రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, జులై 2015, గురువారం

నాటి సినిమా!



          వెండితెర మీద బహువిధ పాత్రలకి మించి నిజజీవితంలో పోషించే పాత్రలు సూపర్ హిట్టయితే ఆ చమత్కృతి పేరేమిటి?
          గన్ షాట్ గా పి. భానుమతే!

          టించిన సినిమాల్లో  ద్విపాత్రాభినయాల పరిమితిని దాటుకుని అక్కినేని, సంజీవ్ కుమార్, శివాజీ గణేశన్ ల నవవిధ పాత్రాభినయాలు, కమల్ హాసన్ దశావతారాలు, ఆఖరికి ప్రియాంకా చోప్రా భుజాన్నేసుకున్న పన్నెండు వేషాలూ ..డబుల్ యాక్షన్ తో మొదలెట్టి డజను యాక్షన్స్  వరకూ చేరిన వెండితెర బహువిధ పాత్రాభినయాల చరిత్ర అంత గర్వకారణ మేమీ కాదు ఆలోచిస్తే, గర్వకారణం నిజజీవితంలో భానుమతి బహుముఖ ప్రజ్ఞాపాటవమే!

          గటు ప్రేక్షకుడు సినిమాకొచ్చి తన అభిమాన నటీనటుల ప్రజ్ఞని విశ్లేషించుకుంటూ కూర్చోవాలనుకోడు. వాడి తహతహ అంతా కూడా కేవలం ఆ నటనల్లో తాదాత్మ్యం చెంది, వెంటాడే ఈ జీవితాన్నుంచీ కాసేపు దూరంగా పారిపోవాలనుకోవడం గురించే. అయితే ఆ తదాత్మ్యత  సాంద్రత పోషించే పాత్రలు పెరిగే కొద్దీ తరిగిపోవడం కూడా కద్దు. కమల్ ( ‘దశావతారం’), ప్రియాంకా ( ‘వాటీజ్ యువర్ రాశి’ ) వంటి ఇటీవలి బాక్సాఫీసు ఓటములే ఇందుకుదాహరణలు.

          భానుమతి కలాటి ఓటమిలేదు. నటిగా, గాయనిగా, కవయిత్రిగా, సంగీత కర్తగా, కథా రచయిత్రిగా, సినిమా దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా, ఫిలిం ఎడిటర్ గా, ఖగోళ జ్యోతిష్య శాస్త్రాల స్రష్టగా...ఇన్ని విభిన్న పాత్రల పోషణని తన జీవితంలో సూపర్ డూపర్ హిట్టు గా నిర్వహించుకుపోయిన వన్ ఉమన్ ఆర్మీ భానుమతీ రామకృష్ణ!
          జీవితం కాన్వాసు జగమంత, అందులో మేధస్సు విస్తృతి ఆకాశమంత, సినిమా కాన్వాసు కమర్షియాలిటీకి సరిపోయేంతే;  అందులో మళ్ళీ క్రియేటివిటీ పాలు ఆ కమర్షియాలిటీకి లొంగినంతే, అంతే! దాటిపోయిందంటే దవాఖానాలో పడకే. ఈ అపూర్వ సందేశాన్నే అందుకోవాలి భానుమతి నిండు జీవితంలోంచి.
          మరొకటుంది- చాలా డేరింగ్ వుమన్ కూడా భానుమతి!
          లేకపోతే ఏమిటా తెగింపు!  ఇంకా ఇరవయ్యారేళ్ళ లేత వయసులోనే 1953 లో, దేశంలో సినిమా దర్శకత్వం చేపట్టిన తొలి మహిళ ఎవరున్నారంటే, తనే అని అన్పించుకుంటూ- నిర్మాతగానూ మారి, ఇంకో చేత్తో భారతీయ సినిమాల్లో తొలిసారిగా ద్విపాత్రాభినయాన్ని అవలీలగా పోషించి అవతలపారేసి,  తెలుగు- తమిళ- హిందీ బహు భాషా చిత్రంగా ‘చండీరాణి’ అనే మసాలా సినిమా తీసి, ఒకే రోజు ఆ మూడు భాషల్లోనూ విడుదల చేసి పారేసి, సత్తా చాటుకోవడం ఇంకెవరి వల్లయింది?
