రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, ఆగస్టు 2021, ఆదివారం

1053 : రివ్యూ

రచన- దర్శకత్వం : హసిత్ గోలి 
తారాగణం: శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయన, రవి బాబు, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, కాదంబరి కిరణ్, గంగవ్వ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్, ఛాయాగ్రహణం : వేద రామన్ శంకరన్
బ్యానర్స్ :  అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్, టి.జి. విశ్వప్రసాద్ 
విడుదల : 19 ఆగస్టు 2021
***
      రెండేళ్ళ క్రితం బ్రోచేవారెవరురా అనే హిట్ తర్వాత తిప్పరా మీసం’, గాలి సంపత్ లాంటి రెండు ఫ్లాప్స్ లో నటించి తిరిగి ఇప్పుడు రాజరాజ చోర తో గాడిలో పడినట్టు వార్తలు సృష్టిస్తున్న శ్రీవిష్ణుకిది నిజానికి నటనలో  ప్రతిభని సానబట్టుకునే అవకాశం, పాత్ర అలాటిది కాబట్టి.  చోరకళ  వున్న పాత్రకి ప్రేక్షకుల హృదయాల్ని దోచుకునే నటన కూడా తోడ్పడాలి.  దీన్నెంత వరకు సాధించాడు? అలాగే కె. విశ్వనాథ్, జంధ్యాల వంటి దర్శకుల స్కూలుకి చెందినట్టు చెప్పుకున్న కొత్త దర్శకుడు హసిత్, సాహిత్య సంగీత సాంప్రదాయాల సమ్మేళనంగా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకుల ముందుంచాడు. దీంతో ఎంత వరకు మెప్పించగల్గాడు? ఈ విషయాలు పరిశీలిద్దాం.

కథ


   భాస్కర్ (శ్రీవిష్ణు) జెరాక్స్ షాపులో పనిచేస్తూంటాడు. ప్రేమిస్తున్న సంజన (మేఘా ఆకాష్) కి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నని చెప్పుకుంటాడు. ఆమె కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఆమెతో ఖర్చులకి జీతం చాలక దొంగతనాలు చేస్తూంటాడు. మరో వైపు భార్య విద్య (సునయన), ఓ కొడుకూ వుంటారు. కొడుకి చదువుకి, భార్య లా చదువుకీ, ఇంకా ఇతర ఇంటి ఖర్చులకీ దొంగతనాల మీదే ఆధారపడతాడు.

        ఒక పోలీస్ ఇన్స్ పెక్టర్ విలియం రెడ్డి (రవి బాబు) వుంటాడు. ఇతడికో ఫ్రెండ్ వుంటాడు. ఆ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తో తను వ్యవహారం నడిపిస్తూ వుంటాడు. సిటీలో దొంగతనాలు పెరిగిపోతున్నాయని పై నుంచి వొత్తిడి వుంటుంది. ఒక మోటారు షెడ్డులో నివసించే (అంజమ్మ) గంగవ్వ వుంటుంది. ఇక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా డ్రెస్ మార్చుకుని పోతూంటాడు భాస్కర్. ఇతడి దొంగతనాల గురించి తెలిసిన ఆమె, కిరీటం పెట్టుకుని రాజు వేషంలో వెళ్తే దొంగతనంలో బాగా కలిసి వస్తుందని చెప్తుంది.

        ఈలోగా సంజనకి భాస్కర్ పెళ్ళయిన వాడని తెలిసి పోతుంది. దీంతో భార్య చనిపోయిందని అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. ఓ రాత్రి కిరీటం పెట్టుకుని రాజులా వేషం వేసుకుని భారీగా దొంగతనం చేసుకుని వస్తూ, ఇన్స్ పెక్టర్ విలియం రెడ్డికి దొరికిపోతాడు. అదే చోట విలియం రెడ్డి కూడా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కోసం వెళ్ళి  ఫ్రెండ్ కి దొరికిపోతాడు.

