రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, జనవరి 2014, శుక్రవారం

రివ్యూ ..
ఇదో పరాకాష్ఠ !

లవ్ యూ బంగారమ్
తారాగణం : రాహుల్ హరిదాస్, శ్రావ్య, రాజీవ్ తదితరులు
సంగీతం : మహిత్ నారాయణ్    నేపధ్య సంగీతం : జె బి
కెమెరా :  అరుణ్ సూరపనేని    ఎడిటింగ్ : ఎస్ బి ఉద్ధవ్
బ్యానర్ ; క్రియేటివ్ కమర్షియల్స్- మారుతీ  టాకీస్
నిర్మాతలు : వల్లభ, మారుతి      సమర్పణ : కే ఎస్ రామారావు
రచన- దర్శకత్వం : గోవి ( గోవింద రెడ్డి)
విడుదల : జనవరి 24, 2014
***
ప్రేమ కథలు కిరాతకంగా తీస్తేనే ఈ తరం దర్శకుడనే పేరొస్తుందని ఒకానొక  ‘ఈ రోజుల్లో’ సందర్భంతో కొత్త దర్శకులు కొందరికి నమ్మకం ఏర్పడి నట్టుంది. అలాటి కొత్త దర్శకుడు ‘గోవి’ అనగా గోవిందరెడ్డి, సినిమా ప్రారంభంలో తను దర్శకుడైనందుకు  కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ,  కుటుంబాలు ఇబ్బంది పడే సినిమా తీసి ‘ గ్రో అప్’ అని సినిమాలో ఒక భోళా పాత్రకి క్లాసు పీకించిన చందంగానే సదరు కుటుంబాలకే జ్ఞాన బోధ చేసే దాకాపోయాడు. సుప్రసిద్ధ  క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ ఈ యజ్ఞంలో పాలుపంచుకునేందుకు ఎలాటి మొహమాటమూ పడకుండా - ఈ తరహా సినిమాలకి ఇప్పటి ట్రెండ్ లో బ్రాండ్ నేమ్ గా వెలుగొందుతున్న దర్శకుడు మారుతి తో జతకట్టి సక్సెస్ కళ్ళ జూడా లనుకుంది. అధినేత కే ఎస్ రామారావే చెప్పినట్టు, తక్కువ బడ్జెట్ లో ఎక్కువ డబ్బులొచ్చే సినిమాలు మారుతీ తీస్తున్నాడు కాబట్టి ఈ జాయింట్ వెంచర్ ఇలా తెరకెక్కిం దన్నమాట!

‘ఈ రోజుల్లో’ తర్వాత ఈ సమీక్షకుడితో మారుతి ఒక విషయం చెప్పాడు- తను నానా ప్రయోగాలూ చేసి 5-డీలో  ‘ఈ రోజుల్లో’ తీసినట్టు  ఇంకెవరైనా 5-డీతో ప్రయత్నాలు చేస్తే చేతులు కాల్చుకుంటారని! అంతేగానీ అసలు అదేపనిగా  ‘ఈ రోజుల్లో’ లాంటి అడల్ట్ కంటెంట్ తో సినిమాలు తీస్తే అట్టర్ ఫ్లాపై పోతారని చెప్పలేదు. చెప్పాల్సిన పనిలేదు-చేసి చూపిస్తున్నాడు గనుక. ప్రస్తుత సినిమాతో  పరాకాష్టకి చేరిన తన ఈ బ్రాండు ‘క్రియేటివిటీ’ తో తన గమ్యం ఏమిటో తనకే తెలుస్తుందిక!

సరైన సినిమాల్లేక త్రిశంకు స్వర్గం లో కొట్టు మిట్టాడుతున్న ‘హేపీ డేస్’ ఫేం హీరో రాహుల్ హరిదాస్ ఈ సినిమాతో నటనలో కాస్త మెరుగయ్యాడు తప్పితే,  ఈ సినిమా తన కెరీర్ లో చెప్పుకో దగ్గదేం కాదు- గత సినిమా ‘ప్రేమ ఒక మైకం’ లాగే. శేఖర్ కమ్ముల అతడికి సృష్టించిన గుర్తుండిపోయిన ‘టైసన్’ లాంటి పాత్రని సృష్టించడంలో ఇతర దర్శకులు విఫలమైనట్టే ‘గోవి’కూడా చేతులెత్తేశాడు.

ఈ తరం ప్రేక్షకులకి యువజంట పెళ్లి కథ చెప్పాలనుకున్నారు. అభద్రతా భావంతో అనుమానాలు పెంచుకు తిరిగే హీరోని, ఆత్మవిశ్వాసం ఉరకలేసే  హీరోయిన్ తో కలిపి ఆ వైవాహిక జీవితం అనుమానాలతో ఏ మలుపులు తిరుగుతుందో చూపాలనుకున్నారు. విషయం కొత్తదేమీ కాదు, చాలాసార్లు చాలా సినిమాల్లో వచ్చేసిన ఈ పాత విషయాన్నే కొత్తగా ఏమైనా చెప్పారేమో ఈ క్రింద చూద్దాం.

ప్రేమో కామమో...
వైజాగ్ లో ఆకాష్ ( రాహుల్) ఓ సెల్ ఫోన్ల కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్. మీనాక్షి (   ) ఓ రాజకీయనాయకుడి కూతురు. ఫ్రెండ్స్ తో జల్సాగా తిరగడమే ఆమె పని. ఆకాష్ తండ్రి కూడా రాజకీయ నాయకుడే. సంపాదన లేని ఆ తండ్రి కొడుకు జీతమంతా లాగేసుకుని రాజకీయాలకి- తన తండ్రి విగ్రహ ప్రతిష్టాపన పన్లకీ తగలేస్తూంటాడు. ఓ సంఘటనలో ఆకాష్, మీనాక్షీలు కలుస్తారు. ఈ కలయిక కాస్తా ప్రేమకి  దారితీస్తే, రాజకీయ ప్రత్యర్ధులైన తండ్రులవల్ల పెళ్లి కుదరక పారిపోయి పెళ్లి చేసుకుంటారు. అంతలో రాహుల్ కి మేనేజర్ గా ప్రమోషన్ వచ్చి హైదరా బాద్ కి బదిలీ అవుతాడు.

ఇక్కడ ఓ ఏడాది ఇద్దరి కాపురం సజావుగా సాగిపోతుంది. అప్పుడు ఒంటరిగా ఇంట్లో బోరు భరించలేక మనాక్షి ఉద్యోగం చేస్తానని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరుతుంది. అలా జాబ్ కి వెళ్తున్న  ఆమెకి  బాల్య స్నేహితుడు మదన్ (రాజీవ్) తారసపడతాడు. ఇతడి గురించి ముందే చెప్పి ఉంచింది రాహుల్ కి.  ఇప్పుడామె ఆ మదన్ ని కలుస్తూ ఉండడంతో,  రాహుల్ కి అనుమాన బీజాలు నాటుకుని ఆమె కదలికల్ని కనిపెడుతూంటాడు. లోలోన కుమిలి పోతూంటాడు. తన సంగతి తెలిసిపోయిందని ఆమెకి తెలిసినా ప్రవర్తన మార్చుకోదు. ఇంతలో ఈ ముగ్గురి మధ్యకి అసలు గేమ్ ఆడుతున్న ఓ దుష్టుడు బట్టబయలవుతాడు...

ఇదీ విషయం. ఈ విషయాన్ని వీలైనంత అశ్లీలాన్ని జోడించి చెప్పారు. విషయం కాదు ప్రధానం, యువప్రేక్షకులకి కామోద్దీపన కల్గించడమే ముఖ్యమన్నట్టుగా సాగించారు. ఇందుకు హీరోయిన్ శ్రావ్య శాయశక్తులా సహకారం అందించింది. హీరో హీరోయిన్ల శృంగార చేష్టలకి పెళ్లి అనే లైసెన్సు ఇచ్చేయడంతో హద్దు లేకుండా పోయింది. అక్షేపణీయం కాని యూత్ అప్పీల్ ని రాజెయ్యడానికి ఇది చాలా తెలివిన ప్లానింగ్. పెళ్ళికాని యువజంట తో ఇలాటి చిత్రీకరణలు తీవ్ర విమర్శల పాలవుతాయి కాబట్టి  -పెళ్లి జరిపించేసి ఆ ముసుగులో యదేచ్ఛగా పడకగది దృశ్యాలకి తెరతీసినట్టుంది. మున్ముందు మారుతికి, మారుతి గ్రూప్ దర్శకులకీ ఇలాటి కొత్త కొత్త టెక్నిక్ లు ఎన్నితడతాయో వేచి చూడాల్సిందే!




contd..







22, జనవరి 2014, బుధవారం

స్క్రీన్ ప్లే సంగతులు - 1

స్క్రీన్ ప్లే ప్రయాణంలో మజిలీలు అక్కర్లేదా?

ఆరోజుల్లో కే ఏ అబ్బాస్ స్క్రిప్టు రాసుకొస్తే షోమాన్ రాజ్ కపూర్ శుభ్రంగా తలంటు పోసుకునిగానీ ఆ స్క్రిప్టుని ముట్టుకునే వాడు కాదట. దాన్నో పవిత్రగ్రంధంలా కళ్ళకద్దుకుని, నెత్తిన పెట్టుకుని పూజ గదిలోకి వెళ్ళే వాడట. ఆ స్క్రిప్టుకి పూజాదికాలు అవీ పూర్తిచేసి తెచ్చుకుని, అప్పుడు మాత్రమే దాని ముందు భక్తి భావంతో  మోకరిల్లి, ఏకబిగిన ఉచ్చ స్వరంతో చదివేసేవాడట!

అలాటి పవిత్ర గ్రంధం ఇప్పుడు స్క్రిప్టు కాదు. ఓ నిర్మాత తయారైన స్క్రిప్టు పట్టుకుని బోల్డు భక్తి శ్రద్ధలతో వెళ్లి తిరుపతి వెంకన్నని దర్శించుకున్నాడు. తిరిగొచ్చి కలం పట్టుకుని తన టాలెంటు ప్రదర్శనతో దాన్ని చెండాడేడు. అది దేవుడి కాపీ అన్న స్పృహే లేకుండా పోయింది. దాన్ని నానా కంగాళీ చేసి ఫెయిర్ చేయడానికి ఇచ్చాడు. దేవుడి దగ్గర మొక్కించిన కాపీని చెత్తబుట్ట దాఖలు చేశాడు. మనకెందుకులే అని ఈ రచయిత దాన్ని ఫెయిర్ చేసిచ్చాడు. ఆ దెయ్యం కాపీతో సినిమా తీశాడు నిర్మాత. సహజంగానే ఆ దేవుడి దయవల్ల దానికి దరిద్రం చుట్టుకుంది!