        ప్రపంచ సినిమా చరిత్రలో భానుమతితో పోల్చదగ్గ  చలనచిత్ర మహిళ ఇంకొక్కరే! ఆవిడ ఫ్రాన్సుకి చెందిన ఆలైస్ గై బ్లాంచ్ ( 1873-1963) అనే ఆవిడ. సినిమా అనే దృశ్య మాధ్యమాన్ని కనిపెట్టింది 1896లో ఫ్రాన్సు దేశస్థులైన లూమియర్ సోదరులహో అని అదేపనిగా బాజా వాయిస్తూంటాం గానీ, అదే సంవత్సరం ఆ విజయంలో ఓ చెయ్యి వేసిన  స్త్రీ మూర్తి గురించి పట్టించుకోం. మేడమ్ ఆలైస్ ప్రపంచంలోనే తొలి సినిమా ‘దర్శకురాలు’ గా ‘లాఫీ ఆక్ హాక్స్’ అనే మూకీ సినిమా తీయడమే కాదు, ఇంకే మూకీ దర్శకుడూ నిర్మాతా ఉత్పత్తి చేయనంత స్థాయిలో 700 వరకూ మూకీలు తీసి అవతల పారేసి కాలుమీద కాలేసుక్కూర్చుందంతే!!

అలైస్ గై బ్లాంచ్
              భానుమతి 1939లో 13వ యేట ‘వరవిక్రయం’ తో సినీరంగ ప్రవేశం చేసినా, 1945లో బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో ‘స్వర్గసీమ’ లో నటించాకే మంచి పేరొచ్చింది. అందులో కథానాయకుడి ( వి. నాగయ్య) పండంటి సంసారాన్ని పీకి పందిరేసే ప్రతినాయిక సుబ్బలక్ష్మి పాత్రలో కనిపిస్తుంది. ‘ఒరేవొరే, భానుమతి కూడా మంచిది కాదురా, కాపురాలు కూల్చే రకం!’ అని నాటి ప్రేక్షకులు యమవర్రీ అయిపోయేవాళ్ళు- ఆవిడేదో తమ పక్కింట్లోనే మకాం వేసి తమ కొంపలకి  ఎసరుపెడుతున్నట్టు. ఇలాటి వాళ్ళని ఇంకా ఏడ్పించి వదలాలని కాబోలు, ‘విప్రనారాయణ’ లోనూ అదే వ్యాంప్ పోకడ పోయారామె!
          ‘విప్రనారాయణ’ భానుమతి నటజీవితాన్ని కీలక మలుపు తిప్పిన మహోజ్వల భక్తి రస ప్రధాన చలన చిత్రం. ‘లైలా మజ్నూ’, ‘మల్లీశ్వరి’, బాటసారి’ ల లాంటి మరెన్నో అద్భుత చలన చిత్రాలు ఆమెఖాతాలో పడివుంటే ఉండొచ్చు గాక- ఒక పూర్తి స్థాయి యాక్టివ్ పాత్రగా, కథలో ఓ ప్రధాన సంఘటనని సృష్టించి, ఆ కథని నడిపించే, కథనాన్ని కూడా పండించే దృశ్య కావ్యంగా  ‘విప్రనారా యణ’ నిలబడింది. అక్కినేని నాగేశ్వరరావు పోషించిన విప్రనారాయణ పాత్రపరంగా సినిమాకి నామకరణం జరిగినా,  నిజానికిందులో భానుమతి పోషించిన దేవదేవి పాత్రకే పెద్ద పీట. ట్రాజెడీల్లో ప్రధాన పాత్ర కర్మణి పాత్ర స్థానంలో వుండిపోయి, ప్రతినాయక పాత్ర కర్తగా తానే కథ నడిపించడం చూస్తూంటాం. అలాగే  ‘విప్రనారాయణ’ లో కూడా ఇలా ప్రతినాయిక పాత్రనే ప్రధాన పాత్రగా చేసి, సాగించిన కథనాన్ని నాటక పరిభాషలో ప్రకరణం అంటారు. ‘చింతామణి’, ‘వసంతసేన’, ‘స్వర్గసీమ’ లలోని ‘సుబ్బలక్ష్మి’ కథలు ఈ కోవకే చెందుతాయి.
          సరే, ఇంతకీ ఎవరీ విప్రనారాయణ?
