్లకి ఎదిగి భాయ్ గా దందాలు చేస్తున్నాడు.
ఇదీ జరిగిన విషయం!
ఇదిశీను అడిగితే చెప్పుకొస్తాడు నరసింహం. శీను సంగతేమో గానీ,  మనలాంటి సామాన్య ప్రేక్షకులకి వెంటనే ఇప్పుడిన్నేళ్ళకి ఫ్లోరీన్ సమస్య తీరని పీడితులు ఇంకెంతమంది పెరిగిపోయి  యాతన పడుతున్నారో కదా- అని సినిమాలో మనకి తాజా పరిస్థితి చూపించకున్నా,  ఆ హృదయవిదారక దృశ్యాలు  కళ్ళముందు కదలాడతాయి...ఇది నిజంగా కథాత్మని ఆవిష్కరించే సన్నివేశం!

హీరోకి ఈ కథాత్మంతా అవసరం లేదు, అరంగేట్రం హీరో మీద అంత హెవీ కథ భారం మోపదల్చుకోలేదు మేము- అని ఆర్గ్యూ చేస్తే, అలాంటప్పుడు ఈ ఫ్లాష్ బ్యాకే పెట్టివుండాల్సింది కాదు. సినిమా అరగంటలోపు ఇచ్చిన మలుపుతో-దాన్నే ‘ప్రధాన సమస్య’ గా- పాయింటుగా చేసుకుని- (నిజానికే ఇదే కథాంశమని మనకి అన్పించినట్టు పైన చెప్పుకున్నాం) శీను కాకతాళీయంగా మామలాగే వున్న భాయ్ ని చూశాడు, మామని ఉపయోగించుకుని డబ్బు సంపాదనకి గేమ్ ప్లే చేశాడు, మరో వైపు డబుల్ ధమాకాగా భాయ్ కూతుర్నే లవ్ చేసిపారేశాడు, ఇది భాయ్ తెలుసుకోగానే భాయ్ ని మాయం చేసి మామనే డైరెక్టుగా భాయ్ గా ప్రవేశపెట్టాడు...ఇలా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీగా చేసుకుంటూ పోతే సరిపోయేది.
***
కానీ ఫ్లాష్ బ్యాక్ విన్న శీను సిల్లీగా మామని నిర్దోషిగా నిరూపిస్తా-అని పాతసినిమా డైలాగే  కొడతాడు. మామ నరసింహం కూడా స్వార్ధ పరుడుగా కన్పించే చిత్రణ ఇది...ఎలాగంటే, ఎంతసేపూ అతడికి తాను నిర్దోషి అని లోకానికి నిరూపించుకోవాలన్న సొంత యావే తప్ప, అసలానాడు తాను  డబ్బు ఖర్చుపెట్టి ఆదుకోబోయిన ఫ్లోరీన్ పీడితులు అన్యాయమైపోయారన్న విశాల దృక్పథంతో బాధే వుండదు!

ఈ ఫ్లాష్ బ్యాక్ రివీలయ్యాక స్టోరీ పాయింటు అసలు ఫస్టాఫ్ లో మామతో శీను ప్రారంభించిన గేము కాదనీ, ఇంటర్వెల్లో భాయ్ హీరోయిన్ తో పారిపోవడం కూడా కాదనీ, ఫ్లాష్ బ్యాక్ లో వీటికంటే తీవ్ర సమస్య వున్నాక,  హీరో రియాక్ట్ అయి దానిమీదే ఉద్యుక్తుడవ్వాలనీ అన్పిస్తుంది ఎవరికైనా.

భాయ్ హీరోయిన్ తో పారిపోయి శీనుకీ, మామకి అన్యాయం చేసి మామకీ అసలు శత్రువే కాదనీ, ఆనాడు ఫ్లోరిన్ బాధితులకి అన్యాయం చేసిన సమాజ శత్రువనీ శీనుకి అవగాహన కలగాలి. కలిగితే పాత్ర ఎదిగి క్యారక్టర్ గ్రోత్ కన్పించేది. పాత్ర అలా పైకిలేచి కథలో వున్న మొనాటనీ ని ఛేదించుకుంటూ పోయేది. శీను కేవలం మామ చెపితే వినడం కాదు, తానూ ఆ ఊళ్ళు తిరిగి ఇప్పటి పరిస్థితిని (ఫ్లోరీన్ బాధితుల్ని) కళ్ళారా గాంచి చలించిపోవాలి. అంతవరకూ తనకోసమే జులాయిగా బతికిన అతను, ఈ పరిస్థతి చూశాక ఎవరికోసం బతకాలో, ఏ ‘గుంపు’కి ప్రాతినిథ్యం వహించాలో బాధ్యత తెలుసుకుని, పెద్ద టర్న్ తీసుకోవాలి! అప్పుడతను ప్రేక్షకుల ప్రేమకి అనివార్యంగా పాత్రుడయ్యే వాడు!

ఒక సుప్రసిద్ధ అమెరికన్ పత్రికా సంపాదకుడు- ఓ కథ నాల్గు పేజీలు  చదివితే, ఈ రచయిత మనుషుల్ని ప్రేమించే రకమో కాదో తెలిసి పోతుందనీ, మనుషుల్ని ప్రేమించని రచయిత రచన  పాఠకుల్ని ఆకట్టుకోదనీ అంటాడు..ఇదే కన్పిస్తోందీ సినిమాలో.
***
.

 contd...










సాంకేతికం..
ఆనాటి ఇంటర్వ్యూ 


వాస్తవికత లేని మిక్సింగ్ వృధా!



దేవీకృష్ణ కడియాల

(సౌండ్ ఇంజనీర్-రామానాయుడు స్టూడియో) 


ఆర్టికల్..

పొంచి వుంది ముంచే కాలం !