ఈ తరహా ధోరణికి కారణం స్క్రిప్టు కంటే కెమెరా ఉన్నతమైనదని భావించడమే. ప్రాక్టికల్ గా తెర మీద కదిలే బొమ్మల్ని సృష్టించే కెమెరాని మించిన సృజనాత్మక ఉపకరణం ఏదీ లేదనుకోవడమే. కెమెరాకి వుండే అన్ని భౌతిక సూత్రాల్లాంటివే  స్క్రిప్టుకీ ఉంటాయని అంగీకరించక పోవడంవల్లే స్క్రిప్టంటే చిన్నచూపు - దాంతో చిల్లరమల్లర ఫలితాలూ.

స్క్రిప్టులో  అంతర్భాగమైన స్క్రీన్ ప్లే అనే క్రియేటివ్ టూల్ కి కెమెరాకి ఉన్నట్టే  పాటించాల్సిన రూల్సూ  వున్నాయి. ఈ రూల్సు లోతుల్లోకి వెళ్తే అదొక అనంతమైన శాస్త్ర మౌతుంది. ఇది గుర్తించకుండా సినిమా అంటే  కేవలం  కెమెరా రూల్సేనని నమ్మడం వల్ల  ఏమీ ప్రయోజనం వుండదు. సినిమా ఆఫీసు తీస్తున్నప్పుడు అన్ని వాస్తు సూత్రాలూ పట్టించుకుని, తీరా స్క్రిప్టు కి  కూడా వుండే అలాటి ‘వాస్తు’ విలువల్నే తెలుసుకోకపోతే – అలాటి సినిమాతీసి కాశీకి ప్రయాణం కట్టడమే.

స్క్రీన్ ప్లే కీ ‘వాస్తు’ వుంటుంది. ‘వాస్తు’ దోషాలుంటాయి. సరిదిద్దుకుంటే సత్ఫలితాలుంటాయి. ప్రజాస్వామ్యమనే మహాసౌధానికి మూల స్తంభాలు నాల్గున్నట్టే, స్క్రీన్ ప్లే కీ ఐదు మూల స్తంభాలుంటాయి. అవి ప్లాట్ పాయింట్స్  -1, 2  లు, మిడ్ పాయింట్, పించ్ పాయింట్స్ -1, 2 లు. ప్రజాస్వామ్య మూల స్తంభాలలో ఏ ఒక్కటి చాప చుట్టేసినా ప్రమాదమన్నట్టుగానే, స్క్రీన్ ప్లే సౌధం లో ఈ ఐదింటిలో ఏ ఒక్క మూల స్తంభం లోపించినా, లేదా బలహీన పడ్డా అది కుప్ప కూలడమే అవుతుంది.  ఐదు స్తంభాల స్క్రీన్ ప్లే అనే సౌధంలో విడుదు ల్లాంటి మూడు అంకాలుంటాయి.  వీటిలో ఏ ఒక్కటి వెళ్లి మరోదాన్ని (విడిదిని) దురాక్రమించినా మొత్తం ఆ ‘వాస్తు’ చెడిపోతుంది.

వేలసంవత్సరాలుగా వున్న ఈ నిర్మాణాన్ని వ్యతిరేకించే నవీన వాదులూ వున్నారు. వీరిని ఫస్టాఫ్- సెకండాఫ్ వాదులందాం. వీరు స్క్రీన్ ప్లే కి ఒక నిర్మాణం చెప్పేసి అందులోనే కథ చెప్పలనడం అన్యాయమంటారు. ..


To be concluded..







21, జనవరి 2014, మంగళవారం



ఇంటర్వ్యూ:

కళా దర్శకత్వం

తెలుగులో ట్రెండ్ ని మార్చింది నేనే!

కె. అశోక్ కుమార్ 

సినిమా కళాదర్శకత్వం పుట్టిల్లు కూడా నాటకరంగమే. తొలి ఆర్ట్ డైరెక్టర్ శిల్పి. 1910 లో ‘పుండలీక్’ అనే నాటకాన్ని నాటకం నడుస్తూండగా యథాతధంగా చిత్రీకరించాడు ఆర్.జి. టోర్నీ అనే ఔత్సాహికుడు. అదే మనదేశంలో మొట్టమొదటి చలనచిత్ర మయ్యింది. తర్వాత 1913 లో స్వయంగా కథ రాసుకుని ‘రాజా హరిశ్చంద్ర’ నిర్మించాడు దాదా సాహెబ్ ఫాల్కే. అప్పట్లో రంగ స్థల నాటకాలుగా పౌరాణికాలే వుండడం చేత తెలుగులో కూడా అవే సినిమాలుగా 1937 వరకూ రాజ్యమేలాయి. సినిమా కళాదర్శకత్వం అందుకే ఆ పౌరాణిక సెట్టింగులతో  వర్ధిల్లింది. 1938లో ‘మాలపిల్ల’ వచ్చిందగ్గర్నుంచీ కళాదర్శకత్వం పంథా మార్చుకుంది. నిత్యజీవితంలో జనం నివసించే ఇళ్ళు, వీధులూ కళా దర్శకత్వపు పరిధిలో కొచ్చాయి. ఆతర్వాత కలర్ సినిమాల్లో వెలుగు జిలుగుల భవంతులూ, ఇప్పుడు స్పెషల్ ఎఫెక్ట్స్ దాసోహులైన ప్రేక్షకులకోసం ఫాంటసీ  ప్రపంచాలూ కళా దర్శకత్వపు చేతికి చిక్కాయి.


అయితే సినిమా కళాదర్శకత్వం సినిమా స్టూడియోలోనే మొదలైందంటారు  ప్రసిద్ధ ఆర్ట్ డైరెక్టర్ కె. అశోక్ కుమార్ (నాటక రంగాన్ని తమ  పూర్వశ్రమంగా అంగీకరించాలంటే మనసొప్పదు చాలామంది సినిమావాళ్ళకి). ఆ రోజుల్లో కెమెరా సహా ఎక్విప్ మెంట్ అంతా  బయటికి మోయలేనంత మోత బరువు కాబట్టి, స్టూడియోల్లోనే సెట్స్ వేసి చిత్రీకరించే వాళ్ళనీ, అలా ఆ సెట్స్ కోసం కళాదర్శకత్వం  స్టూడియోల్లోనే పుట్టిందనీ అంటారాయన.


మహేష్ బాబు హిట్ ‘ఒక్కడు’లో చార్మినార్- ఓల్డ్ సిటీ సెట్ గుర్తుందా? అది అశోక్ కుమార్ అపూర్వ సృష్టే. ‘పౌర్ణమి’లో ఆలయం, ‘అరుంధతి’లో రాజకోట నిర్మాత కూడా ఆయనే. ‘వరుడు’ లో అట్టహాసంగా కట్టిన కళ్యాణ మండపం చూ  శారా? దీని సృష్టికర్త కూడా ఈయనే. అయితే చార్మినార్- ఓల్డ్ సిటీ నాటికి 70 శా తం  కళాదర్శకత్వం, 30 శాతం కంప్యూటర్ గ్రాఫిక్స్ (సీజీ)గా వుంటే, కళ్యాణ మండపం నాటికి వాటి శాతాలు తారుమారయ్యా యంటారు అశోక్ కుమార్. అంటే  సీజీ వచ్చేసి కళా దర్శకత్వాన్ని మింగేస్తోందా? అదేమోగానీ సీజీ వల్ల  వీడియో పైరసీ మాత్రం తగ్గుతుందని కొత్త వ్యాపారసూత్రం. ఎందుకంటే అలాంటి  అద్భుతాల్ని వెండితెర మీద చూడ్డానికి ప్రేక్షకులు తప్పనిసరిగా ధియేటర్లకే వస్తారు కాబట్టి.

ఐతే ఒక కట్టడం పూర్తిగా కళా దర్శకుడి పనితనంగానే సినిమా విమర్శకులు సైతం పొరబడుతున్నారు కదా అంటే, సామాన్య ప్రేక్షకుల సీజీ పరిజ్ఞానం ఇప్పుడు కాదు, ఏనాడో పెరిగిందని సమాధానమిచ్చారాయన. అయితే ఈ సీజీ కూడా సాగిపోయే దశే అనీ, పదేళ్ళ క్రితం ఓసారి ఇలాగే వచ్చి వెళ్లి పోయిందనీ చెప్పుకొచ్చారు. పదేళ్ళ క్రితం ‘అంజి’, ‘సహస వీరుడు –సాగర కన్య’ వంటి ఫెయిల్యూర్ సేజీ లకి తనే ఆర్ట్ డైరెక్టర్ మరి!

హాలీవుడ్ కథలు, దృశ్యాలు మన సినిమాల్లోకి దిగుమతి అయినట్టు కళాదర్శకత్వం కోసం హాలీవుడ్ వైపు తను చూడ్డం లేదని స్పష్టం చేశారాయన. వాళ్ళ శైలి మనకు సరిపడదన్నారు. మరెక్కడ్నుంచీ ఇన్స్ పైరవుతా రంటే,  లైబ్రరీ చూపించారు. కలర్ స్కీమ్స్, డిజైన్స్, ఆర్కిటెక్చర్, కామిక్స్ మొదలైన విభాగాలకి చెందిన వందలాది పుస్తకాలు అక్కడ పేర్చివున్నాయి. ఆ పుస్తకాల్లో ఏ అంశం ఎక్కడుందో తన మస్తిష్కంలో ముద్రించుకు పోయిందన్నారు.