        ఇప్పుడు తప్పుచేసి ఫ్రెండ్ కి దొరికిపోయిన విలియం రెడ్డి, దొంగతనమనే ఇంకో తప్పు చేసి దొరికిపోయిన భాస్కర్ ని పట్టుకునే సాహసం చేశాడా? తన గుట్టు కాపాడుకోవాలంటే భాస్కర్ గుట్టు కూడా కాపాడాల్సి వచ్చిందా? ఇది తెలిసిపోయిన భాస్కర్ భార్య విద్య ఏం చేసింది? భాస్కర్ పెళ్ళయిన వాడని తెలుసుకున్న సంజన ఇప్పుడేం చేసింది? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ
   కామెడీ అన్నారు గానీ ఇది ఫిలాసఫికల్ గా చెప్పాలనుకున్న నీతి కథ. పాత సినిమాల్లో దొంగ మంచివాడుగా మారే ఎన్నోసార్లు చూసేసిన రొటీన్ నీతి కథే. నీతి తప్పిన ఇతర పాత్రలు కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం ఫలితం అనుభవించే సెంటిమెంటల్, ఎమోషనల్ డ్రామాల కథ. దీనికి వాల్మీకి కథ ఆధారమని కూడా ప్రచారమైంది.

        2010 లోనే వాల్మీకి గురించి దుష్ప్రచారం చేయకూడదని హైకోర్టు తీర్పు వుంది.  పంజాబ్ - హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు వాల్మీకి జీవితాన్ని పరిశోధించిన పంజాబ్ - హర్యానా యూనివర్సిటీ, వాల్మీకి దొంగ అని నిరూపించే ఆధారాలేవీ దొరకలేదని తేల్చింది. దీంతో వాల్మీకిని అలా చిత్రిస్తూ నాటికలు, టీవీ సీరియల్స్, సినిమాలు వంటివి రూపొందించడం నేరమని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చనీ హైకోర్టు తీర్పిచ్చింది. అయినా 2019 లో వరుణ్ తేజ్ నటించిన తెలుగు సినిమాకి వాల్మీకి టైటిల్ పెడితే ఆందోళనలు చెలరేగి,  చివరికి గద్దలకొండ గణేష్  గా పేరు మార్చాల్సి వచ్చింది. అయినా కూడా ప్రస్తుత సినిమాకి వాల్మీ కథ ఆధారమని మీడియాలో వచ్చేసింది...

        శ్రీవిష్ణు నటించిన ఈ తాజా కథ ఇటీవల తమిళంలో విడుదలైన జీవి కథని గుర్తుకు తెస్తుంది. ఇది కూడా కర్మ సిద్ధాంతంతో  విధి విలాసపు కథే. కాకపోతే ఆ కుటుంబ కథని చాదస్తాలకి పోకుండా, రియలిస్టిక్ జానర్ లో బిగిసడలని సస్పెన్స్ థ్రిల్లర్ కథగా తీశాడు. ఇందులో కూడా హీరో దొంగే. హీరో చేసే ఒక దొంగతనమనే ప్రధాన కథని, ఇంకో కుటుంబంలో ఇంకో కాలంలో జరిగిన దొంగతనంతో ముడిపెట్టి, సారూప్యతా సిద్ధాంతం అనే దాంతో అర్ధవంతంగా తీశాడు.

        ఇందులో హీరో పాత్ర పాసివ్ గా వుండదు, యాక్టివ్ గా వుంటుంది. ప్రస్తుత కథ పాసివ్ పాత్రతో వున్న నీతి కథ. కథ అనేకంటే సరిగ్గా తీయని గాథ అనొచ్చు. ఈమధ్య కథ అనుకుంటూ గాథలు తీసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కథ- గాథ తేడాల గురించి ఎవరికున్న నాలెడ్జి వాళ్ళది. కథా కథనాలకి కొత్త దర్శకుడు కొత్త కాబట్టి ఇది తన అవగాన మేరకు చేసుకున్న రచన, దర్శకత్వం. దీనికి తన సాహిత్య సంగీతాభి లాషల్ని, ప్రవచనాలతో కథని వివరించే కామెంటరీని జోడించి నేటివిటీని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు.

        తెలుగు పట్ల మక్కువతో ఇంటర్వెల్లో సృజనాత్మకత కోసం ప్రయత్నించాడు. ఇంటర్వెల్లో విలియం రెడ్డి ఫ్రెండ్ కి దొరికిపోయినందుకు విలాపం అని, ఇదే సీనులో భాస్కర్ దొంగగా దొరికి పోయినందుకు విఘాతం అనీ, ఈ రెంటినీ కలిపి విరామం అనీ  అక్షరాలేశాడు.

        ఇలా చేయడం వల్ల పంచ్, బ్యాంగ్ లాంటివి మిస్సయి పేలవంగా మారింది. నవ్వుతూంటే నవ్వుతోందనీ, ఏడుస్తూంటే ఏడుస్తున్నాడనీ క్యాప్షన్స్ వేసి చెప్తే ఎలా వుంటుందో అలా వుందిది. ఏం జరిగిందో తెలిసి పోతున్నాక ఇంకా బ్లాక్ బోర్డు మీద రాసి పాఠం చెప్పనవసరం లేదు.