తెలుగు సినిమాల నిర్మాణాలు ఇప్పుడు జోరు తగ్గాయి. రాష్ట్ర విభజన పరిణామాలు, దీని కారణంగా రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చే పెట్టుబడుల మందగమనం వంటి అవాంతరాలు గాకుండా, కేవలం శాటిలైట్ రైట్స్ కి తాళం పడి పోవడంతో పెద్ద హీరోల సినిమాలు తప్ప చిన్న సినిమాల ప్రారంభోత్సవాలకి ఫుల్ స్టాప్ పడింది. ఎక్కడపడితే అక్కడ తామరతంపరలా వెలసి, పోటీలకి పోయి, ధరలతోబాటు  సినిమా సాంకేతిక విలువలనీ  దిగజార్చిన రికార్డింగ్, ఎడిటింగ్, డీటీఎస్, డీఐ థియేటర్లు ఇప్పుడు పనుల్లేక బోసిపోతున్నాయి. మొన్నటివరకూ గల్లీల్లో రెండు గదుల్లో రికార్డింగ్, ఎడిటింగ్ థియేటర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు డి టి ఎస్, డిఐ టెక్నాలజీ థియేటర్లు సైతం వెలసి పెద్ద స్టూడియోల కార్యకలాపాలకి సవాలుగా మారాయి. ఇక విడుదలకి ముందే శాటిలైట్ హక్కులు కోట్లరూపాయలు అడ్వాన్సుగా తెచ్చుకునే పెద్ద సినిమాలు తప్ప, చిన్న సినిమాల ఉత్పత్తి తగ్గిపోవడంతో, వాటినే నమ్ముకున్న దర్శకులు, వాళ్ళ సహాయకులు, ఇతర టెక్నీషియన్లూ రోడ్డున పడ్డారు! ఇదీ ఈ ఏడాది తొలిసగంలో తెరవెనుక సీను.

ఇక తెర ముందుకొస్తే జనవరి- జూన్ నెలల ఆరు మాసాల కాలంలో షరా మామూలుగా 50కి పైన తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఇవన్నీ గత సంవత్సరం ఎప్పుడో ప్రారంభమైన సినిమాలు కాబట్టి ఈ సంఖ్య కనబడుతోంది. ఇంకా మరెన్నో బ్యాక్ లాగ్ సినిమాలూ వచ్చే ఆర్నెల్లలో విడుదల కావొచ్చు. తాజాగా ఈ ఏడాది కొత్త సినిమాల నిర్మాణాలు పడిపోవడంతో దీని ప్రభావం వచ్చే సంవత్సరం డిస్ట్రిబ్యూటర్ల మీద, ఎగ్జిబిటర్ల మీదా తప్పక వుంటుంది! ఆడించుకోవడానికి సినిమాల్లేక థియేటర్లు ఏమౌతాయో ఏమో! ఇంతేకాదు, ప్రకటనల రంగం మీదా ప్రభావం పడుతుంది. పత్రికలకి, ఛానెళ్ళకి సినిమా యాడ్స్  ఆదాయం తగ్గి పోవచ్చు. ప్రారంభోత్సవాలూ ప్రెస్ మీట్లూ లేక సినిమా విలేఖరులూ ఖాళీగా కూర్చోవాలి. పీఆర్ఓలు వేరే పనులు చూసుకోవాలి. ఇప్పటికే దినపత్రికల  సినిమా పేజీల్లో సినిమా వార్తల్లేక, వేరే కబుర్లు రాసుకోవాల్సిన పరిస్థితి. ఛానెళ్ళలోనూ ప్రతిరోజూ వుండే  సినిమా ప్రొడక్షన్ వార్తలు, ప్రెస్ మీట్ల విశేషాలూ రావడం లేదు. ఇక ఆడియో ఫంక్షన్లు కూడా ఐపులేకుండా పోవచ్చు.

కేవలం చిన్న సినిమాలు ఆగిపోతేనే  ఈ పరిస్థితి. చిన్న సిన్మాల నిర్మాతలకి శాటిలైట్ రైట్స్ పరంగా జేబులో పడే సొమ్ముల బరువు ఈ పరిస్థితి తెచ్చిపెట్టింది. ఛానెళ్ళు లేని కాలంలో, శాటిలైట్ హక్కుల్లేక సినిమాలు ఆడాలంటే కేవలం ప్రేక్షకులనే నమ్ముకోవాలి. ప్రేక్షకుల కోసమే అప్పట్లో సినిమాలు తీసేవాళ్ళు. కాబట్టి కాస్తో కూస్తో క్వాలిటీ వుండేది. శాటిలైట్ రైట్స్ మొదలయ్యాక నిర్మాణ దశలోనే భారీ అడ్వాన్సులు వచ్చేస్తూంటే- భక్తి దేవుడి మీద, చిత్తం ప్రసాదం మీదా  అన్నట్టు ప్రేక్షకులు కోన్ కిస్కా అయిపోయారు. ప్రేక్షకులకోసం సినిమాలు తీయడం మానేశారు. సార్, దీనికి కోటి పెడితే ఎనభై దాకా శాటిలైట్ వస్తుంది...కోటి కూడా పెట్టనక్కరలేదు, డెబ్బై  పెట్టుకుంటే ముఫై శాటిలైట్ అడ్వాన్సు వచ్చేస్తుంది..ఇలా చెబుతూ సినిమా మొహమెరుగని కొత్త కొత్త వాళ్ళని నిర్మాతలుగా దింపడం అలవాటు చేసుకున్నారు తమ స్వార్ధం కోసం దర్శకులు. కోటిలో శాటిలైట్ ఎనభై దాకా వస్తే, ఇరవయ్యే కదా రిస్కు,  ఇది సొంతంగా విడుదల చేసుకున్నా థియేటర్ల నుంచి రాకపోతుందా..అన్న అంచనాలేసుకుని కొత్త వాళ్ళు సినిమాలు చుట్టేయడం మొదలెట్టారు. పెట్టుబడిలో ఇరవై శాతమే ప్రేక్షకులనుంచి ఆశించే పరిస్థితి ఏర్పడింది. 

'ఒకప్పుడు నూరు శాతం ప్రేక్షకులనుంచే రాబట్టాలని కంకణం కట్టుకుని క్వాలిటీ కోసం ప్రయత్నించే వాళ్ళు. ఈ ఇరవై శాతాన్ని కూడా కేర్ చేసే పరిస్థితి లేదు. ఇరవై శాతం క్వాలిటీ సినిమాని కొనే బయ్యర్ ఎవరూ రారు. నిర్మాతే సొంతంగా విడుదల చేసుకోవాలి. ఇదే జరిగింది ఇంతకాలమూ. ఇరవై శాతం సొమ్ముల కోసం నిర్మాతయినా ఎందుకు విడుదల చేసుకోవాలంటే, విడుదల చెయ్యకపోతే మిగతా శాటిలైట్ సొమ్ములూ  రావు గనుక !