1986 లో మద్రాస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో విజువల్ కమ్యునికేషన్స్ లో పట్టభద్రుడైన ఈయన స్వరాష్ట్రం కేరళ. ప్రఖ్యాత  దర్శకుడు భరతన్ ఈయన పిన తండ్రే. 1989 లో ‘ప్రతాప్ పోతన్  ‘డైసీ’ కి కళా దర్శకత్వమిచ్చి ప్రోత్సహిస్తే, కమలహాసన్ తను నటిస్తున్న ‘ఇంద్రుడు-చంద్రుడు’ లో రెండు పాటలకి సిఫార్సు చేశారు. అది మొదలు డి. రామానాయుడు క్యాంపులో సినిమాలు చేస్తూ హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. తెలుగులోనే అగ్ర దర్శకుల, అగ్ర హీరోల సినిమాలు 120 వరకూ పని చేశారు.

‘తెలుగులో కళా దర్శకత్వపు ట్రెండ్ ని మార్చింది నేనే ‘ అంటూ సగర్వంగా చప్పారు. ఏమిటా ట్రెండ్? అంటే ..కొత్త కలర్ స్కీమ్స్, హాఫ్ ఫ్లోర్ సెట్స్ వగైరా. కళా దర్శకత్వానికి కాణాచి అయిన తోట తరణి స్టైల్ కి ముగ్ధుడై, విరివిగా కలర్స్ వాడింది తానేనని చెప్పారు. తెలుగు సినిమాల్లో ఈ ట్రెండ్ ఇప్పటికీ ఇలాగే కొనసాగుతోందని చెప్పారు.
సరే, మంచి కళా దర్శకుడి లక్షణాలేమిటి? ఇంజనీరింగ్, టెక్నికల్, ఆర్కిటెక్చర్ స్కిల్స్ తో బాటు, ఒక మైన్యూట్ ఐడియా తడితే,  దాన్ని బ్రహ్మాండంగా విస్తరించే నైపుణ్యం కలిగివుండడం మంచి కళా దర్శకుడి లక్షణ మన్నారుఅశోక్ కుమార్.

అశోక్ కుమార్ నాయర్ కరలత్ ది అద్భుత కళా ప్రపంచం. సంస్కృతుల్ని ఔపోశన పట్టిన దివ్యానుభూతుల లోకం ఆయనది. కాకపోతే  ఒక్కటే లోటు. తెలుగు గ్రామీణ వాతావరణాన్ని తెలుసుకునే అవకాశం లభించలేదు. అలాటి సినిమాలకి పనిచేస్తే ఆ లోటు కూడా తీర వచ్చేమో. ఆయన దృష్టిలో కథని, పాత్రల్నీ తెలుసుకోకపోతే కళాదర్శకత్వం లేదు. అలాగే దర్శకుడికి కుడి పక్క కెమెరా మాన్, ఎడం పక్క కళా దర్శకుడూ లేకపోతే మంచి సినిమాకూడా లేదు.

ఇప్పుడాయన తనపక్కన తనే నిలబడుతున్నారు. దర్శకుడుగా మారుతున్నారు. ఈ క్రమంలో కొన్ని పెద్ద సినిమాలకు కళా దర్శకత్వాన్ని వదులుకున్నారు కూడా. ఇది అభిమానులకి బాధాకరమే కావొచ్చు. దర్శకుడుగా నిరూపించుకుని ఆ బాధని మరిపించాల్సిన బాధ్యతంతా  ఆయన పైనే వుంది!

-సికిందర్
 (ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)




13, జనవరి 2014, సోమవారం

రీసైక్లింగ్ మసాలా !
రివ్యూ
 ‘ఎవడు’
తారాగణం : రాం చరణ్, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, శృతీ హాసన్, అమీ జాక్సన్, జయసుధ,కోట శ్రీనివాసరావు, సాయికుమార్, రాహుల్ దేవ్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం,
సుబ్బరాజు, అజయ్ తదితరులు 

కథ : వక్కంతం వంశీ, వంశీ పైడిపల్లి,  మాటలు : అబ్బూరి రవి
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్   గీతాలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, చంద్రబోసు, కృష్ణ చైతన్య, శ్రీమణి
చాయాగ్రహణం : రాం ప్రసాద్   నృత్యాలు :       కళ : ఆనంద్ సాయి  కూర్పు : మార్తాండ్ కే వెంకటేష్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్     నిర్మాత : దిల్ రాజు
స్క్రీన్ ప్లే – దర్శకత్వం : వంశీ పైడిపల్లి
నిడివి : 166 నిమిషాలు, సెన్సార్ : A   విడుదల : జనవరి 12 , 2014

***
గత ఆర్నెల్లుగా అనేక సార్లు వాయిదా పడుతూ రామ్ చరణ్ అభిమానుల్ని తీవ్ర అసహనానికి గురిచేస్తున్న  తాజా కానుక ‘ఎవడు’ ఎట్టకేలకు సంక్రాంతికి దిగివచ్చింది. రంగంలో వున్న మహేష్ బాబు ‘1- నేనొక్కడినే’ ని బలంగా ఢీ కొట్టింది. ఈ పందెం కోళ్ళల్లో మొదటిది ఆపాటికే డీలాపడివున్న పరిస్థితిని సొమ్ముచేసుకుంటూ బాక్సా ఫీసు ని కొల్లగొట్టుకుంది. అలాగని పూర్తిగా గెలిచానన్న సంతోషం కూడా లేదు. సంక్రాంతి కోడి పందాలంతటి థ్రిల్లింగ్ గా  ఈ రెండు కోళ్ళ మధ్య నువ్వా నేనా ? అన్నట్టు పోటీ లేకపోవడంతో- ఈయేటి సంక్రాంతి హీరో బ్యాడ్జీ దాని గ్లామర్ ని కోల్పోవాల్సి వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీసు ముఖం పట్టేందుకు ఏంతో  ఓపికపట్టి ఉన్న నిర్మాత దిల్ రాజు కి దీని సక్సెస్ చాలా అవసరం. గత నిర్మాణం ‘రామయ్యా వస్తావయ్యా’ తో అయిన అనుభవం దృష్ట్యా ‘ఎవడు’ ప్రతిష్ట నిలబెట్టాలి. అయితే సుదీర్ఘకాలం నిర్మాణంలో వున్న కారణంగా కొన్ని నష్టనివారణా చర్యలు తీసుకోవడానికి వీలు పడి ఉండక పోవచ్చు. ఫలితంగా ఇది ఒకవర్గం ప్రేక్షక కటాక్షానికే లోబడాల్సి వచ్చింది- పండక్కి కుటుంబాలు వినోదించే మసాలాదినుసులకన్నా,  పక్కా మాస్ ఎలిమెంట్స్ శృతిమించి పోవడంవల్ల!

హీరో రామ్ చరణ్ తన తండ్రిలాగే ఆయన నిర్దేశకత్వంలో మూస ఫార్ములా బరి ఏమాత్రం దాటకుండా,  సేఫ్ గేమ్ ఆడేందుకు కృతనిశ్చయు డయ్యాడని అతడి ట్రాకుని బట్టి తెలిసిపోతోంది. ఏ ముహూర్తాన అయితే 2010 లో ‘ఆరెంజ్’ అనే జెనెక్స్ అర్బన్ క్లాస్ ప్రేమకథ దారుణ పరాజయం పాలయ్యిందో-ఇక అప్పట్నుంచీ చిరంజీవి మార్గదర్శకత్వంలో ఆయనకి కలిసివచ్చిన బాటలో వరుసగా ‘రచ్చ’, ‘నాయక్’, ఇప్పుడు  ‘ఎవడు’ అనే మాస్ లక్ష్యిత మూస ఫార్ములా కథల వైపు మొగ్గడం ప్రారంభించాడు. మధ్యలో ‘జంజీర్’ – ‘తూఫాన్’ హిందీ /తెలుగు రీమేకుల ప్రయోగం మరో దెబ్బ తీసింది. ఒకేతరహా సినిమాలతో మాస్ మహారాజా రవితేజకి  తలపట్టుకునే పరిస్థితి వచ్చిందన్నది కన్పిస్తున్న చరిత్ర. రామ్ చరణ్ కి ఇలాంటి ఇబ్బంది ఎదురవకూడదని ప్రార్ధిద్దాం.

మూస ధోరణిలో ‘ఎవడు’ కొన్ని ఆంగ్ల-తెలుగు సినిమాల రీసైక్లింగ్ తిరగమోత. విద్యాధికుడైన దర్శకుడు వంశీ పైడిపల్లి నుంచి ఇలాటి వంటకం రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. హీరోని బట్టి దర్శకుడు కూడా మారాల్సిందే. కాకతాళీయమే కావొచ్చు, ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తూ విడుదలైన సినిమాలు   ‘క్షత్రియ’,  ‘1-నేనొక్కడినే’, ’ఎవడు’- మూడూ కొత్త కథల్నే ప్రయత్నిచాయి. మొదటి రెండూ సైకాలజికల్ థ్రిల్లర్స్ గానూ, చివరిది ముఖమార్పిడి యాక్షన్ మూవీగానూ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే కథా నిర్వహణలో కొత్తదనాన్ని ప్రదర్శించలేకపోయాయి. ‘ఎవడు’ కథని నడిపించడానికి మరీ ఇంత పాత మూస అవసరమా అన్పించేట్టుంది-మాస్ కి హృదయస్పందనలే  వుండ వన్నట్టు ఇంత సుత్తిమోత అవసరమా?

ఫేసులూ – కౌంటర్ ఫేసులూ
వైజాగ్ లో సత్య( అల్లు అర్జున్), దీప్తి (కాజల్ అగర్వాల్) ప్రేమించుకుంటారు. లోకల్ డాన్ వీరూభాయ్ (రాహుల్ దేవ్) దీప్తిని వశపర్చుకోవాలని చూస్తూంటాడు. సత్య కీ, వీరూకీ ఈ కారణంగా ఘర్షణలు పెరిగి, దీప్తీ తో పారిపోయి హైదరాబాద్ లో పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు సత్య. వీరూ మనుషులు ఆ బస్సుని అటకాయించి ఇద్దర్నీ చంపేసి బస్సుని తగులబెట్టేస్తారు. సగం ముఖం కాలిపోయి కొనప్రాణంతో వున్న సత్యని హైదరాబాద్ లో డాక్టర్ శైలజ  (జయసుధ) చికిత్స చేస్తుంది. పదిరోజుల తర్వాత కోలుకున్న సత్య ముఖం చూసుకుంటే అది తన ముఖం కాదు. సర్జరీలో ఏకంగా ఫేస్ ట్రాన్స్ ప్లాంటేషనే జరిగిపోయింది...మారిపోయిన ముఖంతో (రామ్ చరణ్ ముఖం) ఇదే అదును అనుకుని సత్య వైజాగ్ పారిపోయి వీరూ మనుషుల్ని చంపడం మొదలెడతాడు. ఈ క్రమంలో వీరూ కన్ను పడిన మరో అమ్మాయి శృతి (అమీ జాక్సన్ ) ని కాపాడి ఆమెద్వారానే గ్యాంగ్ ని ట్రాప్ చేసి చంపుతుంటాడు. చివరికి వీరూని చంపేసి పగ తీర్చుకోవడం పూర్తయ్యేసరికి – ఇంకో ముఠా అనుచరుడు- సత్యని చూసి చరణ్ (రామ్ చరణ్) అనుకుని- ఇంకా బతికే ఉన్నాడని  గగ్గోలు లేపుతాడు. ఇక సత్య మీద ఈ  ముఠా దాడులు మొదలెడుతుంది.

