రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, జనవరి 2021, ఆదివారం

1012 : సందేహాలు - సమాధానాలు




 Q : నేను మీ బ్లాగ్ ఫాలోవర్ ని. నాదొక చిన్న డౌట్. ప్రతీ మూవీలో హీరోకి ఒక గోల్ వుంటుంది. హీరో ఆ గోల్ తో సంఘర్షణ అనుభవించి చివరికి ఆ గోల్ సక్సెస్ లేక ఫెయిల్యూర్ అయి కదా పూర్తవుతుంది. ఐతే అర్జున్ రెడ్డి లాంటి కొన్ని మూవీస్ లో హీరోకి గోల్ వుండదు. ఇలాటి స్టోరీస్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి. కాస్త సలహా ఇవ్వండి.
రాజేష్ దమ్ము, అసిస్టెంట్

A :అర్జున్ రెడ్డి రోమాంటిక్ డ్రామా జానర్. రోమాంటిక్ డ్రామా గోల్ లేకపోయినా ఒక్కోసారి చెల్లుతుంది. ఇదే రోమాంటిక్ కామెడీ అయితే చెల్లదు. రోమాంటిక్ డ్రామాలు, ఇంకెవైనా ఫ్యామిలీ డ్రామాలు గాథల కిందికొస్తాయి. గాథలు తప్ప కథలనే వాటికి గోల్ వుండాల్సిందే. జీవితంలో గోల్ లేకుండా ఏ మనిషి వుంటాడు. వుంటే ఇంట్లోంచి వెళ్ళగొడతారు. వెళ్ళ గొట్టించుకునే గాథలు రాసుకోవచ్చు. సినిమా తీయాలన్న గోల్ తో వచ్చి, హీరోకి గోల్ ని ఎలా కాదంటారు. దర్శకుడికి కెరీర్ గోల్ వుండాలి గానీ హీరోకి, నిర్మాతకి బాక్సాఫీసు గోల్ వుండ కూడదా? కథ కి చక్రాల్లాంటిగి గోల్. చక్రాల్లేకుండా కథెలా డిజైన్ చేస్తారో తెలియదు. ఆర్ట్ సినిమాల గురించి శివాజీ గణేశన్ ఒకసారి చెప్పారు : నదిలో పడవ పోతూ వుంటుందిఇంకా పోతూ వుంటుంది ... పోతూనే వుంటుందికథలో ఏమీ జరగదని! పడవకి చక్రాలుండవు. అలలు ఎటు తోస్తే  అటు వెళ్ళి పోవాల్సిందే. గాథ చేయాలనుకున్నప్పుడు గోల్ లేకుండా రాసుకోవచ్చు. కథ చేయాలంటే చాలా ప్లస్ లు, మైనస్ లు దృష్టిలో పెట్టుకోవాల్సి వుంటుంది. గోల్ ఒక ప్లస్.

Q : మీరు డ్రమెటిక్ క్వశ్చన్ అని తరచూ అంటారు. అంటే ఏమిటి? కథలో అదెలా వుంటుంది?
అశోక్ గౌడ్, అసోషియేట్

A : మనం బ్లాగులో హాలీవుడ్ పదాలు వాడడంతో ఇలాటి సందేహాలు వస్తూంటాయి. ఏదైనా తెలుసుకోవడానికి మనకి హాలీవుడ్ తప్ప దిక్కులేదు. వాళ్ళు శాస్త్రాల్ని నిత్యం అభివృద్ధి చేసుకుంటూ వుంటారు కాబట్టి. డ్రమెటిక్ క్వశ్చన్ అంటే మరేమీ కాదు పాయింటు. కథలో పాయింటు. అయితే గమనించాల్సిందేమిటంటే, రెండిటి అర్ధం ఒకటే అయినా సైకాలజికల్ గా రచయిత మీద వేర్వేరుగా పనిచేస్తాయి. పాయింటు అనే పదం జడంగా వుండే భావం కల్గిస్తుంది. అదే డ్రమటిక్ క్వశ్చన్ చలనంలో వుండే ఉత్సాహం కల్గిస్తుంది. పాయింటు గురించి - పాయింటా? ఆఁ... కథలో అలా పడుంటుందిలే పాయింటు అన్పిస్తుంది తేలిగ్గా. దాంతో రచయిత కూడా పాసివ్ గా పడుంటాడు. అదే డ్రమెటిక్ క్వశ్చన్ అనుకుంటే - అమ్మో ఏదో చేయాలనుకుంటాడు. క్వశ్చన్, అంటే ప్రశ్న తలెత్తిందంటే అది కార్యాచరణకి సిద్దం చేస్తుందిగా? యాక్టివ్ గా మారతాడు. అప్పుడా కథలో డ్రమెటిక్ క్వశ్చన్ కి జవాబు వెతికే ఎజెండాతో, క్వశ్చన్ ని  ఫోకస్ చేస్తూ కథని ఉరుకులు పెట్టిస్తాడు.

    కథలో డ్రమెటిక్ క్వశ్చన్ విడిగా వుండదు. ప్రధాన పాత్రకి వుండే గోలే డ్రమెటిక్ క్వశ్చన్. ఆల్ డ్రామా ఈజ్ కాన్ఫ్లిక్ట్ అన్నాడు సిడ్ ఫీల్డ్. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఎప్పుడయితే కాన్ఫ్లిక్ట్ పుడుతుందో, అక్కడ్నించి ఆ మిడిల్ అంతా డ్రామానే. డ్రామా కానిది కాన్ఫ్లిక్ట్ కాదు. కాన్ఫ్లిక్ట్ కానిది డ్రామా కాదు. సినిమా ప్రారంభిస్తే చివరిదాకా వుండే కథనమంతా డ్రామా కాదు. కథ కానిది డ్రామా కాదు. డ్రామా కానిది కథ కాదు. ప్లాట్ పాయింట్ వన్ కి, ప్లాట్ పాయింట్ టూ కీ మధ్యన వుండేదే కథ, డ్రామా, లేదా కాన్ఫ్లిక్ట్. ప్లాట్ పాయింట్ వన్ కివతల, బిగినింగ్ లో వుండేది కేవలం సెటప్, లేదా ఉపోద్ఘాతం. అందుకని ఈ సోది ఎక్కువ చూపించ కూడదు. ప్లాట్ పాయింట్ టూ కవతల, ఎండ్ లో వుండేది మిడిల్లోని కథకి, లేదా డ్రామాకి, లేదా కాన్ఫ్లిక్ట్ కి పరిష్కారం.

     ఈ డ్రమెటిక్ క్వశ్చన్ ప్రధాన పాత్రని టార్గెట్ చేసే వుంటుంది.  అందుకని ఆ క్వశ్చన్ కి సమాధానం లేదా పరిష్కారం వెతికే ప్రయత్నం, లేదా సంఘర్షణ ఆ ప్రధాన పాత్రకే వుంటుంది. అంటే సమాధానం అంత త్వరగా దొరక్కుండా కథనాన్నిజటిలం చేస్తూ పోవాలన్న మాట. ఇంకోటేమిటంటే, గోల్ అనే పదం వాడినప్పుడు నేరోగా అది పాత్రకి మాత్రమే అంటి పెట్టుకుని ఫ్లాట్ గా వుంటుంది. కథలో ఫీల్ వుండదు. డ్రమెటిక్ క్వశ్చన్ అనుకున్నప్పుడు, కథంతా కూడా ఆ క్వశ్చన్ పుట్టించే ఫీల్ నిండి పోతుంది. అంటే సోల్ అన్నమాట. అందుకే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర గోల్ ఏర్పడే ముందు, ఆ గోల్ లో గోల్ ఎలిమెంట్స్ వుండాలనేది. ఏమిటా గోల్ ఎలిమెంట్స్? కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్. వీటిని బిగినింగ్ సెటప్ లో ప్రధాన పాత్రకి ఏర్పడేలా కథనం చేసుకోవాలి. ఒకసారి శివ ని చూసి ఈ మొత్తమంతా  స్టడీ చేసుకోండి.

 సికిందర్ 

 

27, జనవరి 2021, బుధవారం

1011 : రివ్యూ


రచన -దర్శకత్వం :  ప్రవీణ్ వర్మ
తారాగణం : నవీన్ చంద్ర
, చాందినీ చౌదరి, రాకేందు మౌళి, అజయ్ తదితరులు
సంగీతం : సన్నీ ఎంఆర్
, ఛాయాగ్రహణం : దివాకర్ మణి,  
నిర్మాత : సుధీర్ వర్మ
విడుదల : ఆహా

***

          హా నుంచి ఓటీటీలో కొత్త వెబ్ మూవీ సూపర్ ఓవర్ కొత్త దర్శకుడి మేకింగ్ లో విడుదలైంది. కొత్త దర్శకుడు ప్రవీణ్  వర్మ ఇదే మూవీ షూటింగులో కారు ప్రమాదంలో చనిపోయాడు. దీనికి నిర్మాతగా వున్న స్వామి రారా ఫేమ్ దర్శకుడు సుధీర్ వర్మ, మూవీ చివరి భాగాల్ని తనే షూట్ చేసి పూర్తి చేశాడు. 83 నిమిషాల నిడివితో ఇది థియేటర్ సినిమా కాదు కాబట్టి కథతో, పాత్రలతో, యాక్షన్ తో, అనివార్యంగా దీని పరిమితులు దీనికేర్పడ్డాయి. అయితే మేకింగ్ పరంగా చూస్తే దివంగత కొత్త దర్శకుడికి రెగ్యులర్ సినిమా తీసే సామర్ధ్యముంది. జీవించి వుంటే ఈ వెబ్ మూవీతో ఆ అవకాశం వచ్చేది.

        క్రికెట్ బెట్టింగ్ మీద 2008 లో మొదటి సినిమా జన్నత్ వచ్చింది. ఆ తర్వాత 2010 లో దో దోనీ చార్ వచ్చింది. ఈ రెండూ ఇండియాలో ఇల్లీగల్ అయిన క్రికెట్ బెట్టింగ్స్ వలలో పడవద్దని హెచ్చరిస్తాయి. ఇప్పుడు కాలం మారిపోయి, అక్రమం సక్రమమే అనే సినిమాలొస్తున్నాయి కాబట్టి, డబ్బు సంపాదించడానికి చట్టం, నీతి, న్యాయం వంటి స్పీడ్ బ్రేకులు అవసరం లేదనే ధోరణి కొత్త ట్రెండ్. బ్రిటన్లో, అమెరికాలో  క్రికెట్ బెట్టింగ్ లీగల్. ఇండియా నుంచి అక్కడ ఆన్లైన్లో బెట్టింగ్ కట్టొచ్చు. గెలిచిన సొమ్ముకి  ఇండియాలో కూడా పన్నుకట్టి హాయిగా అనుభవించొచ్చు- హవాలా బెట్టింగ్ బ్లాక్ మనీ భయం లేకుండా.