        ఇలా విజువల్ మీడియాకి ఎప్పుడు స్క్రీన్ మీద రాసి చెప్తే ఎఫెక్ట్ వుంటుందంటే, పూరీ జగన్నాథ్ బుజ్జిగాడు చూడొచ్చు. ఇందులో ఇంటర్వెల్ యాక్షన్ సీను ముగింపు చూస్తే- ఈ భావోద్వేగ సన్నివేశంలో ప్రభాస్ తో మోహన్ బాబు లవ్ యూ సాలా అని భుజం తట్టినప్పుడు, ఇదే మాట  Love You Saala’ అని ఇంగ్లీషులో లెటర్స్  వేసినప్పుడు, ఇంటర్వెల్ కి హుషారైన పంచ్, బ్యాంగూ పడ్డాయి. ఇదీ తేడా.

        ఇక దర్శకుడి అభిమాన దర్శకులైన జంధ్యాల, కె విశ్వనాధ్ సినిమాలు చైతన్యంతో వుంటాయి. పాత్ర చిత్రణల మీద పట్టు వుంటుంది. గుర్తుండి పోయే పాత్ర చిత్రణలుంటాయి. వీటి గురించి అనుభవం గడించాల్సిన అవసరముంది దర్శకుడికి.

నటనలు -సాంకేతికాలు

   ఒక చోరుడుగా శ్రీవిష్ణు పాత్రతో బాటు, నటనా ఇంప్రూవ్ అవడానికి అవకాశముంది. అయితే ఇది హాస్య పాత్రనా, సీరియస్ పాత్రనా స్పష్టత లేనట్టు అటు ఇటు కాని పాత్రగా  తయారయ్యింది. కామిక్ సెన్స్, హుషారు, స్పీడు, డైనమిక్స్ వంటి కథాంగాలకి కథనం  దూరంగా వుండడంతో, ఫిలాసఫికల్ మూడ్లోకి వెళ్లిపోవడంతో, శ్రీవిష్ణు చోరుడు పాసివ్ పాత్ర కూడా అయ్యాడు. మధ్య తరగతి కుటుంబ సమస్య డామినేటింగ్ గా, దీనికి తగ్గట్టు భార్యగా నటించిన సునయన పాత్ర సీరియస్ పాత్ర కూడా కావడంతో, వినోదాత్మక విలువలు ఇందులో కనపడవు.

        కథ ఏ జానర్ లో వుంటే ఆ ఫ్రేములోనే నటనలుంటాయి. అయినా కూడా పోనుపోనూ సెకండాఫ్ లో, హడావిడిగా ముగించిన ముగింపులో, శ్రీవిష్ణు స్కిల్స్ ని మరింత మెరుగుపర్చుకుని వుంటే ఈ బరువైన కథకొక వెయిట్ వుండేదేమో. అన్ని సినిమాల్లో ఒకేలాటి పొడిపొడి సాఫ్ట్ నటనతో సరిపెట్టుకోవడం ఏమంత మేలు చేయదేమో.

        సంఘర్షించడానికి, నటించడానికీ ఎక్కువ స్కోపున్న, వ్యక్తిత్వమున్న పాత్ర సునయనది. ఇందులో సఫలమైంది. అయితే పాత్ర వ్యక్తిత్వం ఒక దగ్గర దెబ్బతిని పోయింది. ఈ కథలో తప్పుచేసిన పాత్రలు ఏదోక విధంగా నిష్కృతి చేసుకుంటాయి, లేదా ఫలితం అనుభవిస్తాయి. భర్త తనకి తెలియకుండా చేసిన దొంగతనాల డబ్బుతో లా చదువుతున్న తను, తెలిశాక అలాటి చదువు పట్ల నైతికతని ఫీలవకుండా, అతడితోనే ఒక ఏర్పాటుతో వుంటూ, మళ్ళీ అతను దొంగతనాలు చేస్తే, అప్పుడు బై చెప్పి కొడుకుతో వెళ్ళిపోయి- రెండేళ్ళ తర్వాత లాయర్ గా సెటిలై వుంటుంది!