పదేళ్ళ క్రితం ఈ శాటిలైట్ రంధి ఎక్కడికి దారితీసిందంటే,  మూడ్రోజుల్లో ఐదారు లక్షల్లో సినిమా చుట్టేసి- పది-పదిహేను లక్షలు శాటిలైట్ సొమ్ములు తెచ్చుకో వచ్చనే దాకా. ఈ సినిమాలు థియేటర్ల పరంగా ప్రేక్షకుల ముందుకే రావు. కానీ శాటిలైట్ సొమ్ములు రావాలంటే విడుదలై నట్టు చూపించాలి. కాబట్టి పేపర్లలో ఓ చిన్న యాడ్ వేసి, ఒక రోజు కోసం థియేటర్ మాట్లాడుకుని నాల్గాటలు వేసుకుని ఎత్తేసే వాళ్ళు. ఈ సహకారం అందించడానికి హైదరాబాద్ నగరంలో జనం వెళ్ళని ఓ రెండు థియేటర్లు ఉండేవి. దీని మతలబు తెలీక,  ఓ ప్రముఖ పత్రికలో ఓ సినిమా విమర్శకుడు వీరావేశ పడిపోయి, ఈ థియేటర్లలో ఆ సినిమాలు చూసేసి,  సమీక్షలు రాసి పారేశాడు కూడా!

ఎవరైనా హోటల్ పెడితే కస్టమర్లకి భోజనం పెట్టడానికి పెడతారు. కానీ ఎవరైనా చిన్న సినిమాలు తీస్తే ప్రేక్షకులకోసం తియ్యరు! ఇదే ఇంతకాడికి తెచ్చింది. శాటిలైట్ బూమ్ పెద్ద కుంభ కోణంలోకి తిరగబెట్టడంతో, చిన్న సినిమాలకి ఉరి బిగుసుకుంది. ప్రతి చెత్త సినిమానీ లక్షలకి లక్షలు శాటిలైట్ బేరాలు పెంచేసి సొమ్ములు దండుకున్న కొన్ని పెద్ద తలకాయల వ్యవహారం పొక్కడంతో, మొత్తంగా చిన్న సినిమాల శాటిలైట్ హక్కులకి ఈ ఏడాది ప్రారంభం నుంచే బ్రేకు పడిపోయింది. ఇక చిన్న సినిమా శాటిలైట్ హక్కులమ్ము కోవాలంటే ముందు సొంత డబ్బులతో సినిమా తీసి, అది నాల్గు వారాలు ఆడి ఫర్వాలేదని ప్రేక్షకులు సర్టి ఫికేట్టిస్తే, అప్పుడు లక్షలేం ఖర్మ, కోటి పెడితే మరో కోటి ఇచ్చి శాటిలైట్ హక్కులు కొనేందుకు సిద్ధంగా వున్నాయి ఛానెళ్ళు!

అంటే చిన్న సినిమా తిరిగి ప్రేక్షకుల పేషీ లోకి వచ్చేసిందన్నమాట. ప్రేక్షకులు చూసి, కనీసం యావరేజి అని ధృవీకరిస్తే గానీ ఇంక ఆటలు సాగవన్న మాట. ఫ్లాప్ రిపోర్టు వస్తే ఇక అంతే  సంగతులు!

పరిస్థితి ఇలా ఇలా తిరగ బెట్టాక, అంత అంకిత భావంతో చిన్న చిన్న బడ్జెట్ సినిమా లెవరు తీస్తారు? కళ కోసం ఎలాగూ తియ్యారు, కనీసం ప్రేక్షకుల కోసం తీయడానికైనా మన సొప్పడం లేదు. కచ్చితంగా ఫ్లాపయ్యే సినిమాలే తీస్తారు కాబట్టి. కనుక పెట్టిన మొత్తం డబ్బులూ పోతాయి. చిన్న సినిమాల నిర్మాణాల్నికూడా ఒక కుంభకోణం గా చేసి, జేబులు నింపుకున్నాక, మళ్ళీ ఆ జేబుల్లోంచి తీసి పోగొట్టుకుందుకు మనసొప్పదుగా?

పోనీ తెగించి క్వాలిటీ సినిమా తీద్దామన్నా, అప్పట్లో చిన్న సిన్మాలు తీసి విజయాలు సాధించిన దాసరి నారాయ రావు ల్లాగా, కోడి రామకృష్ణ ల్లాగా ఇప్పుడెవరున్నారు? చిన్న సినిమా అంటే ప్రేమ సినిమా అనే అర్ధం రాసుకుని ఈ ఆర్నెల్లలో తీసిన పద్దెనిమిది ప్రేమ సిన్మాలన్నీ అడ్రసులేకుండా పోయినవేగా? వాటికొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు,కొత్త కొత్త హీరో హీరోయిన్లందరూ ఐపులేకుండా పోయిన వాళ్ళేగా?

ఇదీ సంగతి! ఏడాదంతా పెద్ద సినిమాలు పదే విడుదలౌతాయి. వారం వారం థియేటర్ లకి  ఫీడింగ్ నిచ్చేవి, పదుల సంఖ్యలో తయారయ్యే చిన్న సినిమాలే. ఈ చిన్న కూడా లేకపోయాక మొత్తం అన్ని సెక్టార్లలో ఫీల్డు పరిస్థితేంటో బ్రహ్మ దేవుడే చెప్పాలి. ఫీల్డు ని వైజాగ్ కి తరలించుకోవాలన్న ఆలోచన సంగతి దేవుడెరుగు, అసలిప్పుడున్న ఫీల్డే మవుతుందని ఆలోచించాలి. క్వాలిటీ లేని కళాకారులతో  వైజాగ్ లో పరిశ్రమ స్థాపించినా వైకుంఠంలో  స్థాపించినా ఇంతకంటే ఒరిగేదేమీ వుండదు!

-సికిందర్
(ఈవారం –ఆగస్టు,2014)


20, జులై 2014, ఆదివారం

రివ్యూ..