        ఈ 2021 లో కాశీ (నవీన్ చంద్ర), మధు (చాందినీ చౌదరి), వాసు (రాకేందు మౌళి) అనే ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్స్ ఇల్లీగల్ బెట్టింగ్ కే పాల్పడతారు. ఇలా చూస్తే ఈ కథ ఔట్ డేటెడ్ గా అన్పిస్తుంది. కాశీకి 40 లక్షలు ఒక అప్పు కట్టడానికి ఇంట్లో అవసరం. దీని కోసం ఫ్రెండ్స్ తో క్రికెట్ బెట్టింగ్ కి పూనుకుంటాడు. హైదారాబాద్ లో బంగార్రాజు (వైవా హర్ష) అనే బుకీ కి 30 వేలు కట్టి, కోటీ 70 లక్షలు గెలుస్తాడు కాశీ. ఈ డబ్బు తీసుకోవడానికి హవాలా బ్రోకర్ దగ్గరికి రాత్రి పూట బయల్దేరతారు ముగ్గురూ. ఈ క్రమంలో ఒక ఎస్సై (అజయ్) తో, హావాలా ఏజెంట్లతో ప్రమాదా లెదుర్కొంటారు. ఇక తెల్లారేసరికి ఈ డబ్బుని ఎలా రాబట్టుకున్నారనేది మిగతా కథ.

        ఇందులో క్రికెట్ బెట్టింగ్ నెట్ వర్క్ ఎలా పనిచేస్తుందో ఆపరేషన్స్ వివరంగా చూపించారు. ఇదొక అండర్ వరల్డ్ దందా. బెట్టింగ్ ఏజెంట్లు
, బుకీలు, హవాలా దార్లు, డబ్బు చెల్లింపులు, అదును చూసి మోసాలు, పోలీసులతో సంబంధాలూ ఇవన్నీ ఒక రాత్రి కథలో చూపించారు. ఇది చూస్తే మర్యాదగా బతకాలనుకునే వాళ్ళు క్రికెట్ బెట్టింగ్స్ జోలికి పోరనేది దర్శకుడి ఉద్దేశమైతే అది నెరవేరుతుంది. డ్రగ్ మాఫియా మీద అదే పనిగా సినిమాలొచ్చి విలువ కోల్పోయాయి. కొత్తగా క్రికెట్ బెట్టింగ్ మాఫియా గురించి ఇదొక రౌండప్.

        ఇందులో ఫ్రెండ్స్ గా నటించిన నవీన్ చంద్ర, చాందినీ చౌదరి, రాకేందు మౌళిలు దాదాపు ప్రతీ సీనులో వుంటారు. కథకి తగ్గ నటనలు బాగానే వున్నాయి. వెబ్ కి సెన్సార్ లేదు కాబట్టి నోటి కొచ్చినట్టు పచ్చి అసభ్య భాష వాడారు. హిందీ ట్రెండ్ ఇక్కడ అలవాటు చేస్తున్నారేమో. ఇది కళా స్వేచ్ఛ దుర్వినియోగమని ఇప్పుడనలేం. కాలం మారింది. కళ ఎంత కుళ్ళుగా వుంటే అంత గ్రేట్ ఇప్పుడు. ఇక హీరోయిన్ నోరొకటే మిగిలింది. ఇది కూడా పూర్తి చేసేస్తే సరిపోతుంది.

        ఇక కథలో విషయం సరిగ్గా లేదు. బెట్టింగ్ డబ్బుల కోసం పరుగులు పెట్టడం, ఆ డబ్బు ఒకర్నుంచి ఒకరు లాక్కోవడం, చివరికి ఆ డబ్బుని చేజిక్కించుకోవడం ఇంతే కథ. పాత్రలకి ఎమోషనల్ కనెక్టిచ్చే బలమైన మలుపు లేదు. హవాలా దగ్గర డబ్బు తీసుకోవడానికి గుర్తింపు కోసం పది రూపాయల నోటు చూపించడం వుంటుంది. మధ్యలో ఆ నోటు పోగొట్టు కుంటారు. ఈ సన్నివేశం బలమైన ఎమోషనల్ కనెక్ట్ ఇస్తుంది. అయితే వెంటనే ఆ నోటు సంపాదించుకోవడంతో ఈ ఎమోషనల్ కనెక్ట్ కాస్తా వీగిపోతుంది. ఇంకో చోట డ్రైవ్ చేస్తున్న హీరోయిన్ కారు కింద పడి హవాలా ఏజెంట్ చచ్చి పోతాడు. ఇదికూడా కథని మలుపుతిప్పి పాత్రల్ని సమస్యలో పడెయ్యదు. అంతా పైపైన బలహీనంగా సాగిపోతూంటుంది కథనం.

    ఇంకో సమస్యేమిటంటే, ఈ మొత్తం కథ  పల్ప్ ఫిక్షన్ టెక్నిక్ తో చెప్పాలనుకోవడం. సుధీర్ వర్మ ఎనిమిదేళ్ళ క్రితం కొత్త దర్శకుడిగా తీసిన స్వామి రారా కి ఇదే టెక్నిక్ ఉపయోగించాడు. పల్ప్ ఫిక్షన్ లోని  సీక్వెన్స్ అప్రోచ్ టెక్నిక్. నడుస్తున్న కథలోకి ఒక పాత్ర వస్తే, అక్కడ కథాపి, వెనక్కెళ్ళి ఆ పాత్ర ఎక్కడ కనెక్ట్ అయిందో చెప్పుకు రావడం. దీన్నే తర్వాత తీసిన దోచేయ్ కి కూడా వాడేడు సుధీర్ వర్మ. దీన్నే తిరిగి ఇప్పుడు కొత్త దర్శకుడు ప్రవీణ్ వర్మ వాడేశాడు.

        ఈ పల్ప్ ఫిక్షన్ సీక్వెన్స్ అప్రోచ్ ని ఒకసారి వాడితేనే బావుంటుంది. రెండో సారి బావుండదు, మూడో సారి అసలు బావుండదు. ఇందుకే పల్ప్ ఫిక్షన్ టెక్నిక్ తో ఇంకో హాలీవుడ్ సినిమా తీయలేదు. పల్ప్ ఫిక్షన్ ని అలా తీయడానికి కారణం అది మూడు కథల్లో ఒక కథ. ఇలాటి కథ కాని వాటికి ఈ టెక్నిక్ ని వాడేయడం అర్ధరహితం.శ్యామ్ బెనెగల్ తీసిన సూరజ్ కా సాత్వా ఘోడా లో రచయిత పాత్ర అంటాడు - కథ చెప్పడానికి టెక్నిక్ ఎవరికవసరం? కథలో చెప్పడానికి విషయం లేని రచయితకి అవసరం- అని. ఇదీ సూపర్ ఓవర్ సమస్య.

        పాత్రలకి ఎమోషనల్ గా కనెక్ట్ చేసే అంశమేదైనా వుంటే ఈ సమస్య వచ్చేది కాదు. ముందుకు పరిగెడుతున్న కథని టెంపో దెబ్బతీస్తూ మూడుసార్లు ఆపి, కథలోకి వచ్చిన పాత్ర కనెక్టింగ్ పాయింట్ చెప్పుకు వచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కలిసే మొదటి పాత్ర ఎస్సై అజయ్ గురించి పదిహేను నిమిషాలు  విసుగు తెప్పించే కథ చూపించారు. రెండో సారి హవాలా ఏజెంట్ తో, మూడో సారి హీరోయిన్ చేసే యాక్సిడెంట్ తో. ఇలా ఇవన్నీ ముందుకు దౌడు తీయాల్సిన కథకి స్పీడ్ బ్రేకర్లు గా మారాయి. కథలో విషయం లేకపోతే టెక్నిక్ పేరుతో చేసే హంగామా ఇలా వుంటుంది. ఇక ముగింపు చూస్తే నడక మందగించి అర్ధాంతరంగా తెరపడుతుంది.

        టెక్నికల్ గా బిజీఎమ్, కెమెరా వర్క్ బావున్నాయి. రాత్రి పూట నిర్జన హైదారాబాద్ రోడ్ల మీద మాదాపూర్ నుంచీ కోఠీ వరకూ నైట్ సీన్స్ మొనాటనీ అన్పించవు. ఇలా రియలిస్టిక్ గా చూపించడమనేది కొత్తగా వచ్చిన మార్ప్పు అయితే, కంటెంట్ క్వాలిటీ లేకపోతే ఓటీటీలో ఆదరణ వుండదనేది ఒక నిజం. ఓటీటీలో గ్లోబల్ కంటెంట్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు, అదే క్వాలిటీ లోకల్ గా లేకపోతే తిరస్కరిస్తున్నారని సర్వేలు చెప్తున్నాయి. థియేటర్ విండోకి సినిమాలెలా చుట్టేసినా చెల్లుతుందేమో గానీ, ఓటీటీకి కాదు.

సికిందర్  

 

 

 

 

 

 

 

22, జనవరి 2021, శుక్రవారం

1010 : రివ్యూ

రచన - దర్శకత్వం : బగ్స్ భార్గవ కృష్ణ
తారాగణం : అర్జున్ రామ్ పాల్, మానవ్ కౌల్, ఆనంద్ తివారీ, రజిత్ కపూర్, మధూ సిమ్రన్ కౌర్ 
సంగీతం : సంజయ్ వాండ్రేకర్, ఛాయాగ్రహణం : దీప్ మెట్కర్ 
నిర్మాతలు :  జహానారా భార్గవ, ధీరజ్ వినోద్ కపూర్
విడుదల : జీ5 
***