చిక్కుల్లో పడతాడు సత్యా. చచ్చిపోయిన చరణ్ ఫేసు తన కెందుకొచ్చింది? ఈ అనుమానంతో డాక్టర్ శైలజ  ని కలిస్తే- ఆమె తన కొడుకు చరణ్ కథ చెప్పుకొస్తుంది. అందరి బాగు కోరే కొడుకు దుష్ట రాజకీయనాయకుడు ధర్మా (సాయికుమార్) కుట్రలకి  ఎలా బలైపోయాడో తెలుసుకున్న సత్య – చరణ్ గా ఎంటరై ధర్మాని బోల్డు తికమక పెట్టేస్తూ ఆడుకోవడం మొదలెడతాడు...

ఓకే ఫేసుతో సత్యగా, చరణ్ గా నటించిన రామ్ చరణ్ అభిమానుల మెప్పు తప్పకుండా పొందుతాడు. ఈ ద్విపాత్రాభినయాలు ఇంకో విధంగా వుండి వుంటే నటనల్లో  ఇంకా చాలా వైవిధ్యం వచ్చేది. అదెలాగో తర్వాత చూద్దాం. ప్రారంభంలో అతిధి పాత్రలో వచ్చే అల్లు అర్జున్ ది  ‘లో- ప్రొఫైల్ ‘ మెయింటైన్ చేసే క్యారక్టర్ కావడంతో సినిమా ప్రారంభ దృశ్యాలు అంత ప్రభావశీలంగా ఏమీ లేవు.  అతడి ప్రేయసిగా కాజల్ బాగా లావెక్కి కన్పిస్తుంది. శృతి పాత్రలో బ్రిటిష్ నటి అమీ జాక్సన్ తెలుగులోకి ఎంటరవుతూ పాత్ర సరిగ్గా లేక కృతకంగా నటించి వెళ్ళిపోయింది. ‘1947- ఏ లవ్ స్టోరీ (తమిళ మాతృక ‘మదరాస పట్టినం’- 2010 విడుదల) లో కడు హృద్యంగా అభినయించిన ఆమె ఇలా తేలిపోవడం ఒక విషాదం. 

చరణ్ పాత్ర ప్రేయసిగా శృతీ హాసన్ దీ కురచ పాత్రే. విలన్ గా  నటించిన సాయికుమార్ పెడబొబ్బలు పెట్టడంతోనే సరిపోయింది. డాక్టర్ గా జయసుధ నటన హుందాతనం ఉట్టిపడేలా వుంది. వెన్నెల కిషోర్ ది పాత్రే కాకపోయాక, బ్రహ్మానందం నవ్వించడానికి అంతంత మాత్రమే  స్క్రీన్ టైం దక్కింది.

సినిమాలో కామెడీ మిస్సయి ఒకటే సీరియస్ గా అదేదో ప్రపంచం కొట్టుకు పోతున్న చందంగా పాత్ర చిత్రణ లున్నాయి. దీనికి తోడూ దేవీశ్రీ ప్రసాద్ పాటల పారవశ్యం మాటేమో గానీ, నేపధ్య సంగీతం మాత్రం చాలా నాటుగా, డీటీఎస్ మిక్సింగ్ మరీ ఘోరంగా చెవులుపగిలే మోతతో నరకం చూపిస్తాయి. మాస్ కి ఈ క్రియేటివిటీ తోనే ఆకట్టుకోవచ్చను కున్నారేమో తెలీదు - ‘సి’ గ్రేడ్ సినిమా వ్యవహారంలా వుంది. ఛాయాగ్రహణం, ఫైట్స్ షరామామూలే. పండక్కి పెద్దలకుమాత్రమే ‘A’ సర్టిఫికేట్ తో వచ్చిన ఈ హింసాత్మక మసాలా మాస్ కోసమే అనడం కూడా వాళ్ళని అవమానించడమే అవుతుందేమో!

స్క్రీన్ ప్లే సంగతులు 
దర్శకుడు వంశీ పైడిపల్లి, వక్కంతం వంశీ కలిసి రాసిన కథకి వంశీ పైడిపల్లి  స్క్రీన్ ప్లే రాసినట్టు టైటిల్స్ లో పడుతుంది. ప్రారంభంలో ఇరవై  నిమిషాలూ అల్లు అర్జున్ పాత్ర ప్రమాదానికి గురికావడం, సర్జరీ చేసి రామ్ చరణ్ ముఖం గా మార్చడమూ జరుగుతాయి. అక్కడ్నించీ వైజాగ్ వచ్చి హత్యలు చేయడం మొదలెడతాడు రామ్ చరణ్. ముఖ మార్పిడి అనే వినూత్న కాన్సెప్ట్ తో ప్రారభమైన సినిమా- ఇక్కడ్నించే స్క్రీన్ ప్లే పట్టు తప్పిపోయి ఆసక్తిని కోల్పోతుంది. ప్రసిద్ధ స్క్రీన్ ప్లే ట్యూటర్ జాన్ ట్రూబీ చెప్పే పొరపాట్లలో మొదటిది ఇదే- స్టోరీ ఐడియా ఒరిజినల్ ది  కాకపోవడం, ఆ ఐడియాని తమ వంతుగా డెవలప్ చేసుకోవడానికి రాంగ్ జెనర్ ని ఎంపిక చేసుకోవడం, లేదా ముందే నిర్ణయించుకున్న ఫలానా ఫలానా సినిమాల్లోని కథనాలని ఆ అయిడియాలోకి జోప్పించడమూ చేస్తారు తప్ప,  అరువుదెచ్చుకున్నఆ  స్టోరీ ఐడియాకి తగిన తమదైన ఒరిజినల్ కథనాన్ని సృష్టించే పాపానే పోరు.

హిట్ సినిమా స్క్రిప్ట్ అంటే  హై కాన్సెప్ట్ నేపధ్యంతో భారీ బిల్డప్ ఇవ్వడమే అనుకుంటారు. మరి ఆ బిల్డప్ కి తగ్గ కథనాన్ని జోడించడం ఓ రెండు మూడు సీన్లవరకే చేసి చేతులేత్తేస్తారని కూడా అంటాడు ట్రూబీ.

సరిగ్గా ఇదే జరిగింది. మొదట్లోనే వైజాగ్ వచ్చి హత్యలు చేయడం మొదలెట్టగానే టెన్షన్ గ్రాఫ్ ఒక్కసారి పడిపోయింది. కారణం  ఎన్నుకున్న హై కాన్సెప్ట్ ఐడియా తిరుగు ముఖం పట్టడం. అతను అంతలోనే వెనక్కి వైజాగ్ కి రావడమే కథని వెనక్కి తిప్పేసింది. కొత్త ముఖంతో  హైదరాబాద్ లో కొత్త శత్రువులతో అప్పుడే  కొత్త కథ మొదలై పోయి వుంటే,  టైం అండ్  టెన్షన్ గ్రాఫ్ అమాంతం పైకి లేచి కథ ముందుకు పరుగులెత్తేది! 

తనకు సంబంధం లేని ఆ కొత్త శత్రుత్వం కూడా పేలవమైన పాతచింతకాయ - కాలంచెల్లిన  రాజకీయ గూండాయిజం తో కాకుండా, ముఖమార్పిడి అంతటి సంచలన ఎత్తుగడకి మించిన స్థాయిలో ఉన్నప్పుడే హై కాన్సెప్ట్ కి న్యాయం చేసినట్టు. 

ఇలా లేకపోవడం వల్ల ఫస్టాఫ్ లో అల్లు అర్జున్ పాత్ర వైజాగ్ లో గూండాయిజం తో తలపడినట్టే, సెకండాఫ్ లోనూ  రామ్ చరణ్  కథకి ఫ్లాష్ బ్యాక్ లో సృజనాత్మకత లోపించి, అలాటి గూండాయిజం తోనే కథ నడిఛి- రిపీటీషన్ బారినపడి  ఆ సెకండాఫ్ కూడా  మరీ డల్ అయిపో యింది. 


సినిమాలో టెన్షన్ ఫ్యాక్టర్ లేదా థ్రిల్ మిస్సవడానికి ప్రథమార్ధంలో, ద్వితీయార్ధంలో ఓకే తరహా కాలం చెల్లిన కథలు కొనసాగడం ఒక కారణమైతే,  ఈ కథలు కూడా స్ట్రక్చర్ లో లేకపోవడం అసలు కారణం. ప్రథమార్ధంలో సత్య, చరణ్ లా  వైజాగ్ కి తిరిగివచ్చి ప్రతీకారం తీర్చుకున్నాక,  ధర్మా గ్యాంగ్ మనిషి అతన్ని చూసి గుర్తుపట్టడం అనే మొదటి మలుపు (ప్లాట్ పాయింట్ -1 ) దాదాపు గంట సేపటికి వస్తుంది. ఆ తర్వాత పదిహేను నిమిషాల్లోనే ఇంటర్వెల్ పడిపోతుంది. ఒకసారి సారి ఈ క్రింది పటాన్ని గమనిస్తే... మలుపు యాక్ట్ -1 విభాగంలో, ప్లాట్ పాయింట్ -1 (రెండవ ఎరుపు రేఖ) దగ్గర రావాల్సింది. ఇది ముందుకు జరిగిపోయి, పించ్ పాయింట్ -1 (మూడో ఎరుపు రేఖ ) దగ్గర వచ్చింది. అంటే యాక్ట్ -2 విభాగంలోకి అతిక్రమించి వచ్చింది. తర్వాత పదిహేను నిమిషాల్లో యాక్ట్ -2 మిడ్ పాయింట్ (నలుపు రేఖ) దగ్గర విశ్రాంతి పడింది.
పించ్ పాయింట్ -1 అనేది ఇంటర్వెల్ కి దారితీసే ఉత్ప్రేరక ఘటనగా రావాలే తప్ప మరోలా కాదు. కానీ ఇక్కడ ప్లాట్ పాయింట్ -1 గా వచ్చింది. పించ్ పాయింట్-1 అసల్లే కుండా పోయింది! ఇలా అంకాలు భంగపడి, వాటి బిజినెస్ సాంతం మూతపడి- స్క్రీన్ ప్లేకి అర్ధమే  లేకుండా పోయింది. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో లేనప్పుడు ఏదీ ఆసక్తికరంగా వుండే అవకాశం ఏమాత్రం లేదు.

