రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

6, జూన్ 2024, గురువారం

1437 : రివ్యూ!

 

రచన - దర్శకత్వం : ఉదయ్ శెట్టి
తారాగణం :  ఆనంద్ దేవరకొండ, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ఇమ్మాన్యుయేల్  తదితరులు.
సంగీతం : చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : ఆదిత్య జె.
బ్యానర్ : హై-లైఫ్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
***
          2023 లో బేబీ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీతో ప్రేక్షకుల్ని అలరించడానికి సమ్మర్ సినిమాతో వచ్చాడు. ఇటీవల వచ్చిన క్రైమ్ కామెడీ లేవీ నిలబడ లేదు. సస్పెన్స్ థ్రిల్లర్లు, క్రైమ్ కామెడీలు నిలబడేందుకు మొరాయించి మొండి చెయ్యి చూపిస్తున్నాయి. అలాటిది మరో కొత్త దర్శకుడు క్రైమ్ కామెడీతో తన వంతు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. మరి దీంతో ఎంత నవ్వించాడు, ఎంత నిలబెట్టాడు అన్నవి ప్రశ్నలు. వీటికి సమాధానాలు వెతుకుతూ ముందుగా కథ లోకి వెళ్దాం...

కథ

గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ), శంకర్(ఇమ్మాన్యుయేల్‌) దొంగతనాలు చేసి జీవిస్తూంటారు. గణేష్‌కి శృతి (నయన్ సారిక) తో ప్రేమ వ్యవహారముంటుంది. ఆమె తాను పనిచేసే షాప్ ఓనర్ తో పెళ్ళికి సిద్ధమవడంతో, గణేష్ హర్ట్ అవుతాడు. ఆమె డబ్బుకోసం పెళ్ళికి సిద్ధపడితే ఈలోగా తానూ డబ్బు సంపాదించి కోటీశ్వరుడు అవుతానని సవాలు విసురుతాడు. ఓ నగల షాపులో 7 కోట్ల విలువైన వజ్రాన్ని కొట్టేసే ఆఫర్ రావడంతో ఆ వజ్రాన్ని కొట్టేసి అమ్ముకుందామని దాంతో పారిపోతాడు.
        
చెన్నై వెళ్తూండగా పోలీసులు చెకింగ్ చేస్తూండడంతో భయపడి వజ్రాన్ని అటుగా తీసికెళ్తున్న వినాయకుడి విగ్రహం తొండంలో పడేస్తాడు. నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్న కిషోర్ రెడ్డి ఆ విగ్రహాన్ని ముంబాయిలో తయారు చేయించి తీసుకొస్తూంటాడు. అయితే కిషోర్ రెడ్డి వూరికి వెళ్ళాల్సిన విగ్రహం ప్రత్యర్ధి వూరికి వెళ్తుంది. దీంతో ఆ విగ్రహం కోసం ప్రయత్నాలు మొదలవుతాయి.
       
విగ్రహం కిషోర్ రెడ్డికి ఎందుకు విలువైనది
? అందులో ఏం దాచి పెట్టి ముంబాయి నుంచి రప్పిస్తున్నాడు? విగ్రహం తొండంలో వజ్రాన్ని పడేసిన గణేష్ కది దక్కిందా లేదా? దాంతో కోటీశ్వరుడై శృతిని పెళ్ళి చేసుకున్నాడా లేదా?  ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇదే వారం విడుదలైన భజే వాయు వేగం లో తండ్రి ఆపరేషన్ కోసం హీరో కారు కొట్టేసి పారిపోతాడు. ప్రస్తుత సినిమాలో కోటీశ్వరుడవడం కోసం హీరో వజ్రాన్ని కొట్టేసి పారిపోతాడు. రెండూ ఒకే లాంటి కథలు. అయితే మొదటిది బరువైన సెంటిమెంటల్ డ్రామా, రెండోది క్రైమ్ కామెడీ. ఏదో విలువైనది ఎక్కడో మిస్ అవడం, దాని కోసం వివిధ గ్యాంగులు వేటలో పడ్డం కూడా కొత్త కథేమీ కాదు. అనగనగా ఒక రోజు’, స్వామి రారా వంటి హిట్స్ గతంలో వచ్చాయి. ప్రస్తుత సినిమాని కూడా అలాటి హిట్ చేయాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సిల్లీ కథ వల్ల పాక్షికంగానే సఫలమయ్యారు.
          