షుగర్ కోటింగ్ మిస్సయిన సీరియస్ నెస్ !
దర్శకత్వం : వై. సునీల్ కుమార్ రెడ్డి
తారాగణం : మనోజ్ నందం, ప్రియాంకా పల్లవి, సత్యానంద్ తదితరులు
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
బ్యానర్: శ్రావ్య ఫిలిమ్స్ ,  నిర్మాత : వై. రవీంద్ర
విడుదల: 18 జులై 2014     సెన్సార్ : ‘A’
*
దర్శకుడు వైసునీల్ కుమార్ రెడ్డి  రోమాంటిక్ కథలకి యూత్ ఎదుర్కొంటున్న సమస్యల్ని జోడిస్తూ యూత్ స్పృహ వున్న దర్శకుడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతకి ముందుసొంతూరు’, ‘గంగపుత్రులులాంటి సినిమాలతో సామాజిక స్పృహ  వున్న దర్శకుడుగా అవార్డులు సాధించుకున్నారు. యూత్ వైపు దృష్టి సారించాక  ‘ఒక రోమాంటిక్ క్రైం కథ’, ‘వెయిటింగ్ ఫర్ యూ’, ‘నేనేం చిన్న పిల్లనాతర్వాత ఇప్పుడు  ‘ఒకక్రిమినల్ ప్రేమకథతీశారు.  వీటిలోనేనేం చిన్న పిల్లనాకాలం చెల్లిన ఫ్యామిలీ డ్రామాగా వర్కౌట్ కాలేదు, ‘వెయిటింగ్ ఫర్ యూఫ్యాక్షన్ , టెర్రరిజం, మతకలహాల కలగూరగంపలా దెబ్బతింది . ఇప్పుడుఒక క్రిమినల్ ప్రేమ కథతో మరో యూత్ సమస్యని ఎత్తుకున్నారు. సమస్య ఎక్కడొచ్చిందంటే, యూత్ కి సెక్సు సమస్యలు తప్ప ఇంకేవీ ఉండనట్టు భావించడం దగ్గరే. వీటికంటే కెరీరిజం మీద, డబ్బు సంపాదనల మీద ఆసక్తికరమైన కొత్త  కథలు చెప్పవచ్చన్న ఆలోచన చేయకపోవడం దగ్గరే!


ప్రస్తుత సినిమాలో ఇళ్ళల్లో దగ్గరి బంధువులతో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న  లైంగిక హింస గురించి చెప్పాలనుకున్నారు.  దీనిపట్ల యువతీ యువకులు ఎలా రియాక్టయ్యారన్నది చూపించాలనుకున్నారు. అయితే ఆ కామ ప్రకోపిత బంధువు అసలలా ప్రవర్తించడానికి గల మానసిక కారణాల  మూలాల్లోకి దర్శకుడు వెళ్లకపోవడం వల్ల, సమస్యకి చూపించిన పరిష్కారం రొటీన్ ఫార్ములా చట్రంలో ఉండిపోయింది.

ఇదొక క్రిమినల్ ప్రేమ కథ అన్నారు. కానీ కథలో అతడ్ని క్రిమినల్ గా చూపించలేదు, కథంతా అయ్యాకే అతను క్రిమినల్ గా మిగిలాడు. అదెలాగో చూద్దాం...

బాబోయ్ మేనమామ!

శీను (మనోజ్) ఓ గ్రామంలో ఫోటో స్టూడియోలో పనిచేసే కుర్రాడు. బిందు (ప్రియాంక పల్లవి) పెద్దమనిషైన శుభకార్యానికి వీడియో తీయడానికి వెళ్లి ఆమె ఆకర్షణలో పడతాడు. ఇదామె గమనిస్తుంది. ఇక్కడనుంచీ ఆమె వెంట పడతాడు. ప్రేమ ఖరారవుతుంది. అప్పుడు తాగుబోతు  అయిన బిందు తండ్రికి పక్షవాతం రావడంతో, విధిలేక ఉదర పోషణకు బిందు తల్లి వైజాగ్ లో ఉన్న తన అన్న ( సత్యానంద్) పంచన చేరుతుంది- భర్తా కూతురూ సహా. 

ఈ ఎడబాటు తాళలేక శీనుకూడా వైజాగ్ వెళ్ళిపోయి, బిందు చదివే కాలేజీలోనే క్యాంటీన్ బాయ్ గా చేరతాడు. ఐతే విచిత్రంగా బిందు ఇతన్ని చూడదు, మాట్లాడదు. ఆమె కోపానికి కారణమేంటో అర్ధంగాదు. అతడి కళ్ళ ముందే సిటీలో వేరే కుర్రగ్యాంగ్ తో తిరుగుతూంటుంది.

ఈమె క్లాస్ మేట్స్ గా ఇద్దరమ్మాయి లుంటారు. వీళ్ళు తమ శరీరాల్ని తాకే మగవాళ్ళ అంతు చూస్తూంటారు. ఒక రోజు ఉండబట్టలేక శీను మొండికేసిన బిందూని పట్టుకోవడంతో దేహశుద్ధి జరిగి క్యాంటీన్ నుంచి డిస్మిస్ అవుతాడు. ఈ అవమానంతో ఆత్మహత్య చేసుకోబోతాడు. అప్పుడు బిందు వచ్చి పలకరిస్తుంది. ఇద్దరూ మళ్ళీ ఒకటవుతారు. కానీ బిందూ అంతవరకూ తనకి దూరంగా వున్నా కారణం మాత్రం శీనుకి చెప్పాడు. పైగా అతడికి చెప్పి కొన్ని సాహసాలు చేయిస్తూంటుంది. అమ్మాయిల్ని లైంగికంగా వేధిస్తున్న లెక్చరర్ కి బుద్ధి చెప్పడం, బయట ఓ కారు అద్దం పగలగొట్టడం వంటివి...

చివరికి నా కోసం ఏమైనా చేస్తావా అని, ఒకడ్ని చంపమంటుంది. అతను మేనమామ. అతను లైంగికంగా వేధిస్తున్నాడు. తను భరించలేకపోతోంది-ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొస్తుంది  ...ఇదీ విషయం. విషయం తక్కువే, దీనికి తగ్గట్టు హీరోయిన్ గ్లామర్ కూడా తక్కువే ! నటనకూడా నవ్వుతెప్పించేంత కృతకమే!

ఈ కొత్త హీరోయిన్ ది ఫోటోజెనిక్ ఫేసు కాదు. దీంతో సినిమాకి ‘సి’ గ్రేడ్ లుక్ వచ్చేసింది. ఈమెతో తీసిన లైంగిక వేధింపుల దృశ్యాల ధాటి చూస్తే, ఇలాటి గ్లామర్ తక్కువ హీరోయిన్లే ఇందుకు ధైర్యం చేస్తారేమో అఅన్పించేలా వుంది. కాబట్టి ఇంతకంటే అందమైన హీరోయిన్ ని తెచ్చుకునే అవకాశం లేదు దర్శకుడికి.

హీరో మనోజ్ ఓవరాక్షన్ లేకుండా బాగా చేశాడు. పాత్ర ఎలావుండాలో అలా అండర్ ప్లే చేశాడు. ప్రేమలో బాధని ఓర్చుకోవడంలోనూ పరిణతి కనబర్చాడు. కథల విషయంలో అతడింకా రాటుదేలితే, తనకంటూ ఫాలోయింగ్ వున్న ప్రేక్షకులకి ఇంకా మంచి వినోదాన్ని అందించగలడు.