ప్రేక్షకులనుంచి ఇంకో కామెంట్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ లో ఓ సినిమా, సెకండాఫ్ లో మరో  సినిమా చూపించారని! ఇది రసభంగం కల్గించే ఏకసూత్రత లోపించిన రచనా సంవిధానం. ఫస్టాఫ్ లో వీరూ గ్యాంగ్ మీద పగదీర్చుకుని, ఆ కథ ముగించేసి,  సెకండాఫ్ లో వేరేగా ధర్మా గ్యాంగ్ తో మరో కథ మొదలు పెట్టినట్టు అన్పించడమే ప్రేక్షకుల కి
ఆ  ఫీలింగ్ కలగడానికి కారణం.  ప్రధాన కథలో ప్రారంభ కథ కలగలిసి పోక పోవడం వల్లే ఇలా జరిగింది. ఏ సినిమాకైనా  ఓకే ఒక్క ప్రధాన కథ కథ వుంటుంది. ఇంకేవైనా కథలుంటే అవి ఉప కథలే అవుతాయి. ఈ సినిమాలో వీరూ మీద పగదీర్చుకోవడం, ధర్మా గ్యాంగ్ ని మట్టు  బెట్టడం –ఈ రెండిట్లో ఏది ప్రధాన, ఏది ఉప కథ ఆవుతాయంటే- ధర్మా గ్యాంగ్ తో జరిగేదే ప్రధాన కథ! వీరూ  ముఠాతో జరగాల్సిందంతా  ఉప కథే!

అలాంటప్పుడు ధర్మా గ్యాంగ్ తో జరిగే ప్రధాన కథతో వీరూ గ్యాంగ్ తో కథ అంతర్వాహినిలా వుండాలి. వేరే ముగించేసిన ఎపిసోడ్ లా వుండకూడదు. అంటే, చరణ్ లా సత్య వైజాగ్ లో  వీరూ గ్యాంగ్ ని అంతమొందించడానికి వస్తే, కథ అడ్డం తిరిగి, ధర్మా గ్యాంగ్ కంట పడి అసలు కథ ( ప్రధాన కథ ) మొదలైపోతే- అప్పుడు చరణ్ పాత్రకి పెండింగ్ లో పడ్డ వీరూ మీద ప్రతీకార లక్ష్యంతో కూడిన ఎమోషనల్ యాక్షన్ ఒకవైపు, మరోవైపు తనని చూసి పొరబడ్డ ధర్మా గ్యాంగ్ తో ఫిజికల్ యాక్షన్ అనే ద్వందాలేర్పడి, అది సజీవ పాత్రగా రాణించేది. చివరంటా ఎక్కడా బోరు కొట్టకుండా- రెండు సినిమాలు చూపిస్తున్నారన్న ఫీలింగ్ ఏర్పడకుండా- ఏకకాలంలో ఈ ద్విముఖ కార్యాచరణతో, క్యారక్టర్ అనుక్షణం సంఘటనలు సృష్టిస్తూ- తద్వారా వేడిపుట్టిస్తూ వుండేది. ఆఫ్టరాల్ పంతొమ్మిదో శతాబ్దపు ప్రసిద్ధ నవలా రచయిత జేమ్స్ విలియమ్స్ ఏమన్నాడు? –‘What is character but the determination of incident ? And what is incident but the illumination of character?- అని కాదూ?


క్యారక్టర్ బయోగ్రఫీ బలాదూర్!
రామ్ చరణ్ పాత్ర యాక్టివ్ పాత్రే, పాసివ్ కాదు. కాకపొతే దానికి  ఇన్నర్ (ఎమోషనల్) స్ట్రగుల్, ఔటర్ (ఫిజికల్ ) స్ట్రగుల్స్ తో కూడిన డైమన్షన్స్ పైన చెప్పుకున్న కారణాల వల్ల ఏర్పడలేదు. పూర్వం మహేష్ బాబు నటించిన ‘బాబీ’ అనే సినిమాలోనూ ఈ డైమన్షన్స్ కన్పించవు. బ్యాక్ డ్రాప్ లో బద్ధ శత్రువులైన హీరో హీరోయిన్ల తండ్రుల ఆగడాలతో నగరం అట్టుడికిపోతున్నా- ఈ బ్యాక్ డ్రాప్ తో సంపర్కం లేకుండా హీరో పాత్ర హీరౌయిన్ తో ప్రేమాయణం సాగించడంతో నే సరిపెట్టుకుంటుంది. మొత్తం కథా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతోందో అంతా హీరో కి తెలిసి వుండడ మన్నది  కథనంలో పాటించాల్సిన ప్రాథమిక  సూత్రమే. ఇదిలోపిస్తే పాత్ర ఒట్టి  కటౌట్ లా మిగిలిపోయే ప్రమాదముంది.

అల్లు అర్జున్ ముఖానికి రామ్ చరణ్ ముఖాన్ని అతికించినంత మాత్రాన  శరీరాకృతి, గొంతు, కళ్ళూ వగైరా రామ్ చరణ్ వి వచ్చేస్తాయా?ఇలాటి మాస్ కమర్షియల్ కథలకి కాసేపు లాజిక్ ని పక్కన బెట్టి, సినిమాటిక్ లిబర్టీ( సృజనాత్మక స్వేచ్చ)అనే లైసెన్సు తీసుకుని వాస్తవ దూర కల్పనలకి దర్శకుడు పాల్పడే హక్కు ఎప్పుడూ వుంటుంది. దీన్నే స్క్రీన్ ప్లే పరిభాషలో ‘suspension of disbelief’  అంటారు. అంటే మన అపనమ్మకాల్ని కాసేపు సస్పెండ్ చేసుకుని సినిమాని బేషరతుగా ఎంజాయ్ చేయడమన్నమాట. అలాగనీ ఈ లైసెన్సుని దుర్వినియోగం చేసి ప్రేక్షకుల ఔదార్యంతో అతిగా ప్రవర్తించే అధికారం దర్శకుడికి వుండదు. ‘ఫేస్ ఆఫ్’ అనే హాలీవుడ్ సినిమాలో ముఖ మార్పిడి అదొక గూఢచార సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా గుట్టుగా జరిగే వ్యవహారం. లాజిక్ కి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలూ తలెత్తవు. ‘ఎవడు’ సినిమాలోలా ప్రైవేట్ డాక్టర్ పేషంట్ అనుమతిలేకుండా ఇష్టానుసారం ముఖాన్ని మార్చేస్తే చట్టపరమైన, సామాజిక పరమైన, వ్యక్తిగతమైన సమస్యలెన్నో వస్తాయి. కాబట్టి అరిస్టాటిల్ మహాశయుడు చెప్పినట్టు - ముందు సన్నివేశానికి పునాది నమ్మశక్యంగా ఏర్పాటు చేస్తే , ఆపైన దాన్నాధారంగా ఎలాంటి అసంబద్ధ కామెడీతో నైనా ఒప్పించవచ్చన్నది ‘ఎవడు’ వంటి సీరియస్ కథాంశానికి  కూడా వర్తిస్తుంది.

ఇక్కడ ఒక గొప్ప ఆశయం కోసం మరణించిన పాత్ర ఫ్లాష్ బ్యాక్ లోని చరణ్ పాత్రే తప్ప, చావుతప్పిన సత్య కాదు. కానీ ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం కాడ్నించీ రొటీన్ గా చిత్రించి సరిపెట్టేశారు. మిత్రుడ్ని చంపినందుకు విలన్ని ఢీకొన్నాడు తప్పితే, అసలు మొదట్నించీ  ఆ పాత్ర అంతరంగం, వ్యక్తిత్వం, ప్రపంచం పట్ల, వ్యవస్థ పట్ల దాని దృక్పథం ఏమిటో నిండుతనంతో, సజీవపాత్రలా చూపడంలో విఫలమయ్యారు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే, నడుస్తున్న కథకంటే విభిన్నమైన విషయమేదో ప్రేక్షకులు ఫీలవ్వాలి. ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తుండి పోవాలి. అలాటిదేమీ ఇక్కడ జరక్క- ఫ్లాస్ష్ బ్యాక్ ఓపెన్ కాగానే- సినిమా ఫస్టాఫ్ లో ఫస్ట్ యాక్ట్ బిజినెస్స నే (సన్నివేశాల్నే) మళ్ళీ చూపిస్తున్నట్టు  తయారయ్యింది.

ఇదిలా  వుంటే, గమ్మత్తుగా కొన్ని పాత్రలు అర్ధాంతరంగా అంతర్ధానమై పోతాయి. రెండో హీరోయిన్ అమీ జాక్సన్, పోలీసు అధికారి పాత్ర  పోషించిన మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ వగైరా పాత్రల్ని కొనసాగించలేక మాయం చేశారు కాబోలు!

సమగ్రమైన కథా కథనాలతో భారీ బడ్జెట్ సినిమాలు కూడా తీయలేకపోవడం దేనికి నిదర్శన మనాలో ఎవరికి  వాళ్ళే నిర్ణయించుకోవాలిక!

-సికిందర్









12, జనవరి 2014, ఆదివారం

బాక్సాఫీసు వాస్తవాలు వేరు!


రివ్యూ
1 – నేనొక్కడినే !