ఫస్టాఫ్ పాయింటుకి రావడానికి లవ్ ట్రాకుతో చాలా సేపు సాగదీశారు. హీరోయిన్ తో సుదీర్ఘ లవ్ ట్రాకు పెట్టి, హీరో ఆమెకి సవాలు  చేసిన తర్వాత వజ్రాన్నిదొంగిలించి పారిపోవడం, దాన్ని వినాయకుడి విగ్రహంలో వేయడం, అది విలన్ ప్రత్యర్ధి వూరికి చేరడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇప్పుడా విగ్రహం ఇటు విలన్ కి, అటు హీరోకీ ఇద్దరికీ అవసరం.
        
ఇప్పుడు సెకండాఫ్ లో ఆ విగ్రహంకోసం ప్రయత్నాల్ని కామెడీగా మార్చి నడిపించారు. ఈ ప్రయత్నాలు సిల్లీగా వున్నా కామెడీ కాబట్టి సీరియస్ గా తీసుకోవద్దన్నట్టు నడిపించారు. కానీ హీరో విలన్ల మధ్య బలమైన ఎత్తుగడలు వుండుంటే ఆ కామెడీ లాజికల్ గా వర్కవుటై క్రియేటివిటీతో ఇంకా బావుండేది. ఈ కామెడీకి సారధి డాక్టర్ ఆర్గానిక్ డేవిడ్ గా నటించిన వెన్నెల కిషోర్. సెకండాఫ్ పూర్తిగా వెన్నెల కిషోర్ చేసే సిల్లీ కామెడీ మీద ఆధారపడింది. తన స్కిల్స్ తో అంతలా నవ్వించకపోతే సెకండాఫ్ ప్రమాదంలో పడేది.
       
కథలో క్లయిమాక్స్ ట్విస్టు ఒక్కటే ఉత్కంఠ రేపుతుంది. ఇక ముగింపుగా తుపాకులతో కాల్చుకోవడమన్నది
స్వామిరారా లాంటిదే. అయితే మధ్యలో హీరోకి సెకెండ్ హీరోయిన్ ప్రగతీ శ్రీవాస్తవతో ఇంకో లవ్ ట్రాక్ పెట్టడం వర్కౌట్ కాలేదు. అది కథని పక్కదోవ పట్టించింది. మొత్తానికి సిల్లీ కామెడీతో ఈ సాధారణ కథని గట్టెక్కించే ప్రయత్నం చేశారు.

నటనలు – సాంకేతికాలు

ఆనంద్ దేవరకొండ ఈసారి కామెడీ నటించడంలో కృషి చేశాడు. పరిమిత భావాలు పలికే మొహంలో కామెడీకి కావాల్సిన ఎక్స్ ప్రెషన్స్ శూన్యమైనా ప్రేక్షకుల్ని గతంలోలా ఇబ్బంది పెట్టకుండా కామెడీ నటించడం కోసం ఫర్వాలేదన్పించే స్థాయిలో కష్టపడ్డాడు. ఇక మిగతా రోమాన్స్, యాక్షన్ మామూలే. అయితే హీరోయిన్లిద్దరికీ పెద్దగా పాత్రల్లేవు. విలన్లుగా  రాజన్, కృష్ణ చైతన్య క్రూరత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. వెన్నెల కిషోర్, ఇమ్మాన్యుయేల్ కామెడీలు మాత్రమే ఈ సినిమాకి హైలైట్.
        
చేతన్ భరద్వాజ్ సంగీతం, ఆదిత్య ఛాయాగ్రహణం, ఇతర సాంకేతిక హంగులు ఫర్వాలేదనిపించేలా వున్నాయి. కొత్త దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి కొత్తదనం కోసం ప్రయత్నించకుండా, రొటీన్ ఫార్ములా సేఫ్ జోన్ లోనే వుండిపోయాడు.

—సికిందర్


1436 : రివ్యూ!