      కోర్టు రూం డ్రామాలంటే ఒక హత్య, ఒక ముద్దాయి, ఇద్దరు లాయర్లు, ఒక జడ్జి, కేసు విచారణ, గ్యాలరీలో జనం, థియేటర్లో ప్రేక్షకులు, ప్రేక్షకులకి రొటీన్. ఎందుకని రొటీన్ అంటే అవి రొటీన్ గా ఎండ్ సస్పెన్స్ కథలు. కానీ హత్య కేసు కథలనేవి కేసు రహస్యాలు బయటపెట్టే టెంప్లెట్ తోనే ఎందుకుండాలి. ఇది రొటీన్. కేసు విచారణలో ముద్దాయే ఒక రహస్యమై కేసే స్థంభించిపోతే, కేసే లేకుండా పోతే అప్పుడేమిటి? ఇంకో ఎండ్ సస్పెన్స్ కథతో కోర్టు విచారణ చూసే రొటీన్ తప్పుతుంది. 
      యాడ్ ఫిలిమ్ మేకర్, నటుడు, దర్శకుడు బగ్స్ భార్గవ కృష్ణ సాధారణ హత్య కేసు విచారణ కథని, మధ్యలో ముద్దాయి మిస్టరీగా తిప్పేసి కోర్టు రూం డ్రామా రొటీన్ టెంప్లెట్ ని నిలువునా బద్దలు కొట్టాడు. ఈ మధ్య కూడా గరుడ వేగ’, పడిపడి లేచే మనసు’, నర్తన శాల’, 24 కిస్సెస్ లాంటి సెకండాఫ్ సిండ్రోమ్ కథలతో అలవాటుగా తెలుగు సినిమా లొచ్చాయి. ఇంటెర్వెల్ కి కథ తెగిపోయి సెకండాఫ్ సంబంధం లేని వ్యవహారమన్న మాట. దర్శకుడు బగ్స్ నెయిల్ పాలిష్ కథని సెకండాఫ్ సిండ్రోమ్ కి అందకుండా స్లీప్ వాకింగ్ చేసేశాడు. అంటే పాసివ్ గా కూర్చుని చేసే స్టోరీ రైటింగ్ ఇక పని చెయ్యదన్న మాట, బయటి ప్రపంచంలో కొచ్చి చేసే స్టోరీ మేకింగ్ ఇప్పటి అవసరమన్న మాట. 
        నేరం మెదడు చేస్తుంది. ముద్దాయి మీద కేవలం నేరారోపణ చేస్తారు. అయితే బోనులో నిలబడ్డ ముద్దాయి దోషిగా రుజువవుతూ, నిర్దోషి కూడా అయితే అప్పుడేమిటి? - ఈ స్టోరీ ఐడియాతో కథలోకి వెళ్తే, లక్నోలో వీర్ సింగ్ (మానవ్ కౌల్) అని ఒక స్పోర్ట్స్ కోచ్. ఇన్స్ పెక్టర్ సురేష్ అతడి ఫ్రెండ్. ఒక రోజు వూరి బయట ఇద్దరు పిల్లల కాలిన మృతదేహాలు దొరుకుతాయి. సాక్ష్యాధారాలు వీర్ సింగ్ నే పట్టిస్తాయి. ఇంకో అంతుచిక్కని 32 మంది పిల్లల హత్య కేసుల్లో కూడా అనుమానితుడవుతాడు. జైల్లో వేస్తారు. సిద్ధార్థ్ జైసింగ్ అలియాస్ సిడ్ (అర్జున్ రామ్ పాల్) డిఫెన్స్ లాయర్. కేసు చేపడతాడు. అమిత్ కుమార్ (ఆనంద్ తివారీ) ప్రాసిక్యూటర్. కిషోర్ భూషణ్ (రజిత్ కపూర్) జడ్జి . ఇద్దరు పిల్లల తాజా హత్యల మీద విచారణ ప్రారంభమవుతుంది. డీఎన్ ఏ సాక్ష్యంతో వీర్ సింగ్ మీద కేసు రుజువు చేస్తాడు అమిత్ కుమార్. సిడ్ ఏం చేయడానికీ వుండదు. ఈ సాక్ష్యం ఒప్పుకోవాల్సిందే, వీర్ సింగ్ ని ఇక వదులు కోవాల్సిందే. కానీ పంతానికి పోతాడు. ఈ సాక్ష్యం కచ్ఛితత్వాన్ని నమ్మనని, ఎఫ్బీఐ కి పంపాలనీ పట్టు బడతాడు. అమెరికాలో ఎఫ్బీఐకి పంపితే 50 శాతమే టాలీ అవుతున్నట్టు రిపోర్టు వస్తుంది. ప్రాసిక్యూటర్ అమిత్ కుమార్ ఇది ఒప్పుకోనని చిందులేస్తాడు. ఈ గొడవ తెగక ఇలా వుంటే, ముద్దాయి వీర్ సింగ్ లో వీర్ సింగ్ వుండడు, చారు రైనా అనే ఆవిడ వుంటుంది. చారు రైనా మీద కేసేలా నడుపుతారు? ముద్దాయి లోంచి వీర్ సింగ్ మాయమై పోయాడు - వీర్ సింగే లేడు, కేసే లేదు! జడ్జికి దిమ్మదిరిగి పోతుంది...

***

       న్యాయ వ్యవస్థకే సవాలు ఈ కేసు. సిడ్, అమిత్ కుమార్ లు ఇక పోట్లాట మానుకుని ఈ మిస్టరీ ఏంటో తేల్చేందుకు ఒకటవుతారు. జడ్జికి ఇంటి దగ్గర డ్రింక్ చేసే పడుచు భార్య శోభ (మధూ) తో పిచ్చెత్తుతూ వుంటుంది. కేసుకాని కేసు విచారణ కోర్టు హాల్లోంచి జడ్జి ఛాంబర్ కి ప్రైవేటుగా మారుతుంది. ముద్దాయి కాని ముద్దాయి జైల్లో చేతి గోళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటూ వుంటాడు. 

        పాయింటే మిటంటే, డిఐడి ( డిస్ససోషియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్) అని మనో రుగ్మత వుంది. స్ప్లిట్ పర్సనాలిటీ అన్నమాట. దీన్ని ఇదివరకు ఎంపిడి (మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్) అనే వాళ్ళు. దీంతో అపరిచితుడు వచ్చింది. డిఐడి లో రోగిలో రెండు నుంచి 400 దాకా ఎన్నయినా పర్సనాలిటీస్ వుండొచ్చు. డిఐడి తో హాలీవుడ్ లో చాలా సినిమాలొచ్చాయి. 2017 లో ఎం. నైట్ శ్యామలన్, మెక్ ఎవాయ్ తో స్ప్లిట్ తీశాడు. ఇందులో 24 పర్సనాలిటీస్ బయటపడుతూ వుంటాయి మెక్ ఎవాయ్ లో.
        నెయిల్ పాలిష్ లో వీర్ సింగ్ లో వున్నది చారు రైనా ఆత్మనా, లేక అతనేనా? లేక చారు రైనాలా నటిస్తున్నాడా? అతడిలో వున్నది అతడే అయితే చారు రైనాగా ఎలా మారాడు? చారు రైనా ఎవరు? చారు రైనా గానే అతను మారాడని సైంటిఫిక్ గా రుజువైతే  కేసే మవుతుంది? శరీరం వీర్ సింగ్ ది, మెదడు చారు రైనాది. మెదడు నేరం చేయమంటుంది, శరీరం ఆ నేరం చేస్తుంది. పిల్లల్ని వీర్ సింగ్ శరీరమే చంపింది, కానీ చంపించింది అతడి మెదడే అని రుజువు లేదు. రుజువు చారు రైనాతో వుంది. మరి ఈ డిఐడి కేసు చిక్కు ముడి ఎలా వీడింది? జడ్జి ఎలా తీర్పు చెప్పాడు?

***

       డిఐడి తో వచ్చే సినిమాల మీద అమెరికాలో ఏమంత మంచి అభిప్రాయం లేదు. డిఐడి ని వాస్తవ దూరంగా భూతంలా చూపిస్తున్నారని ఆరోపణలు. జనాభాలో ఒక శాతం మందికే వుండే ఈ రుగ్మత హింసాత్మక చర్యలకి పాల్పడేలా చెయ్యదు. రోగులు తమని తాము కూడా హింసించుకోరు. ఇక హత్యలు చేసిన సంఘటనలు లేవు. ఇలాటి సినిమాల వల్ల ఈ రోగులు సమాజంలో వెలివేతకి గురవుతున్నారు. డిఐడి గురించి ఈ సినిమాలు ప్రేక్షకులకి తప్పుడు అభిప్రాయం కల్గించి, రోగుల్ని అంటరాని వాళ్ళుగా చేస్తున్నాయి. 

        అయితే నెయిల్ పాలిష్ లో వీర్ సింగ్ డిఐడి తో హత్యలు చేయలేదు. కేసు కొనసాగుతూండగా, జైల్లో జరిగిన ఒక సంఘటనతో డిఐడి కి లోనయ్యాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏడాదిన్నర వ్యవసాయ చట్టాలు ఆపుతామంటే, రైతులు కాదన్నట్టు- జడ్జి కేసు నిరవధికంగా వాయిదా వేస్తానంటే బాధితులు ఒప్పుకోరు. అప్పుడు జడ్జి క్రియేటివ్ మైండ్ తో అందరికీ తృప్తి కల్గించేలా ఇంటలిజెంట్ తీర్పు చెప్తాడు. ఈ ఆలోచన ఇంట్లో డ్రింక్ చేసే పడుచు భార్య వల్ల వచ్చింది... 
        చాలా కాలం తర్వాత నాటి  హీరోయిన్ మధూ పడుచు భార్యగా కన్పించింది. అర్జున్ రామ్ పాల్ కి జాతీయ అవార్డు వస్తుందని దర్శకుడి నమ్మకం. యూపీలో చిత్రీకరణ చేశారు. సాంకేతికంగా బావుంది. ఎడిటింగ్ చాలా బావుంది. కోర్టు దృశ్యాలు ఆర్డర్ ఆర్డర్ అరుపులతో లేవు. సహజంగా వున్నాయి. జడ్జిని యువరానర్, మిలార్డ్ టెంప్లెట్ పిలుపులతో సంబోధించడం లేదు. లాయర్లు జడ్జితో ఫ్రీగా వుంటారు. జడ్జి ఛాంబర్లో జడ్జి ముందు కాలుమీద కాలేసుక్కూర్చుంటారు. జడ్జి కూడా కేసు తేల్చడానికి లాయర్లతో కలిసి పని చేస్తాడు. 
        సినిమాలు మారి పోతున్నాయి. విషయ ప్రధాన సినిమాలు వస్తున్నాయి. పాత విషయాలు, ఉన్న నమూనాలూ, బాక్సాఫీసు మూస లెక్కలూ పక్కన పెడుతున్నారు. ఎవరూ ఇంకొకర్ని అనుసరించడం లేదు. ఎవరి పంథా వాళ్ళదిగా డైవర్సిటీని ప్రదర్శిస్తున్నారు. డైవర్సిటీతోనే  ఇలాటి డిస్కవరీలుంటాయి.  