         చరిత్రలో కెళ్ళాలి.  క్రీ.శ. 787 లో తమిళనాడులోని కావేరీ నది ఒడ్డున మందంగుడి అనే గ్రామంలోజన్మించాడు తొండరాదిప్పొడి ఆళ్వార్. ఇతను నారాయణుడి ఆశీస్సులతో  జన్మించడంతో విప్రనారాయణ అయ్యాడు. విప్ర అంటే బ్రాహ్మణుడు. ఇతను పెరిగి పెద్దయి, వేదాలు చదువుకుని, శ్రీరంగ పట్టణం వెళ్లి శ్రీ రంగనాథుడి దర్శనం చేసుకున్నాడు. ఆ దర్శనం అతడిలో భక్తి పారవశ్యాన్ని కల్గించి, ఇక అక్కడే వుండిపోయి ఆ రంగనాథుడి సేవలో తరించి పోయేందుకు పురిగొల్పింది. ఆ సేవలో ప్రధానమైనది మాలా కైంకర్యం. దాంతో ఆలయం వారగా తులసి మొక్కలు, రకరకాల పూల చెట్లూ పెంచి ఒక మనోహరమైన తోటని అభివృద్ధి చేశాడు. అనునిత్యం పూలమాలలు అల్లుతూ స్వామికి సమర్పించుకోవడమే దినచర్య అయిపోయింది.
          కావేరి ఆవలి ఒడ్డున కదంబణగారం అనే ఊరుంది. ఆ ఊళ్ళో దేవదేవి అనే వేశ్య ఉంటోంది. ఓ నాడామె చోళరాజు ఎదుట నృత్య ప్రదర్శన ఇచ్చింది. చోళ రాజు మెచ్చుకుని సత్కరించాడు. ఆమె తిరిగి వెళ్తూ తోటలో విప్రనారాయణని చూసింది. అతడి గొప్ప గురించి ఇదివరకే చెప్పి వుంది తన అక్క అలివేణి. దీంతో ఈ గొప్పవాడికి ప్రణమిల్లాలని ముందుకు సాగిన దేవదేవి కి భంగపాటు ఎదురయ్యింది. అప్పుడేదో పరధ్యానంలో వున్న విప్రనారాయణ ఆమె ప్రణమిల్లడాన్ని గమనించలేదు. దీంతో ఆమె అహం దెబ్బ తింది. అతడి పరధ్యానాన్ని అహంకారంగా భావించుకుని –ఈ మనిషిని ఎలాగైనా లొంగదీసుకుని పీచమణుస్తానని అక్కడికక్కడే ప్రతిజ్ఞ చేసింది.
          ఇక్కడ్నించే మొదలయ్యాయి విప్రనారాయణకి కష్టాలు! అతడి దైవ చింతన, భక్తీ ముక్తీ సర్వం ఆ ఒక్క ఆడగాలి సోకి పటాపంచలై పోయాయి. అనాధనని, అతడి సేవలో తరిస్తూ కష్టాలన్నీ మర్చిపోతాననీ బొంకి, పథకం ప్రకారం అతడి పంచన చేరిన ఆమె, ఓ వర్షపు రాత్రి అనుకున్నట్టూ లొంగ దీసేసుకుంది. అంతే, ఇక దీంతో అతడామెకి దాసుడైపోయాడు. ఆలయం నుంచి ఏకంగా మకాం ఆమె ఇంటికే మార్చేశాడు. కానీ, చిల్లికాణీకీ కొరగాని ఇతగాణ్ణి ఆమె తల్లి చీదరించుకుని, పైపెచ్చు ఇతడి మైకంలో కూతురు పడిందంటే తన ఆదాయమూ పడిపోతుందని ఇంట్లోంచి వెళ్ళ గొట్టేసిందతణ్ణి.
      అయినా మూతబడ్డ తలుపులవతలే బైఠాయించి దేవదేవినే కలవరించసాగాడు. విప్రనారాయణ ఈ దుస్థితిని రంగనాయకి తో పట్టణ విహారాని కొచ్చిన రంగనాథుడు చూసి జాలిపడ్డాడు. దారి తప్పిన ఇతడికి సాయపడాలని, ఆలయంలోంచి బంగారు గిన్నె తొలగించి తెచ్చి, అది విప్రనారాయణ పంపిన కానుక అంటూ  దేవదేవికి బహూకరించాడు. అటు ఆలయంలోని బంగారు గిన్నె చోరీ జరిగిందని పూజారి గోల పెట్టాడు. ఆ నేర విచారణలో విప్రనారాయణుడే నిందితుడిగా నిలబడాల్సి వచ్చింది.
