రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, డిసెంబర్ 2016, శనివారం

Year ending Review!








రచన -దర్శకత్వం : సాగర్ కె. చంద్ర

తారాగణం: శ్రీవిష్ణు, నారా రోహిత్‌, తాన్యా హోప్‌, బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను, రాజీవ్‌ కనకాల, అజయ్‌, సత్యప్రకాష్‌, సత్యదేవ్‌, రవివర్మ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: నవీన్‌ యాదవ్‌
బ్యానర్‌
: అరన్‌ మీడియా వర్క్స్‌
నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్‌
విడుదల : 30 డిసెంబర్, 2016
***
        మొత్తం మీద తెలుగు సినిమా ఒక కొత్త చరిత్ర రాసుకుంది. నానాటికీ దిగదుడుపుగా తయారవుతున్న చిన్న సినిమాల ప్రతిష్టా సత్తా రాబడీ రుచి అసలేమిటో చూపించింది. చిన్న సినిమాలకి కంటెంట్ –డిఫరెంట్ మేకింగ్ ఈ రెండే పెట్టుబడి అంటే వినకుండా పెద్ద సినిమాల్ని చూసి పగటి వేషాలేస్తున్న చిన్న సినిమాలకి  గట్టి జవాబే చెప్పింది. ఈ సంవత్సరం యాభై ఒక్క  చిన్న సినిమాలు విడుదలైతే, రెండు తప్ప అన్నీ ఫ్లాపులు మూటగట్టుకున్నవే. ఇప్పుడు ‘అప్పట్లో ఒకడుండే  వాడు’ ఈ సంవత్సరానికి సైన్ అవుట్ చేస్తూ,  కొత్త సంవత్సరంలో సైన్ ఇన్ చేసే చిన్న సినిమాలకి సవాలు విసురుతోంది- కంటెంట్ వైపా? కుంటినడకల వైపా? రెండో వైపే వుంటే-  They will be declared OUT LAWS!

       నారా రోహిత్ ఏ పోటీలూ వాతలూ పెట్టుకోకుండా తన మానాన తాను ఐదారు సినిమాలు వినమ్రంగా చేసుకుపోయే డిఫరెంట్ మైండ్ సెట్ వున్న వాడు. తన మైండ్ సెట్ తో వచ్చే దర్శకులకి ద్వారాలు తెరిచే వాడు. టాలీవుడ్ లో ఒక్కడైనా ఇలా వున్నందుకు అధునాతనం వైపు చూసే దర్శకులకి అదృష్టమే. ‘అయ్యారే’ అనే కామెడీ తీసిన దర్శకుడు సాగర్ చంద్ర ఒకేసారి రియలిస్టిక్ సినిమావైపు మరలడం విజ్ఞతే. చిన్న సినిమాల కథలు పెద్ద సినిమాల్లోంచి పుట్టవు- చుట్టూ వున్న ప్రపంచంలోంచి పుడతాయి. అలాటి ఒక స్థానిక ప్రపంచాన్ని తన బడ్జెట్ సినిమాలో ఆవిష్కరించాడు-  ఈ ఆవిష్కరణతో తెలుగు సినిమానే చూస్తున్నామా అన్నంత ఆశ్చర్య చకితుల్ని చేస్తూ. 

      ‘అప్పట్లో ఒకడుండే వాడు’  సర్ప్రైజ్ గిఫ్ట్ శ్రీ విష్ణు కూడా. థియేటర్లో - టాప్ యాక్షన్, టాప్ యాక్షన్- అని ప్రేక్షులు అరిచేంత. ఇలాటి అతి సామాన్య క్యారెక్టర్లు బజార్లో  చాలా మంది కన్పిస్తూంటారు. యంగ్ హీరోలు మాస్ పాత్రలు వేయలా? అయితే ఇలా శ్రీ విష్ణులా  కన్పిస్తే చాలు, ప్రేక్షకుల్ని బతికించిన వాళ్ళవుతారు. అపురూపమైన నోట్లతో టికెట్లు కొంటున్న ప్రేక్షకుల్ని ఎలా కదలకుండా కూర్చోబెట్టి సినిమా చూపించవచ్చో- కడుపు నిండా తృప్తితో పంపవచ్చో ఈ మీడియం రేంజి ప్రయోగాన్ని చూస్తే చాలు. 