సికిందర్

 

16, జనవరి 2021, శనివారం

1009 : రివ్యూ

రచన - దర్శకత్వం : ఉదయ్ గుర్రాల
తారాగణం : ప్రియదర్శి
, హర్షిత్ మల్గి రెడ్డి, గౌరీ ప్రియా రెడ్డి, అనూషా,రవీందర్ బొమ్మకంటి తదితరులు
సంగీతం : స్వీకార్ ఆగస్తీ
, ఛాయాగ్రహణం :  ఉదయ్ గుర్రాల, శ్యామ్ దూపాటి నిర్మాతలు :  ప్రియాంకా దత్, స్వప్నా దత్
విడుదల : ఆహా
***

    తెలుగులో షార్ట్ ఫిలిమ్స్ మోజు తగ్గి వెబ్ సిరీస్ సీజన్ ప్రారంభమై కూడా చాలా కాలమైంది. ఈ వెబ్ సిరీస్ కూడా సినిమాల్లాగే రోమాంటిక్ కామెడీల మయమై యూత్ ప్రేక్షకులతో సరిపెట్టుకున్నాయి. థియేటర్లలో సినిమాకొక కొత్త జంటగా రోమాంటిక్ కామెడీల బెడద వదిలిందనుకుంటే వెబ్ లో మొదలయ్యాయి. వేదిక మార్చుకున్నాయే తప్ప విషయం అదే. వెబ్ లో కూడా ఇవి వెలవెల బోతున్న వేళ కోవిడ్ మొదలయ్యింది. కోవిడ్ తో ఓటీటీ ముఖ చిత్రమే మారిపోయింది. కోవిడ్ కాలంలో ఓ 15 కొత్త ఓటీటీ కంపెనీలు వివిధ భాషల్లో వెలిశాయి దేశవ్యాప్తంగా. ఇంకొన్ని ప్లానింగ్ లో వున్నాయి. ఇవి ముందుకు తెచ్చిన కాన్సెప్ట్ ఏమిటంటే, లోకల్ కథలు చెప్పడం. కారణం, కోవిడ్ తో ఇంట్లో బందీలైన పెద్దవాళ్ళు, స్త్రీలు ఓటీటీకి కొత్త ప్రేక్షక వర్గమయ్యారు. దీంతో ఈ వర్గాన్ని టాప్ చేసేందుకు, స్థానిక జీవితాల సహజ కథలు అందించడం మొదలెట్టాయి ఓటీటీలు. అత్తాకోడళ్ళ టీవీ సీరియల్స్ చూసి చూసి వేసారిన స్త్రీలు, ముఖ్యంగా పట్టణ, గ్రామీణ స్త్రీలు, వెబ్ సిరీస్ లో దగ్గరగా తమ జీవితాల్ని చూసుకోవడం మొదలెట్టారు. అటు థియేటర్లలో  చూడదగ్గ సినిమాలు లేక, ఇటు ఇంట్లో టీవీ భరించలేక ఉక్కపోతకి గురైన పెద్దవాళ్ళకి  కూడా లోకల్ ఓటీటీలు వరంలా కన్పిస్తున్నాయి. స్థానిక భాష, సంస్కృతి, వారసత్వం, జీవితాలు, కమర్షియల్ సినిమాల కృత్రిమత్వాలకి దూరంగా సహజ కథలు, ప్రాంతీయ ఓటీటీల కాన్సెప్ట్ అయింది. బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, ఒడియా, అస్సామీ, తుళు, కొంకణి, కన్నడ, మలయాళం ...ఇలా ప్రాంతీయ భాషల్లో వెబ్ సిరీస్ ఇప్పుడు కొత్త మార్కెట్ ని పట్టుకున్నాయి.  

    క సర్వే ప్రకారం ఓటీటీ ప్రేక్షకులు నగరాల్లోనే కాదు గ్రామాల్లో కూడా పెరుగుతున్నారు. కోవిడ్ తో దాదాపు 90 శాతం గ్రామాలకి ఇంటర్నెట్ విస్తరించడం వల్ల ఓటీటీ చొచ్చుకెళ్లింది. మల్టీ లాంగ్వేజ్ ఓటీటీల కంటే, పోటీ తక్కువ వుండే ఈ సింగిల్ లాంగ్వేజ్ ఓటీటీల నిర్వహణ, వ్యాపారం లాభసాటిగా వుంటోంది. ఇప్పటికే 50 కోట్ల యూజర్లతో అమెరికా తర్వాత ఇండియా పెద్ద మార్కెట్ గా వుంది. 2023 కల్లా ఇంకో 45 శాతం పెరిగి, 13 వేల కోట్ల రూపాయల భారీ మార్కెట్ గా విస్తరించే అవకాశముంది. మల్టీ లాంగ్వేజ్ ఓటీటీల్లో క్వాలిటీ కంటెంట్ కి అలవాటుపడ్డ ప్రేక్షకులు, సింగిల్ లాంగ్వేజీ ఓటీటీల్లో కూడా క్వాలిటీ కంటెంట్ కే ఓటు వేస్తున్నారనేది ఇక్కడ పాయింటు. కాబట్టి సంక్రాంతి సినిమాలు సహా 90% అట్టర్ ఫ్లాపయ్యే అడ్డగోలు సినిమాలు తీస్తున్నట్టు గాక, ఓటీటీ కంటెంట్ ని బాగా కష్టపడి, నిజాయితీగా తీయాలన్న మాట. 

    ఈ నేపథ్యంలో తెలుగుకే పరిమితమైన సింగిల్ లాంగ్వేజ్ ఓటీటీ ఆహా నుంచి గ్రామీణ వెబ్ సిరీస్ కంబాల పల్లి కథలు వెలువడింది. మొదటి చాప్టర్ గా మెయిల్ విడుదలైంది. తెలంగాణా గ్రామీణ నేపథ్యం. దర్శకుడు ఉదయ్ గుర్రాల. మరి దీని కథేంటి, ఇదెంత క్వాలిటీతో వుందీ చూద్దాం...  

కథ

    తెలంగాణా మహబూబాబాద్ దగ్గర్లో నిద్రాణంగా వుండే కంబాల పల్లి గ్రామం, నిదానంగా సాగే కాలం, జీవితాలు 2005 లో. అప్పటికింకా కంప్యూటర్లు కొత్త. రవి (హర్షిత్ మల్గిరెడ్డి) అనే విద్యార్థి ఇంటర్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఆన్ లైన్లో ఫలితాలు ప్రకటిస్తుంది ప్రభుత్వం. రవి ఆ కేంద్రాని కెళ్ళి రిజల్ట్స్ చూసుకుంటున్నప్పుడు, మొట్ట మొదటి సారిగా కంప్యూటర్ ని చూస్తాడు. కంప్యూటర్ సహా ఆ కేంద్రం మాయా ప్రపంచంలా కన్పిస్తుంది. థర్డ్ క్లాసులో పాసయిన అతను ఇక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయి పోవాలనుకుంటాడు. బీకాంలో చేరాల్సి వస్తుంది. 

        గ్రామంలో హైబత్ (ప్రియదర్శి) అనే అతను, ఫోటో స్టూడియో బోర్డు తీసేసి, కంప్యూటర్ గేమింగ్ సెంటర్ ప్రారంభిస్తాడు. ఇతను ఫోటో స్టూడియో నడుపుకుంటూంటే, పని నేర్చు కుంటామని ఇద్దరు చేరి, పదిహేను రోజుల్లో అటొకడు, ఇటొకడు  ఫోటో స్టూడియోలు తెరిచేసి మధ్యలో తనని ముంచేశారు. దీంతో కంప్యూటర్ గేమింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. దీన్ని రవి చూసి ఉద్రేక పడతాడు. కంప్యూటర్ నేర్చుకుంటానంటే, వీడెక్కడ ముంచుతాడోనని హైబత్ ఎలర్ట్ అవుతాడు. వదలకుండా సతాయిస్తూంటే కొన్ని షరతులు పెట్టి నేర్పుతాడు. ఈమెయిల్ ఎక్కౌంట్ క్రియేట్ చేసి, ఈమెయిల్ సౌకర్యం గురించి చెప్తాడు. దీంతో తనకి మెయిల్ వచ్చిందేమోనని రవి రోజూ చూస్తూంటాడు. ఒక రోజు రెండు కోట్లు లాటరీ తగిలినట్టు వస్తుంది. భయపడి వెళ్ళి ఫ్రెండ్ సుబ్బు (మణి) కి చెప్తాడు. సుబ్బు ధైర్యం చెప్పి, ఏంచేయాలో చెప్తాడు. ఆ ప్రకారం అడ్రసు పంపి ఎదురు చూస్తూంటే, లక్ష కట్టాలని మెయిల్ వస్తుంది. ఇప్పుడు రవి ఏం చేశాడన్నది, ఎలాటి చిక్కుల్లో పడ్డాడన్నది మిగతా కథ. 

నటీనటులు - సాంకేతికాలు
     ప్రియదర్శి తప్ప అందరూ కొత్తవాళ్లే. ప్రియదర్శి సహాయ పాత్ర వేశాడు. సీరియస్ గా వుంటూ నవ్వు తెప్పించే పాత్ర. తక్కువ మాటలు. సీన్లు కూడా తక్కువే. కంప్యూటర్ తెలిసిన వాడుగా హీరోలా ఫోజు కొట్టకుండా గ్రామీణ అమాయకత్వంతో కూడా వుంటాడు. కంప్యూటర్ వైరస్ అంటే అదేదో మనుషుల ద్వారా సోకే వైరస్ అనుకునే రకం. చెప్పులు బయట విడిచి రావాలని రూలు. ఆ రోజుల్లో నగరాల్లో కూడా కంప్యూటర్ రూములోకి చెప్పులు బయట విడిచే వాళ్ళు ఎడ్యుకేటెడ్ బ్యాచి. ఇలా ప్రియదర్శి గేమింగ్ కి వచ్చిన ఒక కుర్రాడి వల్ల కంప్యూటర్ కి వైరస్ సోకిందని  పంచాయితీ పెట్టించి జరిమానా వేయిస్తాడు. వైరస్ ని తీయించడానికి ఒక బైరాగిలా వుండే టెక్నీషియన్ ని పిలిపిస్తాడు. వాడు అటుచూసి ఇటు చూసి ఒక నొక్కు నొక్కితే వైరస్ పోతుంది. 500 వసూలు చేసుకుంటాడు. ఈ టెక్నీషియన్ ఎక్స్ ప్రెషన్స్ తో బాగా గుర్తుండి పోతాడు. ప్రియదర్శిది ఇలాటి అమాయకత్వం. పాత్ర గుర్తుండిపోయే విధంగా నిలబెట్టాడు. 

        రవిగా నటించిన హర్షిత్ ఆ లేత వయస్సుకి తగ్గట్టుగా మాటలు పలకడంలో గానీ, సున్నిత భావాలు ముఖంలో పలికించడంలో గానీ, కంప్యూటర్ తో అమాయకత్వంలో గానీ, లాటరీతో భావోద్వేగాలతో గానీ, నిద్రణంగా వుండే గ్రామంలో ఒదిగిపోతున్నట్టే  నిదానంగా వుంటాడు. పాత్రని ఇతను కూడా నిలబెట్టాడు. అలాగే ఇతడి స్నేహితుడు సుబ్బు పాత్ర వేసిన మణి గురించి కూడా చెప్పుకోవాలి. ఇక రవి ప్రేమించే స్టూడెంట్ రోజాగా గౌరీ ప్రియా రెడ్డి, ఇంకో అమ్మాయి గిరిజ పాత్రలో అనూషా తెలంగాణా అమ్మాయిల వాలకంతోనే వుంటారు. అప్పులిచ్చే శివన్నగా రవీందర్ బొమ్మకంటి ఇంకో ఎస్సెట్ నటవర్గానికి. వీళ్లే గాక ప్రతీ వొక్కరూ, చుట్టూ కొండలూ పచ్చటి ప్రకృతీ వుండే కంబాల పల్లి నేపథ్య వాతావరణంలో కలిసిపోయినట్టు వుంటారు.