          అప్పుడు  చోళ రాజు అతడి దోషిత్వాన్ని నిర్ధారించుకుని, శిక్షగా చేతులు నరికెయ్యాలని ఆదేశించాడు. ఆ శిక్ష అమలవుతూండగా, రంగనాథుడు ప్రత్యక్షమై కాపాడాడు. ఇదంతా తాను ఆడించిన ఆట అని చెప్పాడు. పూర్వ జన్మలో విప్రనారాయణ వైజయంతీ మాలా రూపుడనీ, శాపవశాత్తూ మానవుడిగా జన్మించాడనీ, దేవదేవి కూడా పూర్వజన్మ కర్మానుభవం కోసం మానవిగా జన్మించిన గంధర్వ కాంత అనీ, అలా వీళ్లిద్దరికీ సంబంధ బాంధవ్యాలు కల్పిస్తూ, వాళ్ళ కర్మ శేషం హరింపజేసేందుకే, తన సన్నిధి లోని బంగారు గిన్నెని సాని ఇంటికి పంపాననీ, చెప్పుకొచ్చాడు రంగనాథుడు. దీంతో విప్రనారాయణ కష్టాలన్నీ గట్టెక్కి, తిరిగి ఆ స్వామి భక్తుడ య్యాడు.
          శ్రీరంగం టెంపుల్ వెబ్ సైట్లో పెట్టిన ఈ చరిత్ర పాఠాన్ని ఉన్నదున్నట్టూ తెరకెక్కించారు దర్శకుడు, భానుమతి భర్త రామకృష్ణ. కాలానుగుణమైన వాతావరణ నేపధ్యం, దృశ్యానుగతమైన నటనలూ ఇంత చక్కగా అమరిన ఈ కళా సృష్టి, మనల్ని ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఎప్పుడో 1954 లోనే సినిమా క్రాఫ్ట్ ఇంత రాటుదేలి వుండడం ఒక అద్భుత విషయంగా కన్పిస్తుంది. వర్షపు రాత్రి సీనైతే ఫెంటాస్టిక్. మూడంకాల ( త్రీ యాక్ట్స్) కథా సంవిధానంలో ఆయా అంకాల్లో ఏ ఏ బిజినెస్సులు జరగాలో- ఆ కథన కవాతులు పొల్లుపోకుండా ఆకట్టుకుంటే, సందర్భానుసారంగా వచ్చే పాటలొక మంచి కవిసమయం. భానుమతి, ఏఎం  రాజాల గళాలు మధువులు నిండిన గళాసులు. సేవించే మనబోటి శాల్తీలకి సాంత్వన క్లాసులు. ‘ఎందుకోయీ తోటమాలీ..’,  ‘సావిరహే తవదీనా..’,  ‘చూడమదే చెలియా ..’  పాటలన్నీ సాలూరు రాజేశ్వరరావు చేతినుంచి జాలువారిన సంగీత ఝరులే. సముద్రాల రచన, రెహ్మాన్ ఛాయాగ్రహణం మరో రెండు పంచ ప్రాణాలు.
          ఈ సినిమా విడుదలై యాభై ఏళ్ళు దాటింది. అయినా లోకంలో ఇంత శోకం ఇంకా మిగిలే వుంది. కష్టాలకి కుంగి పోతారు మనుషులు. భోరున విలపించేసి తమ బాధని ప్రపంచానికి ప్రకటిస్తారు. కష్టాలు రావడమంటే చేసిన పాత కర్మల దరిద్రం వదలడమేననీ, వదిలి పునీతులవడమే ననీ- ఈ సినిమా చూసి గ్రహించి వుంటే, ఇంత విషాదం ఈ  ప్రపంచంలో వుండేది కాదు. అక్కినేని, భానుమతి ల మధ్య రోమాన్సుని రోమాంచితం చేసి, షుగర్ కోటింగ్ సన్నివేశాలతో అలరింపజేస్తూ వెళ్లి, ఆఖర్లో అసలు గుట్టు విప్పుతూ, ఒక ఆధ్యాత్మిక ప్రభోదం చేస్తున్న ఈ చలన చిత్ర రాజం-  సృజనాత్మకతా పరంగా జేమ్స్ బానెట్ స్టోరీ వీల్ స్లాట్ లో అగ్రస్థానాన్నే ఆక్రమిస్తోంది సగర్వంగా!