పోతే, మేనమామగా  నీలి చిత్రాల బాపతు నిమ్న పాత్ర పోషించిన యాక్టింగ్ స్కూల్ అధినేత సత్యానంద్ గట్టి షాకిస్తారు ఈ సినిమాలో. ఇదికూడా ఒక సినిమాపాత్రేనా, సినిమా పాత్రే అనుకుంటే, పోర్న్ స్టార్ సన్నీ లియోన్నే సినిమా ప్రేక్షకులు ఆదరించారు గనుక ఇదెంతా అనుకున్నా, విజువల్ గా దీని పరిమితులు ఎంతవరకుండాలనేది కూడా గాలి కొదిలేస్తే ఎలా? నిజజీవితంలోని  అన్ని చేష్టలూ కళారూపాల సన్నివేశాలవుతాయా? వాస్తవికత అంటే ఇదేనా? అంతా అయోమయం!

సాంకేతికంగా డీ టీ ఎస్ మిక్సింగ్ సృజనాత్మకంగా లేదు. సన్నివేశాల వెలుపల ఎక్కడో  దూరంగా వినిపించే గొంతుకలు కూడా ఫుల్ వాల్యూంలో వుండడం ఇబ్బంది పెట్టే వ్యవహారం. ఎంత లో బడ్జెట్ సినిమాకైనా క్వాలిటీ విజువల్స్ సాధించే డీఐ ఇప్పుడు అందుబాటులో వున్న కాలంలో ఈ సినిమా దాన్నందుకోనట్టే కన్పిస్తోంది. ఉన్నపాటల్లో మాత్రం మొదటి రెండూ సాహిత్యంతో సహా బావున్నాయి. కెమెరా వర్క్ డిస్టర్బింగ్ సీన్లలో కూడా స్టాటిక్ షాట్లతో చలనం లేకుండా వుంది. సినిమా త్వరత్వరగా చుట్టేసినట్టుంది.

స్క్రీన్ ప్లే సంగతులు!

ఇది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలు నాలుగు రకాలు –ఒకే ఏకబిగి ఫ్లాష్ బ్యాక్ తో నడిచేవి, తడవకింత చొప్పున మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వడ్డించేవి.  ఫ్లాష్ బ్యాకులో ఫ్లాష్ బ్యాకులుగా సాగేవి,  ఫ్లాష్ బ్యాకులో ఫ్లాష్ బ్యాకులుగా సాగుతూ, అడపాదడపా వాటికి అడ్డుతగులుతూ,  వర్తమాన కాలంలో నడుస్తున్న కథ కొనసాగించేవి. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఈ నాల్గో తరగతికి చెందుతుంది. చాలా సంక్లిష్టం చేసుకున్న స్క్రీన్ ప్లే. దీంతో ‘కథ’ కి స్థానం లేకుండా పోయింది. సూటిగా చెప్పుకోవాలంటే ఈ సినిమా  ‘కథ’  అసలే రకం ఫ్లాష్ బ్యాకులతోనూ కలిపి  తీయాల్సింది కాదు!

నిజజీవితంలో అనేక చేదు లుంటాయి. అవన్నీ సినిమాకి తీపి అయిపోవు.  వాటిలో చెప్పుకుని చప్పున కట్ చేసేసే  చేదు ఉదంతాలుంటాయి. వాటిని చెప్పుకునీ, ఊహించుకునీ  ఆనందించలేం. ఖండించగలం. అలాటి చేదుల్లో ఒకటి  వావీవరసల్లేని లైంగిక వేధింపులు. ఇందులో వుండేది బూతు కాదు, పెర్వర్షన్. వయసు మీదపడిన మేనమామ టీనేజి మేనకోడల్ని అనుభవించడం,  మామ కోడల్ని చెరచడం, తండ్రి కూతుర్ని రేప్ చేయడం అప్పుడప్పుడు మనచుట్టూ జరిగే పెర్వర్టెడ్ కేసులే. అంత మాత్రాన దీంట్లో సెక్సప్పీల్ ని చూసి,  ఇలా కూడా కొత్తగా యూత్ ప్రేక్షకుల్ని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవచ్చన్న  ఆలోచన కలగడమే బూమరాంగ్ అయ్యే పరిస్థితి! బూతు వేరు, పెర్వర్షన్ వేరు. యువ ప్రేక్షకులు బూతు బానిసలనే దుర భిప్రాయం నుంచి, వాళ్ళు ప్రమోటై సెక్సువల్  పెర్వర్షన్ కూడా ఎంజాయ్ చేసే సైకోలనే  నిర్ణయానికి  రావడం చాలా విచారకరం.

సామాజిక సమస్య చెబుతున్నామని గణాం కాలేసి, చూపించిందంతా పెర్వర్షన్నే. లేకపోతే, పదేపదే కూతురు వయసున్న మేనకోడలితో బలవంతంగా మాస్టర్బేషన్ దగ్గర్నుంచీ ఓరల్ సెక్సు వరకూ పచ్చిగా చూపించాల్సిన అవసరం లేదు.

ఇటీవలే  ‘హైవే ‘ తీసిన ఇంతియాజ్ అలీకి బూతుకీ, పెర్వర్షన్ కీ మధ్య సన్నని గీత తెలుసేమో.. అందుకే జాగ్రత్త పడి,  తను తీస్తున్న కమర్షియల్ ఎంటర్ టెయినర్ లో లైంగిక వేధింపుల గురించి సూచన ప్రాయంగా మాత్రమే తెలియజేసి  వదిలేశాడు. వీటిని దృశ్య పరంగా చూపిస్తే వెగటు పుట్టి  వైడ్ యాక్సెప్ టెన్స్ ఉండదని, కేవలం ఇంటర్వెల్ దగ్గర- తన బాల్యం దగ్గర్నుంచీ ఒక అంకుల్ పాల్పడుతున్న లైంగిక వేధింపుల గురించి హీరోయిన్ చేత  వాచికంగా హీరోకి చెప్పించాడు. క్లైమాక్స్ లో ఆ అంకుల్ ని అందరి ముందూ దులిపేసి, షాక్ కి గురిచేసి వెళ్లి పోతుందామె, అంతే!