       ఛాయాగ్రహణం దర్శకుడే నిర్వహించాడు. కెమెరావర్క్ క్వాలిటీతో వుంది. మిగతా అన్ని ప్రొడక్షన్ విలువలు ఉన్నతంగా వున్నాయి. సున్నిత సంగీతం సహా సాంకేతిక విభాగాలు కంబాలపల్లి పరిసర వాతావరణాన్ని, నిద్రాణంగా వుండే మూడ్ ని కళాత్మకం చేశాయి. దర్శకత్వంలో కథ డిమాండ్ చేస్తున్న ఒక వస్తుగత శైలి వుంది. ఆ శైలిని  చివరంటా చెడకుండా శిల్పం చెక్కాడు దర్శకుడు. సంభాషణలు పనిగట్టుకుని రాసినట్టుగాక నిజంగా ఎలా మాట్లాడతారో ఆ మాటలు రాసేశాడు. ఈ కంబాల పల్లి మొదటి చాప్టర్ ని దాచుకో దగ్గ ఒక ఆల్బంగా రూపొందించాడు అభిరుచిగల ప్రక్షకులకి. నిడివి గంటా 56 నిమిషాలు మాత్రం ఎక్కువే. 

ఎలావుంది కథ
    2005 లో కంప్యూటర్ తో పీరియెడ్ కథగ్రామీణ నేపథ్యంలో కంప్యూర్ తో వైజ్ఞానిక  విప్లవంగా కాక ఫక్తు వినోద ప్రధాన కథ. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు గ్రామాల్లో కంప్యూటర్ల ప్రవేశం తల్లిదండ్రులకి తమ పిల్లల విద్యాభివృద్ధికి కొత్త కెరటంలా కన్పించింది. ఈ కోణం నేపథ్య మాత్రంగా కూడా స్పృశించకుండా కేవలం వినోద వస్తువుగా కథ వుంది. రవి పాత్ర కంప్యూటర్ కొనాలంటే తండ్రి మందలించడంలోనే విషయ ప్రాధాన్యాన్ని తగ్గించడం వుంది. కాస్త చారిత్రక వాస్తవాలు కూడా రికార్డు చేసి వుండాలి. ఈ వాస్తవిక కథలో పాయింటు కూడా ఫార్ములా సినిమా పాయింటులా రెండు కోట్ల ఫేక్ లాటరీ కాలక్షేప కథతో వుంది. హైబత్ పాత్ర కంప్యూటర్ గేమింగ్ ప్రారంభించినప్పుడు, కంప్యూటర్ రాక అనేది వినోదంతో పిల్లల్ని చెడగొట్టడానికా, పిల్లల విద్య కోసమా అన్న చర్చలేని గ్రామ పెద్దల ఉదాసీనత కాన్సెప్ట్ తో ఒక లోపంలా కన్పిస్తుంది. విద్య వర్సెస్ వినోదం కథ ఇంతే వినోదాత్మకంగా చెప్పివుండొచ్చు.         

    ఆర్కే నారాయణ్ రాసిన క్లాసిక్ కథల సంపుటి మాల్గుడి డేస్ దూరదర్శన్ సిరీస్ గా కూడా సంచలనం సృష్టించింది. మాల్గుడి అనే దక్షిణాది కల్పిత వూళ్ళో జరిగే కథలు. ఇవి అంతర్జాతీయ ప్రసిద్ధి పొందాయి. ఇప్పటికీ కాలదోషం పట్టలేదు. మాల్గుడిలో జీవితాలు, ఎదుర్కొనే సమస్యలు, సాధారణంగా కన్పించే అసాధారణ చిత్రణలు. అనితర సాధ్యమైనవి కూడా. విజువల్ మీడియాకి వాస్తవిక రూరల్ కథలు తీయాలనుకునే వాళ్ళకి ఒక గైడ్ అనొచ్చు. 

    ఇందులో జంటిల్ మాన్స్ గిఫ్ట్ అనే కథలో రిటైరైన పాత్రకి పోస్ట్ లో ఒక కవర్ వస్తుంది. తను పని చేసిన కంపెనీ జనరల్ మేనేజర్ నుంచి. ప్రతీ నెలా పెన్షన్ అందినప్పుడల్లా బంక మన్నుతో ఒక ప్రతిమ తయారు చేసి ఇచ్చేవాడు. ఇచ్చినప్పుడల్లా గత నెల ఇచ్చిన బొమ్మ ఎలా వుందని అడిగేవాడు. మెచ్చుకునే వాడు జనరల్ మేనేజర్. అయితే ఇప్పుడిలా కవర్ రావడంతో కవరులో బొమ్మ విషయంలో ఏం కోప్పడుతూ రాశాడోనని భయం పట్టుకుంటుంది. కవరు విప్పే ధైర్యంలేక ఎక్స్ రే టెక్నీషియన్ కి చూపించి లోపలేముందో చెప్పమంటాడు. అతను టెస్టు చేసి ఆరోగ్యం బాగా లేదని రాసి వుందంటాడు. దీంతో రిటైర్డ్ ఉద్యోగికి దిగులు పట్టుకుంటుంది. ఇక బొమ్మలు చేసే వృత్తి చేయలేక పోతాడు. బొమ్మ వల్లే జనరల్ మేనేజర్ ఆరోగ్యం చెడిందనుకుని పిచ్చివాడైపోతాడు. ఇంతకీ ఆ కవర్లో ఏం రాశాడు జనరల్ మేనేజర్. అతి విధేయత, అమాయకత్వం మనిషిని ఎలా తయారు చేస్తాయి అన్న వొక క్యారక్టర్ స్టడీ ఈ కథ. ఆర్కే నారాయణ్ సున్నిత హాస్య ప్రియుడనేది కూడా తెలిసిందే. ఏ ప్రయోజనం కోసం కథ రాయాలన్న దృష్టి అదనపు హంగు. కంబాలపల్లి మెయిల్  కథ చూస్తే ఈ కథ మెదిలింది. పోలికలు కనిపిస్తాయి గానీ ప్రయాణాలు వేరు.

చివరి కేమిటి

   వాస్తవికత అనగానే ఇంకా ఆర్ట్ సినిమా ధోరణిలోకి వెళ్లి పోతూంటాయి కథలు. ఆర్ట్ సినిమాలకి కాలం చెల్లి మూడు దశాబ్దాలయింది. మళ్ళీ శ్యామ్ బెనెగల్ తేరుకుని 2000 లో కొత్త రూపమిచ్చాడు. దీన్నికొత్త దర్శకులు మల్టీ ప్లెక్స్ సినిమాలుగా మార్చి చెడగొట్టాక, 2015 లో కర్నాటక నుంచి కొత్త దర్శకుడు రాంరెడ్డి, ఆర్ట్ సినిమాకి ఆధునిక రూపమిస్తూ లోకల్- నేషనల్- ఇంటర్నేషనల్ అన్నితరగతుల ప్రేక్షకులకీ వర్తించేలా ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేశాడు. ఇదెలా చేశాడో ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. 
     
    వాస్తవిక కథలతో వెబ్ సిరీస్ నైనా కమర్షియల్ సినిమాల ప్రధాన స్రవంతిలోకి తీసుకురాక పోతే ఈ తరం ప్రేక్షకులకి రుచించవు. ప్రధాన స్రవంతి అంటే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో వుండే కథ. ఇండియాలో విజువల్ మీడియాకి త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వినా మార్గం లేదు. స్ట్రక్చర్ వుండని వరల్డ్ మూవీస్ చూసి మోసపోవద్దు. అవి స్ట్రక్చర్ వుండని ఆర్ట్ సినిమాల్లాంటివి. సినిమా ట్రైలర్ కైనా, యాడ్ ఫిలిమ్ కైనా త్రీయాక్ట్ స్ట్రక్చర్ వుంటుందని గుర్తించాలి. స్ట్రక్చర్ లేని ఉత్త క్రియేటివ్ ప్రదర్శన అంటే గోడలు లేని భవనం లాంటిది. తన వరకూ చూసుకుని ఆనందించే మురిపెం. ప్రేక్షకులకి పనికిరాదు. 

    మెయిల్ కథ గంట సేపటికి గానీ ఫేక్ లాటరీ పాయింటు కొచ్చి కథలోకి వెళ్ళదు. పాత్రల పరిచయానికి ఇంత సేపా? ఫేక్ లాటరీ కోసం  అప్పులు చేసిన రవి పాత్ర సమస్యకి చివరి పది నిమిషాల్లో ఇచ్చిన ముగింపు ఫార్ములా ముగింపుగా కాకుండా, ప్రత్యర్ధి శివన్న పాత్ర వెర్రిబాగుల తనంతో ఫన్నీగా వుంది మంచి విషయమే - అయితే కథ పాయింటుకి రాకముందు బిగినింగ్ నడక, పాయింటు కొచ్చాక ముగింపు వరకూ మిడిల్ నడక, ఆర్ట్ సినిమాల పోకడతో వుండడమే సమస్య. నిద్రాణంగా వుండే గ్రామమని నిద్రాణంగా వుండే కథనం చేయకూడదుగా. హైబత్ పాత్ర వూరికి పోతూ రవికి తాళాలు ఇచ్చి పోవడం, అలాగే శివన్న పాత్ర రవికి లక్ష అప్పు ఇచ్చేయడం వంటి రెండు ప్రధాన మలుపులు కథా సౌలభ్యం కోసం చేసినట్టే వుంది. తాళాలివ్వడానికి, లక్ష అప్పు ఇవ్వడానికి లాజికల్ కారణాలు జతపడక పోతే వాస్తవికత బలహీన పడుతుంది. ఆర్ట్ సినిమాల్నిఇక మర్చిపోయి, వాస్తవిక కథల్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చి, అన్నివర్గాల ప్రేక్షకులకీ దగ్గర చేయడమే ఇప్పటి అవసరం.