         అక్కినేనిది బాధిత పాత్ర కావడం వల్ల ఆ మేరకే ఆయన నటనా వుండి జాలి పుట్టిస్తుంది. ఎదురయ్యే సంఘటనల్ని ప్రతిఘటించే తత్త్వం కాకపోవడం చేత ఆయన ప్రదర్శించిన అమాయకత్వం నిండిన హావభావాలు చాలా రోజులూ మనల్ని వెన్నాడి తీర్తాయి! ఇక భానుమతి గురించి చెప్పుకోవాలంటే – ‘భానుమతి ఈజ్ ది షో ఉమన్’  అని చెప్పుకోవాలి. పాత్ర స్వభావం చేత ఆమెకి నవరసాల పోషణ దక్కింది. కథని నడిపించే పాత్రవడం చేత ఆ పాత్ర చివరంటా సినిమాకి చురుకుదనం పుట్టిస్తుంది. వేశ్యగా హొయలు, ప్రేమికగా హుందాతనం..ఈ రెండు శారీరక భాషల తో ఆమె అభినయ కళా విశేషాలు వెర్రెత్తించి వదుల్తాయి. తమిళులు కలైమా మణి  అనీ, బహుకళా ధీరతి శ్రీమతి అనీ, ఊరికే అనలేదు భానుమతి నుద్దేశించి. వ్యాంప్ కి చెరువైనా, గయ్యాళి తనానికి దూరం ఉంటూ, జీవితపు చరమాంకంలో వెండితెర మీద ది గ్రాండ్ ఓల్డ్ మదర్ గా మన్నన లందుకున్న పాలువాయి భానుమతీ రామకృష్ణ ( 1925- 2005) చక్కగా ‘విప్రనారాయణ’ నిర్మించి తనకి తానే నివాళి అర్పించుకున్నారు!

సికిందర్
( నవంబర్ 2009, సాక్షి- ‘ఆ ఒక్క సినిమా’ శీర్షిక)
         
         





అదృశ్యం!

      
                                               
కథ- స్క్రీన్ ప్లే- నిర్మాణం- దర్శకత్వం : వాసు మంతెన
తారాగణం: శ్రేయాన్‌
, ప్రగతి, అభిమన్యుసింగ్‌, ముఖేష్‌ రుషి, కోట శ్రీనివాసరావు, స్నిగ్ధ, సత్య
మాటలు: వడ్డాలపు ప్రభాకర్‌,  ఛాయాగ్రహణం: వి.కె. గుణశేఖర్‌
సంగీతం: ప్రవీణ్‌ ఇమ్మడి,  కూర్పు: గౌతంరాజు విడుదల
నిర్మాణం: వజ్మన్‌ ప్రొడక్షన్స్‌, విడిదల : 3 జులై
, 2015
*
         
సీనియర్ నటి జయసుధ కుమారుడు శ్రేయాన్ ని హీరోగా పరిచయం చేస్తూ కొత్త దర్శకుడు వాసు మంతెన తనే నిర్మాతగా మారి నిర్మించిన ‘బస్తీ’ ని కనువిందు చేసే ఒక సృజనాత్మక ప్రయత్నంగా ఆహ్వానించవచ్చు. చిన్న బడ్జెట్ సినిమాల్లో ఈ స్థాయి దృశ్యపరమైన ప్రమాణాలు తెలుగులో చాలా అరుదుగా చూస్తూంటాం. దర్శకుడికి విజువల్ సెన్స్ వున్నప్పుడు ఛాయాగ్రహణం- కళ- కాస్ట్యూమ్స్ విభాగాలు  సైకలాజికల్ గా ట్రాన్స్ లోకి తీసికెళ్ళేట్టు చేస్తాయి ప్రేక్షకుల్ని. కళా దర్శకుడి కలర్ స్కీం, కాస్ట్యూమ్స్ స్పెషలిస్టు ఇచ్చే డ్రెస్సింగ్ స్కీం, ఈ రెండిటికి మ్యాచయ్యే ఛాయాగ్రాహకుడి లైటింగ్ స్కీం,  దృశ్యాల్లో మూడ్ ని క్రియేట్ చేస్తాయి. ఈ మూడ్ క్రియేషన్ ని పర్యవేక్షించే దర్శకుడు కొత్తవాడై వుంటే అతను ప్రామిజింగ్ డైరెక్టర్ గా కనపడతాడు. వాసు మంతెన అలాటి ప్రామిజింగ్ డైరెక్టర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. చిన్న సినిమాలు తీస్తున్న కొత్త దర్శకులు తమదైన ముద్రతో ప్రామిజింగ్ డైరెక్టర్ లుగా కన్పించే దృష్టాంతాలు భూతద్దం పెట్టి గాలించినా కన్పించడం లేదు. ఏదో ఇలా వస్తున్నారు, అలా పోతున్నారు మొక్కుబడిగా..
