రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, నవంబర్ 2022, ఆదివారం

1250 : రివ్యూ!


 (దేశవిదేశ పాఠకులందరికీ నమస్కారం. సినిమాలు చూస్తూనే వున్నా రాయాలంటే రైటర్స్ బ్లాక్ లాంటిది అడ్డుపడి ఇప్పుడు రిలీజ్ చేసింది. ఇక నుంచి రెగ్యులర్ గా ఆర్టికల్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ రోజు మసూద రివ్యూ, రేపు స్క్రీన్ ప్లే సంగతులు అందుకోండి!)

రచన- దర్శకత్వం : సాయికిరణ్
తారాగణం : సంగీత, బాంధవీ శ్రీధర్, తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్, అఖిలా రామ్, శుభలేఖ సుధాకర్, సత్యప్రకాష్, సత్యం రాజేష్, తదితరులు.
సంగీతం : ప్రశాంత్ విహారి, ఛాయాగ్రహణం బి. నగేష్ 
బ్యానర్ : స్వధర్మ్ ఎంటర్ టైమెంట్స్
నిర్మాత : ఎన్ రాహుల్ యాదవ్
విడుదల : నవంబర్ 18, 2022
***
          ళ్ళీ రావా’, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే రెండు హిట్లు తీసిన నిర్మాత రాహుల్ యాదవ్ మూడో ప్రయత్నం మసూద హార్రర్ జానర్లో ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు ముందు కొచ్చింది. హార్రర్ సినిమాలు చూసి భయపడే ప్రేక్షకులింకా వున్నారా అంటే లేరనే చెప్పేంతగా హార్రర్ కామెడీలు హాస్యమాడాయి. ఈ పరిస్థితిలో ఒక సీరియస్ హార్రర్ తీసేందుకు సాహసం కావాలి. మసూద తీసిన కొత్త దర్శకుడు ఈ సాహసం చేశాడు. మసూద చూసిన కొందరు వర్ధమాన దర్శకులు నిజంగా భయపడ్డామని కితాబు  నిచ్చారు. మళ్ళీ పాత రోజుల్ని గుర్తు చేసేలా ఈ హార్రర్ అంత భయపెట్టించేలా వుందా? ఈ విషయం పరిశీలిద్దాం...

కథ

హైదరాబాద్ లో లో నీలం (సంగీత) ఒక సైన్స్ టీచర్. డబ్బుల కోసం వేధించే భర్త అబ్దుల్ (సత్య ప్రకాష్‌) కి దూరంగా వుంటూ కూతురు నాజియా(బాంధవి శ్రీదర్) ని చదివించుకుంటూ వుంటుంది. పక్క ఫ్లాట్ లో వుండే సాఫ్ట్ వేర్ గోపీ (తిరువీర్) ఈ తల్లీకూతుళ్ళకి సహాయంగా వుంటాడు. ఆఫీసులో మినీ (కావ్యా కళ్యాణ్ రామ్) ని ప్రేమిస్తాడు. ఒక రోజు నాజియా వింతగా ప్రవర్తిస్తుంది. దెయ్యం ఆవహించినట్టు అన్పించే సరికి భయపడి హాస్పిటల్ కి తీసికెళ్తారు నీలం, గోపీ. నీలం కి ఎవరో పీర్ బాబా గురించి చెప్పడంతో సైన్స్ టీచర్ అయిన తను, తాంత్రిక విధ్యల్ని నమ్మాల్సి వచ్చి పీర్ బాబా(శుభలేఖ సుధాకర్) కి కూతుర్ని చూపిస్తుంది. నాజియాని మసూద అనే ప్రేతాత్మ ఆవహించినట్టు పసిగట్టిన పీర్ బాబా- మసూద ఎవరో తెలుసుకోమని గోపీని పురమాయిస్తాడు. గోపీ చిత్తూరు దాకా వెళ్ళి మసూద అలియాస్ మసూదాబీ గురించి ఆరా తీస్తే, కొన్ని భయంకర నిజాలు తెలుస్తాయి.