        ఈమె నైతికతని ప్రశ్నించుకుని అలాటి చదువుకి మొదటే ఛీ కొట్టి వుంటే, ఇది శ్రీవిష్ణు పాత్ర పరివర్తన చెందడానికి బలమైన ఫ్యామిలీ డ్రామాని క్రియేట్ చేసేది. ఇక తన తప్పు వల్ల భార్య భవిష్యత్తు బలి కాకూడదన్న రియలైజేషన్ ఏర్పడి, ఆమె చేత చదువు పూర్తి చేయించే ఏకైక లక్ష్యం కోసం మంచివాడుగా మారే, ఏ త్యాగమైనా చేసే పాత్ర ప్రయాణంతో, నిజమైన ఫ్యామిలీ మాన్ గా హృదయాల్ని దోచుకునే వాడు. శ్రీవిష్ణు ఈ మంచి అవకాశాన్ని కోల్పోయాడు.

       దొంగగా దొరికిపోయిన శ్రీవిష్ణుని విడిపించుకోవడానికి సునయన పోలీస్ స్టేషన్ కొచ్చినప్పుడు,  ఇన్స్ పెక్టర్ పాత్ర రవి బాబుతో, అతనే ఇరుక్కోగల లా పాయింట్లు మాట్లాడి గెలవడం గొప్ప అన్పించుకునే సన్నివేశ సృష్టి కాబోదు. పోవమ్మా, దొంగ డబ్బుతో లా చదువుతూ నాకే నీతులు చెప్తున్నావా అని రవిబాబు అంటే, ఆమె మొహం ఎక్కడ పెట్టుకుంటుంది.

    కథ లాజిక్ వదిలేసినా చెల్లుతుందేమో గానీ, పాత్ర చిత్రణల్లో లాజిక్కులు లేకపోతే కథే ఖతమవుతుంది. ఇక శ్రీవిష్ణుని ప్రేమించే పాత్రలో సంజనగా మేఘా ఆకాష్ వుంటుంది. ఈమె పాత్రకి ఇంటెర్వెల్లో ఒక ట్విస్టు వుంటుంది. ఇంతవరకూ సాఫ్ట్ రోమాన్స్ నటనే వుంటుంది. సెకండాఫ్ లో సైడ్ అయిపోతుంది. భార్య చనిపోయిందని శ్రీవిష్ణు అబద్ధం చెప్పాడని తెలుసుకున్నప్పుడు ఆమె పాత్ర ముగిసిపోతుంది. ఈ అబద్ధం చెప్పాడని తెలుసుకునే మలుపు మాత్రం చేసిన కథనంతో డైల్యూట్ అయిపోయింది. దీంతో అది మలుపు కాకుండా పోయింది. శ్రీవిష్ణు అబద్ధం చెప్పాడని ఆమె తెలుసుకున్న ఇంకో నిజం ఇలా ఫ్లాష్ బ్యాక్ గా వేయడంతో థ్రిల్లింగ్ గా లేక చప్పగా తేలిపోయింది.  
     
        దేర్ విల్ బి బ్లడ్ (2007) ఆస్కార్ గాథ స్క్రీన్ ప్లే సంగతులులో ఇలా జరక్కుండా ఏ జాగ్రత్త తీసుకున్నాడో గమనించాం. ఇందులో ఇంటర్వెల్ ఎపిసోడ్ లో రెండు ప్రమాదాలు జరుగుతాయి. ఒకదాని తర్వాతొకటి రెండు ప్రమాదాలూ చూపిస్తే రిపిటీషన్ తో దెబ్బతింటాయని ఈ జాగ్రత్త తీసుకున్నాడు దర్శకుడు పి.టి. ఆండర్సన్ :  మొదటి ప్రమాదాన్ని మైనర్ ప్రమాదంగా చేసి, లైవ్ యాక్షన్లో చూపించకుండా, మాటలతో వివరించే వెర్బల్ సీనుగా  వేశాడు. దీంతో బాటు ప్రమాదం తాలూకు కొన్ని విజువల్స్ వేశాడు. ఇలా మొదటి ప్రమాదం గురించి కేవలం చెప్పించడంతో, ఆ వెంటనే ఇంటర్వెల్లో జరిగే మేజర్ ప్రమాదాన్ని రియల్ టైమ్ లో లైవ్ యాక్షన్లో చూపించడం వల్ల, ఇది రిపిటీషన్ బారిన పడని ఇంటర్వెల్ ఇంపాక్ట్ గా నిలబడగల్గింది. మేఘా ఆకాష్ విషయంలో కూడా ఇలా ఇంపాక్ట్ వుండాలంటే రియల్ టైమ్ లో లైవ్ యాక్షన్లో చూపించాలి తప్ప, చల్లారిపోయిన అభిప్రాయం కల్గించే ఫ్లాష్ బ్యాకుగా కాదు.