తారాగణం : మహేష్ బాబు, కృతీ సానన్, గౌతమ్, పోసాని కృష్ణ మురళి, సాయాజీ షిండే, శ్రీనివాసరెడ్డి, సూర్య, నాసర్, ప్రదీప్ రావత్, , కెల్లీ దోర్జీ తదితరులు
కథ : చక్కా హరిప్రసాద్, స్క్రీన్ ప్లే : అర్జున్ వై కే, తోట శ్రీను
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, గీతాలు : చంద్ర బోస్
ఛాయాగ్రహణం : ఆర్ రత్నవేలు, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ : రాజీవన్, నృత్యాలు : ప్రేమ్ రక్షిత్ , యాక్షన్ : పీటర్ హెయిన్స్
బ్యానర్ : 14  రీల్స్ ఎంటర్ టైన్మెంట్ – ఇరోస్ ఇంటర్నేషనల్
నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర
సెన్సార్ : u/a
విడుదల : జనవరి 10, 2014

సంక్రాంతి సినిమాలంటే ప్రేక్షకులకి పండగ ఆనందాన్ని మించిన ఆనందం. పండగపూట కడుపునిండా వినోదాన్ని ఆరగించాలని ఉవ్వీళ్ళూరుతారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తారు. ఎదురుచూసిన అభిమాన స్టార్ సినిమా అట్టహాసంగా విడుదలవగానే థియేటర్ల కి పరుగులు పెడతారు. అంతవరకే వాళ్ళ చేతుల్లో వుండేది. ఆతర్వాత
నొసట రాత అంతా ఆ సినిమా దర్శకుడు, స్టార్ లతో బాటూ నిర్మాతల చేతుల్లో వుంటుంది. వాళ్ళు ప్రాప్తకాలజ్ఞు లయ్యరా, ప్రేక్షకులు చిరుదరహాసాలతో బయటపడతారు, వాళ్ళు ప్రేక్షకాభిరుచులమీద ప్రయోగాలు చేశారా- పండగ మూడ్ చెడగొట్టుకుని చెల్లాచెదురై పో తారు. ప్రిన్స్ మహేష్ బాబు 1- నేనొక్కడినేతో ఈ రెండోదే జరుగుతుందని  సాక్షాత్తూ ఆయన ఫ్యాన్స్ కూడా ఊహించివుండరు. సరిగ్గా 2011 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  కూడా ఇలాటి ఆందోళనకర పరిస్థితుల్నే సృష్టించాడు. కాకపోతే ఆ సినిమా పంజాసంక్రాంతికి ఓ నెల ముందే  విడుదలై ప్రేక్షకుల్ని రక్షించింది!

 ‘పంజాలాంటి అపజయాన్ని చూసికూడా ఆ దారిలోనే  నేనొక్కడినేఅనే మరో డార్క్ మూవీ తీయడం సాహసమే. అదీ దూకుడులాంటి పూర్తి వినోదాద్మక సూపర్ హిట్ తీసిన నిర్మాతలు- అలాంటి వినోదానికి దూరంగా సీరియస్ సినిమాతో ముందుకురావడం మింగుడు పడని వ్యవహారమే. వరస హిట్ల మీదున్న మహేష్ బాబు ఇలా తెలుగు సినిమాతో, తెలుగు సినిమా పాత్రతో ప్రయోగం చేయాలనుకోవడం, అందుకు దర్శకుడు సుకుమార్ ని ప్రోత్సహించడం అలావుంచితే, స్టార్ సినిమాకి సకుటుంబ సమేత ప్రేక్షక సమూహాలుంటాయి- అలాంటిది ఇన్నాళ్ళూ పక్కా ప్రేమసినిమాలుతో కుటుంబ ప్రేక్షకుల్ని కూడా అలరిస్తూ వచ్చిన సుకుమార్, ఆ  కుటుంబ ప్రేక్షకులే ఎలా చూస్తారనుకుని  ఏకంగా బిగ్ స్టార్ మహేష్ తో యాక్షన్ జెనర్ లో ఈ ప్రయోగం చేశాడన్నది పెద్ద క్వశ్చన్ మార్కే! ...పోతే ఈ డెబ్బై కోట్ల మెగా బడ్జెట్ మూవీలో అసలేముందో ఇప్పుడు చూద్దాం...

ఏది నిజం? ఏది అబద్ధం ?
పరిస్థితుల ప్రభావంతో మార్పు చెందేది ఎప్పుడూ అసలైన సత్యం కాదని వేదాల్లో చెబుతారు. గౌతమ్ (మహేష్ బాబు) అనే రాక్ స్టార్ తన గురించిన సత్యం తెలుసుకోవడానికి గతంలోకి ప్రయాణిస్తాడు. అప్పటికే ఆ గతంతో సంబంధమున్న ఇద్దర్ని విదేశాల్లో చంపేశాడు. హైదరాబాద్ లో ఓ  రాక్  షో ఇస్తున్నప్పుడు మూడో వాడు తనని చంపడానికి వస్తే  వాణ్ని చంపేసి అరెస్టవుతాడు. ఆ హత్యా దృశ్యాల్ని సమీరా (కృతీ సానన్) అనే టీవీ జర్నలిస్టు చిత్రీకరిస్తుంది. తీరా  ఆ వీడియోలో చూస్తే, అక్కడ లేని  శత్రువుని ఊహించుకుంటూ గాలిలో  విన్యాసాలు చేశాడు తప్పితే చంపలేదని తెలుస్తుంది. సైకియాట్రిస్టు (సూర్య)కి చూపిస్తారు. ఆ సైకియాట్రిస్టు ఇతను  చిత్తభ్రాంతులకి లోనయ్యే మనోవ్యాధితో బాధపడుతున్నాడని తేలుస్తాడు. గౌతమ్ తను చూసిందీ చంపిందీ అబద్ధం కాదనీ, అది పూర్తిగా నిజమనీ వాదిస్తాడు. చిన్నప్పుడు తన తల్లిదండ్రుల్ని హతమార్చిన వాళ్ళే తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారని అంటాడు. కానీ నిజానికి  తను విదేశాల్లో కూడా ఎవర్నీ చంపలేదన్న విషయం అతడికి తెలీదు.

ఇలా వుండగా అతడి మీద మళ్ళీ హత్యా ప్రయత్నాలు జరుగుతూంటాయి. పోలీసు అధికారి (సాయాజీ షిండే) వచ్చి చూస్తే, ఘటనా స్థలం అలావుండదు. అంతా గౌతమ్ స్వైరకల్పనలేనని హేళన చేస్తాడు. దీంతో గౌతమ్ అసలు తానెవరో తెలుసుకోవాలన్న పట్టుదలతో గోవా వెళ్తాడు. సమీరా అనుసరించి వస్తుంది. అక్కడామెకి అతడిమీద ప్రేమలాంటిది పుడుతుంది. అతడి మానసిక స్థితితో ఆ ప్రేమకి సరిపడదు. ఇక్కడా అవే చిత్తభ్రాంతులు. ఇక్కడ కూడా దాడులు జరుగుతాయి. ఈ దాడులు సమీర మీదే జరుగుతున్నాయని పసిగడతాడు. అది నిజమే అయినా తనమీద ఎందుకు దాడులు జరుగుతున్నాయో ఆమె దాస్తుంది. 

ఇక ఇక్కడ దాడులు చేస్తున్న శత్రువు (కెల్లీ దోర్జీ) ని చంపేసి లండన్ బయల్దేరతాడు గౌతమ్...లండన్ లో అతను తెలుసుకున్న రహస్యాలేమిటి, అక్కడింకా ఎవరు శత్రువులున్నారు, అసలు తన తల్లిదండ్రుల్ని ఎందుకు చంపారు, ఆ గుట్టు ఏమిటి, తన తల్లి దండ్రులు అసలెలా వుంటారు- అదెలా తెలుస్తుంది- వగైరా ప్రశ్నల పరంపరకి  ఈ ద్వితీయార్ధంలో సమాధానాలు దొరుకుతాయి.  

ప్యాకేజీ- పాత్రలూ పరిమితం 
చాలాతక్కువ పాత్రలతో, అతితక్కువ వినోదాత్మక విలువలతో రొటీన్ కి భిన్నమైన కథా కథనాలతో చేసిన ఈ ప్రయోగంలో నటనవరకూ మహేష్ బాబు ఓకే, కానీ నటనే సినిమాని నిలబెట్టదు. కాసేపైనా తననుంచి ప్రేక్షకులాశించే అల్లరిచేయకుండా, నవ్వించకుండా , ఆద్యంతం సీరియస్ గా కన్పిస్తూ, హీరోయిన్ తో ప్రేమ సన్నివేశాల్లో సైతం రొమాంటిక్ మూడ్ ని ప్రదర్శించక- తన జీవితం, తన సమస్యే తప్ప ప్రేక్షకులు పట్టని  ఆత్మాశ్రయ ధోరణిలో సాగే ఈ  పాత్ర ఆశించిన ఫలితాల్నిచ్చిందా అంటే అదేమీ లేదు- అలాంటప్పుడు ఈ ప్రయోగం విఫలమైనట్టే.