          హీరో శ్రేయాన్ కెసిఆర్ అన్నట్టు తెలుగు అమితాబ్ బచ్చనే పొడుగు రీత్యా. ఆ పొడుక్కి చాక్లెట్ బాయ్ ఫేస్ కట్ ఒక భిన్నమైన కాక్ టెయిల్. కాకపోతే సరసన నటించే హీరోయిన్లతో రావచ్చు సమస్య. ఈ సినిమాలో వచ్చింది కూడా. హీరోయిన్ ప్రగతి హైటు చాలక చిన్నపిల్లలా కన్పిస్తుంది. పైగా ఈమె అంత వయసున్న కోట శ్రీనివాసరావుకు కూతురంటే కూడా నమ్మశక్యం కాదు- మనవరాలిలా వుంటుంది.
          దర్శకుడు ‘బస్తీ’ అనే ఈ యాక్షన్ మూవీని తనే రాసుకుని తనే తీసి ఎలా ఆకట్టుకోబోయాడో ఒకసారి చూస్తే ...
ప్రేమలు వేరు- చావులు వేరు   
       ఓపెనింగ్ సీనులో సిటీలో ఓ పొద్దుటే జాగర్స్ కి, వాకర్స్ కి పార్కులో ఓ అమ్మాయి శవం కంత పడుతుంది. ఓ క్లాసిక్ క్రైం / డిటెక్టివ్ సినిమాల్లో లాంటి సింపుల్ ఓపెనింగ్. పోలీసులొస్తారు, ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. కథా నేపధ్యం ఎస్టాబ్లిష్ అవుతుంది. సిటీలో ఆ  ప్రాంతం ఒకప్పుడు బస్తీ. ఇప్పుడు పోష్  ఏరియా. బస్తీగా వున్నప్పట్నించీ అక్కడ భిక్షపతి ( కోట), అమ్మిరాజు ( ముఖేష్ రిషి) అనే గ్యాంగ్ స్టర్స్ మధ్య వైరాలు. ఇవి ప్రస్తుతం చల్లబడి ప్రశాంతత నెలకొన్నా- ఈ ప్రశాంతతకి కారకుడైన అమ్మిరాజుని వద్దన్నా ఏదో రకంగా  బిక్షపతి కొడుకు భవానీ ( అభిమన్యు సింగ్) రెచ్చ గొడుతూంటాడు.  అమ్మిరాజు భిక్షపతితో ఏనాడో శత్రుత్వం చాలించుకుని ప్రశాంతంగా తన కుటుంబంతో జీవిస్తున్నాడు. ఇలాటి సమయంలో అమ్మిరాజు ఏరియాలో భవానీ  ఓ అమ్మాయిని చంపించడంతో, అతడి చెల్లెల్ని, అంటే భిక్షపతి కూతురు స్రవంతి ( ప్రగతి) ని రహస్యం గా కిడ్నాప్ చేయించి తనింట్లోనే  బంధిస్తాడు అమ్మిరాజు. 