 

రచన - దర్శకత్వం : ప్రశాంత్ రెడ్డి
తారాగణం : కార్తికేయ, ఐశ్వర్యా మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ళ భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు. 
సంగీతం : రథన్ (పాటలు), కపిల్ కుమార్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్), ఛాయాగ్రహణం : ఆర్.డి రాజశేఖర్
నిర్మాణం : యూవీ కాన్సెప్ట్స్
విడుదల : మే 31, 2024
***

        రెక్స్ 100 తర్వాత సరైన విజయాలు లేని కార్తికేయ ఇప్పుడు మరో యాక్షన్ మూవీతో సక్సెస్ కోసం ప్రయత్నం చేశాడు. రెండు సినిమాల్లో విలన్ గా నటించి పేరు తెచ్చుకున్నా మళ్ళీ విలన్ గా నటించకుండా హీరోగానే నటిస్తూ ఇటీవల బెదుర్లంక తో మెప్పించే ప్రయత్నం చేశాడు. దీనితర్వాత ఇప్పుడు భజే వాయువేగం అనే యాక్షన్ మూవీని ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో నటించాడు. ఇంతకీ ఈ మూవీ అయినా కార్తికేయని గట్టెక్కిస్తుందా? తెలుసుకుందాం...

కథ

వెంకట్‌(కార్తికేయ), రాజు ( రాహుల్ టైసన్) అన్నదమ్ములు. వీళ్ళ తండ్రి లక్ష్మయ్య (తనికెళ్ళ) వీళ్ళ ఆసక్తులు గమనించి కొంత పొలం అమ్మేసి హైదరాబాద్ పంపిస్తాడు. వెంకట్ క్రికెట్ లో, రాజు సాఫ్ట్ వేర్ లో చేరడానికి వస్తారు. కానీ వెంకట్‌ క్రికెట్‌లో సెలక్ట్ వాలంటే పది లక్షలు కట్టాలి. మరోవైపు రాజు జాబ్ లో చేరాలంటే అయిదు లక్షలు కట్టాలి. దీంతో రాజు స్టార్ హోటల్‌లో సర్వెంట్‌గా చేరతాడు. ఇంతలో వూళ్ళో తండ్రి ఆరోగ్యం చెడి పది లక్షలు అవసరపడతాయి. ఈ డబ్బు కోసం వెంకట్ క్రికెట్ బెట్టింగ్స్ కి పాల్పడతాడు. అందులో 40 లక్షలు గెలిచినా బెట్టింగ్ మాఫియా మోసం చేసి 40 లక్షలు ఎదురు కట్టాలంటాడు. ఆ డబ్బు కోసం రాజు డేవిడ్ ని కలుస్తాడు. హోటల్ ఓనర్ డేవిడ్ (రవిశంకర్‌) మేయర్‌ తమ్ముడు.  డేవిడ్  బెట్టింగ్ మాఫియానే సపోర్టు చేయడంతో వెంకట్, రాజు అతడి కారు తీసుకుని పారిపోతారు అమ్ముకుందామని.
        ఆ కారులో శవముంటుంది, డబ్బు వుంటుంది, వేరే వేల కోట్ల హవాలా డబ్బుకి సంబంధించి పాస్ కోడ్ గా 500 రూపాయల నోటు వుంటుంది.  ఇప్పుడేం జరిగింది? ఇంత క్రైమ్ లో ఇరుక్కున్న అన్నదమ్ములు హాస్పిటల్లో వున్న తండ్రిని కాపాడుకోవడం కోసం ఏం చేశారు? కారుకొసం వెంటబడ్డ ముఠాలు కారుని దక్కించుకున్నాయా? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాలి.