మానసిక సమస్యని పక్కన బెడితే, పాత్రకి చిన్నపుడు జరిగిన అన్యాయానికి సంబంధించి సానుభూతిని పొందడానికి తగిన నేపధ్యం కూడా లేకపోవడం పాత్ర బాగా బోరు కొట్టడానికీ, సహన పరీక్ష పెట్టడానికీ కారణం. దీనికి మరమ్మత్తు చేయాలంటే, 'ధూమ్ -3 ' లో అమీర్ ఖాన్ పాత్రచిత్రణ చూడాలి. ఇది తర్వాత చూద్దాం. సీరియస్ నటన తర్వాత, మహేష్ బాబు మూడు పాటలకి డాన్సులేశాడు. అవేమీ ధియేటర్లో కేరింతలు పెట్టించలేదు. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఎందుకనో పేలవంగా వుంది. ఐటెం సాంగ్ తప్పనిసరిగా పెట్టుకునే అలవాటున్న సుకుమార్,   ఈసారి ఐటెం సాంగ్ ని కూడా నీరుగార్చేశాడు. నేపధ్య సంగీతం కూడా శోక రసంతో థీమ్  ట్రాకుగా రిపీటవడం  సినిమా నడకని పెను భారం గా మార్చేసింది. పాటల తర్వాత యాక్షన్ దృశ్యాల్లో మహేష్  ని వంక పెట్టడా నికేం లేదు. యాక్షన్ దర్శకుడు పీటర్ హెయిన్స్ సముద్రం మీదా, లండన్ లోనూ కంపోజ్ చేసిన పోరాట దృశ్యాలు హైలైట్. అలాగే 'రోబో' ఫేమ్ ఛాయాగ్రాహకుడు ఆర్ రత్నవేలు ఎంచుకున్న లైటింగ్ స్కీమ్ చివరంటా డార్క్ మూడ్ నే క్రియేట్ చేయడానికి  పనికొచ్చింది తప్ప,  ప్రేక్షకులకి మానసికంగా కాస్తైనా పంచరంగులతో  అలరించలేకపోయింది. ఈ తరహా చిత్రాకరణ చిన్నాచితకా నటులతో తీసే సైకలాజికల్ థ్రిల్లర్స్ కి నప్పుతుంది- బిగ్ స్టార్స్ కి కన్నులపండువగా వుండాలి- అవుట్ డోర్ లోకేషన్స్ ప్రకాశాన్ని కూడా డీ ఐ తో డీలా పడేట్టు చేశారు. 

హీరోయిన్ కృతీ సానన్ వృత్తి గతంగా మోడలూ కథక్ కళాకారిణీ అయినా,  వెండితెరమీద ఈ సినిమాతో అరంగేట్రం చేసి నటనలోనూ ది బెస్ట్ అన్పించుకుంది. పోసానీ కామెడీ పాత్ర చిన్నదే, విలన్లు నాసర్, ప్రదీప్ రావత్, కెల్లీ దోర్జీలవి అంత శక్తిమంతమైన విలన్ పాత్రలు మాత్రం  కావు. మహేష్ తనయుడు గౌతమ్ నటన ఎలాంటి బెరుకు లేకుండా మంచి ఈజ్ తో వుండడం విశేషం.

స్క్రీన్ ప్లే  సంగతులు 
ఈ సినిమాకి హరిప్రసాద్ కథ నందిస్తే, అర్జున్, తోట శ్రీనులు స్క్రీన్ ప్లే రాసినట్టు టైటిల్స్ లో వేశారు. సరిగ్గా ఇలాటిదే కథ -మానసిక సమస్యలేకుండా, తననెవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారన్న పీడకలలతో- ఒక అసోసియేట్ దర్శకుడు రాసుకుని ఈ సమీక్షకుణ్ణి కలిశాడు. దాన్ని సరిదిద్ది స్క్రీన్ ప్లే రాశాక, ఒక ప్రముఖ హీరోకి విన్పించాడు. ఆ ప్రముఖ హీరో ఇలాటి కథ తమిళంలో అయితే తీస్తారేమోగానీ, తెలుగులో వర్కౌట్ కాదని తేల్చేశారు. 2005  నాటి సంగతి ఇది. ఆ తర్వాత ఆ అసోసియేట్ ఓ తమిళ హీరోకి విన్పించాలని విఫలయత్నం చేశాడు. కొన్నేళ్ళ తర్వాత అందులో పీడకలల యాంగిల్ కూడా తీసేసి పూర్తి స్థాయి కమర్షియల్ యాక్షన్ గా మార్చేశాం. దాంతో మరో అగ్రనటుడి కటాక్షం కోసం ప్రయత్నిస్తున్నాడు ప్రస్తుతం ఆ అసోసియేట్.

ఇప్పుడు 'నేనొక్కడినే' కథేమిటో చూశాక  పైన పేర్కొన్న  ఆ ప్రముఖ నటుడు- ఇలాటి కథ తెలుగులో  వర్కౌట్ కాదని చెప్పడం ఎంత కరెక్టో అర్ధమౌతోంది ! ఆయనకి  ఇలాటి సైకలాజికల్ కథలతో   ఎలాటి 'చిత్తభ్రాంతులూ'  'అనుమానాలూ' లేవేమో-  

కొత్తదనం పేరుతో  ఇలా  బాక్సాఫీసు వ్యతిరేక సినిమాలు తీస్తూ పోతే, అసలే భారీ ఫ్లాపులు మూట గట్టుకుంటున్నఫీల్డు ఇంకా లోతుగా ఊబిలో కూరుకు పోకతప్పదు . కొత్తదనం పేరుతో  జరిగేదేమంటే, నేటివిటీ లేని క్రియేటివిటీని అంట గట్టడమే. స్టయిలిష్ నెస్ పేరుచెప్పుకుని హాలీవుడ్ కథా కథనాలతో తీస్తూపోతే, ప్రేక్షకులు హాలీవుడ్ సినిమాలనే చూడొచ్చు - తెలుగులో వాటి అనుకణలతో పనేముంది!

హాలీవుడ్ దర్శకుడు డాన్ లివింగ్ స్టన్ తన పుస్తకంలో ఒక చోట పేర్కొన్నట్టు- - As the camera rolls and the director watches the scene unfold, the director’s taste must serve as the representative of all the audiences who will ever  see the film – అనేది అదేదో మేధావితనం గా అన్పించుకోవడం కోసం కాదు- సింపుల్ గా సింపుల్ కామర్సే అది- అంతే! బాక్సాఫీసు కాసుల ఘోష...కమర్షియల్ సినిమాకి బాక్సాఫీసే లక్ష్యం కావాలి తప్ప- మేధావులుగా పేరు తెచ్చుకునే ఎలాటి యావా  కాదు. పై దర్శకుడే మరోచోట అన్నట్టు- ‘భావోద్వేగాల్ని ప్రభావితంజేసే  సృజనాత్మక ప్రక్రియే ఆర్టు...ఆ సృజనాత్మక ప్రక్రియకి ప్రేక్షకులు ఉద్వేగభరితులవు తారు, నవ్వుతారు, కన్నీళ్లు పెట్టుకుంటారు, బాగా ఎక్సైటై పోతారు..దర్శకుడనేవాడు తన అభిరుచుల్ని ప్రేక్షకులమీద రుద్దకుండా, ప్రేక్షకులకుండే  సవాలక్ష కోరికలకి తను ప్రతినిధిగా వున్నప్పుడు  చాలావరకూ విజయం సాధిస్తాడు....’

మన స్టైలిష్ మూవీ మేకింగ్ లో ఏం జరుగుతోందంటే, అలాటి ప్రాతినిధ్యమే మాయమై, పై కొటేషన్ లోని ...as the director watches the scene unfold..పదాలు గల్లంతయిపోయి-seen unfold –అవడాన్ని పట్టించుకోడు. దృష్టంతా ఆ scene చుట్టూ భౌతికపరమైన కెమెరా, లైటింగ్, ఆర్ట్  డైరెక్షన్ హంగుల పైనే వుంటుంది. ఇలా తీసి స్టైలిష్ గా తీశామని చెప్పుకుంటారు.

నేనొక్కడినే’ స్క్రీన్ ప్లే చెప్పుకోవడానికైతే సార్వజనీన మూడంకాల (3-act) స్క్రీన్ ప్లే నే అయినా, నిర్వహణ లో బాగా దెబ్బతింది. ప్రారంభించడమే ప్రధాన కథలో కెళ్ళి పోయి పాయింట్ ఎస్టాబ్లిష్ చేసేవరకూ సాగే మొదటి అంకం ముప్ఫై నిమిషాలే తీసుకోవడం అభినందించదగ్గదే. ఈ క్రింది పటం చూడండి-



act -1, act-2, act-3 అనే మూడంకాల స్క్రీన్ ప్లే నిర్మాణంలో కథేమిటో తెలియజేసే act-1 లోని సెటప్ ప్రకారం గౌతమ్ ఎవరు, అతడి సమస్యేమిటి, అతనేం చేయబోతున్నాడనేది చెప్పుకొచ్చారు. హాయిగా అరగంటలో ముగించేసిన ఈ ప్లాట్ పాయింట్ -1 దగ్గర కథ  మలుపు తిరిగి act-2లోకి ప్రవేశించాలి. ఆ మలుపు ఏమిటంటే, మూడోసారి కూడా గౌతమ్ జరగని దాడిని ఊహించుకున్న సందర్భంలో,  పోలీసుల హేళనకి గురై అసలు తానెవరో తెలుసుకోవడానికి గోవా ప్రయాణం కట్టడం.

ఇక్కడ్నించీ act-2 లోకి ప్రవేశించిన  కథా లోకంలో జరిగే బిజినెస్ ఏమిటంటే, పాత్ర తన సమస్య తో లేదా ప్రత్యర్ధితో సంఘర్షించడం- దీన్నే confrontation అంటారు. ఈ సంఘర్షణలో ఎదురు దెబ్బ లుంటాయి-ఎదురుదాడి చేయడం వుంటుంది. ఇంటర్వెల్ దగ్గర కొచ్చేసరికి, సమస్య తీవ్రత పెరిగి మరింత ఇరకాటంలో పెడడమో, లేదా తిరుగులేని సవాలు విసరడమో జరుగుతుంది. ఈ ప్రకారం గౌతమ్ తనని పీడిస్తున్న సమస్యకి కారకుడైన ఒక విలన్ని ఇంటర్వెల్ దగ్గర కాల్చి చంపడం కూడా ఓకే.

విశ్రాంతి తర్వాత act- 2 సెకండ్ పార్ట్ కొచ్చేసరికి కొత్తసమాచారంతో లండన్ వెళ్ళడం, తండ్రి లాకర్ తెరచి ఒక ఫార్ములా స్వాధీనం చేసుకోవడం, ఆ ఫార్ములాకోసం మిగిలిన ప్రత్యర్ధులు వెంటపడ్డంతో ప్రారంభమై ప్రధాన విలన్ (నాసర్)ని కనుగొనడంతో act-2 ముగుస్తుంది. ఇక act -3 లో క్లైమాక్స్ ప్రారంభమౌతుంది...ఇక్కడ ప్రధాన విలన్ తో తన తల్లి దండ్రుల గురించిన సమాచారంకోసం బేరసారాలు కుదరక అతన్ని చంపేయడంతో ముగుస్తుంది. ఇక తల్లిదండ్రులు ఎవరనే అన్వేషణతో కొనసాగి శుభం కార్డు పడే వరకూ సుదీర్ఘంగా జరిగేదంతా  ఉపసంహారమే!