          1990 లలో అప్పటి రాష్ట్రంలో నక్సలిజం సమస్యగానే వుంది. కేంద్ర ప్రభుత్వమేమో ఇందిరా గాంధీ సోషలిజం నుంచి  గ్లోబలైజేషన్ వైపు పయనిస్తోంది  పీవీ నరసింహారావు- మన్మోహన్ సింగ్ ల లెక్కపత్రాలతో. ఇది నక్సల్ ఉద్యమానికి చేటు అని అప్పటి నక్సలైట్లు గ్రహించారో లేదో గానీ,  ఈ సినిమాలో దర్శకుడు నక్సల్స్  నుద్దేశించి ఇన్స్ పెక్టర్ చేత ఈ తెలివైన ప్రశ్నే వేయిస్తాడు- గ్లోబలైజేషన్ లో నక్సలిజం ఏంటని. 

          నక్సల్ కూంబింగ్ ఆపరేషన్స్ స్పెషల్ పార్టీ ఇన్స్ పెక్టర్ అయిన ఇంతియాజ్ అలీ (నారా రోహిత్) ఒక వితండవాది. యుద్ధంలో కెళ్తే  రూల్స్ వుండవంటాడు. అంతమాత్రాన అవినీతి పరుడైన ఎన్ కౌంటర్ స్పెషలిస్టు కాదు, తన రూల్స్ తో నకిలీ ఎన్ కౌంటర్లని కూడా సమర్ధించుకునే నిజాయితీ పరుడైన ఎన్ కౌంటర్ స్పెషలిస్టు. పరాయి సొత్తుని తాకడం ‘హరామ్’ అనుకుంటాడు. అలాటి ఇతడి కన్ను క్రికెట్ లో ఎదగాలనుకుంటున్న రాజు (శ్రీ విష్ణు) మీద పడుతుంది. కారణం,  ఇతడి అక్క నక్సల్ దళంలో వుంది. ఈ నక్సల్ దళం ఒక పోలీస్ ఉన్నతాధికారిని హతమార్చింది. ఇంతియాజ్ అడవిలో కెళ్ళి ఎన్ కౌంటర్ చేయబోతే పారిపోయిందామె. ఆమె గురించిన సమాచారం కోసం  ఏమీ తెలీని అమాయకుడు, క్రికెట్ లో పేరు సంపాదించుకుని, ప్రభుత్వోద్యోగంలో కుదిరి, ప్రేమిస్తున్న నిత్య ( తాన్యా హాప్) అనే అమ్మాయిని శుభ్రంగా పెళ్లి చేసుకుని, హాయిగా స్థిర పడాలని కలలు గంటున్న రాజు మీద తన పోలీసు డేగ కన్నేస్తాడు ఇంతియాజ్. బాగా టార్చర్ చేస్తాడు. 

          ఇలా ప్రారంభమయ్యే  వీళ్ళిద్దరి వైరం అనేక మలుపులు తిరుగుతుంది. రాజు జీవితంకూడా నాశనమై హత్యా నేరం మీద పడి,  తనే ఒక పెద్ద రౌడీగా హైద్రాబాద్ ని కంట్రోల్ చేసే స్థాయికి  ఎదుగుతాడు...పోలీస్- క్రిమినల్ ఈ ఇద్దర్లో ఎవరో ఒకరు గెలవాలి. పోలీస్ పాత్ర ఓడిపోయే అవకాశం లేని ఎడ్జ్ దర్శకుడు ఇచ్చాడు- అడ్డగోలు తనం  వ్యక్తే  అయినా నిజాయితీ పరుడంటూ. అప్పుడు క్రిమినల్ అంతమవ్వాలి. రాజు ఎలా అంతమయ్యాడు- అతడి కథ ఎలా ముగిసిందన్నది ఇంకా పవర్ఫుల్ క్లయిమాక్స్. ఈ ముగింపు సినిమాకి అతి పెద్ద ఎస్సెట్. 