ఎవరీ మసూదాబీ? చిత్తూరు జిల్లాలోని ఆ గ్రామంలో కొచ్చి ఎందుకు మీర్ తాజ్ అనే వ్యవసాయ దారు ఉమ్మడి కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది? ఆమెకి హైదరాబాద్ లో నాజియా కేం సంబంధం? ఆమె ప్రేతాత్మని తుదముట్టించేందుకు పీర్ బాబాతో, నీలంతో  కలిసి గోపీ చేసిన ప్రాణాంతక సాహసాలేమిటి? ఇవన్నీ మిగతా కథలో తెలుసుకోవచ్చు. 

ఎలావుంది కథ

హార్రర్ సినిమాలంటే భయంపోయేలా హార్రర్ కామెడీలొచ్చి హాస్యమాడాయి ఇంత కాలం. మళ్ళీ సీరియస్ హార్రర్ తిరిగి వచ్చి భయపెట్టేందుకు థియేటర్స్ లో రెడీగా వుంది. ముస్లిం చేతబడి కథ కావడంతో పూర్తిగా కొత్తదనాన్ని ఫీలయ్యేలా చేసే మసూదకొత్త దర్శకుడే తీశాడా అన్నట్టుగా వుంది టెక్నికల్ గానూ. దీన్ని చూసి భయపడినట్టు చెప్పుకున్న వర్ధమాన దర్శకుల మాట నిజమే. మళ్ళీ ఇరవై ఏళ్ళ క్రితం మహేష్ భట్ తీసిన హిందీ రాజ్ (రహస్యం) సూపర్ హిట్ సీరియస్ హార్రర్ ని గుర్తు చేసేలా వున్న మసూద –కథాకథనాల రీత్యా  ముస్లిం పాత్రలతో పూర్తి స్థాయి చేతబడి నేపథ్యంతో కొత్తదనాన్ని సంతరించుకోవడంతో-  దీనికి పానిండియాకి వెళ్ళగల అర్హతలు కూడా వుండొచ్చు.

ఐతే నిడివి అతిగా వుంది రెండు గంటలా 40 నిమిషాలూ. ఫస్టాఫ్ గంటకే ముగించినా సెకండాఫ్ గంటన్నరకి పైగా లాగారు. ఫస్టాఫ్ నీలం- నాజియా- గోపీ- మినీల సాధారణ జీవితం, ఇందులో గోపీ- మినీల లవ్ ట్రాక్, తర్వాత నాజియాకి ప్రేతాత్మ ఆవహించడంతో కథ మొదలవుతుంది. మధ్యలో లవ్ ట్రాక్ అనేది అంతగా బావుండదు. ఇక ఫ్రేతాత్మ ఆవహించాక కూడా కథ ఇంకో మలుపు తీసుకోకుండా ఇంటర్వెల్ వరకూ కేవలం ప్రేతాత్మతో భయపెట్టే సీన్లే రిపీటవుతూంటాయి. ఇంటర్వెల్లో కూడా ప్రేతాత్మ భయపెట్టే ఇంకో రిపీట్ సీనుతోనే సాదాగా వుండి తేలిపోతుంది.

సెకండాఫ్ ప్రారంభంలో కథ ఇంకో మలుపు తీసుకుని, మసూదాబీ హార్రర్ ఫ్లాష్ బ్యాక్ తో భయపెట్టడం మొదలెడుతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో చిత్తూరు జిల్లా గ్రామంలో మంత్రగత్తె మసూదాబీ చేతబడి ఘోరాలు ఇదివరకు వచ్చిన సినిమాలకి భిన్నంగా, బీభత్సంగా వుంటాయి. ఫ్లాష్ బ్యాక్ తర్వాత పీర్ బాబా -నీలం, గోపీలకి ఒక చాదర్ ఇచ్చి, మసూదాబీ కంకాళం మీద కప్పమనే విరుగుడు మంత్రంతో సుదీర్ఘ క్లయిమాక్స్ మొదలవుతుంది.

ఈ క్లయిమాక్సే హద్దులు దాటి సాగుతూ సాగిపోతూ వుంటుంది. బీభత్స భయానక రసం అదేపనిగా ఎక్కువైపోతే భయపెట్టడం పోయి విసుగుపుట్టించే ప్రమాదం కూడా వుంది. నటనలు, కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అత్యంత ప్రభావశీలంగా వుండడంతో ఈ ప్రమాదం కాస్త తప్పిందనుకోవాలి. అయినా ఎడిట్ చేసి 20 నిమిషాలు తొలగిస్తే బెటర్.