ఇలా నీటుగా చెబితే  ప్రేక్షకులామె బాధని ఫీల్ అవడానికి సరిగ్గా సరిపోయింది. సునీల్ కుమార్ రెడ్డి  సినిమాలో హీరోయిన్ బాధకన్నా, ఆ బాధని సెక్సువల్ గా చూసి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ కూడా చేయాలన్న కసి ఎక్కువ వుంది. ఇంతియాజ్ అలీ సినిమాలో హీరోయిన్ ఆలియా భట్ కి లైంగిక వేధింపులనే విషాదముంది, అది కేవలం ఇంటర్వెల్లోనూ, ముగింపులోనూ రెండు చోట్ల  తప్ప, ఎక్కడా  బయట పెట్టకుండా బందిపోటు (రణదీప్ హూడా) తో ఆమెకి రోడ్ రోమాన్స్ అనే షుగర్ కోటింగ్ ఇచ్చి ఎంటర్ టెయిన్ చేస్తూ పోయాడు. గొప్పింటి బిడ్డ తనని కిడ్నాప్ చేసిన డెకాయిటీనే  ప్రేమించడమనే  స్టాక్ హోమ్ సిండ్రోం అనే  మానసిక స్థితిని తెలియజేస్తూ వుంటుందే తప్ప, ఆమె చెప్పే వరకూ అసలు కారణం మనం పసిగట్టలేం. మంచి కథల్లో హిడెన్ ట్రూత్ ఉంటుందని అంటాడు జేమ్స్ బానెట్. ఐతే దాన్ని నిర్వహించడంలోనే అంతా వుంది. ఇంతియాజ్ అలీ దాన్ని మరుగు పరచి,  ఆరు రాష్ట్రాల పొడవునా సాగే రోడ్ రోమాన్స్ అనే షుగర్ కోటింగ్ ఇస్తే, సునీల్ కుమార్ రెడ్డి దాన్ని బట్టబయలు చేసి ఎలాంటి షుగర్ కోటింగూ లేకుండా పచ్చి పచ్చిగా అదే ప్రధాన కథ అనుకుని చెలరేగిపోయారు!

***

ఈ కథలోని ‘సమస్య’ని మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులుగా – ఆమాటకొస్తే అసలు ఏకబిగి ఫ్లాష్ బ్యాక్ గాకూడా  ఎందుకు చెప్పకూదదంటే...అది ‘కథ’ కాదు కాబట్టి!

ఒకసారి పైన ఇచ్చుకున్న వివరణని మళ్ళీ ప్రస్తావించుకుంటే - ఇది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలు నాలుగు   రకాలు –ఒకే ఏకబిగి ఫ్లాష్ బ్యాక్ తో నడిచేవి, తడవకింత చొప్పున మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వడ్డించేవి.  ఫ్లాష్ బ్యాకులో ఫ్లాష్ బ్యాకులుగా సాగేవి. ఫ్లాష్ బ్యాకులో ఫ్లాష్ బ్యాకులుగా సాగుతూ, అడపాదడపా వాటికి అడ్డుతగులుతూ,  వర్తమాన కాలంలో నడుస్తున్న కథ కొనసాగించేవి. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఈ నాల్గో తరగతికి చెందుతుంది. చాలా సంక్లిష్టం చేసుకున్న స్క్రీన్ ప్లే. దీంతో ‘కథ’ కి స్థానం లేకుండా పోయింది. సూటిగా చెప్పుకోవాలంటే ఈ సినిమా  ‘కథ’  అసలే రకం ఫ్లాష్ బ్యాకులతోనూ కలిపి  తీయాల్సింది కాదు!

ఇలా ఫ్లాష్ బ్యాక్స్ ని ‘కథ’ అని ఎందుకు అనుకోవడం లేదు మనం? ఏ సినిమాలో ఫ్లాష్ బ్యాకు అయినా కథా లక్షణాలతో వుండదు కాబట్టి!

దీన్ని వివరించుకుందాం- ఉదాహరణకి హీరో చేసే యాసిడ్ దాడితో ఈ సినిమా మొదలౌతుంది. అరెస్టయి లాకప్ లోపడ్డాక అతడికి జరిగిందంతా గుర్తొస్తూంటుంది. ఫ్లాష్ బ్యాక్ మొదలౌతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో- విలేజిలో తను ఫోటో  స్టూడియోలో పనిచేసుకుంటూ, సమర్తాడిన రోజున హీరోయిన్ని చూసి ప్రేమిస్తూ, ఆమె వైజాగ్ వెళ్లిపోవడంతో తనూ అక్కడి కెళ్ళి, అదే కాలేజీ క్యాంటీన్ లో చేరి పనిచేస్తూ, ఆమెకోసం ప్రయత్నిస్తూ వుండి నప్పుడు, ఒకానొక ఘట్టంలో ఆమె తన మేనమామని చంపమంటుంది..ఎందుకు చంపాలన్న దానికి తనూ ఓ ఫ్లాష్ బ్యాక్ ఎత్తుకుంటుంది. అంటే ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ అన్నమాట!

ఈ ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ లో, మేనమామతో తను పడుతున్న లైంగిక వేధింపులు ఏకరువు పెడుతుంది. ఇదయ్యాక మళ్ళీ హీరో ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూ అవుతుంది. హీరోయిన్ చెప్పిన సమస్యకి పరిష్కారంగా మేనమామని చంపడానికి ఒప్పుకుని ప్లానేస్తాడతను. దీంతో ఈ ఫ్లాష్ బ్యాకు కూడా  ముగిసి, హీరో యాసిడ్ దాడికి వెళ్ళే దృశ్యంతో మొదటి కొస్తాం. అంటే వర్తమాన కాలంలోకి వస్తాం. ఈ వర్తమాన కాలంలో కోర్టుకి తీసుకెళ్తున్న హీరో తిరిగి దాడి చేసి మేనమామని చంపడంతో సినిమా ముగింపుకొస్తుంది.

ఫ్లాష్ బ్యాక్స్ నడుస్తున్నప్పుడు మధ్య మధ్యలో వర్తమానం లోకొచ్చి,  యాసిడ్ దాడి కేసులో పోలీసుల విచారణా, లాకప్ లో వున్న హీరో ఇంటరాగేషన్ వగైరా జరుగుతూంటాయి.

ఇప్పుడు పాయింటేమిటంటే – హీరో ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్ ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్, మధ్యమధ్యలో వచ్చిపోయే  వర్తమానకాలంలో జరిగే సంఘటనలూ - ఈ మూడింట్లో  ఏది సినిమా కథ?

***
వర్తమానంలో జరిగేదే సినిమా కథ!

ఫ్లాష్ బ్యాక్స్ ఎప్పుడూ కథలు కాబోవు!