సికిందర్

 

13, జనవరి 2021, బుధవారం

1008 : నిర్ణయం


డియర్ రీడర్స్,

        2021 లో తీసుకున్న నిర్ణయమేమిటంటే, మాస్ ఎంటర్ టైనర్లకి రివ్యూలు ఆపెయ్యాలని. గత 23 ఏళ్లుగా అవే సినిమాలకి అవే రివ్యూలు అలాగే రాసి రాసి, అవే స్క్రీన్ ప్లే సంగతులు అలాగే రాసి రాసి, ఒక చట్రంలో ఇరుక్కుపోయాం. ఇందులోంచి కొత్తగా నేర్చుకోవడానికింకేమీ లేదు. ఈ బ్లాగు ప్రధానంగా మేకర్స్ కి, రైటర్స్ కి ఉద్దేశించింది. ఇంకెంత కాలం ఇవే రివ్యూలు, ఇవే స్క్రీన్ ప్లే సంగతులు చదువుతూ వుంటారు. ఏమిటి ఉపయోగం. ఉపయోగపడే రివ్యూలు వైవిధ్యమున్న సినిమాలతో వస్తాయి. ఇప్పుడు అన్నిభాషల్లో వూహించని వైవిధ్యం అందుబాటులో కొచ్చేసింది. వీటిలోంచి క్రియేటివిటీకి కొత్త ద్వారాలు తెరుచుకునే వీలెంతో వుంది. తెలుగులో కూడా ఇలాటి వైవిధ్యంతో, క్రియేటివిటీ పరిధులని పెంచే చిన్న సినిమాలు వచ్చినా, పరిచయం చేసుకుందాం. సంచిక డాట్ కాం లో రాస్తున్న ప్రాంతీయ, అవార్డు సినిమాల్లో అద్భుత ప్రయోగాలు జరుగుతున్నాయి. క్రియేటివిటీకి పదును పెట్టుకుంటే, తెలుగు మూస కమర్షియల్ సినిమాల రూపు రేఖలు కూడా ఇవి మార్చేయగలవు. క్రియేటివిటీ పరంగా ఇంకెంత కాలం టెంప్లెట్ సినిమాల మీద ఆధారపడతారు. వీటిలో రవంత స్క్రీన్ ప్లే టిప్ కూడా దొరకదు. 2021 లో నైనా ఆలోచనా ధోరణిని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. సెలవు, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

సికిందర్   

9, జనవరి 2021, శనివారం

1007 : రివ్యూ

ఒరు పక్క కథై (తమిళం) 
రచన - దర్శకత్వం : బాలాజీ తరణీ తరన్ 
తారాగణం : కాళీదాస్ జయరాం, మేఘా ఆకాష్, చంద్రమౌళి, జీవా రవి 
సంగీతం : గోవింద్ వసంత్,  ఛాయాగ్రహణం : సి. ప్రేమ్ కుమార్ 
నిర్మాణం : వాసన్ న విజువల్ వెంచర్స్ 
విడుదల : జీ 5

***
    మిళ దర్శకుడు బాలాజీ తరణీ తరన్ విచిత్ర కథలు తీసుకుంటాడు. 2012 లో విజయ్ సేతుపతి క్రికెట్ బంతి తగిలి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కి లోనయ్యే నడువల కొంజమ్ పక్కత కానోమ్ కథ, 2018 లో విజయ్ సేతుపతి ఆత్మ స్టేజి నటుల్నిఆవహించే సీతకతి కథ, 2020 లో కన్యగానే వుండి మేఘా ఆకాశ్ గర్భవతయ్యే ఒరు పక్క కథై. చివరిది 2014 లో విడుదల కావాల్సింది. బిజినెస్ అవక ఆగిపోయింది. ఇప్పుడు ఓటీటీ పుణ్యమాని జీ5 లో విడుదలయ్యింది. ఆరేళ్ళ తర్వాత కథకి తీసుకున్న పాయింటు, మేకింగ్ అన్నీ తాజాగా వున్నాయి. మరి 2014 లో విడుదల ఎందుకు కాలేదన్నదానికి కారణాలు ఈ కింద వెతుకుదాం...

కథ
శరవణన్ (కాళీదాస్ జయరాం), మీరా (మేఘా ఆకాష్) కాలేజీ స్టూడెంట్స్. సౌమ్యంగా  వుండే మధ్యతరగతి కుటుంబాలు. ఇద్దరి ఇళ్ళల్లో ఇద్దరి ప్రేమకి ఆమోదం వుంటుంది. మీరాకి ఒక సమస్య ఎదురవవుతుంది. నెలసరి అవదు. రెండు రోజులు, నాల్గు రోజులు, ఆరు రోజులు దాటినా అవదు. తల్లికి చెబుతూంటుంది. తల్లికేమీ అర్ధంగాదు. డాక్టర్ దగ్గరికి తీసికెళ్తుంది. డాక్టర్ పరీక్షించి గర్భవతని చెప్తుంది. షాక్ తింటారు తల్లిదండ్రులు. మీరా తండ్రి శరవణన్ ని ఇంటికి పిలిపిస్తాడు. విషయం చెప్పకుండా శరవణన్ ని నమ్మక ద్రోహిలా సీరియస్ గా చూస్తూంటారు మీరా తల్లిదండ్రులు. ఎందుకు సీరియస్ గా చూస్తున్నారో అర్ధంగాదు శరవణన్ కి. అప్పుడు చెప్తాడు తండ్రి. షాక్ తింటాడు శరవణన్. గదిలో కెళ్ళి మీరాని చూస్తాడు. మనం ఏమీ చేయకుండానే ఇదెలా జరిగిందని అడుగుతాడు. అదే నాకూ అర్ధం గావడం లేదంటుంది. ఇక మీరా తల్లిదండ్రులు శరవణన్ తల్లిదండ్రులతో పెళ్లి చేసేద్దామంటారు. కొంత తర్జన భర్జన తర్వాత పెళ్లి ఖాయం చేసుకుంటారు. అసలు జరిగింది నిజమేనా అని శరవణన్, మీరాని ఇద్దరు డాక్టర్లకి చూపించినా గర్భమేనని చెప్తారు. అప్పుడు డాక్టర్ తో తను వర్జిన్ నే నని  మీరా అనేసరికి, డాక్టర్ కంగుతిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి పంపిస్తుంది. అక్కడ డాక్టర్ల బృందం పరీక్షించి, మీరా కన్యగానే గర్భం ధరించిందని తేలుస్తారు. ఇదెలా జరిగిందనే ప్రశ్నకి జవాబు మిగతా ఒరు పక్క కథై -ఒక పేజీ కథలో చూడొచ్చు... 

ఎలా నటించారు

      కాళీదాస్ జయరాం, మేఘా ఆకాష్ ఇద్దరూ ఫ్రెష్ గా కన్పిస్తారు. మంచి ఎక్స్ ప్రెషన్స్ చూపిస్తారు. ఇద్దరి తల్లిదండ్రుల పాత్రల్లో నటీనటులు కూడా నీటుగా వుంటారు. మెలోడ్రామాలు, ఏడ్పులు, దూషణలు లేని సున్నిత పాత్రలు. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులున్నారు. వీళ్ళు తప్ప ఇంకెవరూ వినోదాన్ని పంచరు. సీరియస్ పాత్రలు. సీరియస్ మూడ్ లో సన్నివేశాలు. నటనలు బావున్నా పాత్ర చిత్రణలు బలహీనం.

సాంకేతికంగా చిత్రీకరణ బావుంది. చెన్నైలో చిత్రీకరణ. హేండ్ హెల్డ్ సింగిల్ షాట్ సీన్లు, పాత్రల సమన్వయంతో పుల్ బ్యాక్ షాట్లు గమనించ దగ్గవి. ఏ ఇల్లు చూపించినా పింక్ కలర్ వేశారు. కానీ పింక్ బ్యాక్ గ్రౌండ్ చూపించడాని కిది రోమాంటిక్ డ్రామా కాదు, పూర్తిగా రోమాంటిక్ డ్రామా కూడా కాదు. సెకండాఫ్ లో రెండు మాంటేజీ పాటలున్నాయి. మేకింగ్ బావుంది, కథకి మేకప్ బాగాలేదు.

ఎలావుంది కథ
     వర్జిన్ బర్త్ ఐడియా తీసుకున్నాడు దర్శకుడు. కొన్ని రకాల చేపల్లో, ఉభయ చరాల్లో, సరీసృపాల్లో, పక్షుల్లో, క్షీరదాలు కాని అన్ని ప్రధాన సకశేరుకాల్లో ఈ దృష్టాంతం వుంటుందని వివరిస్తాడు. పురుష కణం అవసరం లేకుండానే స్త్రీ అండం దానికదే పొదుగుకుని సంతానోత్పత్తి చేసుకునే ప్రక్రియ. దీనికి కొంత సైన్సుని వివరిస్తాడు డాక్టర్ పాత్రల చేత. పార్థెనో జెనెసిస్ ఈ ప్రక్రియ పేరు. పురుష కణాల్లో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోము లుంటాయి. స్త్రీ కణాల్లో రెండూ ఎక్స్ క్రోమోజోములే వుంటాయి. లైంగిక సంపర్కం ద్వారా పురుష క్రోమోజోముల్లో ఎక్స్ క్రోమోజోము స్త్రీ క్రోమోజోములతో కలిస్తే ఆడ పిల్ల పుడుతుంది, వై క్రోమోజోము కలిస్తే మగ పిల్లాడు పుడతాడు. ఇలాకాక లైంగిక సంపర్కం లేకుండానే స్త్రీ అండం దాని కదే పొదుగుకుని గర్భానికి దారితీయొచ్చు. దీన్నే పార్థెనో జెనెసిస్ అంటారు. మనుషుల విషయాని కొస్తే ఇది కన్యలో జరిగితే, కన్నెగా వుండగానే గర్భవతవుతుంది. ఈ రెండో వూహే కథగా చేశాడు దర్శకుడు.

తర్వాత దీన్ని మతాచార్యుల పాత్రల చేత చెప్పిస్తాడు. ఏసు క్రీస్తుకి జన్మనిచ్చిన కన్నె మేరీ మాత గురించి. కర్ణుడ్నీ, పాండవుల్నీ కన్న కుంతీ దేవి గురించీ. ఇలా తండ్రి లేకుండా పుట్టిన బిడ్డ దేవుడి బిడ్డవుతుందని చెప్తారు. మానవ జాతిలో ఇలాటి ఒక కేసు 1950 లో ఇంగ్లాండులో జరిగిందనీ, ఆడ పిల్ల పుట్టిందనీ డాక్టర్ల చేత చెప్పిస్తాడు దర్శకుడు. ఈ ఉదాహరణే తీసుకుని కథ చేశాడు. 