        రాజు పాత్ర కల్పిత క్రిమినల్ పాత్రేమోగానీ, చూస్తూంటే మాత్రం అప్పట్లో కూకట్ పల్లిలో మకాం వేసి బెదిరింపులు, భూదందాలూ చేసిన నక్సల్ సమ్మయ్య గుర్తుకొస్తాడు. సమ్మయ్య శ్రీలంక పారిపోయి అక్కడి విమానాశ్రయంలో చనిపోయాడు. రాజు పాత్రని కూడా ఇంకో పాత్ర మలేషియా వెళ్లి పొమ్మంటుంది!  

          దర్శకుడు రెండు విషయాల్లో తప్ప మిగతా అంతా సహజత్వానికే చోటిచ్చాడు. క్రిమినల్ హీరో, హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం, ఆమె ఆందోళనతో గడపడం, పెళ్లి రోజు అనే ఒక సందర్భం, పాట ఇవన్నీ – చాలాచాలా ఫార్ములా సినిమాల్లో వచ్చేసినవే. కథాకాలం 90 లలోనే అయినా,  ఈ ‘పెళ్లి రోజు- దాని పాట’ అనే పాత చాదస్తం ఫార్ములా బదులు ఇంకేదో చేసి వుండాల్సింది. అలాగే ముస్లిం అని తెలియడానికన్నట్టు ఇన్స్ పెక్టర్  ఇంతియాజ్ అలీ పాత్ర ఆహార్యం కూడా  ముస్లిం పాత్రల్ని అలా ఎస్టాబ్లిష్ చేయడం నేర్చుకున్న మూస ఫార్ములా సినిమాల రొడ్డ కొట్టుడు పోకడే. పైజమా, జుబ్బా తగిలిస్తే పాత్ర ముస్లిం అయిపోతుందన్నట్టు యూనిఫాంలో లేనప్పుడు నారా రోహిత్ ని ఇలా చూపించడం ఓల్డ్ లుక్ నిచ్చింది-70 లనాటి షేర్ ఖాన్ పాత్ర దిగివచ్చినట్టూ. నారాకి క్యాజువల్ డ్రెస్సింగ్ ఇస్తే పాత్ర తాలూకు కాఠిన్యం  బాగా ఎలివేట్ అయ్యేది. చీటికీ మాటికీ ఓ డిజైనర్ పైజమా జుబ్బా  వేయడం వలన పాత్ర చిత్రణ దెబ్బ తినిపోయింది కూడా. అతను నిజాయితీ పరుడే గానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాడు.  ఇది పైకే చెప్పుకుంటున్నాడు. అలాంటప్పుడు - నేనెంత సాత్వికుణ్నో చూడండి- అన్నట్టు పైజమా జుబ్బా వేసుకు తిరగడం అతి అన్పిస్తుంది. అది అలాటి పోలీస్ మెంటాలిటీ కాదు. 

          శ్రీ విష్ణు పాత్ర కూడా సెకండాఫ్ లో చెప్పిన పని చెయ్యలేదు. తను పవర్ఫుల్ క్రిమినల్ గా  ఎదిగి, ఇన్స్ పెక్టర్ సస్పెండై మూడు నెలల్లో తిరిగి వస్తాననప్పుడు – నీ మీద ఇంకా కేసులేస్తూ తిప్పుతానన్న శ్రీవిష్ణు రాజు పాత్ర,  ఆ ఊసే ఎత్తకుండా వుంటాడు.  తను ఆ పని చేస్తూ వుంటే మళ్ళీ ఇన్స్ పెక్టర్ డ్యూటీలో కొచ్చి తన పని పట్టేవాడు కాదుగా? అలా తిరిగి వచ్చిన ఇన్స్ పెక్టర్ ముందు తను పిల్లిలా  అయిపోయేవాడు కాదుగా?