వర్తమాన కాలం (రియల్ టైం) లో మొదలెట్టిన  కథ లేకుండా, పూర్వ మెప్పుడో  జరిగిన విశేషాల తాలూకు ఫ్లాష్ బ్యాక్ (సింహావలోకనం- డ్రీమ్  టైమ్ ) మనజాలదు. ఫ్లాష్ బ్యాక్ దానికదే స్వతంత్ర కథాంగం కాదు. వర్తమాన సంఘటనలతో మొదలెట్టి చెప్తేనే ఫ్లాష్ బ్యాక్ కి అర్ధం. అదే వర్తమాన కథ ఫ్లాష్ బ్యాక్ లేకున్నా సర్వస్వతంత్రంగా సాగే సంపూర్ణ ప్రక్రియ.

ఎలాగంటే, ఓ కథని తీసుకుంటే, దాంట్లో ఓ  సమస్య- దాంతో ఓ సంఘర్షణా – దానికో పరిష్కారమూ అనే మూడంకాల పరిపూర్ణ ఫోటో  ఫ్రేముగా కన్పిస్తుంది. ఇది కథా లక్షణం.

అదే ఫ్లాష్ బ్యాక్స్ లో చూస్తే, ఈ లక్షణం వుండదు. సమస్య-సంఘర్షణ-పరిష్కారం అనే మూడంకాల నిర్మాణం వుండదు. వీటిలో సమస్య, సంఘర్షణ అనే రెండంకాలే వుంటాయి, మూడోదైన పరిష్కారం వుండదు. వుంటే అసలు ‘వర్తమాన కథే’ వుండదు. ఎందుకంటే, ఫ్లాష్ బ్యాక్ లోనే సమస్య పరిష్కారమై పోయింది కాబట్టి!
ఈ సినిమా హీరోకి  కథలో ముందుగా ఎందుకో ప్రేమించని హీరోయిన్ తో సమస్య ఏర్పడింది, తర్వాత ఆమె చెప్పిన ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ తో సంఘర్షణ మొదలయ్యింది. ఈ సంఘర్షణకి పరిష్కారమార్గం వర్త మాన కథలో హీరోయిన్ మేనమామని చంపమనడం దగ్గర వుంది. ఫ్లాష్ బ్యాక్ లో లేదు.

అలాగే  హీరోయిన్ ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ లో మేనమామాతో ఆమెకి లైంగిక వేధింపుల సమస్యే వుంది. దాంతో సంఘర్షణ మాత్రమే వుంది. అంతేకానీ, అదే ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ లో ఆ సమస్య పరిష్కారమై పోలేదు!


కనుక ఏ కథ ఫ్లాష్ బ్యాక్ లోనైనా సమస్య, సంఘర్షణ ఈ రెండూ మాత్రమే కన్పించి, ఒక  అసంపూర్ణ ఫోటో ఫ్రేములానే వుంటుంది. ఏ సినిమా ఉదాహరణ తీసుకున్నా ఫ్లాష్ బ్యాకులు ఇలాగే వుంటాయి. చిరంజీవి ‘ఖైదీ’ లో చిరంజీవిని పరారీలో వున్న ఖైదీ గా ఎష్టాబ్లిష్ చేసి, గతంలో అసలేం జరిగిందనే దానికి ఒకే ఏకబిగి మోనో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించి,  రావుగోపాలరావుతో సమస్య, సంఘర్షణా  చెప్పుకొచ్చారు. గతంలో అసలేం జరిగిందో ఫ్లాష్ బ్యాకు ద్వారా మనకి తెలియబర్చాక, తిరిగి వర్తమానంలో కొచ్చి, ఇప్పుడేం జరగాలన్న దానికి పరిష్కారంగా క్లైమాక్స్ ప్రారంభించారు. ఇలా ఫ్లాష్ బ్యాక్ లో వుండేది కథే కాదని స్పష్టం చేయడంజరిగింది. కనుక ఫ్లాష్ బ్యాక్స్ లో కూడా చెబుతున్నది కథే అనుకుని సాగిపోతే అంతా అభాసు అవుతుంది.

వర్తమాన కథలో ‘ఎందుకు?’ అన్న ప్రశ్నలోంచే కదా ఫ్లాష్ బ్యాక్ పుడుతుంది? వర్తమానంలో హీరో యాసిడ్ దాడి చేశాడు. ఎందుకు? అన్న ప్రశ్నలోంచే అతడి ఫ్లాష్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ హీరోయిన్ మేనమామని చంపాలన్నప్పుడు కూడా ఎందుకు? అన్న ప్రశ్నలోంచే కదా ఆమె తాలూకు ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ వచ్చింది?
ఫ్లాష్ బ్యాక్ అనేది వర్తమాన కథలో తలెత్తిన సమస్య కి సంబంధించి -ఎందుకు, ఏమిటి, ఎలా-  అన్న సందేహాలకి అవసరమైన సమాచారాన్ని అందించి సంతృప్తి పర్చే వనరు మాత్రమే- డేటా బ్యాంక్ మాత్రమే!

మరి కథ కాని ఇలాటి ఉత్త సమాచారాన్నే ఊకదంపుడుగా అన్నేసి తడవలు ఫ్లాష్ బ్యాక్ మీద ఫ్లాష్ బ్యాకులుగా వేస్తూ పోవడం ఏం స్క్రిప్టింగ్ న్యాయం? ఎంత స్క్రీన్ టైం వేస్టు? పైగా ప్రేక్షకులు జీర్ణించుకోలేని దృశ్యాల పరంపర తో ఎంత సమ్మెట పోటు?
***

లిండా కౌగిల్ 
ఇలా పాలూ నీళ్ళూ వేరుచేసి చూసే క్షీర నీర న్యాయం చేశాం. ఫ్లాష్ బ్యాకులు మింగేసిన నీటి గుంట  లోంచి తెల్లటి పాల లాంటి కథని వేరు చేసి పట్టుకున్నాం. ఎంటా కథ? అదెంత మాత్రం వుంది?

హీరో యాసిడ్ దాడి చేసి లాకప్ లో పడ్డం, ఆతర్వాత అప్పుడప్పుడూ ఇన్వెస్టిగేషన్ ఇంటరాగేషన్ లూ, చిట్టా చివర్లో కోర్టుకి తీసి కెళ్తున్న హీరో మళ్ళీ మేనమామ మీద దాడి జరిపి చంపేయడం-ఇంతే ఈ సినిమా కథ!