అయితే పార్థెనో జెనెసిస్ గురించి గూగుల్ చేస్తే, మరికొన్ని విషయాలు తెలుస్తాయి. 1950 లో ఇంగ్లాండు డాక్టర్లు ఈ అనుమానమున్న స్త్రీలు రిపోర్టు చేయాలని ఆహ్వానిస్తే, 19  మంది వివాహితలు ముందు కొచ్చి, తమకి పుట్టిన ఆడపిల్లలు పార్థెనో జెనెసిస్ ద్వారా జన్మించి వుంటారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే వివాహితల్లో దీన్ని డాక్టర్లు నిర్ధారించడం సాధ్యపడలేదు. భర్తల ద్వారా కూడా ఆడపిల్లలు జన్మించి వుండొచ్చు. కన్యల్లో జరిగితే పార్థెనో జెనెసిస్ ని కచ్చితంగా నిర్ధారించవచ్చు. రిపోర్టు చేసిన వాళ్ళల్లో ఒక్క మిసెస్ ఆల్ఫా అనే వివాహిత విషయంలో సాధ్యమై వుండొచ్చని అభిప్రాయపడ్డారు. స్త్రీలలో స్వయంగా అండ ఫలదీకరణ జరిగి పుట్టే ఆడపిల్లకి తల్లి జీన్స్ తప్ప, తండ్రి జీన్స్ వుండవు. పోలికలు కూడా తల్లితో కలవవు. ఈవిడ కేసునే దర్శకుడు పేరు చెప్పకుండా ఉదాహరణగా చెప్పి వుండొచ్చు. అయితే దర్శకుడి కథలోలాగా కన్యల్లో జరిగిన కేసులు ఇప్పటికీ లేవు. 

కన్యలో పార్థెనో జెనెసిస్ జరిగితే ఆడపిల్లే పుడుతుంది. కారణం పురుష సంపర్కం లేదు కాబట్టి. పురుష సంపర్కముంటేనే, వై క్రోమోజోము కలిస్తేనే మగ పిల్లాడు పుడతాడు. దర్శకుడు చెప్పిన కన్నె మేరీ మాతకీ, కుంతి కీ మగ పిల్లలే పుట్టారు. ఇది పార్థెనో జెనెసిస్సా? కాదు. సైన్సు కంటే ముందు, సైన్సు నోరెత్తకుండా మతాలు ఎంత పకడ్బందీగా లాజిక్ చేసేశాయో గమనించ వచ్చు. మేరీ మాతకీ, కుంతికీ ఆడ సంతానమే కలిగి వుంటే, అది పార్థెనో జెనెసిస్ అని తేల్చేసేది సైన్సు. పార్థెనో జెనెసిస్ అనే అవకాశం లేకుండా, ఇద్దరికీ మగ పిల్లలు జన్మించడంతో అవి దైవ ఘటనలయ్యాయి. 

    దర్శకుడు 1950 కేసు ఉదాహరణ తీసుకుని తయారుచేసుకున్న కన్నె హీరోయిన్ పాత్రకి ఆడపిల్లనే కల్పించాడు. కాబట్టి దీన్ని దైవ ఘటనగా  కాక, పార్థెనో జెనెసిస్ గానే చూడాలి. కానీ తద్విరుద్ధంగా మతాచార్యుల చేత దీన్ని దైవ ఘటనగా చేసి, పుట్టిన ఆడ పిల్లని దేవుడి బిడ్డగా, బాల దేవతగా చేసి, మొత్తం మత భక్తి కథ చేసేశాడు. ఇలా పార్థెనో జెనెసిస్ గురించి ప్రేక్షకులకి తప్పుడు సమాచార మిచ్చినట్టయ్యింది.

***

    పార్థెనో జెనెసిస్ వివాహితల్లో తెలియకుండానే జరగవచ్చు. ఆడపిల్లలే పుడుతూ పోవచ్చు. అయితే పైన పేర్కొన్న 1950 లో జరిగిన కేసు తప్ప ఇంకోటి లేదు. 1995లో  ఇంగ్లాండు లోనే మూడేళ్ళ బాలుడిలో తండ్రి జీన్స్ లేవు. ఇది దైవ ఘటనేనా అనుకుని డాక్టర్లు కంగారు పడి పరీక్షలు జరిపితే, అతడి రక్తంలో వై క్రోముజోము లేదు. ఆడపిల్లలకున్నట్టు రెండూ ఎక్స్ క్రోమోజోములే వున్నాయి. అంటే పార్థెనో జెనెసిస్ ద్వారా జన్మించాడా? ఎలా సాధ్యం? అప్పుడు తెలిసింది : ముందు తల్లి అండం దానికదే పొదుగుకోవడం జరుగుతూంటే, తండ్రి వీర్య కణం వచ్చేసి ఆ ఫలదీకరణ ప్రక్రియని కొనసాగిస్తూ, ఆ క్రోమోజోముల సంక్షోభంలో పాసివ్ పాత్ర వహించడం జరిగిందని. అంటే ఇలా పుడితే ఇది కూడా పురుష సంపర్కం వల్లే జరుగుతుందన్న మాట. కనుక ఆ బాలుడు దేవుడి బిడ్డ అయ్యే అవకాశం లేదు. దేవుడు పంపిన అవతార పురుషుడవడు. ఇలా చూసినా కూడా మేరీ మాత, కుంతీ దేవీల దైవ ఘటనలు సేఫ్ అయిపోతాయి. 

    చివరగా, 1950 లో మిసెస్ ఆల్ఫా కేసులో పుట్టిన కూతురు కూడా తల్లిలాగే పార్థెనో జెనెసిస్ ద్వారా కూతుళ్లని కని వుండొచ్చనీ, ఆధునిక డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా దీన్ని నిర్ధారించవచ్చనీ డాక్టర్లు అంటున్నారు. ఇక్కడే సినిమా కథలో హీరోయిన్ పాత్రకి పుట్టిన కూతురి భావి జీవితం ప్రభావితమవొచ్చు. ఆమె పెళ్లి ఒక సమస్యగా మారవచ్చు. ఈ కథలో ఇంత విషయముంది, డ్రామా వుంది. కానీ మతం దగ్గరే కుదించడంతో కథ దాని సహజ వికాసం పొందకుండా పోయింది.

***

    ఈ సరికొత్త సైన్స్ ఫిక్షన్ కాగల కథని, మతాచార్యుల తప్పుడు భాష్యాలతో మత విశ్వాసాల చట్రంలో బిగించేసి, భక్తి సినిమా చూపించాడు దర్శకుడు. కన్నె హీరోయిన్ పాత్రకి పుట్టిన పిల్లని, మతాచార్యులు బాల దేవతగా ప్రకటించి, ఆలయంలో పెట్టేసుకోవడం, ఈ సంచలన వార్తకి-  భక్తజన సందోహం దర్శనాలకి తరలిరావడం, చిన్నారి కూతుర్ని విడిపించు కోవడానికి హీరో హీరోయిన్లూ, వాళ్ళ తల్లిదండ్రులూ కోర్టు కెక్కడం వగైరా. 

కోర్టు కూడా దీన్నొక వైద్య దృష్టాంతంగా చూడదు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా మతాచార్యులు బిడ్డని తీసికెళ్ళడం నేరమని
, మతాచార్యుల మీద విచారణ వేయాలని, బిడ్డ తానేం అవ్వాలో మైనారిటీ తీరాక నిర్ణయించుకుంటుందనీ తీర్పు చెప్తుంది. గాయపడ్డ బిడ్డకి రక్తదానం చేసిన వాళ్ళల్లో అన్నీ మతాల వాళ్ళూ వున్నారనీ, ఇప్పుడు బిడ్డని ఏ మత దైవంగా కొలుస్తారనీ ప్రశ్నిస్తుంది.
    
పార్థెనో జెనెసిస్ కేసే అరుదైన కేసుల్లో కెల్లా అరుదైన కేసవుతుంది. ప్రపంచ శాస్త్ర వేత్తల దృష్టిలో పడితే వాళ్ళకి బోలెడు పని కల్పిస్తుంది. దర్శకుడు ఎస్ శంకర్ కి ఈ కథ ఆలోచన వచ్చివుంటే, దీన్నొక సైన్స్ ఫిక్షన్ హై కాన్సెప్ట్ యాక్షన్ మూవీ చేసేవాడు. ఇలా పుట్టిన కూతుర్నే హీరోయిన్ గా చేసి, ఆమెకి వినూత్న ప్రత్యేకతలు కల్పించి హల్చల్ చేయించే వాడు. 

స్క్రీన్ ప్లే మాట  

   కథనం డాక్యుమెంటరీలా వుంది. ప్రధాన పాత్ర లేదు. రెండు కుటుంబాల్లో అన్ని పాత్రలకీ కలిపి కుటుంబ సమస్య. సమస్యతో ఆందోళనే తప్ప సంఘర్షణ లేదు. చట్టం పూనుకుని పరిష్కరిస్తే సుఖాంతం. సినిమా అన్నాక కథ అయి వుండాలి. ఇది నిర్మాతకి పదహారణాల వైట్ ఎలిఫెంట్ లాంటి గాథయింది. జానర్ ఫస్టాఫ్ రోమాంటిక్ డ్రామాలా వుంటుంది. సెకండాఫ్ స్పిరిచ్యువల్ జానరై పోతుంది. ఇంటర్వెల్ కే కథ అయిపోయి సెకండాఫ్ కి మరో కథ ఎత్తుకుంటుంది. ఇలా సెకండాఫ్ సిండ్రోమ్ ప్రాబ్లం కూడా. దీనికి కమర్షియల్ సినిమా వ్యాపార విలువలు లేవు. చలన చిత్రోత్సవాల్లో పాల్గొని అవార్డులు పొందే సమాంతర సినిమా విలువలు కూడా లేవు. జరిగిన ఒక విచిత్రానికి మత విశ్వాసాల కథ చేసినప్పుడిది మరో భక్తి సినిమా టెంప్లెట్ అయిపోయింది. తమిళనాట మూఢ భక్తిని సొమ్ముచేసుకునే మార్కెట్ యాస్పెక్ట్ కావచ్చు. ఇది కూడా విఫలమైంది. కొత్త హీరో హీరోయిన్ల తొలి సినిమా కలలు ములయార్ నదిలో ఆరేళ్లు మునక లేశాయి. 
    
విచిత్రాలు జరిగినప్పుడు అవి  సైన్సుకి పరిశోధనాంశాలు కాకుండా, మతానికి ఆరాధ్య అంశాలైనప్పుడు సృష్టి రహస్యాలు బయటపడవు, విచిత్ర కథలు కొత్త సంగతులు చెప్పవు. మానవాళి ఎక్కడేసిన గొంగళిలా సోమరిగా పడుంటుంది. ఈ కథలో జడ్జి ఒక మంచి మాట చెప్తాడు : మత విశ్వాసాలు వేరు, మూఢ విశ్వాసాలు వేరు. ఇది దర్శకుడికే చెప్పినట్టుంది. తను మూఢుడు కాదన్పించు కోవడానికి ఒక సబ్ ప్లాట్ వేసి సేఫ్ అయిపోయాడు దర్శకుడు. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులతో మూఢ నమ్మకాల మీద వేసిన సెటైర్లు మాత్రం చాలా ఫన్నీగా వున్నాయి. బాగానే నవ్వు తెప్పిస్తాయి.