నటనలు- సాంకేతికాలు

హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించి క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిన సంగీత -తల్లి పాత్రలో నటన, ఎక్స్ ప్రెషన్స్, కూతురి కోసం స్ట్రగుల్, పక్క ఫ్లాట్ గోపీతో బాండింగ్, అతడితో కలిసి చిత్తూరు అడవుల్లో నైట్ పూట క్లయిమాక్స్- ప్రతీ చోటా దృష్టి నాకర్షిస్తుంది.

కూతురుగా బాంధవీ శ్రీధర్ ప్రేతాత్మ ఆవహించిన హార్రర్ సీన్లు, క్లయిమాక్స్ లో అందర్నీ చంపుతూ చేసే బీభత్సం టెర్రిఫిక్ గా నటించింది. గోపీగా తిరువీర్ అమాయకుడిగా, భయస్థుడిగా ఫస్టాఫ్ లో పాత్ర అంతగా లేకపోయినా- సెకండాఫ్ లో కథని తానే డ్రైవ్ చేసే యాక్టివ్ పాత్రగా మారిపోతాడు. మాస్ హీరోయిజాలు లేని సహజ నటనతో ఆకట్టుకుంటాడు. ఇంకా చిత్తూరు జిల్లా గ్రామంలో ఉమ్మడి కుటుంబంలోని ముస్లిం పాత్రలూ, హైదరాబాద్ లో పీర్ బాబా హవేలీ లోని ముస్లిం పాత్రలూ తెలుగు సినిమాకి కొత్త బ్యాక్ డ్రాప్ నిస్తాయి.

ఇక టక్ చేసుకుని వుండే మోడరన్ పీర్ బాబాగా శుభలేఖ సుధాకర్, అసిస్టెంట్ అల్లావుద్దీన్ గా సత్యం రాజేష్ కూడా పాత్రల్లో బలం లేక సాధారణంగా కన్పిస్తారు. అయితే క్లయిమాక్స్ లో పీర్ బాబా ప్రత్యక్షంగా పాల్గొనకుండా చాదర్ ఇచ్చి నీలం, గోపీలని పంపేసి వూరుకోవడం, ఎక్కడో నమాజు చేయడం ద్వారా ప్రేతాత్మని అంతమొందించా లనుకోవడం ఏ మాత్రం కుదర్లేదు. నీలం- గోపీలే ప్రాణాలకి తెగించి చాదర్ కప్పి ప్రేతాత్మని అంతమొందిస్తారు.

ఇక మసూదాబీగా నటించిన అఖిలారామ్ కి అందరి కంటే ఎక్కువ ప్రశంసలు దక్కుతాయి. దెయ్యంగా మొహంలో చూపించిన భావాలు ల్యాండ్ మార్క్ ఎక్స్ ప్రెషన్స్ గా నిలుస్తాయి. అయితే బురఖాలో వున్నప్పుడు డూప్ ని వాడినట్టు ఎత్తుగా, బలిష్టంగా కన్పిస్తుంది. పది మందిని ఫైట్ లో విరగదీస్తుంది కూడా. అఖిలారామ్ ని చూస్తే ఈ రేంజి ఫైట్ ఆమెకి సాధ్యం కాదు. అసలు బురఖాలో వున్నది మేల్ ఆర్టిస్టో- లేదా ఫైటరో అయివుండాలి.

చవకబారు తనం లేకుండా రిచ్ విజువల్స్, టైట్ గ్రాఫిక్స్, స్లిక్ ఎడిటింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్ తో సౌండ్ డిజైన్, నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ మాత్రం కళ్ళు తిప్పుకోకుండా చేస్తాయి. అయితే 80 శాతం షూట్ చేశాక, నచ్చక రీషూట్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే స్క్రిప్టు కూడా మార్చుకుని వుండాల్సింది. ఇది మామూలు సీరియస్ హార్రర్ కాదు- హార్డ్ హిట్టింగ్ హార్డ్ కోర్ హార్రర్. చావులు, రక్తాలు, ఆర్తనాదాలు, బీభత్సం, జుగుప్సా యదేచ్ఛగా చూపించేశాడు కొత్త దర్శకుడు సాయి కిరణ్. తొలిసారిగా ముస్లిం చేతబడి నేపథ్యమనేది ఈ మూవీ యూఎస్పీ అనాలి.

—సికిందర్