ఎలావుంది కథ

సాధారణ ఫార్ములా కథే. 2022 లో హాలీవుడ్ మూవీ అంబులెన్స్ ఇలాటిదే కథ. భార్య సర్జరీకి డబ్బు కావాల్సి వచ్చి, తమ్ముడితో కలిసి బ్యాంకుని దోచుకుని అంబులెన్స్ లో పారిపోయే కథ.  ఇది పూర్తి స్థాయి యాక్షన్ జానర్లో కొచ్చే కథ.  భార్య సర్జరీ కోసం డబ్బులు అనే నిస్సహాయులైన అన్నదమ్ముల భావోద్వేగాల్ని కేంద్రంగా చేసుకుని అల్లిన యాక్షన్ కథ. కానీ తెలుగులో యాక్షన్ తక్కువ, సెంటిమెంటల్ డ్రామాలు ఎక్కువ. తండ్రితో అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్టాఫ్ అంతా ఒకటే సీన్లు, డైలాగులు, కన్నీళ్లు, కష్టాలు. హైదరాబాద్ లో అన్నదమ్ముల బాధలు, వూళ్ళో తండ్రి శోకాలు. ఇలా ఫస్టాఫ్ కథ ముందుకు కదలక, ఎంతో ఎస్టాబ్లిష్ చేస్తే తప్ప ఎమోషనల్ డ్రైవ్ సాధ్యం కాదన్నట్టు నడిపాడు దర్శకుడు. దీని వల్ల యాక్షన్ సినిమా ఫీల్ చెడింది.  యాక్షన్ తో వుండే యూత్ అప్పీల్, మార్కెట్ యాస్పెక్ట్ ఆ మేరకు సన్నగిల్లాయి.
       
తండ్రికి ఆపరేషన్ డబ్బుల కోసం మాఫియా కారులో పారిపోయే సెకండాఫ్ కథతో యాక్షన్లో కొస్తుంది మూవీ. వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఫాదర్ సెంటిమెంట్లోకే తిరగబెడుతుంది. ఇది చాలదన్నట్టు తమ్ముడి పాత్ర ఎప్పుడు చూసినా ఏడుస్తూనే వుండడం. ముందుకెళ్ళే అన్నకి బ్రేకులు వేసే ఏడ్పులు. ఇలా అన్నదమ్ముల అనుబంధం
, తండ్రితో అన్నదమ్ముల అను బంధం ఇవే ప్రధానమై సెకండాఫ్ లో కూడా యాక్షన్ తగ్గింది. టైటిల్ ప్రకారం వుండాల్సిన వాయువేగం దొరక్కుండా పారిపోయే కారు ఛేజింగ్స్ తో వుండాల్సిన కథ, కథకుడి అభద్రతా భావం వల్ల భారీ సెంటిమెంటల్ డ్రామాగా మారింది. దీనివల్ల హీరో హీఓయిన్ల మధ్య యూత్ అప్పీల్ తో వుండాల్సిన లవ్ ట్రాక్ కూడా బలైంది.
       
కారులో శవం
, నగదు, హవాలా నోటు- దీంతో విలనీ కూడా పాత స్టయిల్లోనే వుంది ముగింపు సహా. 1993 లో మహా దర్శకుడు రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ థెల్మా అండ్ లూయిస్ లో ఇద్దరు యువతులు రేప్ చేయబోయిన వాణ్ని చంపి కారులో పారిపోయే కథ -వెంటాడే పోలీసులతో యాక్షన్ కథే. ఈ యాక్షన్ కథలో బాధని ఎక్కడా చూపించకుండా సేవ్ చేసి, ముగింపులో ఆ ఇద్దరు యువతులు తీసుకునే నిర్ణయంతో  ఒకేసారి గుండె పగిలేలా చేస్తాడు దర్శకుడు. ఇదీ స్టోరీ డైనమిక్స్ అంటే. ఇందుకే ఈ సినిమా ఎప్పటికీ గుర్తుంటుంది. ఇలాటి సినిమాలు చూసి తెలుగు సినిమాల గ్రాఫు పెంచాలి, కథంటే ఏమిటో తెలుసుకుని.

నటనలు –సాంకేతికాలు

కథని బట్టి కార్తికేయ హీరోయిజం తక్కువ, పాసివ్ నెస్ ఎక్కువ. ఇక హీరోయిన్ తో రోమాన్సే లేదు. తండ్రి రుణం తీర్చుకునే సెంటిమెంట్ల భారం ఎక్కువై పోయి- యాక్షన్ తగ్గి యూత్ ని నిరాశపర్చే ప్రమాదం తెచ్చుకున్నాడు.  తమ్ముడుగా రాహుల్ టైసన్ అయితే వీపింగ్ డాల్ లా ఆద్యంతం ఏడ్పిస్తాడు ఏడ్పు ఇష్టపడే ప్రేక్షకులకి. డిటో తనికెళ్ళ భరణి. హీరోయిన్ ఐశ్వర్యాది ఫార్ములా టర్నింగ్ ఇచ్చే రోటీన్ పాత్ర. ఇక విలన్ వేషధారులు వాళ్ళ డైలాగులతో వాళ్ళు మహానుభావులు.