                                                                            ***

     దీని సైన్స్ ఫిక్షన్ స్వభావాన్ని కాసేపు పక్కన బెట్టి, ప్రేమ కథ గానే చూద్దాం. శరవణన్, మీరాలు ఆల్రెడీ ప్రేమలో వుండి ఇద్దరి కుటుంబాల్లో ఆమోదం వుంటుంది. ఇలా పాత్రల పరిచయం, నేపథ్యం ఏర్పాటయి పోయింది. ఇక సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన కావాలి. దీనికి మీరా నెలసరి పాయింటు వుంటుంది. ఇది రెండు రోజులు, నాల్గు రోజులు, ఆరు రోజులకి చేరి, వైద్య పరీక్షకి దారి తీసి, గర్భవతని తేలడంతో సమస్య ఏర్పాటవుతుంది. ఇది సమస్యా అంటే కాదు. సమస్య కన్యాత్వంతో గర్భం ధరించడం గురించి. కథ దీని గురించి. ప్రశ్నలు దీని గురించి. దీన్ని ముందుకు తీసుకు రాక పోవడంతో మొదటి మలుపు అర్ధరహితమై పోయింది. 
   
ఈ మొదటి మలుపుకి రావడానికి నెలసరి సమస్యని పదేపదే ప్రస్తావించడంతో
, మొదటి మలుపు దేనిగురించి రాబోతోందో తెలిసిపోయేలా అయింది. నెలసరి రావడం లేదంటే గర్భం ధరించి వుంటుందని. ఇది నిజమైతే శరవణన్ కారణమై వుంటాడని. నెలసరి రాకపోవడానికి గర్భమే కారణం కాకపోతే, మెనోపాజ్ వచ్చేసి వుంటుందని. విశృంఖల జీవన శైలులతో పాతిక ముప్ఫై ఏళ్లకే ముట్లుడిగి మూలనబడుతున్న అమ్మాయిలున్నారు దేశంలో. మీరాది విశృంఖల జీవితం కాదు. కనుక శరవణన్ మీద ఫోకస్ అవుతోంది. ఇలా తర్వాత కథ కవసర పడని విషయాలతో మన మెదడు నిండిపోతుంది మొదటి ఇరవై ఐదు నిమిషాలూ. పనికిరాని విషయాలతో ప్రేక్షకుల మెదడు నింప నవసరం లేదు.

    ఈ మొదటి మలుపు (ప్లాట్ పాయింట్ 1) ఇరవై ఐదు నిమిషాల్లోనే వస్తుంది, మంచిదే. అయితే నెలసరి రాని విషయం గురించి అన్నిసార్లు చెప్పకుండా, పది రోజులైనా రావడం లేదని ఒకే సారి రివీల్ చేసి - వెంటనే వైద్య పరీక్షలో గర్భమని చెప్పేస్తే - ఆ వెంటనే వర్జినే అని కూడా తేల్చేస్తే  -ఒక ఫ్లాష్ లో ఇది మొదటి మలుపుకి షాక్ వేల్యూతో వుండేది.

    వర్జిన్ గా గర్భమని అసలు పాయింటు చెప్పకుండా, కేవలం గర్భమని చెప్పడంతో అసలు సమస్య ఏర్పాటు కాలేదు. ఈ సమస్యని కూడా ఎదుర్కొనే ప్రధాన పాత్ర శరవణన్, మీరా ఇద్దరూ కాకుండా, వాళ్ళ తల్లిదండ్రులు కావడంతో, ఇది హీరో హీరోయిన్లు తమ సమస్యని తామెదుర్కో లేని, సంఘర్షించలేని, పరిష్కరించుకో లేని రోమాంటిక్ డ్రామా అయింది. రోమాంటిక్ డ్రామాలు హీరో హీరోయిన్ల స్వశక్తీకరణ చూపని బేలతనపు వ్యక్తీకరణలు. తర్వాత తల్లిదండ్రులు కూడా సమస్యతో సంఘర్షించక బాధలు పడే వరసగా మారడంతో, రోమాంటిక్ డ్రామా కాస్తా సినిమాకి పనికి రాని అగాథపు గాథయి పోయింది. ఈ గాథ కూడా సైన్సు పాఠాలతో డాక్యుమెంటరీలా వుంది.

    ఇక్కడొక ప్రధాన ప్రశ్న వస్తుంది. శరవణన్, మీరాలు శారీరకంగా కలవనప్పుడు, ఈ విషయం చెప్పుకుని ఎందుకు ఆ గర్భాన్ని ప్రశ్నించరు? మొదటి మలుపు సమస్య దీని మీదే వుండాలి. ఇదే కథాంశం కాబట్టి, పరిష్కరించాల్సిన పజిల్ కాబట్టి. నేను వర్జిన్ ని, ఈ ప్రెగ్నెన్సీ నాకార్ధం గావడం లేదని అనదు, నిందని తొలగించుకోవడానికి ఎదురు తిరగదు. తన క్యారక్టర్ ని కాపాడు కోవాలనుకోదు. కాలుజారి తప్పు చేసిన దానల్లే పెళ్ళికి రాజీపడి పోతుంది.

***

    పెళ్లి ఆలోచనకి ముందు అబార్షన్ చేయించాలనుకుంటారు. అప్పుడు అసలే బలహీనంగా వున్న మీరాకి అబార్షన్ వల్ల సమస్యలొస్తాయని డాక్టర్ అంటాడు. కానీ మీరాని చూస్తే బలంగా, గ్లామరస్ గా వుంటుంది. అసలు వర్జిన్ గర్భమని తేల్చేస్తే ఈ అబార్షన్ ప్రశ్న వచ్చేది కాదు. ఇదొక అనవసర ఫీడింగ్ ప్రేక్షకులకి. ఈ సీను కూడా బడ్జెట్ దండగ. తీసుకున్న ఐడియాకి చేసిన కథనమంతా బడ్జెట్ దండగ క్రియేటివ్ యాస్పెక్ట్. ఇందుకే బయ్యర్లు దండించారేమో. 
    
శరవణన్ కూడా తనతో శారీరక సంబంధం లేకుండా గర్భమెలా వచ్చిందని అనుమానించడు. ఆమెని అంత బలంగా నమ్ముతున్నాడనే అనుకున్నా కూడా, ఈ గర్భం ఒక పజిలే. ఆమెని గర్భం నిజమా కాదా నిర్ధారించుకోవడానికి డాక్టర్ల దగ్గర తిప్పుతాడే గానీ, చెప్పాల్సిన మాట చెప్పడు- షీ ఈజ్ వర్జిన్ అని. ఇదంతా కథ లేదనుకుని ఇంటర్వెల్ దాకా సాగదీయడానికి చేసిన ప్రయత్నం. ఇంటర్వెల్ కి ముందు చివరికి చెప్పాల్సిన మాట చెప్తుంది డాక్టర్ కి. మొదటి మలుపులో చెప్పాల్సిన మాట ఇంటర్వెల్ కి చెప్పడంతో ఇంత సేపూ నసతో నత్తనడక. ఈ స్టూడెంట్ పాత్రల క్యారక్టరైజేషన్ ఇలావుంది. 
    
మళ్ళీ నస ఏమిటంటే, వర్జిన్ అంటున్న మీరాని లేడీ డాక్టర్ ఒక నిమిషంలో వర్జినా కాదా తెలుసుకోవచ్చు. దీనికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రమ్మంటుంది. అక్కడ మీరా వున్న గదిలోకి డాక్టర్లు పోతూంటారు. తడవకి ఇద్దరు, ముగ్గురు చొప్పున సీరియస్ గా మొహాలు పెట్టుకుని, ఏదో జరిగి పోతోందన్నట్టు పదిమంది దాకా  పోతారు. వర్జిన్ టెస్టుకి ఇంత మంది డాక్టర్లా? ఆమెని వుంచుతారో, డాక్టర్లు కొట్లాడుకుని చంపేస్తారో?

***

    మొత్తానికి ఆమె వర్జిన్ మదర్ అని తేల్చాక, పార్థెనో జెనిక్ బిడ్డ పుట్టాక, సెకండాఫ్ మతం హైజాక్ చేస్తుంది పైన చెప్పుకున్నట్టుగా. దీంతో ప్రేమ కథ కూడా లేకుండా పోయింది. ప్రేమ కథతో చాలా ప్రశ్నలున్నాయి. వీటిని ఎదుర్కోకుండా ప్రేమికుల జీవితం లేదు. ఐదేళ్ల కథాకాలం గడిచి కూతురు దర్శినికి ఐదేళ్లు వచ్చేటప్పటికి, ఆలయ పూజార్లు తీసికెళ్లి ఆలయంలో దర్శనీయం చేస్తారు. ఈ లోగా శరవణన్, మీరాల చదువులేమయ్యాయో, ఉద్యోగాలేమయ్యాయో తెలీదు. ఎలావున్న క్యారక్టర్లు అలాగే వుంటాయి తల్లిదండ్రుల మీద ఆధారపడి. 
    
ఇదలా వుంచితే, కథ సంధించే ప్రశ్నల జోలికి కూడా పోలేదు. పార్థెనో జెనిక్ కూతురితో శరవణన్, మీరాల జీవితమెలా వుంటుంది? దర్శినికి మీరా తల్లేగానీ, శరవణన్ తండ్రి కాదు. పోనీ రెండో కాన్పుకైనా తండ్రి అన్పించుకుంటాడా అంటే అదీ నమ్మకం లేదు. రెండోసారి గర్భం కూడా పార్థెనో జెనెసిస్ అవదని చెప్పలేరు. ఇలా ఆమెకి పుట్టే ఆమె ఒకత్తి పిల్లలు పుట్టింటికి వంశాంకు రాలవుతారే తప్ప, మెట్టినింటికి కాదు. చాలా విచిత్ర పరిస్థితి. దీన్ని అత్తామామలెలా చూస్తారు? కోడలిగా ఒప్పుకుంటారా? ఎవరికైనా ఆమె కోడలు కాగలదా? తండ్రి కాలేని శరవణన్ ఎంతకాలం వుంటాడు? గిల్టీ ఫీలింగ్ మీరాని కూడా బాధించదా? రేపు పుట్టిన ఆడపిల్లల పరిస్థితి కూడా ఏమిటి? సమాజమెలా చూస్తుంది? గర్భాశయం తొలగించుకుంటే సమస్యలు తీరతాయా? ప్రేమ కోసం ఈ త్యాగాలు చేస్తారా? కలిసి వుంటారా, విడిపోతారా? పార్థెనో జెనెసిస్ వరమా, శిక్షా? పేజీ నిండా ప్రశ్నలు. కథకి చాలా పేజీలు కావాలి.

 సికిందర్