          ఇంతలో అమ్మిరాజు తమ్ముడు విజయ్ ( శ్రేయాన్) అమెరికానుంచి వస్తాడు. ఇంట్లో బంధించివున్న స్రవంతిని చూస్తాడు. విషయం తెలుసుకుంటాడు.  అన్న వాదాన్ని నమ్ముతాడు. స్రవంతితో పరిచయం పెరుగుతుంది, ఆమె కూడా దగ్గరవుతుంది. ఆ దగ్గరవడం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు.  దీనికి అమ్మిరాజు ఒప్పుకుంటాడు- ఇలాగైనా రెండు కుటుంబాల మధ్య శాంతి ఏర్పడుతుందని. ఈ విషయం ఎస్పీ కి చెప్పి భిక్షపతితో మీటింగ్ ఏర్పాటు చేయించమంటాడు. ఆ మీటింగులో ఉద్రిక్తత లేర్పడతాయి పెళ్లనగానే. భిక్షపతి ఒప్పుకున్నా, కొడుకు భవానీ అంగీకరించడు. కాల్చిపారేస్తాడు తండ్రిని, ఎస్పీనీ, అమ్మిరాజునీ...విజయ్ స్రవంతిని తీసుకుని పారిపోతాడు. భవానీ మరికొందరు అమ్మిరాజు బంధువుల్ని కూడా చంపేస్తాడు.
          స్రవంతి తో పారిపోయిన విజయ్ కర్ణాటకలో స్నేహితుల దగ్గర తలదాచుకుంటాడు. ఇక ఎట్టి పరిస్థితిలో స్రవంతిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోవాలనుకుంటాడు ...ఇదీ విషయం. ఇక భవానీని ఎదుర్కొని అమెరికా వెళ్లి పోగలిగారా అన్నది మిగతా కథ. 
బడ్జెట్ కి చాలని కథ 
      ఈ కథ చూస్తే దర్శకుడు పెద్ద బడ్జెట్ ఫార్ములా సినిమాలకి ప్రభావితుడైనట్టు తెలిసిపోతూంటుంది. సినిమా కథ అంటే పెద్ద బడ్జెట్ ఫార్ములా సినిమా కథే అన్న అభిప్రాయమో ఏమో అదిక్కడ బెడిసి కొట్టింది. పెద్ద బడ్జెట్ సినిమా కథల్ని పెద్ద బడ్జెట్ సినిమాల్లోనే అన్ని భారీ హంగులతో చూసి ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు, పనిగట్టుకుని అలాటి హంగులు వుండని ఛోటా సినిమాల్లో కూడా చూడాలని ఎందుకు కోరుకుంటారు? సమస్య ఎక్కడ వచ్చిందంటే, తెలుగులో భారీ సినిమాలు హాలీవుడ్ ని అనుకరిస్తే, భారీ సినిమాల్ని చిన్న సినిమాలు అనుకరిస్తున్నాయి- ఐతే హాలీవుడ్ ని అనుకరించినా  భారీ సినిమాలు బతికుంటాయి, భారీ సినిమాల్ని అనుకరించే చిన్న సినిమాలు మాత్రం చచ్చూరుకుంటున్నాయి. ప్రస్తుత చిన్న సినిమాదీ ఇదే పరిస్థితి. అంతగా యాక్షన్ మూవీ తీయాలనుకుంటే నవ్యత తో కూడిన ఏ థ్రిల్లరో తీయవచ్చు.
          రెండోది, ఈ కథ మూస ఫార్ములాయే  అయినా దర్శకుడు ఒక విజన్ పెట్టుకుని రియలిస్టిక్ గా తీయాలనుకున్నట్టు కొన్ని సీన్లలో అర్ధమవుతుంది. ఓపెనింగ్ సీను అలాంటిదే. కానీ అంతలో అభద్రతాభావం వెంటాడినట్టు మళ్ళీ ఫార్ములా చిత్రీకరణల్లో సేఫ్ జోన్ చూసుకునే ధోరణి కన్పిస్తుంది. ఇదెక్కడిదాకా పోయిందంటే కామెడీ సీన్లన్నీ అలాటివే. ఇంకా పనిగట్టుకుని- ఫార్ములా సినిమాల్లో సెకండాఫ్ లో కథతో సంబంధం లేని కమెడియన్లని దింపి కామెడీతో టైం పాస్ చేసినట్టూ- ఇక్కడా అదే పరిస్థతి. మహావిష్ణువు పాత్రలో అలీ వచ్చేసి ఆ కామెడీ ఏమిటి? గే క్యారక్టర్ తో సత్య కామెడీ ఏమిటి? ఇవన్నీ బిగ్ బడ్జెట్ సినిమా ఫీల్ తీసుకురావడానికి దర్శకుడు పడ్డ పాట్లే!