        ప్రవచన కారుడుగా తనికెళ్ళ భరణి కన్పిస్తాడు. ఇక ఇన్స్ పెక్టర్ రవిబాబుతో బాటు డాక్టర్ కమ్ రియల్ ఎస్టేట్ శ్రీకాంత్ అయ్యంగార్, జెరాక్స్ షాప్ ఓనర్ అజయ్ ఘోష్, హెడ్ కానిస్టేబుల్ కాదంబరి కిరణ్, గంగవ్వ పాత్రలకి ఒక్కో కథనిచ్చాడు దర్శకుడు. కర్మ ఫలాలు కాన్సెప్ట్ కాబట్టి ఈ కథలు. పోతే సాంకేతికంగా ఏ సినిమా అయినా ఇలా అప్డేట్ అవుతూనే వుంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేది సాంకేతికులు మాత్రమే. ఏమాత్రం అప్డేట్స్ అంటకుండా జాగ్రత్తలు తీసుకుని, మాస్కులు వేసుకుని, శానిటైజ్ చేసుకుంటూ, అరకిలోమీటరు దూరం పాటించేది కథకులే. కోవిడైజుడు కథకులు. ఇక సంగీతానికి సెమీ క్లాసిక్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

చివరికేమిటి

    గుళ్ళో శివరాత్రి పవిత్ర ప్రవచనాలతో ప్రారంభమై, గుళ్ళోనే  ఉగాది పవిత్ర ప్రవచనాలతో ముగిసే ఈ గాథ- దొంగతనాలే గాకుండా రంకుతనాల్ని కూడా చూపించింది. సుమారు గంటా ఇరవై నిమిషాలు కథలోకి వెళ్ళడానికే టైము పట్టింది. పైన చెప్పుకున్న ఇంటర్వెల్ సీనుకి గానీ బిగినింగ్ విభాగం ముగియదు. 23 వ నిమిషంలో హీరోకి భార్య వుందన్న విషయం బయటపడుతుంది. ఇది ప్లాట్ పాయింట్ వన్ కాదు. ప్లాట్ పాయింట్ వన్ ఇంటర్వెల్లోనే - శ్రీవిష్ణు, రవిబాబు పరస్పరం దొరికిపోవడంతో.
        ఈ గంటా ఇరవై నిమిషాలూ కథనంలో డైనమిక్స్ లేక, దాంతో స్పీడూ లేక మందకొడిగా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ గంట సేపు పూర్తిగా శ్రీవిష్ణు-సునయనల సీరియస్ కుటుంబ డ్రామాగా మారిపోతుంది. శ్రీవిష్ణు పూర్తిగా పాసివ్ అయిపోతాడిక్కడ. ఫస్టాఫ్ లో గోల్ లేనట్టే సెకండాఫ్ లోనూ గోల్ వుండదు. కథకుడు ఎలా కథనం చేస్తే అలా పోతాడు. కానీ కథనానికి బేసిక్ సూత్రమేమిటంటే, పాత్ర ఎలా కథనం సృష్టిస్తూంటే కథకుడు అలా పోవడం. ఎందుకంటే కథాకథనాలనేవి కథకుడివి అయివుండవు. పాత్రకి చెందిన ఆస్తి అది. పాత్ర డొమైన్. పాత్ర డొమైన్ లో కథకుడికేం పని?

     కేవలం ఐడియానే కథకుడు సృష్టించగలడు. దాంతో కథా కథనాల్ని సృష్టించుకుని, నడుపుకునే పని పాత్రదే. అందుకే కథ నడుపుకునే వాడు కాబట్టి కథా నాయకుడన్నారు. ఫస్టాఫ్ నుంచీ ఇది జరిగి వుంటే శ్రీవిష్ణు గోల్ వున్న యాక్టివ్ పాత్రగా వుంటూ, కథనం చైతన్యంతో వుండేది. గాథల్లో సైతం ట్రాజడీ అయినా సరే పాత్రకి గోల్ వుంటుంది. కొత్త దర్శకుడి స్క్రిప్టులో ఇలాటి చాలా స్క్రిప్టింగ్ టూల్స్ మిస్సయ్యాయి.

“If you give people tools, and they use their natural abilities and their
curiosity, they will develop things in ways that will surprise you very much
beyond what you might have expected.”― Bill Gates

సికిందర్