ఈ అత్తెసరు కథ కూడా ఫ్లాష్ బ్యాకుల వల్ల ముక్కలయ్యింది, త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ని కోల్పోయింది, సింహభాగం స్క్రీన్ టైముని ని ఫ్లాష్ బ్యాకులు మింగేయ్యడం వల్ల ఈ కథలో ఉండాల్సిన టైం ఎండ్ టెన్షన్ గ్రాఫ్ వీలు పడకుండా పోయింది! అప్పుడప్పుడు వచ్చిపోయే ఈ కథని ఫాలోకావడం కష్టమై పోయింది.

మరేం చెయ్యాలి?

నాన్ లీనియర్ కాకుండా లీనియర్ స్క్రీన్ ప్లే ద్వారా ఈ కథ చెప్పాలి, ఫ్లాష్ బ్యాకులు చెప్పడం కాదు.

హీరో నిద్ర లేచాడు, అరటి తొక్క మీద కాలేశాడు, సర్రున జారి కింద పడ్డాడు- ఇది లీనియర్ కథనం. కర్త- కర్మ- క్రియ అనే మైండ్ రిసీవ్ చేసుకునే సక్రమ పద్ధతిలో- వర్తమాన కాలంలో.

హీరో సర్రున జారి కింద పడ్డాడు, అరటి తొక్క మీద కాలేశాడు, హీరో నిద్ర లేచాడు-ఇది నాన్ లీనియర్ కథనం- అక్రమ పద్ధతిలో.

ఇక్కడ ప్రశ్న వేసుకోవాలి  -హీరో ఎందుకు జారి కింద పడ్డాడు? అరటి తొక్క మీద కాలేశాడు కాబట్టి అని- వెనక్కెళ్ళి  ఫ్లాష్ బ్యాకుతో అరటి తొక్క మీద కాలేసినట్టు చూపించాలి. కాలెలా వేశాడూ-అనే మరో సందేహానికి- నిద్ర లేచి మంచం దిగుతున్నట్టు మరో ఫ్లాష్ బ్యాక్ వేయాలి. ఓహో అలాగా అని అప్పుడర్ధం అవుతుంది అడిగేవాడికి.

ఈ సినిమాకి ఎంచుకున్న కథలో వావీవరసల్లేని లైంగిక వేధింపులనే బాక్సాఫీసు వ్యతిరేక, డాక్యుమెంటరీ అనుకూల అంశం వుంది. సినిమాకి దీన్ని లీనియర్ కథనం చేయడం వల్ల రెండు ప్రయోజనాలుంటాయి. ఒకటి, ఈ అంశం లోని బాక్సాఫీసు వ్యతిరేక వెగటుతనాన్ని తప్పించడం, రెండు- కథకి బలాన్ని చేకూర్చడం. స్టైల్ ఎప్పుడూ కంటెంట్ ని డామినేట్ చేయకూడదన్న ప్రాథమిక విషయాన్ని  గుర్తుంచుకోవాలి. ఈ కథకి బాక్సాఫీసు అప్పీలు లేకపోయినా సమస్యగా చూస్తే  ఇది బరువైనదే.  వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ లో కూడా ఆ కుటుంబానికి ఎదురైన సమస్య బరువైనదే.  ఈ బరువైన సమస్యకి ఫ్లాష్ బ్యాకుల చిత్రణ చేసి వుంటే ఎలావుండేదో ఒకసారి ఊహించుకుంటే ఎలా వుంటుంది?  బరువైన ఫ్యాక్షన్ కథలు ఫ్లాష్ బ్యాక్స్ తో తీస్తే హిట్టయ్యాయి కదా అనొచ్చు. పగా ప్రతీకారాల రొటీన్ యాక్షన్ కథలు వేరు, నైతిక విలువల నిగ్గు తేల్చే సామాజిక సమస్యల కథాబలం వేరు. ఎంచుకున్న సమస్యలో ఎనర్జీ వున్నప్పుడు ఆటోమేటిగ్గా సినిమాకి అదే ఒక స్టామినా అవుతుంది. కథ చెప్పడంలో ఫ్లాష్ బ్యాకులూ వగైరాలతో వేరే టెక్నిక్కులు అవసరంలేదు. ఈ టెక్నిక్కులకి పాల్పడితే ఆ బరువైన సమస్య కాస్తా చెల్లాచెదురై పోతుంది. ప్రస్తుత సినిమాలో జరిగిందిదే...అంతటి సీరియస్ సమస్యకి ఎలా స్క్రిప్టింగ్ చేయాలా అన్నది తేలక, లేదా ముందు చెప్పుకున్నట్టు- సమస్య బలం కోల్పోయినా సరే, దీనికి సెక్స్ అప్పీల్ వుంది కాబట్టి అనుకుని ఆ దృశ్యాలకోసం కథని ఖూనీ చేయడం జరిగిపోయింది..

స్క్రీన్ రైటర్, లాస్ ఏంజిలిస్ ఫిలిం స్కూల్ లో స్క్రీన్ రైటింగ్ అధ్యాపకురాలు లిండా కౌగిల్ లీనియర్- నాన్ లీనియర్ తేడాల గురించి ఏమంటారో చూద్దాం -  We generally see action unfold in time. Audiences find it easier to focus on action that develops chronologically than action that skips around time periods. Film is more immediate, and more easily grasped if we see a clear progression of cause and effect relationships leading to a climax, held together by a single protagonist.

ఇంతకంటే వివరణ వుండదు. కాబట్టి, ప్రస్తుత సినిమా కథని హీరో హీరోయిన్ల ప్రేమకథ గానే షుగర్ కోటింగిస్తూ లీనియర్  గా చెబుతూ, హీరోయిన్ వ్యక్తిగత సమస్యని ఇంతియాజ్ అలీ ‘హైవే’ లోలాగా  డైలాగుల్లో చెప్పించేసి, ఆ సమస్యకి హీరో తీసుకునే చర్యని ముగింపుగా పెట్టుకుంటే- అన్నేసి పచ్చి దృశ్యాలతో ప్రేక్షకుల్ని అఫెండ్ చేసే అగత్యం తప్పేది.  కథకి ఆ సమస్య అంతర్లీనంగా ప్రవహిస్తూ (సబ్ టెక్స్ట్ గా ఉంటూ) కథాత్మని ఆవిష్కరించి బలాన్ని చేకూర్చేది. ఇలా చేయాలంటే ఇంతియాజ్ అలీ పడ్డట్టే చాలా కష్టపడక తప్పదు. లేదంటే ఇలాంటి నికృష్ట సమస్యని ఎత్తుకోనే కూడదు!

 -సికిందర్