          మూడోది, ఇలాటి కథ మహేష్ బాబు- ఆర్తీ అగర్వాల్ లతో ‘బాబీ’ గా వచ్చిందే. ఇద్దరి తండ్రులూ పగలు రగిలిన గూండాలే. ఇంకా మహేష్ బాబే నటించిన ‘ఒక్కడు’ లో మహేష్ బాబు హీరోయిన్ ని రహస్యం గా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఈ సినిమాలో హీరో అన్న హీరోయిన్ ని తెచ్చి రహస్యంగా ఇంట్లో పెట్టుకుంటాడు. ఈ రెండు పాయింట్ల తోనే మొత్తం సినిమా అంతా నడించింది. ‘బాబీ’ లో తండ్రులిద్దరూ హింసతో నగరాన్ని అట్టుడికిస్తూంటే, అదేం పట్టనట్టు హీరో హీరోయిన్లు ప్రేమలతో, డ్యూయెట్లతో ఎలా కాలక్షేపం చేస్తారో- అలా ఈ సినిమాలోనూ ఇంతే. భవానీ అనే వాడు కుటుంబాల్నే హతమారిస్తే, ఈ ప్రేమ జంటకి పెళ్ళే ముఖ్యమైపోవడం,  చనిపోయిన వాళ్ళకోసం ఒక్క కన్నీటి బొట్టూ రాల్చకుండా అసలేం జరగనట్టే తిరగడం...ఎలా సాధ్యం?
          నాల్గోది, హీరో పాత్ర పాసివ్ పాత్రగా తయారైందని తెలుసుకోలేదు. ఈ సినిమా మొత్తం మీద హీరో ఏం చేశాడు? చిట్ట చివర్లో మాత్రం తన మీదికి వచ్చిన విలన్ ని రియాక్టివ్ గా చంపి, పేలవమైన డైలాగు కొట్టడం  తప్ప? హీరోయిన్ కుటుంబాన్ని కాసేపు పక్కన పెడితే, కనీసం తన అన్నని చంపినందు కైనా హీరో అనే వాడు ఆ భవానీని చంపేందుకు సిద్ధమవ్వాలిగా? అలాగాక హీరోయిన్ తో పారిపోయి- పెళ్లి చేసుకుని- అమెరికా వెళ్లి పోవాలనుకోవడం ఏ బాపతు పాత్ర, ఏ రకం కథనం?
          ఐదోది, ఆకస్మిక ముగింపు. ‘బాహుబలి’ లో లాంటి ఆకస్మిక ముగింపు! ‘బాహుబలి’ కంటే ముందు ఈ సినిమా తీసినా ఆటోమేటిగ్గా అలాటి బిగ్ బడ్జెట్ సినిమా ముగింపే దర్శకుడికి వచ్చేసిందంటే – ఇక సందేహం లేదు, దర్శకుడి ఊహాశక్తి అపరిమితమైనది! ‘బాహుబలి’ లోని ముగింపు సైతం కలలో కన్పించేంత ఫోర్సుగా బిగ్ బడ్జెట్ సిన్మా హంగులు తనమీద స్వారీ చేస్తున్నాయి!
          ఉరుము లేని పిడుగులా క్లయిమాక్స్ రావడం దర్శకుడు చేతులెత్తేసిన తనాన్నే పట్టిస్తోంది.
          ఒక కనువిందైన దృశ్య ప్రదర్శన చేశాడు తనకున్న విజువల్ సెన్స్ తో. మున్ముందు ఇదే   విజువల్స్ సెన్స్ తో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకుంటూ దర్శకుడిగా నిలదొక్కుకోవాలంటే, ఇక చేయాల్సిందొకటే- ఏ కథ, ఎలాటి స్క్రిప్టు - స్క్రీన్ ప్లే, ఏ క్యారక్టరైజేషన్లు అనే విషయపరమైన  పరిజ్ఞానం పెంపొందించుకుని ఇలా నష్టపోకుండా సినిమాలు తీయడమే. కథా కథనాలూ పాత్ర చిత్రణ లనే మహాసముద్రంలో కొంత లోతుకైనా వెళ్ళగలగడమే...

సికిందర్