          ఇంకో కీలకమైన చోట కూడా దర్శకుడు కాంప్రమైజ్ అయ్యాడు. దీంతో హీరోయిన్ పాత్ర కిల్ అయ్యింది. భర్త రాజు ఎన్ కౌంటర్ అయ్యాడని తెలిసీ ఆమె రైలెక్కి ఎలా వెళ్ళిపోతుంది?  భర్త మృత దేహం కోసం వెళ్తే తనని కూడా పట్టుకుంటారనా?  లేక  ఆమె వెళ్లి భర్త డెడ్ బాడీ క్లెయించేస్తే  అనుకున్న క్లయిమాక్సే వుండదనా? నిజమే,  ఒక భార్యగా భర్త శవాన్ని వదిలేసి వెళ్ళిపోదు ఆమె-  కానీ శవాన్ని తీసుకుంటే కథకి ఆ ‘పవర్ఫుల్’ ముగింపు రాదు! క్యాచ్ -22 సిట్యుయేషన్ లో పడ్డాడు దర్శకుడు. దీన్ని సహేతుకంగా పరిష్కరించుకుని అనుకున్న విధంగానే కథని ‘పవర్ఫుల్’ గా – ఇంతవరకూ ఏ తెలుగు సినిమాల్లోనూ రాని విధంగా ముగించి వుండాల్సింది.

          సినిమాకి నేపధ్య సంగీతం చాలా బలాన్నిచ్చింది. అలాగే కెమెరా వర్క్ కథ డిమాండ్ చేస్తున్న మూడ్ ని బాగా క్రియేట్  చేసింది. బలహీనంగా మారింది యాక్షన్ డిపార్ట్ మెంటే. ఏ యాక్షన్ సీనూ పవర్ఫుల్ గా లేదని చెప్పడానికి విచారించాల్సి వస్తోంది- పోలీస్ ఉన్నతాధికారి మీద నక్సల్స్ ఎటాక్ చేసి చంపడం, ఇన్స్ పెక్టర్ అడవిలో  ఎన్ కౌంటర్ చేయడం, శాంతి దూతల ముందు సన్నివేశంలో కాల్పులూ – ఇలా ఏది తీసుకున్నా పేలవంగా వున్నాయి. పాత్రలు ఈ యాక్షన్ దృశ్యాల్లో సరైన యాక్షన్ లోవుండక- కొన్ని చోట్ల నిలబడి చూస్తూ గుళ్ళ దెబ్బలు తింటాయి. ఇక ఎక్కడా పిస్తోలు పేలినా, రైఫిల్ పేలినా, ఎల్ ఎంజీ  దడ దడ మన్నా వాటి  సౌండ్ ఇంపాక్టే వుండదు- బాణసంచా కాల్చుకుంటున్నట్టు నీరసంగా వుంటుంది. ఓకే ఒక్క చోట క్లయిమాక్స్ కి ముందు – నారా రోహిత్ శ్రీవిష్ణు మీద కాల్చినట్టు స్క్రీన్ బ్లాంక్  చేసి షాట్ విన్పించినప్పుడు- అది హాలీవుడ్ రేంజిలో మార్మోగింది! ఇదే అన్ని చోట్లా వుండాల్సింది.  ఇదసలే షాక్ వేల్యూ వున్న కొత్త తరహా కథ. 

          ఇలాటి టెక్నికల్, రైటింగ్ లోపాలు కూడా లేకుండా చూసుకుంటే ఎవరూ వేలెత్తి చూపడానికి వీలుండదు- ఇది దర్శకుడి క్వాలిటీతో  కూడుకున్న ప్రొఫెషనల్ రైటింగ్ తో బాటు,  ప్రొఫెషనల్ మేకింగ్ కూడా కాబట్టి. ఇదలా వుంచితే,   ఈ సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ ఒక మర్చిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చింది ‘అప్పట్లో ఒకడుండే వాడు’- చిన్న సినిమాలకి ఒక ట్రెండ్ ని సెట్ చేస్తూ. ఇక
OUT LAWS ఉండకూడదని ఆశిస్తూ!

-సికిందర్
http://www.cinemabazaar.in