కెమెరా, సంగీతం, లొకేషన్లు, యాక్షన్ సీన్లు ప్రత్యేకంగా ఏమీ వుండవు. ఓపికగా కూర్చుని పాత్రల బాధలు, గాథలు బాధపడకుండా చూడాల్సిన సినిమా.

—సికిందర్


1435 :స్పెషల్ ఆర్టికల్


కవైపు తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు ఈ వేసవిలో శూన్య ప్రదర్శన చేస్తూండగా, మరో వైపు మలయాళ సినిమాలు స్లంప్ లేకుండా సమ్మర్ లో బాక్సాఫీసు విజయాలు సాధిస్తున్న వైనం కళ్ళముందుంది. ముఖ్యంగా ఏప్రిల్ మే నెలల్లో తెలుగు తమిళ కన్నడ భాషల్లో పెద్ద సినిమాలు విడుదల కాలేదు. ఎండలు, క్రికెట్, ఎన్నికలు కారణంగా చూపి నిర్మాతలు పెద్ద సినిమాల విడుదలల్ని వాయిదా వేశారు. దీంతో ధియేటర్లు నడపలేక మూసివేసే పరిస్థితి ఎదురైంది ఎగ్జిబిటర్లకి. థియేటర్ చైన్ 'జికె  సినిమాస్' యజమాని రూబన్ మతివానన్ 2024 సవత్సరం తమిళ, తెలుగు సినిమాలకు ఆందోళనకర సంవత్సరమని కామెంట్ చేశారు. ఈ దశాబ్దంలోనే  2024 ని అత్యంత చెత్త సంవత్సరంగా పేర్కొన్నారు.

        చాలా మంది లోక్‌సభ ఎన్నికలు, పరీక్షలు, ఎండలు, ఐపీఎల్ వంటివి పెద్ద సినిమాలు లేకపోవడానికి కారణాలుగా చెబుతూ వచ్చారు. కానీ, ఇవి కుంటి సాకులు మాత్రమే. వేసవి అనేది సాధారణంగా పెద్ద సినిమాలకు ఉత్తమ సీజన్ గా వుంటూ వస్తోంది. 2023 వేసవిలోనే తెలుగులో రావణాసుర’, ఏజెంట్’, విరూపాక్ష’, శాకుంతలం’, ఉగ్రం’, కస్టడీ వంటి పెద్ద సినిమాలు 6 విడుదలయ్యాయి. 2024 వేసవిలో మాత్రం ఫ్యామిలీ స్టార్’, ఆ ఒక్కటీ అడక్కు’, ‘’గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూడే పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. ఈ మూడూ ఫ్లాపయ్యాయి. చిన్న చిన్న సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. ఇవి ఎండలు, ఎన్నికలు, ఐపీఎల్, పరీక్షలు వల్ల ఫ్లాపయ్యాయా?
        
లోక్ సభ ఎన్నికలు వేసవిలోనే జరుగుతున్నాయి, ఐపీఎల్ వేసవిలోనే వస్తోంది, ఎండలు వేసవిలోనే మండి పోతున్నాయి, పరీక్షలూ వేసవిలోనే వస్తున్నాయి, జనం వేసవిలోనే టూర్లు వేస్తున్నారు, కూల్ డ్రింకులు, కూలర్లు వేసవిలోనే అమ్ముడుబోతున్నాయిఅలాగే చల్లటి ఏసీ పట్టున కమ్మగా కూర్చుని వేసవిలో సినిమాలు కూడా చూస్తూ వచ్చారు జనాలు. మరి ఇప్పుడెందుకు చూడడం లేదు? చూసేందుకు లోక్‌సభ ఎన్నికలు, పరీక్షలు, ఎండలు, ఐపీఎల్ వగైరా ఇప్పుడెందుకు అడ్డొస్తున్నాయి?
       