అదే అంకం అదే బిజినెస్సూ!
సమస్య ఎక్కడొచ్చిం దంటే, మొదటి అంకంలో గౌతమ్ మానసిక సమస్య చెప్పేసి  పరిష్కారానికి గోవా దారి పట్టించాక,  రెండో అంకంలో పదేపదే ఆ సమస్యనే ( చిత్తభ్రాంతులు - hallucination) రిపీట్ చేసి, ఏ సంఘటన నిజమో ఏ సంఘటన అబద్ధమో తెలీని కన్ప్యూజన్లో ఆడియెన్స్ ని పడేస్తూ- గౌతమ్ క్యారక్టర్ ని అపహాస్యం పాల్జేశారు. రెండో అంకంలో జరగాల్సిన బిజినెస్ అది కాదు. ఇక్కడ జరగాల్సిన బిజినెస్ సమస్యతో పోరాటం- రెండో అంకంలో గౌతమ్ గోల్ మొదటి అంకం ముగింపులో ఎష్టాబ్లిష్ చేసినట్టు- తానెవరో, తన గతం ఏమిటో తెలుసుకునేందుకు జరపబోయే అన్వేషణ ! రెండో అంకంలో తను సంఘర్షిస్తే ఈ గోల్ కోసం సంఘర్షించాలే తప్ప, ఇంకా తన మొదటి అంకంలో చెప్పేసిన తన మానసికసమస్యతో కాదు. ఈ విధంగా కథ మీద ఫోకస్ కోల్పోయి, మొదటి అంకం బిజినెస్ ని రెండో అంకంలో కూడా చొరబెట్టి దాన్నే  క్లైమాక్స్ వరకూ లాగుతూ పోవడం వల్ల, సువిశాలమైన రెండో అంకం ఏరియా అంతా  కథన భంగం కలిగి గందరగోళం ఏర్పడింది. కథ బుర్ర కెక్కడం కష్టసాధ్య మైపోయింది.

పోనీ ప్రధాన విలన్ తో క్లైమాక్స్ అయినా ఎందుకు బలంగా లేదంటే -  కారణం, మొదటి అంకం ముగింపులో గౌతమ్ సమస్యని బలంగా ఎస్టా బ్లిష్  చేయకపోవడం వల్లే! ఎప్పుడైతే మొదటి అంకం ముగింపులో సమస్యని (పాయింటుని) దృశ్య రూపంలో ప్రభావవంతంగా ఎష్టాబ్లిష్ చేయ్యమో, అప్పుడు క్లైమాక్స్ కూడా బలహీనంగా, పేలవంగా  వస్తుంది. మొదటి అంకం ముగింపులో గోవా ప్రయాణం కట్టడానికి చిత్తభ్రాంతుల కారణమే చెప్పినా, అప్పుడు జరిగిన సంఘటన అంతకు మునుపు జరిగిన వాటికి భిన్నంగా ఏమీ లేదు. మార్పేమీ లేదు. ఇంకేదో అఘాయిత్యం లాంటి బలమైన సంఘటన జరిగి- చట్టానికి దొరక్కుండా పారిపోయే పరిస్థితి లాంటిది ఏర్పడితేనే బలమైన మలుపు అన్పించు కుంటుంది. ఏ స్క్రీన్ ప్లే కైనా ప్లాట్ పాయింట్-1, ఇంటర్వెల్, ప్లాట్ పాయింట్-2 లు మూలస్తంభాల్లాంటివి. వీటిని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటే తప్ప కథకి న్యాయం జరగదు.

ఈ లోపాలన్నీ టైం అండ్ టెన్షన్ థియరీని కూడా నాశనం చేశాయి. ఈ క్రింది పటం కూడా చూడండి...

 సినిమారీలు తిరిగే టైము గడుస్తున్న కొద్దీ కథలో టెన్షన్ పెంచుకుంటూ పోవాలి. అప్పుడే ప్రేక్షకులు సీట్లకి అతుక్కుపోతారు. ఆద్యంతం అన్ని అంకాల్లో అదే మొదటి అంకం బిజినెస్సే  నడుస్తూ కథనం మన్నుతిన్న పాములా పడుంటే  ఇంకా టెన్షన్ అనే మాట ఎక్కడ్నుంచి వస్తుంది?

పైగా ఎడాపెడా మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులతో, చిన్ననాటి మాంటేజెస్ తో, జరుగుతున్న కథ ఫలానా ఈ ఈ  విధంగా జరిగిందంటూ ఎక్స్ పొజిషన్ లతో- వర్తమాన కథకి టెన్షన్ అనే కాన్సెప్ట్ లేకుండా చేశారు. కథకుడికి కథమీద స్పష్టత లేనప్పుడే మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులకి పాల్పడతారని స్క్రీన్ ప్లే పండితుల నిర్ధారణ. మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులవల్ల చెప్పాలనుకుంటున్న అసలుకథ ఎక్కడేసిన గొంగళిలా పడుంటుంది.

పాత్ర చిత్రణ వైచిత్రి
మహేష్ బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన గౌతమ్ పాత్ర వాస్తవానికి చేష్టలుడిగిన ప్యాసివ్ పాత్ర. అది గొప్ప హీరోయిజం తో కూడిన యాక్టివ్ పాత్ర కావాలంటే, ఆ మూడంకాల్లో ఏ అంకం బిజినెస్ ఆ అంకంలో స్పష్టంగా జరగాలి. అప్పుడు మానసిక సమస్య అనే మొదటి అంకపు అంతర్గత ఎమోషనల్ స్ట్రగుల్ పదేపదే కథకి అడ్డు పడకుండా (పాత్ర ప్యాసివ్ గా అపహాస్యం గాకుండా) అసలు గోల్ కోసం పోరాడాల్సిన బహిర్గత ఫిజికల్ స్ట్రగుల్ తో యాక్షన్ లో కొచ్చి, పరిస్థితిని తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ జైత్రయాత్ర కొనసాగించే వీలుంటుంది. హీరోయిజం ఉట్టిపడుతుంది. ఎంతసేపూ ఊహాలోకంలో తనమీద దాడుల్ని పదేపదే తిప్పికొట్టడం హీరోయిజం అన్పించుకోదు. అది యాక్టివ్ గా వుండడం కాదు, రియాక్టివ్ గా నిస్సహాయంగా ఉండిపోవడం. జ్యూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ లో ఇలాగే ఆ పాత్ర విలన్ జరిపే దాడుల్ని తిప్పి కొట్టడమే ( రియాక్టివ్ గా) నిగా పెట్టుకుంటుంది తప్ప, ఆ విలన్ ని ట్రాప్ చేసి తనే దాడులు ప్రారంభించే  ప్రారంభించే యాక్టివ్ పాత్రగా ఎప్పటికీ మారదు!
మహేష్ బాబు పాత్ర తన తల్లి దండ్రులు హత్యకి గురయారన్న బాధతో చివరంటా ఎంతో ఎమోషన్ పండించాడని అనుకోవడం కూడా భావ్యం కాదు. అసలా తల్లిదండ్రులు ఎలా, ఎందుకు చనిపోయారో ముందే చెప్పేసి వుంటే పాత్ర మీద నిజమైన సానుభూతి ఏర్పడే అవకాశం వుండేది. ఆ తల్లి దండ్రులకీ, మహేష్ బాబు పాత్రకీ జరిగిన అన్యాయమేంటో మనకు తెలియకపోతే ఎలా మనసులోతుల్లోంచి సానుభూతి ఫీలవుతాం?

 అమీర్ ఖాన్ నటించిన ‘ధూమ్-3’ లో, మొదటి పది నిమిషాల్లో అతడి చిన్నప్పుడు బ్యాంకు వాళ్ళ దురుసుతనం వల్ల  సర్కస్ కంపెనీ మూతపడే పరిస్థితేర్పడి, తండ్రి ఆత్మహత్య చేసుకోవడం కళ్ళారాచూసిన తను, ఆ బ్యాంకు మీద పగ దీర్చుకోవాలన్న దయనీయ బ్యాక్ డ్రాప్ ఏర్పడి,  ఆసాంతం ఎనలేని సానుభూతి పొందుతూ వుంటాడు.

మహేష్ బాబు పాత్ర పేరెంట్స్ ఎందుకు హత్యకి గురయ్యారో క్లైమాక్స్ వరకూ దాచిపెట్టడంవల్ల పాత్ర పడుతున్న బాధలకి  అర్ధం లేకుండా పోయింది.

ఇంకా లాజిక్కొస్తే, తన పేరెంట్స్ ఐడెంటిటీ కోసం గోల్ తప్ప,  దాని దారీ తెన్నూ తెలీని ఈ అడ్డగోలు ప్రయాణమంతా ఎందుకు? ఒక పేరుపొందిన రాక్  సింగర్ గా తను ఆనాటి పోలీస్ రికార్డులన్నీ పరిశీలించడానికి అవకాశం ఎప్పుడూ వుంటుంది. ఆ ఫైళ్ళతో తల్లి దండ్రులెలా ఉంటారన్న జిజ్ఞాసతో బాటు, కేసు వివరాలన్నీ తెలిసిపోతాయి కదా? ఇంత  సింపుల్ గా తేలిపోయే కథకి ఈ కన్ఫూజనంతా ఎందుకు?

ముగింపు- ఉపసంహారం విషయానికొస్తే- గతించిన తల్లిదండ్రుల ఉనికిని కనుగొనడం, ఆ ఫోటోలు చూసుకుని దుఖించడం వంటి సుదీర్ఘ సన్నివేశాలన్నీ ముగింపులో వచ్చి వుండకూడదు. విలన్ని చంపే ముందే వచ్చి వుంటే సింపతీ కోషేంట్ బాగా వర్కౌటయ్యేది. ఈ ఎపిసోడ్లు తారుమారు చేయడంవల్ల కథ ముగిశాక కూడా ఈ బోరేమిటనే ఫీలింగ్ ఏర్పడేది కాదు.

చివరగా- నిడివి ఇరవై నిమిషాలు కత్తిరించారని తాజా వార్త. ఇది టాక్ వెళ్ళిపోయాక విజయావకాశాల్ని పెంచుతుందా? ఏమో!

-సికిందర్