అడ్డు రావడం లేదు.
కేరళలో యధావిధిగా సినిమాలు చూస్తున్నారు ప్రేక్షకులు. చూసి హిట్ కూడా చేస్తున్నారు. 2024 ఏప్రిల్లో విడుదలైన పెద్ద సినిమా ఆవేశం కి రూ. 155 కోట్ల బాక్సాఫీసు నిచ్చారు. ఏప్రిల్లోనే విడుదలైన చిన్న సినిమా వర్షం గక్కుశేషం కి రూ. 80 కోట్లు ఇచ్చారు. ఏప్రిల్లోనే విడుదలైన చిన్న సినిమా జై గణేష్ కి రూ. 83 కోట్లు ఇచ్చారు. మే లో విడుదలైన చిన్న సినిమా మలయాళీ ఫ్రమ్ ఇండియాకి రూ. 18 కోట్లు ఇచ్చారు. మరో చిన్న సినిమా గురువాయూర్ అంబలనాదయిల్ కి రూ. 85 కోట్లు ఇచ్చారు. పెద్ద సినిమా  టర్బో కి రూ. 70 కోట్లు ఇచ్చారు. ఇంకో చిన్న సినిమా తలవన్ కి 10 వ రోజు కల్లా రూ. 15 కోట్లూ కలెక్షన్లిచ్చారు.
       
అంతే కాదు
, తమిళంలో కూడా స్లంప్ అంటున్న మే నెలలోనే విడుదలైన  
అరణ్మనై 4’ అనే హార్రర్ రూ.100 కోట్ల మార్కుని దాటేసింది. తమన్నా భాటియా, రాశీ ఖన్నా, దర్శకుడు సుందర్ సి నటించిన ఇదే మూవీ తెలుగులో బాక్ గా విడుదలై ఫ్లాపయ్యింది. ఈ వేసవిలో తమిళంలో పెద్ద సినిమాల కొరతని భర్తీ చేసేందుకు ఒక మార్గం కనిపెట్టారు. పాత హిట్స్ ని రీ రిలీజ్ చేయడం మొదలెట్టారు. దళపతి విజయ్ 'గిల్లి', ధనుష్ '3', సూర్య 'వారణం ఆయిరం'  పాత సినిమాల్ని రీ రిలీజ్ చేస్తే మళ్ళీ హిట్టయ్యాయి. ఎందుకు హిట్టయ్యాయి? ఎండలు, ఎన్నికలు, పరీక్షలు, ఐపీఎల్ వుంటే ఎలా వచ్చారు ప్రేక్షకులు?
       
కాబట్టి నాణ్యత ప్రధాన పాత్ర వహిస్తోంది ఎలాటి పరిస్థితుల్లోనైనా హిట్టవడానికి. ఈ నాణ్యత మలయాళంలో ఇస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు (చెన్నై)  లో వున్నప్పుడు అక్కడ అన్ని భాషల దర్శకులతో
, టెక్నీషియన్లతో పనిచేసిన తెలుగు అసిస్టెంట్లకి మంచి నైపుణ్యం అబ్బేది. పరిశ్రమ హైదరాబాద్ వచ్చేశాక అసిస్టెంట్లకి ఆ ఇంటరాక్షన్ లేక ఒంటరి వాళ్ళై పోయి నేర్చుకోవడం వదిలేసి దర్శకులై పోతున్నారు. అందుకే సినిమాలిలా తయారవుతున్నాయి. ఇది పాత దర్శకులు చెప్పే మాటే. కాబట్టి ఇప్పుడు అసిస్టెంట్లు  ఇక్కడే అసిస్టెంట్లుగా చేరడం మాని, కొన్నాళ్ళు మాలీవుడ్ వెళ్ళి  ఎన్నికల్లో, ఎండల్లో, ఐపీఎల్లో, పరీక్షల్లో కూడా సినిమాలు తీసి హిట్ చేస్తున్న మలయాళ దర్శకుల మంత్రమేమిటో వాళ్ళ దగ్గర పనిలో చేరి నేర్చుకుంటే మంచిది. అప్పుడు ఎండలు, ఎన్నికలు, ఐపీఎల్, పరీక్షలూ అంటూ కుంటి సాకులు చెప్పే అవసరం రాదు.

***